Thursday 15 February 2018

Kashmir is Brain Child Of Nehru


కాశ్మీర్ నెహ్రు మానస పుత్రిక !

-        డానీ

పట్టించుకోవాల్సిన కీలక విషయాలను మనం తరచుగా పట్టించుకోము; పట్టించుకోవాల్సిన అవసరం (అంతగా) లేని  అంశాలను  మాత్రం చాలా తీవ్రంగా పట్టించుకుంటాము. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు  తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 7న రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నపుడు కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరీ గట్టిగా నవ్వడం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ వ్యవహారం సభా హక్కుల తీర్మానం వరకు వెళ్ళింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 లోని హామీల అమలుకు నిధుల కేటాయింపు కోరుతూ తెలుగుదేశం, వైయస్సార్ సీపీ సభ్యులు వుభయసభల్లో విభిన్న పధ్ధతుల్లో  నిరసన తెలుపుతున్న సందర్భం అది. వాళ్ల నిరసనకు కాంగ్రెస్, టీఆర్ ఎస్ కూడా మద్దతు పలుకుతున్న సమయం అది. ఆరోజు కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ప్రత్యేక నిధులు, ప్యాకేజీలు  ప్రకటిస్తుందని తెలుగు ప్రజలు ఎదురుచూస్తుండగా ప్రధాని మైకు అందుకున్నారు. వారు తన ప్రసంగంలో అనేకానేక అంశాలను ప్రస్తావించారు; ఏపీకి కొత్తగా నిధుల కేటాయింపు గురించితప్ప!

రేణుకా చౌదరి నవ్వుకు కారణమైన ఆధార్ కార్డ్ ప్రస్తావనకన్నా ఎన్నో రెట్లు  కీలకమైన అంశాలు ఆరోజు ప్రధాని ప్రసంగంలో వున్నాయి. బుధ్ధుని దమ్మపథం, బసవేశ్వరుని అనుభవ మంటపం, దేశవిభజన, కాశ్మీ`ర్, పాకిస్తాన్, నెహ్రూ, పటేల్ వగయిరాలు అందులో వున్నాయి. గాంధీజీ, అంబేడ్కర్, భారత రాజ్యాంగాల ప్రస్తావన నేరుగా లేకపోయినా వాటి మీద కూడా ప్రధాని ప్రసంగంలో పరోక్ష వ్యాఖ్యలున్నాయి. ఇప్పుడు ఆలోచనాపరులు చర్చించాల్సింది వాటి గురించి.

“సర్దార్ వల్లభ్ భాయి పటేల్ భారత తొలి ప్రధాని అయ్యుంటే …. నా కాశ్మీరానికి చెందిన ఆ భాగం ఈరోజు పాకిస్తాన్ చేతుల్లో వుండేదికాదు” అని  స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద మోదీజీ ఒక తీవ్ర వ్యాఖ్యానం చేశారు.  కాశ్మీరానికి చెందిన మొత్తం భూభాగం భారత్ చేతుల్లో వుండేదని దాని అర్ధం.

