Tuesday 27 November 2018

Very Costly Crony Democracy


అత్యంత ఖరీదైన  ప్రాయోజిత ప్రజాస్వామ్యం  

డానీ


ఇప్పుడు మనం చూస్తున్నవి స్వేఛ్ఛాయుత సాంప్రదాయిక   ఎన్నికలు కావు. ఇవి ఆర్థిక (ఫైనాన్స్) ఎన్నికలు. సాంప్రదాయిక ఎన్నికలు సామ్యవాదమా? మధ్యేవాదమా? పెట్టుబడీదారీ వాదమా? అంటూ సిధ్ధాంతాల పరంగా సాగేవి.  కొంతకాలం రైటిస్టు, లెఫ్టిస్టు,  సెంట్రిస్టు,  లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్, రైట్ ఆఫ్ ద సెంటర్ అంటూ కొన్ని  శిబిరాలు కొనసాగాయి.  ఇప్పుడు అవన్నీ పోయాయి. ఆర్ధిక శక్తిని బట్టి ప్రచార ఆర్భాటంతో ఓట్లను మంచి ధర పెట్టి కొనుక్కోవడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రక్రియ.  

ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఓ ఏడాది ముందే  ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూతుకు ఓ పది మందిని క్రియాశీల కార్యకర్తలుగా ఎంపిక చేసి చెరో లక్ష రూపాయలు చేరవేసేస్తాయి. ఆ క్రియాశీల సభ్యులు చెరో వంద మంది ఓటర్లను ప్రభావితం చేసి వాళ్ళ ఓట్లు తమ పార్టికి పడేలా ప్రయత్నిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 240 నుండి 250 వరకు పోలింగ్ బూతులుంటాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 43 వేల  పోలింగ్ బూతులున్నాయి. అంటే సీడ్ క్యాపిటల్ 4,300 కోట్ల రూపాయలు. 

రాజకీయాల్లో ఏ పనికైనా డబ్బే ప్రధానం. అయితే, కేవలం డబ్బు తోనే అన్ని పనులు జరగవు. డబ్బుకు తోడుగా కొంచెం ఆప్యాయపు పలకరింపులు కూడా చాలా ముఖ్యం. ఓ ఏడాది ముందు నుండే ఓటర్లను పలకరించే కార్యక్రమం - Interactive Voice Response System (IVRS) సర్వే-  మొదలయిపోతుంది. ఒక్కో కాలర్ రోజుకు సగటున 250 ఫోన్ కాల్స్ చేసేదయితే, దాదాపు 4 కోట్ల 30 లక్షల మంది ఓటర్లను నెలకు రెండుసార్లు పార్టి పక్షాన ఆప్యాయంగా పలకరించాలంటే కనీసం 12 వేల మంది సిబ్బంది పనిచేసే కాల్ సెంటర్లు కావాలి.  ఏడాదిపాటు ఈ సిబ్బంది జీత భత్యాల కోసం సులువుగా ఓ మూడు  నాలుగు వందల కోట్ల రూపాయలు  ఖర్చు అవుతాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వచ్చే ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే వారి ఓట్లు తొలగిస్తున్నారని  కొన్ని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరంటే వారు ఇష్టానుసారంగా ఓట్లు తీసేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆర్పీ సిసోడియా ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. గానీ, ప్రజాస్వామిక వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో అవధులు అన్నింటినీ దాటేసిన నరేంద్ర మోదీ-అమిత్ షాల  పాలనలో అలా జరగడంలేదని నమ్మడం కష్టమే.

రాజకీయాల్లో కొన్ని సామాజికవర్గాలు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటాయి. కమ్మ సామాజికవర్గంలో తెలుగుదేశానికీ, రెడ్డి సామాజికవర్గంలో వైసిపికి, కాపు సామాజికవర్గంలో జనసేనకు ఇలాంటి వీరాభిమానులు వేల సంఖ్యలోనే వుంటారు. వీళ్ళుగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లోనూ కొందరు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటారు. ప్రధాన పార్టీలన్నీ ఒక క్రమపధ్దతిలో వీరాభిమానుల సేవల్ని వాడుకుంటాయి. ఈ వీరాభిమానులు స్వఛ్చంద సేవకులు కనుక వాళ్ళకు   జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ వాళ్లను కార్యక్షేత్రంలోనికి  దించి ఓటర్లను ప్రభావితం చేయడానికి పెద్ద ఖర్చే అవుతుంది. అదో వంద రెండు వందల కోట్ల రూపాయలు!.

