Friday, 29 May 2026

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

 

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన  తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

కాలధార




 

సామాజిక కార్యకర్తల సమావేశాల్లో సాధారణంగా వినిపించే ఒక అసంతృప్తి ఏమంటే ఉద్యమాల్లో ముస్లింలు కలసి రావడంలేదని. ఇదొక సెలెక్టివ్ మెమోరీకి సంబంధించిన అంశం. ముస్లింలు రోజువారీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనని మాట నిజమేగానీ, సమయం వచ్చినపుడు వాళ్ళు మిగిలినవాళ్ళకన్నా చాలా చురుగ్గానే కదులుతారు.  

 

ఇతర అంశాలను స్పృజించే ముందు ఎవరయినా గమనించాల్సిన అంశం ఏమంటే భారత ముస్లింలు ప్రధాన స్రవంతి సమూహం కాదు. వాళ్ళు ఉపస్రంవతి సమూహం. ఇటాలియన్ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్షీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక సబాల్టర్న్ గ్రూపు అది. ఆర్థికంగా వెనుకబడిన, సాంస్కృతికంగా అణచివేయబడిన, ఆధిపత్య అధికార వ్యవస్థల నుండి బహిష్కరణకుగురైన, తమ గోడు వినిపించుకోవడానికైనా  చట్టసభల్లో దాదాపు ప్రాతినిధ్యంలేని ఒక అల్పసంఖ్యాక సామాజిక సమూహాం అది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంచలనాత్మక ఫలితాలను చూసిన మే నెల అంతకన్నా సంచలనాత్మకంగా రెండు వార్తల్ని వెలుగులోనికి తెచ్చింది. The International Hepato-Pancreato-Biliary Association Chines chapter సదస్సు ప్రస్తుతం వూహాన్ లో జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్ ఈ సమావేశంలో పాల్గొనడానికి చైనా వెళ్ళారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఓ పేషెంటుకు అత్యవసరంగా Ureteral reimplantation Surgery చేయాల్సి వచ్చింది. డాక్టర్ గౌస్ దాదాపు ఏడు వేల కిలో మీటర్ల దూరం నుండి విజయవంతంగా టెలీ రోబోటిక్ సర్జరీ నిర్వహించారన్న వార్త దినపత్రికల మొదటి పేజీల్లో వచ్చింది. ఆ పక్కనే మరో వార్త కూడ వచ్చింది. కోల్కతా జిల్లాలోని కాషీపూర్ –బెల్గాచియా  నియోజకవర్గం నుండి గెలిచిన బిజేపి ఎమ్మెల్యే రితేష్ తివారి తాను ముస్లింలకు ఒక్క చిన్నపని కూడ చేసిపెట్టనని శపథం చేశారు.  చివరకు పంక్చర్లు వేసుకుని బతికే అవకాశం కూడ ఇవ్వనంటూ బాబా భోలేనాధ్ విగ్రహం సాక్షిగా ఒట్టు వేశారు.

ముస్లింలు పంక్చర్లు మాత్రమే వేస్తారా? 19వ శతాబ్దం ఆరంభానికి ముందే ‘మైసూరియన్’ రాకెట్లను సృష్టించిన టిప్పూ సుల్తాన్ ను ఏ ఖాతాలో వేయాలీ? అమెరికాలోని నాసా కేంద్రంలో టిప్పూ సుల్తాన్ చిత్రపటాన్ని చూసి ఉత్తేజాన్ని పొంది భారత దేశానికి అగ్నీ, పృధ్వీ వంటి బాలిస్టిక్ మిస్సైల్స్ ను సృష్టించిన ఎపిజె కలాంను ఏ లెఖ్ఖలో వేయాలీ? 

ముస్లింలకు సమస్తరంగాల్లో జీవనోపాధి లేకుండా చేస్తాం. ఎన్నికల్లో పోటీ చేయనివ్వం; పోటీ చేసినా గెలవనివ్వం. అసలు, ఓటు హక్కునే తీసివేస్తాం, ఆరోపణలు వస్తే చాలు విచారణలు లేకుండానే బుల్డోజర్లతో శిక్షించేస్తాం అంటూ మెజారిటీ సమూహానికి చెందిన అధికారవర్గం బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా ఘనత వహించిన ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ముస్లింలను పట్టించుకునది ఏ మేరకూ? భారత మతవ్యవస్థలో ముస్లింలను శ్రామికవర్గంగా ప్రకటించకపోయినాసరే కనీసం అణగారిన సమూహంగా ప్రకటించిన వామపక్ష పార్టీ ఏదయినావుందా? వేడి పాలతో నోరు కాల్చుకున్నవాళ్లు చల్లని మజ్జిగను కూడ  ఊదిఊది తాగుతారు. ఆ స్థితిలో పడిపోయారు భారత ముస్లింలు. సామాజిక సంఘాలు, వాటి కార్యకర్తలు, నాయకుల్ని చూస్తే ముస్లింలకు భయం, ఆందోళన, అనుమానం.

 

దీని అర్ధం ముస్లిం సమూహం సామాజిక మార్పుకు వ్యతిరేకమైనదని కానేకాదు. ఇస్లాం పుట్టుకలోలే అనేక సామాజిక విప్లవాలున్నాయి.  తెగల ఆధిపత్యం, బానిసత్వం, సంపద కేంద్రీకరణ, ఆర్థిక

దోపిడీ, లింగ వివక్ష, పుట్టుకతో వచ్చే అహంకారం వగయిరా సాంఘీక ఆచారాలకు వ్యతిరేకంగా ఇస్లాం ఆవిర్భవించింది. అది ఏకకాలంలో ఆధ్యాత్మికమైనది; సామాజికమైనది.

 

నిరుపేదలు, నిస్సహాయుల పట్ల దయగలిగి వుండండి. బానిసల్ని విముక్తిచేయండి. వర్ణబేధాల్ని పాటించకండి. సంపదను ఒకే చోట పోగుపడనియ్యవద్దు. అందులో, న్యాయమైన భాగాన్ని పేదలకు పంచండి. అలాంటి సత్ప్రవర్తనే గొప్ప ఆరాధనా మార్గం వంటి ఇస్లాం ఆదేశాలు ముస్లిం సముదాయాల్లో సామాజిక న్యాయ పోరాటాలను  ప్రోత్సహించాయి. సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ దేవునికి ప్రీతిపాత్రులు కావచ్చని ధార్మిక ముస్లింలు నమ్ముతారు. సామాజికన్యాయ సాధన కూడ దైవారాధన మార్గమే కనుక దానికోసం నాస్తికులు కావల్సిన అవసరం లేదని కూడా వాళ్లు భావిస్తారు. ఇరాన్ కు చెందిన ముస్లిం ఆలోచనాపరుడు అలీ షరియతీ ఇస్లాంను ఒక విముక్తి సిద్ధాంతంగా మలిచాడు. (ఇస్లామిక్ లిబరేషన్ థియాలజీ!) అతని దృష్టిలో నిజమైన ఆధ్యాత్మికత సమాజంలో దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా నిలబడాలి. అందుకే చరిత్రలో మనకు మతం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది; అధికారానికి ఊడిగం చేసేది; రెండోది; బాధితుల పక్షాన నిలిచే నైతిక శక్తి. ఈ రెండు ధోరణుల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం.

