Monday 30 May 2016

Discourse with VV

Discourse with VV

“ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. “ 
- వరవరరావు - చరిత్ర - చర్చ -  Sakshi Daily -  | 15.05.2016 01:23:23pm


Works at Journalist
ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు భారత కమ్యునిస్టుపార్టీ కార్యక్రమం మీద కొన్ని సందేహాలు కలిగాయి. 

1. భారత కమ్యూనిస్టు పార్టి 1947 సెప్టెంబర్ లోనే ఎందుకు సాయుధ పోరాటాన్ని మొదలెట్టిందీ?
2. 1948 సెప్టెంబర్ లోనే ఎందుకు విరమణ ప్రకటించిందీ?
3. ఆ సాయుధపోరాటం నైజాం సంస్థానంలోనే సాగిందా? దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ కొనసాగిందా? మిగిలిన వాటి విస్తృతి ఎంత?
4. దాదాపు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం కేవలం నిజాంను గద్దెదించడం కోసమేనా?
5. ”ముస్లిం’ నిజాం సంస్థానాన్ని ’హిందూ’ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే ’హిందూత్వ’ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగావుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండిందా?
6. కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాటవిరమణ చేయమన్నారు. ఇద్దరూ ఒకే మతవాదాన్ని కొనసాగించారా?


LikeReply1May 17, 2016 7:34am

Pendyala VaraVara Rao
1946లో చైనా నూత‌న ప్ర‌జాస్వామిక విప్లవ పంథా అనుస‌ర‌ణీయ‌మ‌ని భావించింది గ‌నుక, 1947 ఆగ‌స్టులో జ‌రిగింది కేవ‌లం ట్రన్స్ఫర్ ఆఫ్ పవర్ అని విశ్లేషించింది గనుక. 46 జులై 4న ప్రకటించిన సాయుధ పోరాట పంథాను చేపట్టింది. మగ్ధూమ్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు.

నెహ్రూ socialist stance పట్ల విశ్వాసం, ఆ భ్రమలతో మితవాద వర్గం మిలిటరీ యాక్షన్ తర్వాత పోరాట విరమణ చేయాలన్నారు. దానికి కూడా రా.నా. నాయకుడు. అయితే మెజారిటీ వ్యతిరేకించారు గనకనే 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది. ముఖ్యంగా ప్రజలు కోరుకున్నారు. అప్పటికి మతవాసనాలున్నాయని చెప్పలేము. ఎందుకంటే 1952లో పి.డి.ఎఫ్ కు నాయకత్వం వహించిన డా.జయసూర్య స్వయంగా రజాకార్ల పేరుతో కనీసం 40 వేలు, గరిష్టంగా 2లక్షల మందిని యూనియన్ మిలిటరీ చంపిందని కేంద్ర హోం మినిస్ట్రీ కి సమగ్ర రిపోర్టు ఇచ్చాడు. సుందర్ లాల్, నెహ్రూ స్నేహితుడు కూడా 40 వేల మంది ముస్లింలను చంపారని నెహ్రూకు రిపోర్టు ఇచ్చాడు. ఈ సమాచారం అనండి, చరిత్ర అనండి, దీనినుంచి conclusions ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు డ్రా చేయవచ్చు. అయితే జూలై 4 పిలుపుకు ప్రేరణ దొడ్డి కొమరయ్య హత్యపై విసునూరు దొరకు వ్యతిరేకంగా. జనరల్ గా తెలంగాణ, హైదరాబాదు రాజ్యం మొత్తంగా హిందూ భూస్వాములకు వ్యతిరేకంగానే... తక్కువమంది ముస్లిం భూస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవచ్చు. కానీ పార్టీ విశ్లేషనయే హిందూ భూస్వామ్య పిరమిడ్ పై ముస్లిం ప్రభువున్నాడని. వ్యవస్థ పునాది వీళ్ళని. రజాకార్ల స్వల్ప కాలం మినహాయిస్తే మిగిలిన కాలమంతా ఇక్కడ హిందూ ముస్లింలు రైతులు, కౌలుదారులుగా జీవించారు. బందగీ ఈ పోరాటానికి వేగుచుక్క. కామ్రేడ్స్ అసోసియేషన్ లో డి.వి తప్ప మిగతా అందరూ ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు.
LikeReply1May 18, 2016 11:52pm
ట్రావన్ కోర్ కొచ్చిన్ లో మోప్లా పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ముస్లిం రైతాంగం బ్రాహ్మణ భూస్వాములకు వ్యతిరేకంగా చేశారు.


A.m. Khan Yazdani Danny · 
Works at Journalist

ఖిలాపత్ ఉద్యమం మీద బ్రిటీష్ పాలకులు సాగించిన క్రూరఅణిచివేత మోఫ్లా ముస్లింల తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం. బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టులు 1925 తరువాతనే ఒక పార్టీగా ఏర్పడ్డారు. మోఫ్లా వుద్యమం 1922 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటికి భారత కమ్యూనిస్టు పార్టీకి సాయుధ పోరాట పంథా లేదు.
May 31, 2016 11:52pm

Thursday 19 May 2016

Communal Ideology in Revolutionary Literature

Communal Ideology in Revolutionary Literature
విప్లవ సాహిత్యంలో మతభావజాలం
ఉషా యస్ డానీ

కామ్రేడ్స్! మిత్రులారా!  
ఇప్పటి పాఠం శీర్షిక  ’విప్లవ సాహిత్యంలో మతభావజాలం”. నిజానికి ఈ చర్చ దాదాపుగా ఒక దశబ్ద కాలంగా రకరకాల పధ్ధతుల్లో అనేక చోట్ల సాగుతోంది. అయితే, విప్లవ సమూహాలు ఒక పాఠంగా దీన్ని చర్చంచడం ఇదే మొదటిసారి. గత నెలలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత మనలోని మతభావజాలాల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం మరింత ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఈ అధ్యాయానికి ఒక సిలబస్ అంటూ ఏమీ తయారుకాలేదు. అయినప్పటికీ మా పరిధుల్లో ఒక క్రమంలో కొన్ని విషయాలను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాము.

కళాసాహిత్యమేధోరంగాల్లో వర్గపోరాటం చేస్తానని విరసం తన లక్ష్య ప్రకటనలో పేర్కొంది. మతభావజాలం అనేది ఏ వర్గాల్ని ప్రతిబింబిస్తుందీ? వాటి మీద విరసం తన లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి వర్గపోరాటం చేయాలి? అనేది ఇవ్వాల్టి పాఠానికి స్థూలంగా లక్ష్యం.

సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలిస్తుంది అని మీకందరికీ తెలుసు. అంచేత నేను సమాజం నుండి మొదలెట్టి సాహిత్యానికి వస్తాను. సాహిత్యంలో మతతత్త్వ ప్రతిఫలనాన్ని నా తరువాత ఎస్ ఎఫ్ షరీఫ్ మరింత వివరంగా మాట్లాడుతాడు.

మతభావజాలాల ప్రమాదాన్ని అర్ధం చేసుకోవడానికి మనం మీరట్, ఉత్తరప్రదేశ్, భివాండి వంటి సుదూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన పనిలేదు.  మనం ఇప్పుడు  కృష్ణాజిల్లాలో వున్నాం కనుక ఇక్కడి నుండే సమాజంపై మతభావజలం ప్రభావాన్ని అధ్యయనం చేయవచ్చు.

మీకు లారీలు, ట్రక్కులు తెలుసు. అరిగిపోయిన టైర్లను రీ-ట్రేడ్ చేస్తారనీ తెలుసు. పచ్చి రబ్బరు తీసుకువచ్చి ఆవిరి మీద అచ్చుల్లో పోసి పాత టైర్లకు కొత్త బటన్ గ్రిప్  తయారు చేస్తారని  కూడా మీలో కొందరికి తెలిసి వుండవచ్చు. ట్యూబుల్లో గాలి కొట్టడం, పంక్చర్లు వేయడం మొదలు, రీట్రేడింగ్ వరకు ఈ రంగంలో అత్యధికులు ముస్లింలే వుంటారు. అలాగే, మోటారు మెకానిక్కుల్లోనూ ముస్లింలే ఎక్కువ.

అసలు మెకానిక్ అనేదే మన దేశంలో ముస్లీంకు పర్యాయ పదంగా మారిపోయింది. వ్యవసాయమే ప్రధాన ఆర్ధికకార్యకలాపంగా వున్న కాలంలో మనకు కమ్మరి, కుమ్మరి, సాలే, కంసాలి, మంగలి, చాకలి వంటి అనేక సాంప్రదాయ వృత్తులున్నాయి. వాటి ఆధారంగా ఏర్పడిన కులాలున్నాయి. ఆ కులాలన్నీ లోహార్, హజామ్, ధోబీ తదితర పేర్లతో  ముస్లిం సమాజంలోనూ వున్నాయి. ఆధునిక యంత్ర యుగం ఆరంభమయ్యాక  వాచీలు,  గొడుగులు, తాళాలు వగయిరా రిపేర్లు, బేకరీ, దర్జీపని వంటి కొత్త వృత్తులు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన  సేవా రంగంలో   ముస్లింలు ఎక్కువగావున్నట్టు గమనించవచ్చు. చివరకు అత్యాధునిక కంప్యూటర్ల హార్డ్ వేర్ రంగంలోనూ రిపేరర్లుగా ముస్లింలే ఎక్కువగా కనిపిస్తున్నారు.  

ఒక మతసమూహంలో అత్యధికులు బతకడానికి చేతివృత్తుల ద్వార స్వయం ఉపాధిని వెతుక్కుంటున్నారంటే వాళ్ళను ప్రధాన స్రవంతి అధికారం నుండి గెంటి వేసిందని అర్ధం.  ప్రభుత్వ వుద్యోగాల్లో, చట్ట సభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని అర్ధం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1958లో బస్సు రవాణాని జాతీయం చేసిన తరువాత ప్రభుత్వరంగంలో నాలుగైదు చోట్ల భారీ రీ-ట్రేడింగ్ కేంద్రాలు వచ్చాయి.  ప్రతి డిపోలోనూ మెకానికల్ విభాగాలు వచ్చాయి. ఇంకొంతకాలం డొంక రూట్లలో బస్సులు తిరిగేవి. కొన్ని నగరాల్లో సిటీ బస్సులు వుండేవి. క్రమంగా అన్నీ జాతీయం అయిపోయాయి. ఆ తరువాత మెకానిక్కులు లారీల మీద ఆధారపడి బతికేవారు అందరూ పాత ఉపాధి రంగం నుండి గెంటివేతకు గురయ్యారు.  ఇప్పుడు యఆర్ ఎఫ్, టీవిఎస్ వంటి కార్పొరేట్ సంస్థలు ప్రీ-క్యూర్డ్ రబ్బర్ ను సరఫరాచేస్తున్నాయి. ఇది రెడీ మేడ్ వ్యవహారం లాంటిది. దానికి కార్మికుని నైపుణ్యంతో పనిలేదు.

