Tuesday 9 January 2018

The Problem is Vulgarity in Poetry

కవిత్వంలో బూతు తెచ్చిన తంటా !
-      ఉషా యస్ డానీ

               'దెంగేయికవితలో స్కైబాబా వాడిన భాష మీద విజయవాడ బుక్ ఫేర్ లో వివాదాన్ని రేపిన ముగ్గురూ ఆంధ్రావాళ్ళే; స్కైబాను అక్కడి నుండి సురక్షితంగా బయటికి తీసుకు వచ్చిన పదిమందీ ఆంధ్రావాళ్ళే!.

            ఈ సంఘటనని టిడిపీ, టిఆర్ఎస్ ఘర్షణగా చిత్రించడం అర్ధంలేని వ్యవహారం.  2017 ఫిబ్రవరిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో పాల్గొనడానికి అమరావతి వెళ్ళిన కేసిఆర్ కుమార్త్, నిజామాబాద్ ఎంపీ కవితకు అక్కడి జనం  ఘన స్వాగతం పలికారు. కవిత ఉపన్యాసం వినాలని ఎగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని  సమావేశంలో కవిత కోరడం వాళ్లను గొప్పగా అలరించింది. 

            అమరావతి శంకుస్థాపన సందర్భంగా 2015 అక్టోబరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళినపుడూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన తిరుపతి, విజయవాడ వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు మొక్కులు తీర్చుకుని వచ్చారుఅప్పుడూ ఆయన్ని చూడడానికి, అభినందించడానికీ జనం ఎగబడ్డారు. చంద్రబాబు కేసిఆర్ ఇప్పుడు రాజకీయ సహజీవనం చేస్తున్నారని తెలీనివాళ్ళు ఎవరూ వుండరు. అలాంటిది బుక్ ఫెస్టివల్ లో జరిగిన చిన్న సంఘటనని ముఖ్యమంత్రుల పేషీలకు అంటగట్టడం అతివ్యాప్తి దోషం.   

            అటూఇటూవున్న రాజకీయ అగ్రనాయకులు, వాణిజ్యవేత్తలు  మొదలు  సామాన్యప్రజల వరకు అంతా సన్నిహితంగానే వున్నారు. ఎటొచ్చి కొందరు కవులతోనే కొన్ని చిక్కులున్నాయి. గత ఏడాది తెలంగాణ మీడియా అకాడమీ అవార్డును ఆంధ్రాప్రాంతపు కవికి ఇచ్చినపుడు తెలంగాణ ప్రాంతపు కవులు ఇద్దరు ముగ్గురు  సామాజిక మాధ్యమాల్లో చాలా పెద్ద గోల చేశారు. అలా అప్పుడు వివాదం రేపిన వారికి స్కైబాబ చాలా సన్నిహితులు. అలాగే ఆంధ్రా ప్రాంతపు కథకుడు ప్రచురించిన కథల సంకలనంలో తెలంగాణ కథలకు తగినంత ప్రాతినిధ్యం దక్కలేదని ఓ సారి ఓ రచ్చ జరిగింది. ఇవి రెండూ హైదరాబాద్ లో జరిగిన సంఘటనలే.  

            తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక మంది తెలంగాణ కవులు, రచయితలు ఆంధ్రప్రదేశ్ లో అనేక సభల్లో పాల్గొన్నారు. ప్రశంసలూ  అందుకున్నారుఅలా ఏపీలో అందరికన్నాఎక్కువ  సభల్లో పాల్గొని ఎక్కువ సత్కారాలు పొందిన తెలంగాణ కవి స్కైబాబానే.      

