Wednesday 28 December 2016

Surgical Strike on Swiss Banks

స్విస్ బ్యాంక్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి !
-        డానీ

అధికారం, అవినీతి, నల్లధనం పరస్పరాశ్రయాలు. అవినీతి నల్లధనాన్ని సృష్టిస్తుంది; నల్లధనం అవినీతిపరుల్ని మరింత శక్తిమంతులుగా మారుస్తుంది. వీలు కుదిరినపుడు అధికారాన్నికూడా కట్టబెడుతుంది.  ఆ అధికారం మళ్ళీ అవినీతిని పెంచుతుంది.

అవినీతి అనేది ఒక వ్యవస్థ. చేతిలో అధికారంలేకుండా, అధికారంలో వున్నవారితో సాన్నిహిత్యం (క్రోనీ కేపిటలిజం) లేకుండా,  అధికారుల్ని మచ్చిక చేసుకునే నైపుణ్యం (లాబీయింగ్) లేకుండా ఎవరూ అవినీతికి పాల్పడలేరు. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల మీద ఒక్కసారిగా తనిఖీలు నిర్వహిస్తే ఆదిమూలం మోహన్ (తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్), డీఏ.  సత్యప్రభ (చిత్తూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే) వంటివారు ఒకరు ఇద్దరు కాదు వేలు లక్షల్లో బయటపడతారు. దేశంలో అవినీతి సంపద తొంభై శాతం బయటపడిపోతుంది. ప్రభుత్వాలతో అంట కాగుతూ అవినీతి సంపదను పెంచుకుంటున్న మీడియా అధిపతులు తదితరుల్ని కూడా ఈ జాబితాలో  చేర్చవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు కట్టని చిల్లర వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా వుంటారుగానీ వాళ్ల అవినీతి అంత చెప్పుకో దగ్గదికాదు. దాన్ని కూడా అరికడతామంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదుగానీ పెద్ద తిమింగలాల్ని వదిలేసి పెద్ద నోట్లను రద్దు చేస్తామంటేనే ప్రభుత్వాధినేతల నిజయితీని శంకించాల్సి వస్తున్నది.

నల్లధనం అనే అవినీతి సంపద నగదు రూపంలోనే వుంటుందనేది ఒక  అబధ్ధం. అవినీతిపరులు అతి తెలివైనవాళ్ళు.  వాళ్ళు సంపదను ఎక్కువ కాలం  నగదు రూపంలో నిల్వపెట్టరు. ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా నగదు విలువ క్రమంగా అంతరించిపోతుంటుంది. అసలు కరెన్సీ అంటేనే నిరంతరం చలనంలో వుండేది అని అర్ధం. సాధారణంగా అవినీతి సంపద భూమి, భవనాలు, బంగారం రూపంలో వుంటుంది. ఈ మూడు రంగాలలో మదుపు చేసినపుడే వాటి విలువ పెరుగుతూ వుంటుంది. అంతిమంగా నగదు రూపంలో వుండే అవినీతి సంపద పది శాతం కూడా వుండదు.

అయితే కొందరికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో నల్లధనం నగదు రూపంలో అవసరం అవుతూ వుంటుంది. ముఖ్యంగా  రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో నల్లధనం లేకుండా  బతకలేవు. పార్టీల విధానాలు, అవి చేసే వాగ్దానాలతోపాటూ, అవి పంచే డబ్బు కూడా ఎన్నికల  ఫలితాలను  నిర్ణయిస్తుంటాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులు సగటున 8 కోట్ల రూపాయలు, యంపీ అభ్యర్ధులు సగటున 12 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చుపెట్టారని అనేక పరిశోధనా సంస్థలు అంచనా వేశాయి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ  అనే తేడా ఏమీలేదు. అన్ని పార్టీలూ తమ దగ్గరఉన్న వనరుల మేరకు భారీగా ఖర్చుపెట్టి అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తాయి.  “ఈ డబ్బును అవి మదుపుగా భావిస్తాయి గనుక వీటి మీద కనీసం ఐదారు రెట్లు సంపాదించుకొవడానికి పదవీ కాలంలో అనేక అవినీతి చర్యలకు పాల్పడతాయి. అలా అవినీతి డబ్బు ఎన్నికలు ఎన్నికలకు ఐదారు రెట్లు పెరిగిపోతుందని ప్రెస్‍ కౌన్సిల్ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు జస్టిస్ మార్కండేయ కట్జు వంటివాళ్ళు  తమ నివేదికల్లో  పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం ఎంతడబ్బు చెలామణిలో వున్నదో సులువుగానే లెఖ్ఖలు కట్టి చెప్పవచ్చు. ఇప్పటి వరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోట్ల విలువ వివరాలు  కచ్చితంగా రికార్డుల్లో నమోదు అవుతూవుంటాయి. అలాగే శిధిలమైపోయి  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తిరిగి వచ్చిన నోట్ల విలువ కూడా  కచ్చితంగా రికార్డుల్లో నమోదు అవుతూ వుంటుంది. మొదటిదానిలో నుండి రెండోదాన్ని తీసేస్తే ప్రస్తుతం దేశంలో చెలామణిలో వున్న కరెన్సీ నోట్ల విలువను కచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇందులో నల్లధనంగా మారిన నోట్ల మొత్తం విలువను కచ్చితంగా చెప్పడం సాధ్యంకాదు; అది అప్రకటిత ధనం కనుక.

ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 18 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో వుండగా అందులో సగభాగం నల్లధనంగా మారిందని అంచనా. అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల నల్లధనం కరెన్సీ రూపంలో వుందనేది  కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇస్తున్న సంకేతాలు.

ఇది కాకుండా నకిలీ నోట్లు కూడా పెద్ద మొత్తంలో చెలామణిలోనికి వస్తున్నాయి. మన కరెన్సీలో పెద్ద నోట్లను విదేశాల్లో ముద్రిస్తారని చాలా మందికి తెలీదు.  యూపీఏ హయాంలో ఇంగ్లండ్ హ్యాంప్ షైర్ కు చెందిన డె లా రూయి సంస్థకు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇంకో విచిత్రం ఏమంటే పాకిస్తాన్ కు చెందిన పెద్ద కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్టును కూడా ఈ సంస్థే దక్కించుకుంది. వీటి దుష్ఫలితాలను ఊహించుకోవచ్చు. 


ఆధిపత్యం, ప్రాబల్యం గలవర్గాలు మాత్రమే అవినీతికి పాల్పడి నల్లధనాన్ని సృష్టిస్తాయని అనుకోవడానికి కూడా లేదు. చట్టాల నియమాలకూ, సమాజ సాంప్రదాయాలకూ పొంతన కుదరని సందర్భాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా  నల్లధనాన్ని సేకరిస్తుంది. వరకట్నం దీనికి పెద్ద ఉదాహరణ. వరకట్నం ఇవ్వడం తీసుకోవడం కూడా చట్ట ప్రకారం నేరమే. కానీ, దేశంలో జరిగే దాదాపు అన్ని పెళ్ళిళ్ళలోనూ  వరకట్నం వుంటుంది. వరకట్నం కోసం అనేక కుటుంబాలు నల్లధనాన్ని పోగుపెడుతుంటాయి. ఇంకా దిగువ తరగతికి చెందిన పేదలు, బిచ్చగాళ్ల దగ్గర కూడా ఏదో ఒకస్థాయిలో నల్లధనం వుండే అవకాశాలున్నాయి. అంచేత నల్లధన్నానీ, అవినీతినీ వర్గీకరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. జరుగుబాటు కోసం చేసే అవినీతినీ, అత్యాశతోనూ, అధికారాన్ని చేపట్టే లక్ష్యాలతోనూ చేసే అవినీతిని విడగొట్టాల్సిన అవసరం వుంది. ఎవరిని శిక్షించాలి, ఎవరిని క్షమించాలీ అనే విషయంలో ఒక విధాన నిర్ణయం జరగాల్సిన సమయం ఇది. అంతేతప్ప అవినీతి సర్వత్రావుందనే వంకతో పెద్ద తిమింగిలాలని వెనకేసుకు రావడం క్షమార్హంకాని నేరం.

