Sunday 8 September 2013

ప్రజాగ్రహం

ప్రజాగ్రహం
టిఆర్ఎస్‌తో 2004లో కాంగ్రెస్ పొత్తు
2009లో కెసిఆర్‌తో తెలుగుదేశం
తెలంగాణ ప్రభావం 2009 ఎన్నికల్లో తక్కువే
కెసిఆర్ దీక్షతో మారిన సన్నివేశం
వ్యవస్థతో విసిగిపోతున్న ప్రజానీకం
స్వీయ ప్రయోజనాలకే పార్టీల ప్రాధాన్యం
తారుమారవుతున్న పార్టీల విధానాలు
సమైక్యం నుంచి విభజనకు...
విభజననుంచి సమైక్యానికి!
కొత్త నాయకులు, నినాదాలు, విలువలు అవసరం 


ప్రజల్లో ఇప్పుడున్నంత అలజడి స్వాతం త్య్ర భారత దేశంలో మునుపెన్నడూ లేదు. ప్రజల్లో అలజడి పెరిగితే అది ప్రజాగ్రహంగా మారు తుంది. ప్రజలు తెలంగా ణాను కోరుకుం టున్నారా, సమైక్యాం ధ్రాను కోరుకుంటున్నారా? అన్నది ఒక ఆసక్తికర ప్రశ్నేగానీ, ఏమాత్రం సందు దొరికినా ప్రజలు తమ అలజడిని వ్యక్తం చేయాలనుకుం టున్నారనేది అంతకన్నా ఆసక్తికర అంశం. 2009 ఎన్నికల తరువాత మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఈ అంశాన్నే ధృవీకరిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలన్నీ ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి, చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజాగ్రహాన్నీ, వివిధ పార్టీల మీద ప్రజల అభిమానాన్నీ అంచనా వేయడంలో నిపుణులు సహితం ఒకరకం గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

2009 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు ఏకమై, మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా భావించిన టీఆర్ఎస్‌కు కేవలం పది సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ మహానగరంలో టీఆర్ఎస్ బోణీ కూడా కొట్టలేక పోయింది. ఆ వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీఆర్ ఎస్ సాహసించ లేకపోయింది. 2009 ఎన్నికల గణాంకాలను విశ్లేషిస్తే, తెలంగాణవాదం చాలా తక్కువ స్థాయిలో ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.
ఆ ఏడాది నవంబరు నెలలో కేసీఆర్ నిరాహార దీక్ష ఆరంభించిన తరువాత సన్నివేశం మారిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలోకి తరలి వచ్చారు. దీన్నిబట్టి మనం రెండు రకాల నిర్ధారణకు రావచ్చు. మొదటిది, ప్రజాభీష్ఠానికీ- ఎన్నికలకూ సంబంధం లేదు అనేది. రెండోది, ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఏదో ఒక సందర్భం కోసం వెతుకుతున్నారు అనేది.
ప్రజాగ్రహాన్ని రాజకీయ పార్టీలు తరచుగా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుం టాయి. ఈ విషయం అర్ధంకాకుంటే మనకు సకల జనుల సమ్మె అర్ధం కాదు. ఈ రోజున సీమాంధ్రలో సాగుతున్న నిరసన ఉద్యమం అర్ధం కాదు. దీనికి గతంలో ఒక మహత్తర ఉదాహరణ 1978 నాటి రమీజాబీ కేసు. పద్ధెనిమిదేళ్ల ముస్లిం అమ్మాయిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా- తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. ఆ ఆందోళనలో పాల్గొన్నవారు అత్యాచారానికి వ్యతిరేకులా? ముస్లిం అమ్మాయికి జరిగిన అన్యాయానికి సానుభూతిపరులా? అనేది తేల్చడం చాలా కష్టం. వ్యవస్థతో విసిగిపోయిన జనానికి ఒక నిట్టూర్పు అవకాశం కావాలి. దాన్ని రమీజాబీ కేసు కల్పించింది.
సీమాంధ్రలో ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం సాగుతోంది. బహుశ, గతంలో ఎన్నడూ ఎక్కడా ఏ ఉద్యమంలోనూ లేనంత, పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రజల్లో పెరిగిపోతున్న అలజడికి ఇది తాజా ఉదాహరణ. అయితే, సమైక్యాంధ్ర అనేది వాళ్లకు ఒక నిట్టుర్పేగానీ, వాళ్ల సమస్యకు పరిష్కారం కాదు. సీమాంధ్రలో ప్రజాగ్రహానికీ, సమైక్యాంధ్ర నినాదానికీ సంబంధంలేదు. ప్రజల అలజడి వాస్తవం. నినాదం బూటకం. మొదటిది ప్రజల తిరుగుబాటు. రెండోది, రాజకీయ పార్టీల దారి మళ్ళింపు వ్యవహారం. గమ్యానికీ గమనానికీ సంబంధంలేని అసంబద్ధ పరిణామాలు- ఉద్యమాల్లో చాలా సార్లు జరుగుతాయి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటి, ఐదు వారాల క్రితం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు- జాతీయ కాంగ్రెస్ వ్యూహం గురించి రెండు రకాల వాదనలు బలంగా వినిపించాయి. వాటి సారాంశం ఏమంటే, తెలంగాణలో- కాంగ్రెస్, టీఆర్ ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని, బీజేపి,- టీడీపీల్ని పక్కనపెడతాయనీ, సీమాంధ్రలో- జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని, టిడిపికి అడ్డుకట్ట వేసి, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపియేలో చేరుతుందనీ! ఇలాంటి వాదనలు సహజంగానే టిడిపి అధినేత చంద్రబాబుకు అసహనానికి గురిచేసి ఉంటాయి. రెండు ప్రాంతాల్లోనూ వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందని అనిపించినప్పుడు ప్రత్యర్ధి పార్టీలు వేటికైనా ఆ మాత్రం అసహనం ఉంటుంది.