            తెలంగాణ ఉద్యమ కాలంలో భావోద్వేగాలు ఒక దశలో భావోద్రేకాల స్థాయికి చేరిన మాట వాస్తవం. కొన్ని వేల మంది కవులు ఉద్యమ గీతాలు కవితలు రాశారు. వాళ్ల గురించీ వాళ్ల రచనల గురించీ ఆంధ్రా ప్రాంతంలో అప్పుడూ ఇప్పుడూ ఇబ్బంది ఏమీలేదు. ఉద్యమ కాలంలో తెలంగాణ కవిత్వ విభాగానికి నాయకత్వం వహించిన  నందినీ సిధ్ధారెడ్డి, జూలూరి గౌరీశంకర్ లను కూడా ఏమీ అనకుండా ఇప్పుడు ఆ విజయవాడ  యువకులు ముగ్గురూ స్కైబాబాను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారన్నది నిజంగానే ఆలోచించాల్సిన అంశం. వేల మంది రాసిన కవితలవల్ల జరగని రాష్ట్ర విభజన స్కైబాబా రాసిన బూతు కవితల వల్ల జరిగిపోయిందని వాళ్ళు భావించారా?

               శ్రీశ్రీ వంటివారు కూడా గతంలో కొన్ని సంబర్భాల్లో బూతు పదాలు వాడారు. ఒక సందర్భంలో లోకం 'దొంగలంజ కొడుకుల' మయం అయిపోయిందన్నారు. మరో సందర్భంలో 'దొంగలంజ కొడుకులేలే పాలన ఒక పాలనా?"  అన్నారు. అయితే, రెండు సందర్భాలలోనూ దుర్మార్గమైన సమాజాన్నీ, క్రూరమైన రాజ్యాన్ని తిట్టాడు గాబట్టి, అందులోనూ అమూర్తంగా ప్రస్తావించాడు గాబట్టి దాన్ని కొంత వరకు సమర్ధనీయమే అనుకోవచ్చు.  
            శ్రీశ్రీ  కవితలు రాసేనాటికి తెలుగునాట  స్త్రీవాదం బలపడలేదుస్త్రీవాదం బలపడ్డాక వాళ్ళు మహాకవినీ వదలలేదు; ప్రజాగాయకుడు అనిపించుకున్న గద్దర్నీ వదలలేదు. అలా వాళ్లను నిలదీసిన వాళ్ళల్లో తెలంగాణవాళ్ళూ వున్నారు; ఆంధ్రావాళ్ళూ వున్నారు.

  స్కైబాబా కవిత   స్త్రీవాదం  బలపడ్డాక వచ్చింది.  ఆయన ఆ తిట్లని అమూర్తంగా రాయలేదు.  ఒక ప్రత్యేక సమూహాన్ని నిర్దిష్టంగా సంభోదించి  "నా కొడుకా! దెంగేయీ!' అనడం అనేది ఎంతటి భావోద్వేగంలోనూ సమర్ధనీయం కాదు. సాహిత్యంలో అస్సలు కాదు.