ప్రకటిత ధనం సర్క్యూలేషన్ ను నిర్వహించడానికి ప్రకటిత బ్యాంకులు వున్నట్టే అప్రకటిత ధనం సర్క్యూలేషన్ ను నిర్వహించడానికి కూడా అప్రకటిత బ్యాంకులు వుంటాయి. ఈ కోణంలో ఇప్పుడు విజయమాల్య పేరు ఎక్కువగా వినిపిస్తున్నదిగానీ అలాంటి పెద్ద తిమింగలాలు అనేకం వుంటాయి. ఎందుకో గానీ  తెలుగు రాష్ట్రాల్లో సారా, మద్యం వ్యాపారుల పేర్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తుంటాయి. వీళ్ళు సాధారణంగా అధికార పార్టీల్లోనే వుంటుంటారు. 1995 చివర్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త చనిపోయినపుడు పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రిసహా, కొందరు పెద్ద హీరోలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ చనిపొయిన పారిశ్రామికవేత్త విజయమాల్యాకు ప్రాంతీయ ప్రతినిధి అని అప్పట్లో బలంగా వినిపించింది.

ఇలాంటి వ్యవహారాల్లో విజయమాల్య పేరు ఇటీవల మళ్ళీ వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న విజయమాల్య కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక అధికారుల బృందం గత నెల (అక్టోబరు) మొదటివారంలో టీడీపీకీ చెందిన  చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ ఇంటి మీద దాడులు జరిపి 43 కోట్ల రూపాయల నగదుతోపాటూ దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అధికారపార్టీల్లోనే తిమింగలగిలాలు  వున్నప్పుడు అవినీతిని అరికట్టడం ఏ అధికారపార్టీకి కూడా సాధ్యఅయ్యేపనికాదు. అందువల్ల కేంద్రప్రభుత్వం అప్పుడప్పుడు నల్లధనాన్ని క్రమబధ్ధం చేసే ప్రయత్నం చేస్తుంటుంది. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం సరళీకృత ఆర్ధిక విధానాన్ని చేపట్టినపుడు నల్లధనం స్వచ్చంద ప్రకటన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రకటించిన మొత్తంలో మూడో భాగాన్ని అపరాధ రుసుముగా  వసూలు చేసి మిగిలిన రెండు భాగాల్ని  క్రమబధ్ధం చేసేవారు. ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెన్నయిలో 450 కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది.

దేశంలో నల్లధనంగా మారిన దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలను తెల్లధనంగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయ ప్రకటన పథకం- (ఐడియస్) 2016ను ప్రవేశపెట్టింది. ప్రకటిత మొత్తంలో ఆదాయపు పన్ను, అపరాధపు పన్ను, ఇతర సెస్సులు కలుపుకుని మొత్తం 45 శాతం  వసూలు చేసి మిగిలిన 55 శాతం మొత్తాన్ని తెల్లధనంగా ప్రకటించడం ఈ స్కీము లక్ష్యం. ఈ పథకం ద్వార దేశంలో దాదాపు 6.5 లక్షల కోట్ల నల్లధనం వెలుగులోనికి వస్తుందని ప్రభుత్వం అశించిందిగానీ అందులో ఇప్పటికి పది శాతం ఫలితాలు మాత్రమే  వచ్చాయి.

ఈ స్కీమ్ లో భాగంగా హైదరాబాద్ కు చెందిన  ఓ రాజకీయ కుటుంబం పది వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ప్రకటించడం నెల క్రితం పెద్ద సంచలనం గా మారింది. చిత్తూరు మహిళా ఎమ్మెల్యే డబ్బుతోసహా దొరికిపోవడంతో నైతిక సంక్షోభంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్  అధికార తెలుగు దేశంపార్టి పది వేల కోట్ల రూపాయలు ప్రతిపక్షనేత జగన్ వే అంటూ ప్రచారం  మొదలెట్టింది. పది వేల కోట్ల రూపాయల్ని ప్రకటించిన వారి పేరును  ప్రకటించాలని వైయస్సార్ సీపీ అధినేత జగనే  స్వయంగా ప్రధానికి లేఖరాయడంతో ఆ వివాదం ముగిసింది. ఆ డబ్బు ఓ మాజీ ముఖ్యమంత్రి కుటుంబానివనే గుసగుసలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇందులో రహాస్యాలు ఏమీ వుండవు. 45 శాతం పన్ను కట్టేసిన తరువాత ఎంత నల్లడబ్బయినా  సర్ఫ్ఎక్సెల్ వేసి ఉతికి ఆడేసినట్టు తళతళలాడే తెల్లని తెలుపు డబ్బుగా మారిపోతుంది. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర వుంటాయి. సమాచార హక్కు చట్టం ద్వార ఎవరయినా వాటిని పొందవచ్చు.

దేశంలో వున్న నల్లడబ్బుగాక విదేశీ బ్యాంకుల్లో కూడా మన దేశపు అవినీతిపరుల నల్లడబ్బు వుంటుంది. డిపాజిట్టు నిబంధనల ప్రకారం ఆ వివరాలను విదేశీ బ్యాంకులు ప్రకటించవు. ఇలాంటి సందర్భాల్లో పన్ను ఎగవేతదారుల స్వర్గంగా స్విస్ బ్యాంకుల్ని పేర్కొంటూంటారు. అక్కడ కూడా ఎంత డబ్బు వుందో ఎవరి దగ్గరా అంచనాలు లేనప్పటికీ ఆ డబ్బును వెనక్కి తీసుకువస్తామని గత ఎన్నికల్లో బీజేపి వాగ్దానం చేసింది. అధికారాన్ని చేపట్టిన తరువాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వాగ్దానాన్ని పునర్ఉద్ఘాటించారు. ఆ డబ్బును వెనక్కి తీసుకుని వస్తే ప్రతి భారతీయ పౌరుడికి 15 లక్షల రూపాయల చొప్పున ఆయాచితంగా ఇవ్వవచ్చని కూడా వారు మరీ చెప్పారు. సాక్షాత్తు ప్రధాని వేసిన లెఖ్ఖల ప్రకారం స్విస్ బ్యాంకులో 18 కోట్ల కోట్లు భారత నల్లధనం నిల్వలు వున్నాయని అర్ధం.  అక్కడ అంత ధనం వుందని తెలిసి కూడా దాన్నీ వెనక్కు తీసుకురావడానికి ప్రధాని మోదీ ఎందుకు జంకుతున్నారో అర్ధంకాదు. ప్రపంచంలో అగ్రగామి ఆర్ధికశక్తిగా మారుతున్న చైనా పైనే సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సిధ్ధమౌతున్న ప్రధాని స్విస్ బ్యాంకు మీద సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయలేకపోతున్నారో దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం వున్నది. ఎందుకంటే ప్రధాని తాత్సారం చేసేకొద్దీ ఒక్కో భారతీయుడు 15 లక్షల రూపాయల్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాడు. తలసరి 15 లక్షల రూపాయలు అనేది ఏ విధంగానూ చిన్న విషయం కాదు.