“భారతదేశమునకు దక్షణమున కన్యాకుమారి, ఉత్తరమున కాశ్మీరం  సరిహద్దులు” అని పాఠాలు చదువుకుని ఉత్తేజితులైనవారికి మోదీజీ ఉపన్యాసం మరింత ఉత్సాహాన్ని ఇచ్చివుండవచ్చు.  మోదీజీ లక్ష్యం కూడా  అలాంటి సమూహాలను  ఉత్తేజ పరచడమే. అయితే, చారిత్రక వాస్తవ సంఘటనలు ప్రభుత్వాలు సెలబస్ గా పెట్టే పాఠ్యాంశాలకు అనువుగా వుండవు.  బ్రిటీష్ వాడు పోతూపోతూ భారత ఉపఖండాన్ని  భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడగొట్టి రెండింటి మధ్య చిచ్చుపెట్టి వెళ్ళాడనేది ఇప్పటికీ చాలా మంది నమ్మే విషయం. నిజానికి భారత స్వాత్రంత్ర్య చట్టం-1947 ద్వార భారత ఉపఖండంలో బ్రిటీష్ ప్రత్యక్ష పాలనలోవున్న ప్రాంతానికేగాక, పరోక్ష పాలనలోవున్న దాదాపు 570 సంస్థానాలకు సహితం స్వాతంత్ర్యం లభించింది. ఈ సంస్థానాలు స్వతంత్ర దేశాలుగా కొనసాగడానికో, ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో విలీనం   కావడానికో  మూడు రకాల అవకాశాల్ని ఈ చట్టంలో కల్పించారు. ఇవికాక, ఉపఖండంలో పోర్చుగీస్, ఫ్రెంచ్ కాలనీలు కూడా కొనసాగుతున్నాయి.
లేబర్ పార్టికి చెందిన ప్రధాని  క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం 1947 ఫిబ్రవరి 20న భారత స్వాత్రంత్ర్య చట్టాన్ని చేసింది. ఆగస్ట్ 15ను అప్పాయింటెడ్ డేట్ గా నిర్ణయించారు.  దీని మీద జులై 18న రాజముద్ర పడింది. ఆ రోజు నుండే సంస్థానాలకు స్వాతంత్రం దక్కింది. దాదాపు అన్ని సంస్థానాలూ భారత్ లో విలీనం కావడానికి అంగీకరించాయి. నిజాం, జునాగడ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా కొనసాగడానికో, పాకిస్తాన్ లో విలీనం కావడానికో మొగ్గు చూపాయి. నిజాం, జునాగడ్ సంస్థానాలకు పాకిస్తాన్ తో వాయు, జల మార్గాలు మాత్రమే వున్నాయి. కాశ్మీర్ కు ఏకంగా భూమార్గమే వుంది.
డోగ్రా వంశానికి చెందిన హిందూ రాజపుత్రుడయిన హరిసింగ్ అప్పుడు కాశ్మీర్ రాజుగా వున్నాడు.ప్రజల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడైన షేక్ అబ్దుల్లా ప్రచారం చేస్తున్న సోషలిస్టు భావాల్ని చూసి  హరిసింగ్ భయపడ్డాడు. స్వతంత్ర భారత తొలి ప్రధాని కాబోతున్న జవహర్ లాల్ నెహ్రువి కూడా సోషలిస్టు భావాలే. పైగా నెహ్రూకు షేక్ అబ్దుల్లా అత్యంత సన్నిహిత మిత్రుడు. నిజాం సంస్థానంలో నవాబు ముస్లీం, ప్రజల్లో అత్యధికులు హిందువులు అయినట్టు, కాశ్మీరంలో రాజు హిందువు ప్రజల్లో అత్యధికులు ముస్లింలు.  అయినప్పటికీ హరిసింగ్  పాకిస్తాన్ వైపే ముగ్గు చూపడం విశేషం. ఇద్దరు సోషలిస్టులు ఏకమైతే తన రాజరిక అధికారం సాగదని భావించిన హరిసింగ్ ఇండియాకన్నా పాకిస్తానే తనకు మేలైన మిత్రుడని భావించాడు. ఆ దేశానికి ప్రధాని కాబోతున్న లియాఖత్ అలీ ఖాన్ తో తొలి విడత చర్చలు కూడా జరిపాడు.
సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి హోం మంత్రి వల్లభ్ భాయి పటేల్ కు కాశ్మీర్ సంస్థానం మీద అంతగా ఆసక్తి వుండేదికాదు. నిజాం, జునాగఢ్ సంస్థానాలు భారత్ లో విలీనం అయితే కాశ్మీర్ ను పాకిస్తాన్ లో విలీనం చేసినా ఇబ్బందేమీ కాదనే అభిప్రాయంతో పటేల్ వుండేవారు. భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ 1947 జూన్ నెలలో  ఆరు రోజులు కాశ్మీర్ లో పర్యటించాడు. ఆ సందర్భంగా కాశ్మీరం పాకిస్తాన్ లో విలీనం అయినా భారత్  దాన్ని మైత్రిభంగంగా చూడదని  హరిసింగ్ తో అన్నాట్టు ప్రత్యక్ష సాక్షులున్నారు.  ఈ విషయంలో పటేల్ తనకు గట్టి హామీ కూడా ఇచ్చారని మౌంట్ బాటెన్ అన్నాడట. అప్పట్లో పటేల్ భారత త్రివిధ దళాల అధిపతిగా కూడా వున్నారు. మరోవైపు, లియాఖత్ అలీ ఖాన్ కు కూడా ఎందువల్లనో కాశ్మీర్ విషయం మనసుకు ఎక్కలేదు.
మన జాతియోద్యమ నాయకులందరూ వలసవాద యుగంలో రాజకీయార్ధిక శిక్షణ పొందినవారు. అంచేత వాళ్లలో సహజంగానే వలస దృక్పధం వుంటుంది.  వలసలకు ఆర్ధిక ప్రయోజనమే ప్రాధమికం. వల్లభ్ భాయి పటేల్,  లియాఖత్ అలీ ఖాన్ లకు కాశ్మీరంలో అలాంటి ఆర్ధిక ప్రయోజనం ఏదీ కనిపించలేదు. కాశ్మీరంలో ఖనిజాలు, ఇతర వనరులు లేవు. జమ్మూ, కాశ్మీర్ లోయ తప్ప మిగిలిన ప్రాంతాలు జనావాసానికి కూడా అనువైనవికావు. ఇంతటి జనాభా పెరిగిన తరువాత కూడా ప్రస్తుతం లడాఖ్ ప్రాంతంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు ముగ్గురు మాత్రమే. అప్పుడు అదికూడా లేదు. అంచేత వాళ్ళిద్దరి చూపు బంగారు గనులులాంటి హైదరాబాద్, జునాగఢ్ మీదే వుంది.
కాశ్మీరం విషయంలో పటేల్ నిరాశక్తంగా వుండడం మీద గాంధీజీకి అసంతృప్తిగా వుండేది. కాశ్మీరాన్ని భారత్ లో కలుపుకోవాలనేది గాంధీజీ కోరిక. ముస్లింలు అత్యధికులుగా వున్న సంస్థానం భారత్ లో చేరితే మత ప్రాతిపదిక మీద దేశవిభజన జరిగిందనే నిందను కొట్టిపడేయడానికి వీలుంటుందని మహాత్ముడు ఆశించేవారు. నిజానికి కాశ్మీర్ ను నయాన్నో భయాన్నో భారతదేశంలో విలీనం చేసుకోవాలని గట్టిగా భావించిన నేత నెహ్రు ఒక్కరే.
కాశ్మీర్ మీద నెహ్రుది కూడా వలస దృక్పధమేగానీ అది ఆర్ధిక వలస దృక్పథంకాదు. ఆయనది సాంస్కృతిక వలస దృక్పథం. (మీరు విన్నది  నిజమే!. సాంస్కృతిక వలస పాలన అనేది కూడా ఒకటుంటుంది) కాశ్మీరాన్ని నెహ్రు భారత దేశపటానికి కీరీటంగా భావించేవారు. అలా అనుకోవడానికి వారికి బలమైన వ్యక్తిగత కారణం వుంది. నెహ్రూ పూర్వికులు కాశ్మీర్ పండితులు. కాశ్మీరం భారత దేశపటానికి కిరీటం అయితే, భారత ప్రభుత్వ కిరీటం కాశ్మీర్ పండిట్ తల మీద వుంటుందని వారు కవితాత్మకంగా పరవశించేవారు. అందుకే ప్రత్యేక పతిపత్తి, జనాభిప్రాయ సేకరణ వంటి అనేక హామీలను  ఇచ్చి అయినా సరే కాశ్మీరాన్ని విలీనం చేసుకోవడానికి నెహ్రు సిధ్ధపడ్డారు. దానికి షేక్ అబ్దుల్లా సహకారమూ,  మహాత్ముని ఆశిస్సులూ గట్టిగా వున్నాయి.  
పాకిస్తాన్ నిజాం, జునాగడ్ లను కలుపుకోవడానికి పావులు కదపడంతో చిరాకెత్తిన పటేల్ కాశ్మీర్ ను కూడా పాకిస్తాన్ కు దక్కనివ్వకూడదనుకోవడం ఆ తరువాతి పరిణామం. అప్పటికే కాశ్మీర్ పశ్చిమభాగం (ఆజాద్ కాశ్మీర్), ఊత్తరభాగం (గిల్గిట్ బాల్టిస్తాన్‍)  పాకిస్తాన్ ఆధీనంలోనికీ, తూర్పున ఆక్సాయి చిన్, షాక్స్ గమ్ లోయ (ట్రాన్స్ కారాకోరమ్ ట్రాక్ )  చైనా ఆధీనం లోనికి వెళ్ళిపోయాయి. ఈలోగా ఐక్య రాజ్యసమితి రంగప్రవేశం చేసి వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించేసింది. కాశ్మీర్ లోయ, జమ్మూ ప్రాంతం, లడఖ్, సియాచిన్ హిమనీనదం మాత్రమే సాంకేతికంగా భారత దేశంలో విలినం అయ్యాయి. నెహ్రు నిర్వహిస్తానన్న ప్రజాభిప్రాయ సేకరణ తరువాతి కాలంలో గాలికి కొట్టుకుపోవడంతో కాశ్మీర్ లోయలో స్వయం నిర్ణయాధికార పోరు తలెత్తింది.
గాంధీజీ పటేల్ ఇద్దరూ గుజరాత్ కు చెందిన వారే. కాంగ్రెస్ లో పటేల్ కు ఎంత బలం వుందీ? నెహ్రూకు ఎంత బలం వుందీ? అన్నది ప్రశ్నేకాదు. ఆ రోజుల్లో గాంధీజీ   అభిప్రాయం ఏమిటీ అన్నదే ముఖ్యం. పటేను పక్కన పెట్టి గాంధీజీ  నెహ్రూను ఎందుకు ప్రధాన మంత్రిని చేశారన్నది చర్చిస్తే బాగుంటుంది. మోదీజీ గాంధీజీ పాత్రను వదిలిపెట్టి నెహ్రూ మీద దండయాత్ర చేయాలనుకోవడం కేవలం రాజకీయం.
నెహ్రు ప్రజాస్వామికవాదిగా, లౌకికవాదిగా, సామ్యవాదిగా ప్రసిధ్ధి చెందారు. అదంతా బూటకపు ప్రచారమని చెప్పడానికి కాశ్మీరే చాలా పెద్ద ఉదాహరణ. నెహ్రును విమర్శించాలనుకుంటే కాశ్మీర్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మోదీజీ  ఉటంకిస్తే బాగుండేది. వారు అలా చేయలేదు. నెహ్రూకన్నా ముందే భారత సమాజంలో ప్రజాస్వామిక సాంప్రదాయాలు వున్నాయని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బుధ్ధుని ధర్మపథాన్నీ, బసవేశ్వరుని అనుభవ మంటపాన్నీ ఉదహరించారు. రాజ్యంగం ద్వార ప్రభుత్వ పాలన ప్రజాస్వామికంగా మారిందనే అభిప్రాయాన్ని కూడా మోదీజీ తప్పుపట్టదలిచారని పిస్తోంది.  ఆ విధంగా వారి విమర్శ నెహ్రూకే పరిమితంకాదు; అంబేడ్కర్ కు కూడా వర్తిస్తుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

హైదరాబాద్

14 ఫిబ్రవరి

ప్రచురణ : మన తెలంగాణ , ఫిబ్రవరి 16, 2018
http://epaper.manatelangana.news/1545618/Mana-Telangana-City-Main/16-02-2018#page/4/2

Thursday 8 February 2018

Mocking Sympathy On Muslim Women

ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ
ముస్లిం సమాజంలో తలాఖ్ సాంప్రదాయాల చరిత్రను వివరిస్తూ రాజకీయ పార్టీలు అవకాశవాదంగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చి ఎలా వాడుకుంటున్నాయో వివరిస్తున్నారు అహ్మద్ మొహీయుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

