Tuesday, 20 January 2026

 Please consider the following article for publication in Sakshi edit page.

-        Danny

The Warnings of the History

చరిత్ర  చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతాలు?

 

డానీ

సమాజ విశ్లేషకులు




చరిత్ర పునరావృతం కాదు—కనీసం యథాతథంగా అయితే కాదు. అయినప్పటికీ, కొన్ని ధోరణులు మాత్రం తిరిగి తిరిగి కనిపిస్తుంటాయి. అవే ఒకప్పుడు ప్రపంచాన్ని మహావిధ్వంసం వైపు నడిపించిన సంకేతాలు. ఆ ధోరణులు మళ్ళీ కనిపించడం మొదలైతే, సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని అర్థం.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఏఐ ద్వారా రూపొందించిన  ఆ మ్యాప్‌లో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా తదితర దేశాలను  అమెరికా భూభాగంగా చూపించారు.  చట్టపరంగా దీనికి ఎటువంటి విలువ లేదని అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో మ్యాప్‌లు అమాయకమైన బొమ్మలు కావు. అవి భవిష్యత్తు ఆకాంక్షలను, ప్రపంచ శక్తి నడక దిశను, దురాక్రమణ ఆలోచనలను సూచించే సంకేతాలు కావచ్చు.

చరిత్రను చూస్తే, ప్రపంచ శక్తులు ముందుగా మ్యాప్‌లతోనే ఆడుకున్నాయి. తరువాత మాటలుగా మారాయి. ఆపై విధానాలు మారాయి. యుధ్ధాలు జరిగాయి. చివరకు దేశాల సరిహద్దులే మారిపోయాయి. ప్రపంచ పటం మీద  అగ్రరాజ్యం కావాలనుకున్న దేశం తన ప్రయాణాన్ని ఎప్పుడూ యుద్ధంతో మొదలుపెట్టదు; అది ముందుగా భాషలోకి, చిత్రాల్లోకి, ప్రజల ఊహల్లోకి ప్రవేశిస్తుంది.

ఆ మ్యాప్ కింద రాసిన  “ఇక్కడి నుండి వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు” అనే వ్యాఖ్య కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ వాక్యం కాదు. ఇది చర్చలు, రాజీలు, దౌత్య సంవాదాలకు తలుపులు మూసే భాష. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే—ఇలాంటి భాష వినిపించిన ప్రతిసారీ, దాని వెనక ఘోర పరిణామాలే వచ్చాయి.

బ్రిటిష్ చరిత్రకారుడు ఏ.జె.పీ. టేలర్ ఒకసారి అన్నట్లు, “యుద్ధాలు అకస్మాత్తుగా జరుగుతాయనుకోవడం మన అజ్ఞానం; నిజానికి అవి చాలాకాలం మాటలలోనే సిద్ధమవుతాయి.” నేటి ప్రపంచంలో ఆ మాటల స్థానాన్ని ఇప్పుడు చిత్రాలు, మీమ్స్, ఏఐ మ్యాప్‌లు తీసుకున్నాయి.

1930ల నాటి యూరప్‌లో ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినీ కూడా ఇలానే మాట్లాడాడు. ఆఫ్రికా ఆక్రమణను సమర్థించుకుంటూ, “మన ప్రజలకు ఊపిరి పీల్చుకోవడానికి స్థలం కావాలి” అన్నాడు. జాతీయ గర్వం, భద్రత, ప్రజల అవసరాల సాకులు నెపాలతో సాగిన ఆ వాదన చివరకు ఖండాన్ని రక్తపాతంలో ముంచింది. ఇది వ్యక్తుల్ని విమర్శించడానికో, డోనాల్డ్ ట్రంప్ ను ముస్సోలినీతో పోల్చడానికో కాదు; చరిత్రలో పదే పదే కనిపించే ధోరణుల్ని కొంచె ముందుగా లోతుగా అర్థం చేసుకోవడానికి.

గ్రీన్లాండ్ విషయంలో అంతర్జాతీయ చట్టం స్పష్టంగా ఉంది. అది డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రకారం భూభాగాల మార్పు ప్రజల సమ్మతితోనే జరగాలి. అయితే, భద్రత పేరిట భౌగోళిక ఆకాంక్షలను కప్పిపుచ్చుకోవడం కొత్త కాదు. కానీ, అలాంటి ప్రయత్నాలు ప్రపంచానికి శాంతిని ఎప్పుడూ తీసుకురాలేదు. చరిత్రకారులు పలుమార్లు హెచ్చరించినట్లు, “చట్టం బలహీనపడినప్పుడు శక్తి మాట్లాడుతుంది.”

ఇక్కడే ఐక్యరాజ్యసమితి పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నానాజాతి సమితి ఎలా నిర్వీర్యమైపోయిందో, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా అలాంటి స్థితికి చేరుతోందా అన్న సందేహం అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తోంది. నాటో వంటి కూటముల్లోనూ అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది. పైకి మౌనం ఉన్నా, లోపల ఉడుకుతున్న ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యూరోపియన్ యూనియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అప్పుడే స్పందించారు. “ట్రంప్ టారిఫుల బెదిరింపులు దారితప్పాయి” అని ఆమె  స్పష్టంగానే ప్రకటించారు. అంతేకాదు, ట్రంప్ విదేశాంగ విధానాల మీద  తమ ప్రతిస్పందనఐక్యంగా, సముచితంగా ఉంటుంది.” అన్నారు. ఇది కేవలం ఆర్థిక ప్రకటన కాదు. ఇది ఒక రాజకీయ సంకేతం ప్రపంచ యుధ్ధానంతరం ఏర్పడిన  ప్రపంచ కూర్పును  కాపాడుకోవాలన్న  సంకల్పం అందులో వుంది. చరిత్రకారుడు టోనీ జడ్ అన్నట్లు, “1945 తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ కూర్పు సంపూర్ణం కాకపోవచ్చు; కానీ అది లేకపోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంది.”

డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు  చేస్తున్నారు. అక్కడి వీధుల్లో వినిపిస్తున్న స్వరాలు కూడ ఇప్పుడు ప్రపంచానికి  ముఖ్యమే. “అమెరికాకు పూర్వ వైభవాన్ని తెద్దాం”  అనే నినాదాన్ని ట్రంప్ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో దీన్ని “Make America Great Again (MAGA)’’ అంటున్నారు. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్, గ్రీన్ ల్యాండ్ ముఖ్యపట్టణం నూక్ నగరాల్లో ప్రదర్శనకారులు  ట్రంక్ నినాదానికి కొత్త అర్ధం ఇచ్చారు. వాళ్ళు కూడ MAGA అంటున్నారు. కానీ, వాళ్ళ నినాదం పూర్తిగా అమెరికాకు వ్యతిరేకం. వాళ్ళు “Make America Go Away” అని నినదిస్తున్నారు. ఈ నినాదం పైకి కొంచెం వ్యంగ్యంగా కనిపించినా, దాని వెనక ఉన్న భయం నిజమైనది. సామ్రాజ్యవాద భాషను పాలకులకన్నా ముందే సామాన్య ప్రజలే గుర్తిస్తారని చరిత్ర పదే పదే నిరూపించింది.

ప్రపంచం యుద్ధాల దిశగా సాగేటప్పుడు ఇలాంటి కీలక సంకేతాలు కనిపిస్తాయని అమెరిక చరిత్రకారిణి హన్నా ఆరెండ్ గమనించారు. కీడుకి ఒక సామాన్య లక్షణం ఉంటుందని ఆమె చెప్పారు. దానిని ఆమె *‘Banality of Evil’*గా నిర్వచించారు. బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను బేరీజు వేసుకునే ఇంగితజ్ఞానాన్ని కోల్పోయిన ప్రతిసారీ, ప్రపంచ స్థాయిలో తీవ్రమైన కీడు చోటు చేసుకుందని ఆమె హెచ్చరించారు.

ఇక్కడ కార్ల్ మార్క్స్ చేసిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది. చరిత్ర మొదట విషాదంగానూ, తరువాత ప్రహసనంగానూ తిరిగి వస్తుందనే అర్ధంలో ఆయనోమాట అన్నాడు. చరిత్ర యధాతథంగా పునరావృతం కాకపోయినా, చరిత్రలోని ధోరణులు మళ్ళీ మళ్ళీ వివిధ స్థాయిల్లో మన ముందుకు వస్తాయని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు.

మీడియా పాత్ర ఈ సమయంలో అత్యంత కీలకం. భయాన్ని పెంచకుండ పరిస్థితిని విశ్లేషించడం మీడియా బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు, అనేక గ్లోబల్ మీడియా సంస్థలు ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని వినోదంగా మార్చే ధోరణితో వ్యవ్హరిస్తున్నాయి. ఇది ప్రజల్ని  అప్రమత్తం చేయాల్సిన సమయంలో, మత్తులోకి నెట్టే ప్రమాదం.

ఇది తీర్పు కాదు; ఒక హెచ్చరిక. వ్యక్తుల మీద కాదు, ప్రమాదకర ధోరణుల మీద చర్చ. సార్వభౌమత్వం అంటే శక్తివంతుడి ఇష్టాఇష్టాలు కాదు; అది ప్రజల హక్కు. ఈ సూత్రాన్ని చిన్న చూపు చూస్తే  చిన్న దేశాల భవిష్యత్తే కాక  మొత్తం ప్రపంచ శాంతే కనుమరుగై పోతుంది.

