Monday, 22 December 2025

Paradise Lost

 పారడైజ్ లాస్ట్ 


మార్క్సిస్టు లెనినిస్టు విప్లవోద్యమం నాకు స్వర్గం లాంటిది. అది లేకుంటే నేను బతికుండేవాడిని కాదు. అది నాకు సమాజం మీద నమ్మకాన్ని ఇచ్చింది. నా శరీరంలో ఒక ఉత్సాహాన్ని నింపింది. 


కొంచెం వెనుక నుండి చెప్పాలి. 


మాదొక మధ్యతరగతి కుటుంబం. మానాన్న మంచి మెకానిక్. అప్పట్లో డబ్బులు అపురూపం. ఒక్కోసారి డబ్బు పెట్టినా బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులు కూడ సులువుగా దొరికేవికావు. రేషన్ వుండేది. ఓ ఐదు కిలోలు గోధుమలు, పంచదార కొనాలంటే అసిస్టెంట్ గ్రెయిన్ పర్చేజింగ్ ఆఫీసర్ నుండి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సైకిళ్ళే గొప్పవాహనాలు. వాటి విడిభాగాలూ దొరికేవి కావు. దేశంలో ఉత్పత్తిలేదు.  మానాన్న కొన్ని రకాల విడిభాగాలను లేతు మిషన్ మీద తయారు చేసేవారు. టైర్ రీ-ట్రేడింగ్  కార్ఖానా పెట్టారు. మా కుటుంబానికి ఉమ్మడిలో నరసాపురం -అంత్రర్వేది మధ్య తిరిగే ఒక లాంచి వుండేది.


దేవుడు మమ్మల్ని పరీక్షించాలనుకున్నాడు. ఒకరాత్రి ఇవన్నీ పోయాయి. గోదావరి వరదలో లాంచి మునిగిపోయింది. కార్ఖాన మంటల్లో మాడిపోయింది. అప్పులు చుట్టుముట్టాయి. నాకు శ్వాసకోశ వ్యాధి బయట పడింది. భయంవల్లనూ కావచ్చు ఊపిరి ఆడేది కాదు. నాకు ఊపిరి పోయడానికి మానాన్న, మా అమ్మ చాల కష్టపడ్డారు. మాన్న స్వయంగా నాకు వర్కవుట్ నేర్పారు. గోదాట్లో ఈదడం నేర్పారు. శరీరం బాగుంటే మనుషుల మెదడులో ధైర్యం వస్తుంది. 


ఇది కూడ దేవుడికి ఇష్టంలేదు. కష్టాలు పెరిగాయి. అప్పుల వాళ్ళు మానాన్నను నడిరోడ్డు మీద నిలదీశారు. ఆయన నేల మీద నిలబడలేక పోయారు. పక్క పట్టణానికి వెళుతున్నానని నాతో చెప్పి ఓ రెండు రూపాయలు చేతులో పెట్టి బస్సు ఎక్కారు. నేను ఆ రెండు రూపాయల నోటును చేత బట్టుకుని ఆనందంతో బస్ స్టాండ్ లో గెంతులు వేశాను. అంత ఆనందం దేవుడికి నచ్చలేదు. రెండు రోజుల తరువాత తెలిసింది మానాన్న అవమాన భారంతో పారిపోయారని. 


మానాన్నది మెకానిక్ ఛాతి. చాలా వెడల్పుగా వుండేది. ఆయన చాతీ మీద పడుకోవడం నాకు చాలా ఇష్టం. నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఆయన ఎంత బాధపడ్డారో అని తలచుకుని చాలా ఏడ్చాను. నిజానికి అప్పుడు నేను ఎలా బతకాలి అని నా గురించి  ఆలోచించాలి? కానీ మానాన్న మీద నాకు జాలి వేసింది. నేను మనిషిని అని నాకు మొదటిసారి తెలిసిన క్షణం అది. ఇది 1961లో జరిగింది. అప్పడు నాకు తొమ్మిదేళ్ళు. 


మానాన్న ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడి నుండి లూధియాన వెళ్ళి అక్కడి కార్ఖానాల్లో పనిచేశారు. అలా నాకు బాల్యంలోనే ఢిల్లీ పంజాబ్ మా కుటుంబంలో భాగం అయ్యాయి. మూడేల్ల తరువాత మా నాణ్న తిరిగి వచ్చారు. 


మానాన్న లేని కాలంలో మాకు మా అమ్మే మా నాన్న కూడ అయిపోయింది.  దేవుడు నాకు గొప్ప నాన్నతోపాటు గొప్ప అమ్మనూ ఇచ్చాడు. మానాన్న అమాయకుడు మృదు స్వభావి. మా అమ్మ తెలివైనది. లక్ష్యం పెట్టుకున్నదంటే సాధించి తీరుతుంది. అమె రాక్షసి. కష్టాలను అడ్డంకుల్నీ లెఖ్ఖ చేయదు. “నువ్వు ఇంగ్లీషు మాట్లాడాలి” అని అదేశించింది.  అంతేకాదు; “ఇంగ్లీషువాళ్లలా  చొక్కా లోపలికి వెయ్యాలి. బూట్లు తొడగాలి. మెడలో టై వేసుకోవాలి” అంది. తనతోపాటు ముగ్గురు సంతానాన్ని పోషించడానికి రేయింబవళ్ళు కాగితపు సంచులు తయారు చేసేది. ఇంట్లో నేను తనకు సహాయపడేవాడిని. బయట ఒక షాపులో పార్ట్ టైమ్ వర్కర్ గా పనిచేసేవాడిని. పదవ యేట బాలకార్మికుడిని అయ్యాను.గొప్ప అనుభవం. కష్టాలు ప్రపంచాన్ని అర్ధం చేసుకునేలా చేస్తాయి. అదీ ఒక అదృష్టమే. 


సన్నిహితులు తరచూ ఒక మాట అంటుంటారు.; నాకు జాలి కలిగినపుడు మా నాన్నలా మరిపోతానంటా; కసి పెరిగినపుడు మా అమ్మలా మారిపోతానంటా. రేర్ కాంబినేషన్. 


 చదువు నాకు బాగానే అబ్బింది.  స్కులు పుస్తకాలే కాకుండా లైబ్రరీలోనూ పుస్తకాలు చదివేవాడిని. ఎయిత్ స్టాండర్డ్ కు అప్పట్లో పబ్లిక్ పరీక్ష వుండేది. నేను పశ్చిమ గోదావరిలో టాపర్ గా నిలిచాను. అప్పట్లో మా ఊర్లో మిషన్ హైస్కూలుకు చాలా పేరుండేది. తొమ్మిదిలో వున్న నాలుగు సెక్షన్లు నిండిపోయినా నాకు సీటు ఇచ్చారు. అప్పర్ మిడిల్ స్కూలు, హైస్కూలులో నా టీచర్లు చాలా గొప్పవారు. పాఠాలే కాకుండా ఇతర సాహిత్య  విశేషాలూ చెప్పేవారు. హైస్కూలు మూడేళ్ళూ నాకు మెరిట్ స్కాలర్ షిప్ వచ్చేది. ద నరసాపురం కాలేజీలో పియుసి ఎంపిసి కూడా స్కాలర్ షిప్పు వచ్చింది. అంత వరకు బాగుంది.  


కాలేజీలో నేను దారి తప్పాను. టెక్స్టు పుస్తకాల మీద శ్రధ్ధ తగ్గి ఇతర పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పెరిగింది. నాటక సంఘాలతో పరిచయాలు ఎక్కువయ్యాయి. చదువు అటక ఎక్కింది. పియుసిలో అవమానకరమైన మార్కులు వచ్చాయి. మా అమ్మ గుండెలు అవిసేలా ఏడ్చింది. 


కులవృత్తి మెకానిజం వుందిగా. దాన్నే కొనసాగించాను. అప్పట్లో నేను రాసిన ‘ప్రగతి’ నాటిక పరిషత్తు నాటకాల్లో బహుమతులు గెలుచుకుంది. అప్పుడే ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టులతో పరిచయాలు ఏర్పడ్డాయి.  మళ్ళీ గాడి తప్పాను. వృత్తిని నిర్లక్ష్యం చేశాను. అది నా మీద పగతీర్చుకుంది. రోడ్డున పడేసింది. ఊర్లో వుండలేక జేబులో మూడున్నర రూపాయలతో విజయవాడ చేరాను. కూలీ పనులు చేశాను.  అయినా విజయవాడ ఆశ్రయం ఇచ్చింది. తల్లీ నీకు వందనం! 


