Sunday 28 April 2013

Danny Notes on Literature



యజమానిని సంతృప్తి పరచాలనుకునే కళ హీనం అయిపోతుంది.

Cinema Sensitivity

సమాజం స్పందిస్తోంది
Three act play లో   Setup, Confrontation, Resolution అనే మూడు అంశాలుంటాయి. ఉత్తర రామాయణంలో, సుభిక్షమైన శ్రీరామరాజ్యం  Setup.   మహాసాధ్వీ సీత శీలం మీద ఒక చాకలి చౌకబారు వ్యాఖ్యానం చేయడంతో స్పందించిన శ్రీరాముడు  సీతాదేవిని అడవులకు పంపడం   Confrontation.  సీతమ్మ తల్లి తన బిడ్దల్ని శ్రీరామచంద్రునికి అప్పచెప్పి, తాను భూదేవి ఒడిలో చేరడం  Resolution.

 తెలుగు సినిమా చరిత్రలో ఒక మహత్తర మైలురాయి  1963  నాటి లవకుశ సినిమా. విశేష ప్రజాదరణ పొందిన సినిమాలో చాకలి పాత్రను రేలంగి పోషించారు. లవకుశ సినిమా  2012 లోశ్రీరామరాజ్యంగా వచ్చిందిఇందులో, కథను కీలక మలుపు తిప్పే చాకలి పాత్ర కుచించుకుపోయింది. లవకుశలో, రేలంగి, గిరిజ బృందంపై రెండు పాటలు (వెయ్యర దెబ్బ, వల్లనోరి మామా నీ పిల్లనీ) పెట్టగా, శ్రీరామరాజ్యంలో బ్రహ్మానందం బృందంపై రెండు పాటలు కాదుకదా, ఒక్క పాటను కూడా పెట్టే సాహసాన్ని చేయలేకపోయారు నిర్మాత దర్శకులు. గడిచిన యాభై ఏళ్లలో మనుషుల స్పందించే గుణం చాలా పెరిగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

గతంలో, అల్లు రామలింగయ్య కొన్ని వందల సినిమాల్లో బ్రాహ్మణ వేషాలు వేసి, బోలేడు హాస్యాన్ని పంచిపెట్టారు. అప్పట్లో అవెవీ వివాదంకాలేదుకానీ, ఇటీవల వచ్చిన, ’దేనికైనా రెడీసినిమాలో బ్రహ్మానందం వేసిన బ్రాహ్మణ పాత్ర వివాదంగా మారింది. కొన్ని బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి కొన్ని రోజులు పెద్ద పోరాటమే చేశాయి. సినిమా తరువాత టాలీవుడ్లో బ్రహ్మానందం గిరాకీ కూడా పడిపోయింది. బ్రాహ్మణ వేషాలు వేసి, వెకిలి హాస్యం పండించడమేతప్ప, బ్రహ్మానందం చేసే నటన ఏముందనే విమర్శలూ మొదలయ్యాయి.  

కవి యాకూబ్ కు  బహిరంగ క్షమాపణలు

కవిమిత్రుడు యాకూబ్ కోరిక మేరకు కవిసంగమం ఇ-పత్రికలో సాహిత్య వ్యాసాలు రాయడానికి ఒప్పుకున్నాను. యాకూబ్  దానికి ఒక శీర్షికను కూడా ప్రతిపాదించాడు. నేను కూడా ఉత్సాహంగా మౌసు, కీబోర్డు, మానిటర్ సర్దుకున్నాను. కానీ, టాపిక్ కవిత్వం మాత్రమే అనగానే నేను భయపడ్డాను. ’మన’దంతా వచన భాష. కవిత్వంతో మనకు కొంచెం  language Problem! మన వీక్‌నెస్ విషయం యాకూబ్ తో చెప్పలేక ఓ వారం రోజులు ముఖం చాటేశాను. ఇప్పుడు దానికి బహిరంగంగా క్షమాపణలు చెపుతున్నాను.  Yakoob Sorry! 




Great Stories

కథావస్తువు, కథాంశం

సాహిత్యంలో అప్పటికి ఉన్న నియమనిబంధనల్ని వ్యతిరేకించడమంటే, పాత నియమనిబంధనల స్థానంలో కొత్త నియమనిబంధనల్ని సృష్టించడమే! నియమనిబంధనల్ని వ్యతిరేకించేవారు ఉద్యమాల నుండి గొప్ప సాహిత్యం రాదనే వాదనను కూడా ముందుకు తెస్తుంటారు. అదీ తప్పే. ప్రపంచ సాహిత్యంలో మనం గొప్ప రచనలుగా భావిస్తున్నవన్నీ, ఆయా సందర్భాల్లో, ఆయా సమాజాల్లో చెలరేగిన విధ్వంసాలని చిత్రించినవే.