పంక్చర్ షాపు పెట్టుకోవడానికి పెట్టుబడితో పెద్దగా పనిలేదు. రెండు మూడు పనిముట్లు వుంటే చాలు. రీట్రేడింగ్ వర్కుషాపు పెట్టుకోవడానికి కుడా స్వల్ప పెట్టుబడి సరిపోయేది. ఇప్పుడు ప్రీ క్యూర్డ్ రబ్బర్ బటన్ కు ఏజెన్సీ తీసుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. అప్పుడు ఆ రంగం నుండి మెకానిక్కులు తప్పుకుంటారు. భారీ పెట్టుబడులు పెట్టగలిగినవాళ్ళు మాత్రమే వస్తారు.  దానితో ఈ రంగంలో సాంప్రదాయికంగా పనిచేస్తున్న వాళ్ళు వృత్తిని కోల్పోయారు. దీన్నే మనం ఆర్ధికరంగంలో మాస్ డిస్ ప్లేస్ మెంట్ అంటే జీవనోపాధి నుండి మూకుమ్మడి గెంటివేత అంటున్నాం.

కొత్తగా పెట్టుబడులతో వచ్చినవాళ్లకూ  వృత్తిని కోల్పోయే వాళ్లకూ మధ్య సహజంగానే ఘర్షణ మొదలవుతుంది. వృత్తిని కోల్పోయే వాళ్లు ముస్లీములయి, కొత్తగా పెట్టుబడులతో వస్తున్నవాళ్ళు ముస్లిమేతరులు అయితే ఆ ఘర్షణ మతరూపాన్ని కూడా సంతరించుకుంటుంది. అనేక సందర్భాల్లో ఆర్ధిక ఘర్షణలు సాంస్కృతిక ఘర్షణలుగా కనిపిస్తాయి.  నిజానికి సాంస్కృతిక ఘర్షణలన్నీ సారాంశంలో ఆర్ధిక ఘర్షణలే. మరి కాస్త లోతుగా ఆలోచిస్తే రాజకీయార్ధిక ఘర్షణలే.

సాంప్రదాయిక వృత్తుల నుండి, జీవనోపాధి నుండి ముస్లిం కార్మికుల గెంటివేత అనే క్రమం నగరాల్లో ఎప్పుడో మొదలయిపోయింది. అది గుడివాడవంటి పట్టణాలకూ విస్తరించి. రేపు కైకలూరు వంటి గ్రామాలకూ పాకుతుంది.

ఇప్పుడు మనం జాతీయ స్థాయికి వెళుదాం. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయినపుడు రెండు వస్తువులకు తెగ ప్రాచూర్యం వచ్చింది. మొదటిది, టీయన్ టీ బాంబు. రెండోది,  లొట్టో బూట్లు. ఎల్ టీటిఇ ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీని టీయన్ టీ బాంబుతో చంపేసింది. ఆయన శరీరం తునాతునకలయి గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండాపోయింది. చివరకు లొట్టో బూట్ల ఆధారంగా రాజీవ్ గాంధీ శరీరాన్ని  గుర్తుపట్టారు.  రాజీవ్ భార్య సోనియా గాంధీ ఈ కేసు పరిశోధనా బృందాన్ని కలిసి తన భర్త జ్ఞాపకార్ధం  లొట్టో బూట్లను తనకు ఇచ్చేయమని కోరారు. అలా అప్పట్లో లొట్టో బూట్లకు తెగ బ్రాండ్ వాల్యూ వచ్చేసింది.

లొట్టో తరహా బూట్లను పొలియూరెథానే (పీయూ) ఫోమ్ తో తయారు చేస్తారు.  వీటిని తయారు చేసే అరడజను అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పుడు మన దేశంలోనికి వచ్చేశాయి. క్రికెట్ పేరుతోనో, టెన్నిస్ పేరుతోనో, ప్రధాని తొడిగే రేంజ్ అనో వీటికి ఒక క్రేజ్ వచ్చింది.

 ఇప్పుడు మనం పియూ ఫోమ్  భారత సమాజంలో తెచ్చిన అనర్ధాలను చూద్దాం. దేశంలో చెప్పులు బూట్లు ఆగ్రా, కాన్పూర్, కలకత్తాలో తయారవుతాయని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. బ్రాండు పేర్లు బాటా, కరోనా, ఫ్లెక్స్ వగయిరా ఏదైనా సరే  తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు పాదరక్షలు ఈ పట్టణాల్లోనే తయారవుతాయి. విజయవాడలో కూడా కొన్నేళ్ల క్రితం  చెప్పుల పరిశ్రమ అభివృధ్ధి చెందింది. తోలును పరిశుభ్రం చేయడం, తోలు వస్తువుల తయారీ వంటివి ఇతర కులస్తుల చేతుల్లోవున్నా  తోలు వ్యాపారం మాత్రం దాదాపు ముస్లింల చేతుల్లోనే వుంటుంది.  ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ముస్లింలది ఈ రంగంలో పైచేయిగా వుండేది. తోలు వ్యాపారం చేసే ముస్లింలని లబ్బాలు అంటారు. విజయవాడ బందరు రోడ్డుల్లో లబ్బీపేట పేరుతో ఒక పెద్ద వాడ వుంది.

సాంప్రదాయ చెప్పుల తయారీ చాలా సులువు. ఏ సాయంత్రమో ఒక వెయ్యి రూపాయలు పెట్టి ముడిసరుకు తెచ్చుకుంటే మరునాడు ఇంట్లో పగలు చెప్పులు కుట్టి సాయంత్రానికి అమ్మేసి కూలీ డబ్బులు సంపాదించుకోవచ్చు. పీయూ ఫోమ్ యూనిట్ పెట్టాలంటే భారీ పెట్టుబడి కావాలి.  పియూ ఫోమ్ రాకతో  సాంప్రదాయ తోలు చెప్పుల వాడకం తగ్గిపోయింది. అక్కడ భారీ సంఖ్యలో డిస్ ప్లేస్ మెంట్ సాగింది.  ఇక్కడ కూడా కొత్త పాత సమూహాలకు మధ్య సంఘర్షణ మొదలయింది. పాత సమూహం ఆర్ధికంగా బలహీనమైనది అయితే కొత్త సమూహం  ఆర్ధికంగా బలమైనది. పాత సమూహం సామాజికంగా ముస్లింలు అయితే, కొత్త సమూహం సామాజికంగా ముస్లిమేతరులు. తోళ్ల పరిశ్రమలో మొదలయ్యే  ఆర్ధిక ఘర్షణలు కాస్పూర్, ఆగ్రాల్లో తరచూ మతకల్లోలాలుగా బయటపడుతుంటాయి. ఇప్పుడు విజయవాడలో లబ్బీపేట పేరును వేంకటేశ్వరపురంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉపరితలంలో ఇది కేవలం ఒక పేట పేరు మార్చడంగా మనకు కనిపించవచ్చు. నిజానికి దీన్ని ఆర్ధికరంగంలో మారుతున్న ఆధిపత్యానికి సంకేతంగా మనం గమనించాలి.

గత దశాబ్దంలో సాగిన పంజాబ్ కల్లోలానికి కారణం ఏమిటీ? ఆపరేషన్ బ్లూస్టర్ భింద్రేన్ వాలా కోసం మాత్రమే జరిగిందా? సాంస్కృతికం, రాజకీయం అనేవి ఉపరితల అంశాలు మాత్రమే కదా? మరి వాటి పునాది సంగతి ఏమిటీ? భారతదేశంలో భారీ పరిశ్రమలు ఎవరి చేతుల్లో వున్నాయి? మధ్యతరహా పరిశ్రమలు ఎవరిచేతుల్లో వున్నాయి? చిన్నతరహా లేదా అనుబంధ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఎవరి చేతుల్లో వున్నాయి? సేవారంగం ఎవరి చేతుల్లో వుందీ? అనేవి ఇక్కడ కీలకమైన అంశాలు.  ఆటోమోబైలు రంగంలో పెద్ద కంపెనీలు ఇతరుల చేతుల్లో వున్నా వాటి విడిభాగాల తయారీ రంగం అంటే ఆధారిత పరిశ్రమలు లూధియాన, అమృతసర్, జలంధర్ నగరాల్లో దాదాపు శిక్కుల చేతుల్లో వున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు తమ వాణిజ్య విస్తరణలో భాగంగా చిన్న చిన్న విడిభాగాలను తయారు చేసుకునే అవకాశం కూడా చిన్న కంపెనీలకు ఇవ్వకపోతే ఏం జరుగుతుందీ? పెద్ద కంపెనీల యాజమాన్యం మత అధిక సంఖ్యాకుల సమూహం అయ్యి, చిన్న కంపెనీల యాజమాన్యం మత అల్ప సంఖ్యాకుల సమూహం అయినపుడు జరిగేదేమిటీ? ఇవి మత ఘర్షణలా? సాంద్రీభూత ఆర్ధిక వ్యక్తీకరణలా?

వరసపెట్టి ఒక్కో రంగం నుండి మతఅల్పసంఖ్యాక వర్గాలను  గెంటివేస్తుండడాన్ని, వాళ్లకు జీవనోపాధి అనేదే లేకుండా చేస్తుండడాన్ని  సాహిత్యం ఎట్లా ప్రతిఫలించింది? మరీ ముఖ్యంగా వామపక్ష, విప్లవ సాహిత్యాలు ఎలా ప్రతిఫలించాలి? ఎలా ప్రతిఫలించాయి? అనేది ఈరోజు మన పరిశీలనాంశం.
ప్రస్తుతానికి రాజకీయాలను కాస్సేపు పక్కన పెట్టి  సాహిత్యం సమాజానికి చేసే మేలేమిటీ? అసలు సమాజం అంటే ఏమిటీ? వంటి ప్రాణప్రదమైన అంశాలను పరికిద్దాం.

చాలామందికి వుండే సాధారణ అభిప్రాయం ఏమంటే సమాజం అంటే  గుంపుగా బతకడం అని.  అది అర్ధసత్యం మాత్రమే. మనుషులేకాదు ఏనుగులు, పందులు, చీమలు కూడా గుంపులుగానే బతుకుతాయి. మనిషి కూడా గుంపులుగానే బతుకుతాడుగానీ అదే సమాజ లక్షణంకాదు. సమాజశాస్త్రంలో మొట్టమొదటి పాఠం ఏమంటే మనిషికీ వ్యక్తికీ మధ్యనున్న తేడాను గుర్తించడం. సమాజ విశ్లేషకులు దీన్ని మ్యాన్ అండ్ ఇండివిడ్యువల్ అంటారు. ఇలాంటి విభజన  ఏ ఇతర జీవజాలంలోనూ లేదు. 

ఇతర జీవజాలం చేసినట్టే మనిషి కూడా తన జాతిని అభివృధ్ధి చేస్తాడు. తన జాతి భౌతిక అవసరాలను తీర్చడానికి భౌతిక వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. వస్తు ఉత్పత్తి అనేది ఇతర జీవజాలంలో వుండదు. కొన్ని పక్షులు గూళ్ళు కడతాయి, కొన్ని చేపలు  గుడ్లు పెట్టడానికి ప్రత్యేక స్థలాలకు వెళతాయి. అవి అంత వరకే పరిమితం. ఒక పథకం ప్రకారం ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి కోసం పరికరాలను వాడడం, ఉత్పత్తిని సులభతరం, వేగవంతం చేయడం కోసం నిరంతరం కొత్త పరికరాలను సృష్టించడం మనిషి మాత్రమే చేసేపని.   ఇంతటి సంక్లిష్ట ఉత్పత్తి క్రమంలో మనుషుల మధ్య సంక్లిష్ట సంబంధాలు ఏర్పడతాయి.

