Tuesday 19 November 2013

గ్రహణంపట్టిన అభ్యుదయ సాహిత్యం

గ్రహణంపట్టిన అభ్యుదయ సాహిత్యం

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

డేగల దాడి కన్నా ముందే భల్లూకాలు వచ్చిపడ్డాయి.  అమెరికా ఆరాధకులు ’నిమిజ్‌’ను తెస్తారనుకుంటే పుతిన్‌  ప్రేమికులు వచ్చారు.  రష్యా అమెరికాలు తెలుగు నేల మీద పాలూతేనెల్లా కలిసిపోయాయి! ఆఫ్గనిస్తాన్‌ పై  అలనాడు రష్యా  సాగించిన దురాక్రమణ నుండి పొందిన  ఉత్తేజం ఇప్పటికీ అభ్యుదయ రచయితల సంఘంపై   పనిచేస్తున్నట్టేవుంది. అరసం అగ్రనేత ప్రొఫెసర్‌   యస్వీ. సత్యనారాయణగారు తెలుగు నేలపై బుష్‌ భాష  మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన మనోఫలకంపై  తాలిబాన్లు సజీవంగానే వున్నారు. (’ముస్లిం  సాహిత్యంలో తాలీబాన్ల పుట్టుక’ వ్యాసం, వార్త దినపత్రిక,  రచన పేజీ,  ఆగస్టు 14, 2007)

కష్టాల్లోవున్నవాళ్ళ పక్షాన నిలబడడం నా సహజాతం.  కష్టాల్లోవున్నవాళ్ళ కుల, మత, తెగ, లింగ, జాతి, ప్రాంత  తదితర బేధాల్ని కూడా నేనెన్నడూ పాటించలేదు. కష్టజీవుల  పక్షాన నిలబడ్దప్పుడు కొన్ని నిందలు మోయకతప్పదు.   రెండు రోజుల క్రితం ఓ బహిరంగ సభలో కవి ఖాజా  నన్ను ”సాహిత్య తాలిబాన్‌” అన్నప్పుడు నాకేమీ పెద్దగా ఆశ్చర్యం కలుగలేదు. ఉత్త తాలిబాన్‌ అనేసి  వదిలేయకుండా; నాకు ’సాహిత్య ప్రతిపత్తి’ని కూడా  కల్పించినందుకు అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకునే  లోపులే, సరిగ్గా అదే శీర్షికతో ఈరోజు ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణ వ్యాసం అచ్చయ్యింది.

ఆమెరికా సామ్రాజ్యవాదం  ప్రపంచవ్యాప్తంగా  ముస్లింల  సామాజిక,  సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక  వ్యవస్థల్నీ ఎన్ని కుట్రలతో  నాశనం చేసేస్తున్నదో  "ముస్లిం సాహిత్యంలో కోవర్టుల పుట్టుక" వ్యాసం సుదీర్ఘంగా వివరించింది. అంతర్జాతీయంగా ఆలోచించు, స్థానికంగా ఆచరించు అనేది  సామాజిక ఆచరణకు ఆదర్శవంతమైన నియమం.  ఆ నియమానికి కట్టుబడే; నా వ్యాసం;  చివర్లో, రెండు  స్థానిక ఉదాహరణల్ని పేర్కొంది. కేవలం  యధాతథంగా ఉటంకించడమేతప్ప; ఆ ఉదాహరణల్లోనూ ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు.

ఇదంతా ఎందుకు వివరించాల్సివస్తున్నదంటే, ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణగారు భారీ విద్యైక నేపథ్యం వున్నవారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేస్తున్నవారు. వారి వ్యావృత్తి  కూడా సామాన్యమైనదికాదు. వారు ప్రముఖ వామపక్షవాది.  సాక్షాత్తు అభ్యుదయ రచయితల సంఘం వంటి   ప్రతిష్టాత్మక సాహిత్య సంస్థకు వారు అగ్రనేత.