కథా చట్రం, దాని నియమాలు ఒక పార్శ్వం అయితే అంతకన్నా పాణప్రదమైన పార్శ్వం మరొకటుంది. అది భావోద్వేగాల పార్శ్వం. భావోద్వేగాలే లేకుంటే, సాహిత్యానికి అస్తిత్వమేలేదు.

Main Character:           Who is your story about.
Dramatic Premise:       What is your story about.
Dramatic Situation:      What are the circumstances surrounding the action

Christopher Nolan 'Inception' & Vyasa Mahabharata

Christopher Nolan సినిమా Inception (2010) చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి.
ఇలాంటి కథన ఎత్తుగడ నాకు మహాభారత రచనలో కనిపించింది.
జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట, శౌనకాది మహా మునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో story telling కొనసాగుతూవుంటుంది.

కథా, నవల సాహిత్యంలో కథావస్తువు  (Content)   వేరు. కథాంశంవేరు   (plot)   వేరు. కథావస్తువు ఎప్పుడూ రెండు విరుధ్ధ ప్రాతినిధ్య భావోద్వేగాల సంఘర్షణే. ఏ పాత్రలద్వార, ఏ పరిసరాల్లో, ఏ సందర్భంలో ఎలా చెప్పాలి అన్నది కథంశం.
ఔత్సాహిక రచయితలు తరచూ కథావస్తువును, కథాంశాన్ని అర్ధంచేసుకోవడంలో  గందరగోళానికి గురవుతారు. కథాంశం ఎన్నటికీ కథావస్తువుకాదు.
కథావస్తువును ప్రణాళికబధ్ధంగా పట్టించుకోకుండా, కథాంశంతో పూర్తిచేసిన రచనల్ని నాసిరకం రచనలు అనవచ్చు.
పాత్రలన్నీ పెత్తందారీ కులస్తులైనంతమాత్రాన అది భూస్వామ్య సాహిత్యం అయిపోదు. పాత్రలన్నీ పెట్టుబడీదారులై  నంతమాత్రాన అది పెట్టుబడీదారి సాహిత్యం అయిపోదు. ఉనికివాద సాహిత్యానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రధాన పాత్రలు కార్మికులు అయినంత మాత్రాన  అది కమ్యూనిస్టు సాహిత్యం అయిపోదు. ప్రధాన పాత్ర దళితులు అయినంత మాత్రాన అది దళితవాద సాహిత్యం అయిపోదు.  ప్రధాన పాత్రలు స్త్రీలు అయినంతమాత్రాన అది స్త్రీవాద సాహిత్యం అయిపోదు. అలాగే, ప్రధాన పాత్రలు ముస్లింలు అయినంతమాత్రాన అది ముస్లింవాద సాహిత్యం అయిపోదు. ప్రధాన పాత్రలు ఆంధ్రులు అయినంతమాత్రాన అది సమైక్యవాద   సాహిత్యం అయిపోదు. ప్రధాన పాత్రలు తెలంగాణవాళ్ళు అయినంతమాత్రాన అది తెలంగాణవాద సాహిత్యం అయిపోదు.
ఏ ఉనికివాద ఉద్యమాల్లో అయినా సరే ఇలాంటి నాసిరకం కథల ఉత్పత్తే ఎక్కువగా వుంటుంది. చివర్న ఎర్రజెండా పెడితే కమ్యూనిస్టు కథ గానూ, గులాబీ రంగు చూపెడితే తెలంగాణ కథ గానూ కొందరు అనుకుంటారు. ఇలాంటి నాసిరకం కథలకు ఉద్యమాల్లో ఒక సమకాలీన, తాత్కాలిక  ప్రయోజనం కూడా వుంటుంది. అది ఉద్యమాలకు అవసరం కూడా. అంతమాత్రాన వాటిని గొప్ప కథలు అనడం సమంజసమూకాదు, శ్రేయస్కరమూ కాదు.

