Tuesday 31 July 2018

The slogan of Muslims – Communal Harmony

సామరస్యం ముస్లింల నినాదం
-        డానీ
భారత ఉపఖండంలో మతతత్త్వశక్తులు ముస్లిం వ్యతిరేక విషబీజాలను జాతియోద్యమ కాలంలోనే బలంగా నాటాయి. ఇటలీ, జర్మనీ దేశాల్లో 1920-40ల మధ్య కొనసాగిన ఫాసిస్టు, నాజీ భావజాలం దీనికి ప్రత్యక్ష అంతర్జాతీయ ప్రేరణ. ఆ విషబీజాలు విషవృక్షాలుగా మారి దేశ విభజనకు దారితీసింది.
భారత ఉపఖండంలో 1947లో  జరిగింది భౌగోళిక విభజనేగానీ మత విభజనకాదు. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ భూభాగంలో నివశిస్తున్న ముస్లింలేకాక, ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళిన ముస్లింలను కూడా కలుపుకున్నా భారతదేశాన్ని తమ మాతృభూమిగా విశ్వసించి ఇక్కడ వుండిపోవడానికీ, ఈ నేల మీద చనిపోవడానికీ నిర్ణయించుకున్న ముస్లింలే ఎక్కువ. ఈనాటికీ పాకిస్తాన్ జనాభాకన్నా భారత ముస్లింల జనాభా ఎక్కువ.
అయితే, దేశవిభజనను సాకుగా చూపెట్టి ముస్లింలను దోషులుగా చిత్రించడం మతతత్త్వశక్తులకు సులభం అయింది. బీజేపి అగ్రనేత లాల్ కిషన్ అడవాణిజీ  1990లో చేపట్టిన సోమనాథ్-అయోధ్య రామ్ రథయాత్రతో దేశంలో మతతత్త్వశక్తుల ఏకీకరణ  మొదలయింది. 2014లో నరేంద్రమోదీ – అమిత్ షాల జోడీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టడంతో  మతతత్త్వశక్తుల విజృంభణ దశ ఆరంభమయింది.
దైవభక్తులకు మతతత్త్వశక్తులకు రూపంలో ఒక అనుబంధం వున్నట్టు కనిపించినా సారాంశంలో ఎలాంటి సంబంధంలేదు. ఆ రెండు సమూహాలు పరస్పర విరుధ్ధమైనవి.  దైవభక్తులది అమాయకపు ధార్మిక చింతన మాత్రమే; మతతత్త్వశక్తులది ప్రరాళికబధ్ధ రాజకీయార్ధిక కుట్ర.
దేశ ప్రజలకు దేశ సహజ వనరుల మీద వుండే సహజ హక్కును నిరాకరించి ఆ సంపదను  కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం మతతత్త్వశక్తుల ప్రధాన ఆర్ధిక  కార్యక్రమం. చేతిలో రాజకీయాధికారంలేకుండా ఈ పనిని అవి చేయలేవు. అంచేత, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవి మెజార్టీ మత సమూహాన్ని ఒక కవచంగా వాడుకుంటాయి.
మతతత్త్వశక్తులు అవలంభించే ఆర్ధిక విధానాలవల్ల దేశ సంపద అంతా కొన్ని కార్పొరేట్ల ఆధీనంలోనికి వెళ్ళిపోతూ వుంటుంది; మరోవైపు  దేశంలోని విశాల ప్రజానీకం నిరుపేదలుగా మారిపోతుంటారు. దీనితో, అత్యంత సహజంగానే మెజార్టీ మతంలోని సామాన్య ప్రజానీకం సహితం మతతత్త్వశక్తుల రాజకీయార్ధిక విధానాలను వ్యతిరేకించడం మొదలెడుతుంది. మొదట్లో ఆదివాసీలు, దళితులు తిరగబడతారు. క్రమంగా పెత్తందారీ కులాల్లోని సామాన్య ప్రజలు, ఆ తరువాత  పాలకవర్గంగా భావించే బ్రాహ్మణ-బనియా వర్ణాలలోని నిరుపేదలు సహితం తిరుగుబాటు బాట పడతారు.
