Tuesday 28 November 2017

పత్రికా స్వేఛ్ఛ వెర్సెస్ కర్ణాటక శాసన సభ

పత్రికా స్వేఛ్ఛ వెర్సెస్ కర్ణాటక శాసన సభ

-      గౌరీ లంకేష్

          కర్ణాటకలో శాసనసభ్యులు జర్నలిస్టుల మధ్య వివాదాలకు సుదీర్గ చరిత్రే వుంది.  అత్యంత విలువైన తమ 'పార్లమెంటరీ హక్కుల్ని' జర్నలిస్టులు వుల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు తరచూ ఆరోపిస్తుంటారు. తాజాగా వాళ్ళు రవి బెలేగరే, అనిల్ రాజు అనే ఇద్దరు స్థానిక చిన్నపత్రికల సంపాదకుల మీద విరుచుకుపడ్డారు. సభాహక్కుల కమిటి  అధిపతిగానూ వుంటున్న శాసనసభా స్పీకర్  కేబీ కోలివాడ్ వాళ్ళిద్దరికీ పది వేల రూపాయల జరిమానతోపాటూ ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. తమను తాము చాలా గొప్పవాళ్ళమని భావించుకునే  కాంగ్రెస్ శాసన సభ్యులు  బీ.యం. నాగరాజ్, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు  యస్. ఆర్. విశ్వనాథ్ లతో పాటూ అత్యంత శక్తివంతులైన శ్రీమాన్  కోలివాడ్ పరువుప్రతిష్టలకు సహితం  నష్టం కలిగించేలా వార్తలు రాశారనేది వాళ్ళిద్దరి మీద అభియోగం.
        ఆ ఇద్దరు సంపాదకులు తమ పత్రికల్లో ఏం రాశారు? అన్నది ఇక్కడ అంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే, న్యాయకోవిదుల అభిప్రాయం ప్రకారం, వాళ్ళిద్దరు ప్రచురించిన అంశాలు  పరువునష్టం కేసు కిందికి వస్తాయేగానీ, సభా హక్కుల వుల్లంఘన కిందికి రావు.  ఇక్కడ అసలు విషయం ఏమంటే వలస పాలకుల వారసత్వంగా వచ్చిన ‘సభా హక్కుల్ని’ మన ఘనమైన ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ఆస్వాదిస్తూ వుండడం. శాసనకర్తల్ని న్యాయమూర్తులగా మార్చి జర్నలిస్టులకు జైలు శిక్షలు విధించే అధికారాన్ని ఇస్తున్న ఇలాంటి కాలం చెల్లిన చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్థలో వుండడానికి ఏమాత్రం వీల్లేదు.
        1980 వరకు కర్ణాటకలో పాత్రికేయం చాలా ప్రశాంతంగా, బుధ్ధిమంతుల్లా వుండేది. పాలకపక్షం మీద ఎప్పుడయినా ఒక విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు కూడా  పవిత్ర సంప్రదాయ భాషను మాత్రమే  వాడేవారు. పేరుకు ముందు  శ్రీ పేరు తరువాత గారు తప్పకుండా పెట్టేవారు. అప్పుడు ‘లంకేష్ పత్రికే’ వచ్చింది. మర్యాదస్తుల భాషను కట్టకట్టి  పక్కనపెట్టి, గుర్రాన్ని గుర్రం గాడిదను గాడిద” అంటూ సూటిగా రాయడం మొదలెట్టింది. దాని సంపాదకుడు పి. లంకేష్ ముఖ్యమంత్రి ఆర్. గుండూరావును ‘గుమ్” అనీ, సీనియర్ మంత్రి యస్. బంగారప్పను ‘బమ్’ అనీ రాసే వార్తా కథనాలుపాఠకుల్ని గొప్పగా అలరించేవి.
        ఆ కాలంలోనే - అంటే 1980లలో - కర్ణాటక అంతటా రైతాంగం అసంతృప్తితో రగిలిపోతూవుంది. దళితోద్యమం క్రమంగా వేళ్ళూనుకుంటోంది.  ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదంతో మొదలయిన గోకక్ ఉద్యమానికి మద్దతు పెరుగుతూవుంది. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ మీద ప్రజల్లో రేకెత్తిన తీవ్ర అసంతృప్తి చాప కింది నీరులా వ్యాపిస్తూవుంది. వీటన్నింటికీ ‘పత్రికే’ ఒక గొంతును ఇచ్చింది. ‘పత్రికే’ చేసే పదునైన విమర్శలు గుండూరావుకు మహా కోపాన్ని తెప్పించేవి. ఈ వ్యవహారం ఎందాక వెళ్ళిందంటే, 1981లో ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “ఈ జర్నలిస్టులందర్నీ కట్టకట్టి ఆరేబియా సముద్రంలో పడేయాలి” అన్నారు.

