Monday 28 December 2020

People's War - Unity & Struggle

 పీపుల్స్ వార్ తో ఐక్యత ఘర్షణ

ప్రపంచంలో ప్రతి అంశంలోనూ ఐక్యతా ఘర్షణలు వుంటాయి. అచ్చంగా ఐక్యత, అచ్చంగా ఘర్షణ అనేది వుండదు. నాకు పీపుల్స్ వార్ తో ఐక్యతా వుంది. ఘర్షణ కూడ వుంది.  

పేదరికం కష్టాలు కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, వాటి మూలంగా మానసంబంధాల్లో ఏర్పడే ఘర్షణ, వాటి నుండి బయటపడడానికి పడే ఆరాటం అన్నీ  నాకు బాల్యం నుండే వున్నాయి. వీటన్నింటికీ మూలాలు మన సమాజ నిర్మాణంలోనే వున్నాయనీ, మన బతుకులు మారాలంటే ముందు సమాజం మారాలనీ తొలుత సిపిఐ ప్రజాసంఘాలతో పరిచయాల దశలోనే తెలిసింది. సమాజాన్ని మార్చకుండ సమస్యల నుండి మనుషులు బయటపడలేరనీ, దాని కోసం పోరాటం చేయక తప్పదని సివోసి / పీపుల్స్ వార్ లో చేరాకే నాకు అర్థం అయింది. ఆ పోరాటం సాయుధంగా సుదీర్ఘంగా సాగుతుందనేది మా అవగాహన. 

నా ఆవేశాన్ని, సాహస గుణాన్నీ సద్వినియోగం చేసుకోవడం నేర్పింది అప్పటి పీపుల్స్ వార్ కృష్ణాజిల్లా నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు. ఆయన నాకు తొలి రాజకీయ గురువు. నా జీవితానుభవానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని జోడించడం నేర్చుకున్నది పీపుల్స్ వార్ శిబిరంలోనే. నా ఆగ్రహాన్నీ, ప్రేమనూ ఎవరికి ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నదీ అక్కడే. 

చారూమజుందార్  రచనలు చాలా ఉత్తేజాన్ని ఇచ్చాయి. అయితే ఆయన్ని నేను ఎన్నడూ చూడలేదు. కొండపల్లి సీతారామయ్య పొలిటికల్  క్లాసులు, ప్రసంగాలూ, రచనలు నాకు అలాంటి ఉత్తేజాన్ని ఇచ్చేవి. నేను ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలిసిన గొప్పవాళ్ళలో గొప్పవాడు కొండపల్లి సీతారామయ్య. కేజీ సత్యమూర్తితో కొన్నాళ్ళు సన్నిహితంగా వున్నాను. ఆయన మన కాలపు మహాకవి. 

ముందు నేను 1978లో  సివోసిలో చేరాను. సివోసి రద్దు అయి మరో పార్టీతో కలిసి 1980లో పీపుల్స్ వార్ గా మారింది. కృష్ణాజిల్లాతో పాటూ వుభయగోదావరి జిల్లాల ప్రాంతీయ కమిటీలో బరువైన బాధ్యతల్నే నిర్వర్తించాను. పీపుల్స్ వార్ నాకు నచ్చినంత కాలం అందులో వున్నాను. క్రమంగా అందులో బ్యూరాక్రటికి ధోరణి పెరిగింది. దాన్ని అప్పుడే విమర్శించాను. 1989 ఎన్నికల తరువాత పీపుల్స్ వార్ నాకు అస్సలు నచ్చలేదు. అందులో బ్యూరాక్రటిక్ ధోరణి భరించలేనంతగా పెరిగిపోయింది. 1990లో పూర్తిగా బయటికి వచ్చేశాను. అయితే,  దాని మీద కొంత కాలం ఒకరకం గౌరవం కొనసాగింది.  మనం పుట్టిన ఊరి మీద, మనం పని చేసిన పార్టి మీద మనకు ఒకరకం భావోద్వేగం వుంటుంది. ఇదీ అలాంటిదే. 2004లో పీపుల్స్ వార్ రద్దు కావడంతో ఆ చివరి అనుబంధం కూడా తెగిపోయింది.

 

పీపుల్స్ వార్ జత కలిసిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ మీద నాకు ఎన్నడూ సదభిప్రాయంలేదు. నక్సల్ బరీ పంథాలో ప్రజా సంఘాలను జత చేసిన ఘనత పీపుల్స్ వార్ కు వుండేది.  ఎంసిసి ప్రజా సంఘాలకు వ్యతిరేకం. అది అతివాద పార్టి. ఆ పార్టి పెట్టిన షరతుల మేరకు పీపుల్స్ వార్ తన ప్రజా సంఘాలను కూడ రద్దు చేసుకుంది. అది చాలా స్పష్టంగా వెనకడుగు అని నా అభిప్రాయం.

 

2004లో కొత్తగా ఏర్పడిన సిపిఐ మావోయిస్టు పార్టి తాత్విక రంగంలో గానీ, సామాజిక రంగంలోగానీ, ఉద్యమ విభాగంలోగానీ గత పీపుల్స్ వార్ తో పోలిస్తే కొత్తగా  ఆవిష్కరించిన అంశం ఒక్కటంటే ఒక్కటీ నా దృష్టికి రాలేదు. అంచేత నేను ఎన్నడూ మావోయిస్టు పార్టీని పట్టించుకోలేదు.

 

ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు  ప్రస్తావిస్తున్నారని కొందరు అడుగుతున్నారు. నిన్న రాత్రి నెల్లూరు రాజశేఖర్ – విశ్లేషణలో డా. కె. విజయకుమార్ ప్రసంగాన్ని విన్నాను.  వారు తమ ప్రసంగంలో పీపుల్స్ వార్ ప్రస్తావన అనేక సార్లు చేశారు. సామాజిక అంశాల మీద ఆ పార్టి అవగాహనను గొప్పగా వివరించారు. కానీ సిపిఐ మావోయిస్టు ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అంచేత వారి ఉపన్యాసం గతానికి సంబంధించింది అనిపించింది. అది ముగిసిన అధ్యాయం అని చెప్పడం అవసరం అనుకున్నాను. డా. కె. విజయకుమార్ ఇప్పుడు పీపుల్స్ వార్ ను పునరుధ్ధరించ దలిస్తే అది వేరే విషయం.

 

నేను ముస్లిం సామాజిక వర్గంలో పుట్టాను. ముస్లిం సామాజికవర్గ ప్రతినిధిగానూ భావిస్తాను. నేను దేవుడ్ని నమ్ముతాను. మార్ క్సిస్టులు మతం పేరుతోసాగే  దోపిడిని వ్యతిరేకించాలిగానీ  మత విశ్వాసాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చనిపోయాక కామ్రేడ్స్‍ చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యలను దహనం చేశారు; ముజఫర్ అహ్మద్, మగ్ధూం మొహియుద్దీన్, ఎంటీ ఖాన్, ఎస్ ఎం రవూఫ్ తదితరుల్ని ఖననం చేశారు. అంటే ఆ కామ్రేడ్లకు చనిపోయాక మతం వచ్చింది. ఇవన్నీ వాళ్ల కుటుంబీకులు చేసిన అంత్యక్రియలుకావు. పార్టీలు జరిపించిన అంత్యక్రియలు. తేడా ఒక్కటే భౌతిక కాయం మీద ఎర్రజెండా కప్పుతారు. ఖననం ఖననం ఖననమే. దహనం దహనమే. చివరకు కార్ల్ మార్ క్స్ ను కూడ యూదుల శ్మశానంలోనే ఖననం చేశాడు ఏంగిల్స్. మార్ క్స్ ఏంగిల్స్ కన్నా గొప్ప మార్ క్సిస్టులు మన కాలంలో వున్నారనుకోను.  

పీపుల్స్ వార్ అధ్యాయాన్ని నేను ముగించలేదు. ఆ పార్టీయే తన అధ్యాయాన్ని తానే ముగించుకుంది. ఒక పార్టీలో వున్నా లేకున్నా స్వతంత్ర  మార్ క్సియన్లు చాలా మంది వుంటారు. నేను ఆ కోవకు చెందుతాను. మార్ క్సిస్టుగా వుండడం నాకు ఇష్టం. చాలా మంది కమ్యూనిస్టు, మావోయిస్టు అభిమానులమనే  పేరుతో   పిచ్చి భాషల్లో మాట్లాడుతుంటారు. మార్ క్సియన్ భాషలో మాట్లాడేవారితో సంవాదానికి  నేను ఎప్పుడూ సిధ్ధమే.


Friday 25 December 2020

Mohan- Chittaprasada of Our Times

Mohan- Chittaprasada of Our Times

మనకాలపు  చిత్తప్రసాద్  మోహన్

డానీ



 


చిత్రకారుడు  మోహన్ గురించి గత  మూడేళ్ళుగా అనేక మంది అనేక వ్యాసాలు రాశారు. ఈరోజు మోహన్ కళాసేవల విస్తృతి గురించి  మాట్లాడుకుందాము.

మోహన్ చనిపోయిన రోజు (21 సెప్టెంబరు 2017) ఆంధ్రజ్యోతి కోసం రాసిన వ్యాసంలో తనను ‘మన కాలపు చిత్త ప్రసాద్’ అన్నాను. ఈ సభానిర్వాహకులు తాడి శకుంతల, కాగితాల రాజశేఖర్ అప్పటి నా వ్యాఖ్యానాన్నే ఆహ్వానపత్రానికి శీర్షికగా స్వీకరించడం సంతోషంగా వుంది.