ఒక మనిషికి స్త్రీలందరూ ఒకటికాదు. ఒకామె తల్లి అయితే, ఇంకోకామె ప్రియురాలు అవుతుంది. మరోకామె భార్య అవుతుంది. ఇంకొకరు చెల్లి, అక్క, మరదలు, పిన్ని, వదిన. అత్త, అమ్మయ్య, నాయనమ్మ, సహాధ్యాయురాలు, సహౌద్యోగినీ ఇలా అనంతంగా సాగుతాయి స్త్రీ పురుష సంభంధాలు. పురుషునికీ పురుషునికీ మధ్య, స్తీలకూ స్త్రీలకు మధ్య కూడా అనంతమైన సంబంధాలుంటాయి. మనుషులు అలాంటి ఒక నిర్ధిష్ట చట్రం లోపలే మరో మనిషితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించగలుగుతారు. ఇక్కడ ప్రతి సంబంధమూ ప్రత్యేక మైనదే. ఆ సంబంధంలో వ్యవహరించాల్సిన తీరూ ప్రత్యేకమైనదే. ఏ పురుషుడూ చెల్లితో, ప్రియురాలితో ఒకలాగే వ్యవహరించడు. పనివాడితీ, యజమానితీ ఒకలాగే వ్యవహరించడు.  ఈ సాలెగూడు లాంటి  సంబంధాల మధ్య తన స్థానాన్ని గురించిన స్పృహతో జీవించడాన్నే సమాజం అంటారు. ఇందులో అంతస్తుల దొంతర వుంటుంది. తన కన్నా పైవాళ్ళు, కిందివాళ్ళు, సమానులూ వుంటారు. ఎవరెవరితో  ఎలా వ్యవహరించాలనేదే  సామాజిక చైతన్యం.

శారీరకధర్మం వుంటే చాలు జంతువులు మనుగడ సాగించేస్తాయి. మనిషికి అలా కుదరదు. శారీరకధర్మంతోపాటూ సామాజికధర్మాలు కూడా తెలియాలి. శరీరకధర్మాలవల్ల మనిషి జంతు-మానవుడు మాత్రమే కాగలడుగానీ వ్యక్తికాలేడు. టార్జన్లకూ పిచ్చివాళ్లకూ వ్యక్తిత్వం వుండదు. సామాజిక ధర్మాలు తెలియజెప్పడం కోసమే ”మనిషి పిల్లల్ని’ సాకాలి. ఈ సాకే పనిని తల్లి చేస్తుంది. సమాజం చేస్తుంది. రాజ్యం చేస్తుంది. సాహిత్యం కూడా చేస్తుంది. అందుకే కొడవటిగంటి కుటుంబరావు “సాహిత్యం మానవ హృదయ నిర్మాత” అన్నారు. మనిషి అద్దం ముందు నిలబడి సింగారించుకున్నట్టు సాహిత్యంలో తననుతాను చూసుకుని సంస్కరించుకుంటాడు.

విప్లవ సాహిత్యంలో మతభావజాలం ఎలా కొనసాగుతున్నదో చెప్పడానికి ముందు అంతకన్నా ముఖ్యమైన రెండు అంశాలను మీ దృష్టికి తెస్తాను. సాహిత్యంలో ఇప్పుడు రెండు రకాల మతపక్షపాతం కొనసాగుతోంది. ఇందులో మొదటిది; ఒక మతంసమూహపు మొత్తం అస్థిత్వాన్నే గుర్తించకపోవడం. సాహిత్యంలో వాళ్ల ప్రస్తావనే లేకపోవడం. సామ దాన బేధ దండోపాయాలకన్నా ప్రమాదకరమైన ఉపాయం అసలు పట్టించుకోకపోవడం. మనం సృష్టించే సాహిత్యంలో అన్ని పాత్రలూ ముస్లిమేతరులవే వుంటాయి. ముస్లింలు ఎక్కడా వుండరు. మన సాహిత్యం ద్వార తమను తాము సంస్కరించుకునే అవకాశం ముస్లింలకు మనం ఏ మేరకు ఇచ్చాం? మనం ముస్లిం సమూహానికేకాదు ఏకంగా సాహిత్య ధర్మానికే  అన్యాయం చేస్తున్నాం.

సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించాలని, ప్రతిఫలించాలనీ మనమే ఒక నిర్వచనం ఇచ్చుకున్నాం. నిజానికి మన సాహిత్యం భారత ముస్లింసమాజాన్ని లేదా తెలుగు ముస్లీంసమాజాన్ని ప్రతిబింబించడం లేదు. కొన్ని ప్రమాణాల ప్రకారం మనది సాహిత్యమే; సమాజంతప్ప. మరోమాటల్లో చెప్పాలంటే మనది సమాజంలేని సాహిత్యం.  మత మైనారిటీల చిన్న సమూహమే కావచ్చుగానీ ఏకంగా ఒక సమూహాన్ని మినహాయించిన  సాహిత్యాన్ని అసలు సాహిత్యం అనవచ్చునా? అది సమాజ ప్రతిఫలనం అవుతుందా?  ఇదీ ఈరోజు మన ముందున్న కీలక ప్రశ్నలు.

మన చరిత్ర పుస్తకాల్లో సింధూనాగరీకత గురించి చెపుతారుకానీ గోదావరీ నాగరీకత, కృష్ణా నాగరీకత, పెన్నా నాగరీకత, కావేరీ నాగరీకతల గురించి చెప్పరు. పశ్చిమోత్తర భారత ఉపఖండం చరిత్రే భారతదేశ చరిత్ర అయిపోయినట్లే మెజార్టీ మతమైన హిందూమతం, దానిని ప్రతిఫలించే  సాహిత్యమే భారత సాహిత్యంగా చెలామణి అయిపోతున్నది. ఈ అపచారం రాజకీయాల్లో జరిగింది. చరిత్ర రచనలో జరిగింది. సాహిత్యంలో జరుగుతున్నది. వామపక్ష విప్లవ సాహిత్యాలు సహితం దీనికి మినహాయింపుకాదు.

వైదీకధర్మం శూద్రులకు వేదపఠనాన్ని నిషేధించినట్లే సాహిత్యంలో ఒక రకమైన నిషేధం మైనారిటీల మీద వున్నది. ఎన్ని ముస్లిం, క్రిస్టియన్, శిక్కు తదితర అల్పసంఖ్యాకవర్గాల పాత్రలు మనకు మన కథా నవలల్లో కనిపిస్తాయి?. కొన్ని అరుదైన సందర్భాల్లో అల్పసంఖ్యాకవర్గాల పాత్రలు మనకు కనిపించేమాట కూడా వాస్తవం. సాధారణంగా వాళ్లను అపహాస్యం చేయడానికో, వాళ్ళు మొరటువాళ్లని చెప్పడానికో ఆ పాత్రల చిత్రీకరణ సాగుతుంటుంది. సమయాభావంవల్ల నేను ఇంక ఆ వివరాల్లోనికి వెళ్లను. అయితే   మనం కొనసాగిస్తున్న ఈ ధోరణివల్ల జరిగే ఒక అనర్ధాన్ని మాత్రం మీ ముందు వుంచుతాను.

మనమంతా విప్లవాన్నీ కోరుకుంటున్నాం. నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాం. ఆ కొత్త వ్యవస్థలో ప్రవేశం అధికసంఖ్యాక మతసమూహానికి మాత్రమేనా? అల్పసంఖ్యాక మతసమూహాలకు అందులో ప్రవేశంలేదా? వాళ్లకు ప్రవేశం నిషిధ్ధమైతే మరి వాళ్ళేం చేయాలీ? వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయడానికి మనం చేస్తున్నదేమిటీ? నేను లేవనెత్తుతున్న ప్రశ్నలు కొంచెం ఇబ్బందిగా వుందవచ్చు. మనం మరోలా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. ఆరెస్సెస్ వంటి సంస్థలు, బీజేపీ వంటి పార్టీలు అల్పసంఖ్యాక మతసమూహాలులేని భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నాయి. మనం కూడా అల్పసంఖ్యాక మతసమూహాలులేని వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నామా? ఓసారి ఆలోచించండి.

ఇక సైధ్ధాంతపరమైన సమస్యలు. మతఅల్పసంఖ్యాక సమూహాల విముక్తి అనేది కమ్యూనిస్టుల కార్యక్రమమా? కాదా? అనేది కొందరి సందేహాలు. కమ్యూనిస్టులు వర్గం గురించి మాట్లాడాలిగానీ మతం గురించి మాట్లాడకూడదని మరికొందరి ఆదేశాలు.  వామపక్షాలు, విప్లవకారులు మత వ్యవహారాలకు దూరంగా వుండడమే మంచిదని ఇంకొందరి హెచ్చరికలు. ఇటు హిందూమతానికీ అటు ఇస్లాంమతానికీ  కమ్యూనిస్టులు సమానదూరం పాటించాలని మరికొందరి తరుణోపాయం.

 ఇలాంటి సందేహాలు, ఆదేశాలు, హెచ్చరికలు, ఉపాయాల ద్వార వీళ్లంతా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజంలో కొన్ని సమస్యలకు గతితార్కిక చారిత్రక భౌతికవాదం పరిధిలో పరిష్కారం లేదని!. అలాగే, ప్రపంచమంతా మతరహితంగా మారిన తరువాతనే కమ్యూనిస్టు విప్లవం ఆరంభం అవుతుందనీ!. మార్క్సిస్టు మహోపాధ్యాయుల మీద ఇంతటి ఘోరమైన నిందల్ని నేను రానివ్వదలచలేదు. చరిత్రగతిలో సమాజంలో ఉత్పన్నమయ్యే అనేకానేక సమస్యలకు పరిష్కారాలన్నీ ఒక కేటలాగ్ లా, డాక్టర్ల ప్రిస్ స్క్రిప్షన్ లా మార్క్సిస్టు గ్రంధాల్లో సిధ్ధంగా వుంటాయని మనం భావించకూడదు. మనం మన సృజనాత్మకతను ఉపయోగించి మార్క్సిస్టు మౌలిక ఆదేశాలను కొత్త సమస్యల పరిష్కారానికి అన్వయించాలి.  అలా చేయకపోవడంవల్ల మనం రెండు తప్పులు చేస్తాము. మొదటిది; వర్తమాన సమస్యను పరిష్కరించకుండా పలాయనం చిత్తగిస్తాము. రెండోది, చలనశీలమైన మార్క్సిస్టు సూత్రాలని జడపదార్ధంగా మార్చేస్తాము.

ఇప్పుడు మన ముందున్న సమస్య అల్పసంఖ్యాక మతసమూహాల సమస్యను ఎలా అర్ధం చేసుకోవాలి? దానికి మార్క్సిస్టు పరిష్కారం ఏమిటీ? అనేది.     
ఈ సమస్య పరిష్కారానికి మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనల నుండి నేను అర్ధం చేసుకున్న వాటినే ఇప్పుడు  మీ ముందు పెడుతున్నాను. కార్ల్ మార్క్స్ మీద లెనిన్ రాసిన రెండు వ్యాసాలు ప్రస్తుత నా ప్రతిపాదనకు ప్రధాన ఆధారం. అవి ‘మార్క్సిజం పునాదులు’, ‘కార్ల్ మార్క్స్ బోధనలు’.

