Saturday 29 June 2013

Folk Element in Cinema

జానపదమే హిట్ ఫార్మూలా
.యం. ఖాన్యజ్దానీ (డానీ)
1
          సినిమాకు కథ గుండెకాయ లాంటిదైతే, జానపద అంశ (ఫోక్ఎలిమెంట్‌) వెన్నెముక లాంటిది. మానవ జాతి తొలినాళ్లలో ఏర్పరచుకున్న నీతి, నియమాలు, విలువల్ని జానపద సాహిత్యం ప్రతిబింబిస్తుంది. చరిత్ర క్రమంలో, సమాజం ఎన్ని మార్పులకు గురైనా ప్రాధమిక విలువలు దాదాపు యధాతధంగా కొనసాగుతుంటాయి. విలువల్ని ఉల్లంఘించేవారు సహితం విలువల్ని గౌరవించడం మనుషులకు ఒక విశేష లక్షణం. అబధ్ధాలకోరులు, తాగుబోతులు, దొంగలు, వృత్తి వ్యభిచారులు  సహితం  వాటిని ఒక విలువగా చెప్పుకోలేరుఅందువల్ల, విలువల్ని ప్రభోదించే, పురాణాలు, జానపద సాహిత్యమంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. వాటిది  ఎప్పటికీ తరగని క్రేజ్‌! కారణంచేతనే, పురాణ సాహిత్యాన్ని మానవజాతి బాల్యం అన్నవారూ వున్నారు!

          జానపద అంశ లేకుండా కథను జనంలోనికి జొప్పించడం, ఒప్పించడం, మెప్పించడం అంత సులువుకాదు. సంస్కృతీ సాంప్రదాయాలకు ఎక్కవ ప్రాధాన్యమిచ్చే, భారత ప్రేక్షకుల్ని మెప్పించాలంటే జానపద అంశ మరీ అవసరంటాలివుడ్‌, బాలివుడ్లోనేకాదు, హాలివుడ్లో సహితం నియమమే  పనిచేస్తుంది

          భారతీయ సినిమా బ్లాక్బస్టర్అనగానే ఎవరికైనా ముఫ్ఫయి ఆరేళ్లనాటి షోలే గుర్తుకు వస్తుంది.   హాలివుడ్బ్లాక్బస్టర్అనగానే రెండేళ్ల క్రితం వచ్చిన అవతార్గుర్తుకు వస్తుంది. రెండు సినిమాలు ఇంతగా ప్రేక్షకాదరణ పొందడానికి వీటిల్లోని జానపద అంశమే ప్రధాన కారణం అంటే అతిశయోక్తికాదు. ఇంకో విచిత్రం ఏమంటేబాలివుడ్‌, హాలివుడ్సూపర్బ్లాక్బస్టర్స్రెండింటి కథలకూ  మూలం రామాయణమే.
2
          ’తాటకీ సంహారమూఅనే కథను పది వాక్యాల్లో రాయమంటే ఎవరైనా ఏం రాస్తారూ
1. అడవిలో విశ్వామిత్రుని యాగాన్ని తాటకి అనే రాక్షసి  పాడుచేస్తూ వుంటుంది.
2. విశ్వామిత్రుడు రుషి కనుక తనంతటతాను తాటకిని చంపలేడు.
3. విశ్వామిత్రుడు రాజధానికి వెళ్ళి దశరధుని సహాయం కోరుతాడు .
4. కోరినంత సైన్యాన్ని అడవికి పంపిస్తానంటాడు దశరధుడు.
5. రామలక్ష్మణుల్ని తనవెంట పంపమంటాడు  విశ్వామిత్రుడు.
6. సైన్యంవల్లకానిది ఇద్దరు పసిబాలురు చేస్తారా అని సదేహం వస్తుంది రాజుకి.
7. తనకు రామలక్ష్మణులే కావాలని పట్టుబడతాడు విశ్వామిత్రుడు.
8. విశ్వామిత్రుని వెంటవెళ్ళిన  రామలక్ష్మణులు అడవిలో తాటికను సంహరిస్తారు.
9. రాక్షసులబారినుండి సాధువుల్ని రక్షించి, లోకకళ్యాణాన్నీ  సాధిస్తాడు రాముడు.
10. అయోధ్యకు తిరిగివస్తూ , స్వయంవరంలో సీతను పెళ్ళాడుతాడు రాముడు.