 

చిత్త ప్రసాద్ కు ఒక సౌలభ్యం వుంది. ఆయన ప్రధానంగా వుమ్మడి కమ్యూనిస్టు పార్టీతో వున్నాడు. కమ్యూనిస్టు పార్టి పార్లమెంటరీ పంథాను స్వీకరించాక ఆయన దానికి దూరమయినా 1978లో చనిపోయే వరకు శ్రామికుల చిత్రకారునిగా కొనసాగాడు. అలా చిత్తప్రసాద్ చిత్రాలు స్థూలంగా  ఒకే అంశంతో వుంటాయి.

 

విఖ్యాత కథకుడు గై డి మొపాసా నిజానికి ఓ పది పదిహేనేళ్ళు మాత్రమే రచనలు చేశాడు. 1870ల నాటి ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధాలే ఆయన కథలకు నేపథ్యంగా వున్నాయి. ఇంకో ప్రఖ్యాత కథకుడు సాదత్ హసన్ మంటో కథలకు కూడ నేపథ్యం భారత దేశవిభజనే. మోహన్ కాన్వాస్ అలా homogeneous కాదు.

 

ఆంధ్రప్రదేశ్ లోనేగాక జాతీయంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ 1970-2020 మధ్య కాలం ఒక కల్లోల యుగం. కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు ఓ 40-ప్లస్ అయ్యాయి. అనేకానేక అస్తిత్వవాద ధోరణులు తలెత్తాయి. తూర్పు యూరప్ తో పాటూ ఏకంగా కమ్యూనిస్టుల ‘మక్కా’ రష్యాలోనే సోషలిస్టు వ్యవస్థ పతనమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావంతో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఆర్థిక విధానాలు పడకగదుల్లోనూ వచ్చేసి కవులూ, కళాకారులు, ఆలోచనాపరులకు  కొత్త సమాళ్ళు విసిరాయి.

 

మోహన్ ఈ సవాళ్ళను స్వీకరించాడు. కమ్యూనిస్టు పార్టీలు, వాటి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలకేకాక దళిత మహాసభ, మాదిగ దండోర,   మాల మహానాడు, ఆదివాసులు, స్త్రీవాదులు, మైనార్టివాదులు, మలి దశ తెలంగాణ  ఉద్యమం వగయిరాలు అన్నింటికీ తన క్రోక్విల్ సేవలు అందించాడు. మోహన్ చిత్రాలు వైవిధ్య భరితం; heterogeneous. వేదికల మీద మాట్లాడేది నల్లమల గిరిప్రసాద్, కొరటాల సత్యనారాయణ, సురవరం సుధాకర రెడ్డి, కాళోజీ నారాయణరావు, వరవరరావు, బాలగోపాల్, కత్తి పద్మారావు, మంద కృష్ణ మాదిగ, కేసిఆర్ కావచ్చు. ఆ వేదికలన్నింటి వెనుక మోహన్ సృష్టించిన బ్యాక్ డ్రాప్ లే వుండేవి.

 

కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో “లార్డ్ బైరన్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగాబట్టి అతను 36వ ఏట చనిపోయినందుకు మనం ఆనందించాలి. పెర్సీ బైషే షెల్లీ సామ్యవాద ఆలోచనలు గలవాడు కాబట్టి అతను 29వ ఎట చనిపోయినందుకు మనం బాధపడాలి” అన్నాడు.  మంచి మనిషి కాకుండ ఎవరూ గొప్ప కళాకారులు, ఆలోచనాపరులు కాలేరు.

 

కమ్యూనిస్టు పార్టీల్లోనో, వాటి అనుబంధ సంస్థల్లోనో సభ్యులుగా వున్నంత మాత్రానా మనుషులు కమ్యూనిస్టులు అయిపోరు. వర్తమాన సమాజంలో  కమ్యూనిస్టులుగా చెప్పుకునేవాళ్ళలో ఎక్కువ మంది బూటక స్వభావులు. Hippocrates. జీవితంలో ఎన్నడూ కమ్యూనిస్టులుగా బతికినవారుకాదు; కమ్యూనిస్టు నీతి నియమాలను పాటించినవారూ కాదు. మన మధ్య కమ్యూనిస్టుగా బతికిన బహుకొద్ది మందిలో మోహన్ ఒకడు. కమ్యూనిస్టు అంటే వున్నంతలో కమ్యూన్ జీవితాన్ని గడపాలి. మనం సాటి ‘కామ్రేడ్’ ‘కమ్యూనిస్టు’ అనుకుని పలకరించడానికి వెళితే వాళ్ళు లివింగ్ రూమ్ లోనే కాఫీ టీ ఇచ్చి వెనక్కి పంపించేస్తే ఒళ్ళు మండదూ? ఆ పని కమ్యూనిస్టేతరులు చేస్తారు. అదే పని వీళ్ళూ చేస్తే ఎలా? మరి కమ్యూనిస్టులు అందుకు భిన్నంగా ఏం చేయాలీ?

 

చనిపోవడానికి ముందు మోహన్ ఓ 10-15 యేళ్ళు ఓ కమ్యూన్ ను నడిపాడు. ఎవరయినా సరే అందులోనికి ప్రవేశించవచ్చు. నేరుగా వంట గదిలోనికి పోవచ్చు. స్వయంగా వండుకొని తినవచ్చు. వండింది ఇతరులకు కూడ వడ్డించవచ్చు. 

 

గ్రామాల్లో ఓ గీత గీయగానే తమలో ఓ చిత్రకారుడు వున్నాడని భావించిన ప్రతి ఒక్కడూ బస్సో రైలో ఎక్కి మోహన్ కమ్యూన్ లో వాలిపోయేవారు. మోహన్ కమ్యూన్ లో చేరాక గీత నేర్చుకున్నవారూ వున్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో వేమన వసంత లక్ష్మి, వాసిరెడ్డి శరత్ కూడా తమదైన పధ్ధతుల్లో కమ్యూన్ లు నిర్వహించేవారు. మోహన్ కమ్యూన్ కు శ్రామికవర్గ సంస్కృతి ఎక్కువగా వుండేది. మమ్మ మాస్ !

 

 1980 – 96 మధ్య కాలంలో విజయవాడ సున్నపు భట్టీల సెంటరులో మా ఇల్లు కూడ ఒక కమ్యూన్ గా వుండేది. 11 ద్వారాలున్న ఇల్లు అయినా ద్వారాలు, కిటికీలకు తలుపులు వుండేవి కావు. కామ్రేడ్స్ లోపలికి రావడానికి అడ్డంకులు లేవు. కామ్రేడ్స్  అర్థరాత్రి వచ్చి భార్యాభర్తలు పడుకునివున్న  మంచాన్ని చడీచప్పుడు కాకుండ దాటి వంట గదిలోనికి వెళ్ళి  మైదా ఉడికించుకుని వెళ్ళిపోయేవారు. నిరంతరం ఓ ఇద్దరు (కొన్నిసార్లు అంతకు మించి)  శాశ్విత అతిథులుగా వుండేవారు. “ద్వారములు తెరిచియే వున్నవి”.

 

గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ గొప్పతనం ప్లేటోకు గురువుకావడం. ప్లేటో గొప్పతనం అరిస్టాటిల్ కు గురువుకావడం. శిష్యుల సృష్టి కూడ గురువుల గొప్పతనానికి ఒక కొలమానం.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో  గొప్ప చిత్రకారులుగా వున్నవారి జాబితా తీస్తే వారిలో చాలా మంది మోహన్ కమ్యూన్ నుండి వచ్చినవారే అయ్యుంటారు. మొహన్ గొప్పదనానికి అదొక కొలమానం.  ఈ కమ్యూన్ లో అనేకమంది కవులూ కళాకారులూ తమ నైపుణ్యాలకు పదును పెట్టుకున్నారు.

 

రష్యాలో బోల్షివిక్ విప్లవం 1917లో విజయవంతమైంది. అప్పట్లో అమెరికాలోనూ బోల్షివిక్ అభిమానులు వుండేవారు. వాళ్ళలో చాలా మందిని  అక్కడి  ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్ళలో పడేసింది. విఖ్యాత  రచయిత జాక్ లండన్ అప్పట్లో రాడికల్ సాహిత్య సమూహం ‘ద క్రౌడ్’ లో చురుగ్గా వుండేవాడు.  తను సృష్టించిన నవలలేగాక, స్క్రిప్టు రాసిన సినిమాలు కూడా హాలీవుడ్ లో భారీ విజయాలను సాధించడంతో జాక్ లండన్ సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. అరెస్టు అవ్వాల్సిన జాబితాలో అతని పేరు కూడ వుందిగానీ ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా జాక్ లండన్ కు వున్న  ప్రజాదరణ రీత్యా ప్రభుత్వం జంకింది.

