AM Khan Yazdani Danny Photos
A.M. Khan Yazdani & Usha S Danny
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Wednesday, 2 April 2025
Tuesday, 1 April 2025
Danny on - Chat GPT & Grok
నా గురించి Chat GPT & Grok లకు వున్న అభిప్రాయం
Chat GPT
A.M. Khan Yazdani, better known mononymously as Danny, is a distinguished Telugu writer, journalist, documentary filmmaker, political commentator, literary critic, humorist, and social worker. His multifaceted career reflects a deep commitment to societal issues and cultural discourse.
In the realm of journalism, Yazdani has been actively involved in reporting and analyzing critical events. For instance, he provided insights into the brutal murder of a Muslim man inside a masjid in Andhra Pradesh, highlighting the communal tensions and the need for justice. The News Minute
Yazdani also maintains a blog where he shares his thoughts and experiences. In one of his posts dated April 30, 2023, he reflects on the significance of Lenin's birthday coinciding with the festival of Eid, and shares a personal anecdote about a young visitor named Hashmi, emphasizing the importance of engaging with the younger generation.Instagram+1LinkedIn+1A.M. Khan Yazdani & Usha S Danny
Furthermore, he has been featured in various YouTube videos discussing topics ranging from the impact of Brahmanism on Marxism in India to contemporary political issues. His YouTube channel serves as a platform for his political commentary and social analysis. YouTubeYouTube
Through his diverse body of work, A.M. Khan Yazdani continues to contribute significantly to Telugu literature, journalism, and social activism, fostering critical discussions and advocating for societal progress.
GROK
A.M. Khan Yazdani, Usha S Danny ఇద్దరు జంట రచయితలు అనుకుంది.
Danny - mononym
A mononym is a single name used by a person, without a surname or additional names. Many historical figures, celebrities, and artists are known by mononyms.
Examples:
-
Historical figures: Buddha, Plato, Napoleon
-
Celebrities: Madonna, Cher, Prince
-
Writers & Thinkers: Voltaire, Tagore
-
Athletes: Pele, Maradona
Mononyms are often used for branding, uniqueness, or cultural reasons. In some cultures, single names are the norm, while in others, they are adopted for public recognition.
Usage :
A.M. Khan Yazdani, better known mononymously as Danny, is a distinguished Telugu writer, journalist, documentary filmmaker, political commentator, literary critic, humorist, and social worker.
Sunday, 30 March 2025
You have to excuse Danny for Many things - చాలా వాటికి క్షమించాలి డానీని!!
చాలా వాటికి క్షమించాలి డానీని!!
ఏదైనా
చదువుతున్నప్పుడు, స్టడీ చేస్తున్నపుడు,
రాస్తున్నపుడు నేను ఈ లోకంలో వుండను. శరీరం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంటుంది.
మెదడు ఇంకెక్కడో వుంటుంది. ‘బాడి ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్’ అంటారే ఇది అంతకు మించింది. ఆ సమయంలో నాకు ఏదీ
కనిపించదు; ఏదీ వినిపించదు. చివరికి సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడ వినిపించదు. ఒక వేళ
వినిపించినా ఎత్తను. వేరే లోకం నుండి హఠాత్తుగా తిరిగి రావడం కుదరదు. పాస్ పోర్టు,
వీసా సమస్యలు వుంటాయి.
“స్టౌవ్
మీద కూర మాడుతోంది గ్యాస్ ఆపెయ్యి” అని మా ఆవిడ అరిచి గీపెట్టినా నాకు వినిపించదుగాక
వినిపించదు. ఆ తరువాత “నీకు చెవుడా?” అంటుంది.
అదీ వినిపించదు. ఒకవేళ అప్పటికి ఈలోకం లోనికి తిరిగి వచ్చేసివుంటే మాత్రం
వినిపిస్తుంది. అప్పుడు మౌనంగా వుండిపోతాను. కమ్యూనిస్టు పార్టిల్లోనేకాదు; కాపురాల్లోనూ
వ్యూహాలు ఎత్తుగడలు వుంటాయి. ఇంట్లో మౌనంగా వుండడం తెలిసినవాడే ఈరోజుల్లో కాపురం
చేయగలడు అని ఎవరు చెప్పారో గుర్తులేదుగానీ దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్
చేస్తున్నాను.
