Thursday 20 October 2022

Notes on Descriptive Literature

 

వర్ణన సాహిత్యం భావోద్వేగాలతో నిండివుంటుంది; అది హృదయాన్ని సంభోధిస్తుంది. వ్యాసం ఆలోచనాత్మకమైనది; అది మెదడును సంభోధిస్తుంది.

 

మనుషులు ఆనందం కలిగినప్పుడు నవ్వుతారు; బాధ కలిగినపుడు ఏడుస్తారు. అన్యాయం జరిగినపుడు కోపంతో రగిలిపోతారు. ఇవి మానవ సహజ అసంకల్పిత చర్యలు. వర్ణన సాహిత్యం అసంకల్పిత చర్య కాదు; అది సంకల్పిత చర్య. రచయిత ఒక సంకల్పంతో పాత్రల సుఖదుఖ్ఖాలను పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలకు ట్రాన్స్ మిట్  చేయాలి. రచయితలు తాము లక్ష్యంగా పెట్టుకున్న భావోద్వేగాలను సమర్ధంగా ప్రసారం చేయగలిగారా? లేదా? అన్నది ఒక్కటే వాళ్ళ సామర్ధ్యానికి ఏకైక కొలమానం.

 

అలాగే కథా నవల ప్రక్రియలు ఒకటి కావు. నవల పొట్టిదయితే కథ అయిపోదు; కథ పెద్దదయితే నవల అయిపోదు. కథ సంఘటన ప్రధానమైనది; నవల పాత్ర ప్రధానమైనది.

 

Reflective and refractive

ప్రతిబింబం- ప్రతిఫలనం

చంద్రవంక’ నవల - దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి

 చంద్రవంక’ నవల

రచయిత :  దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి

 

1982-92 మధ్య కాలం భారత దేశంలోనేగాక మొత్తం ప్రపంచంలో ఒక కల్లోల అధ్యాయం.  ఆంధ్రప్రదేశ్ లో కారంచెడు, చుండూరు తదితర గ్రామాల్లో ఎస్సీల మీద దాడులు జరిగిన కాలం. ముందు దళిత మహాసభ, ఆ పిదప మాదిగ దండోర ఏర్పడిన కాలం. కాన్షీరామ్  బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన కాలం కూడ ఇదే.

 

చంద్రవంక  అనే ఒక కల్పిత పాత్ర  ఈ ఉద్యమాలన్నింటి మధ్య ఒక నాయకిగా ఎదిగిన క్రమం ఈ నవల.

 

అందరికీ తెలిసిన వాస్తవ స్థలాలు, వాస్తవ సంఘటనలు, వాస్తవ వ్యక్తులే అయినప్పటికీ ఉర్లు, మనుషుల పేర్లను మార్చి రాశారు. కారంచేడును ‘దారంచేడు’గానూ, చీరాలను ‘చీదరాల’గానూ, చుండూరును ‘తుండూరు’గానూ మార్చారు. ఈక్రమంలో కత్తిపద్మారావు ‘పరశురాం’ అయ్యారు, బొజ్జా తారకం ‘తారకనాధ్’ అయ్యారు, గద్దర్ ను ప్రజాయుధ్ధ ’నేత విఠల్ రావు’ గా మార్చారు.

 

ఇంత పెద్ద కాన్వాస్ ను 91 పేజీల్లో రాయాలనుకోవడం దుస్సాహసం. రచయిత అంతటి సాహసానికి పూనుకున్నాడు. తక్కువ పేజీల్లో ఎక్కువ విషయాలు చెప్పాలనుకోవడంవల్ల ఓవర్ ప్యాక్డ్ అనే భావం కలిగింది. ఆ కాలం గురించి తెలుసుకోవాలనుకునేవారు ఈ నవలను చదవవచ్చు.

 

 

పేరు మార్పుల్లో భాగంగా డ్యానీ అనే ఒకే పేరుతో ఈ నవలలో  రెండు పాత్రలున్నాయి. అందులో ఒక పాత్ర జెఎన్ ఎం ప్రతినిధి (పేజీ 36), ఇంకో పాత్ర విద్యాసంస్థ నిర్వాహకుడు నయీమ్ అనుచరుల్లో ఒకడు (పేజీ 44). కారంచెడు ఉద్యమంతో నాకు ఒక బలమైన అనుబంధం వుందిగానీ ఈ నవలలోని డ్యానీ పాత్రలకూ నాకూ ఎలాంటి సంబంధంలేదు. నేనెన్నడూ జెఎన్ ఎం ప్రతినిధినీకాను, విద్యా సంస్థ నిర్వాహకుల  అనుచరుడ్నీకాదు.

 

ఇదొక బాధ్యతారాహిత్యం.

 

రచయిత తనకు తెలిసిన సమాజం గురించీ, తెలిసిన విషయాల గురించి రాయాలి. తెలియని విషయాలను మరింత లోతుగా తెలుసుకుని రాయాలి.

 

కారంచేడు ఉద్యమంలో నా పాత్ర గురించి రాయాలని నేనేమీ ఏ రచయితనూ కోరను. ఒకవేళ నా గురించి రాయాల్సిన అవసరం వస్తే,   కొన్ని అంశాలను తప్పకుండా  రాయాలి.

 

1985 జులై 25 నుండి అక్టోబరు 6 వరకు నేను చీరాల విజయనగర్ శిబిరంలో వున్నాను. కారంచెడు బాధితుల సంఘీభావ కమిటికి నాయకునిగావున్నాను. అది పీపుల్స్ వార్ కు చెందిన ప్రజాసంఘం. అది కారంచెడు ఉద్యమంలో కత్తి పద్మారావుతో కలిసి పనిచేసింది. ఆగస్టు 15న గడియారం సెంటరులో భారీ బహిరంగ సభ నిర్వహించాను. ఈ క్రమం మొత్తంలో బి పరంజ్యోతి అతని కుటుంబం నాకు పూర్తి స్థాయి షెల్టర్ ఇచ్చింది. సెప్టెంబరు 10 నాటి రాస్తా రోకో కార్యక్రమానికి నాయకత్వం వహించాను.  అప్పటికి సలగల రాజశేఖర్ ఉద్యమం నుండి బయటికి వెళ్ళిపోయారు.

 

రాస్తారోకో చేస్తున్న వారిని అక్టోబరు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని కోరుతూ సెప్టెంబరు 11 మధ్యాహ్నం ఊరేగింపు నిర్వహించాము. ఆ ఊరేగింపులో కత్తి పద్మారావు కొంత దూరం వరకు వచ్చి,   ప్రదర్శకులందరి ముందు ఉద్యమ బాధ్యతల్ని నాకు అప్పచెప్పి, గుంటూరు వెళ్ళిపోయారు. ఆ తరువాత వారు చీరాల రాలేదు.

