Saturday 27 October 2018

Majorities also the victims of Fascism


మెజార్టీలూ మతోన్మాదుల బాధితులే !

డానీ

భారత ప్రజల విజ్ఞతకు మహాపరీక్ష 2019 సాధారణ ఎన్నికలు. భారత ముస్లింలకు అయితే ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కాబోతున్నాయి.  లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జమిలీగా జరగబోతున్న రాష్ట్రం కనుక ఆంధ్రప్రదేశ్ ఈసారి జాతీయ రాజకీయాలకు ఒక నమూనా పరీక్షా కేంద్రంగా మారబోతున్నది.

ఎన్నికల సమయంలో అనేక సామాజికవర్గాలకు సాధారణంగా ప్రాంతీయ అంశాలే ప్రధానంగా పని చేస్తుంటాయి. అయితే, జాతీయ అంశాలను కూడా పట్టించుకునే సామాజికవర్గాలు కొన్నుంటాయి. వాటిల్లో ముస్లిం సామాజికవర్గం ఒకటి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోను చెప్పుకోదగిన ఉనికి వున్న సామాజికవర్గం కనుక ఎన్నికల్లో ముస్లింలు ప్రాంతీయ అంశాలతోపాటూ  జాతీయ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తారు.

బీజేపి నేతగా నరేంద్ర మోదీ ప్రధాని పదవిని స్వీకరించాక దేశంలో సామాన్య ప్రజల జీవిత స్థితిగతులు దుర్భరంగా మారిపోయాయని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ, ముస్లింల జీవితాలు మరింత దయనీయంగా మారిపోయాయి. ముస్లిమేతర సామాన్య ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ముస్లింలను ఆర్ధిక ఇబ్బందులతోపాటూ ప్రాణ భయం కూడా వెంటాడుతోంది.  

రాజకీయాల్లో దాదాపు అందరూ అబధ్ధాలు చెపుతారు. నరేంద్రమోదీ కూడా అబధ్ధాలు చెపుతారు. అయితే వారు అబధ్ధాలు చెప్పే నైపుణ్యం స్థాయిని పెంచి వ్యవస్థీకరించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని తెచ్చి భారత ప్రజలకు పంచుతానన్నది గత ఎన్నికల్లో మోదీ చేసిన ప్రధాన వాగ్దానం. కోటి కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నదనీ దానిని తెచ్చి నూట పాతిక కోట్ల మంది భారతీయులకు పంచితే ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంటులో 15 లక్షల రూపాయలు చొప్పున ఊరికే జమ అవుతాయని ఎన్నికల ప్రచార సభల్లో మోదీజీ అన్నారు.  తాను అధికారంలోనికి వచ్చిన వంద రోజుల లోపునే ఈ పని జరిగిపోతుందన్నారు. జనం నమ్మినారు. మోదీజీ ప్రధాని అయ్యాక బ్యాంకు అకౌంట్లు తెరిచే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మొదలెట్టారు. ఆ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఎలాగూ జమ కాలేదు. పైగా కనీసపు బ్యాలెన్స్ మొత్తాన్ని వుంచలేదనే కారణంతో ఆ పేద ఖాతాదారుల నుండి బ్యాంకులు అపరాధ రుసుము పేరిట భారీగా డబ్బులు వసూలు చేశాయి.   

 ఇప్పుడు కమలనాధులు కొత్త కథనాలను వినిపిస్తున్నారు. నల్ల ధనాన్నితెస్తే  సగటున 15 లక్షల రూపాయలు “వస్తాయి” అని మోదీజీ అంచనా వేసి చెప్పారే తప్ప తాను తెచ్చి ప్రజల ఖాతాల్లో జమ “చేస్తాను” అనలేదని వారు అంటున్నారు.  పైగా హిందీ భాష సరిగ్గా రాకపోవడంవల్ల ప్రతిపక్షాలు తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాయని వాళ్ళు ఎదురు దాడికి దిగుతున్నారు. 

మోదీ ప్రధాని అయితే రూపాయితో డాలర్ మారకపు ధర  35-40 రూపాయలకు పడిపోతుందని సుబ్రహ్మణ్యస్వామి, రవిశంకర్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో లీటరు పెట్రోలు ధర పది రూపాయలకు పడిపోతుందనీ, వంట గ్యాసును కుళాయిల ద్వార   ఇంటింటికీ ఉచితంగా  సరఫర చేస్తారని  సోషల్ మీడియాలో  ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇప్పుడు పెట్రోలు, డాలరు వంద రూపాయల మైలురాయిని చేరుకోవడానికి పరుగెడుతున్నాయి. మరోవైపు, జీయస్టీ దెబ్బ ప్రతి పౌరుని మీద అదనపు భారాన్ని మోపింది.

నల్ల ధనాన్ని కలుగుల్లోనే పట్టుకుంటామనే ప్రగల్భాలతో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు పథకం నల్ల ధనవంతుల్ని తెల్ల మర్యాద పత్రాలతో  సత్కరించింది. మార్కెట్లో నగదుకు కరువొచ్చి చిరువ్యాపారులు, వృత్తి పనివాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ముస్లిం జనాభాలో అత్యధికులు చిరువ్యాపారులు, తోపుడుబండ్లవాళ్ళు, వృత్తి పనివాళ్ళే  గనుక పెద్ద నోట్ల రద్దు పథకం ముస్లింల ఆర్ధిక వ్యవస్థను మరింతగా కుంగదీసింది. అసలు ముస్లింల ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయడానికే పెద్దనోట్ల రద్దు పథకాన్ని రూపొందించారని సాగుతున్న ప్రచారం కూడా  కొట్టివేయదగిందేమీ కాదు. సంఘపరివారం పాలనలో బాధితుల్లో బాధితులు ముస్లింలు. నికరంగా జరుగుతున్నదేమిటంటే ఆర్ధిక రంగంలో దేశ సహజ సంపదంతా ఆడానీ, అంబానీ వంటి కొన్ని మెగా కార్పొరేట్ల ఖాతాలోనికి చేరిపోతోంది. అమిత్ షా కుటుంబ సంపద పెరిగింది. బిజెపి ఆస్తులు భారీగా పెరిగాయి. సంఘపరివారానిది అంబా సాంస్కృతిక విధానం; అంబానీ అర్థిక విధానం అంటే ఇప్పుడు ఎవరూ కాదనకపోవచ్చు.  