        గుండూరావు వారసునిగా వచ్చిన రామకృష్ణ హేగ్డే అయితే శాసనసభ్యుల హక్కుల పరిరక్షణ పేరిట ఏకంగా పత్రికా స్వేచ్చను గొంతు నులిపేందుకు గట్టిగా ప్రయత్నించారు. ప్రధాన స్రవంతి మీడియా ఆయన్ను “సిసలైన మిస్టర్ క్లీన్” “కాబోయే ప్రధాని” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ వుండేది. ఆయన గుట్టును రట్టు చేసింది ‘పత్రికే’. రెవతేజూ హౌసింగ్ (1988), యన్ ఆర్ ఐ హౌసింగ్ అసోసియేషన్ (1989), మద్యం సీసాల కాంట్రాక్టు (1984) కుంభకోణాల్ని అది నిర్భయంగా బయటపెట్టింది.

        క్రోడీకరిస్తున్నామనే సాకుతో పత్రికా స్వేఛ్ఛను హరించేందుకు కర్ణాటక శాసనకర్తల (అధికారాలు, హక్కులు, మినహాయింపులు) బిల్లు-1988ను హెగ్డే రూపొందించారు. తాము గీసిన రేఖ దాటిన పాత్రికేయులకు అత్యంత కఠిన శిక్షలు వేయాలని అందులో  ప్రతిపాదించడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈలోగా ప్రభుత్వం టెలీఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నదనే  ఆరోపణలు వెల్లెవెత్తడంతో హెగ్డే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది.  ఆయన తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన యస్ ఆర్ బొమ్మయి ఆ బిల్లును సమాధి చేసేశారు.

        జనతా పార్టీకే చెందిన మరో ముఖ్యమంత్రి జే హెచ్ పటేల్ కతే వేరు. మహిళా శాసన సభ్యులు తమ విధుల్ని నిర్వర్తించడంలేదని 1997లో ‘పత్రికే’ ఒక కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. (నిజానికి అదేమీ గొప్ప అభిరుచితో రాసిన కథనం ఏమీకాదులెండి.) దానితో, అన్ని పార్టీలకు చెందిన మహిళా శాసన సభ్యులు అందరూ ఏకమై నిండు శాసన సభలో  బకెట్లకొద్దీ కన్నీళ్ళు కారుస్తూ  ‘పత్రికే’ను సంజాయిషీ అడగాలని కోరారు. అప్పటికే ‘పత్రికే’ విమర్శల సెగను స్వయంగా చవిచూసిన ముఖ్యమంత్రి పటేల్, ఇతర మంత్రులు, శాసన సభ్యులు  ముక్తకంఠంతో  సభాహక్కుల ఉల్లంఘన నోటీసుకు మద్దతు పలికారు.

