Thursday, 12 February 2026

On Maoists Crisis

 


1.

*సిధ్ధాంతం మాట్లాడండి  :  ట్రోల్ భాషను పక్కన పెట్టండి*

 

పీపుల్స్ వార్ గానీ, మావోయిస్టు పార్టీ గానీ 1990 తరువాత ఏ రంగంలో అయినా సాధించిన స్పష్టమైన విజయం ఏమిటో నాకు తెలియదు అన్నాను. “విజయం” అనే పదం నచ్చకపోతే — “కొత్తగా ఆవిష్కరించిన సిద్ధాంత అంశాలు ఏమిటి?” అని అడగవచ్చు. నిజంగా నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే చెప్పండి. “గుడ్డోళ్లు, కళ్ళజోళ్లు” వంటి మాటలు అనవసరం.

 

ముందుగా నా అంధత్వం గురించి స్పష్టత: బాల్యంలోనే ఎడమ కన్ను తెగింది. అదే కంటికి ఇరవై ఏళ్ల క్రితం రెటీనోపతి వచ్చింది; దాని ప్రభావం కుడి కంటికి కూడా వస్తోంది. రెండు కళ్ళూ పోయినా ఎలా జీవించాలో ముందే కొంత  శిక్షణ తీసుకున్నాను. కళ్ళో, కాళ్ళో పోతాయేమోనని భయపడే మనిషిని కాదు.

 

నేను 1980లో కొండపల్లికి కొరియర్/బాడీగార్డ్ గా  పనిచేశాను. 1985లో కారంచేడు ఉద్యమానికి నాయకత్వం వహించాను. 1990లో పీపుల్స్ వార్ విధానాలతో విభేదించాను.  బయటికి రావడానికి ముందు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక వ్యాసం రాసి బహిరంగంగా నా అసంతృప్తిని ప్రకటించాను. ఆ వ్యాసాన్ని విరసం జనరల్ బాడీ చర్చించింది. అప్పటి నుండి పీపుల్స్ వార్ మీద నా అభిప్రాయాలు ఏమాత్రం మారలేదు. రాజకీయ ఆలోచనల్ని నేను బహిరంగంగానే మాట్లాడుతాను.

 

పీపుల్స్ వారుకు  ఒక సృజనాత్మక దశ ఉండింది. ఎమర్జెన్సీ కాలంలో పూర్తిగా దెబ్బతిన్న సివోసిని కొండపల్లి మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఇందులో రెండు దశలున్నాయి. ఉద్యమం పెరుగుతున్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా వుండేది. దాన్ని నాలాంటివాళ్ళు బాగా ఆస్వాదించారు. ఉద్యమం బలపడిన తరువాత  పార్టీలో బ్యూరాక్రసీ పెరిగింది. పార్టీ బాధ్యుల నైతిక విలువలు దిగజారిపోయాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ ప్రోత్సాహం కూడ తోడవ్వడంతో  ఇవి విజృభించాయి. నాలాంటి వాళ్ళు భరించలేని స్థితి ఏర్పడింది. తరువాత ఇంకో దశ మొదలయ్యింది.  బయటి నుండి ప్రభుత్వ నిర్బంధం పెరగడం ఒక పార్శ్వం.  లోపలి వికృతులు పెరగడం మరో పార్శ్వం. ‘ఆరు చెడులు’ అంటూ కొండపల్లి ప్రవేశపెట్టిన పత్రం కూడా పార్టి నాయకత్వం అంతర్గత పతనానికి సంకేతమే. ఉద్యమం లోపల నుంచి కూడ  క్షీణిస్తోంది అన్న భావన బలపడినప్పుడు నేను బయటికి వచ్చేశాను. ఇది జరిగిన కొద్ది రోజులకే  గ్రేటెస్ట్ తరానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను బేబీ బూమర్లు పీపుల్స్ వార్ నుండి తరిమేశారు.

 

ఆ తరువాత పీపుల్స్ వార్ గురించిగానీ, మావోయిస్టు పార్టీ గురించి గానీ నేను ఒక్క మాట కూడా మెచ్చుకోలుగా చెప్పలేదు. వాటి మీద నాకు సదభిప్రాయం లేదు. వాటి పేరు చెప్పుకుని జీవించాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఉద్యమం మీద ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రజాస్వామిక దృక్కోణంలో ఖండించడం అనేది వేరే విషయం; వారి విధానాలను సమర్థించడం అనేది వేరే విషయం. నేను ప్రభుత్వ అణిచివేతని ఖండించడం ఆపలేదు; విప్లవపార్టీలు అని చెప్పుకునేవారి డొల్లతన్నాని ఖండించడమూ ఆపలేదు.

 

మావోయిస్టు అభిమానుల్లో ఒక అతిశయ ధోరణి కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకత్వాన్ని నేను దగ్గరగా చూసిన వాడిని. కొన్ని మరచిపోలేని చేదు అనుభవాలున్నాయి.

 

ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని గుర్తించాలి. రాజ్యాంగ లక్ష్యాల రూపకల్పనలో, భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలో “సోషలిస్టు”, “సెక్యులర్” ఆదర్శాల చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించకపోయినా, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే.

 

కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో, మత నిర్మూలనో జరగలేదుగానీ కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం కొనసాగింది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా  ప్రోత్సాహించకపోయినా ఆమోదం లభించింది.  తెలుగు సాహిత్యం మీద వామపక్ష ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి. ఇవన్నీ కమ్యూనిస్టుల చారిత్రక విజయాలే. వీటిని ఎవరూ కాదలేరు.

 

1990 తరువాత ప్రపంచ సామాజిక-ఆర్థిక కూర్పు సమూలంగా మారిపోయింది. దీనిని నేను “1990 అనంతర సంక్షోభం” అంటున్నాను. పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. పనిచేయలేదు కూడ.  ఈ మార్పును కమ్యూనిస్టు నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక పోయింది.

 

*ఇక్కడ తరాల ప్రశ్న కీలకం*

Greatest Generation – Silent Generation – Baby Boomers – Gen X/Y/Z.

 

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులు Greatest Generationకు చెందినవారు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలపు అంతర్జాతీయ కూర్పు వారికి బాగా అర్థమైంది; ఆ మేరకు వారు తమ కాలంలో సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపారు.

 

మధ్యలో  silent Generation ఒకటుంది. కేజి సత్య మూర్తి ఆ తరానికి చెందినవారు. తరువాతి నాయకత్వం ప్రధానంగా Baby Boomers‌కి చెందింది. కొత్తగా ఎదిగి వచ్చిన  Gen X, Y, Z తరాలను వారు ఆకర్షించలేకపోయారు. విద్యావంతులైన పట్టణ మధ్యతరగతి సానుభూతి వర్గాన్ని కూడా క్రమంగా కోల్పోయారు.

 

1990ల దశకం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సంధికాలం. ఆ మార్పును Baby Boomer నాయకత్వం హ్యాండిల్ చేయలేకపోయింది. అక్కడి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం చారిత్రక పతన దశలోకి వెళ్లింది.

 

ఉద్యమాలకు చారుమజుందార్ కాంట్రిబ్యూషన్ ఏమిటో మనకు తెలుసు. కొండపల్లి సీతారామయ్య కాంట్రిబ్యూషన్ కూడ మనకు తెలుసు. గణపతి సిద్ధాంతపరంగా కొత్తగా ఏమి జోడించారో మనకు తెలియదు. అలాగే, ఉద్యమ పురోగతికి వారు చేసిన కృషి గురించి కూడ ఎవరూ చెప్పగా వినలేదు.  ఎవరైనా స్పష్టంగా చెప్పగలిగితే వినడానికి సిద్ధం. విప్లవకారుల త్యాగాలను గౌరవించడం వేరు. వారి విప్లవ పంథాను సమర్థించడం వేరు. బయటివారికి పంథానే ముఖ్యం.