 

1908 నాటి జాక్ లండన్ నవల ‘ఉక్కుపాదం’ (The Iron Heel) ఒక తిరస్కార సమాజాన్ని (dystopian) చిత్రిస్తుంది. నవల చివర ఒక ఆదర్శ సమాజాన్ని (utopian) సూచిస్తుంది. నిజజీవితంలోనూ జాక్ లండన్ కు అలాంటి ఆదర్శధామ ఆలోచనలు వుండేవి. వాటిని సాకారం చేయడానికి ఒక సువిశాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు.  అందులో ఒక ఎస్టేట్ నిర్మాణం మొదలెట్టాడు. “మన కలల సామ్యవాద సమాజం ఏర్పడడానికి ఇంకా సమయం పట్టవచ్చు. మనమేమీ నిరాశ చెందవద్దు. మీరు జైళ్ళ నుండి విడుదలయ్యాక నేరుగా నా ఎస్టేట్ కు వచ్చేయండి. అక్కడ సామ్యవాద జీవితాన్ని గడుపుదురుగాని. మనం ఒక దేశాన్ని విముక్తి చేయలేకపోవచ్చు; కానీ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కమ్యూన్ గా మార్చలేమా” అనే అర్థం వచ్చేలా సోషలిస్టు ఖైదీలకు 1916లో ఉత్తరాలు రాశాడు. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు భారీ అగ్నిప్రమాదం జరిగి ఆ ఎస్టేట్ కాలిబూడిదయిపోయింది. సామ్యవాద సమాజం కోసం తను కన్న చివరి కల కూడ చితికిపోవడంతో ఆ రాత్రే జాక్ లండన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఇప్పుడు జాక్ లండన్ ప్రస్తావన తేవడానికి ఒక ప్రత్యేక కారణం వుంది. సమాజంలో ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు తగ్గిపోతున్నారనీ, వున్న కొద్దిమంది కూడ  వలసపోతున్నారనీ, ప్రభుత్వంలో చేరిపోతున్నారనీ  ఇటీవల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన సమంజసమైనదే గానీ ఈ ఆరోపణలో ఒక నిజాయితీ లోపం వుంది. ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు ఉత్సాహంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని మనం కల్పిస్తున్నామా? అనేది సామ్యవాద అభిమానులు ఆలోచించుకోవాలి.

 

ఆలోచనాపరులు స్వభావరీత్యానే అనేక అవకాశాల్ని (advantages) కోల్పోతుంటారు. వాళ్ళకు కొన్ని గౌరవాలు (privileges) అయినా మనం సమకూర్చుతున్నామా? గతంలో కవులూ కళాకారులు కలిసినపుడు స్తోమత కలిగినవాళ్ళు వాళ్ళకు పుస్తకాలు కొనిపెట్టేవారు. భోజనం-వసతి కల్పించేవారు. వాళ్ళ ప్రయాణాలకు చేతనైన సహాయం చేసేవారు. వాళ్ళ రచనల ప్రచురణకు తోడ్పడేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో అంతమంది ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు వుండేవారు. మనం మన కర్తవ్యాలను నిర్వర్తించడం మానేశాం. సానుకూల వాతావరణం లేకపోవడంతో వాళ్లు తగ్గిపోయారు. ఇప్పుడు మనమే వాళ్లు తగ్గిపోయారని నిందిస్తున్నాం. ఏది కారణం? ఏది కార్యం? నారువేయకుండ, నీరు పోయకుండ పంట దిగుబడి రావాలంటే ఎలా వస్తుందీ? 

1970ల చివర్లో 1980ల ఆరంభంలో విజయవాడలో ఒక గొప్ప సానుకూల వాతావరణం వుండేది. మోహన్, పతంజలి, నేను, ఖాదర్, గౌస్, విశ్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సురేంద్రలు యువతరం. పెద్దిభట్ల సుబ్బరామయ్య, వేగుంట మోహన్ ప్రసాద్, సోదుం రామ్మోహన్, పి. రామకృష్ణారెడ్డి,  టిఎల్ కాంతారావు మా పైతరం, మహీధర రామ్మోహన రావు, కంభంపాటి సీనియర్ ఆ పైతరంగా వుండేవాళ్లం. మూడు తరాలు కలిసి వుండడంవల్ల మామధ్య ఒక సహజ అనుబంధం (organic link) ఉండేది. సమిష్టి జ్ఞానసముపార్జన  స్థాయి గొప్పగా వుండేది. సోషల్ కేపిటల్ అంటే కులం నుండి, వంశం నుండి సంక్రమిస్తుందని చాలా మంది అనుకుంటారు. మనం నివశించే పట్టణాల నుండి, మనం తిరిగే సమూహాల నుండి కూడ సోషల్ కేపిటల్ సమకూరుతుంది. 

తరువాతి కాలంలో ఊసా, ఎన్ వేణుగోపాల్, వసంతలక్ష్మి, త్రిపురనేని శ్రీనివాస్, కే శ్రీనివాస్, కే బాలగోపాల్, సతీష్ చందర్, ప్రసేన్, అఫ్సర్, బిఎస్ రాములు, అల్లం నారాయణ తదితరులు కూడ విజయవాడకు నివాసాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. అప్పట్లో విజయవాడ మీడియా సెంటర్ కావడంవల్ల వాళ్ళొచ్చారు అనవచ్చుగానీ అదొక్కటే కారణంకాదు. విజయవాడలో ఆలోచనాపరులకు ఆదరణ గొప్పగా వుండేది. మా సమూహానికి నాగేంద్ర ప్రెస్ బాబూరావుగారు చాలాకాలం ఒక ఆశ్రయంగా వుండేవారు. అప్పుడుకదా విజయవాడను ప్రేమించ బుధ్ధి వేసేదీ? అలాంటి పాత్రని ఇప్పుడు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు నిర్వహిస్తున్నట్టున్నాడు.

 

ఒకటి మాత్రం నిజం. మనం కమ్మర్షియల్ బతుకు బతికితే మన చుట్టూ కమ్మర్షియల్ కళాకారులు వుంటారు. మనం కమ్యూన్ బతుకు బతికితే మన చుట్టూ కమ్యూనిస్టు కళాకారులు వుంటారు.  

 

మారుతీనగర్ లోని దాసరి శిరీష ఇంట్లో 1978 చివర్లో నేను మోహన్ ను మొదటిసారి కలిశాను. అది యాధృఛ్ఛికంగా చిత్తప్రసాద్ చనిపోయిన సంవత్సరం. అప్పుడు నా వయస్సు 27. తను నాకన్నా ఓ ఏడాది మాత్రమే పెద్ద. అయితే, ఓ సీనియర్ కార్మిక నాయకుని కొడుకు కావడంవల్ల ఇంటా బయట కమ్యూనిస్టు పార్టి వాతావరణంలో పెరిగాడు. జాతీయ (అంతర్జాతీయ?) యవజనోత్సవాలకు కలకత్తా వెళ్ళి వచ్చాడు. అక్కడ అరెస్టు కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనల విస్తృతి మాకన్నా  విశాలంగా వుండేది.  

 

నేను అప్పట్లో రాడికల్ యూత్ లీగ్ కు కృష్ణా జిల్లా అధ్యక్షునిగా వుండేవాడిని. నరసాపురం అనే ఓ సముద్రపుగట్టు చిన్న పట్టణం నుండి వచ్చినవాడిని. అంచేత నా మదర్ బోర్డు, ర్యామ్ రెండూ విజయవాడతో పోలిస్తే చిన్నవి.  అయితే, ఎదుటి వ్యక్తిలోని బలమైన అంశాన్ని కనిపెట్టగలిగే కొన్ని తెలివితేటలు కూడ నాకు వుండేవి. ఆర్టిస్టుగా మోహన్ కు అది ఆరంభదశ. విపరీతంగా పుస్తకాలు చదివేశాడు. అది అతని స్ట్రాంగ్ పాయింట్.  పరిచయం అయిన రెండోరోజే ఒక విన్నపం చేశాను. “మాలాంటి కార్యకర్తలకు రోజూ ఏవో పార్టి పనులుంటాయి. అదే పనిగా పుస్తకాలు చదవడం అస్సలు కుదరదు. అలాగని పుస్తకాలు చదవకపోయినా అస్సలు కుదరదు. అంచేత నాకు ఒక హెల్ప్ చేయి. నువ్వు పదిపుస్తకాలు చదివినపుడు వాటిల్లో ల్యాండ్ మార్క్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసి  నాకు చెప్పు. అది నేను చదువుతాను. టెన్ ఈస్టు ఒన్!” అన్నాను. “అదేం పెద్ద పనబ్బా” అన్నాడు. అలా ఆ కాలంలో మోహన్ చెప్పిన ల్యాండ్ మార్క్ పుస్తకాలన్నీ చదివి నేను వుంటాను. బుక్ రీడింగ్ లో బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోయినా స్నాతకోత్సవం జరిగింది అనిపించుకున్నాను.  మోహన్ స్కూల్లో ఈ ‘క్రాష్ కోర్స్’ పుణ్యమా అని పుస్తకాలు చదవడంలో నేను ఓ పదేళ్ళు ఆదా చేయగలిగాను.

 

“నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్” అంటాడు గిరీశం. మోహన్ తో సినిమా చూడడం కూడ ఒక ఎడ్యుకేషన్.  హాలివుడ్ నటి ఆడ్రీ హెప్ బర్న్  (Audrey Hepburn) అంటే మోహన్ కు చాలా ఇష్టం. ఆమె నటించిన ‘మై ఫెయిర్ లేడీ’, ‘రోమన్ హాలీడేస్’ ను మోహన్ తో కలిసి చూశాను. బెర్నార్డ్ షా 1913లో రాసిన ‘పిగ్మాలియన్’ నాటకాన్ని  ‘మై ఫెయిర్ లేడీ’ పేరుతో సినిమాగా తీశారు. ఆ నాటకాన్ని నేను చదవలేదు. మోహన్ రన్నింగ్ కామెంట్రీ సహితంగా ఆ సినిమాను చూడడంవల్ల ఆ నాటకం చదివినంత జ్ఞానం వచ్చేసింది.