ఈలోగా ఒక విచిత్రం జరిగింది. నరసాపురం కాల్ గ్యాస్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్న ఉష నాకు లైబ్రరీలో పరిచయం అయ్యింది. పుస్తకాల మీద ఇష్టం వ్యక్తిగత ఇష్టంగానూ మారింది. నేను నిలబడడానికి నేల లేని సమయంలో తన్ను నన్ను ప్రపోజ్ చేసింది. 


విజయవాడలో నిలబడడానికి మార్వాడీల దగ్గర చేరాను. హరిప్రసాద్ ఖండేల్ వాల్ నాకు అన్నగా మారారు. వాళ్ల కుటుంబ సభ్యుడ్ని అయిపోయాను. వాణిజ్య సూత్రాలు అర్ధం అయ్యాయి. మార్కెటింగ్, అకౌంటింగ్ లో మెళుకువలు తెలిశాయి. వాణిజ్యపన్నుల అధికారులతో డీల్ చేయడం వచ్చేసింది. నేను బతకడమేగాక మరో నలుగురికి పని ఇచ్చేంత వరకు అవకాశాలు వచ్చాయి. 


హరిప్రసాద్ ఖండేల్ వాల్ సాక్షి సంతకంతో విజయవాడలో ఉషను రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాను. జీవితం మీద నమ్మకం కొంచెం అతిశయించింది. 


ప్రతి ఆనందం నీడన విషాదం వుంటుంది. పెళ్ళి చేసుకున్నాంగానీ కాపురం పెట్టలేదు. మా పెళ్ళి ఉష కుటుంబ సభ్యులకు నచ్చలేదు. విడగొట్టడానికి ప్రయత్నించారు. ఆ వత్తిడిని తట్టుకోలేక ఉష ఆత్మహత్య చేసుకుంది. 


ఆందోళన వత్తిడి కుంగుబాట్లు అన్నీ ఒక్కసారిగా ఆవరించాయి. అలాంటి మానసిక స్థితిలో మార్కెటింగ్ అస్సలు కుదరదు. తొమ్మిదో ఏట బస్ స్టాండ్ లో నిస్సహాయంగా నిలబడ్డట్టు ఇరవై ఏడో ఏట విజయవాడ రైల్వే స్టేషన్ లో వుండిపోయాను. 


 కష్టాల్లో వున్నవాళ్ల దగ్గరికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. మా ఊరి మిత్రుడు ఒకడు కలిశాడు. ఉష ఒక మహిళా సంఘంలో పనిచేసేది. అది కమ్యూనిస్టు తీవ్రవాదుల సంఘం అని తను చెప్పాడు. “నువ్వు రచయితవు గనుక సమాజం కోసం చాలా చెయ్య గలవు” అన్నాడు. బతకడానికి ఓ దారి కనిపించింది. ఆ రోజు నుండి విజయవాడలో నక్సలైట్ల కోసం వెతకడం మొదలెట్టాను. 


విజయవాడ మొఘల్రాజపురం నవోదయకాలనీలో వాసిరెడ్డి వెంకట కృష్ణారావు గారిని  కలిశాను. నక్సలైట్లలో చాలా గ్రూపులు వుంటాయని నాకు తెలీదు. యాధృఛ్ఛికంగా కృష్ణారావు గారిని కలిశాను. వేవ్ లెంగ్త్ కుదిరింది రాడికల్ గా మారిపోయాను. దానికి అగ్రనేత కొండపల్లి సీతారాయయ్య అని చాలా కాలం తరువాత తెలిసింది.  


స్వల్పకాలంలోనే  కృష్ణారావు నేను గురుశిష్యులమై పోయాము. వారు నా బలాలు బలహీనతల్ని గొప్పగా విశేషించారు. వాణిజ్యరంగంలో దాన్ని స్వాట్ (SWOT) రిపోర్టు అంటారు. మన బలం, మన బలహీనతలు, మనుకున్న అవకాశాలు, ముంచుకు వస్తున్న ముప్పులు. వీటిని ఎప్పటి కప్పుడు బేరీజు  వేసుకుంటూ వుండాలి. 


నాకు ఫిజిక్ తో పాటు బ్రెయిన్ వుందని కృష్డారావు గుర్తించారు. దేన్ని ఎప్పుడు వాడాలి అని నిర్ణయించడానికి ఒక గురువు కావాలి. ఆ పని వారు నిర్వర్తించారు. ఆయన నన్ను దాడులు చేయడానికీ ఉపయోగించారు; కమ్యూనిస్టు పత్రికల్లో వ్యాసాలు రాయడానికీ ఉపయోగించారు. 


మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవాళ్ళు కలిసి బతకడంకన్నా ఈ భూమ్మీద స్వర్గం అంటూ ఏమీ వుండదు. అలాంటి స్వర్గంలో నేను మూడేళ్ళు వున్నాను. 


నా కోసం ఒక కొత్త ప్రపంచం ద్వారాలు తెరుచుకున్నాయి. అద్భుతమైన మనుషులుండే కొత్త ప్రపంచం. అది చాలా విశాలమైనది. ఒక్క విజయవాడలోనే వందకు పైగా కుటుంబాల్లో నేను సభ్యుడ్ని అయిపోయాను. మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లి, బరంపురం ఎక్కడికి వెళ్ళినా బంధువర్గాన్ని మించిన కామ్రేడ్లు వుండేవారు.  ప్రయాణానికి డబ్బులు లేవు. అయినా ఇండియా అంతటా కలయ తిరగేసేవాడిని.  ఫోన్లు లేవు, కామ్రేడ్స్ మధ్య ఒక విధమైన టెలీపతి పనిచేసేదేమో అనిపిస్తుంది. కలకత్తా వెళితే ఒకాయాన సైకిలు వేసుకుని హౌరా స్టేషన్ ముందు నాకోసం ఎదురు చూస్తుండేవాడు. లూసన్ మీద అధారిటీ అనదగ్గవాడు విజయవాడలో ఒకడున్నాడు; లూసన్ శతజయంతోత్సవాలకు అతన్ని పిలిస్తే బాగుంటుందని జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంటుకు ఒకడు సూచించేవాడు. ఏం నెట్ వర్క్ అదీ! ఇప్పటి డిజిటల్ నెట్ వర్క్ మనుషుల్ని కలపడంలేదు; విడగొడుతోంది. 


అప్పట్లో విప్లవోద్యమం మీద చాలా నమ్మకం వుండేది. కామ్రేడ్ల మధ్య ఆత్మీయత చాలా గొప్ప స్థాయిలో వుండేది. ఎలాంటి రిస్కుకు అయినా సిధ్ధపడేవాడిని. అక్షరాలు కూర్చడం నుండి  ఆయుధాల తయారీ వరకు ఏ రంగంలో టాస్క్ ఇచ్చినా పూర్తి చేసేవాడిని. పెర్ఫెక్షనిస్టు అనే పేరుండేది. 


నేను కృష్ణాజిల్లా రాడికల్ యూత్ లీగ్ కు అధ్యక్షుడిగా వుండేవాడిని. తరువాతి కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టుగా మాడిన బి. చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడుగానూ, పాలఫ్యాక్టరి లింగం నాగేశ్వరరావు కార్యదర్శిగానూ వుండేవారు.  మా మధ్య ఆత్మీయ సంబంధాలు చాలా బాగుండేవి. మరోవైపు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు మెంటార్ గా వుండేవాడిని. ఆంధ్రప్రదేశ్  పౌర హక్కుల సంఘానికి కూడ కృష్ణాజిల్లాలో తొలి కన్వీనర్ ని నేనే. విరసంలో చేరాక కృష్ణా వుభయగోదావరి జిల్లాలకు ప్రాంతీయ  కన్వీనర్ గా వున్నాను. 


అప్పట్లొ విజయవాడలో రాష్ట్ర పార్టి పొలిటికల్ క్లాసులు జరిగాయి. తరువాతి కాలంలో బిగ్ బిగ్ నేమ్స్ గా మారిన వాళ్ళు ఆ క్లాసుల్లో స్టూడెంట్స్. కొండపల్లి, సత్యమూర్తి, వంటివారు టీచర్లు. నాకు అప్పటికి ఆ క్లాసుల్లో విద్యార్ధి అయ్యేంత అర్హత లేదు. క్లాసుల నిర్వహణలో వాలంటీరుగా పనిచేసే అవకాశం వచ్చింది. చాలా ఛాలెంజింగ్ బాధ్యత. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ క్లాసులు జరుగుతున్నట్టు బయటికి తెలియరాదు. భోజనాల ఏర్పాటుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికయినా తిండి వికటిస్తే రోగం వస్తుంది. రోగం వస్తే డాక్టరు వస్తాడు. డాక్టరు వస్తే  వెనక పోలీసులు వస్తారు. అదీ డేంజరు. దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. నా సామర్ధ్యం రాష్ట్ర నాయకత్వానికి తెలిసిన సందర్భం అది. 