అయితే, ఈనాటి పరిస్థితికి చంద్రబాబు సహితం సమిధ నొక్కటి ధారబోసిన వారే! చంద్ర బాబు 2004 ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎన్నికల పొత్తును గట్టిగా తప్పుపట్టారు. తెలంగాణ వాదాన్ని సమర్ధించిన కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్నికల గణాంకాల్ని విశ్లేషించడంలో ప్రత్యేక నైపుణ్యమున్న చంద్రబాబు, కాంగ్రెస్ గెలుపునకు టిఆర్ఎస్‌తో పొత్తు మాత్రమే కారణమని నాలుగేళ్ల తరువాత కనుగొన్నారు. తాము గెలవాలన్నా కేసిఆర్‌తో పొత్తు తప్పదని వారు నిర్ధారరించు కున్నారు. తెలంగాణపై టీడిపి విధానాన్ని తేల్చడానికి ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఆధ్వర్యాన ఒక కమిటీ వేశారు. దాదాపు ఆరు నెలలపాటు ఇరు ప్రాంతాల ప్రజల మనో భావాల్ని సేకరించిన ఆ కమిటీ కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వాలనీ, కేసిఆర్ తో పొత్తు కుదుర్చుకోవాలనీ ఒక నివేదికను ఇచ్చింది. నాయుడు- కృష్ణుడు కమిటి నివేదిక ఆధారంగా తెలుగు దేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమేగాక, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి- తెలంగాణ ఏర్పాటుకు అంగీకార పత్రాన్ని ఇచ్చింది. ఆ క్రమంలోనే 2008 విజయ దశమి రోజున మంచి ముహూర్తం చూసి కేసిఆర్‌తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు.