        ప్రధాని నరేంద్ర మోది చేపట్టిన ప్రధాన విధాన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు, జీయస్టీలకన్నా ఎక్కువ వివాదాన్ని రేపుతున్న అంశం ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017. తక్షణ ట్రిపుల్ తలాఖ్ (చిటికెల్లో విడాకులు / ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్) ను కఠినంగా శిక్షించదగ్గ నేరంగా పరిగణించడం ఈ బిల్లులో కీలక అంశం. ఈ బిల్లు లోక్ సభ ఆమోదాన్ని పొంది రాజ్యసభలో ప్రవేశించింది. రాజ్యసభలో బిల్లు పాస్ కావడానికి అవసరమైన సంఖ్యాబలం ఎన్డీయేకు లేని కారణంగా ఇప్పటికి అక్కడ ఆగివుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో, అవసరం అయితే, పార్లమెంటు వుభయ సభల్ని సమావేశపరచైనా సరే ఈ బిల్లును చట్టంగా మార్చితీరాలని కమలనాధులు గట్టి పట్టుదలతో వున్నారు. 
        నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు పథకం  సామాన్య ప్రజల్ని ఇబ్బందుల పాలుచేసి సూపర్ కార్పొరేట్లు, బ్యాంకులకు దోచిపెట్టిందని తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు.  ఆయన ప్రవేశపెట్టిన మరో పథకం జీయస్టీ దక్షణాది రాష్ట్రాల్ని  దోచి ఉత్తరాది రాష్ట్రాలకు కట్టబెట్టడానికేనని ఇటీవలి గణాంకాలు చెపుతున్నాయి. భారత ముస్లిం సమాజాన్ని నయా బానిసగా మార్చి హిందూత్వశక్తులకు ఊడిగం చేసేలా లొంగదీయడానికే ఇప్పుడు ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లును తెస్తున్నారని కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళన  కొట్టిపడవేయ దగ్గదేమీకాదు.
        దాదాపు 14 వందల సంవత్సరాలుగా కలిసి వుంటున్నప్పటికీ ముస్లిం సమాజం గురించి సాటి సమాజాలకు తెలిసింది చాలా తక్కువ. కేవలం అపోహలే తప్ప ముస్లిం సమాజం గురించీ, వాళ్ల సాంస్కృతిక జీవనం గురించీ తెలుసు కోవాలనే ఆసక్తి కూడా  ఎవరికీ లేదు. ఇక మిగిలింది అపోహలు మాత్రమే. మిగిలిన అంశాల విషయం ఎలావున్నా ముస్లిం వివాహ వ్యవస్థ గురించి ఇప్పుడయినా బయటి ప్రపంచం అర్ధం చేసుకోవాల్సింది చాలా వుంది.  
        ధార్మిక ప్రమాణాల ప్రకారం హిందూ వివాహం శాశ్వితమైనది. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే అది ఒక జీవితకాల బంధం మాత్రమే కాదు; ఏడు జన్మల అనుబంధం. ముస్లిం వివాహం దీనికి పూర్తిగా భిన్నమైనది.  ఇస్లాం ధార్మిక ప్రమాణల ప్రకారం వివాహం అనేది ఒక పౌర ఒప్పందం. ఇది ఆధునిక అగ్రిమెంట్‍ మ్యారేజ్ లను పోలి వుంటుంది. అగ్రిమెంట్ అన్నాక ఒక అవసరం, ప్రతిపాదన, ఇష్టపూర్వక ఆమోదం, నోటరీ (ఖాజీ),  సాక్షులు  మాత్రమేగాక అగ్రిమెంటును రద్దు చేసుకోవడానికి ఇరుపక్షాలకు గల హక్కులు, దానికి షరతులు వగయిరా విధివిధానాలు వుంటాయి. ఈ అంశాలన్నీ ముస్లిం పెళ్ళిలో వుంటాయి. ప్రతిపాదిత పెళ్ళి తమకు “ఇష్టమే” (ఖుబూల్) అని వధువు మూడుసార్లు, వరుడు మూడుసార్లు సాక్షుల ముందు విడివిడిగా ప్రకటించిన  తరువాత మాత్రమే పెళ్ళి జరుగుతుంది. వివాహ బంధాన్ని తెంచుకుంటున్నపుడు కూడా విడిపోతున్నామన్న విషయాన్ని మూడుసార్లు ప్రకటించాల్సి వుంటుంది. ఏ కారణం చేత అయినా వివాహబంధం నుండి బయటపడాలనుకున్నప్పుడు విడాకులు కోరే హక్కు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగా వుంటుంది.  
        ముస్లిం వివాహ వ్యవస్థలో పెళ్ళి చేసుకోవడానికి మూడుసార్లు ఖుబూల్ చెప్పినట్టే, విడిపోవాల్సివచ్చినపుడు కూడా మూడుసార్లు తలాఖ్ చెప్పాలి. ఈ ట్రిపుల్ ఖుబూల్,  ట్రిపుల్ తలాఖ్ విధానం ముస్లిం సమాజంలో అనాదిగా వుంది. ఇక భవిష్యత్తులోనూ వుంటుంది. అదేమీ మారదు. అది వాళ్ళ పౌరస్మృతి (షరియ).       
        ఇలాంటి హక్కులు భారత సమాజంలోని ఇతర సమూహాలకు దేశ స్వాతంత్ర్యం తరువాత మాత్రమే వచ్చాయి. విడాకుల హక్కును సాధించుకోవడానికి భారత మహిళలు వీధుల్లో నెలల తరబడి ఆందోళనలు చేశారు, బాబా సాహెబ్ అంబేడ్కర్ పార్లమెంటులో భీకర పోరాటం చేశాడు. చాలామందికి తెలియని విషయం ఏమంటే ముస్లిం సమాజంలో మహిళలకు ఆస్థిహక్కు, విడాకుల హక్కు మాత్రమేకాక విధవాస్త్రీ పునర్ వివాహ హక్కు కూడా ఏడవ శతాబ్దం నుండే వున్నాయి. మిగిలిన సమాజాల్లోని మహిళలు వీటిని సాధించడానికి దాదాపు 14 వందల సంవత్సరాలు పట్టింది. ముస్లిం సమాజానికి ప్రవక్ర ముహమ్మద్ కేవలం దైవ సందేశహరుడు మాత్రమేకాదు వారే ఒక గొప్ప సంస్కర్త. వారు స్వయంగా విధవాస్త్రీని మాత్రమేగాక తన కన్నా వయసులో పెద్దవారైన మహిళను వివాహమాడి ఒక మహత్తర  సాంప్రదాయానికి నాందీ పలికారు.
        ఆధునిక ప్రమాణాల్లో విడిపోయే హక్కు ఏ రంగంలో అయినా ప్రజాస్వామికమైనదే. విడిపోయే హక్కు వున్నంత మాత్రాన ముస్లిం సమాజంలో విడాకుల శాతం ఎక్కువ అనిగానీ, ఇతర సమాజాల్లో విడాకుల శాతం తక్కువ అనిగానీ చెప్పడానికి లేదు. భారత దేశంలో బౌధ్ధుల్లో విడాకుల శాతం అందరికన్నా ఎక్కువగా వుందని ఇటీవలి జనాభా లెఖ్ఖలు చెపుతున్నాయి. విడాకుల్ని ఒక హక్కుగా గుర్తించిన సమాజం కనుక ముస్లింల విడాకుల కేసులు బాహాటంగా బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇతర సమాజాల్లో చట్టబద్దంగా విడాకులు పొందిన వాళ్ళ సంఖ్య మాత్రమే అధికారికంగా తెలుస్తోంది.  నిజానికి విడాకులు పొందకుండానే విడిగా వుంటున్నవాళ్ళు, ‘విడిచిపెట్టబడ్డ’ వాళ్ళ సంఖ్య ఇంతకన్నా తక్కువగా ఏమీలేదు.
        అయితే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే దాంపత్యంలో ఆర్ధిక స్వేచ్చగలవారే విడాకుల సౌకర్యాన్ని  ఎక్కువగా  వాడుకుంటారు. దీనికి ఆ మతం, ఈ మతం అని తేడా ఏమీలేదు. ఇదొక సార్వజనీన సూత్రం. ఇప్పటి వరకు భర్తలే ఈ సౌకర్యన్ని వాడుకునేవారు.  ఇటీవలి కాలంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సహితం ఆర్ధిక స్వేచ్చను ఆస్వాదిస్తున్నారు. ఆ మేరకు వాళ్లు కూడా అవసరమైనప్పుడు విడాకుల సౌకర్యాన్ని బాగానే వాడుకుంటున్నారు.
