Sunday 15 September 2013

నాయకులులేరు నినాదాలు కొనసాగుతున్నాయి

నాయకులులేరుగానీ, వాళ్ల నినాదాలే కొనసాగుతున్నాయి

పోతనామాత్యుడు తన శ్రీమద్భాగవతం కృతిని రాజులకు అంకితం చేయడానికి నిరాకరించాడు. రాజులిచ్చే ఆ "పడుపు కూడు" తిననన్నాడు. ఆ సందర్భంలో ఆయన రాసిన "బాలరసాలశాల నవపల్లవ కోమల కావ్య కన్నెకన్" పద్యం మనకు తెలుసు. రచయితలు, కవుల నైతికతకు సంబంధించి ఇవన్నీ మహత్తర విషయాలు. భాగవతం కథాంశం శ్రీమహావిష్ణువు అవతార విశేషాలయితే దాని కథావస్తువు ఆదర్శ భూస్వామ్యం. దీని అర్ధం ఏమంటే పోతనామాత్యుడు సమకాలీన రాజులు కొందర్ని వ్యతిరేకించినట్టు, రాచరిక వ్యవస్థను వ్యతిరేకించలేదు. భగవంతుని లీలల్ని వర్ణిస్తూ తాను సృష్టించిన రచన రాచరిక, భూస్వామ్య వ్యవస్థలకు సాంస్కృతిక బలాన్ని ఇస్తుందని పోతనకు కూడా  తెలిసివుండకపోవచ్చు. గమనానికీ గమ్యానికీ పొంతనలేని విషయాలు అనేకం సాహిత్యం, సమాజం, రాజకీయాల్లో జరిగిపోతుంటాయి.

సీమాంధ్రలో ప్రస్తుతం సాగుతున్న ఆందోళనను చూస్తుంటే, పోతనామాత్యుని ఉదంతమే గుర్తుకు వస్తుంది. అక్కడ ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు. ప్రజలు వాళ్లను వీరోచితంగా తరిమేశారు.  సీమాంధ్ర ’ప్రజాప్రతినిధులు’ ప్రజలకు భయపడి ఢిల్లీలోనో మరో చోటో పలాయన జీవితాన్ని గడుపుతున్నారు. ఇవన్నీ సీమాంధ్ర ఆందోళనలో నిస్సందేహంగా మహత్తర అంశాలు. కానీ, ఇప్పటికీ వాళ్ళిస్తున్న నినాదం ఏమిటీ? వాళ్ల ’ప్రజాప్రతినిధులు’ 2008  లో  నేర్పిన  ’సమైక్య’ వాదమేకదా! మనం వ్యతిరేకిస్తున్నదానినే సమర్ధించడం ఒక రాజకీయ వైచిత్రి! సీమాంధ్రలో తక్షణం నినాదం మారాలి! అది మారితే సీమాంధ్ర ప్రజలు నిస్సందేహంగా అద్భుత విజయాలు సాధించగలరు.

సీమాంధ్రప్రాంతపు రెండు మూడు ఆధిపత్యకులాల ఆర్ధిక ప్రయోజనాలను కాపాడడం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతున్నదనే విమర్శ ఒకటి వున్నది. సరిగ్గా, అలాంటి విమర్శే తెలంగాణలో విభజనవాదంపై కూడా వుంది. ఉద్యమ ప్రయోజనాలని తమకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం ఆధిపత్య కులాలకు సహజంగానే వుంటుందిగానీ, ఏ ఉద్యమమైనా ఆధిపత్యకులాలకు మాత్రమే పరిమితమై సాగదు. ఇటైనా అటైనా విస్తృత ప్రజాశ్రేణులు కదులుతున్నప్పుడు ఆయా సామాజిక వర్గాలకు చెందిన అనేకానేక ఆకాంక్షలు ముందుకు వస్తాయి. అయితే, విభిన్న సామాజికవర్గాల ఆకాంక్షలు తెలంగాణ ప్రాంతంలో ముందుకు వచ్చినంతగా, సీమాంధ్ర ప్రాంతంలో రావడంలేదు. రానివ్వడంలేదు.