ఆ క్లాసుల తరువాత కొండపల్లి కొన్ని రోజులు కృష్ణాజిల్లాలో వున్నారు. స్థానికులకు క్లాసు చెప్పారు.  ఆ సమయంలో వారికి కొరియర్ -కమ్- బాడీ గార్డ్- ఒకరు కావలసి వచ్చారు. జిల్లా రాడికల్ కార్యదర్శి లింగం నాగేశ్వర రావుది బిగ్ ఫ్రేమ్ బాడి. అతన్నే సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు వచ్చింది. బాడీ కొంచెం చిన్నదేగానీ ఏదైనా జరిగితే నేను చాలా వేగంగా రియాక్ట్ అవుతానని కృష్టరావు  భావించారు. ఆ సమయంలోనే సుప్రసిధ్ధ స్వీడిష్ రచయిత జాన్ మీర్డాల్ విజయవాడ వచ్చి కొండపల్లి సీతారామయ్యను కలుసుకున్నారు. విప్లవోద్యమంలో నా ఇగోను ఎంతగానో సంతృప్తి కలిగించిన రోజులవి.  


కృష్ణారావుగారు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ ను వదిలి వినోద్ మిశ్రా నాయకత్వంలోని ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్ళిపోయారు.  ఆ కాలంలో నేను కృష్ణా జిల్లా పీపుల్స్ వార్ పార్టి బాధ్యతలు నిర్వర్తించాను. 


పుస్తకాలు పాత సందేహాలకు సమాధానం చెపుతాయి. కొత్త సందేహాలను రేకెత్తిస్తాయి. అదే వాటి పని. చదవడంవల్ల కొత్త సందేహాలు వచ్చేవి. పార్టి రాష్ట్ర నాయకులు చాలా ఓపిగ్గా మా సందేహాలను తీర్చేవారు. చాలా సంయమనం పాటించేవారు. అందరి మధ్య గొప్ప సమన్వయం కూడ వుండేది. కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు వంటి అగ్రనేతలు నెలకు ఒక్కొకరు చొప్పున వచ్చి కలిసేవారు. 


నేను చేరక ముందు కొండపల్లి సీతారామయ్య సాయుధపోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించి చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. సివోసి నుండి పీపుల్స్ వార్ గా మారేక పార్టి గతంకన్నా చాలా ఎక్కువగా విస్తరించింది. నక్సలైట్ పార్టీల్లో అన్నింటికన్నా పెద్దది చురుకైనది అనిపించుకుంది. రైతాంగ పోరాటాలు మొదలు, కళాసాహిత్య రంగాలు, పౌరహక్కుల ఉద్యమం అన్నింట్లోనూ దానిదే అగ్రస్థానం. 


శ్రీశ్రీ మొదలు కొడవటిగంటి కుటుంబరావు, కేవి రమణారెడ్డి, రావిశాస్త్రీ, కాళీపట్నం రామారావు వంటిసాహిత్య వుద్దండుల్ని ఒక వేదిక మీదికి తీసుకుని రావడం. గద్దర్, వంగపండు వంటి వాగ్గేయకారుల్ని సృష్టించడం, బాలగోపాల్ వంటి పౌరహక్కుల నేతను, వరవరరావు వంటి సామాజిక కార్యకర్తను, త్రిపురనేని మధుసూదన రావు వంటి తత్వవేత్తను తయారు చేయడం సివోసి-పీపుల్స్ వార్ కే సాధ్యం అయింది. 


నా విప్లవ అతిశయాన్ని చూసి ఏలూరి భీమయ్య అనే రైతు ముచ్చట పడ్డారు. తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్ళి చేశారు.

 

పార్టి నాయకులకు ఆలోచనాపరులతో ఎలాగూ ఒక ఇబ్బంది వుంటుంది. పార్టి ముఖ్యులు కనిపించినప్పుడెల్లా ఆలోచనాపరులు “చైనాను ఇంకా విప్లవకేంద్రం ఎందుకు అంటున్నాము?” “జాతీయ బూర్జువావర్గం ఇండియాలో ముందుకు వస్తుందా?” వంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తారు. దానికి వారు సంతృప్తికర సమాధానం చెప్పలేరు. ఎక్కువగా మాట్లాడితే “పార్టి లైన్” అంటారు. ఆ మాట అంటే అందరూ నోరు మూసుకోవాల్సిందే. 


ఆలోచనాపరుల నుండి ఎదురయ్యే ఇబ్బందులకు వాళ్ళొక పరిష్కారాన్ని కనుగొన్నారు. “ఆలోచనాపరులది పెట్టీ బూర్జువా మనస్తత్వం; వాళ్ళు పూర్తిస్థాయి విప్లవకారులుకాలేరు” అనే మాటను ప్రచారంలో పెట్టారు. ఇది సమస్యను పరిష్కరించకపోగా కార్యకర్తలకూ ఆలోచనాపరులకు మధ్య ఒక వైరుధ్యాన్ని పెంచింది.

 


మతానికి విప్లవోద్యమానికీ నమ్మకం విషయంలో తేడాలేదు. విప్లవోద్యమంలోనూ ఒక దేవుడు వుంటాడు. అతన్ని మనం హేతువుతో, తర్కంతో చూడకూడదు. అతనే సర్వస్వం అని నమ్మాలి.  నమ్మకపోతే మతంలో అన్యులు అంటారు; విప్లవోద్యమంలో అన్యవర్గ భావజాలం అంటారు.  ఇది నన్ను బాగా అసంతృప్తికి గురిచేసింది. 


సమాజానికి విప్లవం ఆకలికి అన్నమంత అవసరం. అవసరాన్ని గుర్తిస్తే సరిపోదు అవసరమైన శక్తిసామర్ధ్యాలను సంతరించుకోవాలి. నేను పెట్టుబడీదారుల్ని చాలా దగ్గర నుండి చూశాను. వాళ్ళ వనరులు, శక్తి, సామర్ధ్యాలు, సంస్కృతి నాకు బాగా తెలుసు. కమ్యూనిస్టు తీవ్రవాదులతో సహా  కమ్యూనిస్టుల దగ్గర అలాంటి శక్తి సామర్ధ్యాలు సంస్కృతి లేవని నాకు తరచూ అనిపించేది.  పరిమిత జ్ఞానంతో, పరిమిత వనరులతో ఎవ్వరూ కొత్త తరాలను ఆకర్షించలేరు. విప్లవాలను విజయవంతం చేయలేరు. 


శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం (1967-70)లో అయినా, కరీంనగర్, ఆదిలాబాద్  రైతాంగ సాయుధ పోరాటం (1977 – 90)లో అయినా కమ్యూనిస్టు విప్లవవాదులు పెద్ద శత్రువుల్ని ముఖాముఖీ  ఎదుర్కోలేదు. చిన్నాచితకవాళ్లని శిక్షించి అదే ఘన విజయమనుకున్నారు. ఇది కూడ నాకు సంతృప్తి నివ్వలేదు. వీటితో పోలిస్తే, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొంచెం మెరుగు. నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డిని, వరంగల్  జిల్లాలో  విసునూరు దొర రాంచంద్రారెడ్డిని గట్టిగా ఎదుర్కొన్నారు.   


గతంలో రెండు నెలలకు ఒకసారి కలిసే అగ్రనాయకులు పార్టి విస్తరించేకొద్దీ  జిల్లా పర్యటనలకు రావడం పూర్తిగా మానుకున్నారు. రీజినల్ కమిటీ నాయకుల ప్రాధాన్యం పెరిగింది.  రీజినల్ కమిటీ కార్యదర్శులు విధేయులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన ఉద్యమ అభిమానుల్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితుల్లో నాలాంటి అసమ్మతివాది  హోల్ టైమర్ గా వుండడం అసాధ్యం అనిపించింది. 1981 మేడే రోజున హోల్ టైమర్ జీవితాన్ని వదిలి పార్ట్ టైమర్ గా మారిపోయాను. 