 

ఈరోజు మావోయిస్టుల విప్లవ పంథా ఏమిటి? మావో వందేళ్ళ క్రితం చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమేనా? దానికి ముందు కొండపల్లి వ్యవసాయిక విప్లవాన్ని జోడించారు. వందేళ్ళలో సమాజం చాలా మారిపోయింది. మారిన సమాజాన్ని గుర్తించని వాళ్ళు ఆ సమాజాన్ని ఎన్నడూ మార్చలేరు.

 

వర్తమాన భారత సమాజాన్ని నేను “కార్పొరేట్ – కమ్యూనల్ - డిక్టేటర్‌షిప్”గా అర్థం చేసుకుంటాను. మావోయిస్టు పార్టీతో సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు  ఇంకా “అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థ””నాలుగు వైరుధ్యాలు” అనే పురాతన నిర్వచనానికే కట్టుబడి ఉంటే అది చారిత్రక జఢత్వమే అవుతుంది. పాత విశ్లేషణ పనికిరాకపోయినా కొత్త విశ్లేషణ సృష్టించలేని నిస్సహాయ స్థితి — అదే అసలు సంక్షోభం.

 

ఉద్యమాల్లో సైనిక విజయాలు - పరాజయాలు నాకు ఆసక్తికరం కాదు. సిద్ధాంత పరాజయం గురించి మాత్రం విస్తృత చర్చ అవసరం. విప్లవ సిద్ధాంతం సామాజిక మార్పుకు ప్రాణవాయువు. నిరంతరం బొగ్గుపులుసు వాయువును వదిలేసి, ప్రాణవాయువును పీల్చుకుంటూ వుండాలి. లేకుంటే మరణం తప్పదు.

 

విమర్శించగానే తిట్లు మొదలుపెట్టడం వాదన కాదు.  మావోయిష్టులు ఇటీవల ట్రోల్ ఇష్టులుగా మారారు. ఇదో ముందంజ కాబోలు. మర్యాదకర  భాషలో చర్చించాలంటే నేను ఎప్పుడైనా సిద్ధం. తిట్ల భాష మాత్రమే మీకు వచ్చు అనుకుంటే — నేను నరసాపురోడినని గుర్తుంచుకోండి.

 

– డానీ

 

 

*పాత కార్యక్రమాలకు కాలం చెల్లింది*

 2

 

1985లో కేజి సత్యమూర్తిని పార్టీ నుండి బహిష్కరించారు. సరిగ్గా అదే సాంప్రదాయంలో  కొండపల్లి సీతారామయ్యను 1990లో పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరువాత పీపుల్స్ వార్ గానీ, 2004లో ఏర్పడిన  మావోయిస్టు పార్టీగానీ కొత్తగా రూపొందించిన విప్లవ కార్యక్రమం ఏమిటీ? అనేదే సూటి ప్రశ్న. అలాంటి కార్యక్రమం ఏదైనా వుంటే మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగానీ, అభిమానులుగానీ బయటి ప్రపంచానికి చెప్పాలి. 

 

ప్రస్తుత వ్యవస్థను ‘కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్’ అని కొన్నేళ్ళుగా పిలుస్తున్నాను. ఇంగ్లీషులో ‘Corporate Communal Dictatorship’  అంటున్నాను. దీనికి బాధితులు కొన్ని వందల సమాజాలు, సమూహాలుంటాయి. ముందు వాటన్నింటి విస్తృత జాబితా ఒకటి తీయాలి. విడిగా ప్రతి సమాజపు జన సంఖ్యనూ అంచనా వేయాలి.

 

ఈ సమూహాల్లో ప్రతీదీ ఒక ప్రత్యేక తరహా అణిచివేతకు గురవుతుంటుంది.  అణిచివేత తీవ్రత కూడ ఒక్కో సమూహానికి ఒక్కో స్థాయిలో వుంటుంది.  తీవ్రత ప్రాతిపదికగా వాటన్నింటినీ నిలువు దొంతరలు (vertical staratification)గా పేర్చాలి. నా అంచనా మేరకు ఈ దొంతరల్లో అత్యంత   అణిచివేతకు గురవుతున్న సమాజాల్లో ఆదివాసులు, ముస్లింలు, దళితులు వుంటారు. ఆ తరువాత కూడ ఇంకో 97 రకాల సమాజాలు వుంటాయి.

 

ఈ సమూహాలన్నీ బాధిత సమాజాలు. వీటన్నింటినీ అవి ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రత్యేక అణిచివేతల నుండి విముక్తి చేసి స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలతో జీవించగలిగే ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి.  అలాంటి ఒక విప్లవ సిధ్ధాంతం  విప్లవ కార్యక్రమం ఒకటి రూపొందాలీ. అదీ నేటి చారిత్రక అవసరం.

 

స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అనేవి రాజ్యాంగ ఆదర్శాలు. రాజ్యాంగవాదం పరిమితమైనదనీ తమది అంతకన్నా విస్తృతమైన ఆదర్శాలనీ మావోయిస్టులు అంటుంటారు.  ఇటు రాజ్యాంగం ప్రతిపాదించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథా, అటు సాయుధపోరాట పంథా రెండూ విషాదకరంగా విఫలం అయిపోయిన దశలో ఇప్పుడు మనమున్నాము.  

 

రాజ్యాంగం అనేది ఒకటి వుండబట్టే కొన్ని సానుకూల చట్టాలను కమ్యూనిస్టు పార్టీలు సాధించుకోగలిగాయి. అయితే, ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. ఆ  పాజిటివ్ కాన్స్టిట్యూషన్ దశ 1990లలో ముగిసి పోయింది. ఇది పోస్ట్ -1990 దశ.

 

దేశంలోని రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నతమైనవనీ, వాటిల్లోనూ మావోయిస్టు పార్టి మరింత ఉన్నతమైనదనే నేరేటివ్ ఒకదాన్ని కొందరు ఇప్పుడు అతి ఉత్సాహంతో రేయింబవళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంచేత వారినే నేరుగా అడిగాను;  ‘Corporate Communal Dictatorship’  సమాజం నుండి బాధిత, పీడిత సమూహాలను విముక్తి చేయడానికి మీ విప్లవ కార్యక్రమం ఏమిటీ? అని. సమాధానం లేదు. ఆపైన, వ్యక్తిత్వ హననం. నిందలు. చెత్త మాటలు. ఇదేనా వీరి సైధ్ధాంతిక స్థాయి?. బహుశ ఇదే కావచ్చు.

 

అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయి నూతన ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇప్పుడూ ఆ నాలుగు వైరుధ్యాలేనా? దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కార్యక్రమం 1990 నాటికే తన ప్రాసంగికతను కోల్పోయింది.

 

మన దగ్గర జలుబు దగ్గుకు మందులే వున్నాయిగానీ కరోనాకు మందులు లేవంటే కుదరదు. కనిపెట్టాలి. ఇప్పుడున్న పార్టీలకు చారిత్రికంగా  అవసరమైన సృజనాత్మకత లేదు. అది వ్యక్తుల తప్పుకాదు. కాలం మారింది. పాత కార్యక్రమాలకు కాలం చెల్లింది.

 

విముక్తి అనేది చాలా పెద్ద మాట. వర్తమాన సమాజంలో శ్రామికవర్గాన్ని, అణగారిన సమూహాల్ని  కనీసం నిర్వచించగలిగే స్థితిలో అయినా కమ్యూనిస్టు పార్టీలు వున్నాయా?

 

– డానీ

 

*ముస్లింల ప్రస్తావనలేని విప్లవకార్యక్రమం ఒక బూటకం!*

 3.

 

సమాజాన్ని మార్చడానికి దీర్ఘకాలిక పోరాటం అవసరమనీ, దానికి వందేళ్ళు కూడ సరిపోవు అని కొందరు  అంటున్నారు. ఆరెస్సెస్ పుట్టి కూడ వందేళ్ళే. అది ఏం సాధించిందో కళ్ళు మూసుకున్నా కనపడుతోంది. ముస్లింలు పొట్టకూటి కోసం ఓ జాతరలో కోవా బన్ అమ్ముకుందామన్నా కుదరడంలేదు.