చరిత్ర మౌనంగా ఉండదు. అది వర్తమాన ప్రపంచాన్ని నిద్ర లేపుతుంది. నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి నిలదీస్తుంది. అప్రమత్తంగా వున్నవాళ్ళు, సమూహ బాధ్యతలు తెలిసిన వాళ్ళు మాత్రమే చరిత్ర           విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వగలరు.

రచన : 21 జనవరి 2026

Saturday, 17 January 2026

Happy Birthday Eluri Agitha

 

అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! 






 

          ఎవరెవరికి రుణపడివున్నాను? అనుకున్నప్పుడు సహజంగానే మా అమ్మీ సుఫియా బేగం ముందుగా గుర్తుకు వస్తుంది.  ఇప్పుడు మా అమ్మకన్నా పెద్ద స్థానం అజితది.

         

          సాక్షాత్తు పార్టి అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సూచించారని నేను తనను పెళ్ళిచేసుకున్నాను. తన తండ్రి చెప్పాడని తను నన్ను పెళ్ళి చేసుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగానూ తనకు చాలా అడ్వాంటేజెస్ వున్నాయి. తను వాటిని ఎన్నడూ నా మీద ప్రయోగించలేదు. తన స్థాయిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది.

 

          తనను నేను ఒక స్టూడెంట్ గానే చూసేవాడిని. తనూ నన్ను ఒక గురువుగానే భావించేది.  పిల్లలు పుట్టాక  తను అనుచర స్థానం నుండి సమాన స్థాయికి, ఆ తరువాత నన్ను నడిపించే స్థాయికి కూడ చేరుకుంది.

 

          మా ఇద్దరికి ఒక సామాన్య గుణం వుంది. ఇద్దరికీ కోపం ఎక్కువ. మా స్వభావాల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మేము మూడు నాలుగేళ్ళు కూడ కలిసుంటామని అనుకోలేదు. అలా నలభై మూడేళ్ళు దాటేశాం.

 

          తను చాలా మొండిది. విపరీతమయిన పట్టుదల. ఇప్పటికీ రైలు, బస్సు లేని కుగ్రామంలో తను పుట్టింది.  నేను అత్తారింకి వెళ్ళాలంటే మధిర స్టేషన్లో రైలు దిగి, వైరా గట్టుకుపోయి, బూట్లు, ప్యాంటు తీసి నెత్తిన పెట్టుకుని యేరు దాటి, ఐదు కిలోమీటర్లు నడిచి శివాపురం చేరుకునేవాడిని. ఈ వెనుకబాటు తనం నుండి బయటపడడానికి తను అదనంగా శ్రమించింది. నాకన్నా ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది. పిల్లలకూ తనే కంప్యూటర్స్ నేర్పింది. ఆ ఏరియాలో నేను లేటుగా ప్రవేశించాను. అక్కడి నుండి మొదలయ్యి,  ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ లో అడ్మిన్ హెడ్ గా చాలా యేళ్ళు పనిచేసింది. ఆమెతో ప్రధాన సమస్య ఏమంటే ఇంట్లోనూ తనే అడ్మిన్ హెడ్ అనుకుంటుంది.

 

గడిచిన యాభై యేళ్లలో మనదేశ కుటుంబ వ్యవస్థలో మౌలిక మార్పులు వచ్చేశాయి. అప్పుడు భర్త యింటి మజమాని. ఇప్పుడు భార్య ఇంటి యజమాని. వ్యవస్థ తలకిందులు కావడానికి చాలా యేళ్ళు చాలా ఘర్షణ వుంటుంది.  దానికి మేమిద్దరం మినహాయింపుకాదు.

 

          గంటకోసారి మంచినీళ్ళు తాగినట్టుగా గంటకోసారి మేము దెబ్బలాడుకుంటాము. వెనెజులా అధ్యక్షుడ్ని డొనాల్డ్ ట్రంప్ కిడ్నాప్ చేయడం వంటి చిన్నచిన్న విషయాలను మేము అస్సలు పట్టించుకోము. తాలింపులో కరివేపాకు మాడడం వంటి పెద్దపెద్ద గ్లోబల్  ఇష్యూస్  మీద ఆ ఉప్మా తింటున్నంత సేపూ  కొట్లాడుకుంటాము.

 

          అయితే కుటుంబాన్ని తను ప్లాన్ చేసే విధానం, ముందు చూపు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఏం చదవాలీ  ఎక్కడ చదవాలి ఎక్కడ ఎలా సెటిల్ కావాలీ మన ఇల్లు ఇలావుండాలీ? వగయిరా విషయాలన్నింట్లో  తనకో లెఖ్ఖ వుంటుంది. దాదాపు అవన్నీ నెరవేర్చేసింది. ఈ విభాగంలో తనను బోలెడు ప్రేమించవచ్చు.

 

           వర్గ వ్యవస్థకన్నా ముందే వివాహవ్యవస్థ కూలిపోతుందని నేను గట్టిగా నమ్ముతాను. కొత్తతరం పెళ్ళిళ్లు చేసుకోవడంలేదు. లివి- ఇన్ రిలేషన్ షిప్స్ కూడ షార్ట్ లివింగ్ గా మారిపోతున్నాయి. వివాహాన్ని నిరాకరించవచ్చుగానీ పిల్లల పుట్టుకను నిరాకరించడం మహాపరాధం అని నేను భావిస్తాను. ఆర్ధిక పరిమితుల కారణంగా కుటుంబ నియంత్రణ పాటించాల్సి రావచ్చు. కానీ, అసలు పిల్లలు పుట్టడానికే వీల్లేని పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నాం. ఇది దారుణం అనిపిస్తుంది. మానవజాతి మనుగడను కొనసాగించడం మనందరి బాధ్యత.

 

          నేను అజితను తనను తానుగా సగం ప్రేమిస్తాను.  పిల్లల్ని సాకిన తీరుకు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను.

 

          మా దండల పెళ్ళికి చలసాని ప్రసాద్ పురోహితుడు. చలసానికి ఒక రికార్డు వుంది. ఆయన వంద పెళ్ళిళ్ళు చేశాడు. 99 జంటలు విడిపోయారు. నిలబడింది మేమిద్దరమే. తను నన్ను దారికి తెచ్చుకోవాలి అనుకుంటుందిగానీ విడిపోవాలనుకోదు.

 

          అప్పుడప్పుడు నాకు కూడ తన మీద చాలా కోపం వస్తుంది. మూడు నాలుగు సంఘటనల్ని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

         

          మొదటిది; 1983లో మేము పెళ్ళి చేసుకున్నప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులకు నేను ఒక్కడ్నే బ్రెడ్ ఎర్నర్ ని. తాటాకు ఇంట్లో నివాసం. ఓపెన్ లావెటరీస్. అక్కడ తను నివశించడం చాలా కష్టం. రెండోది; 1985లో కారంచేడు ఉద్యమం మొదలయినపుడు పార్టి నన్ను అక్కడికి వెళ్ళమంది. అదొక ఛాలెంజ్ గా భావించి వెళ్ళాను. అప్పుడు మా పెద్దబ్బాయి మూడున్నర నెలల పిల్లోడు.  ఆ పరిస్థితిని తాను తట్టుకుంది. 1998లో తెలుగు జర్నలిజానికి కష్టకాలం. నేను పనిచేస్తున్న ఏపి టైమ్స్ మూతపడింది, అంతకు ముందు నేను పనిచేసిన ఆంధ్రజ్యోతి (పాతది) మూతపడింది. ఉదయం మూసేశారు, ఆంధ్రపత్రిక మూసేశారు. ఆంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. అసలే నిరుద్యోగం ఆపైన ఆ ఆందోళన, వత్తిడి, కుంగుబాట్లతో ఆరోగ్య సమస్యలు. నేను నా భార్యా పిల్లల్ని ఆకలితో మాడ్చిన రోజులవి. సరిగ్గా పిల్లలు పెద్ద చదువులకు వచ్చిన సమయం అది. ఆ కష్టాల నుండి గట్టేక్కడానికి తను అదనంగా కష్టపడింది. వీటిని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

 

          తన తరువాత నా బాగోగులు ఎవరు చూసుకుంటారని ఇప్పుడు తను ఆలోచిస్తూ వుంటుంది. నేనూ అంతే.

15 జనవరి 2026

Monday, 12 January 2026

Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!

 Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!

డానీ 

సమాజవిశ్లేషకులు  



దేశంలో నిరసనోద్యమాలు, ఆందోళనల్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు మొదలెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన నిరసనోద్యమాలు, వాటికి కారణాలు, అవి సాధించిన ఫలితాలు, వాటికి నాయకత్వం వహించిన వారి వ్యక్తిగత ప్రయోజనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఈ అంశం మీద ఒక సమగ్ర నివేదికను అందించే పనిని  పోలీసు మేధోసరోవరంగా భావించే బ్యురో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR&D)కు అప్పగించారు. మరీ ముఖ్యంగా, 1974 తరువాత సాగిన ఉద్యమాల మీద మరింత లోతైన విశ్లేషణ జరపాలని కేంద్రం కోరింది.  ఆ మేరకు అన్ని రాష్ట్రాల  హోంశాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. అంతేకాక, భవిష్యత్ ఆందోళనల నివారణకు ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించాలని కూడ కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే దేశంలో నిరసనలు, ఆందోళనల్ని నిషేధిస్తూ ఒక బిల్లు పార్లమెంటులో ప్రవేశించవచ్చు. అది ఆమోదం పొంది ఒక చట్టంగా కూడ మారవచ్చు. 

