Saturday 28 December 2013

కిరణ్, బాబు, జగన్ – 1,2,3

కిరణ్, బాబు, జగన్ – 1,2,3

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
        ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ భీష్ములు. గాంధీ_నెహ్రు వంశానికి మూడు తరాలుగా ఆపద్బాంధవులుగా వుంటున్నవారు. తాను రాష్ట్రపతి భవనానికి చేరినా వీలుకుదిరితే  రాహుల్ గాంధీకి కూడా తన  అనుభవాన్నీ, విద్వత్తునీ అందించాలనుకుంటున్నవారు. రాహుల్ గాంధీకి దాన్ని అందుకునే స్తోమత వుందా? లేదా? అన్నది వేరే విషయం!

        గడ్డకట్టే ఢిల్లీ  చలి నుండి విడుపు కోసం శీతాకాలం విడిది హైదరాబాద్ కు వచ్చిన ప్రణబ్ దాకు ఇక్కడ వెచ్చదనం సంగతి ఎలావున్నా రోజూరోజుకీ  వేడుక్కుతున్న రాష్ట్ర రాజకీయ సెగలు మాత్రం గట్టిగానే తగులుతున్నట్టున్నాయి.  

       ప్రతి సమస్యకూ వారి దగ్గర పరిష్కారాలు వున్నాయోలేవో మనకు తెలీదుగానీ,  ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం వుంటుందని తెలిసిన జ్ఞాని ప్రణబ్ దా! తెలంగాణ నాయకులతోపాటూ, సీమాంధ్ర నాయకులు కూడా పలు సందర్భాల్లో పలు హోదాల్లో ప్రణబ్ ముఖర్జీని కలిశారు. విభజన రాష్ట్ర అంశంపై  తమ అభిప్రాయాల్ని చెప్పారు. ఇప్పుడు  మళ్ళీ  చెపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ నేతల అభిప్రాయాల్లో పెద్ద తేడా ఏమీలేదుగానీ, సీమాంధ్ర నేతల తలకిందుల తప్పస్సు మాత్రం ప్రణబ్ దా వంటి తలపండిన రాజకీయ నాయకునికి కూడా అశ్చర్యం కలిగిస్తూ వుండవచ్చు. 

        ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-2013  సీమాంధ్రులకు ఎలాగూ నచ్చదని అందరికీ తెలుసు.   విచిత్రం ఏమంటే, తెలంగాణవాదులు కూడా ఇప్పుడు బిల్లు మీద పెదవి విరుస్తున్నారు.  అటు సీమాంధ్రులది ఏదో కోల్పోతున్నామనే ఆవేదన. భవిష్యత్తు అర్ధంకాని అయోమయం.  ఇటు తెలంగాణవాదులది  "యే దిల్ మాంగే మోర్ " ఉరిమే ఉత్సాహం! బరువులు, బాధ్యతలు, అప్పులు, హామీలు లేని తెలంగాణ కావాలని ఇప్పుడు కెసిఆర్ కొత్త పాచికలు కదుపుతున్నారు. 
       తాముచెపుతున్న సమైక్యవాదాన్ని సమైక్యంగా వినిపించి విజయాన్ని సాధించాలని సీమాంధ్ర నాయకులు ఏ దశలోనూ అనుకోలేదు;  అనుకోవడమూలేదు.  రేపు ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రంలో ఓట్లు, సీట్లు ఎలా దండుకోవాలనేదే వాళ్ల తాపత్రయంగా కనిపిస్తున్నది. 

       2004 ఎన్నికల నాటికి అధికారంలోవున్న చంద్రబాబు  సహజంగానే సమైక్యవాది.  ఆ ఎన్నికల్లో,  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును  వాగ్దానం చేసిన కాంగ్రెస్ సహజంగానే టీఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుంది. రాజకీయంగా తనను ఎదుర్కోలేని వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తెచ్చారని ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విమర్శించేవారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా  చంద్రబాబు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. 2004 ఎన్నికల తరువాత ఏర్పడిన యూపియే ప్రభుత్వ కార్యక్రమాల్లో  చేరిన తెలంగాణ అంశాన్ని పరిశీలించడానికి వేసిన కేంద్ర  మంత్రివర్గ ఉపసంఘానికి ప్రణబ్ ముఖర్జీయే అధ్యక్షులు. 

       2009 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చారు. ఆ ఎన్నికల్లోనే జగన్ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ప్రవేశించి, కడప లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్టుపై  గెలిచారు.  2004లో రాజశేఖరరెడ్డి చేసిన పనినే, 2009 ఎన్నికల్లో చంద్రబాబు చేశారు.  రాజకీయంగా వైయస్ ను ఎదుర్కోలేనని భావించి, కేసిఆర్ తో పొత్తు పెట్టుకున్నారు.  ఆ పొత్తు కోసం ముందు షరతుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఒక లేఖ కూడా ఇచ్చారు. అప్పుడూ ఆ ఉప సంఘానికి అధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీనే! చంద్రబాబుగారి చాణిక్యం ఎక్కడ వుంటుందంటే, వారు 2004 ఎన్నికలని  గుర్తుచేస్తారుగానీ, 2009 ఎన్నికల్లో టిఆర్ ఎస్ తో పెట్టుకున్న పొత్తు గురించి మాట్లాడరు.  2009 ఎన్నికల్లో 45 సీట్లు ఇస్తే  10 సీట్లు కూడా  గెలవలేకపోయారని కేసిఆర్ ను ఎద్దేవ చేస్తారుగానీ, కేసిఆర్ తో పొత్తుపెట్టుకోవడానికి తాను తహతహలాడిన  అంశాన్ని దాస్తారు. 