తాటకీ సంహారంకథని తీసుకుని దాన్నిగబ్బర్సంహారంగా మార్చేశారు  షోలే స్కిప్టు రైటర్స్సలీమ్ఖాన్‌- జావేద్అఖ్తర్‌. వాళ్లగబ్బర్సంహారంకథ ఇలా సాగుతుంది?
3
1. చంబల్లో ఠాకూర్కుటుంబాన్ని గబ్బర్అనే బందిపోటు హతమారుస్తాడు.
2. ఠాకూర్‌  అవిటివాడు కనుక గబ్బర్ను తానంతటతానుగా అంతంచేయలేడు.
3. నగరానికి వెళ్ళి పోలీసాఫీసరైన  పాతమిత్రుడ్ని సహాయం కోరుతాడు ఠాకూర్‌.
4. కావాలంటే పోలీసు బెటాలియన్ని పంపిస్తానంటాడు పోలీసాఫీసర్‌.
5. తన పనికి  వీరూ, జై అనే ఇద్దరు దొంగలు కావాలంటాడు ఠాకూర్
6. పోలీసులు చేయలేని దాన్ని ఇద్దరుదొంగలు ఎలా చేస్తారని ఆఫీసరు సందేహం
7. గబ్బర్ను చంపడానికి వీరూ, జై లే కావాలని పట్టుబడతాడు ఠాకూర్‌.
8. ఠాకూర్కోరికమేరకు చంబల్లోయలో గబ్బర్ను చంపుతారు వీరూ, జయ్‌.
9. ఠాకూర్పగ తీరడంతోపాటూ రామ్గడ్వాసులకు గబ్బర్పీడ వదులుతుంది.
10. రామ్గఢ్లో  బసంతిని పెళ్ళిచేసుకుని నగరానికి తిరిగి వస్తాడు వీరు.

పురాణాలన్నీ ఒక్కటే
అకిరా కురసోవా సినిమాసెవెన్సమురాయ్స్‌’ ను ప్రేరణగా తీసుకుని షోలే కథ  రాశారనే మాట కూడా వుందిసెవెన్సమురాయ్స్కథలో కూడా జానపద అంశంమే ప్రాణం. అంతమాత్రాన, అకిరా కురసోవా కథని కఛ్ఛితంగాతాటకి సంహారంనుండి తీసుకున్నాడని చెప్పాల్సినపనిలేదు. ప్రాధమిక మానవ విలువల్ని ప్రభోదించడమే జానపద సాహిత్య కర్తవ్యం కనుక  అన్ని దేశాల, అన్ని భాషల జానపద సాహిత్యాల్లో అనేక సారుప్యాలు, పోలికలు కనిపిస్తాయి. దుర్మార్గుడు మంచివాడి భార్యను ఎత్తుకుపోవడం, సముద్రపులంకలో ఆమెను బంధించడం, ఆమె బంధుగణం సముద్రందాటి, యుధ్ధంచేసిఆమెను రక్షించడం వంటి సన్నివేశాలు మనకు గ్రీకు పురాణాల్లోనూ కనిపిస్తాయి.

