Friday 1 December 2017

Perception of Telugu Muslim Literature

Perception of Telugu Muslim Literature  
బహుజన తాత్వికత :  సాహిత్యం
3 డిసెంబరు 2017 , శ్రీకాకుళం సదస్సులో నా ప్రసంగం
‘తెలుగు ముస్లిం కథా సాహిత్య దృక్పథం’ 
3 డిసెంబరు 2017 , శ్రీకాకుళం సదస్సు

Duration 45 Minutes
Typing 20,000 – 22500 characters

ప్రవేశిక
సభాధ్యక్షులు ………………………………………….. ………………………     గారికి,
వేదిక మీద వున్న మిత్రులకూ, వేదిక ముందు  వున్న మిత్రులకు జైభీం, జై మీం.
మీం అంటే మైనారిటీ, మీం అంటే ముస్లిం, మీం అంటే ముహమ్మద్.
బహుజన రచయితల వేదిక భారాన్ని ఇష్టంగా భుజాల మీద మోస్తున్న తమ్ముడు డాక్టర్ నూకతోటి రవికుమార్ కూ,
దానికి నిరంతరం ఒక మేధోసరోవరంలా వుంటున్న ప్రియ మిత్రుడు బొక్కా పరంజ్యోతికి ప్రత్యేక అభినందనలు.

1.          బహుజన తాత్వికత : సాహిత్యం అనే అంశంపై శ్రీకాకుళంలో సదస్సు పెట్టి అందులో ‘ముస్లిం సాహిత్య దృక్పథం’ మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు.

2.          బహుజన అంటే హిందూ శ్రామిక కులాలని ఒక పరిమిత అర్ధం వుంది. మాన్యవార్ కాన్షీరామ్ దీనికి ఒక విస్తృత అర్ధం ఇచ్చారు. ఆదివాసులు, దళితులు, శ్రామిక కులాలు, మతఅల్పసంఖ్యాక వర్గాల్ని ఈ గొడుకు కిందికి తెచ్చారు. ఈ విస్తరణ మహత్తరమైనది.

3.          ఇతర బహుజన సామాజికవర్గాల సాహిత్య దృక్పథం గురించి ఇతర మిత్రులు మాట్లాడారు. ఇంకా మరికొందరు మాట్లాడాల్సి వున్నారు. నేను ముస్లిం సాహిత్య దృక్పథం గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను.

4.          ఒక చారిత్రక దశలో ప్రతి సామాజిక సమూహానికీ ఒక నిర్ధిష్ట లక్ష్యం వుంటుంది. ఆ దశలో ఆ సమూహం అంతా ఆ ప్రకటిత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది.

5.          కమ్యూనిస్టులు, నక్సలైట్లు సమసమాజాన్ని కోరుకుంటారు. దళిత, బహుజనులు కులరహిత సమాజాన్ని కోరుకుంటారు. ఆదివాసులు సాంస్కృతిక రక్షణ సమాజాన్ని కోరుకుంటారు. స్త్రీలు మాతృస్వామిక వ్యవస్థను కోరుకుంటారు. అలాగే భారత ముస్లింలు మతసామరస్య సమాజాన్ని కోరుకుంటారు.

6.          నేను భారత ముస్లింలని ప్రత్యేకంగా ఎందుకు పేర్కొంటున్నానంటే; ఇస్లాం ప్రపంచమతం. ప్రపంచంలో ముస్లింలు అధిక సంఖ్యాకులుగా వున్న దేశాలూ వున్నాయి. ముస్లింలు అల్ప సంఖ్యాకులుగా వున్న దేశాలూ వున్నాయి. భారత ముస్లీంలకు ఒక ప్రత్యేకత వుంది. వాళ్ళు భారతదేశాన్ని తమ మాతృదేశంగా గట్టిగా భావిస్తారు. రెండు రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చిన అమేరికా పూర్వ అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీతో ఆ విషయమే చెప్పారు. భారత అల్పసంఖ్యాకవర్గాలు దేశభక్తులు!.