 

          కోవా బన్ విషాదం మీద  చాలామంది స్పందించారు. దానికి వారందరికీ ధన్యవాదాలు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలను జీవనోపాధిని అణిచివేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళను, దుకాణాలనూ బుల్ డోజర్లతో కూల్చేస్తున్నారు. మావోయిస్టులు ఎన్నికల్ని బహిష్కరించమంటారు. సంఘపరివారం ముస్లింలను చట్టసభల నుండి బహిష్కరిస్తోంది.  వాటి మీద కూడ  కోవా బన్ స్థాయి స్పందన అవసరం.

 

ఇవన్నీ సంఘపరివారం సాగిస్తున్న ముస్లింయాగం అనుకోవచ్చు. కమ్యూనిస్టు విప్లవకారులు అయినా అందుకు భిన్నంగా వున్నారా? ఇటివల విరసం 30వ మహాసభలు జరిగాయి. నాలుగు పేజీల ఒక పెద్ద అందమైన కరపత్రం విడుదల చేశారు. సాయుధ విప్లవ పోరాట విరమణ  గురించి లోకంలో ఎంతమంది  ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో అందులో చాలా వివరంగా చర్చించారు.

 

ఆయుధాలను భుజాన్నే మోస్తారా? లేక, జాతర పెట్టి ప్రభుత్వానికి ఉత్సాహంగా అప్పగిస్తారా? అనేది మావోయిస్టుల ఇష్టం. ఆయుధాలను భజాన్న పెట్టుకున్నా, ప్రభుత్వానికి స్వాధీనం చేసినా దేనికోసం? అనేది సామాజిక అంశం. బయటి వారికి సామాజిక అంశంతోనే పని.  జాగ్రత్తగా గమనిస్తే ఆ కరపత్రంలో విప్లవ కార్యక్రమం, పంథాల మీద సెంటిమెంట్ కన్నా తుపాకీ మీద సెంటిమెంట్ అతిగా కనిపిస్తుంది. విప్లవోద్యమ పతనానికి ఇది చివరి సంకేతం.

 

ఆ కోవాబన్ బాధితుడు నడుబిగించి విప్లవించడానికి సిధ్ధపడి ఉత్తేజం కోసం ఆ కరపత్రాన్ని చదివితే చాలా నిరుత్సాహానికి గురవుతాడు. ఆ కరపత్రంలో ముస్లిం అనే పదం కాదుకదా మైనారిటీలు అనేమాట కూడ మనకు కనిపించదు. ఆ కరపత్ర రచయితలు చాలా తెలివైనవారు. అవకాశం వస్తే మావోయిస్టు పార్టీకి కొత్త కార్యదర్శి కాగలిగినంత  సమర్ధులు. అంత జాగ్రత్త పడి దాన్ని రాశారు. ఇది కూడ ఇంకో జాతరలో ఇంకో కోవా బన్ కథ.

 

పూర్వ విప్లవ విద్యార్ధి సంఘం  50 వసంతాల ఉత్సవం నుండి గమనిస్తే మనకో విషయం సులువుగా అర్ధం అవుతోంది. మావోయిస్టు పార్టి సోషల్ మీడియాలో ముస్లింల కోసం  ప్రత్యేతేకంగా ఉత్సాహవంతులైన ఒక ట్రోల్ బ్యాచిని తయారు చేసింది.

 

మైనారిటీల ప్రస్తావనలేని విప్లవకార్యక్రమం ఏదైనా  ఒక బూటకం!. ఇది పైకి ప్రగతిశీలంగా కనిపించే మెజారిటీ మతవాదం!

 

- డానీ


Friday, 6 February 2026

Is the decision to wage war the responsibility of the Prime Minister? The Army Chief?

 Is the decision to wage war the responsibility of the Prime Minister? The Army Chief?

 యుధ్ధ నిర్ణయం ప్రధానీదా?  ఆర్మీచీఫ్ దా?

డానీ

రాజకీయ, సామాజిక విశ్లేషకులు




 

భారత్–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా? లేదా? “మీకు నచ్చినట్టు చేయండి” అంటూ చేతులెత్తేశారా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది.

            భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం. ఎం. నరవణే రాసిన ‘నాలుగు నక్షత్రాల విధి’ (Four Stars of Destiny) అనే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. కాని ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు ‘కారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. ప్రత్యేకించి, చైనా సైన్యం ముందుకు దూసుకు వచ్చిన అత్యంత ఉద్రిక్త క్షణాల్లో భారత ప్రభుత్వ నాయకత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. ఇప్పుడిది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది ఒక సంక్షోభ  కాలంలో తీసుకున్న లేక తీసుకోలేకపోయిన నిర్ణయాల వివాదం. 
 

2020 జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాస్ రేంజ్ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుధ్ధ ప్రకటన.

ఇలాంటి వేళల్లో దేశాన్ని నడిపించాల్సింది ఎవరు? యుధ్ధ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరూ?  సైన్యమా? కేంద్ర ప్రభుత్వమా?

 

ఆగస్టు 31, 2020. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి. భారత  కమాండర్లు కూడ

అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, విధానపరంగా  ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలు లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి.

 

అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల  సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్లు చేశారు. అందరికీ వారడిగింది ఒక్కటే మాట.  “ఏం చేయాలి?”! కొన్ని గంటల వరకు స్పందన లేదు; ఆదేశాలు రాలేదు. తరువాత రక్షణశాఖా మంత్రి నుండి ఒక ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు.  “ప్రధానితో మాట్లాడాను”. “జో ఉచిత్  సమ్జో వో కరో” (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి”).  ఈ సూచన విని తాను షాకుకు గురయ్యినట్టు ఈ పుస్తకంలో నరవణె రాసుకున్నారు. యుధ్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది. యుధ్ధం చేయాలనో, జరుగుతున్న యుధ్ధాన్ని ఆపాలనో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరూ? రాజకీయ నాయకత్వమా? సైనిక నాయకత్వమా?

 

ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్ పాయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ అప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణే ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో  అలాంటి నిర్ణయాత్మక శక్తిగానీ, స్పష్టతగానీ కనిపించలేదు అని. దీన్నేమీ ఆయన ఒక ఆరోపణగా చెప్పలేదు. తనకు ఎదురయిన అనభవంగా పాఠకులతో పంచుకోవాలనుకున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్తే నిర్ణయాలు తీసుకుంటుంది; దాన్ని సైన్యం పాటిస్తుంది.

 

పుల్వామా, బాలాకోట్ ప్రతిదాడుల తరువాత ప్రధాని మోదీజీ దృఢ నిర్ణయాలు తీసుకోగల సమర్ధులు అనే మాట బాగా ప్రచారం అయ్యింది.   కానీ చైనా విషయంలో వారు తడబడినట్టుగా నరవణె కథనం ద్వార అర్ధం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఇప్పుడు చేతికి అందివచ్చిన ఆయుధంగా మారింది.

 

జాతీయ భద్రత కారణంగా నరవణే పుస్తకాన్ని పరిశీలించాల్సివుందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర  గడిచినా సమీక్ష పూర్తికాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రతకన్నామ్తమకు  ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ వున్నాయి. ఇది సెన్సారా? నియంత్రణా? ఒక ఆర్మీ మాజీ చీఫ్ తన యుధ్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా?

 

ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్ సభలో నరవణె  పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించినపుడు అధికార పక్షాలు గట్టిగా అడ్డుకున్నాయి. సభ వాయిదాపడింది. 

 

అగ్నివీర్, అగ్నిపథ్ పథకాల మీద కూడ నరవణె ఈ పుస్తకంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్విత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడ తక్కువనీ ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యవహరించినంత కటువుగా చైనాతో వ్యవహరించలేకపోతున్నదని నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు.    పుస్తకం పూర్తిగా బయటికి వస్తే దేశంలో ఒక దుమారం రేగుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.  ప్రధాని మోదీ గురించి ప్రధాన స్రవంతీ మీడియా ప్రచారం చేస్తున్న అతిశయోక్తులకు, మోదీ అమిత్ షా ద్వయం తమ గురించి చెప్పుకుంటున్న ప్రగల్భాలకూ ఈ పుస్తకం ఒక ఇబ్బంది కావచ్చు ! 

