Friday 16 August 2013

Red Fort Speeches

నిస్సారంగా ఎర్రకోట ఉపన్యాసాలు!

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ) 

నిస్సారంగా ఎర్రకోట ఉపన్యాసాలు!

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

స్వాతంత్ర్య దినోత్సవమంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల పండుగలా మారిపోయిందిగానీ,  మూడు దశాబ్దాల క్రితం వరకు అది ప్రజల పండుగలా వుండేది. ఎర్రకోట బురుజుల మీద నిలబడి దేశప్రజల్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసే ప్రసంగాన్ని వినడానికి జనం ఆసక్తిగా ఎదురు చూసేవారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ప్రతి వాక్యపు ప్రతి పదాన్నీ రేడియోలూ, ట్రాన్సిస్టర్లకు చెవులురిక్కించి మరీ వినేవారు. ఇళ్లల్లో, టెలివిజన్లు వచ్చాక కళ్లప్పగించి చూసేవారు. మరునాడు దినపత్రికలన్నింటి మొదటి పేజీలన్నీ ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలతో నిండిపోయేవి.

  ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్  ప్రసంగం దినపత్రికల ఫ్రంట్ పేజీల్లో డబల్ కాలమ్ నుండి సింగిల్ కాలమ్ కు కుచించుకుపోయింది. నిష్కర్షగా చెప్పాలంటే, ఈసారి ప్రధాని ఎర్రకోట ఉపన్యాసంకన్నా కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలకు చేరబోతుందనే వార్తే ఎక్కువమంది పాఠకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

  దేశానికి స్వాతంత్రంవచ్చి డెభ్భయి యేళ్ళు కావస్తున్న తరుణంలో, దేశప్రజలకు ఆహార భద్రత కల్పించగలమని కేంద్ర ప్రభుత్వాధినేత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు!. అంటే, దేశప్రజల్లో ఒక ప్రధాన భాగానికి ఇప్పటికీ కడుపు నిండా తిండి కూడా అందడంలేదని ప్రధాని  ఆమోదిస్తున్నారు. భారత స్వాతంత్ర సంగ్రామానికి ఇంతకన్నా అవమానకర నివాళి ఇంకేముంటుందీ?

  మన జాతీయ సగటు అభివృధ్ధి రేటు 5 శాతం మాత్రమే వుందని, స్వయంగా ఆర్ధిక సంస్కరణల పాత్రధారి మన్మోహన్ సింగే అంటున్నారు. ఆర్ధిక సంస్కరణల సూత్రధారి పీవీ నరసింహారావు అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నడూ లేనిది మన్మోహన్ సింగ్ తొలిసారిగా తన రాజకీయ గురువైన పీవీ నరసింహారావును ఎర్రకోట ప్రసంగంలో  తలచుకోవడం విశేషం. కష్టకాలంలోనే మనుషులకు తల్లిదండ్రులు, గురువులు, కోల్పోయిన మిత్రులు గుర్తుకు వస్తారు.

సగటు అభివృధ్ధి రేటు గురించి మాట్లడే సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశంలోని వున్నతవర్గాలు, కార్పొరేట్ కంపెనీలు భారీ లాభాల బాటలో నడుస్తున్నట్టు మనం తరచుగా పత్రికల్లో చూస్తున్నాం. దాని అర్ధం ఏమిటంటే, మధ్యతరగతి, ఆ దిగువ తరగతి ప్రజలు రుణ_అభివృధ్ధికి గురవుతున్నారని అర్ధం. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోని సగటు, పేద వర్గాలు మరింత పేదలుగా మారిపోతున్నారని అర్ధం.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పెరగడంవల్ల, పలు రంగాల్లో అభివృధ్ధిని సాధిస్తామని, స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో, ప్రధాని చెప్పడం ఒక వైచిత్రి! 1863 నాటి అమెరికా అంతర్వ్యుధ్ధపు రోజుల్లో "ప్రజలద్వార (ఎన్నుకోబడి), ప్రజలచే (నడపబడి), ప్రజల కొరకు (పనిచేసే) ప్రభుత్వం ఈ భూమి మీద ఎన్నటికీ నశించదు" అన్నాడు అబ్రహామ్ లింకన్ . ఆ మాటల్ని గమనిస్తే, మనకు ఏం అర్ధం అవుతుందీ?   ప్రజల ద్వార (ఎన్నుకోబడి), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులచే (నడపబడి), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కొరకు (పనిచేసే) ప్రభుత్వం ఈ భూమి మీద ఎంతోకాలం బతకదు అనేకదా!.

