Thursday, 19 March 2026

Naredra Modi and Amit Shah Face Saving Tactics

 

Naredra Modi and Amit Shah Face Saving Tactics

బిజెపి 2014లో అధికారానికి వచ్చినప్పటి నుండీ అమెరికాతో సన్నిహితంగా వుంటూ వస్తున్నది.

ప్రపంచ మార్కెట్లో చైనా విస్తరణను అదుపుచేయడానికి ఇండియా తనకు వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా కూడా భావిస్తున్నది.

భారత ప్రధాని నరేందర్ మోదీ ఇంతకు ముందు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లొ డొనాల్డ్ ట్రంపుకు ప్రచారం కూడ చేశారు.

రెండేళ్ల క్రితం అంబానీ రిలయన్స్ సంస్థకు చమురు  కోసం  మోదీజీ రష్యా వైపుక్లు మొగ్గారు.

అమెరికాకన్నా, పశ్చిమాసియా దేశాలకన్నా చౌక ధరకు రష్యా చమురును సరఫరా చేసింది.

రెండోసారి అధికారానికి వచ్చిన  డోనాల్డ్ ట్రంప్ ఇండియా మీద కక్షకట్టారు.  

భారీగా టారీఫ్ లు విధించారు.

మరోవైపు, రష్యా చ అవుక చమురు  ప్రయోజనాలు భారత ప్రజలకు దక్కలేదు.

దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గలేదు.

ఆ చమురు లాభాలన్నీ రిలయన్స్ సంస్థకే దక్కాయని విమర్శలు వచ్చాయి.

మళ్ళీ మోదీజీ అమెరికా వైపుకు మళ్ళారు.

దేశానికి నష్టాన్ని  చేకూర్చే ఒక ట్రేడ్ డీల్  ను అమెరికాతో చేసుకున్నారు.

అంతేకాదు అమెరిక-ఇజ్రాయేల్ కలి ఇరాన్ మీద యుధ్ధానికి సిధ్ధం అవుతున్న వేళ ఇజ్రాయేల్ వెళ్ళి పొగిడి వచ్చారు. ఇండియాలో గ్రామగ్రామాన ఇజేయేల్ టెక్నాలజీని విస్తరింపజేస్తామని వచ్చారు.  

ఇంతగా వారు ఎందుకు లొంగి ప్రవర్తిస్తున్నారనే చర్చ దేశంలో మొదలయ్యింది.

తీవ్ర వివాదాస్పదుడైన జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మత్రుల పేర్లు వుండడం వల్లనే మోదీజీ జుట్టును పట్టుకుని ట్రంప్ ఆడిస్తున్నారనే మాట బాగా ప్రచారంలో వుంది.

ఈమాట మీద పార్లమెంటులో తనను నిలదీస్తారనే భయంతోనే మోదీజీ ఒ నెలరోజులుగా పార్లమెంటుకు రావడంలేదు. ముఖం చాటేశారు.

గతంలో మిత్రునిగావున్న ఇరాన్ కు దూరమయ్యారు.

భారత దేశం విశాఖపట్నంలో  జరిగిన నౌకా విన్యాసాల్లో పాల్గొని వెనక్కు వెళుతున్న ఇరాన్ యుధ్ధనౌకను అమెరికా కూల్చి వేసినా, ఇరాన్ దేశాధినేతల్ని చంపేసినా  మోదీజీ కొంచెమైనా నిరసన / సానుభూతి వ్యక్తం చేయలేదు.

ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో భారత ఓడల్ని అనుమతించాలని ఇరాన్ ను వేడుకుంటున్నారు.

జ్ఞానం శీలంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్తోమత తమకు వుందని మోదీ తరచు ప్రచారం చేసుకునేవారు.

చైనా గాల్వాన్ ఆక్రమణకు వచ్చినప్పుడు మోదీజీ తటపటాయించారని  అప్పటి సైనిక ఉన్నతాధికారి రాసినట్టు చెపుతున్న పుస్తకం కూడ మోదీ ఇమేజ్ ను దెబ్బతీసింది.

హిందూమతం ప్రమాదంలో వుందనే ప్రచారాన్ని ఉధృతం చేసి ఓటర్లను హిందూ ముస్లిం అంటూ చీల్చి రాజకీయంగా లబ్ది పొందుతూ వస్తున్నారు  మోది.

ఇప్పుడు శంకరాచార్య లాంటి హిందూ మతాచార్యులు కొందరు మోదీకి వ్యతిరేకంగా మారారు.