       కీలక వాస్తవాలని  దాయడంలో జగన్ కు కూడా చంద్రబాబే ఆదర్శం.  2009 ఎన్నికల్లో,  తొలి విడతగా తెలంగాణలో పోలింగ్ అయిపోయిన తరువాత, సీమాంధ్రలో పోలింగ్ ఆరంభం కావడానికి ముందు  వైయస్ రాజశేఖర రెడ్డి తొలిసారిగా బహిరంగంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. జగన్ ఈ అంశాన్నే గుర్తుచేస్తారుగానీ, కేసిఆర్ ను వెలుగులోనికి తెచ్చిందే  రాజశేఖర రెడ్డి అనే వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ నుండి విడిపోయి స్వంత పార్టీని పెట్టుకున్న తరువాత కూడా జగన్, ఆయన తల్లి విజయమ్మ. చెల్లి షర్మీల కూడా చాలా సంధర్భాల్లో తెలంగాణకు సానుకూలంగా ప్రకటనలు, తీర్మానాలు చేశారు. జగన్ ఒక అడుగు ముందుకువేసి, మూడవ అధీకరణం అధారంగా రాష్ట్రాన్ని విభజించాలని సూచనలూ చేశారు. ఇప్పుడు వారు, రాజ్యాంగంలో మూడవ అధీకరణాన్ని సవరించడానికి రాష్ట్రాలుపట్టి తిరుగుతున్నారు. 

       అందరికీ తెలిసిన వాస్తవాలని  దాయాలని సీమాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నాయకులు ఎందుకు విఫలయత్నం చేస్తున్నారు? అనేది ఎవరికైనా రావలసిన ప్రశ్నే!  సీమాంధ్ర ప్రజలు తమను గుడ్డిగా అనుసరిస్తారని వీరిద్దరూ అనుకున్నారు. ఇది అతివిశ్వాసమూ కావచ్చు. అహంభావమూ కావచ్చు.  మరోవైపు, తెలంగాణలో బోనస్ ఓట్లు, సీట్లు రాబట్టుకోవడానికి వెకిలి రాజకీయ విన్యాసాలన్నీ చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీమాంధ్రను రాసిచ్చారు.!  వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. తెలంగాణలో ఎలాగూ నూకలు చెల్లిపోయాయి. సీమాంధ్ర ఓట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి దాపురించింది. సీమాంధ్ర  ఓట్లనైనా కాపాడుకోవడానికి  "అశ్వథ్థామ అతః (కుంజరః)" అంటూ సగం దాచి, సగం బయటికి చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు.  

        గతాన్ని గుర్తు చేస్తే జగన్, చంద్రబాబు ఇద్దరికీ చిర్రెత్తుకొస్తుంది. గతాన్ని గుర్తు చేసే పాత్రికేయుల మీదే వీళ్లకు ఇప్పుడు ప్రధాన కోపం అంటే అతిశయోక్తికాదు. పాత్రికేయుల మీద  అసహనాన్ని వ్యక్తం చేయకుండా ఇటీవలి కాలంలో చంద్రబాబు, జగన్ ల మీడియా సమావేశాలు ముగియడం లేదు! 

       సీమాంధ్ర సియం రేసులో ఆఖర్న చేరిన నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు, జగన్ లాగ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్లూ ఇవ్వలేదు. ప్రకటనలూ చేయలేదు. ఆ మేరకు వారిమీద సీమాంధ్రలో ప్రతికూల ప్రభావం లేదు. అయితే, వారికున్న సానుకూల ప్రభావం ఎంతో కూడా అంతుచిక్కడంలేదు. తన దగ్గర ఇంకా లాస్ట్ బాల్ వుందని కిరణ్ కుమార్ రెడ్డి ఈమధ్య అభిమానుల్ని ఊరిస్తున్నారు. అయితే, పునర్విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి విధించిన జనవరి 23 గడువు ముగిసేలోగా వారు తన దగ్గరున్న లాస్ట్ బాల్ బయటికి తీసేలాలేరు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి బలహీనతనే చెపుతోందిగానీ, బలాన్నికాదు. కిరణ్ కుమార్ ను నమ్మలేని, జగన్ క్యాంపులో ఇమడలేని మంత్రులు సహితం ఇప్పుడు చంద్రబాబు క్యాంపులో సీటు కోసం ప్రయత్నిస్తున్నారని గట్టి వినికిడి! ఆ మేరకు, జగన్, కిరణ్ ల మీద ఇది చంద్రబాబు విజయం అనే చెప్పాలి.