నా మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు రంగావజ్జుల భరద్వాజ ప్రధాని ఉపన్యాసం విన్నాక ఓ మాట అన్నాడు. "మనోళ్లు 1857  నుండి 1947  వరకు దాదాపు తొంభయి యేళ్ళు స్వాతంత్ర సమరాన్ని సాగించారు. బహదూర్ షా జాఫర్, నానాసాహెబ్ పేష్వా మొదలుకుని రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్ల ఖాన్,   చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వరకు అనేక యోధులు పోరాడారు. స్వదేశీ ఉద్యమం మొదలుకుని క్విట్ ఇండియా, శాసనోల్లంఘనం వరకు అనేక పోరాటలు చేసి, వేలాదిమంది జైళ్లకు పోయి, జలియన్ వాలా బాగ్ వంటి నరమేధాల్లో వందలాదిమంది చనిపోయి దేశానికి స్వాతంత్రం తేవడం అంతా వృధాకద సార్!" అన్నాడు.

నా మిత్రుని మాటలు కాస్త కటువుగా వుండవచ్చుగానీ అర్ధంలేనివి మాత్రంకావు. రెండు వందల అరవై యేళ్ల క్రితం బ్రిటీషువాళ్ళు ప్లాసీ యుధ్ధం చేసి, అంతకు ముందు పోర్చుగీసువాళ్ళు, ఫ్రెంచివాళ్ళు ఇంకేవో యుధ్ధాలు చేసి భారత దేశాన్ని తమ వలసగా మార్చుకున్నారు. ఇప్పుడయితే, అన్ని యుధ్ధాలు గట్రా చేయాల్సిన పనిలేదు. గౌరవనీయమైన పార్లమెంటు సభ్యుల్ని కాస్త మంచి చేసుకుంటే చట్టబధ్ధంగానే దేశాన్ని ఆధునిక వలసగా మార్చుకోవచ్చు! గౌరవనీయమైన పార్లమెంటు సభ్యుల్ని చాలా మంది చాలా సందర్భాల్లో మంచి చేసుకున్న సంఘటనలు మనకు తెలుసు. 1993  లో పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని గెలిచినపుడు జార్ఖండ్ ముక్తి మోర్చా పాత్ర వివాదాస్పదంగా మారింది. అలాగే, 2008 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భారత_అమేరిక పౌర అణు ఒప్పందం బిల్లును గెలిపించుకున్నప్పుడూ అలాంటి వదంతులు బయటికి వచ్చాయి. మొన్న ఎఫ్ డీఐ బిల్లు పాసైనపుడు కూడా  భారీ మొత్తాలు చేతులుమారిందని వార్తలు వచ్చాయి. అంత పెద్ద మొత్తాలు చేతుల్లో పట్టవు గనుక, సూటుకేసులు మారడమో, ఆన్ లైన్ ట్రాన్సఫర్లో జరిగాయి అనుకోవాలి.

మొదటి యుపియే, రెండవ యూపియే గా పిలిచే సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ ల  తొమ్మిదేళ్ల పాలనలో  ప్రజల మేలు కోసం ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఎవరికైనా గుర్తుందా?  కోల్, రైల్, 2 జీ స్పెక్ట్రం, ఛాపర్, టాట్రా ట్రక్స్, కామన్ వెల్త్ గేమ్స్, క్యాష్ ఫర్ ఓట్, ఆదర్శ్ అపార్ట్ మెంట్, ఐపిఎల్, సత్యం స్కాములు తప్పా.