        ఆర్ధికరంగంలో సరళీకరణ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రవేశించాక మనుషుల్లో ఆర్ధిక అత్యాశ, వస్తు వ్యామోహం విపరీతంగా పెరిగిపోయాయని మనకందరికీ తెలుసు. అయితే, దాంపత్య జీవితం మీద కూడా దాని ప్రభావం బలంగా పడిందని మాత్రం మనం ఇంతకాలంగా గుర్తించలేదు.  మన సమాజంలో దాంపత్య జీవితం ఎంత వేగంగా విఛ్ఛిన్నం అయిపోతున్నదో చెప్పడానికి కుటుంబ న్యాయస్థాల్లో నమోదు అవుతున్న విడాకుల కేసుల సంఖ్య ఒక కొలమానం. హైదరాబాద్ లో విడాకుల కేసుల్ని విచారించడానికి గతంలో ఫ్యామిలీ కోర్టులు ఒకటో రెండో వుండేవి. ఇటీవల కేసుల సంఖ్య పెరగడంతో కోర్టుల సంఖ్య కూడా నాలుగైదు రెట్లు పెరిగింది. అంతేకాక ఐటీ ఉద్యోగుల విడాకుల కేసుల్ని ప్రత్యేకంగా విచారించడానికి కొన్ని కోర్టులు వీకెండ్స్ లో కూడా పనిచేస్తున్నాయి.
        ఇక్కడొక విచిత్రాన్ని గమనించాలి. ముస్లిం సమాజంలో ‘తాత్కాలికం’ అనే ప్రాతిపదిక మీద వివాహబంధంలో ప్రవేశించిన స్త్రీలు దాన్ని శాశ్వితబంధంగా మార్చాలని కోరుకుంటున్నారు. మరో వైపు, హిందూ సమాజంలో ‘శాశ్వితం’ అనే ప్రాతిపదిక మీద వివాహబంధంలో ప్రవేశించిన స్త్రీలు తమకు విడాకుల హక్కు ఉండాలని, అంటే వివాహాన్ని తాత్కాలిక బంధంగా మార్చాలని కోరుకుంటున్నారు!. 
        ముస్లిం సమాజంలో భార్య విడాకులు కోరడాన్ని ఖులా అంటారు. భర్త విడాకులు కోరడాన్ని తలాఖ్ అంటారు.  తలఖ్ పొందడానికి సాంప్రదాయంగా రెండు విధానాలున్నాయి. తలాఖ్ – ఏ- హసన్, తలాఖ్ –ఏ- అహసాన్. ఈ రెండు పధ్ధతుల్లో స్వల్ప బేధాలున్నప్పటికీ కొన్ని సారూప్య ప్రమాణాలున్నాయి. ఏ కారణం చేతనయినాసరే భార్య నుండి విడిపోవాలనుకున్న భర్త ఆ విషయాన్ని భార్యకు ముందుగా ప్రకటించాలి. అంటే మొదటిసారి తలాఖ్ చెప్పాలి. నెలకు ఒకసారి చొప్పున మూడు నెలల్లో మూడుసార్లు చెప్పాలి. మూడవసారి కూడా చెపితేనే విడాకులు పొందినట్టు.  రెండుసార్లు తలాఖ్  చెప్పినా మూడోసారి చెప్పడానికి ముందు భర్త తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం వుంది. అప్పుడు అంతకు ముందు రెండుసార్లు చెప్పిన తలఖ్ లు రద్దయిపోతాయి. భర్త తన ఆలోచనల్ని మార్చుకునే అవకాశం ఇవ్వడానికే ఈ మూడు నెలల సాగదీతను పెట్టారు. ఈ మూడు నెలల వ్యవధి ఇవ్వడానికి మరో ప్రధాన కారణం ఏమంటే భార్య గర్భవతి అయిందో? లేదో? తేల్చడం. ఆ కాలంలో భార్య గర్భవతి అయితే పుట్టబోయే శిశువు పోషణ బాధ్యత భర్తదే అవుతుంది.  అప్పుడు తలాఖ్ వాయిదా పడుతుంది.
        తలాఖ్ నిర్ణయానికి మూడు నెలల గడువు సరిపోదని ఖలీఫాలే బలంగా భావించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. తలాఖ్ గడువును తగ్గించాలని తన మీద వత్తిడి తెచ్చిన వారి మీద రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. “మీరు సహనంతో వ్యవహరించాల్సిన చోట తొందరపాటును ప్రర్శిస్తున్నారు” అని హెచ్చరించినట్టు కూడా ఇస్లాం ధార్మిక గ్రంధాల్లో వుంది.
        ఈ సందర్భంగా సంభోగ నియమాలని కూడా  ఒకసారి పరికించాలి. ముస్లిం సమాజంలో వివాహేతర సంభోగానికి ధార్మిక సమర్ధన లేదు. వివాహమాడిన స్త్రీలతో మాత్రమే పురుషుడు సంభోగంలో పాల్గొనాలనే కట్టుడివుంది. అనాధలు, పనివాళ్ళు, బానిసలు,  విధవాస్త్రీలు తదితరులకు యజమానులైన పురుషుల సంభోగ కోరిక ముప్పు (Susceptible, Vulnerable) ఎప్పుడూ వుంటుంది. అలాంటి స్త్రీలను డబ్బు, అధికారం, కండ బలాలతో లొంగదీసుకోకుండా గౌరవప్రదంగా వివాహమాడాలనే నియమం ఒకటి వుంది. అలా పుట్టిందే బహుభార్యత్వం. ముస్లిం సమాజంలో బహుభార్యత్వానికి ధార్మిక సమర్ధన వున్నప్పటికీ దానికి సంఖ్యాపరమైన పరిమితి,  ఇతర బాధ్యతలకు సంబంధించిన ఆదేశాలు అనేకం వున్నాయి. బహుభార్యత్వం అనేది ముస్లిం సమాజంలో అధికారికంగా కొనసాగితే ఇతర సమాజాల్లో అనధికారికంగా సాగుతోంది. ఇక్కడా ఒక విచిత్రం వుంది. మనదేశంలో ధార్మిక సమర్ధనవున్న ముస్లింలకన్నా, ధార్మిక సమర్ధనలేని హిందూ సమాజంలోనే బహుభార్యత్వం అధికంగా వున్నట్టు అనేక సర్వేలు చెపుతున్నాయి.  వివాహేతర సంబంధంగా స్త్రీలను ‘ఉంచుకోవడం’ అనేది గ్రామీణ ప్రాంతపు భూస్వామ్య కుటుంబాల్లో  సర్వసాధారణ విషయంగా మనం ఇప్పటికీ గమనించవచ్చు.  
        అప్పటి అరబ్బు ముస్లిం రాజులు కొందరు బహుభార్యత్వపు పరిధిని మించి వివాహాలు చేసుకున్నారు. పాత భార్యల్ని వదిలిపెట్టి కొత్త స్త్రీలను పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళు ఒక దుర్మార్గమైన, అమానవీయమైన విడాకుల విధానాన్ని కనుగొన్నారు. మూడు నెలల వ్యవధి విధానాన్ని పక్కన పెట్టి  ఒక్క గుక్కలో ట్రిపుల్ తలాఖ్ చెప్పడం మొదలు పెట్టారు. దీనినే తలాఖ్ –ఏ – బిద్దత్ అంటారు. ముస్లిం సమాజంలో ఈ విధమైన విడాకులు మొదటి నుండీ వివాదాస్పదమైనవే. వీటికి ధార్మిక మద్దతు లేదు.
        గతి తప్పిన దురాచారాన్ని ముస్లిం  మతాచార్యులు మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేశారో? లేదో? మనకు తెలీదు.  బహుకొద్ది మందికితప్ప సాధారణంగా మతాచార్యులకు చక్రవర్తుల్ని ఎదురించే సాహసం వుండదు. పైగా వాళ్ళు ప్రభువుల మెప్పు పొందడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. ప్రభువులు చేసే అకృత్యాలను సహితం ధర్మసమ్మతంగా చిత్రించడానికి తమ పాండిత్యాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అన్నింటికిమించి మతాచార్యుల్లో అత్యధికులు పురుషాహంకారులు. మత నిబంధనల్ని ఆధునిక పరిణామాలకు వర్తింపచేయాల్సి వచ్చినపుడు వాళ్ళు  పురుషుల పక్షం వహించి పరిష్కారాలు చేస్తుంటారు. ఆ మేరకు మహిళల హక్కుల్ని కాలరాస్తుంటారు. తరచుగా కాకపోయినా అరుదుగానయినా తలాఖ్ – ఏ – బిద్దత్ ముస్లీం సమాజంలో కొనసాగిందన్నది వాస్తవం.  
        ముస్లిం మతాచార్యుల పురుష అభిజాత్యం సమీప గతంలో 1986 నాటి షాబానో కేసులో బాహాటంగా బయటపడింది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మొహమ్మద్ అహమ్మద్ ఖాన్ అనే వ్యాపారి ఐదుగురు పిల్లల తల్లి, 62 ఏళ్ల వృధ్ధురాలైన తన భార్య  షాబానోకు విడాకులిచ్చాడు. మాజీ భర్త నుండి తనకు జీవానాధారాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన సుప్రీం కోర్టు 1986లో నెలకు 179 రూపాయల మనోవర్తిని ఇవ్వాల్సిందిగా షా బానో భర్తను  ఆదేశించింది.
