Saturday, 21 June 2025

ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?

 సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురణార్ధం

 

*ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?* 

డానీ

సమాజ విశ్లేషకుల, 9010757776   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్టంగా 8 మాత్రమే గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్రప్రదేశ్ లో దాన్ని 9 గంటలకు పెంచారు.  ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. 

పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మ్యాన్‌పవర్ చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడ పెంచితే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరుతున్నాయి. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. 

ఇక్కడో విచిత్రం వుంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల  ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగుతాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు  సిబ్బంది మధ్య చాలా నగ్మంగా వివక్ష చూపడానికి సిధ్ధపడింది. 

ప్రభుత్వోద్యోగుల మీద కన్నతల్లి ప్రేమ, ప్రైవేటు శ్రామికుల మీద సవతితల్లి ప్రేమ చూపడం అనేది పని గంటలతో మాత్రమే ఆగడంలేదు. జీతభత్యాల్లో అసాధారణ వ్యత్యాసం వుంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన కూడ చేయలేదు. 

వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరకధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైధూనాలు వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి వుంటుంది. ఆ పిదప, కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ  ఆసక్తులు వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి వుంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి వుంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే  కనుక ఒక రోజులో వుండే 24 గంటల్లో  ఈ మూడు ధర్మాలకు  సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిధ్ధపడుతున్నాయి. ఇదొక అమానవీయ పరిణామం.

 ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పాదాయవర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగయిరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృధ్ధి చేస్తుండాలి.  వీటికయ్యే ఖర్చును కూడ ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం కూడ కావాలి. దానినే మనం సామాన్య భాషలో ప్రభుత్వ వుద్యోగులు అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ వుద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు.   

ఏపి ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్ధిక మంత్రి ఎనమల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ వుద్యోగ జీతభత్యాలు పెన్షన్లకు సరిపోతున్నదన్నారు.   

ఏ ప్రభుత్వం అయినాసరే రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటాయించినా 75 శాతం రాష్ట్ర అభివృధ్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడంలేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృధ్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి  వస్తున్నది. చివరకు పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే; ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల్ని మొత్తంగా  ప్రభుత్వ వుద్యోగుల జీతభత్యాలకు కేటాయిస్తున్నారు. ఈమాత్రం దానికి పన్నులు వసూలు చేయడం దేనికీ? ప్రభుత్వ  ఉద్యోగుల్ని పోషించడం దేనికీ? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.   

వృత్తి మీద ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి కార్యాలయంలో ప్రతి పనికి ఒక టారీఫ్ బుక్ వుంటుంది. దాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ నిజాయితీగా పనిచేసేవారు కూడ తప్పనిసరిగా వుంటారు. అయితే, అలాంటివారు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి. 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచీవాలయ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి రావడానికి సిధ్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారానికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడ ఏర్పాటు చేశారు. 12796 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిముషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిముషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్ లో బయలు దేరుతుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో  5.30 నిముషాలకు బయలు దేరి మంగళగిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం చెరో అరగంట పని సమయాన్ని తగ్గించాల్సిందే!. 

సచీవాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగజేసి పదేళ్ళు దాటుతోంది.  ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం?  ఎవరికయినా రావలసిన సందేహమే! 

22 జూన్ 2027

Saturday, 7 June 2025

Sudhakar - *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 

మావోయిస్టు సుధాకర్ (అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహా చలం / / TLNS చలం).  ఉద్యమంలో ఆనంద్, సోమన్న పేర్లతోనూ వున్నాడు. ఆయుర్వేద మెడిసిన్ విజయవాడలోనే చదివాడు.

 

ప్రతిష్టాత్మక  కృష్ణా జిల్లాలో సివోసి / పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్లుగా పెండ్యాల మల్లేశ్వర రావు, నేను, సుధాకర్ వరుసగా పని చేశాము.  మా ముగ్గురి వ్య్వహారశైలి భిన్నమైనది. ఉద్యమానికి మా కాంట్రిబ్యూషన్ కూడ భిన్నమైనది.

 

నేను ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతాను.

సుధాకర్ దానికి పూర్తిగా భిన్నం.

తక్కువ గొంతుతో చాలా సున్నితంగా మాట్లాడుతాడు.

ప్రత్యర్ధిని కూడ నచ్చచెప్పాలనుకుంటాడు.

అప్పట్లో కొంచెం బిడియస్తుడు కూడ.

 

తనూ కాకినాడ నాగమల్లేశ్వర రావు కొన్నాళ్ళు  - బహుశ 1978లో -రామచంద్రాపురంలో చదివారు.

అక్కడి బ్యాంకు ఉద్యోగి నిమ్మకాయల వీర రాఘవ వీళ్ళకు రాడికల్ సంబంధాలు కల్పించారు. 

ఆ తరువాత వీళ్ళిద్దరూ విజయవాడకు వచ్చారు.

 

ముందు మల్లేశ్వరరావు సివోసి/ పీపుల్స్ వార్ లో చేరాడు.  

తను నాకన్నా సీనియర్ సెంట్రల్ ఆర్గనైజర్. / సివో. 

మల్లేశ్వర రావును వేరే జిల్లాకు పంపించాక నేను ఆ స్థానంలోనికి వచ్చాను.

ఆ తరువాత చలం చేరాడు.  

 

మాకు గురువయిన వివి కృష్ణారావు 1979 చివర్లో సివోసి నుండి బయటికి వెళ్ళిపోయేనాటికి నేను రాడికల్ యూత్ లీగ్ కృష్ణాజిల్లా అధ్యక్షుడిని.