 

సెప్టెంబరు 10 నుండి ఉద్యమం మీద అణిచివేత ఆరంభం అయింది.  సెప్టెంబరు 11 సాయంత్రం పోలీసు స్టేషన్ ముందు కారంచేడు బాధితుల మీద కర్కశంగా లాఠీ చార్జ్ జరిపారు. అనేక మంది గాయపడ్డారు. నేను స్వయంగా కొందరు మహిళల్ని రిక్షాలో వేసుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాను. రాస్తారోకోలో  అరెస్టయిన వారిని  సెప్టెంబరు 12 ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుల్ని బహిష్కరించి బాధితుల్ని బయటికి తీసుకుని వచ్చేశాను. బి పరంజ్యోతి ఇంట్లో పడుకొనివున్న నన్ను సెప్టెంబరు 13 తెల్లవారు జామున అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో పరంజ్యోతి, వాళ్ళ అన్నయ్య, కత్తి పద్మారావు అనుచరుడు జాన్ తదితరులు వున్నారు. మమ్మల్ని 15 రోజులు రిమాండ్ కు ఒంగోలు జైలుకు పంపించారు. అక్కడి నుండి కండీషన్ బెయిలు మీద విడుదలై చీరాల వచ్చాక విజయనగర్ శిబిరానికి నేను ఒక్కడ్నే బాధ్యునిగా వున్నాను. ఈ దశ అక్టోబరు 6 వరకు నడిచింది. నేను చీరాల వదిలి వెళతాననే షరతు మీద మా కేసులోని మిగిలినవారి మీద బెయిల్ కండీషన్లు ఎత్తివేస్తామని పోలీసు అధికారులు చెప్పిన తరువాత నేను విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యాను.

 

20 అక్టోబరు 2022

Wednesday 19 October 2022

కొత్త పుస్తకం : ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.

 

కొత్త పుస్తకం  : ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.

 


 

కొత్త పుస్తకం  : ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.

 

 

రానున్న 2024 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనలు కొంచెం ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బిజెపి పనితీరును అధ్యయనం చేస్తున్నారు.

 

దేశరాజకీయాల్లో బిజెపి అతిపెద్ద పార్టి అతి సంపన్న పార్టి మాత్రమేకాదు; అతి విభిన్నమైన పార్టి కూడ. పైన కనిపించే బిజెపికన్నా వందరెట్లు బలమైనది  దాని తల్లివేరులాంటి ఆర్ ఎస్ ఎస్.

 

 ఆర్ ఎస్ ఎస్. స్వయంగా అనేక పుస్తకాలను ప్రచురించింది. ఆ సంస్థ మీద అనేక పుస్తకాలు వచ్చాయి. అనేక పుస్తకాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్ ఎస్ ఎస్ విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చిత్రించిన పుస్తకం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. ఈ పరంపరలో కొత్తగా వచ్చిన పుస్తకం ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.

 

కన్నడ రచయిత దేవనూరు మహాదేవ రచించిన ఈ 40 పేజీల ఈ చిన్ని పుస్తకం ఈ ఏడాది జులైలో విడుదలయి తొలి నెలలోనే లక్ష కాపీలు అమ్ముడయి ఒక సంచలనాన్ని సృష్టించింది.  అజయ్ వర్మ అల్లూరి ఈ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించగా వేమన వసంత లక్ష్మి సంపాదకత్వంలో హెచ్ బిటి, నలుపు, ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర, సాహితీ మిత్రులు తదితర ఎనిమిది ప్రచురణ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి.

 

ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్పథం గురించీ, దాని పనితీరు గురించి అనేక అంశాలు, రచయిత అనుభవాలు   ఈ పుస్తకంలో వున్నాయి.

 

“దేశంలో (ప్రజాస్వామిక) రాజ్యంగ సంహారం; మను ధర్మశాస్త్ర ప్రతిష్టాపన జరుగుతోంది. (పేజీ 34)”

 

“సాంస్కృతికంగా అణిచివేతకు గురవుతున్న హిందూ దళిత సమూహాల ఓట్ల మద్దతుతోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది” (పేజీ 33).

 

“కర్ణాటక ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘మత స్వేఛ్ఛ రక్షణ చట్టం’

నిజానికి ‘మతమార్పిడి నిరోధక చట్టం’ “(పేజి 31).

 

“హిజాబ్ వివాదం, హలాల్ చేసిన మాసం అమ్మకాల నిషేధం, అజాన్ మొదలయిన ముస్లిం అంశాలపై గొడవలు చేసే ఉన్మాద ముఠాల్లో వున్న కుర్రాళ్ళందరూ   బడుగు బలహీనవర్గాలకు చెందినవారే” (పేజీ 29).

 

“ఎప్పుడయితే హిందూ-ముస్లిం ద్వేషపూరిత సమరంలో ఈ మాజీ-శూద్రులు (ST SC BC) హిందువులుగా పాల్గొంటారో అప్పుడు ఆ ‘విశాల’ హిందూ గుర్తింపులో ఈ వంచిత సముదాయాల రాజ్యంగ హక్కులు మసకబారిపోతాయి” (పేజీ 18)

 

“సంస్కృతాన్ని భారతదేశంలో అనుసంధాన భాష చేయాలన్నది ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం. అంతవరకు హిందీ భాషను అనుసంధాన భాష చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది” (పేజీ 14).

 

ఇలాంటి పరిశీలనలు అనేకం ఈ పుస్తకంలో వున్నాయి. ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలు పనితీరు గురించి ప్రాధమిక సమాచారం కోసం చాలా ఉపయోగపడే పుస్తకం ఇది. తప్పక చదవండి.

 

డానీ

20221019


RAHASYAM –Sridhar Bollepalli – Story Review

 స్త్రీపురుష సంబంధాల పునర్ నిర్వచనం

 

            అనేకమంది రచయితలు ముట్టుకోవడానికి కూడ భయపడే ఒక సరికొత్త సామాజిక పరిణామాన్ని శ్రీధర్ బొల్లేపల్లి పెద్ద కథ ‘రహాస్యం’ పట్టించుకుంది.

 

మానవ సంబంధాల్లో ప్రతి చారిత్రక దశలోనూ పాత నేరేటివ్స్ గతించి కొత్త నేరేటివ్స్ వస్తుంటాయి.  వాటిని ఎప్పటికప్పుడు పునర్-నిర్వచించాల్సి వుంటుంది. జాతి పునరుత్పత్తికి అదే మూలం కనుక, వీటిల్లో, అత్యంత ప్రాధమికమైనది స్త్రీపురుష సంబంధం.

 

వర్గం సర్వాంతర్యామి. ఆర్ధికరంగంలో యజమానివర్గపు ఆధిపత్యంలేని వ్యవస్థను  శ్రామికవర్గం కోరుకుంటున్నట్టు, సాంస్కృతిక రంగంలో మెజారిటీ సమూహాల  ఆధిపత్యంలేని వ్యవస్థను మైనారిటీ సమూహాలు కోరుకుంటున్నట్టు, ‘దాంపత్యం’లో  పురుష ఆధిపత్యంలేని వ్యవస్థను స్త్రీలు కోరుకుంటారు. పురుషాధిపత్యం అంతరించిపోయాక దాన్ని ‘దాంపత్యం’ అంటారా లేక సహజీవనం అంటారా మరొకటి అంటారా అనేది భాషా పండితులు తేల్చాల్సిన అంశం.

                   

మన దినచర్యను ప్రకృతితో అనుసంధానం చేయడాన్ని Circadian Rhythm అంటాము. ప్రకృతిలోని జీవులన్నీ సూర్యుని చీకటి వెలుగులతో ఒక సహజ అనుసంధానాన్ని కొనసాగిస్తుంటాయి; మనిషి కూడ అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అయితే, సమాచార సాంకేతిక (IT) విప్లవం భారత ఐటియన్ల Circadian Rhythmను సమూలంగా మార్చిపడేసింది.

 

అమెరికాలో పగలు భారతదేశంలో రాత్రి కావడం ఒక వరం; ఒక సవాలు. వరం ఏమంటే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం; సవాలు ఏమంటే  Circadian Rhythmను మార్చుకోవాల్సిరావడం. భర్త పగలు డ్యూటీ చేసివచ్చి రాత్రి ఇంట్లో పడుకుంటుంటే, భార్య పగలు ఇంట్లో పడుకుని రాత్రి ఆఫీసులో డ్యూటీ చేయాల్సివస్తున్న సందర్భాలు ఇటీవలి కాలంలో  విస్తృతంగా పెరుగుతున్నాయి.