కారంచేడు ఇష్యూను డీల్ చేయమని నన్ను కోరడంతో మళ్ళీ కొన్నాళ్ళు హోల్ టైమర్ గా మారాను. ఇదేమీ గొప్ప త్యాగం కాదు. ఇందులో నా స్వార్ధం కూడ వుంది. మార్క్సిజం ఆర్ధిక వ్యవహారాలతో తప్ప సాంస్కృతిక వ్యవహారాలతో డీల్ చేయలేదనే ఒక అపభ్రంస నింద వుంది. నాకు మత వివక్షను పట్టించుకోవాలనే ఒక ప్రత్యేక ఆసక్తి వుంది. 1984 నాటి ఢిల్లీ అల్లర్లు, శిక్కుల ఊచకోత సమయంలో నేను గద్దర్ తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ టూర్ లో వున్నాను. ఢిల్లీ వెళ్ళడం కుదరలేదు. కుల వివక్షను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే ఒక గొప్ప అవకాశం నాకు కారంచేడు ఉద్యమం ఇచ్చింది. కారంచేడు ఉద్యమం తాను ఆశించిన సమస్త ఆర్ధిక సౌకర్యాలనూ, చట్ట భద్రతను పొందింది. ఆ తరువాత మరే ఉద్యమం అలాంటి విజయాలను సాధించలేదు. 


1950లలో కమ్యూనిస్టు కాకపోయినా, 1970లలో నక్సలైటు కాకపోయినా, 1990లలో ఉనికివాది కాకపోయినా, 2020లలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి వ్యతిరేకి కాకపోయినా మనం ప్రజలతో వున్నట్టు కాదు. 


ఆంధ్రప్రదేశ్ లో 1989నాటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంలో పీపుల్స్ వార్ పాత్ర కూడ వుందని ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి భావించారు. నక్సలైట్ల మీద నిర్బంధాన్ని తొలగించారు. ఇతర వెసులు బాటులు కూడ కల్పించారు. విప్లవం విజయవంతం కాకుండానే విప్లవ పార్టీ నాయకులకు ప్రభుత్వంలో ప్రాబల్యం వచ్చింది. దానితో బ్యూరాక్రసీ పెరిగింది. అది అన్నిజిల్లాలకు వ్యాపించింది. ఆ బ్యూరాక్రసీని తట్టుకుని పార్టీలో కొనసాగడం నాకు చాలా ఇబ్బందిగా మారింది. 1990 జూన్ నెలాఖరులో పీపుల్స్ వార్ నుండి పూర్తిగా బయటికి వచ్చేశాను. ఆ తరువాత మరే పార్టీలోనూ చేరకూడదనుకున్నాను. 


ఒక గొప్ప విషయం అయితే ఉద్యమంలో వుండేది. కార్యకర్తల్లో విపరీతమైన అంకిత భావం వుండేది. ఎవ్వరూ చావుకు కూడ భయపడేవారు కాదు. అది సామాన్యమైన విషయం కాదు. చాలా మహత్తరమైనది. అలాంటి తరాన్ని ఈ భూమి మళ్ళీ పుట్టిస్తుందా? అనే అనుమానం వస్తుంటుంది. ఆ గౌరవం వాళ్ళ మీద సదా వుంది. వుంటుంది. 


పార్టి నుండి బయటికి వచ్చేసినా నేను చేయగల పని, నేను మాత్రమే చేయగల పని ఏది అప్పజెప్పినా అహాన్ని పక్కన పెట్టి పూర్తి చేసి ఇచ్చాను. ఎందుకంటే నాకు బోలెడు అసంతృప్తి వుండోచ్చు. కానీ, అది నాకు మరోజన్మ నిచ్చిందనే వాస్తవం కన్నా ఆ అసంతృప్తి గొప్పదేంకాదు. 


కమ్యూనిస్టు పార్టీల గురించి ఎవరయినా అధ్యయనం చేయాలనుకుంటే ‘1990కు ముందు 1990 తరువాత” అని ఒక విభజన రేఖను స్పష్టంగా  గీసుకోవాలి.  నేను 1990 వరకు పీపుల్స్ వార్ లో వున్నాను. 


(మావోయిస్టుల కథ ఒక ముగింపుకు వచ్చిందనే వార్తలతో కొంచెం మనస్తాపం కలిగి గతాన్ని ఇప్పుడు ఇలా అందరితో పంచుకోవాలనిపించింది) 


23-09-2025

Sunday, 21 December 2025

విశ్వగురు (ట్యాగ్ లైన్ - సినిమా ఇలా మొదలైంది

 

*విశ్వగురు  (ట్యాగ్ లైన్ - సినిమా ఇలా మొదలైంది*




అతి ఉత్సాహవంతుడైన ఓ రచయిత–దర్శకుడు  రంపా తిరుగుబాటును ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా  సినిమా తీశాడు.

ఆ చారిత్రక తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ పోలీసు యంత్రాంగం తిరుగుబాటుదారులపై అమానుష హింసను సాగించింది. ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు తమ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఆ పోరాటంలో తెల్లవాళ్ళయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ థామస్ హైటర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆల్ఫ్రెడ్ స్కాట్, మరో అధికారి జార్జ్ ఇండికేట్ కూడా హతమయ్యారు.

ఆ కాలపు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని ఇలాంటి దృశ్యాలతో దర్శకుడు భారీ వీఎఫ్‌ఎక్స్ తో ఉత్కంఠభరితంగా చిత్రీకరించాడు. ప్రతిఫ్రేమ్ లోనూ దేశభక్తి ఉత్సాహం జలధారలా పొంగిపొర్లేలా చూపించాడు. సినిమాకు ‘అల్లూరి’ అనే పేరు పెట్టి, “ఇప్పటికీ స్ఫూర్తి” అనే ట్యాగ్‌లైన్ జతచేశాడు.

తన పాన్‌ఇండియా దేశభక్తి చిత్రాన్ని అన్ని భాషల ప్రజలు విరగబడి చూస్తారని, బాక్సాఫీసులు బద్దలైపోతాయని అతను గట్టిగా నమ్మేడు. ప్రభుత్వం తనను మెచ్చుకొని, ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు పురస్కారం కూడా ఇస్తుందని ఐమాక్స్ స్థాయిలో కలలు కూడా కన్నాడు.

పోస్ట్–ప్రొడక్షన్ పూర్తయి సరిగ్గా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న క్షణంలోనే సెన్సార్ బోర్డు కాలు అడ్డం పెట్టింది.  సినిమాలో అనేక అభ్యంతరకర, ఆక్షేపణీయ దృశ్యాలు ఉన్నాయనేది వారి ఆరోపణ.

దేశంలో ఆపరేషన్ కగర్ నడుస్తున్న సమయంలో గిరిజన తిరుగుబాటును సమర్థిస్తూ సినిమా తీయడం తప్పని బోర్డు సభ్యులు తేల్చిచెప్పారు. గిరిజనులు పోలీస్ అధికారులను హతమార్చే దృశ్యాలు చూపించడం మరింత పెద్ద నేరమని పేర్కొన్నారు. సినిమాల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం తీవ్రమైన నేరమని వారు ముక్తకంఠంతో  ప్రకటించారు.

మన నిర్మాత ఖంగుతిన్నాడు. అప్పర్ సీలేరులో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తు ఒక్కసారిగా అతన్ని తాకింది. అదేమీ కల్పితగాధ కాదనీ, వందేళ్ల క్రితం నాటి బ్రిటిష్ వలసపాలన క్రూరత్వం గురించే సినిమా తీశానని, అందులో మరణించినవారు కూడా బ్రిటిష్ పోలీసులేనని, తనది ఫక్తు దేశభక్తి సినిమా అని రచయిత–దర్శకుడు అధికారులకు విన్నవించుకున్నాడు.

“ఆదివాసులు పోలీసుల్ని చంపిన దృశ్యాలు పెట్టి మీరు దాన్ని ‘అప్పటిది’ అంటున్నారు,” అన్నాడు సీనియర్ అధికారి, “మాకు మాత్రం అది ‘ఇప్పుటిది’గా కనిపిస్తోంది”.

దర్శకుడికి అధికారి మాటలు అర్థం కాలేదు.

“మీరు అంటున్నట్టు అది గత పోరాటం కావచ్చు. ప్రేక్షకులు అలా చూడరు. వాళ్లకు అది ఈరోజు జరుగుతున్న పోరాటంలానే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడితో ఆగరు. ఇది జెన్–జీ కాలం కదా! వీధుల్లోకి వస్తారు. ప్రదర్శనలు చేస్తారు. ఇప్పుడీ హడావుడి అంతా మనకు అవసరమా?” అని అధికారి ప్రశ్నించాడు.

“ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేమీ తెలియడం లేదు సార్,” అని దర్శకుడు అన్నాడు.

“మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మేమే మీకోసం అన్నీ చేశాం. ఆక్షేపణీయ దృశ్యాలన్నీ తొలగించాం,” అని సెన్సార్ అధికారి ప్రశాంతంగా అసలు విషయం శెలవిచ్చాడు.

