Tuesday 1 October 2019

The Good Person of Szechwan & The Respectful Prostitute


The Good Person of Szechwan & The Respectful Prostitute

షేజ్వాన్ వీధి మహిళ, గౌరవనీయమైన వేశ్య
డానీ   
          

          బ్రెక్ట్, సార్త్రె జగమెరిగిన నాటక కర్తలు. Bertolt Brecht’s The Good Person of Szechwan (1941) Jean-Paul Sartre’s The Respectful Prostitute (1946) నాటకాలు నాకు ఇష్టం. ఈ రెండు నాటకాలకు నేపథ్యం ఫాసిజం. జర్మనీలో  నాజీల కాలంలోనూ, ప్రాన్స్ లో  నాజీల పతనం తరువాత ఇవి వచ్చాయి.

          Jean-Paul Sartre నాటిక The Respectful Prostitute (1946)ను  ఇండయనైజ్ చేయాలనే కోరిక రెండు మూడేళ్ళుగా వుంది. ఆ దిశగా కొంత అభ్యాసం కూడ చేశాను. అలాగే, పూణేలో భీమా - కోరే గావ్  ద్విశతాబ్ది ఉత్సవాలు, ఆ తరువాత సాగుతున్న పరిణామాల నేపథ్యంలో Bertolt Brecht నాటకం  The Good Person of Szechwan మీద విపరీతమయిన ఆసక్తి పెరిగింది.

          జర్మనీలో నాజీ పాలన సాగుతున్న కాలంలో బ్రెక్ట్ ప్రవాసంలో వున్నాడు. 1941లో The Good Person of Szechwan నాటకాన్ని రాశాడు. ఆర్థిక వ్యవస్థే సమాజంలో నైతిక విలువల్ని నిర్ణయిస్తాయని చెప్పే నాటకం ఇది. మనిషి – వ్యక్తి (man and individual, species-being and  individual-being) తాత్విక ఘర్షణని బ్రెక్ట్ తనదైన నాటకీయ శైలిలో గొప్పగా చిత్రిస్తాడు. నిర్లిప్త సమాజం మీద  ప్రొటోగానిస్టు పాత్ర ‘షెన్ టీ’ చేసే వ్యాఖ్యలు అప్పుడూ సంచలనమే. ఇప్పుడూ సంచలనమే. 

          రాజ్యంగ పరిషత్తు సమావేశాల చివరి రోజైన 1949 నవంబరు 25న బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన ఉపన్యాసంపై బ్రెక్ట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

          “మనం ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎంత కాలం నిరాకరిద్దాం?  ఈ విలువల్ని దీర్ఘకాలం నిరాకరిస్తూ పోతే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనమే ప్రమాదం లోనికి నెట్టేసిన వాళ్లం అవుతాము. సాధ్యమైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాల్ని తొలగించి తీరాలి. అలా చేయకపోతే, ఈరోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య మహా నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చి వేస్తారు (….. those who suffer from inequality will blow up the structure of political democracy which this Assembly has laboriously built up.)” అంటూ భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్ హోదాలో అంబేడ్కర్  హెచ్చరించాడు.

          ఈ ఏడాది పిబ్రవరి, మార్చి నెలల్లో విరసం నల్గొండ, విజయవాడల్లో జరిపిన  సభల్లో వరవరరావు జైలు డైరీ ‘సహచరులు’ పుస్తకాన్ని నేను ఆవిష్కరించాను. రెండు చోట్లా నా ఉపన్యాసాన్ని షేజ్వాన్ వీధి మహిళ ‘షెన్ టీ’  ఆక్రోశంతో ముగించాను.

          “ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడి మీద మూకోన్మాదులు దాడి చేశారు.  మీరు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు అతన్ని పొడిచి పారిపోయారు. మీరు మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఒక ఘోరం జరిగినపుడు మనుషులన్నవాళ్ళు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదై పోవాలి”.