ఇలా స్వీయ సామాజికవర్గమే తమ మీద తిరుగబడుతుందని మతతత్త్వశక్తులకు ముందుగానే తెలుసు. అలనాటి ఇటలీ, జర్మనీల్లో కూడా  ముస్సోలినీ, హిట్లర్ ల  మీద స్వీయ సామాజికవర్గమైన క్రైస్తవ సమూహం సహితం తిరగబడింది. ముస్సోలినీని తుపాకితో కాల్చి, ఒంటిమీద తోలు తీసి బహిరంగ ప్రదేశంలో కొక్కేలకు వేలాడగట్టింది. హిట్లర్ నూ అదే కుక్కచావు వెంటాడింది. వేగంగా సమీపిస్తున్న చావును చూసి భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
మొత్తం దేశ సంపదను కొన్ని మెగా కార్పొరేట్లకు కట్టబెట్టే తమ విధానాల మీద స్వీయసామాజికవర్గం నుండి సహితం వ్యతిరేకత వస్తుందని మతతత్త్వశక్తులకు ముందే తెలుసు. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవి మెజార్టి మతసమూహాన్ని ముందుగానే మైనారిటీ మతసమూహం మీదికి ఉసి గొల్పుతాయి. మైనారిటీ మతసమూహం వుండడంవల్లే దేశంలోని మెజార్టి మతసమూహం పేదరికంలో వుంటున్నదనే వాదన మొదలు, అసలు మైనార్టీల మతాలవల్ల మెజారిటీ మతమే అంతరించిపోతున్నది అనేంత వరకు ఆ బూటకపు ప్రచారం సాగుతుంటుంది. దీనితో దేశంలో మెజారిటీ మతసమూహంలోని సామాన్య ప్రజానీకం ఒక అసహనానికి గురవుతుంది. తమ మీద సాగుతున్న ఆర్ధిక అణిచివేతకు కారణమయిన  మతతత్త్వశక్తుల మీద తిరుగుబాటు చేయాల్సిన సమయంలో, మెజారిటీ  మతసమూహంలోని సామాన్య ప్రజానీకం,  మైనార్టీ మత సమూహం మీద వ్యతిరేకతను పెంచుకుంటుంది.  ఇది సహజంగానే మైనార్టీ మత సమూహానికి ప్రాణసంకటంగా మారుతుంది.
అసహన వాతావరణానికి బలయిపోతున్న మైనార్టీ మత సమూహంలోని  కొందరు నిరాశ నిస్పృహ  మనోవైఫల్యం (Frustration), పిరికితనాలతో  కొన్ని ప్రతిదాడులు చేస్తారు. అదే మైనారిటీ ఉగ్రవాదం. ఏ దేశంలో అయినా మెజారిటీ ఉగ్రవాదానికి ప్రతిచర్యగానే మైనారిటీ ఉగ్రవాదం పుడుతుంది. అయితే, ప్రచార మాధ్యమాలు మొదలు వున్నత న్యాయస్థానాల వరకు మైనారిటీ ఉగ్రవాద చర్యల్ని  కప్పిపుచ్చి వాటికి ప్రతిచర్యగా సాగే మైనారిటీ ఉగ్రవాద చర్యల్ని మాత్రమే ప్రచారం చేస్తాయి.  దేశ సహజవనరుల్ని కొల్లగొట్టి అత్యంత సంపన్నుడుగా మారిన ముఖేష్ అంబానీ యే ఇప్పుడు దేశంలో అత్యంత భారీ మీడియా సంస్థకు  అధినేతగా మారినపుడు మీడియా ‘మోడియా’గానే వ్యవహరిస్తుంది.  
భౌతికశాస్త్రంలో చర్యకు ప్రతిచర్య వుంటుందనే సిధ్ధాంతం సమర్ధనీయం కావచ్చేమోగానీ సమాజశాస్త్రంలో మెజార్టీ ఉగ్రవాదానికి మైనార్టీ ఉగ్రవాదం ప్రతిచర్య అనే సిధ్ధంతం ఎన్నడూ సమర్ధనీయంకాదు. ఉగ్రవాదం మైనారిటీలను ఆత్మవినాశనానికి దారితీస్తుంది. మైనార్టీ మత సమూహం నిరంతరం మతసామరస్యం,  ప్రజాస్వామిక సాంప్రదాయాలు విలువలకే కట్టుబడివుండాలి. ప్రజాస్వామిక వ్యవస్థకు నాలుగు మూల స్థంభాలయిన న్యాయ, శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలన్నీ పూర్తిగా కలుషితమైపోయిన యుగంలో మతసామరస్యం,  ప్రజాస్వామిక విలువల పునరుధ్ధరణకు పూనుకోవడం దుస్సాహసంగానే కనిపిస్తుంది.  కానీ, ఆ లక్ష్యం కష్టసాధ్యమేగానీ  అసాధ్యం ఏమీకాదు.
