భౌతిక పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 27 August 2023
Objective conditions and subjective efforts
Objective conditions and
subjective efforts
భౌతిక
పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
పుట్టిన రోజు సందర్భంగా కొన్ని
వందల మంది సోషల్ మీడియా ద్వార శుభాకాంక్షలు తెలిపారు. సన్నిహిత మిత్రులు ఫోన్
కాల్స్ ద్వారనూ మరి కొందరు వ్యక్తిగతంగానూ కలిసి అభినందించారు. కొడుకులిద్దరు
వాళ్ల అభిరుచి మేరకు ఓ విందు జరిపారు.
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
గుంటూరు లక్ష్మీ నరసయ్య తదితరులు
నా గురించి చాలా గొప్పగా రాశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గొప్పతనం అంతా
నాదికాదని నాకు తెలుసు. నేను పుట్టి పెరిగిన కాలానికీ, ఆయా దశల్లో నా పరిసరాల్లో
వున్నవారికీ నాకు బతుకు మార్గం చూపినవారికీ ఈ గొప్పతనంలో పెద్దవాటా దక్కుతుంది.
కష్టాల్లోవున్నవాళ్ళు, వివక్షకు గురయ్యేవాళ్ళు
అత్యంత సహజంగానే సమానత్వాన్ని కోరుకుంటారు. వీళ్ళు సహజ సామ్యవాదులు; ఆర్గానిక్
కమ్యూనిస్టులు. నా విషయంలోనూ అదే జరిగిందనుకుంటాను. పేదరికాన్ని అనుభవిస్తూ, బాలకార్మికునిగా
జీవితాన్ని ఆరంభించిన కారణంగా నేను చిన్నప్పటి నుండే సమానత్వాన్ని కోరుకునేవాడిని.
నన్ను ఎవరూ ఓదార్చనందుకేనేమో మరొకర్ని ఓదార్చడంలో నాకు చాలా ఆనందం
కలుగుతుంది.
కార్ల్ మార్క్స్ పేరు కూడ
వినకుండానే, పేదోళ్ల ఆవేదన, వున్నోళ్ల అత్యాశను ఘర్షణ అంశంగా తీసుకుని ‘ప్రగతి’
నాటిక రాశాను. దానికి ధవళా సత్యంగారు
దర్శకత్వం వహించారు. ఎంజి రామారావుగారు చాలా ప్రోత్సహించారు. వారే మాక్సిమ్ గోర్కి
‘అమ్మ’ నవలను నాకు బహుమతిగా ఇచ్చారు. అందులో నాకేదో జీవనమార్గం కనిపించింది. ఆ తరువాత
మరికొన్ని నాటకీయ మలుపులు తిరిగి ఎమర్జెన్సీ తరువాత నన్ను నక్సలైట్ గా మార్చింది. ఆ
తరువాతి కథ మీకందరికీ తెలుసు.
సాహిత్యం నేరుగా సమాజాన్ని
మార్చలేదుగానీ పాఠకుల ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. కొత్త ఆలోచనలతో పాఠకులు
సమాజాన్ని మార్చే శక్తిని పుంజుకుంటారు. అలా సాహిత్యం పరోక్షంగా భౌతిక శక్తిగా
మారుతుంది.
“డానీ కథలు చదువుతుంటే ఇతను మిగతా వ్యాపకాలన్నీ వదిలి కథలు మాత్రమే రాసి ఉంటే తెలుగు సాహిత్యానికి గొప్ప కధకుడు లభించి వుండేవాడనిపిస్తుంది” అన్నాడు గుంటూరు
లక్ష్మీనర్సయ్య. చాలా ఆనందం వేసింది. లక్ష్మీనర్సయ్య వాక్యానికి తెలుగు సాహిత్య
విమర్శలో మంచి విలువ వుంది. అయితే, నేను సోషల్ యాక్టివిస్టుగా వుండడానికే ఎక్కువ
ఇష్టపడతాను. ఒక చారిత్రక సందర్భంలో అత్యవసరమైన అంశాన్ని ఇతర కథకులు రాయకపోవచ్చు అనుకున్నప్పుడు
మాత్రమే నేను కొన్ని కథలు రాశాను. భావోద్వేగాలను చిత్రించడానికి ఎన్నికథలయినా
రాయవచ్చు. రాజ్యాన్ని
మార్చాలనుకునే లక్ష్యం వుంటే రాజకీయ కథలు మాత్రమే రాయాలి అనే కోవకు చెందినవాడిని. నా
అభిప్రాయం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, రాజకీయంతోతప్ప రాజ్యాన్ని మార్చలేము.
విప్లవం ఒక రాజకీయ చర్య.
మన వ్యక్తిగత ప్రతిభ, నైపుణ్యాలు,
ఆశయాలు, లక్ష్యాలు అన్నింటినీ మన కాలం ప్రభావితం చేస్తుంటుంది. “అప్పుడు కాలం
కడుపుతో వుండింది; కార్ల్ మార్క్స్ ను కనింది” అన్నాడు మయకోవిస్కీ. చారిత్రక,
సామాజిక, తాత్విక పార్శ్వాలున్న కవిత్వ వ్యక్తీకరణ అది. భౌతిక వాస్తవికత; వ్యక్తిగత ప్రయత్నం
(Objective conditions and subjective efforts) రెండింటి మధ్య సమన్వయం కుదరాలి అన్నాడు
కార్ల్ మార్క్స్.
మా తరం స్వాతంత్య్రానంతర భారత
దేశంలో పుట్టింది. మేము హైస్కూల్ ను వదిలి కాలేజీలో చేరుతున్న కాలంలో నక్సల్ బరీ
ఉద్యమం మొదలయింది. రాజ్యాంగం ప్రవచించిన ప్రజాస్వామిక ఆదర్శాలకూ ప్రభుత్వాధినేతల
ఆచరణకు మధ్యనున్న వైరుధ్యాన్ని పరిష్కరించడానికే నక్సల్ బరీ గర్జించింది.
మొద్దుబారిపోతున్న భారత సమాజాన్ని మేల్కొల్పడానికి హైవోల్టేజ్ షాక్ ట్రీట్మెంట్
ఇచ్చాడు చారు మజుందార్. అనేక సంస్కరణలు, అనేక ఉద్దీపన చర్యలు నక్సల్ బరికి భయపడే
వచ్చాయి. నాటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నుండి, ఎన్టీ రామారావు కిలో బియ్యం రెండు
రూపాయాలు మొదలు జగన్ నవరత్నాలు వరకు అన్నీ నక్సల్ బరీ వెలుగులోనే వచ్చాయి. రాజ్యాంగ
ప్రవేశికలో సామ్యవాదం చేరింది కూడ నక్సల్ బరీ భయంతోనే. ఆ పక్కనే అనేక నల్ల చట్టాలు
కూడ వచ్చాయి. అది వేరే కత.