 

ఈధోరణి ముందుగా ఐటీ రంగంలో మొదలయింది. తరువాత మీడియా-సినిమా రంగానికి విస్తరించింది. ఆ తరువాత క్రమంగా ఇతర వృత్తినైపుణ్య రంగాలన్నింటికీ విస్తరిస్తోంది. ఈ కొత్త ధోరణికి అనువుగా హైదరాబాద్ వంటి  మహానగరాల్లో మాల్స్ రాత్రి తెరిచే వుంటున్నాయి. ఫ్యామిలీ (విడాకుల) కోర్టులు వీకెండ్ లో ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. ఇన్ని రంగాల్లో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు దాంపత్య జీవితంలోనూ మార్పులు వచ్చి తీరుతాయి. అత్యంత సహజంగానే మన వర్తమాన సమాజంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ‘One-Night Stand’, ‘Work Place Sex’ ఒక కొత్త అవసరాలుగా మారుతున్నాయి.  

 

ప్రపంచంలో ప్రతీదీ చలనశీలమైనదైనప్పుడు స్త్రీ పురుష సంబంధాలు కూడ చలనశీలంగానే వుంటాయి. స్త్రీపురుష సంబంధాలు కాన్ స్టాంట్ కాదు; వేరియబుల్ అంటే ఛాందసవాదులకేకాదు; అభ్యుదయవాదులుగా కనిపించేవాళ్ళకు కూడ గుండె ఆగిపోతోంది.  

పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం అనేవి ఆచరణ సాధ్యంకాని భూస్వామ్య యుగపు ఆదర్శాలేతప్ప వివాహేతర సంబంధాలనేవి అనాదిగా వున్నవే. గతంలో, యజమాని కులాలు వాటిని బహిరంగంగా సాగించేవి; శ్రామిక కులాలు వాటిని రహాస్యంగా సాగించేవి. వివాహేతర సంబంధాలు ఒక సామాజిక అవసరంగా మారాయని ఇప్పుడు న్యాయవ్యవస్థ సహితం గుర్తించాల్సి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుల్ని నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించే ఐపిసి సెక్షన్ 497ను సుప్రీం కోర్టు 2018 సెప్టెంబరులో రద్దు చేసింది.

 

గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఓ మంచి బార్లో కూర్చొని మంచి మద్యం తాగుతూ హ్యాప్పీగా తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వివాహపూర్వ విడాకుల (బ్రేకప్) పార్టి జరుకుంటారని గతంలో  ఎవరైనా ఊహించారా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒక జట్టుగా వచ్చి (వీలయితే తమ కొత్త బాయ్ ఫ్రెండ్స్ ను కూడ వెంటబెట్టుకుని వచ్చి) గిఫ్ట్స్ ఇచ్చి అభినందిస్తారని మనలో ఎంత మందికి తెలుసూ? 

ఇదొక కొత్త ప్రపంచం. అక్కడా భావోద్వేగాలు,  ప్రేమానురాగాలు, త్యాగాలు, ఒకరికొకరు కొంత ప్రైవేటు స్పేస్ ఇచ్చుకోవడాలు వంటి విలువలు గొప్పగానూ  వుంటాయి. 

 “సమాజం చేత మొగుడూ పెళ్ళాలుగా ముద్ర వేయించుకున్నవాళ్ళు వుండే చోటుని యిల్లు అనాలి; బ్యాచిలర్స్ వుండేదాన్ని రూమ్ అనాలి” అని ఈ కథలో ఓ చోట ప్రొటోగోనిస్టు అంటుంది. బ్యాచిలర్స్ అంటే మగవాళ్ళే కాకుండ ఆడవాళ్లు కూడ అని ఎక్స్ టెండ్ చేస్తే దాన్ని ‘ట్రయల్ రూం’ అనవచ్చు. సెక్స్ పార్టనర్ కు కేవలం ఫ్రెండ్షిప్ కంటెంట్ మాత్రమే కాకుండ ఫ్యామిలీ కంటెంట్  కూడ  వుందోలేదో  పరీక్షించుకునే ప్రదేశం అన్నమాట.

పేరుకు తగ్గట్టు ‘రహాస్యం’ కథ చివరి వరకు కొంత యాంగ్జైటీ, కొంత థ్రిల్, కొన్ని సర్ప్రైజింగ్ ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. తప్పక చదవాల్సిన అత్యంత ఆధునిక కథ ఇది.

 

-        డానీ

 

 

ఈ కథలో ప్రొటోగోనిస్టు ఒక మహిళ. చాలామంది రచయితలకు వాక్య నిర్మాణంలో  స్త్రీపురుష బేధాలు తెలీవు. ఈ కథ మొత్తం ఒక మహిళ చెపుతున్నట్టే వుంటుంది. పదాల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలకు రచయితను మెచ్చుకోవాలి.

 

మానవ సమూహాల చలనం అడవుల నుండి గ్రామాలకు, అక్కడి నుండి పట్టణాలకూ, అక్కడి నుండి నగరాలకూ, అక్కడి నుండి మహానగరాలకు, అక్కడి నుండి ప్రపంచ మహానగరాలకు సాగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం క్షితిజ సమాంతర చలనం (horizontal mobility)  మాత్రమేకాదు;   నిలువు చలనం (vertical mobility) కూడ. జీవితంలో వుధృతంగా సాగుతున్న చలనశీలత ఇప్పుడు స్త్రీపురుష సంబంధాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నదన్నది ఎవరికయినా రావలసిన సందేహం.

 

 

జీవన విధానంలో వస్తున్న పెను మార్పులు ‘దాంపత్యాన్ని’ ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించడం చాలా అవసరం. అమెరికాలో పెళ్ళి చేసుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. 2021 సెన్సెస్ ప్రకారం 33 కోట్ల మందిగల అమెరిక జనాభాలో  వివాహ వయస్సుగల పురుషులు 12.9 కోట్ల మంది, స్త్రీలు 13.6 కోట్ల మంది. వీరిలో ఎన్నడూ పెళ్ళి చేసుకోని పురుషులు 4.47 కోట్లమంది; స్త్రీలు 4.18 కోటల మంది. అంటే వివాహ వయస్సు గలవారిలో 33.53 శాతం మంది అస్సలు పెళ్ళి చేసుకోలేదు.  ప్రతి ముగ్గురురిలో ఒకరు పెళ్ళిని నిరాకరిస్తున్నారు. వీరుగాక, విడాకులు పొందినవాళ్ళు మరో రెండున్నర కోట్ల మంది వున్నారు. భారతదేశ ‘దాంపత్య’ గణాంకాలు కూడ దీనికి భిన్నంగా ఏమీ వుండవు.

 

గత శతాబ్దంలో అయితే,  అమెరికాలో జరిగిన పరిణామాలు రెండు మూడు దశాబ్దాల తరువాత ఇండియాలో జరిగేవి. ఇప్పుడు అంత సమయం పట్టడంలేదు. అమెరికాలో నిన్న జరిగింది ఈరోజు మనదేశంలో  జరిగిపోతున్నది. అంచేత వీటిని అమెరిక ప్రత్యేక అంశంగా చూడకూడదు.