వర్గం, పాలితవర్గం, పాలకవర్గం, వర్గ సంఘర్షణ, సామ్యవాదం వంటి భావనలు కార్ల్ మార్క్స్ కన్నా ముందే సామాజిక, తాత్వికరంగంలో వాడుకలో వున్నాయి. సమాజ చలనానికి ఇంధనం వర్గ సంఘర్షణ అని చెప్పినవారు కూడా వున్నారు.  కార్ల్ మార్క్స్ వీటిని కొనసాగిస్తూ  మూడు అద్భుతమైన నిర్ధారణలు చేశాడు. వాటిల్లో మొదటిది వర్గ సంఘర్షణలో కార్మికవర్గం నిర్వర్తించే పాత్రే సమాజ చలన శక్తి అనేది.  రెండవది; సమాజంలో ప్రతి సమూహం కూడా తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటుంది; ఒక్క కార్మికవర్గంతప్ప. తనను తాను రద్దుచేసుకోవడం ద్వార వర్గ సమాజాన్నే రద్దు చేసే శక్తి ఆ అవకాశం కార్మికవర్గానికే వుంటుంది.  మూడోది; పెట్టుబదీదారీ నియంతృత్వానికి విరుగుడుగా కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించినపుడే వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది.

ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ముందుకు వస్తుంది. కార్మికవర్గం అంటే ఎవరూ? అని. ఇప్పటికీ చాలామంది కమ్యూనిస్టులు కార్మికవర్గం అంటే ఫ్యాక్టరీ కార్మికులు అనే అభిప్రాయంతోనే వున్నారు. విప్లవకమ్యూనిస్టులు కారంచేడు బాధితులయిన దళితుల  పక్షం వహించినపుడు కొందరు కమ్యూనిస్టులు ఘాటైన విమర్శలే చేశారు; కులపోరాటాలతో  మార్క్సిస్టులకు పనేంటీ? అని. కారంచేడు బాధితులు కులపరంగా మాదిగలు; మతపరంగా క్రైస్తవులు. దాడిచేసినవారు కులపరంగా కమ్మ సామాజికవర్గం, మతపరంగా హిందువులు.

కార్మికవర్గం అంటే ఫ్యాక్టరీ కార్మికులు మాత్రమే  అనే బండ అభిప్రాయాన్ని మావో తునాతునకలు చేశాడు. రైతు కూలీలతో సామ్యవాద సమాజాన్ని నిర్మించి చూపాడు. అంచేత మనం బాధితులు, పీడితులు, కష్టజీవులు, కష్టాల్లోవున్నవారు, ఆపదలో వున్నవారు అనే విసృత అర్ధంలో కార్మికవర్గాన్ని చూడాల్సి వుంటుంది. నిజానికి ఈ వివరణ కమ్యూనిస్టు ప్రణాళికలోనే వుంది. కమ్యూనిస్టు ప్రణాళిక “The history of all hitherto existing society is the history of class struggles” అనే ప్రకటనతో మొదలవుతుంది. ఇంతవరకు మనకు తెలిసిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే అంటే అర్ధం ఏమిటీ?  ఫ్యాక్టరీ కార్మికులు ఆవిర్భవించదానికి ముందు నుండే వర్గపోరాటం అనేక రూపాల్లో సాగిందీ  అనంటే  ఫ్యాక్టరీ కార్మికులు ఆవిర్భవించిన తరువాత కూడా వర్గపోరాటం అనేక రూపాల్లో సాగుతుందని అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. బహుశ, మనలో ఇలాంటి అవగాహన కల్పించడానికే మన సీనియర్ కామ్రేడ్ కేవి రమణా రెడ్డి 1985 నాటి గద్వాల సభల్లో ‘మతవర్గతత్త్వం’ అనే ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ఆ అంశాన్ని మనం విస్తృతంగా చర్చించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరంవుంది.

ఒక దేశాన్నీ పీడక దేశంగానో, పీడిత దేశంగానో నిర్ణయించే సాంప్రదాయం మనకుంది. బ్రిటీష్, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశాలను వలసవాదులుగా నిర్ధారించి వాళ్ళ మీద జాతీయ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మనకుంది. వర్తమాన ప్రపంచాన్ని మావో మూడు ప్రపంచాలుగా విభజించి, వాటిల్లో మూడవ ప్రపంచ దేశాలని పీడిత దేశాలుగా నిర్ధారించి వాటికి మద్దతు ప్రకటించాడు. అమేరికాను అగ్రరాజ్యంగా, ప్రపంచపోలీసుగా, సామ్రాజ్యవాద దేశంగా మనం భావిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ప్రపంచ పటం మీద అమేరికా సామ్రాజ్యవాదంతో తలపడుతున్న దేశాలకు మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. కానీ,    దేశవ్యాప్తంగా భారీ సంఖ్యవున్న ఒక మత సమూహం తక్కువ సంఖ్యవున్న మరో మత సమూహాన్నీ రాజకీయార్ధిక, సాంస్కృతిక రంగాల్లో  మన కళ్ల ముందు అణిచివేస్తుంటే పీడకులెవరో పీడితులెవరో ఒక నిర్ధారణ చేసి ప్రకటించడానికి తటపటాయిస్తున్నాం. పైగా మత సమూహాల మధ్య వర్గ విభజన చేయడానికి కమ్యూనిజం ఒప్పుకోదని కొందరు చేస్తున్న వాదన మనసుకు బాధకలిగిస్తోంది.  ఇది విచారకరం. ఇది కమ్యూనిజానికి అప్రదిష్ట!. కులపోరాటాలు, మతపోరాటాలు అన్నీ సారాంశంలో ఆర్ధికపోరాటాలే. ఆర్ధిక పోరాటాలంటే వర్గపోరాటాలే.

బానిస సమాజంలో బానిసలు- బానిస ప్రభువులు (యజమానులు) వున్నట్టు కులసమాజంలో శ్రామిక కులాలు- ప్రభువు కులాలు వుంటాయి. అలాగే మతసమాజంలోనూ శ్రామిక మతాలు. ప్రభువుమతాలు లేదా పాలక మతాలు వుంటాయి. గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని అనుసరించేవాళ్ళు ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టాలి. ముస్లింలు ఆచరించే ఇస్లాం మతాన్ని పీడిత మతం అనవచ్చునా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నారు. అరబ్ దేశాల్లో ఇస్లాం అధికసంఖ్యాకుల మతం అనే వాస్తవాన్ని ఈ సందేహం వ్యక్తం చేస్తున్నది.  అంచేత ఇది సమంజసమైన సందేహమే. మనది భారత కమ్యూనిస్టు పార్టి. అరబ్ కమ్యూనిస్టు పార్టి కాదు.  అరబ్ దేశాల్లోని అల్పసంఖ్యాక మతస్తుల సమస్యల్ని అక్కడి కమ్యూనిస్టు పార్టిలు పరిష్కరిస్తాయి. మనం ఇప్పుడు పరిష్కరించాల్సింది మనదేశపు అల్పసంఖ్యాక మతస్తుల సమస్యల్ని.  యూదల సమాజాన్ని మనం హీట్లర్ కాలం నాటి జర్మనీలో ఒకలాగ చూశాం. రెండవ ప్రపంచ యుధ్ధానంతరం ఏర్పడిన ఇజ్రాయిల్ లో ఇంకోలా చూస్తున్నాం. ప్రతి మతం విషయంలోనూ స్థల కాల వైవిధ్యం వుంటుంది. మనం దాన్ని గమనించడంలేదు.

అల్పసంఖ్యాక మతవర్గాల్ని కమ్యూనిస్టులు సకాలంలో బాధితులుగానో పీడితులుగానో గుర్తిస్తే ఆ పోరాటాలు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాగుతాయి. అలా గుర్తించక పోతే వాళ్ల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీలకు బయట సాగుతాయి.  ఒకవేళ అదే జరిగితే మతఅల్పసంఖ్యాకులవాదం కమ్యూనిస్టు వ్యతిరేక దృక్పధాన్ని స్వీకరించినా ఆశ్చర్యం ఏమీలేదు. భారత కమ్యునిస్టులు కులము, మతము, తెగలు అని మడి కట్టుకుని కూర్చోకుండా దళిత, వెనుకబడినకులాల, ఆదివాసి, మతఅల్పసంఖ్యాకుల వాదాల్ని బలపరచాల్సిందే.  ఈ పని సకాలంలో జరక్కపోతే పీడితులు ఒక పక్షం, కమ్యూనిస్టు పార్టీలు ఇంకో పక్షం అయిపోతాయి. వీటి పర్యావసానాలు ఇరుపక్షాలకూ నష్టమే చేస్తాయి. పీడితులు కమ్యూనిస్టు పార్టీలని విశ్వసించాలి. కమ్యూనిస్టు పార్టీలు పీడితుల పక్షం వహించాలి.

మిత్రులారా! ఇప్పుడు నేను మన సమాజంలో జరుగుతున్న ప్రధాన సాంస్కృతిక పరిణామాల్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇవన్నీ మన సాహిత్యంలో  విసృతంగా ప్రతిఫలించాలనేది నా ఆశ.

దేశంలో పరిపాలన చేసే ప్రభుత్వానికి మార్గదర్శకాలను సూచించడానికి మనకు ఒక రాజ్యాంగం వుంది. భారత రాజ్యాంగంలోని మంచిచెడుల చర్చను పక్కన పెట్టినా అసలు వాళ్ళు రాసుకున్న ఆ రాజ్యాంగాన్నయినా ప్రభుత్వం  సజావుగా అమలు చేస్తున్నదా? అనేది అనుమానమే. మరోవైపు, దేశంలో ఇంకో రాజ్యాంగం బలంగా అమలవుతోంది. దాని పేరు మనుస్మృతి. అసలు మనుస్మృతినే స్వతంత్ర భారత దేశ రాజ్యాంగంగా ప్రకటించాలని హిందూత్వ శక్తులు మొదటి నుండీ గట్టిగా వాదిస్తున్నాయి. అది కుదరకపోవడంతో దొడ్డిదారిన మనుస్మృతిని అమలు పరుస్తున్నాయి. ఇంతకీ మనుస్మృతి ఏం చెపుతోందీ? మరీ ముఖ్యంగా, మత అల్పసంఖ్యాక సమూహాలతో ఎలా వ్యవహరించాలని అది ఆదేశిస్తోందీ? అనేది క్లుప్తంగా అయినా తెలుసుకోవడం చారిత్రక అవసరం.