7.          ఇక్కడ నా వ్యక్తిగత అంశం ఒకదాన్ని చెప్పడం తప్పు కాదనుకుంటున్నాను. సౌదీ అరేబియా వాటర్ అండ్ ఇరిగేషన్ సెక్రటరీ భార్య నాకు మేనత్త. మానాన్న చెల్లెలు. అంతేకాదు బాల్యంలో నా ఆలనా పాలనా తనే చూసిందట. అంచేత నాకు సగం తల్లి కూడా. 1979లో నేను ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తను భారత దేశానికి వచ్చి  నన్ను సౌదీ అరేబియాకు వచ్చేయమంది. నేను వెళ్ళదలచలేదు. నా దేశపు పేదరికం కూడా నాకు గొప్పగా వుంటుంది. ఇంత వరకు నేను  విదేశీ గడ్డ మీద కాలు మోపలేదు. విదేశాల్లో పర్యటించాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు. కొంచెం అతిశయంగా వుండొచ్చుగానీ మరో దేశంలో కాలు మోపకుండానే చనిపోవాలనీ నేను ప్రగాఢంగా భావిస్తాను.

8.          మత అసహన రాజకీయ సామాజిక వాతావరణానికి ఒకటే మందు మత సామరస్యం. నిజానికి ఇటు హిందూ సమాజం, అటు ముస్లిం సమాజం కూడా మత సామరస్యాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి.

9.          ముస్లింలు ఎన్నడూ  హిందూత్వవాదుల్ని చూసి హిందూసమాజాన్ని అంచనా వేయకూడదు. అలాగే హిందువులు ఎన్నడూ ముస్లిం ఛాందసవాదుల్ని చూసి  ముస్లిం సమాజాన్ని అంచనా వేయకూడదు.

10.      భారత ముస్లిం సమాజం ఎంత ఉదారమైనదో హిందూ సమాజం కూడా అంతే ఉదారమైనది.  ఇది నా వ్యక్తిగత అనుభవం కూడా. నన్ను అభిమానించేవారు, మెచ్చుకునేవారు, ఇష్టపడేవారు, ప్రేమించేవారు అత్యధికులు హిందూ సమాజానికి చెందినవారు. వారిలో అగ్రవర్ణాలవారూ, ప్రాబల్య సామాజికవర్గాలవారు కూడా పెద్ద సంఖ్యలో వున్నారు.

11.       దేశంలో మతసామరస్య వాతావరణం ఏర్పడితే తమ రాజకీయార్ధిక ప్రయోజనాలు నెరవేరవవి హిందూత్వవాదులు భయపడుతున్నారు. అలాంటి మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయడానికే ‘లవ్ జిహాద్’ వంటి నినాదాలతో  వివాదాలు సృష్టిస్తున్నారు. రెండు మహత్తర సమూహాల మధ్య గోడలు నిర్మిస్తున్నారు.

12.      సాధారణ హిందూ సమాజం భారత ముస్లింలని తమ వాళ్ళుగా చూస్తున్నదని చెప్పడానికి కేరళ మెడికో ‘హదియా’ కేసే తాజా ఉదాహరణ. ఈ అంశాన్ని ముస్లిం రచయితలు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.

13.      మత సామరస్య వాతావరణాన్ని సృష్టించడమే భారత ముస్లిం సమాజ లక్ష్యం. అదే ముస్లిం సాహిత్య లక్ష్యం.

14.      Communal Harmony refers to the harmony, acceptance and love among the people of various communities belonging to different castes, races and religion. Communal Harmony is the most important pre-condition for feeling of Unity and National Integration.

15.      ముస్లిం జీవితాలను ప్రతిబింబించే కథలు తెలుగులో ఇటీవల పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి.

16.      ఖదీర్ బాబు, వేంపల్లె షరీఫ్, స్కైబాబ, షాజహానా, బా రహంతుల్లా వంటి సమర్ధులయిన రచయితలు ఈ రంగంలో చురుగ్గా కృషి చేస్తున్నారు.