 

ఆర్ ఎస్ యూ తో సహా ఇతర ప్రజాసంఘాల బాధ్యతల్ని కూడ నేనే చూడాల్సి వచ్చింది. జిల్లా పార్టి బాధ్యతల్ని కూడ నేనే చూసేవాడిని. జిల్లా యూనిట్ కు అడహాక్ కార్యదర్శి.

 

1981 ఏప్రిల్ చివరి వరకు హోల్ టైమర్ గా వున్నాను.

 

నాకు చలం తోడయ్యాడు. తను స్టూడెంట్స్ వింగ్ ను చూసేవాడు.

 

ఇద్దరం విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి దగ్గర బాయ్స్ హాస్టలు జమీందార్ బిల్డింగ్స్ లో వుండేవాళ్ళం.  అది వామపక్షాల కోట.

 

ఓ అరవై చదరపు అడుగుల గది. ఒక చెక్క మంచం, ఒక చెక్క బల్ల, ఓ చెక్క కుర్చీ,ఓ 40 క్యాండిల్స్ బల్బు. ఇదీ మా వసతి.

 

నెలకు అద్దె 8 రూపాయలు. సబ్సిడీ రేటు.

అయినా నిత్యం మూడు నాలుగు నెలలు అద్దె బకాయి వుండేది.

అభిమానులు ఇచ్చిన పుస్తకాలు గదినిండా వుండేవి.

కడుపు నిండా ఆకలి వుండేది.

 

ఉదయాన్నే అద్దె బకాయి గురించి మమ్మల్ని తిట్టిపోసే హాస్టల్ మేట్రన్ సుందరమ్మ 10 గంటల తరువాత చల్లబడి అభిమానంతో ఉప్మా వండి పంపేది.

 

మా ఇద్దరి జీవితం గుణదల కొండతో ముడిపడి వుండేది. కొండకిందే జమీందార్ బిల్డింగు.

 

నగరంలో కొన్ని ఇళ్ళు, కొన్ని హొటళ్ళు మాకు ఉచితంగా భోజనం పెట్టేవి. ఒక్కోసారి అక్కడికి వెళ్ళడానికి సిటీ బస్సు టికెట్టు చార్జీలు కూడ వుండేవి కావు.

 

పుస్తకాలు చదవడం, సమావేశాల్లో మాట్లాడడం మాత్రమే పని.

ఆ తరువాత నేను ఎప్పుడూ అంతగా చదవలేదు.

 

పార్టీ పిసి సెక్రటరి ముక్కు సుబ్బారెడ్డి /రంగన్న, క్రాంతి పత్రిక ఇన్ చార్జి  ఎల్ ఎస్ ఎన్ మూర్తి  తరచూ వచ్చి కలిసేవారు. ఇతర జిల్లాల బాధ్యులు కలవడానికి కూడ అదే కేంద్రం.

 

మా కదలికల్ని పసిగట్టడానికి స్టేట్ ఇంటెల్లిజెన్స్, సెంట్రల్ ఇంటెల్లిజెన్స్ సిబ్బంది ఎవరో ఒకరు నిరంతరం మాచవరంలోనే తిరుగుతూ వుండేవాళ్ళు.

 

ఒక్కోసారి నేనే వాళ్లను పిలిచి డబ్బులు లేవుగానీ టీ తాగించండి అనేవాడిని. అదో కామెడి.

 

విప్లవోద్యమంలో ఇలాంటి కామెడీలు చాలా వుంటాయి.

అందుకే చాలామంది ఆ జీవితాన్ని ఆస్వాదిస్తారు.

 

1983లో నేను అజితను పెళ్ళి చేసుకునేవరకు జమిందార్ బిల్డింగ్ లోనే వున్నాము.

 

1980 చివర్లో ఒక పార్టి పంచాయితీ కోసం హైదరాబాద్ రాంనగర్ కు వెళ్ళినపుడు కుటుంబం కోసం హోల్ టైమర్ జీవితం నుండి బయటికి పోవాలి అని శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి లకు తెలిపాను.

ఆ సమావేశానికి చెలం కూడ వచ్చాడు.

 

చెలానికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాక మాత్రమే హోల్ టైమర్ జీవితం నుండి తప్పుకో మన్నారు.

 

ఆ శిక్షణ ఓ నాలుగైదు నెలలు సాగింది.

1981 మే 1న నేను హోల్ టైమర్ జీవితాన్ని ముగించాను.

సుధాకర్ జిల్లా పార్టి బాధ్యతలు తీసుకున్నాడు.

అక్కడి నుండి తన ఎదుగుదల చాలా వేగంగా సాగింది.

 

నేను తనకు గురువు అయినట్టు

అజితకు తను గురువు.

 

తల్లిదండ్రుల గొప్పతనాన్ని పిల్లలు నిరూపిస్తారు.

గురువుల గొప్పతనాన్ని శిష్యులు నిరూపిస్తారు.

 

కలేకూరి ప్రసాద్ కత వేరు.

తను బయట వుండి చావుని కొని తెచ్చుకున్నాడు.

చెలం లోపలుండి  చావుకు ఎదురెళ్ళాడు.

తనంటే నాకు కొంచెం గర్వంగా వుండేది.

 

విప్లవోద్యమంలో  నా కాంట్రిబ్యూషన్ కొంత వుందని చెప్పడానికయినా కొందరు మిగిలి వుండాలిగా.

వాళ్ళే నాకన్నా ముందే చనిపోతే

నా గొప్పలు నేనే చెప్పుకోవాలి.

అది చాలా హీనంగా వుంటుంది. 

 

నేను హోల్ టైమర్ జీవితం నుండి బయటికి వచ్చి ఆటోమోబైల్ రంగంలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు కారంచేడు సంఘటన జరిగింది.

 

కారంచెడు ఉద్యమంలో పనిచేయడానికి ఎవర్ని పంపించాలో ఆ పార్టికి అర్ధం కాలేదు.

ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. సఫలం కాలేదు.

 

నేనయితే బాగుంటుందని సుధాకర్  భావించాడు.

కారంచెడు ఇష్యూను నువ్వు సాల్వ్ చేయగలవు.

నువ్వు వెళ్ళి తీరాలి అని నన్ను తనే అడిగాడు.

నాక్కూడ ఆ ఛాలెంజ్ నచ్చింది.

మరొక్కసారి హోల్ టైమర్ గా మారాను.  

 

కారంచెడు ఉద్యమానికి ముందు అలాంటి ఒక్క ఉదాహరణ కూడ (precedent) లేదు.

అయినప్పటికీ ఆ ఉద్యమం చాలా గొప్పగా విజయవంతం అయ్యింది.

ఆ తరువాత కత వేరు.

 

నెమలూరి భాస్కర రావు / మల్లిక్ వంటి కపటి వచ్చాక నేను పీపుల్స్ వార్ తో సన్నిహితంగా కొనసాగలేకపోయాను. ఆ పార్టీ నుండి తప్పుకున్నాను.  

 

అయినా, వ్యక్తిగత స్థాయిలో కొందరితో పాత  అనుబంధం కొనసాగింది.

నేను బయటికి వచ్చాక కూడ పీపుల్స్ వార్ వాళ్ళు అడిగిన ఏ పనినీ కాదనలేదు.

అజితను ప్లీజ్ చేయడానికి కూడ కొన్ని పనులు చేసి పెట్టాను.

 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో  అక్టోబరులో శాంతిచర్చలకు వచ్చిన నక్సల్స్ ప్రతినిధి బృందంతో తను ఉపనాయకుడు. అప్పట్లో తను ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ AOB  జోనల్ కార్యదర్శిగా వుంటున్నాడు.

 

చర్చల కోసం వాళ్లందరూ శ్రీశైలం సమీపాన చినఆరుట్ల గ్రామం దగ్గర బయటికి వచ్చారు. ప్రభుత్వం కూడ చర్చల అనంతరం చినఆరుట్ల గ్రామం దగ్గరే వాళ్ళనును లాంఛనంగా దించేసింది. నిజానికి ఎవరి డెన్ లు వారికున్నాయి.

 

ఓరోజు రాత్రి చెలం ఫోన్ చేశాడు. తనను ఒరిస్సా ఆంధ్రా బోర్డర్ లోని తన డెన్ లో దించాలని అడిగాడు. నేను సరే అన్నాను. అజితతో పాటు వెళ్ళి అప్పర్ సీలేరు ప్రాంతలో దించి వచ్చాను.

 

ఆ మధ్య ఎవరో ఓ పాత రాడికల్ నన్ను పత్రికల్లో నాలుగు వ్యాసాలు రాస్తే పెద్దవాళ్లయిపోరు అని ఎద్దేవ చేశాడు.

 

అక్షరాలతోపాటు ఆయుధాలనూ సృష్టించాను అని గట్టిగా చెప్పాలనుకున్నాను.

అది చెప్పాల్సింది నేను కాదు. చెప్పాల్సినవాళ్లు చెప్పాలి.

ఇప్పుడు చెప్పాల్సిన వాడు చనిపోయాడు.

సుధాకర్ మరణం నాకు మామూలు నష్టంకాదు.

నా నైతికతే సంక్షోభంలో పడిపోయింది.

 

తల్లిదండ్రుల కళ్లముందే పిల్లలు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద మరోటి వుండదని అంటారు.

గురువుల కళ్ళముందే శిష్యులు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద వుండదు.

 

 

తను ఆయుధాల సేకరణ విభాగంలో వున్నాడని కొన్నేళ్ల క్రితం ఎవరో అన్నారు.

రాజకీయ అవగాహన  విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడని ఇంకోసారి విన్నాను.

మంచి వ్యూహకర్తగా మారాడని కొందరు చెప్పారు.  

కాబోయే జాతీయ కార్యదర్శి అన్నారు.

నా పొగరు కొంచెం పెరిగింది.

కానీ ఇప్పుడు అదంతా గతం అయిపోయింది.

 

మా అనుబందానికి ప్రతీక గుణదల కొండ.

రాత్రి గుణదల కొండెక్కి విజయవాడ అంతా వినిపించేలా గట్టిగా ఏడ్వాలనిపించింది.  

ఇప్పుడు నేను జమిందార్ బిల్డింగులోని డానీని కాను.

హిప్పోక్రాట్ అయిపోయాను.


తను బతకాలనుకున్నట్టే బతికాడు. చావాలనుకున్నట్టే చనిపోయాడు. ఇంతటి అదృష్టం కోటికి ఒక్కరికి కూడ దక్కదు. .


వీరుల మరణవార్తలు విన్నప్పుడు ముందు కొంచెం విషాదంగా ఉంటుంది. ఆ విషాదంలోనూ బోలెడు గర్వం ఉంటుంది.

 

*డానీ*

06 జూన్ 2025

తెలిసి తెలిసి ఒకే తప్పును పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?