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడ కొన్ని బాధ్యతలు, హక్కులు ఉంటాయి. సమ్మెలు, ఆందోళనల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి వుంటుందిగానీ, వాటిని నిర్మూలించే అధికారం వుండదు. నియంత్రణకూ నిర్మూలనకూ మధ్య ప్రజాస్వామిక అవగాహనలో చాలా వ్యత్యాసం వుంది. అవి రెండూ పరస్పర వ్యతిరేక అంశాలు. 

కార్మికులకు సమ్మె చేసే హక్కు, ప్రజలకు నిరసన వ్యక్యం చేసే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం.  వాటిని తీసివేస్తే ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద క్రూరంగా హత్య చేసినట్టే. 

వ్యక్తులకు వుండే భావప్రకటన స్వేఛ్ఛ, సమూహ స్థాయిలో నిరసన స్వేఛ్ఛగా మారుతుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం కూడ సరికాదు; ఆ పునాదుల మీదనే రాజ్యాంగం అవతరించింది అనడం సబబు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటేనే నిరసన హక్కు. ఆ విలువలను  పరిరక్షించడానికే ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నియమం రూపొందింది. అధికారంలో వున్న ప్రభుత్వ పని తీరుకు ఆమోదం తెలిపే అవకాశంతోపాటు, నిరసనతో గద్దెదించే అవకాశాన్ని  కూడ ఎన్నికలు ప్రజలకు ఇస్తాయి. వీటిల్లో, మొదటిదానికన్నా రెండోదే కీలకమైనది. 

సమ్మెలు, నిరసనలు, ఉద్యమాల ద్వార ప్రజలు తమ కోర్కెలను పాలకుల  దృష్టి తెస్తారు. తద్వార తమ విధానాలను సరిదిద్దుకునే, కొత్త వాగ్దానాలను రూపొందించుకునే అవకాశం అధికార పార్టీకేకాక,  ఇతర రాజకీయ పార్టీలకు కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను నిరోధించే పనిలో కేంద్రప్రభుత్వం నిమగ్నమైంది. 

సంఘ పరివారానికీ, దాని రాజకీయ వేదిక అయిన, భారతీయ జనతా పార్టికి రాజకీయాల్లో గాంధీజీ, ప్రభుత్వ నిర్వహణలో రాజ్యాంగం అస్సలు పడవు. ఆ విషయాన్ని వాళ్ళేమీ దాచుకోరు. చాలా బాహాటంగానే మొదటి నుండి చెపుతూ వస్తున్నారు. ఇప్పుడయితే గాంధీ వ్యతిరేకతను ప్రత్యక్షంగానూ, రాజ్యాంగం మీద వ్యతిరేకతను పరోక్షంగానూ డైలీ సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు.  

రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే నిజాం సంస్థానంలోని తెలంగాణలో రైతులు సాయుధులై స్థానిక జాగీర్దాలతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలను నిషేధించాలని రాజ్యాంగ సభ భావించలేదు. అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని కల్పించిన రాజరిక వ్యవస్థను రద్దు చేయాలనుకుంది. భూస్వామ్య వ్యవస్థను నియంత్రించాలనుకుంది. రైతులు, వ్యవసాయకూలీల హక్కులకు రక్షణ కల్పించాలనుకుంది. కుల వివక్షను శిక్షించాలనుకుంది. ఈ ఆదర్శాలకు అనుగుణంగానే తరువాతి కాలంలో అనేక చట్టాలు వచ్చాయి.  

మరోవైపు సంఘపరివారం రాజ్యాంగాన్ని తీవ్రంగా దూషించింది. మనువును అవమానించారంటూ గగ్గోలు పెట్టింది. తాము అధికారం లోనికి వచ్చిన రోజున ఈ రాజ్యాంగాన్ని తీసిపడేసి మనుధర్మాన్ని అమలు చేస్తామని ప్రతినలు చేసింది. 

ఇంకో వైపున కూడ రాజ్యాంగాన్ని విమర్శించిన వారున్నారు. సామాజికంగా వెనుకబడిన శూద్రులు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కొత్తలోనే తమకు అన్యాయం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళన సాగించారు. నాటి నెహ్రు ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇది ప్రజాందోళన సాధించిన విజయం. అయినప్పటికీ, తమిళనాడులో పెరియార్ ఇవి రామసామి నాయకర్ 1957లో రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ ప్రతుల్ని బహిరంగంగా తగుల బెట్టారు. రాజ్యాంగం కులాన్ని నిర్మూలించకుండ కుల వివక్షను మాత్రమే నిర్మూలించిందనేది పెరియార్ చేసిన ప్రధాన విమర్శ.  కులం వున్నంత కాలం  కుల వివక్ష వుంటుందనేది ఆయన ఆందోళన.  ఇప్పటికీ ఈ అంశం మీద ఆలోచనాపరుల వేదికల మీద చర్చలు సాగుతూనేవున్నాయి. 

1990లలో  నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక పరిస్థితి మారింది. అయితే, అంతకు ముందు ప్రభుత్వలు చేసిన ప్రజానుకూల చట్టాలన్నీ ప్రజాందోళనలు సాధించుకున్నవే. కార్మిక హక్కుల చట్టాలు, అటవీ భూముల మీద  ఆదివాసులకు హక్కు కల్పించే చట్టాలు, భూపరిమితి చట్టాలు సమస్తం ప్రజాందోళనలకు తలొగ్గి వచ్చినవే. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన  పాత్ర కూడ మహత్తరమైనది. ఏ చట్టం ఏ ఉద్యమం ఫలితంగా వచ్చింది అనేదాన్ని వివరిస్తూ ఒక పట్టిక తయారు చేయవచ్చు. 

2017లో సంచలనం రేపిన ‘ఉన్నావ్ బాలిక మీద సామూహిక అత్యాచారం’ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బిజెపి నేత కుల్దీప్సింగ్ సెంగార్ ను విడుదల చేయించుకోడానికి ఢిల్లీ పెద్దలు చేసిన కృషి ఇటీవల ఫలించింది. కానీ, ప్రభుత్వ చర్యను నిరశిస్తూ దేశ రాజధాని నగరంలో   మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి పక్షాన గట్టిగా నిలిచాయి.  ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు అనడంకన్నా ప్రజాందోళనలు వాళ్ళను దిగివచ్చేలా చేశాయి అనడం సబబు. 

అలాగే, మైనింగ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల కనీసపు ఎత్తును వంద మీటర్లకు పెంచుతూ కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం కూడ వివాదంగా మారింది. ఈ నిర్వచనం సుప్రీం కోర్టు ఆమోదాన్ని పొందినాసరే  దానికి వ్యతిరేకంగా ప్రజాందోళన సాగింది. మరోసారి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి సుప్రీం కోర్టులో తమ పాత వాదనల్ని వెనక్కు తీసుకున్నారు. 

ఒక వారం రోజుల వ్యవధిలో  రెండు కేసుల్లో దిగిరావాల్సిన పరిస్థితి  ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రజాందోళనల పని పట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 

నియంతృత్వం, మతతత్త్వ నియంతృత్వం, 

1974 నుండి సాగిన నిరసనోద్యమాల మీద ప్రత్యేక అధ్యయనం సాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకొంటోంది. ఎమర్జెన్సీకు వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పునరుధ్ధరణ ఉద్యమాలను పరిశీలించాలనేది దాని ఉద్దేశ్యం కావచ్చు.

 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సాగించింది నిస్సందేహంగా నియతృత్వమే. అయితే, ఇప్పుడు మనం చూస్తున్నది మతతత్త్వ నియంతృత్వం. ప్రజల్నీ ప్రజాస్వామిక హక్కుల్ని నియంతృత్వం క్రూరంగా అణిచివేస్తుంది. మతతత్త్వ నియంతృత్వం అంతకన్నా నాలుగు అడుగులు ముందుకేసి, ప్రజల్ని మతప్రాతిపదికన చీల్చి మెజారిటీ సమూహాన్ని మైనారిటీ సమూహం మీదికి  ఉసి గొల్పుతుంది. నియంతృత్వం సరళమైనది. ప్రజలందరూ ఏకం అవుతారు కనుక దాన్ని ఎదుర్కోవడం సులువు. మతతత్త్వ నియంతృత్వం సంక్లిష్టమైనది. ప్రజల్లో అది తెచ్చిన కుత్రిమ చీలిక వుంటుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి అదనపు ఉపాయాలు అవసరం అవుతాయి.  

2014 తరువాత  ప్రజాస్వామిక విలువలు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత కరెన్సీ మీద గాంధీ బొమ్మ వుంటుందిగానీ, భారత ప్రభుత్వ విధానాల్లో గాంధీ ఆలోచనలు వుండవు. పైగా, అనుక్షణం గాంధీ ఆలోచనల్ని విమర్శించే ప్రకటనలే చేస్తుంటారు. 