నేను
చాలా సెలెక్టివ్ గా మాత్రమే పుస్తకాలు చదువుతాను. కనిపించిన పుస్తకాలన్నింటినీ తిరగేసేంతటి
చదువరినికాను. అప్పటికి నాకు అవసరమైనవి అనుకున్నవి మాత్రమే చదువుతుంటాను. నా
షెడ్యూల్ లో లేనివి చదవడం చాలా కష్టం. పుస్తకాలు బాగోలేవని కానేకాదు; అప్పటికి
చదవాల్సినవి క్యూలో చాలా వుంటాయి.
మరీ
ఆబ్లిగేషన్ అయితే తప్ప పుస్తకావిష్కరణ సభల్లో వక్తగా వుండడం నాకు ఇష్టం వుండదు. ముందుమాటలు
రాయడమూ చాలా కష్టం. ఆ పుస్తకాన్ని నిర్ణిత సమయంలోగా చదవాల్సి వస్తుంది. దాని కోసం
అనేక పనుల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అదీగాక అందులో ఏదైనా లోటు వుందని
చెప్పినా, అతిశయోక్తులతో పొగడకపోయినా రచయితలు అలుగుతారు. ఇదో కొత్త సమస్య.
నా
ఆర్టికల్స్ అచ్చయిన రోజున చాలా కాల్స్ వస్తుంటాయి. కొందరు మెసేజులు పెడుతుంటారు. కొందరు
విమర్శిస్తారు. కొందరు మెచ్చుకుంటారు. మెచ్చుకోళ్ళు, విమర్శలు రెండూ నాకు చాలా
ఇష్టం. ఆ తరువాత ఏం రాయాలో నాకు అర్ధం అవుతుంటుంది.
ఇంకొందరు
నేనేదో గొప్పవాడిని అనుకుని తమ వ్యక్తిగత సమస్యలు కూడ చెపుతుంటారు. కష్టాల్లోవున్న
సమూహాలకు సంఘీభావం తెలపడం నా బాధ్యత అనుకుంటాను. వాళ్ళను ఆ కష్టాలనుండి తప్పించే
స్తోమత నాకులేదు.
ఈమధ్య
చాలా మంది వాట్సప్ లో ఫోన్లు చేస్తున్నారు. రకరకాల గ్రూపుల్లో రోజుకు వందకు పైగా
మెసేజులు వస్తుంటాయి. వాటిల్లో ఆ మిస్సిడ్ కాల్స్ ను, జూమ్ మీటింగ్ సమాచారాలను
చూడడం చాలాసార్లు కుదరదు. అందుకు అందరూ నన్ను క్షమించాలి.
మీటింగులకు
వక్తలుగా వెళ్ళడం కూడ ఒక సమస్యే. నేను వస్తే బాగుంటుందని నిర్వాహకులు భావిస్తారు.
ముందు డేట్ల సమస్య వుంటుంది. వాళ్లు అనుకున్న రోజు మనకు ఖాళీ వుండాలి. ఈనెల 23
ఆదివారం ఉదయం విజయవాడలో మార్క్సిస్టుల కేవి రమణారెడ్డి మీటింగు వుండింది. దానికి
నేను తప్పక వెళ్ళాలి. సాయంత్రం గుంటూరులో ఓ కొత్త అంబేడ్కరిస్టు సంఘం ఆరంభం.
అక్కడికీ పిలిచారు. ఆరోజు మధ్యాహ్నం
మామూలు ఎండగాలేదు. లైవ్ లో మెసేజ్ ఇస్తానని గుంటూరు వారిని కోరాను. వాళ్ళు
ఒప్పుకున్నారు. అలా గత ఆదివారం గడిచిపోయింది.