            బూతులు తెలంగాణ నుడికారంలో అంతర్భాగం అని స్కైబాబ మిత్రులు కొందరు వాదిస్తున్నారు. స్కైబాబ వంటి ఒకరిద్దరి కవితల్లో తప్ప తెలంగాణలోని వేల మంది కవుల కవితల్లో బూతులు కనిపించవు. వాళ్లంతా  తెలంగాణ నుడికారానికి తీవ్ర అపచారం చేశారనేది వీళ్ళ అభిప్రాయం కాబోలు! ఇటీవలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వీక్షణం సంపాదకుడు ఎన్. వేణుగోపాల రావు  1975 నాటి విరసం కార్యవర్గ తీర్మానం ఒకదాన్ని గుర్తు చేశాడు.  మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కటం” అంటూ “దానిలో స్త్రీలను కించపరిచే నానుడి ఒకటి ఉంది. విరసం కూడా ఇప్పుడైతే అటువంటి వ్యక్తీకరణ వాడదనుకుంటాను. కాని అది చారిత్రక పత్రం గనుక దాన్ని యథాతథంగా ఇవ్వక తప్పలేదు” అని ఒక వివరణ ఇచ్చాక మాత్రమే దాన్ని  ఉటంకించాడు.  వేణుగోపాల రావు నిస్సందేహంగా తెలంగాణ ఆలోచనాపరుడు.  అయితే ఆయన కూడా  భీతి భావంతో బూతుకు వివరణ ఇచ్చుకుని తెలంగాణ నుడికారానికి అన్యాయం చేసినట్టున్నాడు!!.
            ఇటీవలి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఓ కాంగ్రెస్‍ నేత “నీచుడు” అన్నాడు. నిజానికి దీన్ని ఎవరూ పెద్ద బూతు అనుకోరు. అయితే మనుధర్మశాస్త్రంలో దానికి ‘వర్ణ సంకరం వల్ల పుట్టిన సంతానం’ అనే పెద్ద అర్ధం వుందట. దాన్ని పట్టుకుని “వాళ్ళు నన్నేకాదు నా తల్లిని కూడా తిడుతున్నారు. నా తల్లి ఏం పాపం చేసిందీ?” అంటు ఓ సభలో మోదీ కన్నీళ్ళు పెట్టుకున్నారు. చివరి క్షణంలో గుజరాత్ ఓటర్లు మోదీ మీద సానుభూతి చూపడానికి ఆ బూతు ప్రధాన కారణం అయింది.
            తెలంగాణలోనేకాక ఆంధ్రప్రదేశ్ లోని  అన్ని ప్రాంతాలలోనూ ఒకేరకం బూతు పదాలు వాడుతారు. అవన్నీ ఆయా ప్రాంతాల్లో నుడికారాలే. జనసామాన్యం వాటిని విరివిగా వాడుతారు.  అయితే, సాహిత్యంలో వాటిని  వాడరు.
            స్కైబాబా కవితలో ఉద్యమ భావోద్వేగంకన్నా బూతు ప్రీతి ఎక్కువగా వుంది. దాన్ని ఎవరైనా తప్పక తప్పుపట్టాల్సిందే. ఇది వారికి ఉద్యమ ఆవేశంలో వచ్చిందేమీ కాదు. తెలంగాణ ఉద్యమం ఆరంభం కావడానికి ముందే వారు రాసిన ఇతర కవితల్లోనూ బూతు  ఛాయలున్నాయి. బూతు రాయడం వారికి సహజాతం.
            విజయవాడలో తన మీద దాడికి ప్రయత్నించింది కమ్మ సామాజికవర్గం అని వారు ఆరోపిస్తున్నారు. వారు ప్రదర్శించిన వీడియోల్లో వాగ్వివాదం జరుగుతున్నంత సేపు  ఆయన భుజం మీద చేయివేసి గట్టిగా అండగా నిలబడిన కాకర్ల సజయ సామాజికవర్గానికి చెందిన మనిషే. దాడి చేసినవాళ్ళూ, కాపాడినవాళ్ళూ ఇద్దరూ ఓకే సామాజికవర్గానికి చెందిన వారయినపుడు దాన్ని ఏమనలో వారు ఇంకా నేర్చుకోవాల్సివుంది. కమ్మ సామాజికవర్గానికి తెలంగాణలో ఇప్పుడు ఉత్తేజాన్నిస్తున్న నాయకుడు కేటిఆర్. ఆ పరిణామాల్ని మనం జీహెచ్ యంసీ ఎన్నికల్లో చూశాం. కేసిఆర్, కేటిఆర్ లకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే ఫ్లెక్సీలు ఏపీలో కూడా వెలుస్తున్న రోజులివి.