        ఇప్పుడు సీమాంధ్ర నాయకులు విభజన బిల్లును చర్చల ద్వారకాక, న్యాయవ్యవస్థలోని సౌలభ్యం, తర్కం ద్వార అడ్డుకోవాలనుకుంటున్నారు.  అందులోనూ నిజాయితీ కొరవడింది. ప్రాణప్రదమైన వునర్విభజన బిల్లుపై నిజాయితీగా, సుదీర్గ్జంగా చర్చ చేయాలనుకుంటే శాసనసభ సెలవులు రద్దు చేస్తే సరిపోతుంది. క్రిస్మస్ కు ఒక రోజు, సంక్రాంతికి ఒక రోజు సెలవు చాలదూ? దానికోసం రాష్ట్రపతిని కలిసి మరో ఇరవై రోజుల గడువు అడగడం దేనికీ?  చేతిలోవున్న కాలాన్ని సెలవుల్లో గడిపి, రాష్ట్రపతిని కలిసి గడువు కోరడం నిజాయితీ అనిపించుకోదు.

        విభజన బిల్లును తక్షణం శాసనసభ ఆమోదించాలని టీ-తమ్ముళ్ళు మోత్కుపల్లి సర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ వాదిస్తుంటే,  బిల్లు సమగ్రంగా లేదు కనుక దాని ప్రస్తుత రూపాన్ని మార్చాలని ఎస్-తమ్ముళ్ళు వాదిస్తున్నారు. జగన్ వర్గం  పది అడుగులు ముందుకువేసి,  బిల్లుపై శాసన సభలో చర్చకు అంగీకరించడమంటేనే విభజనకు అంగీకరించినట్టు అని ఒక అతివాదాన్ని ముందుకు తెచ్చింది. అలాకాకుండా శాసనసభ్యులందరూ అఫిడవిట్లు ఇవ్వాలని జగన్  కొత్త  విరుగుడుని కనుగొన్నారు.  వాదనకు వ్రాత రూపమే అఫిడవిట్ అయినపుడు నోటితో వాదించడానికీ,  రాసి ఇవ్వడానికీ తేడా ఏమిటీ? అనే సందేహానికి సమాధానం ఇవ్వడానికి జగన్ శిబిరం సిధ్ధంగాలేదు. 

       ఇక్కడ "శాసనసభ్యులందరు" అని ఎవరైనా అంటున్నపుడు వాళ్ళు తమ ప్రాంతపు శాసనసభ్యుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అనుకోవాలి. ఇప్పుడు రాష్ట్రప్రజల్ని సంయుక్తంగా సంభోధించగల నాయకులు మనకు ఒక్కరూ లేరని అర్ధం చేసుకోవాలి.

       చట్టసభల్లో విభజన ప్రక్రియను అధ్యయనం చేయడానికి  స్పీకర్ నాదెండ్ల మనోహర్  లక్నో వెళ్లడం కూడా వివాదంగా మారింది.  అయితే, "స్పీకర్ కు బుధ్ధుందా? జ్ఞానముందా?" అని  జగన్  చేసిన విమర్శలు సంచలన విలువకేతప్ప, విలుపైన ఫలితాలను సాధించడానికి ఏమాత్రం ఉపయోగపడవు.   ఆరేళ్ల పిల్లవాడికి కూడా తెలుసు అని జగన్ అంటున్న విభజన ప్రక్రియ ఇప్పుడు మహానాయకులకు కూడా అర్ధంగాకేకదా ఇంతమంది తలలు బద్దలుగొట్టుకుంటున్నదీ? అయితే, సీమాంధ్రలో అరేళ్ల పిలగాడికి కూడా  తెలిసిన విషయం ఒకటుంది ఈ చిచ్చుకు వైయస్, చంద్రబాబు ఇద్దరూ తలోవైపు నుండి చెరో చెంబుడు  పెట్రోలు పోశారనీ, దానికి జగన్ సహితం సమిధనొక్కటి ధారబోశారనీ! 
   
        తెలంగాణలో భిన్న పార్టీల శాసనసభ్యుల మధ్య కనిపించే ఐక్యత సీమాంధ్రలో మచ్చుకైనా కనిపించడంలేదు. భిన్నపార్టీల మధ్య ఐక్యత సంగతి పక్కనపెట్టినా ఒకే పార్టిలోని శాసన సభ్యుల మధ్య కూడా ఐక్యత కరువైపోయింది. జేసి దివాకర రెడ్డి ఉదంతం దీనికి పెద్ద ఉదాహరణ. సమైక్యవాదులమంటూ నిత్యం గొంతు చించుకునే  నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం నాయకుల పచ్చి అవకాశవాదంతప్ప  మరేమీకాదు. ఇవన్నీ సీమాంధ్రలో యుధ్ధం మొదలవ్వడానికి ముందే కనిపిస్తున్న ఓటమి సంకేతాలు.

       ప్రస్తుతం, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 'ఒక' బంతి మాత్రమే వుంది. చంద్రబాబు దగ్గర 'రెండు' కళ్ల సిధ్ధాంతం పదిలంగావుంది.  జగన్ 'మూడవ' అధికరణాన్ని నమ్ముకున్నారు. ఈ ఒకటి, రెండు, మూడు ఆయుధాలు సీమాంధ్రకు ఎంత వరకు  న్యాయం చేస్తాయో చూడాలి! 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
28 డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

29 డిసెంబరు 2013

Friday 27 December 2013

వేర్పాటువాదులకూ అసంతృప్తే

రాష్ట్ర విభజన బిల్లుపై
వేర్పాటువాదులకూ అసంతృప్తే
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

       పన్నెండు అధ్యయాలు, 13 షెడ్యూళ్ళు, 63 పేజీలున్న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013 ప్రతులు రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి చేరాయి.  ఇంగ్లీషులో బిల్లు, డ్రాఫ్ట్ కాపీ వగైరాలుగా పిలిచేదాన్ని తెలుగులో చిత్తుప్రతి అంటారు. సైనిక విమానంలో అతి భద్రంగా  రాష్ట్రానికి  వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013  బిల్లు చిత్తుగానేకాదు చెత్తగానూ వుంది. ఇంగ్లీషులో కొంచెం నయం, తెలుగు తర్జుమా అయితే మరీ ఘోరం. ఉర్దూ తర్జుమా సంగతి చెప్పనక్కరలేదు.