అంతకు ముందు వరకు  ప్రజా నిరసనల్ని ప్రజాస్వామ్య ఒత్తిడి సాధనంగా భావించే ఒక  రకమైన అంగీకారం వుండేది. ఇప్పుడు దాన్ని పాలనకు ముప్పుగా,  దేశ భద్రతా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. విభిన్న చట్టాల మీద  ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగ హక్కుగా చూసేవారు, ఇప్పుడు దాన్ని ప్రజా క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారు. అంతకన్నా తీవ్రంగా తప్పుపట్టితే ఏకంగా దేశ భద్రతకు ముప్పుంటున్నారు. గతంలో  కార్మికుల సమ్మె హక్కును రాజకీయ సామూహిక చర్చగా గుర్తించేవారు. ఇప్పుడు ఆర్ధిక నష్టం కలిగించే చర్యగా ముద్ర వేస్తున్నారు. ఇంతకు ముందు ఆందోళనలు జరిగితే చర్చలకు పిలిచే వారు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలను నియమించేవారు. కమిటీల సిఫార్సుల మేరకు అవసరమైతే  వెనక్కు తగ్గడానికి కూడ జంకేవారుకాదు. ఇప్పుడు నిరసనకారుల మీద ఎదురుదాడికి దిగుతున్నారు, వాటికి నాయకత్వం వహించేవారిని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  అన్నింటికన్నా  మైనంగా వుండిపోవడం ఇప్పుడు గొప్ప ఉపాయంగా మారిపోయింది. మణిపూర్ అల్లర్ల మీద ప్రధాని ప్రతిస్పందన ఏమిటో చూశాంగా! ఇంతకు ముందు దేశానికి ముప్పు సరిహద్దులకు ఆవలి నుండి వుందనేవారు, ఇప్పుడు ముప్పు అంతర్గతంగా వుందంటున్నారు.  

ప్రజాస్వామ్య పతనం 2014కు ముందు ఆ తరువాత అని బేరీజు వేసుకుంటే మనల్ని ముంచుకొస్తున్న ప్రమాదం అర్ధం అవుతుంది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో కూడ బోధపడుతుంది. 

రచన : 31-12-2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 13 జనవరి 2026 


https://www.andhrajyothy.com/2026/editorial/if-protest-becomes-a-crime-democracy-faces-collapse-1484567.html

Thursday, 8 January 2026

Venezuela Western Hemisphere

 

Venezuela Western Hemisphere

'వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!'

ఈరోజు సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని 'దాపరికం లేని సామ్రాజ్యవాదం' అనే ఉమ్మడి శీర్షిక కింద ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 


*వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!*

 

డానీ

సమాజవిశ్లేషకులు

 

ఇది వెనిజులా గురించి కాదు. ఇది ప్రపంచ చట్టవ్యవస్థ ప్రాణాలు, ప్రమాణాల గురించి. ఇది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో మంచి వాడా? చెడ్డవాడా? అన్న ప్రశ్న కాదు. ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అన్న రాజకీయ చర్చ కూడా కాదు. ఇక్కడ  ఒకే ఒక మౌలిక ప్రశ్న వుంది. ఒక దేశం మరో దేశపు రాజకీయ భవిష్యత్తును బలప్రయోగంతో నిర్ణయించే హక్కును కలిగి వుంటుందా? వుండవచ్చా?

 

ఈ ప్రశ్నకు “వుండకూడదు” అని గట్టిగా సమాధానం చెప్పడానికే 1945 అక్టోబరు 24న  ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తడమే ఈ రోజున జరుగుతున్న అతిపెద్ద నేరం.

 

అంతర్జాతీయ చట్టంకన్నా సైనిక బలం గొప్పదా?

 

ఏ దేశమైనా సరే మరో దేశ సార్వభౌమత్వాన్ని బలప్రయోగం ద్వారానో,  బెదిరింపుల ద్వారానో ధ్వంసం చేయకూడదు. ఐక్యరాజ్యసమితి చార్టర్—ఆర్టికల్ 2(4)— ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటీ? మార్కెట్ విస్తరణ కోసం, దిగజారుతున్న తన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం. బలహీన దేశాలపై  సైనిక దాడి. కుదరదంటే కుత్రిమంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం. నౌకల ముట్టడి. ఆస్తుల స్తంభన. దాడికి లక్ష్యంగా పెట్టుకున్న దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నచ్చడం లేదని ప్రచారం. ‘రాజ్యాంగ మార్పు’ పేరుతో రాజకీయ బ్లాక్‌మెయిల్. దానికి తోడు అగ్రరాజ్య మీడియా మాయాజాలం.  ఇది అపవాదు కాదు; ఇది సుదీర్ఘ కాలంగా అమెరిక ఆచరిస్తున్న  విధానం.

 

          రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసిన తరువాత వివిధ దేశాల్లో అమెరికా చేసిన ‘రాజ్యపాలన మార్పు’ ఆపరేషన్లు వందకు పైగా వుంటాయి. 1991లో సోవియట్ రష్యా పతనమై ప్రఛ్ఛన్న యుధ్ధం (కోల్డ్ వార్) ముగిసినా అమెరికా ఆగడాలు ఆగలేదు. మరింత వేగాన్ని పుంజుకున్నాయి. ఇరాక్, లిబియా, సిరియా, ఉక్రెయిన్, హోండురాస్, వెనిజులా. ఈ జాబితా చాలా పెద్దది. ఈ దారుణాలన్నింటి వెనుక ఒక దారుణ సత్యం వుంది; ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండానే బలప్రయోగానికి పాల్పడడం. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి సైనిక బలంతో విర్రవీగే రాజకీయాలివి. 

తన ఆర్ధిక ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే దేశాలను అమెరిక సహించదు.  వాటిమీద ‘ఆర్థిక ఆంక్షలు’ విధిస్తుంది. ఇది ప్రత్యక్ష యుధ్ధానికి మరో రూపం. రెండింటి ప్రభావం ఒక్కటే.

 

వెనిజులాపై అమెరిక విధించిన ఆంక్షలు ఆయుధాల యుధ్ధంకాదు. కానీ,  వాటి ప్రభావంతో జరిగే ఆర్ధిక నష్టం ప్రత్యక్ష యుధ్ధంకన్నా తక్కువ కాదు. వెనిజులాలో చమురు ఉత్పత్తి 75 శాతం పడిపోయింది. ప్రజల సగటు ఆదాయం 60 శాతం కంటే ఎక్కువగా కూలిపోయింది.

 

పాలకులు నిరంకుశులుగా మారితే ఆ దేశ ప్రజలు వారిని తప్పిస్తారు. దానికోసం పోరాటాలు చేస్తారు. తిరుగుబాట్లు చేస్తారు. అమెరికా వాళ్లకు ఆ అవకాశం ఇవ్వదు. పాలకులను శిక్షిస్తున్నాం అనే వంకతో దేశాన్ని శిక్షిస్తుంది. దేష ప్రజల్ని శిక్షిస్తుంది.  ఒక దేశం అధ్యక్షుడిని గుర్తిస్తామా, తిరస్కరిస్తామా అన్నది నిర్ణయించాల్సింది ఆ దేశ ప్రజలే; వైట్ హౌస్ కాదు. పెంటగాన్ అస్సలే కాదు.

 

ఇది మడూరో మీద శిక్షా? లేదా వెనిజులా పిల్లల మీద శిక్షా?  ఒకవేళ, శిక్షా పడాల్సింది పాలకుల మీద అయితే, సామాన్య ప్రజల్ని ఇక్కడ ఆకలితో చనిపోయేలా చేయడం ఏం న్యాయం?.

 

దీనికి అంతర్జాతీయ చట్టం ఏమంటోంది? ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక్క భద్రతా మండలిని మాత్రమే సభ్య దేశాల మీద ఆంక్షలు విధించే హక్కు ఉంది. అమెరిక తనకు తాను అంతర్జాతీయ భద్రతా మండలి అనుకుంటుంది. ట్రంప్ అయితే అంతకన్నా ఎక్కువే అనుకునే వ్యక్తి. ”ప్రజాస్వామ్య రక్షణ’ అనే నెపంతో గ్లోబల్ గూండాయిజాన్ని చెలాయిస్తుంది. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”. ఇది కొత్త వలసవాదానికి అమెరిక పెట్టిన అందమైన పేరు.

 

ఇది పశ్చిమార్ధగోళం అంతర్గత వ్యవహారం; పూర్వార్ధ గోళానికి దీనితో సంబంధంలేదు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇదొక అపభ్రంశవాదం. పశ్చిమార్ధగోళంలో అమెరిక సంయుక్తరాష్ట్రాలు మాత్రమే వుండవు. దానికి ఉత్తరాన కెనడా వంటి దేశాలు, దక్షణాన మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు అనేకం వున్నాయి. వాదన కోసంఐనా సరే అవన్ని అమెరికా ఆఢిపత్యాన్ని అంగీకరిస్తాయా।

 

రెండవ ప్రపంచ యుధ్ధం దాదాపుగా ముగిశాక, 1945 మే 8న యూరప్ లో విజయ దినం (VE Day) జరిగాక, అమెరిక దూకుడుతో జపాన్ మీద అణుబాంబుల దాడి చేసింది. ఇది ఎంత అమానుషచర్యో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ప్రపంచ యుధ్ధం ముగిసిన రెండుదశాబ్దాలకే రెండో ప్రపంచ యుధ్ధాం జరిగింది. ఆ తరువాత ఎనభై యేళ్ళు గడిచినా మూడో ప్రపంచ యుధం రాలేదు. దానికి ప్రధాన కారణం,  నాగాసాకీ, హీరోషీమాల్లో మానవహననం ఆ పైన  కొనసాగిన జన్యు సమస్యల్ని చూసిన దేశాలు మరో ప్రపంచ యుధ్ధానికి ఇప్పటి వరకు సాహసించలేదు. కానీ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కాదని మూడో ప్రపంచ యుధ్ధానికి కాలు దువ్వుతోంది.