ప్రభుత్వ ప్రాయోజిత (క్రోనీ) పెట్టుబడీదారీ విధానం మన దేశంలో ఓ మూడూ దశాబ్దాలుగా కొనసాగుతూనే వుంది. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని సంఘపరివారం వుధృతంగా మార్చింది. ఐటి నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో ఎర్పాటు చేసిన ‘ఐ టు వుయి’ చర్చా గోష్టిలో పాల్గొన్న ప్రధాని “కార్పోరేట్లను తిట్టడం ఫ్యాషనైపోయింది” అని బాధపడ్డారు. దేశ సహజ సంపదను కొన్ని మెగా కార్పొరేట్లకు ధారాదత్తం చేసి,  మిగిలిన దేశ ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేసిన ఘనత సంఘపరివారానిదే.  దీని కోసం దేశ రక్షణ వ్యవస్థతో సహా  సిబిఐ, ఆర్ బిఐ, ఐటి, ఇడీ, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం తదితర ప్రజాస్వామిక వ్యవస్థలు అన్నింటినీ మోదీజీ భ్రష్టు పట్టించడాన్ని గత నాలుగున్నరేళ్ళలో దేశప్రజలంతా చూస్తున్నారు.  జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ఏఏ పార్టీలున్నాయో సామాన్య ప్రజలకు తెలీదు. బిజెపి మిత్రపక్షాలు అంటే సిబిఐ, ఆర్ బిఐ, ఐటి, ఇడీ, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం  మరియూ మాంసం ఎగుమతిదారులే గుర్తుకు వస్తున్నారు. మోదీజీ ‘మిత్రపక్షాల’ భయంతో దేశీయ మీడియా సహితం మోడియాగా మారిపోయింది.

అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్న ఈ అపచారం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి సంఘపరివారం మైనారిటీ ద్వేషాన్ని  రెచ్చగొడుతోంది.  స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని మోదీజీ తెచ్చి తమకు పంచుతారని నమ్మినట్టే, “భారతదేశంలో ముస్లింలు లేకుంటే  వాళ్ళ సంపదతో  హిందువులు  మరింత సౌఖ్యంగా బతకవచ్చు” అని సాగుతున్న విద్వేష ప్రచారాన్ని కూడా చాలా మంది నమ్ముతున్నారు. దేశప్రజల్ని అలా నమ్మించడాన్నే  ఇటలీలో ఫాసిజం అనేవారు. జర్మనీలో నాజిజం అనేవారు. దీనిని తెలుగులో ‘పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం’ అనవచ్చు. దీనికి బాధితులు సామాన్య ప్రజలు. ఆ బాధితుల్లో బాధితులు మైనార్టీలు.

మోది ప్రధాని అయ్యాక దేశంలో  అసహన వాతావరణం విజృంభించింది. గోగ్రవాదం పుట్టింది. ముస్లింల మీద మూక హత్యలు (మాబ్ లించింగ్) పెరిగిపోయాయి. ముస్లింలను వేధించడానికి అనేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వానికి  మతసామరస్యం ఒక్కటే విరుగుడు. అదే ఇప్పుడు ముస్లింలకు ప్రాణరక్షణ ఔషధం.  

రూపంలో ఫాసిజం మైనార్టీలను మాత్రమే వేధిస్తున్నట్టు కనిపిస్తుందిగానీ, సారాంశంలో మెజార్టీలలోని సామాన్య ప్రజలందర్నీ కూడా అది అణిచివేస్తుంది. ఫాసిజానికి తొలి బాధితులు మైనార్టీలేగానీ మలి బాధితులు మెజార్టీలు.  హిట్లర్ అలనాడు రష్యా మీద ప్రత్యేక పగ పెంచుకున్నట్టు, ముస్సోలినీ ఆఫ్రికా ఖండం మీద కసిని పెంచుకున్నట్టు  ఇప్పుడు మోదీ-అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక పగతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అందరూ  ముస్లింలు కారు! ఫాసిజం-నాజీజంల  అసలు ఎజెండాను తెలుసుకోవడానికి మెజార్టీ సామాజికవర్గానికి  ఇటలీలో మూడు దశాబ్దాలు పట్టింది, జర్మనీలో రెండు దశాబ్దాలు పట్టింది.   భారతదేశంలో 2019 ఎన్నికలకు ముందే మెజార్టీ సామాజికవర్గానికి  ఈ అవగాహన వస్తుందనీ ఆశిద్దాం.

పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వానికి  తొలి బాధితులు వాళ్ళే కనుక సహజంగా ముస్లింలే అందరికన్నా ముందుగా ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతారు. ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో మైనార్టీలే నమ్మకమైన కాల్బలం.

(రచయిత సమాజ విశ్లేషకులు) మొబైలు – 9010757776 
రచన : 27 అక్టోబరు 2018
ప్రచురణ :  మనతెలంగాణ,  28 అక్టోబరు 2018
                   ప్రజాశక్తి, 28 అక్టోబరు 2018



https://khanyazdani.blogspot.com/2018/10/majorities-also-victims-of-fascism.html

Tuesday 9 October 2018

IPC Section 497 - Equal Justice


సెక్షన్ 497 రద్దు - సమన్యాయం

-        డానీ


వివాహ వ్యవస్థలోనే ఒక అణిచివేత వుంటుంది.  సాంప్రదాయ వివాహ వ్యవస్థలో పురుషులు యజమానులు అయితే మహిళలు శ్రామికులు. కొన్ని సందర్భాలలో వాళ్ల స్థితి శ్రామికులకన్నా హీనం. వాళ్లను వస్తువుగా, సరుకుగా, జంతువులుగా పరిగణిస్తుంటారు. కొన్ని మత సమూహాల వివాహాల్లో ధన, కనక, వస్తు, వాహనాల దానాలతో పాటు కన్యాదానాలు కూడా చేస్తుంటారు. మరికొన్ని మత సమూహాల పెళ్ళిళ్లలో కన్యాదానాల వ్యవహారం  ఒక లాంఛనంగా ప్రస్పుటంగా వుండకపోవచ్చుగానీ సారం మాత్రం ఒక్కటే. 

అణిచివేత వున్నప్పుడు వాటి నుండి బయట పడే ప్రయత్నాలూ మొదలవుతాయి. వివాహ వ్యవస్థలోని అణిచివేత అతి సహజంగానే వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది. వివాహ వ్యవస్థలో సాధారణంగా  అణిచివేతకు గురయ్యేది స్త్రీలే. కనుక వివాహ వ్యవస్థ నుండి బయటపడే అవసరం కూడా ముందుగా వాళ్ళకే వస్తుంది.