        తొమ్మిది కోట్లమందికి సంబంధించిన  పంపకాల అంశంలో  కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? అని అశ్ఛర్యం వేస్తుంది. ఆక్రోశం వచ్చినా తప్పుకాదనిపిస్తోంది. ఆంధ్రప్రధేశ్ ను సమైక్యంగా వుంచడం సాధ్యంకాదనీ,  తెలుగు - తెలంగాణ విభజన తప్పదని భావిస్తున్నవాళ్ళు కూడా సమర్ధించలేనట్టుగా వుంది ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013. మరోమాటల్లో చెప్పాలంటే ఇరుప్రాంతాల మధ్య చెలరేగిన వివాదాల్ని  పరిష్కరించడంకన్నా,  అనేక కొత్త వివాదాలు సృష్టించేలా వుంది బిల్లు. ఇది ఒకవేళ శాసనసభ, శాసనమండలి దశను దాటినా, న్యాయపరమైన చిక్కుల రీత్యా పరిష్కారం కోసం సెలెక్ట్ కమిటీ చుట్టు చక్కర్లు కొడుతూ వుండిపోకతప్పదు.

        ఆంధ్రప్రదేశ్ విభజనలో అత్యంత కీలకమైన నదీజలాల వివాదాన్ని పదకొండవ షెడ్యూలులో అతితేలిగ్గా తీసిపడేశారు.  జస్టిస్ బ్రిజేష్ కుమార్ కృష్ణాజలాల వివాద ట్రిబ్యూనల్ ఇటీవల ప్రకటించిన తీర్పు మీద రాష్ట్ర ప్రజలు ఎంత ఆగ్రహంతో వున్నారో కేంద్ర ప్రభుత్వం  అస్సలు పట్టించుకోలేదు.  పైగా, కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ నిర్ణయించిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. ఆ కేటాయింపుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ప్రకటిస్తుంది.అని ఒక ఫర్మానా జారీ చేసింది,  ఇది పుడు మీద కారం చల్లే వ్యవహారమే!
        ఇవ్వాల్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యనైనా, రేపటి తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యనైనా ఇరు ప్రాంతాల శాసనసభ్యులు  ప్రస్తుత రూపంలోవున్న అరకొర బిల్లుని ఏకగ్రీవంగా తిరస్కరించి, ఒక సమగ్రబిల్లుని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరి వుండాల్సింది. లేదా ఆ బిల్లుని పంపిన రాష్ట్రపతికి తమ మనోభావాల్ని సమిష్టిగా చెప్పివుండాల్సింది. ప్రాంతీయ  విబేధాలు వచ్చినపుడు  తెలంగాణులు 119 మంది. సీమాంధ్రులు 175 మంది అయితేకావచ్చుగానీ, ఇరు ప్రాంతాల ఉమ్మడి ప్రయోజనాలే దెబతింటున్నప్పుడు  తెలుగు-తెలంగాణులు 294  మంది అని చాటిచెప్పాలి.

        అయితే, రాజకీయాలు అంత విశాలహృదయంతో పనిచేయవు. ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. రాష్ట్రంలోని రాజకీయపార్టీల అధినేతలకూ,  ఇదే అదనుగా కొత్త పార్టీలు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్న నాయకులకూ అందరికీ చాలా రోజుల క్రితమే ఒక విషయం స్పష్టంగా తెలుసు; రాష్ట్రం విడిపోతున్నదనీ, దాన్ని ఆపడం సాధ్యమూ కాదని. ఇప్పుడు సాగుతున్న ప్రహసనం ఏమంటే, మినహాయింపు లేకుండా ప్రతిఒక్కరు వర్తమానం కోసంకాక, తమ రాజకీయ భవిష్యత్తు కోసం  పెనుగులాడుతున్నారు.

        తెలంగాణలో తమ కలలు పండించు కోవాలనుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు ఎవరికివారు తెలంగాణను తామే సాధించామని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్లకు రాజకీయ సంధిగ్ధం ఏమీలేదు.  సీమాంధ్రలో  తమ కలలు పండించు కోవాలనుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు విభజనను అడ్డుకోవడానికి తాము ప్రాణాలొడ్డి పోరాడామని చెప్పుకోవడానికి పోటీలు పడుతున్నారు. తమది ఎలాగూ విఫలయత్నమే అయినా సీమాంధ్ర ప్రజలు సానుభూతి ఓట్లు కురిపిస్తారని వాళ్ల నమ్మకం.