మోది భక్తులు, అల్లరి మూకలు ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ పరిణామాల్ని  బిజెపి అభిమానులు సహితం చీదరించుకుంటున్నారు.  

బిజెపి అధికారంలోవున్న రాష్ట్రాల్లో పోలీసులు సహితం ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని పోలీసు అధికారుల్ని మందలిస్తున్నాయి.

కిలో మాసం ఇంట్లో వుంచుకున్నందుకు లించింగ్  ముఠాలు ఇళ్ళలోనికి దూరి  ముస్లింలను చంపేసిన సంఘటనలున్నాయి. ఆ కేసుల్లో అసలది బీఫో కాదో తేలలేదు.

ఇప్పుడు బీఫ్ ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది.

అందులో ఆవుమాసం కూడ వుందని వార్తలొస్తున్నాయి.

ఏకంగా ఆరెస్సెస్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కుటుంబ సభ్యులే బీఫ్ ఎగుమతి చేస్తూ పట్టుబడ్డారు.

బీఫ్ ఎగుమతిదారుల నుండి బిజెపికి ఏలా భారీ ముడుపులు, పార్టీ ఫండ్స్ బాహాటంగానే అందుతున్నాయి.

బ్యాంకుల్లో వందల వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవాళ్ళు అందరు హిందువులే కావడం, అందులోనూ అత్యధికులు గుజరాతీయులు కావడం అనేక అనుమానాలకు తావ ఇస్తున్నది.  

భారీ కుంభకోణాల్లో చిక్కున్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు బిజెపిలో చేరి రాత్రికి రాత్రి పునీతులైపోతున్నారు.

బిజెపి నేతల చాలా జుగుప్సాకరమైన నేరాలు, అనైతిక ప్రవర్తనలు  ఇటీవలి కాలంలో  వరుసగా బయటికి వస్తున్నాయి.

దేశంలోని సహజవనరులు, ఎనర్జీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్  తదితర రంగాలన్నింటినీ క్రమంగా  అస్మదీయ కార్పొరేట్లకు కట్టబేట్టేస్తున్నారనే వాస్తవం ఇప్పుడు బహిరంగ చర్చగా మారిపోయిం.

ఏప్రిల్ నెలలో అస్సాం, కేరళ, పాండుచ్చెరీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

వీటిల్లో ఆధిక్యత రాకపోయినా మోదీ గ్రాఫ్ పడిపోతున్నదనే ప్రచారం మొదలవుతుంది.

అసలు దేశంలో ఎన్నికలే ఒక అప్రహసనంగా మారిపోయాయి. పోలిగ్ లెఖ్ఖలు హాస్యాస్పదంగా మారిపోయాయి. ఇవిఎంల మాయ నిజమేనని నమ్మేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇన్ని తలవంపుల మధ్య మోదీ తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి మోదీజీ ఒక పని చేయవచ్చని ఒక ప్రచారం జరుగుతోంది.

ఛతీడ్ గడ్ లో మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ భారీగా సాగుతోంది.  

మావోయిస్టుల్ని లేకుండా చేయడానికి మార్చి 31ని గడువు తేదీగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించి వున్నారు.

ఇప్పటికే వందల మంది మావోయిస్టుల్ని ఆయుధాలతోసహా లొంగిపోయేలా చేశారు. అనేక మందిని చంపేశారు. కొందరిని అరెస్టు చేర్శారు. ఇక బహుకొద్దిమంది మాత్రమే లోపలున్నారు. వారిని కూడ ఈ పది రోజుల్లో అరెస్టు చేయడమో, లొంగదీసుకోవడమే చేస్తారు.

వీరినీ, ఇటీవల లొంగదీసుకున్నవారికీ కలిపి ఓ మూడు నాలుగు వందల మంది మావోయిస్టూలతో ఛత్తీస్ గడ్ లో పెద్ద ప్రదర్శన నిర్వహిస్తారు.

మావో యిస్టుల్ని లేకుండా చేస్తాం అన్నాం చేసి చూపించాం అని గొప్పగా ప్రచారం చేసుకోవడానికి రంగాన్ని సిధ్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి జవాబు చెప్పుకోలేని ఆరోపణల పర్వం ఇదొక్కటే వాళ్లకు ఫేస్ సేవిం్ మార్గం.