సాధారణంగా చెయ్యాల్సిన పనులు చేయకుండా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరంలేని పనులు అనేకం చేస్తుంటాయి. వీటికి దేశ ఆర్ధిక ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని ఎవరికైనా అనిపిస్తే అందులో అతిశయోక్తి ఏమీలేదు.  దేశంలో 500, 1000 రూపాయలను రద్దు చేయాలని నవంబరు 8న మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ కోవకే చెందుతుంది.

రాజకీయాల్లో ఎవరు ఏం చెపుతున్నారు అనే దానికన్నా ఎప్పుడు చెపుతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం.  జాతీయ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా భావించే  ఉత్తర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడంతో ఇందులో ఆర్ధిక ప్రాధాన్యతకన్నా రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తున్నది. ఆర్ధిక ప్రాధాన్యతే ముఖ్యం అనుకుంటే భారత  ప్రభుత్వం ఈపాటికే స్విస్  ప్రభుత్వం మీద, ఆ దేశ ఉత్పత్తుల మీద ఆర్ధిక అంక్షల్ని విధించి వుండేది. అంతకన్నా తీవ్రమైన చర్యలకు పాల్పడి వుండేది. 

నిజానికి పెద్ద నోట్లను రద్దు చేయడం ఇదే మొదటిసారికాదు. మొదటి పపంచ యుధ్ధం తరువాత అప్పటి బ్రిటీష్ పాలకులు కూడా భారత వలసలో పెద్ద నోట్లను రద్దు చేశారు. ఎమర్జెన్సీ కాలంలోనూ పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదన వచ్చింది. 1978లో మురార్జీ దేశాయి కాలంలో అది అమల్లోనికి వచ్చింది. ఆ రెండు సందర్భాలోనూ సమాజపు పైపొరల్లో కొన్ని సర్దుబాట్లు జరగడమేతప్పా పేదవాళ్లకు ఒరిగింది ఏమీలేదు. ఇప్పుడూ అంతే. కానీ, ఏదో జరిగిపోతున్నదనే భ్రమ కొంత కాలం వుంటుంది. ఎన్నికలకు ముందు ప్రజల్ని అలాంటి భ్రమల్లో వుంచడం రాజకీయ పార్టీలకు అవసరం.

పిల్లికి చెలగాటం ఏలక్కి ప్రాణ సంకటం అన్నట్టు ఈ రాజకీయ క్రీడ ప్రభావం దిగువతరగతి వర్గాల మీద చాలా తీవ్రంగా వుంటుంది. నల్ల కుబేరుల్ని గట్టున పడేయడానికి పెద్దపెద్ద ఆడిటింగ్ సంస్థలుంటాయి. అవి చొక్కా నలగకుండానే, జుట్టు చెదరకుండానే పెద్దపెద్ద తిమింగలాల్ని దొడ్డిదారిన బయట పడేస్తుంటాయి. దిగువ తరగతి జీవులకు ఆ సంస్థలు, ఆ మతలబులు, ఆ దొడ్డిదారులూ, ఆ కిటుకులు తెలిసే అవకాశం వుండదు. చిన్న తేడా వచ్చినా ఆ జీవితాలు ఆరిపోతాయి. అప్పుడే మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి సంక్షోభంలో కూరుకుని  ఒకామె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలవర పెడుతోంది.

మహబూబాబాద్ కొత్తజిల్లా శెనగపురం గ్రామానికి చెందిన కందుకూరి వినోద అనే మహిళ భర్త కందుకూరి ఉపేంద్రాచారి  కొంతకాలంగా పక్షవాతంతో మంచాన పడ్డాడు.  కుటుంబ సభ్యులు వారిస్తున్నా భర్తను ఎలాగయినా బతికించుకోవాలని పట్టుదలతోవున్న వినోద తమకున్న 12 ఎకరాల భూమినీ 56 లక్షల రూపాయలకు ఇటీవలే అమ్మేసింది. భర్తకు వైద్య ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో మరోచోట కొంత భూమి కొని మిగిలిన జీవితం గ్డపాలనేది ఆమె వుద్దేశ్యం. భూమి అమ్మేసి  సరిగ్గా డబ్బులు చేతిలో పడిన సమయంలో   కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అమె చేతికి అరకోటి వచ్చివుండవచ్చుగానీ అందులో చాలా తక్కువ మొత్తానికి భూమి రిజిస్ట్రేషన్ జరిగివుంటుంది. అందులో  వైట్ ఎంత? బ్లాక్ ఎంత?  బ్లాక్ ను వైట్ చేసుకునే మార్గాలేమిటీ? వాళ్ళకు తెలిసే అవకాశంలేదు. “ఈ నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలే” అని నమో భక్తులు చేసిన ప్రచారం ఆ కుటుంబంలో విషాదంగా మారింది. భూమిని అమ్మి చిత్తుకాగితాలు తెచ్చిందని కొడుకు, కూతురు, బంధువులు నిందించడంతో వినోద హతాశురాలైంది. చివరకు భర్త కూడా అసహనాన్ని వ్యక్తం చేయడంతో వినోద తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఇలాంటి విషాదాలు మరికొన్నింటిని మనం సమీప భవిష్యత్తులో చూడబోతున్నాం.

గతంలో పెద్ద నోట్లను రద్దుచేసినపుడు ఇలాంటి విషాద సంఘటనలు లేవు. నల్లకుబేరులకన్నా దిగువతరగతి జీవులే ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కోవడం ఈసారి విశేషం.

నల్లధనం పెరిగిపోవడానికి కారణం పెద్దనోట్లే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న వాదన కూడా చిత్రమైనది. మురార్జీ దేశాయి రద్దుచేసిన 1000 రూపాయల నోటును తిరిగి ప్రవేశ పెట్టింది బీజేపి ప్రధాని వాజ్ పాయే.  2000లో ఇది జరిగింది. అప్పటి యన్డీయే ప్రభుత్వంలో టిడిపి భగస్వామ్యపార్టీ మాత్రమేకాక   దాదాపు చంద్రబాబు సూచనల ప్రకారమే వాజ్ పాయి ప్రభుత్వం నడుస్తున్నట్టు గట్టిగా ప్రచారం జరిగేది. అలా  తార్కికంగా ఆ తప్పులో వారికీ భాగం వుందనుకోవాలి.

మొన్న 500, 1000 రూపాయల నోట్ల ను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించినపుడు వాజ్ పాయి చేసిన తప్పును నరేంద్ర మోదీ  సరిదిద్దదలిచారేమో అనిపించింది. అయితే, వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో 2 వేల రూపాయల నోటును ప్రవేశపెట్టి వారు వాజ్ పాయి చేసిన తప్పును రెట్టింపు చేయదలిచారు. మన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లకు అప్పటికి సవరించిన ధర ప్రకారం వెయ్యి రూపాల నోటుకు బదులు రెండు వేల రూపాయలు నోటు ఇస్తారేమో. ప్రైస్ అప్రిసియేషన్!

భారత కరెన్సీ మీద గాంధీజీ బొమ్మ వున్నంత కాలం దేశ రాజకీయాల్లో గాంధీ-నెహ్రు కుటుంబం అంతరించిపోదని కమలనాధులు భావిస్తున్నారనే  అభిప్రాయం ఒకటుంది. సమీప భవిష్యత్తులో మన కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు కమలనాధులు అభిమానించే వల్లభాయి పటేల్ బొమ్మలు ప్రత్యక్షం కావచ్చు.