        టీఆర్ ఎస్, బీజేపి, యంఐయం, సిపిఐ, సిపియంలకు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే  శాసనసభ్యులున్నారు. ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో  వాళ్లకు భౌగోళిక సౌలభ్యం వుంది. జగన్ వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రాంతాన్ని వదులుకున్నారు కనుక వైయస్సార్ సిపి  బాహాటంగా సమైక్యాంధ్ర  అనడానికి సౌలభ్యం లభించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర పీఠం తమదే అనీ నమ్మకంలో జగన్ అనుచరులున్నారు.
        రెండు ప్రాంతాల్లోనూ శాసనసభ్యులున్న కాంగ్రెస్, టిడిపి పరిస్థితే ఇప్పడు ఇబ్బందికరంగా మారింది. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ చెరోవైపు చెరో కళ్ళెం ఇచ్చేసి ఆయన కాడి దించేసి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలు కూడా అప్పుడపుడు రాజకీయాల్లో పనికివస్తాయి. కాంగ్రెస్  సీమాంధ్ర విభాగానికి  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, తెలంగాణ విభాగానికి సీనియర్ నేత జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, గీతా రెడ్డి త్రయం నాయకత్వం వహిస్తున్నారు.  రాష్ట్రాన్ని  తెచ్చిన క్రెడిట్టును ఓటర్లు  కేసిఆర్ ఖాతాలో వేసేస్తారేమో అనే అనుమానంతప్ప, కాంగ్రెస్ తెలంగాణ విభాగానికి ఇతర సమస్యలు లేవు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకునే అవకాశం వాళ్లకు ఎలాగూవుంది. రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్అని చెప్పాక ఆ పార్టీలో కొనసాగడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు చాలా ఇబ్బందితో కూడిన వ్యవహారం. దీన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు నిజంగానే కొత్త బ్యాటు పట్టుకోవచ్చు.  అలా సీమాంధ్ర కాంగ్రెస్ క్రికెట్టు టీం  రెండు జట్లుగా మారవచ్చు.        ఒక జట్టు కిరణ్ కుమార్ తో నడిస్తే, రెండో జట్టు సోనియా విధేయులుగా మిగలవచ్చు, లేదా జగన్ శిబిరంలో చేరవచ్చు లేదా రాజకీయాల నుండి కొంతకాలం విశ్రాంతి తీసుకోవచ్చు.

        సీమాంధ్రలో జగన్ గుర్రం రేసులో ముందుంది అనేది కూడా పాక్షిక సత్యమే. బెయిలుపై బయటికి వచ్చాక ఆ ఐదు రోజుల లాంఛనపు దీక్ష, సమైక్య శంఖారావం  సభతప్ప, వారు  ప్రకటిస్తున్నట్టు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్న దాఖలాలు ఏమీలేవు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో ఆయన పార్లమెంటులో మద్దతు కూడగట్టడానికి రాష్ట్రాల పర్యటనలు చేయడం పలాయనమో, ఫలితాలు రాబట్టడమో మరికొద్ది కాలానికిగానీ తెలియదు. ప్రస్తుతం అయనది మైదానంలో దిగి బ్యాటు ఝళిపిస్తున్న ఆటగాడి పాత్రమాత్రం కాదు.  ఒక విధంగా నాన్ ప్లేయింగ్ కెప్టెన్! 

        రాజకీయంగా అందరికన్నా ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుగారిదే. అన్ని విధాలా ప్రజల తిరస్కారానికి గురౌతున్న కాంగ్రెస్ ఓడిపోతే, మళ్ళీ అధికారం తన చేతికే వస్తుందని కొంత కాలం వారు చాలా ధీమాగా వున్నారు.  గత ఎన్నికల్లో చిరంజీవి వచ్చి టీడిపి విజయాన్ని అడ్డుకున్నట్టు ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్, సీమాంధ్రలో జగన్ తన పాలిట సైంధవుడిలా  మారతారనే అనుమానం వారిలో బలపడుతోంది.

        బొత్స సత్తిబాబులా చంద్రబాబు కాడి వదిలేస్తే టిడిపి తెలంగాణ వ్యవహారాన్ని మోత్కుపల్లి నర్సింహులో, ఎర్రఎల్లి దయాకరో చూసుకునేవారు. ఆ పార్టి సీమాంధ్ర వ్యవహారాల్ని పయ్యావుల కేశవో, ముద్దు కృష్ణమనాయుడో చూసుకునేవారు. చంద్రబాబు అలా చేయలేరు. లేదా,  జగన్ లా తెగించి ఇక తెలంగాణ లేదనుకుని సీమాంధ్రలో సమైక్య  జెండా పట్టుకోనూలేరు.  రెండు చోట్లా లాభపడేమార్గాల్ని ఇప్పుడు వారు ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో  టి-తమ్ముళ్ళు, ఎస్ –తమ్ముళ్ళు కూడా ఆయన ఛాంబరు నుండే వెళ్ళి సభలో స్పీకర్ పోడియం ముందు పరస్పర విరుధ్ధమైన ప్లకార్డులు ప్రదర్శించడం రాజకీయ విచిత్రం!