Wednesday, 18 March 2026

Telugu Regional Literature and the Water Narrative - తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

 తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-     -   / డానీ 




తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-      డానీ

-       

తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం 1970లలో ఒక్కసారిగా ఊపందుకున్నట్టుగా కనిపించినా, దాని వేర్లు అంతకంటే లోతుగా విస్తరించి ఉన్నాయి. ఎమర్జెన్సీ తరువాత ఈ ధోరణి మరింత స్పష్టంగా, ఒక సాహిత్య ధోరణిగా రూపుదిద్దుకుంది. అయితే, ఇది కేవలం సాహిత్య పరిణామం మాత్రమే కాదు; దీనికి వెనుక బలమైన రాజకీయ-ఆర్థిక శక్తులు పనిచేశాయి.

 

సాహిత్య ధోరణులు కేవలం రచయితల వ్యక్తిగత అభిరుచుల ఫలితం కావు. అవి సమాజంలోని రాజకీయార్ధిక సంబంధాల ప్రతిబింబాలు. జాతీయ ఆదాయంలో తమకు న్యాయమైన వాటా కోసం రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల గొడుగుల కింద గొంతు పెంచినప్పుడు, ఆ భావజాలం క్రమంగా సాహిత్యంలో ప్రతిబింబించింది. ప్రాంతీయ ఆత్మగౌరవం, అన్యాయంపై అసంతృప్తి, అభివృద్ధిలో అసమానత — ఇవన్నీ కలిపి ప్రాంతీయ సాహిత్యానికి పునాది వేశాయి.

 

ఈ సాహిత్య ప్రవాహం మొదట ఉత్తరాంధ్ర–కళింగాంధ్ర ప్రాంతాలలో స్పష్టంగా వినిపించింది. అక్కడి రచయితలు తమ భూభాగానికి, జీవన అనుభవాలకు ఒక ప్రత్యేక స్వరాన్ని ఇచ్చారు. ఆ స్వరం తరువాత రాయలసీమకు విస్తరించింది. ఆ తరువాత తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బలంగా వ్యక్తమైంది. ఈ సాహిత్య పరిణామంలో నక్సలైట్  ఉద్యమం ఒక పరోక్ష శక్తిగా పనిచేసింది. అది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాక, సాంస్కృతిక చైతన్యాన్ని కూడా గొప్పగా మేల్కొలిపింది.

 

ఈ మార్పుల వెనుక ఆర్థిక మూలాన్ని ఒక్క పదంలో చెప్పాలంటే — “నీళ్లు”. ప్రాంతీయ సాహిత్యంలో నీళ్లు కేవలం ఒక నేపథ్యం కాదు; అదే కథల కథానాయకగా మారింది అనడం అతిశయోక్తి కాదు. నీటి కొరత, కరువు, వలసలు — ఇవి కథలలో కేవలం సంఘటనలు కాదు; అవే కథను నడిపించే ప్రధాన శక్తులుగా మారాయి.

 

ప్రాంతీయ సాహిత్యం కరువును తన ప్రధాన కథా వస్తువుగా స్వీకరించినప్పుడు, అది సహజంగానే నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాలపై ఒక అంతర్గత విమర్శను నిర్మించింది. ఈ విమర్శ ఎప్పుడూ ప్రత్యక్షంగా బయటపడకపోయినా, దాని అంతర్బావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు నేలలో నీటి సమృద్ధితో గుర్తింపుపొందిన ప్రాంతాలు గోదావరి - కృష్ణా జిల్లాలు. అయితే, అక్కడి సాహిత్యంలో ప్రాంతీయ భావోద్వేగాలు పూర్తిగా లేకపోయాయని  చెప్పడం మరీ సింప్లిఫై చేసినట్టు అవుతుంది. కానీ, నీటి కొరత వంటి తీవ్రమైన అనుభవం అక్కడి సాహిత్యంలో ప్రధాన కథావస్తువుగా మారడానికి ఆస్కారంలేదు.

 

నేను అలాంటి నేల నుంచే వచ్చాను. ఆడపిల్ల మురిపెంగా కాలి గోటి తో నేలను తాకితే చాలు — ఒక జలధార ఉబికి వస్తుందనిపించే భూమి అది. అదే ఒక గిఫ్టెడ్ ల్యాండ్; అదే ఒక కర్స్డ్ ల్యాండ్. ఎందుకంటే, కరువు కథలతో నిర్మితమైన ప్రాంతీయ సాహిత్యం విమర్శించే నేల అదే. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కథలకు జీవంపోస్తే, ఇంకో ప్రాంతంలో నీటి సమృద్ధి కథలకు వస్తువుల కొరతను సృష్టించింది. ఇది ఒక విరుధ్ధ అభాస.