4
రాముడు-కృష్ణుడు
అడవుల్లోని ఆదివాసి సమాజానికీ, మైదాన ప్రాంతాల్లోని నాగరీక సమాజానికి మధ్య నిరంతరం ఒక విధమైన వైరం సాగుతూ వుంటుంది. నాగరీకక సమాజపు అధికారాన్నీ, చట్టాలనీ ఆదివాసులు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వుంటారు. వైరం గురించి పురాణాలు, జానపద సాహిత్యాల్లో సహితం అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి. సర్పయాగాలు, ఆర్యులు నాగజాతితో చేసిన యుధ్ధాలు, ఖాండవ దహనం వంటివి వీటికి కొన్ని ఉదాహరణలు. మరోవైపు, నాగరీక సమాజానికి చెందిన రాజులు అదివాసీ స్త్రీలని పెళ్ళాడి, జాతులతో సంధి చేసుకున్న  సంఘటనలు కూడా మనకు అనేకం కనిపిస్తాయి. బకాసురుని చెల్లెల్ని భీముడు, వనకన్య ఉలూచిని అర్జునుడు, జాంబవంతుని కూతుర్ని శ్రీకృష్ణుడు పెళ్ళిచేసుకున్నట్టు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. పురాణపురుషుడు శ్రీరాముడు  వనవాసకాలంలో  ఆదివాసుల సమస్యల్ని పరిష్కరించి, వాళ్లను తన భక్తులుగా మార్చుకున్నట్టు, చివరకు వానరసైన్యంతోనే లంకను జయించినట్టు రామాయణంలో కనిపిస్తుంది. శ్రీరాముడు నైతికంగా ఏకపత్నీవ్రతుడు కనుక ఆదివాసి స్త్రీని పెళ్ళిచేసుకునే ప్రసక్తేలేదుఅయితే, పురాణాల ప్రకారం, శ్రీరామునికి కొనసాగింపే శ్రీకృష్ణడు కనుక; శ్రీరాముని పోరాటం, శ్రీకృష్ణుడు జాంబవతిల  వివాహం కలిపితే (మిక్స్చేస్తే) అవతార్హీరో ఆవిర్భవిస్తాడు. దండకారణ్యంపండారాగ్రహంగా మారిఓతుంది. వానరుల తోకలు, నీలంరంగు మనుషులు, చివరకు అవతార్అనే సినిమా టైటిల్ను కూడా జేమ్స్కామెరూన్రామాయణ మహాభారతాల నుండి ఎత్తేశాడుఇంతటి బలమైన జానపద అంశం వుండబట్టే, అవతార్సినిమా ప్రపంచ ప్రేక్షకుల్ని అంతలా ఆకర్షించింది.

జనపద సాహిత్య ప్రభావం ఆఫ్రో- ఆసియన్దేశాల్లో

అల్లావుద్దీన్‌- టెర్మినేటర్‌ - టూ
జేమ్స్కామెరూన్కు ఫోక్కంటెంట్‌  మీద చాలా లోతైన అవగాహన వుందనే విషయం అతని ఇతర సినిమాలను చూసినా అర్ధం అవుతుంది. దానికి మరో మంచి ఉదాహరణ టెర్మినేటర్‌ - టూ, డే ఆఫ్జడ్జిమెంట్‌. కథని అరేబియన్నైట్స్లోనిఅల్లావుద్దీన్అద్భుతదీపంనుండి తీసుకున్నారు. జానపద జిన్పాత్రకాస్తా, టెర్మినేటర్‌ - టూలో   ఆర్నాల్డ్ష్వాజ్నెగ్గర్గా ఎలా మారాడో  చూద్దాం.

5

1. అల్లావుద్దీన్చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు.
          జాన్కానర్తండ్రి చనిపోయాడు; తల్లి పిచ్చాసుపత్రిలో వుంది.
2. అల్లావుద్దీన్‌  అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు.
          జాన్తన తల్లి స్నేహితురాలింట్లో పెరుగుతున్నాడు.
3. అల్లావుద్దీన్కు ఆటలమీదతప్పా పనీపాటల మీద శ్రధ్ధలేదు.
          జాన్కు కంప్యూటర్గేమ్స్మీదతప్పా చదువుమీద శ్రధ్ధలేదు.
4. ఓరోజు అల్లావుద్దీన్ సమద్రపు ఒడ్డున దొరికిన దీపాన్ని రుద్దితే భూతం ప్రత్యక్షమయ్యింది.
          ఓరోజు జాన్ ను పోలీసులు తరుముతూంటే, కాపాడడానికి జిన్లాంటి భారీకాయుడు ప్రత్యక్షమయ్యడు.
5. నువ్వే నా యజమాని, ఇక నువ్వు చెప్పిందల్లా చేయడమే నాపని అన్నాడు జిన్‌.
          నువ్వే నన్ను సృష్టించావు. నిన్ను కాపాడడమే నా పని అన్నాడు భారీకాయం.
6. తరువాత అల్లావుద్దీన్జీవితం మారిపోయింది. అతను రాజ్యంలోనే గొప్పవాడైపోయాడు.
          తరువాత జాన్కానర్‌  అణుయుధ్ధం నుండి ప్రపంచాన్ని కాపాడే సైంటిస్టు అయ్యాడు.