నేను సరైన కాలంలో పుట్టడంవల్లనే
కొండపల్లి సీతారామయ్య, కెజి సత్య మూర్తి, ఐవి సాంబశివరావులతో రాజకీయాల్లో కలసి
పనిచేయగలిగాను. పీపుల్స్ వార్ తో అనుబంధాన్ని నేను చాలా గొప్పగా ఆస్వాదించాను. శ్రీశ్రీ, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు,
కేవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్ లతో కలిసి పనిచేసే
అవకాశం దక్కింది. ఇక్కడ పేర్కొనాల్సిన మరో ఇద్దరు ముఖ్యులు ఆర్ ఎస్ రావు, ఎంటి
ఖాన్ గార్లు. వరవరరావుతో అనుబంధాన్ని నేను
ఒక వరంగా భావిస్తాను. అల్లం రాజయ్య, బిఎస్ రాములు, ఎన్ వేణుగోపాల్, అట్టాడ
అప్పల్నాయుడు తదితరులు నా సమకాలీనులు
కావడం గొప్ప అవకాశంగా భావిస్తాను. గొప్ప
సమకాలికులు లేకుండ ఎవరూ గొప్పవారు కాలేరు. విరసం బయట జిలుకర శ్రీనివాస్, భార్గవ
గడియారం, ఉసా నాకు ఇష్టం.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి మొదలు
నేటి ఎంఎల్, మావోయిస్టు పార్టీల వరకు అన్నీ సమసమాజ స్థాపన కోసం తమ ‘వ్యక్తిగత
ప్రయత్నాలను’ దాదాపు నిజాయితీగానే సాగించాయి. కానీ, భారత ‘సమాజ భౌతిక వాస్తవికతను’
అర్ధం చేసుకోవడంలో పాక్షికంగానో, సంపూర్ణంగానో అవి విఫలం అయ్యాయి. వివక్ష కేవలం
అర్ధిక రూపంలో మాత్రమే సాగదనీ, కుల, మత, తెగల, సాంస్కృతిక రూపాల్లో కూడా
సాగుతుందని స్వయంగా మార్క్స్ చెప్పిన మాటల్ని గుర్తించడంలో భారత కమ్యూనిస్టు
పార్టీలకు హ్యాంగోవర్ ఇబ్బందులున్నాయి. సిధ్ధాంత పరంగా ప్రాణప్రదమైన ఈ అంశాన్ని
పరిష్కరించుకోనంత వరకు ప్రస్తుత ఫాసిస్టు వ్యవస్థ విసురుతున్న సవాళ్ళను అవి
ఎదుర్కోలేవు. ఫాసిజం రూపంలో సాంస్కృతికమైనది; సారంలో ఆర్ధికమైనది. సాంస్కృతిక
రంగంలో అది ముస్లింలు, క్రైస్తవుల్ని అణిచివేస్తుంది. ఆర్ధిక రంగంలో దేశసంపదను అస్మదీయ
కార్పొరేట్లకు అప్పగించడానికి అది ముస్లింలు, క్రైస్తవుల్నేకాక, హిందూ సమాజాన్ని
సహితం అణిచివేస్తుంది.
కమ్యూనిస్టు పార్టీలు చేసే సైధ్ధాంతిక
చారిత్రక తప్పిదాలు వాటికే పరిమితంకావు; అవి సామ్యవాద సిధ్ధాంత ఆమోదాంశానికే ముప్పుగా
మారుతాయి. సరిగ్గా ఇక్కడే నేను కమ్యూనిస్టు పార్టీల నాయకులతో విభేధిస్తుంటాను.
మెయిన్ ల్యాండ్ ఇండియాలో 1984లోనే
మత యుధ్ధం మొదలయింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తెగ హననం కొనసాగుతోంది. ఈ పరిణామాల్ని
ఇప్పుడు ఎక్కువమంది గుర్తిస్తున్నారు.
ఉద్యమ జీవితంలో రెండుసార్లు చావు
నా ముందు కనిపించింది. చావు కొంచెం అందంగా వుండాలనే చిన్న కోరిక తప్ప చావుకు
భయపడింది ఎన్నడూ లేదు. యాధృఛ్ఛికంగా నేను పఠాన్ తెగకు చెందినవాడిని. మొరటోళ్ళం
అన్నమాట!
స్త్రీలు బాల్యంలో తల్లిదండ్రుల
నీడన, యవ్వనంలో భర్త నీడన, వృధ్ధాప్యంలో పిల్లల నీడన బతకాలనేది స్మృతి వాక్యం.
నన్ను బాల్యంలో మా అమ్మీ ప్రెజెంటబుల్ గా వుంచింది. యవ్వనంలో నా భార్య అజిత
ప్రెజెంటబుల్ గా వుంచింది. ఇప్పుడు కొడుకులిద్దరు కలిసి ప్రెజెంటబుల్ గా
వుంచుతున్నారు. కొన్ని అంశాల్లో నాకు స్వేఛ్ఛలేదు. నిన్నటి పార్టీ అలాంటిదే.
ఇటీవల మిజోరం వెళ్ళి శరణార్ధి
శిబిరాల్లో కుకీ జోలను పరామర్శించి వచ్చినందుకు చాలా మంది నన్ను
మెచ్చుకుంటున్నారు. పది మంది మిత్రుల గుప్త సహకారం లేకుండా ఈ పనిని నేను చేయగలిగి
వుండే వాడిని కాదు. అది objective condition. నేను వారందరికీ రుణపడి వున్నాను.
ఇలాంటి భౌతిక వాస్తవికత సహకరించినంతవరకు
నా వ్యక్తిగత ప్రయత్నానికి ఎలాంటి లోటు రానివ్వను. నా శక్తి సామర్ధ్యాలు
పరిమితమైనవని నాకు స్పష్టంగా తెలుసు. కష్టాల్లో వున్నవారిని పరామర్శించం ఒక్కటే
ఇప్పుడు నేను చేయగలుగుతున్న పని. ఆ
కర్తవ్యాన్నీ ఇకముందు కూడ ఎలాగూ చేస్తాను. అయితే, వాళ్ళను కష్టాల నుండి బయట పడేసే
శక్తి నాకులేదు. దానికి సమూహ శక్తి కావాలి. అయినప్పటికీ శరీరం మెదడు సహకరించినంత
వరకు నా subjective effortsకు లోటు రానివ్వను; అది ఎంతటి రిస్క్ అయినా సరే.
పుట్టిన రోజున ఇది నా కొత్త
నిర్ణయం.
మీ
ప్రేమాభిమానాల్ని కోరుకునే
ఉషా ఎస్ డానీ
27 ఆగస్టు 2023
with Kuki Zo boy at Relief camp in Aizawl, Mizoram on 7th
August 2023
Friday, 25 August 2023
Hallucinations and Four phone calls
ఒక చిత్తభ్రమ నాలుగు ఫోన్లు.