 

అణుయుగంలో  ప్రపంచ యుధ్ధం అంటే మొత్తం మానజాతి హననం అని అర్ధం. ఈ భయంతోనే తన జోలికి ఎవ్వరూ రారని అమెరిక ధీమా. ఈరోజు ప్రపంచం మౌనం వహిస్తే రేపు మానవజాతికే సమాధి.  కాబట్టి ప్రశ్న మడూరో కాదు; మనమే. ప్రశ్న వెనిజులాకాదు; ప్రపంచం. బలిసిన దేశాల ఆయుధ సంపత్తితో కింద  ప్రపంచం నడవకూడదు.

 

ఐక్యరాజ్యసమితి తన చార్టర్లను  కాపాడుకుంటుందా? లేదా గొప్ప దేశాల దౌర్జన్యానికి మౌన సాక్షిగా మారుతుందా? ఇప్పుడు ప్రపంచానికి ఇది  ఒక పెద్ద సందేహం. ఐక్యరాజ్య సమితీ వెన్నెముకతో నిలబడినా, వెన్నెముక విరిగి కిందపడినా ప్రపంచాన్ని కాపాడుకోవడం ప్రపంచ ప్రజల బాధ్యత. ఇప్పుడు ప్రపంచం స్పందించకపోతే రేపటి ప్రపంచానికి సమాధానమే ఉండదు.

 

6 జనవరి 2026

ప్రచురణ : సాక్షి దినపత్రిక, 8 జనవరి 2026

Monday, 22 December 2025

Paradise Lost

 పారడైజ్ లాస్ట్ 


మార్క్సిస్టు లెనినిస్టు విప్లవోద్యమం నాకు స్వర్గం లాంటిది. అది లేకుంటే నేను బతికుండేవాడిని కాదు. అది నాకు సమాజం మీద నమ్మకాన్ని ఇచ్చింది. నా శరీరంలో ఒక ఉత్సాహాన్ని నింపింది. 


కొంచెం వెనుక నుండి చెప్పాలి. 


మాదొక మధ్యతరగతి కుటుంబం. మానాన్న మంచి మెకానిక్. అప్పట్లో డబ్బులు అపురూపం. ఒక్కోసారి డబ్బు పెట్టినా బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులు కూడ సులువుగా దొరికేవికావు. రేషన్ వుండేది. ఓ ఐదు కిలోలు గోధుమలు, పంచదార కొనాలంటే అసిస్టెంట్ గ్రెయిన్ పర్చేజింగ్ ఆఫీసర్ నుండి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సైకిళ్ళే గొప్పవాహనాలు. వాటి విడిభాగాలూ దొరికేవి కావు. దేశంలో ఉత్పత్తిలేదు.  మానాన్న కొన్ని రకాల విడిభాగాలను లేతు మిషన్ మీద తయారు చేసేవారు. టైర్ రీ-ట్రేడింగ్  కార్ఖానా పెట్టారు. మా కుటుంబానికి ఉమ్మడిలో నరసాపురం -అంత్రర్వేది మధ్య తిరిగే ఒక లాంచి వుండేది.


దేవుడు మమ్మల్ని పరీక్షించాలనుకున్నాడు. ఒకరాత్రి ఇవన్నీ పోయాయి. గోదావరి వరదలో లాంచి మునిగిపోయింది. కార్ఖాన మంటల్లో మాడిపోయింది. అప్పులు చుట్టుముట్టాయి. నాకు శ్వాసకోశ వ్యాధి బయట పడింది. భయంవల్లనూ కావచ్చు ఊపిరి ఆడేది కాదు. నాకు ఊపిరి పోయడానికి మానాన్న, మా అమ్మ చాల కష్టపడ్డారు. మాన్న స్వయంగా నాకు వర్కవుట్ నేర్పారు. గోదాట్లో ఈదడం నేర్పారు. శరీరం బాగుంటే మనుషుల మెదడులో ధైర్యం వస్తుంది. 


ఇది కూడ దేవుడికి ఇష్టంలేదు. కష్టాలు పెరిగాయి. అప్పుల వాళ్ళు మానాన్నను నడిరోడ్డు మీద నిలదీశారు. ఆయన నేల మీద నిలబడలేక పోయారు. పక్క పట్టణానికి వెళుతున్నానని నాతో చెప్పి ఓ రెండు రూపాయలు చేతులో పెట్టి బస్సు ఎక్కారు. నేను ఆ రెండు రూపాయల నోటును చేత బట్టుకుని ఆనందంతో బస్ స్టాండ్ లో గెంతులు వేశాను. అంత ఆనందం దేవుడికి నచ్చలేదు. రెండు రోజుల తరువాత తెలిసింది మానాన్న అవమాన భారంతో పారిపోయారని. 


మానాన్నది మెకానిక్ ఛాతి. చాలా వెడల్పుగా వుండేది. ఆయన చాతీ మీద పడుకోవడం నాకు చాలా ఇష్టం. నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఆయన ఎంత బాధపడ్డారో అని తలచుకుని చాలా ఏడ్చాను. నిజానికి అప్పుడు నేను ఎలా బతకాలి అని నా గురించి  ఆలోచించాలి? కానీ మానాన్న మీద నాకు జాలి వేసింది. నేను మనిషిని అని నాకు మొదటిసారి తెలిసిన క్షణం అది. ఇది 1961లో జరిగింది. అప్పడు నాకు తొమ్మిదేళ్ళు. 


మానాన్న ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడి నుండి లూధియాన వెళ్ళి అక్కడి కార్ఖానాల్లో పనిచేశారు. అలా నాకు బాల్యంలోనే ఢిల్లీ పంజాబ్ మా కుటుంబంలో భాగం అయ్యాయి. మూడేల్ల తరువాత మా నాణ్న తిరిగి వచ్చారు. 


మానాన్న లేని కాలంలో మాకు మా అమ్మే మా నాన్న కూడ అయిపోయింది.  దేవుడు నాకు గొప్ప నాన్నతోపాటు గొప్ప అమ్మనూ ఇచ్చాడు. మానాన్న అమాయకుడు మృదు స్వభావి. మా అమ్మ తెలివైనది. లక్ష్యం పెట్టుకున్నదంటే సాధించి తీరుతుంది. అమె రాక్షసి. కష్టాలను అడ్డంకుల్నీ లెఖ్ఖ చేయదు. “నువ్వు ఇంగ్లీషు మాట్లాడాలి” అని అదేశించింది.  అంతేకాదు; “ఇంగ్లీషువాళ్లలా  చొక్కా లోపలికి వెయ్యాలి. బూట్లు తొడగాలి. మెడలో టై వేసుకోవాలి” అంది. తనతోపాటు ముగ్గురు సంతానాన్ని పోషించడానికి రేయింబవళ్ళు కాగితపు సంచులు తయారు చేసేది. ఇంట్లో నేను తనకు సహాయపడేవాడిని. బయట ఒక షాపులో పార్ట్ టైమ్ వర్కర్ గా పనిచేసేవాడిని. పదవ యేట బాలకార్మికుడిని అయ్యాను.గొప్ప అనుభవం. కష్టాలు ప్రపంచాన్ని అర్ధం చేసుకునేలా చేస్తాయి. అదీ ఒక అదృష్టమే. 


సన్నిహితులు తరచూ ఒక మాట అంటుంటారు.; నాకు జాలి కలిగినపుడు మా నాన్నలా మరిపోతానంటా; కసి పెరిగినపుడు మా అమ్మలా మారిపోతానంటా. రేర్ కాంబినేషన్. 


 చదువు నాకు బాగానే అబ్బింది.  స్కులు పుస్తకాలే కాకుండా లైబ్రరీలోనూ పుస్తకాలు చదివేవాడిని. ఎయిత్ స్టాండర్డ్ కు అప్పట్లో పబ్లిక్ పరీక్ష వుండేది. నేను పశ్చిమ గోదావరిలో టాపర్ గా నిలిచాను. అప్పట్లో మా ఊర్లో మిషన్ హైస్కూలుకు చాలా పేరుండేది. తొమ్మిదిలో వున్న నాలుగు సెక్షన్లు నిండిపోయినా నాకు సీటు ఇచ్చారు. అప్పర్ మిడిల్ స్కూలు, హైస్కూలులో నా టీచర్లు చాలా గొప్పవారు. పాఠాలే కాకుండా ఇతర సాహిత్య  విశేషాలూ చెప్పేవారు. హైస్కూలు మూడేళ్ళూ నాకు మెరిట్ స్కాలర్ షిప్ వచ్చేది. ద నరసాపురం కాలేజీలో పియుసి ఎంపిసి కూడా స్కాలర్ షిప్పు వచ్చింది. అంత వరకు బాగుంది.  


కాలేజీలో నేను దారి తప్పాను. టెక్స్టు పుస్తకాల మీద శ్రధ్ధ తగ్గి ఇతర పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పెరిగింది. నాటక సంఘాలతో పరిచయాలు ఎక్కువయ్యాయి. చదువు అటక ఎక్కింది. పియుసిలో అవమానకరమైన మార్కులు వచ్చాయి. మా అమ్మ గుండెలు అవిసేలా ఏడ్చింది. 