 *తెలిసి తెలిసి ఒకే తప్పును*

*పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?*






మా భూమి సినిమాలోని ‘బండెనకబండికట్టి పదారు బండ్లు కట్టి’ పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన ఒరిజినల్ పాటకు పూర్తి వక్రీకరణ.
మనం ఘనంగా చెప్పుకునే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ సాగింది నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ జిల్లాల్లోని కొన్ని తాలుకాల్లో.
నల్గొండజిల్లాలో ఎర్రపహడ్ (సూర్యపేట) దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి ప్రధాన ప్రతినాయకులు.
ఆ ఉద్యమంలో చాలా కాలం నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రస్తావన లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం భారత దేశంలో చేరకుండ స్వతంత్ర్య దేశంగా వుండాలనుకున్న తరువాత, ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్ల ఆగడాలు మీతిమీరాక మాత్రమే సాహిత్యంలో అదీ చాలా అరుదుగా నైజాం నవాబు ప్రస్తావన వచ్చింది.
ఎర్రపహడ్ దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద నల్గొండజిల్లాకు చెందిన కవి-గాయకుడు-ఉద్యమకారుడు, అమరుడు బండి యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాట రాశాడు. ఆ పాట చరణాలు అన్నింటిలోనూ చివరి పంక్తిలో “నా కొడుక ప్రతాపరెడ్డి” అనే మకుటం పునరావృతం అవుతూ వుంటుంది.
మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా 1979 మార్చి 23న మా భూమి సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో సెన్సార్ బోర్డు అధికారిగా వున్నవారు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సెన్సార్ అధికారి వుండగా “నా కొడుక ప్రతాపరెడ్డి” అని పాట వుంటే సినిమా విడుదల కాదనో మరే కారణం చేతనో బండి యాదగిరి పాటను నిర్మాతలు మార్చేశారు. జెన్నారెడ్డి ప్రతాప రెడ్డిని కాపాడి “నా కొడుక ప్రతాపరెడ్డి” అని వున్న మకుటాన్ని ‘నైజాము సర్కరోడా!’గా మార్చేశారు.
అప్పటికే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయి పుష్కరం దాటింది. ఆయన సమాధి నుండి బయటికి వచ్చి”నేను తిరిగితే, 16 రోల్స్ రాయిస్ కారుల్లో హైదరాబాద్ వీధుల్లో కాన్వాయిగా తిరుగుతానేమోగానీ, ఎర్రపహాడ్ వీధుల్లో పదహారు ఎడ్లబండ్ల మీద ఎందుకు తిరుగుతానూ?” అని అభ్యంతరం చెప్పలేడని సినీ నిర్మాతల ధైర్యం కావచ్చు. నవాబ్ వారసులు, అభిమానులు ఎలాగూ తెలుగు సినిమాలు చూడరనే గట్టి నమ్మకం కూడ ఈ బరితెగింపుకు కారణం కావచ్చు.
ఈ వక్రీకరణ గద్దర్ చేశాడో, మరొకరు చేశారో బయటికి తెలీదు. కానీ ఇది గద్దర్ పాటగానే ప్రచారం అయ్యింది. గద్దర్ కూడ “నా కొడుక ప్రతాపరెడ్డి” మకుటంను తొలగించి ‘నైజాము సర్కరోడా!’ మకుటం వున్న పాటనే బహిరంగ సభల్లో పాడేవాడు. ఇది సంఘపరివారం సాగించే ముస్లిం వ్యతిరేక ప్రచారానికి చాలా అనుకూలంగా మారింది. ఆరెస్సెస్ నాయకులు నిజాం నవాబును తిట్టడానికి ‘గద్దర్ పాట’ను కోట్ చేయడం మొదలెట్టారు. ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు.
ఈరోజు మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) గారు మళ్ళీ వక్రీకరణ పాటనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కమ్యూనిస్టు పార్టీల విధేయులైన మేధావులు ఈ వివాదం మీద ఎక్కడయినా రాశారేమో నేను చదవలేదు. ఇతరులు ఒక్క అక్షరం తేడా రాసినా పోలీసుల్ని మించిన “ఇంటరాగేషన్” చేసే ఈ విధేయులు ఇంతటి వక్రీకరణనను కడుపులో దాచేసుకున్నారా! తెలీదు!
*డానీ*

మా భూమి సినిమా పాటలో పది అంశాలు

 *మా భూమి సినిమా పాటలో పది అంశాలు*




 

1.            ఎర్రపహడ్ దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాటరాశాడు. దీన్ని ఉద్యమ కాలంలో రాసి వుంటాడు.    

 

2.            అతనే నిజాం నవాబు మీద ‘నైజాము సర్కరోడ నాజీల మించినోడ’ పాట కూడ రాశాడు. దీన్ని స్వాతంత్ర్యానంతరం రాసివుంటాడు.   

 

3.            మాభూమి సినిమా కథ ప్రతాప రెడ్డి ఆవరణలో సాగుతుంది. పాట మాత్రం హఠాత్తుగా నిజాము ఆవరణ లోనికి  మారిపోతుంది. ‘బండెనక బండికట్టి’ పాట తలను తీసుకొచ్చి ‘నైజాము సర్కరోడ’ పాట మొండేనికి అతికించారు. వీక్షణం ఎన్ వేణుగోపాల్ భాషలో అక్కడి పల్లవిని తీసుకొచ్చి ఇక్కడి చరణాలకు జోడించారు.  

 

4.            యాదగిరి అటు  ఎర్రపహడ్  దొర‌ను ఇటు నైజాము సర్కారునూ విమర్శిస్తూ పాటలు రాశాడు. రాసిన సందర్భాలు వేరైనా ఆయన దృష్టిలో ఇద్దరూ దోషులే.

 

 

5.            సినిమా పాటలో ఎర్రపహడ్  దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డికి పూర్తిగా లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి నైజాము సర్కరోడిని మాత్రమే బోను ఎక్కించారు.

 

6.            ఇద్దరు వ్యక్తులు ఒకేరకం తప్పుచేసినా ఒకరికి లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి మరొకరికి  మాత్రమే శిక్ష వేసే మనుస్మృతి సాంప్రదాయం ఒకటి మనకు వుండింది.

 

7.             “ఆ పాట మీద వివాదం, లేనివి వెతకడానికి ప్రయత్నించడం అనవసరం” అని వేణుగోపాల్ హితవు కూడ పలికారు.