మీడియాలో తమకు వ్యతిరేక వార్తలు రాకుండా ఆపి, తరచుగా అనుకూల వార్తలు వచ్చేలా చేసుకోవడం చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే కాదు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఇప్పుడు చాలా పెరిగింది.  వీటన్నింటినీ  సానుకూలంగా మార్చుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇంకో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించక తప్పదు.

ప్రధాన పార్టీలకు చెందిన సిట్టింగ్ అభ్యర్ధులేగాక, కొత్తగా రంగంలో దిగే అభ్యర్ధులు సహితం ఏడాది ముందు నుండే  అనేక ప్రచార  కార్యక్రమాలను చేపట్టి పార్టి అధిష్టానవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రధాన పార్టీల పక్షాన పోటీలో వున్నామనిపించుకోవడానికి ఎన్నికల సంవత్సరంలో ఒక్కొక్కరికి సులువుగా రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆశావహులు పార్టి టిక్కెట్టు కోరడానికి అది దరఖాస్తు రుసుము లాంటిది. ఇవి గాక, ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తమ దగ్గర స్వంత నిధులు కనీసం పది కోట్ల రూపాయల వరకు వున్నాయని రుజువు చూపని అభ్యర్ధులకు ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా ఇవ్వవు. ఎంపీ టిక్కెట్టు ఆశించే అభ్యర్ధుల  ఆర్ధిక అర్హతలు దీనికి ఓ ఏడెనిమిది రెట్లు  ఎక్కువగా వుంటాయి.

మరో మాటల్లో చెప్పాలంటే, చెరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయలను  నేల మీద పరిచేశాకే రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిధ్ధం అవుతాయి. జాతీయ స్థాయి ప్రధాన రాజకీయ పార్టీలు దీనికి ఓ పాతిక ముఫ్ఫై రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఈ లెఖ్ఖలన్నీ 2014 ఎన్నికల ఖర్చు అంచనాతో వేసినవి. ఇప్పటి ధరల ప్రకారం సవరించాలంటే మరో 30-40 శాతం అదనంగా కలపాల్సివుంటుంది. ఓ సీనియర్ ఎం.పీ మాటల్లో చెప్పాలంటే “ఓటరుకు నికరంగా రెండు వేల రూపాయల నోటు  చేర్చాల్సిందే. అలా చేర్చడం కోసం ఇంకో వెయ్యి రూపాయలు పైఖర్చు పెట్టాల్సిందే”. ఇదొక బండ లెక్క.

  శాసనసభకు 28 లక్షల రూపాయలు, లోక్ సభకు 70 లక్షల రూపాయల్ని ఎన్నికల గరిష్ట ప్రచార వ్యయంగా  కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది నిర్ణయించింది. ఇది సిగరెట్టు ప్యాకెట్ల మీద ధూమపానం హానికరం అంటూ రాసే హెచ్చరిక లాంటిది.  దేశం మొత్తమ్మీద ఒక్కరంటే ఒక్కరూ దాన్ని పట్టించుకోరు.

అనైతిక సాంప్రదాయాలు ఎక్కడ మొదలయినా, ఎంత చిన్నగా మొదలయినా అవి మొత్తం సమాజానికి చాలా వేగంగా చాలా విస్తృతంగా వ్యాపించేస్తాయి. మొదట్లో కార్మికవాడలు, మురికివాడల్లో నివశించే నిరుపేద ఓటర్లు మాత్రమే డబ్బు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సాంప్రదాయం మధ్యతరగతి కుటుంబాలకు కూడా వ్యాపించింది. “తీసుకోక పోతే మమ్మల్ని ప్రత్యర్ధి ఖాతాలో పడేస్తారు” అనే భయంతో వాళ్ళు ఓటుకు నోట్లు తీసుకోవడం మొదలెట్టారు. “ఎవర్ని వద్దన్నా ఇబ్బంది కదా?” అంటూ  ఇప్పుడు గడుసరిగా ఇరుపక్షాల దగ్గరా నోట్లు తీసుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన విద్యార్ధులు సహితం ఓటుకు నోటు సంస్కృతికి చాలా సులువుగా అలవాటు పడిపోతున్నారు. ఓ వీకెండ్ పార్టి ఖర్చు ఆ ఖాతాలో పోతుందని వాళ్ళ ఆనందం. కొనుక్కుంటున్నారు గాబట్టి అమ్ముకుంటున్నారో అమ్ముకుంటున్నారు గాబట్టి కొనుక్కుంటున్నారో తేల్చడం ఇప్పుడు చాలా కష్టం.  