 

అయితే, కృష్ణా–గోదావరి ప్రాంతాల గురించిన ఈ భావన కూడా పూర్తిగా సత్యం కాదు. ఈ జిల్లాలలోని తూర్పు ప్రాంతాల్లో నీటి సమృద్ధి ఉన్నప్పటికీ, పశ్చిమ ప్రాంతాల్లో మెట్టభూములు, అడవి ప్రాంతాలు కరువుతోనే పోరాడుతున్నాయి. ఈ అంతర్గత వైరుధ్యాన్నీ మనం తరచూ విస్మరిస్తుంటాము.

 

నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల రచయితలు సహజంగానే వేరే దిశలో ప్రయాణిస్తారు. వారు స్థూల సామాజిక అంశాలు, తత్త్వశాస్త్ర సమస్యలు, లేదా మనిషి అంతర్గత ప్రపంచాన్ని పరిశీలించే కథల వైపు మొగ్గు చూపవచ్చు. ఈ విభిన్న దృక్కోణాలే తెలుగు సాహిత్యాన్ని సమృద్ధిగా నిలబెడతాయి.

 

ఇటీవల నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణతో, గతంలో కరువుతో బాధపడిన అనేక ప్రాంతాల్లో పరిస్థితులు మారాయి. రాయలసీమలో పండుతున్న సోనా మసూరి ధాన్యం, తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పెరిగిన ధాన్య ఉత్పత్తి — ఇవన్నీ ఈ మార్పులకు సంకేతాలు. ఉత్తర తెలంగాణలో పండే జిరా రైస్ వంటి పంటలకు జాతీయ స్థాయిలో గిరాకీ పెరగడం కూడా ఒక కొత్త ఆర్థిక వాస్తవాన్ని సూచిస్తోంది.

 

అయితే, ఈ మార్పుల ప్రభావం సాహిత్యంలో అంత త్వరగా ప్రతిబింబించలేదు. కరువు కథలకు అలవాటు పడిన రచయితలు, మారిన వాస్తవాలను పట్టుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నారు. కథలు, నవలలు రాయడంలో సులభ మార్గాలను వెతుక్కోవడం ఒక ధోరణిగా మారుతోంది. 1980–90లలో వచ్చిన ఉనికివాదాలు కొంతకాలం కొత్త ఆకర్షణగా నిలిచినా, కాలం మారినా రచయితల దృక్కోణం అంతగా మారలేదనిపిస్తుంది.

 

మలిదశ తెలంగాణ ఉద్యమం ఆంధ్రా ప్రాంతం నుండి వలసవచ్చిన వారిపై ఎక్కుపెట్టింది. నిజానికి తమ ప్రాంతంలో పెరుగుతున్న పెట్టుబడి సంచయనం మీద పోరాడాల్సిన సమయంలో ప్రాంతీయవాదానికి పరిమితమైంది. రాష్ట్ర విభజన తరువాత విజృభించిన పెట్టుబడీ సంచయనంతో ఎలా వ్యవహరించాలో ప్రాంతీయవాద సాహిత్యానికి అర్ధం కాలేదు. అది ఇప్పటికీ కన్వీనియంట్ గా పాత పాటలే పాడుతోంది.

 

ఈ స్థితికి కారణం ఏమంటే, చాలా మంది రచయితలు తమకు అనువైన ఒక సాహిత్య స్థలాన్ని ఎంచుకుని, దానిలోనే స్థిరపడిపోతున్నారు. తమ రచనలు పాక్షిక వాస్తవాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయన్న అవగాహన కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఈ పెరిఫెరల్ సౌకర్యం, సాహిత్యానికి మాత్రమే కాదు, సమాజానికీ హానికరం.

 

కథకుడికి కావలసింది కేవలం రచనా నైపుణ్యం మాత్రమే కాదు; సమాజాన్ని అర్థం చేసుకుని మార్చే తత్త్వదృష్టి కూడా కావాలి. ప్రస్తుతం ఆ తత్త్వదృష్టికే కరువు ఏర్పడింది. కార్పొరేట్–కమ్యూనల్ నియంతృత్త్వం పెరుగుతున్న ఈ కాలంలో, ఆ వాస్తవాన్ని కథా వస్తువుగా స్వీకరించినప్పుడే తెలుగు సాహిత్యం కొత్త జవసత్వాలను పొందుతుంది.

 

ప్రాంతీయవాదం ఒక దశలో అవసరమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ, అదే ఒక సౌకర్యవాదంగా మారినప్పుడు, అది తన తొలినాటి శక్తిని కోల్పోతుంది. కాబట్టి, ప్రాంతాన్ని దాటి, సమాజపు విస్తృత వాస్తవాలను ఆవిష్కరించే దిశగా తెలుగు సాహిత్యం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.