కులవృత్తి మెకానిజం వుందిగా. దాన్నే కొనసాగించాను. అప్పట్లో నేను రాసిన ‘ప్రగతి’ నాటిక పరిషత్తు నాటకాల్లో బహుమతులు గెలుచుకుంది. అప్పుడే ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టులతో పరిచయాలు ఏర్పడ్డాయి.  మళ్ళీ గాడి తప్పాను. వృత్తిని నిర్లక్ష్యం చేశాను. అది నా మీద పగతీర్చుకుంది. రోడ్డున పడేసింది. ఊర్లో వుండలేక జేబులో మూడున్నర రూపాయలతో విజయవాడ చేరాను. కూలీ పనులు చేశాను.  అయినా విజయవాడ ఆశ్రయం ఇచ్చింది. తల్లీ నీకు వందనం! 


ఈలోగా ఒక విచిత్రం జరిగింది. నరసాపురం కాల్ గ్యాస్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్న ఉష నాకు లైబ్రరీలో పరిచయం అయ్యింది. పుస్తకాల మీద ఇష్టం వ్యక్తిగత ఇష్టంగానూ మారింది. నేను నిలబడడానికి నేల లేని సమయంలో తన్ను నన్ను ప్రపోజ్ చేసింది. 


విజయవాడలో నిలబడడానికి మార్వాడీల దగ్గర చేరాను. హరిప్రసాద్ ఖండేల్ వాల్ నాకు అన్నగా మారారు. వాళ్ల కుటుంబ సభ్యుడ్ని అయిపోయాను. వాణిజ్య సూత్రాలు అర్ధం అయ్యాయి. మార్కెటింగ్, అకౌంటింగ్ లో మెళుకువలు తెలిశాయి. వాణిజ్యపన్నుల అధికారులతో డీల్ చేయడం వచ్చేసింది. నేను బతకడమేగాక మరో నలుగురికి పని ఇచ్చేంత వరకు అవకాశాలు వచ్చాయి. 


హరిప్రసాద్ ఖండేల్ వాల్ సాక్షి సంతకంతో విజయవాడలో ఉషను రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాను. జీవితం మీద నమ్మకం కొంచెం అతిశయించింది. 


ప్రతి ఆనందం నీడన విషాదం వుంటుంది. పెళ్ళి చేసుకున్నాంగానీ కాపురం పెట్టలేదు. మా పెళ్ళి ఉష కుటుంబ సభ్యులకు నచ్చలేదు. విడగొట్టడానికి ప్రయత్నించారు. ఆ వత్తిడిని తట్టుకోలేక ఉష ఆత్మహత్య చేసుకుంది. 


ఆందోళన వత్తిడి కుంగుబాట్లు అన్నీ ఒక్కసారిగా ఆవరించాయి. అలాంటి మానసిక స్థితిలో మార్కెటింగ్ అస్సలు కుదరదు. తొమ్మిదో ఏట బస్ స్టాండ్ లో నిస్సహాయంగా నిలబడ్డట్టు ఇరవై ఏడో ఏట విజయవాడ రైల్వే స్టేషన్ లో వుండిపోయాను. 


 కష్టాల్లో వున్నవాళ్ల దగ్గరికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. మా ఊరి మిత్రుడు ఒకడు కలిశాడు. ఉష ఒక మహిళా సంఘంలో పనిచేసేది. అది కమ్యూనిస్టు తీవ్రవాదుల సంఘం అని తను చెప్పాడు. “నువ్వు రచయితవు గనుక సమాజం కోసం చాలా చెయ్య గలవు” అన్నాడు. బతకడానికి ఓ దారి కనిపించింది. ఆ రోజు నుండి విజయవాడలో నక్సలైట్ల కోసం వెతకడం మొదలెట్టాను. 


విజయవాడ మొఘల్రాజపురం నవోదయకాలనీలో వాసిరెడ్డి వెంకట కృష్ణారావు గారిని  కలిశాను. నక్సలైట్లలో చాలా గ్రూపులు వుంటాయని నాకు తెలీదు. యాధృఛ్ఛికంగా కృష్ణారావు గారిని కలిశాను. వేవ్ లెంగ్త్ కుదిరింది రాడికల్ గా మారిపోయాను. దానికి అగ్రనేత కొండపల్లి సీతారాయయ్య అని చాలా కాలం తరువాత తెలిసింది.  


స్వల్పకాలంలోనే  కృష్ణారావు నేను గురుశిష్యులమై పోయాము. వారు నా బలాలు బలహీనతల్ని గొప్పగా విశేషించారు. వాణిజ్యరంగంలో దాన్ని స్వాట్ (SWOT) రిపోర్టు అంటారు. మన బలం, మన బలహీనతలు, మనుకున్న అవకాశాలు, ముంచుకు వస్తున్న ముప్పులు. వీటిని ఎప్పటి కప్పుడు బేరీజు  వేసుకుంటూ వుండాలి. 


నాకు ఫిజిక్ తో పాటు బ్రెయిన్ వుందని కృష్డారావు గుర్తించారు. దేన్ని ఎప్పుడు వాడాలి అని నిర్ణయించడానికి ఒక గురువు కావాలి. ఆ పని వారు నిర్వర్తించారు. ఆయన నన్ను దాడులు చేయడానికీ ఉపయోగించారు; కమ్యూనిస్టు పత్రికల్లో వ్యాసాలు రాయడానికీ ఉపయోగించారు. 


మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవాళ్ళు కలిసి బతకడంకన్నా ఈ భూమ్మీద స్వర్గం అంటూ ఏమీ వుండదు. అలాంటి స్వర్గంలో నేను మూడేళ్ళు వున్నాను. 


నా కోసం ఒక కొత్త ప్రపంచం ద్వారాలు తెరుచుకున్నాయి. అద్భుతమైన మనుషులుండే కొత్త ప్రపంచం. అది చాలా విశాలమైనది. ఒక్క విజయవాడలోనే వందకు పైగా కుటుంబాల్లో నేను సభ్యుడ్ని అయిపోయాను. మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లి, బరంపురం ఎక్కడికి వెళ్ళినా బంధువర్గాన్ని మించిన కామ్రేడ్లు వుండేవారు.  ప్రయాణానికి డబ్బులు లేవు. అయినా ఇండియా అంతటా కలయ తిరగేసేవాడిని.  ఫోన్లు లేవు, కామ్రేడ్స్ మధ్య ఒక విధమైన టెలీపతి పనిచేసేదేమో అనిపిస్తుంది. కలకత్తా వెళితే ఒకాయాన సైకిలు వేసుకుని హౌరా స్టేషన్ ముందు నాకోసం ఎదురు చూస్తుండేవాడు. లూసన్ మీద అధారిటీ అనదగ్గవాడు విజయవాడలో ఒకడున్నాడు; లూసన్ శతజయంతోత్సవాలకు అతన్ని పిలిస్తే బాగుంటుందని జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంటుకు ఒకడు సూచించేవాడు. ఏం నెట్ వర్క్ అదీ! ఇప్పటి డిజిటల్ నెట్ వర్క్ మనుషుల్ని కలపడంలేదు; విడగొడుతోంది. 


అప్పట్లో విప్లవోద్యమం మీద చాలా నమ్మకం వుండేది. కామ్రేడ్ల మధ్య ఆత్మీయత చాలా గొప్ప స్థాయిలో వుండేది. ఎలాంటి రిస్కుకు అయినా సిధ్ధపడేవాడిని. అక్షరాలు కూర్చడం నుండి  ఆయుధాల తయారీ వరకు ఏ రంగంలో టాస్క్ ఇచ్చినా పూర్తి చేసేవాడిని. పెర్ఫెక్షనిస్టు అనే పేరుండేది. 


నేను కృష్ణాజిల్లా రాడికల్ యూత్ లీగ్ కు అధ్యక్షుడిగా వుండేవాడిని. తరువాతి కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టుగా మాడిన బి. చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడుగానూ, పాలఫ్యాక్టరి లింగం నాగేశ్వరరావు కార్యదర్శిగానూ వుండేవారు.  మా మధ్య ఆత్మీయ సంబంధాలు చాలా బాగుండేవి. మరోవైపు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు మెంటార్ గా వుండేవాడిని. ఆంధ్రప్రదేశ్  పౌర హక్కుల సంఘానికి కూడ కృష్ణాజిల్లాలో తొలి కన్వీనర్ ని నేనే. విరసంలో చేరాక కృష్ణా వుభయగోదావరి జిల్లాలకు ప్రాంతీయ  కన్వీనర్ గా వున్నాను. 


అప్పట్లొ విజయవాడలో రాష్ట్ర పార్టి పొలిటికల్ క్లాసులు జరిగాయి. తరువాతి కాలంలో బిగ్ బిగ్ నేమ్స్ గా మారిన వాళ్ళు ఆ క్లాసుల్లో స్టూడెంట్స్. కొండపల్లి, సత్యమూర్తి, వంటివారు టీచర్లు. నాకు అప్పటికి ఆ క్లాసుల్లో విద్యార్ధి అయ్యేంత అర్హత లేదు. క్లాసుల నిర్వహణలో వాలంటీరుగా పనిచేసే అవకాశం వచ్చింది. చాలా ఛాలెంజింగ్ బాధ్యత. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ క్లాసులు జరుగుతున్నట్టు బయటికి తెలియరాదు. భోజనాల ఏర్పాటుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికయినా తిండి వికటిస్తే రోగం వస్తుంది. రోగం వస్తే డాక్టరు వస్తాడు. డాక్టరు వస్తే  వెనక పోలీసులు వస్తారు. అదీ డేంజరు. దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. నా సామర్ధ్యం రాష్ట్ర నాయకత్వానికి తెలిసిన సందర్భం అది. 