 

 

జంతు ప్రపంచంలో జీవుల మధ్య సంబంధాల్లో పెద్దగా వైవిధ్యం వుండదు. కానీ, మానవ ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలు విపరీతమైన వైవిధ్యంతో వుంటాయి. జంతు ప్రపంచంలో గుంపు అనే మాట మానవ ప్రపంచంలో సమాజంగా మారిపోతుంది. ఈ సమాజం అత్యంత చలనశీలమైనది, జటిలమైనది, అంతులేని వైవిధ్య పూరితమైనది. 

 

 

Marital status of the United States population in 2021, by sex

https://www.statista.com/statistics/242030/marital-status-of-the-us-population-by-sex/

 

 

 

Fiancée

కాబోయే భార్య

 

Future Husband

కాబోయే భర్త

 

A one-night stand is a single sexual encounter in which there is an expectation that there shall be no further relations between the sexual participants. The practice can be described as "sexual activity without emotional commitment or future involvement".

 

 

 

Marital status of the India population in 2021, by sex

 

 

These natural processes respond primarily to light and dark and affect most living things, including animals, plants, and microbes. Chronobiology is the study of circadian rhythms

         

Thursday 13 October 2022

How Should Muslims Deal with Economic Front?

 వాణిజ్యరంగంలో ముస్లింలు ఎలా వ్యవహరించాలీ?

డానీ

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

How Should Muslims Deal with  Economic Front?

Companionship 2nd Anniversary  Speech

11 October 2022

 

Intro

 

Respected President Shabeer Saheb and the dignitaries on the dais and in the conference hall, I am very much happy to be amongst you this evening.

 

I am thankful to the organizers for making me a companion to your organization Companionship.

 

మిత్రులారా!  నా ప్రసంగాన్ని ఇంగ్లీషులో కొనసాగిస్తే మీలో కొందరికి అర్ధం కాని పరిస్థితి కనపడుతోంది. నేను ఉర్దూలో ప్రసంగిస్తే మీలో చాలా మందిని ఇబ్బంది పెట్టినవాడిని అవుతాను. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నా ఉర్దూ యాస కొంచెం ముతగ్గా వుంటుంది.  అందువల్ల ఎక్కువ మందికి అనువుగా వుండేలా తెలుగులో మాట్లాడడానికి మీ అనుమతిని కోరుతున్నాను.  

 

Speech Talking Points

1.        ఓ జర్నలిస్టుగా నేను గతంలో చాలాసార్లు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. వాటికి కొనసాగింపుగా వైశ్య సామాజికవర్గంవాళ్ళు కొన్నేళ్ల క్రితం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ (VCI)ను నెలకొల్పారు. 2018లో జరిగిన  VCI ఇంటర్నేషనల్ వార్షికోత్సవాల ఈవింట్ మేనేజ్మెంట్ లో నేను చాలా క్రియాశీలంగా పాల్గొన్నాను.

 

2.        Federation of Indian Chambers of Commerce & Industry (FICCI) తరహాలో దళిత కులాలకు చెందిన వాణిజ్య పారిశ్రామికవేత్తలు డిక్కీ (DICCI) అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. డిక్కీ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన ఓ రెండు కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

 

3.        ఆ సందర్భాల్లో  ముస్లిం వాణిజ్య, పారిశ్రామికవేత్తలు కూడ ఇలాంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ముస్లిం థింకర్స్ ఫోరం (MTF) కన్వీనర్ గా నాకు అనిపించింది. దానికోసం కొందరు సన్నిహితులతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో కంపానియన్ షిప్ వార్షికోత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది.

 

4.        కాలం కలిసిరావడం అంటే ఇదే. అందుకుగానూ కంపానియన్ షిప్ అధ్యక్షులు షాబీర్ సాహెబ్ గారికీ, కార్యదర్శి సిరాజ్ సాహెబ్ గారికి మరీమరీ కృతజ్ఞతలు.

 

5.        నలుగురు ముస్లింలను ఒక వేదిక మీద కూర్చోబెట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు. అదొక Herculean Task! అలాంటి టాక్స్ ను పూర్తి చేసిన షాబీర్ సాహెబ్ గారికీ, సిరాజ్ సాహెబ్ గారికి ప్రత్యేక అభినందనలు.

 

6.        మిత్రులారా! వాణిజ్యంలో మొదటి షరతు ఏమంటే అందుబాటులోవున్న అవకాశాల్ని మీరు ఎంత గొప్పగా ఎంత సంపూర్ణంగా  వాడుకోగలరూ  అనేది. దీనినే Optimum Utility అంటారు.

 

7.         Optimum Utility అంటే ఇక్కడే ఒక ఉదాహరణ చెపుతాను. ఇంతకు ముందు మనకు ఒక ఆడియో విజువల్ (AV) ప్రెజెంటేషన్ ఇచ్చారు. మానిటర్ స్క్రీన్ 60 అంగుళాలుంది; దాని మీద వీడియో 6 అంగుళాలుంది. వున్న అవకాశాల్లో 90 శాతం వృధా చేసేశారు. ఇది వీడియో తీసే సమయంలో మొబైల్ ఫోన్ ను నిలువుగా పట్టుకోవడంవల్ల వచ్చిన చేటు. వాళ్ళే కాదు ఇప్పుడు ఈ హాల్లోనూ కొందరు నా ప్రసంగాన్ని మొబైల్ ఫోన్ లను నిలువుగా పట్టి రికార్డు చేస్తున్నారు.  ఇది ఘోరమైన వృధా.

 

8.        మీరు ఏ రంగలో అయినాసరే గెలవాలంటే అందుబాటులోవున్న వనరుల్ని పూర్తిగా సమర్ధంగా వాడుకోవాలి. అలాకాక వృధాచేస్తే మీరు ఓడిపోవడం ఖాయం. You are deemed to lose!.

 

9.        ప్రతీ వ్యాపారానికీ, ప్రతీ వృత్తికి, ప్రతీ పనికి కొన్ని ప్రాధమిక సూత్రాలు వుంటాయి. బేసిక్స్ అంటాము. ప్రతి ఒక్కరికీ తమ రంగానికి సంబంధించిన బేసిక్స్ తెలిసి తీరాలి. చివరకు వంట చేయడానికి కూడ బేసిక్స్ వుంటాయి. వాటిని పాటించకపోతే వంట చెడిపోతుంది. వ్యాపారం నష్టపోతుంది.

 

10.    మీ సభ్యులకు వాళ్ళవాళ్ళ వృత్తులకు సంబంధించిన బేసిక్స్ ను నేర్పించడానికి ఒక చిన్న శిక్షణ కేంద్రాన్ని నిర్వహించండి. క్వాలిటీ సెంటర్, Application Lifecycle Management (ALM) అంటారు వీటిని.

 

11.    వర్తమాన భారతదేశ వాణిజ్యరంగంలో గుజరాత్ ఆధిపత్యం చాలా స్పష్టంగా  కనిపిస్తున్నది. ఇటీవల విజయవాడలో జైన సంఘం ప్రతినిధులు నగర పాలక సంస్థ వున్నతాధికారుల్ని కలిసి ఒన్ టౌన్ పేరును జైన్ టౌన్ గా మార్చమని కోరారని విన్నాను. దానికోసం భారీ విరాళాన్ని కూడ వాళ్ళు ఆఫర్ చేశారట.

 

12.    నేను విజయవాడలో మార్వాడీ ఖండేల్ వాళ్ళ దగ్గర రెండేళ్లు పూర్తికాలం పనిచేశాను. గుజరాతీయులకు వాణిజ్య వ్యాపార నియమాలు, డబ్బు చలనం తాలూకు బేసిక్స్ చాలా బాగా తెలుసు. వాళ్లు టెన్త్ క్లాస్ పాసయ్యేనాటికే అకౌంటెన్సీ బుక్ కీపింగ్ నేర్చేసుకుంటారు.