 

ప్రసంగాన్నీ చిత్తప్రసాద్ తో మొదలెట్టానుగాబట్టి చిత్తప్రసాద్ తోనే ముగిస్తాను. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రైతులకు సంఘీభావాన్ని తెలపడానికి ఇటీవల నేను ఢిల్లీ వెళ్ళాను. నా చిరకాల మిత్రుడు బిబిజి తిలక్ నాకు స్థానికంగా సహకరించాడు. తను ఇటీవల సర్రియలిస్టిక్ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆ సింఘూ బోర్డర్ లో, గాజీపూర్ బోర్డర్ లో రైతు ఆందోళనకారులతో వున్నంత సేపూ నాకు చిత్తప్రసాద్, మొహన్ లే గుర్తుకు వచ్చారు. వాళ్ళయితే ఈ చారిత్రక ఘట్టాన్ని ఎలాంటి చిత్రాలుగా మలిచేవారనే ఆలోచనలు వెంటాడాయి.

 

చిత్తప్రసాద్ చిత్రాలకూ మోహన్ చిత్రాలకూ చాలా పోలికలు కనిపిస్తాయి. అదే ఆవేదన; అదే ఆర్తి; అదే ధిక్కారం; అదే ప్రతిఘటన, అదే తిరుగుబాటు; బానిస సంకెళ్ళను తెంచుకోవడం, బలిష్టంగా భారీ కాయులైన రైతులు, చీమలు దోమలు ఈగల్లా పోలీసులు, పాలకులు, నిరంకుశులు!. ఇవన్నీ ఇద్దరిలోనూ దాదాపు ఒకేలా వుంటాయి. అయితే మోహన్ చిత్రాల్లో ఒక అదనపు  గుణం వుంటుంది. అదే వెటకారం; అవహేళన. నిరంకుశుని ముందు నిటారుగా నిలబడి “పోభే  కుయ్యా!” అంటాయి మోహన్ బొమ్మలు. చిత్రకళలో వెటకారం మోహన్ సంతకం. భవిష్యత్తులో చిత్రకళా పరిశోధకులు కొందరు తవ్వకాలు జరిపి “ మోహన్ కు గోదావరి మండలము నుండి ఈ వెటకారము అబ్బేను” అని నిర్ధారిస్తే మనలో ఎవరికీ  ఎలాంటి అభ్యంతరమూ  వుండాల్సిన పనిలేదు.  

 

చివరగా ఒకమాట, నా జ్ఞాన సంపదను వాటాలు వేసి పంచాల్సివస్తే అందులో మోహన్ కు కూడ కొంత వాట వుంటుంది. నా మిత్రునికి నివాళి.

 

(తాడి మోహన్ 70వ జయంతి సందర్భంగా డిసెంబరు 24, 2020న  విజయవాడ ఎంబి విజ్ఞాన భవన్ లో జరిగిన సభలో చేసిన ప్రసంగ పాఠం)

 

(నా రచనల ప్రచురణ కోసం తపించే చిరకాల మిత్రురాలు శబరికి ఈ వ్యాసం అంకితం) 

 

రచన : 24 డిసెంబరు 2020


Monday 14 December 2020

Farmers are neo Vanguards of Neo India

 Farmers are neo Vanguards of Neo India

‘నవభారతానికి దారి చూపుతున్న రైతాంగం’

డానీ

1. రైతాంగ ఉద్యమ నేపథ్యం 

1.        వ్యవసాయరంగలో సంక్షోభం ఇవ్వాళ కొత్తగా పుట్టిందేమీకాదు. దశాబ్దాలుగా కొనసాగుతూనే వుంది.

2.        ఆధునిక దేవాలయాలుగా భావించి భాక్రానంగల్, నాగార్జునసాగర్  నిర్మించినపుడు దేశంలో ఆహార కొరత, పేదరికం పోతుందని అందరూ భావించారు. విచిత్రం ఏమంటే నీటిపారుదలా  ప్రాజెక్టుల సంఖ్య పెరిగేకొద్దీ దేశంలో పేదరికం కూడ పెరుగుతూ వస్తోంది.  ఈ ప్రాజెక్టుల రూపకల్పనల్లోనే మౌలిక లోపం వుందనే వాదనలూ బలంగా ముందుకు వస్తున్నాయి.

3.        ఇవ్వాల్టి గణాంకాల్లో చెప్పాలంటే భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయరంగం వాట 15-16 శాతం. వ్యవసాయరంగం మీద ఆధారపడిన జనాభా 45-50  శాతం.  అంతటి వత్తిడి కారణంగా ఆ రంగంలో సహజంగానే పేదరికం వుంటుంది.

4.        ఈ సంక్షుభిత రంగంలో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, ధనిక రైతులు, భూస్వాములు, వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం, వ్యాపారులు, మార్కెట్ యార్డు దళారులు, ప్రభుత్వ అధికారులు వంటి ఆర్థిక అంతస్తుల దొంతర వుంటుంది.

5.        ఈ దొంతరల్లోనే కులాల దొంతర కూడ వుంటుంది. వ్యవసాయ కూలీల్లో ఎస్టీలు, ఎస్సిలు, పేద రైతుల్లో, బిసిలు, ఓసిలు మధ్యతరగతి, ధనిక రైతులు, భూస్వాములు, వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గంలో ఓసిలు, వ్యాపారులు, మార్కెట్ యార్డు దళారుల్లో  వైశ్యులు ఎక్కువగా వుంటారు.

6.        ఒక ఆర్థిక దొంతరలో ఒక కులమే వుంటుంది అని చెప్పడం అతి ఉత్సాహం. ప్రతి ఆర్థిక దొంతరలోనూ అన్ని కులాలు వుంటాయనడం అర్థ సత్యం. అలాకాకుండ ఒక్కో ఆర్థిక దొంతరలో కొన్ని కుల సమూహాలకే ఆధిపత్యం వుంటుంది అని చెప్పడం సమంజసం.  

7.         వ్యవసాయ కూలీల్లోనూ కొందరు ఓసిలు వున్నట్టే, వ్యాపారులు, మార్కెట్ యార్డు దళారుల్లోనూ అరుదుగానైనాసరే కొందరు ఎస్సీలు, ఎస్టీలు కూడా వుంటారు.  ప్రభుత్వాధికారుల్లో దాదాపు అన్ని కులాల వాళ్ళు వుంటారు.

8.        ఆర్థిక దొంతరల్లో కింది దొంతరల్ని పై దొంతరలు దోచుకుంటున్నట్టు కుల దొంతరల్లోనూ కింది దొంతరల్ని పై దొంతరలు దోచుకుంటుంటాయి.

9.        నగరీకరణ వేగాన్ని పుంజుకుంటున్నపుడు గ్రామాల ప్రాధాన్యత తగ్గి అవి క్రమంగా కళాహీనంగా మారిపోతాయి.

10.   వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోవడంతో సాగు భూములు క్రమంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస భూములుగా మారిపోతుంటాయి. ఇలాంటి క్రమాన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృధ్ధి సాధికార సంస్థలో చూడవచ్చు.

11.   సాగుదార్లు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా వుండేందుకుగాను ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయానికి  ఉచిత విద్యుత్తు, వడ్డీలేని పంట రుణం, స్వల్ప వడ్డీకి గోల్డ్ లోన్లు వంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల్ని (ఎంఎస్పీ) ప్రకటిస్తుంది. అయితే ఇందులో అనేక నిబంధనలు, అధికారుల బ్యూరాక్రసీ, ప్రజాప్రతినిధుల ఆధిపత్యం, బ్యాంకు అధికారుల నిర్లిప్త వైఖరి తదితర కారణాలవల్ల ఈ ప్రోత్సాహకాల అమలులో అనేక అవకతవకలు జరుగుతుంటాయి.

12.   కనీస మద్దతు ధర మీద మన నేరేటివ్ లోనే ఒక లోపం వుంది. పండిన పంట చివరి గింజ వరకు కనీస మద్దతు ధర దక్కేలా  చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు హామీ ఇవ్వాలి.

13.   ఆచరణలో కనీస మద్దతు ధర అర్థమే మారిపోతున్నది. ఆహార భద్రత, ప్రజాపంపిణీ పథకాలకు అవసరమైన మేరకే ప్రభుత్వాలు కనీస మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేస్తున్నాయి. మిగిలిన పంటను రైతులు అంతకన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఫలితంగా  కనీస మద్దతు ధర అనేది రైతులకు దక్కే గరిష్ట ధరగా మారుతోంది.

14.   చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే మార్కెట్లో రైతుకు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ ధర లభిస్తుంది.

15.   1981-82 వ్యవసాయిక సంవత్సరంలో ధాన్యం, గోధుమలు కామన్ రకాలకు కనీస మద్దతు ధర 115, 142 రూపాయలు వుండేది. దాన్ని  2013 – 14 వ్యవసాయిక సంవత్సరంలో 1310, 1400 రూపాయలుగా నిర్ణయించారు. ఆ 32 సంవత్సరాలలో ఎంఎస్పీ పది రెట్లు పెరిగింది. ఈ కాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల ధరలు, కూలీ రేట్లు అంతకన్నా ఎక్కువ రెట్లు  పెరిగాయి.  

16.   అంటే వ్యవసాయరంగంలో ఇన్ పుట్ కాస్ట్ పెరుగుతున్నంతగా ఔట్ పుట్ కాస్ట్ పెరగడంలేడు.

17.   హరిత విప్లవం తరువాత దేశంలో ఆహారోత్పత్తి భారీగా పెరిగిన మాట వాస్తవం. ఈ కాలంలో వైద్య ఆరోగ్య వ్యయం దానికి అనేక రెట్లు పెరిగినమాట అంతకన్నా వాస్తవం.

18.   హరిత విప్లవానికి కర్మ భూమిగా భావించే పంజాబ్ లో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ప్రతిరోజూ రాత్రి భటిండాలో బయలుదేరి మర్నాడు బికనీర్ చేరుకునే రైలు ‘క్యాన్సర్ ఎక్స్ ప్రెస్’ అనే అపవాదును కూడగట్టుకుంది.