            విజయవాడ ఘటన వెనుక హిందూత్వశక్తుల  ప్రమేయం వుందని కూడా స్కైబాబ అనుమానిస్తున్నారు. ఇది మరీ విచిత్రంనిజానికి హిందూత్వశక్తుల  దృష్టిలో స్కైబాబ చాలా మంచివారు. ప్రేమాస్పదులు. ముస్లింలను "అరే సూవర్ కే ఔలాద్!"  అని తిట్టి హిందూత్వశక్తుల్ని గొప్పగా ఆనందింప చేసిన చరిత్ర వారికి వుంది. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగినా, గతవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ జామియా మసీదులో  ఖురాన్ ను తగులబెట్టినా నోరు మెదపని బుధ్ధిమంతులు వారురాజమండ్రి మసీదులో మౌజన్ హత్యకు కొనసాగింపుగా తనను విజయవాడలో చుట్టు ముట్టారని వారు చెప్పుకుంటున్నారు. రాజమండ్రి సంఘటనకు వ్యతిరేకంగా జరిగిన శాంతిర్యాలీల్లో చాలా మంది ముస్లిం ఆలోచనాపరులు పాల్గొన్నారు. ఆ జాబితాలో స్కైబాబ లేనేలేరు. వారు అలాంటి పనులు చేయరు.  
            రచయితలు, కవులుకళాకారులు ఆలోచనాపరుల భావప్రకటనా స్వేచ్చ గురించి స్కైబాబా మాట్లాడితే నప్పదు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అదుపులోనికి తీసుకుని పోలీసు కష్టడీలో పెట్టిన తెలంగాణ  రచయితలు, కవులుకళాకారులు ఆలోచనాపరుల్ని  స్కైబాబా వెళ్ళి పలకరించారా? కనీసం సామాజిక మాధ్యమాల్లో అయినా వాళ్లకు సంఘీభావం తెలిపారా? ఈసడించుకున్నారా? అప్పుడు అసలు వారి స్పందన ఏమిటీ? వారు చెపితే వినాలనుంది.
            విజయ భాస్కర్ చాగంటి, కెసి చేకూరి, మోహన్ రావిపాటి తన మీద దాడి చేశారనేది స్కైబాబ ఆరోపణ. ఆ కవితలో వాడిన వ్యక్తికరణకు విచారం వ్యక్తం చేయమని మాత్రమే అడిగాం అన్నది వాళ్ల వివరణ. వాస్తవం ఈ రెండు వాదనల మధ్య వుంది.
   
    ఈలోగా, అసలిది అప్పనంగా సెలబ్రెటీ కావడం కోసం కోరి తెచ్చుకున్న తగవు అనే పుకారు కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది. తెలంగాణలోనే ఎవరూ పట్టించుకోని ఆ కవిత వంద జెరాక్స్ కాపిలు టిడిపి కార్యాలయానికి ఎవరు చేర్చారు అనే అంశం ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.    
            ఏమైనా స్కైబాబాను నిలదీసిన ఆ ముగ్గురికీ విజయవాడ నగర దౌత్య సాంప్రదాయం తెలీదుస్కైబాబ కవితలో తమకు అభ్యంతరంగా వున్న  బూతుల్నే తిరిగి ఆయన మీదే ప్రయోగించడం  ఏం సంస్కారం? బూతులు స్కైబాబా వాడినా తప్పే. ఆయన ప్రత్యర్ధులు వాడినా తప్పే.