ఇంత చరిత్రను నెత్తి మీద పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై అభ్యంతరం చెప్పడం వింత పరిణామమే. ఇలాంటి వింతలు ఇటీవలి రాజకీయాల్లో ఒక పరంపరగా సాగి పోతున్నాయి.
కాంగ్రెస్ హఠాత్తుగా తెలంగాణ ప్రకటించేసిందని చంద్రబాబు అంటున్న మాటల్లో అర్ధం లేదు. నిజానికి, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన అంగీకార పత్రంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ ఐదేళ్ళు తీసుకుంది. రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదని చంద్రబాబు చేస్తున్న వాదన కూడా పస లేనిదే. రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసమే నిర్ణయాలు చేస్తాయి. అందులో కొత్తది గానీ, వింతైనది కానీ ఏమీ లేదు. మహా అయితే, 2009 ఎన్నికల్లో టీడిపి ఆశించినదాన్నే, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశిస్తోంది. దీన్ని తప్పు పట్టేవాళ్ళు తప్పు పట్టవచ్చు. కానీ, అలా తప్పుపట్టే నైతిక అర్హత టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్‌లకు లేదు. అన్ని పార్టీలు ప్రజలతో ఆడుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజల్ని ఫణంగా పెట్టి జూదం ఆడాయి!

తెలంగాణ జలాల్లో- తమ వలల్లో చేపలు పడబోవడంలేదని టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సరిగ్గానే అర్ధం అయింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు సీమాంధ్ర జలాల్లో వలలు విసిరే ప్రయత్నం చేస్తున్నాయి. షర్మిల, చంద్రబాబు బస్సు యాత్రల లక్ష్యం ఇదే!

కాంగ్రెస్ ప్రకటనలో- విభజన విధి విధానాల ప్రస్తావన, సీమాంధ్ర పునర్నిర్మాణం ప్రణాళిక లేవనేది చంద్రబాబు చేస్తున్న కొత్త వాదన. షర్మిల అంత లోతైన అంశాల జోలికి ఎలాగూ పోలేరు కనుక భావోద్వేగాలతో పని కానించడానికే పరిమితమయ్యారు. అయితే, 2004 లో ఆమె తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ భావోద్వేగాలను ఎందుకు పట్టించుకోలేదనే అంశాన్ని షర్మిల తెలివిగానో, అమాయకంగానో దాటవేస్తున్నారు. కానీ, చంద్రబాబు అలా దాటవేయ లేరు. నాయుడు- కృష్ణుడు కమిటీ నివేదికలో గానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖలో గానీ, ఇప్పుడు తాను మాట్లాడుతున్న విభజన విధి విధానాలు, సీమాంధ్ర పునర్నిర్మాణం ప్రణాళికల ప్రస్తావన ఉందో లేదో స్పష్టం చేయాలి.

సాధారణంగా ప్రతి ఉద్యమం కొన్ని కొత్త సామాజిక విలువల్ని ముందుకు తెస్తుంది. ప్రస్తుత సమైక్యాంధ్ర ఉద్యమంలో అలాంటి కొత్త విలువలు ఏమీ కనిపించడం లేదు; అరవై యేళ్ల నాటి కాలం చెల్లిన విశాలాంధ్ర నినాదం తప్ప. ఆ కోణంలో దాన్ని ఉద్యమం కాదన్నా తప్పు కాదు.

తుపాకీ గొట్టం సూటిగా లేకపోతే మందు గుండు వెనక్కి చీదుతుంది. లక్ష్యం ఆచరణ సాధ్యం కానిది అయితే, ఉద్యమాల్లో ప్రజల శక్తియుక్తులు వృథా అవుతాయి. ఈ అంశాన్ని సీమాంధ్ర ప్రజలు ఇప్పుడైనా గుర్తించాలి. ఇప్పటి వరకు వాళ్లను నడిపించిన సాంప్రదాయ నాయకుల్నీ, నినాదాల్ని, విలువల్ని పక్కన పెట్టి- కొత్త నాయకుల్ని, కొత్త నినాదాల్ని, కొత్త విలువల్ని ఎంచుకోవాలి. లేకపోతే, గడిచిన అరవై యేళ్లలో జరిగిందే, వచ్చే అరవై యేళ్లలో జరుగుతుంది.
ఎ.ఎం.ఖాన్ ఎజ్దాని (డాని)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

No comments:

Post a Comment