మనం జాతీయ బ్యాంకులకు వెళ్ళినపుడు అక్కడి అందమైన అమ్మాయిలు ఎంతో అభిమానంతో ఫిక్సిడ్ డిపాజిట్టు స్కీముల లాభాల్ని వివరించి “ఏమైనా ప్లాన్ వుందా।“ అని అడుగుతుంటారు. వాళ్లను తప్పించుకోవడం చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇప్పుడు వాళ్లకు ఆ శ్రమ అక్కర లేదు. జనం తమంత తాముగా బ్యాంకుల ముందు క్యూలు కట్టి డబ్బును దిపాజిట్టు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోది ఇప్పుడు జాతీయ బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్ స్కీములకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.  బ్యాంకింగ్  వ్యవస్థకు సంబంధించి ఒక వాస్తవం ఏమంటే చేపలు బ్యాంకుల్లో డబ్బును దాచుకుంటాయి. తిమింగలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్)

మొబైల్ : 9010757776


నవంబరు 11, 2016

Saturday 24 December 2016

An another cow story

పుస్తకపరిచయం

ఆవుకథ ... మరోలా

అద్దాల మేడల్లో వుండేవాళ్ళు గుడిసెల మీద రాళ్ళు రువ్వకూడదు. అంటే, వాళ్ళ మీద జాలిచూపాలనికాదు; ముందుజాగ్రత్తగా అన్నమాటా. గుడెసెల మీద రాయి రువ్వితే చీకిపోయిన రెండు తాటాకుముక్కలు కిందికి రాలిపడతాయి. అంతకన్నా పోయేదేమీలేదు.  అదే గుడెసెవాసులు అద్దాల మేడ మీద రాళ్ళురువ్వితే  కొల్లాటరల్ డామేజి జరిగిపోతుంది. అయితే, అద్దాల మేడల్లో వుండేవాళ్ళకు ఇంతటి ఇంగితం వుండదు. అమావాసకీ పౌర్ణానికీ పిచ్చి ముదిరినట్టు బీహార్ లోనో, ఉత్తర ప్రదేశ్ లోనో దేశంలోనో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళ అరచేతుల్లో దురద పెరుగుతుంటుంది. దురద చేతులుకదా? గుడెసెల మీద నాలుగురాళ్ళు రువ్వకుండా వుండలేవు.

ఇప్పుడు గుడిసెవాసుల వంతు వచ్చింది. ప్రతిదాడిగా వాళ్ళు అద్దాల మేడ మీద ఒక రాయి విసిరారు. దాని పేరు ‘గోధనం’ నవల; రచయిత సతీష్ చందర్. దాడికన్నా ప్రతిదాడి తీవ్రంగా వుంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

గోధనం మెడికల్ ఫిక్షన్ నవల. ఆవు ఆర్ధశాస్త్రం మీద రాసిన ఉద్యమ మార్మిక రచన అని కూడా దీన్ని అనవచ్చు.  ఆవు సాధుజంతువు. ఆవు గడ్డి తినును. పాలు ఇచ్చును. పాలనుండి వెన్న వచ్చును. వెన్న నుండి నెయ్యి వచ్చును అంటూ సాగుతుంది ఎలిమెంటరీ స్కూలు పాఠం.  ఆవు రాజకీయ జంతువు. ఆవు ఓట్లు తెచ్చును. ఓట్లు ఆధికారమును తెచ్చును. ఎన్నికల్లో నల్లధనముకన్నా గోధనము గొప్పగా పనిచేయును అంటూ సాగుతుంది సతీష్ చందర్ నవల.

హిందూ అగ్రవర్ణాలవారు గోమాంసం తినరూ అనేది ఇటీవలి పరిణామం మాత్రమే. ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుడు వచ్చేంత వరకు భారత ఉపఖండంలో  అందరూ అన్నీ తినవాళ్ళే. యాగాల్లో గోవును ఎలా వండుకుని తినాలో సవివరంగాచెప్పే శ్లోకాలూ మనకున్నాయి. బౌధ్ధమతం ధాటిని తట్టుకోవడానికి శంకరాచార్యుడు బ్రాహ్మణ సామాజికవర్గాన్ని శాకాహారులుగా మార్చాడు. బెంగాల్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో దీనికి కొన్ని మినహాయింపులున్నాయి.


కోనసీమ అంబాజీపేటలో పుట్టి హైదరాబాద్ లో స్థిరపడిన  సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గోమహాలక్ష్మి అనే అమ్మాయి అమేరికాలో బావ కమ్ బాయ్ ఫ్రెండ్ తో ఓ రెస్టారెంట్ లో తెలీక గోర్గర్ తింటుంది.  గోర్గర్ అనగా గోవుమాసంతో చేసిన బర్గర్ అనేది రచయిత వివరణ. ఆ విషయం తెలిశాక షాక్ కు గురయ్యి  కౌ ఫోబియా ఆవరించి తనే ఆవు అయినట్టు వింతగా ప్రవర్తిస్తూ వుంటుంది. కౌంటర్ షాక్  కోసం ఆమెను అంబాజీపేటకు తీసుకుపోతారు. అక్కడ కథ నాటకీయ మలుపులు తిరిగి గోమహాలక్ష్మితోపాటూ పాఠకులకూ జ్ఞానోదయం అవుతుంది.

గోదావరినది సముద్రంలో కలిసేచోట ఆ చిత్తడి నేలల్లో వింత లవణాలు ఏవో ఉత్పన్నం అవుతాయని చెప్పుకుంటారు. వాటి ప్రభావంవల్ల కామోసు అక్కడి రచయితల కలాలు అసమదీయుల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ అలరిస్తుంటాయి. తసమదీయుల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి.  గోధనం నవల ఆద్యంతం సతీషచందర్ మార్కు హాస్యమూ, వ్యంగ్యమూ, కారమూ, వెటకారమూ, అనేక విషయాల పరిజ్ఞానమూ పంచుకుంటూ సాగుతుంది. రూపంలో హాస్య నవలగా కనిపించినప్పటికీ “మేం ఆవకాయతో అన్నం తింటన్నా ఆల్లకి ఆవు మాసంతో తింటన్నట్టుంటది” వంటి పదునైన వాక్యాలూ, లూధర్ పాల్ వంటి ఉద్వేగ పాత్రలు నవల చదివేసిన తరువాత కూడా మనల్ని వెంటాడుతాయి.

-        డానీ
మొబైల్ – 9010757776

ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 25 డిసెంబరు 2016
http://epaper.andhrajyothy.com/1047520/Sunday/25.12.2016#dual/28/1


గోధనం
నవల
సతీష్ చందర్
స్మైల్స్ స్మైల్స్ ప్రచురణ, హైదరాబాద్
వెల 75 రూపాయలు

ప్రధాన బుక్ షాపులు అన్నింటిలోనూ దొరుకును

Thursday 8 December 2016

Ranga Is No Way Connected With Kapu Mahanadu

కాపుమహానాడుతో రంగాకు సంబంధంలేదు.  

వంగవీటి సోదరులు కాపు సామాజికవర్గానికి చెందిన వారయినప్పటికీ  వాళ్లను కాపు నాయకులు అనడం సరికాదు. రాధా అనుచరుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. రంగా కొలువులో కూడా బ్రాహ్మణులు, దళితులు, బీసీలు, ముస్లింలు, క్రైస్తవులతోపాటూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కూడా అనేకులు వుండేవారు. 1985 ఎన్నికల్లో రంగాకూ, 1989, 1994 ఎన్నికల్లో రత్నకుమారికీ చీఫ్ పోలింగ్ ఏజెంట్‍ గా వున్న ఏకే అన్సారీ ముస్లిం. అంతేగాక, రంగాకు రాజకీయసలహాదారు కాట్రగడ్డ రాజగోపాలరావు, న్యాయసలహాదారు కర్ణాటి రామ్మోహన రావు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. రంగా హత్యానంతరం ఆయన భార్య రత్నకుమారికి కూడా కాట్రగడ్డ రాజగోపాలరావు  రాజకీయ గురువుగానే వున్నారు. 