జరిగిందేమిటో దర్శకుడికి ఇప్పుడు అర్ధం అయింది. ఒళ్ళంతా వణుకుతుంటే తడబడుతున్న గొంతుతో నెమ్మదిగా అడిగాడు, “అయితే సార్… ఏమైనా మిగిలిందా?”

“మీరు అంత కష్టపడి సినిమా తీశారు కదా—ఏమీ మిగల్చకుండా తగలెయ్యడం న్యాయం కాదనిపించింది. లంబసింగి కొండల్లో అందమైన ల్యాండ్‌స్కేప్ షాట్లు కొన్ని తీశారు కదా? అవి మాత్రం తాకకుండా వదిలేశాం,” అని అధికారి అపారమైన కరుణతో చెప్పాడు.

ఒక నిమిషం మాత్రమే మిగిలిన ఆ భాగాన్ని పవిత్ర ప్రసాదంలా కళ్లకు అద్దుకుని, రచయిత–దర్శకుడు బయటకు నడిచాడు.

కానీ,  కథ అక్కడితో ముగియలేదు.

తలవంచుకుని బయటికి పోతున్న ఆ దర్శకుడ్ని ఆ అధికారి వెనక్కు పిలిచాడు. “చూడండీ మీరు యువకులు. మంచి టాలెంట్ వుంది. చెప్పకూడదు అనుకుంటూనే ఒక మాట చెపుతున్నాను. అల్లూరి, భగత్ సింగ్ లను మించిన దేశభక్తులు  ఇప్పుడూ వున్నారు. మీరు చూడడంలేదు” అన్నాడు.

మరుసటి రోజే, మన రచయిత–దర్శకుడు మీడియాను పిలిచి ‘విశ్వగురు’ అనే కొత్త సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.

==//==

21-12-2025


Sakshi 29-12-2025

Monday, 15 December 2025

Chrismas Message - కొలకలూరులో క్రిస్మస్ సందేశం

 

కొలకలూరులో క్రిస్మస్ సందేశం

 

సోదరులారా! మిత్రులారా!




 

మినీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన జేజే సొసైటీ నిర్వాహకులు శ్రీమతి సువర్చలా శశికిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

నేను ధార్మికంగా ముస్లింని. అయితే హిందూ, క్రైస్తవ సమూహాలతో నాకు ప్రగాఢమైన అనుబంధాలున్నాయి. జైన, శిక్కు సమూహాలతోనూ ఎంతో ఆత్మీయంగా మెలిగిన అనుభవాలు ఉన్నాయి.

 

ప్రతి మతానికీ ఒక కేంద్ర భావన ఉంటుంది. హిందూ మతం—తన తన కర్తవ్యాలను నిష్ఠతో ఆచరించాలనే ధర్మాన్ని బోధిస్తుంది. ఇస్లాం—అంకితభావాన్ని బోధిస్తుంది. నువ్వు నమ్ము. నమ్మినదాన్ని కొనసాగించు.  క్రైస్తవం—కరుణను, క్షమను బోధిస్తుంది.

 

మూర్ఖులు ఏసుక్రీస్తును బంధించి శిలువ వేశారు. అంతటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆయనకు కోపం రాలేదు. పైగా, వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు—“Forgive them, for they know not what they do.” ఈ క్షమాగుణమే క్రైస్తవ మత సారమని నేను భావిస్తాను.

 

No curse. No retaliation. No call for revenge. Only faith, restraint, and silence

 

జీసస్ ప్రభావం గాంధీజీ మరణంలోనూ కనిపిస్తుంది. ద్వేషులు పేల్చిన గుండ్లకు ఆయన “హే రామ్” అంటూ నేలకు ఒరిగిపోయారు. అయినా తన హంతకులపై పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా, వారిని క్షమించమని సంకేతాలు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతారు.

 

ఆంధ్రా క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ (ACTC) ఫాదర్ జోనథన్ గారు వేదికపై ఉండగా క్రైస్తవం గురించి మాట్లాడటం నాకు ఒక కొత్త అనుభవం.

 

నేను నరసాపురం గోదావరి డెల్టా మిషన్ హైస్కూలులో చదివాను. మాకు లంచ్ అవర్‌కు ముందు పదిహేను నిమిషాల బైబిల్ క్లాస్ ఉండేది. అది పాఠ్యక్రమంలో భాగం కాదు—ఐచ్ఛికం మాత్రమే. మాది తెలుగు మీడియం చదువు. అయినా బైబిల్ క్లాస్‌కు హాజరైతే ఇంగ్లీషు మెరుగుపడుతుందని ఆసక్తితో తరచూ అటెండ్ అయ్యేవాడిని. విశేషం ఏమిటంటే, నా క్లాస్‌మేట్లలో ఓ ముగ్గురు తరువాత కాలంలో ప్రసిద్ధ బిషప్‌లయ్యారు. మా హైస్కూల్ నుంచే అయితే ఓ డజను మంది బిషప్‌లు అయ్యుంటారు.

 

నా హైస్కూల్ అనుభవం మరోదాన్ని కూడా మీతో పంచుకోవాలి. ఫ్రంట్ బెంచీలో మేము ముగ్గురం కూర్చునేవాళ్లం—అమ్మనమంచి కృష్ణశాస్త్రి, పిట్టా కాల్విన్ విక్టర్ బాబ్, నేను. మొదటివాడు హిందువు, రెండోవాడు క్రైస్తవుడు, మూడోవాడు ముస్లిం. మూడేళ్లూ మాది ఇదే కలయిక. ఈ రోజు జేజే సొసైటీ నిర్వాహకురాలు సువర్చలా శశికిరణ్ గారు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, నేను ఒకే వేదికపై వరుసగా కూర్చుంటే—నాకు నా హైస్కూల్ ఫ్రంట్ బెంచీ నాటి మతసామరస్యం గుర్తుకు వచ్చింది. ధన్యవాదాలు మనోహర్ గారూ!.

 

మత సామరస్యం గురించి గొప్పగా మాట్లాడటం మాత్రమే కాదు; దాన్ని ఒక ఆదర్శంగా ఆచరించాలి. ఒక సందేశం ఇవ్వమని నన్ను పిలిచారు. అయితే, ఇక్కడి నుంచి నేను ఇంకో గొప్ప సందేశాన్ని అందుకుని వెళ్తున్నాను.

 

ఈ అపూర్వ అనుభవాన్ని నాకు అందించిన నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

కొలకలూరు 15 డిసెంబరు 2025

Saturday, 29 November 2025

మూడో కూటమి వద్దే వద్దు!

 మూడో కూటమి వద్దే వద్దు!


బిజెపి నాయకత్వంలోని ఎన్డీ కూటమిని లోక్ సభ ఎన్నికల్లో ఒడించాలనే లక్ష్యంతో  జాతీయ స్థాయిలో 'ఇండియా బ్లాక్' పని చేస్తున్నది. 

ఎన్నికల పంథాగల కమ్యూనిస్టు పార్టీలు  అన్నీ కూడ ప్రస్తుతం ఇండియా బ్లాక్ లో వున్నాయి. బిసిల పార్టీలుగా భావించే ఆర్జేడి,   సమాజ్ వాదీ పార్టి కూడ అందులోనే వున్నాయి. 

మనకు అంబేడ్కరిస్టు సంఘాలు అనేకం వున్నాయి. అయితే,  అంబేడ్కరిస్టు రాజకీయ పార్టీలు ఏవీ ఎన్డీ కూటమి బయటలేవు; ఒక్క VCK పార్టి తప్ప. అది ఇండియా బ్లాక్ లో వుంది. 

ఈ వాట్సప్ గ్రూపు  ప్రధాన లక్ష్యం కూడ ఎన్డీ కూటమిని ఓడించాలనేదే. అలాంటప్పుడు ఇది ఇప్పటి నుండే ఇండియా బ్లాక్ ను సమర్ధించమే మంచిది. 

అలా కాకుండా మూడో కూటమిని ఏర్పాటు చేస్తే అది ఎన్డీ కూటమికి పరోక్షంగా మేలు చేస్తుంది. 

డానీ, కన్వీనర్ MTF 

29-11-2025


మిత్రులారా!

*2029 లోక్ సభ ఎన్నికల్లో ఏపీ వ్యూహం ఏమిటీ?* 

మన లక్ష్యాలను, దాన్ని సాధించే మార్గాలనూ మన వనరులు, శక్తి సామర్ధ్యాల పరిధి పరిమితుల్లో ఒక రోడ్ మ్యాప్ గీసుకోవడం అవసరం.