మనుస్మృతి అంటే ఒక్కమాటలో కులవ్యవస్థను సమర్ధించడం. దీనినే హిందూత్వ, హిందూమతవాదం, బ్రాహ్మణవాదం అంటున్నారు. దీన్ని బ్రాహ్మణవాదం అని ఎందుకు అంటారంటే మనుస్మృతి ప్రతిపాదించే కులవ్యవస్థలో ప్రామాణిక కొలమానం బ్రాహ్మణ కులమే. మనువు వాదన ప్రకారం వాళ్ళు నేరుగా దేవుని వారసులు. వాళ్ళే ప్రధమ వర్ణం.  బ్రాహ్మణులు తమకు దగ్గరగా అనుమతించిన సమూహాలను  అగ్రవర్ణాలుగానూ, దూరంగా వుంచే సమూహాలను నిమ్నవర్ణాలుగానూ మనువు  చాలా స్పష్టంగా స్కేలుపెట్టి కొలిచి మరీ వర్గీకరించాడు.  ఇక్కడ ఇంకో తిరకాసు వుంది. వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ కులం ఒక్కటే స్థిరమైనది (Constant). మిగిలిన వర్ణాలు అస్థిరమైనవి (Variable). మనకు క్షత్రీయ, వైశ్య, శూద్రవర్ణాలు కూడా వున్నట్టు తెలుసు. ఈ ముడు వర్ణాలు మారుతుంటాయి. యుధ్ధం చేసి రాజ్యాన్ని పరిరక్షీంచేవాళ్ళూ పాలించేవాళ్ళు క్షత్రీయులు.  వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు వైశ్యులు. సేవలు అందించేవాళ్ళు శూద్రులు. వర్ణవ్యవస్థకు బయట ఇంకో రెండు సమూహాలున్నాయి. దళితులు, ఆదివాసీలు. వాళ్ళను అసలు మనుషులుగానే గుర్తించలేదు మనువు.

మనుధర్మశాస్త్రం అనేది ఒక స్మృతి. అంటే ఒక చట్టం. ఒక చట్తం చేసినంత మాత్రాన సమాజంలోని ప్రజలందరూ దానికి బధ్ధులై నడుచుకుంటారని ఏమీలేదు. వుల్లంఘనలు, ప్రత్యేక మినహాయింపులు కూడా వుంటాయి. ఈ వ్యవహారం సజావుగా సాగదనీ, అనేక మార్పులు వస్తాయనీ మనువుకు కూడా తెలుసు. మనువుకు సంబంధించి క్షత్రీయ వర్ణం అంటే సూర్యవంశం, చంద్రవంశం మాత్రమే. వీళ్ళిద్దరూ కాకుండా మరో సమూహం యుధ్ధం ద్వార  అధికారాన్ని చేజిక్కించుకుంటే ఏం చేయాలీ? యుధ్ధం చేసి అధికారాన్ని చేపట్టినవాళ్ళకు దండన సామర్ధ్యం కూడా వుంటుంది. వాళ్లతో చెలగాటమాడితే   బ్రాహ్మణులకు కుడా ముప్పు వస్తుంది. అంచేత రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నవాళ్లంతా ఇతర క్షత్రీయులే అని పెద్ద సవరణ చేశాడు మనువు. బ్రాహ్మణుల సాంస్కృతిక ఆధిపత్యాన్ని గౌరవించాలని ఈ ఇతర క్షత్రీయ క్రమబధ్ధీకరణ పథకానికి ఒక కీలక క్లాజు పెట్టాడు.  అయితే ఈ ఇతర క్షత్రీయ హోదా తాత్కాలికమే. ఈ ఇతర క్షత్రీయులు మరో సమూహం చేతిలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోగానే వాళ్ళు క్షత్రీయ హోదాను కూడా కోల్పోతారు. మనువు అంతటితో ఆగడు అధికారాన్ని కోల్పోయిన ఆ ఇతర క్షత్రీయుల్ని శూద్రులుగా మార్చాలి అంటాడు.   శూద్రులుగా మార్చడం అంటే ఏమిటీ? ఆ వివరాలు కూడా  మనువే చెప్పాడు. వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళు కొత్తగా సంపద పెంచుకోకుండా పరిమితులు విధించాలి.  వాళ్ళను సేవకులుగా మార్చాలి. మళ్ళీ యుధ్ధం చేసి అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకుండా వాళ్ళు ఆయుధాలు పట్టుకోకుండా కట్టడి చేయాలి.

కామ్రేడ్స్! భారత ఉపఖండాన్ని రెండు మూడు శతాబ్దాలపాటు ముస్లింలు పాలించారని మనకు తెలుసు. వాళ్ళు మనువు చెప్పిన క్షత్రీయులు కాదు. ‘ఇతర’ క్షత్రీయులు. అక్బర్ అయినా, ఔరంగజేబ్ అయినా పాలిస్తున్నంత కాలం క్షత్రీయులే. అయితే, 1857 నాటి భారత ప్రధమ సంగ్రామంలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన తరువాత వాళ్ళను ఏంచేయాలీ? శూద్రులుగా మార్చాలి!. శూద్రులుగా మార్చడం అంటే వాళ్ళకు స్వంత ఆస్తిలేకుండా చేయాలి.  వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల్నీ, వక్ఫ్ వంటి సమిష్టి ఆస్తుల్ని
స్వాధీనం చేసుకోవాలి.  ఎక్కడయినా  ముస్లింల ఆస్థి పెరుగుతూవుంటే అక్కడ మతకల్లోలాలు రేపి వాళ్ళ అస్థుల్ని ద్వంసం చేయాలి. భారత దేశం అంతటా  ఇప్పుడు జరుగుతున్నది అదే. జాతి చిహ్నాలను ధ్వంసం చేయడం ద్వార గెలుపును ప్రకటించుకోవడం కూడా పురాతన సాంప్రదాయమే. బాబ్రీ మసీదు కూల్చివేతను ఏదో ఒక కట్టడం కూల్చివేతగా భావిస్తే మనం తప్పు చేస్తున్నట్టే. బాబ్రీ మసీదును భారత ముస్లీంల జాతి చిహ్నంగా మార్చి, దాన్ని కూల్చివేసి ఇక మీరంతా మా బానిసలు అని వాళ్ళు ప్రకటించ దలిచారు.  సరిగ్గా పురాతన పధ్ధతుల్లో ఆశ్వమేధయాగాలు జరుపుతున్నారు. దీన్ని మన సాహిత్యం ప్రతిఫలించాలా వద్దా?

ముస్లింలని నవశూద్రులుగా మార్చాలనే విషయంలోనూ ఒక తిరకాసుంది. వర్తమాన శూద్ర సమూహం మనువు ఊహించినట్టు లేదు. అందులో ఒక భాగం ఆర్ధికాభివృధ్ధిని సాధించి పెత్తందారీ కులాలుగా మారిపోయింది. ఇంకో భాగం ఆర్ధికంగా మరింత కిందికి దిగజారింది. ఆ తరువాత ఐదవ వర్ణంగా దళితులున్నారు. అప్పుడు ముస్లింలని ఆదివాసుల పక్కనైనా పెట్టాలి. లేదా ఆరోవవర్ణంగానైనా మార్చాలి.  ఇప్పుడు జరుగుతున్నదదే. ఇలాంటి సందర్భంలో మన పాత్ర ఏమిటీ? మనం ముస్లిం సమాజం పక్షాన నిలబడాలనేది నా ప్రతిపాదన. నా ప్రతిపాదనని మీరు సమర్ధిస్తారనే నమ్మకంతో ముగిస్తాను.

ఇంతవరకు నా ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.   నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విరసం నాయకత్వానికి కృతజ్ఞతలు.



విరసం గుడివాడ పాఠశాలలో 14 జనవరి1993న జరిగిన   ’విప్లవసాహిత్యంలో మత భావజాలం’ పాఠానికి అధ్యక్షోపన్యాసం ఆధారంగా.


(నా ప్రసంగ పాఠం టేపును విని అక్షర రూపం ఇచ్చిన ప్రముఖ దళిత కవి కలైకూరి ప్రసాద్ కు కృతజ్ఞతలు) 







Wednesday 18 May 2016

America’s God’s Country and Advani’s RamaRaj

Americas God’s Country and Advani’s RamaRaj
అమెరికా  దేవుని రాజ్యం! అద్వానీ రామరాజ్యం!!
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

బక్ పత్రికలు చదవదు” అంటూ ఆరంభమౌతుంది జాక్ లండన్ నవల ’ప్రకృతి పిలుపు’. బక్ పత్రికలు చదవగలిగితే అలాస్కాలో బంగారం గనులు బయటపడ్డాయని దానికి తెలిసి వుండేది. బంగారం వేటగాళ్ళ స్లెడ్జి బండ్లు లాగడానికి దొరికిన ప్రతి కుక్కనూ పట్టుకుపోతున్నారని ముందుగా తెలిసి జాగ్రత్తపడి వుండేది.  బక్ ఒక కుక్క గనుక పత్రికలు చదవడం రానందుకు దాన్ని తప్పు పట్టనవసరంలేదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డాలర్ వేట ఆరంభమయింది. పాలకులేకాదు పాలితులు సహితం డాలర్ డ్రీమ్ లో మునిగితేలుతున్నారు. స్లెడ్జి బండ్లు లాగడానికి ఇప్పుడు ముస్లింలకు బక్ పాత్ర మిగిలింది. అప్పుడు అక్షరజ్ఞానం లేదుగనుక బక్ పత్రికలు చదివేదికాదు. అదేం వైపరీత్యమోగానీ పొట్టలో నాలుగు అక్షరాలున్న ముస్లింలెవ్వరూ దేశంలో ఇప్పుడు పత్రికలు చదవడంలేదు. సాయంత్రం టీవీలో ప్రసారం అవ్వాల్సిన వార్త ఉదయమే లీక్ అయిపోతోంది. రాత్రివచ్చిన పీడకల  తెల్లారితే పత్రికల్లో వార్తగా ప్రత్యక్షమవుతోంది. ముస్లింలకు ఇప్పుడు వార్తల ఫోబియో పట్టుకుంది. అందులోనూ గుజరాత్ వార్తలంటే మరీ భయంగా వుంటోంది.

ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లీంలు చనిపోయాక వాళ్ళ ఆత్మలు తీర్పు దినం కోసం సమాధుల్లో ఎదురుచూస్తుంటాయి. అంతేతప్ప భూతాల్లా మారిపోవు. కానీ, గుజరాత్ ముస్లింల ఆత్మలు మనల్ని పగలూరేయి భూతాల్లా వెంటాడుతున్నాయి. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని వాటికి తెలిసినట్టులేదు.

నలుగురం కలిసి నవ్వుకోవడం ఎలాగూ సాధ్యంకావడంలేదు. కనీసం నలుగురు కలిసి ఏడవగలిగినా బాగుండును. సమిష్టి విలాపం కూడా ఇప్పుడు భారత ముస్లింలకు విలాస వ్యవహారం అయిపోయింది. ఈ విషాదానికి కనీసం వంద శిశిరాల వయస్సుంది. అంతర్జాతీయంగా 1973 నాటి చమురు సంక్షోభంలో దీనికి మూలాలున్నాయి.

ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా కేవలం మూడు శాతం మాత్రమే. ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా వినియోగం ఏకంగా 25 శాతం. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాల్లో అగ్రస్థానం సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఇ, కువైట్, ఇరాన్ లది అయితే చమురు దిగుమతిచేసుకునే దేశాల్లో అగ్రస్థానం అమెరికాది.

నేటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ షేనీ పూర్వాశ్రమంలో ఓ బహుళజాతి చమురు కంపెనీ సిఇఓ. కరుణామయుడైన భగవంతుడు ప్రజస్వామ్య విరుధ్ధమైన దేశాల్లో అపార చమురు నిల్వలు పెట్టి, అమెరికాలోనూ అమెరికావంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ చమురు నిల్వలు పెట్టలేదని ఆయన వాపోయేవాడు. చమురు అవసరాలను తీర్చుకోవడానికి ’ప్రజాస్వామ్య వ్యతిరేక దేశాలు’ వేటిలోనయినాసరే ’ప్రజాస్వామ్య అమెరికా’ కాలు మోపాలనేది ఆయన సిధ్ధాంతంగా వుండేది. మరోవైపు, బహుళజాతి చమురు కంపెనీలే పెట్రో డాలర్లు కురిపించి జూనియర్ బుష్ ను అమెరికా అధ్యక్షునిగా గెలిపించుకున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ చమురు కంపెనీల ముద్దుబిడ్డలే కావడంతో డిక్ షైనీ సిధ్ధాంతం ఇప్పుడు అమెరికాలో ’ఎనర్జీ బిల్లు’గా మారింది. చమురు ఉత్పత్తి చేసే ఇస్లామిక్ దేశాలను నయాన్నో భయాన్నో లొంగదీసుకోవడం ఈ బిల్లు లక్ష్యం. ఎనర్జీ బిల్లుకు అనుకూలంగా అమెరికా ప్రజల మద్దతునేకాకుండా, అమెరికా మిత్రదేశాల మద్దతును కూడా కూడగట్టేందుకు ’నాగరీకతల పోరు’ సిధ్ధాంతానికి ప్రాణం పోశారు అమెరికా పాలకులు.

డిక్ షేనీ ఎలాగూ దేవుని ప్రస్తావన ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాల్సి వున్నది.   ఇస్లామిక్ గ్రంధాల ప్రకారం ప్రవక్త ఇబ్రాహిం (అబ్రహాం) తొలి భార్య సంతానం తదనంతర కాలంలో క్రైస్తవులుగా మారితే , రెండవ భార్య సంతానం తదనంతర కాలంలో ముస్లిములుగా మారారు. ఆ మేరకు, ఇస్లాంకు క్రైస్తవంతో మరేమతంకన్నా ఎక్కువ అనుబంధం వుంది. చమురు ఎగుమతి చేసే దేశాలు ఇస్లామిక్ దేశాలు కావడం, చమురు దిగుమతి చేసుకునే దేశం క్రైస్తవ దేశం కావడం కేవలం యాధృఛ్ఛికం. కానీ, చమురు ఎగుమతులు దిగుమతుల మధ్య సాగుతున్న పచ్చి వాణిజ్య ఫొరుని అమెరికా ’నాగరీకతల పోరు’గా మార్చి తటస్థంగా వుండాల్సిన దేశాల్ని సహితం ఈ వివాదం లోనికి బలవంతంగా లాగింది. ఈ నేపథ్యంలోనే ’సెప్టెంబరు 11’ దాడులు జరిగాయి. ఏది చర్య? ఏది ప్రతిచర్య?

గుజరాత్ మారణ హోమంలో ముస్లింలది చర్య హిందువులది ప్రతిచర్య అంటున్నాడు ప్రచారక్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. రామసేవకుల సజీవ దహనం ఒక అమానుష చర్య. గోధ్రా దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే; వాళ్ళు ముస్లింలు అయినా సరే. గోధ్రా దోషుల నిర్ధారణ ప్రక్రియ ముగియక ముందే (నిజానికి ఆరంభం కాకముందే) గుజరాత్ లో ముస్లింల నరమేధం  ఆరంభమయిపోయింది. పైగా ఇది గుజరాత్ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అట!. ఒక వ్యక్తి నేరం చేస్తే అతని తెగ నంతటినీ శిక్షించే మధ్యయుగాల ధర్మం ఇప్పుడు గుజరాత్ లో పునరావృతమవుతోంది.  అమన్ చౌక్, షా ఆలం రక్షణ శిబిరాల్లోంచి చెవులు హోరెత్తేలా వినిపిస్తున్న ఆర్తనాదాలు ’క్రియాశీల’ రాశ్ట్రపతి భవనాన్ని తాకకపోవడం ఆశ్చర్యకరం. గుజరాత్ మారణహోమంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం తగులబడిపోయిందేమో మనకు తెలీదు. ప్రాణభయంతో రక్షణ కోసం పరుగున వచ్చిన ముస్లిం శరణార్ధుల్ని చూసి సబర్మతీ ఆశ్రమం తలుపులు మూసేశారట!. “ఈశ్వర్ అల్లా తేరే నామ్” ఓ మహర్షీ!  ఓ మహాత్మా! వింటున్నావా?

ప్రతీ చర్యకూ సమానమైన తద్వెతిరేకమైన ప్రతిచర్య వుంటుందనేది న్యూటన్ కనుగొన్న చలన సూత్రం.  అరవాయ్ శవాలకు ఆరువేల శవాలు, ఆరు లక్షల నిర్వాశితులు అనేది మోదీ రూపొందించిన సాంస్కృతిక యుధ్ధ వ్యూహం. మనమ్ ఆందోళన్ చెందాల్సింది దేనికంటే ప్రతిచర్యకు కూడా ఇంకో ప్రతిచర్య వుంటుందని మనకు తెలిసినందుకే!

భింద్రేన్ వాలా బాహాటంగా శిక్కు నాయకుడు అయినట్టు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధి బాహాటంగా హిందూ నాయకురాలుకాదు.  ఇందిరాగాంధీని ఇద్దరు శిక్కు అంగరక్షకులు కాల్చి చంపేశారు. దానితో కోపోద్రేకులయిన హిందువులు ఢిల్లీలో దాదాపు ఐదు వందల మంది శిక్కులపై ఊచకోత సాగించారు. విచిత్రం ఏమంటే స్వర్ణదేవాలయంపై దాడి జరిగినపుడూ, భింద్రేన్ వాలాను కాలి చంపినపుడూ శిక్కులెవ్వరూ పంజాబ్ లోని హిందువులపై దాడులు జరపలేదు. పైగా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ళల్లో దాక్కున్నారు. ఢిల్లీలో పనిచేసిన న్యూటన్ సూత్రం పంజాబ్ లో పనిచేయలేదు. చలన సూత్రాలు ప్రకృతిలో ఎప్పుడూ ఒకలా వుంటాయి. కానీ, సమాజంలో మాత్రం అవి సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. విజ్ఞాన శాస్త్రాలకు జాతి స్వభావంతో పాటూ మత స్వభావం కూడా వుంటుందని మనకు తెలియక పోవడమే విషాదం. కచ్ లో భుజ్ లో భూకంపం వచ్చినపుడు అంతటి వితరణ చూపిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపొయారూ? ప్రకృతి వైపరిత్యాలకేతప్ప సామాజిక వైపరిత్యాలకు మనం చలించలేమా?

మహారథి హోంమంత్రి అద్వానీకీ గుజరాత్ అంటే మహా ఇష్టం. మహాత్ముని రాష్ట్రాన్ని మనువు రాష్ట్రంగా మార్చడం ఆయన ఆశయం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన తన ఆశయాలని చాలసార్లు వివరించారు. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో బీజేపి అధికారానికి వచ్చినపుడు “నేడు మినీ భారత్ రేపు మహా భారత్” అంటూ ఆ పార్టి నేతలు  ఆశాభావం వ్యక్తం చేసేవారు. వాళ్ల కోరిక ఫలించింది. కేంద్రంలో ప్రస్తుతం బీజేపి నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో వుంది. వాళ్లకు అది చాలదు. ఇంకేదో కావాలి. ఇప్పుడు ’గుజరాత్ ప్రయోగం” జయప్రదమయ్యాక సంఘ్ పరివార్ అప్పుడే “నేడు గుజరాత్ రేపు మహాభారత్” అంటూ హెచ్చరికలు చేస్తోంది.

మరో కోణంలో చూస్తే, ఈ హెచ్చరికకు గట్టి నేపథ్యమే వుంది. గుజరాత్ కు కార్పొరేట్ రాజధానిగా పేరుంది. గుజరాత్ కార్పొరేట్ సంస్థలే తొలి నుండీ భారత స్టాక్ మార్కెట్ ను నియంత్రిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ’అప్పుల ఉచ్చు” పరచుకున్నాక  అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి అత్యధిక వడ్డీ రేటుకు అప్పుతెచ్చిన రాష్ట్రం గుజరాత్. యూసె ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటును 4  శాతానికి తగ్గించినా ప్రపంచ బ్యాంకుకు గుజరాత్ 18 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఆర్ధికరంగంలో ఏర్పడిన లోటు సంక్షోభంగా మారి, సహజంగానే సామాజిక ఘర్షణగా మారింది. గుజరాత్ మారణహోమాన్ని ఘర్షణ అనడంకన్నా ఏకపక్ష యుధ్ధం అనడం మరింత సమంజసంగా వుంటుంది. కార్పొరేట్ రంగంలో క్రమంగా నిలదొక్కుకుంటున్న భోరా ముస్లింల ఫ్యాక్టరీల్ని, కార్యాలయాల్నీ, నివాసభవనాల్నీ ప్రత్యేకంగా గుర్తించి మరీ భస్మీపటలం చేసేశారు. విధేశీ ఆర్ధిక సంస్థల నుండి అప్పులు తెచ్చుకోని రాష్ట్రం ఇప్పుడు దేశంలో ఏదీలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు గుజరాత్ లో జరుగుతున్నది రేపు మరో రాష్ట్రంలో జరగదన్న నమ్మకం ఏమీలేదు. ఆ మేరకు గుజరాత్ సంక్షోభానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత, అమెరికా లింకు రెండూ వున్నాయి.అప్పుడే, శివసెన అధినేత బాల్ థాక్రే మహారాష్ట్రలో రక్తపాత అంతర్యుధ్ధానికి సిధ్ధంకందని పిలుపు ఇచ్చేశారు.

ప్రభుత్వమే నేరుగా ప్రజల్ని నాగరీకత పేరునో, సంస్కృతి పేరునో రెండు శిబిరాలుగా చీల్చి, ఒకవర్గంపై ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తున్నపుడు ప్రజలు ఏం చేయాలీ? విదేశాల నుండి తెచ్చిన నిధులు, ఆయుధాలు, పరికరాలు, సిధ్ధాంతాలతోనో అగ్రరాజ్యాల వత్తిడి మేరకు చేసిన చట్టాలతోనో ప్రభుత్వం తమ మీద దాడి చేస్తున్నదని స్పష్టమైపోయినపుడు ఆదేశ ప్రజలు కూడా నిధులు, ఆయుధాలు, పరికరాలు, సిధ్ధాంతాల కోసం విదేశాల వైపుకు చూడాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. చారిత్రకంగా ఇలాంటి నేపథ్యంలోనే టెర్రరిజం పుట్టుకు వస్తుంది. ఏది చర్య? ఏది ప్రతి చర్య?