19.   గత ఆరు దశాబ్దాల్లో ఫార్మారంగం సాధించిన ఇబ్బిడిముబ్బిడి లాభాలతో పోలిస్తే వ్యవసాయరంగానికి జరుగుతున్న అన్యాయం గురించి మనకు ఒక అవగాహన వస్తుంది.

20.   ప్రూనింగ్, గ్రీన్ హౌస్, సెల్వీకల్చర్ తదితర ఆధునిక సాంకేతిక విధానాలవల్ల తక్కువ విస్తీర్ణంలో అత్యధిక దిగిబడిని సాధించే  పధ్ధతులు వ్యవసాయరంగంలో వచ్చాయి. అయితే, ఇవి స్థిర ఆర్థిక విధానాలు కావు. అస్థిర (Volatile)  ఆర్థిక విధానాలు. ఇంటెన్సివ్ వ్యవసాయ పధ్ధతులు.

21.   భారీ ఆర్థిక స్తోమత, అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యం అందుబాటులోవున్న సమూహాలు మాత్రమే ఇంటెన్సివ్ వ్యవసాయ పధ్ధతుల్లో రాణీంచగలరు. సాంప్రదాయ సాగుదార్లు అస్థిర ఆర్థిక విధానాలను తట్టుకోలేరు.

22.   ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో వరి, గోధుమలు వంటి ఆహారపంటల్ని పండించే వారికన్నా  మిర్చి, ప్రత్తి వంటి వాణిజ్య పంటల్ని  పండించేవారే ఎక్కువమంది వుంటున్నారు.

23.   ఎక్స్ టెన్సివ్ సాగు విధానాల్లోనే రాణించలేకపోతున్న సాంప్రదాయ రైతులు సెమీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ సాగు పధ్ధతుల్లో అస్సలు రాణించలేరు. వాళ్ళకు అంతటి ఆర్థిక స్తోమత వుండదు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనూ వుండదు.

24.   ఇంటెన్సివ్ సాగు పధ్ధతులు కార్పొరేట్లకు మాత్రమే అనువుగా వుంటాయి. అటూ నుండి చూస్తే ఇవి కార్పొరేట్ల కోసమే రూపొందిన సాగు విధానాలు.

25.   వ్యవసాయ కుటుంబాల పిల్లలు అమెరికాకు వలస పోయే క్రమం మనకు 1960లలో మొదలయింది. ఇప్పుడు అమెరికా నుండి తిరిగివచ్చి మళ్ళీ వ్యవసాయాన్ని చేపట్టడం కొత్త ధోరణి. దీనినే కొందరు ‘రివర్స్ మైగ్రేషన్’ అంటున్నారు. అయితే, వాళ్ళు చేపట్టేది 1960వ దశకపు వ్యవసాయ పధ్ధతుల్ని కాదు; 21వ శతాబ్దపు ఇంటెన్సివ్ పధ్ధతుల్ని.  ఈ గుణాత్మక మార్పు అర్థం కాకపోతే ‘రివర్స్ మైగ్రేషన్’ అర్థంకాదు. వాళ్లు రైతు బిడ్డలుగా వలస వెళ్ళి కార్పొరేట్ ప్రచారకులుగా తిరిగివస్తున్నారు.

26.   కొన్ని అనువైన ప్రాంతాల్లో  కొందరు రైతులు ప్రయోగాత్మకంగా 10 – 20 సెంట్ల విస్తీర్ణంలో ఇంటెన్సివ్ పధ్ధతుల్లో సాగుచేసి భారీ లాభాలు  సాధిస్తున్న వార్తలు మనకు అప్పుడప్పుడు మీడియాలో వస్తుంటాయి. ఇవి ప్రయోగాలకు మాత్రమే పరిమితం. భారీ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఈ విధానాలు సాధారణ రైతులకు పనికిరావు.

27.   భారత దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 4 వేల లక్షల (40 కోట్ల) ఎకరాలు. నీటిపారుదలా సౌకర్యంవున్న భూమి 2 వేల లక్షల (20 కోట్ల) ఎకరాలు.

28.   ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల సబ్సిడీ మొత్తాన్నీ, ఉచిత విద్యుత్తు మొత్తాన్నీ నేరుగా రైతులకు నగదు రూపంలో ఇవ్వడం మొదలు పెట్టాయి. ఎన్నికల సమయంలో రైతుల్ని ప్రలోభపెట్టడానికి అధికార పార్టీలకు ఇలాంటి నగదు బదిలీ పథకాలు వుపయోగపడవచ్చు.

29.   అయితే, నగదు బదిలీ పథకాల చాటున వ్యవసాయానికి సబ్సిడీలను రద్దు చేసే ప్రమాదం పొంచివుంది.  

30.   వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను అమర్చడం మొదలు పెట్టడంతో ప్రభుత్వాల మీద ఈరకం అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

31.   మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ ఏడాది జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణల్ని చేపడుతూ మూడు ఆర్డినెన్స్ లను తీసుకుని వచ్చింది.

32.   భారత రాజ్యంగంలోని ఏడవ షెడ్యూలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణి గురించి వివరించారు. ఇందులో కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, వుమ్మడి జాబితాలు వుంటాయి.

33.   భారత రాజ్యాంగంలో వ్యవసాయాన్ని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. వ్యవసాయరంగం మీద కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త చట్టాలను తేవడం సమాఖ్య (ఫెడరల్ ) స్పూర్తికి వ్యతిరేకం.

34.   వీటిల్లో మొదటిది; వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు. రెండవది; రైతులకు సాధికారత పరిరక్షణ ధరల హామీ బిల్లు, మూడవది; నిత్యావసర సరుకుల సవరణ బిల్లు.

35.   వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లో  ఇప్పటి వరకు జరుగుతున్న అవకతవకల్ని సరిదిద్దడానికి ఈ బిల్లుల్ని రూపొందించివుంటే వీటిని అందరూ ఆహ్వానించాలి.

36.   రైతుల్ని మార్కెట్ యార్డుల దోపిడి నుండి బయటపడేయడం ఈ బిల్లుల లక్ష్యం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల్ని కార్పొరేట్లకు (మాత్రమే) అమ్మేలా ఈ బిల్లుల రూపకల్పనలో భారీ కసరత్తు చేశారు.

37.   రైతుల్ని దోపిడీ చేసే హక్కును మార్కెట్ యార్డుల నుండి కార్పొరేట్లకు మార్చడం. దోపిడి అప్ గ్రేడ్ అన్నమాట.  కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే.

38.   రైతులు తమ పంటను  వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC)లలోనే అమ్ముకోవాల్సిన పనిలేదనీ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళి లాభసాటి ధరకు అమ్ముకోవడానికి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు అవకాశం కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది.

39.   ఒకే దేశం ఒకే మార్కెట్ అనేది కొత్త నినాదం.

40.   భారతదేశంలో 90 శాతం కమతాల విస్తీర్ణం ఒక హెక్టారు (రెండున్నర ఎకరాలు) మాత్రమే.

41.   భారతదేశపు ధాన్యాగారంగా భావించే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెక్టారుకు సాలీన  గరిష్టంగా సగటున 3,322 కిలో గ్రాముల (33 క్వింటాళ్ళు) ధాన్యం దిగుబడి వస్తుంది. విశాఖపట్నం జిల్లాలో ఈ దిగుబడి కేవలం 1,430 కేజీలు (14 క్వింటాళ్ళు) మాత్రమే.

42.   టన్నున్నర నుండి మూడున్నర టన్నుల వరకు వున్న దిగుబడిని ట్రాక్టరులో వేసుకుని పొరుగు రాష్ట్రాలకు  వెళ్ళి అమ్ముకోవడం ఏ రైతుకైనా సాధ్యమా? ఒకవేళ వెళ్ళినా కనీస మద్దతు ధర ప్లస్ రవాణా వ్యయం, ప్లస్ ఇతర ప్రయాణ ఖర్చులు పోగా కొంచెమయినా అదనపు ధర వస్తుందా? దీనికి సమాధానం బిగ్ నో.

43.   భారతదేశమంతటా నైరుతీ రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాలు దాదాపు ఒకే సమయంలో వస్తాయి. ఫలితంగా ఖరీఫ్, రబీ పంటలు కూడ ఒకే సమయంలో కోతకు వస్తాయి.

44.   దాదాపు 40 కోట్ల ఎకరాల పంట ఒకేసారి మార్కెట్ కు వచ్చి పడిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో గిరాకీ పడిపోయి నిరంతరం కొనుగోలుదారునిదే పైచేయి (Purchaser’s Market)గా వుంటుంది.

45.   ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)తో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మన దేశం కొన్ని ఇతర దేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని విధిగా దిగుమతి చేసుకోవాల్సి వుంటుంది. ఇథియోపియా తదితర ఆఫ్రికా దేశాల నుండి పప్పుధాన్యాలు అతి తక్కువ ధరకు దిగుమతి అవుతుంటాయి. అవి కూడ పంట సమయంలో దిగుమతి అయితే దేశీ మార్కెట్లో ధరలు భారీగా పడిపోతాయి.

46.   ముందే ఇంతపోటీ వున్నప్పుడు తమ మార్కెట్లోనికి ఇతర  ప్రాంతాల రైతుల్ని స్థానిక రైతులు రానిస్తారా?