అంత మాత్రాన సమాజం మొత్తంగా గొడ్డుపోయిందని కాదు. విధానాలు, సిధ్ధాంతాల ఆధారంగా ఓటింగు జరగాలని కోరుకునే ఆదర్శ ఓటర్లు ఇప్పుడూ వుంటారు. కానీ వాళ్ల సంఖ్యం క్రమంగా క్షీణించి 15-10 శాతానికి పడిపోయింది. ఈ సమూహం ప్రధానంగా విద్యావంతులు. నిజానికి వీళ్ళ కొసమే  రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతుంటాయి. ఆదర్శవంతమైన వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తుంటాయి.  ఇప్పుడు ఎంతో కొంత చాటు పాటిస్తున్నారుగానీ, ఈ విద్యాధిక ఆదర్శ సమూహం ఎంతోకొంత లేకుంటే, రాజకీయ పార్టీలు ఏనాడో ఓట్లను చేపల సంతలా మార్చేసేవారు.

ఇంతటి భారీ నిధుల్ని సమీకరించడం, నిఘా సంస్థల కళ్ళుగప్పి వాటిని పంపిణీ చేయడం ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కష్టమైన పని. ఆయా రాజకీయ పార్టిలు అధికారంలోనికి వస్తే తాము పెట్టిన పెట్టుబడికి పది రెట్లు  లాభాలు దండుకోవచ్చని ఆశించే మెగా కార్పొరేట్లు ఈ భారాన్ని తమ నెత్తిన వేసుకుంటాయి. నిజానికి ఎన్నికల తరువాత ప్రభుత్వ నిర్ణయాలను నియంత్రించేవి ఈ మెగా కార్పొరేట్లే. దీనిని పెట్టుబడీదారీ ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనవచ్చు. మనం తరచూ పత్రికల్లో అదానీ లాభాలు ఇన్ని వేల కోట్లు, అంబానీ లాభాలు అన్ని వేల కోట్లు అని చదువుతున్నది ఈ  ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఫలాలే.

‘The Industrial Vagina : The Political Economy of the Global Sex’ పుస్తకాన్ని రాసిన Sheila Jeffreys  ఈ సమయంలో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో వుండి వుంటే  The Industrial Vote : The Political Economy of the Indian Democracy’ అనే గ్రంధాన్ని తప్పకుండా రాసివుండేది. అసలు కథ ఇది. దీన్నీ దాచి పెట్టడానికి  “ముఖ్యమంత్రిగా మారిన ఆరణాల కూలీ”, “ప్రధానమంత్రి కుర్చీ ఎక్కిన చాయివాలా” వంటి ముసుగుల్ని ఈ మెగా కార్పొరేట్లు అప్పుడప్పుడు కప్పుతుంటాయి. అలా దేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంటుంది. 

 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

రచన : 27 నవంబరు 2018
ప్రచురణ : ప్రజాపక్షం దినపత్రిక, 28 నవంబరు 2018


Wednesday 14 November 2018

Keep Sangh Parivar dictatorship out of power


Keep Sangh Parivar dictatorship out of power

సంఘపరివార నియంతృత్వాన్ని నిలవరించడమే నేటి కర్తవ్యం!  

Muslim Intellectual’s Meet
Organised by Integrated Forum for Muslim Rights
Guntur, 14th Novamber 2018

సదస్సు చివర్లో నేను చాలా క్లుప్తంగా మాట్లాడాను.
నా ప్రసంగ పాఠం ఇది.