        ఆనాటి జీవన ప్రమాణాల ప్రకారం చూసినా  నెలకు 179 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం. షాబానో గౌరవప్రదంగా బతకడానికి సరిపడేలా మనోవర్తి మొత్తాన్ని పెంచేలా ఆమె మాజీ భర్తను సుప్రీం కోర్టు ఆదేశించాలని ముస్లిం సమాజం ఆందోళన చేసి వుండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత ముస్లిం సనాతనవర్గం రంగప్రవేశం చేసి విడాకులు పొందిన స్త్రీకి మనోవర్తి తీసుకునే హక్కేలేదని  వాదించింది. విడాకులు ఇచ్చిన భర్త పరపురుషునితో సమానమనీ, పరపురుషుని నుండి జీవనాధారాన్ని పొందడం ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమని విపరీత భాష్యాలు చెప్పింది. విడాకులు పొందిన స్త్రీల పోషణ భారాన్ని ఆమె రక్త సంబంధీకులుగానీ, వక్ఫ్ బోర్డుగానీ స్వీకరిస్తారని బూటకపు హామీలు గుప్పించింది. షాబానో మనోవర్తిని రద్దు చేయాలంటూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి తెచ్చింది. అప్పట్లో, పంజాబ్ లో అల్లకల్లోలం, అస్సాంలో  విద్యార్ధి ఉద్యమాలతో సతమతమవుతున్న రాజీవ్ గాంధీ చివరకు  ముస్లీం సనాతనవర్గం వత్తిడికి లొంగిపోయారు. విడాకులు పొందిన ముస్లిం స్త్రీల మనోవర్తిని రద్దు చేస్తూ ‘ముస్లిం మహిళ (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం – 1986’ తెచ్చారు. ఇది ముస్లిం మాతాచార్యులు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేసిన ఒక చారిత్రక తప్పిదం, సాంఘీక మహాఅపచారం.
        ప్రపంచ మతాల్లో కొత్తది కావడంవల్ల కావచ్చు సామ్యవాదం తదితర ఆధునిక  భావజాలాల మూలాలు అనేకం ఇస్లాంలో కనిపిస్తాయి. ఇస్లాం ఆర్ధిక విధానం ధర్మకర్తృత్వం. దానాలు చేయడం ద్వార మనుషులు తమ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చనేది దీనికి అంతస్సూత్రం. ఫిత్రా, జకాత్, ఖుర్బానీ, పాత వస్తువుల్ని పంచడం వగయిరా సాంప్రదాయాలన్నీ ధర్మకర్తృత్వ దృక్పధం నుండి  పుట్టినవే. నిరుపేదలు, అనాధలు, విధవాస్త్రీలు, రోగులు, నిస్సహాయులు దానం పొందడానికి తొలి అర్హులు అంటూ అనేక సందర్భాల్లో ధార్మిక ఆదేశాలున్నాయి.   అన్నార్తులకు దానాలు చేయాలని ఆదేశాలు స్పష్టంగా వున్నప్పుడు మాజీ భర్త నుండి మాజీ భార్య జీవనాధారాన్ని పొందడాన్ని ఈ మతాచార్యులు తప్పుబట్టడం ఒక వికారమే తప్ప మరేమీకాదు. లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నప్పటికీ నోరు మెదపలేని ఈ మతాచార్యులు విధవాస్త్రీల పోషణ బాధ్యతను వక్ఫ్ బోర్డులు స్వీకరిస్తాయని గొప్పలు చెప్పుకోవడం మరో బూటకం. సామాజిక దృక్పధంలో ఇస్లాం మతానికి అప్పటి వరకువున్న గౌరవ స్థానాన్ని షాబానో కేసు మసకబార్చింది.
        ఆ తరువాతి కాలంలో,  సమాచార సాంకేతిక (ఐటి) విప్లవం తెచ్చిన అనర్ధాలకు దాంపత్య జీవితం కూడా బలయిపోయింది. స్మార్ట్ ఫోన్లు, ఎస్సెమ్మెస్, వాట్స్ అప్, ట్విట్టర్, ఇ-మెయిల్ వగయిరా అత్యాధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వార ఒక్క గుక్కలో ట్రిపుల్ తలాఖ్ చెప్పేసే తరం ఒకటి తయారయింది. ఇలాంటి సంఘటనలు వార్తల్లో వచ్చిన తొలి దశలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ధార్మిక సంస్థలు మేల్కొని వుండాల్సింది. ఐటీ డివోర్సు, తలాఖ్ –ఏ – బిద్దత్, ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ లు ఏ విధంగానూ చెల్లవని స్పష్టంగా ప్రకటించి వుండాల్సింది. విగ్రహారాధన కిందకు వస్తుందేమోననే అనుమానంతో  ముస్లింలు ఫొటోలు దిగడం మీద రోజుల తరబడి చర్చించే మతాచార్యులకు స్మార్ట్ ఫోన్ తలాఖ్ –ఏ – బిద్దత్  ధర్మ విరుధ్ధం అని తోచకపోవడం దారుణం!.
        ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితురాలయిన షయరా బాను అనే మహిళ గత ఏడాది న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిదప మరికొందరు ముస్లిం మహిళలు కూడా ఈ కేసులో చేరారు. ఈ కేసు ముస్లిం సమాజంలోనేకాక ముస్లిమేతర సమాజాల్లోనూ సంచలనం రేపింది. ఈ కేసు లో సుప్రీం కోర్టు విచారణాంశం మీద కూడా అనేక అపోహలు ప్రచారం అయ్యాయి.  ఇన్  స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ లేదా తలాఖ్ –ఏ – బిద్దత్ ఇస్లాం మూలసూత్రాలకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశాన్ని మాత్రమే సుప్రీం కోర్టు విస్తారంగా పరిశీలించింది.
        షా బానో కేసు సమయంలో రాజీవ్ గాంధీ వున్నట్టే షాయరా బానో కేసు సమయంలో నరేంద్ర మోదీ కూడా రాజకీయ ఇరకాటంలో వున్నారు. బీహార్ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు మరో పెద్ద సవాలుగా మారాయి. సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకునే స్థితిలోనూ ఆయన లేరు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలన్నీ కూలిపోయాయి. ఆ విఫల పథకాల గురించి చెప్పినా జనం నమ్మే స్థితిలోలేరు. మోదీ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ తిరోగమన బాటలో నడుస్తోందని ఆయన పార్టీ సీనియర్లే బయటపడి మాట్లాడడం మొదలు పెట్టారు.  
        ఆధునిక పనిముట్లు పనిచేయనపుడు వాడడానికి పాలకుల దగ్గర పురాతన ఆయుధాలు ఎలాగూ వుంటాయి; అదే మతతత్త్వాన్ని రెచ్చ గొట్టడం. ప్రభుత్వం తమ మేలు కోసం ఏమీ చేయకపోయినా ముస్లింలను అణిచివేస్తే చాలని సంబరపడే ఓటర్లు మనకు తక్కువేం లేరు. అలాంటి వాళ్ళు యూపీలో మరీ ఎక్కువ. వాళ్లను సంతృప్తి పరచడానికి నరేంద్ర మోదీజీ హఠాత్తుగా స్త్రీ జనోధ్ధారకులు అయిపోయారు. అందులోనూ ముస్లిం మహిళా బాంధవులయిపోయారు. వారు పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్ననట్టు రూపొందించిన ప్రచార పోస్టర్ లో ఇద్దరు మహిళలు బుర్ఖాలు వేసుకొని వుంటారు. మహిళల ఆర్ధిక వికాసం, దాంపత్య హక్కులు ముస్లింలతోనే ఆరంభం అన్న రీతిలో యూపీ ఎన్నికల ప్రచారం సాగింది. ముస్లింలను సున్నీలుగా, షియాలుగా, తిరిగి వాళ్ళను పురుషులుగా స్త్రీలుగా చీల్చేస్తున్నట్టు సంకేతాలిస్తూ తన సాంప్రదాయ ఓట్ బ్యాంకును అలరించారు ప్రధాని.
        ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం  ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ అనేది ఇస్లాం ఆదర్శాలకు విరుధ్ధమంటూ,  చట్టపరంగా అది చెల్లదంటూ ఈ ఏడాది ఆగస్టు 22న   తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం సమాజంలోని ప్రగతిశీలురే కాకుండా చాందసులు సహితం ఆహ్వానించారు. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను ఇస్లాం సాంప్రదాయాలు, విలువలతో సంబంధంలేని భ్రష్టాచారంగా పేర్కొన్న సుప్రీం కోర్టు తన తీర్పులో ఇస్లాం ఆదర్శాలను కొనియాడడం ఆ సమూహాలకు ఆనందాన్నిచ్చింది.