 

8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ప్రపంచ విజ్ఞాన కేంద్రాలు ముస్లిం ప్రపంచంలోనే ఉండేవి అంటే అతిశయోక్తికాదు. ఇరాక్ లో బాగ్దాద్, స్పెయిన్ లో కార్డోబా, ఈజిప్టులో కైరో నగరాలు విజ్ఞానశాస్త్ర, తత్వ, వైద్య పరిశోధనలకు నిలయాలయ్యాయి. ప్రపంచ ఆధునిక భావాలకు పుట్టినిల్లుగా భావించే ఫ్రెంచ్ విప్లవం ముందుకు తెచ్చిన న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అప్పటికే ఇస్లాంలో వున్నాయి. ఇస్లామిక్ స్వర్ణయుగంగా భావించే ఈ కాలం మనకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే — ప్రశ్నించే తత్త్వాన్ని కాపాడుకున్న సమాజాలు విజ్ఞాన రంగంలో  ముందుకు వెళ్తాయి అని.

 

సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కూడ కాపాడుకోవచ్చా? అనేది ముస్లిం సమాజం నిరంతరం ఎదుర్కొనే ధార్మిక మీమాంస.  అది సాధ్యమే అని చాలాసార్లు చాలామంది నిరూపించారు.

 

భారత స్వాతంత్ర్య ప్రధమ సంగ్రామానికి బహద్దూర్ షా నాయకత్వం వహించాడనీ, 1920లో ఏర్పడిన భారత జాతీయ కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపక కార్యదర్శి మొహమ్మద్ షఫీఖీ సిధ్ధీఖి అని చాలా మందికి తెలుసు. కానీ ఆయా చారిత్రక సందర్భాల్లో వాళ్ళే ఆ పాత్రను ఎందుకు పోషించారు అనే సందేహం మాత్రం చాలా మందికి వచ్చి వుండదు.

 

ఇక వర్తమానానికి వద్దాం. నరేంద్ర మోదీ – అమిత్ షాల హయాంలో ఏపుగా పెరిగిన  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఎలా ఎదుర్కోవాలో తెలీక విపక్షాలు సతమతమౌతున్న కాలంలో వాళ్లకు ఒకదారి చూపించింది ముస్లిం మహిళలే. అదే, పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ను వ్యతిరేకిస్తూ మొదలయిన  షాహీన్ బాగ్ నిరసనోద్యమం. దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో ఒక వేదికను నిర్మించి, ప్రశాంతంగా కూర్చొని నిరసన తెలిపే ఒక వినూత్న విధానాన్నీ వాళ్ళు రచించారు. ఒక మైనారిటీ సమూహమైన ముస్లిం మహిళలు ఉద్యమం చేస్తుంటే మరో మైనారిటీ సమూహమైన శిక్కు మహిళలు కదలి వచ్చి షాహీన్ బాగ్ లో ఉచిత భోజనం (లంగర్)  ఏర్పాటు చేశారు.

 

షాహీన్ బాగ్ ఒక కొత్తరకం ఉద్యమం.  దీనికి నాయకులు లేరు. సంయుక్త కార్యాచరణ కమిటిలేదు. కార్యవర్గం లేదు. అందరూ నాయకులే. అందరూ కార్యకర్తలే. షాహీన్ బాగ్ ఉద్యమం ఇచ్చిన స్పూర్తితోనే సరిగ్గా అదే పధ్ధతుల్లో ఢిల్లీ నగర శివార్లలో లంగరుతోసహా నిరసనోద్యమాన్ని చేపట్టారు భారత  రైతులు. ఈ పరిణామాల్ని, అనుబంధాల్నీ  మరచిపోవడం న్యాయం కాదు.

 

ఇప్పటి డిజిటల్ యుగంలో నిరసనోద్యమాల రూపం సారం రెండూ మారిపోయాయి. టునీషియాలో 2010 డిసెంబర్‌లో రోడ్డు మీద పండ్లు అమ్ముకునే  ఒక చిరువ్యాపారి మొహమ్మద్ బొవాజిజిని ట్రాఫిక్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ అవమానాన్ని భరించలేక అతను అక్కడికక్కడే ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటన మీద టునీషియా యువత తీవ్రంగా స్పందించింది. అవినీతి, నియంతృత్వం, నిరుద్యోగం, యువతలో పేరుకుపోయిన నిస్పృహ — ఇవన్నీ కలిసి ఒక్కసారిగా పేలాయి. స్మార్ట్ ఫోన్ల సహాయంతో  వాళ్ళ ఆక్రోసం  ప్రపంచం నలుమూలలకు చేరింది. నెలరోజుల్లోనే టునీషియా ప్రభుత్వం పడిపోయింది. దేశాధ్యక్షుడు బెన్ అలీ దేశం వదిలి పారిపోయాడు.

 

అమెరికా చరిత్రకారిణి హన్నా అరెండెట్ చెప్పినట్టు ప్రజలు ప్రభుత్వానికి విధేయంగా వుండడం మానేసిన క్షణాణ అధికార భవనాలు కూలిపోతాయి.

 

ఆ తరువాత యువతరం నిరసన సెగలు ఈజిప్టును తాకాయి. కైరోలోని తాహరీర్ స్క్వేర్లో లక్షల మంది యువకులు ప్రదర్శనగా వచ్చారు. ముఫ్ఫయి యేళ్ళుగా నిరాఘాటంగా అధికారాన్ని చెలాయిస్తున్న హోస్నీ ముబారక్ రాజీనామా చేసి గద్దె దిగి వెళ్ళిపోయాడు. ఇదే పధ్ధతి నిరసనోద్యమం లిబియాలో అంటుకోగా అధ్యక్షుడు మువమ్మర్ గడాఫీ గద్దె దిగడమేగాక హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే సిరియా, ఎమెన్, బహెరెన్  లో కూడా యువతరం నిరసన సెగలు గట్టిగా తాకి అక్కడి ప్రభుత్వాలను మార్చేశాయి.  ఇవన్నీ అరేబియన్ దేశాలు కనుక సమాజశాస్త్రవేత్తలు యువతరం నిరసనోద్యమాలకు ‘అరబ్ స్ప్రింగ్’  అని పేరు పెట్టారు. తెలుగులో మనం ‘అరబ్ వసంతం’ అనుకోవచ్చు. ఈ యువగాలులు  ఇతర దేశల్లోనికి ప్రవేశించినపుడు జెన్ –జీ అనే పేరు వచ్చింది. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లను తాకి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇండియాలోనూ ప్రవేశించాయి.

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో యువతరం నిరసనలు  యుద్ధాలకంటే పెద్ద మార్పుల్ని చాలా వేగంగా తీసుకొచ్చాయి. అయితే,  అరబ్ వసంతాలు నియంతల వ్యవస్థల్ని సమర్ధంగా నిర్మూలించినంతగా  ఒక ఆదర్శవంతమైన కొత్త వ్యవస్థల్ని నిర్మించలేకపోయాయి. ఇది వీటి బలహీనత. నియంతృత్వాన్ని నిర్మూలించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా వుంది. ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మీంచే సిధ్ధాంతం ఇప్పుడు వాళ్ళకు కావాలి!!

 

రచన : 26-05-2026

ప్రచురణ :  27 మే 2026

విప్లవకర సంస్థ, పార్టి - పూర్తిగా మిస్సయింది.

 



ఈమధ్య కాలంలో చాలా ఆసక్తిగా విన్న ప్రసంగం ఇది. 

ఇందులో మూడు భాగాలున్నాయి. 

గతం, వర్తమానం, భవిష్యత్తు. 

నక్సల్ బరీ గత చరిత్ర  గురించి వేణు చాలా ఉత్తేజకరంగా ప్రసంగించాడు. 

అందుకు అతన్ని ఎంతయినా మెచ్చుకోవచ్చు. 


వర్తమానానికి వచ్చే సమయానికి అలాంటి ఉత్తేజానికి అవకాశంలేదు.  