మీరు నామీద చాలా కోపంతో వున్నారు.
అది చాలా సహజం.
మీరు ఒక్కరే కాదు నన్ను చాలామంది ద్వేషిస్తారు.
స్వతహాగా నేను కొంచెం చెడ్డ వాడిని
చాలా అబధ్ధాలు చెపుతాను.
మహాభారతంలో వుండే భీష్ముడు నేను క్లాస్ మేట్లమి. ఆ విషయం
ఎవరికీ చెప్పను. నా వయస్సు తెలిసిపోతుందని భయం. నాకు పెళ్ళయిందనీ, పెళ్ళంతోపాటు
పెళ్ళీడుకు వచ్చిన కొడుకులు వున్నారని కూడ ఎవరికీ చెప్పను.
అడవుల్లో, కొండల్లో, మైదానాల్లో బికారీలా నడిచి నడిచి నా
తుంటి కీళ్ళు అరిగిపోయాయనీ, వాటిని తీసేసి కొత్తవి అమర్చాలని డాక్టర్లు
చెప్పినపుడు అది మీకు తెలియకుండ జాగ్రత్త పడ్డాను.
తుంటి కీళ్ళు అరిగిపోయిన వాళ్లను ఏ అమ్మాయీ ఇష్టపడదు కదా
అందుకన్న మాట!
ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి ఒక పథకం ప్రకారం ఆడిన
అబధ్ధాలు.
అందంగావున్నారు; పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు.
రాస్తున్నారు; పాడుతున్నారు, ఉపన్యాసాలిస్తున్నారు, సెలబ్రెటిగా ఎదుగుతున్నారు.
స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు.
ఇన్ని గొప్ప లక్షణాలు వున్నామెను ఎవరూ వదులుకోరుకదా!
మీకు కొంచెం అమాయికత్వం కూడ వుంది. బుట్టలో వేసుకోవడం సులువు.
నాది కొంచెం మొరటు వ్యవహారం.
బుర్ర తక్కువ; భ్రమలు ఎక్కువ.
తరచూ చిత్తభ్రమలు కూడ వస్తుంటాయి.
Hallucinations అన్నమాట.
మీరు నాకు రాధాకృష్ణుల ప్రేమ పెయింటింగ్స్ పంపిస్తున్నట్టు
ప్రతి రోజూ ఉదయం చిత్తభ్రమ కలిగేది.
ఒకరోజు ఏకంగా మిక్కి మౌస్, అతని భార్య కలిసి రాక్ అండ్ రోల్
డాన్సు చేస్తున్న ఫొటోను మీరు పంపినట్టు చిత్తభ్రమ కలిగింది.
దానికింద “హమ్ ఔర్ ఆప్” అని క్యాప్షన్ రాసినట్టూ అనిపించింది.
ఈ చిత్తభ్రమ నాకు నచ్చింది.
పిచ్చోళ్లకు ఇలాంటి భ్రమలు బాగా నచ్చుతాయిగా.
ఆ తరువాత నా చిత్తభ్రమల స్థాయి పెరిగింది. మెడికల్ భాషలో
క్రానిక్ దశ అంటారు.
నా భార్య నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకొమ్మని
మీరు ఫోన్ చేసి అడిగినట్టు ఒకరోజు చిత్తభ్రమ కలిగింది.
కొంచెం చదువు తక్కువ కావడాన NOC కి నాకు సరైన అర్ధం
తెలియలేదు. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి నా భార్య నుండి అనుమతి
తీసుకొమ్మంటున్నారని అనుకున్నాను.
మీరేమీ తప్పుగా అనుకోవద్దు;
పిచ్చోళ్లకు అలాంటి వైల్డ్ ఆలోచనలు వస్తుంటాయి లెండి.
ఆ చిత్తభ్రమలోనే నేను నా భార్యను NOC అడిగేశాను.
నాలాగ ఆమెకు
చిత్తభ్రమలు లేవు. చెడామడా చెత్తగా తిట్టేసింది.
అక్కడితో ఆగకుండ ఫోన్ చేసి మీకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసింది.
మీకూ చిత్తభ్రమలు లేవు; మీరు చాలా ప్రాక్టికల్ వుమన్.
మీ గురించి మీ అనుమతి లేకుండా ఏవేవో ఊహించుకున్నందుకు నామీద
పరువునష్టం దావా వేయమంటూ అడ్వకేట్ కు ఫోన్ చేశారు.
నా భార్య నాకు ఫోన్ చేసింది.
“మనిద్దరికి కుదరదు. నువ్వు ఆమెతోనే సెటిల్ అవ్వు. గుడ్ బై
“అంది.
నన్ను విడిచి నా భార్య వెళ్ళిపోయింది. మీ అడ్వకేట్ పంపిన
నోటీసు వచ్చింది.
రచన : 25 ఆగస్టు 2023
Thursday, 17 August 2023
Manipur is a teaser only; IMAX movie is ahead!
Manipur is a
teaser only; IMAX movie is ahead!
మణిపూర్ టీజర్ మాత్రమే;
ఐమాక్స్ సినిమా ముందుంది!
భారతదేశం అంతటా ఇవ్వాళ చర్చనీయాంశంగా మారిన రాష్ట్రాలు
మణిపూర్, హర్యాణ. ఒకచోట క్రైస్తవులు, ఇంకోచోట ముస్లింలు బాధితులు. మతమైనారిటీలను వేధిస్తుంటే
హిందూ ఓటు బ్యాంకు ధృవీకరణ చెంది ఎన్నికల్లో బిజేపికి విజయాన్ని సాధించి పెడుతోంది.
ముస్లింలనేకాదు; క్రైస్తవుల్ని కూడ వేధిస్తామని 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రచారం
చేసి మూడోసారి ప్రధాని అవ్వాలని నరేంద్ర మోదీజీ సిధ్ధం అవుతున్నారని అందరికీ తెలుసు.
కానీ, అసలు స్కెచ్ ఇంతకన్నా చాలా పెద్దదని చాలామందికి తెలీదు.
మణిపూర్ ఒక విధంగా చతురస్రాకారంలో వుంటుంది.
రాష్ట్రానికి నాలుగు సరిహద్దుల్లోనూ ఎత్తైన
కొండలుంటాయి మధ్యలో లోయ వుంటుంది. రాజధాని ఇంఫాల్ కూడ లోయ ప్రాంతంలో వుంటుంది. రాష్ట్రంలో
మెజారిటీ సామాజికవర్గంగా భావించే మెయితీలు లోయలోనే వుంటారు. మైనారిటీలుగా భావించే కుకీ జో తెగలు రాష్ట్రం చుట్టు
వున్న కొండ ప్రాంతాల్లో వుంటారు.