17.      వీళ్ళు రాస్తున్న కథల్లో ఎక్కువ భాగం వైయుక్తిక కథాంశాలతో వున్నాయి. వీటిల్లో ముస్లిం జీవితం వున్నంతగా మైనారిటీ (మత అల్పసంఖ్యాకుల) వాదం ప్రతిఫలించడంలేదు. భారత ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక సమస్యల్ని ప్రతిఫలించే కథలు, నవలలు రావలసివుంది.

18.       అక్కడక్కడ కొన్ని కథల్లో వర్తమాన  రాజకీయ అంశ,  వున్నప్పటికీ అవి రేఖా మాత్రమే.

19.      ఉద్యమ సాహిత్యం అంటేనే రాజకీయ సాహిత్యం అనే అవగాహన ఇంకా పెరగాల్సి వుంది.

20.      ఇస్లామోఫోబియాను ప్రచారం చేసి భయపెట్టి రాజకీయాధికారాన్ని చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అగ్రరాజ్యం అమేరికా అధినేతగా వున్నారు. సరిగ్గా అదే పంథాలో నరేంద్రమోదీ భారత ప్రధానిగా వున్నారు. ఈ పరిణామాలు సృష్టిస్తున్న ఒక భయానక అసహన వాతావరణాన్ని  ముస్లిం రచయితలు ఒక  ముందస్తు షరతుగా గుర్తించాలి.

21.      వర్తమాన అసహన రాజకీయ భీభత్సాన్ని చిత్రించి దానికో పరిష్కారాన్ని సూచించే కథలు, నవలలు విరివిగా రావల్సి వున్నాయి.  

22.      మనకు ఇప్పుడు ఒక గోర్కీ కావాలి. గోర్కీ ముందు తరంవాళ్ళు రష్యన్ సమాజ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తే, గోర్కి రష్యన్ సమాజాన్ని విప్లవీకరించే సాహిత్యాన్ని సృష్టించాడు. అలనాటి రష్యన్ సాహిత్యంలో గోర్కీ నిర్వహించిన పాత్రను పోషించే రచయితలు ఇప్పుడు మనకు రావాలి. ఇది ఒకరివల్ల అయ్యే పనికాదు. సమిష్టిగా జరగాలి.

23.      వర్తమాన భారత ముస్లిం సమాజపు అవసరాలు, లక్ష్యాలు ఏమిటీ? అనేది నిజానికి రాజకీయ కార్యక్రమం, దాన్ని సాహిత్యం ప్రతిఫలిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అలాంటి రాజకీయ పార్టీగానీ, ఉద్యమంగానీ లేదు. అంచేత రాజకీయ అవగాహన పాత్రనూ, సాహిత్య ప్రతిఫలన పాత్రనూ సాహిత్యకారులే నిర్వర్తించాల్సిన అవసరం వుంది.

24.      రాజకీయ పార్టీ / కాడ్యక్రమం / పంథాల లేమి సమస్య ముస్లింలకు మాత్రమేకాదు. దేశంలోని సాంఘీక అణగారినవర్గాలు అందరికీ వుంది.

25.      రాజకీయ సంస్థలు /వేదికలు సాహిత్యకారులకు  ఒక బైండింగ్ వైర్ గా పనిచేస్తాయి. అప్పుడు వ్యక్తిగత తేడాలు ఎన్నివున్నా రచయితలు ఒక సంఘంలో కలిసి పనిచేస్తుంటారు. అలాంటి బైండింగ్ వైర్ ను ఇప్పటికీ మనం రాడికల్  కమ్యూనిస్టుల సాహిత్య సంఘాల్లో చూడగలం. బైండింగ్ వైర్ లేకపోవడంవల్ల మిగిలిన పీడిత సమూహాల రచయితలు వ్యక్తివాదులుగా, స్వీయ ఉన్నతివాదులు (కెరీరిస్టులు)గా  మారిపోతున్నారు.

