Monday 30 September 2019

Government Employees


టీచర్లు, లెక్చరర్లకుతప్ప ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే దండగ. ఈ ఫిట్ మెంట్లు, విరమణ వయస్సు పెంచడాలు దేనికీ?

ఈమధ్య ఓ టీచరమ్మను ప్రేమిస్తున్నాను. అందుకని టీచర్లు, లెక్చరర్లకు   డిస్కౌంట్ ఇచ్చాను. Ha ha ha.

ప్రజల ముక్కుపిండి వసూలు చేసే పన్నుల్లో సగానికి పైగా ఉద్యోగుల జీత భత్యాలకు పోతాయి. వాళ్ళలో 10 శాతం కూడ నిజాయితీపరులు వుండరు.

మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుని అంచనా ప్రకారం  ఉద్యోగుల జీత భత్యాలకు రాష్ట్ర  ప్రభుత్వ రెవెన్యూలో 95 శాతం పోతాయటా?

ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం సాగాల్సిన అవసరం వుంది.  

మద్యనిషేధం

మద్యనిషేధం

మద్యంకన్నా సిగరెట్టే ఎక్కువ ప్రమాదకారి. మద్యానికి ఒక మందు లక్షణం వుంది. మద్యపాన నిషేధ ఉద్యమకారులు దీన్ని గమనించాలి.

"డాక్టరు చీటీ మీద బ్రాందీ అమ్మబడును" అని 1969కి ముందు నాటి  ప్రొహిబిషన్ కాలంలో  మెడికల్ షాపుల ముందు బోర్డులు వుండేవి.

బాలింతలకు ఓ వారం రోజులు బ్రాంది పట్టించాలని మిస్సమ్మ హాస్పిటల్ లో చీటీ రాసేవారు. అలా నేను చాలా మందికి  బిస్క్యూట్  బ్రాంది తెచ్చి ఇచ్చాను.

మద్యపాన నిషేధం కనుక వస్తే సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతుంది. అది ఇంకా  ప్రమాదకరం.

మద్యం ఒక్కటేనా?  ఉప్పు, కారం, నూనె, పంచదార, చింతపండు చివరకు వరి అన్నం …..  మోతాదు  మించితే  శరీరానికి విషం కానిదేదీ?





Love and Hatred

ప్రేమాద్వేషం 

మనం ఆశించే  సమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రేమించాల్సిన వాటిని  ప్రగాఢంగా ప్రేమించాలి; ద్వేషించాల్సిన వాటిని తీవ్రంగా ద్వేషించాలి.

మన ఆదర్శ సమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రేమించాల్సిన వాటిని  ప్రగాఢంగా ప్రేమించాలి; ద్వేషించాల్సిన వాటిని తీవ్రంగా ద్వేషించాలి.

ప్రగాఢంగా ప్రేమించడం, తీవ్రంగా ద్వేషించడం తెలిసినవాళ్ళే  తమ కాలపు సమాజం మీద గొప్ప ప్రభావాన్నీ వేయగలరు.  లక్ష్యాలను సాధించగలరు.

రాగద్వేషాల్లో తీవ్రత లేనివాళ్ళు తమ కాలపు సమాజం మీద ఎలాంటి ప్రభావాన్నీ వేయలేరు; తమ లక్ష్యాలనూ సాధించుకోలేరు. 

శ్రేయోరాజ్యాన్నీ బుల్లెట్ ద్వార తెస్తామన్నవారు విఫలమయ్యారు సరే బ్యాలెట్ ద్వార తెస్తామన్నవారు ఇన్నేళ్ళుగా  ఏం సాధించారూ? 

Friday 27 September 2019

Kodela - Scalpel and Sword


ప్రేమాస్పదుడు – వివాదాస్పదుడు
డానీ

          కోడెల శివప్రసాదరావు చనిపోయారు. ఆయన ఆత్మహత్యకు  పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెపుతున్నట్టు హైదరాబాద్ వెస్ట్ డిసిపి వెళ్ళడించారు. పోస్ట్ మార్టెం నివేదిక  వస్తేగానీ కోడెల మృతి  వివరాలు స్పష్టం కావు.
         
          కోడెల శివప్రసాదరావు ఒకరు కాదు ఇద్దరని సన్నిహితులు అంటుంటారు. వైద్యునిగా వారు రోగులకు గొప్ప ప్రేమాస్పదులు; రాజకీయాల్లో అత్యంత వివాస్పదులు.

          కోడెల బాల్యంలోనే ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు స్మాల్‌ పాక్స్‌తో ఓ వారం వ్యవధిలో చనిపోయారు. ఆ సంఘటన శివప్రసాద రావును కలచివేసిందనీ దాని ప్రభావంతోనే ఆయన కసిగా వైద్య విద్యను చదివారని అంటారు. కర్నూలు, గుంటూరు, వారణాసీల్లో వైద్యవిద్యను అభ్యసించిన కోడెల నరసారావుపేటలో  సర్జన్ గా స్థిర పడ్డారు. శివప్రసాదరావు స్కాల్పెల్ బ్లేడు పట్టుకుంటే శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టేనని జనం చెప్పుకునేవారు. ఆయన హస్తవాసి గురించి నరసారావుపేట పరిసరాల్లో కథలు కథలు వినిపించేవి.

          ఎన్ టీ రామారావు 1982లో తెలుగు దేశం పార్టిని పెట్టినప్పటి నుండీ కోడెల అందులో చురుకైన కార్యకర్తగా వున్నారు. వైద్యరంగంలో  కోడెలకున్న మంచి పేరును చూసిన ఎన్టీఆర్ ఆయన్ను పిలిచి టిక్కెట్టు ఇచ్చారని అంటారు. రాజకీయాల్లో ప్రవేశించాక కోడెల శివప్రసాద్ క్యారెక్టర్ మారిపోయింది. డాక్టరుగా స్కాల్పెల్ బ్లేడు వాడినంత నైపుణ్యం వారికి కత్తులు, కఠార్లు తిప్పడంలోనూ వుండేదని అనేక కథనాలు ప్రచారంలోనికి వచ్చాయి.  

          అప్పట్లో నరసారావుపేట నియోజకవర్గం కమ్మ-రెడ్డి సామాజికవర్గాల కుమ్ములాటలకు నిలయంగా వుండేది. సరసారావుపేట పరిసరాల్లో అనేక ఫ్యాక్షన్ గ్రామాలుండేవి. బాంబు దాడులు హత్యల సంస్కృతి కొనసాగేది.   కోడెల కమ్మ సామాజికవర్గానికి రాజకీయ ప్రతినిధిగా వుండేవారు. క్రమంగా ఆయన కూడ ఫ్యాక్షన్ నాయకుడనే ముద్రను వేయించుకున్నారు. ఆయన ఇంటి పెరట్లోనే బాంబుల గిడ్డంగి వుండేదని ఒక స్దశలో పెద్ద  ప్రచారం సాగింది. కోడెల 1987-88లలో రాష్ట్ర హొం మంత్రిగా వున్నారు. ఆ కాలంలో మరీ వివాదాస్పదుడిగా వున్నారు.  ఆయన ఇంటి పెరట్ళోనే బాంబులు పేలి  నలుగురు చనిపోయిన సంఘటన అప్పట్లో రాజకీయ రంగంలో పెద్ద దుమారం రేపింది.  కోడెల హోంమంత్రిగా వున్న కాలంలోనే ఆయన మీద ఒకసారి బాంబుదాడి జరిగింది. ఇంకోసారి యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడుల్లో వారు స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగారు. టిడిపిలో ఆయన ఎన్టీఆర్ కు, చంద్రబాబుకూ ఆయా దశల్లో అత్యంత సన్నిహితులుగా వున్నారు. ఎన్టీ రామారావు హయాంలో పంచాయితీ రాజ్, నీటి పారుదల శాల మంత్రిగానూ ఆయన పనిచేశారు.

          1988 డిసెంబరు 26న విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య జరిగినపుడు కోడెల శివప్రసాదరావే రాష్ట్ర హోంమంత్రిగా వున్నారు. ఎన్టీ రామారావు, కోడెల శివప్రసాద్ కుట్ర చేసి రంగాను హత్య చేసినట్టు కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. 1983 నుండి 1999 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఐదు శాసన సభ ఎన్నికల్లోనూ కోడెల నరసారావుపేట నియోజకవర్గం నుండి వరుస ఘనవిజయాలు సాధించారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి గాలి బలంగా వీచిన 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరుస పరాజయాలను చవిచూశారు.

          రాజకీయాల్లో కోడెల ప్రత్యర్ధుల మీద ఒంటికాలితో లేచేవారు. ఎలాంటి సంకోచము లేకుండా తీవ్ర ఆరోపణలు చేసేవారు. రెండు శరీరాలు ఒకే ఆత్మలా కొనసాగిన వైయస్ రాజశేఖర రెడ్డి,  కేవిపి రామచంద్రరావుల మీద తరచూ విరుచుకుపడేవారు. ఒక సారి ఆయన వైయస్ అర్ ను జయలలితతోనూ, కేవీపిని శశికళతోనూ పోల్చడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తరువాత వైయస్ కక్షగట్టి తనను వేధించారని కోడెల అనేవారు.  వైయస్ హయాంలోనే కోడేల భూముల్ని స్వాధినం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు పంపింది. ఆయితే ఆ కేసు చివరకు న్యాయస్థానాల్లో నిలవలేదు. కోడెలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

          2014 ఎన్నికల్లో నరసారావుపేటను వదిలి  సత్తెనపల్లీ నియోజకవర్గానికి మారిన కోడెలకు విజయం దక్కింది. కొత్త రాష్టపు కొత్త ప్రభుత్వంలో సహజంగానే ఆయన పంత్రి పదవిని ఆశించారు. గానీ చంద్రబాబు ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. “ప్లేయర్ కావలసినవాడిని ఆపైర్ గా మార్చారు” అని కోడెల కొంచెం నొచ్చుకున్నారని అంటారు.

          శాసన సభ స్పీకర్ గా కోడెల హుందాగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మీద కసిని ఆయన కుమారుడు వైయస్ జగన్ మీద తీర్చుకున్నారని పిస్తుంది.  హోం మంత్రిగా విపక్షాల మీద  ఒంటి కాలు మీద లేచినట్లే స్పీకర్ గానూ ప్రతిపక్షం మీద ఇంటికాలి మీద లేచేవారు. కోడెల వ్యవహార శైలివల్లే వైయస్ జగన్ శాసన సభ సమావేశాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు.

           రాష్ట్రంలో  తెలుగు దేశం పతనం కోడెలతోనే ఆరంభం అయిందంటే అతిశయోక్తికాదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టి అధికార ప్రతినిధి అంబటి రాంబాబును రంగంలోనికి దింపింది వైయస్సార్ సిపి. నరసారావు పేటలో రెడ్డి సామాజికవర్గం కోడెలకు వ్యతిరేకంగా ఏకం అయినట్టే సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఏకం అయింది. పోలింగు రోజు రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామ పోలింగ్ బూతుకు ఓట్ల సరళిని పరిశీలించడానికి వెళ్ళిన  కోడెల మీద స్థానికులు దాడి చేశారు. ఒక గదిలో ఆయన్ను బంధించి వేశారు.  చేయి చేసుకున్నారు. ఆ కుమ్ములాటలో కోడెల చొక్కా కూడ చిరిగిపోయింది.  ఓ పదేళ్ళ క్రితం వరకు తాను గడగడలాడించిన   పల్నాడు ప్రాంతంలోనే  తనకు ఇంతటి పరాభవం జరుగుతుందని కోడెల కలలో కూడ ఊహించి వుండరు. ఎన్నికల పండితులు ఆరోజే చెప్పేశారు టిడిపి చిత్తుగా ఓడిపోయి వైసిపి ఘనవిజయాన్ని సాధిస్తుందని. అదే జరిగింది.