మతసామరస్యం అనేది సమాజంలో కొందరికి  ఇష్టము, అభిమానము, తపన, సరదా వగయిరాలు కావచ్చు కానీ మైనార్టీలకు అది జీవికను  కాపాడుకునే ఏకైక మందు;  అసహనంతో రగిలిపోయే సమాజానికి అందుబాటులోవున్న ఏకైక చికిత్స. మతసామరస్యం మైనార్టీల నినాదం; మతతత్త్వ శక్తులతోనే వారికి వివాదం. వర్తమాన భారత ముస్లింలకు రెండే కర్తవ్యాలు; మతసామరస్య ఆరాటం; మతతత్త్వశక్తులతో పోరాటం.
దేశంలో మతతవశక్తులతో పోరాడేవాళ్ళు ముస్లింలు ఒక్కరేకాదు. క్రైస్తవులు, శిక్కులు, ఆదివాసీలు, దళితులు, బహుజనులు, సామ్యవాదులు, సౌమ్యవాదులు, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, లౌకికవాదులు, మానవహక్కులు-పౌరహక్కుల కార్యకర్తలు సహితం తమతమ పరిధుల్లో మతతవశక్తులతో పోరాడుతూనే వుంటారు. వాళ్లందరి మధ్య అనేక విబేధాలూ వుంటాయి. ఆ విబేధాలకు దూరంగా అందర్నీ కలుపుకునిపోవడం, అందరితో కలిసి పనిచేయడం ముస్లింల చారిత్రక కర్తవ్యం.
అయితే, సామాజిక రంగంలో ప్రజాసంఘాలతో కలిసి పనిచేసినంత సులువుకాదు రాజకీయరంగంలో పని చేయడం. ప్రజాసంఘాలు కార్యక్రమాలు,  విధానాల ప్రాతిపదికగా కలిసి పనిచేస్తుంటాయి. రాజకీయ పార్టీల కలయికకు  కార్యక్రమాలు, విధానాలకు మించి రాజ్యాధికారం అనేది ఒక కీలక అంశంగా వుంటుంది. అందువల్ల, ఒకే రకమైన ఆశయాలు, విధానాలున్న రాజకీయ పార్టీలు సహితం కలిసి పనిచేయకపోగా పరస్పరం  శత్రువర్గాల్లా పోటీ పడుతుంటాయి.
అయితే, మైనార్టీ ప్రజాసంఘాలకు తమదైన ఒక స్పష్టమైన కొలమానం వుండాలి. ముందుగా ఎవరితో ఘర్షణ,  ఎవరితో ఐక్యత తేల్చుకోవాలి. మతతత్త్వశక్తుల రాజకీయ పార్టీలతోపాటూ ఎన్నికల్లో వారితో పొత్తులు పెట్టుకునే రాజకీయ  పార్టీలతో కూడా రాజకీయాల్లో మైనార్టీలకు ఘర్షణ వుంటుంది; వుండాలి. కానీ, ఏ రాజకీయ పార్టీతో ఐక్యత వుండాలి అనేది   అంత సులువుగా తేలే వ్యవహారంకాదు. ఇది ముస్లిం ఆలోచనాపరుల్లో వ్యూహకర్తలు లేకపోవడవల్ల తలెత్తిన సమస్యకాదు; రాజకీయ పార్టీల్లో విధానపరమైన నిజాయితీ లేకపోవడంవల్ల కొనసాగుతున్న సమస్య.  మతతత్త్వశక్తుల రాజకీయ పార్టీలతో ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జతకట్టని పార్టీ పార్లమెంటరీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో దాదాపు లేదు. కుళ్ళిపోయిన టమాటాల బుట్టలోంచి సగమైనా బాగున్న కాయల కోసం  వెతుకులాట తప్పదు.  
( రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ : 9010757776