అంతకు ముందు టిడిపి మహానాడు జరిపిన కృష్ణా నది గర్భంలోనే 1988 జులై రెండవ వారంలో కాపుమహానాడు నిర్వహించారు. అయితే ఆ సభను నిర్వహించింది వంగవీటి రంగా కాదు. అప్పుడు ఆయన ఒక హత్యకేసులో నిందితునిగా విజయవాడ సబ్ జైల్లో వున్నారు. రంగాను కాపు నాయకునిగా ప్రచారం చేసింది బందరుకు చెందిన చిలంకుర్తి వీరాసామీ అంబులు, మిరియాల వెంకట రావు, ముద్రగడ పద్మనాభం. ఈ జాబితాలో దాసరి నారాయణ రావుని కూడా చేర్చవచ్చు. ఇలాంటి ప్రచారంవల్ల రంగాకు మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది. కాపు మహానాడు నిర్వహించడంవల్ల రంగా శిబిరంలోని ఇతర సామాజికవర్గాలు ఒకరకం సంధిగ్ధంలో పడిపోయాయి. ఈ పరిణామాలు రంగాను సామాజికంగా ఒంటరివాడిని చేసేశాయి. వాటి ఫలితాలు ఏమిటో  చరిత్ర చెప్పేసింది.  

Wednesday 7 December 2016

Objective Conditions, Subjective Concerns & The Descriptive Account Of History

Objective Conditions, Subjective Concerns & The Descriptive Account Of History
-     డానీ
Danny
6 Dec 2016

ప్రతి చారిత్రక సందర్భంలోనూ అనివార్యంగా రెండు అంశాలుంటాయి. మొదటిది, అప్పటి వస్తుగత సామాజిక పరిస్థితి (Objective Conditions). రెండోది; కీలక వ్యక్తుల వ్యక్తిగత అభిష్టాలు  (Subjective Efforts). మార్క్సిస్టులు అప్పటి సామాజిక వస్తుగత పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తుల అభిష్టాలకు  తక్కువ ప్రాధాన్యతనిస్తారు. “అప్పుడు కాలం కడుపుతో వుంది కార్ల్ మార్క్స్ ను కనింది” అన్నాడు మయకోవిస్కీ. అంతేగానీ కార్ల్ మార్క్స్ కాలాన్ని కన్నాడు అనలేదు.

ఆర్ధికరంగం ద్వార, అందులోనూ ఉత్పత్తి విధానాల ద్వార, పనిముట్ల ద్వార మరీ ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాల ద్వార చారిత్రక దశను వివరించడం మార్క్సిస్టులు అవలంభించే పధ్ధతి. అలాకాకుండా కొందరు వ్యక్తులే చరిత్రను నడిపినట్లు రాయడం మరో పధ్ధతి. వ్యక్తులు, వాళ్ళ కార్యాచరణను వర్ణిస్తే చదవడానికి చాలా బాగుంటుంది. సాధారణ చరిత్రకారులు, రచయితలు, పాత్రికేయులు ఈ విధానాన్నే అనుసరిస్తుంటారు. కానీ, ఇందులో శాస్త్రీయ దృష్టి లోపిస్తుంటుంది. వస్తుగత సమాజం, బాహ్యాత్మక పరిస్థితుల వివరణ శాస్త్రీయమైనదేగానీ దానికి పెద్దగా పఠనాసక్తి వుండదు. ఈ రెండు విధానాల మేలు కలయికగా Descriptive account of history అంటూ ఓ మిశ్రమ మార్గముంది. పఠనాసక్తిని కలిగించడానికి కీలక సంఘటనల్ని వివరంగా వర్ణించాలి. శాస్త్రీయ కోణం తప్పిపోకుండా  ఆ వివరాలూ ఇస్తూ వుండాలి.  నేను అలాంటి శైలిని ఇష్టపడతాను. ఇందులో వున్న సౌలభ్యం ఏమంటే పఠనాసక్తీ వుంటుంది; శాస్త్రీయ కోణమూ తప్పిపోదు.

చరిత్ర అంటే గతానికి సంబంధించిన వ్యవహారం అని ఎవరయినా అనుకుంటూవుంటే వాళ్ళకు ఆ రంగానికి సంబంధించి ఓనమాలు కూడా తెలియవని అర్ధం. సమస్య ఎక్కడ వస్తుందంటే చరిత్ర అనేది ఎన్నడూ గతం కాదు.  నిజానికి చరిత్ర వర్తమానం కూడా కాదు. చరిత్ర రచన అనేది మానవ సమూహాలకు భవిష్యత్తు ప్రణాళిక. అంచేత తమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చరిత్రను  తిరగరాయాలని సమాజంలోని మానవసమూహాలన్నీ తపిస్తుంటాయి. చాలా మందికి గతంలో ఏం జరిగిందన్నది ఎంత మాత్రం ముఖ్యంకాదు; ఏం జరిగిందని చెప్పుకుంటే భవిష్యత్తులో తమకు ప్రయోజనకరంగా  వుంటుందన్నది ముఖ్యం.

ద్రావిడులు భారత ఉపఖండపు ఆదివాసులు అనడం ఒకరకం రాజకీయం. ఆర్యులు బయటి నుండి వచ్చినవారు అనడం ఇంకోరకం రాజకీయం. ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే   బయటి నుండి వచ్చారనడం మరో రకం రాజకీయం.  ద్రావిడులకన్నా ముందే ఇక్కడ ఆదివాసులు వున్నారనడం కూడా మరో రకం రాజకీయం.

చరిత్ర రచన అనేది ఒక విధంగా  న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పండం లాంటిది.  ఏ సాక్షీ కూడా న్యాయమూర్తి ముందు తనకు తెలిసింది తెలిసినట్టు చెప్పడు. న్యాయమూర్తి నుండి తాను ఆశించే తీర్పుకు అనుగుణమైన వ్యాఖ్యానాలతో మాత్రమే సాక్ష్యం చెపుతాడు. వాది పక్షాన సాక్షిగ వస్తే నేరతీవ్రతను పెంచి సాక్ష్యం చెపుతాడు. ప్రతివాది పక్షాన సాక్షిగ వస్తే నేరతీవ్రతను తగ్గించి సాక్ష్యం చెపుతాడు.

అతిగా ప్రచారం అయినట్టు విజయవాడ అల్లర్లు అనేవి కమ్మ-కాపు వైరమూ కాదు;  వంగవీటి- దేవినేని కుటుంబాల రాజకీయ శతృత్వమూకాదు. ఇవన్నీ బయటికి కనిపిస్తున్న కొన్ని అంశాలు మాత్రమే. పది లక్షల జనాభాగల అప్పటి  విజయవాడలో దేవినేని నెహ్రు, వంగవీటి రంగా అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళిద్దరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, వాళ్ళకు బయట, వాళ్ళకన్నా  ప్రభావశీలంగా చరిత్రగతిని తిప్పగలవాళ్ళు  9,99,998 మంది విజయవాడలో వున్నారని గుర్తించడం ముఖ్యం.

రంగాహత్య తరువాత చెలరేగిన అల్లర్ల హోరు ఢిల్లీ వరకేకాదు లండన్ వరకూ వినిపించింది. అక్కడి ఆర్ధిక విశేషకులు ఇక్కడి కుల తగవుల్నీ, రాజకీయ కక్షల్నీ అసలు పట్టించుకోనేలేదు. విజయవాడలొని 130 మురికివాడల్లో నివశిస్తున్న దాదాపు ఐదు  లక్షలమంది  జనమే దీనికి కారణమని వాళ్ళు భావించారు. కొత్త ధనికవర్గపు సంపద ప్రదర్శన మీద పేదవర్గాలు చేసిన దాడి అంటూ తేల్చాయి.  