 

13.       క్రెడిట్‍ ను ఎడమ వైపు ఎందుకు రాయాలో, డెబిట్ ను కుడివైపు ఎందుకు రాయాలో  తెలియని వ్యాపారుల్ని నేను చూశాను. డే బుక్కు, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, లాస్ అంట్ ప్రాఫిట్ అకౌంట్,  జిఎస్టీ మంత్లి రిటర్న్స్ పంపడం, మూలధనం, రుణాలు, వాటి మీద వడ్డి, యంత్రపరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ మీద తరుగుదల బ్యాలెన్స్ షీట్ వగయిరాల గురించి మనలో చాలామందికి లోతుగా  తెలీదు.

 

14.       పాతకాలంలో లాగ సరుకును పదిరూపాయలకు కొన్నాం; ఇరవై రూపాయలకు అమ్మాం.; పది రూపాయలు జేబులో వేసుకున్నాం అనుకుంటే ఇప్పుడు చెల్లదు. అదొక ప్రాధమిక స్థాయి మాత్రమే.

 

15.       వ్యాపారం వాణిజ్యాలు ప్రత్యేక శాస్త్రాలు. వ్యాపార వాణిజ్యరంగాల్లో వున్నవారు నియత విద్యగా అయినా, అనియత విద్యగా అయినా వాటిని అధ్యయనం చేసితీరాలి. గుజరాతీయులు అనియత విద్య (informal education)గా ఈ రెండు శాస్త్రాల్ని విస్తారంగా అధ్యయనం చేస్తుంటారు. మన రాష్ట్రంలో వైశ్య సమూహాల్లో కూడ ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.  వాళ్లను చూసి మనం కొన్ని మెళుకువలు, కిటుకులు నేర్చుకోవాలి.  

 

16.       అసలు మనం చేస్తున్న వ్యాపారం వుంటుందా? ఊడుతుందా? దాని భవిష్యత్తు ఏమిటీ?  విస్తృతి ఎంత? వంటి సమస్తం మనకు తెలిసి వుండాలి.

 

17.        వాణిజ్యాభివృధ్ధికి ఎప్పటికప్పుడు ఎస్-డబ్ల్యూ- ఓ- టి (SWOT) విశ్లేషణ చాలా ముఖ్యం. వాణిజ్యరంగంలో వున్నారు కనుక మీలో చాలామందికి ‘స్వాట్’ రిపోర్టు గురించి తెలిసే వుంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను దాన్ని కొంచెం వివరిస్తాను.

 

18.       ఎస్ - అంటే స్ట్రెంగ్త్. బలం. డబ్ల్యూ - అంటే  వీక్ నెస్; బలహీనతలు. మన వ్యాపారంలో మన బలం ఏమిటీ మన బలహీనతలు ఏమిటీ అనేవి మనకు చాలా క్షుణంగా తెలిసి వుండాలి. బలహీనతల్ని అధిగమించాలి; బలాన్ని పుంజుకోవాలి.

 

19.       ఓ – అంటే ఆపర్చ్యూనిటీస్; అవకాశాలు. టి- అంటే థ్రెట్స్; ముప్పు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు ఎక్కడ వున్నాయని నిరంతరం అన్వేషిస్తుండాలి. ఆక్రమంలో ముంచుకు వచ్చే ముప్పుల గురించి కూడ నివారణోపాయాల్ని కనుగొంటూ వుండాలి.

 

20.       ఒకప్పుడు ఇండియా మార్కెట్ ను ఏలిన అనేక బ్రాండ్స్ హఠాత్తుగా మాయమైపోవడం మనకు తెలుసు. 1980లలో ఒక కొత్త బజాజ్ స్కూటర్ కొనాలంటే బుకింగ్ చేసుకున్న తరువాత నాలుగైదు సంవత్సరాలు ఆగాల్సి వచ్చేది. రెండు మూడేళ్ళు వాడిన పాత స్కూటర్లను కొత్త రేట్లకు అమ్మేవారు. “ఆమ్ కా ఆమ్ – గుట్లీ కా దామ్” అనేది ఆ కంపెనీ క్యాప్షన్ గా వుండేది.  అలాంటిది మన రోడ్ల మీద  హఠాత్తుగా బజాజ్ స్కూటర్లు కనిపించకుండాపోయాయి. వాటికి పోటీ వచ్చేసింది. ముందు కెనటిక్ హోండా, ఆ తరువాత హోండా యాక్టీవా వచ్చి బజాజ్ ను స్కూటర్ల మార్కెట్ నుండి తరిమేశాయి.

 

21.       అలాగే అప్పెరల్ రంగంలో టిటికే వారి ‘ట్యాంటెక్స్’ ఇన్నర్ వేర్ కొంతకాలం మార్కెట్ లీడర్ గా వున్నాయి. అవీ హఠాత్తుగా అదృశ్యమైపోయాయి. ఇప్పుడు జాకీ బ్రాండ్ హవా నడుస్తున్నది.

 

22.       జీవపరిణామ సిధ్ధాంతంలో ఛార్లెస్ డార్విన్ ఏమన్నాడో తెలుసుగా!  “Survival of the biggest” అనలేదు; Survival of the fittest” అన్నాడు.   మీరు ఈ నియమాన్ని అనుక్షణం గుర్తు పెట్టుకోండి. మార్కెట్ పరిణామాలకు  ఫిట్ అయ్యే అనువుగా వుండే విధంగా మీ ఉత్పత్తుల డిజైన్లను, మీరు అందించే సేవల్నీ  మారుస్తూ వుండండి.

 

23.       మారిన పరిస్థితులకు  మనం అనువుగా మారాలి. Adaption అంటారు. Adaptability ఒక్కటే జీవికను కాపాడుకునే సూత్రం.

 

24.       వాణిజ్య రంగంలోని పోటీదారుల నుండే కాకుండా రాజకీయ రంగంలోని వ్యతిరేకుల నుండి కూడ ముస్లింలకు ముప్పు వుంటున్నది. ఇది కొత్త ట్రెండ్.

 

25.       బెంగళూరులో పూల వ్యాపారం అనాదిగా ముస్లింల చేతుల్లో వుంది.  వాళ్ళ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగేది. ముస్లింలు అంటే గిట్టని కొందరు రాజకీయ   నాయకులు ఇటీవల ముస్లింల దుకాణాల్లో పూలు కొనవద్దని హిందూ సమూహాలకు ఓ పిలుపు నిచ్చారు. అంతే కొన్ని వారాలపాటు పూల దుకాణాలు మూతపడ్డాయి. ముస్లిం వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఈ ముప్పును వాళ్లు ఊహించలేదు. స్వాట్ లో టీ – ని మరచిపోయారు.

 

26.       అదృష్టావశాత్తు ఆ వివాదం ఇంకో విధంగా పరిష్కారం అయింది. కర్ణాటకలో పూల తోటల యజమానులు హిందువులు.  దుకాణదారుడు కొనకపోతే వాళ్ళు పూలు ఎవరికి అమ్ముకోవాలీ? అంచేత వాళ్ళు ముస్లిం వ్యాపారులకు మద్దతుగా ఆందోళనకు దిగారు.   