మొత్తం కథలు డజనున్నరే!
          చెట్టుకు ఉత్త మాను మాత్రమే ఉంటే అది గడకర్రలాగో, దుంగలాగో వుంటుంది. మానుకి కొమ్మలు, కొమ్మలకు ఉపకొమ్మలు, వాటికి ఆకులు, పువ్వులు, కాయలూ ఉండాలి. ప్రతికొమ్మ నుండి వచ్చే ఊడలు భూమిలో బలంగా నాటుకుపోవాలి. అప్పుడే బలంగానూ, అందంగానూ వుండే మర్రిచెట్టు తయారవుతుందికథ కూడ అంతే. కేవలం జానపథ అంశ వుంటే సరిపోదు. అంశాన్ని వివరించడానికి అనేక పర్వాల్ని సృష్టించాలిమనిషి శరీరంలో ఆస్థిపంజరమే లేకపోతే మిగిలిన అవయవాలకు అస్థిత్వమేలేదు. అలాగే, సజీవ అవయవాలు లేకపోతే అస్థిపంజరానికి సార్ధకతే లేదు. కథలో జానపద ఆంశ అస్థిపంజరమే అయితే దాని ట్రీట్మెంట్సజీవ   అవయవాలు వంటివి.

6

          మనుషులందరి శరీరనిర్మాణం దాదాపు ఒకేలా వుంటుంది. మరీ శరీరధర్మ శాస్త్రవేత్తలయితే, ప్రపంచవ్యాప్తంగా డజనో, డజనున్నరో  రకాల ఆదిమానవ జాతులు వున్నాయని అంటుంటారు. నీగ్రోలాయిడ్‌, ఆస్ట్రోలాయిడ్‌, పెకింగ్కేవ్మ్యాన్‌, రామా పితికస్వంటివి అన్నమాట. వాటిమీద ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా  కొన్ని వందల కోట్ల జనాభా వర్ధిల్లుతుంటుంది. శరీరనిర్మాణం ఒకటైనంత మాత్రాన మనుషులందరూ ఒక్కలాగే వుండరుప్రతిమనిషి స్వరూపంలోనూ, స్వభావంలోనూ తనదైన వైవిధ్యం వుంటుందిసృజనాత్మక రచన కూడా అంతే, ప్రపంచవ్యాప్తంగావున్న జానపద సాహిత్యాన్ని పరిశీలిస్తే, డజనో, డజనున్నరో  మూల కథలుమాత్రమే కనిపిస్తాయి. వాటిని పునాదిగా చేసుకుని కొన్ని వేల, లక్షల కథలు పుట్టుకొస్తాయి. మూలకథను తీసుకుని  కొత్త వాతావరణంలో, కొత్త పాత్రల మధ్య, వైవిధ్యపూరితంగా, సృజనాత్మకంగా చెప్పడమే రచయితల నైపుణ్యంఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, అస్థిపంజరమే లేకుంటే మనిషి కుప్పకూలిపోయినట్టు, జానపద అంశాన్ని మర్చిపోతే మొత్తం కథ కుప్పకూలిపోతుంది.

పురాణస్థాయి
          మనుషులకు అనేకానేక భావోద్వేగాలుంటాయి. ఒక్కోసందర్భంలో ఒక్కో భావోద్వేగం బలంగా బయటికి వస్తుంటుంది. తమకూ ఇలాంటి అనుభూతి కలిగినపుడే ప్రేక్షకులు తెరపై కనిపించే పాత్రలలో మమేకం అవుతారు. ఇలాంటి భావోద్వేగాలకు  అవకాశం ఇచ్చే సన్నివేశాలన్నీ కథలో అమరాలి. పుట్టుక, చావు, పండుగలు, పెళ్ళిళ్ళు, ప్రేమ, విరహం, సుఖాలు, దుఖ్ఖాలు, కోపాలు, తాపాలు, బాధ, ఆనందం, నవ్వు, ఏడుపు, ఆశలు, ఆశయాలు, కుట్రలు, కపటలుఅన్నీ కుదిరినప్పుడే ఒక కథ జీవితాన్ని సమగ్రంగా ప్రతిఫలిస్తుంది.

          షోలే సినిమాలో మూలకథ, కొత్త సన్నివేశాలు, భావోద్వేగాలు అన్నీ పరిపూర్ణంగా అమిరాయి. సినిమాలోని కాలియా, సాంబా వంటి  చిన్నచిన్న పాత్రలువాటి సంభాషణలు సహితం మనకు ఇప్పటికీ  గుర్తున్నాయంటే  సన్నివేశాలన్నీ అంతటి భావోద్వేగాలతో నిండివుండడమే కారణం.

