Wednesday 23 April 2014

గురువులూ మీకు వందనం!

My Teachers in Journalism

పాత్రికేయ గురువులూ మీకు వందనం!
డానీ

నోటికి అన్నమే తింటున్నారా? అనే అరుణ్ సాగర్ పోస్టింగ్ (https://www.facebook.com/arun.sagar.9440?fref=nf) చూశాక రెండు విషయాలు రాయాలనిపించింది. అతని ఆవేదన నా జర్నలిజం కెరీర్ లో కొన్ని మైలురాళ్ళని గుర్తుతెచ్చింది. ముఖ్యంగా, నా గురువుల్ని తలుచుకోవాలనిపించింది.

       నాకు అప్పర్ ప్రైమరీ స్కూలు దశ నుండే రాయడం అలవాటు అయింది. నియతవిద్య  మానేశాక 1973లో రాసిన ప్రగతి నాటికకు  పరిషత్తు నాటకాల్లో మంచి గుర్తింపు వచ్చింది. రచయితగా నేను యవ్వనంలో ప్రవేశించింది 1978 లో విప్లవ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాతే. ఉపస్రవంతి పత్రికల్లో ఎనిమిదేళ్ళపాటు రచనావ్యాసంగాన్ని కొనశాగించాక 1986 జనవరిలో ప్రధాన స్రవంతి పత్రికల్లో  ప్రవేశించాను.  ప్రధాన స్రవంతి పత్రికల్లో   నా తొలి వ్యాసం ఉదయంలో అచ్చయింది. అప్పట్లో ఆ పత్రిక్కి ఏబీకే ప్రసాద్ సంపాదకుడు. ఆయనే నాకు తొలి బ్రేక్ ఇచ్చారు. మాది ఏబికే ప్రసాద్ కల్ట్ అని చెప్పుకోవడానికి నేను ఇప్పటికీ గర్వపడతాను.

                     విప్లవ పత్రికల రచనల్లో భావోద్వేగానికి పెద్దపీట వేస్తారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ఆవేశం పాళ్లను తగ్గించి, నిష్కామంగా రాయాలి; కనీసం రాస్తున్నట్టు వుండాలి. ఈ కిటుకుని నేను మిత్రులు కే శ్రీనివాస్ (ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్)  దగ్గర చేతులుకట్టుకుని నేర్చుకున్నాను. కొన్ని టాపిక్స్ చెప్పి పనికట్టుకుని నాతో రాయించింది వేమన వసంత లక్ష్మీ.

                     ఇంకో మూడేళ్ళు ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాసిన అనుభవం తరువాత 1988లో ప్రేమ కొద్దీ ఆంధ్రభూమితో వర్కింగ్ జర్నలిస్టుగా మారాను. అప్పుడూ ఆ వుద్యోగం ఇచ్చింది ఏబీకే ప్రసాద్. అప్పటి మా బ్యూరో చీఫ్ సతీష్ చందర్. 1990లో నన్ను డక్కన్ క్రానికల్ కు మార్చారు. అప్పుడు మా బ్యూరో చీఫ్ కే శ్రీరాములుగారు. నాకు తొలి ప్రమోషన్ ఇప్పించింది శ్రీరాములుగారే!  డక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్నపుడు ఎడిషన్ ఇన్ చార్జి బీ. జయప్రకాశ్ రెడ్డి నను చాలా ప్రోత్సహించారు.

 1991లో నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. దీనికి సమన్వయకర్తలు రావి రాంప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్. అక్కడ ఎడిషన్ ఇన్ చార్జి యూయస్ ఎన్ రాజుగారు.  2003లో నేను సీటీవి ద్వార టెలివిజన్ జర్నలిజంలో చేరాను. దాని ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య. జీయం ధనేకుల సుందరయ్య. 

                     ఇందులో విశేషం ఏమంటే నేను గురువులుగా పేర్కొన్న వాళ్ళలో కొందరు నాకన్నా వయసులో చిన్నవారు. మినహాయింపులేకుండా నా గురువులందరూ నా మీద వాత్సల్యాన్నే చూపించారు. వాళ్ళకు గురుదక్షణగా అన్నట్టు నేను కూడా నా శిష్యపరంపర మీద వాత్సల్యాన్నే ప్రదర్శిస్తూ వచ్చాను.

