Who are the murderers in
suicides?
*ఆత్మహత్యల్లో
హంతకులెవరూ?*
ఆంధ్రజ్యోతి
దినపత్రిక ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించింది. పత్రిక యాజమాన్యానికీ, ఎడిటర్ కు,
ఎడిట్ పేజీ బాధ్యులకు ధన్యవాదాలు.
వాసాన్ని
చదివి మీ కామెంట్స్ పెట్టండి. నా తప్పులు తెలుస్తాయి.
*డానీ*
*సమాజ విశ్లేషకులు*
ఆత్మహత్యలు
మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అంటే మన సమాజంలో ఆత్మహత్యల రేటు పెరుగుతోందని
అర్ధం. హతుడే హంతకుడైనపుడు దాన్ని
ఆత్మహత్య అంటారు. హంతకుడు మరొకరైనపుడు దాన్ని హత్య అంటారు.
ఇటివల వెలుగులోనికి వస్తున్న ఆత్మహత్యల
కేసుల్లో స్త్రీపురుష సంబంధాల్లో తలెత్తిన వివాదాలకు చెందినవి ఎక్కువగా వుంటున్నాయి.
మన కుటుంబ, దాంపత్య వ్యవస్థల్లో చెలరేగుతున్న సంక్షోభాలకు ఇవి సంకేతాలు. సమాజంలో
ఏదైనాసరే పాతదిపోయి కొత్తది రాకతప్పదు. అయితే, మనం గ్ర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, పాత దానితోపాటు పాత నిబంధనలు
పోయినట్టే, కొత్త దానితోపాటు కొత్త నిబంధనలు వస్తాయి.
వివాహిత స్త్రీతో వివాహేతర సంబంధాన్ని
కొనసాగించిన పురుషుల్ని న్యాయస్థానాలు
ఇప్పుడు శిక్షార్హమైన నేరస్తులుగా పరిగణించడం లేదు; సామాజిక తప్పిదానికి పాల్పడినవారిగా
మాత్రమే భావిస్తున్నాయి. దాంపత్యంలో అలాంటి సంక్షోభం తలెత్తినపుడు విడాకులు
సామాజిక పరిష్కారం అవుతాయి. వివాహేరత సంబంధంలోనికి ప్రవేశించి సామాజిక తప్పిదానికి
పాల్పడిన వారికి వాళ్ళ జీవిత భాగస్వాములు – భర్త గానీ భార్యగానీ - విడాకులు
ఇవ్వవచ్చు. అయితే, విడాకులు ఇవ్వడం కూడ అంత సులువుకాదు. దానికి అనేక ఆర్ధిక
పరిమితులుంటాయి; ముఖ్యంగా స్త్రీలకు.
ఆత్మహత్యలకు ఒక సాధారణ
ప్రాతిపదిక ఏదైనా వుందా? అనేది సుదీర్ఘకాలంగా సాగుతున్న ఒక ఆసక్తికర సందేహం. అది
తెలిస్తే, సమాజంలో ఆత్మహత్యల రేటును తగ్గించడానికి వీలు కుదురుతుంది.
ఆత్మహత్యల వెనుక బయటికి
కనిపించని హంతకురాలు ఒకటి వుంటుంది; అది సమాజం. కొందరికి ఇది కొంచెం ఆశ్చర్యకరంగా
కనిపించవచ్చుగానీ, అదే నిజం. సామాజిక అనుబంధాలు, నియమాల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతాయని
19వ శతాబ్దపు ఫ్రెంచ్ సమాజశాస్త్రవేత్త డేవిడ్ ఎమిలె దుర్ఖేమ్ (David Émile
Durkheim) తొలిసారిగా ప్రతిపాదించాడు. ఆయన 1897లో ‘లా సుసైడ్’ పేరిట ఆత్మహత్యల మీద
ఒక విస్తార సిధ్ధాంత గ్రంధాన్ని రాశాడు. ఆ సిధ్ధాంతాన్నే సమాజ విశ్లేషకులు, పరిశోధకులు
ఇప్పటికీ ప్రామాణికంగా భావిస్తుంటారు.