సభల్లో టాపిక్కు అనేది చాలా కీలకమైన అంశం. కొందరు
వక్తగా పిలుస్తారుగానీ టాపిక్ స్పెసిఫిక్ గా చెప్పరు. మనం వేదిక ఎక్కాక మైకు
ముందుకు వెళ్ళేటప్పుడు టాపిక్ అనుకోవాలి. కొందరు వాళ్ళేదో కొత్త టాపిక్ చెప్పి
“అది మీకు కొట్టిన పిండేనండి” అంటారు. ఒకే టాపిక్కును మళ్ళీమళ్ళీ మాట్లాడడం అంత
బావుండదు. కొత్త అంశాలు కొన్నయినా జోడించాలి. దానికి తప్పక కొత్త అధ్యయనం కావాలి.
నాతోపాటు
వేదికను ఎవరు పంచుకుంటున్నారు అనే విషయం మీద
నాకు ఎప్పుడూ ఎలాంటి పట్టింపులూ లేవు. కొందరికి ఈ విషయంలో చాలా పట్టింపులు
వుంటాయి. నాకు బాగా సీనియర్ అయినా ఓకే; బాగా జూనియర్ అయినా ఓకే. కెప్టెన్ ఏ ఆర్డర్ లో పంపినా మన బ్యాటింగ్ మనం కఛ్ఛితంగా
చేయాలి. అదొక్కటే రూలు.
ఎంత
సమయం మాట్లాడాలి? ఏఏ అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి? వినేవారు ఎవరూ? వంటి
అంశాలను మాత్రం నేను ముందుగా తెలుసుకుంటాను. వినేవాళ్ళు విద్యాధికులయితే కొంచెం
ఇంటెలెక్యూవల్ స్టఫ్ జోడిస్తాము. వినేవాళ్ళు సామాన్య కర్షక-శ్రామికులు అయితే కొంచెం
భావోద్వేగ అంశాలను జోడిస్తాము. ఒకే
సమావేశంలో ఈ రెండు సమూహాలు వుంటే మాత్రం
నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టినట్టే.
ప్రసంగానికి
ప్రయాణ ఖర్చులు కూడ ఇటీవల చాలా ముఖ్యమైన కాంపోనెంట్ గా మారింది. కొందరు ప్రయాణ
ఖర్చులు ఇస్తున్నారు. కొందరు ఇవ్వడంలేదు. 1970లలో రైళ్ళల్లో టికెట్టు
లేకుండానే ప్రయాణం చేసేవాళ్లం. అరుగుల
మీదో, రోడ్ల పక్కన చెట్లకిందో, గొడ్ల సావిట్లోనో పడుకునేవాళ్ళం. ఆరుబయట ఇసుకలోనో,
ఒక్కోసారి కోళ్ళ ఫారంలోనో పడుకున్న సందర్భాలున్నాయి. నాకు ఉబ్బసం వుంది. తరువాత అది ఎంత బాధపెట్టేదో
చెప్పలేను.
ఇప్పుడు
కాలం మారిపోయింది. మరోవైపు, ఆరోగ్య నిబంధనలు వచ్చాయి. వాటిని కఛ్ఛితంగా పాటించాల్సి
వస్తున్నది.
విజయవాడ
నుండి ఉత్తరం, దక్షణం, పడమర ఏ దిక్కున
పోవాలన్నా వోల్వో ఏసి బస్సు చార్జీలు వెయ్యి నుండి 12 వందల రూపాయలు వరకు వున్నాయి.
రానూ పోనూ 2500. క్యాబ్ తదితర ప్రయాణ ఖర్చులు ఇంకో 500 రూపాయలు. ఇదిగాక హొటల్
వసతి, భోజన ఖర్చుల కోసం నిర్వాహకులకు సులువుగా 1500 - 2000 రూపాయలు అవుతాయి.
నాలుగున్నర వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎవరికైనాసరే అది
కఛ్ఛితంగా పెద్ద భారమే.
అలాగే
వక్త కూడ కొన్ని భారాలుంటాయి. ఒక
ప్రసంగానికి ప్రయాణ సమయం రానూపోనూ రెండు రోజులు. అధ్యయనం కోసం కనీసం ఓ మూడు రోజులు
కేటాయించాలి. వెరసి ఐదు రోజుల వ్యవహారం.