వివాహేతర సంబంధాన్ని  కొందరు  అక్రమ సంబంధం అంటుంటారు. అది సరికాదు. క్రమం, అక్రమం అనేది చట్టాలకు సంబంధించిన వ్యవహారం; అది మనుషుల భావోద్వేగాలకు  సంబంధించిన అంశం కాదు. సమాజ బంధనాలకు  అతీతంగా ఏర్పడే ప్రేమ బంధాలను కూడా చట్టం నియంత్రిస్తుంది. అది సహజ న్యాయానికి విరుధ్ధం.

వయసు, ఆలోచనల రీత్య పరిపకత్వత కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడే అనుబంధాలు లైంగిక సంబంధాలకు దారితీయడం సహజమనే అవగాహన  నాగరీక సమాజాలు అన్నింటిలోను ఇప్పుడు పెరుగుతోంది. ఒక వ్యక్తి మీద ఇష్టాన్ని అభిమానాన్నీ వ్యక్తం చేయడానికి అత్యున్నత మాధ్యమం సంభోగమే అనే భావనలూ బలంగా ముందుకు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా కొన్ని దేశాల్లో చట్ట సవరణలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇంకా జరగాల్సి వున్నాయి. పరిపకత్వత కలిగిన వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో సాగే లైంగిక సంబంధాలకు అడ్దంకిగా మారే చట్టాలున్న దేశాల్లో భారత దేశం ఒకటి. 

          పరస్పర అంగీకారంతో సాగినవైనా సరే వివాహేతర లైంగిక సంబంధాలను కొనసాగించిన పురుషుల్ని భారతీయ శిక్షా స్మృతిలోని  సెక్షన్ 497 ప్రకారం చాలా తీవ్రంగా శిక్షించేవారు.  ఐదేళ్ల వరకు  జైలు శిక్షతోపాటూ భారీ జురిమాన విధించడానికి సెక్షన్ అవకాశం ఇచ్చేది. వందల ఏళ్ల నాటి సెక్షన్ ను సెప్టెంబరు 27 భారత సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. పరస్పర అంగీకారంతో సాగే  వివాహేతర లైంగిక సంబంధాలు నేరం కావనీ, మహా అయితే వాటిని పౌర తప్పిదాలు అనవచ్చనీ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

          విచిత్రం ఏమంటే, వివాహ వ్యవస్థలో పాతివ్రత్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే  భారత దేశంలో  పరపురుషునితో లైంగిక సంబంధాన్ని కొనసాగించే భార్యలకు చట్ట పరిధిలో శిక్ష లేదు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పురుషులకు విధిస్తూ వస్తున్న శిక్షను  రద్దు చేయడంతో సుప్రీం కోర్టు తీర్పు ఒకవిధంగా సమన్యాయాన్ని ప్రసాదించింది అనవచ్చు.

సెక్షన్ 497లో మూడు అంశాలుండేవి. అవి:

1.  పరస్పర అంగీకారంతో మరో పురుషునితో  వివాహేతర లైంగిక సంబంధాన్ని  పెట్టుకున్న భార్యను భర్త మందలించలేడు. కోర్టులు శిక్షించలేవు. 

2. భార్యతో పరస్పర అంగీకారంతో వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న వ్యక్తిని సహితం భర్త మందలించగలడు; కోర్టులు శిక్షించ గలవు.  

రెండు క్లాజుల్లోనూ పురుషుడే శిక్షార్హుడు. స్త్రీలు చట్ట పరిధిలోనికి రారు. వారికి ఈ రకం నేరము శిక్షల నుండి మినహాయింపు (Legal Impunity) ఇచ్చారు.

న్యాయవ్యవస్త, చట్టాలు మాయాసభ వంటివి. తీర్పు మనకు అనుకూలంగా వున్న సందర్భాలలోనూ ఆ తీర్పును అలా ఇవ్వడానికి న్యాయమూర్తులు ఇచ్చే వివరణలు కొన్నిసార్లు మన భావాలకు పూర్తి విరుధ్ధంగా వుంటాయి. అలాగే తీర్పు మనకు వ్యతిరేకంగా వున్న సందర్భాలలోనూ ఆ తీర్పును అలా ఇవ్వడానికి న్యాయమూర్తులు ఇచ్చే వివరణలు కొన్నిసార్లు మన భావాలకు పూర్తి అనుకూలంగా  వుంటాయి.

వివాహేతర సంబంధాల కేసుల్లో స్త్రీలకు శిక్ష నుండి మినహాయింపు ఇవ్వడం పైకి మహత్తర విషయంగా కనిపిస్తుంది. కానీ న్యాయ కోవిదులు  ఒక దుర్మార్గమైన తర్కాన్ని రూపొందించారు. బంగారాన్ని ఎవడయినా దోచుకుపోతే కేసును దొంగ మీద పెడతారా? బంగారం మీద  పెడతారా? దొంగ మీదే పెడతారు?. ఇదీ అంతే. భార్య బంగారం వంటిది. బంగారం ఒక సరుకు. దానికి వ్యక్తిత్వం వుండదు.  మెదడే వుండదు. పిచ్చివాళ్ళు, స్పృహలో లేనివాళ్ళు చేసే నేరాలకు శిక్షలు వుండవు.  అలాగే వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న స్త్రీలకు కూడా శిక్షలు వుండవు; వాళ్ళు పనుల్ని స్పృహలో చేయరని దాని అర్ధం. 

497 ప్రకారం తన భర్త మరో స్త్రీతో వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నా అతని మీద భర్య కేసు పెట్టడానికి వీలు లేదు. భర్తలకు ఇలాంటి వెసులు ఇస్తే  భార్యలకు అన్యాయం జరుగుతుందన్నది ఒక వాదన. భర్తలకు ఈ వెసులుబాటు ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేమీ కాదు. ఈ చట్టం వచ్చినప్పటి నుండి వున్నదే. భార్య తన భర్త ప్రియురాలి భర్తను కలిసి తన భర్త మీద సరుకు దొంగతనం కేసు పెట్టమని అడిగే అవకాశం నిన్నటి వరకు వుండింది. అది ఇప్పుడు పోయింది.

 వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న భార్యకు శిక్ష నుండి మినహాయింపు ఇవ్వడానికీ, వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న భర్త మీద కేసు వేసే హక్కు భార్యకు లేకుండా చేయడానికీ ప్రాతిపదిక ఒకటే; సరుకు.  సరుకును శిక్షించడం కుదరనట్టే, సరుకుకు  కేసులు వేసే హక్కు కూడా వుండదు.