అస్సలాం అలైకుమ్ !

చట్ట సభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనేది ఒక అందమైన కల.  ఇప్పుడు మనం చూస్తున్నవి  విధానపరమైన  (policy) ఎన్నికలు కావు; ఆర్థికపరమైన( finance )ఎన్నికలు.

పెద్ద పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేకు అయ్యే ఎన్నికల ఖర్చు సగటున పదిహేను కోట్ల రూపాయలు వుంటుంది. టిక్కెట్టు పొందినవాళ్ళు ఓ ఐదారు కోట్ల రూపాయలు అయినా స్వంతంగా ఖర్చుపెట్ట గలిగి వుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు ఇవన్నీ neither economically viable nor politically feasible. ముస్లింలలో ఎవరో నలుగురికో ఐదుగురికో మాత్రమే  అలాంటి సామర్థ్యం వుంటుంది. వాళ్లు ఎలాగూ టెక్కెట్లు తెచ్చుకుంటారు. ఎన్నికల్లో గెలుస్తారు.

130 కోట్ల మన దేశ జనాభాలో ఈరోజు ఒక్క ఐదు శాతం తప్ప 95 శాతం  మంది సమస్యల్లో వున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నూట ఒక్క సమస్యలు వున్నాయి. ముస్లింలకు రెండు వందల ఒక్క సమస్యలున్నాయి. ముస్లింల సమస్యలకూ, ఇతర ప్రజా సమూహాల సమస్యలకూ కారణం ఒక్కటే; మూలం ఒక్కటే. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం. దీనినే ఇంగ్లీషులో Capitalist Communal Dictatorship అంటారు.  సులభ భాషలో  ఫాసిజం అంటున్నారు. భారత దేశంలో సంఘపరివార నియంతృత్వం అనవచ్చు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ పరిపాలనని గద్దె దించే రాజకీయ వ్యూహాలను ఈ సదస్సు చర్చించకపోవడం విచారకరం.  

ముందు మనం ఆలోచించాల్సింది సంఘపరివార నియంతృత్వాన్ని ఎలా అంతం చేయాలి అనేది.  ఇది ముస్లింలు ఒక్కరి సమస్యేకాదు; దేశ ప్రజలందరి సమస్య. ఈ సమస్య మీద అనేక రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక సంస్థలు పోరాడుతున్నాయి.  వాళ్లతో కలవకుండ, అసలు సమస్యను వదిలేస్తే మిగిలిందంతా ఎన్నటికీ సాకారంకాని  ఒక అందమైన కల గానే వుండిపోతుంది.

సంఘపరివార నియంతృత్వాన్ని ఎదురించే క్రమంలో సాటి బాధిత ప్రజల సంఘీభావాన్నీ, నమ్మకాన్నీ,  సౌభాతృత్వాన్నీ పొందగలిగితే సహజంగానే ముస్లిం అభ్యర్ర్థులకు ఓట్లు, సీట్లు, ప్రాతినిథ్యం అన్నీ పెరుగుతాయి.  

అల్ హందు లిల్హా !


Saturday 3 November 2018

Never Again Sangh pariwar Rule


సంఘ్ పరివార్ కి సర్కార్ ఫిర్ కభీ నహీ !!

డానీ


ఆంధ్రప్రదేశ్ ముస్లింలు 2019లో ఎవరికి ఓటేస్తారు? అనేది రాజకీయ పరిశీలకులకు ఎంతటి ఆసక్తికర ప్రశ్నో, ఎవరికి ఓటేయాలి? అనేది ముస్లింలకు కూడా అంతే అంతుపట్టని సంధిగ్ధం.  

భారత ముస్లింల రాజకీయ వ్యవహార శైలి భిన్నమైనది. మిగిలిన సామాజికవర్గాల్లా వాళ్ళు కూడా ఆర్ధిక ప్రయోజనాలను కోరుకుంటారు. అయితే, సామాజిక ప్రశాంతతకు ఆర్ధిక ప్రయోజనాలకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది తెలియనివాళ్ళు ముస్లింలు ధార్మిక (మతపరమైన) అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తరచూ అపార్ధం చేసుకుంటుంటారు.  