 

(ఖదీద్ బాబు రైటర్స్ మీట్‌లో 15 మార్చి 2026న చేసిన ప్రసంగం ఆధారంగా)


Saturday, 7 March 2026

జన్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి

 

జన్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి

 

డానీ

సమాజ–రాజకీయ విశ్లేషకుడు

రాజకీయాల్లో ధార్మిక భావోద్వేగాలకన్నా ఆర్ధిక  ప్రయోజనాలే ముఖ్యం.  అమెరికా–ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుధ్ధంలో ఈ అంశం మరోసారి స్పష్టమైంది. 

భారతీయ ముస్లింలు ఇక్కడే పుడతారు, ఇక్కడే జీవిస్తారు, ఇక్కడే చనిపోతారు — ఇది వారి జన్మభూమి, కర్మభూమి. అయితే, కొందరు హిందూత్వ సిద్ధాంతకర్తలు “పుణ్యభూమి” ప్రమాణంతో దేశభక్తిని కొలిచే ప్రయత్నం చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్, గురూజీ ఎంఎస్ గోల్వార్కర్ మాతృభూమి–కర్మభూమి–పుణ్యభూమి మూడూ కలిసినప్పుడే సంపూర్ణ జాతీయత్వం సాధ్యమవుతుందని  వాదించారు.

భారత ముస్లింలు, క్రైస్తవులకు పుణ్యభూములు భారత దేశం ఆవల వున్నాయి. అప్పట్లో కమ్యూనిస్టుల ‘పుణ్యభూమి’ (ప్రపంచ విప్లవ కేంద్రం)  కూడ రష్యాలో వుండేది. పుణ్యభూమి దేశానికి బయట వున్నవారితో దేశానికి అంతర్గత ముప్పు వుంటుందనేది వారి సిధ్ధాంతం.

పుణ్యభూమి ప్రమాణంతో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని అన్యులుగా నిందించడానికి సావర్కర్ తదితరులు రూపొందిన సిధ్ధంతం ఇది.

ఇలాంటి ప్రమాణాలని భారత రాజ్యాంగం    అంగీకరించదు. పౌరసత్వానికి  మతవిశ్వాసాలు ప్రమాణీకం కానేకాదు. అంతర్జాతీయ సంఘటనలను దేశీయ విధేయతతో కలపడం ప్రమాదకరం. అనేవి ఆధునిక రాజ్యాంగాల ఆద్ర్శాలు.  

ఇస్లాం పుణ్యక్షేత్రాలయిన మక్కా, మదీన సౌదీ అరేబియాలో వున్నాయి. మూడో పుణ్యక్షేత్రం అయిన అల్ ఆక్సా మసీదు జెరూసలేంలో వుంది. సావర్కర్, గోల్వార్కర్ సిధ్ధాంతం ప్రకారం  భారత ముస్లింలు ఇప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ ల పక్షం వహించాలి. కానీ తద్విరుధ్ధంగా జరుగుతోంది. అమెరికా పంచన చేరిన సౌదీ అరేబియాను ఇప్పుడు భారత ముస్లింలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ఇజ్రాయిల్ ఇస్లాం వైరం ఈనాటిదికాదు.

గతంలో ప్రస్తుతం ఆక్సా మసీదు మీద పాలస్తీన, ఇజ్రాయిల్ లకు ఉమ్మడి అధికారం వుండేది.  ప్రస్తుతం అల్ ఆక్సా మసీదును ఇజ్రాయేల్ పూర్తిగా  స్వాధీనం చేసుకుంది. యుధ్ధానికి రెండు రోజులు ముందు జరిపిన  ఇజ్రాయిల్ పర్యటనలో  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాదర్ ల్యాండ్ అనే పదాన్ని వాడారు. అంచేత ఇప్పుడు ముస్లింల పుణ్యక్షేత్రం కూడ బిజెపి అభిమానులకు గొప్పదేశం అయిపోయింది.