మనం ఎంత చిన్న సమూహం గురించి రాస్తున్నాం అన్నది ముఖ్యం కాదు మానవీయ సార్వజనీన లక్షణాన్ని ఆవిష్కరిస్తున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. అదే దానికి అంతర్జాతీయ లక్షణాన్ని సమకూరుస్తుంది. మానవీయ సార్వజనీన లక్షణాన్ని వదిలేసి, ఒక ప్రాంతం కోసమో, ఒక గ్రామం కోసమో, ఒక కులం కోసమో కథరాసి అది అంతర్జాతీయ స్థాయి కథ అనుకోవడం బూటకమైన అయ్యుండాలి. ఒఠ్ఠి అమాయకత్వమైనా అయ్యుండాలి!!



పౌలో కోఏల్హో అంటే నాకో చిత్రమైన ఆసక్తి వుంది. ఆయన కొత్త పుస్తకం  Manuscript Found in Accra  గురించి   The Guardian, లో సమీక్ష చదివాను.

సమీక్షకుల ప్రధాన కర్తవ్యం పుస్తకం మీద ’భవిష్య’ పాఠకుల్లో ఆసక్తి కలగజేసి, పుస్తకాన్ని చదివేటట్టు చేయడం. కథాంశాన్నీ, రచయిత శిల్ప నైపుణ్యాన్ని, క్లుప్తంగా వివరించడం. ఒకటీఅర వాస్తవ దోషాలుంటే ప్రస్తవించడం. సాహిత్య విమర్శ ప్రధాన కర్తవ్యం రచనలోని వస్తుశిల్పాల్ని విస్తారంగా పరామర్శించడం.

తెలుగులో మనకు చాలా సమర్ధులైన పుస్తక సమీక్షకులు, సాహిత్య విమర్శకులు వుండేవారు. కొందరు క్రియాశీల రచయితలు, కవులు ప్రధాన స్రవంతి పత్రికల్లో, సాహిత్య విభాగం అధినేతలు అయ్యాక సాహిత్య విమర్శ పూర్తిగా అంతరించిపోయింది. సాహిత్య సమీక్ష ఫక్తు లాబీయింగ్ లా మారింది. ’కేవీ రమణారెడ్డి వ్యాసాలు’ పై జయధీర్ రాసిన  సమీక్ష (ఆంధ్రభూమి 13-4-2013), స్కైబాబా ’అధూరే’ కథా సంపుటిపై సామిడి జగన్ రెడ్డి సమీక్ష (ఆంధ్రజ్యోతి 31-3-2013) రెండూ మన సమీక్షలు ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి తాజా ఉదాహరణలు.

మంచి సమీక్షలు ఎలా వుంటాయి? అని ఎవరైనా విజ్ఞులు అడగవచ్చు.  వాళ్ళు  The Guardian,  లో John Crace  24-3-2013  న రాసిన సమీక్ష చూడవచ్చు.  లింకు ఇస్తున్నాను.

చాలామంది రచయితలు, విమర్శకులు తరచూ కథాంశానికీ, కథావస్తువుకూ, పాత్రలకు, ప్రాంతాలకు మధ్య గందరగోళానికి గురవుతుంటారు. ఒక రచనలోని, పాత్రలన్నీ హిందువులైనంత మాత్రాన దాన్నీ హిందూవాద (హిందూత్వ) సాహిత్యం అననట్టే, పాత్రలన్నీ ముస్లింలైనంత మాత్రాన దాన్ని ముస్లింవాద సాహిత్యం అనలేం. ’వాద సాహిత్యం’ అన్నప్పుడు దానికి కొన్ని ప్రాధమిక షరతులు వుంటాయి. వాదసాహిత్యం అంటే నిస్సందేహంగా పక్షపాత సాహిత్యమే. రచయిత ఒక సామాజికవర్గం పక్షాన నిలబడి, ఆ వర్గంపై ఇతరవర్గాలు సాగిస్తున్న పీడన, అణిచివేతల్ని ఖండిస్తాడు. వీలైతే విముక్తి మార్గాన్ని కూడా సూచిస్తాడు.

నిరంతర సంఘర్షణ
ప్రకృతి, దానికి కొనసాగింపయిన సమాజం రెండూ నిరంతరం సంఘర్షణమయంగా వుంటాయి. ఈ సంఘర్షణ ఉధృతంగా మారినప్పుడు ఉద్యమ రూపం తీసుకుంటుంది.  అలాంటి సమయాల్లో పరస్పర విరుధ్ధ భావోద్వేగాలని పట్టుకోవడం సులువవుతుంది. పరస్పర విరుధ్ధ భావోద్వేగాల ఘర్షణకు పరాకాష్టను అందిపుచ్చుకున్న రచనే తన ప్రాంత పాఠకుల్నీ, ఇతర ప్రాంతాల పాఠకుల్నీ ఆకట్టుకుంటుంది. అదే దాని సార్వజనీనత.
సమర్ధులైన రచయితలు, సమాజం సాపేక్షంగా ప్రశాంతంగా వున్నప్పుడూ అందులోని సంఘర్షణను పట్టుకోగలరు. అసమర్ధులైన రచయితలు సమాజ సంఘర్షణ ఉధృతంగా వున్నప్పుడు కూడా దాన్ని పట్టుకోలేరు.