బయటివారు సాధారంణంగా భావిస్తున్నట్టు మెయితీలందరూ
హిందువులు కాదు. వారిలో క్రైస్తవులు, ముస్లింలు కూడ వున్నారు. మెయితీలు చర్చీల దహనం
కార్యక్రమాన్ని మొదలెట్టినపుడు మెయితీ క్రైస్తవుల చర్చీల జోలికి పోలేదు. అయితే మెజారిటీ
మెయితీలు హిందువులు. వారిలో వర్ణవ్యవస్థ కూడ కొనసాగుతోంది.
కుకీ జో ల మాతృభాష మిజావు. ఇంగ్లీషు ధారాళంగా
మాట్లాడుతారు. అంతేకాదు; హిందీని వ్యతిరేకిస్తారు. వాళ్ళు క్రైస్తవులు కావడం మాత్రమేగాక,
ఉత్తర భారతదేశంలో వుంటూ హిందీని దూరంగా వుంచడం కూడ సంఘపరివారానికి చిరాకు కల్పించే అంశంగా మారింది.
ఈశాన్య రాష్ట్రాల్లోని ఎస్టీలకు దేశంలోని ప్రతిష్టాత్మక
విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు వుంటాయి. ‘సానుకూల వివక్షను’ సద్వినియోగం చేసుకున్నకుకీ జో, నాగ తెగలు క్రమంగా
ప్రభుత్వ యంత్రాంగంలో కీలక స్థానాలకు చేరుకున్నారు. మొన్నటిదాక మణీపూర్ డిజిపిగా వున్న
పి దౌంగెల్ కుకీ జో తెగకు చెందినవారే. విశ్వవిద్యాలయాల్లోనూ కుకీ జో, నాగ ప్రొఫెసర్లు
పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. కుకీ జో, నాగ తెగల అభివృధ్ధిని చూసి మెయితీలు ఈర్ష్యా ద్వేషాలను
పెంచుకున్నారు.
ఆర్ధిక బలహీనవర్గాలకు (EWS) గత ఎన్నికలకు ముందు
కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు కూడ మెయితీలను సంతృప్తి పరచలేదు.
ప్రస్తుత చట్టాల ప్రకారం అటవీ భూముల మీద సమస్త అధికారాలు కుకీ జో, నాగ తదితర తెగలవి.
అక్కడ మెయితీలు భూములు కొనడానికి వీల్లేదు. అటవీ భూములపై మెయితీలకు హక్కు దక్కాలంటే
వారికి ఎస్టీ హోదానివ్వాలి. అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్ర
సింగ్ మెయితీలకు ఎస్టీ గుర్తింపునివ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంవి మురళీధరన్ మార్చి
27న మెయితీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఏప్రిల్ 19న
బయటికి వచ్చింది. అప్పటి నుండి ఎస్టీలు ఆందోళన బాట పట్టారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ATSUM) హైకోర్టు ఉత్తర్వులకు
వ్యతిరేకంగా మే 3న ‘గిరిజనుల సంఘీభావ యాత్ర’ కు పిలుపిచ్చింది. అక్కడి నుండి మణిపూర్
లో హింసాత్మక సంఘటనలు ఆరంభమయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తమను భిన్న జాతులుగా
భావిస్తారుగానీ, భారతీయులు అనుకోరు. చాలా మంది ఆధార్ కార్డ్ కూడ తీసుకోరు. ఆధార్ కార్డు
తీసుకుంటే తమను భారతీయుల జాబితాలో పడేస్తారని వాళ్ళు భయపడతారు. కశ్మీర్ లోయలోనూ ఇలాగే
వుంటుంది. కశ్మీర్ లోయ ప్రజలంతా ఒకే జాతి అని
వాళ్లు భావిస్తారు. తమ భూభాగాన్ని సగం పాకిస్తాన్, సగం ఇండియా ఆక్రమించుకున్నాయనే భావనతో
వుంటారు.
కుకీ జోలు మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల్లోని
గిరిజనులంతా సాధారణంగా శాంతి కాముకులు. మౌనంగా వుంటారు. ఇతరులు తమ జోలికి వస్తే మాత్రం
ఉగ్రులైపోతారు. సాంప్రదాయకంగా వాళ్ళు సైనిక జాతి (Warrior Tribe / Martial Tribe). ఆయుధాలు వాడడంలో నేర్పరులు. హైకోర్టు ప్రకటన వెలువడగానే
ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కుకీ జోల నుండి లైసెన్సు
ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మరో వైపు మెయితీలు పోలీసు స్టేషన్ల నుండి 6 వేల ఆయుధాలను
ఎత్తుకుపోయారు. బుల్లెట్లు అయితే లక్షల సంఖ్యలో ఎత్తుకుపోయారట. ముఖ్యమంత్రి సూచనల మేరకు
పోలీసులే స్వఛ్ఛందంగా మైతీలకు ఆయుధాలను సరఫరా చేశారనే మాట మణిపూర్ లో పెద్ద ప్రచారంలో
వుంది. పోలీసులు తోడుగావున్నా, ఆయుధాలు చేతిలోవున్నా తగిన శిక్షణలేని మైతీలు వాటిని
ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారు. ఆ అసహనంతో కుకీల ఇళ్లను తగుల బెట్టారు. మహిళల మీద
లైంగిక దాడులు జరిపారు. మరోవైపు, కుకీ జోలు తమ యుధ్ధ నైపుణ్యంతో నాటు తుపాకులతోనే మైతీల
మీద భీకరంగా ప్రతిదాడి చేశారు.
చూరచందాపూర్ జిల్లాలోని కుకీ జో మహిళలు, పిల్లలు
పక్క రాష్ట్రమ్జైన మిజోరంకు శరణార్ధులుగా వెళ్ళిపోయారు. కుకీ జో పురుషులు ఇంటికొకరు
చొప్పున స్వఛ్ఛంద సైనిక దళంగా మారి వంతుల వారీగా ప్రతిదాడి సాగిస్తున్నారు. దానిని
తట్టుకోవడం మైతీలకు సాధ్యం కావడంలేదు.
శరణార్ధులుగా వచ్చిన కుకీ జోలను మిజోరంలోని మీ
జోలు అక్కున చేర్చుకున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 40 వేల మంది కుకీ జోలు మిజోరంకు
తరలి వచ్చారు. శరణార్ధుల కోసం మిజోరం రాజధాని నగరం ఐజ్వాల్ లో ఇటీవల లక్షమంది సంఘీభావ
యాత్ర జరిపారు. కుకీ జోలు, మీ జోలు ఒకే తల్లి బిడ్దలుగా భావిస్తారు. మణిపూర్ ప్రభుత్వానికి కుకీ జోలు వద్దనుకుంటే చూరచందాపూర్
తదితర జిల్లాలను తమకు ఇచ్చేయాలనీ, తాము ‘గ్రేటర్ మిజోరం’ ఏర్పాటు చేసుకుంటామని మిజో
నేషనల్ ఫ్రంట్ కు చెందిన మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు.