సభలో భిన్నంగా స్పందించిన ఏకైక సభ్యుడు  స్వతంత్ర అభ్యర్ధి వాటల్ నాగరాజ్. తనకు వ్యతిరేకంగా ఒక కథనాన్ని ప్రచురించినందుకు 1980లో లంకేష్ మీద భౌతికదాడి చేసిన చరిత్ర కూడా అతనికి వుంది. అయితే ఈసారి ఆయన కొత్త అభిప్రాయాన్ని సభ ముందు వుంచాడు. ‘పత్రికే’ కథనాన్ని పరువునష్టంగా భావించాలేతప్ప శాసన సభ్యుల హక్కుల వుల్లంఘన కింద పరిగణించాల్సిన అవసరం లేదన్నడు. ఈ వ్యవహారం శాసనసభలో కొన్ని రోజులు పెద్ద దుమారాన్నే రేపినప్పటికీ   అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ఆ వేడి చల్లారే వరకూ దాన్ని సాచివేశారు. ఆ తరువాత ఆ వ్యవహారం నిశ్శబ్దంగా చనిపోయింది. 
        కర్ణాటకలో శాసన సభ్యుల ఆగ్రహానికీ, దాడులకూ గురైంది లంకేష్, ఆయన ప్రచురణలు మాత్రమే కావు. సుప్రసిధ్ధ పాత్రికేయుడు టీ జే యస్ జార్జ్ ను శాసనసభకు రప్పించి నిండుశాసనసభలో వాళ్ళు  వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు.  అప్పటి నుండి ఇప్పటి వరకు – ఈ వ్యాసకర్తతో సహా -  ప్రముఖ దిన వార పత్రికల సంపాదకులు అనేకమందికి సభాహక్కుల సంఘం ముందు హాజరవ్వాలని తాఖీదులు వచ్చాయి.  శాసనసభ్యుల్ని ఏకవచనంలో సంభోదించడం, సభ బయట వాళ్ల కార్యకలాపాలను విమర్శించడం, వాళ్ల అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడం  వంటివన్నీ పాత్రికేయుల పరిధిలోని అంశాలు కావనే గట్టి అభిప్రాయంతో సభాసంఘం వుండేది అనిపిస్తోంది. ‘ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు’ కావడాన తాము ఇతరులకన్నా “మరింత సమానులు” అని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. 
ఇలాంటి అనేక పిర్యాదులు మందలింపులతోనో, (బలవంతపు) క్షమాపణల్ని  ప్రచురించడంతోనో పరిష్కారం అయ్యాయి. అయితే, పత్రికల మీద వేధింపులు మాత్రం నిరాఘాటంగా సాగుతూనే వున్నాయి.  
భారతీయ జనతా పార్టీకి చెందిన జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 2012లో ఒక సంపాదకుడ్ని శాసనసభకు క్షమాపణలు చెప్పించడంలో ఇద్దరు శాసనసభ్యులు  కృతకృత్యులయ్యారు.  బెలగావి నుండి ప్రచురితమయ్యే మరాఠీ దినపత్రిక ‘తరుణ్ భారత్’ తమ మీద నిరాధార ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించిందని బీజేపి శాసనసభ్యుడు ఆభయ్ పాటిల్, కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్యామ్ బీ ఘాతగే ఆరోపించారు. అప్పటి సభాపతి కేజీ బోపయ్య వాళ్ళ పిర్యాదుల్ని సభా హక్కుల సంఘానికి పంపించారు. ఆ కమిటీ తరుణ్ భారత్ సంపాదకులు కిరణ్ థాకూర్ ను సభకు పిలిచి, తాత్కాలికంగా నిర్మించిన ఒక బోనులో నిలబెట్టింది. “ఈ సభా గౌరవమర్యాదలు, హక్కులు అధికారాల్ని కించపరిచే వ్యాఖ్యానాలు, కథనాలు వేటినీ ఇకముందు నా ప్రతిక ప్రచురించదు” అంటూ ఆయన చేత బలవంతంగా ఒక ప్రకటన చేయించింది. సాటి సహచరుడికి ఇంతటి అవమానం జరిగినప్పటికీ, బహిరంగంగా పరాభవించినప్పటికీ కర్ణాటక మీడియా సోదరులు   మౌనంగా వుండిపోయారు.   