రచయిత పుడతాడా? తయారు అవుతాడా? అన్నది కుత్రిమ విభజన. ప్రతి మనిషీకీ  అతను బతికిన వాతావరణం నుండి, అతను ఏర్పరచుకున్న మానసిక స్థితి నుండీ కొన్ని కళల మీద ఆసక్తి పుడుతుంది. సాధన ద్వార ఆ అసక్తి నైపుణ్యంగా మారుతుంది. సాధన అంటే ఆ రంగానికి సంబంధించిన నియమాలని తెలుసుకుని ఆచరించడమే.
మూడు అంకాల నిర్మాణంలో, ముందు ఒక వాతావరణాన్ని, పాత్రల్ని పరిచయం చేయాలి. ఆ తరువాత కొత్తగా ప్రవేశించిన సమస్యతో ప్రధాన పాత్రల పెనుగులాటను వివరించాలి. చివరకు సమస్యను పరిష్కరించాలి. తద్వార సమకాలీన ప్రయోజనంతోపాటూ సార్వజనీన ప్రయోజనాన్ని కూడా సాధించాలి.
భారతీయ కావ్యసాంప్రదాయంలోనూ, నాట్యసాంప్రదాయంలోనూ, కావ్య రచనకు కొన్ని నియమాలున్నాయి. కథానాయకుని స్వభావం, వర్ణం, భాష వగయిరాలతోపాటూ, ఇతర పాత్రల స్వభావం, భాషల వరకు అనేక నియమాలు మనకు అక్కడ కనిపిస్తాయి.
భారతీయ ప్రధాన పురాణాలైన రామాయణ, మహాభారతాల్లోనూ మనకు మూడు అంకాల నిర్మాణం కనిపిస్తుంది. రామాయణాన్ని, సీతారామకళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, ఉత్తర రామాయణం (లవకుశ) అని మూడు భాగాలుగా చేసినా  ప్రతి భాగంలోనూ మళ్ళీ మూడు అంకాల నిర్మాణం కనిపిస్తుంది. సీతారామకళ్యాణంలో దశరధ మహరాజుకు పిల్లలుపుట్టడం సెటప్. విశ్వామిత్రుడు వచ్చి ఆ పిల్లల్ని తనతోపాటు అడవికి పంపాలనడం కన్ఫ్రంటేషన్, రామలక్ష్మణులు తాటకిని వధించడం రిజల్యూషన్. సీతారామకళ్యాణం పాత్రలకూ, పాఠకులకూ కూడా కళ్యాణం. శ్రీరామ పట్టాభిషేకంలో శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు సెటప్. మందర కుట్ర, కైకేయి కోరికలు, శ్రీరాముడు సతీసమేతంగా వనవాసానికి పోవడం మొదటి కన్ఫ్రంటేషన్, అడవిలో సీతారాములు ఆనందంగా వుండడం రెండవ సెటప్, సూర్పణఖ పరాభవం, సీతను రావణుడు ఎత్తుకుపోవడం రెండవ కన్ఫ్రంటేషన్, శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణాసురుడ్ని వధించడం రిజల్యూషన్. భార్యను ఎత్తుకు వెళ్ళినవాడిని చంపడం సమకాలీనత. అదేసందర్భంలో లోకకంటకుడ్ని చంపడం సార్వజనీనత.




అలాగే, ఉత్తరరామాయణంలో, సీత సీమంతం సెటప్. సీతకు అడవిని చూడాలనే కోరిక కలగడం,ఒక చాకలతను సీత శీలం మీద నిందలేయడం, శ్రీరాముడు సీతను అదవికి పంపడం కన్ఫ్రంటేషన్, చివరకు సీత తన బిడ్డల్ని శ్రీరామునికి అప్పచేప్పడం రిజల్యూషన్.    