అలాగే, రెండు గొప్ప ముస్లిం పుణ్యక్షేత్రాలున్న సౌదీ ఆరేబియా సహితం ప్రస్తుతం ఇజ్రాయీల్, భారత్ తోపాటు అమెరికా క్యాంపులో  వుంది. అంచేత, సౌదీ అరేబియా కూడ ఇప్పుడు సంఘపరివారానికి  బ్రదర్ లాండ్ లెఖ్ఖ. అమెరికా పక్షం వహించే దేశాలను  ఇండియాలో ఎవరు దూషించినా సరే సంఘపరివారం సోషల్ మీడియా వాళ్ళను దేశద్రోహులు అనడానికి  కూడ వెనుకాడడం లేదు. ఇరాన్ యుధ్ధాంలో సౌదీ అరేబియా వైఖరిని ఎవరు తప్పుపట్టినా సంఘపరివారం సోషల్ మీడియా ట్రోల్స్ వెంటాడుతున్నారు.   పుణ్యభూమి, దేశభక్తి కథ  ఎక్కడి నుండి ఎక్కడికి చేరిందో చూడండి.

Friday, 6 March 2026

Iran can be destroyed; but not alone.

 ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇరాన్ యుధ్ధం మీద నా వ్యాసాన్ని ప్రచురించింది. ప్రచురణకర్తలకు ధన్యవాదాలు.

*ఇరాన్ ధ్వంసం కావచ్చు; కానీ ఒంటరిగా కాదు!*

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:10 AM



అమెరికా–ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో తొలిరోజే చనిపోయిన సయ్యిద్ అలీ హుసైనీ ఖమేనీ గొప్ప ప్రజాదరణ పొందిన నేత ఏమీకాదు. నిస్సందేహంగా అతనొక నియంత. కానీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా సామ్రాజ్యవాదానికి పచ్చి వ్యతిరేకి. ఇరాన్ చమురు కొనే దేశాలు ఆ మొత్తాన్ని తమ దేశ కరెన్సీలో చెల్లించవచ్చని పెద్ద ఆఫర్ ఇచ్చినవాడు, అమెరికా ఆర్థిక మనుగడకు ప్రాణప్రదమైన డాలర్ ఆధిపత్యానికి గట్టి సవాలు విసిరినవాడు ఖమేనీ. ఇరాక్ సద్దాం హుస్సేన్, లిబియా మువమ్మర్ గడాఫీల దారిలో అలీ ఖమేనీ కూడా ఇప్పుడు అమరవీరుల జాబితాలో చేరాడు.

అంతర్జాతీయ చమురు వనరుల మీద అమెరికా గుత్తాధిపత్యాన్ని సాగించాలనుకుంటున్నది. అందులో భాగంగా రెండు నెలల క్రితం సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్‌లను కిడ్నాప్ చేసి అమెరికా జైలులో బంధించడాన్ని ప్రపంచం చూసింది. ఆ తరువాతి వంతు ఇరాన్ అగ్రనేతదే అని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అలీ ఖమేనీకి కూడా తెలుసు. అయినా, అతడు భయపడలేదు. అమెరికాకు సరెండర్ కాలేదు. ఓ ట్రేడ్ డీల్ చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికాకు తాకట్టుపెట్టలేదు. భార్యా పిల్లలతో సహా చనిపోవడానికి సిద్ధపడ్డాడు; చనిపోయాడు.

భారత ముస్లింలలో సున్నీలు 85 శాతం, షియాలు 15 శాతం. నేటి ఇరాన్ జనాభాలో షియాలు 90–95 శాతం. సున్నీలు 5–10 శాతం. ధార్మిక శాఖా భేదాల ప్రకారం, భారత ముస్లింలు ఇరాన్‌ను వ్యతిరేకించాలి; సౌదీ అరేబియాను సమర్థించాలి. కానీ అలా జరగడం లేదు. భారత ముస్లింలు మాత్రమే కాదు, ప్రపంచ ముస్లింలు ఇప్పుడు సౌదీ అరేబియాను వ్యతిరేకిస్తూ ఇరాన్ పక్షం వహిస్తున్నారు! ఇక్కడ ధార్మిక శాఖా భేదాలకన్నా అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రధానంగా మారింది.

ఇరాన్ ఇవ్వాళ అమెరికా–ఇజ్రాయెల్ కూటమితో మాత్రమే పోరాడడం లేదు. అమెరికాకు సైనిక స్థావరాలు ఏర్పాటు చేసిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, జోర్డాన్ తదితర ముస్లిం దేశాలతోనూ ఒకే సందర్భంలో పోరాడుతోంది.

ఇరాక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వం ఈ యుద్ధానికి దూరంగా ఉండాలనుకుంటున్నది. అయితే, అక్కడి సైన్యం మీద ప్రభుత్వానికి పెద్దగా పట్టులేదు. అది ఇరాన్ పక్షం వహించాలనుకుంటున్నది. అదీగాక ఇరాక్‌లోని కతీబ్ హిజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలు కూడా అమెరికా వ్యతిరేకతతో ఇరాన్‌కు మద్దతు పలుకుతున్నాయి.