కన్నడలో 24x7 వార్తా ఛానళ్ళ పెరుగుతుండటంతో పరిస్థితి మరింత అధ్వాహ్నంగా మారింది. అర్నాబ్ గోస్వామికి స్థానిక  క్లోన్ లు చాలామమ్ది పుట్టుకొచ్చారు. టీవీ చర్చల్లో పాల్గొన్నవాళ్ళు ప్రభుత్వం మీద ఏమాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేసినా వీళ్లు పెద్ద గొంతుతో విరుచుకుపడిపోతుంటారు. టీవీ తెర మీద - స్వీయప్రకటిత జాతీయవాదులకంటే- మరింత ఎక్కువ దేశభక్తిని వొలకబోస్తుంటారు. ప్రతిరోజూ నిముషనిముషానికి వేసే 'బ్రేకింగ్ న్యూస్లని ప్రభుత్వానికి అనుకూలంగా అతిశయోక్తులతో నింపేస్తుంటారు.
టీవీ ఛానళ్ల ప్రసారాలను ఖండించడానికి,  ఏడాది మార్చిలోకాంగ్రెస్బీజెపిజనతా దళ్(సెక్యులర్)లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేతులు కలిపారుతమను "తక్కువచేసి చూపెడుతున్నారు” "వాస్తవాలను వక్రీకరిస్తున్నారు” "తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తున్నారు” అనేవి వీరి ప్రధాన ఆరోపణలు.  బీజెపి ఎమ్మెల్యే సురేష్ గౌడ ఓ టోల్ గేట్ బూత్ లో సిబ్బంది మీద దాడి చేసి సిసిటివి కెమెరాలకు అడ్దంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారాన్ని ఆయన శాసనసభలో పిర్యాదు చేస్తూ టీవీ ప్రసారాల్లో తనను “రౌడీ సురేష్ గౌడ” అంటూ పేర్కొన్నారని ఆవేదన వెళ్ళగక్కారు. “టీవీల వాళ్ళు రౌడీ, గూండా వంటి పదాలను చాలా అలవోకగా వాడేస్తున్నారు”. “చివరకు ప్రజాప్రతినిధుల్ని కూడా  అలా సంభోదిస్తున్నారు” అని ఆయన నిండు సభలో బాధపడిపోయాడు.
చివరకు, మీడియా ప్రసారాల నియంత్రణ కోసం నియమ నిబంధనలను రూపొందించడానికి ఒక అఖిలపక్ష సభా సంఘాన్ని కోలివాడ్ ప్రకటించారు.  దానితో మీడియా సోదరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విచిత్రం ఏమంటే మీడియాకు మార్గదర్శకాలను  రూపొందించాలని సభలో గట్టిగా పట్టుబట్టిన బీజేపి శాసనసభ్యులు సభా సంఘంలో సభ్యులుగా వుండడానికి మాత్రం ఇష్టపడలేదు. పత్రికా స్వేఛ్ఛను అణిచివేయడం తమ పార్టీ విధానం కాదంటూ తప్పుకున్నారు.  నాలుగు వైపుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఈ సభాసంఘం స్లీప్ మోడ్ లోనికి వెళ్ళిపోయింది.
రవి బెలేగరే, అనిల్ రాజులకు శాసనసభ శిక్షను విధించడంతో ఈ వివాదం మళ్ళీ ముందుకు వచ్చింది. నిజానికి బెలేగరే పాత్రికేయ శైలి ప్రతిఒక్కరూ మెచ్చుకునేలా వుండదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అనిల్ రాజు గురించిగానీ, అతని ‘యలహంక వాయిస్’ పత్రిక గురించిగానీ ఎవరికీ పెద్దగా ఏమీ తెలీదనే చెప్పాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమంటే శాసనసభ్యులు న్యాయమూర్తుల స్థానంలో కూర్చొని జర్నలిస్టుల మీద తీర్పులు  చెప్పడం ఏమాత్రం సరికాదు. ఒకవేళ వాళ్ళు తమ పరువుకు నష్టం కలిగిందని భావిస్తే ఇతర పౌరులలాగ నేర శిక్షాస్మృతి (సీఆర్ పిసీ)లోని వివిధ సెక్షన్ల కింద తమకు  న్యాయ పరిష్కారం కోరుకోవచ్చు. కాలం చెల్లిన ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకుని విమర్శకుల్ని శిక్షించడంకన్నా రాజ్యాంగ పరిధిలో అదే సరైన   పని.