అంతిమ లక్ష్యం, మధ్యంతర లక్ష్యం, ప్రస్తుత లక్ష్యం అంటూ వర్గీకరణ చేసుకోవాలి. 

కులవర్గమత తదితర పీడనలు ఏవీ లేని సమాజాన్ని నిర్మించడం మన అంతిమ లక్ష్యం. ఆ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. 

కానీ, దీన్ని సాధించడానికి ఇంకో వందేళ్ళు సులువుగా పడతాయి. మనకు ఆ స్పష్టత సహనం వుండాలి. 

కార్పొరేట్ మతతత్త్వ వ్యవస్థను కూల్చడం మన మధ్యంతర లక్ష్యం. 

దానికీ చాలాకాలం పడుతుంది. 

ఈ రెండు  దశలు కాకుండా మరికొన్ని దశల్ని కూడ మనం ఎంచుకోవచ్చు.  

ఈలోగా మనకో తక్షణ సవాలు ఒకటుంది. అది; 2029 లోక్ సభ ఎన్నికలు. 

ఆ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్డీ కూటమిని ఓడించడం మన తక్షణ లక్ష్యం. 

దానికి అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించుకోవాలి. 

అది ఎప్పుడో కాదు. ఇప్పుడే, ఈరోజే! ఈరోజే కుదరకపోతే ఈ వారంలో!

ఈ వాట్సప్ గ్రూపులో ఆరెస్సెస్ - బిజెపి, కమ్యూనిస్టు పార్టీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారేగానీ ఇతర పార్టీల గురించి మాట్లాడడంలేదు. 

ప్రతి రాజకీయ పార్టీని పరిశీలనకు స్వీకరించి దాని మీద మన వైఖరిని  స్పష్టం చేయాలి. 

మన కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్. మనం అంతకు మించి  ప్రభావితం చేయలేము. ఆ వినయం కూడ మనకు వుండాలి.   

ఆంధ్రప్రదేశ్ లో  టిడిపి, జనసేన, బిజేపి అధికార కూటమిగా వున్నాయి. వైసిపి ప్రతిపక్షంగా వుంది. 

కమ్యూనిస్టు, కాంగ్రెస్  పార్టీలు, బిఎస్పీ, ఏఐ బిఎస్పీ, ఎంఎల్  తదితర పార్టీలు కూడ  ఎన్నికల బరిలో వుంటాయి. 

2029 అసెంబ్లీ-లోక్ సభ ఎన్నికల్లోనూ వీటి మధ్యనే ప్రధాన పోటీ వుంటుంది. 

వీళ్ళలో మనం ఎవరితో కలుస్తాం? ఎవరితో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తాం? ఎవరిని శత్రువుగా ప్రకటిస్తాం? 

ఎన్నికల  గణాంకాలు మన శిబిరాన్ని బలపరుస్తున్నాయా? ఐక్య సంఘటనలు అవసరం అంటున్నాయా? చూసుకోవాలి. 

ఈ పనిని ఈ గ్రూపులో ఎవరయినా ఆరంభించారో లేదో తెలీదు. 

ఆ కసరత్తు పూర్తిచేసి 2029 ఎన్నికల వ్యూహాలు-ఎత్తుగడల్ని రూపొందించుకోవాలి. 

మరోమాట, సిపిఐ, సిపియం, ఫార్వార్డ్ బ్లాక్, ఎంఎల్ లిబరేషన్ లను ఇండియా బ్లాక్ నుండి బయటకు రప్పించి కొత్తగా మూడో  ఫ్రంట్ కట్టగలమనే అభిప్రాయం కొందరికి వున్నట్టుంది. దాన్ని నేను ఏమాత్రం నమ్మలేను. 

అవి రాజకీయ పార్టీలు; మనది ప్రజాసంఘం. ఇప్పటికి  ఇది ఒక ప్రజాసంఘం కూడ కాదు. ఒక వాట్సప్ గ్రూపు.  మహా ఉద్యమం ఒకటి సాగితేతప్ప, మహానాయకుడు ఒకడు ఆవిర్భవించితేతప్ప  రాజకీయ పార్టీలు ప్రజాసంఘల మాట వినవు. ఎన్నికల సమయంలో అస్సలు వినవు. 

ప్రస్తుతం వున్న రెండు రాజకీయ కూటముల్లో మెరుగైనదాన్ని ఎంచుకోవడం మినహా మరోమార్గం లేదు. 

2029 లోక్ సభ ప్లాన్ ను ఈ గ్రూపు నిర్వాహకులు ఇంతవరకు ఎందుకు రూపొందించలేదో ఆశ్చర్యకరంగా వుంది.  

ఈగ్రూపులో చాలామంది ఇతర విషయాల గురించి చాలా పోస్టులు పెడుతున్నారు. 2029 ఎన్నికల వ్యూహ రచన మాత్రం చేయడం లేదు. 

ఇప్పుడు అదే ముఖ్యం. 

- డానీ 

కన్వీనర్ , MTF 

29-11-2025



స్థూలంగా డానీ గారి ప్రతిపాదన తో నాకు అంగీకారం ఉంది. సూటిగా నాకు తెలిసిన సమాచారం, నా అభిప్రాయాలు/ప్రతిపాదనలు,.

 

i. సమాచారం :

 

1). 2023 జులొ 18 ను INDIA కూటమి ఎర్పడగా భారత్ బచావో ఆంధ్రప్రదేశ్ కమిటీ జులై నెలలనే ఆ కూటమి కి మద్దతు ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ప్రచారం చేసింది.

 

2). సిపిఐ(ఎం) INDIA లో లేదు. రాష్ట్రాల వారీగా అవగాహన లోకి వస్తున్నది.

 

3). అఖిల భారత స్థాయిలో  ప్రజాసమస్యలపై కృషి చేస్తూ, ఆర్ ఎస్ ఎస్ -బీజేపీ కార్పోరేట్ హిందూత్వ ఫాసిజంను ఎన్నికల రంగంలో ఓడించటం కోసం సూత్రబద్ధమైన విశాలమైన ప్రంట్ ఏర్పాటు కోసం సంవత్సరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి

 

4). మన రాష్ట్రంలో  ' సామాజిక న్యాయం కోసం మార్క్సిస్ట్ ఆలోచనాపరులు వేదిక (Marxist Thinkers Forum for Social Justice)'  అనే వేదిక ఈ కృషిని ఆంధ్రప్రదేశ్ లో చేస్తూ ఉంది.

 

 ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఇతర సమూహాలు,, వ్యక్తులు అందరూ కలసి ఒక mega పౌర వేదిక గా ఏర్పడ వలసిన అవసరం ఉంది.

 

ii. అభిప్రాయాలు:

 

 INDIA లోని పార్టీలు అధికార కాంక్ష తో ఒక గుంపు అయ్యాయి గానీ కనీసం సెక్యులరిజం పట్ల కూడా నిబద్ధత లేదని రెండున్నర సంవత్సరాల వారి వ్యవహారాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.

 

కనుక సూత్రబద్ధమైన మూడవ ఫ్రంట్ ('సమతా శక్తుల కూటమి ' లాంటి పేరుతో) అవసరమని, అది మాత్రమే ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఫాసిస్టు భావజాలం ను, బీజేపీ/ఎన్డీఏ పరభ నిరంకుశ పాలనను ఓడించ గల నిలకడైన శక్తి అని నా అభిప్రాయం. ఇలాంటి కూటమి త్వరగా ఏర్పడి ప్రజల సమస్యలు కృషి చేస్తూ 2029 ఎన్నికల్లో పాల్గొనాలి.

 

iii. ప్రతిపాదనలు:

 

1). బిజెపి భావజాలంతో సహా బీజేపీ ని వ్యతిరేకించే పార్టీలు , సంఘాలతో  ఒక స్థిరమైన రాజకీయ కూటమి (ఉదా: సమతా శక్తుల కూటమి) త్వరగా ఏర్పడాలి.  యింకా, స్పష్టంగా చెప్పాలంటే ఆ కూటమి సీపీఐ ,సిపిఎం , వివిధ 'ఎంఎల్' పార్టీులు, MCPI(U), MCPI, SUCI(C), FB, RSP, వీసీకే , ఏఐబీఎస్పీ  WPI లాంటి పార్టీలు, దళిత బహుజన మైనారిటీల సంఘాలు ఒక కూటమిగా ఏర్పడాలి. అందుకోసం ఉత్ప్రేరకంగా పనిచేసే పెద్ద 'పౌర సమాజ అసోసియేషన్' కావాలి. 