తాము మాత్రమే విప్లవకారులు, తమది మాత్రమే విప్లవకర సంస్థ అని 

గొప్పలు చెప్పుకున్న మావోయిస్టు పార్టి నాయకత్వం   'వికసిత్ భారత్'  తీర్ధం తీసుకుని ప్రభుత్వానికి వీరోచితంగా లొంగిపోయింది.


వర్తమానమే నిరాశాజనకంగా వున్నప్పుడు భవిష్యత్తును ఆశాజనకంగా చిత్రించడం కష్టం, 


దేశంలో విప్లవకర వాతావరణం అద్భుతంగా వుంది. విప్లవకర శక్తులు పుష్కలంగా వున్నాయి. 

కానీ, విప్లవానికి అవసరమైన మూడు షరతుల్లో ప్రాణప్రదమైనది -  విప్లవకర సంస్థ, పార్టి -  పూర్తిగా మిస్సయింది. 


ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఆలోచనాపరులు ఏం చేయాలీ? 

చొరవ చేసి భవిష్యత్తు కోసం ఒక కొత్త పంథాను రూపొందించాలి. 


1990ల తరువాత మారిన ఆర్ధిక సామాజిక వాతావరణంలో వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం వంటి పాత కార్యక్రమాలను పక్కన పెట్టి కొత్త సామాజికార్ధిక పునాదుల మీద కొత్త కార్యక్రమాన్ని, ఒక కొత్త ఐక్య సంఘటనను ప్రతిపాదించాలి. 

అలాంటి చొరవ వేణు ప్రసంగంలో లోపించింది.   

ఈసారి బక్రీద్ భారత ముస్లింల రాజకీయ చరిత్రలో ఒక ముందడుగు. "గోహత్యను నిషేధించండి", "ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి" అంటూ ఒక వినూత్న  ఉద్యమానికి వాళ్లు నడుంబింగించారు. బక్రీద్ కు నాలుగు రోజులు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఆ  ప్రస్తావనలేదు. 

అయినప్పటికీ, 80 నిముషాల ప్రసంగంలో ఒక చోట  మైనారిటీలు, ఇంకోచోట ముస్లింలు, క్రైస్తవులు అనే పదాలు వినిపించాయి. అందుకు వేణుకు ధన్యవాదాలు. 


N. Venugopal Breaks Down Charu Mazumdar’s Explosive Letter on Naxalbari | G8news

https://www.youtube.com/watch?v=B7vJ4YQfSJQ

Sunday, 24 May 2026

*బొద్దింకల ఉద్యమం దేనికి ప్రతీకా?*

*బొద్దింకల ఉద్యమం దేనికి ప్రతీకా?*

 

ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు.  

 

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*




భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దేశంలోని మొత్తం యువత గురించి తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని  దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే మాటను జెన్ జీ యువత వైరల్ గా మార్చేసింది. “అవును. మేము బొద్దింకలమే” అని ప్రకటించుకుంది.  ఇది కేవలం మీమ్ రాజకీయమా? లేక వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?

 ఉద్యోగాలులేని యువతరం మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిజంలోకి వచ్చి కొందర్ని టార్గెట్ చేస్తున్నదని  మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా “బొద్దింకలు” అనే పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చిందని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి  శత్రుత్వం కాదని అనేక మంది స్పందించారు. మనకు నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేఛ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా స్వేఛ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్ధంలో అమెరిక సామాజిక కార్యకర్త నోవమ్ చోమ్స్కీ అన్న మాట మళ్ళీ వైరల్ అయ్యాయి.

ఉద్యమకాలంలో అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా మారిపోతుంది.  నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సిపిఐ – మార్క్సిస్టు - లెనినిస్టులు. కిట్టనివాళ్లు వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. “అవును మేము నక్సలైట్లమే” అంటూ  వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొదలెట్టారు. “మేము మాల”, “మేము మాదిగ” వంటి ఆత్మగౌరవ ప్రకటనల్ని కూడ మనం చూశాం. ఇది సోషల్ మీడియా యుగం కనుక వేగం మరింత ఎక్కువ. ఇప్పుడు “బొద్దింక” అనే మాట కొత్త రాజకీయ మీమ్‌గా మారింది. వేలాది మంది యువత “అవును. మేము బొద్దింకలం” అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు బొద్దింక ఫోటోలతో టీ షర్టులు ధరించి రీల్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ తత్వవేత్త మైఖేల్ ఫుకాల్ట్ “అధికారం ప్రతిఘటనను సృష్టిస్తుంది” అన్న సిద్ధాంతం ఇప్పుడు గట్టిగానే పనిచేస్తోంది. అధికార భాష ఎంత కఠినంగా మారితే ప్రతిస్పందన అంత వైరల్ అవుతుంది.

 

బోస్టన్ యూనివర్సిటీ విద్యార్ధి అభిజీత్ దీప్కే సరదాగా ‘కాక్రోచ్ జనతా పార్టి’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే ఆ పార్టీలో యాభై వేల మంది చేరిపోయారు. తరువాత కోటి మంది అయ్యారు. ఇదేమీ ఒక రాజకీయ పార్టి కాకపోవచ్చు కానీ, ఇది ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. ముఖ్యంగా, విద్యావంతులైన పట్టణ యువత ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ భావోద్వేగంగా కనెక్ట్ కాలేకపోతున్నదని  ఈ వైరల్ స్పందన చెపుతోంది. స్థిరమైన రాజకీయ ఐడెంటిటీలు కరిగిపోతున్న కాలం ఇది. అస్థిర కార్మికవర్గం అస్థిర రాజకీయ భావాలనూ సృష్టిస్తుంది.

కొత్త పరిణామాల వెనుకనున్న అసలు నేపథ్యం తీవ్రమైన నిరుద్యోగం. పరీక్షాపత్రాల  లీకులు, ఉద్యోగాల కొరత, కాంట్రాక్ట్ కల్చర్, పెరుగుతున్న పోటీ యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉపాధి  సంక్షోభం కూడా ఉంది.

కొత్త తరాల్లో కొత్త ఆలోచనలు రావడం సహజం; పాత ఆలోచనల నుండి బయటపడటమే పెద్ద కష్టం. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టుకోవడంలేదు. అందుకే మీమ్స్, వ్యంగ్యం, డిజిటల్ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.

బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ఉన్నాయి. “న్యూక్లియర్ యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే” అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు. కోట్ల సంవత్సరాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను తట్టుకునే సామర్ధ్యం కూడా వీటికి ఉందనడానికి సైంటిఫిక్ ఆధారాలున్నాయి. అందుకే ఇప్పుడు యువత “మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం” అని ధీమాగా అంటోంది. 

 

ఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్ పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు — ఇవే ఇప్పుడు కొత్త పోరాట   వేదికలు. టునీషియా, లిబియా అరబ్ స్ప్రింగ్,  అమెరికాలో “వాల్ స్ట్రీట్ ను ఆక్రమించండి”, హాంగ్‌కాంగ్ ఉద్యమాలు,— అన్నీ డిజిటల్ మీడియా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్-Z అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.

            ఈ బొద్దింకల వివాదం మరో పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తింది — ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా? దానికి సమాధానం కాదనే! రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టే దాని విలువ ఉంటుంది అన్నాడు అంబేడ్కర్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం అవసరం. అదే సమయంలో వాటికి అకౌంటబిలిటీ కూడా అవసరం. సోషల్ మీడియాలో యువత అంటున్నదేమిటీ? - “ప్రశ్నించడం దేశద్రోహం కాదు.” అది నిజమేకదా!! 

కాక్రోచ్ జనతా పార్టి నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేవి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. రాజకీయ పార్టీలు, మీడియా, న్యాయవ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థలపట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతుంది. ఈసారి అది ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే యువతను అవమానిస్తే అనర్ధాలే జరగవచ్చు.