పురుషులకు మెదడు వుంటుంది. ఆలోచనాశక్తి వుంటుంది.  అందువల్ల వాళ్ళు మెదడులేని, ఆలోచనాశక్తిలేని ఒక వస్తువుతో (వివాహిత స్త్రీతో) వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడం నేరం. లైంగిక సంబంధం  పరస్పర అంగీకారంతో జరిగినా సరే అది నేరమే. మెదడు, ఆలోచనాశక్తి రెండూ లేని వాళ్లకు పరస్పర అంగీకారాన్ని తెలిపే స్తోమత వుండదు గనుక అది మతిస్థిమితం లేని స్త్రీ మీద అత్యాచారం చేయడం అవుతుంది. అందువల్ల పురుషుడిని  శిక్షించి తీరాలి అనేది చట్టం వెనుకవున్న తర్కం.

చట్టంలో మూడో క్లాజు కూడా వుంది.

3. ఒక వివాహిత పురుషుడు  యుక్త వయసు గల ఒక అవివాహిత స్త్రీతో పరస్పర అంగీకారంతో  లైంగిక సంబంధాన్ని పెట్టుకోవచ్చు. అది నేరం కాదు. 

అంటే,  పెళ్ళికి ముందు మాత్రమే స్త్రీలకు  మెదడు వుంటుంది, ఆలోచనాశక్తి వుంటుంది. అయితే, వివాహం కాగానే స్త్రీ ఒక వస్తువు గా తయారయ్యి, మరొకరికి ఆస్తిగా మారిపోయి మెదడును, ఆలోచనాశక్తిని కోల్పోతుంది అనేది ఈ  చట్టం లోని అంత:స్సూత్రం.     

అవివాహిత, వివాహిత  మహిళలకు  497 చట్టం ఇచ్చిన నిర్వచనాన్ని మహిళా సమాజం ఖండించిందా? లేక  శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆ చట్టం ఇచ్చిన మినహాయింపును ఆస్వాదించిందా?  అనేవి  కీలక ప్రశ్నలు. చట్టంలో దాగున్న నిర్వచనాన్ని వాళ్ళు  ఏనాడో ఖండించి, 'మతిలేనివాళ్ళు' అనే వంకతో తమను 'సరుకు'గా పరిగణించి ఇచ్చిన  Legal Impumity వద్దని తిరస్కరించి వుండాల్సింది.   కానీ అలా జరగలేదు.

తమకు పురుషులతో  సమానంగా ఆలోచించే శక్తి  వుంది గనుక వివాహేతర సంబంధాల కేసుల్లో  తమకు కూడా పురుషులతో సమానంగా  కారాగార శిక్షలను విధించాలనో, లేకుంటే తాము వివాహేతర లైంగిక సంబంధాన్ని కొనసాగించినపుడు తమకు అందిస్తున్న  Legal Impumityని తమ భర్తలు  వివాహేతర లైంగిక సంబంధాన్ని కొనసాగించినపుడు కూడా అందించాలనో స్త్రీవాదులు కోరినట్టు ఇప్పటి వరకు వెలుగు లోనికి రాలేదు.  

ఇద్దరు వివాహిత స్త్రీపురుషులు లైంగిక  కార్యకలాపాల్లో పరస్పర అంగీకారంతో పాల్గొన్నపుడే అది వివాహేతర సంబంధం అవుతుంది. పరస్పర అంగీకారం లేకపోతే అది అసలు  497  కేసు అవ్వదు; అత్యాచార నేరం అవుతుంది. అత్యాచార కేసుల్ని విచారించడానికి  నిర్భయ చట్టాలున్నాయి. వివాహేతర సంబంధాల్లో పాల్గొనే స్త్రీపురుషుల సంఖ్య దాదాపు సమానంగానే వుంటుంది.

పరస్పర అంగీకారంతో  సాగిన వివాహేతర లైంగిక సంబంధాల కేసుల్లో  1959 నాటి నానావతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజా భారత నావికా దళ కమాండర్  కేయం నానావతి భార్య సిల్వియాతో వివాహేతర లైంగిక సంబంధాన్ని కొనసాగించాడన్నది అభియోగం. దానితో ఆగ్రహించిన నానావతి తన సర్విస్ రివాల్వర్ తో ప్రేమ్ అహుజాను కాల్చి చంపాడు.  నిజానికి సిల్వియా, ప్రేమ్ అహుజాల మధ్య  పరస్పర అంగీకారంతోనే వివాహేతర లైంగిక సంబంధం కొనసాగింది. నానావతిని వదిలి  ప్రేమ్ అహుజాను  పెళ్ళి చేసుకోవాలని సెల్వియా అనుకుంది. అయినప్పటికీ,  ప్రేమ్ అహుజాను నానావతి కాల్చి చంపడం  శిక్షించదగ్గ నేరం కాదని  జ్యూరీ  తీర్పు చెప్పింది.   (తరువాత వేరే కోర్టు హత్యానేరం కింద నానావతికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం వేరే విషయం). మొన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో సెక్షన్ 497 చరిత్ర ముగిసింది.

పరస్పర అంగీకారంతో సాగే వివాహేతర లైంగిక సంబంధాలు ఇక ముందు నేరం కానప్పటికీ విడాకులు తీసుకోవడానికి అవి ఒక ఆధారంగా పనికివస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. ఎప్పుడయినాసరే దాంపత్యంలోని  పౌర తప్పిదాలకు విడాకులే పౌర పరిష్కారం. వివాహేతర సంబంధాలు, విడాకుల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఉదారంగా వ్యవహరిస్తున్న సమయంలోనే ముస్లింల విడాకుల్ని శిక్షించదగ్గ నేరంగా పరిగణిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం విషాదకర మలుపు.  

(రచయిత సీనియర్ జర్నలిస్టు,  సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

రచన : 30 సెప్టెంబరు 2018
ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక 9 అక్టోబరు 2018

Social Telangana and Muslims – A Retrospective Approach


Social Telangana and Muslims – A Retrospective Approach

తెలంగాణ, ముస్లింలు - వర్తమానం, గతం
.యం. ఖాన్యజ్దానీ ( డానీ)  


తెలంగాణ ఉద్యమంలో కొత్త దశ ఆరంభమైంది. ఇప్పటి వరకు హోరెత్తించిన రాజకీయ అంశం కొంచెం వెనక్కితగ్గి, సామాజిక అంశం కొంచెం ముందుకు వచ్చింది. భౌగోళిక తెలంగాణవాదం పక్కన సామాజిక తెలంగాణవాదం వచ్చి చేరింది.