ఇరాన్‌లో చైనా పెట్టుబడులున్నాయి. ఆ దేశంతో భౌగోళిక, రాజకీయ అవసరాలున్నాయి. అయినప్పటికీ అమెరికాతో నేరుగా ఢీకొనడానికి చైనా సిద్ధంగా లేదు. అమెరికా దురుసుతనం మీద పరిమిత నిరసనను వ్యక్తం చేసి ఊరుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో మునిగి ఉన్న రష్యా సైతం తన మిత్రదేశమైన ఇరాన్‌కు ప్రత్యక్ష సహకారం అందించే స్థితిలో లేదు. కంటి తుడుపుగా మద్దతిచ్చి సరిపెట్టుకుంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతాయి కాబట్టి, అలా అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని పుతిన్ భావిస్తున్నారు.

ఇరాక్‌ను ధ్వంసం చేయాలనుకున్నప్పుడు సద్దామ్ హుస్సేన్ జీవరసాయన ఆయుధాలను తయారు చేసి ప్రపంచ వినాశనానికి కుట్ర చేస్తున్నాడని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, యూకే ప్రధాని టోనీ బ్లెయిర్ తెగ ప్రచారం చేశారు. సద్దాం హుస్సేను ఉరి తీశాక, ఇరాక్ అంతటా వెతికినా అలాంటి ఆయుధాల జాడ ఎక్కడా కనిపించలేదు. వెనెజువెలా చమురును స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని అమెరికా ప్రచారం చేసింది. ఆ సంప్రదాయంలోనే ఇరాన్ అణ్వాయుధాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నట్టు కొన్నాళ్ళుగా అమెరికా ప్రచారం చేస్తున్నది. ఏకంగా దేశాధినేత చనిపోయినా సరే, వైరి దేశాలపై ఇరాన్ ఇప్పటిదాకా అణ్వాయుధాలను ప్రయోగించలేదంటే అర్థం ఏమిటి?

అబద్ధాలను ప్రచారం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ గత అమెరికా అధ్యక్షులందర్నీ మించిపోయారు. తానే ప్రపంచ పోలీసు, ప్రపంచ జడ్జి అనుకుంటున్నారు. ఇప్పుడైతే మరీనూ, తానో ప్రపంచ మొనగాడు అనుకుంటున్నారు.

యుద్ధాలు మొదలుపెట్టడం సులభం; ముగించడం కష్టం. యుద్ధాలను మొదలు పెట్టినవారి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పడం కూడా కష్టమే. చరిత్ర చెప్పేది ఒకటే– పెద్ద యుద్ధాలు ప్రత్యర్థిని మాత్రమే కాదు, ప్రారంభించిన వారినీ మార్చేస్తాయి. అమెరికాకు వియత్నాం ఎలా గుణపాఠమైందో, ఈ యుద్ధం కూడా అలాగే మరో అంతర్జాతీయ పాఠంగా మిగిలే అవకాశం ఉంది.

ఈ యుద్ధంలో ఇరాన్ ధ్వంసం కావచ్చు; కానీ ఒంటరిగా అయితే కాదు!

- డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకుడు

Updated Date - Mar 07 , 2026 | 01:12 AM

Sunday, 1 March 2026

Ashok Parmar - అశోక్ పార్మర్ జీవితం ఇస్తున్న హామీ!*

 *అశోక్ పార్మర్ జీవితం ఇస్తున్న హామీ!*

ఈరోజు సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది. 

ప్రచురణకర్తలకు ధన్యవాదాలు. 


-      డానీ  

రాజకీయ, సమాజ విశ్లేషకులు





 




గుజరాత్ అల్లర్ల సందర్భంగా రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది; అశోక్ పార్మర్ ది. కుడిచేతిలో ఇనపరాడ్డు పట్టుకుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అల్లర్లలో అతను వీరావేశంతో చెలరేగిపోయాడు. రోడ్ల మీద దొరికిన ముస్లింలందరీ  తలలు పగులగొట్టాడు. ఆ రాక్షసానందంలో మీడియాకు మంచి పోజులిస్తూ  జాతీయ అంతర్జాతీయ గుర్తింపును పొందాడు.