రచన : విజయవాడ, 18 జులై 2018
ప్రచురణ : మనతెలంగాణ, 31 జులై 2018

Sunday 22 July 2018

మూకోన్మాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు.


హైదరాబాద్
23 జూలై 2018
మతవిశ్వాసులు శ్రీరాముడినీ, శ్రీ కృష్ణుడినీ కొలుస్తారు.
మూకోన్మాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు.

మిత్రులు దివికుమార్ గారికి, 
రామాయణం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న వివాదం మీద మీ రెండు కరపత్రాలు అందాయి. వాటిని నాకు పంపించినందుకు ధన్యవాదాలు.
ప్రపంచమంతటా 18వ శతాబ్దం ఆరంభం వరకూ  దాదాపు అన్ని దేశాల్లోనూ మతమూ, రాజకీయార్ధిక ప్రయోజనాలు కలిసిపోయే వుండేవి. వాల్టేర్ – రూసోలు రంగ ప్రవేశవేశం చేసి వాటిని విడగొట్టారు. మతం, రాజకీయార్ధికం విడిగా వుండడం ఆధునిక భావనలు గా ఇంత కాలం కొనసాగాయి.
అయితే, గొప్పగా ప్రచారం అయిన ఆధునిక భావనలు సహితం సహజవనరుల్ని శూద్రుల నోరుకొట్టి అగ్రవర్ణాలకో, పెత్తందారీ కూలాలకో కట్టబెట్టడం అనే పాత రాజకీయార్ధిక ప్రయోజనాలనే సాధించాయి. అంతకు మించి జరిగింది ఏమీలేదు. దీనికి, హేతువాదులు, నాస్తికులు వర్గ దృక్పశాన్ని నిరాకరించడం ఒక కారణమయితే, వర్గ దృక్పథంగల కమ్యూనిస్టులు భారత సమాజపు ప్రధాన అస్తిత్వమయిన కులాన్ని గుర్తించ నిరాకరించడం  ఇంకో కారణం. అంచేత ఆధునిక భావనలకు 1980ల వరకు వున్న ప్రజాదరణ, విశ్వాసం, ఆమోదాంశం ఇప్పుడు అంతరించిపోయింది. ఆలోచనాపరులు అందరూ  ముందు ఈ వాస్తవాలని గుర్తించాలి.
రాజ్యం గతంలో 85 కాకుల్ని కొల్లగొట్టి 15 గద్దలకు పెట్టేది. ఇప్పుడు ఆశ అత్యాశ దశను దాటి దురాశ దశకు చేరుకుంది. కొల్లగొట్టి కట్టబెట్టే ధర్మం వుధృతి బాగా పెరిగింది. కాకుల సంఖ్య పెరిగింది. గద్దలు సంఖ్య తగ్గింది. ఆక్స్ ఫాం నివేదిక సారాంశం అదే.  దేశంలోని సహజవనరులన్నింటినీ ఆడానీ – అంబానీ తదితర మెగా కార్పొరేట్లకు  కట్టబెట్టేయడానికి   రాజ్యం సిధ్ధమైంది. అమరావతిలో ‘అన్న భోజనం’ పథకం ఏమిటీ? అందరి సంపదను పెంచుతామని నిర్మిస్తున్న రాజధానిలో  పేదల సంఖ్య పెరుగుతున్నదనడానికి  ఇంతకన్నా రుజువు ఏంకావాలీ?
 దేశ జనాభాలో అత్యధికులుగావుంటున్న అణగారిన సమూహాలు ఈ దౌర్జన్యాన్ని ఒప్పుకోవు. వాళ్లను తట్టుకోవడానికీ ఇంతటి అన్యాయాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి   రాజ్యం మతాన్ని కవచంగా వాడుకొంటోంది. 
ఇక్కడే ఒక ధార్మిక విశేషం వుంది. సామాన్య ప్రజలు విశ్వసించేది మతాన్ని; రాజ్యం కవచంగా వాడుతున్నది మతతత్వాన్ని. మనం మతతత్వాన్ని విమర్శించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పదం తేడా వచ్చినా – రాజ్యంకన్నా ముందు -  సామాన్య ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతింటాయి. అంటే, మనం సామాన్య ప్రజల్ని రాజ్యం పక్షాన చేరేటట్టు చేస్తున్నామన్నమాట.
అంబేడ్కర్ హిందూమతాన్ని విమర్శించారు. కంచ ఐలయ్య వంటివారు తాము హిందువులం కాదని ప్రకటించుకున్నారు. దాని అర్ధం సాధారణ దళిత బహుజనులు హిందూమతానికి వ్యతిరేకంగా వున్నారని కాదు. ఆ సామాజికవర్గాల్లో అత్యధికులు ఇప్పటికీ హిందూ మత విశ్వాసులు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.
ఇక్కడ విమర్శలో భాషాపరమైన వివాదాలు కొన్నున్నాయి. “గుండేలేని మనిషల్లే నిన్ను కొండాకోనకు వదిలేశాడా?” అనడానికీ “దగుల్బాజీ” అనడానికీ “మీ నాన్నగారున్నారా? అనడానికీ నీ యమ్మ మొగుడు వున్నాడా? అనడానికీ వున్నంత తేడావుంది. ఇలాంటి దురుసు పదాలవల మనం మన సహజ మద్దతుదారుల్ని కోల్పోవడమేగాకుండా, మత విశ్వాసుల్ని మతోన్మాద శిబిరాలకు తరలించిన వాళ్ళమవుతాం.  
నిజానికి ఈరోజు మనం చెయ్యాల్సిన పని హిందూమతాన్ని విమర్శించడంకాదు; మతానికీ మతోన్మాదానికీ మధ్యనవున్న వైరుధ్యాన్ని సాధారణ ప్రజలకు వివరించడం. ఏ మత విశ్వాసులతో అయినా మనకు కలిగే నష్టం ఏమిటీ? ఇబ్బంది వున్నది నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలిచేవారితోనేగానీ, శ్రీరాముడినీ, శ్రీకృష్ణుడినీ కొలిచేవారితో మనకేమిటీ ఇబ్బందీ? 

మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. మతవిస్వాసులు, మూకోన్మాదులు-గోగ్రవాదులు ఒకటి కాదు. మతవిస్వాసులు శ్రీరాముడినీ, శ్రీ కృష్ణుడినీ కొలుస్తారు. మూకోన్మాదులు-గోగ్రవాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు. అందుకే వాళ్ళు స్వామి అగ్నివేశ్ వంటి ఉదారవాద స్వాముల మీద కుడా దాడులు చేస్తున్నారు. 
దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసులు, బహుజనులు మన దేశంలో అణగారిన సమూహాలు.  అణగారిన సమూహాల మధ్య సహజమైన ఐక్యత వుంటుంది. నా వరకు అయితే కారంచేడు ఉద్యమ కాలం నుండి మొదలయినా ఈ ఐక్యత ముస్లిం ఆలోచనాపరుల వేదిక, బహుజన ప్రతిఘటన వేదిక వరకు కొనసాగింది. ఈ భూమ్మీద ఎక్కడయినా సరే అణిచివేతను ఖండించాలనే ఒక సామాజిక విలువ కూడా ఈ ఐక్యత నుండి ఆవిర్భవించింది. రెండు దశాబ్దాల క్రితం వరకూ ట్రాన్స్ జెండర్స్ బాధల గురించి నాకు తెలీదు.; వాళ్ళ మీద గౌరవనీయమైన భావం కూడా లేదు. అయితే, మత మైనారీటీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే అభిప్రాయం నాలో బలపడేకొద్దీ, మైనారిటీ సెక్స్ మీద కూడా సదభిప్రాయం వుండాలనే ఆలోచన కలుగుతోంది.  
మనలోని మతతత్వాన్ని నిర్మూలించనంత వరకు  సమాజంలో ఇతరుల మతతత్వ నిర్మూలన కూడా జరగదని నాకు క్రమంగా అర్ధం అవుతోంది. అలాగే, మనలోని కులతత్వాన్ని నిర్మూలించనంత వరకు  సమాజంలో కులనిర్మూలన జరగదు. అదే విధంగా, మనలోని పెట్టుబడీదారుడ్ని చంపనంత వరకు బయట పెట్టుబడీదారి సమాజ నిర్మూలన కూడా జరగదు.
ఇక్కడ ఇంకో సూక్ష్మ సామాజిక కోణం వుంది.  భారత మెజార్టీ సామాజికవర్గంలోని భిన్న అంతస్తులు  మతవిమర్శపై తమదైన శైలిలో స్పందిస్తాయి. మొదటిది; ఏ అంతస్తులో వున్నవారైనా సరే మత ఔన్నత్యాన్ని చాటినపుడు అంతస్తులన్నీ గొప్పగా ఆస్వాదిస్తాయి. రెండోది; పై అంతస్తులో వున్నవాళ్ళు ఎవరయినా మతాన్ని విమర్శించినపుడు వాళ్ళు నిరాకరించరు పైగా ఆదరిస్తారు. తమ సమూహం  ప్రజాస్వామికమైనదని చెప్పుకోవడానికి అదొక అవకాశంగా భావిస్తారు. మూడోది,  దిగువ అంతస్తుల్లో వున్నవాళ్ళు మతాన్ని విమర్శించినపుడు పై అంతస్తుల్లో వున్నవాళ్ళు అసౌకర్యంగా భావిస్తారు. నాలుగోది;  ఇతర మతస్తులు  తమ మతాన్ని విమర్శించినపుడు అన్ని అంతస్తులవాళ్ళూ అసహనాన్ని ప్రర్శిస్తారు. అందరూ కలిసి దాడులు చేసినా ఆశ్చర్యం ఏమీలేదు. గుజరాత్ మారణహోమంలో నాలుగు అంతస్తుల హిందూ సమాజం కిరీటధారులు, సూత్రధారులు, పాత్రధారులు, కాల్బలంగా పనిచేయడాన్ని మనం చూశాం. అణగారిన సమూహాల మధ్య వైరుధ్యానికి  గుజరాత్ గాయం సమీప గతంలో గొప్ప ఉదాహరణ.  
అణగారిన సమూహాలన్నీ అణిచివేత అంతస్సూత్రంగా ఏకమవుతూనే తమ విముక్తి కోసం విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తాయి. దళితులు కులనిర్మూలనను కోరుకుంటారు. ముస్లింలు మతసామరస్యాన్ని కోరుకుంటారు. ఎజెండాలోనికి మతసామరస్యం వచ్చాక ఇతరుల దేవుళ్ళను, విశ్వాసాలను ఖండించడం సబబు కాదు. ఈ కారణం వల్లనే ఇటీవలి కత్తి మహేష్ వివాదానికి నేను దూరంగా వున్నాను.