          అసెంబ్లీలో  ఫర్నిచర్ మాయం కేసు కోడెల మెడకు ఎంతగా చుట్టుకుందోగానీ ఆయన పరువును మాత్రం నరసారావుపేట మురుగుకాలవలో పడేసింది.  అసెంబ్లీ స్పీకరుగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తి మీద ఫర్నిచరు దొంగతనం కేసు రావడం చాలా ఇబ్బందికర వ్యవహారమే. అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటిని సోదా చేసేందుకు రావడానికి కొద్ది నిముషాల ముందు ఆయన ఇంటిలోని రెండు కంప్యూటర్లను దుండగులు ఎత్తుకు పోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.  మరోవైపు, గుంటూరు నగరంలో కోడెల కొడుకుకు చెందిన బైక్స్ షోరో రూమ్ ఇంకో పెద్ద వివాదంలో ఇరుక్కుంది. కొత్త వాహనాలకు టిఆర్ లేకుండానే అమ్ముతున్నారనే అభియోగం మీద ఆ షోరూమును  రవాణాశాఖ అధికారులు  తాళం వేశారు.
          ఈలోగా ఇంకో స్కామ్ జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి.  అసెంబ్లీలోనూ, స్పీకర్ కొడుకు షోరూమ్ లోనూ ఓకె రకం ఫర్నిచర్, ఏసీ మిషిన్లు వుండడం ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా వుండగా  ఆరోగ్యశ్రీ జాబితాలో పెడతాననీ కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఒక నర్సింగ్ హోమ్ నిర్వహకుల వద్ద నాలుగు లక్షల రూపాయలు లంచంగా తీసుకుని మోసం చేశారని 420 కేసు నమోదయింది. తననూ తన సంతానాన్ని సహితం కేసులు చుట్టుముట్టి వీధుల్లోనికి లాగడంతో కోడెల హతాశులైపోయారు. తెలుగు దేశం పార్టి, నాయకులు సహితం  తనకు నైతిక మద్దతు నివ్వడానికి ముందుకు రాకపోవడంతో   కోడెల మానసికంగా కుంగిపోయారు.

          కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేసుల పేరిట తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నదని ఇటీవల ఆయన బాహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చారు. అయితే కేసులకు భయపడి జీవితాన్ని చాలించే స్వభావం కాదు ఆయనది. కుటుంబ అంతర్గత వివాదాలు సహితం ఆయనను కుంగదీశాయనే మాట కూడ గట్టిగానే వినపడుతోంది. ఆ వివరాలు బయటికి వచ్చాకే ఆయన మృతి మీద ఒక స్పష్ట వస్తుంది. 

          రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతటి వివాదాస్పదం అయినప్పటికీ వైద్యరంగాలో ఆయన పాత్ర మహత్తర మైనది. నరసారావుపేటలో అప్పట్లో వారు అందించిన వైద్య సేవలు ఒక ఎత్తు అయితే, హైదరావాద్ లో కొంతకాలం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టు ఛైర్మన్ గా ఆయన అందించిన వైద్య సేవలు మరో ఎత్తు. రాజకీయాల్లో పట్టుదల గల నాయకునిగా, వైద్యరంగంలో ఒక సేవాతత్పరునిగా కోడెల గుర్తుంటారు.

రచన : 16సెప్టెంబరు 2019
ప్రచురణ : బిబిసి తెలుగు, 16సెప్టెంబరు 2019

Communal Politics and the Congress


Communal Politics and the Congress
మతవర్గతత్త్వ రాజకీయాలు – కాంగ్రెస్  
-        డానీ

మత రాజకీయాలు అనగానే మనకు సంఘపరివారం, భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టి వగయిరాలు గుర్తుకు వస్తాయి. దేశంలో మతరాజకీయాలను ప్రోత్సహించడంలో భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన పాత్ర కూడ తక్కువదేమీ కాదు.
స్వాతంత్ర్యానంతరం భారత  పార్లమెంటరీ రాజకీయాల్లో  ఎడమ, కుడి, మధ్య పక్ష శిబిరాలు చాలా కాలం నడిచాయి. అప్పట్లో కమ్యూనిస్టుల్ని వామపక్షంగానూ, భారతీయ జన సంఘ్ ను కుడి పక్షంగానూ కాంగ్రెస్ ను మధ్యస్థ పక్షంగానూ భావించేవారు. గిరిగీసినట్టు ఎవరి రాజకీయ సిధ్ధాంతాలు వారికి వుండేవి.
కాంగ్రెస్ 1885 నుండే రాజకీయ రంగంలో  వుంది. 1925లో భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది. అదే సంవత్సరం ఆరెస్సెస్ కూడ ఆవిర్భవించింది. అయితే, డాక్టర్ కేశవ్ బలిరామ్ హేగ్డేవార్ స్థాపించిన  ఆరెస్సెస్ ఒక హిందూత్వ సిధ్ధాంత ప్రచార సంస్థేగానీ రాజకీయ పార్టికాదు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే తలంపు రెండవ సర్సంగ్ ఛాలక్ గురూజీ ఎం. ఎస్. గోల్వాల్కర్  కాలంలో కలిగింది. అప్పట్లో హిందూమహాసభ అధ్యక్షునిగా వున్న డాక్టర్ శ్యామ ప్రసాద ముఖర్జి అధ్యక్షునిగా, సంఘ్ ప్రచారక్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపాధ్యక్షునిగా భారతీయ జన సంఘ్ (బిజెఎస్) ఆవిర్భవించింది. అయితే, తొలిదశలో  దానికి ఎన్నికల్లో ఎన్నడూ చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు.
భారత తొలిమలి ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రులాల్ బహద్దూర్ శాస్త్రి ఇద్దరూ 1964-66 మధ్య ఏడాదిన్నర వ్యవధిలో చనిపోయారు. దానితో,కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వ సమస్య తలెత్తి ఒక అస్థిరత చోటుచేసుకున్న తరుణంలో రాజకీయాల్లో కాంగ్రెసేతర శక్తులు పుంజుకున్నాయి. 1967 లోక్ సభ ఎన్నికల్లో  సి రాజగోపాలాచారి  నాయకత్వంలోని స్వతంత్రపార్టికి 44 సీట్లు రాగాదీన్ దయాళ్ ఉపాధ్యాయ నాయకత్వంలోనిజన సంఘ్ కు 35 సీట్లు దక్కాయివుభయ కమ్యూనిస్టులకు 23, 19, స్థానాలు దక్కాయి. ప్రధానంగా ఢిల్లీ నగర పరిసరాల్లో జన సంఘ్ కు మంచి పట్టు వుండేది. 1971 లోక సభ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ కు 22 సీట్లు  దక్కగా వుభయ కమ్యూనిస్టులకు 23, 25 సీట్లు వచ్చాయి.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధి 1975లో న్యాయపరపరమైన చిక్కుల్లో పడ్డారు. వాటిని అధిగమించడానికి ఆ ఏడాది జూన్ 26న అత్యయిక పరిస్థితిని ప్రకటించిభారత పార్లమెంటరీ వ్యవస్థ ఆమోదాంశాన్నే సంక్షోభంలోనికి పడేశారు. ఎమర్జెన్సీ తరువాత, 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా పరాజయం పాలవ్వగా, కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా తగ్గింది. ఆ ఎన్నికల్లో సిపిఎం కు 22 స్థానాలు దక్కగా, సిపిఐ బలం కేవలం 3 స్థానాలకు పడిపోయింది. ఆ ఎన్నికల్లో ఇందిరా  కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఏకమై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. జనసంఘ్ కూడ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో బలపడి తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్టు మీద 93 మంది జనసంఘ్ అభ్యర్ధులు విజయాన్ని సాధించడం విశేషం. అయితే, స్వల్పకాలంలోనే జనసంఘ్ సభ్యులకు  ఆరెస్సెస్ తో వున్న అనుబంధం కారణంగా ‘ద్వంద్వ సభ్యత్వం’ పేరిట జనతా పార్టీలో వివాదాలు తలెత్తాయి. 
జనతా పార్టీలో తలెత్తిన లుకలుకలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోగా  జనతా పార్టి కూటమి కకావికలైపోయింది. కమ్యూనిస్టులు మళ్ళీ పుంజుకున్నారు.  సిపియం 37 స్థానాలు దక్కించుకోగా సిపిఐకు 10 స్థానాలు దక్కాయి.
1980 లోక్ సభ ఎన్నికల తరువాత భారత రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. జనతా పార్టి నుండి బయటికి వచ్చిన  మాజీ జన సంఘ్ సభ్యులు అటల్ బిహారీ వాజ్ పాయి, ఎల్ కే అడ్వాణిల నాయకత్వంలో  1980 ఏప్రిల్ 6 న  భారతీయ జనత పార్టిని ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడిన బిజెపి ‘గాంధీయ సోషలిజం’ తన లక్ష్యంగా ప్రకటించుకోవడం ఒక విశేషం. మొదటి నుండీ అనేక విషయాల్లో హిట్లర్ ను ఆదర్శంగా భావించే సంఘపరివారం పార్టీ విధానాల విషయంలోనూ హిట్లర్ నే ఆదర్శంగా తీసుకుంది. నాజీ పార్టీ పూర్తి పేరు నేషనల్ సోషలిజం.  అయితే బిజెపి నేతలు జాతీయ స్థానంలో గాంధీజీ పేరు పెట్టారు. నిజానికి గాంధీజీ పాటించిన ‘’మైనార్టీ పక్షపాత’’ విధానాలతోనూ, సామ్యవాదంతోనూ సంఘపరివారానికి తీవ్రమైన సైధ్ధాంతిక విబేధాలున్నాయి.
 సంఘపరివారం సోషలిస్టు రాగం అందుకున్న తరుణంలో ఇందిరా గాంధి అందుకు పూర్తి విరుధ్ధంగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ చివరి ఘట్టంలో 1977 జనవరి 3న భారత రాజ్యాంగానికి 42వ సవరణ చట్టం ద్వార ప్రవేశికలో “సామ్యవాద, లౌకికవాద” లక్ష్యాలను చేర్చిన ఘనత ఇందిరా గాంధీదే. కానీ, తిరిగి అధికారాన్ని చేపట్టిన ఇందిరాగాంధి అప్పటి వరకు కాంగ్రెస్ కు వున్న ‘సెంట్రిస్ట్ ఫోర్స్’ అనే ముద్రను చెరిపి వేసి రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మతతత్వ పోకడలు పోయారు. మతమైనార్టీలైన శిక్కుల్ని బూచీలుగా చూపెట్టి మిగిలిన సామాజికవర్గాల్లో ఒక జాతీయ  ఉన్మాదాన్ని సృష్టించి కాంగ్రెస్ ఓటు బ్యాంకును విస్తరింప చేసుకుని తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కారు. ఈ వ్యవహారం ముదిరి 1984 జూన్ మొదటి వారంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరుతో అమృతసర్ లోనీ హర్మందిర్ సాహెబ్ (స్వర్ణదేవాలం) మీద సైనిక దాడి వరకు సాగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో చనిపోయిన జర్నైల్ సింగ్ భింద్రేన్ వాలే  అభిమానులైన ప్రధాని అంగరక్షకులు ఆ ఏడాది అక్టోబరు 31న ఇందిరా గాంధీని హత్య చేయడంతో ఒక అధ్యాయం ముగిసి రాజీవ్ గాంధీ అధ్యాయం ఆరంభమయింది.  
ఇందిరాగాంధీ హత్యానంతరం దేశరాజధాని ఢిల్లీతో సహా దేశంలో అనేక చోట్ల శిక్కుల మీద ఊచకోత సాగింది. ప్రభుత్వ లెఖ్ఖల ప్రకారమే ఢిల్లీలో 2800 మంది ఇతర నగరాల్లో 3350 మంది శిక్కులు చనిపోయారు. స్వతంత్ర సంస్థల లెఖ్ఖలు దీనికి రెట్టింపుకన్నా ఎక్కువగా వున్నాయి.
రెండు నెలల తరువాత జరిగిన 1984 లోక్ సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 414 సీట్లు గెలుచుకోగా బిజెపి బలం కేవలం రెండు స్థానాలకు పడిపోయింది. ఇందిరాగాంధీ హత్యతో దేశమంతటా కాంగ్రెస్ కు అనుకూలంగా సానుభూతి పవనాలు వీచాయని ఎక్కువ మంది భావించారు. అయితే, మతతత్త్వం మూలంగా తనకు భారీ ఆధిక్యత వచ్చిందని రాజీవ్ గాంధీ గుర్తించారు. ఆ నమ్మకంతో ఇందిరాగాంధి మలిదశ మతతత్వ విధానాలనే వారు కొనసాగించారు. విడాకులు పొందిన ముస్లిం మహిళకు మనోవర్తిని రద్దు చేస్తూ ముస్లిం ఛాందసులకు అనుకూలంగా చట్టం తేవడం, అయోధ్యలో రామమందిరం తలుపులు తెరిచి కొత్త వివాదానికి తెర లేపడం వగయిరా కీలక నిర్ణయాలన్నీ ఈ క్రమంలో సాగినవే. చివరకు 1989 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సహితం రాజీవ్ గాంధీ ఆయోధ్య నుండే మొదలెట్టారు.
జాతీయ సామ్యవాదం విధానంతో కొత్త సమూహాల్లోనికి దూసుకు పోవచ్చని ఆశించిన బిజేపి 1984 ఎన్నికల్లో ఘోరంగా విఫలమయింది. జన సంఘ్ స్థావరంగా భావించే ఢిల్లీలో సహితం ఒక్క సీటు కూడ రాకపోవడంతో ఆ పార్టి పునరాలోచనలో పడింది. మరోవైపు రాజీవ్ గాంధి హిందూత్వ నినాదాన్ని హైజాక్ చేసి ముందుకు దూసుకుపోతుండడాన్ని సంఘీయులు సహించ లేకపోయారు. మృదు హిందూత్వ ముద్ర వున్న వాజ్ పాయిని నాయకత్వం నుండి తప్పించి ముదురు హిందూత్వ ముద్ర వున్న అడ్వాణీకి బిజెపి నాయకత్వాన్ని అప్పచెప్పారు. అడ్వానీకీ మద్దతుగా విశ్వహిందూ పరిషత్ రంగ ప్రవేశం చేసి రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370 రద్దు అంశాలను చర్చనీయాంశాలుగా మార్చి దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది.
1989 లోక్ సభ ఎన్నికల సంవత్సరం అనేక విధాలుగా బిజెపికి కలిసి వచ్చింది. ఫిబ్రవరి 1న కుంభమేళ జరిగింది. అక్కడ విహెచ్ పి నిర్వహించిన సంత్ సమ్మేళన్ అయోధ్యలో శిలాన్యాస్ జరుపుతామని ప్రకటించింది. ఏప్రిల్ 1న ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ శతజయంతోత్సవాలు జరిగాయి. ఆ సభలో వాజ్ పాయి ‘సహితం’  చెలరేగిపోయారు. “ముస్లింలు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని వదులుకోవాలి లేదా తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిధ్ధపడాలి” అని హెచ్చరించారు. జూన్ రెండవ వారంలో హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూరులో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం రామ్ మందిర్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించింది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అంతటి ఉత్కంఠలోనూ నవంబరు 9న శిలాన్యాస్ జరిగిపోయింది.
ముహూర్తాలు నిర్ణయించడంలో సంఘపరివారంది ఒక ప్రత్యేక శైలి. నవంబరు 9 బెర్లిన్ గోడను కూల్చేసిన రోజు. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబరు 6 అంబేడ్కర్ పుట్టిన రోజు. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ లో  విభజనకు నిర్ణయించిన అప్పాయింటెడ్ డే అక్టోబరు 31 సర్దార్ వల్లభ్ భాయి పటేల్ పుట్టిన రోజు.
1984 లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పరిమితమైన బిజెపి రామమందిరం నినాదంతో 1989 ఎన్నికల్లో 85 స్థానాలను గెలుచుకుని విపి సింగ్ ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయికి ఎదిగింది. ఆ తరువాత సాగిన చరిత్ర మనకందరికీ తెలిసిందే.
రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓ రెండేళ్లుగా రాజీవ్ గాంధి హిందూత్వ విధానాలతో కొనసాగాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పార్టీకి ప్రతి ఎన్నికలలోనూ 1989 ఎన్నికల ఫలితాలు తప్పవు.