రచన : 20 మే 2026


Friday, 22 May 2026

Beef Politics - Unexpected Twist - గోవధ … అనుకోని మలుపు!

*గోవధ … అనుకోని మలుపు!* 

*డానీ* 

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 


ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకు ధన్యవాదాలు. 





“గోవధను నిషేధించండి!”, “ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి” అంటూ భారత ముస్లింలే డిమాండు చేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. కానీ రాజకీయాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి కొత్త చరిత్రను సృష్టిస్తుంటాయి.


దారుల్ ఉలుమ్ దేవ్ బంద్ కు చెందిన మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ ఇచ్చిన పిలుపుతో ఈ చర్చ కొత్త మలుపు తిరిగింది. కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల నుండి కూడా మద్దతు స్వరాలు వినిపించడంతో “గోవధ నిషేధం” అంశం ముస్లిం సమాజంలోనేగాక దేశంలోనే ఒక కొత్త చర్చగా మారుతోంది. కోల్‌కతాలోని నఖోడా మసీద్ ఇమామ్ మౌలానా ముహమ్మద్ షఫీఖీ ఖాసిం దీనిని “హిందూ-ముస్లిం మతసామరస్య ఉద్యమం”గా అభివర్ణించారు.


బీఫ్ రాజకీయంలో ఒక పెద్ద వైరుధ్యం భారత సమాజంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బీఫ్ ఎగుమతిదారులలో భారతదేశం ఒకటి. కొన్నిసార్లు బ్రెజిల్ ను కూడా అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలున్నాయి. ఏటా దాదాపు 16 లక్షల టన్నుల బీఫ్ మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇండోనేషియా తదితర దేశాలకు ఇండియా నుండి ఎగుమతి అవుతోంది. ఇవి ప్రధానంగా ముస్లిం దేశాలు కనుక బీఫ్ ను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం  ‘హలాల్’  చేసి అధికారిక వ్యవస్థల ద్వారా రాచమార్గంలోనే ఎగుమతి చేస్తారు. 


ముస్లిం దేశాలకు ఎగుమతి చేస్తారు కనుక ప్రత్యేక ఆకర్షణ కోసం బీఫ్ ఎగుమతి సంస్థల పేర్లు ఎక్కువగా అరబ్బీ భాషలో వుంటాయి. ఈ పేర్లను చూసి వాటి ప్రమోటర్లు ముస్లింలు ‘మాత్రమే’ అయ్యుంటారు అనుకునే అవకాశం ఎక్కువ. ఇది వ్యాపారం కనుక ఇందులో అన్ని మతాలవాళ్ళూ వున్నారు. అహింసావాదులుగా భావించే జైనులు సహితం ఇందులో వున్నారు. వీటిల్లో కొన్ని సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిజెపి  ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్టు ఆరోపణలున్నాయి. అంతేగాక, సాక్షాత్తు బిజెపి ప్రముఖ నాయకులే బీఫ్ ఎగుమతి వ్యాపారంలో వున్నట్టు ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి.  విచిత్రం ఏమంటే, “ఏక్ గాయి భీ నహీ కటేగీ” అని వేదికల నుండి అరవీర భయంకరంగా అరిచే యోగీ ఆదిత్య నాధ్ గారి ఉత్తరప్రదేశ్ నుండే బీఫ్ ఎక్కువగా ఎగుమతి అవుతుంది. 


అదే సమయంలో, దేశంలో సాంఘీక పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా వుంది. బీఫ్ తింటూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని బిజెపి ఢిల్లీ నాయకుల నుండి గల్లీ లీడర్ల వరకు నిత్యం ముస్లింలను సోషల్ కోర్టుల్లో దోషులుగా నిలబెడుతుంటారు. కేవలం బీఫ్ అనే అనుమానంతో  — చేతి సంచిలో పావుకిలో వుందనో, స్కూటర్ టిక్కీలో అరకిలో తీసుకెళ్తున్నారనో, ఇంట్లో ఫ్రిజ్‌లో కేజీ దాచారనో — ముస్లింలపై దాడులు,  హత్యలు చేసిన సంఘటనలు కూడ వున్నాయి. ఇలాంటి సంఘటనల్లో  పాల్గొన్న అల్లరి మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా, చట్టం వారిని కఠినంగా శిక్షించకపోగా మినహాయింపులు (లీగల్ ఇంప్యూనిటి) ఇస్తూ వచ్చింది. ఒక విధంగా ప్రొత్సహిస్తూ వచ్చింది. 


సమాజం బోనులో ముస్లింలను నిరంతరం దోషులుగా నిలబెట్టడానికి సంఘపరివారం దశాబ్దాలుగా బీప్ ఆరోపణలు చేస్తున్నది. హిందువులు దైవంగా భావించి పూజించే గోవుల్ని ముస్లింలు తింటున్నారనేది ప్రధాన ఆరోపణ. 


బీఫ్ విభాగంలో ఐదారు రకాల మాంసాలున్నాయి. ఆవు, ఎద్దు, గేదె దున్న మాంసాలన్నీ చూడడానికి ఒక్కలాగే వుంటాయి. రసాయనశాలల్లో డిఎన్ ఏ - సీక్వేన్సింగ్, ఎలిసా పరీక్షల ద్వార ఏది ఏ మాంసమో తేల్చే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోవుంది.  కానీ, అల్లరి మూకలకు అంతటి ఇంగితం వుండదు. ముస్లీం చేతిలో మేక మాసం కనిపించినా సరే దాడి చేయడానికి వాళ్లు ఉవ్వీళ్ళూరుతున్నారు.   


అనేక జంతువులు, జీవులు మనకు  హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో దేవతలుగా దర్శనమిస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి  అవతారాల్లోనే తాబేలు, చేప, వరాహం, సింహం వున్నాయి. చేపల్ని ప్రైవేటు సంస్థలతోపాటూ ప్రభుత్వరంగ సంస్థలు కూడ మార్కెటింగ్ చేస్తుంటాయి. ప్రాసెస్ చేసిన పందిమాంసం (బేకన్) తయారీ, పంపిణి పనుల్ని అనేక రాష్ట్రాల్లో యానిమల్ హజ్బెండ్రీ శాఖ, మీట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో ఎక్కడా ముస్లింలతో వివాదంలేదు. అందుకే ఆ జీవులు రాజకీయానికి పనికి రాలేదు. సమస్యల్లా ఆవుతోనే. 


భారతదేశంలో ఆవు రాజకీయం రోజురోజుకూ విస్తరిస్తోంది. దేశంలో సాంప్రదాయంగా 15-20 శాతం మాత్రమే శాఖాహారులు, 80-85 శాతం మాంసాహారులు. ఈశాన్య రాష్ట్రాలతోపాటూ కశ్మీర్, బెంగాల్, కేరళ, తెలంగాణాల్లో మాంసాహారులు 90 శాతం కన్నా ఎక్కువ అని గణాంకాలు చెపుతున్నాయి.  కానీ, ముస్లీంలు మాంసాహారులు, హిందువులు  శాకాహారులు అంటూ ఇప్పుడు ఒక కొత్త ధార్మిక విభజన జరుగుతోంది. “మీరు మాసం తింటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు” అని ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు దేశ ప్రభుత్వాధినేత అనేంత వరకు పోయింది వ్యవహారం. ఇది అక్కడ కూడ ఆగలేదు. దేశంలో ఎవరయినా టీ తాగినాసరే వాళ్ళు గో -హంతకులే అని ఈమధ్య ఓ సాధ్వీ ప్రవచనకర్త ప్రకటించారు. ముస్లింలు ఏ వృత్తిని చేపట్టినాసరే అది గోహత్యతో సమానమని వీరు ముద్ర వేస్తున్నారు. 


దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 80 శాతానికి పైగా బిజెపి అధికారంలో వున్నాయి.  గోవధ నిషేధం తన విధానం అంటూ ప్రతి సందర్భంలోనూ బిజెపి ప్రకటిస్తూ వుంటుంది. కానీ, జాతీయ స్థాయిలో అలాంటి చట్టాన్ని మాత్రం తీసుకునిరాదు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించదు. ఇదో రాజకీయం. నిరంతరం ‘హేట్ ముస్లిం’ విధానాలను కొనసాగిస్తేనేగానీ ఎన్నికల్లో హిందూ సమాజం ఓట్లు పడవని ఆ పార్టీకి తెలుసు. 


తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది కోసం సంఘ్ పరివార్ కార్యకర్తలు ఆవుల మీద తెగ ప్రేమను ప్రదర్శిస్తారు. ఇది కపట ప్రేమ. వీళ్లకు గోమాత మీద నిజంగా ఎంత ప్రేముందో నిర్ధారించాలంటే  బిజెపి పాలనలోవున్న రాష్ట్రాల్లో గోశాలల్ని చూడాలి. ఉదాహరణకు రాజస్థాన్ లో బిజెపి అధికారంలోవుంది. జైసల్మేర్ లో చాలా పెద్ద గోశాల వుంది. ఆక్కడి ఆవులకు గడ్డికాదుకదా నీళ్ళు అందించే సౌకర్యం కూడా లేదు. కొన్ని వందల ఆవులు చనిపోతున్నాయి. 'Jaisalmer Dead Cow'  అని సెర్చ్ చేయండి ఒక భయానక వాస్తవం కనిపిస్తుంది. 


ఈశాన్య రాష్ట్రాలో బిజెపిది ఇంకో పాలసీ. అక్కడ బీఫ్ కు అనుమతి ఇస్తేనే ఓట్లు పడతాయి. ఈ ద్వంద్వాన్ని బిజెపి అడ్డగోలుగా సమర్ధించుకుంటుంది. వాళ్ళు తినేది ‘జెర్సీ ఆవు’నేగానీ భారత సంతతికి చెందిన ‘దేశీఆవు’ కాదని ఒక వివరణ ఇస్తుంది. ఈ వివరణ కొందరికి విచిత్రంగానో, అసంబధ్ధంగానో కనిపించవచ్చు కానీ,  ఇది నిజం. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ సుధాంశు త్రివేది ఇటివల మీడియాకు ఈ విషయంలో ఒక స్పష్టత నిచ్చారు. భారత సంతతికి చెందిన మూపురం (hump)గల ఆవులకే పవిత్ర మాతా స్థానం వుంటుందనీ, మూపురంలేని జెర్సీ ఆవులకు మాతా స్థానం వుండదు అనేది వారి వివరణ.  


భారత దేశీ ఆవులకు మూపురం వుంటుంది; జెర్సీ ఆవులకు మూపురం వుండదు. దేశీ ఆవులకు మెడ కింద చర్మం వదులుగా వుంటుంది; జెర్సీ ఆవులకు బిగుతుగా వుంటుంది. కాళ్లు సన్నగా పొడవుగా వుంటాయి, బండగా పొట్టిగా వుంటాయి. కొమ్ములు చెవుల్లోనూ తేడాలు కనిపిస్తాయి. సన్నగా ఎత్తుగా వుంటాయి, బండగా పొడుగ్గా వుంటాయి. 


ముస్లీంలు గోహత్యకు దూరంగా వుండాలని నిర్ణయించుకోవడం భారత సాంఘీక పరిణామంలో కొత్త అధ్యాయం. ఇతర రాష్ట్రాల ముస్లింలు సహితం ఇక గోమాంసానికి దూరంగా వుండడానికి సిధ్ధం అవుతున్నారు. ‘నో బీఫ్’  ఇప్పుడు ముస్లింల కొత్త ఉద్యమం.  ఈదుల్ అజ్హా (బక్రీద్) సందర్భంగా ఖుర్బానీ కోసం ఆవులను కొనరాదని కొన్ని వర్గాల ముస్లింలు పిలుపునివ్వడం కూడా ప్రభావాన్ని చూపుతోంది. కోల్ కతా, హైదరాబాద్ సంతలకు పశువుల్ని తెచ్చిన కాపర్లు ముస్లింల బహిష్కరణ పిలుపుతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ నాయకుల్ని వాళ్ళు  శాపనార్థాలు పెట్టడం మొదలెట్టారు. 


మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే, ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి వంటి హిందూ ఆధ్యాత్మిక నాయకులు కూడా  కొంతకాలంగా గోవధ నిషేధ చట్టాన్ని తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ముస్లిం మౌలానాలు, హిందూ స్వామీజీలు ఒకే నినాదంతో మతసామరస్య వేదికపై నిలిచి  భారత రాజకీయ ఆధ్యాత్మిక రంగంలో కొత్త అధ్యాయానికి నాందీ పలకవచ్చు. 1857 నాటి భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత మళ్ళీ ముస్లిం మౌలానాలు, హిందూ స్వామీజీలు కలిసి నడిపే ఒక మహత్తర ఉద్యమం ఒకటి దేశంలో రూపుదిద్దుకుంటున్నది అనవచ్చు. 


ఇది దేశవ్యాప్తంగా ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది — “బీఫ్ పాలిటిక్స్” అనే దీర్ఘకాలిక వివాదాన్ని కొత్త దిశలోకి మళ్లించే ప్రయత్నం ప్రారంభమైంది. ఇది షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మించి వుధృతంగా మారే అవకాశాలున్నాయి. 


ముస్లింలు బీఫ్ మానేస్తే పశువుల్ని పోషించే హిందూ సమూహాల కులవృత్తి దెబ్బ తింటుందనీ,  వాళ్లు సామూహికంగా  స్థానభ్రంశానికి గురవుతారని కూడ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో బీఫ్ అమ్మే గాయ్ ఖసాబ్ లు కూడ వృత్తిని కోల్పోయే మాట కూడ నిజమే. అయితే, అప్పుడు ఎగుమతులకు మరింత ఎక్కువ బీఫ్ అందుబాటులోనికి వస్తుంది. అరబ్ ముస్లింలకు హలాల్ బీఫ్ ఎగుమతి, ఇక్కడి ముస్లీంలు బీఫ్ తింటే ద్వేష రాజనీతి ఎలాగూ మన పాలసీగా వుందిగా! 


23-05-2026

ప్రచురణ : 26-05-2026, ఆంధ్రజ్యోతి


https://www.andhrajyothy.com/2026/editorial/muslim-leaders-demand-cow-slaughter-ban-india-beef-politics-debate-1526765.html


Wednesday, 20 May 2026

I am afraid to go to Mecca -

 I am afraid to go to Mecca

*మక్కా కు వెళ్ళాలంటే నాకు భయం*.




 

ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ ఇవి ఐదూ ముస్లింలకు మౌలిక విధులు. మొదటి మూడింటికి ఎవ్వరికీ మినహాయింపులు లేవు. చివరి రెండింటినీ  ఆర్ధిక అవకాశాన్నిబట్టి పాటించాలి అనుకుంటాను.  

 

ఈమాన్ విషయంలో నాకు ఎప్పుడూ మరో ఆలోచనలేదు. నేను అల్లాను నమ్ముతాను. అల్లా దయ నా మీద బలంగా వుందని కూడ నమ్ముతాను. అనేక సందర్భాల్లో ప్రాణాపాయాల నుండి ఒక మెరికల్ గా నేను తప్పించుకున్నాను.