 

అయితే, ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ చేస్తున్న వాదనకు భిన్నమైన కోణం కూడా వుండవచ్చు. ఎందుకంటే, ఎంఎం నరవణె సంఘ్ పరివారానికి అనుకూలురనీ, దానివల్లనే వారికి సైన్యంలో అంతటి స్థానం దక్కిందనే మాట కూడ ప్రచారంలోవుంది. కారవాన్ పత్రిక ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను మాత్రమే ప్రచురించింది. మిగిలిన పేజీల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి వుండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.

 

6 ఫిబ్రవరి 2026

Tuesday, 20 January 2026

The Warnings of the History

The Warnings of the History

చరిత్ర  చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతాలు?

 

డానీ

సమాజ విశ్లేషకులు




చరిత్ర పునరావృతం కాదు—కనీసం యథాతథంగా అయితే కాదు. అయినప్పటికీ, కొన్ని ధోరణులు మాత్రం తిరిగి తిరిగి కనిపిస్తుంటాయి. అవే ఒకప్పుడు ప్రపంచాన్ని మహావిధ్వంసం వైపు నడిపించిన సంకేతాలు. ఆ ధోరణులు మళ్ళీ కనిపించడం మొదలైతే, సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని అర్థం.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఏఐ ద్వారా రూపొందించిన  ఆ మ్యాప్‌లో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా తదితర దేశాలను  అమెరికా భూభాగంగా చూపించారు.  చట్టపరంగా దీనికి ఎటువంటి విలువ లేదని అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో మ్యాప్‌లు అమాయకమైన బొమ్మలు కావు. అవి భవిష్యత్తు ఆకాంక్షలను, ప్రపంచ శక్తి నడక దిశను, దురాక్రమణ ఆలోచనలను సూచించే సంకేతాలు కావచ్చు.

చరిత్రను చూస్తే, ప్రపంచ శక్తులు ముందుగా మ్యాప్‌లతోనే ఆడుకున్నాయి. తరువాత మాటలుగా మారాయి. ఆపై విధానాలు మారాయి. యుధ్ధాలు జరిగాయి. చివరకు దేశాల సరిహద్దులే మారిపోయాయి. ప్రపంచ పటం మీద  అగ్రరాజ్యం కావాలనుకున్న దేశం తన ప్రయాణాన్ని ఎప్పుడూ యుద్ధంతో మొదలుపెట్టదు; అది ముందుగా భాషలోకి, చిత్రాల్లోకి, ప్రజల ఊహల్లోకి ప్రవేశిస్తుంది.

ఆ మ్యాప్ కింద రాసిన  “ఇక్కడి నుండి వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు” అనే వ్యాఖ్య కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ వాక్యం కాదు. ఇది చర్చలు, రాజీలు, దౌత్య సంవాదాలకు తలుపులు మూసే భాష. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే—ఇలాంటి భాష వినిపించిన ప్రతిసారీ, దాని వెనక ఘోర పరిణామాలే వచ్చాయి.

బ్రిటిష్ చరిత్రకారుడు ఏ.జె.పీ. టేలర్ ఒకసారి అన్నట్లు, “యుద్ధాలు అకస్మాత్తుగా జరుగుతాయనుకోవడం మన అజ్ఞానం; నిజానికి అవి చాలాకాలం మాటలలోనే సిద్ధమవుతాయి.” నేటి ప్రపంచంలో ఆ మాటల స్థానాన్ని ఇప్పుడు చిత్రాలు, మీమ్స్, ఏఐ మ్యాప్‌లు తీసుకున్నాయి.

1930ల నాటి యూరప్‌లో ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినీ కూడా ఇలానే మాట్లాడాడు. ఆఫ్రికా ఆక్రమణను సమర్థించుకుంటూ, “మన ప్రజలకు ఊపిరి పీల్చుకోవడానికి స్థలం కావాలి” అన్నాడు. జాతీయ గర్వం, భద్రత, ప్రజల అవసరాల సాకులు నెపాలతో సాగిన ఆ వాదన చివరకు ఖండాన్ని రక్తపాతంలో ముంచింది. ఇది వ్యక్తుల్ని విమర్శించడానికో, డోనాల్డ్ ట్రంప్ ను ముస్సోలినీతో పోల్చడానికో కాదు; చరిత్రలో పదే పదే కనిపించే ధోరణుల్ని కొంచె ముందుగా లోతుగా అర్థం చేసుకోవడానికి.

గ్రీన్లాండ్ విషయంలో అంతర్జాతీయ చట్టం స్పష్టంగా ఉంది. అది డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రకారం భూభాగాల మార్పు ప్రజల సమ్మతితోనే జరగాలి. అయితే, భద్రత పేరిట భౌగోళిక ఆకాంక్షలను కప్పిపుచ్చుకోవడం కొత్త కాదు. కానీ, అలాంటి ప్రయత్నాలు ప్రపంచానికి శాంతిని ఎప్పుడూ తీసుకురాలేదు. చరిత్రకారులు పలుమార్లు హెచ్చరించినట్లు, “చట్టం బలహీనపడినప్పుడు శక్తి మాట్లాడుతుంది.”

ఇక్కడే ఐక్యరాజ్యసమితి పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నానాజాతి సమితి ఎలా నిర్వీర్యమైపోయిందో, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా అలాంటి స్థితికి చేరుతోందా అన్న సందేహం అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తోంది. నాటో వంటి కూటముల్లోనూ అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది. పైకి మౌనం ఉన్నా, లోపల ఉడుకుతున్న ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యూరోపియన్ యూనియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అప్పుడే స్పందించారు. “ట్రంప్ టారిఫుల బెదిరింపులు దారితప్పాయి” అని ఆమె  స్పష్టంగానే ప్రకటించారు. అంతేకాదు, ట్రంప్ విదేశాంగ విధానాల మీద  తమ ప్రతిస్పందనఐక్యంగా, సముచితంగా ఉంటుంది.” అన్నారు. ఇది కేవలం ఆర్థిక ప్రకటన కాదు. ఇది ఒక రాజకీయ సంకేతం ప్రపంచ యుధ్ధానంతరం ఏర్పడిన  ప్రపంచ కూర్పును  కాపాడుకోవాలన్న  సంకల్పం అందులో వుంది. చరిత్రకారుడు టోనీ జడ్ అన్నట్లు, “1945 తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ కూర్పు సంపూర్ణం కాకపోవచ్చు; కానీ అది లేకపోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంది.”

డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు  చేస్తున్నారు. అక్కడి వీధుల్లో వినిపిస్తున్న స్వరాలు కూడ ఇప్పుడు ప్రపంచానికి  ముఖ్యమే. “అమెరికాకు పూర్వ వైభవాన్ని తెద్దాం”  అనే నినాదాన్ని ట్రంప్ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో దీన్ని “Make America Great Again (MAGA)’’ అంటున్నారు. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్, గ్రీన్ ల్యాండ్ ముఖ్యపట్టణం నూక్ నగరాల్లో ప్రదర్శనకారులు  ట్రంక్ నినాదానికి కొత్త అర్ధం ఇచ్చారు. వాళ్ళు కూడ MAGA అంటున్నారు. కానీ, వాళ్ళ నినాదం పూర్తిగా అమెరికాకు వ్యతిరేకం. వాళ్ళు “Make America Go Away” అని నినదిస్తున్నారు. ఈ నినాదం పైకి కొంచెం వ్యంగ్యంగా కనిపించినా, దాని వెనక ఉన్న భయం నిజమైనది. సామ్రాజ్యవాద భాషను పాలకులకన్నా ముందే సామాన్య ప్రజలే గుర్తిస్తారని చరిత్ర పదే పదే నిరూపించింది.