(రచయిత సీనియర్ జర్నలిస్ట్, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776 

రచ్న : 31 ఆగస్టు 2019
ప్రచురణ : ప్రజాపాలన దినపత్రిక, 24 సెప్టెంబరు 2019

The deference between speeches and writings


The deference between speeches and writings
 నిరక్షరాశ్యుల కోసం ప్రసంగిస్తాను;  అక్షరాశ్యుల కోసం రాస్తాను.

          “పెట్టుబడీదారీ రాజ్యం తన ప్రభువులైన కార్పొరేట్లకు మరింతగా సేవలు చేయడానికి మతాన్ని అత్యాచారం చేయడమే ఫాసిజం” అంటూ ఈ మధ్య ఫాసిజాన్ని నిర్వచించి ఫేస్ బుక్కులో పోస్టు చేశాను. మరెవరయినా ఇంతకన్నా మెరుగయిన నిర్వచనం ఇస్తే ఆనందిస్తాను.

          ఒక విషయాన్ని ఉపయోగించుకోవడాన్ని ఇంగ్లీషులో use, proper use, under use, over use, misuse, abuse వంటి అనేక స్థాయిల్లో వ్యక్తం చేస్తారు. Abuse ను తెలుగులో అత్యాచారం అనడం కూడ వాడుకలో వుంది.  ఒకవేళ అత్యాచారం అనే పదం కటువుగా వుందనుకుంటే దుర్వినియోగం అనుకోవచ్చుగానీ, ఫాసిజం తీవ్రతను నిర్వచించడానికి ఆ పదం  సరిపోదు.

          నా నిర్వచనం దివి కుమార్ గారికి నచ్చలేదు. అందులో వారికి “సెన్సేషనలిజం” “కవితాత్మకత” వంటి కొన్ని నేరాలు కనిపించాయి.  “సాధారణ ప్రజలు అందుకునే విధంగానూ ఆచరణకు దోహదపడేట్లుగానూ … ప్రకటనలు వుంటే మంచిది” అంటూ వారు కొన్ని సూచనలు కూడ చేశారు. ఆ తరువాత వారు “మతం - అసహాయులకొక ఊతకర్ర. అదే కలిగినవారి చేతిలో దుడ్డుకర్ర” అంటూ ప్రత్యామ్నాయ నిర్వచనాన్ని ప్రకటించారు.

          దివికుమార్ గారు గందరగోళ పడిన మొదటి విషయం ఏమంటే వారికి  ఫాసిజానికీ మతానికీ తేడ తెలియలేదు. వారు ఫాసిజాన్ని నిర్వచించబోయి మతాన్ని నిర్వచించారు. ఇదేమీ పెద్ద నేరం కాదు. చాలామంది తమకు కొత్త విషయాలు అర్థం కానప్పుడు తమకు తెలిసిన పాత విషయాలనే వల్లె వేస్తుంటారు. అది మానవ సహజం.

          “ఫాసిజం రూపంలో సాంస్కృతికం, సారంలో రాజకీయార్ధికం”. ఇది కూడ నా నిర్వచనమే.  నాకున్న పెద్ద  బలహీనత ఏమంటే నేను కొత్త విషయాలను ఇంకాస్త కొత్తగా చెప్పాలనుకుంటాను. అది అందరికీ ఒక పట్టాన అర్థంకావు. అయితే అర్థం కాకపోవడమే తమ జన్మ హక్కుగా భావించే ఒక సమూహం ఇటీవల తెలుగునాట బలపడుతూ వుంది.

          “సాధారణ ప్రజలు అందుకునే విధంగానూ ఆచరణకు దోహదపడేట్లుగానూ” అనేది కమ్యూనిస్టు పార్టీల్లో దాదాపు ఆరు దశాబ్దాలుగా వాడివాడి అరిగిపోయిన రికార్డు. దానివల్ల రెండు ఘోర నష్టాలు జరిగాయి. మొదటిది; కమ్యూనిస్టుల రాతల్లో సాహిత్య ప్రమాణాలు దారుణంగా పతనం అయిపోయాయి. రెండోది; నిస్సార భాషలో ఉద్వేగం ఉత్తేజం కొత్తదనం లేక సాధారణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను వదిలి వెళ్ళిపోయారు. రెండు కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కమ్యూనిస్టుల కరపత్రాలు చదివేవాళ్లు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కొత్తతరం తెలుగు భాషను వదిలి ఇంగ్లీషు మీద మక్కువ చూపడానికి  ఈ సోకాల్డ్ ‘ప్రజా’ కమ్యూనిస్టుల తెలుగు కూడ ఒక కారణం అనంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.
         
          నేను భావానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో వ్యక్తీకరణలో సాహిత్య ప్రమాణాలకు  కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను. దాని కోసం కొంత సాధన కూడ చేస్తాను.

          “యూరప్ ను ఒక భూతం వెంటాడుతోంది దాని పేరు కమ్యూనిజం”, “ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే” “పెట్టుబడీదారీవర్గం తానే అదుపుచేయలేని ఒక భూతాన్ని సృష్టించింది; అదే కార్మికవర్గం” “మహిళల విషయంలో ఇప్పుడు పెట్టుబడీదారులు రహాస్యంగా చేస్తున్న పనిని రేపు కమ్యూనిస్టులు మహా అయితే బాహాటంగా చేస్తారు” “తిరగబడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లుతప్ప” “చౌకధరలు అనే మరఫిరంగులతో ఎలాంటి మార్కెట్ కోటలనైనా అది ధ్వంసం చేసేస్తుంది” “దరిద్రుల తత్వశాస్త్రంకాదు అది తాత్వికదారిద్ర్యం” వంటి ‘సంచలనాత్మక’ ‘కవితాత్మక’ ప్రకటనలు చేయడం నాకు చాలా ఇష్టం. ప్రజలు కూడ వాటినే ఇష్టపడతారు. ఈ జబ్బు నాకు కార్ల్ మార్క్స్ నుండే అంటుకుంది. తనకు షేక్స్ పియర్ రచనా శైలి చాలా ఇష్టం అని మార్క్స్ స్వయంగా చెప్పుకున్నాడు. నాకు మార్క్స్ రచనా శైలి  చాలా ఇష్టం.   

          నేను అక్షరాశ్యుల కోసం మాత్రమే రాస్తాను. నిరక్షరాశ్యుల కోసం ప్రసంగిస్తాను. రెండింటి శైలి వేరు. వాడే భాష వేరు. కూర్చే వాక్యాలు వేరు. వ్యక్తీకరణ వేరు.

           కొందరికి మౌఖిక సాహిత్యానికీ, లిఖిత సాహిత్యానికీ తేడాలు తెలీవు. అక్కడి ప్రమాణాల్ని ఇక్కడ ఇక్కడి ప్రమాణాల్ని అక్కడ వాడుతుంటారు. అదోరకం అమాయికత్వం!. మరికొందరు తమకు విషయాలు అర్థం కాలేదన్న సంగతి బయటికి చెప్పకుండ మౌనంగా వుండిపోతారు. ఇదోరకం తెలివిడితనం. ఇంకొందరైతే తమకు కొన్ని విషయాలు తెలియవని ఒప్పుకోవడానికి బిడియపడి ప్రజలకు తెలియవు అని వాదిస్తారు. ఇదో రకం గడుసుతనం.