16 జూన్ 2017,
ప్రచురణ :
ద వైర్ వెబ్ మ్యాగజైన్
(గౌరీ లంకేష్ హత్యానంతరం ద వైర్ వెబ్ మ్యాగజైన్ 5 సెప్టేంబరు 2017న ఈ వ్యాసాన్ని మరోసారి ప్రచురించింది.)
అనువాదం : డానీ 
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

230 పేజీలు , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

Saturday 25 November 2017

Padmavathi Movie and Gujarat Elections

            గుజరాత్ పద్మవ్యూహం


-     - డానీ

               సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమాపద్మావతిమీద  ఉవ్వెత్తున చెలరేగిన వివాదం చల్లారుతోంది. చిత్రం సింగిల్కట్కూడా లేకుండా నవంబరు 22   బ్రిటీష్బోర్డు ఆఫ్ఫిల్మ్స్క్లాసిఫికేషన్సెన్సార్సర్టిఫికేట్ పొంది డిసెంబరు 1 లండన్ లో విడుదలకు సిధ్ధం అయింది. మనదేశంలో విడుదలవ్వడానికున్న అడ్దంకులు కూడా క్రమంగా తొలిగిపోతున్నాయి. పద్మావతిసినిమాపై విమర్శలు, బెదిరింపులు, హెచ్చరికల హోరు తగ్గాక రెండు చేదు వాస్తవాలు మన ముందు నిలుస్తాయి. మొదటిది;  సంఘ్ పరివారం శూన్యం నుండి కూడా ఒక జాతీయ వివాదాన్ని సృషించగలదనీ, రెండోది; ప్రతి అంశాన్నీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోగలదు అని

               సంఘ్ పరివారానికి ఒక చిత్రమైన గుణం వుంది. అది కావ్యాన్ని వాస్తవం అంటుంది; వాస్తవాన్ని కావ్యం అంటుంది. ముస్లిం పాలకులకు సంబంధించి సానుకూల అంశాన్ని చెప్పినా దాన్ని ఒక కావ్యం (కల్పితగాధఅంటూ అది కొట్టి పడేస్తుంది. కథ తనకు అనుకూలంగా వుంటే మాత్రం  అనేక కావ్యాల్ని అది వాస్తవ చరిత్ర  అంటుంది.

               సూఫీ కవి మాలిక్ ముహమ్మద్ జయాసీ 16 శతాబ్దంలో అవధీ భాషలో పద్మావత్’ అనే కావ్యాన్ని రాశాడు. కావ్యం అంటే కల్పితగాధ అనే అర్ధం దీనికి సరిగ్గా సరిపోతుంది. 14 శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి వాస్తవ  పాత్ర, మేవార్ రాజ్యం.  చితోర్ ఘడ్ కోట వంటి వాస్తవ ప్రదేశాలతోపాటూ మేవార్ మహారాణి పద్మావతి (పద్మిని) అనే కల్పిత పాత్ర చుట్టూ అల్లిన కథ యిది. పద్మావతి అందచందాల గురించి విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను ఎలాగయినా సరే పొందాలని మేవార్ రాజ్యం మీదికి దందయాత్రకు వస్తాడు. పన్నాగాలతో పద్మావతి భర్తను  చంపేస్తాడు. అయినా పద్మావతి అతనికి దక్కదు. యుధ్ధరంగంలో భర్త చనిపొయాడన్న వార్త తెలియగానే పద్మావతి ఆత్మాహుతి చేసుకుంటుంది.