"కోవర్టుల పుట్టుక" వ్యాసాన్ని మెచ్చుకున్నవాళ్ళు వున్నట్టే;  నచ్చనివాళ్ళూ ఉంటారు. సాధారణ పాఠకుల విషయం  అలావుంచినా, నా అభిప్రాయాలతో ఏకీభవించని విద్యైక సాహిత్య విమర్శకులు  కనీసం రెండు లాంఛనాలను  పాటించాలి. మొదటిది; నా వ్యాసం ఆవిష్కరించిన  అంతర్జాతీయ నేపథ్యన్ని అభావం చేయాలి. రెండోది; నా  వ్యాసం చివర్లో పేర్కొన్న రెండు స్థానిక ఉదాహరణలు  అవాస్తవమని నిరూపించాలి.

జీవప్రదమైన రెండు సాహిత్య లాంఛనాలను  నిర్వర్తించకుండానే  నా వ్యాసంపై ఆధిక్యాన్ని  సాధించాలనుకున్నారు ప్రొఫెసర్‌ యస్వీ  సత్యనారాయణగారు. జాలి కలిగేలా వారు నా వ్యాసం  చుట్టూ పది చక్కర్లు కొట్టారేతప్ప, ఒక్కటంటే ఒక్క  వాక్యం మీదనైనా వాలే సాహసం చేయలేకపోయారు.

సామాజిక,  సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల నాకు అపారమైన  ఆసక్తివున్నది. ధార్మిక అంశాల గురించి నా అవగాహన పరిమితమైనది.  వాటిని గురించి సాధికారికంగా మాట్లాడే ఉత్సుకత కూడా  నాకులేదు. అందుకే నా వ్యాసంలో ధార్మిక అంశాలకు  సబంధించి ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా లేదు. నేను ప్రతిపాదించిన అంశాలపై తన  అభిప్రాయం చెప్పనంత మాత్రాన ప్రొఫెసర్‌ గారిని తప్పుపట్టలేం. కానీ నేను అసలు  ప్రస్తావించనే ప్రస్తావించని అంశాన్ని  ముందుకుతెచ్చి, దానికి నన్ను ప్రతినిధిగామార్చి,  "మతదురభిమాని" అనేసి పరుగెట్టడం మాత్రం నిజంగానే  తప్పుపట్టాల్సిన అంశం.

రాయాల్సినవి రాయని యస్వీగారు  రాయాల్సిన అవసరంలేనివి అనేకం రాశారు. పోనీ వారు రాసిన వాక్యాలకైనా ప్రాణం వుందా? అంటే అదీలేదు.  పట్టుకుని  చూస్తే; వాటిల్లో ఒక్క వాక్యానికి కూడా నరమూలేదు;  ఎముకాలేదు. వెన్నెముకేలేని వాక్యాలతో పోరుచేయడం "సాహిత్య తాలిబాన్ల"కు క్షాత్రధర్మంకాదు. నా దృష్టిలో సాహిత్య విమర్శ అంటే అక్షరాలా అక్షరయుధ్ధం.

ప్రతి జాతి, ఉపజాతి, తెగ, కులం, మతం, ప్రాంతం, భాషలకూ  తమవైన ప్రత్యేక ఆచార వ్యవహారాలుంటాయి. వీటిని  సాంస్కృతిక సౌందర్యంగా చూడాలేతప్ప, ఆధునిక  తర్కాన్ని అన్వయించడం అపార్థాలకు దారితీస్తుంది.  హిందూ మత సంస్కృతే భారత ఉపఖండం సంస్కృతి అని  నమ్మేవాళ్ళు చాలామందే వున్నారు. కమ్యూనిస్టులు  సహితం దీనికి మినహాయింపుకాదు. ఇలాంటి నమ్మకానికి   కారణాలు రెండు. మొదటిది, ఇతర మత సంస్కృతుల గురించి  తెలియకపోవడం. రెండోది, మన సంస్కృతినే ఇతరులు  ఆచరించాలనుకోవడం. ఇందులో మొదటిది అమాయకత్వమైతే;  రెండోది ఆధిపత్యం.

సాంస్కృతిక భిన్నత్వంలో ఏకత్వం అంటే విలీనంకాదు;  ఐక్యసంఘటన. సాంస్కృతిక ఐక్యసంఘటన అంటే ఎవరి  సంస్కృతినీ వాళ్ళు ఆచరించుకుంటూ ఇతరుల సంస్కృతిని గౌరవించడం. ఇద్దరి సంస్కృతుల్లో  సారూప్యం ఉన్న అంశాలకు ప్రాచూర్యాన్ని కల్పించడం;   తీవ్రంగా విభేధించే అంశాలను త్యజించడం.