అలాగని, ఎన్డీయే చరిత్ర అత్యంత పవిత్రమైనది అనేమీకాదు. కార్గిల్ యుధ్ధ అమర సైనికుల శవపేటికల స్కామ్ ఎన్డీయే ప్రభుత్వంలోనే జరిగిందన్నది మరిచిపోవడం కష్టం. ఒక కోటి నలభై లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని అక్రమంగా తవ్వేసి చైనా తదితర విదేశాలకు తరలించేసి, నాలుగున్నర వేల కోట్ల రూపాయల దేశసంపదని దోచేసిన ఓబుళాపురం గనుల ఘనులు ఆ కుంభకోణానికి పాల్పడ్డప్పుడు, సంఘపరివారం సభ్యులే అన్నది మన జ్ఞాపకాల నుండి ఇంకా చెరిగిపోలేదు.

అయితే, యూపియే, ఎన్డీయేలు సంయుక్తంగా ఈ దేశప్రజలకు ఒక అద్భుతమైన స్వేఛ్ఛనిచ్చారు. తలను రాయితో బద్దలుగొట్టువాలా? ఇటుకతో బద్దలు గొట్టుకోవాలా? అనే స్వేఛ్ఛ అది. ఇది కాకపోతే అది. బీజేపి మతవాద కాంగ్రెస్ అయితే. కాంగ్రెస్ మితవాద బీజేపి.

సోనియా, మన్మోహన్, రాహుల్, రాబర్ట్ వధేరాల పాలనను అంతంచేయడానికి వజ్రాయుధ్ధాన్ని చేతబట్టి దూసుకు వస్తున్నాడని ఒకరకం మీడియా కొనియాడుతున్న బీజేపి ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోదీ కూడా ఈవారమే తన యువభారత జయభేరీని హైదరాబాద్ లో ఆరంభించారు. మోదీ తొలి సభ హైదరాబాద్ కావడానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది.

ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన 1984 సాధారణ ఎన్నికల్లో, దేశమంతటా వీచిన కాంగ్రెస్ సానుభూతి పవనాల్లో  బీజేపీ మట్టికరిచింది. ఆ పార్టీకి లోక్ సభలో రెండే రెండు సీట్లు లభించాయి. గుజరాత్ లోని మెహాసన నుండి అమ్రత్ భాయ్ కాళీదాస్ పటేల్, ఆంధ్రప్రదేశ్ లోని హనమకొండ నుండి చందుపట్ల జంగారెడ్డితప్ప, బీజేపీ అతిరథమహారథులందరూ ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ సెంటిమెంటుతోనే, గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టారు.

మన్మోహన్ సింగ్ ను మీడియా మౌనముని అంటుంది. నరేంద్ర మోదీ అలాకాదు. వారు బహిరంగ సభల్లో నిప్పులు కురిపించగలరు. అయితే, దేశరాజకీయ పరిస్థితీ,  ప్రాంతీయ తెలంగాణ వాతావరణం ఎంతో అనుకూలంగా వున్నప్పటికీ మోదీ హైదరాబాద్ ఉపన్యాసంలో విద్యుత్తు, విద్వత్తు రెండూ కనిపించలేదు. గుజరాత్ లో అభివృధ్ధి రేటూ భారీగా వుందని మోదీ గట్టిగా చెప్పడానికి ప్రయత్నించారుగానీ, ఆ ఘనతను మోదీ ఒక్కరికే ఇచ్చివేయడం సమంజసంకాదు. 1990 వ దశకంలో బీజేపి ప్రభావం గుజరాత్ లో పుంజుకోవడానికి ముందే ఆ రాష్ట్రంలో అభివృధ్ధి రేటు గణనీయంగా వుండింది. మోడీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు.  నిజానికి గుజరాత్ లో మోడీ సాధించినదానికన్నా చెడగొట్టిందే ఎక్కువ. ఆ రాష్ట్రం సామాజిక సూచికలు రెండవ ప్రపంచ యుధ్ధం నాటి జర్మనీని తలపిస్తూ భయపెడుతున్నాయి. దేశంలో అన్నింటికీ తావు వున్నట్టే ఫాసిస్టు ప్రేమికులు కూడా వుంటారు. మోదీ ఉపన్యాసం బహుశ వాళ్లను అలరించి వుండవచ్చు.