               పద్మావతి పాత్ర మరికొన్ని కావ్యాల్లోనూ కనిపిస్తుంది. ఆమె తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు ఒక్కో కావ్యంలో ఒక్కోలా వున్నాయి. అయితే కావ్యాలు అన్నింటిలోనూ వున్న ఒక సామాన్యాంశం ఏమంటే అల్లావుద్దీన్ ఎన్నడూ పద్మావతిని ప్రత్యక్షంగా చూడలేదు. ఆమె ప్రతిబింబాన్ని ఒకసారి అద్దంలో చూశాడని కొన్నింట్లో వున్నప్పటికీ పరపురుషుడికి అలా కనిపించడం కూడా ఇష్టంలేని పద్మావతి అద్దాన్ని పగలగొట్టేసిందని మరి కొన్ని కావ్యాల్లో వుంది. ముస్లిం చక్రవర్తులకు పరస్త్రీ వ్యామోహం ఎక్కువనీ, హిందూ స్త్రీలకు ప్రాణంకన్నా శీలం ఎక్కువని చెప్పే కథ ఇది.

               కథలోవున్న లవ్ జిహాద్వంటి అంశ హిందూత్వ ప్రచారానికి అనుకూలంగా వున్నప్పుడు సంఘ్ పరివారం అభ్యంతంరం పెట్టడం దేనికీ? అనే సమంజసమైన సందేహం ఎవరికైనా రావచ్చు. పద్మావతి సినిమా గుజరాత్ ఎన్నికలకు ముందే వచ్చి వుంటే సంఘ్ పరివారం దాన్ని భుజాల మీద మోసి వుండేది.  ఎన్నికల తరువాత వస్తున్నది గాబట్టి దాన్నో వివాదంగా మారుస్తోంది.

               హిందూ సమాజానికి భౌతికంగాగానీ, సాంస్కృతికంగాగానీ ముప్పు వచ్చినపుడు కాపాడగలిగేది తాను మాత్రమే అని అనుక్షణం చెప్పుకోవడం సంఘ్ పరివారానికి అవసరం. ముప్పు ముంచుకు వస్తున్నదనే వంకతో హిందూ సమూహాలని సమైక్యంగా తన శిబిరంలో వుంచి నమ్మకమైన ఓటు బ్యాంకును ఏర్పరచుకోవాలనేది దాని వ్యూహం.  దానికోసం అది తరచూ ఒక శత్రువును తానే కల్పించి ప్రచారంలో పెడుతుంది. ఏదేశంలో అయినా అధిసంఖ్యాక సమూహం అల్పసంఖ్యాక సమూహాన్ని అణిచివేస్తుంటుంది. మన దేశంలో సంఘ్ పరివారం దీనికి విరుధ్ధమైన వాదనని ప్రచారంలో పెడుతుంటుంది.  అల్పసంఖ్యాక సమూహం వల్లనే అధిసంఖ్యాక సమూహానికి ముప్పు వుందని అంటుంది.  ఇలాంటి బూటకపు ప్రచారం నుండే  అధిక సంఖ్యాక సమూహ ఉగ్రవాదం పుడుతుంది.   
      
               కథ ప్రకారం వాళ్ళిద్దరు ఒక్కసారి కూడా తారసపడనప్పటికీ, అల్లావుద్దీన్ వూహల్లో పద్మావతితో యుగళ గీతం ఒకదాన్ని సినిమాలో పెడుతున్నారని ప్రచారం మొదలయ్యింది. దానితో, షూటింగ్ మొదలయిన రోజే   వివాదం రాజుకుంది. శ్రీ కర్నీ రాజ్ పుత్ సేన రంగ ప్రవేశం చేసి పద్మావతి షూటింగ్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. మొదట్లో క్షత్రీయ స్వచ్చంద సంస్థల వ్యవహారంగా కనిపించిన వివాదం గుజరాత్ ఎన్నికలు సమీపించడంతో  బాహాటంగా రాజకీయ రూపం సంతరించుకుంది. పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీనాయిక దీపిక పదుకొనే తలలు నరికిన వాళ్ళకు పది కోట్ల రూపాయల బహుమానం ఇస్తానని హర్యాణ బీజేపి అధికార ప్రతినిధి సూరజ్ పాల్ ఆమూ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇస్లాం మతగురువులే ఆటవిక ఫత్వాలను జారీ చేస్తారనే ప్రచారం వుండేది. ఇప్పుడు హిందూ పెద్దలు సహితం అంతకన్నా పెద్ద ఫత్వాలు జారీ చేస్తారని ప్రపంచానికి తెలిసింది.