ఇంత
ఖర్చు, ఇంత సమయం వున్నాయి కనుక ప్రసంగాలను నేను కొంచెం సీరియస్ వ్యవహారంగా భావిస్తాను.
ప్రసంగానికి సిధ్ధంకావడానికి కనీసం 15 రోజుల వ్యవధి వుండాలంటాను. ముందు ప్రసంగం రాసుకుని సమయాన్ని సరిచేస్తాను.
ప్రసంగ పాఠాన్ని నిర్వాహకులకు రెండు మూడు రోజుల ముందే పంపిస్తాను. తప్పులు, తొలగింపులు,
తగిలింపులు వాళ్ళు సూచిస్తారు. ఆ తరువాత ఫైనల్ కాపీ తయారవుతుంది. ప్రసంగించడానికి ఒక
అరగంట ముందు దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాను.
చేతికి
మైకు ఇచ్చారు గనుక నోటికి వచ్చింది మాట్లాడేయడం అనేది నాకు నచ్చదు. ఇంత వ్యవహారం
కుదరదు అనుకున్నప్పుడు డేట్లు కుదరవు అని ఒక అబధ్ధం చెప్పి తప్పించుకోక తప్పదు.
అంచేత చాలా వాటికి క్షమించాలి డానీని.
నన్ను
పిలిచినప్పుడు నా ప్రసంగానికి ఇంత సమయం ఇవ్వాలని ఎవర్నీ ఇప్పటి వరకు అడగలేదు. గంట
క్లాస్ చెప్పాలన్నాఓకే. కేవలం రెండు నిముషాల సందేశం ఇవ్వాలన్నా ఓకే.
సాహిత్య
సభలు హైదరాబాద్ లో అరగంట ఆలస్యంగా మొదలవుతాయి. విజయవాడ, విశాఖపట్నంలో గంట ఆలస్యంగా
మొదలవుతాయి. గుంటూరులో గంటన్నర ఆలస్యంగా మొదలవుతాయి. ఫలితంగా అధ్యక్షులవారికి కార్యక్రమాన్ని కుదించక తపదు. కానీ, 30 నిముషాల
ప్రసంగానికి సిధ్ధమయి వెళ్ళీన వక్త దాన్ని హఠాత్తుగా 10 నిముషాలకు కుదించుకోవడం
అంత సులువైన వ్యవహారంకాదు. సినిమాలకు స్క్రీన్
ప్లే వున్నట్టు ఉపన్యాసానికి కూడ ఒక ఆర్డర్ వుంటుంది. అది పాడైపోతే ఉపన్యాసం రక్తికట్టదు.
ఎంతైనా ఉపన్యాసం కూడ ఒక కళేకదా!
నేను
వక్తను కాకపోయినా నాకు నచ్చినవారు ప్రసంగించే మీటింగులకు వెళుతుంటాను. ఇటీవల అక్కడా
కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సభికుల్లో నన్ను చూసి సభాధ్యక్షులు వేదిక మీదికి
పిలుస్తున్నారు. హఠాత్తుగా ప్రసంగించేయగల సమర్ధుడ్నికాను నేను. పైగా షెడ్యూలులో
లేకుండా వేదికనెక్కి ప్రసంగిస్తే, నేను తీసుకున్న సమయం ఇంకో వక్త ఎవరికో కోత
పడుతుంది. అది చాలా బాధ.
కొన్ని
ఎమర్జెన్సీ వ్యవహారాలుంటాయి. శ్రీశ్రీ విశ్వేశ్వర రావు, సామాజిక పరివర్తనా కేంద్రం
దుర్గం సుబ్బారావు నా పబ్లిషర్లు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా నిబంధనల్ని సడలించి
వెళ్ళక తప్పదు. ఇందులో విశ్వేశ్వర రావు మార్క్సిస్టు, దుర్గం సుబ్బారావు ఫూలే- అంబేడ్కరిస్టు. ఈ రెండు
శిబిరాల్లోనూ నేను ఒకేలా వుండగలను.