ప్రధాని ఎర్రకోట ఉపన్యాసం చారిత్రక ప్రాధాన్యతని కోల్పోతున్నది అనడానికి టెలివిజన్ రేటింగ్స్ ను కూడా ఒక సూచికగా భావించవచ్చు. స్వాతంత్ర దినోత్సవం రోజు అన్ని టీవీలు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వరంగ దూరదర్సన్ ను మినహాయిస్తే, ఇతర న్యూస్ ఛానళ్ళలో ప్రధాని ఉపన్యాసం ఇన్_బాక్స్ ఫీచర్ గా మారిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన అంశం కూడా వర్షంలో కొట్టుకు పోయింది. వచ్చే గురువారం విడుదలయ్యే టామ్ రిపోర్టును పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా అర్ధంచేసుకోవచ్చు.

ఈ నిర్లిప్తత మన దేశంలోనే వ్యాపిస్తున్నదనుకుంటే పోరపాటు. ప్రపంపంచ వ్యాప్తంగా పాలకులపట్ల నిర్వేదం కొనసాగుతున్నదని టీవీ కార్యక్రమాలు చెపుతున్నాయి. ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్నామని భావించే అమేరికా అధ్యక్షులకు కూడా ఈ గతి తప్పడంలేదు. అమేరికా అధ్యక్షుల ఓవల్ ఆఫీసు ప్రసంగం అంటే ఒకప్పుడు అదో చారిత్రక ఘట్టంలా వుండేది.  1962 లో క్యూబా క్షిపణి సంక్షోభం గురించి కెన్నడీ,  1986 లో అంతరిక్ష నౌక ఛాలెంజర్ పేలిపోయినపుడు రోనాల్డ్ రీగన్,   9/11 దాడి తరువాత జార్జి డబ్యూ బుష్ చేసిన ప్రసంగాల్ని ప్రపంచమంతా చెవులు రెక్కించి, కళ్ళు  పెద్దవి చేసుకుని చూసింది. అమెరికా అధ్యక్షుల ఓవల్ ఆఫీసు సాయంకాలపు ప్రసంగాల్ని టీవీ ఛానళ్లన్నీ ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసేవి, తద్వార రేటింగ్ పాయింట్స్ ను భారీగా పెంచుకునే ప్రయత్నం చేసేవి.

రోనాల్డ్ రీగన్ రికార్డు స్థాయిలో  29 సార్లు ఓవల్ ఆఫీసునుండి ప్రైమ్ టైమ్ లో ప్రసంగించాడు. ఆ తరువాతి స్థానం  22 ప్రసంగాలతో రిచర్డ్ నిక్సన్ ది. ప్రస్తుత అధ్యక్షుడు బారక్ ఒబామా ఇటీవల వర్ణవివక్ష మీద చేసిన ప్రసంగంతో సహా మూడు సార్లు మాత్రమే ఓవల్ ఆఫీసు నుండి ప్రసంగించాడు. రేటింగ్స్ రావడం లేదని అమేరికా టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు ప్రెసిడెంట్ ఓవల్ ప్రసంగాన్ని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయడానికి ఆసక్తి చూపడంలేదు. అధ్యక్షుని ప్రసంగాన్ని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయించడానికి వైట్ హౌస్ అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలతో పైరవీలు చేస్తుండడం దీనికి కొసమెరుపు.  

తీరికలేని నేటి జీవితాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి ఉపన్యాసాల్ని జనం పట్టించుకోకపోవడం సహజమేనని కొందరు అనుకోవచ్చు. అది చాలా వరకు నిజమేగానీ, సమస్య అంతకన్నా తీవ్రమైనది. శాసనకర్తల్ని, రాజ్యాంగ నిర్వాహకుల్ని జనం పట్టించుకోవడం లేదంటే, ప్రజల్లో పార్లమెంటరీ వ్యవస్థ మీద అపనమ్మకమో, నిర్లిప్తతో పెరిగిపోతున్నదనేగా అర్ధం! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  అవసానదశకు చేరుకుంటుంన్నది అనడానికి ఇది గట్టి సంకేతం అనుకోవాలి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336

హైదరాబాద్
17  ఆగస్టు 2013

ప్రచురణ : సూర్య దినపత్రిక,
18 ఆగస్టు2013



No comments:

Post a Comment