అస్తిత్వవాదం - ఉప అస్తిత్వవాదం
అస్తిత్వవాద ఉద్యమాలు, ఏదో ఒక దశలో, ఉప-అస్తిత్వవాద ఉద్యమాలుగా మారడం సహజం, అనివార్యం. ఇప్పటి తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో, కొంచెం ఆలస్యంగానైనా, సామాజిక చర్చ మొదలైంది. వన్యసీమవాదం, ఎస్సీల వర్గీకరణ డిమాండ్‌, సామాజిక తెలంగాణ ఒప్పందం ప్రతిపాదన మొదలైనవన్నీ క్రమంలో ఒక ఆరంభం మాత్రమే. ముందు ముందు అనేకానేక ప్రజాసమూహాలు తమ ఉనికి కోసం అనేక డిమాండ్లతో ముందుకు వస్తాయి. భౌగోళిక తెలంగాణవాదం, అధికార మార్పిడితో ఆగిపోయే ప్రమాదముందని గుర్తించిన కొద్దీ సామాజిక తెలంగాణవాదం మరింతగా బలాన్ని పుంజుకుంటుంది.

ఉద్యమమైనా, ఉధృతంగా సాగుతున్నప్పుడు అనేక  సామాజిక, ఆర్దిక సమూహాలు తమ తమ అస్తిత్వాల కోసం చురుగ్గా మారుతాయి. ఎవరికివారు తమ విముక్తి కోసమే ఉద్యమం సాగుతోందని నమ్ముతారు. ఉద్యమ నాయకత్వం కూడా అలాంటి భ్రమల్ని ఉధృతంగా ప్రచారం చేస్తుంది. తమ సమూహపు ప్రయోజనాల్ని సమస్త సమూహాల ప్రయోజనాలుగా ప్రచారం చేయగలిగినవారే నాయకులుగా కొనసాగగలరనే సూత్రం అన్ని ఉద్యమాల్లోనూ పనిచేస్తుంది. అంతిమంగా ఉద్యమ ఫలాలు మాత్రం కొన్ని సమూహాలకు మాత్రమే దక్కుతాయి. పాత పాలకవర్గాల స్థానంలో కొత్త పాలకవర్గాలు ఆవిర్భవిస్తాయి. అలాంటి అధికార  మార్పిడిలో, ఉద్యమ ఫలాల్ని దక్కించుకున్న సమూహాలు, మిగిలిన సమూహాల అస్తిత్వాన్ని క్రూరాతిక్రూరంగా అణిచివేస్తాయి. ఆనుమానం వున్నవాళ్ళు, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం నాటి పరిణామాల్ని ఒకసారి పరికించాల్సి వుంటుంది.
హైదరాబాద్ప్రిన్స్లీ స్టేట్అంటే బల్దియా-అత్రాఫ్బల్దియా, తెలంగాణ మాత్రమేకాదు. నిజాం సంస్థానంలో  మరాఠా, కన్నడ ప్రాంతాలు కూడా వుండేవి. ఇప్పుడెవరూ విషయాన్ని అంతగా పట్టించుకోవడంలేదుగానీ, 1956లో జరిగింది ఆంధ్రా, తెలంగాణ, బల్దియా-అత్రాఫ్బల్దియాల  విలీనం మాత్రమేకాదు, హైదరాబాద్స్టేట్విభజన కూడా!

1946 నుండి 1951 వరకు సాగిన హైదరాబాద్అంతర్యుధ్ధంలో కూడా అనేక అస్తిత్వవాదాలు  క్రియాశీలంగా పనిచేశాయి. ఐదేళ్ల అంతర్యుధ్ధాన్ని ఒక్కో అస్తిత్వ సమూహం, ఒక్కో పేరుతో పిలిచింది; పిలుస్తూనేవుంది.

1.    ఆర్యసమాజ్‌/ సంఘ్పరివారానికి  అది (ముస్లింలపాలన నుండి) విమోచన.
2.   కాంగ్రెస్కు అది (భారతదేశంలో) విలీనం.
3.   ఆంధ్రమహాసభకు అది వెట్టి నిర్మూలనా ఉద్యమం.
4.   కమ్యునిస్టులకు అది సామ్యవాద సమాజం కోసం  సాగిన పోరాటం.
5.   మహారాష్ట్రులకు అది ఐక్య మహారాష్ట్ర ఉద్యమం.
6.   కన్నడిగులకు అది కన్నడరాజ్య ఏకీకరణ ఉద్యమం.
7.   ముస్లింలలో నిజాం సమర్ధకుల నుండీ తీవ్ర వ్యతిరేకుల వరకు వున్నారు.  
8.   మరొకరికి అది మరొకటి!. ఇంకొకరికి అది ఇంకొకటి! 

హైదరాబాద్ప్రిన్స్లీ స్టేట్లో ఐదేళ్ల అంతర్యుధ్ధానికి సంబంధించి కాంగ్రెస్‌, సంఘ్పరివార్‌, కమ్యూనిస్టుల వాదాలే ఇప్పుడు విశేష ప్రచారంలో వున్నాయి. వాటికి సంబంధించి వేలాది రచనలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో వున్నాయి. నాటి మహారాష్ట్రులు, కన్నడిగుల వాదాలు ఇప్పుడు రాజకీయ ప్రాసంగికతను కోల్పోయాయి.  కానీ,  నాటి నిజాం సంస్థానంలోనేకాక, నేటి ఆంధ్రప్రదేశ్లోనూ  ఒక ప్రధాన సాంఘీక శక్తిగావున్న ముస్లింలు పోరాటాన్ని అప్పుడు ఏమనుకునేవారో, ఇప్పుడు ఏమనుకుంటున్నారో బయటి ప్రపంచానికి దాదాపు తెలియదనేచెప్పాలి. ముస్లింలు సహితం ప్రాణాలొడ్డి నిజాం వ్యతిరేక పోరాటం చేశారంటే నమ్మలేనంతగా  వాస్తవాలు సమాధి అయిపోయాయి.



ముస్లిం సమాజం
ఉద్యమకాలంలో, సంస్థానంలోని ముస్లిం సమాజంలో స్పష్టంగానే, నిట్టనిలువు విభజన వచ్చింది. ఒకవర్గం,  నిజాం డొమెనియన్స్టాటస్ను   సమర్ధించాలనుకుంది. ఇందులో కూడా మితవాదులు, అతివాదులు ఉన్నారు. వర్గంలోని అతివాదులే అత్యంత వివాదాస్పద రజాకార్లు. నిజాం వ్యతిరేకవర్గంలోనూ మూడు శాఖలున్నాయి. ఒక శాఖ   నిజాం డొమెనియన్లోనే రాజరిక వ్యవస్థను కూల్చి ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలనుకుంది. రెండోశాఖ,  రష్యా తరహా సోషలిస్టు వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. మూడోశాఖ, నిజాం సంస్థానాన్ని ఇండియన్యూనియన్లో విలీనం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించాలనుకుంది.