 

గుజరాత్ అల్లర్లకు కిరీటధారులు, సూత్రధారులు, అమలుకర్తలు   వేరేగావున్నారు.   ఆ అల్లర్ల నిర్వాహకులు ఎస్సి, బిసి సామాజికవర్గాలకు చెందిన వారిని పెద్దఎత్తున సమీకరించి విశాలమైన కాల్బలాన్ని  నిర్మించారు.  అశోక్ పార్మర్ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.

 

1970ల నాటి గుజరాత్ లో  బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజికవర్గాలు రాజకీయరంగాన్ని శాసించేవి. దానికి విరుగుడుగా ఒక కొత్త సామాజిక కూర్పును కాంగ్రెస్ నాయకుడు మాధవ్  సింగ్  సోలంకీ రూపొందించారు. క్షత్రీయులు, హరిజనులు, ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీకరణను ఖామ్ (KHAM) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు  56 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో  142 స్థానాలు దక్కాయి.  అలా దెబ్బతిన్న పటేల్ సామాజికవర్గం హిందూ  సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బిసి రిజర్వేషన్’ వ్యతిరేక  ఉద్యమం వాళ్లకు కలిసి వచ్చింది. దానితో, ఖామ్ బలహీనపడింది. హిందూ సమాజంలో అణగారిన సామాజికవర్గాలు కాంగ్రెస్ కు దూరం అయ్యారు.  బిజెపికి దగ్గరయ్యారు. గుజరాత్ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి చెలరేగిపోయాయి.

 

అశోక్ పార్మర్ మాదిగ  సామాజికవర్గానికి చెందిన వాడు. అల్లర్ల కిరీటధారులు, సూత్రధారులు, అమలుకర్తలు   అతనికి సామాజిక అణిచివేత నుండి విముక్తిని ప్రసాదించారు. ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేఛ్ఛను ఇచ్చారు. కొత్తగా లభించిన స్వేఛ్చతో అతను చెలరేగిపోయాడు.  ప్రాణభయంతో పారిపోతున్న వారి పట్టుకుని తలలు పగులగొడుతూ వీలయినంత ఆనందాన్ని జుర్రుకున్నాడు.

 

ఆ అల్లర్లలో లించింగ్ మాబ్ కు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ  దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో  కుతుబుద్దీన్ అన్సారి ఒకరు.  నిస్సహాయ స్థితిలో   చేతులు జోడించి వేడుకుంటున్న అన్సారి ఫొటో కూడ అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

 

గుజరాత్ అల్లర్లు జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు.  మనుషుల్ని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. అప్పట్లో చాలామంది గుజరాత్ ముస్లింల పరిస్థితి ఇదే. మానవజాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవియ వాతావరణం అది.

 

మరోవైపు, అశోక్ పార్మర్ కు     వాస్తవ సాంఘీక జీవితం  గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వహణలో తనది కాల్బలం పాత్ర మాత్రమేనని అతనికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని కోరుకుంటే తమ సామాజికవర్గ మీద కూడ అల్లర్లు జరుగుతాయని అతనికి కొంచెం ఆలస్యంగా అర్ధమయ్యింది. తను చాలా తప్పుచేశానని పశ్చాత్తాప  పడ్డాడు. ఇనపరాడ్డును పడేశాడు. నెత్తినకట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు.. తన కులవృత్తి అయిన చెప్పులు కుట్టుకోవడం మొదలెట్టాడు. కుతుబుద్దీన్ అన్సారీని వెతికి పట్టుకున్నాడు. తన చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్కరించడానికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కారంగా ముగిసింది.

 

ఇవ్వాల్టి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ అప్రతిహత శక్తిగా కనిపిస్తున్నమాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని చాలామంది అనుకుంటున్న మాట కూడ నిజమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమంలేదు. ఇండియా బ్లాక్ సమిష్టిగా లేదు. రాహుల్ గాంధీ వుండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్ అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడంలేదు. మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాయుధపోరాటం సాగిస్తామన్న మావోయిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోయారు.  ఇలాంటి నేపథ్యంలో  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఓడించగలమనే ఊహ కూడ దుస్సహాసం అనేలా వుంది.

 

కానీ,  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్  కాల్బలం దానిదికాదు అని అశోక్ పార్మర్ కథ చెపుతోంది. ఈరోజు కాకపోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్ పార్మర్లు బయటికి వస్తారు. మరో కోరేగావ్ యుధ్ధం జరగవచ్చు.  అప్పుడు కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది.

 

1 మార్చి 2026


Published : 15 March 2026 


https://epaper.sakshi.com/Hyderabad_Main?eid=123&edate=15/03/2026&pgid=824087&device=desktop&view=3