        సుప్రీం కోర్టు తీర్పులో కూడా ఒక విశేషముంది. ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో 3:2  నిష్పత్తిలో భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. తీర్పుకు ఒక్క ఓటుతో స్వల్ప ఆధికయత మాత్రమే వుంది. ముగ్గురు న్యాయమూర్తులు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ అనేది ఇస్లాం ధార్మిక ఆదర్శాలకు విరుధ్ధమని చట్టపరంగా అది చెల్లదని మెజారిటీ తీర్పును ప్రకటించారు. నిజానికి దీన్ని న్యాయస్థానాల్లో ఇస్లాం ధార్మిక విలువలు సాధించిన విజయంగా భావించవచ్చు. ట్రిపుల్ తలాఖ్ నే కాదు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను సహితం రాజ్యాంగ విరుధ్ధం అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పలేదు. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు ఆ తీర్పు మీద తమ అసమ్మతిని నమోదు చేశారు.  ఆ ఇద్దరిరిలో ఒకరు సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం.  వాళ్ళిద్దరి అసమ్మతికి రాజ్యాంగపరమైన ధర్మసూక్ష్మాలు అనేకం  వున్నాయి. మతవిశ్వాసాలు కలిగి వుండడం, మతాచారాల్ని పాటించడం, మతాన్ని ప్రచారం చేసుకోవడం వంటి పౌరుల ప్రాధమిక హక్కుల జోలికి సుప్రీం కోర్టు పోదలచలేదు. ఒక పౌర సమూహపు వివాహం, విడాకులు, వారసత్వం వంటి సాంస్కృతిక అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని భారత రాజ్యంగంలోని 25వ అధీకరణ ఆమోదించదని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్ చాలా స్పష్టంగా వివరించారు.
        అయితే సుప్రీం కోర్టు తీర్పును నరేంద్ర మోదీ అనుకూల మీడియా వక్రీకరించింది. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ నే కాకుండా ఏకంగా సాంప్రదాయ ట్రిపుల్ తలాఖ్ ను సహితం రాజ్యాంగ విరుధ్ధం అని సుప్రీం కోర్టు ప్రకటించినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. ఇది ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం సాధించిపెట్టిన మేలు అన్నట్టు ఒక అబధ్ధపు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
        నిజానికి సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఈ వివాదం ముగిసిపోవాలి. ముస్లింలను ఎప్పుడూ ఏదో ఒక భావోద్వేగ  ధార్మిక వివాదంలో వుంచడమే కమలనాధుల ఎత్తుగడ. ఆ హోరులో తన పరిపాలనలోని లోపాలను, వైఫల్యాలను ప్రజలు మరిచిపోవాలనేదే   మోదీ ప్రభుత్వ వ్యూహం. దానికోసం, ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017ను రూపొందించి వివాదాన్ని కొత్త దశకు తీసుకొని వెళ్ళింది మోదీ ప్రభుత్వం.
        ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం ఈ బిల్లుల్లో కీలక అంశం. ఈ బిల్లు చట్టంగా మారితే ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ ను చెప్పిన భర్తకు భారీ జుర్మానాతోపాటూ మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించవచ్చు. ఒక సమూహాపు సాంస్కృతిక ఆచారాన్ని  శిక్షార్హమైన నేరంగా పరిగణించ వచ్చునా? అన్నది ఒక ప్రశ్న అయితే దేశద్రోహ నేరానికి పాల్పడ్డవారితో సమానంగా కఠిన కారాగార శిక్ష విధించవచ్చునా అన్నది అంతకన్నా కీలకమైన ప్రశ్న.
        సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడా ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్  కేసులు కొన్ని తమ దృష్టికి వచ్చిన కారణంగా కొత్త చట్టం చెయ్యాల్సిన అవసరం వచ్చిందని మోదీ ప్రభుత్వం అంటున్నది.  సుప్రీం కోర్టు తీర్పుకూ కొత్త చట్టానికీ అసలు పొంతనేలేదు. ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ ఇస్లాం ధార్మిక ఆదర్శాలకు విరుధ్ధమని చట్టపరంగా చెల్లదని  సుప్రీం కోర్టు చెప్పింది. అంటే, ఒక ముస్లిం భర్త తన భార్యకు ఏదైనా ఆవేశంలో  ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ చెప్పినా అది చెల్లదు. భార్యకు తన భర్త మీద, ఆమె పిల్లలకు తమ తండ్రి మీద గతంలో వున్న దాంపత్య, కుటుంబ, వారసత్వ హక్కులన్నీ యధాతధంగా కొనసాగుతాయి. సుప్రీం కోర్టు తీర్పు తుంటరులైన భర్తల్ని సరిదిద్దుతుంది; బాధితులైన భార్యల్ని పరిరక్షిస్తుంది. కొత్త చట్టం అలాకాదు. తుంటరులైన భర్తల్ని జైలుకు పంపుతుంది. భార్యనూ, ఆమె పిల్లల్నీ గాలికి వదిలేస్తుంది. ఇక్కడ ఇంకో తిరకాసుంది. భర్త చెప్పిన ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్  చెల్లినట్టా? చెల్లనట్టా అనేది సమాధానంలేని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఒకవేళ ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ చెల్లేదయిదే భర్తను జైలుకు పంపాల్సిన పనిలేదు. ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ చెల్లకుంటే ఆ మహిళ అతనికి భార్యగానే కొనసాగాల్సి వుంటుంది. విడాకులుపొందలేదు గాబట్టి  భర్త జైలు శిక్షాకాలం పూర్తిచేసే వరకు  ఆమె మరో వివాహం చేసుకోవడానికి కూడా కుదరదు.  భర్తను జైలుకు పంపిన కారణంగా అతని బంధువులు సహజంగానే ఆమెనూ ఆమె పిల్లల్నీ దగ్గరకు రానివ్వరు. సారాంశంలో, ముస్లిం పురుషులతోపాటూ, ముస్లిం మహిళల్ని కూడా అణిచివేయడానికి ఈ చట్టాన్ని  రూపొందించాడు అనవచ్చు. ఇంత అడ్దగోలు చట్టాన్ని భారత నేరస్మృతి చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూసి వుండరు.
         ఈ చట్టంలో ఇంకో ప్రమాదం పొంచివుంది. భర్త ఇన్ స్టాంట్ త్రిపుల్ తలాఖ్ చెప్పినట్టు భార్య పిర్యాదు చేయకపోయినా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తనంతట తాను (సుమోటో)గా కేసు నమోదు చేయవచ్చు. కేసు నమోదు చేయడం అంటే జైలుకు పంపడమే.  అంటే, ముస్లిం పురుషుల మీద ఎప్పుడయినా సరే కేసులు పెట్టి జైళ్లకు పంపడానికి పోలీసులకు ఈ చట్టం అపార అధికారాల్ని ఇస్తుంది. తనతో విబేధించే రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలపై  మోదీ ప్రభుత్వం  సిబిఐ, ఆర్ బిఐ,  ఇడి, ఐటీ, ఇసీ, చివరకు న్యాయస్థానాల్ని సహితం ఉపయోగించి  దారికి తెచ్చుకోవడాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇక ముందు ముస్లిం సమాజాన్ని అణిచివేయడానికి పోలీసుల్ని, చట్టాల్ని ఉపయోగించడాన్ని మనం చూడబోతున్నాం.
