Tuesday 1 April 2014

బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి

వర్తమానం
బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి
డానీ
      
       బీజేపి, టిడిపి పొత్తు కుదిరినట్టు ఇరువైపుల నుండి బలమైన సంకేతాలు వస్తున్నాయి. పొత్తుల చర్చలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తుల నుండి రాష్ట్రానికి చెందిన బీజేపి సీనియర్ నేత స్వచ్చందఘా తప్పుకోవడంవల్ల ఆ పార్టి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకరో, రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లో టిడిపితో పాటూ పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు వ్యవహారంకూడా వచ్చేవారం ప్రకటించే అవకాశాలున్నాయి.

నిజానికి టిడిపి, బీజీపి పొత్తు ఎప్పుడో  పొడవాల్సింది. నరేంద్ర మోదీని బీజేపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణం నుండే చంద్రబాబు పొత్తు దిశగా కదలడం మొదలెట్టారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపి ముందంజ వేయగానే కాంగ్రెస్  జగన్ కు బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చిందనీ,  తాను రాజ్ నాథ్ సింగ్ ను కలవగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందనీ, తాను నరేంద్ర మోదీని  కలవగానే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు చాలాసార్లు అంటున్నారు. అయితే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ బీజేపి సభ్యులు ప్రదర్శించిన అతిఉత్సాహం టీడిపీని ముఖ్యంగా సీమాంధ్ర తమ్ముళ్లని ఇరుకున పెట్టేసింది. తమకు జరిగిన అన్యాయానికి ప్రతిగా సీమాంధ్ర ఏకంగా భారతదేశం నుండి విడిపోతుందని కొందరు ఎస్-తమ్ముళ్ళు ఆవేశంగా ప్రకటించగా, బీజేపిని సీమాంధ్ర ద్రోహిగా  ప్రకటించాలని మరికొందరు ఎస్-తమ్ముళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కారు. హఠాత్తుగా రాజకీయవాతావరణం వేడేక్కడంతో టిడిపి-బీజేపి రాజకీయ సహజీవనం నెలన్నర రోజులు వాయిదా పడింది. ఇప్పుడు వాతావరణం మళ్ళీ పొత్తులకు అనుకూలంగా మారుతోంది.

        బీజేపి-టిడిపి పొత్తు ఒక విధంగా ఓడలు, బండ్లు లాంటిది.  సీమాంధ్రలో బీజేపి భారాన్ని టీడిపి మోస్తే, తెలంగాణలో టీడిపి భారాన్ని బీజేపి మోయాల్సివుంటుంది.  ప్రస్తుతం బీజేపికి సీమాంధ్రలో ఎమ్మెల్యేలుగానీ, ఎంపీలుగానీ లేరు. అక్కడ కాలుమోపాలంటే మోదీ ఇమేజితోపాటూ టీడిపితో పొత్తు అనివార్యమని బీజేపి భావిస్తోంది. పైగా సీమాంధ్రలో ఇప్పుడు అన్నిపార్టీలకన్నా టిడిపి ముందంజలో వున్నట్టు కనిపిస్తోంది. జగన్ పార్టి గతంకన్నా బలహీనపడుతున్నట్టు సంకేతాలు వస్తుండడంతో టిడీపీతో కలిసి ఎన్నికలకు పోవడమే మంచిదని కమలనాధులు భావిస్తున్నారు.

తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ టీడీపిని బలహీనపర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. అధినేత మీద నమ్మకం కుదరని టి-తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ ను వదిలి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బీజేపి అండలేనిదే తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించే స్థితిలోలేదు.  ఈ నేపథ్యంలో సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా తాము కలిసి నడిస్తేనే ఇద్దరికీ శ్రేయస్కరం అనే అభిప్రాయం టిడిపి, బీజేపి రెండింటికీ వుంది.

టిడిపి-బీజేపి అనుబంధానికి దాదాపు దశాబ్దంన్నర చరిత్రవుంది. 1996  ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో  చక్రంతిప్పి  యునైటేడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, 1998ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో  చక్రం తిప్పడానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా  ఢిల్లీ విమానం ఎక్కిన చంద్రబాబు బీజేపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పాయిని ప్రధానిని చేసి, ఎన్డీయే కన్వీనర్ గా హైదరాబాద్ లో విమానం దిగారు.

దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్దగా విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకికపార్శ్వం విమర్శలకు గురైంది. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ ముస్లిం సామాజికవర్గం టిడిపి మీద గట్టిగానే నిరసన వ్యక్తం చేసింది. అప్పటి భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మనస్థాపం చెంది  ఏకంగా రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. 1999ఎన్నికల్లో కార్గిల్ సెంటిమెంటు వాజ్ పాయి ప్రభుత్వాన్ని  గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు. ఎన్నికల్లోచంద్రబాబు టీడిపిని గట్టెక్కించిన  సందర్భం ఇప్పటికి అదొక్కటే!

        ఇప్పుడు పునరేకీకరణకు ప్రధాన ఆకర్షణగా మారిన నరేంద్ర మోదీ వల్లనే అప్పట్లో టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు విమర్శించినప్పటికీ.  బీజేపీతో దోస్తీని మాత్రం వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ  1999 ఎన్నికల్లో గెలిపించినట్టు, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ కూడా ఆ తరువాతి ఎన్నికల్లో అధికారం నుండి తప్పించాయి. 

        అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయని చంద్రభాబు గట్టిగా నమ్మారు. దానితో, 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు. తనతోపాటు ఎన్డీయేను కూడా  ముందస్తు ఎన్నికలకు సిధ్ధం చేశారు. తమ హయాంలో దేశం వెలిగిపోతున్నదనే భ్రమలోవున్న బీజేపి, 2020వరకు  తానే హైటెక్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని గట్టి నమ్మకంతోవున్న చంద్రబాబు ఇద్దరూ ఆ ఎన్నికల్లో భంగపడ్డారు. నిర్ణిత కాలవ్యవధికన్నా ముందుగానే అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పచెప్పారు.

        2004 జమిలి ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత రాష్ట్రంలో టిడిపి, బీజేపిల మధ్య కొంతకాలం పరస్పరం తిట్ల పర్వం కొనసాగింది. టిడీపి హైటెక్కు పోకడలవల్లనే తమపార్టీ ఓడిపోయిందని బీజేపి నేతలు, బీజేపి మీద వ్యతిరేకతవల్లనే తమ పార్టి ఓడిపోయిందని టిడీపి నేతలు విమర్శించుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీలు లాఛనంగా రాజకీయ విడాకులు తీసుకున్నాయి.        2009 ఎన్నికల్లో రెండుపార్టీలు విడివిడిగానే పోటిచేశాయి. అయినా పెద్దగా మార్పురాలేదు.

మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు.

మతవాద శిబిరంలో చాలాకాలం అతివాదిగా కొనశాగిన లాల్ కిషన్ అడవాణీజీకి 2005 లో ఒక విషయం అర్ధం అయింది. ఇంతకాలం తన బలానికి కారణం అనుకుంటున్న మతవాద ముద్రే భారత ప్రధాని కావడానికి తనకు ప్రధాన అడ్దంకిగా మారిందని  భావించారు. దానితో, మతవాద ముద్రను తొలగించుకోవడానికి కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు.

        ఆ తరువాత ఆరేళ్ళకు చంద్రబాబు కూడా అడవాణి మార్గంలో పాపప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టారు. బీజేపీతో అంటకాగిన గుర్తుల్ని చెరిపేసుకుని లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించడం తప్పేనని ఒప్పుకుని  2011 మే 28నటీడిపి మహానాడు వేదిక నుండి వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేసి వాగ్దానం చేశారు.  ఒక దశలో లౌకిక రాజకీయాలు ప్రాతిపదికగా యూపియే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా వారు సిధ్ధమయినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇవన్నీ జగన్ కు బెయిలు రాకముందు,  నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిడానికి ముందు నాటి పరిణామాలు.   

రాజకీయాల్లో శాశ్విత శత్రులు వుండనట్టు, శాశ్విత వాగ్దానాలూ వుండవు, తరువాత మోదిఫికేషన్, నమో, మోదీ మానియా దేశరాజకీయాల్ని హోరెత్తించడం మొదలేట్టిన తరువాత చంద్రబాబు తన పాలసీని మరోమారు మార్చుకున్నారు. బీజేపీతో సాధ్యమైనంత త్వరగా పొత్తు కుదుర్చుకుంటేనేగానీ తెలంగాణలో కేసిఆర్ దగ్గరికి పొతున్న తమ్ముళ్లని ఆపలేమని వారు అనుకుంటున్నారు. అలాగే, చంద్రబాబుతో పొత్తు వుంటేనే సీమాంధ్రలో పార్టీ పున:ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని బీజేపి నమ్మతోంది. ఆ నేపథ్యంలో టీడిపి, బీజేపి రాజకీయ పునర్వివాహాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 9010 75 7776


హైదరాబాద్‌
 20 మార్చి 2014
ప్రచురణ :

No comments:

Post a Comment