-ఆయన ప్రస్తుతం ఎన్డీఏలో వున్నారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో
విభేదిస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో మణిపూర్ హింసమీద తీవ్రంగా
మాట్లాడారు. ఎన్డీయేకు తమది అంశాలవారీ మద్దతు మాత్రమేనని ప్రకటించారు. ఇక ‘గ్రేటర్
మిజోరం’ అంశాన్ని ముందుకు తెస్తే
మోదీ, అమిత్ షాలకు రాజకీయంగా కొత్త సమస్యలు తప్పవు.
మణిపూర్ కు ఉత్తరాన వున్న నాగాలాండ్ రాష్ట్రంలోనూ అనేక
కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మణిపూర్ ఉత్తరాన వుండే కాంగ్ పోక్పీ
(Kangpokpi), సేనాపతి జిల్లాల్లో కుకీ జోలు, నాగాలు వుంటారు. ఈ
రెండు తెగల మధ్య 1984లో కొన్ని ఘర్షణలు జరిగాయి. అందులో కుకీ జోలు ఎక్కువగా
నష్టపోయారు. దానికి గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రోజు బ్లాక్ డే
నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. ఆదివాసీ తెగల మధ్య ఐక్యత బలంగా పెరుగుతోంది.
ప్రస్తుత మెయితీ-కుకీ జోల ఘర్షణలో నాగ
తెగ తటస్థంగా వుంటోంది. మణిపూర్ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు
సభ్యుల్లో ఒకరు మెయితీ, మరొకరు నాగ. కుకీలకు లోక్ సభలో ప్రాతినిధ్యంలేదు. కుకీ
జోలకు ఇప్పుడు నాగ తెగల సహకారం చాలా అవసరం.
కుకీ జోలు బ్లాక్ డేను విరమిస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తేచాలు
వాళ్లను అన్ని విధాలుగా ఆదుకోవడానికి నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో (Neiphiu Rio) సిధ్ధంగా వున్నారు.
ఆయన ఇప్పటికే ఆదివాసులు, క్రైస్తవుల్ని ఉమ్మడి పౌరస్మృతి నుండి మినహాయించాలని
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు, బ్లాక్ డేను విరమించడానికి కుకీ జోలు కూడ
సిధ్ధంగా వున్నారు. నాగాలు కుకీ జోలు ఏకమైతే మణిపూర్ లోయలోని మైతీలకు మరిన్ని
కష్టాలు వస్తాయి. కోల్ కటా నుండి మణిపూర్ వెళ్ళే రోడ్డు మార్గం నాగాలాండ్ మీదుగా
వెళుతుంది. ఆ మార్గాన్ని నాగాలు కుకీ జోలు అడ్డుకుంటే మణిపూర్ లోయకు సరఫరాలన్నీ
ఆగిపోతాయి. అప్పుడు, ఎయిర్ లిఫ్ట్ ఒక్కటే శరణ్యం అవుతుంది.
ఘర్షణల మొదటి దశలో కుకీ జోలు ఎక్కువ మంది చనిపోయారుగానీ
ఇప్పుడు వాళ్ళు జరుపుతున్న ప్రతిదాడిలో చనిపోతున్న మైతీల సంఖ్య కూడ తక్కువగా ఏమీలేదు. పరువుపోతుందని ఆ విషయాన్ని మైతీలు బయటికి చెప్పుకోవడంలేదు.
సైనికంగా, నైతికంగా, భౌతికంగా ఇంతటి పరాజయాన్ని పరాభవాన్నీ మూటగట్టుకోవాల్సి వస్తుందని
మైతీలు ఊహించి వుండరు. వాళ్ల కథ అడ్డం తిరిగింది.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్
మే 3న నిర్వహించిన ‘గిరిజనుల సంఘీభావ మార్చ్’ వల్ల హింస చెలరేగిందని మైతీలు ఆరోపిస్తున్నారు.
మణిపూర్ హైకోర్టు మార్చి 27న మెయితీలను ఎస్టి
జాబితాలో చేర్చడంవల్ల కుకి జో తదితర ఆదివాసి సమూహాల ఉనికికి ముప్పు ముంచుకు వచ్చిందని
ట్రైబల్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది కారణం? ఏది ప్రభావం? ఇదీ ప్రస్తుతం
మణిపూర్ లో సాగుతున్న ఎడతెగని వేదాంత చర్చ.
కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లోని అటవీ ప్రాంతం
– కొండప్రాంతం కావాలి. కుకీ జో లను అక్కడి నుండి తరిమేయాలి. ఆ ప్రాంతాన్ని అస్మదీయ
కార్పొరేట్లకు దారదత్తం చేయాలి. దానికోసం మైతీలను పావులుగా వాడింది. వాళ్ల ప్లాన్
- ఏ విఫలం అయింది. అయితే, వాళ్ల దగ్గర ప్లాన్ – బి కూడ వుంది.
మణిపూర్ మంటల మీద ప్రధాని మోదీజీ నెలల తరబడి
మౌనం వహించడం మీద చాలా కథనాలు వచ్చాయి. వారు ప్లాన్ -బి అయిన అటవీ భూముల (పరిరక్షణ)
సవరణ బిల్లు – 2023 ను రూపొందించే పనిలో తీరిక లేకుండ వున్నారు. ఈ బిల్లును జులై
27న లోక్ సభ ఆమోదించింది.
దేశ సరిహద్దుల నుండి వంద కిలో మీటర్ల లోపు భూముల్ని
వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు అనేది సవరణ చట్టంలో కీలక అంశం. వ్యూహాత్మకత
అనే పదానికి ఎవరికి తోచిన అర్ధం వారు చెప్పుకోవచ్చు. అస్మదీయ కార్పోరేట్లకు ఆ భూముల్ని
దారాదత్తం చేయడం కూడ వ్యూహాత్మక ప్రాజెక్టు కావచ్చు.
మణిపూర్ రాష్ట్రానికి తూర్పు దిక్కున మయన్మార్
దేశం వుంటుంది. ఆ వైపున వంద కీలో మీటర్ల మేర తెంచి వ్యూహాత్మక ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. అలా కుకీ జోలను చట్టబధ్ధంగా వాళ్ల భూముల నుండి తప్పించవచ్చు.
మిజోరం కు తూర్పున మయన్మార్, పశ్చిమ దిక్కున బంగ్లాదేశ్ వుంటాయి. ఉత్తర దక్షణ సరిహద్దుల
మధ్య మిజోరం పొడవు 285 కిలో మీటర్లు. తూర్పు పడమరల మధ్య మిజోరం వెడల్పు 115 కిలోమీటర్లు.