 ఏపి ముస్లింలు 2004, 2009 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అది బిజెపి ఆధ్వర్యంలోని ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందనే ప్రధాన కారణంతోనూ,  విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందనే ద్వితీయ కారణంతోనూ 2004 లో వాళ్ళు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. అలాగే ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించిందనే ప్రధాన కృతజ్ఞతతోనూ, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిందనే   ద్వితీయ కృతజ్ఞతతోనూ  2009లో  వాళ్ళు కాంగ్రెస్ కు  మద్దతిచ్చారు.

కొందరు అంగీకరించకపోవచ్చుగానీ రాష్ట్ర ప్రజల్లో వైయస్ రాజశేఖర రెడ్డి గ్రాఫ్ 2009 ఎన్నికల నాటికే క్రమంగా పడిపోతూ వుంది. “ప్రజలు మాకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు” అని స్వయంగా వైయస్సే అన్న సందర్భాలున్నాయి. ఒక విధంగా ముస్లింల గట్టి మద్దతు కారణంగానే వైయస్  ప్రభుత్వం  2009లో గట్టెక్కింది అనంటే అతిశయోక్తికాదు.   

వైయస్ మరణానంతరం చంద్రబాబు 2012లో ముస్లిం సాధికారత పథకాన్ని ప్రకటించారు.  దానితో ముస్లిం సామాజికవర్గంలోని ఒక భాగం  తెలుగు దేశం పార్టి వైపు మళ్ళీ మొగ్గు చూపింది. అయితే, చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు, ముస్లింలలో ఎక్కువ మంది అభిమానిస్తున్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో నవ్యాంధ్రాలో  కనీస పోటీ ఇవ్వగలిగే స్థితిలో కూడా లేదు. వైయస్ కు వారసునిగా వచ్చిన జగన్ అప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. కానీ, రాజకీయాల్లో జగన్ ద్వంద్వ వైఖరి కారణంగా అది కూడా సజావుగా సాగలేదు.

మద్దతు ఇచ్చే అంశం మీద ముస్లిం ప్రతినిధులు వైయస్సార్ సిపి తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి ఘడియ అయిన మే 4 సాయంత్రం 4 గంటల వరకూ హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని వైయస్సార్  సిపి కార్యాలయంలో  ఆ చర్చలు సాగాయి.  జగన్ ప్రతినిధిగా ఆర్థిక నిపుణులు డి.ఏ. సోమయాజులు ఆ చర్చల్లో పాల్గొన్నారు.  “ఎన్నికల అనంతరం ఎన్ డీఏ లో చేరబోన”ని జగన్ స్పష్టంగా ఒక్క ప్రకటన చేస్తే చాలు అనేది ముస్లిం ప్రతినిధుల డిమాండ్. ‘కోవా’ స్వఛ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వెళ్ళిన ఆ ప్రతినిధుల బృందంలో ఈ వ్యాసకర్త కూడా ఒకరు. ముస్లింల కనీస డిమాండ్‍ ను కూడా జగన్ ప్రతినిధి అంగీకరించలేదు. ఎన్నికల తరువాత తాము మోదీకి దూరంగా వుండలేమని వారు చాలా స్పష్టంగా చెప్పారు.

జగన్ కు ఇటీవల నరేంద్ర మోదీజీ మీద రాజకీయ ప్రేమ పుట్టిందని  చాలామంది అనుకుంటుంటారు. నిజానికి వారు 2014లోనే మోదీజీ మీద మనసు పారేసుకున్నారు. జాతీయ రాజకీయ దృక్పధాల్లో రాజశేఖర రెడ్డికీ, జగన్ కూ  పొంతనలేదు. రాజశేఖర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పక్షం అయితే, జగన్ భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేక పక్షం.