47.   మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  డిసెంబరు 3న ‘కిసాన్ కళ్యాణ్ యోజన’ పథకాన్ని ఆరంభిస్తూ ఇతర రాష్ట్రాల రైతులకు ఒక హెచ్చరిక చేశారు. “మధ్యప్రదేశ్ మార్కెట్ యార్డుల్లో మధ్యప్రదేశ్ రైతులకు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకునే హక్కు వుంటుంది. ఇతర రాష్ట్రాల రైతుల్ని మధ్యప్రదేశ్ లోనికి రానివ్వం. ఎవరైనా అలా వస్తే వాళ్ళ సరుకునీ, వాహనాలనీ స్వాధీనం చేసుకుంటాం. అలా వచ్చిన రైతుల్ని అరెస్టు చేసి జైళ్లకు పంపిస్తాం” అన్నారాయన. (https://www.hindustantimes.com/india-news/farmers-from-other-states-won-t-be-allowed-to-sell-crops-in-madhya-pradesh-says-shivraj-singh-chouhan/story-JCkOxWYXNJ2QXrlV6eFIEK.html)

48.   భారతీయ జనతా పార్టికే చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారంటే ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు’ ప్రకటిత లక్ష్యాల డొల్లతనం ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు కూడా అర్థం అవుతుంది.

49.   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC)ల్లో జరిగే లావాదేవీల మీద వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సెస్సును వసూలు చేస్తుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఈ సెస్సు ద్వార లభించే సాలీన రెవెన్యూ వేల కోట్ల రూపాయల్లో వుంటుంది.

50.   ఈ సెస్సు మొత్తాన్ని మార్కెటింగ్  విభాగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తారు.

51.   పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సెస్సు ద్వార సాలీన  3,800 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 

52.   వ్యవసాయ  మార్కెటింగ్ యార్డుల బయట వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కొత్త బిల్లులు అవకాశం కల్పించడమేగాక, సెస్సును కూడ రద్దు చేశాయి. ఇది రాష్ట్రాల ఖజానాకు భారీగా గండి కొడుతుంది.

53.   మూడవ బిల్లు ద్వార నిత్యావసర సరుకుల నిల్వల మీద నియంత్రణల్ని ఎత్తివేయడం అంటే నేరుగా బ్లాక్ మార్కెట్ కు చట్టబధ్ధత కల్పించడమే.

54.   అలా ఈ బిల్లు రైతులకు వ్యతిరేకమైనది మాత్రమేకాక  నిత్యావసర సరుకుల వినియోగదారులందరికీ కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది.

55.   కరోనా – లాక్ డౌన్ కాలంలో మాస్ డిస్ప్లేస్ మెంట్  కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఆదాయాలు పడిపోయాయి. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ‘సవరణ’ చట్టం అమల్లోనికి వస్తే వినియోగదారుల కష్టాలు మరింతగా పెరిగిపోతాయి.

56.   చట్టాల విషయంలోగానీ, వాటి అమలు విషయంలోగానీ వివాదం ఏర్పడితే పరిష్కారం కోసం కోర్టుల్ని ఆశ్రయించే అవకాశం ప్రతి పౌరునికీ వుంటుంది. అది ప్రజాస్వామిక హక్కు. చాలా విచిత్రంగా ఈ బిల్లుల్లో  కోర్టులకు వెళ్ళే అవకాశం లేదంటూ ఒక దుర్మార్గపు క్లాజ్ ను పెట్టారు. ఇది నిరంకుశ పోకడ. ఈ బిల్లుల్ని తేవడం వెనుక కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్రనే రచించిందని ఈ ఒక్క అంశాన్ని బట్టే చెప్పవచ్చు.

57.   ఎంతటి వివాదాస్పద బిల్లునైనా లోక్ సభలో ఆమోదం పొందడానికి కావల్సిన సంఖ్యాబలం, రాజ్యసభలో ఆమోదం పొందడానికి అవసరమైన చాకచక్యం ఇవ్వాల్టి అధికార పార్టికి వున్నాయి. అంతటి బలం వున్నప్పటికీ ఆర్డినెన్స్ ను తీసుకురావడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

58.   ఈ మూడు బిల్లులు సెప్టెంబరు 20న మూజువాణీ ఓట్లతో  పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. సెపెంబరు 27న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీటి మీద ఆమోదముద్ర వేశారు.

59.   వ్యవసాయరంగంలో 21వ శతాబ్దం విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా భారతీయ రైతుల్ని  సన్నధ్ధం చేయడం ఈ చట్టాల లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయశాఖా  మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహారం ప్రజాపంపిణి వినియోగదారుల వ్యవహారాల మంత్రి పియుష్  గోయల్ పెద్ద గొంతుతో  ప్రచారం చేస్తున్నారు.

60.   1990ల నాటి ఆర్థిక సంస్కరణల సందర్భంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల్ని (ఎల్ పి జి) అప్పటి ప్రభుత్వం సరిగ్గా ఇలాగే గొప్ప విలువలుగా భారీ ప్రచారం చేసింది.

61.   చివరకు ఆర్థిక సంస్కరణలు అంటేనే అభద్రలోకం నోరుకొట్టి భద్రలోకం సంపదను పెంచడం  అని తేలింది.

62.   ఇప్పుడు భారత వ్యవసాయ రంగంలో అలాంటి విషాదకర ఘట్టం  మరొకటి ఆరంభం అవుతోంది.

63.   ప్రమాదాన్ని అడ్డుకోకుంటే అది మన జీవితంలో భాగం అయిపోతుంది. మనల్ని జీవితం నుండి గెంటి వేస్తుంది.

 ‘నవభారతానికి దారి చూపుతున్న రైతాంగం’

డానీ

2. ఢిల్లీ మార్గం పట్టిన రైతాంగం

 64.       హరిత విప్లవాన్ని జోరుగా సాగించి దాని సత్ఫలితాలను, దుష్ఫలితాలను కూడ అనుభవించిన పంజాబ్ హర్యాణ రాష్ట్రాల రైతులు  ఈ కొత్త చట్టాలు సృష్టించబోతున్న విధ్వంసాన్ని ముందుగా పసిగట్టారు.

65.       కాంగ్రెస్ కు చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్తచట్టాలను ‘దురదృష్టకరం’ ‘ఆందోళనకరం’ అని ముందుగానే ప్రకటించారు. 

66.       ఈ వివాదాస్పద బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు నిరసనగా పంజాబ్ కు చెందిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి,  శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి సెప్టెంబరు 17న రాజీనామా చేసి ప్రభుత్వం నుండి తప్పుకున్నారు. ఆ తరువాత శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్  తాము కేంద్రంలో అధికార కూటమిగా వున్న ఎన్ డిఏ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

67.       తొలుత పంజాబ్ హర్యాణాల్లో మొదలయిన రైతాంగ ఆందోళన క్రమంగా ఉత్తర ప్రదేశ్, మధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు వ్యాపించింది. 

68.       ఇప్పుడు ఈ సెగ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నది.

69.       పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వున్న కాంగ్రెస్  ప్రభుత్వాలు రైతాంగ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

70.       తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడ రైతుల ఆందోళనను సమర్థించారు.

71.       మరోవైపు, హర్యాణ, ఉత్తర ప్రదేశ్ లో వున్న బిజేపి ప్రభుత్వాలు రైతాంగ ఉద్యమం మీద కత్తి ఝళిపించాయి. నిర్బంధాన్ని ప్రయోగించాయి.

72.       దానితో ఏకంగా దేశరాజధాని ఢిల్లీనే రైతాంగం ఉద్యమ కేంద్రంగా  మార్చుకుంది. 

73.       గత ఏడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలయిన షాహీన్ బాగ్  ఉద్యమం దేశ రైతాంగానికి ఆదర్శంగా మారింది.  

74.       పంజాబ్, హర్యాణ, ఉత్తర ప్రదేశ్ రైతులు నవంబరు 26న నాలుగు వైపుల నుండి ఢిల్లీ చేరుకుని సింఘూ బోర్డర్, గాజీపూర్ బోర్డర్, టిక్రి, ఝరోద, ఔచందీ, పియావో మనియారి, మంగేష్ బోర్డర్లలో హైవేలకు అడ్డంగా శిబిరాలు వేసి ఆ మార్గాల్లో రాకపోకల్ని నిలిపివేశారు.

75.       తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనకు దిగినప్పుడెల్లా ఆదివాసుల్ని మావోయిస్టులు అనడం. ఎస్సీల్ని రాడికల్ బహుజనులు ( భీమ్ ఆర్మీ – చంద్రశేఖర ఆజాద్ –రావణ్) అనడం, (భీమా-కోరేగావ్ కేసులో ఎస్సీల్నీ మావోయిస్టుల ఖాతాలో వేశారు), ముస్లింలను జిహాదీలు అనడం, శిక్కుల్ని ఖలిస్తానీయులు (శిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నాయకులు గుర్పత్ వంత్ సింగ్ పన్నూన్, హర్దీప్ సింగ్ నిజ్జార్)  అనడం మోదీ-షా కేంద్ర ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది.

76.       తమ వేర్పాటువాద ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఖలిస్తానీయులు రైతుల్ని వాడుకుంటున్నారని హర్యాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్రంగా ఆరోపించారు.

77.       రైతాంగ ఆందోళన  వుధృతం అయ్యేకొద్దీ భారత రాజకీయాల్లో సమీకరణలు మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రెండేళ్ళుగా బిజేపి విధానాలతో తీవ్రంగా ఘర్షిస్తున్నారు. రైతాంగ ఉద్యమానికి ఆయన మద్దతు పలకడంలో ఆశ్చర్యం ఏమీలేదు.