        కేంద్ర హోం, న్యాయశాఖలు  సంయుక్తంగా రూపొందించిన ఈ బిల్లును డిసెంబరు 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది డిసెంబరు 29న ఈ బిల్లు లోక్ సభ ఆమోదాన్ని కూడా పొందింది. దీనికి కాంగ్రెస్‍ సహితం మద్దతి ఇవ్వడం విశేషం. 1986 నాటి షాబానో కేసులో మనవర్తిని రద్దుచేసి రాజీవ్ గాంధీ  ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. మూడు దశాబ్దాల తరువాత ఆయన కుమారుడు రాహుల్ గాంధీ షయరా బానూ కేసులో కమలనాధులకు మద్దతు పలికి  మరో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు.
        ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017ను తాము మత ప్రాతిపదికగా చూడడం లేదనీ మహిళల సమస్యల్ని మానవీయ కోణంలో చూస్తున్నామని కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర ప్రసాద్ అంటున్నారు. ప్రభుత్వం చెపుతున్న ఆదర్శాలకూ ఆచరణకూ పొంతన లేదు. మన దేశంలో ముస్లిం మహిళలు భర్తలవల్లనేగాక ప్రభుత్వాలవల్ల, వాళ్ల సైనికులవల్ల బాధపడ్డ సందర్భాలు అనేకం వున్నాయి.  మాలియాన, ముజఫర్ నగర్ హత్యలు, అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళలు ఇంతకన్నా పెద్ద సంఖ్యలో, ఇంతకన్నా హృదయ విదారకంగా రోదించారు. అప్పటి ప్రభుత్వాల్లోగానీ, ఇప్పటి ప్రభుత్వంలోగానీ అప్పుడెప్పుడూ ఇలాంటి ముస్లిం మహిళా సానుభూతి కనిపించలేదు. ప్రభుత్వానికి మహిళల గౌరవ మర్యాదలు స్వేచ్చా స్వాతంత్ర్యాల మీద అంతగా ప్రేమ వుంటే దేశంలోని అన్ని మతసమూహాల్లోని మహిళలకు వర్తించేలా ఒక సమగ్ర చట్టాన్ని తెచ్చి వుండాల్సింది.  ప్రత్యేకంగా ముస్లిం మహిళ వైవాహిక హక్కుల పరిరక్షణ కోసమే కొత్త చట్టం తేవడం దేనికీ? ముస్లిం మహిళల మీద సానుభూతి ముసుగులో ముస్లిం స్త్రీ పురుషుల మీద ఒక అప్రకటిత దాడియే ఈ చట్టం. 
        సంక్జయ్ లీలా భన్సాలీ నిర్మించిన పద్మావత్ సినిమా తమ మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నదంటూ ఆరోపిస్తూ ఆ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ  ఆందోళనకు దిగిన రాజపుత్ర సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్యయించాయి.  ఈ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించడమేగాక, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మానవ వనరుల అభివృధ్ధి శాఖను కోరింది. దాదాపు 20 కోట్ల జనాభాకు దాదాపు జీవన్మరణ అంశంగా మారనున్న అంశం  పై చట్టం చేసే సమయంలో ఒక సినిమాకు చేసినంత కసరత్తు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ముస్లీం సమాజం రాజపూత్రుల మార్గంలో రోడ్ల మీదికి వచ్చి హింసాత్మక ఆందోళనలు చేయాలని నరేంద్ర మోది ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. 
        ట్రిపుల్ తలాఖ్ కేసుకు భారీ ప్రచారం ఇచ్చే క్రమంలో మీడియా దాచిపెట్టిన పెద్ద కేసు ఇంకొకటుంది. భార్య ఇష్టం లేకుండా సాగించే సంభోగాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తల్ని  శిక్షించేలా ఒక చట్టం చేయాలని సుప్రీం కోర్టు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వైవాహిక అత్యాచారం మీద ఢిల్లీ హై కోర్టులో ఇంకో  ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) నడుస్తున్నది. పధ్ధెనిమి సంవత్సరాల వయస్సు దాటని భార్యతో సంభోగం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తను శిక్షించాలనేది దీని సారాంశం. ఈ అశం ఇప్పుడు సుప్రీం కోర్టు పరిధిలోవుంది. ఎలా లెఖ్ఖవేసినా ఇన్ స్టాంట్  ట్రిపుల్ తలాక్ బాధిత స్త్రీల కన్నా వైవాహిక అత్యాచార బాధిత స్త్రీల సంఖ్య నిస్సందేహంగా అనేక రెట్లు ఎక్కువగా వుంటుంది. ఇన్ స్టాంట్  ట్రిపుల్ తలాక్  చెప్పిన భర్తల్ని నేరస్తులుగా పరిగణించమని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ, వైవాహిక అత్యాచార నిందితుల్ని నేరస్తులుగా పరిగణించమని స్పష్టంగా చెప్పింది. సుప్రీం కోర్టు నేరస్తులుగా పరిగణించిన కేసుని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నేరస్తులుగా పరిగణించని కేసుని మాత్రం తీవ్రంగా పట్టించుకుంది. సుప్రీం కోర్టుతో నరేంద్ర మోది ఆడుకుంటున్న తీరుకు కూడా ఈ చట్టం అద్దం పడుతుంది.
        వైవాహిక అత్యాచారానికి పాల్పడే పురుషుల్ని శిక్షించే సాహసం కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూలేదు.   పైగా, ఆ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో విచిత్ర వాదనలు చేశారు. “దాన్ని భార్య అత్యాచారంగా అనుకోవచ్చు. కానీ భర్తకు అది అత్యాచారంగా కనిపించపోవచ్చు.  ఇలాంటి చట్టాలను కనుక తీసుకుని వస్తే దేశంలో వివాహ వ్యవస్తే మొత్తంగా కూలిపోతుంది. భర్తల్ని వేధించడానికి భార్యల చేతికి ఆయుధాలను అందుబాటులో వుంచినట్టవుతుంది” అని అందులో పేర్కొన్నారు.  ఇదే మాటను ముస్లిం సమాజం విషయంలో కేంద్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలనే కాదు, మతపక్షపాతాన్ని కూడా పాటిస్తోంది. ఇది రాజ్యాంగ విరుధ్ధం మాత్రమే కాదు సమాజానికి ప్రమాదకరం కూడా.
        భర్తల్ని హత్య చేసిన భార్యల కధనాలు ఇటీవలి కాలంలో  ఒక పరంపరగా వెలుగులోనికి వస్తున్నాయి. మహబూబ్ నగర్ స్వాతి, హైదరాబాద్జ్యోతి, పద్మలు; గుంటూరు శ్రీవిద్య భర్తలను చంపిన భార్యలుగా మీడియాలో ప్రచారం పొందారు. తాము ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెప్పనప్పటికీ బయటికి వెళ్ళిపోయే ఉద్దేశ్యంతోనే తమ మీద భార్యలు నిందలు వేస్తున్నారని ఆవేదన పడే  ముస్లిం భర్తలు కూడా ఇప్పుడు  లేకపోలేదు. భవిష్యత్తులో అలాంటివాళ్ళ సంఖ్య పెరగవచ్చు.  ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లిం భర్తల్ని జైళ్లకు పంపడానికీ, ముస్లిం భార్యల్ని రోడ్డున పడేయడానికీ కొత్త చట్టం సిధ్ధం అయింది.
(మొబైల్ నెం. 9010757776
హైదరాబాద్
23 జనవరి 2018
ప్రచురణ :  వీక్షణం మాస పత్రిక, ఫిబ్రవరి 2018