ప్రపంచం యుద్ధాల దిశగా సాగేటప్పుడు ఇలాంటి కీలక సంకేతాలు కనిపిస్తాయని అమెరిక చరిత్రకారిణి హన్నా ఆరెండ్ గమనించారు. కీడుకి ఒక సామాన్య లక్షణం ఉంటుందని ఆమె చెప్పారు. దానిని ఆమె *‘Banality of Evil’*గా నిర్వచించారు. బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను బేరీజు వేసుకునే ఇంగితజ్ఞానాన్ని కోల్పోయిన ప్రతిసారీ, ప్రపంచ స్థాయిలో తీవ్రమైన కీడు చోటు చేసుకుందని ఆమె హెచ్చరించారు.

ఇక్కడ కార్ల్ మార్క్స్ చేసిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది. చరిత్ర మొదట విషాదంగానూ, తరువాత ప్రహసనంగానూ తిరిగి వస్తుందనే అర్ధంలో ఆయనోమాట అన్నాడు. చరిత్ర యధాతథంగా పునరావృతం కాకపోయినా, చరిత్రలోని ధోరణులు మళ్ళీ మళ్ళీ వివిధ స్థాయిల్లో మన ముందుకు వస్తాయని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు.

మీడియా పాత్ర ఈ సమయంలో అత్యంత కీలకం. భయాన్ని పెంచకుండ పరిస్థితిని విశ్లేషించడం మీడియా బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు, అనేక గ్లోబల్ మీడియా సంస్థలు ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని వినోదంగా మార్చే ధోరణితో వ్యవ్హరిస్తున్నాయి. ఇది ప్రజల్ని  అప్రమత్తం చేయాల్సిన సమయంలో, మత్తులోకి నెట్టే ప్రమాదం.

ఇది తీర్పు కాదు; ఒక హెచ్చరిక. వ్యక్తుల మీద కాదు, ప్రమాదకర ధోరణుల మీద చర్చ. సార్వభౌమత్వం అంటే శక్తివంతుడి ఇష్టాఇష్టాలు కాదు; అది ప్రజల హక్కు. ఈ సూత్రాన్ని చిన్న చూపు చూస్తే  చిన్న దేశాల భవిష్యత్తే కాక  మొత్తం ప్రపంచ శాంతే కనుమరుగై పోతుంది.

చరిత్ర మౌనంగా ఉండదు. అది వర్తమాన ప్రపంచాన్ని నిద్ర లేపుతుంది. నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి నిలదీస్తుంది. అప్రమత్తంగా వున్నవాళ్ళు, సమూహ బాధ్యతలు తెలిసిన వాళ్ళు మాత్రమే చరిత్ర           విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వగలరు.

రచన : 21 జనవరి 2026

Saturday, 17 January 2026

Happy Birthday Eluri Agitha

 

అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! 






 

          ఎవరెవరికి రుణపడివున్నాను? అనుకున్నప్పుడు సహజంగానే మా అమ్మీ సుఫియా బేగం ముందుగా గుర్తుకు వస్తుంది.  ఇప్పుడు మా అమ్మకన్నా పెద్ద స్థానం అజితది.

         

          సాక్షాత్తు పార్టి అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సూచించారని నేను తనను పెళ్ళిచేసుకున్నాను. తన తండ్రి చెప్పాడని తను నన్ను పెళ్ళి చేసుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగానూ తనకు చాలా అడ్వాంటేజెస్ వున్నాయి. తను వాటిని ఎన్నడూ నా మీద ప్రయోగించలేదు. తన స్థాయిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది.

 

          తనను నేను ఒక స్టూడెంట్ గానే చూసేవాడిని. తనూ నన్ను ఒక గురువుగానే భావించేది.  పిల్లలు పుట్టాక  తను అనుచర స్థానం నుండి సమాన స్థాయికి, ఆ తరువాత నన్ను నడిపించే స్థాయికి కూడ చేరుకుంది.

 

          మా ఇద్దరికి ఒక సామాన్య గుణం వుంది. ఇద్దరికీ కోపం ఎక్కువ. మా స్వభావాల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మేము మూడు నాలుగేళ్ళు కూడ కలిసుంటామని అనుకోలేదు. అలా నలభై మూడేళ్ళు దాటేశాం.

 

          తను చాలా మొండిది. విపరీతమయిన పట్టుదల. ఇప్పటికీ రైలు, బస్సు లేని కుగ్రామంలో తను పుట్టింది.  నేను అత్తారింకి వెళ్ళాలంటే మధిర స్టేషన్లో రైలు దిగి, వైరా గట్టుకుపోయి, బూట్లు, ప్యాంటు తీసి నెత్తిన పెట్టుకుని యేరు దాటి, ఐదు కిలోమీటర్లు నడిచి శివాపురం చేరుకునేవాడిని. ఈ వెనుకబాటు తనం నుండి బయటపడడానికి తను అదనంగా శ్రమించింది. నాకన్నా ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది. పిల్లలకూ తనే కంప్యూటర్స్ నేర్పింది. ఆ ఏరియాలో నేను లేటుగా ప్రవేశించాను. అక్కడి నుండి మొదలయ్యి,  ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ లో అడ్మిన్ హెడ్ గా చాలా యేళ్ళు పనిచేసింది. ఆమెతో ప్రధాన సమస్య ఏమంటే ఇంట్లోనూ తనే అడ్మిన్ హెడ్ అనుకుంటుంది.

 

గడిచిన యాభై యేళ్లలో మనదేశ కుటుంబ వ్యవస్థలో మౌలిక మార్పులు వచ్చేశాయి. అప్పుడు భర్త యింటి మజమాని. ఇప్పుడు భార్య ఇంటి యజమాని. వ్యవస్థ తలకిందులు కావడానికి చాలా యేళ్ళు చాలా ఘర్షణ వుంటుంది.  దానికి మేమిద్దరం మినహాయింపుకాదు.

 

          గంటకోసారి మంచినీళ్ళు తాగినట్టుగా గంటకోసారి మేము దెబ్బలాడుకుంటాము. వెనెజులా అధ్యక్షుడ్ని డొనాల్డ్ ట్రంప్ కిడ్నాప్ చేయడం వంటి చిన్నచిన్న విషయాలను మేము అస్సలు పట్టించుకోము. తాలింపులో కరివేపాకు మాడడం వంటి పెద్దపెద్ద గ్లోబల్  ఇష్యూస్  మీద ఆ ఉప్మా తింటున్నంత సేపూ  కొట్లాడుకుంటాము.

 

          అయితే కుటుంబాన్ని తను ప్లాన్ చేసే విధానం, ముందు చూపు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఏం చదవాలీ  ఎక్కడ చదవాలి ఎక్కడ ఎలా సెటిల్ కావాలీ మన ఇల్లు ఇలావుండాలీ? వగయిరా విషయాలన్నింట్లో  తనకో లెఖ్ఖ వుంటుంది. దాదాపు అవన్నీ నెరవేర్చేసింది. ఈ విభాగంలో తనను బోలెడు ప్రేమించవచ్చు.

 

           వర్గ వ్యవస్థకన్నా ముందే వివాహవ్యవస్థ కూలిపోతుందని నేను గట్టిగా నమ్ముతాను. కొత్తతరం పెళ్ళిళ్లు చేసుకోవడంలేదు. లివి- ఇన్ రిలేషన్ షిప్స్ కూడ షార్ట్ లివింగ్ గా మారిపోతున్నాయి. వివాహాన్ని నిరాకరించవచ్చుగానీ పిల్లల పుట్టుకను నిరాకరించడం మహాపరాధం అని నేను భావిస్తాను. ఆర్ధిక పరిమితుల కారణంగా కుటుంబ నియంత్రణ పాటించాల్సి రావచ్చు. కానీ, అసలు పిల్లలు పుట్టడానికే వీల్లేని పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నాం. ఇది దారుణం అనిపిస్తుంది. మానవజాతి మనుగడను కొనసాగించడం మనందరి బాధ్యత.

 

          నేను అజితను తనను తానుగా సగం ప్రేమిస్తాను.  పిల్లల్ని సాకిన తీరుకు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను.