               సాధ్యమయినన్ని విధాలా, సాధ్యం కానన్నివిధాలా సినిమాను ముస్లింలతో ముడిపెట్టేశారు. ముంబాయి డాన్ దావూద్ ఇబ్రాహీం దీనికి తెరవెనుక  నిర్మాత అని మరో ప్రచారం సాగించారు. దావూద్ ఇబ్రాహీం దుబాయ్ లో కూర్చొని భారత దేశం లోనికి వందల కోట్ల రూపాయలు రహాస్యంగా పంపిస్తున్నాడంటే అది నరేంద్ర మోదీ పాలన చేతగానితనానికి  రుజువు అవుతుందన్న ఇంగితం కూడా వీళ్ళకు లేకుండా పోయింది!.

               మన చరిత్రను వలస పాలకులు రాశారని ఒకపక్క విమర్శిస్తూనే దానినే ప్రామాణికంగా తీసుకోవడం ఏం విలువా? పద్మినీ-అల్లావుద్దీన్ కథ సినిమాగా రావడం ఇదేమీ మొదటిసారి కాదు.  1930లలో ఇది తొలిసారికామోనార్ ఆగున్పేరుతో మూకీ సినిమాగా వచ్చింది. 1963లో చిత్తూరురాణి పద్మినీ పేరుతో తమిళంలో నిర్మించిన సినిమాలో వైజయంతిమాల, శివాజీ గణేశన్  నటించారు. 1964లో మహారాణి పద్మినీ పేరుతో నిర్మించిన హిందీ సినిమాలో అనిత గుహ, సజ్జన్, జైరాజ్ నటించారు. 1980లలో శ్యామ్ బెనగల్ నిర్మించిన దూరదర్శన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ 26 ఎపిసోడ్ లో పద్మినీ-అల్లావుద్దీన్ కథ వుంటుంది. 2009లో సోనీ టీవీ చిత్తూర్ కి రాణి పద్మినీ కా  జోహూర్ అనే సీరియల్ ను ప్రసారం చేసింది. 1960 నాటి తెలుగు పాఠ్యపుస్తకాల్లో పద్మినీ-అల్లావుద్దీన్ కథ వుండేది. అప్పుడెప్పుడూ లేని వివాదం ఇప్పుడు ఎందుకు రాజుకుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం కనిపిస్తోంది. అదేమంటే అప్పుడు గుజరాత్ ఎన్నికలు లేవు!.

               ఎన్నికలకు ముందు అధికార ప్రతిపక్షాలు రెండు రకాల ప్రచారాన్ని సాగిస్తాయి. తమను గెలిపిస్తే చేపట్టబోయే  పథకాలు, సంస్కరణల్ని ప్రతిపక్షాలు చెప్పుకుంటాయి. తాము పాలనలో చేపట్టిన పథకాలు, సంస్కరణల్ని అధికారపక్షాలు చెప్పుకుంటాయి. అలా చెప్పుకోదగ్గ పథకాలు, సంస్కరణలు అధికారపక్షం దగ్గర లేనపుడు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి గద్దెను కాపాడుకోవాలనుకుంటాయి.  నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీయస్టీ పథకాలను సామాన్యప్రజలు మెచ్చుకునే స్థితిలో లేరు. మోదీ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై అధికార పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటప్పుడు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చ గొట్టడంతప్ప మరో మార్గం లేదని మోదీ శిబిరం భావిస్తోంది.