 

8.            వేణుగోపాల్ రైటప్ ఆ పురాతన శిక్షాస్మృతిని బాహాటంగా సమర్ధిస్తున్నది.

 

9.            వారి హితవు దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి సామాజికవర్గానికి అనుకూలంగానూ, నైజాము సర్కారు సామాజికవర్గానికి ప్రతికూలంగానూ వున్నది. ఇద్దరూ రెండు మతాలకు ప్రతినిధులు. మావోయిస్టుల్లో స్థాయి మేధావులుగా చెలామణి అవుతున్నవారు ఏ మత సమూహానికి లీగల్ ఇంప్యూనిటీ ఇస్తున్నారూ? ఏ మత సమూహాన్ని బోను ఎక్కిస్తున్నారూ? అనేదే ఈ వివాదానికి మూలం.  ఇది పాట మీద వివాదం మాత్రమేకాదు; మావోయిస్టుల సామాజిక దృక్పథాల మీద వివాదం.

 

10.    It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.

 

*డానీ*

05 జూన్ 2025 

Wednesday, 28 May 2025

The only winning formula - 20:80 !

 *ఒక్కటే గెలుపు ఫార్మూలా - 20:80  !*

 

నా వ్యాసాన్ని ఈ రోజు సాక్షి దినపత్రిక ప్రచురించింది.

సాక్షి యాజమాన్యానికి, ఎడిటర్ గారికి, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 

ఈ వ్యాసం చదివి మీ అభిప్రాయాల్ని  తెలిపితే  ఆనందిస్తాను.

మీ

-        డానీ

    


                      

          ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం, కొత్త రాజకీయ కూటములు ఏర్పడడం ఆనవాయితి.  ఈసారి ఎందుకోగానీ లోక్ సభ ఎన్నికలు ముగిసి పూర్తిగా ఏడాది కాకుండానే వచ్చే ఎన్నికల గురించి చర్చ మొదలైంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఆశించిన మేరకు  పనిచేయడం లేదని ప్రజల్లో అప్పుడే ఒక అసంతృప్తి మొదలయినట్టుంది.  

          మనకు తెలిసిన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పార్టీలే.  కొందరు వాటిని గొప్పగా పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా అనుకోవచ్చు. అప్పట్లో పీపుల్స్ వార్, ఇప్పట్లో సిపిఐ-మావోయిస్టు పార్టి ఒక్కటి మాత్రమే దీనికి భిన్నంగా వుంటూ వచ్చింది. అది తన పరిథి పరిమితుల్లో  సాయుధపోరాట పంథాను కొనసాగిస్తూ వుండేది. ప్రస్తుతం దాని భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. మావోయిస్టు పార్టి కూడ ఎన్నికల పంథాను స్వీకరించవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి. 

          స్వాతంత్ర్యానంతర కాలపు  తొలి దశ రాజకీయాలు వేరు. అవి ఎంతోకొంత సిధ్ధాంతపరంగా వుండేవి. వాటి ఆర్ధిక విధానాలు కూడ ఆదర్శవంతంగా వుండేవి. ఇటు వ్యవసాయరంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టేది. ఇటు వ్యవసాయ రంగంలో రైతు కూలీలు, అటు పారిశ్రామిక రంగంలో శ్రామికుల  శ్రేయస్సు  దిశగా కమ్యూనిస్టు పార్టీల కృషి సాగుతుండేది.  

          రాజకీయాల్లో కులమతాలకు ఒక పాత్ర, పెట్టుబడికి ఇంకో పాత్ర వుంటుంది. మన ఆలోచనాపరులది ఒంటికన్ను వ్యవహారం. కులమతాల్ని  చూసేవాళ్లు పెట్టుబడిని చూడలేరు; పెట్టుబడిని చూసేవాళ్లు కులమతాల్ని చూడలేరు. నిజానికి ఎన్నికల్లో కులమతాలకన్నా పెట్టుబడి ప్రభావమే ఎక్కువగా వుంటుంది. ఎప్పుడయినాసరే పెద్ద పెట్టుబడి  చిన్న పెట్టుబడుల్ని తన వైపుకు లాక్కుంటుంది. రాజకీయ కూటములు అలాగే ఏర్పడుతుంటాయి. 

          దేశ తొలి ఎన్నికల్లో ప్రధాని నుండి  రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దాదాపు అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండే ఎన్నికయ్యారు. ఆ తరువాత వ్యవసాయిక కులాల్లో పెట్టుబడి పెరిగింది. సహజంగానే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనికి మారింది. ఆ తరువాత వెనుకబడిన తరగతుల్లోనూ పెట్టుబడి పోగవడం మొదలయింది. వాళ్ళూ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులయ్యారు. 

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఎస్సీ బిసిలకు అధికారం వచ్చిందనడం అర్ధసత్యం మాత్రమే. ఎస్సీ, బిసీ కులాల్లొ పెట్టుబడి ఎక్కువగా పోగయిన కులాలకు, కుటుంబాలకు మాత్రమే అధికారం దక్కుతుంది. కులమతాలకూ, పెట్టుబడికి వున్న సంబంధాన్ని అర్ధం చేసుకోకపోతే వర్తమాన రాజకీయాలు అర్ధం కావు. 

1991లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పిజి) ఆర్ధిక విధానాలు వచ్చాక రాజకీయాలు ఫక్తు వాణిజ్య వ్యవహారంగా మారిపోయాయి. కొంతకాలం ఆశావహులుగా కొనసాగిన ఎస్సీ, బీసీ రాజకీయ పార్టీల్ని వాణిజ్య రాజకీయాలు గట్టిగా దెబ్బతీశాయి. స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుని బతికిన ముస్లిం సమూహానికి ఆర్ధిక పునాది బీటలు వారడంతో ప్రేకషక పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. 