రచన :  28 సెప్టెంబరు 2019
ప్రచురణ :   

Thursday 26 September 2019

Social Issues and Personal Problems


మన  వ్యక్తిగత సమస్యలకన్నా మన కాన్వాస్ పెద్దదిగా వుండాలి
మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి

          మా అమ్మానాన్నలు భిన్న పార్శ్వాలు. మా నాన్న emotional; మా అమ్మ organizer. ఆ రెండు లక్షణాలు రెండు పార్శ్వాలుగా నాలో వున్నాయంటారు సన్నిహితులు. నాలోని emotional పార్శ్వానికి వారసుడు మా పెద్దాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి. వాడు artist and technician. నాలోని organizer పార్శ్వానికి వారసుడు మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి. వాడు గొప్ప crisis manager. మేము రెండు మతాలు కులాల కలయిక అని చెప్పడానికి మా పిల్లల పేర్లు అలా పెట్టాము. మతసామరస్యాన్ని చాటి చెప్పడం ఒక ఆదర్శం అనుకున్నాము.

                       
సన్నిహితుల్లో ఎవరికి ఎంతపెద్ద సమస్య వచ్చి పడినా చిటికెల్లో పరిష్కారం చూపించే స్తోమత అనిల్ ది. నేను వేసుకోవాల్సిన డ్రెస్సు, షూస్, పెట్టుకోవాల్సిన కళ్ళజోడు, వాచీలు చివరకు తాగాల్సిన మద్యం బ్రాండ్లు కూడ వాడే నిర్ణయిస్తుంటాడు. “Poor man’s luxurious drink Mansion House and rich man’s impoverish drink Johnny Walker Red label. And you are still dwelling between them” అంటాడు.

          కుటుంబ వ్యవహారాల్లో నాకో సలహాదారుడు అవసరమైనపుడు అనిల్ నే సంప్రదిస్తాను. నాకు సలహా ఇవ్వగల సమర్ధుడు వాడు. ఈ మధ్య వాడొక మాట అన్నాడు. “నాన్నా! మమ్మల్ని పెంచడానికీ, చదివించడానికీ, జీవితంలో స్థిరపడేలా చేయడానికీ నువ్వు అనేక త్యాగాలు చేసివుంటావు. ఏదైనా టూరిస్ట్ స్పాట్ కు వెళ్ళాలనుకుని వెళ్ళివుండవు. ఏదైనా పెద్ద బ్రాండు మందు తాగాలనుకుని తాగివుండవు. ఎవరైన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగుకు వెళ్ళాలనుకుని వెళ్ళి వుండవు. ఇప్పుడు మనకు వెసులుబాటు వుంది. వాటినన్నింటినీ నెరవేర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అన్నాడు. వాడు నాకు నచ్చాడు.

          ఉద్యమాల గురించి కూడ వాడి అభిప్రాయాలు భిన్నంగా వుంటాయి. “నువ్వు శిక్కుల్ని పట్టించుకోవడం గొప్ప విషయం; నువ్వు శిక్కువి కాదు కనుక. నువ్వు భోపాల్ గ్యాస్ బాధితుల్ని పరామర్శించడం గొప్ప విషయం; నువ్వు భోపాల్ వాసివి కాదుకనుక. నువ్వు కారంచెడు ఉద్యమంలో పాల్గొనడం గొప్ప విషయం; నువ్వు దళితుడివి కాదుకనుక. నువ్వు చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం గొప్ప విషయం; నువ్వు బాధితుడివి కాదుకనుక. నువ్వు యానాదుల కోసం సమాఖ్య పెట్టడం గొప్ప విషయం; నువ్వు ఆదివాసివి కాదుకనుక. ఇతరులు నిన్ను గౌరవించేది అందుకోసమే. కానీ, నువ్వు గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ వెళ్లడం, ముస్లిం హక్కుల కోసం మాట్లాడడం అంత గొప్ప విషయం కాదు; అది నీ సమస్య కనుక. నువ్వు  మగవాళ్ల సమస్యల గురించి మాట్లాడితే గొప్పెలా అవుతుందీ? That is your problem. నువ్వు మహిళల సమస్యల మీద మాట్లాడితే గొప్ప అవుతుంది. నీ కాన్వాస్ ఎప్పుడయినాసరే నీ వ్యక్తిగత సమస్యలకన్నా పెద్దదిగా వుండాలి” అంటాడువాడు.  

          పెద్దయ్యాక ఇన్ని పెద్ద మాటలు చెపుతాడని వాడు పుట్టినపుడు తెలీదు. ఇప్పుడు ఇన్ని పెద్ద మాటలు చెపుతుంటే వాడు పుట్టినందుకు ఆనందంగా వుంది.

Happy Birthday Anil !.


Tuesday 24 September 2019

there was no one left to speak for me.


నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు! 
ఉష యస్ డానీ  


నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు
ఉష యస్ డానీ  

వాళ్లు మొదట ముస్లింల కోసం వచ్చారు
నేను ముస్లింని కాదు గాబట్టి మాట్లాడలేదు.

తర్వాత వాళ్ళు క్రైస్తవుల  కోసం వచ్చారు
నేను క్రైస్తవుడ్ని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు అర్బన్ నక్సలైట్ల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టు విప్లవకారుడ్ని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను వర్గ నిర్మూలన వాదిని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు ప్రతిపక్షాల కోసం వచ్చారు
నేను రాజకీయ కార్యకర్తను కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు అంబేడ్కరిస్టుల కోసం వచ్చారు
నేను కుల నిర్మూలనవాదిని కాదు గాబట్టి మాట్లాడలేదు


తర్వాత వాళ్ళు హేతువాదుల  కోసం వచ్చారు
నేను నిరుపేద రామ భక్తుడ్ని గాబట్టి మాట్లాడలేదు

చివరకు  వాళ్ళు  నా  కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు.

(
జర్మనీ నాజిజం కాలపు లూథరన్  ఫాదర్ మార్టీన్ నీమోల్లర్ ప్రేరణతో


23 సెప్టెంబరు 2019

Fr. MARTIN NIEMÖLLER is perhaps best remembered for the quotation1 :

First they came for the socialists, and I did not speak out—because I was not a socialist.
Then they came for the trade unionists, and I did not speak out— because I was not a trade unionist.
Then they came for the Jews, and I did not speak out—because I was not a Jew.

Then they came for me—and there was no one left to speak for me.

Monday 23 September 2019

Danny Speech On Fascism and Julius Fučík


Danny Speech On  Fascism and Julius Fučík
8 September 2019
Talking Points

1.         అందరికీ పాత్రికేయుల అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవ  శుభాకాంక్షలు.

2.             జూలియస్ ఫ్యూజిక్ (Julius Fuchik) ను ఉరి తీసిన రోజును ఐక్యరాజ్య సమితి International day of solidarity of journalists గా ప్రకటింది.

3.         ఈ రోజు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు, గొప్ప నాటక ప్యయోక్త డాక్టర్ గరికపాటి రాజారావు జయంతి  కూడ.

4.          ఒక చారిత్రక సందర్భంలో ఒక సామాజిక బాధ్యతగా జరుగుతున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సభ నిర్వాహకులు విజయవాడ సాహితీ మిత్రులకు, ముఖ్యంగా శ్రీశ్రీ విశ్వేశ్వరరావుకు   కృతజ్ఞతలు.

5.         నన్ను వేదిక మీదికి ఆహ్వానిస్తూ నా గురించి అనేక మంచి మాటలు చెప్పిన కవి మిత్రుడు బండ్ల మాధవరావుకు ప్రత్యేక  కృతజ్ఞతలు.

6.         మిత్రులారా ! ఈ సభలో నా ప్రసంగ అంశాలు 1. జ్యూలియస్ ఫ్యూజిక్ జీవితం, 2. ఫాసిస్టుదాడి – రెండవ ప్రపంచ యుధ్ధం.

7.         ఇందులోని రెండు అంశాలు కూడ చాలా విస్తారమైనవి. వీటిని వివరించడానికి ఒక పూట కూడ సరిపోదు. అయితే బహిరంగ సభల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని ఒక 30 నిముషాల లోపు నా ప్రసంగాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తాను.

8.         నాతోపాటు వేదిక మీద కామ్రేడ్ తమ్మినేని  వీరభద్రం గారు, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు వున్నారు. వేదిక ముందు వున్నవారిలోనూ అనేక మంది పెద్దలు వున్నారు. రెండవ ప్రపంచ యుధ్ధం గురించి, జూలియస్ ఫ్యూజిక్ పోరాటం గురించీ అనేక వివరాలు మీకు తెలుసు. అంచేత నేను ఆ వివరాల్లోనికి ఎక్కువగా వెళ్ళకుండ కొన్ని ప్రధాన సంఘటనలను మాత్రమే మీ ముందు వుంచుతాను. .

9.         మిత్రులారా!

10.      రెండవ ప్రపంచ యుధ్ధం గురించీ,  ఫాసిజం, నాజిజంల గురించీ మరింత లోతుగా స్పష్టంగా, వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం మళ్ళీ ముందుకు వచ్చింది.

11.      మన దేశంలో 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తరువాత పఠనరంగంలో  జైలు డైరీల ప్రాముఖ్యత పెరిగింది. మేరీ టేలర్, భగత్ సింగ్, జూలియస్ ఫ్యూజిక్ పుస్తకాలను అప్పట్లో ఎక్కువగా  చదివేవారు.

12.      ఒక సుదీర్ఘ విరామం తరువాత  ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలకు ఆదరణ పెరుగుతోంది.

13.      ఎందుకంటే ఇప్పుడు    మన దేశం కూడ క్రమంగా ఫాసిస్టు, నాజీయిస్టు  ధోరణుల్లోనికి పోతున్నదనే అనుమానాలు బలపడుతున్నాయి. 

14.      సమాజంలో ఒక కొత్త చారిత్రక దశ ఆరంభం అవుతున్నప్పుడు గతంలో సాగిన అలాంటి దశను అధ్యయనం చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అది అవసరం కూడ.

15.      మనం కొంత కాలం ప్రజాస్వామ్యం ముసుగులో సాగిన నియంతృత్వాన్ని చూశాము. మరి కొంత కాలం ముసుగు కప్పిన ఫాసిజంలో బతికాం. ఇప్పుడు ఫాసిజం ముసుగు తీసేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఫాసిజం బాహాటంగా ముందుకు వచ్చేస్తే ఏం చేయాలనే ఆలోచనలు కూడ మనలో  మొదలయ్యాయి.

16.      అయితే, మనం గతాన్ని  అధ్యయనం చేసేది గతాన్ని ఉధ్ధరించడానికి కాదు.

17.       చరిత్ర అనేది ఎన్నడూ గతం కాదు. చరిత్ర వర్తమానం కూడా కాదు. చరిత్ర అంటే భవిషత్తు.

18.      వర్తమానం తన భవిష్యత్తును నిర్మించుకోవడం కోసమే గతాన్ని తలచుకుంటుంది. గతం నుండి కొన్ని పరికరాలను తెచ్చుకుంటుంది.


19.    1942-43ల్లో ఒక 14 నెలలపాటూ ప్రాంకాస్ జైలులో తన అనుభవాలని రహాస్యంగా చిన్న చిన్న కాగితపు ముక్కల మీద రాసి బయటికి పంపించేవాడు జూలియస్ ఫ్యూజిక్. యుధ్ధానంతరం అతని భార్య గుస్తా ఫ్యూజికోవ ఆ చీటీలను Notes from the Gallowsగా అచ్చు వేసింది. కొన్ని దేశాల్లో  "the Report with a noose around his neck"  అనే పేరుతోనూ ఇవి అచ్చు అయ్యాయి. 

20.      మన దేశంలో, మన రాష్ట్రంలో,  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే జవహర్ లాల్ నెహ్రు మార్కు నియంతృత్వాన్ని మనం చూశాం. 1948 సెప్టెంబరులో నైజాం సంస్థానం మీద ‘పోలీస్ యాక్షన్’ సమయంలో వేలాది మంది ముస్లింలను , ఆ వెనుక మళ్ళీ వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తల్ని చంపిన చరిత్ర నెహ్రూది.