 

27.       కశ్మీర్ లోయలో ఈ ఏడాది ఆపిల్ పండ్లు కోతకు వచ్చినప్పుడు హైవేల మీద రాకపోకల్ని ఆపేశారు. రవాణ స్థంభించిపోవడంతో వేల ట్రక్కుల ఆపిల్ పండ్లు కుళ్ళిపోయాయి. ఆపిల్ రైతుల్లో అత్యధికులు ముస్లింలు అమి ఇక్కడ మనం గమనించాలి.

 

28.       మీ వ్యాపారం బాగా నడుస్తున్నా అనుకోని ముప్పులు వస్తాయి అనడానికి ఈ రెండు ఉదాహరణలు ఇచ్చాను.

 

29.                ముస్లిం దుకాణాల్లో పర్చేజింగ్ చేయవద్దు అంటూ ఢిల్లీ బిజెపి పర్వేష్ సాహిబ్ సింగ్ వంటివారు బహిరంగ సభల్లో బాహాటంగా పిలుపులు ఇస్తున్నారు. ఆ ప్రభావం విజయవాడకు కూడ చేరింది. ఈ అంశం మీ దృష్టికి కూడ వచ్చి వుంటుందనుకుంటున్నాను.

 

30.        భవిష్యత్తులో, ముస్లింలకు అమ్మకండి అని కొన్ని సంఘాలు పిలుపులు ఇచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదు.  అలాంటి సవాళ్ళకు మీ దగ్గర వాణిజ్యపరమైన సమాధానం వుండాలి. దానికి సిధ్ధంకండి. 


31.       మిత్రులారా! భూమి మీద ముస్లింలకు ఒక కఛ్ఛితమైన విధానం వుండాలి. ఒక శతాబ్దం క్రితం మన దేశంలో ముస్లింలకు తమ జనాభాకు తగ్గట్టుగా భూమి వుండేది. అది వ్యవసాయ భూమి కావచ్చు లేదా ఇళ్ళ స్థలాలు కావచ్చు. కానీ ఈరోజు ముస్లిం జనాభాలో 5 శాతానికి కూడా భూమిలేదు. ఇది చాలా పెద్ద ప్రమాద సూచిక.

 

32.       ముస్లింల భూమి విధానం  గురించి నా అనుభవంలో నుండి ఒక సంఘటన చెపుతాను. ఓ పాతికేళ్ళ క్రితం నేను హైదరాబాద్ పాతబస్తీలో ఓ బతికి చెడిన ఓ ముస్లిం ఇంటికి ఓ విందుకు వెళ్ళాను. అతను తనకుతాను నిజాం నవాబు కుటుంబానికి చెందిన వాడిగా గొప్పగా చెప్పుకున్నాడు. ఆరోజుల్లో తన కుటుంబానికి ఎంత భూమి వుందో తనకే తెలియదట. గ్రామాల నుండి ఎవరయినా ఓ కిలో  ‘ఘీ షక్కర్’ (నెయ్యి, బెల్లం)  తీసుకుని ఇస్తే సంతోషపడి ఓ రెండు ఎకరాలు రాసి ఇచ్చేవాడట. ఓ రోజు నిజాం సంస్థానం అంతరించిపోయింది. తన భూమి దానంగా పొందినవారు ధనికులయ్యారు. తను బికారి అయ్యాడట. ఇదెలా జరిగిందంటే, తను అందరి పేరున పత్రాలు రాశాడుగానీ తన పేరున తాను ఏ పత్రమూ రాసుకోలేదట.   పత్రాలువున్న భూముల్ని కొత్త ప్రభుత్వం క్రమబధ్ధం చేసిందట.

 

33.       మనది కాని కాలం ఇది. ఇప్పటికే చాలా చోట్ల ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వడంలేదు. అద్దెకు వున్నవాళ్లని క్రమంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

34.       స్వంత భూమి లేనివారికి ఇక్కడ నివశించే వీలులేదు అనే క్రూరమైన నిబంధనలు వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు.

 

35.       కంపానియన్ షిప్ ఈ విషయంలో జాగ్రత్తలు వహించి భూమి విధానం మీద ముస్లిం సమాజంలో ఒక  స్పృహను  కల్పించాలని కోరుతున్నాను.

 

36.       సేవారంగంలో  ముస్లింలకున్న నైపుణ్యం  అందరి మన్ననల్ని అందుకుంది. మెకానిక్ అంటే ముస్లిం గుర్తుకు వస్తాడు. మొదటితరం యంత్రపరికరాలనేగాక, రెండవతరం, మూడవతరం యంత్రపరికరాలను సహితం రిపేరు చేసే సామర్ధ్యం ముస్లిం మెకానిక్కులకు వుంది.

 

37.       ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక మల్టీనేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఎలక్ట్రానిక్ ఇంజినీర్లతో ఐదేసి పదేసి ఏళ్ళు కష్టపడి రూపొందించిన కంప్యూటర్ ను పదోతరగతి కూడ పాస్ కాని ఓ ముస్లిం బాగుచేస్తుండడాన్ని మనం తరచూ చూస్తుంటాం. హార్డ్ వేర్ సాంకేతిక రంగంలో ముస్లింల సామర్ధ్యం అలాంటిది మరి.   

 

38.       సేవారంగంలో కొంతకాలంగా మన సామర్ధ్యానికి ఒక ముప్పు వచ్చింది. వాచీ రిపేర్లు, గొడుగుల రిపేర్లు, తాళాల రిపేర్లు వంటి వృత్తులు అంతరించి పోతున్నాయి. పాత పార్ట్స్ ను లేతు మిషన్ల మీద రిపేరు చేసి కొత్త జీవాన్నిపోసే అవసరం లేకుండా పోతోంది. యూజ్ అండ్ థ్రో విధానం వచ్చేస్తున్నది. దానితో, రిపేరర్, మెకానిక్ ల ప్రాధాన్యం తగ్గిపోతున్నది. మనం ఇప్పుడు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి.

 

39.       ఇప్పుడు లోకల్ వ్యాపారానికి ఇంకో ముంపు వచ్చింది.  దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల్ని ఏలుతున్న మెగా కార్పొరేట్లు లోకల్ కంపెనీలను మింగేస్తున్నాయి. దీనినే Merger and Acquisition Strategy అంటున్నారు.

 

40.       ఈ ఏడాది విజయవాడ జరిగిన ఒక ఉదాహరణనే మీకు చెపుతాను. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 25-30 మాల్స్ గల ఓ టెక్స్ టైల్స్ రిటైల్ ఔట్ లెట్స్ ఫ్రాంఛైజీవుంది. దాన్ని రిలయన్స్ సంస్థ ఒక ఫ్యాన్సీ ప్రైజ్ ను ఆఫర్ చేసి కలుపుకుంది.

 

41.       ఆ ఫ్యాన్సీ ప్రైస్ ఒక సర్ ప్రైజ్ కూడ. దాని మీద కొన్నాళ్ళు వాణిజ్యరంగంలో  పెద్ద చర్చ జరిగింది. అంత  ఆకర్షణీయమైన ధర చెల్లించడానికి రిలయన్స్ సంస్థ కు రెండు కారణాలున్నాయి. మొదటిది; రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సాలీన ఆదాయం 6 బిలియన్ డాలర్లు. రోజుకు దాదాపు 1200 కోట్ల రూపాయలు. వాళ్లు బేరసారాల్లో గంటలు కూడ వృధా చేయరు. “మూ బోలీ దామ్” పడేస్తారు. రెండవది, రెండు రాష్ట్రాల్లో కొత్తగా 25 అవుట్ లెట్స్ ను నిర్మించడానికి, వృత్తి నైపుణ్యంగల స్టాఫ్ ను రిక్రూట్ చేయడానికి, కొత్త బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. దానికన్నా నడుస్తున్న సంస్ద్థను అదిరిపోయే ఫ్యాన్సీ ధర చెల్లించి తక్షణం కలుపుకోవడమే వారికి లాభం.