          మూలకథ, భావోద్వేగాలు, సరికొత్త వాతావరణం వీటితోపాటూ నాల్గవ అంశంగా ఒక కొత్త చలనశీలత కథలో అమరాలి. షోలే సినిమాలోప్రతినాయకుడికి వ్యతిరేకంగా, ప్రధాన పాత్రలన్నీ  మొక్కవోని పట్టుదలతో బతుకుపోరాటం చేస్తుంటాయి. సినిమాకు అసలు  థీమ్ఇదే!

7
కిరాయి హంతకులే అయినా  ఎంతటి ఉపద్రవాన్నయినా ఎదుర్కొనే ఇద్దరు సాహసికులు.
స్నేహం కోసం ప్రాణమిచ్చే ఇద్దరు కథానాయకులు.
రెండు చేతులూ లేకపోయినాసరేబందిపోటు గబ్బర్ను అంతం చేయడమే జీవిత పరమావధిగా పెట్టుకున్న ఠాకూర్‌.
ఇంట్లో మగదిక్కు లేకపోయినా, జట్కాబండి తోలి కుటుంబాన్ని పోషించే కథానాయకీ,
భర్త చనిపోయినా, మెట్టినింటి బాధ్యతల్ని నిర్వర్తించే సాత్వికురాలు.
వయసులోవున్న కొడుకును బందిపోటు చంపేస్తే, పుట్టిన ఊరికోసం బలివ్వడానికి తనకు మరో నలుగురు కొడుకుల్ని ఎందుకు ఇవ్వలేదని దేవుడ్ని అడిగే ముసలి తండ్రి.
వయసొచ్చిన పిల్లను మంచివాడి చేతిలో పెట్టి కన్ను మూయాలనుకునే బామ్మ.
బాధవేస్తే భోరున ఏడ్వడం, ఆనందంవస్తే గలగల నవ్వడం  తెలిసిన గ్రామ ప్రజలు.
పేరుమోసిన దొంగల్ని తనే ప్రభుత్వానికి పట్టించానని బడాయికి పోయే కట్టేల వ్యాపారి.
తను ఆంగ్లేయుల కాలంనాటి ఆధికారినని గొప్పలు చెప్పుకునే జైలరు.
ఇవన్నీ ఒక ఎత్తుయితే, తేడావస్తే, తన అనుచరుల్ని సహితం చంపడానికి వెనుకాడని క్రూరుడైన బందిపోటు నాయకుడు ఇంకో ఎత్తు.

          ఇన్ని అంశాలు అమరినపుడు సహజంగానే ఒక కథ పురాణంగా మారిపోతుంది. దానికి ఎపిక్స్టేటస్వచ్చేస్తుందిషోలే, అవతార్విషయంలో జరిగింది ఇదే.

జానపద కథల్లో సౌలభ్యం
కథ చెప్పడం ప్రధానంగా రెండు రకాలు. జరగబోయేది ప్రేక్షకులకు తెలిసి, పాత్రలకు తెలియని పధ్ధతిలో కథ చెప్పడం ఒకరకం. జరగబోయేది పాత్రలకు మాత్రమే తెలిసి ప్రేక్షకులకు తెలియని పధ్ధతిలో కథ చెప్పడం రెండోరకం. జానపద కథలు చెప్పడానికి మొదటి రకం అనువుగా వుంటుంది. సస్పెన్సు థ్రిల్లర్స్వంటి కథలు చెప్పడానికి రెండో రకం అనువుగా వుంటుంది. రెండిటినీ కలిపి కూడ ప్రేక్షకులపై ప్రభావాన్ని వేయవచ్చు.

          ప్రేక్షకులకు  ముందుగానే కథ తెలిసిపోతే అందులో కూడా ఒక సౌలభ్యం వుంటుంది. తమకు తెలిసిన కథను ఎలా తీశారో అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో వుంటుంది. రామాయణ, మహాభారతాల్ని ఎన్నిసార్లు తీసినా ప్రేక్షకులు కొత్తగా చూడ్డానికి ఇష్టపడతారుపౌరాణిక అంశతో తీసిన సినిమాలు విపరీతంగా విజయవంతం కావడానికి కారణం ఇదే.