35-39 పేజీలు

Wednesday 7 February 2018

They Surrendered Unconditionally

వాళ్ళు బేషరతుగా లొంగిపోయారు
-       డానీ

జాతీయ బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడెల్లా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వీధి నాటకం మొదలతూ వుంటుంది. దీన్ని వారం రోజులు ఆడుతారు. అందరూ ఆరితేరిన నటులు కావడాన తమ నటనా చాతుర్యంతో ఒక యుధ్ధం మొదలయిపోతున్నంత హడావిడి సృష్టిస్తారు. తరువాత, ఎవరి డేరాలు, కుర్చీలు బల్లలు, మైకులు వాళ్ళు  తీసుకుని ఎవరి దారిన వాళ్ళు మెల్లగా జారుకుంటారు.  
పౌరాణిక పాత్రలు పుట్టినపుడు మంత్రసాని చేతుల్లో మొదలుకుని చచ్చేక చితి మీద శయనించే వరకు ఒకే మూసలో ప్రవర్తిస్తుంటాయిమినహాయింపు లేకుండా మన రాజకీయ నాయకులు అందరూ పౌరాణిక పాత్రలు వంటివారు. ఎవరి మూస వారిది. ఎంత హిచ్ కాక్, రామ్ గోపాల్ వర్మ సినిమా అయినా మొదటివారం ఉన్నంత ఉత్కంఠ, సస్పెన్సు రెండోవారం వుండదు!. ఏపీ రాజకీయ నాయకులు ఐదు కేంద్ర బడ్జెట్లుగా ఒకే నాటకం ఆడుతున్నారు. అంచేత, నాటకం మొదలు కాకుండానే ప్రజలు పాత్రల డైలాగుల్ని సహితం ముందుగానే చెప్పేస్తున్నారు.
అరుణ్ జైట్లి యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందే ఏపీలో మూడు విషయాలు తెలిసిపోయాయిమొదటిది; ఇది కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ అనేది. రెండోది, దేశంలో రగులుకుంటున్న రైతాంగ అసంతృప్తిని శాంతింపచేసే ప్రయత్నం చేస్తారనేది. మూడోది; అన్నింటికన్నా కీలకమైనది, ఏపీకి ఏమీ ఇవ్వరనేదీ. ఇందులో మూడోది చిత్రమైనదేగానీ ఏపీకీ ఏమీ ఇవ్వక పోయినా చంద్రబాబు ఏమీ చేయలేరనే అభిప్రాయం జనంలో బలంగా నాటుకుంది. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని బహిరంగ సభలో ప్రకటించిన మోదీ మాట తప్పినా చంద్రబాబు, జగన్   నోరు మెదపలేని స్థితి బహిరంగమే.
జాతీయ ప్రజాస్వామిక కూటమిలో టిడిపి కీలక భాగస్వామి. టీడిపి అధినేత చంద్రబాబుకు గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసిన చరిత్ర కూడా వుంది. ఎందువల్లనో గానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అమరావతికీ ఢిల్లీకీ మధ్య దూరం రానురాను పెరుగుతూ వుంది. విషయం మీద అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి.
జైట్లి బడ్జెట్ ను ప్రవేశ పెట్టగానే గ్రాండ్ నేరేటివ్స్ యధావిధిగా మొదలయిపోయాయి. బడ్జెట్ విదిలింపుల మీద చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో వున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి బడ్జెట్ మీద చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. వారి మనో భావాలను వారి అనుకూల మీడియాటెలీపతి ద్వార తెలుసుకుని  కథనాలు ప్రచారంలో పెట్టింది.
స్క్రీన్ ప్లే ప్రకారం  బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకు మోదీ ఎన్ని ఇచ్చారో వివరించారు. అందులోచంద్రబాబు కుమారుడు లోకేష్  బాబుకు మోదీ 19 అవార్డులు ఇప్పించారు అనే విషయాన్ని మరీ నొక్కి చెప్పారుఇందులో ఒక సమంజసమైన తర్కం వుంది. ఎవరయినా చంద్రబాబును విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని అడ్డుకుంటున్నట్టే అనే తర్కాన్ని టిడిపీ శ్రేణులు కొంత కాలంగా బలంగా ప్రచారం చేస్తున్నాయి. దాని ప్రకారం, చంద్రబాబు కుమారుడికి ఏదైనా ఇచ్చి సంతృప్తి పరిస్తే ఆంధ్రప్రదేశ్ ను సంతృప్తి పరచినట్టేననేది సోము వీర్రాజు తర్కం కావచ్చు.
ప్రత్యర్ధుల్ని బహిరంగంగా ఉరివేయాలనీ, కత్తీ ఢాలు పట్టుకుని యుధ్ధరంగం లోనికి ఉరకాలనీ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్ కు చాలా సరదా. బీజేపీ పొగరు దించుతామనీ, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారనీ వారు ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో తక్కువగానూ, టివీల ముందు అతిగానూ కనిపించే చిత్తూరు యంపి నారమల్లి శివప్రసాద్ తాము కత్తులూ, ఢాళ్ళూ తీసి పదును పెట్టామనీ చంద్రబాబు ఆదేశించగానే కదనరంగంలోనికి దూకేస్తామని బీరాలు పలికారు
పాత్ర ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సంభాషణలు వారికోసం ప్రత్యేకంగా వున్నాయి. నిధులు తేలేకపోయినందుకు ఆయన చంద్రబాబును విమర్శిస్తారేగానీ నిధులు ఇవ్వనందుకు మోదీని ఏమీ అనలేరు.
నిజానికి కూడా చంద్రబాబు కేంద్రం నుండి  తెచ్చుకోవలసినవి తెచ్చుకోలేక పోయారు. పైగా ఏపీకి రావలసినవి చాలా వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక తరహా హోదాను కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని కేంద్ర సంకేతాలను ఇచ్చినపుడు వారు చాలా సంబరపడ్డారు. ప్రత్యేక తరహా హోదా ఆడపిల్లలాంటిదనీప్రత్యేక ప్యాకేజీ మగపిల్లాడు లాంటిదని గొప్పగా చెప్పుకున్నారు. “కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా?” అని మురిసిపోయారు. [సీమంతం కూడా జరిపినట్టున్నారు]. చంద్రబాబు తరచూ తనను తాను ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విప్లవ సారధి అని చెప్పుకుంటూ వుంటారు. పురుషులు పురుడు పోసుకొనే దశకు  జీవశాస్త్రం ఇంకా అభివృధ్ధి కాలేదని వారికి సమాచారంలేదు
నాటకం నియమాల ప్రకారం కథ క్లైమాక్సుకు చేరుతున్నప్పుడు కొంచెం ఉత్కంఠను పెంచాలి. నియమానికి లోబడిఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా  చంద్రబాబు వివిధ పార్టీల జాతీయ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు పుకార్లు వినిపించాయి. ఇలాంటివన్నీ సాధారణంగా సియం పేషీ నుండే లీకుల రూపంలో బయటికి వస్తుంటాయి. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో టీడీపీ అధ్యక్షుడు మంతనాలు చేసినట్లు అలా ఒక లీకు బయటికి వచ్చింది.
అనేక పార్టీలు తాము ఎన్డీఏ భాగస్వాములమనీ, బీజేపి మిత్రపక్షాలమనీ గొప్పగా చెప్పుకుంటుంటాయి గానీ నిజానికి సిబిఐ, ఇడి, ఈసీ, ఆర్బీఐ లను మోదీ తనకు నమ్మకమైన మిత్రులుగా భావిస్తుంటారు జాబితాలో సుప్రీం కోర్టు కూడా వుందని కొందరి అభిప్రాయం.
సిబిఐ భయం వున్నంత కాలం చంద్రబాబు, జగన్ ఎన్నడూ యుధ్ధం కాదుకదా మోదీ మీద ఒక్క పరుష పదాన్ని కూడా వాడలేరని ఏపీలో ఇప్పుడే పుట్టిన పసిపిల్ల కూడా చెపుతుందినిజానికి విషయాన్ని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టి సమావేశంలో చంద్రబాబే స్వయంగా చెప్పారట. కేంద్రంపై ఒత్తిడి తెస్తే కేసులు పెడతారని కొందరు అంటున్నారని, తాను వేటికీ భయపడేది లేదని వారే అన్నారట. సమావేశంలో మోదీ మీద అమీతుమీ యుధ్ధానికి చంద్రబాబు జెండా ఊపేస్తున్న దశలో ఒక పక్క కేంద్ర హోం మంత్రి  రాజ్ నాధ్ సింగ్, మరోపక్క మోదీ ఆత్మీయ మిత్రుడు, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  ఫోన్ చేసి వివాదాన్ని చల్లబరచారని ఇంకో లీకు వచ్చిందిదానర్ధం ఏమంటే చంద్రబాబు మొదలెట్టబోయిన యుధ్ధాన్ని మరోసారి వాయిదా వేశారని!. వచ్చేది ఎలాగూ ఓట్ -ఆన్ -అకౌంట్ బడ్జెటే కనుక మోదీ ప్రభుత్వానికి సంబంధాంచి ఇదే ఐదవ బడ్జెట్; ఇదే చివరి బడ్జెట్. మోదీ చివరి బడ్జెట్ తరువాత కూడా చంద్రబాబు మొదటి యుధ్ధం మొదలెట్టలేదు. దీని అర్ధం ఏమంటే, ప్రత్యేక హోదానే కాకుండా పోలవరం, అమరావతి నిర్మాణాలు కూడా ప్రశ్నార్ధకం అయ్యాయి. చంద్రబాబు చిత్తశుధ్ధి కూడా బోనులో నిలబడింది. ఉద్దావ్ థాక్రే, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు చేశారనడం ఎంత వాస్తవమో? ఎంత కల్పనో కూడా మనకు తెలీదు. 
సాధారణంగా బడ్జెట్ రూపకల్పన సమయంలో మంత్రివర్గ సూచనలు తీసుకుంటారు, కూటమి గాబట్టి భాగసామ్య పక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. మోదీ లాంఛనాన్ని పాటించారో లేదో తెలీదు. అయితే, తెలుగు దేశం పార్లమెంటరీ పార్టి సమావేశంలో పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల వ్యవహార శైలి కొన్ని అనుమానాలకు తావిచ్చింది. సీనియర్ మంత్రి పి. అశోక్ గజపతిరాజు అసలు సమావేశానికే రాలేదు. జూనియర్ మంత్రి వై. సుజనా చౌదరి మాత్రం  ప్రస్తుత  పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకోవడం సాధ్యం కాదనీ పార్టీతో ఘర్షణ పడలేమనీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రాలేమనీ వివరించారు. వెరసి తాము బేషరతుగా లొంగిపోయామని  తేల్చి చెప్పారు.

(రచయిత సీనియర్ జర్నలిస్టు

మొబైల్   9010757776  

హైదరాబాద్ 5 ఫిబ్రవరి 2018

ప్రచురణ : బీబీసి – తెలుగు 7 ఫిబ్రవరి 2018
https://www.bbc.com/telugu/42966391