        చంద్రబాబుగారికి దూరాలోచన ఎక్కువ.  అందరూ ఒక సమస్యలో తలమునకలై వున్నప్పుడు వారు ఆ తరువాతి ఘట్టాన్ని దర్శిస్తూ వుంటారు.  రాష్ట్రంలోని విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు, ప్రధాన ప్రతిపక్షనేత అయివుండి కూడా  వారు బస్సుయాత్రలో రాజధాని నగరానికి దూరంగా వున్నారు.  ఇప్పుడు రాష్ట్ర పునర్విభజన బిల్లు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో వారు బీజేపీతో పొత్తు గురించి ఆలోచిస్తున్నారు.  తరచుగా బీజేపి నేతల్ని కలిసి, మళ్ళీ ఎన్డీయేలో తాను చక్రం తిప్పుబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

        చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపి జాతీయ నేతల అభిప్రాయం ఏమిటో ఇంకా బయటికి రాలేదు.  కానీ, కిషన్ రెడ్డీతో సహా బీజేపి రాష్ట్ర నేతలు పొత్తులు వద్దని ఆహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. 2004  ఎన్నికల తరువాత బీజేపీతో పొత్తువల్లనే తాము ఓడిపోయామని తెలుగు తమ్ముళ్ళు ఒకవైపు, చంద్రబాబును నమ్మి ముందస్తు ఎన్నికలకు వెళ్ళీ నిండా మినిగిపోయాం అని కమలనాధులు మరోవైపు ఓ ఆరు నెలలు గుక్క తిప్పుకోకుండా తిట్టుకోవడం చాలా మందికి ఇంకా గుర్తుండేవుంటుంది.  ఏడేళ్ల తరువాత, 2011 టిడిపి మహానాడులో చంద్రబాబు గతంలో బీజేపీతో జత కట్టినందుకు పశ్ఛాత్తాపం చెందారు. అలా మహానాడులో పశ్ఛాత్తాపం చెందినందుకు  రెండున్నరేళ్ళ తరువాత వారు ఇప్పుడు మళ్ళా పశ్ఛాత్తాపం చెందుతున్నారు. భవిష్యత్తులో వారు  ఇలాంటి పశ్చాత్తాపాలు  మరిన్ని ప్రకటించవచ్చు.  టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఎందుకంత బాధ?అని మీడియా సమావేశాల్లో  ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.    

        రాష్ట్రంలో ఇప్పుడు వేడివేడిగా చర్చ జరుగుతున్న అంశం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టి పెడితే రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయని? కిరణ్ కుమార్ రెడ్డి  పార్టీ పెడితే అది నిస్సందేహంగా సీమాంధ్రలో జగన్ జోరుకు కళ్ళెం వేస్తుంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని తేల్చేసుకుని, జగన్ పార్టీలో జేబురుమాళ్ళు వేసుకు కూర్చున్న ఎస్-కాంగ్రెస్ వాళ్లలో చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి శిబిరంలో చేరే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. సీమాంధ్రలో జగన్ కన్నా కిరణ్ దే పెద్ద పార్టి అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు; ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన అధ్బుతం లాంటిది ఇక్కడా ఏదైనా జరిగితేతప్ప, 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
20  డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
22  డిసెంబరు 2013


Saturday 14 December 2013

కొత్త స్పూర్తి, కొత్త ఆశ

కేజ్రివాల్

కొత్త స్పూర్తి, కొత్త ఆశ

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
పాపం పండాలి, కుంచం నిండాలిఅని పాత కాలంవాళ్ళు అనేవారు.  భారత దేశపు గ్రాండ్ ఓల్డ్ పార్టిగా  భావించే కాంగ్రెస్ కు ఇప్పుడు పాపం పండినట్టుకనిపిస్తోంది. అత్తకిచ్చిమాట కోసం శిశుపాలుని నూరు తప్పులు కాసిన శ్రీకృష్ణుడు  నూటొక్కో తప్పును కూడా కాయడుకదా! యూపీయే ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ఇప్పటికే వెయ్యి తప్పులు చేసింది.  వెయ్యిన్నోకటో తప్పును కాయడానికి ప్రజలు సిధ్ధాంగాలేరు.

        వర్తమాన భారత రాజకీయల్లో ప్రధాన విషాదం ఏమంటే సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం. అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ లా,  యునైటెడ్ కింగ్ డమ్ లో కన్జర్వేటివ్స్, లేబర్ పార్టీలా, ఇండియాలో  కాంగ్రెస్బీజెపి ఒకదానికొకటి శాశ్విత ప్రత్యామ్నాయాలుగా స్థిరపడిపోయాయి. ఇలాంటి జంట ప్రత్యామ్నాయాలవల్ల ఒక ప్రమాదం ఏమంటే కొంత కాలానికి వాళ్ల మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక అవగాహన ఏర్పడిపోతుంది. రాజకీయాలు సైధ్ధాంతిక ఘర్షణగాకాక,  ప్రణయకలహంగా మారిపోతాయి.  దీనికి పరాకాష్ట ఏమంటే అధికారంలో నువ్వున్నప్పుడు నువ్వు దోచుకో నేనున్నప్పుడు నేను దోచుకుంటాఅని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే స్థాయికి  వ్యవహారం చేరిపోతుంది. ప్రజలు కూడా రెండు మూడు ఎన్నికలు చూసి,  వీళ్ళుపోతేవాళ్ళు వాళ్లుపోతేవీళ్లు వస్తారు అనే నిర్వేదానికి గురవుతారు. క్రమంగా వాళ్లకు  రాజకీయాల మీద ఆసక్తి, నమ్మకం కూడా తగ్గిపోతుంది. వీటి ఫలితమే కూటమి రాజకీయాలు.  కూటమి ప్రభుత్వాలు.
       