నాయకులు చేసిన తప్పులకు ప్రజల్ని శిక్షించడం అన్యాయమనే వాదన ఒకటి సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు వినిపిస్తున్నది. ఇలాంటి వాదన ఇంకాస్త ముందు వచ్చివుండాల్సింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.  ఆధిపత్యం కోసం ఇరుప్రాంతాల నాయకులు (పాలకవర్గాలు) ఘర్షిస్తున్నపుడు ప్రజల ముందు రెండు మార్గాలుంటాయి. మొదటిది, తమ ప్రాంతపు పాలకవర్గాలతో కలిసి వెళ్లడం. రెండోది, ఇతరప్రాంతపు ప్రజలతో ఐక్య సంఘటన కట్టడం. తెలిసిగానీ, తెలియకగానీ సీమాంధ్ర ప్రజలు నెల క్రితం వరకు తమ ప్రాంతపు పాలకవర్గాలతోనే కలిసి నడిచారు.

ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతకు పునాది వేస్తుందని చాలామంది ఆశించారు. "రాష్ట్ర విభజనతో నీరు, విద్యుత్తు వంటి 30 రకాల సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. వాటి బదులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఉత్తమం” అనేదే ఏపీ‌ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు చేసిన ప్రధాన వాదన. కలిసి వుండడంవల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగే మేలేంటో ఆ సభ చెప్పలేదు. సమైక్య నినాదంతో దాదాపు  లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ లో సమావేశమై, తెలంగాణలో ఒక్కరి సంఘీభావాన్ని కూడా పొందలేకపోయారంటే దాన్ని ఏమనాలీ? హాజరైన సభ్యుల పరంగా చూసుకుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సూపర్ సక్సెస్! కానీ, అదిచ్చిన సందేశం పరంగా చూసుకుంటే అట్టర్ ఫ్లాప్!

ఆంధ్రప్రదేశ్ లో విభజనవాదం పుట్టిందే ప్రభుత్వోద్యోగులవల్ల. రాష్ట్రపతి ఉత్తర్వుల్నీ, జోనల్ విధానాన్నీ, 610  జీవోనీ చిత్తశుధ్ధితో అమలుపరచివుంటే, తెలంగాణ ప్రాంతపు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసమ్మతి పుట్టేదేకాదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పుట్టిన అసమ్మతి క్రమంగా ఇతర రంగాలన్నింటికీ వ్యాపించి పెద్ద ఉద్యమంగా మారిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం! ఇప్పుడు ఎన్జీవోల నాయకత్వంలో సమైక్య ఉద్యమం నడపాలనుకోవడం అర్ధంలేని వ్యవహారం!

సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పంపిన సందేశాల్లో మరో కీలక అంశం, రాష్ట్రాన్ని సమైక్యంగావుంచి, పదిహేనేళ్లపాటు ఏలుకోమని కేసిఆర్ కు ఆఫర్ ఇవ్వడం. ఆరోజు తాను మంత్రి పదవి ఇచ్చివుంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలెట్టేవారేకాదని సీమాంధ్ర ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు అంటున్నపుడే, హైదరాబాద్ సభలో సామాజిక కార్యకర్త గొట్టిపాటి సత్యవాణి ఈ ప్రతిపాదన చేయడం విశేషం. ఇలాంటి ఆఫర్లు పాతికేళ్ల క్రితమే చేసివుండాల్సింది. ఇప్పుడు టూ లేట్!