 

మార్క్సిస్టుగా వుంటూ అల్లాను నమ్మవచ్చా అనే సందేహం నాకు ఎప్పుడూ లేదు. కార్ల్ మార్క్స్ ను లండన్ లోని యూదుల హైగేట్ స్మశానంలోనే ఖననం చేశారు. మార్క్సిజం దైవ విశ్వాసానికి వ్యతిరేకం ఏమీకాదు.  రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ముస్లిం మార్క్సిస్టులు, ఇస్లామిక్ సోషలిస్టులు పెట్టుబడిదారీ విధానం, వలసవాదం, సామ్రాజ్యవాదం, ఫాసిజం, నాజీజంల మీద పోరాడారు. వీరు అణచివేతకు వ్యతిరేకం, న్యాయం, సమానత్వం అనే ఇస్లామిక్ సూత్రాలను మార్క్సిస్ట్ వర్గదృక్పథంతో జోడించి తిరుగుబాట్లు సాగించారు.

 

నమాజ్, రోజాల విషయంలో కొన్ని బద్దకాలున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కొన్ని బలహీనతలున్నాయి. అవన్నీ పూర్తిగా నా దోషాలు.  అందుకు నన్ను క్షమించాలి.  జకాత్, హజ్ నా ఆర్ధిక పరిధిలోని అంశాలు కావు.

 

“Feed the hungry, visit the sick, and free the captive if he is unjustly confined. Support anyone who is oppressed, whether Muslim or non-Muslim.” — Prophet Muhammad.

 

అనాధలు, వితంతువులు, నిస్సహాయుల విషయంలో దయగలిగి ప్రవర్తించంచండి అనే నియమాన్ని నేను ప్రతి సందర్భంలోనూ పాటించాను.  రాజ్యం నిరపరాధుల్ని బంధిస్తే వారి విడుదల కోసం పోరాడడం మన కర్తవ్యం అన్న ఆదేశం ఒక సామాజిక కార్యకర్తగా నాకు  ప్రేరణగా వుంటుంది. 

 

ఇండియా నా మాతృభూమి, నా కర్మభూమి, నా జీవన పుణ్యభూమి. ఒక దేశంగా సౌదీ అరేబియా ముస్లింలకు పుణ్యభూమి ఏమీ కాదు. ముస్లింల ధార్మిక పుణ్యస్థలాలు మక్కా, మదీనాలు.

 

సౌదీ అరేబియాతో నాకో అనుబంధం వుంది. మా మేనత్త (మానాన్నగారికి పెదనాన్న కుమార్తె) అఖ్తరి  జిద్దాలో సెటిల్ అయ్యారు. వారి భర్త సౌదీ అరేబియా కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అధికారి. నా బాల్యంలో కొన్నేళ్లు అఖ్తరీ ఫుప్పుజాన్ దగ్గరే వున్నానంటా. తనకు నేనంటే పెద్ద కొడుకు అనే భావన వుండేది. ఇదంతా 1953 నాటి సంగతి.

 

1980లో ఇండియాకు వచ్చిన అఖ్తరీ ఫుప్పుజాన్ నన్ను తనతోపాటు సౌదీకీ తీసుకుపోతానన్నారు. అప్పట్లో నక్సలిజం పూనకంలోవున్న నాకు ఇండియా వదిలి వెళ్ళాలనిపించలేదు.  ఆ తరువాత ఎన్నడూ వేరే దేశంలో కాలుపెట్టనూలేదు.

 

మా అమ్మీని హజ్ యాత్రకు పంపించాము. మా దగ్గర కొన్ని డబ్బులు వచ్చే సమయానికే మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన వారి పేరున కూడ హజ్ జరిపించే అవకాశం వుందని తెలిసి, మానాన్నగారి పక్షాన మా మేనమామ మగ్బూల్ ను హజ్ యాత్రకు పంపించాము.

 

వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో నేను ఒక రిపోర్టరుగా ముఖ్యమంత్రి పేషీ బీట్ చూసేవాడిని. అప్పట్లో షబ్బీర్ అలీ సమాచార శాఖా మంత్రిగా వుండేవారు. మైనారిటీ వ్యవహారాలనూ వారే చూసేవారు. మక్కాలో ఏపి  యాత్రికులకు హజ్ ఏర్పాట్లు చేయడం కోసం అధికారుల బృందం  ఒకటి స్పెషల్ ఫ్లయిట్ లో జిద్దా వెళ్ళీంది. హైదరాబాద్ నుండి కొందరు ముస్లిం రిపోర్టర్లను కూడ వారితోపాటు పంపించారు. అలా వెళ్ళే అవకాశం నాకు కూడ వచ్చింది.

 

హజ్ యేతర సందర్భాల్లో మక్కాను సందర్శించడాన్ని ఉమ్రా అంటారు. హజ్ అంతకాకున్నా ఉమ్రా కూడ గొప్ప పుణ్యకార్యమే. నాకు ధైర్యం చాలలేదు. ఉమ్రాకు వెళ్ళీ వచ్చిన తరువాత ఆ పవిత్రతను, నియమాలనూ  నిష్టను పాటించలేనని  భయం వేసింది. ఆమాటే మంత్రితో చెప్పి తప్పుకున్నాను.  

 

ఇప్పుడు ఆత్మీయ మిత్రులు, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి (Muslim JAC)  కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్  హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా నా హజ్ యాత్ర గురించి సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతోంది. నేను హజ్ యాత్ర చేయాలని కొందరు ప్రతిపాదిస్తే, నన్ను మక్కా తీసుకుని వెళతానని మునీర్ గారు ప్రకటించారు.

 

నా ఉద్దేశ్యంలో మక్కా టూరిస్టు పాయింట్ కాదు. విమానం ఎక్కి దిగి అక్కడో వారం రోజులు వుండి వచ్చేస్తే సరిపోదు. అదొక నిబధ్ధత. అదొక క్రమశిక్షణ. అదొక నిష్ట. చెయ్యాల్సినవి చెయ్యకూడనివి చాలా పెద్ద జాబితా వుంటుంది. నాలో అంతటి క్రమశిక్షణ వుందా? అనేది నా అనుమానం. నామీద నాకు నమ్మకం కుదిరిన రోజూ ఉమ్రాకే కాదు హజ్ యాత్రకే వెళుతాను.

 

20 మే 2026

Monday, 18 May 2026

Womb also a Geopolitical Space - గర్భాశయంపై భౌగోళిక రాజకీయాలు!*

 

* గర్భాశయంపై భౌగోళిక రాజకీయాలు!*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*





 

 

ప్రపంచం ఒకప్పుడు జనాభా పేలుడు గురించి భయపడింది. ఇప్పుడు జనాభా క్షీణత గురించి వణుకుతోంది! గర్భాశయం గొప్పతనం ఇప్పుడు పెరిగింది.

 

అవసరమే అన్వేషణలకు జన్మస్థలం అనే మనుగడ నియమం తెలీని ఓ భయస్తుడు థామస్ రాబర్ట్ మాల్థస్ ఓ పిచ్చి జనాభా సిధ్ధాంతంతో ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆయన సిధ్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనదేశం ఆహారం అందక కృంగి కృశించి అల్లాడిపోవాలి. అలా జరగడంలేదు. అవసరానికి మించి పండించే సామర్ధ్యం మనకుందని ప్రతి సంవత్సరం నిరూపిస్తున్నాం. ప్రతి ఏటా 35 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని పండిస్తున్నాం. ఏటా 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని ఎగుమతి చేస్తున్నాం. అనధికారికంగా స్మగుల్ అవుతున్న ఆహారధాన్యాలకు లెఖ్ఖలు లేవు.  ‘సీజ్ ద షిప్’ కథ గుర్తుంది కదా!