        ఆంధ్రప్రదేశ్ రాజకీయాలూ ఇందుకు భిన్నంగాలేవు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు టిడిపి, టిడిపికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా స్థిరపడిపోయాయి.  ప్రత్యర్ధి  పార్టి అధికారంలోవుందనే బాధతోకన్నా తరువాత తామే అధికారంలోనికి వచ్చేస్తామనే ధీమాతోనే ప్రతిపక్షపార్టీలు  బతికేస్తున్నాయి. ప్రజలు తమను ఒకసారి ఓడించినా, ఆపైవచ్చే ఎన్నికలో అయినా తమను ఎన్నుకోక  తప్పదనే ధీమాలో అధికారపార్టీలు బతికేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల ప్రత్యేక విధానాలు,  ఎన్నికల వాగ్దానాలు,  సాధారణ పరిపాలనా బాధ్యతలు సహితం గాలికి కొట్టుకుపోతున్నాయి. 

         ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోవుంది. యూపీయేకు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు కనుక  వచ్చే ఎన్నికల్లో  విజయం తమదే అనే ధీమాతో బీజేపి నాయకత్వంలోని ఎన్డీయే వుంది.  దుందుడుకు (బీజేపి భాషలో దూసుకుపోయే) స్వభావంవున్న నరేంద్ర మోడి వంటి ప్రధాని అభ్యర్ధి దొరకడాన్ని ఆ కూటమి అదనపు అదృష్టంగా భావిస్తోంది.  జాతీయ రాజకీయాల్లో బీజేపి ఆలోచిస్తున్న తీరులోనే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ఆలోచిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు బాటలో ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంత ఖాయమో చెప్పడానికి డిజిటల్ డిస్ ప్లేలు ఇస్తున్నారు. 

        చాలా అరుదుగా మాత్రమే  రాజకీయాల్లో బలమైన  మూడో ప్రత్యామ్నాయం  పుట్టుకు వస్తుంటుంది. గత ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ యన్. జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పేరుతో, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రంగప్రవేశం చేశారుగానీ, ప్రజల ఆమోదాంశాన్ని  పొందడంలో వాళ్ళిద్దరూ  విఫలమయ్యారు. కూకట్ పల్లీలో పోటీ చేయడంలోనే జేపి బలహీనత బయటపడిపోయింది. చిరంజీవి స్వయంగా అత్తారిల్లు  పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. రెండో స్థానంగా పోటీచేసిన తిరుపతిలో  వారు గెలవడం వేరే విషయం. 

        మూడో ప్రత్యామ్నాయం అనగానే ఎవరికైనా గుర్తుకు రావల్సిన మొదటి పేరు యన్టీ రామారావు. అంతవరకూ కాంగ్రెస్ – కమ్యూనిస్టుగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికని  ఆయన కాంగ్రెస్- తెలుగుదేశంగా మార్చేశారు. నిజాం పతనాన్నీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటునీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శాసించిన పార్లమెంటరీ వామపక్షాల్ని రాజకీయ ప్రధాన స్రవంతి నుండి తప్పించగలగడానికి కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణం.   పార్లమెంటరీ వామపక్షాలు తాము చెప్పే దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలాగూ చేరుకోలేక పోయాయి.  ప్రజలు కోరుకునే తక్షణ లక్ష్యాలనీ సాధించలేకపోయాయి.  వెరసి రాజకీయాల్లో గుడ్డి దీపంలా మారిపోయాయి.

సినిమాలకు కథ ముఖ్యం. పార్టీలకు రాజకీయాలు ముఖ్యం. తెలుగునాట ఈ విజయ రహాస్యం యన్టీ రామారావుకు తెలిసినంతగా మరెవరీకీ తెలియదంటే అతిశయోక్తికాదు. వెండితెర మీద పురాణ పురుషులకు ఒక రూపాన్నిచ్చినట్టే, రాజకీయ రంగంలోనూ సంక్షేమ పథకాలకు   అయన ఒక కొత్త వూపునిచ్చారు. యన్టీ రామారావు 1982లో రాజకీయ రంగంలో ప్రవేశించగానే రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టూ తిరగడం ఆరంభించాయి.

ఇప్పటికీ చాలా మంది గుర్తించని అంశం ఏమంటే, యన్టీ రామారావు నేరుగా  సినిమారంగం నుండి రాజకీయాల్లోనికి రాలేదు.  సినిమారంగంలో వుండగానే, తన రాజకీయ దృక్పధాన్ని రూపకల్పన చేసుకున్నారు. సందర్భాన్నిబట్టి దాన్ని ప్రచారంలో పెడుతూవచ్చారు. యన్టీ రామారావు మొదటీ నుండీ ద్రావిడ అభిమాని. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం  వహించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలోనే అది ప్రస్పుటంగా కనిపించింది. స్వంత  బేనర్‌, నేషనల్‌ ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో రామారావు కథానాయకుడు కాదు. ప్రతినాయకుడు. రావణాసురునిగా బహుళ ప్రచారంలో వున్న పాత్రను ఆయన రావణబ్రహ్మగా మలిచి ప్రాణప్రతిష్ట చేశారు. తదుపరి సినిమా, 'శ్రీకృష్ణపాండవీయం' లోనూ దుర్యోధనుణ్ణి సుయోధనుడ్ని చేశారు.