              ఉమ్మడి మదరాసు రాష్ట్రం చీలుతున్న రోజుల్లో తమని తిడుతున్న రాయలసీమ నాయకులు కడప కోటి రెడ్డి, పప్పూరి రామాచార్యుల్ని సాదరంగా ఆహ్వానించి   ఏనుగు అంబారీ మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో తిప్పి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు చేతుల మీదుగా ఘనంగా సత్కరించిన జనం విజయవాడ వాసులు. ఆంధ్రాప్రాంతం వారిని నిత్యం విమర్శించే  తెలంగాణవాది కేవి రంగా రెడ్డిని 70 పుట్టిన రోజును పురస్కరించుకుని  అయ్యదేవర కాళేశ్వరరావు, నీలం సంజీవ రెడ్డిల  చేతుల మీదుగా ఘనంగా పౌరసన్మానం చేసిన  దౌత్యనీది విజయవాడది. తెలుగులో ఒక్క పదం కూడా మాట్లాడలేని ఓ బెంగాలీ కవి హరీంద్రనాధ్ చట్టోపాధ్యాయని గెలిపించి తొలి లోక్ సభకు పంపిన రాజకీయ చైతన్యం  వాళ్ళది. ఒకప్పుడు తూర్పు గాలులన్నీ కలకత్తా నగరం తరువాత విజయవాడనే తాకేవి.
            గత సాంప్రదాయాలు తెలిసుంటే ఆ ముగ్గురు మరోలా ప్రవర్తించేవారు. వేదిక సైజులో పెద్ద ఫ్లెక్సీ మీద స్కైబాబ  కవితను పెద్దపెద్ద అక్షరాలతో ప్రింటు తీయించి  వేదిక పక్కన వేలాడ గట్టి. పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రారంభానికి ముందు వారి దగ్గరికి వెళ్ళి చేతుల్లో పూల చెండు పెట్టి "మీ కవితను మీ నోటితో ఒకసారి గట్టిగా ఆలపించండి. మాతోపాటూ ఇక్కడున్న మీ జీవితభాగస్వామి, ఇతర మహిళలు వింటాం” అని  వినయంగా అడిగివుంటే ఎంత బావుండేదీ? ఇలా చేస్తే  విజయవాడ మర్యాద పోయేదికాదు. పైగా ఒక మంచి సాంప్రదాయం కొనసాగివుండేది.
            కవిత్వాన్ని వున్నతంగా రాయడం కొందరు కవులకు తెలియనట్టే నగర చరిత్రను వున్నతంగా రాయడం  కొందరు యువకులకు తెలీదు.
---------------------   

09 జనవరి 2018 


నేను నిజాయితీగానే వ్యవహరించాను. 
10 జనవరి 2018 

ప్రయాణ బడలిక కారణంగా జనవరి 3 రాత్రి నేను చాలా త్వరగా నిద్రపోయాను.  రాత్రి 8.25కు ఒక మిత్రుడు ఫోన్ చేసి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో గొడవ జరిగిందని చెప్పాడు. ఈ వార్తను తను సంగిశెట్టి శ్రీనివాస్ ఫేస్ బుక్ వాల్ లో  చూశానన్నాడు. నేను వెంటనే కంప్యూటర్ ఆన్ చేసి ఆ పోస్ట్ చూశాను. ఒక రచయిత మీద దాడి జరగడం, పైగా ఆ దాడి విజయవాడలో జరగడం నన్ను కలచి వేశాయి. వరుసగా ఐదు  పోస్టులు పెట్టాను. ఫేస్ బుక్కులో స్కైబాబాకు ఇంత గట్టిగా నైతిక మద్దతు ఇచ్చినవాళ్ళు మరొకరు వుండరు. 

 ఆ తరువాత ఆ రాత్రే దాడి జరగలేదంటూ  నాకు మరికొన్ని ఫోన్లు వచ్చాయి. అప్పుడు 6వ 7వ పోస్టులు పెట్టాను. 
వాదోపవాదాలు ముగిశాక పరిస్థితి చల్లబడ్డాక ఆరు రోజుల తరువాత నిన్న 'కవిత్వంలో బూతు తెచ్చిన తంటా !' అనే విశ్లేషణ రాశాను. 

ఆరోజు దాడి జరిగిందనగానే దాన్ని తీవ్రంగా ఖండించడం ఎంత అవసరం అనుకున్నానో ఆ కవితలోని తప్పును వివరించడం కూడా  అంతే అవసరమని నిన్న అనుకున్నాను. స్కైబాబ కపటి. మొదటి భాగాన్ని దాచిపెట్టి రెండో భాగాన్ని తెరుస్తాడు. 

