సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురణార్ధం
*ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?*
డానీ
సమాజ విశ్లేషకుల, 9010757776
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రామికులు రోజుకు గరిష్టంగా 8 మాత్రమే గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్రప్రదేశ్ లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు.
పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మ్యాన్పవర్ చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్లో పని గంటల్ని కూడ పెంచితే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరుతున్నాయి. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.
ఇక్కడో విచిత్రం వుంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగుతాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య చాలా నగ్మంగా వివక్ష చూపడానికి సిధ్ధపడింది.
ప్రభుత్వోద్యోగుల మీద కన్నతల్లి ప్రేమ, ప్రైవేటు శ్రామికుల మీద సవతితల్లి ప్రేమ చూపడం అనేది పని గంటలతో మాత్రమే ఆగడంలేదు. జీతభత్యాల్లో అసాధారణ వ్యత్యాసం వుంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన కూడ చేయలేదు.
వారానికి ఆరు
రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరకధర్మాల కారణాలున్నాయి.
యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైధూనాలు వంటి శరీర ధర్మాల్ని
పాటించాల్సి వుంటుంది. ఆ పిదప, కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తులు వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి వుంటుంది.
ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి వుంటుంది. వీటిల్లో ప్రతీదీ
ముఖ్యమైనదే కనుక ఒక రోజులో వుండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ
వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి
ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిధ్ధపడుతున్నాయి. ఇదొక అమానవీయ పరిణామం.
ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పాదాయవర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగయిరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృధ్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడ ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం కూడ కావాలి. దానినే మనం సామాన్య భాషలో ప్రభుత్వ వుద్యోగులు అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ వుద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు.
ఏపి ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్ధిక మంత్రి ఎనమల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ వుద్యోగ జీతభత్యాలు పెన్షన్లకు సరిపోతున్నదన్నారు.
ఏ ప్రభుత్వం అయినాసరే రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటాయించినా 75 శాతం రాష్ట్ర అభివృధ్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడంలేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృధ్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది. చివరకు పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే; ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల్ని మొత్తంగా ప్రభుత్వ వుద్యోగుల జీతభత్యాలకు కేటాయిస్తున్నారు. ఈమాత్రం దానికి పన్నులు వసూలు చేయడం దేనికీ? ప్రభుత్వ ఉద్యోగుల్ని పోషించడం దేనికీ? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.
వృత్తి మీద ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి కార్యాలయంలో ప్రతి పనికి ఒక టారీఫ్ బుక్ వుంటుంది. దాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ నిజాయితీగా పనిచేసేవారు కూడ తప్పనిసరిగా వుంటారు. అయితే, అలాంటివారు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచీవాలయ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి రావడానికి సిధ్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారానికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడ ఏర్పాటు చేశారు. 12796 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిముషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిముషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్ లో బయలు దేరుతుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిముషాలకు బయలు దేరి మంగళగిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం చెరో అరగంట పని సమయాన్ని తగ్గించాల్సిందే!.
సచీవాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగజేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!
22 జూన్ 2027