ఆ క్లాసుల తరువాత కొండపల్లి కొన్ని రోజులు కృష్ణాజిల్లాలో వున్నారు. స్థానికులకు క్లాసు చెప్పారు.  ఆ సమయంలో వారికి కొరియర్ -కమ్- బాడీ గార్డ్- ఒకరు కావలసి వచ్చారు. జిల్లా రాడికల్ కార్యదర్శి లింగం నాగేశ్వర రావుది బిగ్ ఫ్రేమ్ బాడి. అతన్నే సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు వచ్చింది. బాడీ కొంచెం చిన్నదేగానీ ఏదైనా జరిగితే నేను చాలా వేగంగా రియాక్ట్ అవుతానని కృష్టరావు  భావించారు. ఆ సమయంలోనే సుప్రసిధ్ధ స్వీడిష్ రచయిత జాన్ మీర్డాల్ విజయవాడ వచ్చి కొండపల్లి సీతారామయ్యను కలుసుకున్నారు. విప్లవోద్యమంలో నా ఇగోను ఎంతగానో సంతృప్తి కలిగించిన రోజులవి.  


కృష్ణారావుగారు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ ను వదిలి వినోద్ మిశ్రా నాయకత్వంలోని ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్ళిపోయారు.  ఆ కాలంలో నేను కృష్ణా జిల్లా పీపుల్స్ వార్ పార్టి బాధ్యతలు నిర్వర్తించాను. 


పుస్తకాలు పాత సందేహాలకు సమాధానం చెపుతాయి. కొత్త సందేహాలను రేకెత్తిస్తాయి. అదే వాటి పని. చదవడంవల్ల కొత్త సందేహాలు వచ్చేవి. పార్టి రాష్ట్ర నాయకులు చాలా ఓపిగ్గా మా సందేహాలను తీర్చేవారు. చాలా సంయమనం పాటించేవారు. అందరి మధ్య గొప్ప సమన్వయం కూడ వుండేది. కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు వంటి అగ్రనేతలు నెలకు ఒక్కొకరు చొప్పున వచ్చి కలిసేవారు. 


నేను చేరక ముందు కొండపల్లి సీతారామయ్య సాయుధపోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించి చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. సివోసి నుండి పీపుల్స్ వార్ గా మారేక పార్టి గతంకన్నా చాలా ఎక్కువగా విస్తరించింది. నక్సలైట్ పార్టీల్లో అన్నింటికన్నా పెద్దది చురుకైనది అనిపించుకుంది. రైతాంగ పోరాటాలు మొదలు, కళాసాహిత్య రంగాలు, పౌరహక్కుల ఉద్యమం అన్నింట్లోనూ దానిదే అగ్రస్థానం. 


శ్రీశ్రీ మొదలు కొడవటిగంటి కుటుంబరావు, కేవి రమణారెడ్డి, రావిశాస్త్రీ, కాళీపట్నం రామారావు వంటిసాహిత్య వుద్దండుల్ని ఒక వేదిక మీదికి తీసుకుని రావడం. గద్దర్, వంగపండు వంటి వాగ్గేయకారుల్ని సృష్టించడం, బాలగోపాల్ వంటి పౌరహక్కుల నేతను, వరవరరావు వంటి సామాజిక కార్యకర్తను, త్రిపురనేని మధుసూదన రావు వంటి తత్వవేత్తను తయారు చేయడం సివోసి-పీపుల్స్ వార్ కే సాధ్యం అయింది. 


నా విప్లవ అతిశయాన్ని చూసి ఏలూరి భీమయ్య అనే రైతు ముచ్చట పడ్డారు. తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్ళి చేశారు.

 

పార్టి నాయకులకు ఆలోచనాపరులతో ఎలాగూ ఒక ఇబ్బంది వుంటుంది. పార్టి ముఖ్యులు కనిపించినప్పుడెల్లా ఆలోచనాపరులు “చైనాను ఇంకా విప్లవకేంద్రం ఎందుకు అంటున్నాము?” “జాతీయ బూర్జువావర్గం ఇండియాలో ముందుకు వస్తుందా?” వంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తారు. దానికి వారు సంతృప్తికర సమాధానం చెప్పలేరు. ఎక్కువగా మాట్లాడితే “పార్టి లైన్” అంటారు. ఆ మాట అంటే అందరూ నోరు మూసుకోవాల్సిందే. 


ఆలోచనాపరుల నుండి ఎదురయ్యే ఇబ్బందులకు వాళ్ళొక పరిష్కారాన్ని కనుగొన్నారు. “ఆలోచనాపరులది పెట్టీ బూర్జువా మనస్తత్వం; వాళ్ళు పూర్తిస్థాయి విప్లవకారులుకాలేరు” అనే మాటను ప్రచారంలో పెట్టారు. ఇది సమస్యను పరిష్కరించకపోగా కార్యకర్తలకూ ఆలోచనాపరులకు మధ్య ఒక వైరుధ్యాన్ని పెంచింది.

 


మతానికి విప్లవోద్యమానికీ నమ్మకం విషయంలో తేడాలేదు. విప్లవోద్యమంలోనూ ఒక దేవుడు వుంటాడు. అతన్ని మనం హేతువుతో, తర్కంతో చూడకూడదు. అతనే సర్వస్వం అని నమ్మాలి.  నమ్మకపోతే మతంలో అన్యులు అంటారు; విప్లవోద్యమంలో అన్యవర్గ భావజాలం అంటారు.  ఇది నన్ను బాగా అసంతృప్తికి గురిచేసింది. 


సమాజానికి విప్లవం ఆకలికి అన్నమంత అవసరం. అవసరాన్ని గుర్తిస్తే సరిపోదు అవసరమైన శక్తిసామర్ధ్యాలను సంతరించుకోవాలి. నేను పెట్టుబడీదారుల్ని చాలా దగ్గర నుండి చూశాను. వాళ్ళ వనరులు, శక్తి, సామర్ధ్యాలు, సంస్కృతి నాకు బాగా తెలుసు. కమ్యూనిస్టు తీవ్రవాదులతో సహా  కమ్యూనిస్టుల దగ్గర అలాంటి శక్తి సామర్ధ్యాలు సంస్కృతి లేవని నాకు తరచూ అనిపించేది.  పరిమిత జ్ఞానంతో, పరిమిత వనరులతో ఎవ్వరూ కొత్త తరాలను ఆకర్షించలేరు. విప్లవాలను విజయవంతం చేయలేరు. 


శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం (1967-70)లో అయినా, కరీంనగర్, ఆదిలాబాద్  రైతాంగ సాయుధ పోరాటం (1977 – 90)లో అయినా కమ్యూనిస్టు విప్లవవాదులు పెద్ద శత్రువుల్ని ముఖాముఖీ  ఎదుర్కోలేదు. చిన్నాచితకవాళ్లని శిక్షించి అదే ఘన విజయమనుకున్నారు. ఇది కూడ నాకు సంతృప్తి నివ్వలేదు. వీటితో పోలిస్తే, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొంచెం మెరుగు. నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డిని, వరంగల్  జిల్లాలో  విసునూరు దొర రాంచంద్రారెడ్డిని గట్టిగా ఎదుర్కొన్నారు.   


గతంలో రెండు నెలలకు ఒకసారి కలిసే అగ్రనాయకులు పార్టి విస్తరించేకొద్దీ  జిల్లా పర్యటనలకు రావడం పూర్తిగా మానుకున్నారు. రీజినల్ కమిటీ నాయకుల ప్రాధాన్యం పెరిగింది.  రీజినల్ కమిటీ కార్యదర్శులు విధేయులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన ఉద్యమ అభిమానుల్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితుల్లో నాలాంటి అసమ్మతివాది  హోల్ టైమర్ గా వుండడం అసాధ్యం అనిపించింది. 1981 మేడే రోజున హోల్ టైమర్ జీవితాన్ని వదిలి పార్ట్ టైమర్ గా మారిపోయాను. 


కారంచేడు ఇష్యూను డీల్ చేయమని నన్ను కోరడంతో మళ్ళీ కొన్నాళ్ళు హోల్ టైమర్ గా మారాను. ఇదేమీ గొప్ప త్యాగం కాదు. ఇందులో నా స్వార్ధం కూడ వుంది. మార్క్సిజం ఆర్ధిక వ్యవహారాలతో తప్ప సాంస్కృతిక వ్యవహారాలతో డీల్ చేయలేదనే ఒక అపభ్రంస నింద వుంది. నాకు మత వివక్షను పట్టించుకోవాలనే ఒక ప్రత్యేక ఆసక్తి వుంది. 1984 నాటి ఢిల్లీ అల్లర్లు, శిక్కుల ఊచకోత సమయంలో నేను గద్దర్ తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ టూర్ లో వున్నాను. ఢిల్లీ వెళ్ళడం కుదరలేదు. కుల వివక్షను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే ఒక గొప్ప అవకాశం నాకు కారంచేడు ఉద్యమం ఇచ్చింది. కారంచేడు ఉద్యమం తాను ఆశించిన సమస్త ఆర్ధిక సౌకర్యాలనూ, చట్ట భద్రతను పొందింది. ఆ తరువాత మరే ఉద్యమం అలాంటి విజయాలను సాధించలేదు. 