నియమాలను తెలుసుకోవడం నైపుణ్యం
నియమాలను ధిక్కరించడం ఉద్యమం
నియమాలే తెలియకపోవడం అజ్ఞానం   

రామాయణంలోని మూడు విభాగాల్ని మరోసారి పరికిస్తే మనకు మరికొన్ని నియమాలు అర్ధం అవుతాయి. సెటప్, రిజల్యూషన్ అంకాలు చిన్నవిగా వుంటాయి. కన్ప్రంటేషన్ అంకాలు చాలా పెద్దవిగా వుంటాయి. సీతారామకళ్యాణంలో కథ ప్రారంభం అయిన కొద్దిసేపటికే విశ్వామిత్రుడు ప్రవేశిస్తాడు. శ్రీరామపట్టాభిషేకంలో కథ మొదలయిన కొద్దిసేపటికే మందర ప్రవేశిస్తుంది. ఉత్తర రామాయణంలో కథ మొదలయిన కొద్దిసేపటికే చాకలతను సీత మీద నిందవేస్తాడు. ఇలాంటివి గమనించే స్క్రీన్ ప్లే నిపుణులు సిడ్ ఫీల్డ్ వంటి వాళ్ళు సినిమా మొదలైన ఇరవై నిముషాలలోపే ప్లాట్ పాయింట్ వచ్చేయాలి, కన్ఫ్రంటేషన్ ఘట్టం మొదలైపోవాలి అన్నారు.

అంతేకాదు, కథను  Set up, Plot Point-I, Confrontation-I, First Half Dramatic Contest, First Half  Time frame, Pinch I, Mid Point, Confrontation-II, Plot point-II,Resolution, Second Half Dramatic Contest, Second Half  Time Frame, Pinch-II, Plot Point III  తదితర విభాగాలుగా విభజించడమేగాక, ఒక్కో విభాగానికి ఎంతెంత స్థలాన్ని కేటాయించాలో కూడా చెపుతూ ఒక నిర్మాణచట్రాన్నే  (Screenplay Paradigm)  తయారు చేశారు

 భాష నుండే వ్యాకరణం పుడుతుందన్నమాట నిజమేగానీ, వ్యాకరణం తెలిసిన రచన మరింత నైపుణ్యవంతంగా వుంటుంది. ప్రపంచంలో ప్రతిదీ తద్విరుధ్ధంగానూ వుంటుంది. నియమాలతోనే రచయిత పుట్టడుగానీ, రచయిత పుట్టడానికి కొన్ని నియమాలు తప్పని సరిగా వుంటాయి.   

KVR
కేవి రమణా రెడ్డి గారి ’సాహిత్య వ్యాసాలు’ పై జయధీర్ వ్యాసం FB లో పోస్ట్ చదివాను. ఈ జయధీర్ ఎవరో నాకు తెలీదు. ఈమధ్య ఇలాంటి సమీక్షలు ఎక్కువగా వస్తున్నాయి. ఎంతసేపూ దోమలాగో, ఈగలాగో పుస్తకం చుట్టు రొదచేస్తూ తిరుగుతారేతప్ప, పుస్తకం మీద వాలరు. ఆ శక్తి వాళ్ళకులేదు. పుస్తకం వంకతో తమకు వ్యక్తిగతంగా నచ్చనివాళ్ళ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటివాళ్ళు సాహిత్య వ్యవసాయం మానేసి టీవీల్లో పనిచెస్తే మంచిది. ఏమీలేని దాంట్లో నుండి సంచలనాలు సృష్టిస్తే టీవీల్లో రాణించవచ్చు. నాకైతే, వరవరరావు మీద అక్కసును వెళ్ళగక్కడానికి రమణా రెడ్డి గారి పుస్తకాన్ని అడ్డు పెట్టుకున్నారనిపించింది.

ఏ సంస్థలో అయినా మూడు తరాలు ’ముమ్మాలుగా ’ (ఈ పదం కేవీ‌ఆర్ దే) పనిచేసినపుడే అది సమర్ధంగా పనిచేస్తుందని కేవీ‌ఆర్ అనేవారు. కేవీ‌ఆర్, కోకు, విరసానికి పెద్దతరం. చలసాని, వరవరరావు, త్రిపురనేని రెండోతరం. మాబోటివాళ్ళం మూడో తరం. రమణారెడ్డిగారు కేవీ యార్ అని సంతకం పెట్టేవారు. నేను ఓకసారి ఆయన సంతకానికి ముందు 1000 అని రాశాను. అప్పుడు అది 1000 కేవి యార్ అవుతుంది. ఆ కాగితాన్ని ఆయన చాలా ప్రేమగా మడిచి జేబులో పెట్టుకున్నారు. కెవియార్ మా భీష్ముడు.