యాభై ఏడేళ్ల ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్యలు ముఖ్యమంత్రి పదవిలో వున్నది పూర్తిగా ఏడేళ్ళు కూడా కాదు. నాలుగున్నరేళ్ళు ముఖ్యమంత్రిగావున్న జలగం వెంగళరావు స్వంత నియోజకవర్గం సత్తుపల్లి తెలంగాణలోనే వున్నప్పటికీ, ఆయన సీమాంధ్రుడే. గతాన్ని పక్కన పెట్టినా వర్తమానంలో మాత్రం జరుగుతున్నదేమిటీ? ముఖ్యమంత్రి, శాసన సభాధిపతి, డిజీపి, పిసిసి అధ్యక్షుడు అందరూ సీమాంధ్రులే! పంపకాలు అసమానంగా వున్నప్పుడు ఉద్యమాలు పుట్టుకురాకతప్పదు.

యధాస్థితిని మార్చడమే ఉద్యమం. యధాస్థితిని కొనసాగించడం ప్రతీఘాత ఉద్యమం. కలసి ఉండటం ప్రతిఘాతం కాదు. కలిసి ఉండాలని వత్తిడి చేయడం తప్పకుండా ప్రతీఘాతమే. యధాస్థితితో నష్టపోతున్న వాళ్ళు విడిపోవాలనుకుంటారు.  లబ్ది పొందుతున్నవాళ్ళు కలిసివుందామంటారు. అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్!

సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలు తమ కోసం పోరాడడంలేదు. తమ పాలకుల కోసం పోరాడుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రజల భుజాల మీద తుపాకి పెట్టి తెలంగాణ పాలకుల్ని అదుపు చేయాలనుకుంటున్నారు సీమాంధ్ర పాలకులు.

సీమాంధ్ర ప్రజలు తమ కోసం తామే పోరాడాలనుకుంటే వాళ్ల ముందు అనేక చారిత్రక  కర్తవ్యాలున్నాయి.  ఉత్తరాంధ్రా అడవిలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా  ఆదివాసులతో కలిసి వాళ్లు పొరాడవచ్చు. విశాఖపట్నంలో హిందూజాలు సృష్టిస్తున్న భీభత్సానికి వ్యతిరేకంగా పొరాడవచ్చు. కృష్ణా-గోదావరి బేసిన్ లో చమురూ, సహజ వాయువు తవ్వకాలు సృష్టిస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా పొరాడవచ్చు. చమురు కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గోదావరి నది కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీరప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. అనంతపురం జిల్లాలో ఇనప గనుల అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా అనంతంగా కొనసాగుతూపోతుంది. ఈ పనుల్లో ఒక్కటయినా అక్కడి ప్రజలు చేస్తున్నారా? చేయ్యాల్సిన పనులు ఏవీ చేయకుండా మీడియాలో ప్రచారం వచ్చే పనులు మాత్రమే చేయడాన్ని ఏమనాలీ? ఇలాంటి తప్పులు తెలంగాణలో లేవనికాదు. అక్కడా తప్పులున్నాయి. ఎక్కువ తప్పులు ఎటున్నాయి అనేదే ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యం.

ఒకటి రెండుగా మారుతుంది. ఏకత్వంలో భిన్నత్వం. ఏ కుటుంబంలో అయినా  ఒక తరం వెనక్కు వెళితేచాలు ఆ విషయం అర్ధం అవుతుంది. ఏ కుటుంబమూ దీనికి మినహాయింపుకాదు.

పురుషాధిక్య దాంపత్యంలో ఏ భార్య కలిసివుందామనుకుంటుందీ? వాళ్ళిద్దరు కలిసి కొనసాగాలంటే భర్త తన జీవిత భాగస్వామికి సమానస్థాయి ఇవ్వాలి. లేకుంటే, ఆమె జీవితం నుండి తప్పుకోవాలి. ఆ రెండూ జరక్కపోతే,  భార్య ఎలాగూ విడాకులు తీసుకుంటుంది. అది చట్టబధ్ధం కూడా! విడాకుల్ని కూడా భర్త అడ్డుకుంటే ఆ భార్య ఏం చేస్తుంది? అనేది ఊహించడం పెద్దకష్టంకాదు.

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336

హైదరాబాద్
13  సెప్టెంబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, 15  సెప్టెంబరు  2013 

No comments:

Post a Comment