 

          మా దండల పెళ్ళికి చలసాని ప్రసాద్ పురోహితుడు. చలసానికి ఒక రికార్డు వుంది. ఆయన వంద పెళ్ళిళ్ళు చేశాడు. 99 జంటలు విడిపోయారు. నిలబడింది మేమిద్దరమే. తను నన్ను దారికి తెచ్చుకోవాలి అనుకుంటుందిగానీ విడిపోవాలనుకోదు.

 

          అప్పుడప్పుడు నాకు కూడ తన మీద చాలా కోపం వస్తుంది. మూడు నాలుగు సంఘటనల్ని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

         

          మొదటిది; 1983లో మేము పెళ్ళి చేసుకున్నప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులకు నేను ఒక్కడ్నే బ్రెడ్ ఎర్నర్ ని. తాటాకు ఇంట్లో నివాసం. ఓపెన్ లావెటరీస్. అక్కడ తను నివశించడం చాలా కష్టం. రెండోది; 1985లో కారంచేడు ఉద్యమం మొదలయినపుడు పార్టి నన్ను అక్కడికి వెళ్ళమంది. అదొక ఛాలెంజ్ గా భావించి వెళ్ళాను. అప్పుడు మా పెద్దబ్బాయి మూడున్నర నెలల పిల్లోడు.  ఆ పరిస్థితిని తాను తట్టుకుంది. 1998లో తెలుగు జర్నలిజానికి కష్టకాలం. నేను పనిచేస్తున్న ఏపి టైమ్స్ మూతపడింది, అంతకు ముందు నేను పనిచేసిన ఆంధ్రజ్యోతి (పాతది) మూతపడింది. ఉదయం మూసేశారు, ఆంధ్రపత్రిక మూసేశారు. ఆంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. అసలే నిరుద్యోగం ఆపైన ఆ ఆందోళన, వత్తిడి, కుంగుబాట్లతో ఆరోగ్య సమస్యలు. నేను నా భార్యా పిల్లల్ని ఆకలితో మాడ్చిన రోజులవి. సరిగ్గా పిల్లలు పెద్ద చదువులకు వచ్చిన సమయం అది. ఆ కష్టాల నుండి గట్టేక్కడానికి తను అదనంగా కష్టపడింది. వీటిని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

 

          తన తరువాత నా బాగోగులు ఎవరు చూసుకుంటారని ఇప్పుడు తను ఆలోచిస్తూ వుంటుంది. నేనూ అంతే.

15 జనవరి 2026

Monday, 12 January 2026

Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!

 Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!

డానీ 

సమాజవిశ్లేషకులు  



దేశంలో నిరసనోద్యమాలు, ఆందోళనల్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు మొదలెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన నిరసనోద్యమాలు, వాటికి కారణాలు, అవి సాధించిన ఫలితాలు, వాటికి నాయకత్వం వహించిన వారి వ్యక్తిగత ప్రయోజనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఈ అంశం మీద ఒక సమగ్ర నివేదికను అందించే పనిని  పోలీసు మేధోసరోవరంగా భావించే బ్యురో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR&D)కు అప్పగించారు. మరీ ముఖ్యంగా, 1974 తరువాత సాగిన ఉద్యమాల మీద మరింత లోతైన విశ్లేషణ జరపాలని కేంద్రం కోరింది.  ఆ మేరకు అన్ని రాష్ట్రాల  హోంశాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. అంతేకాక, భవిష్యత్ ఆందోళనల నివారణకు ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించాలని కూడ కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే దేశంలో నిరసనలు, ఆందోళనల్ని నిషేధిస్తూ ఒక బిల్లు పార్లమెంటులో ప్రవేశించవచ్చు. అది ఆమోదం పొంది ఒక చట్టంగా కూడ మారవచ్చు. 

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడ కొన్ని బాధ్యతలు, హక్కులు ఉంటాయి. సమ్మెలు, ఆందోళనల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి వుంటుందిగానీ, వాటిని నిర్మూలించే అధికారం వుండదు. నియంత్రణకూ నిర్మూలనకూ మధ్య ప్రజాస్వామిక అవగాహనలో చాలా వ్యత్యాసం వుంది. అవి రెండూ పరస్పర వ్యతిరేక అంశాలు. 

కార్మికులకు సమ్మె చేసే హక్కు, ప్రజలకు నిరసన వ్యక్యం చేసే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం.  వాటిని తీసివేస్తే ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద క్రూరంగా హత్య చేసినట్టే. 

వ్యక్తులకు వుండే భావప్రకటన స్వేఛ్ఛ, సమూహ స్థాయిలో నిరసన స్వేఛ్ఛగా మారుతుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం కూడ సరికాదు; ఆ పునాదుల మీదనే రాజ్యాంగం అవతరించింది అనడం సబబు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటేనే నిరసన హక్కు. ఆ విలువలను  పరిరక్షించడానికే ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నియమం రూపొందింది. అధికారంలో వున్న ప్రభుత్వ పని తీరుకు ఆమోదం తెలిపే అవకాశంతోపాటు, నిరసనతో గద్దెదించే అవకాశాన్ని  కూడ ఎన్నికలు ప్రజలకు ఇస్తాయి. వీటిల్లో, మొదటిదానికన్నా రెండోదే కీలకమైనది. 

సమ్మెలు, నిరసనలు, ఉద్యమాల ద్వార ప్రజలు తమ కోర్కెలను పాలకుల  దృష్టి తెస్తారు. తద్వార తమ విధానాలను సరిదిద్దుకునే, కొత్త వాగ్దానాలను రూపొందించుకునే అవకాశం అధికార పార్టీకేకాక,  ఇతర రాజకీయ పార్టీలకు కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను నిరోధించే పనిలో కేంద్రప్రభుత్వం నిమగ్నమైంది. 

సంఘ పరివారానికీ, దాని రాజకీయ వేదిక అయిన, భారతీయ జనతా పార్టికి రాజకీయాల్లో గాంధీజీ, ప్రభుత్వ నిర్వహణలో రాజ్యాంగం అస్సలు పడవు. ఆ విషయాన్ని వాళ్ళేమీ దాచుకోరు. చాలా బాహాటంగానే మొదటి నుండి చెపుతూ వస్తున్నారు. ఇప్పుడయితే గాంధీ వ్యతిరేకతను ప్రత్యక్షంగానూ, రాజ్యాంగం మీద వ్యతిరేకతను పరోక్షంగానూ డైలీ సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు.  

రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే నిజాం సంస్థానంలోని తెలంగాణలో రైతులు సాయుధులై స్థానిక జాగీర్దాలతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలను నిషేధించాలని రాజ్యాంగ సభ భావించలేదు. అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని కల్పించిన రాజరిక వ్యవస్థను రద్దు చేయాలనుకుంది. భూస్వామ్య వ్యవస్థను నియంత్రించాలనుకుంది. రైతులు, వ్యవసాయకూలీల హక్కులకు రక్షణ కల్పించాలనుకుంది. కుల వివక్షను శిక్షించాలనుకుంది. ఈ ఆదర్శాలకు అనుగుణంగానే తరువాతి కాలంలో అనేక చట్టాలు వచ్చాయి.  

మరోవైపు సంఘపరివారం రాజ్యాంగాన్ని తీవ్రంగా దూషించింది. మనువును అవమానించారంటూ గగ్గోలు పెట్టింది. తాము అధికారం లోనికి వచ్చిన రోజున ఈ రాజ్యాంగాన్ని తీసిపడేసి మనుధర్మాన్ని అమలు చేస్తామని ప్రతినలు చేసింది. 