అందుకు భిన్నంగా, అందరూ తమతమ సంస్కృతుల్ని  వదులుకుని, మెజారిటీ మతసంస్కృతిని అనుసరించాలని  ప్రతిపాదిస్తున్నవారూ వున్నారు. సాంస్కృతిక  ఆధిపత్యవాదం అంటే ఇదే. ముస్లిం మహిళలు బుర్ఖాను  త్యజించినా వీళ్ళు సంతృప్తి చెందరు; బొట్టు కూడా  పెట్టుకోవాలంటారు. దీనికి వాళ్ళు పెట్టిన  ముద్దుపేరు; సాంస్కృతిక జాతీయవాదం.

మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ రాజకీయాలతో విసిగిపోయిన కొందరు హైదరాబాదీ  ముస్లింలు వామపక్షాలపట్ల ఆకర్షితులవుతున్నారు.  ఇళ్ళ  స్థలాల కోసం సిపియం, సిపి‌ఐ నిర్వహిస్తున్న   భూపోరాటాల్లో పాల్గోనే ముస్లింల సంఖ్య కూడా  గణనీయంగానే పెరుగుతోంది.  ఈ అంశానికి గట్టి  ప్రాచారాన్ని కల్పించి, మరింత మంది ముస్లింల  మద్దతు కూడగట్టగలిగితే, రానున్న గ్రేటర్‌ హైదరాబాద్‌  ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించవచ్చని  వామపక్షాలు ఆశిస్తున్నాయి. వామపక్షాలు నిర్వహించే  ఆందోళనల్లో  పాల్గొంటున్న వాళ్ళు ముస్లింలని బయటి ప్రపంచానికి  చెప్పాలంటే  మగాళ్ళకు ’గడ్డాలు’, ఆడాళ్లకు ’బుర్ఖాలు’  ఉండాలి!. అదేకదా వాళ్లకు గుర్తింపు!.  అప్పుడే మీడియా పాఠకులు, ప్రేక్షకులు  వాళ్ళను సులువుగా గుర్తిస్తారు.  కనుక,  ఇప్పుడు  వామపక్షాలు సహితం బూర్ఖా బాటలో నడవక తప్పడంలేదు. ఇది ప్రహసనంకాదు; విషాదం.

నా వ్యాసంలో ఎక్కడాలేని బుర్ఖాల గురించి ఇంతగా ఆవేదన చెందిన ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణగారు తన సంస్కరణోద్యమాన్ని  కమ్యూనిస్టు కార్యాలయాల నుండే ఆరంభిస్తే  ఇంట గెలిచినట్టూ వుండేది. పనిలో పనిగా,  హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గడ్డానికీ, సవజోత్‌ సింగ్‌  సిధ్ధూ గడ్డానికీ తాత్విక బేధం ఏమిటో, బృందా కారత్‌ బొట్టుకూ,  సాధ్వీ రితంబర బొట్టుకూ ధార్మిక వైరుధ్యం ఏమిటో వివరిస్తే  మాబోటి వాళ్లక్కూడ సాంస్కృతిక వ్యవహారాలపట్ల  కొంచెం అవగాహన పెరగడానికి అవకాశం వుండేది. ఇది సవాలుకాదు; విన్నపం.

ముస్లిం సంస్కృతిపట్ల సామ్రాజ్యవాదుల అవగాహనకూ,  కమ్యూనిస్టుల అవగాహనకూ తేడా ఏమిటో ప్రొఫెసర్‌ యస్వీ  సత్యనారాయణగారు తెలియజేస్తే భవిష్యత్తరాలకు కొంచెం  మేలు జరిగేది.  ప్రాంతీయ సంస్కృతుల్నీ సామ్రాజ్యవాదం నాశనం  చేసేస్తున్నదని కమ్యూనిస్టు నాయకులు తరచూ ఆవేదన  వ్యక్తం చేస్తుంటారు. కానీ, ప్రాంతీయ సంస్కృతుల్నీ  పరిరక్షించుకోవడంపట్ల కమ్యూనిస్టులకు ఒక విధానం  వున్నట్టు కనిపించదు. నూట డెభ్భై సంవత్సరాల  సుదీర్ఘ చరిత్రలో, కమ్యూనిస్టులు, ఇప్పటివరకు  తమదైన ఒక సంస్కృతీని  రూపొందిచుకున్నాట్టూ నాకు  తెలీదు. ఆమధ్య కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో. ఓ సీనియర్ కార్మిక నాయకుని భౌతికకాయానికి శ్రధ్ధాంజలీ ఘటిస్తూ ప్రొఫెసర్ యస్వీగారు న్యుస్ ఛానళ్ళు అన్నింటిలోనూ ప్రముఖంగా కనిపించారు. అక్కడ వారు ఆచరించిన కర్మకాండే వారు ప్రతిపాదిస్తున్న "లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద సంస్కృతి" అని మనకు తెలీదు. ఇది వెటకారంకాదు; నిజాయితీ ఒప్పుకోలు.    