వెంటనే Overseas Development Authority  అనే బ్రిటీష్  సేవాసంస్థ విజయవాడకు వచ్చి మురికివాడల్ని అభివృధ్ధిచేసే పని మొదలెట్టింది. ముందు చూపుతో విశాఖపట్నం తదితర నగరాల్లోని మురికివాడల్లోనూ ఈ  ప్రాజెక్టును చేపట్టారు. మురికివాడల ప్రజల్లో మధ్యతరగతి ఆశలు రేపి వాళ్ళను శాంతింపజేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అప్పటి ఓడియే ప్రాజెక్టు కమీషనర్ ఆదిత్యనాధ్ దాస్ తరచుగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుభట్టీల సెంటరులోని దాసరి రమణ నగర్ కు వచ్చి పనుల్ని పరిశీలించేవారు. విజయవాడ మొత్తంలో క్రమబధ్ధంగా నిర్మించిన మురికివాడ అదొక్కటే. పైన్నుండి వచ్చే అధికారుల్ని, పరిశీలకుల్ని ఆదిత్యనాధ్ దాస్ ముందుగా ఆ పేటకే  తీసుకువచ్చేవారు.  ఈ క్రమంతో నాకున్న ప్రధాన అనుబంధం ఏమంటే దాసరి రమణనగర్ మురికివాడకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడ్ని.



అప్పట్లో విజయవాడలో విజృంభించిన కొత్త ధనికవర్గాన్నీ (neo rich), అది ముందుకు తీసుకువచ్చిన ధనప్రదర్శన సంస్కృతినీ అర్ధం చేసుకోకుండా వాటికి అనివార్యమైన పరిణామంగా సంభవించిన విజయవాడ అల్లర్లనూ ఎప్పటికీ అర్ధం చేసుకోలేం. అప్పట్లో రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించేది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణ నేపథ్యంలో ఇప్పుడు అక్కడి రియల్ ఎస్టేట్ అరవై పువ్వులు ఆరువేల కాయలుగా  వికసిస్తోంది. వీధికో నాలుగు ఆడీ, బెంజి, బియండబ్ల్యూ కార్లు కనిపిస్తున్నాయి. మరోవైపు స్వంతఇళ్ళు లేని జీవులు అద్దెలు కట్టుకోలేక అప్పుల పాలవుతున్నారు. విజయవాడలో మరోమారు అల్లర్లు జరిగే ప్రమాదాన్ని గుర్తించి వాటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం వివేకవంతుల కర్తవ్యం. 

People are the real writers of History

ప్రజల అభిష్టమే చరిత్ర
వ్యక్తుల రాగద్వేషాలు చరిత్రకాదు

-        డానీ
People are the real writers of History

History Made Easy
చరిత్రను మనం కీలక వ్యక్తుల చర్యల ద్వారా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కొంచెం సులభంగానూ, వినోదంగానూ వుంటుంది. సినిమా కథలకూ బాగుంటుంది.  అగ్నిదేవుని అజీర్తిని పోగొట్టడానికి  ఖాండవ దహనం చేయమంటాడు  శ్రీకృష్ణుడు. నాగరీకులు వచ్చి ఆదివాసుల సంహారం సాగించారని మనకు ఎప్పటికి అర్ధం కావాలీ?

వీధుల్లో కులపోరాటాలు జరగలేదు
విజయవాడ అల్లర్లలో కమ్మ-కాపు సామాజికవర్గాలు రోడ్ల మీదకు వచ్చి కలబడలేదు. అల్లర్ల సందర్భంగా ఒకే ఒక హత్య జరిగింది. దానికి కూడా కులం కారణం కాదు. స్థానిక తగవులు కారణం. రంగా అనుచరులు కొన్ని వాణిజ్యసంస్థల మీద కులం దృష్టితో దాడులు జరిపారుగానీ మొత్తం దాడుల్లో వాటి సంఖ్య చాలాచాలా తక్కువ.

పేద ప్రజల అసహనం ఆక్రోసంగా మారింది
మొత్తం అల్లర్లని మురికిపేటల జనం ఎలాంటి ముందస్తు  ప్రణాళికలేకుండా, ఒక నాయకుడు లేకుండా, ప్రాప్తకాలజ్ఞతతో జరిపేశారు. తమ ఇళ్ళస్థలాలని క్రమబద్దీకరించే ప్రక్రియను నగరంలోని ధనవంతులు అడ్డుపడుతున్నారనీ, తమ ఇళ్ళ పట్టాల కోసం పోరాడుతున్నందుకే రంగాను చంపేశారనే సంకేతం మురికివాడల్లోనికి బలంగా వెళ్ళింది. వాళ్లలోని  అసహనం ఆక్రోసంగా మారింది. 

హత్యా స్థలం నిర్మానుష్యంగా వుంది
కులమే ప్రధాన కారణం అయితే రంగా చివరి నిరాహార దీక్ష శిబిరం మరోలా వుండేది. బహుశ కాపు జనసముద్రంలో మునిగిపోయి వుండేదేమో. కానీ, అలా జరగలేదు. రంగా హత్య జరిగే సమయంలో శిబిరం దాదాపు నిర్మానుష్యంగా వుంది. శిబిరం దగ్గర రోజూ పెద్ద సంఖ్యలో వుండే  దళితులు, క్రైస్తవులు ఆ రాత్రి క్రిస్మస్ ప్రార్ధనల్లో వున్నారు. హత్య కు ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా తక్కువ మంది వున్నారు. వాళ్ళు కూడా మీడియా ముందు, న్యాయస్థానాల్లో తలో కథనాలు చెప్పారు.


రాజకీయ కోణం అదో భ్రమ

ఇక రాజకీయం అంటారా? రంగాకు తెలుగుదేశంలోనేకాదు కాంగ్రెస్ లోనూ గట్టి ప్రత్యర్ధులు  వుండేవారు. విజయవాడలో జీయస్ రాజు, హైదరాబాద్ లో జలగం వెంగళరావు కూడా ఆయన ప్రత్యర్ధులు. అప్పటి  హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారం కొందరు పోలీసు అధికారుల ద్వార తన భర్తను హత్య చేయించారనేది రంగా భార్య రత్నకుమారి చేసిన ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి యన్టీ రామారావును ప్రధాన నిందితునిగా పేర్కొనాలని కూడా వారు కోరారు.   రంగా హత్య జరిగిన ఏడేళ్ళ తరువాత వారే స్వయంగా కాంగ్రెస్ ను వదిలి చంద్రబాబు నాయకత్వంలోని  తెలుగుదేశంలో చేరారు. దానికి ప్రతిచర్యగా అన్నట్టు దేవినేని నెహ్రు టిడిపిని వదిలి కాంగ్రెస్‍ లో చేరారు. అంచేత అది రాజకీయ కక్షలు అనడానికి కూడా లేదు.  

హత్యకు పెట్టిన ముహూరర్తమే సాక్ష్యం!