 

2). ఈ మూడవ కూటమి లోకకి  బీజేపీతో అంట కాగిన/ అంటకాగుతున్న పార్టీలు, సంఘాల్ని . అంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే - టీడీపీ ,జనసేనలతో పాటు వైసీఆర్ సీపీ ,బీఎస్పీ లను కూడా వద్దని అనుకోవాలి

 

3). 2029 సాధారణ ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన  గెలుపును సాధించటం లేదా బీజేపీ/ ఎన్డీఏ ను ఓడించడం కోసం, అప్పటికి ఉన్న  నాన్-ఎన్డియ్యే పార్టీ లలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే దాన్ని 'సమతా శక్తుల కూటమి' (3వ కూటమి) చూసుకుంటుంది .

 

       ఈ ఆలోచనలకు నిర్దిష్ట ఆచరణాత్మక రూపం ఇవ్వడానికి రెండు రోజుల భౌతిక సమావేశం డిసెంబర్ చివరి వారంలో జరుపుకుందాం.

  మీ అభిప్రాయాలు సంసిద్ధత తెలియ జేయ వలసిందిగా  విజ్ఞప్తి చేస్తున్నాను.

 

          అభివందనాలు

       సిబిఆర్, 8639195989

         తేదీ. 30- 11 - 2025,

 

మిత్రులు డానీ గార్కి,

సూచనలు, మీ స్పష్టత — రెండూ చాలా సమయోచితంగా ఉన్నాయి. ఉద్యమాలకు అంతిమ – మధ్యంతర – తక్షణ లక్ష్యాల వర్గీకరణ ఎంత ముఖ్యమో, రాజకీయ వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చేయాల్సిన అవసరాన్ని మీరు బలంగా చెప్పారు. 2029 ఎన్నికలు కేవలం పార్టీలు గెలుపు-ఓటముల విషయం కాదు; మనకు ఎదురుగా వున్న కార్పొరేట్-కమ్యూనల్ హేగెమనీని అడ్డుకునే తక్షణ పోరాటం. దీనిపై గ్రూపులో సమగ్ర చర్చ లేకపోవడంపై మీరు చూపిన ఆందోళన సహేతుకంగానే  ఉంది.

 

మీ సూచనలకు నా స్పందన

 

1. ప్రతి పార్టీని పరిశీలించాలి — ఇది తప్పనిసరి. ఓటర్లలో ప్రభావం, పూర్వపు వైఖరి, ప్రజా-పాలసీలపై నిర్దిష్టంగా ఏం చేశారన్నదానిపై నిర్దిష్ట విశ్లేషణ లేకుండా వ్యూహం అసాధ్యం.

 

 

2. కూటములు నిర్మించాలా — ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయాలా — శత్రు కూటమిని ఎవరు నిర్దిష్టం చేయాలా అనే విషయాలు వెంటనే నిర్ణయించాలి.

 

 

3. కార్య క్షేత్రం  ఒక రాజకీయ పార్టీ కాదు — ఇది చాలా కీలకమైన నిజం. ఉద్యమ శక్తులు ఎన్నికల్లో “ప్రత్యామ్నాయం సృష్టించడం” కాదు; “ప్రమాదాన్ని తగ్గించడం” మాత్రమే చేయగలవు.

 

 

4. రెండు కూటముల్లో “ఎవరు తక్కువ హాని చేస్తారు?” అనే దాని ఆధారంగా టాక్టికల్ పొజిషనింగ్ నిర్ణయించడం తప్ప మరే మార్గమూ లేదు కదా సార్ — ఇదే ప్రస్తుత రాజకీయ సత్యం.

 

          నమస్తే 🙏

మార్పు శరత్

 

 

భౌతిక సమావేశం

ఒకటి జరగవలసిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది

 

 నిర్దిష్ట అంశాల తో

ఆలోచనల మథనం ఒకటి అక్కడ జరగాలి!

 

ఆ మథనం ఇచ్చే

తుది ఫలితాల ఆధారంగానే

ఏం చేయాలి అనే

నిర్దిష్ట కార్యాచరణ ను తయారు చేసుకోగలం!

 

అందుకోసం నిర్దిష్ట ఎజండా తో

ఆ సమావేశం జరగాలి!

 

వాట్సప్ చర్చలతో సమగ్రత, స్పష్టత రాదు

ముఖతా మాట్లాడు కోవడమే సరైన చర్య!

 

అటువంటి సమాలోచనల కోసం 3-5 గురితో ఒక ఎజెండా కమిటీ ఏర్పడి ఇప్పటినుంచే పనిలోకి దిగడం మంచిది!

 

ఈ కమిటీ నే ఆ సమావేశం యొక్క నిర్వణా కమిటీ గా కొనసాగి, సదరు సమావేశ ఎజెండా యొక్క కట్టు దాటకుండా చర్చలు సాగించే విధంగా నియంత్రణ చేయడం ఇంకా మంచిది!

 

అలా కుదరని పక్షంలో నిపుణులు, అనుభవజ్ఞులైన 3 గ్గురి పెద్దలతో సమావేశ నిర్వహణ కమిటీ నొకదాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది!

 

                       రత్నారావు

 

Rekha Chandrasekhar

ఎన్నికల మూడవ కూటమి ఏర్పడితే అది బీజేపీ కూటమికే మేలు చేస్తుంది అన్న డ్యానీ గారి మాట చాలా వాస్తవం.

 

మరి మూడవ కూటమి

“ వామపక్ష సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల కూటమి” ఏమి చేయాలి!

 

పార్లమెంటు ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి, భారత్ బచావో , మేలుకో ఆంధ్ర ప్రదేశ్ వంటి సంస్తలు పార్లమెంటు ఎన్నికలు సంవత్సరం లోపు ఉన్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాల వంటి నిర్ణయాలు

ఇప్పుడు  మనకు అవసరమా!

 

ఈ కాలమంతా మన ప్రజా కూటమి శక్తులు ప్రజలలో ప్రజా ఉద్యమాలను నిర్మించాలి.

 

1.) రాజ్యాంగ హక్కుల

పరి రక్షణ కోసం

2.) అక్రమ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా

3.) EC ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా

4.) రిజర్వేషన్లు రద్దుకు వ్యతిరేకంగా

5.) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా

6.) అడవి సంపదను అంబానీ, అద్వానీలకు దోచి పెట్టడానికి వ్యతిరేకంగా

7.) సమాఖ్య స్ఫూర్తి కి భంగం కలిగించే చర్యలకు వ్యతిరేకంగా 

 

ఇంకా ప్రజా సమస్యల కోసం, రాజకీయ సమస్యల కోసం, ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసం  తదితర సమస్యల కోసం ప్రజలలో బలమైన ఉద్యమాలను మన కూటమి శక్తులు నిర్వహించ వలసి ఉంది.

 

మన ఉద్యమాల పోరాట మొన మనువాద, కార్పోరేట్ , ఫాసిస్టు శక్తుల పైన ఉండాలి.

మన శక్తులు బలాన్ని సమీకరించు కోవాలి , ఎన్నికల సమయానికి ఫాసిస్టు శక్తులను బలహీన పరచడం, ఓడించడం మన లక్ష్యంగా ఉండాలి.

 

— రేకా చంద్ర శేఖర రావు.

తేది. 30.11.2025.

 

 

 

మిత్రులారా !

 

ఖాన్ యజ్దాని గారి విశ్లేషణాత్మక విషయ సూచనలు నూటికి నూరు పాళ్ళు నిజం. గత 14 సంవత్సరాల నుండి పాలనలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి " టక్కు టమార ఎన్నికల విద్యల్లో వందలాది PhD లు " కల్గి ఉందన్న విషయం కలలో కూడా విస్మరించరానిది.

 

ఈ అధికార పార్టీ నానా విధాల సాంఘిక ,సామాజిక ఆర్ధిక , రాజకీయ, వేర్పాటువాద , అబద్దాలు, అసత్యాలు , అర్థ సత్యాలు, వికృత, విశృంఖల నానా విధ ఉన్మాదాలు , వేర్పాటువాద ప్రణాళికలతో భారతీయ ఓటర్లను ఏమార్చటంలో తన గోదీ మీడియాతో ఇప్పటికే ఓ గొప్ప స్థాయిలో విజయం సాధించింది. అధికారంలో ఉంది. ఈ సత్యాన్ని విస్మరించటం అంటే మనం ఎక్కడో మన అంతరంగాల్లో ఆ ఉన్మాదమే జనోన్మాదం కావాలని కోరుకోవటమే! దీనిని ఈ రోజు భారతీయ రాజకీయ చిత్రపటంలో చూస్తూనే ఉన్నాం.