అమెరికా-భారత్‌ పౌర అణు ఒప్పందం, సెవెంత్ ఫ్లీట్ లో భారత నౌకాదళ యుగళ గీతాలన్నీ  దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమేనంటూ వామపక్షాలు భూమ్యాకాశాల్ని ఏకం చేస్తున్న కాలంలోనే నా వ్యాసం అచ్చయింది.  యస్వీగారు నా వ్యాసాన్ని ఖండించబూనుకోవడమే ఒక విశేషమైతే,   అమెరికామీద పల్లెత్తు మాట కూడా అనకుండా వారు వీరోచిత  పలాయానం చిత్తగించడం మరీ విశేషం! అరసానికి అమెరికా గ్రహణం బాధాకరమే! ఇది యస్వీగారి స్వయంవికాసమో, అరసం నూతన అంతర్జాతీయ విధానమో మనకు తెలీదు. ఇది ఎద్దేవాకాదు; తేల్చుకోవాల్సిన అవసరం!

ముస్లిం అభిమానం నాకెలాగూ వున్నది. దాన్ని దాచుకోవాల్సిన అవసరమూలేదు. ఇప్పటి కష్టకాలంలో భారత ముస్లింలకు మతాభిమానం కూడా చారిత్రక అవసరమని నేను భావిస్తాను. ప్రొఫెసరుగారు  "మతదురభిమానం" అన్నారు. ఇది కొంచెం తీవ్రమైన నిందే. నా వ్యాసంలో వారికి అలాంటి అభిప్రాయాన్ని కలిగించిన ఒక్క వ్యాక్యాన్నైనా దయచేసి చూపెడితే బావుండును. ఇది వినయం కాదు; సవాలు.

ఒక్కటే ఆవేదన. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ  ముస్లిం సమాజం కష్టకాలంలోవుంది. దాన్ని మరింత  కష్టాలపాలు చేయవద్దు. శత్రువుల దాడినే తట్టుకోలేక  అది అల్లాడిపోతోంది. ఆపైన; మిత్రుల దాడి కూడానా!.  మిత్రులు, సహచరుల రూపంలో తన వాళ్ళకు హానీ చేసేవాళ్ళను  కోవర్టులంటారు. కోవర్టు అనేది ఉద్యమ భాషే అనే  అభిప్రాయంతోనే ఆ పదాన్ని ఎంచుకున్నాను. ఆ పదం చాలా  తీవ్రంగా, కటువుగా వుందని కొందరు మిత్రులన్నారు.  వారి అభిప్రాయంతో  ఏకీభవిస్తున్నాను. ఎవరైనా  భాషావేత్తలు, ప్రత్యామ్నాయంగా, అంతకన్నా సరళమైన  పదాన్ని సూచిస్తే స్వీకరించడానికి  సిధ్ధంగావున్నాను. ఇది సవాలుకాదు; వినయం.

హైదరాబాదు
14  ఆగస్టు   2007
ప్రచురణ : వార్త దినపత్రిక, రచన పేజీ, 7 అక్టోబరు 2009

(వార్త దినపత్రిక, రచన పేజీ,  ఆగస్టు 14, 2007 సంచికలో  యస్వీ. సత్యనారాయణ వ్యాసం  ’ముస్లిం సాహిత్యంలో  తాలీబాన్ల పుట్టుక’ కు సమాధానం)

No comments:

Post a Comment