రంగా హత్య క్రిస్మస్ మరునాడు డిసెంబరు 26 తెల్లవారు జామున జరిగింది. హంతకులు ఇలాంటి ముహూర్తాన్ని ఎంచుకోవడానికి ఒక తర్కం కూడా వుంది. అర్ధరాత్రి వరకు  చర్చీల్లో ప్రతేక  ప్రార్ధనలు  జరుపుకున్న జనం  తెల్లవారు ఝామున గాఢ నిద్రలో వుంటారు కనుక హత్యకు పెద్దగా ఆటంకం వుండదనేది ఇందులోవున్న తర్కం. అంతవరకూ బాగానేవుందిగానీ క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ప్రార్ధనలు జరిపి తెల్లవారుజామున  గాఢనిద్రలోనికి జారుకునే జనం ఎవరూ? వాళ్ళు క్రైస్తవులు, దళితులు అయ్యుంటారుగానీ కాపు సామాజికవర్గం కాదుకదా?. ఈ దాడికి ముహూర్తం పెట్టినవాళ్ళు  చాలా తెలివిగా మురికివాడల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పథక రచన చేశారు. వాళ్ళ లక్ష్యం రంగాయేగానీ కాపులు కాదు. ఈ సూక్ష్మాన్ని  మేధావులకన్నా మురికివాడల ప్రజలే బాగా అర్ధం చేసుకున్నారు. 

8-12-2016


Saturday 3 December 2016

Vangaveeti Brothers

వంగవీటి సోదరులు
-        డానీ

(ఈ వ్యాసాన్ని ఇతర పత్రికలు ఏవీ ప్రచురించవు అనే ఉద్దేశ్యంతో నేరుగా Facebook లో పెడుతున్నాను.)


నేను విజయవాడకు మకాం మారడానికి ముందే వంగవీటి సోదరులు రాధా-రంగాలతో  స్వల్ప పరిచయం వుంది.

విజయవాడ బిసెంట్ రోడ్డు సెంటర్ లోని మోహన్ ఫ్యాన్సీ ఎంపోరియం భాగస్వామి యర్రంశెట్టి మోహనరావుగారు చిన్నప్పుడు  నరసాపురంలో మానాన్నకు క్లాస్ మేట్. ఆ అనుబంధం వాళ్ళ జీవితకాలం కొనసాగింది.

హత్యకు గురి కావడానికి రెండు నెలల ముందు 1974 అక్టోబరులో వంగవీటి రాధా బృందం అంతర్వేదిలో ఆలయ దర్శనానికి వచ్చారు. నరసాపురం నుండి అంతర్వేదికి లాంచీ ప్రయాణ ఏర్పాట్లు, భోజన వసతి వగయిరాలు మోహనరావుగారు పర్యవేక్షించారు. వంటలు మా ఇంట్లోనే చేయించారు. సాధారణంగా ఇంటికి చుట్టాలు వచ్చినపుడు పిల్లల హడావిడి వుంటుంది. అలాంటి హడావిడి లేకుండా అసలు వాళ్ళెవరో బయటికి తెలియకుండా రహాస్యంగా వుంచడం మాకు కొత్తగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. నేను రాధను చూడడం అదొక్కసారే. ఆయన పొట్టిగా, చామన ఛాయలో వుండేవారు. కొంచెం ముందుకు వంగి కొద్దిగా వూగుతూ నడిచేవాళ్ళు. సన్నిహితులు ఆయన్ని “గూని రాధ” అని ప్రస్తావించేవారు.

 రాధకు రాబిన్ హుడ్ వంటి ఇమేజ్ వుండేది. విజయవాడ కృష్ణలంక ఆయన కార్యక్షేత్రం. అప్పట్లో అది చాలా పెద్ద మురికివాడ.  అక్కడి జనం ఆయన్ని పేదల పాలిటి  పెన్నిధిగా  భావించేవారు.

విజయవాడ రౌడియిజానికి సుదీర్ఘచరిత్ర వుంది. దీని బీజాలు స్వాతంత్రోద్యమ కాలంలోనే పడ్డాయి. కాంగ్రెస్‍ అగ్రనేతలైన టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆచార్య యన్ జీ రంగా, నీలం సంజీవరెడ్డి లకు పార్టీ దిగువ శ్రేణుల్లో వేరువేరు గ్రూపులు వుండేవి. . ఈ విబేధాలకు సామాజికవర్గ  కోణం కూడా వుండేది. బ్రాహ్మణులు ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్యల వెంట వుండేవారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవాళ్ళు రంగా వెంట వుండేవారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవాళ్ళు సంజీవరెడ్డి వర్గంగా వుండేవాళ్ళు. ప్రతివర్గంలోనూ ఇతర కులాలవాళ్ళు కూడా వుండేవారుగానీ వారెప్పుడూ నిర్ణయాత్మక శక్తికాదు.

కాంగ్రెస్‍ ముఠాతగాదాలు అప్పుడప్పుడు హింసాత్మకంగానూ మారేవి. కొన్నిసందర్భాలలో కాంగ్రెస్ నాయకులు తమ ప్రత్యర్ధుల్ని దెబ్బ తీయడానికి  కొందరు రౌడీల సహకారాన్ని కూడా తీసుకునేవారు. ఆ రౌడీలు నగరంలో అక్కడక్కడ వ్యాయామశాలలు నడుపుతూ యువ రౌడీలకు శిక్షణ ఇస్తుండేవారు.

సిధ్ధాంతపరంగా కులాన్ని విస్మరించే కమ్యూనిస్టులకూ సామాజికవర్గ కోణం ఏర్పడింది. కమ్మ సామాజిక వర్గం సాంస్కృతిక వికాసం ఆరంభం దశలో రెండు వ్యూహాలను పాటించింది. సాంస్కృతికంగా బ్రాహ్మణ వ్యతిరేక హేతువాదాన్నీ, రాజకీయంగా కాంగ్రెస్ వ్యతిరేక సామ్యవాదాన్నీ  ఆచరించింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ మీద బ్రాహ్మణ సామాజికవర్గానికి  తిరుగులేని ఆధిపత్యం వున్నకారణంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన రాజకీయ నాయకులు మొదట్లో జస్టీస్ పార్టీ వైపు ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. బ్రాహ్మణ వతిరేకులయిన రెడ్లదీ దాదాపూ అదే చరిత్ర. “కామ్రేడ్ అంటే కమ్మ-రెడ్డి” అనే మాట ఈ నేపథ్యం నుండి పుట్టిందే.  

కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తుండిన 1950లలో విజయవాడ నగరంలోని రౌడీల్ని కూడా వాళ్ళు అదుపుచేశారు. ప్రధానంగా చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్యలు విజయవాడ రౌడీల్ని కర్రలతో కొట్టుకుంటూ నగర శివార్ల వరకూ తరిమేసిన ఉదంతాన్ని పాత కామ్రేడ్లు కథలుకథలుగా చెప్పుకుంటారు.  అప్పట్లో అది కమ్యూనిస్టుల స్వర్ణయుగం. దాని ఫలితంగానే ఇటీవలి కాలం వరకూ విజయవాడ ఎర్రగా వుండగలిగిందంటే  అతిశయోక్తికాదు.

ఎన్నికల్లో పాల్గొనడం మొదలుపెట్టాక కమ్యూనిస్టుపార్టీకీ కాంగ్రెస్ పార్టికి వుండే అవలక్షణాలన్నీ వచ్చేశాయి. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టి 1964లో చీలిన తరువాత ఆ రెండు పార్టీల మధ్య పోటీ పెరిగింది. ఇరువర్గాలూ తమదే పైచేయి అనిపించుకోవడానికి అన్నిరకాల అవలక్షణాల్ని విపరీతంగా ప్రోత్సహించాయి. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలేగాక వడ్డీవ్యాపారులు, సారావ్యాపారులు,  చివరకు వేశ్యాగృహాలు నడిపేవారు సహితం కమ్యూనిస్టు జెండాలు పట్టేసుకున్నారు. వాళ్ళతోపాటూ అతి సహజంగానే ఎర్ర రౌడీలు ఆవిర్భవించారు.  ఈ సందర్భాంగానే చలసాని వెంకట రత్నం పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. కృష్ణలంకకు ఆనుకునివున్న భాస్కరరావుపేట వెంకటరత్నం కార్యక్షేత్రం.  ఎర్రకోట మీద ఎగురవేద్దామని దాచుకున్న ఎర్రజెండాలు సారా పాకల మీద ఎగురుతుంటే  కమ్యూనిస్టు వృధ్ధులు చండ్ర రాజేశ్వర రావు, తమ్మిన పోతరాజు వంటివారు చూడలేక  బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసేవారట.