అక్కడ వంద కిలో మీటర్ల ఫార్మూలాను అమలు చేస్తే అసలు మిజోరం రాష్ట్రమే మిగలదు. నాగాలాండ్
పరిస్థితి కూడా ఇంతే. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల ఇలాంటి ముప్పుతప్పదు.
చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్,
మయన్మార్, ఆఫ్గనిస్తాన్ దేశాలతో మన దేశంలోని
20 రాష్ట్రాలు సరిహద్దులు కలిగి వున్నాయి. అవన్నీ తమ భూభాగాల్ని వ్యూహాత్మక ప్రాజెక్టులకు
ఇవ్వాల్సి వుంటుంది. మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ తో సాధ్యం కానిదాన్ని ఒక చట్ట సవరణతో
సాధించవచ్చని నరేంద్ర మోదీజీ ఒక్కరికి మాత్రమే తెలుసు.
డానీ
సమాజ
విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
మొబైలు
– 9010757776
రచన
: 10 జులై 2023
ప్రచురణ : 18 ఆగస్టు 2023, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్
పేజీ
https://www.andhrajyothy.com/2023/editorial/manipur-teaser-only-imax-movie-is-ahead-1123535.html
Friday, 4 August 2023
Manipur mayhem, a manufactured Ethnic Cleansing
Manipur mayhem, a manufactured Ethnic Cleansing
మణిపూర్ అల్లకల్లోలం, ఒక కుత్రిమ జాతి హననం
1.
మణిపూర్ లో కుకీలు నివసించే కొండప్రాంతాల్లో అత్యంత
విలువైన అపార ఖనిజ నిక్షేపాలు వున్నాయి.
2.
అడవి సంపద, ఖనిజ నిక్షేపాలు మన కార్పొరేట్లకు
కావాలి.
3.
మణిపూర్ తూర్పునగల అంతర్జాతీయ సరిహద్దుల్లో
మైన్మార్ కు చెందిన రెండు
రాష్ట్రాలుంటాయి.
4.
అలాగే ఆ ప్రాంతం వివాదాస్పద గోల్డెన్ ట్రయాంగిల్ (మైన్మార్,
లావోస్, థాయిలాండ్) కు దగ్గరగా వుంది.
5.
డ్రగ్ మాఫియాలకు ఆ ప్రాంతం మీద పట్టుకావాలి.
6.
కార్పొరేట్ల సంపద పెరుగుదలతోపాటు , అంతర్జాతీయ
రహదారి ఏర్పడాలంటే ముందు మణిపూర్ తూర్పు భాగంలో గ్రౌండ్ క్లియరెన్స్ జరగాలి.
7.
కుకిలను వాళ్ల ప్రాంతాల నుండి ఖాళీ చేయించాలి.
8.
ఇదీ నేపథ్యం
9.
మెయితీల ద్వార అంతర్యుధ్ధానికి పథకరచన చేశారు.
10.
మైదాన ప్రాంతాల్లో వుండే మెయితీలకు ఎస్టి
రిజర్వేషన్ కల్పిస్తే కొండ ప్రాంతాల్లో వుండే కుకీలు సహజంగానే
వ్యతిరేకిస్తారు.
11.
సంఖ్యా బలం, ప్రభుత్వ అండవున్న కారణంగా మెయితీలు
రెచ్చిపోయారు.
12.
కుకీల మీద మెయితీలు అనాగరీక దారుణ దాడులు
జరిపారు.
13.
గృహదహనాలు, హత్యలు, సామూహిక అత్యాచారాలు పెద్ద
ఎత్తున సాగాయి.
14.
కొన్ని వందల మంది కుకీలు చనిపోయారు.
15.
పోలీసులతో సహా, ప్రభుత్వ యంత్రాంగం మెయితీల పక్షం
వహించింది. లేదా మౌన ప్రేక్షకుల్లా వుండిపోయింది.
16.
Assam Rifels, CRPF, PAC తదితర కేంద్ర బలగాలూ
భిన్నంగా లేవు.
17.
అక్కడి శాంతిభద్రతల బాధ్యతల్ని తీసుకున్నట్టు మే
4న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నది.
18.
ముస్లింలను వేధించడానికి ఉమ్మడి పౌరస్మృతి
చట్టాన్ని తెస్తున్నట్టు ఇటీవల కేంద్రప్రభుత్వం కొన్ని సంకేతాలు వదిలింది.
19.
అటవీ భూమి మీద అనాదిగా తమకున్న ప్రత్యేక
హక్కుల్ని రద్దు చేయడానికి ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తెస్తున్నట్టు వనవాసులు,
గిరిజనులు, ఆదివాసులకు స్పష్టంగా తెలిసిపోయింది.
20.
ఉమ్మడి పౌరస్మృతి ఇక ఎంతమాత్రం ముస్లింల సమస్య
కాదు. అదిప్పుడు ఆదివాసుల ఉనికి సమస్య.
21.
కుకీలు ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయి పొరుగునున్న
మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు.
22.
కొందరు కుకీలు అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు.
ప్రధానంగా వాళ్ళు బిజెపి పాలన లేని రాష్ట్రాలకు వెళుతున్నారు. వాళ్ల గమ్యంలో
పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడ వున్నాయి.
23.
దీనికి వలసలు, మాస్ డిస్ ప్లేస్ మెంట్ వంటి చిన్న
పదాలు చాలవు.
24.
ఇది జాతి హననం. Ethnic Cleansing.
25.
కొన్ని చోట్ల కుకీలు తిరగబడ్డారు; అలాంటి
సందర్భాల్లో మెయితీలు కూడ చనిపోయారు.
26.
ప్రపంచం మొత్తం తమను ఒక క్రూర అనాగరిక జాతిగా
భావిస్తూ వుండడం కొందరు మెయితీలకు నచ్చడంలేదు.
27.
మెయితీల్లో మానవ హృదయం వున్న వారు కొన్ని చోట్ల
కుకీలను కాపాడారు, తమ ఇళ్ళల్లో ఆశ్రయం కల్పించారు.
28. అలాగే కుకీల జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల
కుకీలు కూడ మెయితీలను తిరుగుబాటుదార్ల నుండి కాపాడారు.
29. ఇప్పుడు సమస్య తక్షణ సహాయక చర్యలు, పునరావాసానికి (Releaf and
rehabilitation (R&R) కు సంబంధించింది.
30. నాగాలాండ్, మిజోరం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే
అనేక తక్షణ సహాయక సహాయక శిబిరాలు వెలిశాయి.
31. కుకీలను ఎక్కడికక్కడ పునరావాసం కల్పిస్తారూ?
32. ఇప్పుడు వారు చేరుకున్న చోట పునవాసం కల్పిస్తారా? ఇది కూడ
పెద్ద సమస్యే. గృహదహనాల్లో వాళ్ల గుర్తింపు కార్డులు, విద్యకు సంబంధించిన
సర్టిఫికేట్లు తగలబడిపోయాయి.