26.      తెలుగు ముస్లిం రచయితల్లో సమిష్టి ధోరణి లేకపోగా వ్యక్తివాదం, స్వీయ ఉన్నతివాదం వుధృతంగా  పెరుగుతోంది.

27.      వీరిలో ఒక వింత పెడధోరణి కూడా విస్తరిస్తోంది. ప్రముఖ రచయితలు అందరూ ఎవరి రచనల్ని వారే ప్రమోట్ చేసుకుంటున్నారు. అదికాస్తా అతిశయించి స్వంత సాహిత్య సభలు పెట్టుకుని ఎవరికివారు తామే గొప్ప రచయితలమని చెప్పుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

28.      వర్తమాన భారత ముస్లిం సమాజ అవసరాలు ఏమిటీ? దానికి కథా – నవల సాహిత్యరంగం ఎలా దోహదపడాలి? అనే అంశం మీద ప్రముఖ తెలుగు ముస్లిం రచయితలు ఒక  మేధోమధన సమావేశం జరపాల్సి వుంది.

29.      ప్రపంచ సాహిత్యంలో మత అల్పసంఖ్యాకవర్గాల ప్రతిఫలనం కొత్తదేమీకాదు.

30.      యూరప్ లో యూదులు ఒక దశలో దాదాపు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయినా నిలబడ్డారు. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే దశలోనూ వున్నారు. అప్పట్లో వచ్చిన జుడాయిజం/ జియోనిజం సాహిత్యాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేయాలి.

31.      Antisemitism is hostility to, prejudice, or discrimination against Jews. A person who holds such positions is called an antisemite. Antisemitism is generally considered to be a form of racism.

32.      Islamophobia is defined as "Intense fear or dislike of Islam, chiefly  as a political force; hostility or prejudice towards Muslims". The term Islamophobia was first used in the early 20th century and it emerged as a neologism in the 1970s, then it became increasingly salient during the 1980s and 1990s, and it reached public policy prominence with the report by the Runnymede Trust's Commission on British Muslims and Islamophobia (CBMI) entitled Islamophobia: A Challenge for Us All (1997).

33.      నల్లజాతి వివక్షను ప్రపంచ సాహిత్యం ఎలా ప్రతిఫలించిందో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

34.      1931 మార్చి 25న అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది. ఒక లోకల్ ట్రైన్ లో తెల్లవాళ్ళు నల్లవాళ్ళ మధ్య వివాదం చెలరేహింది. ఓ తెల్ల యువకుడు అది తెల్లవాళ్ల ట్రైన్ అని ప్రకటించి ఓ నల్ల యువకుడిని నడుస్తున్న రైలు నుండి  దిగిపొమ్మన్నాడు. నల్ల యువకులు ఈ దారుణాన్ని గట్టిగా  ప్రతిఘటించారు. దానితో ఆగ్రహం చెందిన తెల్లవాళ్లంతా కలిసి తొమ్మిదిమంది నల్లవాళ్ళ మీద గ్యాంగ్ రేప్ కేసు పెట్టారు. దానికి వత్తాసుగా ఇద్దరు తెల్లమహిళలు తమమీద మూకుమ్మడి అత్యాచారం జరిగినట్టు తప్పుడు సాక్ష్యం చెప్పారు. రేప్ జరగలేదని మెడికల్ నివేదిక చెపుతున్నప్పటికీ మొత్తం తెల్లన్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పట్టించుకోలేదు. ఒక మైనర్ పిల్లవాడ్ని మినహా మిగిలిన ఎనిమిది మంది నిందితులకు ఏకంగా ఉరిశిక్ష విధించింది తెల్ల న్యాయస్థానం.   

35.      సామాజిక స్పృహలేని న్యాయమూర్తులు  ఎంతటి విచక్షణారహితంగా న్యాయాన్ని దుర్వినియోగం (miscarriage of justice) చేయగలరో  చెపుతుంది ఈ సంఘటన. న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోయింది  Scottsboro Boys కేసు.