ఇంకో వైపున కూడ రాజ్యాంగాన్ని విమర్శించిన వారున్నారు. సామాజికంగా వెనుకబడిన శూద్రులు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కొత్తలోనే తమకు అన్యాయం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళన సాగించారు. నాటి నెహ్రు ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇది ప్రజాందోళన సాధించిన విజయం. అయినప్పటికీ, తమిళనాడులో పెరియార్ ఇవి రామసామి నాయకర్ 1957లో రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ ప్రతుల్ని బహిరంగంగా తగుల బెట్టారు. రాజ్యాంగం కులాన్ని నిర్మూలించకుండ కుల వివక్షను మాత్రమే నిర్మూలించిందనేది పెరియార్ చేసిన ప్రధాన విమర్శ.  కులం వున్నంత కాలం  కుల వివక్ష వుంటుందనేది ఆయన ఆందోళన.  ఇప్పటికీ ఈ అంశం మీద ఆలోచనాపరుల వేదికల మీద చర్చలు సాగుతూనేవున్నాయి. 

1990లలో  నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక పరిస్థితి మారింది. అయితే, అంతకు ముందు ప్రభుత్వలు చేసిన ప్రజానుకూల చట్టాలన్నీ ప్రజాందోళనలు సాధించుకున్నవే. కార్మిక హక్కుల చట్టాలు, అటవీ భూముల మీద  ఆదివాసులకు హక్కు కల్పించే చట్టాలు, భూపరిమితి చట్టాలు సమస్తం ప్రజాందోళనలకు తలొగ్గి వచ్చినవే. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన  పాత్ర కూడ మహత్తరమైనది. ఏ చట్టం ఏ ఉద్యమం ఫలితంగా వచ్చింది అనేదాన్ని వివరిస్తూ ఒక పట్టిక తయారు చేయవచ్చు. 

2017లో సంచలనం రేపిన ‘ఉన్నావ్ బాలిక మీద సామూహిక అత్యాచారం’ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బిజెపి నేత కుల్దీప్సింగ్ సెంగార్ ను విడుదల చేయించుకోడానికి ఢిల్లీ పెద్దలు చేసిన కృషి ఇటీవల ఫలించింది. కానీ, ప్రభుత్వ చర్యను నిరశిస్తూ దేశ రాజధాని నగరంలో   మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి పక్షాన గట్టిగా నిలిచాయి.  ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు అనడంకన్నా ప్రజాందోళనలు వాళ్ళను దిగివచ్చేలా చేశాయి అనడం సబబు. 

అలాగే, మైనింగ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల కనీసపు ఎత్తును వంద మీటర్లకు పెంచుతూ కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం కూడ వివాదంగా మారింది. ఈ నిర్వచనం సుప్రీం కోర్టు ఆమోదాన్ని పొందినాసరే  దానికి వ్యతిరేకంగా ప్రజాందోళన సాగింది. మరోసారి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి సుప్రీం కోర్టులో తమ పాత వాదనల్ని వెనక్కు తీసుకున్నారు. 

ఒక వారం రోజుల వ్యవధిలో  రెండు కేసుల్లో దిగిరావాల్సిన పరిస్థితి  ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రజాందోళనల పని పట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 

నియంతృత్వం, మతతత్త్వ నియంతృత్వం, 

1974 నుండి సాగిన నిరసనోద్యమాల మీద ప్రత్యేక అధ్యయనం సాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకొంటోంది. ఎమర్జెన్సీకు వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పునరుధ్ధరణ ఉద్యమాలను పరిశీలించాలనేది దాని ఉద్దేశ్యం కావచ్చు.

 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సాగించింది నిస్సందేహంగా నియతృత్వమే. అయితే, ఇప్పుడు మనం చూస్తున్నది మతతత్త్వ నియంతృత్వం. ప్రజల్నీ ప్రజాస్వామిక హక్కుల్ని నియంతృత్వం క్రూరంగా అణిచివేస్తుంది. మతతత్త్వ నియంతృత్వం అంతకన్నా నాలుగు అడుగులు ముందుకేసి, ప్రజల్ని మతప్రాతిపదికన చీల్చి మెజారిటీ సమూహాన్ని మైనారిటీ సమూహం మీదికి  ఉసి గొల్పుతుంది. నియంతృత్వం సరళమైనది. ప్రజలందరూ ఏకం అవుతారు కనుక దాన్ని ఎదుర్కోవడం సులువు. మతతత్త్వ నియంతృత్వం సంక్లిష్టమైనది. ప్రజల్లో అది తెచ్చిన కుత్రిమ చీలిక వుంటుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి అదనపు ఉపాయాలు అవసరం అవుతాయి.  

2014 తరువాత  ప్రజాస్వామిక విలువలు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత కరెన్సీ మీద గాంధీ బొమ్మ వుంటుందిగానీ, భారత ప్రభుత్వ విధానాల్లో గాంధీ ఆలోచనలు వుండవు. పైగా, అనుక్షణం గాంధీ ఆలోచనల్ని విమర్శించే ప్రకటనలే చేస్తుంటారు. 

అంతకు ముందు వరకు  ప్రజా నిరసనల్ని ప్రజాస్వామ్య ఒత్తిడి సాధనంగా భావించే ఒక  రకమైన అంగీకారం వుండేది. ఇప్పుడు దాన్ని పాలనకు ముప్పుగా,  దేశ భద్రతా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. విభిన్న చట్టాల మీద  ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగ హక్కుగా చూసేవారు, ఇప్పుడు దాన్ని ప్రజా క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారు. అంతకన్నా తీవ్రంగా తప్పుపట్టితే ఏకంగా దేశ భద్రతకు ముప్పుంటున్నారు. గతంలో  కార్మికుల సమ్మె హక్కును రాజకీయ సామూహిక చర్చగా గుర్తించేవారు. ఇప్పుడు ఆర్ధిక నష్టం కలిగించే చర్యగా ముద్ర వేస్తున్నారు. ఇంతకు ముందు ఆందోళనలు జరిగితే చర్చలకు పిలిచే వారు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలను నియమించేవారు. కమిటీల సిఫార్సుల మేరకు అవసరమైతే  వెనక్కు తగ్గడానికి కూడ జంకేవారుకాదు. ఇప్పుడు నిరసనకారుల మీద ఎదురుదాడికి దిగుతున్నారు, వాటికి నాయకత్వం వహించేవారిని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  అన్నింటికన్నా  మైనంగా వుండిపోవడం ఇప్పుడు గొప్ప ఉపాయంగా మారిపోయింది. మణిపూర్ అల్లర్ల మీద ప్రధాని ప్రతిస్పందన ఏమిటో చూశాంగా! ఇంతకు ముందు దేశానికి ముప్పు సరిహద్దులకు ఆవలి నుండి వుందనేవారు, ఇప్పుడు ముప్పు అంతర్గతంగా వుందంటున్నారు.  

ప్రజాస్వామ్య పతనం 2014కు ముందు ఆ తరువాత అని బేరీజు వేసుకుంటే మనల్ని ముంచుకొస్తున్న ప్రమాదం అర్ధం అవుతుంది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో కూడ బోధపడుతుంది. 

రచన : 31-12-2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 13 జనవరి 2026 


https://www.andhrajyothy.com/2026/editorial/if-protest-becomes-a-crime-democracy-faces-collapse-1484567.html

Thursday, 8 January 2026

Venezuela Western Hemisphere

 

Venezuela Western Hemisphere

'వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!'

ఈరోజు సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని 'దాపరికం లేని సామ్రాజ్యవాదం' అనే ఉమ్మడి శీర్షిక కింద ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 


*వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!*

 

డానీ

సమాజవిశ్లేషకులు

 

ఇది వెనిజులా గురించి కాదు. ఇది ప్రపంచ చట్టవ్యవస్థ ప్రాణాలు, ప్రమాణాల గురించి. ఇది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో మంచి వాడా? చెడ్డవాడా? అన్న ప్రశ్న కాదు. ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అన్న రాజకీయ చర్చ కూడా కాదు. ఇక్కడ  ఒకే ఒక మౌలిక ప్రశ్న వుంది. ఒక దేశం మరో దేశపు రాజకీయ భవిష్యత్తును బలప్రయోగంతో నిర్ణయించే హక్కును కలిగి వుంటుందా? వుండవచ్చా?

 

ఈ ప్రశ్నకు “వుండకూడదు” అని గట్టిగా సమాధానం చెప్పడానికే 1945 అక్టోబరు 24న  ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తడమే ఈ రోజున జరుగుతున్న అతిపెద్ద నేరం.