-        డానీ

Muslim Women Marriage Rights Bill is for political mileage


Muslim Women Marriage Rights Bill is for political mileage

రాజకీయ ప్రయోజనం కోసమే ముస్లిం మహిళా బిల్లు

యం ఖాన్ యజ్దానీ (డానీ)

       పాములు కప్పల్ని మింగేసినట్టు, గద్దలు పిచ్చుకల్ని ఎత్తుకుని పోయినట్టు, సమాజంలో మెజారిటీలు మైనార్టీలను కబళించాలని చూస్తారుప్రాణాలు తీయడానికి సిధ్ధమైన పాములు, గద్దలు మౌనంగావుంటే, ప్రాణాపాయంలో చిక్కుకున్న కప్పలు, పిచ్చుకలు అరుస్తుంటాయి. కానీ, మన సమాజంలో అందుకు విరుధ్ధంగా జరుగుతోంది. అణిచివేస్తున్న మతతత్వశక్తులే గొంతు పెంచి అరుస్తున్నాయి. ప్రాణభయంతో గిజగిజలాడుతున్న మైనార్టీలే నోరు తెరవడానికి భయపడి మౌనంగా విలపిస్తున్నాయి.
       మైనార్టీలను అణిచివేయడానికి మతతత్వశక్తులు కొత్తగా సృష్టించిన ఆయుధంముస్లిం మహిళల (వివాహ హక్కులపరిరక్షణ) బిల్లు – 2017’.  గత ఏడాది డిసెంబరులో లోక్ సభ ఆమోదం పొందిన   వివాదాస్పద  బిల్లు ఇప్పుడు రాజ్యసభ లోకి ప్రవేశించింది. ప్రధానిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం జాతీయ రాజకీయాల్లో సృష్టిస్తున్న హోరులో ముస్లిం సమాజపు ఆర్తనాదాలు అణిచివేతకు గురవుతున్నాయి. ఎవరికీ వినిపించడం లేదు
            ముస్లిం సాంప్రదాయంలో వివాహమైనా, విడాకులైనా ఒకే రీతిలో జరుగుతాయి. వివాహ సమయంలో దాంపత్య అనుబంధం మీద వాళ్ళు  మూడుసార్లుఖుబూల్’ (అంగీకారం) చెపుతారు. దంపతులు విడిపోవాలనుకున్నప్పుడు సరిగ్గా అలాగే మూడుసార్లు విడాకులు చెపుతారు. దీనినే ట్రిపుల్ తలాఖ్ అంటారు. విడాకుల్ని భర్త ప్రతిపాదిస్తే తలాక్ అంటారు; భార్య ప్రతిపాదిస్తే ఖులా అంటారు. సాధారణంగా విడాకుల ప్రక్రియకు కనీసం  మూడు  నెలలు పడుతుందిఅది కొన్ని సందర్భాల్లో ఒక ఏడాదికి పైగా కొనసాగుతుంది.
            సైబర్ యుగంలో వేగం ఎక్కువ. విడాకుల కోసం సుదీర్ఘకాలం వేచి చూడలేని కొందరు వాట్సప్, ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్, వీడియో కాన్ఫరెన్స్, మెసెంజర్, ట్విట్టర్ తదితర సమాచార విప్లవ పరికరాల ద్వారా ఒక్క క్షణంలో విడాకులు చెప్పేస్తున్నారు. వీటినే ఇప్పుడు ఇన్ స్టాంట్ (తక్షణ) ట్రిపుల్ తలాక్ అంటున్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన 60 కేసులు గత ఏడాది సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయిసంచలనం సృష్టించిన కేసుల్ని విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 22తక్షణ ట్రిపుల్ తలాక్  చెల్లదు; అది చట్టవిరుధ్ధం (void and illegal)” అని తీర్పు చెప్పింది. అంతేకాక, ఇస్లాం ఆరంభం నుండి కాకుండా మధ్యలో వచ్చిన  దురాచారం ఇస్లాం ధార్మిక సూత్రాలకు వ్యతిరేకమైనదని కూడా తేల్చిచెప్పింది.
       దానితో వివాదం న్యాయంగా ముగిసిపోవాలి. కానీ అలా జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత కూడా దేశంలో తక్షణ ట్రిపుల్ తలాక్ సంఘటనలు కొన్ని జరిగాయనీ, వాటిని అరికట్టడానికి  ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లును రూపొందించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెపుతోంది. ఇందులో ఒక తిరకాసు వుంది. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు జరిగిన తక్షణ ట్రిపుల్ తలాక్ సంఘటనలే కాక  తరువాత జరిగే అలాంటి సంఘటనలకు  కూడాఅవి చెల్లవుఅనే తీర్పే వర్తిస్తుంది. ఇక కొత్త చట్టం చేయ్సాల్సిన అవసరం ఏముంది?   ప్రశ్నకు ప్రభుత్వం సమాధానాన్ని దాటవేస్తున్నది.
            ప్రభుత్వం రూపొందించిన కొత్త బిల్లులో  తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ళ వరకు  కారాగార శిక్షతోపాటు అపరాధ రుసుము విధించే ఒక క్లాజ్ ను చేర్చారు. ఒక సమూహపు సాంస్కృతిక సాంప్రదాయాలను శిక్షించదగ్గ నేరంగా పరిగణించడం ప్రమాదకర పరిణామం.
       సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమంటే, ఒకవేళ భర్త ఏదో ఆవేశంలో తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పినప్పటికీ అది చెల్లదు. అతను గతంలోలాగే  భార్యకు భర్తగాపిల్లలకు తండ్రిగా కుటుంబ బాధ్యతల్ని కొనసాగించాల్సి వుంటుంది. మరో మాటలో చెప్పాలంటే వాళ్ల దాంపత్య, కుటుంబ జీవితాల మీద తక్షణ ట్రిపుల్ తలాక్ ఎలాంటి ప్రభావాన్ని చూపదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు  ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తను జైలుకు పంపించి, భార్యకు భర్త లేకుండా, పిల్లలకు తండ్రి లేకుండా చేస్తుంది. ఒకవేళ భార్య ఫిర్యాదు చేయకపోయనా సరే  సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారి సుమోటోగా  కేసు నమోదు చేసి భర్తను జైలుకు పంపగల మరో కిరాతకమైన క్లాజు కూడా  చట్టంలో వుంది. అంటే భార్య  ఫిర్యాదు చేయకపోయినా, భర్త అసలు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చెప్పకపోయినా సరే రాజకీయ ప్రోద్భలంతో గానీ, మతప్రోధ్బలంతో గానీ  పోలీసులే  తప్పుడు కేసులు నమోదు చేసి ముస్లిం భర్తల్ని జైళ్లకు పంపించే అవకాశాన్ని బిల్లు కల్పిస్తుంది. ఇంతటిదుర్మార్గమైన చట్టం  ఇటలీ, జర్మనీల్లో  ఫాసిస్టు, నాజీల పాలనలోనూ లేదు.
       త్రిపుల్ తలాక్ కూ, ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ కూ తేడా లేని విధంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించడమేగాక, ముస్లిం సమాజాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారుఇలాంటి చర్యలు ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చడమే తప్ప మరేదీ కాదు. ఎక్కడో ఒకసారి, ఎవరో మూర్ఖులయిన భర్తలు  చెప్పే ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను ముస్లిం సమాజంలో సార్వజనీన విషయంగా సాక్షాత్తు దేశ ప్రధాని తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
       తాము మహిళల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం కృషి చేస్తుంటే విపక్ష పార్టిలు మహిళల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు ప్రధాని మోదీ ఆజమ్ గడ్ సభలో అన్నారు. కాంగ్రెస్ ను సందర్భంగా వారుముస్లిం పురుషుల పార్టిఅని ఎత్తిపొడిచారు. తమది ముస్లిం మహిళల కోసం నిలబడే పార్టి అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇదొక బూటకపు ప్రకటన. ఒక క్రూరమైన మైండ్ గేమ్. నిజానికి సాధారణ ముస్లిం మహిళలే కాకుండా తక్షణ ట్రిపుల్ తలాక్ బాధితులయిన మహిళలు కూడా బిజెపి పక్షానలేరుముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు - 2017 ద్వార  ముస్లిం యువకుల్ని జైళ్ళకు పంపాలని  కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నదనీ, తమ మీద బిజెపి  కపట ప్రేమను ఒలకబోస్తున్నదనీ   ముస్లిం మహిళలకు కూడా స్పష్టంగా తెలుసు.
       బిజెపి లక్ష్యం తక్షణ ట్రిపుల్ తలాక్ బాధితులయిన మహిళల్ని ఆదుకోవడం కాదు. చట్టం ద్వారా బాధిత సమూహానికి ( కేసులో ముస్లిం మహిళలకు) ఒనగూడే  ఒక్క ప్రయోజనాన్ని కూడా పార్టి చెప్పలేకపోతున్నది. బాధిత సమూహానికి మేలు చేయనపుడు అసలు కొత్త చట్టం చేయడం దేనికీ? పురుషుని జీవితంలో స్త్రీలంటే కేవలం భార్యమాత్రమే  కాదు. ట్రిపుల్ తలాఖ్ చెప్పాడనే నెపం మీద కుటుంబంలో నుండి యువకుడ్ని జైలుకు పంపించేస్తే అతని భార్య మాత్రమేకాదు, అతని మీద ఆధారపడిన తల్లిదండ్రులు, అక్కాచెళ్ళెల్లు సహితం వీధిన పడతారు. విడాకుల అన్యాయానికి గురైన స్త్రీలను కాపాడుతామనే నెపంతో ముస్లిం కుటుంబాలను మొత్తంగా అణిచివేయడం చట్టం వెనుకనున్న కుట్ర.