సంస్థానంలో సాగిన అంతర్యుధ్ధంలో తొలి అమరుడు షేక్బందగీ. చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఒక కోణంలో చూస్తే, అంతర్యుధ్ధానికి ఆరంభమూ, అంతమూ ముస్లింలే. ఇందులో విషాదం ఏమంటే,  నిజాంను అడ్డంగా సమర్ధించిన అల్లరి మూకలు రజాకార్లకూ,  వాళ్లకు పది నెలలపాటు నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీకి  దొరికినంత విస్తృత ప్రచారం, నిజాం రాజరిక వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించిన ప్రజాస్వామిక ముస్లింలకు దక్కలేదు.  షోయబుల్లా ఖాన్గురించి కొందరికైనా తెలియడానికి యాభై యేళ్ళు పట్టింది. అతనికి విగ్రహం పెట్టడానికి అరవై మూడేళ్ళు పట్టింది! 

పెత్తందారీ కులాల ఐక్యత
సంస్థానంలో వెట్టి చాకిరీకి వ్యతిరేక పోరాటం ఉధృతంగా సాగుతున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతపు కమ్యూనిస్టు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణకు వచ్చి, అందులో పాల్గొన్నారు. అయితే, జాగీర్దారులు, దేశ్ముఖులు, పటేళ్ళు,  పట్వారీలు, దొరలపై కమ్యూనిస్టు గెరిల్లాలు దాడులు మొదలెట్టడంతో సన్నివేశం మారింది. డ్రాగన్ను  చూడాలని పరితపించిన చైనా యువరాజు, తీరా డ్రాగన్తనంతట తానుగా రాజప్రసాదానికి వస్తే, దాన్ని చూసి మూర్చపోయినట్టు, గెరిల్లా చర్యల్ని చూసి పెత్తందారీ కులాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు భయంతో వణికిపోయి, పోరాటానికి ద్రోహం చేశారని ఆంధ్రా నక్సలైట్పితామహుడు కొండపల్లి సీతారామయ్య అనేక సందర్భాల్లో నాటి సన్నివేశాన్ని వివరించేవారు. 

నిజాంను గద్దే దించి, తాము అధికారాన్ని చేపట్టాలని హిందూ పెత్తందారీ కులాలు ఆశించాయి. అయితే, ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరిన దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, భిన్నవృత్తులవాళ్ళు, ముస్లింలు సహితం 'రాబోయే అధికారంలో న్యాయమైన భాగస్వామ్యం' కోరడం  వాళ్లకు నచ్చలేదు. అలాంటి కోరికలు తమ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమని పెత్తందారీ కులాలు భావించాయి. మరోవైపు, ఉత్సాహంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు గెరిల్లా దళాలు నిజాంనేకాక, తమనూ పక్కకు గెంటేస్తాయనే భవిష్యత్తు చిత్రపటం వాళ్లకు స్పష్టంగానే అర్ధమయిపోయింది.

కమ్యూనిస్టు గెరిల్లాల ఉత్సాహాన్ని చూసి కమ్యూనిస్టేతర పెత్తందారీ కులాలవాళ్ళు భయపడిపోయినట్లే, కమ్యూనిస్టు పార్టీల్లోని పెత్తందారీ కులాలవాళ్ళూ భయపడిపోయారు. పెత్తందారీ కులాల భయానికి ఆంధ్రా, తెలంగాణ, కన్నడ, మహారాష్ట అనే ప్రాంతీయ విబేధాలు అడ్దం రాలేదు. అప్పటికి, తెలంగాణ ప్రాంతంలో మాత్రమే బలంగావున్న కమ్యూనిస్టు గెరిల్లాలు తమ ప్రాంతానికి కూడా విస్తరించక ముందే జాగ్రత్తపడాలని మహారాష్ట్రులు, కన్నడిగులు భావించారు. అప్పటి ఆర్యసమాజ్కు,  కాంగ్రెస్కు కూడా మహారాష్ట్రులు, కన్నడిగులు అగ్రనాయకులుగా వుండడం వాళ్లకు కలిసొచ్చిన అంశం!  దానితో నిజాం సంస్థానంలో రాజకీయ సవిూకరణలు మారిపోయాయి.  ఆర్యసమాజ్‌, కాంగ్రెస్తో పాటూ, అన్ని సంఘాలు, పార్టిల్లోని పెత్తందారీ కులాలవాళ్ళు ఏకమైపోయారు. కమ్యూనిస్టు గెరిల్లాలు, కార్యకర్తలతోపాటూ, ప్రజాస్వామిక ముస్లింలు ఒంటరివారైపోయారు.

స్వామి రామానంద తీర్ధ
మరాఠా కుటుంబంలో పుట్టి, కన్నడ ప్రాంతంలో పెరిగి, బొంబాయి వెళ్ళి ఎన్‌. యం. జోషి వంటి కమ్యూనిస్టులతో కలిసి కార్మిక సంఘాల్లో పనిచేసి, చివరకు ఆర్యసమాజికునిగా మారి, నిజాం సంస్థానానికి చేరుకుని, కాంగ్రెస్కు నాయకత్వం వహించిన వ్యంకటేష్భగవాన్రావు ఖేల్గీకార్అనే స్వామి రామానంద తీర్ధ తిరుగుబాటు చివరిదశలో అధికారమార్పిడికి రూపశిల్పిగా మారారు. స్వామి రామానంద తీర్ధ అనేకాదు, ఆరోజుల్లో, నిజాం సంస్థానంలోని ప్రతి ప్రముఖ రాజకీయ కుటుంబంలోనూ ఆర్యసమాజ్‌,  కాంగ్రెస్‌, కమ్యూనిస్టు సభ్యులు వుండేవారు.  దానితో, వివిధ సంఘాలు, పార్టీల్లోన్ని  పెత్తందారీ కూలాల మధ్య 'భవిష్యత్అవగాహన' ఏర్పడడానికి  మార్గం మరింత సులభమయింది. 