        యన్టీ రామారావు సాంస్కృతిక దృక్పధం ఆర్యవ్యతిరేకత అనేది సుస్పష్టం. అది ఆయనకు, పుట్టినిల్లు గుడివాడ తాలూకాలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ద్వార అబ్బిందో, మెట్టినిల్లు మదరాసులో పెరియార్‌ ఇ.వీ. రామస్వామి నాయకర్‌ ద్వారా అబ్బిందో, లేక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు మార్గదర్శిగా భావించే యం.జీ. రామచంద్రన్‌ ద్వారా అబ్బిందో చరిత్రకారులు తేల్చాల్సేవుంది.  రాజకీయాల్లో భౌగోళికంగా ఆయన దక్షణాది అభిమానాన్నీ, ఉత్తరాది వ్యతిరేకతను ప్రదర్శించేవారు.  దానికి కొనసాగింపే, ఆయనిచ్చిన  సాంస్కృతిక నినాదం 'తెలుగుజాతి ఆత్మగౌరవం'. ''ఢిల్లీ ఒక మిధ్య'' అనడం అప్పట్లో ఆయనకుమాత్రమే సాధ్యమయ్యే విషయం.
        సరిగ్గా యన్టీ రామారావు వంటి ఆశావహ  ప్రత్యామ్నాయం ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రూపంలో ప్రత్యక్షమయింది. అప్పట్లో యన్టీఆర్ తీరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి పోటీ చేసి మూడు చోట్లా గెలిచి, తన సత్తా చాటారు.  కేజ్రీవాల్ నేరుగా సిట్టింగ్ సియం షీలా దీక్షిత్  మీద పోటీకి దిగారు. అలాంటి తెగువను ఇటీవలి కాలంలో ఇంకెవరూ చూపలేదు.

        సాంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయనడానికి గత ఏడు పార్లమెంటు ఎన్నికలే ప్రబల సాక్ష్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా, పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ, సాధారణ అధిక్యత (మ్యాజిక్ ఫిగర్ 273) దక్కడంలేదు. అన్నీ కూటమి ప్రభుత్వాలే.   ఏఐఏడీయంకే అధినేత్రి జయలలిత కూటమి నుండి తప్పుకోవడంతో 1999 మధ్యలో పతనమైపోయిన మొదటి యన్డీయేను కార్గిల్ యుధ్ధం ఆదుకుంది!. ఆ యేడాది చివర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపి సీట్లు 182 నుండి పెరగనప్పటికీ, కాంగ్రెస్ సీట్లు తగ్గి, మొత్తమ్మీద యన్డీయే పక్షాలకు ఆధిక్యం లభించింది. 2002 లో నరేంద్ర మోదీ హయాంలో సాగిన గుజరాత్ మారణకాండ 2004  లో రెండవ యన్డీయే ప్రభుత్వానికి చరమగీతం పాడింది.  

        ప్రజల్లో కొత్త ఆశల్ని కల్పిస్తూ, కాంగ్రెస్ నాయకత్వాన 2004 లో ఏర్పడిన మొదటి యూపియే ప్రభుత్వం అంచనాల మేరకు పనిచేసింది ఏమీలేదు. అయినప్పటికీ, గుజరాత్ మారణకాండ వంటివి లేకపోవడంతో. 2009 లో ఆ కూటమికి మద్దతు పెరిగి, రెండవ యూపీయే ప్రభుత్వం ఏర్పడింది.  ప్రజల నమ్మకాన్ని రెండవ యూపీయే వమ్ము చేసింది. దేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారి విధానం విజృంభించింది.  అధికారాన్ని చేపట్టిన మరునాటి నుండే గుట్టలుగుట్టలుగా స్కాములు బయటపడ్డం మొదలెట్టాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి మీదనే భారీ ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, దేశంలో పేద, మధ్య తరగతి జీవితం నరకంగా మారిపోయింది. దేశంలో 1990 ల నాటి ఆర్ధిక సంక్షోభాన్ని పరిష్కరించిన సంస్కరణల శిల్పి అని ప్రచారంలోవున్న మన్మోహన్ సింగ్ హయాంలోనే దేశ ఆర్ధిక స్థితిగతులు అధఃపాతాళానికి  చేరుకున్నాయి. కొత్త విధానంతో, బంగారం తాకట్టుపెట్టి బతుకును వెళ్లదీసే పరిస్థితి కూడా ఇప్పుడు మధ్యతరగతికి లేకుండాపోయింది.  
        బీజేపి, కాంగ్రెస్  లకు భిన్నంగా కాస్త మేలైన పాలనని అందించే నాయకుని కోసం దేశప్రజలు గత మూడేళ్ళుగా కళ్ళుకాయలుగాచేట్టు  ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అలాంటి సందర్భంలో   ప్రత్యక్షమయ్యాడు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు అధికార కాంగ్రేస్  ను పాతాళానికి తొక్కేశారు. విపక్ష బీజేపికి ఆధిక్యం లేకుండా చేసేశారు. బలమైన ప్రత్యామ్నాయంవుంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిందే రేపు దేశమంతటా జరగవచ్చు!  మొదటి ప్రయత్నం హంగ్ తో ముగిసినా, రెండో ప్రయత్నంలో భారీ ఆధిక్యం కూడా రావచ్చు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
14  డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

15  డిసెంబరు 2013