78.       ఎన్డీఏలో భాగస్వామి కానప్పటికీ పార్లమెంటు వ్యవహారాల్లో ఆ కూటమికి నమ్మకమైన మిత్రునిగా బయటి నుండి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి  సహితం డిసెంబరు 8 నాటి భారత బంద్ కు  పాక్షికంగా అయినా మద్దతు తెలుపక తప్పలేదు. 

79.       కౌరవులు పాండవుల మధ్య దాయాదిపోరు వున్నప్పటికీ బయటివాళ్ళు కురు సామ్రాజ్యం మీదికి వస్తే నూట ఐదు మంది దాయాదులు ఏకమయిపోతారు అనే మాట మన పురాణాల్లో వుంది.

80.       వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమీటీలు (APMC) రద్దు కాబోతున్నాయని తెలియగానే, అప్పటి వరకు మండీల్లో పెత్తనాన్ని చెలాయించిన ధనికరైతులు, వ్యాపారులు, దళారులు సహితం రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించడం మొదలెట్టారు.

81.       దాదాపు ప్రధాన ఉద్యమాలు అన్నింటిలోనూ ఇలాంటి ‘వర్గసంకరం’ వుంటుంది. దీన్ని వర్గ  ఐక్యత అనాలేమో.

82.       1970ల నుండి  1990ల వరకు వుధృతంగా సాగిన నక్సలైట్‍ వుద్యమంలోనూ విద్యాధిక మధ్యతరగతి వర్గం  కదిలి వచ్చి శ్రామిక వర్గంతో కలిసి పనిచేసింది. క

83.       పదేళ్ళ క్రితపు తెలంగాణ వుద్యమంలోనూ వర్గాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన ఐక్యత కనిపించింది.

84.       మధ్య తరగతి రైతులు, ధనిక రైతులు కలిసివచ్చిన రిచ్ నెస్ ఢిల్లీ రైతుల ఆందోళనలో  కొట్టొచ్చినట్టు కనిపించింది.

85.       పంజాబ్ హర్యాణ వ్యవసాయ సంపదను ఢిల్లీ రోడ్ల మీద పరిచేశారు.

86.       ఢిల్లీలోని శిక్కు వాణిజ్య వ్యాపావేత్తలే కాకుండ ఇతర సామాజికవర్గాలకు చెందిన వారు సహితం రైతులకు అండగ నిలుస్తున్నారు. ఆందోళనకారులకు కొందరు రగ్గులు, శాలువలు పంచుతున్నారు.

87.       సందర్శకులు సింఘూ బోర్డర్ లో ప్రవేశించగానే నిర్వాహకులు మాస్క్ లు పంచుతున్నారు. కొన్ని చోట్ల  వెల్కం డ్రింక్ అన్నట్టు బాదం పాలు ఇస్తున్నారు. కొన్ని సభల్లో బాదం పప్పు కూడ గుప్పెడు చేతిలో పోస్తున్నారు. జామ, యాపిల్ ముక్కలతో ఫ్రూత్ సలాడ్ ఇస్తున్నారు. కిలో మీటరుకు రెండో మూడో మెడికల్ కియోస్కోలు వుంటున్నాయి. వైద్య పరీక్షలు, మందులు కూడ ఉచితంగా అందిస్తున్నారు. ఇక భోజనాలకు, వాటర్ బాటిళ్ళకు అంతేలేదు. కిలో మీటర్ల కొద్ది రోడ్ల మీద రోడ్ల మీద భోజనాల పంక్తులు కనిపిస్తున్నాయి. ఫుల్కాలు, ఆలూ గోబీ. ఫ్రైడ్ రైస్ వడ్డిస్తున్నారు.

88.       పంజాబీ మహిళలు ట్రాక్టర్లు తోలుకుని రావడం ఈ ఉద్యమంలో ఒక ఆకర్షణ. ఆ ట్రాక్టర్ల ట్రాలీల్లోనూ మహిళలు వుంటున్నారు.

89.       ట్రాక్టర్ల కొద్ది గోధుమ పిండి, కూరగాయలు నిరంతరం వస్తూనే వున్నాయి.

90.       కొన్ని ట్రాక్టర్లకు పైన సోలార్ ప్యానల్స్ వున్నాయి.

91.       వాళ్లు మామూలు రైతులు కాదు. ఆరు నెలల ఆందోళనకు సిధ్ధమై వచ్చాము అంటున్నారు. అక్కడ నిల్వ చేసిన గ్రాసాన్ని బట్టి చూస్తే కనీసం మూడు నెలల నిల్వలు వుణ్నట్టే కనిపిస్తున్నాయి.

92.       శానిటేషన్ సమస్య తలెత్తకుండ ఢిల్లీ ప్రభుత్వం అన్ని బోర్డర్స్ లోనూ భారీగా మొబైల్  టాయిలెట్స్ ను  ఏర్పటు చేసింది.

93.       షాహీన్ బాగ్ లా తైతుల ఉద్యమానికి కూడ ఒక వేదిక లేదు. దాదాపు 34 రైతు సంఘాలు అందులో వున్నాయి. మరి కొన్ని త్వరలో కలుస్తాయి.

94.       ప్రతి రైతుసంఘంవాళ్ళు ఆ ప్రాంగణంలో పగలంతా అనేక చోట్ల అనేక సభలు నిర్వహిస్తున్నారు.

95.       పంజాబీ, హర్యాణ్వీ భాషల్లో సాగుతున్న ఆ ప్రసంగాలు ఇతరులకు అర్థం అయినాకాకున్నా కొన్ని సందేశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి. భగత్ సింగ్, ఉధ్ధాం సింగ్ పేర్లు తరచుగా వినబడుతున్నాయి. వాళ్ళ పేర్లు వినబడినప్పుడెల్లా  రైతులు ఉద్వేగంతో తప్పట్లు కొడుతున్నారు.

96.       ఇందిరాగాంధీతోనే తలపడినవాళ్లం నరేంద్ర మోదీతో తలపడలేమా అనే మాటలు కూడ వినబడుతున్నాయి.

97.       ధనిక రైతులు కూడా చేరడంతో మీడియా కూడ ఈ ఉద్యమం మీద ఆసక్తిని కనపరుస్తున్నది. ప్రధాన స్రవంతి మీడియాలోనూ సానుకూల కవరేజి వస్తున్నది.  

98.       మీడియా కెమేరాలకు కరిష్మ కావాలి. ఎర్రగా, పొడుగ్గా, అందంగా వుండి ఇంగ్లీషు-హిందీలో ధారాళంగా మాట్లాడే ఓసీ అమ్మాయిలు ఉద్యమాల్లో మీడియాను గొప్పగా ఆకర్షిస్తుంటారు. అలాంటి కరిష్మ ఢిల్లీ రైతాంగ ఉద్యమంలోనూ ఇప్పుడు కావలసినంతగా వుంది.

99.       మధ్యతరగతి కదిలి వచ్చినపుడు ఉద్యమాలకు ఒక ప్రదర్శన స్వభావం (Vigiblity) వస్తుంది.  అది ఢిల్లీ ఉద్యమంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది.

100.  పంజాబ్ మార్కెట్ యార్డుల్లో ఇంతవరకు పెత్తనాన్ని చెలాయించినవాళ్ళు రాజకీయంగా సహజంగానే కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ లకు చెందినవారు. వాళ్లు ఇప్పుడు ఆందోళనలో చేరారు. దానితో ఈ ఉద్యమాన్ని వెనుక నుండి కాంగ్రెస్ నడుపున్నదనే మాట కూడ వినిపిస్తోంది.

 

101.  ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏ రాజకీయ శక్తులున్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్‌ తోమర్, పీయూస్‌ గోయెల్‌ ప్రసార మాధ్యమాలను కోరడం వెనుక వుద్దేశ్యం నెపాన్ని విపక్షాల మీదకు నెట్టడమే .

102.  ఉద్యమంలో విపక్ష పార్టీల అభిమానులు వున్నమాట వాస్తవమేగానీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మీంచే శక్తి ఇప్పటి విపక్షాలకు లేదు.

103.  ఇప్పటికి ఇది స్వతంత్ర రైతు వుద్యమమే.

 

‘నవభారతానికి దారి చూపుతున్న రైతాంగం’

డానీ

3.    అసలు శత్రువును గుర్తించిన రైతాంగం

 104.  ప్రస్తుత రైతు వుద్యమంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గుర్నామ్ సింగ్ చాగుని. భారతీయ కిసాన్ యూనియన్ కు హర్యాణ విభాగం అధ్యక్షునిగా వుంటున్న గుర్నామ్ వృత్తి రీత్య  వ్యవసాయదారుడేగాక మార్కెట్ బ్రోకర్  కూడ.

105.   దేశంలోని అనేక రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్ కే ఎమ్) పేరిట   ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి.

106.   భారతీయ కిసాన్ యూనియన్ (చాదుని) (గుర్నామ్ సింగ్ చాదుని)

107.  రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ (విఎం సింగ్)

108.  జైకిసాన్ ఆందోళన్ (అవిక్ సహ, డాక్టర్ అషీష్ మిటల్)

109.  ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (వి వెంకటరామయ్య)

110.  ఆల్ ఇండియా కిసాన్ సభ (డాక్టర్ అశోక్ ధావల్, హన్నాన్ మొల్లా)

111.  క్రాంతికారి కిసాన్ యూనియన్ (డాక్టర్ దర్శన్ పాల్)

112.  బికెయు (దకౌంద) (జగ్మొహన్ సింగ్)

113.  ఆశా – కిసాన్ స్వరాజ్  (కవిత కురుగంటి)

114.  కర్ణాటక రాజ్య రైత సంఘ (కొడిహళ్ళి చంద్రశేఖర్)

115.  నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ (మేథా పాట్కర్)

116.   లోక్ సంఘర్ష్ మొర్చా (ప్రతిభా షిండే)

117.  ఆల్ ఇండియా కిసాన్ మహాసభ (రాజారామ్ సింగ్, ప్రేమ్ సింగ్ గెల్హాట్)

118.  స్వాభిమాని షేత్కారి సంగ్హటన్ (రాజు షేట్టి)

119.  సగ్తీన్ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (రిచా సింగ్)

120.  జమ్హూరి కిసాన్ సభ (సత్నామ్ సింగ్ అజ్నాల)

121.  ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘటన్ (సత్యవాన్).