అయినప్పటికీ ప్రతిచర్యగా కూడా టెర్రరిజం సమర్ధనీయం కాదు. ఎన్నడూ ఎక్కడా టెర్రరిజం విజయాన్ని సాధించిన దాఖలాలులేవు. అంతేకాదు, టెర్రరిజం ఏ లక్ష్యాలను సాధిస్తానని ఆరంభం అవుతుందో సరిగ్గా ఆ లక్ష్యాలకు విరుధ్ధంగా అది అంత మౌతుంది. అనుమానం వున్నవాళ్ళు కాశ్మీర్ ను చూడండి. అక్కడ ఇస్లామిక్ టెర్రరిస్టుల చేతుల్లో చనిపోతున్నవాళ్ళలో అత్యధికులు ముస్లింలు.
ఇండియాలో టెర్రరిస్టుల ప్రస్తావన వచ్చినపుడు సహజంగానే పాకిస్తాన్ ప్రస్తావన కూడా వస్తుంది. స్వదేశంలో తమ మతస్తులు అనుభవిస్తున్న క్రూర అణచివేతని చూసి కలతచెందిన ముస్లింలలో కొందరికి “ఆదుకుంటుందేమో” అని పాకిస్తాన్ మీద ఆసక్తి కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే పాకిస్తాన్ వేగులు కాచుకు కూర్చొని వున్నారు. భారత ముస్లింలలో కొందర్ని పావుల్ని చేసి తన రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకోవాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. అంతేతప్ప భారత ముస్లీంలను మతాభిమానంతో ఆదుకోవాలనే తలంపు పాకిస్తాన్ కు లేదు. ఆదేశానికి అంతటిశక్తీ లేదు. నిజానికి పాకిస్తాన్ తన రాజకీయార్ధిక ప్రయోజనాల కోసం భారతదేశంలో ముస్లింలను మాత్రమేకాదు ముస్లిమేతరుల్ని కూడా ఉవయోగించుకుంటుంది.

మతాభిమానమే కావాలనుకుంటే ముస్లింలకు ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. విషయం ఇంత స్పష్టంగా వున్నప్పటికీ కొందరు భారత ముస్లిం యువకులు నిస్పృహతో పాకిస్తాన్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలాంటి చర్యలు మొత్తం భారత ముస్లీంలకు మచ్చ తెస్తాయని వాళ్ళు గుర్తించాలి. దేశంలోని ముస్లింలందరూ టెర్రరిస్టులు కానట్లే, టెర్రరిస్టులందరూ ముస్లింలుకారు!. మనదేశంలోని పాకిస్తాన్ ఏజెంట్లలో ముస్లీంలకన్నా ముస్లిమేతరులే ఎక్కువ అని ఇటీవలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రజల ధన మాన ప్రాణలను పరిరక్షించడానికి ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ వుంటుంది. ఆపైన కేంద్ర ప్రభుత్వానికి కుడా మరో పోలీసు వ్యవస్థ వుంటుంది. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏటా ఇరవాయ్ వేల కోట్ల రూపాయల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. ఇదంతా ప్రజాధనమే. ప్రజల నడ్డి విరిచి వసూలు చేసిన పన్నుల్లో భాగమే. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విదేశాల నుండి ఆయుధాలేకాదు అప్పులు కూడా తేవాల్సివస్తున్నదని ప్రభుత్వాలు పదేపదే గగ్గోలు పెడుతున్నాయి. గుజరాత్ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించినా మనం ఇంతగా బాధపడాల్సిన అవసరం వుండేదికాదేమో! సంఘ్ పరివారానికి చెందిన అల్లరి మూకల్ని గుజరాత్ పోలీసులు వెన్నుతట్టి, ప్రోత్సహించి, దగ్గరుండి మరీ ముస్లింలపై  దాడులు జరిపించారని వస్తున్న వార్తలే ప్రజాస్వామ్యవాదుల్ని మరింతగా కలవరపెడుతున్నాయి. గుజరాత్ పోలీసుల్నీ, ముఖ్యమంత్రి నరేంద్రమోదీనీ వదిలేసి మరెవరిపై ప్రయోగించడనికి ఎన్డీయే ప్రభుత్వం పొటాపోటీగా పోటాను సంధించిందనే అనుమానం ఈ సందర్భంగా ఎవరికయినా రాకుంటే వాళ్ల నిజాయితీని శంకించాల్సిందే!

నాగరీకతల యుధ్ధాన్ని ఆరంభించిన అమెరికా ప్రపంచ ప్రజల్ని రెండు సాంస్కృతిక శిబిరాలుగా చీల్చి వేస్తోంది. ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యమున్న ప్రతి దేశంలోనూ అణగారినవర్గాలు రెండు రకాల అణచివేతల్ని చవిచుస్తున్నాయి. వాటిల్లో మొదటిది; జాతీయ అణచివేత. రెండోది; అంతర్జాతీయ అణచివేత. తన ఆధీనంలో ప్రపంచరాజ్య స్థాపన చేయాలని అమెరికా ఉవ్విళ్ళూరుతోంది. దీనినే దైవరాజ్యస్థాపన అని నమ్మించి క్రైస్తవులను రెచ్చగొట్టాలని కుడా అమెరికా ఆశిస్తోంది. అమెరికా ప్రత్యక్షంగా దాడిచేస్తే ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది. పరోక్షంగా దాడులు చేస్తే ఆ రాష్ట్రం గుజరాత్ అయిపోతుంది. మేడ్ ఇన్ ఇండియా జిల్లెట్ ట్విన్ బ్లేడ్లూ, మేడ్ ఇన్ యూఎస్ ఏ జిల్లెట్ ట్విన్ బ్లేడ్లూ ఒకే సూపర్ బజార్లో దొరుకుతున్నట్లే మనకు ఇప్పుడు జాతీయ మెజారిటీ మతతత్త్వమూ, అంతర్జాతీయ మెజారిటీ మతతత్త్వమూ చెట్టాపట్టాలేసుకుని దర్శన మిస్తున్నాయి.

ఇప్పటి వరకు మనం ఆయుధాల యుధ్ధాన్ని చూశాం. ఇక అక్షరాల యుధ్ధాన్ని కాస్సేపు పరికిద్దాం. రక్తం చిందలేదన్న మాటేగానీ క్రూరత్వంలో ఆయుధాల యుధ్ధానికి ఏమాత్రం తీసిపోదు అక్షరాల యుధ్ధం. ముస్లింలను అనుక్షణం ఏదో ఒక వివాదంలోనికి లాగి వాళ్లని నిరంతరం ఊపిరి ఆడని స్థితిలో వుంచడం ఈ యుధ్ధతంత్ర లక్ష్యం.

దేశంలో కొనశాగుతున్న కాషాయీకరణను ఈమధ్య ఒకాయన లోక్ సభలో గట్టిగా సమర్ధించారు. జాతీయ జెండాలోనే కాషాయం రంగు వుందని సమయానుకూలంగా గుర్తు చేశారు. ఆయన కన్వీనియంట్ గా గుర్తు చేయని అంశాలు మరో రెండున్నాయి. మన జాతీయ జెండాలో మూడు మతాలకు ప్రతీకగా మూడు రంగులున్నాయి. అంతేకాదు, ఆ మూడు రంగులకూ జెండాలో సమాన స్థానముంది. జాతీయ జెండాలో కాషాయ రంగు వుండడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదు. ఆమాటకొస్తే కాషాయరంగు మీద భారతీయ ముస్లీంలకూ అభ్యంతరం లేదు. అభ్యంతరం ఒక్కటే, కాషాయ రంగు మిగిలిన రెండు రంగుల్ని మింగేయడానికి చేస్తున్న ప్రయత్నాలే. మూడు రంగులు ఉమ్మడి కుటుంబంగా కొనసాగడం కుదరదని సంఘ్ పరివారం భావిస్తూ వుండవచ్చు. అదే చర్య అయితే దానికి ప్రతిచర్య ఏమైవుంటుందీ? ఈ చర్య ప్రతి చర్యలే దేశాన్ని మునుపు ఒకసారి చీల్చాయి. కాషాయం రంగు వేరు. కాషాయీకరణ వేరు. 

ఇలోపున మరో సంఘ్ పరివారకుడు రష్యా దేశస్తుల్ని రష్యన్లు, చైనా దేశస్తుల్ని చైనీయులు, పర్షియన్ దేశస్తుల్ని పర్షియన్లు అన్నట్టు హిందూదేశస్తుల్ని హిందువులని పేర్కొనాలని ప్రతిపాదించారు. నిజానికి ఈ ప్రతిపాదనలో కొత్తదనంగానీ, వివాదంగానీ ఏమీలేవు. భారత ముస్లింలు భారతదేశంలో ముస్లింలేగానీ బయటి దేశాలకు ఇండియన్లు, భారతీయులు. ఈ రెండు పదాలకు రాజ్యాంగ ప్రతిపత్తి వుంది. అయితే, హిందూ పదానికి  రాజ్యాంగ ప్రతిపత్తిలేదు. అయినప్పటికీ  హిందూ పదం మీద కూడా భారత ముస్లింలకు అభ్యంతరం ఏమీలేదు. “మేము హిందువులం. మనది హిందూ దేశం” అనడానికి ఇండియన్ ముస్లింలకు అభ్యంతరం ఏమీలేదు. “సారే జహా సే అచ్చా హిందూసితా హమారా” అన్న మహాకవి ఇక్బాల్ ముస్లిమేనని సంఘ్ పరివారకులు మరచిపోయినట్టున్నారు. కొందరికి ఆశ్చర్యకరంగా వుండొచ్చేమోగానీ ముస్లిం ఛాందసవాద సంస్థగా నిందలు మోస్తున్న జమాతే ఇస్లాం సంస్థ పూర్తిపేరు జమాత్ ఏ ఇస్లామీ ఏ హింద్.

నిజానికి వివాదం హిందూ పదంలో లేదు; హిందూ పదానికి ఇస్తున్న భాష్యంలో వుంది. రష్యా అనేది దేశం పేరు, రష్యన్ అనేది జాతిపేరు. పాకిస్తాన్ అనేది దేశం పేరు, పాకిస్తానీ అనేది జాతిపేరు. ఆఫ్ఘనిస్తాన్ అనేది దేశం పేరు, ఆఫ్ఘనీ అనేది జాతిపేరు. హిందూ అనేది కూడా జాతి పేరే అయితే అసలు వివాదం ఏముందనీ? వివాదం ఎప్పుడు మొదలవుతుందంటే హిందూ పదానికి మతపరమైన భాష్యం చెప్పినపుడే. హిందూ జాతిగా ప్రతిపాదించి దాన్ని హిందూ మతంగా మార్చడం ఇందులో మొదటి దశ. హిందూ దేశంలో హిందువులకుతప్ప మరో మతస్తులకు స్థానం లేదని తేల్చడం రెండో దశ. ఇది అతివ్యాప్తి దోషం. ఈ అతివ్యాప్తి దోషం దేశం పేరుకో, జాతి పేరుకో, జాతీయ జెండా రంగుకో, రాజకీయాలకో పరిమితమైలేదు. పాఠ్యపుస్తకాలకు, విజ్ఞానశాస్త్రాలకూ, కళాసాహిత్య రంగాలకూ విస్తరించింది.  దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈనాడు కుల మత వర్గ పీడనకు గురవుతున్న వాళ్ళందరిపైనావుంది. దళిత బహుజన మేధావులపైనా వుంది. సంఘ్ పరివారం ప్రస్తుతం ముస్లింలపై గురి నిలపడంతో దేశంలో మిగిలిన అణగారినవర్గాలు సేదదీరుతున్నట్టున్నాయి. తుర్కల వ్యవహారాన్ని తుర్కలకు వదిలి పెట్టేసినట్టున్నారు!!.