వైయస్సార్ సిపీతో చర్చలు విఫలం కావడంతో 2014 ఎన్నికల్లో ఏపి ముస్లిం పెద్దలు తమ స్వీయ సమాజం ఎవరికి ఓటేయ్యాలి అనే విషయంలో  స్పష్టంగా ఒక పిలుపును ఇవ్వలేక పోయారు. ఓటింగును ముస్లింల ‘ఆత్మ ప్రబోధానికి’ వదిలివేశారు.  దానితో ఏపీలో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగం జగన్ కు పడ్డాయన్నది ఎంత వాస్తవమో టిడిపికి పడిన ముస్లిం ఓట్లు తక్కువేమీ కాదన్నది కూడా అంతే వాస్తవం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే  ఈ విషయం సులువుగానే అర్ధం అవుతుంది.   అక్కడి ముస్లింలలో అత్యధికులు అసెంబ్లీ ఓట్లను వైసిపికి, లోక్ సభ ఓట్లను టీడీపికి వేశారు.

దేశంలో ఒక భయానక అసహన వాతావరణం, మూకోన్మాదం చెలరేగుతున్న సమయంలో 2019 ఎన్నికలు వస్తున్నాయి. బిజెపితో తగువు పెట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడంకన్నా ఆ పార్టీలోనే చేరిపోతే మేలని భావించే వాళ్ళు సహితం ముస్లింలలో కొందరు వుంటారు.  అయితే, ముస్లిం సమాజంలోని అత్యధికులు మాత్రం సంఘపరివారాన్ని అదుపుచేసే రాజకీయ కూటమి కోసం నిరంతరం అన్వేషిస్తూనే వుంటారు. ఇలాంటి నేపథ్యంలో, భారత జాతీయ కాంగ్రెస్సే తిరిగి తిరిగి ముస్లింలకు తప్పని అనుబంధంగా కనిపిస్తూ వుంటుంది. సంస్థాగతంగానూ, విధానపరంగానూ కాంగ్రెస్ లో అనేక లోపాలు వుండవచ్చు. అది వేరే కథ.

ముస్లింలు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతారని బిజెపి-సంఘపరివారానికి కూడా తెలుసు. వాళ్లు దానికి విరుగుడును కనిపెట్టి సిధ్ధంగానే వున్నారు. అందులో కీలకమైనది ముస్లింలకు ఓటు వేసే అవకాశం లేకుండా చేయడం; ఎన్నికల  జాబితా నుండి ముస్లిం ఓటర్లను తగ్గించడం; వీలయితే మొత్తంగా తొలగించడం. ఎన్నికల సంఘం ద్వార ఆ పనుల్ని వాళ్ళు సులువుగా చేయగలరు. ప్రజాస్వామిక వ్యవస్ద్థల్ని భ్రష్టు పట్టించడంలో మోదీజీ-అమిత్ షాజీ జంటకు  మరొకరు సాటిరారు.

ఒక అంచనా ప్రకారంలో ఏపీలో అర్హులైన దాదాపు 4 కోట్ల మంది ఓటర్లలో  34 - 36 లక్షల మంది ముస్లింలు వుండాలి. గుంటూరుకు చెందిన ఐఐటియన్ షేక్ హుస్సైనీ విభిన్న లాగరిథమ్స్ ను ఉపయోగించి ప్రస్తుత జాబితాలో 16-17 లక్షల మంది ముస్లింలులకు  మాత్రమే ఓట్లు వున్నాయని తేల్చారు. అంటే, అర్హులైన ముస్లిం ఓటర్లలో సగంకన్నా తక్కువ మందికి మాత్రమే ఇప్పుడు ఓట్లున్నట్టు లెఖ్ఖ.

ఒక సామాజికవర్గానికి ఓటర్ల లిస్టులో చోటు దక్కకపోతే రెండు రకాల నష్టాలు జరుగుతాయి. మొదటిది; వాళ్ళు ఓటు హక్కును కోల్పోతారు. రెండోది; ఓటర్ల లిస్టులో పెద్ద సంఖ్యలో లేని సామాజికవర్గాల సంక్షేమాన్ని రాజకీయ పార్టిలు పట్టించుకోవు. దాదాపు నలభై లక్షల మంది ఓటర్లను కలిసి వాళ్ళలో దాదాపు ఇరవై లక్షల మందిని కొత్తగా జాబితాలో నమోదు చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.  ఇంతటి శక్తి ఇప్పటి ఏపి ముస్లిం సేవా సంస్థలు వేటికీ లేదు. ఎన్నికల సంఘమే దానికి పూనుకోవాలి. లేకుంటే ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ ఆ భారాన్ని మోయాలి. ముస్లిం ఓట్లలో అత్యధిక భాగం బిజేపికి వ్యతిరేకంగా పడేవే కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచిన రాజకీయ పార్టిలు ముస్లిం ఓటర్ల నమోదుకు పూనుకోవాలి.