ఇది
1982 నాటి ఫొటో. విజయవాడ ప్రెస్ క్లబ్ లో చలసాని ప్రసాద్ తో నేను. ఆ రోజుల్లో మీటింగుల్ని
మేము 30-40 రూపాయల్లో జరిపేసేవాళ్ళం.
ఫొటో
కర్టెసీ – vmrg Suresh
Thursday, 27 March 2025
Does Hindutva suits 'fascism'?
Does Hindutva suits 'fascism'?
*హిందూత్వకు
‘ఫాసిజం’ నప్పుతుందా?*
ఈరోజు ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం.
చదివి అభిప్రాయం చెప్పండి. విమర్శల్ని కూడ ఆహ్వానిస్తున్నాను.
ట్రోల్ మాత్రం వద్దు.
*డానీ
సమాజ
విశ్లేషకులు*, 9010757776
కమ్యూనిస్టు
పార్టి ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం ముసాయిదా కేంద్ర
ప్రభుత్వాన్ని “నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది” అని పేర్కొనడంతో ఫాసిజం,
నయా-ఫాసిజం, నాజిజంల మీద మేధోరంగంలో ఒక కొత్త చర్చ మొదలయింది.
నేరుగా ‘ఫాసిస్టు’ అనకుండా ‘కొత్త ఫాసిస్టు స్వభావం’ అనడాన్ని జాతీయ కాంగ్రెస్ తో
పాటు సిపిఐ సహితం సిపిఎంను తప్పుపడుతున్నాయి.
ఇతరులు ఛాందసం అనుకున్నాసరే భూస్వామ్య సమాజానికి తనకంటూ కొన్ని విలువలు వుంటాయి.
పెట్టుబడీదారీ వ్యవస్థకు లాభాలే ముఖ్యం. అదే దాని సంస్కృతి; అదే దాని విలువ. లాభం
వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళ్ళను సహితం పెట్టుబడీదారులు అమ్మకానికి
పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి, పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి
నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. విస్తరించిన మార్కెట్ డిమాండును అందుకోవడానికి
మళ్ళీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి. ఇది ఒక విధంగా పులి మీద స్వారీ లాంటిది.
ఎక్కడా ఆగడానికి వీల్లేదు. ఆగితే అక్కడే ఖేల్ ఖతం.
గతంలో సెల్ ఫోన్ల మార్కెట్ ను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రి, మోటరోలా బ్రాండ్లు
ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ ఫిషర్
ఏయిర్ లైన్స్, కొడాక్ కెమేరాలు, సోనీ వాక్ మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు.
పరుగు ఆపేస్తే మహామహా బ్రాండ్లు కూడ అలా అంతమైపోతాయి.
తమ
ప్రాచూర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడీదారులు
ఏమైనా చేయగలరు. ఏ వేషం అయినా వేయగలరు. ఒక దశలో అత్యంత ఆధునికులుగా,
హేతువాదులుగా, మతరహితులుగా దర్శనమిస్తారు. ఇంకో దశలో జనాన్ని పెద్ద సంఖ్యలో
కదిలించడానికి మతం పనికివస్తుంది అనుకుంటే వాళ్ళే సమాజంలో ఛాందసాన్ని
మూఢనమ్మకాలను పెంచిపోషించడం మొదలెడతారు.
ఈ మార్కెట్ లక్షణాలు తెలియని చాలా మంది భూస్వామ్యంకన్నా పెట్టుబడీదారులు
మెరుగయినవారు అనుకుంటుంటారు. అది తప్పు అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది.
ఇప్పుడు భారీ పెట్టుబడీదారులు (వీరినే మనం మెగాకార్పొరేట్లు అంటున్నాం) తమ లాభాల
కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించి తద్వార తమ
అనుకూలుర్ని ఎన్నికల్లో గెలిపించుకుని అధికార పీఠం మీద కూర్చొబెట్టి వారి
ద్వార తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.
ఇక్కడ మనకు కనిపించేది ఒకటి; జరిగేది మరొకటి. ఎన్నికల ద్వార పరిపాలనాధికారాన్ని
చేపట్టినవాళ్ళు కార్పొరేట్ల సంపదను పెంచుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది.