కొత్త సవిూకరణ, కొత్త అవగాహనలో భాగంగా, ఒక్కో శ్రేణి నాయకత్వం ఒక్కో పాత్ర నిర్వహించింది. కాంగ్రెస్నాయకులు 'ప్రతిపాదిత హైదరాబాద్డొవిూనియన్‌' పై పోలీస్ (సైనిక) చర్య తీసుకోవాలని ఇండియన్యునియన్ను ఆహ్వానించారు. నిజాం విూర్ఉస్మాన్అలీ ఖాన్గద్దె దిగీ దిగగానే, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం  సాయుధపోరాట విరమణ ప్రకటించింది. సంస్థానంలో ముస్లింల పాలనను అంతంచేసి, హిందువుల పాలనను నెలకొల్పాలన్న ఆర్యసమాజ్ఆశయాన్ని  కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకులు  సమిష్టిగా నెరవేర్చారు. స్వామి రామానంద తీర్ధకు 'రెండవ ఛత్రపతి శివాజీ' అనే బిరుదు వచ్చింది.

నెహ్రూ - ముస్లిం సెంటిమెంటు
ఇమ్రోజ్పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్ను  1948 ఆగస్టు 22 రాత్రి రజాకార్లు  క్రూరంగా చంపేసి, అతని చేతులు నరుక్కుపోయారు. వార్త విని చలించిపోయిన జవహర్లాల్నెహ్రు  నిజాంపై పోలీసు చర్యకు పచ్చ జెండా ఊపారు. సెప్టెంబరు మొదటి వారంలోనే భారత సైన్యం పశ్చిమాన షోలాపూర్కు, తూర్పున విజయవాడకు చేరుకుంది. సరిగ్గా సమయంలో, పాకిస్తాన్లో  మహమ్మదాలీ జిన్నా ఆరోగ్యం విషమంగా మారింది.  'ముస్లిం సెంటిమెంటు'తో పోలీసు చర్యను నెహ్రు కొన్ని రోజులు వాయిదా వేశారు. సెప్టెంబరు 11 జిన్నా చనిపోయారు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 12 జరిగాయి. పోలీసు యాక్షన్సెప్టెంబరు 13 ఉదయం అరంభమైంది. 

ఐదు రోజుల నామమాత్రపు ప్రతిఘటన తరువాత సెప్టెంబరు 17  నిజాం సైన్యం భారత సైన్యం ముందు మోకరిల్లింది. నవాబ్విూర్ఉస్మాన్అలీ ఖాన్స్వయంగా రేడియో స్టేషన్కు వెళ్ళి  సంస్థానాన్ని ఇండియన్యూనియన్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. హైదరాబాద్కు స్వతంత్ర దేశంగా డొమేనియన్హోదా ఇమ్మంటూ ఐక్య రాజ్య సమితి భద్రతామండలికి  చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు.

నిజాం సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమైపోయి,  అధికారం చేతులు మారడంతో, తిరుగుబాటుకు నైతిక మద్దతు నుండి రక్తం వరకు ధారబోసిన విభిన్న ప్రజాశేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కానీ,  అధికారమార్పిడి జరిగినంత మాత్రాన కొత్త పాలకవర్గాలకు సంతృప్తి కలగదు. చేజిక్కించుకున్న అధికారం సుస్థిరంగా కొనసాగుతుందనే హావిూ కూడా వాళ్లకు కావాలి. అంతవరకు రాచరికపాలనను ద్వేషించిన తిరుగుబాటుదార్లు భవిష్యత్తులో  భూస్వామ్య-పెట్టుబడీదార్లను కూడా ద్వేషించే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. భవిష్యత్తులో తలెత్తే తిరుగుబాట్లను మొగ్గలోనే తుంచేయాలంటే తమకు అధికారాన్ని కట్టబెట్టిన ఉద్యమకారుల్ని కూడా కర్కశంగా అంతం చేసేయాలని కొత్త పాలకవర్గాలు భావిస్తాయి. షోలాపూర్రెజిమెంట్కు నాయకత్వం వహించిన కల్నల్జినేంద్ర నాద్ఛౌధరి ఆధ్వర్యాన ఏర్పడిన సైనిక ప్రభుత్వం హైదరాబాద్  స్టేట్లో    రెండేళ్ల పాటు నిర్వర్తించిన కర్తవ్యం ఇదే!

కమ్యూనిస్టుల్ని వేల సంఖ్యలో, ముస్లింలని లక్షల సంఖ్యలో చంపేశారు. తెలంగాణ పోరాటంలో వీరోచితంగా పోరాడింది బందగీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల సామాజికవర్గాలే! నైజాంపై విజయోత్సవాల్లో ప్రాణాలను  బలిచ్చింది కూడా వాళ్ల సంతతినే! 

 కమ్యూనిస్టులకు త్యాగాలే మిగిలాయి. కొత్త సమాజంలో వాటా దక్కలేదు. నిజాం సంస్థానంలోని ముస్లింలు రెండు విధాలా నష్టపోయారు. తొలి అమరుడిగా బందగీ పేరు నిలిచిపోయిందిగానీ, అతని మతానికి చెందిన పాలకూలూ పతనం అయిపోయారు, మేలైన జీవితాన్ని ఆశించిన జాతి ప్రజలు పాతబస్తీ అయిపోయారు. ఇలా ఏందుకు జరిగిందంటే, ఉద్యమంలో పాలకవర్గాలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో? ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో? తెలియని ఒక రకం గందరగోళం ఏర్పడిన ఫలితమిది.

ఉద్యమంలో అయినాసరే, అంతిమంగా, పాత పాలకవర్గ ముఠాను తొలగించి కొత్త పాలకవర్గ ముఠా అధికారాన్ని చేపడుతుంది.  కనుక,  అస్తిత్వ ఉద్యమాల్లో పాలకవర్గ శ్రేణులు ఎమరుపాటుగా వున్నా వాళ్లకు వచ్చే నష్టం ఏవిూ వుండదు.  కానీ, సువిశాల ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్య వహిస్తున్న వ్యక్తులు, సంస్థలు ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా, పొరపాటుకు కొన్ని తరాలు నష్టపోతాయి. 

తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేయడాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నవారు, అప్పుడు నిజాం  సంస్థానాన్ని  భారతదేశంలో విలీనం చేయడాన్ని కూడా విమర్శిస్తారా? అనేది ఒక ఆసక్తికర సందేహం!



సాంస్కృతిక సంస్కరణలు
ఒక ఉద్యమం ముగియగానే సాంస్కృతిక సంస్కరణలు మొదలవుతాయి. అంటే విజేతలకు అనుగుణంగా  ఉద్యమ చరిత్రను, సంస్కృతిని, ఘటనల్ని  తిరగరాయడం అన్నమాట.

చారిత్రక ప్రముఖుల మీద మనకుండే దృక్పథం చారిత్రక దశలు మారేకొద్దీ మారిపోతూ వుంటాయి. ఇది రెండు స్థాయిల్లో జరుగుతుంది. మొదటిది, పాలకవర్గాల అంచనా, రెండోది ప్రజల అంచనా. సాధారణంగానే ఇవి రెండూ పరస్పర విరుధ్ధంగా వుంటాయి.