36.      Scottsboro Boys కేసు గురించి విన్న విఖ్యాత ఫ్రెంచ్ రచయిత జీన్ పాల్  సార్త్రె  కు చాలా కోపం వచ్చింది. తప్పుడు సాక్ష్యం ఇచ్చి సాంఘీక మహాపాతకానికి పాల్పడిన  ఆ ఇద్దరు తెల్లమహిళలకన్నా ఒక బజారు వేశ్య గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించాడు. ఆ భావోద్వేగంలోనే The Respectful Prostitute అనే నాటికను రాశాడు.

37.      ఈ ఏడాది జూన్ నెలాఖర్లో రంజాన్ పండుగకు ముందురోజు  హర్యాణ లోకల్ ట్రైన్లో జునైద్ ఖాన్ అనే ఓ ముస్లిం యువకుడ్ని హిందూత్వవాదులు చంపేశారు. ఆ సంఘటన  ఆధారంగా నేను ‘మదరసా మేకపిల్ల’ కథ రాశాను.

38.      అప్పటికి నాకు సార్త్రె రాసిన The Respectful Prostitute తెలుసు. అయితే, సార్త్రె నాటికకు ప్రేరణ Scottsboro Boys Case అని తెలీదు. ఇప్పుడు తెలిసాక చాలా ఆనందంగా వుంది. నేను కూడా జీన్ పాల్  సార్త్రె  బాటలో వున్నానని!. Just kidding!!

39.      Lynching అనేది ముస్లింలు, దళితులను భయభ్రాంతులకు గురిచేసే సాధారణ  ప్రక్రియగా మారిపోయింది.

40.      గోగ్రవాదుల మూకుమ్మడి దాడులు, హత్యలు ఒక పరంప్రగా దేశమంతటా సాగుతున్నాయి.

41.      అంబాజీపేట సమీపంలో జరిగిన ఒక Lynching సంఘటన నుండి ప్రేరణ పొందిన సతీష్ చందర్ గోధనం అనే నవలను రాశారు.  ముస్లిం రచయితలు అలాంటి చారిత్రక సాహిత్య బాధ్యతను ఇంకా స్వీకరించలేదు. ‘స్వశ్ఛ భారత్’ కథలు రాస్తూ అదే గొప్ప సాహిత్య సేవగా సంతృప్తి చెందిపోతున్నారు. 

42.      యూదుల మీద వివక్షను చిత్రించిన ఒక కథను ఈ సందర్భంగా మీకు చెప్పాల్సి వుంది.

43.      రచయిత్రి Laura Z. Hobson 1947లో 'Gentleman's Agreement'  అనే నవల రాసింది. అదే సంవత్సరం అది అదే పేరుతో సినిమాగానూ వచ్చింది. హాలీవుడ్ దిగ్గజ నటుడు  గ్రెగోరి పెక్ ఆ సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు.   

44.      అమెరికాలో యూదుల మీద సాగుతున్న జాతి వివక్షను చిత్రించడానికి ఓ క్రైస్తవ పాత్రికేయుడు కొన్నాళ్ళు తానే యూదునిగా నటించడం ఇందులో ప్రధానాంశం. ఈ నవల, ఈ సినిమా కూడా అప్పట్లో ఘన  విజయాన్ని సాధించాయి.

45.      తెహల్కాకు చెందిన ముస్లిం మహిళా జర్నలిస్టు రాణా అయూబ్. ఆమె తన పేరును  మైథిలీ త్యాగిగా మార్చుకుని, అమెరికా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ స్టూడెంట్ గా, ఆరెస్సెస్ అభిమానిగా చెప్పుకుని  2002 నాటి గుహరాత్ అల్లర్ల  సూత్రధారులు, పాత్రధారులు, కిరీటధారులు అనేక మందిని కలిసింది. అలనాటి మారణ హోమం మీద అనేక వాస్తవాలను సేకరీంచి  ‘గుజరాత్ ఫైల్స్’ పేరుతో ఒక గొప్ప పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించింది.  Laura Z. Hobson నవల  'Gentleman's Agreement' నుండి రాణా అయూబ్ ప్రేరణ పొందివుండవచ్చు కూడా.