దుర్ఖైమ్ సిధ్ధాంతం ప్రకారం ఆత్మహత్యలు
నాలుగు రకాలు. మనుషులతో అనుబంధాలు ఎక్కువైనవారు వారిని ఆదుకోవడానికి
ప్రాణత్యాగానికి సిధ్ధమౌతారు. ప్రజల్ని విపరీతంగా ప్రేమించే విప్లవకారులు ప్రజల కోసం చనిపోవడానికి సిధ్ధపడడాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు.
ఇది బలిదానాల అత్మహత్య (Altruistic suicide). మనుషులను అతిగా ద్వేషించేవారు కూడ అనుబంధాలు
పూర్తిగా లోపించి ఒంటరివారైపోయి అత్మహత్యలు చేసుకుంటారు. ఇది అహంభావ
ఆత్మహత్య (Egoistic Suicide). నిబంధనలు, నిర్బంధాలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు
పాల్పడతారు. ఇది బలవన్మరణం (Fatalistic Suicide). నియమ నిబంధనల్ని ఏమాత్రం పాటించని
వారు కూడ ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇది నిబంధనోల్లంఘన ఆత్మహత్య (Anomic Suicide).
ఆత్మహత్యల్లో అత్యంత బాధాకరమైనది బలవన్మరణం. అత్యంత సంక్లిష్టమైనది నిబంధనోల్లంఘన ఆత్మహత్య. ఎవరయినా
నిబంధనల్ని వుల్లంఘిస్తున్నపుడు మనకు అవి ఒకవైపు అభ్యుదయకరంగా, విప్లవకరంగా అనిపిస్తుంటాయి.
మరోవైపు, ఓ ఇనుపతాళ్ళ వల ఒకటి వాళ్ళను బయటపడడానికి వీలు లేకుండా బంధించేస్తూ వుంటుంది. పాత నిబంధనల్ని వుల్లంఘించినప్పటికీ కొత్త
నిబంధనల్ని రూపొందించుకుని పాటించేవారు బహు అరుదుగానైనా కొందరు వుంటారు. వాళ్లు
మార్గదర్శకులు అవుతారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం
సాలీన సగటున లక్ష మందికి 9 మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. దీనికి 20 రెట్లు మంది
ప్రతి ఏటా ఆత్మహత్యాయత్నం చేస్తుంటారు. ఆత్మహత్యల రేటు కొన్ని దేశాల్లో
ఎక్కువగానూ, కొన్ని దేశాల్లో తక్కువగానూ వుంటుంది. దానికి కారణం ఆయా సమాజాల్లోని
సంఘీభావ స్థాయిల్లో వ్యక్తమయ్యే హెచ్చుతగ్గులు.
మనం కల్లోల దేశాలుగా భావించే
ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో ఆత్మహత్యల రేటు తక్కువ. అభివృధ్ధి చెందుతున్న, చెందిన
దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ. సంఖ్యాపరంగా అత్యధిక ఆత్మహత్యలు ప్రస్తుతం
ఇండియాలోనే జరుగుతున్నాయి.
చారిత్రక దశలను బట్టి ఆత్మహత్యల రేటు మారుతుంటుంది. ఉద్యమాలు, విప్లవపోరాటాలు, ఇతరదేశాలతో యుధ్ధాలు కొనసాగుతున్న కాలంలో మనుషుల మధ్య అనుబంధాలు, సంఘీభావాలు చాలా వున్నత స్థాయికి చేరుకుని ఒక ప్రేమైక సమాజం (Altruistic Society) ఏర్పడుతుంది. అయితే, ఉద్యమాలు విజయవంతం అయ్యాక లేదా ముగిశాక దాని ఫలాల కోసం ఒకప్పటి ఉద్యకారుల మధ్యనే పోటీ పెరిగి, సంఘీభావం తగ్గుముఖం పడుతుంది. సామాజిక నైతికతను, న్యాయ నియమాలనూ ఉల్లంఘించే ఒక అరాచక, అలగా (లుంపెన్) సంస్కృతి విజృంభించే ప్రమాదం కూడ ఉద్యమానంతర కాలంలో వుంటుంది. తెలంగాణలో ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమం సాగిన కాలాన్నీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతి కాలాన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఈ రెండు ధోరణుల్నీ చూడవచ్చు.