            వనవాసం తరువాత పాడవులు  మారువేషాల్లో విరాటుని కొలువులో  చేరి, అజ్ఞాతవాసంలో,  ఒక మహాయుధ్ధానికి సన్నాహాలు చేసుకుంటారు. మహాభారతంలోని విరాట, ఉద్యోగపర్వాల్లోని నాటకీయ సంఘటనలు బాక్సాఫీసును కొల్లగొట్టే ఫార్మూలాలుగా మారాయి. రజినీ కాంత్ నటించిన ’బాషా’ సినిమా ఆధునిక ఆజ్ఞాతవాస ఫార్మూలాకు తెరతీసింది. తెలుగులో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర తదితర సినిమాలు ఆ కొవలో వచ్చినవే. విరాటుని కొలువులో పాండవులు వంటవాళ్ళు, నాట్యాచార్యులు, రథసారధులుగా వున్నారు. దాదాపు ఆ వృత్తుల్నే ఆధునిక రూపంలో సినిమాల్లో వాడారు. బాషాలో రజినీకాంత్ ను ఆటోడ్రైవర్ని చేయగా, సమరసింహారెడ్డిలో  బాలకృష్ణను వంటవాడిగా చూపించారు. నరసింహానాయుడులో కథానాయకుడు నాట్యాచార్యుడుకాగా, ఇంద్రలో కథానాయకుడు కాశీలో టాక్సీ డ్రైవరు.

       ఉత్తర రామాయణం (లవకుశ) నిర్మితిలో వచ్చిన సినిమా పూరీ జగన్నాధ్ నిర్మించిన ’అమ్మా, నాన్న ఒక తమిళ అమ్మాయి’.
1.  ప్రజా వాక్కు కోసం రాముడు సీతను త్యజించాడు.
        ప్రపంచ కప్పు కోసం ప్రకాష్ రాజ్ జయసుధను వదిలేశాడు.
2.  రాముని సంతానం లవకుశలు తండ్రిని మించిన  వీరులవుతారు.
        ప్రకాష్ రాజ్ కొడుకు రవితేజ కిక్ బాక్సింగ్ లో మొనగాడు అవుతాడు.
3.  సీతను అడవిలో వదిలేశాడని  రాముని మీద లవకుశలు ద్వేషాన్ని పెంచుకుంటారు.  

జయసుధను వదిలేశాడని ప్రకాష్ రాజ్ మీద రవితేజ ద్వేషాన్ని పెంచుకుంటాడు.

4.  లవకుశుల్ని  రామునికి అప్పచెప్పిన తరువాత సీత భూదేవి ఒడిలో లీనం అయిపోతుంది. 
        జయసుధ చనిపోతు రవితేజను ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్లమని ఆదేశిస్తుంది.
5.  లవకుశులు శ్రీరాముని వంశ కీర్తిప్రతిష్టల్ని మరింత పెంచుతారు.
        ప్రకాష్ రాజ్ కీర్తిప్రతిష్టల్ని రవితేజ మరింత పెంచుతాడు.


            భాగవతంలో ’శతృమార్గంపట్టిన’ కొడుకును చంపమని ఆదేశించే తండ్రిగా హిరణ్యకశిపుడు కనిపిస్తే, దుర్మార్గుడైన కొడుకును చంపే తల్లిగా సత్యభామ కనిపిస్తుంది. ఈ రెండు పౌరాణిక పాత్రలూ అనేక సినిమాల్లో అనేక రూపాల్లో మనకు తారసపడతాయి.