46.      “For our own motherland a junction of the two great systems, Hinduism and Islam — Vedanta brain and Islam body — is the only hope” అని వివేకానందుడు ఒక సందర్భంలో అన్నాడు. దీన్ని మరో మాటల్లో ముస్లిం దేహం, బ్రాహ్మణ ఆలోచన అనవచ్చు.

47.      నల్లదేహం, తెల్ల ఆలోచన అనే థీమ్ తో ఈ ఏడాది ఆరంభంలో ‘Get Out’ అనే హాలివుడ్ సినిమా వచ్చింది. ఇది హారర్ సినిమా. వృధ్ధులయిన తెల్లవాళ్ళు తమ మెదడును నల్ల యువకుల శరీరంలోనికి ట్రాన్స్ ప్లాంట్ చేసుకుని తమ ఆయుష్షును పెంచుకుంటుంటారు. నల్లజాతికి చెందిన Jordan Haworth Peele ఈ కథను రాశాడు. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

48.      నల్లజాతి యువకులు వున్నత విద్యా సంస్థల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరిస్తూ  2014లో Dear White People అనే సినిమా వచ్చింది.

49.       Harry Segall అనే రచయిత్రి 1938లో   Heaven Can Wait అనే నాటకాన్ని రాసింది. దాన్ని హాలివుడ్ లో వివిధ దశల్లో  మూడు సినిమాలుగా తీశారు. వాటిల్లో  2001లో  వచ్చిన సినిమా Down to Earth.  ఇందులో కథ విచిత్రంగా వుంటుంది. ఒక నల్ల యువకుని ఆత్మ ఒక తెల్ల వృధ్ధుని శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలా మనకు నల్లవాళ్ళ మీద తెల్లవాళ్ల జాతివివక్ష ను చిత్రిస్తుంది రచయిత్రి.   

50.      ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే మనం ఎలాంటి కథలు రాయాలో మీకు గుర్తుచేయడానికి. ఇతర దేశల్లో మనలాంటి రచయితలు ఆయా సందర్భాల్లో ఎలాంటి రచనలు చేశారో చెప్పడానికి.

51.      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మక్కా మసీదు, లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్ళు జరిగాయి. వాటిని కథాంశంగా తీసుకుని తెలుగు ముస్లిం సమాజంలోని అభద్రతకు  కథా నవలా రూపం ఇవ్వ వచ్చు.

52.      హిందూ సమాజంలో హిందూత్వవాదులు సంఖ్య చాలా స్వల్పం మాత్రమే. భారత ముస్లిం సమాజంలోనూ మతతత్త్వవాదుల సంఖ్య  చాలా స్వల్పం మాత్రమే.  ఒక శాతం కాదుకదా అర, పావు శాతం కూడా వుండరు.

53.      2014లో జరిగిన 16వ లోక్ సభ ఎన్నికల్ని ఒకసారి సమీక్షిద్దాం. దేశ జనాభా 130 కోట్లు, ఓటర్లు 81 కోట్లు, బీజేపి నాయకత్వం వహిస్తున్న  ఎన్డీయే కూటమికి పడ్డవి 17 కోటల ఓట్లు.  

54.      భారతీయ జనతా పార్టీ అనేది సంఘ్ పరివారపు రాజకీయ విభాగం అని అందరికీ తెలుసు. అయితే, బీజేపీకో, ఎన్డీయేకో మద్దతు పలికిన ఓటర్లందరూ హిందూత్వవాదులు, సంగ్హ్ పరివారకులు అనుకోవడం తప్పు మాత్రమేకాదు ప్రమాదకరం కూడా.  ఎన్నికల్లో స్దానుకూల ఓట్లేకాదు ప్రతికూల ఓట్లు పడతాయి ఉబుసుపోక ఓట్లు పడతాయి సరదా ఓట్లు పడతాయి వివిధ పథకాలకు ఓట్లు పడతాయి. భ్రమల ఓట్లు పడతాయి.   