ప్రేమైక సంఘీభావ సమాజాల్లో (Altruistic Society)
ఆత్మహత్యల రేటు తక్కువగానూ, విద్వేష సమాజాల్లో
ఆత్మహత్యల రేటు ఎక్కువగానూ వుంటుందని ఓ పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో నేనొక
పోస్టు పెట్టాను. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ మహిళా సైకాలజీ లెక్చరర్ నా వాదనను చాలా గట్టిగా
తిరస్కరించారు. ఆందోళన, వత్తిడి, కుంగుబాటు తదితర మానసిక దౌర్బల్యాల కారణంగా మనుషులు
ఆత్మహత్యలు చేసుకుంటారని వారు వాదించారు. కొన్ని రోజుల పాటు మా మధ్య వాదన కొనసాగింది.
నేను సమాజశాస్త్ర విద్యార్ధిని, వారు మనస్తత్త్వశాస్త్ర ఉపన్యాసకులు. మా మధ్య ఎక్కడా
రాజీ కుదరలేదు.
ఆ మహిళా లెక్చరర్ ఓ మూడు నాలుగేళ్ళ తరువాత
విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారికి పెళ్ళయింది; భర్త వున్నాడు. విడాకులు తీసుకోలేదు.
మరొకతనితో సహజీవనం ఆరంభించారు. అతనూ వివాహితుడు. భార్యా, పిల్లలు వున్నారు. అతను కూడ
విడాకులు తీసుకోలేదు. విడాకులకు బదులు భార్య నుండి నిరభ్యంతర పత్రం (NOC) అయినా తీసుకోలేదు.
లేడీ లెక్చరర్ తో బహిరంగంగా సహజీవనం కొనసాగించారు.
విడాకులు తీసుకోని వివాహిత స్త్రీ
పురుషులు బాహాటంగా సహజీవనాన్ని కొనసాగించడం సామాజిక తప్పిదం. వాళ్ళ శాసనోల్లఘనం అక్కడితో
ఆగలేదు. ప్రభుత్వ పత్రాలు వేటిల్లోనూ తాము సహజీవనం చేస్తున్నట్టు నమోదు చేసుకోలేదు.
పెన్షన్ పత్రాల్లో నామినీగా చేర్చుకోలేదు. సహజీవన పురుషుని సమీప బంధువు పేరిట వున్న స్థలంలో
ఆమె ఒక ఇల్లు కట్టారు. ఇంటి డాక్యుమెంట్స్ ను తన
పేరిట మార్పించుకోలేదు. భావోద్వేగాల ప్రేమ వున్నప్పుడు ఇవన్నీ అక్కరలేదు
అనుకుని వుండవచ్చు.
ఇలా వుండగా, సహజీవన పురుషుడు చనిపోయాడు. శవాన్ని అతని భార్యా
పిల్లలు తీసుకునిపోయారు. శవాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్టే!.
(మళ్ళీ మార్క్స్ గుర్తుకు వస్తున్నాడు). కొన్నాళ్ళకు ఆ స్థల యజమాని వచ్చి ఇంటిని స్వాధీనం
చేసుకుని లేడీ లెక్చరర్ ను బయటికి గెంటేశాడు. ఆమె అన్నింటినీ కోల్పోయింది. అంతకన్నా
విషాదం ఏమంటే ఆమె క్లెయిమ్ చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్క అంశం కూడ మిగలలేదు. నిబంధనోల్లంఘన
ఆత్మహత్యగా ఆమె జీవితం ముగిసింది.
సామాజిక అంశాలను మాత్రమే పట్టించుకుని వ్యక్తిత్వ,
మనస్తత్వ అంశాలను నిర్లక్ష్యం చేశాడని దుర్ఖేమ్ మీద మొదటి నుండీ ఒక విమర్శ వుంది. తరచిచూస్తే
వత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నైతికత మొదలైన వ్యక్తిత్వ, మనస్తత్వ అంశాలు కూడ ఆధునిక సమాజ ఉత్పత్తులే అని గమనించవచ్చు.
భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని
తెలిసిన ఏ భార్య అయినా ముందుగా భావోద్వేగంతో తీవ్ర అభ్యంతరం చెపుతుంది. ఆ వెనుక ఆమెకు
తన భయానికి అసలు కారణం తెలుస్తుంది. అది ప్రధానంగా
ఆర్ధిక పరమైనది. తనదీ, తన పిల్లలది అనుకుంటున్న ఆస్తికి మరొకరు వాటాదారులుగా వస్తుంటే
తాము నిరాశ్రయులమైపోతామనేది ఏ భార్యకయినా సమంజసమయిన ఆందోళన. భావోద్వేగాలకు మాత్రమే
పరిమితమయ్యేవారు అక్కడే ఆగిపోతారు. కొంచెం లౌక్యం తెలిసినవారు దానికో ఆర్ధిక పరిష్కారాన్ని
వెతుకుతారు.
వివాహేతర సంబంధాల్లో పురుషులకు వున్నంత అనుకూలత స్త్రీలకు లేదు. అయితే, స్త్రీలు కొంచెం తెలివిని ఉపయోగించి పరిస్థితిని తమకు పూర్తిగా అనుకూలంగా కాకపోయినా ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు. కొత్తగా వచ్చే ఆమెకు భర్త ఆస్తిలో వాటా ఇవ్వరాదు, కొత్తామెతో పిల్లల్ని కనరాదు వంటి కొన్ని షరతులు పెట్టి రెండు కుటుంబాలు అన్యోన్యంగా (నే) కొనసాగిన సెలబ్రిటి ఉదాహరణలు మన ముందు కొన్నున్నాయి. మరోవైపు, ఒక వివాహిత పురుషునితో సహజీవనం చేయాలనుకున్న స్త్రీ ముందుగా అతని మొదటి భార్య నుండి విడాకులో కనీసం నిరభ్యంతర పత్రమో పొందాలి. ఈ సాంప్రదాయం కూడ ఇప్పుడు మన సమాజంలో వుంది. విడాకులో, నిరభ్యంతర పత్రమో పొందడం వేరు; పొందుతామనే నమ్మకంతో ముందుగానే సహజీవనం మొదలు పెట్టేయడం వేరు. ఇలాంటి తప్పులు ఒక్కోసారి మరణానికి కూడ దారితీయవచ్చు.
సమాజంలో వివాహేతర ప్రేమలు కూడ పుడతాయి. వాటంతటగా అవేమీ తప్పుకాదు. వాటిని క్రమబద్దీకరించుకోవడమే పెద్ద సవాలు. ఆర్ధిక నియమాల ఆధారంగా ఇప్పుడు సమాజంలో సంక్లిష్ట కుటుంబాలు, మిశ్రమ కుటుంబాలు, సవతి కుటుంబాల (complex family, blended family and step family) పేరిట కొత్త దాంపత్య బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ ధోరణి పెరుగుతోంది కూడ. ఇప్పటికీ చాలామంది దాంపత్యానికి వున్న ఆర్ధిక పునాదిని గుర్తించక నివారించతగ్గ ఇబ్బందుల్ని కూడ కొని తెచ్చుకుంటున్నారు.
ప్రేమను భావోద్వేగ వ్యవహారం అన్నంత వరకు
ఎవరికీ పేచీ లేదు. గానీ, వివాహాన్ని భావోద్వేగానికి మాత్రమే పరిమితం చేయడం కుదరదు.
వివాహం ఒక వ్యవస్థ. వ్యవస్థ అన్నాక సహజంగానే అందులో నియమ నిబంధనలు అనేకం వుంటాయి. వివాహ బంధంలోనికి ప్రవేశించాలన్నా, అందులో నుండి
బయటికి రావాలన్నా దాని నియమాలన్నింటినీ పాటించాల్సివుంటుంది.
30-06-2025
ప్రచురణ
: 3 జులై 2025
https://www.andhrajyothy.com/2025/editorial/who-is-responsible-for-suicides-1421805.html
https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=37d7eac392&eid=34&imageview=1&device=desktop