122.  కిసాన్ సంఘర్ష్ సమితి (డాక్టర్ సునీలమ్)

123.  తెరాయి కిసాన్ సభ (తాజిందర్ సింగ్ విర్క్)

124.  జైకిసాన్ ఆందోళన్ (యోగేంద్ర యాదవ్)

125.  బికెయు (రాజేవాల్) (బల్బీర్ సింగ్ రాజెవాల్)

126.  గన్నా సంఘర్ష్ సమితి – భడ్సన్ (రాంపాల్ చాహల్)

127.  గన్నా సంఘర్ష్ సమితి –షాజాద్ పూర్ (వినోద్ రానా)

128.  కిసాన్ సంగర్ష్ సమితి (సత్యవాన్ దనోద)

129.  రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (జోగిందర్ సింగ్ ఉగ్రహాన్)

130.  అనేక రాష్ట్రాల నుండి అనేక రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చ లో చేరనున్నాయి.

131.  ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను క్రిమినలైజ్ చేయడం, పౌరసత్వ సవరణ బిల్లు తేవడం వంటి వేధింపులకు గురిచేసినపుడు ముస్లిం సమూహం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించింది.  

132.  రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కు కాదని సుప్రీం కోర్టు అన్నపుడు ఎస్సీలు, ఎస్టీలు కూడ సంక్షేమ రాజ్యాంగ పరిరక్షణ నినాదాలు ఇచ్చాయి.

133.  కర్మిక హక్కుల్ని కాలరాసే చట్టాలు తెచ్చినపుడూ కార్మికులు ప్రజాస్వామ్య  పరిరక్షణ నినాదాలు ఇచ్చాయి.

134.   ఈ వేధింపు చట్టాలన్నీ అస్మదీయ కార్పొరేట్ల సంపదను పెంచడానికేనని తొలిసారిగా గుర్తించింది రైతాంగమే. ఇది గుణాత్మక మార్పు.

135.  ఆడానీ, అంబానీలకు ప్రయోజనాలను సమకూర్చడానికే ఈ వ్యవసాయ సంస్కరణలు చేపట్టారని రైతాంగ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

136.  వ్యవసాయ సంస్కరణ బిల్లుల మీద రాష్ట్రపతి సంతకం పెట్టిన రెండు రోజుల్లోనే అక్టోబరు 2న పంజాబ్ రైతులు పాటియాల, సంగ్రూరు పట్టణాల్లో మాల్స్, ప్రైవేటు ధర్మల్ స్టేషన్ల ముందు ధర్ణాలు చేశారు.

137.  కేంద్ర ప్రభుత్వంతో ఆరు రౌండ్ల చర్చలు విఫలం అయ్యాక డిసెంబరు 9న జరిగిన సమావేశంలో రైతు సంఘాల నాయకులు కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వం మూడు చట్టాలను ఉపసంహరించుకోని పక్షంలో రియన్స్ మాల్స్, ఆడానీ టోల్ గేట్స్ లను లక్ష్యంగా చేసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

138.  ఇప్పుడు రైతాంగం దృష్టిలో నరేంద్ర మోదీజీ – అమిత్ షాజీల ప్రభుత్వానికి  ఆడానీ, ఆంబనీ తదితరులు  అస్మదీయ కార్పొరేట్లు.

139.  అస్మదీయ కార్పొరేట్లు వున్నప్పుడు తసమదీయ కార్పొరేట్లు కూడా వుంటారు.  ఈ చారిత్రక సందర్భంలో  తసమదీయ కార్పొరేట్లు ఏం చేస్తారన్నది కీలక అంశం.

140.  సామ్రాజ్యవాదుల మీద సాగే పోరులో జాతీయ  బూర్జువావర్గం కూడా కలిసి వస్తుందని మావో సే టుంగ్ ఒక దశలో చెప్పాడు. చైనాలో  జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట దశలో కమ్యూనిస్టులు, జాతీయ బూర్జువావర్గం కలిసి పనిచేశారు.  చైనా నుండి సామ్రాజ్యవాదుల్ని తరిమి కొట్టడంలో విజయాన్ని సాధించారు.

141.  భారత దేశంలో కూడ జాతీయ బూర్జువావర్గం ఒకటి ఆవిర్భవిస్తుందని 1970వ దశకంలో విప్లవ కమ్యూనిస్టులు ఆశించేవారు. కానీ ఎప్పుడూ జాతీయ బూర్జువావర్గం ఉనికిలోనికి రాలేదు.

142.  ఆర్థికంగా కొంచెం  బలపడగానే మన కార్పొరేట్లు ఎంఎన్ సి లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉవ్విళ్ళూరడాన్నే మనం ఇంతకాలం చూస్తూవస్తున్నాం.

143.  ఆటో మోబైల్స్ రంగంలో హీరో-హోండా, బజాజ్-కవాసాకి, టివిఎస్ – సుజికి వంటి పేర్లు అలా వచ్చినవే. 

144.  కేంద్రప్రభుత్వాలు కార్పొరేట్లను ప్రోత్సహించడం అనేది చాలా కాలంగా వున్నదే.  అలాగే ఎన్నికల ఖర్చు కోసం రాజకీయ పార్టీలు కార్పొరేట్ల నుండి నిధుల్ని సేకరించే సాంప్రదాయమూ పాతదే.

145.  ప్రభుత్వం నుండి లైసెన్సులో, భూములో, రాయితీలో  పొందకుండ బలపడిన కార్పొరేట్లు మన దేశంలో ఒక్కరూ వుండరంటే అతిశయోక్తికాదు. దీనినే ప్రాయోజిత పెట్టుబడీదారీ వ్యవస్థ (క్రోనీ కేపిటలిజం) అంటున్నాము. 

146.  ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారత కార్పొరేట్ రంగంలో అస్మదీయ కార్పొరేట్లు, తస్మదీయ కార్పొరేట్లు అనే విభజన కనిపిస్తున్నది.

147.  కేంద్ర ప్రభుత్వం ఆడానీ, అంబానీలను అతిగా ప్రోత్సహిస్తూ ఇతర కార్పొరేట్లను పక్కన పడేస్తున్నదనే విమర్శలున్నాయి.

148.  ఈ పరిణామాలతో ఇతర కార్పొరేట్లు కేంద్ర ప్రభుత్వ తీరు మీద అసంతృప్తితో వున్నారనే మాట ఇటీవల తరచుగా వినిపిస్తున్నది.

149.  కొత్తగా వునికి లోనికి వస్తున్న తసమదీయ కార్పొరేట్ల తదుపరి అడుగు ఎటువైపు అని దేశం (ముఖ్యంగా కార్మిక కర్షకులు)  ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

150.  బజాజ్ ఆటోస్ కు చెందిన వృధ్ధ కార్పొరేట్ రాహుల్ బజాజ్ కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను బాహాటంగానే తప్పు పడుతున్నారు. కార్పొరేట్ రంగంలో ఒక రకం భయం వెంటాడుతున్నదని  ఆయన విమర్శిస్తున్నారు.

151.  జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్మా గాంధీజీకి ‘ఐదవ కొడుకు’గా పేరు తెచ్చుకున్న జమ్నాలాల్ బజాజ్ మనవడే రాహుల్ బజాజ్. 

152.  రాహుల్ బజాజ్ లా అసంతృప్తితో వున్న కార్పొరేట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదనే వార్తలు వినవస్తున్నాయి. వారు బయటపడతారా లేదా అనే సందేహాలూ వున్నాయి.

153.  తసమదీయ కార్పొరేట్లు మరి కొందరు బయటపడి రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తారనే మాట సామాజిక విశేషకుల్లో వినిపిస్తున్నది. అదే జరిగితే భారత రాజకీయార్థిక రంగంలో కొత్త చరిత్ర మొదలవుతుంది.

154.  అలా జరుగకపోతే, షాహీన్ బాగ్ ఉద్యమాన్ని అణిచివేసినట్టు కోవిడ్ వ్యాప్తి వంకతోనో, శాంతిభద్రతల వంకతోనో రైతాంగ ఉద్యమాన్ని అణిచివేయడానికి  కేంద్ర ప్రభుత్వానికి ఓ పది పదిహేను రోజులు కూడ పట్టదు.

155.  అయితే, ఈసారి రైతాంగ ఉద్యమం  కొన్ని మహత్తర అంశాలను  చర్చకు తెచ్చింది. అవి ఒకవేళ ఇప్పటికి అణిచివేతకు గురయినా సమీప భవిష్యత్తులో కొత్త ఉత్సాహంతో ముందుకు నడుస్తాయి.

(అయిపోయింది)

 

Three Farm Acts

1.     The Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Act - 2020

2.     The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance and Farm Services Act- 2020 and

3.     The Essential Commodities (Amendment) Act- 2020.

 రచన : 14 డిసెంబరు 2020

ప్రచురణ :