 

అంతర్జాతీయ చట్టంకన్నా సైనిక బలం గొప్పదా?

 

ఏ దేశమైనా సరే మరో దేశ సార్వభౌమత్వాన్ని బలప్రయోగం ద్వారానో,  బెదిరింపుల ద్వారానో ధ్వంసం చేయకూడదు. ఐక్యరాజ్యసమితి చార్టర్—ఆర్టికల్ 2(4)— ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటీ? మార్కెట్ విస్తరణ కోసం, దిగజారుతున్న తన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం. బలహీన దేశాలపై  సైనిక దాడి. కుదరదంటే కుత్రిమంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం. నౌకల ముట్టడి. ఆస్తుల స్తంభన. దాడికి లక్ష్యంగా పెట్టుకున్న దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నచ్చడం లేదని ప్రచారం. ‘రాజ్యాంగ మార్పు’ పేరుతో రాజకీయ బ్లాక్‌మెయిల్. దానికి తోడు అగ్రరాజ్య మీడియా మాయాజాలం.  ఇది అపవాదు కాదు; ఇది సుదీర్ఘ కాలంగా అమెరిక ఆచరిస్తున్న  విధానం.

 

          రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసిన తరువాత వివిధ దేశాల్లో అమెరికా చేసిన ‘రాజ్యపాలన మార్పు’ ఆపరేషన్లు వందకు పైగా వుంటాయి. 1991లో సోవియట్ రష్యా పతనమై ప్రఛ్ఛన్న యుధ్ధం (కోల్డ్ వార్) ముగిసినా అమెరికా ఆగడాలు ఆగలేదు. మరింత వేగాన్ని పుంజుకున్నాయి. ఇరాక్, లిబియా, సిరియా, ఉక్రెయిన్, హోండురాస్, వెనిజులా. ఈ జాబితా చాలా పెద్దది. ఈ దారుణాలన్నింటి వెనుక ఒక దారుణ సత్యం వుంది; ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండానే బలప్రయోగానికి పాల్పడడం. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి సైనిక బలంతో విర్రవీగే రాజకీయాలివి. 

తన ఆర్ధిక ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే దేశాలను అమెరిక సహించదు.  వాటిమీద ‘ఆర్థిక ఆంక్షలు’ విధిస్తుంది. ఇది ప్రత్యక్ష యుధ్ధానికి మరో రూపం. రెండింటి ప్రభావం ఒక్కటే.

 

వెనిజులాపై అమెరిక విధించిన ఆంక్షలు ఆయుధాల యుధ్ధంకాదు. కానీ,  వాటి ప్రభావంతో జరిగే ఆర్ధిక నష్టం ప్రత్యక్ష యుధ్ధంకన్నా తక్కువ కాదు. వెనిజులాలో చమురు ఉత్పత్తి 75 శాతం పడిపోయింది. ప్రజల సగటు ఆదాయం 60 శాతం కంటే ఎక్కువగా కూలిపోయింది.

 

పాలకులు నిరంకుశులుగా మారితే ఆ దేశ ప్రజలు వారిని తప్పిస్తారు. దానికోసం పోరాటాలు చేస్తారు. తిరుగుబాట్లు చేస్తారు. అమెరికా వాళ్లకు ఆ అవకాశం ఇవ్వదు. పాలకులను శిక్షిస్తున్నాం అనే వంకతో దేశాన్ని శిక్షిస్తుంది. దేష ప్రజల్ని శిక్షిస్తుంది.  ఒక దేశం అధ్యక్షుడిని గుర్తిస్తామా, తిరస్కరిస్తామా అన్నది నిర్ణయించాల్సింది ఆ దేశ ప్రజలే; వైట్ హౌస్ కాదు. పెంటగాన్ అస్సలే కాదు.

 

ఇది మడూరో మీద శిక్షా? లేదా వెనిజులా పిల్లల మీద శిక్షా?  ఒకవేళ, శిక్షా పడాల్సింది పాలకుల మీద అయితే, సామాన్య ప్రజల్ని ఇక్కడ ఆకలితో చనిపోయేలా చేయడం ఏం న్యాయం?.

 

దీనికి అంతర్జాతీయ చట్టం ఏమంటోంది? ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక్క భద్రతా మండలిని మాత్రమే సభ్య దేశాల మీద ఆంక్షలు విధించే హక్కు ఉంది. అమెరిక తనకు తాను అంతర్జాతీయ భద్రతా మండలి అనుకుంటుంది. ట్రంప్ అయితే అంతకన్నా ఎక్కువే అనుకునే వ్యక్తి. ”ప్రజాస్వామ్య రక్షణ’ అనే నెపంతో గ్లోబల్ గూండాయిజాన్ని చెలాయిస్తుంది. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”. ఇది కొత్త వలసవాదానికి అమెరిక పెట్టిన అందమైన పేరు.

 

ఇది పశ్చిమార్ధగోళం అంతర్గత వ్యవహారం; పూర్వార్ధ గోళానికి దీనితో సంబంధంలేదు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇదొక అపభ్రంశవాదం. పశ్చిమార్ధగోళంలో అమెరిక సంయుక్తరాష్ట్రాలు మాత్రమే వుండవు. దానికి ఉత్తరాన కెనడా వంటి దేశాలు, దక్షణాన మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు అనేకం వున్నాయి. వాదన కోసంఐనా సరే అవన్ని అమెరికా ఆఢిపత్యాన్ని అంగీకరిస్తాయా।

 

రెండవ ప్రపంచ యుధ్ధం దాదాపుగా ముగిశాక, 1945 మే 8న యూరప్ లో విజయ దినం (VE Day) జరిగాక, అమెరిక దూకుడుతో జపాన్ మీద అణుబాంబుల దాడి చేసింది. ఇది ఎంత అమానుషచర్యో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ప్రపంచ యుధ్ధం ముగిసిన రెండుదశాబ్దాలకే రెండో ప్రపంచ యుధ్ధాం జరిగింది. ఆ తరువాత ఎనభై యేళ్ళు గడిచినా మూడో ప్రపంచ యుధం రాలేదు. దానికి ప్రధాన కారణం,  నాగాసాకీ, హీరోషీమాల్లో మానవహననం ఆ పైన  కొనసాగిన జన్యు సమస్యల్ని చూసిన దేశాలు మరో ప్రపంచ యుధ్ధానికి ఇప్పటి వరకు సాహసించలేదు. కానీ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కాదని మూడో ప్రపంచ యుధ్ధానికి కాలు దువ్వుతోంది.

 

అణుయుగంలో  ప్రపంచ యుధ్ధం అంటే మొత్తం మానజాతి హననం అని అర్ధం. ఈ భయంతోనే తన జోలికి ఎవ్వరూ రారని అమెరిక ధీమా. ఈరోజు ప్రపంచం మౌనం వహిస్తే రేపు మానవజాతికే సమాధి.  కాబట్టి ప్రశ్న మడూరో కాదు; మనమే. ప్రశ్న వెనిజులాకాదు; ప్రపంచం. బలిసిన దేశాల ఆయుధ సంపత్తితో కింద  ప్రపంచం నడవకూడదు.

 

ఐక్యరాజ్యసమితి తన చార్టర్లను  కాపాడుకుంటుందా? లేదా గొప్ప దేశాల దౌర్జన్యానికి మౌన సాక్షిగా మారుతుందా? ఇప్పుడు ప్రపంచానికి ఇది  ఒక పెద్ద సందేహం. ఐక్యరాజ్య సమితీ వెన్నెముకతో నిలబడినా, వెన్నెముక విరిగి కిందపడినా ప్రపంచాన్ని కాపాడుకోవడం ప్రపంచ ప్రజల బాధ్యత. ఇప్పుడు ప్రపంచం స్పందించకపోతే రేపటి ప్రపంచానికి సమాధానమే ఉండదు.

 

6 జనవరి 2026

ప్రచురణ : సాక్షి దినపత్రిక, 8 జనవరి 2026