21.       నేహ్రు క్రౌర్యాన్ని చూసిన పరుచూరి కోటేశ్వరరావుగారు 1960లలో జూలియస్ ఫ్యూజిక్  Notes from the Gallows ను ‘రక్తాక్షరాలు’గా తెలుగులో అనువాదం వేశారు.

22.      ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ మార్కు నియంతృత్వాన్ని చూసిన చలసాని ప్రసాదరావుగారు 1980లో Notes from the Gallows ను మరొక్కసారి ‘రక్తాక్షరాలు’ పేరుతోనే  అనువాదం వేశారు.

23.        సరిగ్గా ఆ రొజుల్లోనే నేను రెండు ప్రపంచ యుధ్ధాల మధ్య కాలంలో, ఫాసిస్టు ఇటలీ, నాజీ జర్మన్ లు సాగించిన నరమేధం నేపథ్యంలో జూలియస్ ఫ్యూజిక్ ను ఒక ప్రొటోగానిస్టుగా తీసుకుని పుస్తకం రాయాలనుకున్నాను. 

24.      ఫాసిజం, నాజిజంలు అతి భయంకరమైనవి అతి బలమైనవి అయినప్పటికీ  ఓడించసాధ్యం కానివి మాత్రంకాదు. ఎర్రసైన్యం చేతిలో ఫాసిజం, నాజిజం రెండూ కుక్క చావు చచ్చాయి అని గుర్తు చేసి కొత్త తరాలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే నా పుస్తకం లక్ష్యం.

25.        ఉద్యమ రచనలు అన్నీ స్థానిక అవసరాలలో పుడతాయి.  అంతర్జాతీయ అనుసంధానంతో ఒక పరిపూర్ణతను సాధిస్తాయి. అంతిమంగా స్థానికులకు ఒక ఉత్తేజాన్ని ఇస్తాయి. థింక్ గ్లోబల్లి యాక్ట్ లోకల్లి అంటే అదే.

26.        పరుచూరి కోటేశ్వరరావు గారు అయినా, చలసాని ప్రసాదరావు గారు అయినా, నేనయినా జెక్ ప్రజల కోసం రచనలు చేయలేదు. తెలుగు ప్రజల కోసమే పుస్తకాలు ప్రచురించాం. ఫ్యూజిక్ ను కథాంశంగా తీసుకున్నాం. నియంతృత్వాన్ని, దాని క్రౌర్యాన్ని కథా వస్తువుగా స్వీకరించాం. 

27.       ఎర్రసైన్యం ముస్సోలినీ హిట్లర్ సైన్యాలను ఓడించి బెర్లిన్ నగరంలో ప్రవేశించిన మేడే రోజే 1981లో నా 'జూలియస్ ఫ్యూజిక్' పుస్తకావిష్కరణ సభ విజయవాడలో జరిగింది.

28.        దాదాపు నలభై యేళ్ల తరువాత కూడ నా పుస్తకం మీద చర్చ జరుగుతున్నదంటే రచయితగా చాలా ఆనందంగా వుంది.  కానీ, ఒక సామాజిక కార్యకర్తగా ఇది నాకు ఏమాత్రం ఆనందాన్ని ఇచ్చే అంశం కాదు. 

29.      నా జూలియస్ ఫ్యూజిక్ ను రెండుసార్లూ విశ్వేశ్వరరావే ప్రచురించాడు.  ఆ పుస్తకం మీద    ఇంతటి ప్రేమను పెంచుకోవడానికి తనకు కూడ ఒక స్థానిక ప్రేరణ వుంది. నెహ్రూ మార్కు నియంతృత్వ నిర్భంధ  రాక్షసత్వాన్ని చవిచూసిన  కాటూరు-ఎలమర్రు గ్రామంలోనే విశ్వేశ్వరరావు పుట్టాడు. ఆ ప్రభావం అతను మనసు మీద ఇప్పటికీ వుంది. అంచేత అతను ప్రపంచంలో నిర్భంధం, నియంతృత్వం ఎక్కడున్నా వ్యతిరేకిస్తాడు. నిర్భంధానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లను ప్రేమిస్తాడు.

30.      తత్వశాస్త్రంలో సబ్జెక్టివ్ నుండి ఆబ్జెక్టివ్, స్పెసిఫిక్ టు జనరల్, పర్టిక్యూలాటి టు యూనివర్శాలిటీకి  చేరుకోవడం అంటే ఇదే.

31.      ఏదైనా వ్యక్తిగతం నుండి విశ్వగతంకు చేరుకోవాలి. మాతృప్రేమ అంటే మన తల్లిని ప్రేమిస్తే సరిపోదు. మాతృదేశాన్ని కూడ అంతే ప్రగాఢంగా ప్రేమించాలి.

32.      అయితే దేశభక్తిలో నా దేశభక్తికీ  నరేంద్ర మోదీ, అమిత్ షాల దేశభక్తికి బోలెడు తేడా వుంది. 

33.      జూలియస్ ఫ్యూజిక్ అయినా ఈరోజు ఇక్కడ మరి కాస్సేపటిలో ఆవిష్కరించబోతున్న నాకథ ‘మదర్సా మేకపిల్ల’ అయినా dystopian రచనలే. Utopian రచన పదికాలాలు బతకాలి. Dystopian రచన సాధ్యమైనంత త్వరగా ప్రాసంగికతను కోల్పోవాలి. ఒక Dystopian రచన ఎక్కువ కాలం బతికి వుందంటే సమాజంలో ఆ రచయిత ఆశించిన మార్పు సరాలేదని అర్థం.  ఇది బాధాకరమే! 

34.      జూలియస్ ఫ్యూజిక్ అనేక రంగాలలో అనేక విభాగాలలో నిపుణుడు. కవి, గాయకుడు, రచయిత, నటుడు, సాహిత్య విమర్శకుడు, ఉద్యమ కారుడు, పాత్రికేయుడు, జెకోస్లావోకియా కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపకుల్లో ఒకడు. నాజీల మీద తిరగబడినవాడు. నాజీల నిర్బంధాన్ని స్వయంగా అనుభవించినవాడు. చివరకు నాజీల క్రౌర్యానికి  బలయినవాడు.

35.      మొదటి ప్రపంచ యుధ్ధానికి ముందు జెకోస్లావోకియా రాజధాని ప్రాగ్ నగరంలోని  ఒక మురికివాడలో పుట్టాడు. రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో బెర్లిన్ లోని ప్లాట్ జెన్సీ జైలులో ఉరికంభం మీద చనిపోయాడు.

36.      కొలిమిలో ఇనుము ఉక్కుగా మారినట్టు పొరాటాల్లో, ఉద్యమ సాహిత్యంలో నిర్బంధాల్లో, చిత్రహింసల్లో ఫ్యూజిక్ రాటుదేలాడు.

37.      ఆయా సందర్భాలలో ఫ్యూజిక్ వాడిన  ఒన్ లైనర్స్ ప్రపంచ పీడిత ప్రజల్ని ఇప్పటికీ ఉత్తేజ పరుస్తూనేవున్నాయి.

38.      నాజీ  వోక్స్ గెరిచేస్టోఫ్ కోర్టు న్యాయమూర్తి రోలాండ్ ఫ్రేయిజ్లర్  అతని తలతీసి వేయమని తీప్రు చెప్పినపుడు ఫ్యూజిక్ చేసిన ప్రకటన వింటుంటే ఇప్పటికీ వొళ్ళు గగుర్పొడుస్తుంది.

39.      “తల తీసివేసినంతమాత్రాన మనిషి అల్పుడైపోడు”. Man does not become less even he is made shorter by a head.

40.      ప్రజలారా! మిమ్మల్ని  ప్రేమించాను. మీ జాగ్రత్తలో మీరుండండి. People! Be on your guard.

41.      “మేమంతా సోషలిస్టు విప్లవాల కోసం ఈ భూమిలో నాటబడిన విత్తనాలం. ఈరోజు కాకపోతే రేపయినా  వసంత కాలం రాకమానదు. మాలో అన్నీ కాకపోయినా కొన్ని విత్తనాలయినా మొలకెత్తక మానవు”.

42.      ఫాసిజానికి మృత్యువు. మానవునికి స్వేఛ్ఛ. కమ్యూనిజానికి భవితవ్యం”

43.      ఫాసిజం, నాజిజాలను అధ్యయనం చేయాల్సిన అవసరం రావడంతో అనేకులు ఈమధ్య  లైబ్రరీల మీద పడి అలనాటి ఇటలీ, జర్మనీ రాజకీయార్ధిక పరిణామాల్నీ, అప్పటి తత్వవేత్తల పుస్తకాలనీ తెగ చదివేస్తున్నారు.

44.      ఫాసిజం, నాజిజాలను అధ్యయనం కి భారతీయులు అంత దూరం వెళ్ళాల్సిన పనిలేదు. మన ‘మనుస్మృతి’యే ‘చండాలుడు’ సిధ్ధాంతంతో సహా జర్మనీకి చేరి  ప్రైడరిక్ నీషేను గొప్పగా ప్రభావితం చేసింది. చుండూరును ఇంగ్లీషులో T s u n d u r u అని రాసినట్టు చండాలను నీషే T s c h a n d a l a అని రాశాడు.  

45.        నీషే తరువాత అతని సోదరి ఎలిజబెత్ ఫోర్స్ టర్ నీషే ద్వార హిట్లర్ కు చేరి  ఆ నియంతకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. నీషే రచనల సమగ్ర సంకలనాన్ని మరో నియంత బెనిటో ముస్సోలినికి పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు హిట్లర్. 

46.      ఆర్య సంస్కృతి, సమానత్వ సిధ్ధాంత నిరాకరణలతోపాటూ స్వస్తిక్ చిహ్నం, సూపర్ మ్యాన్ భావన  సహితం జర్మన్ మతతత్త్వ నియంతకు గొప్పగా నచ్చేశాయి.

47.      నిఘంటువు అర్థంలో ఫాసిజం అంటే ఇటలియన్ భాషలో కట్టెల మోపు అని అర్థం. నాజిజం అంటే జర్మనీ భాషలో జాతీయ సామ్యవాదం అని అర్థం.  నిఘంటువు అర్థాలు వేరు ఆచరణాత్మక అర్థాలు వేరు.

48.        మన దేశంలో 1980లో భారతీయ జనతా పార్టి ఏర్పడినపుడు దాని రాజకీయ సిధ్ధాంతం గాంధీయ సోషలిజం. దీన్ని వాళ్ళు హిట్లర్ జాతీయ సోషలిజం నుండి ఎరువు తెచ్చుకున్నారు.

49.       ముస్సోలినీ, హిట్లర్ లు ఫాసిజం అన్నా నాజిజం అన్నా, బిజెపి మరోమాట అన్నా రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థల్లో దాని సాంకేతిక నామం మతవర్గతత్వ నియంతృత్వం. ఇంకా ఎంతకాలం మనం ఇటలియన్, జర్మన్ పదాలనే వాడుతుంటాం.

50.      1984 నాటి ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధి హత్య తరువాత శిక్కుల ఊచకోతల నేపథ్యంలో  కేవి రమణా రెడ్డిగారు మతవర్గతత్వం అనే ఒక సిధ్ధాంత వ్యాసాన్ని రాశారు.

51.       మన సాంప్రదాయ కమ్యూనిస్టుల మీద నాస్తికవాద హ్యాంగోవర్ బలంగా వుంటుంది. అంచేత, ఒక మతాన్ని వర్గం అనవచ్చునా? అనే సందేహం ఇటీవలి కాలం వరకు బలంగా వుండేది.