నిజానికి తమ సంపదను పెంచుకోవడానికి కార్పొరేట్లే తమ అనుకూలుర్ని పరిపాలన పీఠం మీద
కూర్చో బెట్టుకుంటారన్న సత్యం సాధారణ దృష్టికి కనిపించదు. మన వర్తమాన వ్యవస్థను
సాంకేతికంగా కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal
Dictatorship - CCD) అంటేగానీ తత్త్వం
బోధపడదు.
కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం అనే మాట నిస్సందేహంగా క్లిష్టమైనది.
తెలుగువాళ్లకెందుకో కొత్త పదాల మీద ఒకరకం అసమ్మతి వుంటుంది. ఆక్స్ ఫర్డ్
తదితర ఇంగ్లీషు నిఘంటువుల్లో ఏడాదికి వెయ్యి నుండి రెండు వేల కొత్త పదాలను
చేరుస్తుంటారు. మనకు ఆ సాంప్రదాయం లేదు. తమిళులకు అలాంటి సాంప్రదాయం వుంది. అలాంటి
ఏర్పాటు మనకు ప్రభుత్వ పరంగానూలేదు; స్వఛ్ఛందంగానూ లేదు. పాత పదాలు కొత్త అర్ధాలను
ఇవ్వవు. కొత్త పదాల్ని మనం ఒక పట్టాన అంగీకరించము. అంచేత మనకు కొత్త జ్ఞాన
సూక్ష్మాలు ఒక పట్టాన అబ్బవు.
ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు వున్నట్లే నచ్చని వారూ
వుంటారు. నచ్చనివారు దీన్ని ఫాసిస్టు అంటున్నారు. ఆ మాటను కాంగ్రెస్సూ అంటున్నది;
కమ్యూనిస్టులు అంటున్నారు.
ఫాసిజం
ఇటాలియన్ పదం. అది ముస్సోలిని నియంతృత్వాన్ని విమర్శించడానికి ఇటలీ
కమ్యూనిస్టులు పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అదికాదు.
ముస్సోలిని సగర్వంగా తనకుతానుగా పెట్టుకున్న పేరు అది. ‘ఫాసియో’ అంటే ఇటలీ భాషలో
కట్టెల మోపు అని అర్ధం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ
అని పేరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్ధం. బిజెపి కూడ
తొలి రోజుల్లో జాతిపిత పేరున గాంధేయ సోషలిజం అనేది. హిట్లర్ పార్టి పేరు నేషనల్ సోషలిస్టు
జర్మన్ వర్కర్స్ పార్టి.
ఫాసిజం,
నాజిజం రెండూ నియతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి.
ఆరెస్సెస్ వ్యవస్థాపకులైన హెడ్గేవార్ మీద ఫాసిస్టు ముస్సోలినీ ప్రభావం వుండింది.
రెండవ సర్సంగ్ ఛాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ నాజీ హిట్లర్ ను ఎక్కువగా
అభిమానించేవారు. ‘ఆర్యజాతి ఔన్నత్యం’, ‘మతమైనారిటీ సమూహాల నరమేధం’ వగయిరాలు
వారికి తెగనచ్చాయి. స్వఛ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో వారు రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్లర్
తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ
ఫాసిజంలో మైనారిటీ మత సమూహాలను అణిచివేయాలనే అంశం లేదు; కనీసం మొదట్లో లేదు.
జర్మనీ నాజిజంలో యూదు నరమేధం పెద్ద ఎత్తున వుంది. హిట్లర్ కాన్సెంట్రేషన్
క్యాంపులు పెట్టాడు; మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇండియా
ప్రభుత్వ స్వభావానికి ఫాసిజంకన్నా నాజిజమే దగ్గరగా వుంటుంది.
ఇటలీలో
ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మనదేశంలోనూ
సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరును ఇష్టంగా పెట్టుకుంది. చాలా మందికి మతానికీ,
మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకు తేడా తెలీదు. మతం అంటే దేవుని
మీద విశ్వాసం. మతతత్త్వం అంటే ఇతర మతస్తుల మీద అసహనం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం
రాజకీయార్ధిక వ్య్వహారం.