 

42.       వ్యాపార వాణిజ్యాల్లో సంవత్సరాలు, నెలలు మాత్రమేకాదు నిముషాలు సెకన్లు కూడ కౌంట్ అవుతాయి.

 

43.       మధ్యయుగాల రాజులు అనుసరించిన యుధ్ధ వ్యూహాలను ఇప్పుడు మెగా కార్పొరేట్లు అనుసరిస్తున్నాయి. క్రీస్తు పూర్వం నాలుగవ  శతాబ్దపు అలెగ్జాండర్ వీరికి ఇప్పుడు గొప్ప ఆదర్శంగా మారాడు.

 

44.       మసిడోనియా రాజు  హత్యకు గురికావడంలో యువరాజు అలెగ్జాండర్ 21వ ఏట రాజయ్యాడు. పాత సైన్యాన్ని ప్రక్షాళన చేయడంలో, కొత్త సైన్యాన్ని సమకూర్చుకోవడంలో, రాజ్యాలను కబళించడంలో, యుధ్ధ వ్యూహాల్లో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. లొంగిపోయిన రాజుల్ని తన ప్రతినిధులుగా నియమించేవాడు. తిరస్కరించిన వారిని అంతం చేసేవాడు. చాలా తక్కువ రోజుల్లో ప్రపంచ విజేత అయ్యాడు. అలెగ్జాండర్ -ద –గ్రేట్ గా చరిత్రలో నిలబడ్డాడు.

 

45.       ఈ ఉపన్యాసం కోసం నేను బ్రియాన్ ట్రేసీ (Brian Tracy) పుస్తకం ‘బిజినెస్ స్ట్రాటెజీస్’ (Business Strategy) ఓ సారి తిరగేశాను. మొదటి ఛాప్టర్ మొత్తం అలెగ్జాండర్ రూపొందించిన యుధ్ధ వ్యూహాల మీదే వుంది.

 

46.       కష్టకాలం నుండి గట్టెక్కడానికి శిక్కు సామాజికవర్గం నుండి మనం ఒక ప్రేరణను పొందవచ్చు.

 

47.       1984 అక్టోబరు చివర్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డ్స్ అయిన ఇద్దరు శిక్కు యువకులు హత్యచేశారు.  దానికి ప్రతీకారంగా అంటూ మూకోన్మాదులు, అల్లరి మూకలు ఢిల్లీలో శిక్కుల మీద  ఊచకోత సాగించారు. రాజధాని నగరంలోనే 3 వేల మంది శిక్కులు చనిపోయారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంకో వెయ్యి మంది చనిపోయారు. 

 

48.       ఈ నరమేధం తరువాత ఢిల్లీ శిక్కు పెద్దలు సమావేశమై ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. కాంగ్రెస్ లోని మతతత్త్వవాదులు కొందరు ఈ నరమేధానికి జనాన్ని ఉసిగొల్పారన్నది అందరికీ తెలిసిన విషయమే. గానీ, ఈ జనం ఎందుకు అంతగా రెచ్చిపోయి కసితో కక్షతో తమ మీద దాడి చేశారో వారికి అర్ధం కాలేదు. జనానికి తమ మీద ఒక అసహనం, అసూయ, అక్కసు వంటివి వున్నట్టు వాళ్లు గుర్తించారు. ముందు ఈ సామాజిక వాతావరణాన్ని మార్చి, ఢిల్లీ పౌరుల ప్రేమాభిమానాలను తిరిగి పొందే  మార్గాలను వాళ్లు అన్వేషించారు.

 

49.       ఢిల్లీ శిక్కులు ఏ రంగంలోవున్నా తమ కష్టమర్లకు గొప్ప క్వాలిటీ సేవలు ఇవ్వాలని ఆ సమావేశంలో తీర్మానించుకున్నారు.

 

50.       అప్పట్లో ఢిల్లీలో ఆటోరిక్షాల వాళ్లు ప్రయాణికుల్ని అనేక రకాలుగా మోసం చేసేవారు. ముందు అది ఆగిపోయింది. శిక్కుల ఆటో ఎక్కితే చార్జి తక్కువ, సరిగ్గా గమ్యానికి చేరుస్తారనే మాట వచ్చేసింది. సరుకులూ అంతే. శిక్కుల దుకాణాల్లో తక్కువ ధరకు నాణ్యమైన సరుకు దొరుకుతుందనే నమ్మకం కలిగింది. అలా ఓ ఐదారు నెలల్లోనే శిక్కులు ఢిల్లీ నగరంలో తమ పూర్వ వైభవాన్ని పుంజుకున్నారు.

 

51.       ఆరోజు ఢిల్లీ శిక్కులు ఎదుర్కొన్నంతటి సవాళ్ళు ఈనాటి ముస్లింలకు లేకపోవచ్చు. గానీ, మన చుట్టూ ఒక అసహన వాతావరణం ఏర్పడుతున్నదని మాత్రం గమనించాలి.

 

52.       ‘నాణ్యమైన సేవ’ అనేది  మన వాణిజ్య కార్యకలాపాల్లో తొలి ప్రమాణం కావాలి.

 

53.       ఇప్పుడు నేను మన అంతర్గత సమస్యల గురించి మాట్లాడుతాను. “ముస్లింలు పీతలబుట్ట లాంటివాళ్లు; ఒకడు ఎదుగుతూ వుంటే మరొకడు వాడి కాళ్ళు పట్టుకుని లాగుతుంటాడు” అనే మాటను మనం తరచూ వింటుంటాం.  ఇందులో నిజం లేకపోలేదు.

 

54.       అయితే ఇది ముస్లిం సమాజపు ప్రత్యేక సమస్య ఏమీకాదు. ప్రపంచంలో పతన దిశగా సాగుతున్న సమూహాలన్నీ అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుంటుంటాయి. అభివృధ్ధి దిశగా సాగే సమూహాలన్నీ సమిష్టిగా వ్యవహరిస్తుంటాయి. అంతర్గత కుమ్ములాటలనేవి ఏ సామాజికవర్గానికి అయినా పతన దశ లక్షణమే.

 

55.       పతన దిశగా ప్రయాణిద్దామా? లేక వికాశం దిశగా ప్రయాణిద్దామా? ఈ విషయం మీద మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. మనం నిలదొక్కుకుని వికాసాన్ని సాధించాలంటే మాత్రం మనలో ఐక్యత చాలా ముఖ్యం.

 

56.       ప్రపంచ చరిత్రలో ఇస్లాంకు కూడ ఒక స్వర్ణయుగం అధ్యాయం వుంది. ఎనిమిదవ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఇది  గొప్పగా వెలిగింది.  ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆలోచనాపరులు, కవులు, కళాకారులు, వాణిజ్యవేత్తలతో ముస్లిం సమాజం విలసిల్లిన కాలం అది.

 

57.       ఇవ్వాళ  ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న అంకెలు అరేబియన్ వే. మహత్తరమైన ‘సున్నా’ భారత దేశంలో పుట్టింది. ఆ తరువాత గణితాన్ని అల్ ఖ్వారిజ్మి వంటి అరేబియన్ శాస్త్రజ్ఞులు గొప్పగా అభివృధ్ధి చేశారు.