52.      మొన్నటి లోక్ సభ ఎన్నికలు ఆ సందేహాలను మొత్తంగా పటాపంచలు చేసేశాయి. ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగా, రాజకీయ సిధ్ధాంతాల ప్రాతిపదికగా జరగలేదు. హార్డ్ హిందూత్వ, సాఫ్ట్ హిందూత్వ, నాన్ హిందూత్వల మధ్య జరిగాయి. ఎప్పుడూ ఎలాగూ స్వల్ప మినహాయింపులు వుంటాయి గానీ స్థూలంగా దేశమంతటా ఇదే సూత్రం పనిచేసింది.

53.      ఇప్పుడు మనమంతా ఫాసిజంను ఎదుర్కోవడానికి జర్మనీ భాష నేర్చుకొని నీషేను అధ్యయనం చేయవలసిన పనిలేదు.

54.      సామాజిక రంగంలో మనువాదాన్ని ఎదుర్కోవడానికి జ్యోతిబా ఫూలే, పెరియార్ ఇవి రామసామి నాయకర్ బీఆర్ అంబేడ్కర్ లను అధ్యయనం చేసితీరాలి.  మరో మార్గం లేదు. 

55.        భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక రంగంలో వర్గం వున్నట్టే, సామాజికరంగంలో  కులం మతం తెగ లింగం కూడ తప్పనిసరి అస్తిత్వాలుగా  వుంటాయి.  మినహాయింపు ఏ ఒక్కరికీ లేదు.

56.        ఎవరో కొందరు తమకు కులం లేదనో మతం లేదనో చెప్పుకోవచ్చు.  కానీ ఆచరణలో అలా కుదరదు. నేను అనేకమంది కమ్యూనిస్టు ప్రముఖుల అంత్యక్రియల్లో పాల్గొన్నాను. వాళ్ళు హిందువులయితే దహనం చేస్తారు. ముస్లింలు అయితే ఖననం చేస్తారు. అంటే చనిపోయాక మాత్రమే  కమ్యూనిస్టులకు మతం వస్తుందా? బతికుండగా మతం వుండదా? ఇదేమి హిప్పోక్రసీ?  

57.        ఈ రోజు భారతదేశంలో సంఘ పరివారం కుల మతాలను గుర్తిస్తూ బలపడుతున్నది. కమ్యూనిస్టు పార్టీలు కులమతాలను నిరాకరిస్తు బలహీన పడుతున్నాయి. ఇదొక వాస్తవం.
58.        కమ్యూనలిజం అన్ని సందర్భాల లోనూ నెగటివ్ గానే వుంటుందనే నేరేటివ్ నుండి ముందు మనం బయటపడాలి. పాజిటివ్ కమ్యూనలిజం అనేది కూడా ఒకటి వుంటుందని గుర్తించాలి. ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ అనే సూత్రం లేకుండా  ఉద్దీపన చర్యలు సాధ్యం కావుకదా! ఇదీ అంతే.

59.        ఈరోజు ప్రపంచ రాజకీయార్థిక ధార్మిక రంగాల్లో యూదుల పాత్ర అత్యంత వివాదాస్పదమే గానీ జర్మనీలో నాజీజాన్ని ఎదుర్కోవడంలో వాళ్లు నిర్వహించిన పాత్ర చాలా సానుకూలమైనది. మనకు ఇలాంటి గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అలవడాలి. చారిత్రక దశలను బట్టి సామాజిక సమీకరణలు వుంటాయి.  

60.        పాజిటివ్ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే స్త్రీపురుష సంబంధాల్లో స్త్రీల పక్షాన నిలబడడం, పాజిటివ్ క్యాస్ట్  డిస్క్రిమినేషన్ అంటే కుల సంఘర్షణల్లో దళితులు బహుజనులపక్షాన నిలబడడం, పాజిటివ్ ట్రైబ్స్ డిస్క్రిమినేషన్ అంటే అడవి మైదాన ప్రాంతాల మధ్య సాగే ఘర్షణల్లో అడవి పక్షాన నిలబడడం, పాజిటివ్ కమ్యూనల్  డిస్క్రిమినేషన్ మత సంఘర్షణల్లో  అల్పసంఖ్యాకుల పక్షాన నిలబడడం. 

61.        కళ్ళముందు ఒక ఘర్షణ జరుగుతున్నప్పుడు బలహీనుల పక్షం వహించి బలవంతుల్ని ఎదుర్కోవాలి. అంతేతప్ప ఎవరి పక్షమూ కాదు అని అంతే తప్ప ఎవరి పక్షమూ కాదు అని ప్రకటిస్తే  వర్తమాన సమాజంలో వాళ్ళకు స్థానం వుండదు.

62.        మనలో చాలామందికి తెలియని విషయం ఏమంటే అంబేడ్కర్ కన్నా, ఫూలేకన్నా ముందే భారత సమాజంలో కుల సమస్య గురించి మాట్లాడిన వాడు కార్ల్ మార్క్స్. అంతేకాదు బ్రాహ్మణీయ వ్యవస్థను కూడా ఆయన పరిశీలించాడు. కుల వ్యవస్థ పోకుండా కింది వర్గాలు / కులాలకు ఆర్ధిక ఫలాలు దక్కవు అని చాలా స్పష్టంగా హెచ్చరించాడు. 

63.      A country not only divided between Mahommedan and Hindoo, but between tribe and tribe, between caste and caste; a society whose framework was based on a sort of equilibrium, resulting from a general repulsion and constitutional exclusiveness between all its members.

64.        అనుమానం వున్నవాళ్ళు 1853లో న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్ కు మార్క్స్ రాసిన వ్యాసాల్ని చదవండి.  అంతేగానీ కమ్యూనిస్టులకు కులం లేదు; మతం లేదు వంటి వట్టి మాటలు  చెప్పొద్దు. సాక్షాత్తు మార్క్స్ ను సహితం హైగేట్ యూదు శ్మశానంలోనే ఖననం చేశారు. 

65.        “కులం అనేది శ్రమ విభజన మాత్రమే కాదు శ్రామికుల విభజన కూడ” అన్నాడు అంబేడ్కర్. "Caste is not just a division of labour, it is a division of labourers". 

66.         “కులనిర్మూలన జరగాలంటే శ్రామికుల ఐక్యత జరగాలి" అనే కద అర్థం!. మరి శ్రామికుల్ని ఏకం చేయడం మార్క్సిస్టుల పనికాదా?

67.      అంబేడ్కర్ రాజకీయ అనుబంధాలతో మనలో కొందరికి భిన్నాభిప్రాయాలు వుండవచ్చుగాక. వున్నాయి కూడ. ఆ భాగాన్ని పక్కన పెట్టయినా సరే అంబేడ్కర్ సాంఘీక విశ్లేషణను  చదవాలి.

68.        ఛార్లెస్ డార్విన్ ను చదవకుండ జీవపరిణామ సిధ్ధాంతం అర్థం కానట్టు, కార్ల్ మార్క్స్ ను చదవకుండ పెట్టిబడీదారీ వ్యవస్థ అర్థం కానట్టు, బాబాసాహెబ్ రాంజీ అంబేడ్కర్ ను చదవకుండ కులవ్యవస్థ అర్థంకాదు.

69.        కులమత వర్గ వ్యవస్థను  అర్థం చేసుకోకుండా ఫాసిజాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. 

70.      జర్మనీ నాజిజాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఒక షార్ట్ కట్ రూట్ వున్నది.  అలనాటి అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ గోబ్బెల్స్ లను చూడలేకపోయాం అని బెంగపడాల్సిన పని కూడ లేదు. మనకూ నరేంద్ర మోదీజీ వున్నారు. అనిత్ షాజీ వున్నారు.

71.      అయితే వీరిలో ఎవరు హిట్లర్ ఎవరు గొబ్బెల్స్ అనేది పెద్ద సందేహం. మోదీజీ ఫస్ట్ టెర్మ్ లో ఆయన హిన్ను  హిట్లర్ లా కనిపించేవారు; అమిత్  భాయి గొబ్బెల్స్ లా కనిపించేవారు. ఇప్పటి మోదీజీ టు-డాట్ ఓ (2.O) ప్రభుత్వం ఏర్పడ్డాక అమిత్ షా  హిట్లర్ లా కనిపిస్తున్నారు;  మోదీజీ గొబ్బెల్స్ లా కనిపిస్తున్నారు.

72.      బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకుడు రజినీ పామే దత్ రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసిన తరువాత ‘ఫాసిజం – సోషల్ రివల్యూషన్ అనే 350 పేజీల పుస్తకం రాశాడు. ఫాసిజాన్ని, నాజీజాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ అది ఒక మంచి పుస్తకం.

73.      కమ్యూనిస్టుల సాంప్రదాయ అవగాహన  ఏమంటే పెట్టుబడీదారీ వ్యవస్థలో ఉత్పత్తి అత్యున్నత దశకు చేరుకున్న తరువాత ఉర్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడ సోషలిస్టు విప్లవం వస్తుందని. సోషలిజం తొలుత ఇంగ్లండ్ లో వస్తుందని కార్ల్ మార్క్స్ కూడ ఊహాగానం చేశాడు. కానీ పెట్టుబడీదారీ వ్యవస్థ అంతగా ఎదగని తృతీయశ్రేణి దేశం రష్యాలో తొలి సోషలిస్టు సమాజం ఏర్పడింది. .

74.      ఫాసిజం కూడ అంతే. మరీ భారీ ఆర్ధిక వ్యవస్థల్లో కాకుండా సంక్షోభాల్లో కొట్టు మిట్టాడుతున్న ఇటలి, జర్మనీదేశాల్లో వచ్చాయి.

75.        ఈ సూత్రాన్ని కొనసాగిస్తే, ఈనాటి గ్లోబల్ ఆర్ధిక సంక్షోభంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్తలైన అమెరిక, చైనాలకన్నా ఐదు స్థానాలు కింద వున్న భారతదేశంలో ఫాసిజం-నాజిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

76.      పామే దత్ మరో మాట కూడ అన్నాడు; కార్పొరేట్లలో లుంపెన్ స్వభావం గల ఒక మైనార్టి వర్గమే పాసిజాన్ని నియంత్రిస్తుంది అని. ఈ సూత్రం కూడ ఇప్పటి మన ఆర్థిక కవ్యవస్థలో పని చేస్తున్నదని అనిపిస్తోంది.

77.      ప్రజాస్వామ్యం అంటేనే అధికారాల వికేంద్రీకరణ. చట్ట సభల్లో అయినా, సమాజంలో అయినా మైనారిటీల  భావోద్వేగాలను  మెజారిటీ గౌరవించడం ప్రజాస్వామ్యం.  అంతే తప్ప ప్రజలు అధికారాన్ని ఇచ్చారనే వంకతో అధికారపక్షం మైనారిటీ పక్షాల మీద కాలుదువ్వడం  నియంతృత్వం అవుతుందిగానీ ప్రజాస్వామ్యం కాదు.

78.        గతంలో అయితే అధికారా పీఠాన్ని ఎవరు అధిష్టించాలి? అనేది ప్రజలు నిర్ణయించేవారు. ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు నిర్ణయిస్తుండడంతో ప్రజలు ఇచ్చిన అధికారం అనే మాట కూడ అనుమానాస్పదంగా  మారిపోయింది.  

79.      ప్రభుత్వ విధుల్ని న్యాయ, చట్టనిర్మాణ, కార్యనిర్వాహకవర్గ వ్యవస్థలకు పంచితే అది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం కార్పొరేట్లు కలిసిపోతే అది ఫాసిజం.

80.      ఈ మాట స్వయంగా ముస్సోలినీ యే అన్నాడు. “Fascism should more appropriately be called Corporatism because it is a merger of state and corporate power”.  

81.        ముస్సోలిని మాటలకు  అర్థం ఏమంటే మోదీజీ ఆడానీలు కలిసి పోవడం అని అర్థం, అమిత్ భాయి ముఖేష్ అంబానీ ఏకం అయిపోవడం అని అర్థం.