సమస్త రంగాలలో ముస్లింలపై దాడికి సంఘ్ పరివారం సన్నధ్ధం కావడం ఒక విషాదమైతే సహజ మిత్రులు అనుకున్న సోషలిస్టులు, అంబెడ్కరిస్టులు సహితం ముస్లీంలను ఒంటరిగా వదిలివేయడం అంతకన్నా విషాదం. సోషలిస్టు జంట జార్జి ఫెర్నాండేజ్, జయా జైట్లీలు ఇప్పుడు తమ శక్తియుక్తుల్ని నరేంద్ర మోడీని సమర్ధించడానికి ఉపయోగిస్తున్నారు. మరోవైపు భారత సమాజానికి మత స్వభావమే లేదంటున్నారు ఆంధ్రా అంబేడ్కరిస్టు ఊ. సాంబశివరావు. గుజరాత్ మారణహోమం పాత్రధారుల్ని వెనకేసుకువచ్చే పనిలో కంచ ఐలయ్య వున్నారు. ఇవన్నీ చూస్తుంటే సోషలిస్టు సిధ్ధాంతాన్నీ, అంబేడ్కర్ రచనల్నీ మత కోణంలో సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది.  

భారత సమాజంలో హిందూ అతివ్యాప్తి దోషానికి రాజ్యాంగ రచనా సమయంలోనే బీజాలుపడ్డాయి. ఈలోపం కుప్పుస్వామిదో, అంబేడ్కర్ దో, మరొకరిదో తేల్చాల్సిన అవసరం ఇప్పుడు ముందుకు వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రక్షణ కల్పించిన రాజ్యాంగం ముస్లింల వ్యవహారాన్ని దాదాపు గాలికే వదిలేసింది. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వకుంటే దేశం నుండే విడిపోతామని ఇ.వి. రామసామి నాయకర్ హెచ్చరిస్తే ఆ వ్యవహారాన్ని రాష్ట్రాల జాబితాలో చేర్చారు  జవహర్ లాల్ నెహ్రు. యాభై యేళ్ల చరిత్ర గమనాన్ని ఒకసారి పరికిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాల్లో ఉర్ధ్వముఖ చలనం సాగిందనీ, ముస్లిం సమాజంలో అధోముఖ చలనం సాగిందనీ ఎవరికైనా తెలిస్తోంది. దళిత బహుజనుల్లోని విద్యాధిక ధనికవర్గం భద్రజనులుగా మారి క్రమమ్గా హుందూ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే భద్రత కరువైన ముస్లిం సమాజం ’ఆరవవర్ణం”గా మారిపోతున్నది.

ఒక విశాలసమూహాన్ని సరికొత్త బానిసవర్గంగా మార్చడం అనేది ఒక్క రోజులో పూర్తయ్యే వ్యవహారంకాదు. వాళ్లకు చదువులేకుండా చేయాలి. మీడియాలో వాళ్ళ మాటకు విలువలేకుండా చేయాలి. రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకుండా చేయాలి. శాసన నిర్మాణంలో, వాళ్లకు చోటు లేకుండా చేయాలి. వాళ్లకు స్వంత ఆస్తి లేకుండా చేయాలి. వాళ్లకు ఆయుధాలు దక్కకుండా చేయాలి. వాళ్ల సంస్కృతి నీచమైనదని ప్రచారం చేయాలి. వాళ్ల నెత్తురు అపవిత్రమైనదని బుకాయించాలి. వాళ్ల సామాజిక విలువల్ని ధ్వంసం చేయాలి. వాళ్ల వైభవాన్ని చాటిచెప్పే ప్రతీదాన్నీ తుడిచిపెట్టేయాలి. చరిత్ర గ్రంధాల్లో వాళ్లను పరమ అనాగరీకులుగా చిత్రించాలి. సహజవనరుల్లో, సామాజిక వ్యవస్థల్లో వాళ్ళకు వాటా లేకుండా చేయాలి. వాళ్ళ స్త్రీలకు మానం లేకుండా చేయాలి. వాళ్ల పిల్లలకు కలలు లేకుండా చేయాలి. దేశ నిర్మాణంలో వాళ్ళు నిర్వర్తించిన కర్తవ్యాలను నిరాకరించాలి. అన్నింటికీ మించి వాళ్లకు దేశం లేకుండా చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మూకుమ్మడిగా గుజరాత్ లో నిరాఘాటంగా సాగుతున్నాయి. నోరెత్తే వాళ్ళేరీ?  ఒక సంఘ్ పరివారకుడు అన్నట్టు ఇప్పుడు నిజంగానే “ముస్లీంల మనుగడ హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడివుంది”!!.

ఇతర రంగాలతో పోలిస్తే కళాసాహిత్యరంగాలకు మానవీయ స్పందన ఎక్కువ. ఇన్నాళ్ళూ అనేకానేక ప్రగతిశీల స్రవంతుల్లో ఏపుగా పెరిగిన తెలుగు సాహిత్యం సహితం ముస్లిం వ్యవహారం వచ్చేసరికి ఎందుకో మూగబోయింది. సాహిత్యంలో మత వివక్ష రెండు రకాలుగా కొనసాగుతుంది. ఒకవైపు అది ముస్లింలను సాహిత్యరంగం నుండి వెలివేస్తుంది.  ఎక్కడా వాళ్ల గురించిన ప్రస్తావన కూడా చేయదు. ఈరోజు మనదేశంలో ఏకైక తిపెద్ద సామాజికవర్గం (సింగిల్ లార్జెస్ట్ సోషల్ గ్రూప్) ముస్లింలు. దేశ జనాభాలో 15 శతం వున్న ముస్లీంలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎలాగూలేదు. సాహిత్యరంగంలోనూ ప్రాతినిధ్యం లేకుండా చేయడం హీనమైన పాపం. మరోవైపు ముస్లీంలను ప్రస్తావించినపుడు సాహిత్యం వాళ్ళను నెహటివ్ ధోరణిలో చిత్రిస్తుంది. అమాయకపు దేశభక్తులుగానో, మొరటు లారీ డ్రైవర్లు, వీధి గూండాలుగా తప్ప సభ్యసమాజపు వ్యక్తులుగా సాహిత్యంలో మనకు ముస్లింలు కనిపించరు. అననుకూల పరిస్థితుల్లోనూ, తీవ్రమైన అణిచివేతలోనూ ముస్లీంలు సాధించిన విజయాలు అనేకం వున్నాయి. అమెరికాలో వర్ణమైనారిటీలయిన వల్లవాళ్ళే (ఆఫ్రో-అమెరికన్స్) ఈ విషయంలో భారత ముస్లీంలకు సాటి. తెలుగు సాహిత్యం వాటిని రికార్డు చేసిన దాఖలాలు చాలాచాలా తక్కువ.

ఈ క్షణాన ఎటునుండి కూడా స్నేహ హస్తం అందనంతమాత్రాన హిందువులందరినీ ఒకేగాటనకట్టి శత్రువులుగా భావించడం మరో చారిత్రక నేరం అవుతుంది. అభ్యతరం వుండాల్సింది హిందూమతోన్మాదం మీదనేగానీ, హిందూమతస్తుల మీద కానేకాదు. పరలోక భావనల్ని రెచ్చగొట్టి ఇహలోక రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించుకోవడమే మతతత్త్వం. ఏ మతమైనా దీనికి వ్యతిరేకమే. హిందువులలో అయినా, ముస్లింలలో అయినా చాలాచాలా తక్కువ మంది మాత్రమే మతోన్మాదులు. ఇరు సమాజాల్లోనూ అత్యధికులు మతసామరస్యవాదులు. హిందువులలో సాధారణ భక్తులతోపాటూ ఉదారులు, ప్రగతిశీలురు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, హేతువాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు, కులనిర్మూలనవాదులు, మత సామరస్యవాదులు, మానవాతావాదులు అనేకులున్నారనే వాస్తవాన్ని ఈ బాధాకర సమయంలో సహితం మరచిపోవడం సమంజసం కాదు. మధ్యయుగాలలో హిందూ ముస్లింలు రాజులు ఎలా ఘర్షణ పడ్డారనేది కాదు మనకు కావలసింది. రానున్న కాలంలో హిందూ ముస్లిం ప్రజాసమూహాలు ఎలా కలిసి జీవించాలనేదే మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే, ఉపస్రవంతి గుండెల మీద చిచ్చు పెట్టిన ప్రధాన స్రవంతికి కూడా ప్రశాంతత కరువైపోతుంది. అంతర్గత శాంతిని సాధించని ఏ దేశం కూడా అభివృధ్ధి చెందదు. భిన్న సంస్కృతుల మధ్య ఏకత్వం నేటి అవసరం. మతసామరస్యం అనేది మనదేశంలోని ఇతర సామాజిక సమూహాలకు ఒక ఆదర్శం అయితే కావచ్చుకానీ ముస్లింలకు అది ప్రాణవాయువు.

కారుచీకటిలో కాంతి కిరణాలను వెదకడం నేర్చుకోవాలి. గుజరాత్ లో కొనసాగుతున్న ముస్లింయాగాన్ని చూసి కలత చెందిన ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఏకంగా తమ పదవులకే రాజీనామాలు చేశారు. వాళ్ళు ముస్లీంలు కాదు; హిందువులు. అలాంటివాళ్ళు సమీప భవిష్యత్తులో వందల్లో వేలల్లో కాదు లక్షల్లో కోట్లల్లో వెలుగులోనికి వస్తారు. ఇప్పటికి అదే ఆశ.

అల్లహుమ్మ సల్లి/ అలా ముహమ్మదీన్‌/ వాఅలాఆలి ముహమ్మదీన్‌/  కమా సల్లైత /
అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి ఇబ్రాహీమా/ ఇన్నక  హమీదు మ్మజీద్/

అల్లహుమ్మ బారిక్ / అలా ముహమ్మదీన్‌/ వాఅలాఆలి  ముహమ్మదీన్‌/ కమా బారక్త/ అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి  ఇబ్రాహీమా/ ఇన్నక హమీదు మ్మజీద్/

”పరమపవిత్రుడు, సకలస్తోత్రాలకూ అర్హుడైనఅల్లా!  అబ్రహామ్  ప్రవక్తకూ,  ఆయన  అనుయాయులకూ  ప్రసాదించిన శాంతిని ముహమ్మద్  ప్రవక్తకూ ఆయన   అనుయాయులకూ  ప్రసాదించు.

పరమపవిత్రుడు, సకలస్తోత్రాలకూ అర్హుడైనఅల్లా!  అబ్రహామ్  ప్రవక్తకూ, ఆయన  అనుయాయులకూ  ప్రసాదించిన శుభాలను ముహమ్మద్ ప్రవక్తకూఆయన    అనుయాయులకూ  ప్రసాదించు.


సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, విజయవాడ
9 ఏప్రిల్ 2002

ప్రచురణ : ప్రజాతంత్ర ప్రత్యేక సంచిక, మే 2002