ఓటర్ల నమోదు తరువాత కీలక ప్రశ్న ఓటింగుకు సంబంధించింది.  ఏపి ఎన్నికల బరిలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా గ్రాండ్‍ ఫినాలే చంద్రబాబు, జగన్ ల మధ్యనే వుంటుందని ఈపాటికే తేలిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరు యూపియే, ఎవరు ఎన్డీయే అనేది తేల్చడమే ఇప్పుడు ముస్లిం సెఫాలజిస్టులు (Psyphologists) తేల్చాల్సిన అంశం.


మతతత్వశక్తులతో కలవను వంటి పొడిపొడి ప్రకటనలు అప్పుడప్పుడు  చేస్తున్నప్పటికీ మోదీజీతో ఒక సాఫ్ట్ కార్నర్ ను జగన్ అట్టే పెట్టుకుంటూ వస్తున్నారు. వంచనపై గర్జన గుంటూరు సభలో వైసిపీ నాయకులు  మోదీజీ మీద కొంత గొంతు పెంచి మాట్లాడారుగానీ అదొక యాధృఛిక సంఘటనగానే మిగిలిపోయింది. తనకు పేటెంటు హక్కులున్నాయని అంటున్న ప్రత్యేక తరహా హోదా సాధన ఉద్యమం  ఒకవేళ విజయవంతమైనా దానివల్ల ముస్లింలకు ఒనగూడే ప్రయోజనాలు కూడా ఏమీలేవు. మాబ్ లించింగ్, గోగ్రవాదం, విడాకుల్ని నేరంగా పరిగణించే ఆర్డినెన్సు, జాతీయ పౌరసత్వ నమోదు, రాజ్యాంగంలో లౌకిక ఆదర్శాల పరిరక్షణ, వక్ఫ్ భూముల పరిరక్షణ, విద్యా ఉపాధిరంగాల్లో జనాభా దామాషా ఆధారిత  రిజర్వేషన్లు   మొదలైనవి ముస్లింలకు కీలక అంశాలు. వీటి మీద మాట్లాడకపోగా ముస్లింలు తనను వదిలి ఎక్కడికీ పోలేరు అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు.  మరోవైపు, జగన్ శిబిరంలో గత ఎన్నికలలో డిఏ సోమయాజులు నిర్వహించిన మోదీజీ అనుకూల పాత్రను ఇప్పుడు వైసిపి జాతీయ కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారు.

          మరోవైపు, నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు సహితం ముస్లింల సంక్షేమానికి చేసిందేమీలేదు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చినా, మరో విభాగాల్లో ప్రోత్సహించినా ఢిల్లీలో నరేంద్రమోదీ మనోభావాలు దెబ్బతింటాయని వారు వెనుకాడే వారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రాకుంటే ఆంధ్రప్రదేశ్ మనుగడ కష్టం కనుక ప్రధాని నొచ్చుకోకుండా మసులుకోవడం తనకు తప్పదనేవారు. మరోమాటల్లో చెప్పాలంటే, నవ్యాంధ్రప్రదేశ్  అభివృధ్ధి కోసం ముస్లింలు త్యాగాలు చేయకతప్పదనేది వారి అభిప్రాయంగా వుండేది.

          నరేంద్ర మోదీ ఐదవ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు వ్యవహార శైలి మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రమంగా వారు మోదీకి వ్యతిరేకంగా స్వరం పెంచారు. దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోదీ-అమిత్ షాలను ముఖాముఖీగా ఎదుర్కొంటున్న  ముఖ్యమంత్రులు నలుగురు; మమతా బెనర్జీ, కేజ్రివాల్, పినరయి విజయన్, చంద్రబాబు. వీరిలో చంద్రబాబు ఇప్పుడు  మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరులో ముస్లింల సదస్సును నిర్వహించి వారు కేంద్రానికి స్పష్టమైన సంకేతాన్నే పంపించారు.  