82.        కశ్మీర్ కు ప్రత్యేక హక్కుల్ని ఇచ్చే ఆర్టికల్ 370, 35 ఏ లను  తొలగిస్తూ ఆగస్టు 6న భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ తీర్మానం చేసింది. ఆగస్టు 12న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం జరిగింది.  ఆ సమావేశంలో మనదేశ అత్యంత సంపన్నుడయిన ముఖేష్ అంబానీ కశ్మీర్ లో భారీ పెట్టుబడుల్ని పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

83.        కశ్మీర్ ప్రత్యేక హక్కుల్ని తీసేసినందుకు ముఖేష్ అంబాని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారా? లేక  ముఖేష్ అంబాని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీలుగా కశ్మీర్ ప్రత్యేక హక్కుల్ని రద్దు చేశారా? అనేది ఎవరికయినా రావలసిన సందేహం.

84.      భారత దేశాన్ని ఐదేళ్ళలో ఐదు  ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ప్రధాని నరేంద్ర మోదీజి తరచుగా అంటున్నారు. ఎర్రకోట బురుజు మీద నిలబడి చేసిన స్వాతంత్ర్య  దినోత్సవ ప్రసంగంలోనూ వారు ఆ మాట మరోసారి అన్నారు. ఆ లక్ష్యాన్ని దాన్ని సాధించాలంటే సాలీన జిడిపి అభివృధ్ధి రేటు 14 శాతం కన్నా ఎక్కువగా వుండాలి. ప్రస్తుతం మన జిడిపి అభివృధ్ధి రేటు క్రమంగా తగ్గుతూ 5 శాతానికి పడిపోయింది. యూపియే మన్మోహన్ సింగ్  హయాంలో అది దాదాపు 10 శాతానికి పైగా వుంది. కొలమానాలు మార్చేశారు కనుక ఇప్పుడు అది నికరంగా 5 శాతం కూడా లేదు అని బిజెపికే చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా అంటున్నారు.

85.        ఈలోగా మళ్ళీ ముఖేష్ అంబానీ అమిత్ భాయి ఏదైనా చేయగలరు. దేశాన్ని త్వరలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగలరు అని మరో ప్రకటన చేశారు.

86.        మన దేశంలో అధికారపక్షం భాషను కార్పొరేట్లు మాట్లాడుతున్నారు. కార్పొరేట్ల భాషను అధికారపక్షం మాట్లాడుతోంది. గతంలో ఈ సాంప్రదాయం ఇంత బాహాటంగా లేదు.


87.      ఇంతకీ మతవర్గతత్వ నియంతృత్వం ఏ కర్తవ్యాలను నిర్వహించడానికి ఆవిర్భవిస్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్న. మతవర్గతత్వ నియంతృత్వం రెండు రంగాల్లో చురుగ్గా పనిచేస్తుంది. మొదటిది, ఆర్థిక రంగం, రెండోది సాంస్కృతిక రంగం.

88.        వర్తమాన భారత సమాజపు మేధో విషాదం ఏమంటే ఆర్థిక రంగాన్ని పట్టించుకునేవాళ్ళు సాంస్కృతిక రంగాన్ని పట్టించుకోరు; సాంస్కృతిక రంగాన్ని పట్టించుకునేవాళ్ళు ఆర్థికరంగాన్ని పట్టించుకోరు.

89.        ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే మార్క్సిస్టులు వర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నారుగానీ కులమతాల గురించి మాట్లాడడం లేదు. అంబేడ్కరిస్టులు కులమతాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారుగానీ వర్గం గురించి మాట్లాడడం లేదు.

90.        చారిత్రకంగా ఐక్యం కాలసిన ప్రజా సమూహాలు  ఇప్పుడు రెండు శత్రు శిబిరాలుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్స్ వెర్సెస్ అంబేడ్కర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఈ రెండు శిబిరాలు కలవాల్సిన అవసరం వుంది.

91.      ఇంతకన్నా ప్రమాదకర ధోరణి ఏమంటే, కొన్ని ప్రాంతాల్లో  అంబేడ్కరిస్టులు  సంఘపరివారంతో అయినా జట్టు కడతాం  కానీ మార్క్సిస్టులతో  పొసగదు అంటున్నారు.  మరికొన్ని ప్రాంతాల్లో మార్క్సిస్టులు కూడ సంఘపరివారంతో అయినా జట్టు కడతాం  కానీ అంబేడ్కరిస్టులతో పొసగదు అంటున్నారు.

92.      పెట్టుబడీదారీ రాజ్యం ఇతర సందర్భాలలో ఆర్థికరంగంలో ఏం కర్తవ్యాలను నిర్వహిస్తుందో  మతవర్గతత్వ నియంతృత్వం కూడ అవే పనులు చేస్తుంది. అయితే, కొంచెం వేగంగా చేస్తుంది. కొంచెం బరి తెగించి చేస్తుంది. ఎక్కువ పక్షపాతంతో చేస్తుంది. జాతి వివక్ష అనేది పరిపాలనా విధానం అయిపోతుంది.

93.      సంపదను సృష్టించే  భూమి, అడవులు, ఖనిజాలు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు తదితర సహజ వనరులన్నింటినీ  కార్పొరేట్ల పరం చేసేస్తుంది.  

94.      దేశంలోని రేవు పట్టణాలన్నింటినీ ఆడానీలకు, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలను అంబానీలకు రాసి ఇచ్చేస్తుంటే ప్రజలు ఊరుకుంటారా? 

95.      జనాభాలో అత్యధికులుగా వుండే  సామాన్య ప్రజలు నిరుపేదలు  దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

96.      పోలీసులు, లాఠీలు, తుపాకులు, జైళ్ళు, ఉరికొయ్యలతో వాళ్ళ నోళ్ళను నొక్కే ప్రయత్నం ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది. అశాంతిని అదుపు చేయడానికి సైన్యాన్ని కూడ రంగంలోనికి దించవచ్చు. అయితే, అది సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకంలేదు. ప్రజలు తెగబడి పోరాటాలకు సిధ్ధపడితే అంతర్యుధ్ధం చెలరేగవచ్చు.

97.      అంతర్యుధ్ధ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి కార్పొరేట్ రాజ్యం  ప్రజల్నిమనం – వాళ్ళు అని చీలుస్తుంది. వాళ్ళు అంటే అన్యులు, ఇతరులు, పరాయివాళ్ళు, శత్రువులు ఇలా ఎన్ని అర్థాలయినా చెప్పుకోవచ్చు.

98.      మతమైనార్టీలను బూచీలుగా చూపెట్టి మిగిలిన సామాజికవర్గాల్లో ఒక బూటకపు జాతీయ  ఉన్మాదాన్ని సృష్టించి తన ఓటు బ్యాంకును విస్తరింప చేసుకుని తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక అడ్డదారులు తొక్కుతుంది ఫాసిజం. .

99.      ప్రజల్లో చీలికలు తేవడానికి కార్పొరేట్ రాజ్యానికి అనేకానేక అస్థిత్వాలు అందుబాటులో వుంటాయి. భాష, కులం, మతం, తెగ, ప్రాంతం వర్గం, మొదలైనవన్నీ అస్థిత్వాలే.

100.    ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయమే తీసుకుందాం. నిర్వాశితులు కాబోతున్న ఆదివాసులకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతంలో వున్న వారందరూ ఏకం అవుతున్నారు. నిజానికి మైదాన ప్రాంతంలో వున్నవారందరికీ పోలవరం వల్ల మేలు జరుగుతుందా? కృష్ణా డెల్టాలో వ్యవసాయ భూములున్న వారికి మాత్రమే మేలు జరుగుతుందా? డెల్టావ్యవసాయదారులకు అది లైఫ్ లైన్ కావచ్చుగానీ  ఆదివాసులకు లైఫ్ లైన్ కాదుకదా!  ఆదివాసులకు లైఫ్ లైన్ అడవి. మనం ఆదివాసుల్ని  మనలో భాగం అనుకోవడంలేదు. “వాళ్ళు”, “అన్యులు” “ఇతరులు” “శత్రువులు” అనుకుంటున్నాము.

101.    సమాజంలోని అస్థిత్వాలన్నింటిలోనూ పదునైన, బలమైన ఆయుధం మతం.

102.   అయితే, మతాన్ని నేరుగా రాజకీయాల్లోనికి తేవడం విద్యాధికులైన మధ్యతరగతి వర్గానికి అంతగా రుచించదు. వాళ్ళు అభ్యంతరం చెపుతారు. వాళ్లను దారికి తెచ్చుకోవడానికి ఒక మార్గం వుంది.   కార్పొరేట్లు బలపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని  వాళ్లను నమ్మిస్తారు.  

103.   అప్పుడు, మతం దేశభక్తి కలగలిసి ఒక్క రూపాయి ఖర్చు కూడ లేకుండా ఒక బలమైన అసంఖ్యాక స్వఛ్ఛంద సాంస్కృతిక సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పడుతుంది.



104.   ప్రభుత్వానికీ, కార్పొరేట్లకూ అనుకూలంగా స్థాయీ సైన్యం సహితం చేయలేని అనేక పనుల్ని సాంస్కృతిక సైన్యం సునాయాసంగా  చేసి పడేస్తుంది.

105.   ఇటలీలో ముస్సోలినిబ్లాక్ షర్ట్స్పేరుతో ఫాసిస్టు మూకల్ని సృష్టిస్తే, జర్మనీలో అడాల్ఫ్  హిట్లర్షుట్జ్ స్టాఫెల్ (ఎస్ఎస్) పేరుతో నాజీ మూకల్ని సృష్టించాడు.

106.   జనం పిచ్చోళ్ళా? ప్రజలు అంత సులువుగా రిక్రూట్ అయిపోతారా? అనే మాటలూ వినిపిస్తున్నాయి. జనం అటుకేసి వెళుతారు. గుంపులు గుంపులుగా వెళుతారు. అందుకు కారణం మనిషి స్వభావంలోనే అంతర్గతంగా వుంటుంది.  

107.   మనిషి స్వభావసిధ్ధంగా వున్నతుడు అని ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు ఒక గొప్ప విషయాన్ని చెపుతున్నట్టు మనమంతా నమ్ముతాము. కానీ, మనిషి స్వభావసిధ్ధంగానే చెడ్డవాడు అని ఎవరైనా అంటే వాళ్ళు అంతకన్నా మహత్తర విషయాన్ని చెపుతున్నారని మాత్రం మనం మరిచిపోతాం అన్నాడు జర్మన్ తత్వవేత్త జోర్జ్ విల్హెమ్ ఫ్రైడ్రిక్  హెగెల్.

108.    ప్రకృతిలో జీవితో పోల్చినా అతి క్రూరమైన జీవి మనిషి. తనను సృష్టించిన ప్రకృతినే కబళించాలనుకునే కృతఘ్నుడు. ఒక రోజు తాను సహితం నాశనం అయిపోతానని తెలిసినా ప్రకృతి విధ్వంసాన్ని ఆపని స్వార్ధపరుడు మనిషి.

109.   దేశంలో సంచలనాత్మక హత్యల్ని చేయిస్తున్నది ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు కాదు; వేల కోట్ల రూపాయల రాజ ప్రసాదాల్లో నివశిస్తున్న శ్రీమంతులు. వీటి అర్ధం ఏమంటే భూమ్మీద అత్యంత ప్రమాదకర జీవి మనిషి.

110.   మనిషి మాంసం రుచి మరిగి మ్యాన్ ఈటర్ గా మారిన పులిని అడవినంతా గాలించి చంపేస్తారు ఆటవికులు. వ్యక్తిగత ఆస్థి రుచి మరిగిన మనిషి తమ మధ్య సంచరిస్తున్నా మౌన ప్రేక్షకుల్లా వుండిపోతారు నాగరీకులు. ఆటవికులకు వున్నంత సామాజిక బాధ్యత ఈ నాగరీకులకు లేదు. 