"ఒక ముస్లిం రచయితపై దాడి జరిగిందన్న విషయం కూడా విస్మరించి విమర్శలు చేయడం వారి దుర్మార్గపు మనస్తత్వానికి నిదర్శనం". అని ఒక నిందను తన వాల్ పై పోస్టు చేశాడు. 

విజవాడలో వివాదానికి కారణం 'దెంగేయ్' కవితలో  "మా తెలుగుతల్లికి మల్లెపూదండ" పాటను అవమానించడం, "నా కొడక !" అనడం.

తెలంగాణ ఉద్యమ ఆవేశంలో తెలుగు, తెలంగాణ రెండూ వేరు వేరు భాషలనే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  అది వెనక్కి తగ్గింది. కేసిఆర్ సహితం పాత అభిప్రాయాన్ని మార్చుకుని  తెలుగు ప్రపంచ మహాసభలు జరిపారు గానీ తెలంగాణ ప్రపంచ మహాసభలు పెట్టలేదు. ఈ మార్పును స్కైబాబ గుర్తించినట్టులేదు. 

విజయవాడలో స్థానికులు స్కైబాబాను కోరింది "మా తెలుగుతల్లికి మల్లెపూదండ" పాటను అందరితోపాటూ ఆలపించమని. దానికి అతను  నిరాకరించడంతో వాదోపవాదాలు పెరిగి పెద్ద రచ్చ జరిగింది.   

ముందు నోరు జారడం ఆ తరువాత ఎవరయినా  నిలదీస్తే నోరు మూసుకోవడం స్కైబాబ అలవాటు. ఇది ఏమాత్రం మేధోలక్షణం కాదు. గతంలో ముస్లిం అనే పదాన్ని నిర్వచించమంటే అతను పారిపోయాడు. ఇప్పుడు 'నా కొడకా!'  అనే పదాన్నీ అతను నిర్వచించలేడు. అతనో మేధో దివాళాకోరు. 

స్కైబాబా ముస్లింవాదం అంటే ఏమిటో నేను కొంచెం తీరిక చేసుకుని ఓ రెండు రోజుల్లో ఆచరణాత్మకంగా వివరిస్తాను. 

నేను ఆ రాత్రి స్కైబాబ కు మద్దతుగా పెట్టిన పోస్టుల్ని మిత్రులు ఈ కింద చూడవచ్చు. 

1.
January 3 at 8:30am
విజయవాడ బుక్ ఫేర్ లో రచయిత స్కైబాబా మీద దాడి జరిగిందని విన్నాను. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

2.
January 3 at 8:34am 
రచయిత స్కైబాబా మీద దాడి చేసి విజయవాడ పేరు చెడగొట్టిన ఆ దుండగులు ఎవరూ?

3. 
January 3 at 8:49am
ఆంధ్రప్రదేశ్ విభజన డిమాండును ముందుగా మొదలుపెట్టింది బీజేపి; కాకినాడ ప్లీనరీలో.

4.
January 3 at 8:52am 
ఆంధ్రప్రదేశ్ ను చీలుస్తారా? మెడపట్టి చీల్చమంటారా? అని కేంద్రప్రభుత్వాన్ని బెదిరించింది టీడిపి.

5. 
January 3 at 8:59am 
"ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు' అని నినదించి రాష్ట్రాన్ని చీల్చిన పార్టీని వదిలేసి ఒక కవిత మీద దాడిచేయడం ఏమిటీ?

6. 
January 3 at 5:32pm 
కవిని కవిత్వంతో ఎదుర్కోవాలి !

స్కైబాబా కవిత 'దెంగేయ్'ను అప్పుడే నిరసించాను. 
స్కైబాబా మీద దాడిని కూడా ఇప్పుడు నిరసిస్తున్నాను.

7.
January 4 at 2:54am

దాడి, రగడ, క్షమాపణ కోరమనడం ల మధ్య సత్యం దాగుంది.

No comments:

Post a Comment