       భారత ముస్లింల ఆర్ధిక వ్యవస్థతోపాటూ వాళ్ళ  కుటుంబ వ్యవస్థను  సహితం తాను విఛ్ఛిన్నం చేసేస్తున్నట్టు సమాజంలోనికి గట్టి సంకేతాలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఆరెస్సెస్-బీజేపి అభిమానులయిన మతతత్వవాదుల్ని అలా సంతృప్తి పరిచినంత కాలం తన ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా వుంటుందని వారు ఆశిస్తున్నారు.
       ట్రిపుల్ తలాక్ ను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని  సుప్రీంకోర్టు కోరలేదు. కానీ, ముస్లింలు, దళితులకు ప్రాణసంకటంగా మారిన మూకోన్మాదాన్ని (mob lynching)  అరికట్టడానికి తక్షణం కఠిన చట్టాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టు ఆదేశాలను  పట్టించుకునే  స్థితిలో లేదు. తానే ముస్లింల మీద మూకోన్మాదంతో విరుచుకు పడుతోంది.
       స్వాతంత్ర్యానంతర భారత దేశపు ముస్లిం సమాజంలో అత్యధికుల ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితి యస్సీలు, యస్టీలకన్నా హీనంగా వుందని జస్టిస్ రాజిందర్ సచార్ కమిటి నివేదిక పేర్కొంది. కటిక పేదరికం కారణంగా ఆడపిల్లలను ఏదో ఒక విధంగా పెళ్ళిచేసి బాధ్యతలు నెరవేర్చేశామనుకునే దయనీయ స్థితిలో ముస్లిం సమాజం వుంది. వారి మీద దయ చూపాల్సిన తరుణంలో, పగతీర్చుకోవడానికి నేరుగా కేంద్ర ప్రభుత్వమే సిధ్ధమయింది.
       నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముస్లిం ఆడపిల్లల్ని ఆదుకోవాలనే చిత్తశుధ్ధి నిజంగా వుంటే నిర్బంధ విద్య, పెండ్లి కానుకలువితంతు స్త్రీల భృతి వంటి పధకాలను రూపొందించవచ్చు. కానీ, కేంద్ర ప్రభుత్వం పని చేయడం లేదు. దేశ జనాభాలో 14 శాతం వున్న ముస్లింల సంక్షేమానికి  జాతీయ బడ్జెట్ లో ఒక్క శాతం నిధులు కూడా కేటాయించడం లేదు. మరోవైపు ముస్లిం మహిళల మీద కపట ప్రేమను ఒలకబోస్తున్నది.
       ప్రధానమంత్రికి నిజంగానే  దేశంలోని మహిళల మీద అంత ప్రేమ వుంటే వారు నెరవేర్చాల్సిన చారిత్రక బాధ్యతలు ఇంకా అనేకం వున్నాయిమహిళా సాధికార (రిజర్వేషన్ల) బిల్లును లోక్ సభలో ఆమోదించాలి. 2010 మార్చి నెలలో రాజ్య సభ ఆమోదం పొందిన  బిల్లు అప్పటి నుండి లోక్ సభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది.
       దేశప్రజల్ని మతప్రాతిపదిక మీద చీల్చి ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసిన మతతత్వశక్తులు రాజకీయ లబ్దిపొంది కేంద్ర ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం మనందరికీ తెలుసుఇప్పుడు ముస్లిం సమాజాన్ని లింగ ప్రాతిపదిక మీద చీల్చేసినట్టు సంకేతాలిచ్చి 2019 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవి  కుట్రలు చేస్తున్నాయి.
       ఏదో ఒక ధార్మిక అంశాన్ని వివాదంగా మార్చి ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టి రాజకీయ లబ్దిపొందాలని మతతత్వశక్తులు తరచూ ప్రయత్నిస్తుంటాయి. అభివృధ్ధిమంత్రం పనిచేయనపుడు మతతత్వశక్తులు ప్రయోగించే చివరి ఆయుధం పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టడం. మోదీ ఇప్పుడు పనే చేస్తున్నారు. అలా వారు ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్ ను జాతీయ  సమస్యగా మార్చారు.
       ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్, వామపక్ష తదితర పార్టీలు  ఇప్పటికే ప్రకటించాయి. బిజెపితో తెగతెంపులు చేసుకున్నామని చెపుతున్న టిడిపి, బిజెపీతో జత కట్టేదిలేదని చెపుతున్న వైసిపి తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే తమ రాజ్యసభ సభ్యుల ద్వార బిల్లును పెద్దల సభలో అడ్డుకోవాలిమతతత్వశక్తుల మీద వ్యతిరేకతకూ, మతసామరస్య విలువల మీద అభిమానాన్ని చాటుకోవడానికి  రాజకీయ పార్టీలకు కేసు ఒక  గీటురాయి.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైలు  :  9010757776

హైదరాబాద్  20 జూలై 2018

ప్రచురణ :  ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జులై 2018