55.      ముందు మనం మతతత్త్వవాదుల్ని హిందూ ముస్లిం  రెండు సమాజాలనుండీ తరిమి వేయాలి. అప్పుడు మాత్రమే మతసామరస్య సమాజం నెలకొనడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.  ముస్లిం రచయితలు ఇప్పుడు ఆ దిశగా కృషిచేయాలి.

56.      వర్తమాన సమాజంలో మనం చూస్తున్న సంఘటనలన్నీ దాదాపు గతంలో జరిగినవే. ఒక భీభత్స చరిత్ర పునరావృతమౌతున్నది.  తెలుగు ముస్లిం సాహిత్యం చారిత్రక డిమాండ్ మేరకు పునరావృతం కావడంలేదు.

57.      మనకు గొప్ప నైపుణ్యంవున్న కథకులు వున్నారు.  అయినా అసహన రాజకీయ వాతావరణాన్ని చిత్రించడానికీ, స్వీయ సమాజానికి  భవిష్యత్తును సూచించడానికీ ఎవరూ గట్టిగా ప్రయత్నం చేయడంలేదు.

58.      సేఫ్ జోన్ లో వుండాలనుకునే ఏ కథకుడూ గొప్ప కథలు రాయలేడు. మనలో అత్యధికులు లేదా దాదాపు అందరూ సేఫ్ జోన్ లో వుండాలనుకుంటున్నాం.

59.      ప్రాణప్రదమైన అంశాలను చిత్రించడానికి శక్తి చాలక, శక్తి వున్నా ధైర్యం చాలక అప్రధానమైన అంశాలను రాసి సంతృప్తి చెందుతున్నారు.

60.      పిల్ల కాలువల్లో ఈత కొడుతూ బ్రిటీష్ ఛానల్ ను దాటేశామని చెప్పుకుంటున్నాం. నిజానికి మనం పసిఫిక్ మహా సముద్రంలో ఈత కొట్టాల్సిన సమయం ఇది.

61.      సాదన్ హసన్ మంటో ఒక మాట అన్నాడు. “మా కథల్ని మీరు భరించలేరు. ఎందుకంటే భరించశక్యంగాని వాతావరణంలో మేము బతికాము” అని. రాజ్యపు అణిచివేతని అనుభవించనివాళ్ళు గొప్ప రచయితలు కాలేరని రష్యన్ బోల్షివిక్ సాహిత్యం నిరూపించింది.

62.      మతసామరస్య సమాజ నిర్మాణం ముస్లిం రచయితలు ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. సమాజంలోని ఇతర అణగారినవర్గాలతో కలిసి దీన్ని సాధించాలి.

63.      దళితులు, బహుజనులు, ఆదివాసులు, ముస్లిం, క్రైస్తవ సమూహాలని  అణగారిన వర్గాలుగా మనం భావిస్తున్నాం. అది మాత్రమే చాలదు హిందూ సమాజపు అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలలోని పేదల్ని కూడా మనం అణగారినవర్గాలుగా గుర్తించాలి. అప్పుడు మాత్రమే మతసామరస్య వాతావరణం ఏర్పడుతుంది.

64.      లేకపోతే సాధారణ హిందువులు సహితం హిందూత్వ శిబిరంలోనికి చేరిపోతారు. అప్పుడు శత్రువు బలం పెరుగుతుంది. మనం మెజారిటీగా నిరూపించుకోవాలంటే హిందూత్వవాదులు పోగా మిగిలిన హిందూ సమాజపు మద్దతు చాలా అవసరం.

65.      సమీప భవిష్యత్తులో తెలుగులోనూ మహత్తర రచనలు వస్తాయనే  ఆశతో ముగిస్తాను.

66.      ఇంతవరకు నా ప్రసంగాన్ని విన్నందుకు ధన్యవాదాలు. Thank you.


// EOM/./ 

No comments:

Post a Comment