కాంగ్రెస్ తో  చంద్రబాబు జత కూడవచ్చని కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు రాహుల్ గాంధీ – చంద్రబాబు గురువారం ఢిల్లీలో  ఒక స్పష్టత ఇచ్చారు.  “మోదీ హయాంలో కుప్పకూలిపోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు, దేశాన్ని రక్షించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాం” అని  ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఈ రెండు పార్టిలతోపాటూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ , జేఎంఎం, సీపీఐ, సీపీఎం, తృణమూల్కాంగ్రెస, జేడీఎస్‌, ఎన్సీ, లోక్దళ్‌,. పీడీపీ ఇప్పటికే ఐక్య ప్రజాస్వామిక కూటమిలో చేరాయి. గతంలో యున్సైటెడ్ ఫ్రంట్, ఏన్డీఏలకు కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు యూపియే కు కూడా కన్వీనర్ గా  మారినా ఆశ్చర్య పడాల్సింది ఏమీలేదు.

మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనే కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప జగన్ ఇప్పుడు యూపియేలో చేరే అవకాశాలు లేవు. వైసిపి ఇప్పుడు ఎన్డీయేలో చేరవచ్చు లేదా  మూడో ఫ్రంట్ లో చేరవచ్చు. మూడో ఫ్రంట్ అనేది మోదీజీ టీం –బీ మాత్రమే అని ఇప్పటికే తేలిపోయింది.

కాంగ్రెస్‍ తో చంద్రబాబు చేతులు కలపడం భారత రాజకీయాల్లో ఎంతటి దిగ్బ్రాంతికర పరిణామమో ఏపి ముస్లింలు చంద్రబాబును పూర్తిగా సమర్ధిస్తారా? అనేది కూడా అంతటి దిగ్బ్రాంతికర సందేహమే. ఏపీలోని కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టిడిపిని ప్రత్యర్ధిగానూ, వైసిపిని దారితప్పిన  సోదరునిగానూ భావిస్తున్నారు. అలాగే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును సమర్ధించడానికి చాలామంది ముస్లింలు కూడా సుముఖంగా లేరు. కానీ, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కాంగ్రెస్ ప్లస్ టిడిపి అనేది ముస్లింలకు క్రమంగా ఆమోదయోగ్యమైన రాజకీయ ఫార్మూలా అవుతుంది. యూపిఏలో చంద్రబాబు క్రియాశీలంగా మారేకొద్దీ ఇప్పటి దిగ్భ్రాంతి ఒక సాధారణ విషయంగా మారిపోతుంది. ఎన్నికల సంఘం అన్యాయానికి బలైన ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యతను న్రవేర్చగలిగితే ముస్లింల వైపు నుండి టిడిపికి అది బోనస్ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నడూ పాత తేదీలు, పాత పేజీలు వుండవు. వుండేదల్లా భవిష్యత్తే. ఎవ్రి డే ఈజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్.

          ముస్లిం రాజకీయ చైతన్యం ఓ రెండు మంత్రి పదవుల కోసమో కాదు.  ఓ డజను ఎమ్మెల్యే స్థానాలకోసమో, అరడజను కార్పొరేషన్ల కోసమో అసలు కాదు. ఇది ముస్లింల ఆత్మగౌరవ పోరాటం. వునికిని చాటుకునే ఆరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్షాన కేంద్ర ప్రభుత్వంతో పోరాడే ఒక చారిత్రక బాధ్యతను  పంచుకోవడానికి ముస్లింలు సిధ్ధం కావాలి. చరిత్ర విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ఢిల్లీలో  జాతీయ విపక్షాలు కదులుతున్నాయి. ఇది ఆరంభంలో రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాటం. అంతిమంగా దేశ భవిష్యత్తు కోసం పోరాటం. మోదీని తప్పించడమే నేటి ప్రజాస్వామ్య కర్తవ్యం.  సంఘ్ పరివార్ కి  సర్కార్ ఫిర్ కభీ నహీ !

(రచయిత సమాజ విశ్లేషకులు) మొబైల్ – 9010757776

రచన :  2 నవంబరు 2019
ప్రచురణ : మనతెలంగాణ  4 నవంబరు 2019