1969లో నక్సలైటు భావాల ఆవిర్భావంతో విజయవాడ కమ్యూనిస్టు శిబిరంలోనూ కలకలం మొదలయింది. కొందరు యువకులు చలసాని వెంకటరత్నం ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు. అలాంటివాళ్ళలో వంగవీటి రాధ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మొదట్లో వెంకటరత్నం శిష్యునిగా  కమ్యూనిస్టుపార్టీకి చెందిన టాక్సీ డ్రైవర్ల సంఘాల్లో పనిచేసిన రాధా 1970లో నక్సలైట్ రాజకీయల మీద కొంత ఆసక్తి కనపరిచారు. శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో పాల్గొనడానికి విజయవాడ నుండి రైలెక్కి వెళ్ళాల్సిన బృందంలో  దాసరి రమణ, చిత్రకారుడు టీవీ, అరుణ, షేక్ మసూద్ బాబా, కళ్యాణ (బాంబుల) కృష్ణ, కడియాల రాఘవేంద్రరావు తదితరులతోపాటూ వంగవీటి రాధా పేరు కూడా వుంది. ఎందుకో ఆయన చివరి క్షణంలో ఆగిపోయారని అప్పటి సన్నిహితులు అంటారు.

టాక్సీ స్టాండులో రాధా పోటీ సంఘాన్ని పెట్టడంతో గురువు వెంకటరత్నంతో ఘర్షణ పెరిగింది. 1972లో వెంకటరత్నం హత్యతో అది కొత్త మలుపు తిరిగింది. కమ్యూనిస్టు శిబిరంలో మొదలయిన ఘర్షణ కుల ఘర్షణగా మారింది. రాధా కాపు సామాజికవర్గానికీ, వెంకటరత్నం కమ్మ సామాజికవర్గానికీ చెందినవాళ్ళు కావడంతో వెంకటరత్నం హత్యకు కుల కోణం కూడా వచ్చిచేరింది.

రాధ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి  కమ్యూనిస్టు పార్టీయేగాక, కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యాపారవేత్తలు కూడా పథకాలు రచించడం మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో  గన్నవరం సీమపందుల మాసం (బెకన్) ఫ్యాక్టరీ ఆవరణలో ఒకరాత్రి జరిగిన ఒక రహాస్య సమావేశం విజయవాడ  సామాజిక చరిత్రను మలుపు తిప్పింది. 

రౌడీయిజం సిధ్ధాంతాల నుండో, ప్రతీకారాల నుండో పుట్టదు.  వాణిజ్య వ్యాపారాల నుండి పుడుతుంది. పెద్దగా పరిశ్రమలు లేని విజయవాడ ఆర్ధిక జీవితం మొత్తం ఆటోమోబైలు రంగం మీదనే ఆధారపడి వుండేది. లారీలకు ఫైనాన్స్ చేసే సంస్థల అధిపతులు మొండి బకాయిల వసూళ్ళ కోసం కొంతమంది యువకుల్ని పెంచిపోషించేవాళ్ళు. వాళ్ళే కొత్తతరం రౌడీలుగా మారారు. వాళ్ల అనుచరులే తరువాతి కాలంలో  బ్యాంకుల రికవరీ టీంలుగా మారారు. 

ఫైనాన్స్ రంగం  నిర్వహణలో అంతర్గతంగా ఒక సామాజిక నియమం పనిచేస్తూ వుంటుంది. స్థానిక ఆధిపత్య కులానికి చెందినవాళ్ళు ఫైనాన్షియర్లుగా వుంటారు. ద్వీతీయ ఆధిపత్య సామాజికవర్గానికి చెందినవాళ్ళు రికవరీ టీమ్ సభ్యులుగా వుంటారు. ఇదంతా అచ్చంగా తెలుగు సినిమారంగంలో సామాజికవర్గాల సమీకరణల్ని పోలి వుంటుంది. చిరంజీవి వచ్చే వరకు తెలుగు సినీహీరోలు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. యస్వీ రంగారావు మొదలుకుని ఆర్ నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణ వరకు   తెలుగు సినిమా విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కొన్ని సందర్భాల్లో ఆధిపత్య సామాజికవర్గానికి చెందినవాళ్ళు కూడా రౌడీలుగా వుంటారుగానీ వాళ్ళు సహజంగానే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కుంటుంబాల నుండి వచ్చినవారై వుంటారు.

చురుగ్గా వున్నాడని మొదట్లో రాధను చేరదీసి ప్రోత్సహించి రౌడీగా మార్చింది ఫైనాన్షియర్లే. రాధ బృందంలో  ఆయన తమ్ముడు వంగవీటి మోహనరంగాతోపాటూ, దేవినేని రాజశేఖర్ నెహ్రు అన్న దేవినేని గాంధీ కూడా వుండేవారు. ఆరోజుల్లో వాళ్ల మధ్య  ఆర్ధిక ఐక్యతే కొనసాగుతూ వుండేది.  కుల స్పృహ అప్పటికి మొదలు కాలేదు.

విజయవాడలో గతకాలపు రౌడీలు కసరత్తులు చేసి పెంచిన కండల్ని  ప్రదర్శించుకుంటూ మొరటుగా, కటువుగా వుండేవాళ్ళట. వాళ్ళ కాస్ట్యూమ్ 1970లలో ఒక్కసారిగా మారిపోయింది.  తెల్లటి షర్టు, తెల్లటి ప్యాంటు, కాళ్ళకు తెల్లటి చెప్పులు, నడుముకు తెల్ల బెల్టులు వేసుకోవడం మొదలెట్టారు. మనుషులతో చాలా ఆప్యాయంగా, కొండొకచో వినయంగానూ మాట్లాడేవారు. చూడ్డానికి ‘రాముడు మంచిబాలుడు’ అన్నట్టు వుండేవారు. ఈ కొత్త ప్యాట్రన్ వంగవీటి రాధాతో మొదలయిందో, చలసాని వెంకటరత్నంతోనే మొదలయ్యిందో పరిశోధించాల్సివుంది. పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులు కావడాన కూడా వాళ్ళ అహర్యం అలా మారివుండవచ్చు. 

నైతిక రంగంలోనూ విజయవాడ రౌడీలు కొన్ని విలువల్ని పాటించేవారు. టీతాగరు. మందు కొట్టరు. చాలామందికి సిగరెట్ అలవాటు కూడా లేదు. పాలు తాగుతారు. వక్కపొడి కూడా తినరు. అప్పుడప్పుడు జీడిపప్పు తింటారు. అమ్మాయిల జోలికి వెళ్ళరు. అందుకే కావచ్చు విజయవాడ రౌడీలను  అమ్మాయిలు ఇష్టపడేవారు. వాళ్ళలో కొందరివి  ప్రేమ వివాహాలు కావడంలో ఆశ్చర్యం ఏమీలేదు. రౌడీల్లో ఇలాంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం దాదాపు గత శతాబ్దం ముగింపు వరకూ కొనసాగింది.