పైకి ఎంత వైవిధ్యపూరితంగా కనిపించినా సమస్త రాజకీయ పార్టీల గెలుపు మంత్రం  ఒక్కటే; 20 : 80!. 20 శత్రువర్గం; 80 మన వర్గం. 20 వాళ్ళు; 80 మనం! 

ఓటర్లలో 20 శాతంగా వుండే రాజవంశీకులు , బడా భూస్వాములకు తాను వ్యతిరేకం అని కాంగ్రెస్ చెప్పుకునేది. మిగిలిన 80 శాతం ఓటర్లను ఎన్నికల్లో ఆకర్షించడానికి ఆ పార్టి ప్రయత్నించేది. అది క్యాచ్ మెంట్ ఏరియా; ఆరగాణి ప్రాంతం. అందులో సగం ఓట్లు పడినా విజయం తథ్యం. మరోవైపు కమ్యూనిస్టు పార్టిలు కూడ ఓటర్లల్లో 20 శాతంగా వుండే పెట్టుబడీదారులు, భూస్వాములకు తాము వ్యతిరేకులమనీ, 80 శాతంగా వుండే కార్మికులు, వ్యవసాయకూలీలకు తాము రక్షకులమని చెప్పుకునేవారు. 1990వ దశకంలో బహుజన రాజకీయాల్ని ముందుకు తెచ్చిన  కాన్షీరామ్ కూడ దేశంలో పెత్తందారీ కులాలు 20 శాతం మాత్రమేననీ, 80 శాతం మంది బహుజనులని మరీ లెఖ్ఖలు కట్టి చెప్పేవారు. 

భారతీయ జనతా పార్టీది కూడ సరిగ్గా అదే వ్యూహం. దేశంలో 20 శాతం మాత్రమే హిందూయేతరులు; 80 శాతం హిందువులు అనేది దాని విభజన. మనుషులకుండే సమస్త భావోద్వేగాల్లో మతం చాలా శక్తివంతమైనది. ఈ 80 శాతం హిందువుల్లో 36 శాతం ఓట్లు పడినా అధికారం ఖాయం అని గత మూడు ఎన్నికల్లో బిజెపి నిరూపించింది. 

మతభావోద్వేగాలనీ, కార్పొరేట్ శక్తుల్ని, రాజకీయ అధికారాన్నీ మిళితం చేయడంలో బిజెపి గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఇప్పుడు బిజెపిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల్ని రచించడానికి దాదాపు అన్ని పార్టీలు తలలు పగలగొట్టుకుంటున్నాయి. బిజేపి నాయకత్వంలో కొనసాగుతున్న కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి ఓటర్లలో 80 శాతంను ఏకం చేసే బైడింగ్ వైర్ ను కనిపెట్టడం అంత సులువుకాదు.  

కమ్యూనిస్టులు, అంబేడ్కరైట్లు  ఏకం అయితే (లాల్ నీల్ మైత్రి)  బిజెపిని నిలవరించవచ్చు అనేది ఒక ఆలోచన. 2019 ఎన్నికల్లో దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడ దక్కలేదు.  ఓటర్లు తిరస్కరించారు. 

మరోవైపు, ఒక వ్యూహం ప్రకారం అంబేడ్కర్ ను బిజెపి క్రమంగా హైజాక్ చేసింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిఎస్పి అధినేత్రి మయావతి ఉత్తరప్రదేశ్ లోనే ఉనికిని కోల్పోయింది. 403 స్థానాలున్న యూపి అసెంబ్లీలో ఆ పార్టికి ఒక్క స్థానం మాత్రమే దక్కింది.  దాదాపు మూడున్నర దశాబ్దాలు నిరాఘాటంగా పశ్చిమ బెంగాల్ ను ఏలిన సిపియం  2021 ఎన్నికల్లో  తనకున్న 26 సీట్లనూ కోల్పోగా బిజేపి అదనంగా 74 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టుల స్పేస్ ను కూడ బిజెపి ఆక్రమించుకుంటున్నది అనడానికి ఇదొక ఉదాహరణ.    

అంబేడ్కరైట్లు, కమ్యూనిస్టులు కొత్తగా ఆదివాసులు, మైనారిటీలతో (లాల్ నీల్ హర్యాలి) కలిసి నడిస్తే ఎమైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? అనేది ఒక కొత్త ఆలోచన. ముందు అలాంటి కూటమి ఏర్పడాలి. అంత పెట్టుబడి సమకూరాలి.  ఆ తరువాత అది ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే ఎన్నికల వరకు ఇంకే మార్పులు వస్తాయో చూడాలి. 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

90107 57776 

రచన : 25 మే 2025

ప్రచురణ:  సాక్షి, 29 మే 2025

Sunday, 25 May 2025

What would Ambedkar do if he were here now?

 What would Ambedkar do if he were here now?

 *ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవారు?* 

*డానీ* 

*సమాజ విశ్లేషకులు*  




మావోయిస్టులది ప్రకటిత సాయుధపోరాటం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హింసామార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ధృఢ నిశ్ఛయంతో వుంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, ప్రభుత్వం చేపట్టిన హింసామార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వుందా? లేదా? అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని వెంటాడుతున్న సందేహం.  

అంబుజ్ మడ్ లోని నారాయణ్ పూర్ అడవుల్లో మే 21న సిపిఐ – మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతాదళాలు చంపేశాయి. ఆయనతోపాటు మరో పాతికమంది స్త్రీ పురుష  మావోయిస్టుల్నీ చంపేశారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, “నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం” అన్నారు. 