మహాభారతంలో కృష్ణార్జున తత్త్వంతోపాటూ, కర్ణార్జున తత్త్వం కూడా అద్భుత సృష్ఠి. అర్జునుడు గొప్ప విలుకాడు మాత్రమేకాదు అధికారమార్గంలో పెరిగివచ్చాడు. కర్ణుడు అంతకన్నా గొప్ప విలుకాడు. అయితేనేం, అనధికారమార్గంలో పెరిగాడు. వ్యక్తిత్వంలో కర్ణుడు  మహోన్నతుడు అయినప్పటికీ అర్జునుని చేతిలో చావకతప్పదు అనేది ’ప్రధాన స్రవంతి’ తత్వం. హిందీలో, దిలీప్ కుమార్ నటించిన ’గంగా జమున’, అమితాభ్ బచ్చన్ నటించిన ’దీవార్’, తెలుగులో కృష్ణం రాజు నటించిన ’కటకటాల రుద్రయ్య’, తమిళంలో రజినీకాంత్, మమ్ముట్టి నటించిన ’దళపతి’ ఈ కోవలో వచ్చినవే. వీటిల్లోని, మొదటి మూడు సినిమాల్లో కర్ణార్జునుల ఘర్షణని ప్రధాన కథాంశంగా  తీసుకోగా, మణిరత్నం ’దళపతి’లో కర్ణ దుర్యోధన స్నేహాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. కర్ణుడు చనిపోయే వరకు అర్జునునికి అతను తన సోదరుడని తెలీదు. ఒకవేళ తేలిస్తే ఎలావుంటుందనేది మణిరత్నం మరో సినిమా ’ఘర్షణ’.


9
జానపద కథానాయికలు

          జానపద సాహిత్యంలో మహిళల చుట్టు తిరిగిన కథలు కూడా చాలా వున్నాయి. ఇప్పుడైతే సినిమాల్లో హీరోతో డ్యూయట్లు పాడడానికి మాత్రమే  హీరోయిన్లు వుంటున్నారుజానపద సాహిత్యం అందుకు భిన్నంగా వుంటుంది. సాహిత్యంలో మహిళలది ప్రధాన భూమికకొన్ని సందర్భాల్లో, అసలు జానపద సాహిత్యం అంటేనే మాతృస్వామిక సాహిత్యం ఏమో అనిపిస్తూ వుంటుంది.

          సీత లేని  రామాయణం, ద్రౌపది లేని భారతాన్ని ఉహించడం కష్టం! శకుంతల, సతీ సావిత్రి, బాలనాగమ్మ మొదలైనవన్నీ కథానాయికల చుట్టు తిరిగే కథలే.

          సాక్షాత్తు యముడే వచ్చిసత్యవంతుని ప్రాణాలు తీసుకుపోతుంటే, ముల్లోకాలు వెంబడించి, వైతరణి నది ఒడ్డున  పతిప్రాణాలు దక్కించుకుంటుంది సావిత్రి. యమకింకరుల్ని  మించిన కాశ్మీర్టెర్రస్టులు తన భర్తను కిడ్నాప్చేస్తే, వాళ్ళను  ఝీలంనది వరకు వెంబడించి  తన మాంగల్యాన్ని కాపాడుకుంటుంది మణిరత్నంరోజా’.

          వేటకోసం  అడవికి వెళ్ళిన దుష్యంతమహరాజు అక్కడ మునికన్య శకుంతలను వివాహమాడతాడుముని ఆశ్రయం నుండి  రాజధాని నగరానికి వస్తున్నపుడుశకుంతల పెళ్ళి ఉంగరం నదిలో జారిపడిపోతే ఒక చేప దాన్ని మింగేస్తుందిశకుంతలను తాను పెళ్ళి చేసుకున్న విషయాన్ని దుష్యంతుడు మరిచిపోతాడు. సాక్ష్యం చూపెట్టడానికి శకుంతల దగ్గర ఉంగరం వుండదు. అడవికి వెళ్ళిపోతుంది శకుంతలచివరకు, జాలర్లు తమకు దొరికిన ఉంగరాన్ని తీసుకొచ్చి ఇస్తే దుష్యంతునికి గతం గుర్తుకొచ్చి శకుంతలను స్వీకరిస్తాడు. కథలో, శకుంతలను అబ్బాయినీ, దుష్యంతుడ్ని అమ్మాయిని చేస్తే, అది అల్లు అర్జున్ నటించినఆర్యసినిమాకు మూల కథ అవుతుంది

          విహారయాత్రకు కన్యాకుమారి వెళ్ళిన గీత అక్కడ సముద్రంలో  తన కాలి పట్టా పోగొట్టుకుంటుంది.  "నన్ను నిజంగా ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వక్కరలేదు పట్ట తీసుకొచ్చి ఇస్తే చాలు" అని ఒక  ప్రకటన చేసి వస్తుంది. పట్టా పట్టుకుని పట్టణానికి వస్తాడు ఆర్యకానీ, అప్పటికే గీత ఇంకొకరి ప్రేమలో వుంటుంది. చివరకు పట్టాను చూసాక గీతకు గతం గుర్తుకొచ్చి ఆర్యను వెతుక్కుంటూ వెళుతుంది.