33. The final updated NRC for Assam, published 31 August 2019,
contained 31 million names out of 33 million population.
34. It left out about 1.9 million applicants, who seem to be
divided roughly equally between Bengali Hindus, Bengali Muslims and other
Hindus from various parts of India
35. In December 2022, audit by the Comptroller and Auditor
General of India (CAG) revealed several irregularities in the National Register
of Citizens in Assam, such as, exclusion of several indigenous people of Assam,
irregularities in utilization of funds in the process and choosing software for
the task. The project cost increased from Rs 288.18 crore in 2014 to Rs
1,602.66 crore by March 2022.
36. The Government of Bangladesh has indicated that Bangladesh
is prepared to take back any of its citizens residing in India if evidence is
offered.[15]
37. ఇప్పుడు కుకీలను వాళ్ల
స్వగ్రామాలైన Churachandpur, Tamenglong, Senapati, Ukhrul లకు వెనక్కు తీసుకునివెళ్ళి శాశ్విత పునవాసం కల్పిస్తారా?
38. అలా చేయకపోతే Churachandpur, Tamenglong, Senapati, Ukhrul ప్రాంతాలు
కార్పొరేట్ల హస్తగతం అయిపోతాయి. ఇదేకదా వారి పథకం. అందుకే ప్రభుత్వం దానికి
ఒప్పుకోదు.
39. సహాయక కేంద్రాల దగ్గర పునరావాసం కల్పించలేము, వాళ్ల
స్వగ్రామాల్లోను పునరావాసం కల్పించలేము.
40. కార్పొరేట్లది ద్విశృంగవాదం. మనం వాళ్ల పద్మ వ్యూహంలో
చిక్కుకున్నాం.
Wednesday, 2 August 2023
Prof. Kham Khan Suan Hausing భావప్రకటన స్వేచ్చను కాపాడడానికి ఒక రౌండ్ టేబుల్ సభ పెట్టాలి
*Prof. Kham Khan Suan Hausing భావప్రకటన స్వేచ్చను కాపాడడానికి ఒక రౌండ్ టేబుల్ సభ పెట్టాలి*.
Prof. Kham Khan Suan Hausing
90 రోజులు గడిచిపోయాయి. ఖాండవ దహనంలా కుకీలున్న ప్రాంతాల్ని ఖాళీ చేయించేయిస్తున్నారు.
వాళ్లను అక్కడి నుండి తరిమివేస్తున్నారు. Mass displacement. వాళ్లసలు భారతీయులే కాదంటున్నారు.
ప్రభుత్వం మెయితీలది, కేంద్ర ప్రభుత్వం మెయితీల పక్షం, పోలీసులు మౌన ప్రేక్షకులుగా
వుండిపోతే అదో ఇది అనుకోవచ్చు. పోలీసులూ దహన కాండలో పాల్గొంటున్నారు. అల్లరి మూకలకు
ఆయుధాలు అందిస్తున్నారు. బహిరంగా మూక అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రపంచానికంతటికీ
తెలుసు. జాతిహననం చేసి ఖాళీ చేసిన ప్రాంతాన్ని ఎవరికి అప్పగిస్తారో కూడ మనకు తెలుసు. ఇన్ని తెలిసినా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏం చేయాలో
తెలిస్తే ఎలా చేయాలో ఆలోచించే వాళ్ళం. అసలు ఏం చేయాలో కూడ మనకు తెలియడంలేదు. అదీ అసలు
విషాదం. అంచేత, మణిపూర్ పరిణామాల్ని గురించి విన్నప్పటి నుండి చాలా అసహనంగా, అశాంతిగా
వున్నది.
మణిపూర్ కు చెందిన Kham Khan Suan Hausing హైదరాబాద్ సెంట్రల్
యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా వుంటున్నారనీ ఆయనిప్పుడు పొలిటికల్ సైన్సెస్ విభాగానికి
డీన్ గా పని చేస్తున్నారని మీడియాద్వార తెలిసింది. మిత్రుడు SA David ప్రొఫెసర్ హాసింగ్
కు పరిచయం చేశాడు. ఆయన కూడ సంతోషంగా తన కార్యాలయానికి రమ్మన్నారు. ఈశాన్య రాష్ట్రాల
రాజకీయ పరిణామాల మీద ప్రొఫెసర్ హాసింగ్ స్పెషలైజ్ చేశారు. ఇప్పటి మణిపూర్ అల్లర్లలో
ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నారు.
వైర్ వెబ్ పత్రిక నిర్వహించే కరణ్ థాపర్ షోలో ప్రొఫెసర్ హాసింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు
వైరల్ గా మారాయి. మెయితీలు కుకీలకు మధ్యజరుగుతున్న జాతి సంఘర్షణలో మెయితీ సంఘాలకు ప్రభుత్వం
సహకరిస్తున్నదని ఆయన చేసిన ఆరోపణ వివాదంగా మారింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని స్థానిక
న్యాయస్థానం హాసింగ్ మీద దాఖలయిన అభియోగాలను పరిగణన లోనికి తీసుకుంది. తుది తీర్పు
వచ్చే వరకు హాసింగ్ మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టింది. ఇంఫా కోర్టు ఆర్డరు తన
భావప్రకటన స్వేచ్చకు భంగకరంగా వుందని ప్రొఫెసర్
హాసింగ్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన మీడియాతో,
బయట మణిపూర్ అంశం మీద మాట్లాడే పరిస్థితి లేదు.
నన్ను చాలా ఆప్యాయంగా
రిసీవ్ చేసుకున్నారు. తన కారులో యూనివర్శిటి మెయిన్ గేటు వరకు వచ్చి దింపారు. మా సంభాషణను
బయటికి చెప్పడం కుదరదు.
ప్రొఫెసర్ హాసింగ్
తో మాట్లాడిన తరువాత అర్ధం అయిందేమంటే ఇప్పటి
పరిస్థితుల్లో ఇంఫాల్ ఎయిర్ పోర్టు వరకు వెళ్ళవచ్చు. ఎయిర్ పోర్టు నుండి బయటపడడం చాలా
రిస్క్ తో కూడిన వ్యవహారం. కేంద్ర బలగాలు, నిఘావర్గాలు, మణిపూర్ పోలీసులు, అక్కడి అధికారుల
తనిఖీల నుండి బయటపడాలి. ఒకవేళ వాళ్లను దాటినా అల్లరిమూకలు వెంటపడతాయి. మీడియా అని తెలిసినా,
క్రైస్తవ, ముస్లిం ప్రతినిధులని తెలిసినా కొత్త సమస్యలు వస్తాయి.