 

“మేమిద్దరం మాకిద్దరు” “పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం” “చిన్న కుటుంబం – చింతలు లేని కుటుంబం” “ ఒక్కరే ముద్దు – ఆ తరువాత వద్దు” ఇలాంటి నినాదాలు 1960, 70 లలో హోరెత్తించాయి. కథ అక్కడి నుండి మొదలైంది. మతద్వేషాన్ని పెంచి దేశ ప్రధాని కాదలచిన ఒక రాష్ట్ర  ముఖ్యమంత్రి ముస్లింలను జనాభా దోషులుగా చిత్రించడానికి కొత్త నినాదాన్ని రూపొందించారు.  “హమ్ పాంచ్ హమారే పచ్చీస్” (ఒక భర్త, నలుగురు భార్యలు- వారికి పాతికమంది సంతానం) అని భయపెట్టేంత వరకు సాగింది వారి ప్రచారం.

 

ఇప్పుడు అదే సంఘపరివారానికి అధినాయకులైన మోహన్ భగవత్ నలుగురు పిల్లల్ని కనాలంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లల్ని కనేవారికి వేల రూపాయల నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.

 

ఇది భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. రష్యా, చైనా, యూరప్ — అందరూ ఒక్కసారిగా ‘ఫెర్టిలిటీ’ గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం కుటుంబ సమస్యనా? లేక భవిష్యత్ ప్రపంచాధిపత్య యుద్ధమా? పెట్రోలు స్థానాన్ని జనాభా ఆక్రమిస్తున్నదా?

 

విద్యార్ధులు లేక ఖాళీగా పడున్న కుర్చీల్ని చూసి జపాన్ వణుకుతోంది. పాఠశాలలు మూతపడుతున్నాయి. యూరప్‌లో వృద్ధులే ఎక్కువ. దక్షిణ కొరియాలో పెళ్లిళ్లు తగ్గిపోయాయి. తైవాన్ జనాభా అంతరించిపోతోంది. ఇటలీలో గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రీస్, పోర్చుగల్ పరిస్థితి అదే. చొరబాటుదార్లను తరిమేస్తాం  అంటూ మనం ఎన్నికల హామీలు ఇస్తుంటే, జర్మనీ  విదేశీయుల్ని తమ దేశానికి రావాలని బతిమాలుకుంటోంది. అక్కడ యంత్రాలున్నాయి; యంత్రాల మీద పనిచేయడానికి మనుషులు లేరు. 

 

జనాభాకు ముంచుకొస్తున్న ముప్పును చూసి రాజకీయ నాయకులు, ధార్మిక పెద్దలు కొత్త నినాదం మొదలుపెట్టారు — “పిల్లలు కనండి!” అంటున్నారు. ఎందుకంటే, జనాభా లేకపోతే మార్కెట్ ఉండదు. సైన్యం ఉండదు. కార్మికులు ఉండరు. పన్నులు కట్టేవాళ్లు ఉండరు. కార్మికులు లేకపోతే కార్పొరేట్ సామ్రాజ్యాల శ్వాస ఆగిపోతుంది అని కార్ల్ మార్క్స్ అన్న మాటలు ఈ సందర్భంగా సహజంగానే  గుర్తుకు వస్తాయి. ప్రపంచం ఇప్పుడు ‘డెమోగ్రాఫిక్ ఎమర్జెన్సీ’ని ఎదుర్కొంటోంది.”

 

మోహన్ భగవత్  పెద్దకుటుంబాల గురించి మాట్లాడినప్పుడు చాలా మంది దాన్ని కేవలం సిద్ధాంత రాజకీయంగా చూశారు. కానీ అసలు భయం ఇంకోటి. ఇండియా సంతానోత్పత్తి రేటు ఇప్పటికే భర్తీస్థాయి దిగువకు వచ్చేస్తోంది. అంటే భవిష్యత్తులో వృద్ధులు ఎక్కువ; యువత తక్కువ! ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదు; ఇది ఆర్థిక యుద్ధం.

 

స్వామి వివేకానంద ఒక సందర్భంలో  ఒక జాతి బలం దాని ప్రజలే అన్నాడు. ప్రజలు లేకుండా దేశభక్తి నినాదాలు కూడా నీరసపడిపోతాయి. తమాషా ఏమిటంటే, ఏళ్ల తరబడి ‘జనాభా నియంత్రణ’ గురించి చెప్పిన వ్యవస్థే ఇప్పుడు ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అంటోంది. చరిత్రలో ఇది చాలా పెద్ద మలుపు. ఒక పెద్ద కుదుపు!

 

ప్రభుత్వాలు ఇప్పుడు ప్రసూతిని  సంక్షేమంగా కాకుండా జీవికను కాపాడుకునే  మార్గంగా చూస్తున్నాయి. ఇది ఒక దేశం కథ కాదు; ప్రపంచ సంక్షోభం. తూర్పు ఆసియాలో, దక్షణ కొరియా, జపాన్, చైనా, తూర్పు యూరప్ లో యుక్రేయిన్, రష్యా, బల్గేరియా, దక్షణ యూరప్ లో ఇటలీ గ్రీస్ లలో ప్రసూతి సంక్షోభం చాలా తీవ్రంగా వుంది. అనేక దేశాలు పిల్లలు కనేవారికి పన్ను మినహాయింపులు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. వారికి ఒక విషయం అర్థమైపోయింది; జనాభాయే ముక్తి. ఈమాట వినగానే ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆగస్టే కోమ్టే మాటలు ‘డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ’ గుర్తుకు వచ్చి వుంటాయి.

 

ఇప్పుడు ప్రపంచం ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా వుండడం గురించి చర్చిస్తోంది. ప్రసవ రేటు అధికంగా వుండడానికి జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు కూడ వుంటాయి.  అందులో భాగంగా ధార్మిక కారణాలూ వుంటాయి. వాటిని పరిశోధించాలి. పిల్లల్ని కనడానికి 19 నుండి 29 సంవత్సరాలలోపు  సానుకూలమైన వయస్సు. యువతరం ఆ వయసులోనే పెళ్ళి చేసుకునేలా సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానికి తగ్గ వాతావరణాన్ని చట్టపరంగా  ఏర్పాటు చేయాలి.

 

2001 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో  విడాకులు తీసుకున్నలేదా విడిపోయిన మహిళలు 23.5 లక్షల మంది. పదేళ్ళ తరువాత 2011లో వీరి సంఖ్య 33 లక్షలకు చేరుకుంది. పదేళ్ళలో 40 శాతం పెరుగుదల. 2021లో జనాభా లెఖ్ఖలు తీయలేదుగానీ అది 46 లక్షలకు చేరివుంటుందని అంచనా. 2031 నాటికి ఈ సంఖ్య 65 లక్షలు దాటుతుంది.

 

సమాజాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలు సరిపోవు. సమాజ విశ్లేషకులు ఇంకొన్ని అడుగులు ముందుకు వేయాలి. గణాంకాల్ని సామాజికవర్గాలవారీగా వర్గీకరించాలి. అప్పుడు విడాకులు తీసుకున్న / విడిపోయిన మహిళలు ఏ కుల, ఏ మత  సమూహాల్లో ఎక్కువ శాతం వున్నారో తేలిపోతుంది. కులమత విద్వేషాలను రేకెత్తించే వారికి ఇలాంటి  వర్గీకరణలు నచ్చవు. “ముస్లింలలో విడాకులు ఎక్కువ” అని ప్రచారం చేసేవారికి ఈ గణాంకాలు గొంతు దిగవు. మరో విషయం ఏమంటే, వితంతువుల్ని, విడాకులు పొందిన స్త్రీలని వివాహం చేసుకునే సాంప్రదాయం ముస్లిం సమాజంలో ఏడవ శతాబ్దం ఆరంభం నుండే వుంది. దీనినొక సామాజిక విలువగా గుర్తించడానికి మిగిలిన సమూహాలకు వెయ్యేళ్ళకు పైగా పట్టింది.