111.   నిన్ననే పత్రికలో ఒక వార్త చదివాను. తమ్ముడి కొడుకు బర్త్ డే రోజున  విషం కలిపిన కేకు పంపి చంపిన పెదనాన్న. అంతకు ముందు రోజు తండ్రిని చంపి పెరట్లోనే పాతిపెట్టెసిన కొడుకుల గురించి ఇంకో వార్తవుంది. ఇంకో రోజు ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. లేదా భార్యను చంపిన భర్త. వరుసకు మేనకోడళు అయ్యే ఓ పాపను ఫర్నేస్ లో పడేసిన మేనమామ. ఇలాంటి వార్తలూ లేని దినపత్రికలు ఒక్కరోజు కూడ వుండవు. నాలుగు రాష్ట్రాల్లో మినీ స్టీలు ప్లాంటులు పెట్టి మినీ లక్ష్మీ మిట్టల్ అనిపించుకుంటున్నాయన తన వ్యాపార భాగస్వామిని చంపించాడు. బోంబే డైయ్యింగ్ అధినేత నస్లీ వాడియా మీద హత్యాయత్నం చేసినట్టు రిలయన్స్ అంబానీ సోదరుల మీద 1989లో ఓ కేసు నమోదైంది.   కన్న కూతురు షీనా బోరానును చంపిన   కార్పొరేట్ తల్లి  ఇంద్రాణీ ముఖర్జియ కేసు ఎలాగూ వుంది.

112.   ఇవన్నీ ఏం చెపుతున్నాయీ? మనుషుల్లో నరమాంస భక్షణ ప్రీతి, హంతక స్వభావం వున్నాయి అని.  

113.   Private property is an evil అన్నాడు ప్లేటో. సమాజంలో ఒక evil గా పుట్టిన  వ్యక్తిగత ఆస్తి మనిషిని Evil గా మార్చేస్తుంది. ఈ  హంతక స్వభావాన్ని మతవర్గతత్వ నియంతృత్వ  రాజ్యం తనకు వీలుగా వాడుకుంటుంది. మనుషుల్లో దాగున్న భూతాన్ని అది బిరడా తీసి బయటికి రప్పిస్తుంది.

114.   అల్లరి మూకలకు legal   Impunity ని ప్రసాదించిఇతరుల’  మీద   స్వైర విహారానికి ఉసిగొల్పుతుంది.

115.   హిట్లర్ అయితే యూదుల మీద   ‘ఇతరులు’ అనే ముద్ర వేసి కొన్ని లక్షల మందిని అతి క్రూరంగా  చంపించాడు.

116.    ఇంతటి మారణ హోమాన్ని కొనసాగించినా కార్పొరేట్ల ఆత్యాశ చావదు. వాళ్ళ వ్యాపారాలను విస్తరింప చేయడానికి కొత్త మార్కెట్లు కావాలి. యుధ్ధ్గాల ద్వార కొత్త దేశాలను కొత్త మార్కెట్లుగా మార్చుకోవాలి.

117.   ముస్సోలిని ఆఫ్రికన్ల మీద కన్నేశాడు. ఆఫ్రికా ఖండాన్ని ఖాళీ చేయించివేస్తే ఇటాలియన్లు ఛాతీ నిండా గాలి పీల్చుకోవచ్చు అన్నాడు. ఖాళీ చేయించడం అంటే కోటి రెండు కోట్ల మందిని చంపేయడం అన్నమాట.

118.   జర్మనీలో ఆహార కొరత వస్తే తూర్పు కేసి చూడాలి అన్నాడు హిట్లర్. మనకు తూర్పున రష్యా వుంటుంది. ఆదేశాన్ని ఆక్రమించుకుంటే అక్కడి యూదు రైతులు మనకోసం ఆహారాన్ని పండిస్తారంటూ జర్మన్ల ముందు ఒక భష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిఉంచాడు.

119.    రెండవ ప్రపంచ యుధ్ధంలో తొలి విజయాలు దక్కడంతో ముస్సోలినీ, హిట్లర్ చెలరేగిపోయారు. ఆ ఉత్సాహంలో ముస్సోలిని ఆఫికా ఖండాన్ని ఖాళీ చేయించడానికి  వెళితే, హిట్లర్ సోవియట్ రష్యాను ఆక్రమించడానికి బయలు దేరాడు.

120.   రష్యాలో ఇటు నాజీ సేనలకు హిట్లర్ స్వయంగా నాయకత్వం వహించగా, అటు ఎర్రసైన్యానికి కూడ స్టాలిన్ స్వయంగా నాయకత్వం వహించాడు.

121.   ఉర్దూలో ఒక సామెత వుంటుంది, జబ్ గీదడ్ కో మౌత్ ఆతీ హై ఓ షేర్ కే తరఫ్ జాతాహై. (రాబందుకు పోగాలం దాపురించినపుడు అది పులి గుహ వైపుకు వెళుతుంది). 

122.   చరిత్రలో ఒక వైచిత్రి ఏమంటే లో ఇటలీ సేనలకు ఆఫ్రికా ఖండపు ఈజిప్టులోనే ఎదురు దెబ్బలు తగిలాయి. జర్మనీ సేనలకు రష్యాలో అయితే  ఏకంగా చావుదెబ్బే తగిలింది.

123.   ప్రభుత్వ అండతో చెలరేగిపోయిన మూకోన్మాదులకు సహితం ఫాసిజం, నాజిజంల మీద నమ్మకాలు క్రమంగా తగ్గిపోయాయి. వాళ్ళు సహితం ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలెట్టారు.

124.   ముందుగా ఇటలీలో ముస్సోలిని అధికారాన్ని కోల్పోయాడు. స్వదేశంలో  అతని ప్రాణాలకే రక్షణ లేకుండాపోయింది.

125.   తనతో సహజీవనం చేస్తున్న క్లారా పెటస్సీని వెంట బెట్టుకుని 1945 ఏప్రిల్ 27న ముస్సోలిని స్పెయిన్ కు పారిపోయేందుకు బయలుదేరాడు.  అప్పుడు స్పెయిన్ ను మరో నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాలిస్తున్నాడు.

126.   ముస్సోలిని, క్లారా పెటస్సీలను  ఆ రాత్రి ఇటలీ సరిహద్దుల్లో  కమ్యూనిస్టు కార్యకర్తలు పట్టుకున్నారు.

127.   బ్లాక్ షర్ట్స్ స్వైర విహారం చేస్తున్న రోజుల్లో కమ్యూనిస్టు కార్యకర్తలు దొరికితే రివాల్వర్ తో కాల్చి చంపి, శవాల తోళ్ళు వొలిచి గ్యాస్ స్టేషన్ లో కొక్కేలకు వేలాడ దీసి ఒక భయోత్పాతాన్ని సృష్టించేవారు.

128.   అంతకు ముందు బ్లాక్ షర్ట్స్ చేసినట్టే కమ్యూనిస్టు కార్యకర్తలు కూడ  ఏప్రిల్ 28న ముస్సోలిని, క్లార్తా పెటస్సీలను తుపాకితో కాల్పి చంపి, శవాల చర్మాల్ని వొలిచి, ఒక పెట్రోలు బంకులో కొక్కేలకు వేలాడగట్టి. “ఫాసిజానికి కుక్క చావు” అని నినాదాలు చేశారు.

129.   అప్పటికి జర్మనీలో హిట్లర్ పరిస్థితి కూడ పూర్తిగా దిగజారిపోయింది. ప్రేయసి ఇవా బ్రౌన్ తోపాటు బెర్లిన్ సమీపంలోని ఒక బంకరులో దాక్కొని కాలం గడుపుతున్నాడు.  ఆ సమయంలో తనను పెళ్ళి చేసుకోమని కోరింది  ఇవా.  28 అర్ధరాత్రి వాళ్ళు చాలా నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారు.

130.   కొత్త దంపతులు మూడు రాత్రుళ్ళు కూడ గడపక ముందే ఏప్రిల్ 30న ముస్సోలిన్  చావు వార్త హిట్లర్ కు చేరింది. తనకూ కుక్క చావు తప్పదని అతనికి తెలిసిపోయింది. అతని భార్యకు కూడ ఆ విషయం అర్థం అయింది. ఆరోజు సాయంత్రం ఇవా బ్రౌన్ సైనేడ్ తాగి చనిపోయింది. హిట్లర్ రివాల్వర్ తో కణితిలో కాల్పుకుని చనిపోయాడు.

131.   ఆ మరునాడు అంటే మే డే రోజు ఎర్రసైన్యం బెర్లిన్ నగర వీధుల్లోనికి ప్రవేశించింది. స్వల్ప ప్రతిగ్హటన తరువాత జర్మన్ మూడో డీచ్ మే 8న లాంఛనంగా లొంగుబాటును ప్రకటించింది. డానినే విక్టరీ ఇన్ యూరోప్ డే (విఇ- డే) అంటారు.

132.    అక్షరాజ్యాల్లో మూడవ ప్రధాన భాగస్వామి అయిన జపాన్ మరి కొంత కాలం యుధ్ధాన్ని కొనసాగించింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమేరిక హిరోషీమ, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడులు జరిపిన ఆగస్టు 15న జపాన్ లొంగుబాటును ప్రకటించింది.  దీనినే విక్టరీ ఓవర్ జపాన్ డే అంటారు.  

133.   గతం నుండి వర్తమానం లోనికి వస్తే,  వర్తమాన భారతదేశంలో ఫాసిస్టు పోకడలు అనేకం కనిపిస్తున్నాయి.  మన సమాజంలో మతతత్వం చెలరేగడానికి సంఘపరివారం ఎంత కారణమో కాంగ్రెస్ కూడా అంతే కారణం. 

134.   అయితే దీనిని అప్పుడే ఫాసిజం అనవచ్చునా? మరి కొంతకాలం ఆగాలా? అనే సందేహాలు కూడా వున్నాయి.   

135.    ఒక విషయం అయితే స్పష్టం.  భారత సమాజంలో ‘మనం’ - ‘ఇతరులు’ లకు మధ్య నియంత్రణ రేఖ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది.

136.   అలనాటి జర్మనీలో   యూదులు, కమ్యూనిస్టులు ఇతరులుగా వున్నారు.  మన దేశంలో ఇతరులుగా  ముస్లింల పేరు ప్రముఖంగా వినపడుతున్న ప్పటికీ ఆ జాబితాలో క్రైస్తవులు, ఆదివాసులు, దళితులు, శిక్కులు కూడ వున్నారు.

137.    జర్మనీలో కమ్యూనిస్టులు ఇతర ప్రతిపక్షాలు ఐక్యంగా వున్నారు. ఇక్కడ మార్క్సిస్టులు అంబేడ్కరిస్టులు పరస్పర విరోధులుగా వున్నారు.  

138.    పార్లమెంటుకు క్రమం తప్పకుండ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దాన్ని ఫాసిజం అనొచ్చునా అనేది ఇంకో ప్రశ్న.

139.    హిట్లర్ పోలెండ్ మీదనో, ఆస్ట్రీయా మీదనో దాడి చేసినట్టు భారత దేశం పొరుగుదేశాల మీద దాడి చేసే వరకు ఎదురు చూడాలని కూడ కొందరి ఆలోచన.

140.    అన్నీ ఇటలీలోనో జర్మనీలోనో జరిగినట్టే ఇక్కడా జరిగితేనే ఫాసిజం అనాలా?  ఫాసిజం సహితం తన రూపాన్ని మార్చుకోవచ్చుకదా?

141.    పోనీ దేశం రేపు ఫాసిజంగా మారిపోయాక దాన్ని ప్రతిఘటించే ప్రయత్నాలు మొదలెట్టాలా? ఇప్పటి నుండే అప్రమత్తంగా వుండాలా? అనేవి ప్రాణప్రద అంశాలు.

142.   ఇంతకీ మనం ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? భారతీయుల దేశభక్తికి ఇప్పుడు అదొక్కటే గీటురాయి.

(సెప్టెంబరు 8న విజయవాడలో జరిగిన ఫాసిస్టు వ్యతిరేక సభలో చేసిన ప్రసంగం ఆధారంగా రాసిన వ్యాసం)

//EOM//