          భీమా-కోరేగావ్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో వక్తలు బ్రెక్ట్,  అంబేడ్కర్ మాటల్ని గుర్తు చేశారు. పాలకులకు సాహిత్యానికీ పడదు కనుక  ఆ కవితా వాక్యాలను తమ సహజ ధోరణిలో అపార్థం చేసుకుని సభా నిర్వాహకుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు పెట్టడం కోసమే బ్రెక్ట్,  అంబేడ్కర్ మాటల్ని వక్రీకరించారు. 

          ‘షెన్ టి’ ఆక్రోశం ధర్మాగ్రహం. దాని కోసం బ్రెక్ట్ నాటకం The Good Person of Szechwan ను తెలుగులో అనువాదం చేయాలి. ఇప్పుడు ఇది ఒక చారిత్రక అవసరం. భాషాంతీకరణ మాత్రమేగాక, కాలాంతీకరణ, దేశాంతీకరణ కూడ చేయాల్సి వుంటుంది. అది అంత సులభమైన వ్యవహారం కాదు.        

          Jean-Paul Sartre రాసిన The Respectful Prostitute  నాటికను  తెలుగు చేయడంలోనూ కొన్ని ఇబ్బందులు వున్నాయి. ఇది ప్రాధమికంగా socio-political drama.  సార్త్రె అమెరికన్ సమాజాన్ని విమర్శించ దలిచాడు గాబట్టి scapegoat పాత్రకు African - Americansను తీసుకున్నాడు. మనదేశంలో కొనసాగుతున్న lynchings, legal impunity, immunity ల నేపథ్యంలో scapegoat పాత్రను ముస్లింగా మార్చాల్సి వుంటుంది; వర్తమాన భారత సమాజంలో Vulnerable section  బలిపశువులు ముస్లింలే కదా!

          తాము ప్రయాణిస్తున్న రైల్లో కొందరు నల్లజాతి బాలురు తమ మీద అత్యాచారం చేశారని ఇద్దరు శ్వేత జాతి మహిళలు 1931లో అమెరికాలోని అలబామ రాష్ట్రంలో కేసు పెట్టారు. ఈ సంఘటన Scottsboro Boys కేసుగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. అమెరికా న్యాయవ్యవస్థ పూర్తిగా జాతి వివక్ష,  వర్ణవివక్షలో మునిగి తేలుతున్న రోజులవి. దేశమంతటా నల్లజాతీయుల మీద మూకోన్మాద దాడుల పరంపర కొనసాగింది. జడ్జీలు జ్యూరీ మొత్తంగా  శ్వేత జాతీయులు. శ్వేతజాతి అల్లరి మూకలు  న్యాయస్థానాల ఆవరణల లోనికి చొచ్చుకుని వచ్చి న్యాయమూర్తుల్ని చుట్టుముట్టి నల్లజాతీయులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వత్తిడి తెచ్చేవారు. అసలు అత్యాచారమే జరగలేదని మెడికల్ రిపోర్టు నిర్ధారించింది.  అయినప్పటికీ నిందితులైన నల్లజాతి బాలులు అందరికీ కోర్టు మరణశిక్ష విధించింది.  Scottsboro Boys కేసును చరిత్రలో Miscarriage of justice కు ఉదాహరణగా చెప్పుకుంటారు. ఈ అమానవీయమైన కేసు నుండి ప్రేరణ పొందిన సార్త్రె The Respectful Prostitute నాటికను రూపకల్పన చేశాడు.

          Scottsboro Boys కేసు ఆధారంగా  Harper Lee 1960 లో To kill a Mockingbird అనే సుప్రసిధ్ధ నవల రాసింది. ఈ నవల Pulitzer Prizeను కూడ అందుకుంది. ఈ నవలను అదే పేరుతో  1962లో సినిమాగా తీశారు. Protagonist Atticus Finch గా  హాలివుడ్ దిగ్గజం Gregory Peck  నటించగా scapegoat Tom Robinson పాత్రను Brock Peters పోషించాడు. AFI రూపొందించిన నూరేళ్ళ హాలివుడ్ చిత్రాల జాబితాలో ప్రస్తుతం ఇది 25వ స్థానంలో వుంది.