 

అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్లు " మనకూ అన్నీ ఉండి కూడా, " తప్పక ఉండాల్సినవి కొన్ని లేకపోవటం వల్ల సంపూర్ణంగా చేష్ఠలుడిగి " చెట్టుకొకరం పుట్టకొకరం గా వెదజల్లబడి, చల్లబడి, చతికలబడి , వెనుకబడి జనహితం ఉండి కూడా తడబడి జనానికి దూరంగా దఖలుబడి , దిగలుబడి దిక్కుతోచక ఉండిపోయి " ఇంకా గొంగట్లో వేటినో ఏరుకుంటూనే ఉన్నాము. స్థితిగత ఔన్నత్యాన్ని మరచి " ఏవో మెతుకుల కోసం వెంపర్లాటలోనే సేద తీరుతున్నామేమో ??!'

 

ఒక్క మాటలో చెప్పాలంటే " మనమందరం గత కాలపు సైద్ధాంతిక వైపరీత్యాల పైత్యాన్ని తాత్కాలికంగానైనా కనీస ప్రాప్త కాలజ్ఞతతో  " మూడు చేపల కథలోని " దీర్ఘదర్శి లా " ఆలోచించి ఓ సమగ్ర సమిష్టి ఆచరణాత్మక  కార్యాచరణ  ప్రణాళికని బేషరతుగా రచించుకుని  " దేశ సంరక్షణావసర ఏకీకరణ / పునరేకీకరణ " కార్యాన్ని ప్రారంభించి " మన నిష్ఠాగరిష్ఠా ఆచరణతో "  అటు ప్రజల ఇటు విడిపోయి దిగాలుగా చిక్కబడి, చిక్కుబడి, దిక్కులు చూస్తున్న  " భావసారూప్య ఇండియాలోని "ఇండియా పార్టీలను కలుపుకుని " నూతన ఉత్తేజ భరిత ఆక్సిజన్ " ఇవ్వాల్సి ఉంటుంది. దేశ నేలకు రాజ్యాంగబద్ధ కళాత్మక జీవనాన్ని ఇచ్చి రక్షించుకోవాల్సి ఉంది.

 

మరో మూడవ లేదా నాల్గవ విభాగంఅంటూ " క్రొత్త వాటిని జననం చేస్తే " భాగాహారంలో మన ఉమ్మడి శతృవు యొక్క భాగ ఫలం పెద్దదై " మళ్ళీ మనం " అల్ప శేషం " గానే తరిగి, మిగిలి " తెలివైన గానుగ ఎద్దులం" గానే తరతరాల బౌద్ధిక బానిసత్వం లోనే ఉండిపోతాము. క్రమంగా మనకు మనమే నిర్మాలించబడతాం'

 

" విశాల సర్వామోద సామాజిక పద్దతిలో  కన్నెత్వం కోల్పోతేనే  ఏ స్త్రీ అయినా గౌరవ అమ్మత్వం " పొందగలదన్నది నేడు మనకు కావలసిన " తక్షణ , లక్షణ , లక్ష్య సాధనకు దీర్ఘకాలిక విజేత పథనిర్దేశనం అని భావిస్తాను.

 

అంతిమంగా " మన ఉమ్మడి రాజకీయ శతృవు " సర్వకాల, సర్వ రకాల సకల అవలక్షణ సమేత గండర గండడు " అని ఒక్క క్షణం కూడా మరచిపోరాదు.

 

ప్రస్తుతం చేయవలసిన పని ఓ రకంగా అసాధ్యమే. కానీ దానిని సాధించటంలో " తొలి అడుగు మలి అడుగై జన పద అడుగుల చప్పుడుగా ఓ ప్రభంజనం కావాలని ఆశిద్దాం! పునరంకితమౌదాం.

 

జనంతో కలసి మెలసి కలియ బడదాం .....

 

మళ్లీ నిజ ప్రజాస్వామ్య భారతాన్ని నిర్మిద్దాం.....

 

అల్ కమర్ , నిజాంపట్నం '

 

 

CBR సర్,

 

2029 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలో INDIA Block  వుంటుంది. కొన్ని షరతులతో కమ్యూనిస్టు పార్టీలన్నీ అందులో వుంటాయి.

 

కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు  పార్టీలు ఎవరితో జతకట్టాలనే విషయాన్ని ఏ ప్రజాసంఘమూ నిర్ణయించజాలదు; ఒక మహాఉద్యమం చెలరేగితేతప్ప. అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు.

 

NDA, INDIA Block  లకు భిన్నంగా కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు కలిసి మూడవ కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువ. ఒకవేళ మూడో కూటమి ఏర్పడినా అది INDIA Block గెలుపు అవకాశాలను దెబ్బతీసి NDA కు అనుకూలంగా మారుతుంది. అదొక అదనపు అప్రదిష్ట.

 

అందుచేత, INDIA Blockను బలపరచడం తప్ప మరో మార్గం నాకు కనిపించడం లేదు.

 

ఎన్నికల్లో ఒక కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడం సమయం, శ్రమ, డబ్బుతో కూడిన పని. ఆ వనరుల గురించి కూడ ఒక ప్రణాళిక వుండాలి.

 

ఆ పనిని ఎన్నికల ముందు మొదలెట్టకుండా ఇప్పుడే మొదలు పెడితే మంచిదని భావిస్తున్నాను.

 

ఏపిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరికొన్ని పార్టీల కూటమి ఎలాగూ ఏర్పడుతుంది. దానికి మద్దతు ఇవ్వడమే సబబు.

 

-        డానీ

-        కన్వీనర్, MTF




2029 లోక్ సభ ఎన్నికల్లో బిజెపినీ, దాని నాయకత్వంలోని ఎన్డీ కూటమినీ ఎలా ఓడించాలనే అంశం మీద తీవ్రంగానే చర్చ జరుగుతోంది.

 

దేశంలోని మార్క్సిస్టు, అంబేడ్కరిస్టు సమూహాలన్నీ ఏకం అయితే ఎన్డీ కూటమిని ఓడించడం అసాధ్యం ఏమీ కాదు అనే నమ్మకం ఒకటి కొందరిలో బలంగా కనిపిస్తున్నది.

 

మార్క్సిస్టులతో  కలవడానికి అంబేడ్కరిస్టు సమూహాలు కొన్నింటికి అభ్యంతరాలున్నాయి. అలాగే, అంబేడ్కరిస్టులతో కలవడానికి మార్క్సిస్టు సమూహాలు కొన్నింటికి అభ్యంతరాలున్నాయి.

 

ఈ పరిస్థితుల్లో ఆ రెండు సమూహాలు కలుస్తాయా? లేదా? అనేది ఒక సందేహం. అయితే, ఒకవేళ ఆ సమూహాలు రెండూ కలిసినా ఎన్డీ కూటమిని ఓడించే సామర్ధ్యం వాటికి వుంటుందా? లేదా? అనేది అంతకన్నా పెద్ద సందేహం.

 

ఎన్డీ కూటమిని ఓడించడానికి మార్క్సిస్టు, అంబేడ్కరిస్టు సమూహాల సామర్ధ్యం సరిపోకపోతే ఏం చేయాలీ? అనేది ప్రాణప్రదమైన ప్రశ్న. వామపక్షానికీ, కుడి పక్షానికి మధ్యన సాగే పోరులో ఒక సెంట్రిస్టు పార్టీతో ఐక్య సంఘటన కట్టక తప్పదు. ప్రస్తుతం అలాంటి అవకాశాలు కాంగ్రెస్ కు ఎక్కువగా వున్నాయి.  

 

ఎమర్జెన్సీ విధింపు వంటి పాపాలు కాంగ్రెస్ ఖాతాలో చాలా వున్నాయి. అది అందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ నాయకత్వంలో నడవాలంటే ముందు ఒక అంశాన్ని తేల్చుకోవాలి. బిజెపి, కాంగ్రెస్ లలో ఏది ఎక్కువ ప్రమాదకారి? అని. బిజెపియే ఎక్కువ ప్రమాదకారి అని తేలితే కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాలు పెరుగుతాయి. ఆ పిదప ఇండియా బ్లాక్ ను బలపరచాల్సి వుంటుంది.

 

అప్పుడూ ఒక సందేహం వుంటుంది. మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు కాంగ్రెస్ తో కలిసినా ఎన్డీ కూటమిని ఓడించగలవా? అని. దానికి ఇప్పటికిప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేరుగానీ, ఇండియా మహా బ్లాక్ ను ఒక ఉత్తేజకరమైన ప్రత్యామ్నాయంగా మార్చగలిగితే అది సాధ్యం కావచ్చు అని మాత్రం చెప్పవచ్చు!. 



-        డానీ

-        కన్వీనర్, MTF

1114-12-2025