అతివాద
హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది
1922లో ఘనంగా ‘హిందూత్వ’ అనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ
అన్నప్పుడు తమని నిందిస్తున్నారని సాధారణ హిందువులు అపోహపడితే తమ ఉనికికి ముప్పు
వస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి. మెజారిటీ మతతత్త్వ నియంతృత్వాన్ని
సంభోదించడానికి కొందరు ‘బ్రాహ్మణీయ’ ‘కాషాయ’ అనే పదాలను వాడుతున్నారు.
బ్రాహ్మణులు, కాషాయాంబరధారులు అందర్నీ నియంతల భక్తుల జాబితాలో వేయడం తప్పు. దానివల్ల
నియంతృత్వాన్ని వ్యతిరేకించేవారికి మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది.
ఇండియా
కమ్యూనిస్టు పార్టీల్లో మొదటి నుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడిత
మతసమూహాలు పీడక మతసమూహాలు వుంటారని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల
పక్షాన వుంటామని ప్రకటించాల్సివుంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి
వెళ్ళిపోతుందని వాళ్ళ భయం. మతవ్యవస్థలో పీడితులపక్షం వహించలేవు; పీడకులపక్షం
వహిస్తామని చెప్పుకోలేవు. ఇలాంటి ఇరకాటం నుండి బయటపడడానికి మతంలో వర్గ లేదని
చాలాకాలం బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం,
లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి. ప్రతిదేశంలోనూ పాలకమతం
వున్నట్టే పాలితమతం కూడ వుంటుంది.
నిజ
జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం అనేది
మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీనితో పాటు ఉపరితలం కూడ వుంటుంది.
రెండూ విడిగా వుండవు. పునాది ఉపరితలాల్లో ప్రధానమైది నిస్సందేహంగా పునాదే. దాని
అర్ధం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో వుంటూ,
ఒకదాన్నిమరొకటి నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. సాంకేతిక భాషలో చెప్పాలంటే, పునాదీ
ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో వుంటాయి.
గడిచిన
ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18-22
తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన సిపిఐ-ఎం 22వ మహాసభల్లో "నిరంకుశ, హిందూత్వ
సాగిస్తున్న మతతత్త్వ దాడులు ముందుకు తోసుకుని వస్తున్న ఫాసిస్టు ధోరణులను
ప్రదర్శిస్తున్నాయి" అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6-10 తేదీల్లో కన్నూర్
లో జరిగిన సిపిఐ-ఎం 23వ మహాసభల్లో " ఆర్ ఎస్ ఎస్
ఫాసిస్టిక్ ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నది"అని పేర్కొన్నారు.
2025 ఏప్రిల్ 2-6 తేదీల్లో మధురైలో జరుగనున్న సిపిఐ-ఎం 24వ మహాసభల ముసాయిదా
తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు. "మితవాద హిందూత్వ
ఎజెండాను ముందుకు తీసుకుని పోవడానికీ, ప్రతిపక్షాలనూ, ప్రజాస్వామ్యాన్నీ
అణగదొక్కడానికీ అనుసరిస్తున్న నియంతృత్వ పధ్ధతులు నయా- ఫాసిస్టు స్వభావాన్ని
వ్యక్తం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. ఇంత డొంక తిరుగుడు లేకుండా
స్పష్టంగా ‘ఫాసిస్టు’ అనవచ్చుగా అని కాంగ్రెస్ సిపిఐ అసంతృప్తిని వ్యక్తం
చేస్తున్నాయి.
1970ల
నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరా
గాంధీని ‘హిట్లర్’ అని నేరుగా విమర్శించేవారు. జయప్రకాశ్ నారాయణ, అటల్
బిహారీ వాజ్ పాయి, జార్జ్ ఫెర్నాండెస్, మురార్జీ దేశాయి, ఎల్ కే అద్వానీ, నానీ
ఫాల్కీవాల తదితరులు ఆమెను అలా విమర్శించినవారి జాబితాలో వున్నారు.