 

58.       ముస్లిం పౌరస్మృతి నుండి అకౌంటెన్సీ పుట్టింది. చనిపోయిన వారి ఆస్తిని వారసులు ఏఏ నిష్పత్తిలో పంచుకోవాలనేది ముస్లిం సమాజంలో  చాలా క్లిష్టమైన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించడానికి మూ-హసాబా రూపుదిద్దుకుంది. మనం సాధారణంగా హిసాబ్ కితాబ్ అంటుంటాం. అదే ఆధునిక అకౌంటెన్సీకి మూలం. 

 

59.       అల్ జీబ్ర అనేదే అరబిక్ పదం. ‘చితికిపోయిన ముక్కల్ని కూర్చడం’ అని దానికి మూల అర్ధం. స్క్వేర్ రూట్లు, క్యూబ్ రూట్లు కూడ ఆ కాలంలోనే అభివృధ్ధి చెందాయి. 

 

60.       ఇప్పుడు నేను వ్యాపారానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాల్ల్ని గుర్తు చేస్తాను. సరుకును కొన్న ఖరీదుకు రెట్టింపు చేసి అమ్మకపు ధర నిర్ణయిస్తే, అమ్మకాల మీద 50 శాతం స్థూల లాభం వస్తుందని దాదాపు అందరికీ తెలుసు. సేల్స్ ప్రమోషన్ కోసం 10-15 శాతం డిస్కౌంట్ ఇస్తే స్థూల లాభం శాతం సుమారుగా 33 శాతం వుంటుంది. స్థూల లాభం వేరు; నికర లాభం వేరు అని మీకు తెలుసు. అయినా, ఇవన్నీ పాత లెఖ్ఖలు. ప్రాధమిక గణాంకాలు.

 

61.       ఆధునిక వాణిజ్యంలో లాభం శాతం అనేది ఎన్నడూ కీలకం కాదు. టర్నోవర్ చాలా ముఖ్యం. లాభం శాతాన్ని బాగా తగ్గించి, టర్నోవర్ ను భారీగా పెంచగలిగితే మొత్తమ్మీద భారీ నికర లాభాలు వస్తాయి అనేది ఆధునిక వ్యాపార సూత్రం.

 

62.       సిబ్బందికి జీతాలు తక్కువ ఇచ్చి, ఎక్కువ గంటలు పనిచేయుంచుకుంటే ఖర్చు ఆదా అవ్వడమేకాకుండ ఉత్పత్తి కూడ పెరుగుతుందని గత కాలపు మొరటు పెట్టుబడీదారులు భావించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కార్యాలయాల్ని అందంగా తీర్చిదిద్ది, సిబ్బందికి పనిగంటలు తగ్గించి, ఎక్కువ జీతాలు చెల్లించి,  వీకెండ్ సెలవులు ఇచ్చి, ఏడాదికి ఓ వారం అన్ని ఖర్చులు భరించి టూర్లకు పంపిస్తే  ఔట్ పుట్ క్వాలిటీ, క్వాంటమ్ రెండూ బాగుంటాయని  మార్కెట్ వ్యూహకర్తలు సూచిస్తున్నారు. 

 

63.       బిఎస్ ఎన్ ఎల్ భారీగా చార్జీలు వసూలు చేసి భారీగా నష్టాల్లో కూరుకుపోవడాన్నీ,  జియో ఉచితంగా సేవలు అందించి భారీగా లాభల్ని సాధించడాన్ని మనం చూశాం. వాణిజ్యానికి ఇప్పుడు ఈ కిటుకులు కావాలి. ఇలాంటి నైపుణ్యం కావాలి.

 

64.       ఇక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన రెండు సున్నితమైన అంశాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. కొంచెం సహనంతో ఆలకిస్తారని నమ్ముతున్నాను.

 

65.       మొదటిది;  బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ లేకుండ భారీ వ్యాపారం, వాణిజ్యం సాగదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచ బ్యాంకు శాసిస్తుంది. వడ్డీ విధానం మీద మనకున్న  వ్యతిరేకత మనల్ని బ్యాంకింగ్ వ్యవస్థకు దూరం చేస్తున్నది. ధార్మిక ఆదేశాల కారణంగా ముస్లింలు వడ్డీ కోసం రుణాలు ఇవ్వకపోవచ్చు. కానీ, బ్యాంకుల నుండి వడ్డీకి రుణాలు  తీసుకోకుండ పెద్ద వ్యాపారం ఆరంభమేకాదు.

 

66.       రెండోది; వాణిజ్యరంగంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, ఈరోజు సింహభాగం  లిక్కర్ ది. ముస్లిం సమాజానికి దాని మీద కూడ వ్యతిరేకత వుంది.

 

 

67.       వడ్డీ లేకుండా రుణాలిచ్చే ఇస్లామిక్ బ్యాంక్, బైతుల్ మాల్ గురించి నాకు తెలుసు. అది ఒక ఆదర్శమేతప్ప వర్తమాన ప్రపంచంలో ఆచరణ సాధ్యం కాని విధానం.

 

68.      హాకర్స్  వంటి కొందరు చిరు వ్యాపారులకు ఇస్లామిక్ బ్యాంక్ ల ద్వార కొంత మేలు జరుగుతున్నమాట వాస్తవం. అయితే,  దాని పరిధీ పరిమితి చాలా స్వల్పం. ఆ బ్యాంకుల్లో కూడ ఆఫీసు అద్దెలు, కరెంటు, సిబ్బంది జీతాలు, స్టేషనరీ, బకాయిల వసూలు యంత్రాంగం వగయిరా ఖర్చుల్ని పూడ్చుకోవడానికి ఒక శాతం అయినా సర్వీసు చార్జీల రూపంలో వసూలు చేయక తప్పదు.

 

69.       రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ఈ రెండు రాష్ట్రాల ఆర్ధిక కార్యకలాపాల్లో ఓ పాతిక కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పడిన ఇస్లామిక్ బ్యాంక్ ప్రభావం ఎంత? 0.00005 శాతం!

 

70.       ఆర్ధికరంగంలో సాంప్రదాయికంగా మనం పెట్టుకున్న ఆంక్షలు మనల్ని ఆర్ధికరంగం నుండి వెలివేతకు గురిచేస్తున్నాయి. దీన్ని పెద్దలు గమనించాలి; పట్టించుకోవాలి; పరిష్కరించాలి.

 

71.       మధ్య ఆసియా దేశాల ఆర్ధిక దృక్పధంలో ఇటీవల చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్ని మనం ముఖ్యంగా దుబాయిలో చూడవచ్చు. న్యూ ఎడిషన్ యాపిల్ ఫోన్ ఇండియాలో కన్నా దుబాయ్ లో 30 వేల రూపాయలు తక్కువ. హైదరాబాద్ నుండి ఫ్లయిట్లో వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు జనం. అక్కడ ఆ వ్యాపారం చేస్తున్నదీ ముస్లింలే. వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకోవాలి.

 

72.       కష్టమర్లకు మీరెవరూ అన్నది అంత ముఖ్యం కాదు; మీరు ఎంత నాణ్యమైన సేవలు అందిస్తారన్నది మాత్రమే ముఖ్యం.

 

73.       మార్కెట్ నియమాలను అధ్యయనం చేసి పాటించకపోతే మీరు ఓడిపోతారు. మార్కెట్ నియమాల మీద పట్టు సాధించి పాటిస్తే మీరే విజేతలు.  మీరు విజేతలుగా మారాలని ఆశిస్తాను.

 

74.         మార్కెట్ లో ఎప్పుడయినా విజయ సూత్రం ఒక్కటే; “నాణ్యమైన సేవ”!

 

75.       ధన్యవాదాలు.

 

విజయవాడ

11 అక్టోబరు 2022