          సంఘ్ పరివారం దృక్పథంలోనే ఎప్పుడూ అలాంటి ద్వంద్వత్త్వం వుంటుంది. రోజుకో మాట మారుస్తుందిభారతదేశం పేరును హిందూదేశంగా మార్చాలని  కొన్ని రోజులు అది ఆందోళనలు చేస్తుంది. దానితో, అంబేడ్కరిస్టులు హిందూత్వ మీద దాడి మొదలెడతారు. దానితో అది విచిత్రంగా అసలు హిందూమతం అనేదేలేదనీ అది పర్షియన్లు పెట్టిన తిట్టు పేరు అని ప్రకటిస్తుంది. తమది కులాలు లేని వైదీకులం అంటుంది. హర్యాణ, రాజస్థాన్ లలో పరువు హత్యల్ని వెనకేసుకు వస్తూనే వుంటుంది. ఒకరోజు చాతుర్వర్ణ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెపుతుంది. మరునాడు దళితులు, ఆదివాసుల్ని హిందువులేనంటూ  కలుపుకుంటుంది. దళితులనే పేరు కమ్యూనిస్టులు పెట్టారని నిందిస్తుంది. ఒకరోజు దేశంలో పుట్టినవారందరూ  హిందువులే అని ప్రకటిస్తుంది. మరునాడే, ముస్లింలు, క్రైస్తవుల్ని పరాయివాళ్ళు అంటుంది. వాళ్ళు హిందూవులుగానైనా మారాలి లేకుంటే వేరే దేశానికి పోనైనా పోవాలి అంటుంది. అరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో ఏకంగా యాభై యేళ్ళు  త్రివర్ణ పతాకాన్ని ఎగురేయకుండా వుంటుంది. సినిమాహాళ్ళలో త్రివర్ణపతాకం ఎగురుతుంటే లేచి నిలబడనివాళ్ళని దేశద్రోహులు అంటుంది. త్రివర్ణ పతాకాన్ని తీవ్రంగా విమర్శించిన సంస్థ కూడా ఆరెస్సెస్సే. ఏమరుపాటున  ముస్లిం వల్లనో త్రివర్ణపతాక గౌరవానికి  భంగంకలిగితే దాన్నీ దేశద్రోహమంత నేరంగా చిత్రించేదీ ఇదే. ముక్కోటి దేవతల్లో ఎవరినయినా పూజింవ్చుకునే స్వేచ్చ హిందూమతంలో వుందని గుర్తుచేస్తూ అదే ధార్మిక ప్రజాస్వామ్యం అని చెప్పేదీ ఇదేప్రజాస్వామ్యం, లౌకికవాదం అనేవి విదేశీ భావనలు అని ద్వేషించేదీ ఇదే.  ఎప్పటికి ఏది అవసరం అనుకుంటే అప్పుడు అది ఉంది అని చెప్పడానికి రెడీమేడ్ఆధారాలు మతంలో కన్నా అధికంగా హిందూమతంలో ఉన్నాయి. ఇన్ని మాటలు ఎందుకు మారుస్తోందని ఎవరికయినా సందేహం రావచ్చు. హిందూ ఓటు బ్యాంకును పదిలంగా వుంచడానికి ఎన్ని మాటలు మార్చిన తప్పుకాదనే తత్త్వం దానిది.

          ఇటీవల ఒక రెస్టారెంట్ లో ఒక విచిత్ర సంభాషణ విన్నాను. ముస్లిం రాజుల దాడులవల్లనే హిందూ సమాజంలో సతీసహగమనాలు మొదలయ్యాయని ఒకతను గట్టిగా వాదిస్తున్నాడు. పద్మావతి కథ అతనికి అలా ఉపయోగపడింది!. మహాభారతం వంటి పురాణ కాలంలోనే    సతీసహగమన ఆచారం వుందికదా!. అంతకన్నా ముందే ముస్లింలు భారత ఉపఖండంలో వున్నారా? అని అడుగుదా మనుకున్నాను. కుదరలేదు.

గుజరాత్ ఎన్నికలు ముగియగానే పద్మావతి వివాదం ముగిసిపోతుంది. ఇప్పుడు రోడ్ల మీదికొచ్చి తలలు తీస్తామంటున్నవారు సహితం టిక్కెట్టుకొని సినిమా చూసి తరిస్తారు!.  ఆతరువాత సంఘ పరివారం వివాదాన్ని వదిలేసి ఇంకో వివాదాన్ని పట్టుకుంటుంది.  వివాద సాంప్రదాయం కొనసాగుతుంది!.

(రచయిత సమాజ విశ్లేషకులు
24 నవంబరు 2017