ఇప్పటి
కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా
వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయే మహాసభల్లో సిపిఐ-ఎం
నాయకత్వం దానికి వివరంగా సమాధానం చెప్పవచ్చు.
రచన
: 09-మార్చ్ 2025
ప్రచురణ
: ఆంధ్రజ్యోతి, 27 మార్చి 2025
https://www.andhrajyothy.com/2025/editorial/is-hindutva-fascilism-a-new-debate-in-politics-1385963.html
Friday, 14 March 2025
Socialist Society? or Welfare State?
సాక్షి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించగలరు
*సమసమాజమా? సంక్షేమ రాజ్యమా?*
*డానీ*
సమాజ విశ్లేషకులు. 9010757776
సామ్యవాద
సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను
ఎంచుకున్నాయి. మొదటిది; సాయుధ పోరాటం. రెండోది; పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల
నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చుగానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి.
“దేశాలు స్వాతంత్ర్యాన్ని,
జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు”
అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లాడేవి. ఇప్పుడు ఆ
పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడంలేదు.
ఇది నేటి వాస్తవస్థితి. దీనికి కారణం ఆయా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే
చర్చలవల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది.
జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి.
సోషలిస్టు
కలను సాకారం చేసుకోవడానికి అభిమానులు వందేళ్ళు ఎదురుచూడడమే మహత్తర విషయం. దీర్ఘకాల
పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి
కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమసమాజం
కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్పురించే
సమాధానం సంక్షేమరాజ్యం.
నార్డిక్
దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్ లాండ్ లు సంక్షేమ దేశాలని
చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్ లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం,
స్విడ్జర్లాండ్ కూడ తమవైన పధ్ధతుల్లో సంక్షేమరాజ్యాలని బయటికి అంతగా తెలీదు.
వీటిల్లో జర్మనీ రాజకీయార్ధిక పరిణామాలతో ఇండియాకు చాలా దగ్గరి పోలికలున్నాయి. జర్మనీ చరిత్రలో కొనసాగిన రాజకీయ దశలన్నీ కొంచెం ముందువెనుకగా ఇండియాలోనూ సంభవించాయి.
మొదటి
ప్రపంచ యుధ్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’
ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్
సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టి’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్
మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ట రూపం
నాజీజం. రెండవ ప్రపంచ యుధ్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ
‘మిత్రరాజ్యాల’ ఆధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరిక, రష్యాలు
చెరో భాగాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నాయి.
ఓ
నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరిక, యూకే,
ఫ్రాన్స్ ల ప్రాబల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ఫెడడల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ
(ఎఫ్ ఆర్ జి)గా అవతరించింది. అదే ఏడాది
అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్
(జిడిఆర్)గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడీదారీ దేశంగానూ, తూర్పు
జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పుకునేవారు.
కారణాలు
ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ
జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు
చేసి 1961 ఆగస్టు నెలలో అడ్దంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి
‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జిడిఆర్ నుండి
వలసలు ఆగలేదు. హంగేరి, జకోస్లోవోకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరుకోవడం
మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు
జర్మనీతోపాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమానియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోషలిస్టు
పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్
గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న
తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి.
రెండు
జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడీదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్ధం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు
ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన
ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్నప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు,
పెట్టుబడీదారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మని ఇప్పుడు పశ్చిమ యూరప్ లో ఒక మెరుగయిన సంక్షేమ
రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా జర్మనీ స్థూల జాతియోత్పత్తులు కూడా దాదాపు సమానం.
ఇప్పటి
ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త
ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ ఒక చర్చ సాగుతోంది. అదీగాక, మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ
నియంతృత్వం కొనసాగుతోందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. దేశంలోని సహజవనరుల్ని,
మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర
విస్తాపన సాగునుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టి
ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ
పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా
వుంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.
రచన : 15 మార్చి 2025
ప్రచురణ : సాక్షి దినపత్రిక, 24 మార్చి 2025
Wednesday, 12 March 2025
అన్యవర్గ భావజాలం !!!
అన్యవర్గ భావజాలం