                     అయితే, దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘకాలంలో ఎంతటి మిత్రులతో అయినా మధ్యలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. నాకు నా గురువుల్లో కొందరితో అలాంటి సంఘటనలు కూడా వున్నాయి.  ఇలాంటి సందర్భాల్లో నేను ఎన్నడూ నా గురువులకు ప్రత్యర్ధిగా నిలబడదలచలేదు. నాకు కొంచెం నష్ఠం జరిగినాసరే అస్త్రసన్యాసంచేసి అక్కడి నుండి తప్పుకునేవాడిని. (తోక ముడిచేవాడిని అన్నా తప్పుకాదు)  అసలు నా గురువులకు వ్యతిరేకంగా వాళ్ళ పరోక్షంలో మాట్లాడడం కూడా నాకు రుచించదు; ఏవో కొన్ని సరదా మాటలుతప్ప.

                     ఏడాది క్రితం నా గురువు ఒకరు నన్ను కలవడానికి  ఎన్-టీవీ ఆఫీసుకు వచ్చారు. వారి చొక్కా చిరిగివుంది. దాన్ని దాయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నేను కొత్త బట్టలు వేసుకుని ఆఫీసుకు వచ్చాను. జీవితంలో ఇంతటి కాంట్రాస్టు ప్రత్యక్షంగా ఎదురయితే నేను భరించలేను. ఒంటి మీద చొక్కా తీసేసి ఇచ్చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలాంటి నాటకీయ ఆలోచనలు వస్తుంటాయి. కానీ తమాయించు కున్నాను. వారు కొన్ని డబ్బులు కావాలన్నారు. పర్సు చేతికి ఇచ్చి తీసుకోండి అన్నాను. వారు అందులో నుండి రెండువేలో, మూడు వేలో తీసుకుని ఇది చాలు అన్నారు. ఫస్ట్  వీక్ లో తిరిగి ఇచ్చేస్తానని రెండు మూడుసార్లు అన్నారు. మీకు నేను అప్పు ఇవ్వడంలేదు మీరు తిరిగి ఇవ్వడానికి. ఈ విషయాన్ని నేను ఇక్కడితో మరిచిపోతాను. మీరూ మరిచిపొండి. ఎప్పుడయినా ఇబ్బందిగా వుంటే నా దగ్గరికి రండి. మొఖమాటపడవద్దు. నా దగ్గర గొప్పగా డబ్బులు వుండవు. అయినా  వున్నది సర్దుకుందాం అన్నాను.

తల్లిదండ్రులు దయనీయ స్థితిలో వుంటే ఆ పాపం పిల్లలదే అయినట్టు గురువులు దయనీయ స్థితిలోవుంటే ఆ పాపం శిష్యులదే!


ఏప్రిల్ 24, 20014

7 comments:

  1. నా దగ్గర గొప్పగా డబ్బులు వుండవు. అయినా వున్నది సర్దుకుందాం” అన్నాను.

    ReplyDelete
    Replies
    1. నేను ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టరుగా పనిచేస్తున్న కాలంలో, అనేక సంవత్సరాలు తలుపులు, తాళంకప్పలు లేని ఇంట్లో వున్నాను.

      Delete
  2. danny oka manasunna maneeshi.excellent.

    ReplyDelete
  3. తల్లిదండ్రులు దయనీయ స్థితిలో వుంటే ఆ పాపం పిల్లలదే అయినట్టు గురువులు దయనీయ స్థితిలోవుంటే ఆ పాపం శిష్యులదే!

    - బాగా చెప్పారు సర్! మా గురువులు మమ్మల్ని ప్రేమిస్తున్నదానికన్నా ఎక్కువగానే, మేమూ మా గురువులను ప్రేమిస్తాం. ప్రేమిస్తూనే ఉంటాం. మీ శిష్యపరంరలో నేనూ ఉన్నానని మర్చిపోకండి..

    ReplyDelete