10

రామాయణంలో హనుమంతుడు లంక నుండి సీత జ్ఞాపికగా తలపిన్ను  తీసుకుని వచ్చినపుడు దాన్ని లక్ష్మణుడు గుర్తుపట్టలేడు.  లక్ష్మణుడు  ఎప్పుడూ  వదినగారి కాళ్ళనే చూసేవాడు, ఎన్నడూ  సీతను కన్నెత్తి చూడలేదు. అంశాన్ని గురుదత్ నటించినసాహెబ్ బీవీ ఔర్ గులాంలో   దర్శకుడు అబ్రార్ అల్వి అధ్బుతంగా వాడారు. బిమల్ మిత్రా రాసిన  నవల ఆధారంగా తీసిన సినిమాలో, గులామ్ ఎప్పుడూ జమిందారుగారి చిన్న కోడల్ని కన్నేత్తి చూడడు. అతనికి ఆమె చేతులకున్న కడియాలే తెలుసు. ఇరవై యేళ్ల తరువాత చిన్నకోడలు శవాన్ని చేతి కడియాల ఆధారంగానే గుర్తుపడతాడు.   


ఇలా సినిమాల్లో జానపద అంశను వెతుక్కుంటూ పోతే, ఒక పరిశోధనా వ్యాసం పరిధి సరిపోదు. సంపుటాలు సంపుటాలుగా పరిశోధనా గ్రంధాలు రాయాల్సి వుంటుంది. ఈ వ్యాసంలో పేర్కొన్నవి అందరూ గుర్తుపట్టగల  కొన్ని ఉదాహరణలు మాత్రమే! 

8

వర్తమానం-గతం-వర్తమానం
పండారా గ్రహంలో దొరికే ప్రత్యేకమైన ఖనిజం కోసం దాడిచేసిన, భూగ్రహవాసుల్ని, అక్కడి మనుషులు, జంతువులు, పక్షులు కలిసి తిప్పికొట్టడం అవతార్కథ. అంటే దండకార్యణ్యాన్ని జేమ్స్కామెరూన్రామాయణ కాలం నుండే కాకుండ వర్తమానం నుండి కూడా తీసుకున్నాడని అర్ధం అవుతోంది. వర్తమానం అంటే కఛ్ఛితంగా అది దండకారణ్యమే కానక్కరలేదు. సహజవనరులపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద దేశాలు దాడులుచేయడం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నదే. తమ ప్రాంతపు సహజసంపదనీ, సాంప్రాదాయాల్ని పరిరక్షించుకోడానికి స్థానికులు, మరీ ముఖ్యంగా ఆదివాసులుప్రాణలకు ఒడ్డి నాగరీక సమాజంతో పోరాడ్డం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. దీనికి ఆధునిక రూపమే గల్ఫ్వార్‌! గల్ఫ్లో అమెరికా యుధ్ధనేరాలకు పాలడిందని విమర్శించే మానవహక్కుల నేతలు అమెరికాలోనూ లేకపోలేదు. అలాంటి వాళ్ల ప్రేరణ నుండి కూడా అవతార్కథానాయకుడు ఆవిర్భవించి వుండవచ్చు.

          దండకారణ్యంలో బాక్సైట్తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీడ్ఘడ్‌, మధ్యప్రదేశ్లలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతోందిఇటీవల ఉద్యమకారులు పండార గ్రహవాసుల్లా నీలం రంగుపూసుకుని, తోకలుపెట్టుకుని సింబలిక్ఆందోళన కూడా చేశారు.   దండకారణ్యం అవతార్సినిమాకు  ప్రేరణగా నిలిస్తే, అవతార్సినిమా దండకారణ్య పరిరక్షణ ఆందోళనకారులకు ప్రేరణగా మారింది. సమాజం నుండి ప్రేరణ పొందిన సినిమా, తిరిగి సమాజానికి ప్రేరణ ఇవ్వడం అంటే ఇదే! అంతకన్నా పరమార్ధం సినిమాకు మరేదీ వుండదు!

404, స్కిల్ప్రెసిడెన్సీ,
హైదరాబాద్
27 ఆగస్టు 2011

ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి 
సెప్టెంబరు, 2011