మణిపూర్ లో కుకీలు
మారుమూల ప్రాంతాలయిన Churachandpur, Tamenglong, Senapati, Ukhrul జిల్లాలో వుంటారు. నాగాలాండ్, మిజోరమ్. అస్సాం రాష్ట్రాల్లోని
సరిహద్దు జిల్లాల్లోనూ వాళ్ళు వుంటారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం తరువాత పరిస్థితి
అదుపులో రావచ్చని ఒక ఆశ. ఆ తరువాత మణిపూర్
itinerary సిధ్ధం చేసుకుంటాను.
ఈలోగా మనం చేయవసిందేమంటే prof. Kham Khan Suan
Hausing భావప్రకటన స్వేచ్చను కాపాడడానికి ఒక రౌండ్ టేబుల్
సభ పెట్టాలి.
ఆగస్టు 2, 2023
ఏబికే సైన్యం అంటే ఆ కిక్కే వేరబ్బా!
ఏబికే సైన్యం అంటే ఆ కిక్కే వేరబ్బా!
ఎమెర్జెన్సీ తరువాత జర్నలిజం లోనికి కొత్త రక్తం వచ్చింది. శ్రీకాకుళ గిరిజన
సాయుధ పోరాటం అణిచివేత తరువాత మిగిలివాళ్ళు ఎన్జీవోలవైపు, మీడియావైపు నడిచారు. మీడియా
వైపుకు వచ్చిన వాళ్ళకు ఎబికె ప్రసాద్ ఒక ఆశ్రయం కల్పించారు.
దాసరి నారాయణ రావు స్థాపించిన ‘ఉదయం’ దిన పత్రిక ఫస్ట్ వీక్ టాక్ వీక్ గా వుండింది. దాసరి నారాయణ రావు కోరిక మేరకో,
ఏబికే చొరవ మేరకో అందులోనికి రకరకాల ఎర్రరక్తం ఎక్కించారు. అంతే సూర్యుడు పూర్తి వెలుగులతో
ఉదయించాడు.
విరసం సభ్యునిగా విప్లవ వ్యాసాలు, కథలు రాసిన నేను కారంచెడు ఉద్యమం తరువాత మెయిన్
స్ట్రీమ్ జర్నలిజంలోనికి ప్రవేశించాలనుకున్నాను. రెండింటి జానర్ వేరు. విప్లవ రచనల్లో
“జాతులు విముక్తిని కోరుతున్నాయి; ప్రజలు విప్లవాన్ని కొరుతున్నారు” అంటూ భావోద్వేగంతో
ఒక అబ్సల్యూట్ స్టేట్ మెంట్ ఇస్తాం. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో అలా కుదరదు. “కొన్ని
జాతులు విముక్తిని కోరుతున్నాయి; కొందరు ప్రజలు విప్లవాన్ని కొరుతున్నారు” అనాలి. వంగవీటి
రంగా హంతకులు ఎవరో మనకు తెలిసినప్పటికీ వారు హత్యచేశారు అని రాయకూడదు. ఈ హత్య వెనుక
ఫలానావారి హస్తం వున్నట్టు ఆరోపణలున్నాయి అని అంటీఅంటనట్టు రాయాలి. ఎంత వరకు మనకు ఆధారాలతోసహా
కఛ్ఛితంగా తెలుసో అంతవరకే రాయాలి. మిగిలినదాన్ని
ఒక ఊహాగానంగా ప్రకటించాలి. ఇంగ్లీషు జర్నలిజంలో allegedly అనే పదాన్ని తప్పక వాడుతుంటారు.
అంటే రాసిన దానికి మాకూ సంబంధలేదు; జనం అనుకుంటున్నారని ఇంకొకరి మీద తోసేయ్యాలి.
మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం మెళుకువల్ని నా ఆత్మీయ మిత్రులు, ఇప్పటి ఆంధ్రజ్యోతి
ఎడిటర్ కే. శ్రీనివాస్ దగ్గర నేర్చుకున్నాను. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో నా తొలి రచన
‘పగలూ రేయీ – పశ్చిమగోదావరి’ ఉదయం దినపత్రిక 1986 జనవరిలో ప్రచురించింది. ఆ వ్యాసం కాన్సెప్ట్ వరకే నాది; రచనా
శైలిని పూర్తిగా కే శ్రీనివాస్ గైడెన్స్ లోనే రాశాను. అలా తను నాకు జర్నలిజంలో తొలి
గురువు.
1988 చివర్లో నేను ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ తో వర్కింగ్ జర్నలిస్టుగా
మారాను. చెన్నైలోని ‘ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం’ లొ ప్రొఫెసర్ గా పని చేస్తున్న
మరో ఆత్మీయ మిత్రుడు మోహన్ రామ్మూర్తి అప్పట్లో ఢిల్లీలో పేట్రియాట్ ఇంగ్లీషు పత్రికల్లో
పనిచేస్తుండేవాడు. ఢిల్లీ వెళ్ళి తన గదిలోనే వుంటూ తనతో ప్రెస్ కాన్ఫెరెన్స్ లకు వెళ్ళి
రిపోర్టింగ్ modus operandi నేర్చుకున్నాను. అలా తను నాకు రిపోర్టింగ్ గురువు.
అప్పుడు ఆంధ్రభూమికి ఏబికే ప్రసాద్ చీఫ్ ఎడిటర్. అలా వారి శిష్యునిగా జర్నలిజంలో
ప్రవేశించాను. వారు నాకు చాలా స్వేఛ్ఛ ఇచ్చారు. నా తొలి బ్యూరో చీఫ్ లు ఆంధ్రభూమిలో
సతీష్ చందర్; డెక్కన్ క్రానికల్ లో కే. శ్రీరాములు. సతీష్ చందర్ ఎలాగూ కమ్యూనిస్టు.
అయితే, శ్రీరాములుగారికి అప్పట్లో కమ్యూనిస్టులు అంటే ఎందుకోగానీ బొత్తిగా పడేదికాదు. కానీ, మనిషి చాలా మంచివారు.
వారే నాకు ఫస్ట్ ప్రమోషన్ కు రికమెండేషన్ లేఖ ఇచ్చారు.
గురువుల్ని మరచిపోవడం భావ్యంకాదు. తల్లిదండ్రులు లేకుండా మనం పుట్టలేనట్టే, గురువులు లేకుండా మనం ఎదగలేము.
ఈ రోజు ఏబికే ప్రసాద్ గారి పుట్టినరోజు. 90వ పడిలో పడ్డట్టున్నారు. ఆర్ధిక శాస్త్రంలో
వారు దిట్ట. రాజకీయాల్లో వామపక్షవాది. యువతరాన్ని ప్రోత్సహించడంలో వారిని మించినవారు
లేరు. ఏబికే సైన్యం అనుకోవడంలో గొప్ప కిక్కు వుంటుంది. దానిని నేను ఇప్పటికీ ఆస్వాదిస్తుంటాను.
గురువుగారూ! పుట్టిన రోజు శుభాకాంక్షలు.
2 ఆగస్టు 2023