 ఒక దశలో మహాపురుషులుగా నీరాజనాలు అందుకున్నవారు మరో దశలో విమర్శల్ని అందుకోవడం, లేదా ఒక దశలో విమర్శల్ని ఎదుర్కొన్నవారు ఇంకో చారిత్రక దశల్లో నిరాజనాలు అందుకోవడమూ  జరుగుతుంది. 1940-50 దశకాల్లో పోరాట వీరులుగా ఒక వెలుగు వెలిగిన చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలను ఇరవై యేళ్ళ తరువాత  విప్లవ  కమ్యూనిస్టులు తీవ్రంగా విమర్శించడం మనకు తెలుసు. నిజాం మీర్‍ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా అంతే 1947కు ముందు నిజాం మీద అంచనాలు  వేరు. 1947-48 మధ్య కాలంలో నిజాం మీద అంచనాలు  వేరు. 1948 తరువాత నిజాం మీద అంచనాలు  వేరు. ఇప్పుటి అస్తిత్వ యుగంలో నిజాం మీద అంచనాలు వేరు.  చాలామందిలో ఈ చారిత్రక భౌతికవాద దృక్పథం లోపిస్తున్నది.

తెలంగాణ పోరాటంలో విజేతలు పెత్తందారీ కులాలు కనుక  పోరాట  కాలంలో వాళ్ళ సామాజికవర్గానికి చెందిన దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని ప్రఛ్ఛన్నంగా నిషేధిస్తారు. ఆ పోరాటంలో పరాజితులు ముస్లింలు కనుక  వాళ్ళ సామాజికవర్గానికి చెందిన నవాబు, ఇతర దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా  వచ్చిన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు.  ఈ ప్రక్రియ  అక్కడితో ఆగదు. పోరాట  కాలంలో పెత్తందారీ  సామాజికవర్గాలకు  చెందిన దేశ్ ముఖ్ లకు వ్యతిరకంగా వచ్చిన సాహిత్యాన్ని నవాబ్ కు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యంగా మారుస్తారు. నవాబ్ స్వయంగా బందగీని కత్తితో పొడిచి హత్య చేసినట్టో, చాకలి ఐలమ్మను దగ్గరుండి హింసపెట్టినట్టో కొత్త కథనాలు వచ్చేస్తాయి. 


ఇలాంటి సాంస్కృతిక మార్పుకు గొప్ప ఉదాహరణ  “బండెనక బండి కట్టి’ పాట.  ఈ పాట కనీసం అరుసార్లు మార్పులకు గురైవుంటుంది.  స్థానిక దేశ్ ముఖ్ మీద ప్రజల ఆగ్రహాన్ని చిత్రిస్తూ రాసిన ఈ పాట నిజాం నవాబు మీద ప్రజలు ఆగ్రహాన్ని చిత్రిచే పాటగా మారిపోయింది. ఈ పాటలో ఏఏ మార్పులు ఏఏ దశల్లో చోటుచేసుకున్నాయో కొంచెం లోతుగా పరిశోధిస్తే పాలకవర్గంలో ఆయా సందర్భాలలో మారిన సామాజిక సమీకరణల్ని అర్ధం చేసుకోవడం సులభమవుతుంది. చరిత్ర అనేది ఎన్నడూ గతం కాదు. అది వర్తమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చరిత్ర అనేది భవిష్యత్తు ఆకాంక్ష.

ఒక ఉద్యమానికి భౌగోళిక నామం పెట్టడంలోనే సామాజిక దృక్పథం వుంటుంది. 1970ల నాటి నక్సలైట్ ఉద్యమంలో “జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి”  అనేవారు. కొందరు “కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి”  అనేవారు. అయితే, ఏ దశలోనూ  తెలంగాణ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి” అనే నినాదం రాలేదు.  అంతకు ముందు శ్రీకాకుళం గిరిజనుల పోరాటంలోనూ అలాగే జరిగింది. దాన్ని నక్సలైట్లతోసహా అందరూ “శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం” అన్నారేగానీ,  ఉత్తరాంధ్ర  గిరిజన సాయుధ పోరాటం అనో, ఆంధ్రా గిరిజన సాయుధ పోరాటం అనో అనలేదు.

నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో సాగిన  రైతాంగ సాయుధ పోరాటాలను ఆ జిల్లాల పేరుతో పిలిచి వుండాల్సింది. బహుశ దాని స్థాయిని పెంచడం కోసం తెలంగాణ అని వుంటారు. ఆంధ్రా ప్రాంతపు రచయితలు, తెలంగాణ రచయితలు మాత్రమే గాక నిజాం సంస్థానానికి చెందిన మఖ్ధూం మొహియుద్దీన్ వంటి వారు కూడా ఆ పోరాటాన్ని ‘తెలంగాణ’ పేరుతోనే పేర్కొన్నారు. ఈ వ్యాసకర్త చదవలేదుగానీ, బహుశ ఆర్యసమాజ్ పుస్తకాల్లో దాన్ని నిజాం సంస్థానంలో అంతర్యుధ్ధం అని రాసి వుండవచ్చు!.

విప్లవ సాహిత్యంలోనూ మత భావజాలం వుంటుంది.   జననాట్యమండలి అనేది ఒక విప్లవ కమ్యూనిస్టు పార్టీకి చెందిన సాంస్కృతిక వేదిక. మార్పులకు గురైన ‘బండెనక బండి కట్టి’ పాటకు ప్రాణంపోసి విపరీతంగా ప్రచారం చేసింది ఈ సంస్థే.  తెలంగాణలో ప్రజల వ్యక్తీకరణకు ప్రధాన రూపం పాట. నల్గొండ, వరంగల్లు జిల్లాల  రైతాంగ సాయుధ పోరాట కాలంలో  కొన్ని  వందల పాటలు పుట్టాయి. వాటిల్లో అత్యధిక భాగం స్థానిక దేశ్ ముఖ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా రాసినవే. అన్ని పాటలు అందుబాటులో వుండగా జననాట్యమండలి   ఒక్క పాటనే ఎంచుకోవడానికి పని చేసిన సామాజికవర్గ దృక్పథం ఏమిటీ? అన్నది ముఖ్యం. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు కూడా విజేతల చరిత్రనే ప్రచారం చేశాయా? అనేవి ఎప్పటికయినా సమాధానం రాబట్టాల్సిన ప్రశ్నలే.

రచన : 4 జులై 2012
ముద్రణ : (అముద్రితం)