హింసావాదుల్ని హింసతోనే అంతం చేయడం ధర్మబధ్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోం మంత్రి ప్రకటనలు  కొందరికి సమంజసంగా అనిపించవచ్చు. మరి కొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడ కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఉగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చీదరించుకునేవారో, విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ, ప్రజలకూ ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్రగ్రంధం ఒకటుందని మరచిపోవడం ఆలోచనాపరులకు సమంజసం కాదు.

రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను మార్గదర్శకాలనూ ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు  తలెత్తాల్సిన అవసరమే వుండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తుంగలో తొక్కినపుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం. 

జాతియోద్యమ కాలంలోనే రాజకీయాల్లో రెండు స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలచుకునే భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, ఉధ్ధామ్ సింగ్ తదితరులది బాహాటంగా హింసామార్గం. గాంధీ, నెహ్రు, అంబేడ్కర్ లది అహింసామార్గం. వాళ్ళ మధ్య అభిప్రాయ బేధాలు, ఇతర వివాదాలు కూడ వుండవచ్చుగాక; వున్నాయి కూడ. అయితే,  అంతిమంగా వాళ్ళది అహింసామార్గం. చాలామంది వాళ్ల మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారుగానీ ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్. 

రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగుదేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది.  మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను కొనసాగిస్తున్నది. పైగా, అల్లూరి, భగత్ సింగ్ ల మీద ప్రజలకు ఆరాధనా భావం వుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాల పనితీరుతో విసిగిగిపోయిన ప్రజలు సాయుధులై తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటి చైర్మన్ బిఆర్ అంబేడ్కర్ ఇదే విషయాన్ని ఇంకో పధ్ధతిలో చెప్పాడు.  రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తరువాత ముందు  రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తరువాత, భావి ప్రభుత్వాలు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్నాడు. పాలకులు అలా చేయకపోతే, వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైనవారు తిరగబడి ఏకంగా  ‘ప్రజాస్వామ్య భవనాన్ని’ పేల్చేస్తారు అని హెచ్చరించాడు. 

వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనము. వాళ్ళు అసమానత్వాన్ని పెంచిపోషిస్తున్నా అభ్యంతరం చెప్పము. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారితప్పినవారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయినవారిగా నిందార్ధంలో చూస్తాము. మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం. 

. 19వ శతాబ్దం చివర్లో మద్రాసు- కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మించడానికి, దారి కోసం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని  అడవి నుండి తరిమేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం   తూర్పుకనుమల్లోని  అడవుల్ని విచక్షణా రహితంగా నరికి వేసింది. అడవిని కోల్పోయి రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆదివాసుల్ని  అణా (6 నయాపైసలు), అర్ధణా (3 నయాపైసలు) వేతనం ఇవ్వడానికి కూడ వేధించింది. అణిచివేత ఈ స్థాయికి చేరుకోవడంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది. 

మన్యంకు వాయువ్య దిశలోనే బస్తర్ వుంటుంది. అక్కడా అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడా అల్లూరివంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటుంటారు. ఇప్పుడూ బస్తర్ లో వందేళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి. ఆదివాసుల్ని అడవుల నుండి తరిమేసి అటవీ సంపదనీ, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేట్లకు అప్పగించేందుకు ఒక  మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడూ అణిచివేత స్వీయ అనుభవం. ఇప్పుడూ స్వీయ అనుభవమే. తెల్లవాళ్ళ మీద తిరగబడడం న్యాయమేగానీ,  నల్లవాళ్ల మీద తిరగబడడం అన్యాయం అని ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెపుతారా? 

అల్లూరిని చంపినపుడూ ఇంగ్లండులో సహితం  మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ  చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు  ఇక్కడి బ్రిటీషు అధికారులు. భగత్ సింగ్ ను ఉరి వేసిన తరువాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో ’ముగ్గురు బాధితులు’ శీర్షికతో అంబేడ్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తివిశ్వాశాలతో వాళ్ళీ పని చేయలేదు; ఇంగ్లండ్ లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్నీ, అక్కడి మూర్ఖులయిన జనాన్నీ సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికభం ఎక్కించారన్న వాస్తవం  ఈ ప్రభుత్వానికే కాదు ; మొత్తం ప్రపంచానికి కూడ స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి సరిగ్గా అలాంటి  ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం రాసేవాడో? 

చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతోందోలేదోగానీ, మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ  కొనసాగుతున్నాయని గుర్తించకపోవడం మాత్రం మన కాలపు విషాదం.  

రాజ్యాంగం తొలి ప్రతిలో  ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే  వుంది. దానికి మరింత వివరణ ఇస్తూ, దాని పరిధిని పెంచుతూ సామ్యవాద, మతసామరస్య  రాజ్యాంగం అని పునర్ నిర్వచించుకున్నాము.  ఆ తరువాత లెఖ్ఖ ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ, అలా జరగడంలేదు., రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నవారు, పార్లమెంటు భవనం మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. 

రాక్షసులు రాక్షసులుగానూ దేవతలు దేవతలుగానూ వుంటే సమాజం సులువుగా అర్ధం అవుతుంది. రాక్షసులు దేవతల రూపంలో తిరగడం మొదలెట్టినపుడే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. 

దేశ సంపదలో 70 శాతం కేవలం పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం సంపద ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 70 నుండి 80 శాతం జనాభా కేవలం 3 శాతం దేశ సంపదతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శమయిన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరూ?  

దేశంలో మతసామరస్యం గురించి ఇక చెప్పనక్కర లేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టాన్ని తెచ్చి వాళ్ళ పడక గదుల్లోనికి ప్రవేశించారు. ఇంకో చట్టాన్ని తెచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని సంధిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ళ ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కుడళ్ళ పక్కన హాకర్లు, చిరు వ్యాపారులుగా మారి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సరే సహించలేక వాళ్ళ బతుకుల్ని బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా, మతసామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే వున్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని, బూటకాన్ని  భరించడం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు. 

మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చాలనీ, అడవుల్లో ఆదివాసుల్ని తుడిచి పెట్టేయాలనీ ఏలినవారు ఒక ధృఢ నిశ్చయంతో వున్నట్టు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనపడుతోంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనపుడు ప్రతిచర్యల మీద మాత్రమే అభ్యంతరాలుండడం సబబుకాదు. 

బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణిచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు వున్నారుగాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుపడుతున్నవాళ్ళు అణిచివేతనూ తప్పుపట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు వున్నట్టు లెఖ్ఖ. 

నారాయణపూర్ మృతుల ఫొటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో వున్నాయి. వాళ్ళ తలల్లో  తుపాకుల బాయినేట్లను గుచ్చినట్టు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.  పొరుగుదేశం నుండి వచ్చి పెహల్గాంలో యాత్రికుల మీద భీభత్సాన్ని సృష్టించిన ఉగ్రవాదుల ఫొటోల్ని ప్రభుత్వం ఇలా విడుదల చేస్తుందని చాలా మంది ఆశించారు. కానీ, ప్రభుత్వం బస్తర్ ఆదివాసుల ఫొటోలు విడుదల చేసింది. ఇదొక వైచిత్రి. 

రాజ్యాంగం చెడ్డదయినాసరే అమలు చేసేవాడు మంచోడయితే అది మంచిదయిపోతుంది.  రాజ్యాంగం మంచిదయినాసరే అమలు చేసేవాడు చెడ్డోడయితే అది చెడ్డదయిపోతుంది అని అంబేడ్కరే అన్నాడు. పార్లమెంటు అనే దేవాలయాన్ని నిర్మించి అందులో రాజ్యాంగమనే దేవతను ప్రతిష్ఠించాలనుకుంటే ముందే దాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అవకాశం వస్తే తానే ఈ రాజ్యాంగాన్ని తొలుత తగులబెడతానని 1950లలోనే అన్నాడు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవాడో? దెయ్యాలు, భూతాలు కన్నా పెద్ద పదాల్ని ప్రయోగించేవాడు. తగులబెట్టడంకన్నా పెద్ద పనే చేసి వుండేవాడు. 

23 మే 2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి 

24 మే 2025 

https://www.andhrajyothy.com/2025/editorial/maoist-insurgency-violence-and-constitution-challenges-1407915.html

https://epaper.andhrajyothy.com/Hyderabad?eid=34&edate=24/05/2025&pgid=1076701&device=desktop&view=2


Friday, 23 May 2025

ఆ రకమైన గణన జరపాలి !

ఆ రకమైన గణన జరపాలి !

డానీ

సమాజ విశ్లేషకులు  


కులగణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బిజేపి ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్నికల్లో లబ్ది కోసమే తన విధానాన్ని మార్చుకుందనుకున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం  తప్పక  మెచ్చుకోవాలి. 


అయితే,  సామాజిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమేగానీ పరిష్కారం కాదు; సాధనమేగానీ సమాధానం కాదు. రాజకీయార్ధిక సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధించడానికి చాలా పెద్ద కసరత్తు చేయాలి. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,  అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్ధం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయార్ధిక, సామాజిక, కులమత గణన (PESRCC)) జరగాలి. 


కులగణన వల్ల దేశంలో ఏ కులస్తులు ఎంతమంది వున్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ  ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వానికి నిజాయితీ వుంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు. కానీ, అలాంటి కార్యక్రమం ప్రభుత్వానికి వున్నట్టు లేదు. 


ఆర్ధికంగా మెరుగైన స్థితిలో వున్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగుతాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికేకాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలు వంటి అమూర్త, సామూహిక ఉనికిలు వుండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే వుంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ  కూడ వుండదు. ప్రతి కులానికీ  వాళ్ళ జనాభా   ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సి వుంటుంది. జిస్కే జిత్నీ ఉస్కే ఉత్నీ. 


దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషేధంగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్ని, వ్యాపారాలని, ఓలా, ఊబర్, స్వీగ్గీ,  జమాటో వంటి చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం  ప్రకటనలు చేస్తున్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యారుల్ని హింసిస్తున్న  వీడియోలు సోషల్ మీడియాలో  నిత్యం మనం చూస్తున్నాం.   


ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతున్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిధ్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా? 


దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రదమైన అంశం. టెలీకమ్యూనికేషన్స్,  ఐటి, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌళికరంగ నిర్మాణాలు, ఇ-కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గనులు, సహజవనరులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది.  వీటి యాజమాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాము అంటారా?   


వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుధ్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగుతున్నాయి. ఒకవైపు, సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు; పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో భారత స్థూల జాతియోత్పత్తి (GDP) నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతుంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుంది. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు కనుక మన కరెన్సీలో 379 లక్షల 80 వేల కోట్ల రూపాయలు.    


ఆక్స్ ఫాం సంస్థ ఇటీవల ప్రకటించిన ‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్రాం్నతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 70 శాతం ఓ పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేదరికం ఏ స్థాయిలో వున్నదో అంచనా వేయవచ్చు. 


సంపద పంపిణిలో అసమానత్వం అత్యధికంగా వున్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్యవాదం కూడా వుంది. 39వ అధీకరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని  పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచాలని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ  రెండేళ్ళ క్రితం బిజెపి చాలా హంగామా చేసింది. ఆటు ఆదేశిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ వున్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టి మాట్లాడడంలేదు. 

7 మే 2025

ప్రచురణ ః సాక్షి 

17 మే 2025