1950లలో కమ్యూనిస్టు కాకపోయినా, 1970లలో నక్సలైటు కాకపోయినా, 1990లలో ఉనికివాది కాకపోయినా, 2020లలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి వ్యతిరేకి కాకపోయినా మనం ప్రజలతో వున్నట్టు కాదు. 


ఆంధ్రప్రదేశ్ లో 1989నాటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంలో పీపుల్స్ వార్ పాత్ర కూడ వుందని ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి భావించారు. నక్సలైట్ల మీద నిర్బంధాన్ని తొలగించారు. ఇతర వెసులు బాటులు కూడ కల్పించారు. విప్లవం విజయవంతం కాకుండానే విప్లవ పార్టీ నాయకులకు ప్రభుత్వంలో ప్రాబల్యం వచ్చింది. దానితో బ్యూరాక్రసీ పెరిగింది. అది అన్నిజిల్లాలకు వ్యాపించింది. ఆ బ్యూరాక్రసీని తట్టుకుని పార్టీలో కొనసాగడం నాకు చాలా ఇబ్బందిగా మారింది. 1990 జూన్ నెలాఖరులో పీపుల్స్ వార్ నుండి పూర్తిగా బయటికి వచ్చేశాను. ఆ తరువాత మరే పార్టీలోనూ చేరకూడదనుకున్నాను. 


ఒక గొప్ప విషయం అయితే ఉద్యమంలో వుండేది. కార్యకర్తల్లో విపరీతమైన అంకిత భావం వుండేది. ఎవ్వరూ చావుకు కూడ భయపడేవారు కాదు. అది సామాన్యమైన విషయం కాదు. చాలా మహత్తరమైనది. అలాంటి తరాన్ని ఈ భూమి మళ్ళీ పుట్టిస్తుందా? అనే అనుమానం వస్తుంటుంది. ఆ గౌరవం వాళ్ళ మీద సదా వుంది. వుంటుంది. 


పార్టి నుండి బయటికి వచ్చేసినా నేను చేయగల పని, నేను మాత్రమే చేయగల పని ఏది అప్పజెప్పినా అహాన్ని పక్కన పెట్టి పూర్తి చేసి ఇచ్చాను. ఎందుకంటే నాకు బోలెడు అసంతృప్తి వుండోచ్చు. కానీ, అది నాకు మరోజన్మ నిచ్చిందనే వాస్తవం కన్నా ఆ అసంతృప్తి గొప్పదేంకాదు. 


కమ్యూనిస్టు పార్టీల గురించి ఎవరయినా అధ్యయనం చేయాలనుకుంటే ‘1990కు ముందు 1990 తరువాత” అని ఒక విభజన రేఖను స్పష్టంగా  గీసుకోవాలి.  నేను 1990 వరకు పీపుల్స్ వార్ లో వున్నాను. 


(మావోయిస్టుల కథ ఒక ముగింపుకు వచ్చిందనే వార్తలతో కొంచెం మనస్తాపం కలిగి గతాన్ని ఇప్పుడు ఇలా అందరితో పంచుకోవాలనిపించింది) 


23-09-2025

Sunday, 21 December 2025

విశ్వగురు (ట్యాగ్ లైన్ - సినిమా ఇలా మొదలైంది

 

*విశ్వగురు  (ట్యాగ్ లైన్ - సినిమా ఇలా మొదలైంది*




అతి ఉత్సాహవంతుడైన ఓ రచయిత–దర్శకుడు  రంపా తిరుగుబాటును ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా  సినిమా తీశాడు.

ఆ చారిత్రక తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ పోలీసు యంత్రాంగం తిరుగుబాటుదారులపై అమానుష హింసను సాగించింది. ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు తమ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఆ పోరాటంలో తెల్లవాళ్ళయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ థామస్ హైటర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆల్ఫ్రెడ్ స్కాట్, మరో అధికారి జార్జ్ ఇండికేట్ కూడా హతమయ్యారు.

ఆ కాలపు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని ఇలాంటి దృశ్యాలతో దర్శకుడు భారీ వీఎఫ్‌ఎక్స్ తో ఉత్కంఠభరితంగా చిత్రీకరించాడు. ప్రతిఫ్రేమ్ లోనూ దేశభక్తి ఉత్సాహం జలధారలా పొంగిపొర్లేలా చూపించాడు. సినిమాకు ‘అల్లూరి’ అనే పేరు పెట్టి, “ఇప్పటికీ స్ఫూర్తి” అనే ట్యాగ్‌లైన్ జతచేశాడు.

తన పాన్‌ఇండియా దేశభక్తి చిత్రాన్ని అన్ని భాషల ప్రజలు విరగబడి చూస్తారని, బాక్సాఫీసులు బద్దలైపోతాయని అతను గట్టిగా నమ్మేడు. ప్రభుత్వం తనను మెచ్చుకొని, ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు పురస్కారం కూడా ఇస్తుందని ఐమాక్స్ స్థాయిలో కలలు కూడా కన్నాడు.

పోస్ట్–ప్రొడక్షన్ పూర్తయి సరిగ్గా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న క్షణంలోనే సెన్సార్ బోర్డు కాలు అడ్డం పెట్టింది.  సినిమాలో అనేక అభ్యంతరకర, ఆక్షేపణీయ దృశ్యాలు ఉన్నాయనేది వారి ఆరోపణ.

దేశంలో ఆపరేషన్ కగర్ నడుస్తున్న సమయంలో గిరిజన తిరుగుబాటును సమర్థిస్తూ సినిమా తీయడం తప్పని బోర్డు సభ్యులు తేల్చిచెప్పారు. గిరిజనులు పోలీస్ అధికారులను హతమార్చే దృశ్యాలు చూపించడం మరింత పెద్ద నేరమని పేర్కొన్నారు. సినిమాల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం తీవ్రమైన నేరమని వారు ముక్తకంఠంతో  ప్రకటించారు.

మన నిర్మాత ఖంగుతిన్నాడు. అప్పర్ సీలేరులో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తు ఒక్కసారిగా అతన్ని తాకింది. అదేమీ కల్పితగాధ కాదనీ, వందేళ్ల క్రితం నాటి బ్రిటిష్ వలసపాలన క్రూరత్వం గురించే సినిమా తీశానని, అందులో మరణించినవారు కూడా బ్రిటిష్ పోలీసులేనని, తనది ఫక్తు దేశభక్తి సినిమా అని రచయిత–దర్శకుడు అధికారులకు విన్నవించుకున్నాడు.

“ఆదివాసులు పోలీసుల్ని చంపిన దృశ్యాలు పెట్టి మీరు దాన్ని ‘అప్పటిది’ అంటున్నారు,” అన్నాడు సీనియర్ అధికారి, “మాకు మాత్రం అది ‘ఇప్పుటిది’గా కనిపిస్తోంది”.

దర్శకుడికి అధికారి మాటలు అర్థం కాలేదు.

“మీరు అంటున్నట్టు అది గత పోరాటం కావచ్చు. ప్రేక్షకులు అలా చూడరు. వాళ్లకు అది ఈరోజు జరుగుతున్న పోరాటంలానే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడితో ఆగరు. ఇది జెన్–జీ కాలం కదా! వీధుల్లోకి వస్తారు. ప్రదర్శనలు చేస్తారు. ఇప్పుడీ హడావుడి అంతా మనకు అవసరమా?” అని అధికారి ప్రశ్నించాడు.

“ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేమీ తెలియడం లేదు సార్,” అని దర్శకుడు అన్నాడు.

“మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మేమే మీకోసం అన్నీ చేశాం. ఆక్షేపణీయ దృశ్యాలన్నీ తొలగించాం,” అని సెన్సార్ అధికారి ప్రశాంతంగా అసలు విషయం శెలవిచ్చాడు.

జరిగిందేమిటో దర్శకుడికి ఇప్పుడు అర్ధం అయింది. ఒళ్ళంతా వణుకుతుంటే తడబడుతున్న గొంతుతో నెమ్మదిగా అడిగాడు, “అయితే సార్… ఏమైనా మిగిలిందా?”

“మీరు అంత కష్టపడి సినిమా తీశారు కదా—ఏమీ మిగల్చకుండా తగలెయ్యడం న్యాయం కాదనిపించింది. లంబసింగి కొండల్లో అందమైన ల్యాండ్‌స్కేప్ షాట్లు కొన్ని తీశారు కదా? అవి మాత్రం తాకకుండా వదిలేశాం,” అని అధికారి అపారమైన కరుణతో చెప్పాడు.

ఒక నిమిషం మాత్రమే మిగిలిన ఆ భాగాన్ని పవిత్ర ప్రసాదంలా కళ్లకు అద్దుకుని, రచయిత–దర్శకుడు బయటకు నడిచాడు.

కానీ,  కథ అక్కడితో ముగియలేదు.

తలవంచుకుని బయటికి పోతున్న ఆ దర్శకుడ్ని ఆ అధికారి వెనక్కు పిలిచాడు. “చూడండీ మీరు యువకులు. మంచి టాలెంట్ వుంది. చెప్పకూడదు అనుకుంటూనే ఒక మాట చెపుతున్నాను. అల్లూరి, భగత్ సింగ్ లను మించిన దేశభక్తులు  ఇప్పుడూ వున్నారు. మీరు చూడడంలేదు” అన్నాడు.

మరుసటి రోజే, మన రచయిత–దర్శకుడు మీడియాను పిలిచి ‘విశ్వగురు’ అనే కొత్త సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.

==//==

21-12-2025


Sakshi 29-12-2025