ప్రస్తుతం నన్ను ఈ అమ్మాయి ఆవహించింది. ఈమె పేరు Anne Hathaway ఇటీవల వచ్చిన Les Misérables సినిమాలో Fantine అనే వేశ్యగా నటించింది. ఆ పాత్రలో, ఒక పాటలో, ఆమెను ఒక్కసారి చూస్తే మిమ్మల్నీ ఆవహిస్తుంది. ఇది నా వాగ్డానం.

Les Misérables విశ్లేషణ

Victor Hugo నవల Les Misérables లో
కథా వస్తువు - పాపభీతి, అమానుష చట్టాల కౄరత్వం.
వాదం - ఆదర్శ క్రైస్తవ జీవితం
కథాసందర్భం - 18 శతాబ్దపు ఫ్రాన్స్.

విరుధ్ధ భావోద్వేగాలు
ఆకలితో తల్లడిల్లిపొతున్న అక్కపిల్ల కోసం రొట్టెను దొంగిలించిన పాపానికి జీవితాంతం తల్లడిల్లిపోయే మనిషి.
చేసింది చిన్ననేరమైనా, పెద్దనేరమైనా నేరస్తుడు నేరస్తుడే అని విద్యుక్తధర్మాన్ని పాటించే అధికారి.

ప్రాతినిధ్య పాత్రలు - దొంగ (Jean Valjean), పోలీసు (Javert)
సంఘర్షణ పరాకాష్ట - నాయక, ప్రతినాయకుల్లో ఒకరు చనిపోవడం.
సమగ్రత - ప్రతినాయక పాత్ర చనిపోతున్నపుడు సానుభూతి కలగడం.
సార్వజనీనత - చట్టం, మానవత్వం
సర్వకాలీనత- విక్టర్ హ్యూగో మాటల్లోనే చెప్పాలంటే -
So long as laws shall exist which create Hells in the midst of Civilization.
So long as men are degraded. women ruined and Children afraid.
So long as there shall be Ignorance, Poverty and Wretchedness on this Earth,
Stories such as this one must be told.

(Les Misérables ప్రేరణతో వచ్చిన సినిమాలు, నవలలు గురించి రేపు మాట్లాడుకుందాం)

Dear Pasunoori Ravinder,

Story plot and  treatment both are good.
Confrontation is interesting. 
Resolution is ahead of the time. 
Sensible  Dalit story.
You have maintained formal paradigm of a short story

Danny  



తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలేదనే అసంతృప్తి మనలో చాలామందికి వుంది. దీనికి కారణాలను  వెతకడానికి ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. తెలుగు కథకులు అసలు అంతర్జాతీయ పాఠకుల్ని ఉద్దేశించి రాస్తున్నారా? అని. అప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలంటే ఏమిటీ? అనే మరో ప్రశ్న ముందుకు వస్తుంది.

సాహిత్య ప్రక్రియలకు సంబంధించి మనలో రెండు రకాల వాదాలున్నాయి. ఇందులో మొదటిది, కథ పాఠకుల్ని రంజింపచేస్తేచాలు, దాని నిర్మాణానికి నియమనిబంధనలు ఏమీ వుండరాదనేది. రెండవది, కొన్ని నియమనిబంధనలని అనుసరించి రాసిన కథలు పాఠకుల్ని మరింతగా రంజింపచేస్తాయనేది. నిజనికి ఈ రెండు వాదాలమధ్య వైరుధ్యం ఏమీలేదు. ఇవి ఒకే నాణానికి రెండు పార్శ్వాలు.
విజయవంతమైన నాటకాలన్నీ ఒక నిర్దిష్ట నిర్మాణంతో వుంటాయని, క్రీస్తు పూర్వం  350  లోనే  అరిస్టాటిల్ గమనించాడు. అంటే, నాటకీయ సంఘటనలు ఒక క్రమ పధ్ధతిలో సాగుతున్నప్పుడే ప్రేక్షకులు నాటకాలను మరింతగా ఆస్వాదించ గలుగుతారని దీనిఅర్ధం. ఈ నేపథ్యంలోనే మూడు అంకాల నిర్మాణం  (Three-Act Structure)  అనే నియమావళి వచ్చింది. ఈ విధానంలో కథను మూడు అంకాలుగా విడగొడతారు, పొందిక, సమస్య, పరిష్కారం (Setup, the Confrontation and the Resolution)

No comments:

Post a Comment