          రెండేళ్ళ క్రితం మొపాసా కథ ‘వెన్నముద్ద (Boule de Suif)ను పరిచయం చేసినపుడు మిత్రురాలు వేమన వసంత లక్ష్మి ఒక ప్రశ్న అడిగింది. గొప్ప కావ్యాల్లో ప్రధాన పాత్రలుగా వేశ్యలు ఎందుకు వుంటారు? అని నా అభిప్రాయం చెప్పడానికి అప్పట్లో వసంతను కొంత గడువు కోరాను. అది అలా రెండేళ్లకు డేకింది.

           మొపాస కథ  Boule de Suifలో ప్రధాన పాత్ర ‘ఎలిజబెత్ రోసో’ ఒక వాణిజ్యవేశ్య. జీన్ పాల్ సార్త్ర్ రాసిన The Respectful Prostituteలోనూ ప్రధాన పాత్ర ‘లిజ్జీ’ కూడ  ఒక వాణిజ్యవేశ్య. బెర్తొల్ట్ బ్రెక్ట్ రాసిన The Good Person of Szechwan లోనూ ప్రధాన పాత్ర ‘షిన్ టి’ కూడ  ఒక వాణిజ్యవేశ్య. తెలుగులో ఇప్పటికీ గొప్ప నాటకంగా కొనసాగుతున్న గురజాడ కన్యాశుల్కం లోనూ ప్రధాన పాత్ర మధురవాణీ కూడ ఒక వాణిజ్య వేశ్య.  

          సాధారణంగా మనుషులు ఎలా జీవించాలనుకుంటారో అలా జీవించరు. చాలా సందర్భాల్లో అందుకు విరుధ్ధంగానూ జీవిస్తారు. కానీ బయటికి మాత్రం సభ్య సమాజానికి ఆమోదయోగ్యమైన ప్రమాణాలు గల జీవితాన్ని మాత్రమే తాము జీవిస్తున్నట్టు చెప్పుకుంటారు. అనేకమంది ఉద్యమకారులు, విప్లవకారులు సహితం ఈ బూటకానికి అతీతులుకారు.

          వివాహేతర సంబంధాలనేవి సమాజంలో సర్వసాధారణ అంశం. కానీ ఎవరూ ఆ విషయాన్ని బయటికి ఒప్పుకోరు. వాస్తవాలకు ముసుగులు వేస్తారు. అలాంటి నిజాయితీలేనితనం మీద, ద్వంద్వ ప్రమాణాల మీద, అసత్యాల మీద, బూటకం మీద  ఆధారపడి జీవన సత్యాన్ని ఆవిష్కరించడం రచయితలకు సాధ్యంకాదు.
         
          వేశ్యలు అలాకాదు. సభ్య సమాజానికి ఆమోదయోగ్యమైన ప్రమాణాలతో వాళ్ళకు పనిలేదు. వాళ్ళది భౌతికంగానూ భావపరంగానూ నగ్న ప్రపంచం. వాళ్ళు వృత్తిలోనూ నగ్నంగానే వుంటారు. భావాలనూ నగ్నంగానే ప్రకటిస్తారు. Naked truths. ముసుగులు లేని జీవితాల్లో నుండే జీవన సత్యాన్ని ఆవిష్కరించడం సాధ్యం అవుతుంది కనుక మహారచయితలు వేశ్యల్ని తమ కథానాయకిగా ఎంచుకుంటా రనిపిస్తుంది.   

          కన్యాశుల్కంలో మధురవాణి, గిరీశం అద్భుతమైన కాంట్రాస్ట్. మధురవాణి పారదర్శకం; గిరీశం బూటకం.


రచన : 1 అక్టోబరు 2019

No comments:

Post a Comment