 

ప్రధాన స్రవంతి  మీడియా, సోషల్ మీడియా రెండూ ఒక క్లిష్టమైన సామాజిక అంశాన్ని ‘భయ రాజకీయంగా’ మార్చడానికి అదనపు గంటలు శ్రమిస్తున్నాయి. సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డర్కెమ్ అవగాహన ప్రకారం సమాజం సంఘీభావంతో ఏర్పడుతుందిగానీ భయంతోకాదు. ఎందుకంటే మాతృత్త్వాన్ని కూడ ఒక రాజకీయార్ధిక ఆయుధంగా మార్చేస్తే సమాజమే అంతరించిపోతుంది.

 

గత మార్చి నెలలో రంజాన్ పండుగ సందర్భంగా  రష్యా అధినేత వ్లదిమీర్ పుతిన్ తన అధికార నివాసంలో ముస్లిం పిల్లలతో వేడుక చేసుకుని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి సాధారణ ఫోటోలు కావు; ఒక సరికొత్త రాజకీయ సంకేతం. యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, జనాభా సంక్షోభం మధ్య క్రెమ్లిన్ ఇప్పుడు ముస్లిం సమాజాన్ని వ్యూహాత్మకంగా ప్రయోజనకారిగా చూస్తోంది. ఇది కేవలం మత సహనం కాదు; జనాభా డిమాండ్.  

 

మావో కాలంలో జనాభాను చైనా ఒక శక్తిగా భావించేది. తర్వాత దానికీ జనాభా భయం పట్టుకుంది. కుటుంబ నియంత్రణల్ని చాలా కఠినంగా  సాగించింది. అదే చైనా ఇప్పుడు యువతను పెళ్లి చేసుకోమని వేడుకుంటోంది. ఇది చరిత్రలోని అతిపెద్ద వ్యంగ్యాల్లో ఒకటి. చైనా వాయువ్య ప్రాంతలో వుండే వ్యూఘుర్ ముస్లింలను అప్పట్లో క్రూరంగా  అణిచివేసేవారు. కొత్తతరం పుట్టక  సతమతమైపోతున్న చైనాకు ఇప్పుడు ముస్లింల మీద  సానుకూల వైఖరి పుట్టుకొచ్చింది.  

 

ప్రపంచ నాయకులకు ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్ధం అయిపోయింది; జనాభా లేకపోతే దేశాలు ఖాళీ అయిపోతాయి.  1970లలో అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ లకు రక్షణ వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన హెన్రీ కిస్సింగర్ పంటల్ని నియంత్రిస్తే మానవాళిని నియంత్రించవచ్చు అనేవాడు. ఇప్పుడు ఆ సూత్రం మారింది; ‘జనాభాను కాపాడుకుంటే భవిష్యత్తును శాసించవచ్చు’. ఇప్పుడు ఇదే కొత్త గ్లోబల్ రాజకీయ వ్యూహం!

 

ఇప్పుడు ప్రపంచ యువత క్రమంగా పెళ్లి నుంచి దూరమవుతోంది.  సౌకర్యవంతమైన జీవితం మీద ఆశ, ఉద్యోగ అస్థిరత, ఒంటరి జీవన విధానం, వినియోగదారీ సంస్కృతి దీనికి కారణాలు. సోషియాలజిస్ట్ జిగ్మంట్ బౌమన్ ద్రవాధునికత అన్నది దీనినే. స్థిరమైన బంధాలు కనమరుగౌతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ స్థిరంగా వుండడం సాధ్యం కాదు. మనం స్థిర కుటుంబాన్ని నిరాకరిస్తే సంతానోత్పత్తికి అవకాశాలు తగ్గిపోతాయి.  నశించిపోతున్న మానవ జాతిని పునరుత్పత్తి సామర్ధ్యంతో  నిలబెట్టే శక్తి ఒక్క మహిళలకే వుంది. దానిని గౌరవించడం నేర్చుకోవాలి. మహిళల్ని గౌరవించకపోతే మానవజాతి నిలబడదు.

          ఇరవయ్యొకటో శతాబ్దంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతో జరగవు; జనాభాతో కూడా జరుగుతాయి. ఎవరి దగ్గర యువత ఎక్కువగా ఉంటే… వాళ్ల దగ్గర మార్కెట్ ఉంటుంది. వాళ్ల దగ్గర కార్మికులు ఉంటారు. వాళ్ల దగ్గర సైనికులు ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మహిళల గర్భాశయాన్ని కూడా భౌగోళిక రాజకీయ వేదిక (geopolitical space) గా చూస్తోంది.

 

ఇది వినడానికి కఠినంగా ఉన్నా — నిజం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మహిళలకు గౌరవం, భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, పిల్లల్నికనే సానుకూల వాతావరణం కల్పించకుండా కేవలం ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అని చెప్పడం సరిపోతుందా?

 

18-05-2026


Thursday, 14 May 2026

Parliamentary democracy — a Sedative? or a Solvation?

 Parliamentary democracy — a Sedative? or a Solvation?

ప్రజాస్వామ్యమా? రాజకీయ మాయా?

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో ‘ప్రజాస్వామ్యం; అనే పదానికి వచ్చినంత పవిత్రత మరే రాజకీయ సిధ్ధాంతానికీ రాలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తనను ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వంగానే ప్రకటించుకుంటోంది. ప్రతి యుద్ధం, ప్రతి ఆర్థిక విధానం, ప్రతి చట్టం — ప్రజాస్వామ్యం పేరుతోనే సాగుతున్నాయి. ఇరాన్ మీద యుధ్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన రాజకీయ ఆయుధం ‘పాలనమార్పు’ (Regime change). అంటే, ఇరాన్ లో నియంతృత్త్వాన్ని అంతంచేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని నమ్మబలికాడు. ఆ మంత్రం ప్రభావవంతంగా పనిచేసింది. ఆ దెబ్బకు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయేల్ ల జంటదాడిని ఖండించడానికి కూడ అనేక దేశాలు జంకాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటే హజార్ ఖూన్ మాఫ్ !

కానీ, అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న ఇక్కడే ఎదురవుతుంది. ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల పాలనేనా? లేక ప్రజల పేరుతో నడిచే ఇతరుల అధికార వ్యవస్థనా?

మార్క్సిస్టులకు  సాంప్రదాయంగా  ప్రజాస్వామ్యం మీద ఎలాగూ నమ్మకం వుండదు. పెట్టుబడీదారీ వ్యవస్థ తనకు అనుకూలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించుకుందన్నారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ ముక్తకంఠంతో. అంచేత వాళ్ళ మీద ప్రజాస్వామ్య మంత్రం ప్రభావం చూపదు.

           రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత, ముఖ్యంగా ముస్సోలినీ – హిట్లర్ల ఫాసిస్టు, నాజీయిస్టు నియంతృత్త్వాలను  చూసిన తరువాత  ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం మీద వ్యామోహం ప్రమాదకరంగా పెరిగింది. ఈ ‘పవిత్ర మాయాజాలం’ను ఛేధించడానికి  ప్రయత్నించినవాళ్లలో ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు జాన్  డన్న్ ఒకడు. ‘ప్రజాస్వామ్యపు మాయజాలం ఛేదింపు’ అనే పుస్తకంలో క్రూరంఐన నియంతృత్త్వమే అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం ముసుగులో  కొనసాగుతున్న తీరును అతను లోతుగా విశ్లేషించాడు. 

అనేక దేశాల్లో క్రమం తప్పకుండ ఎన్నికలు జరుగుతున్నాయి. రుతుక్రమం తప్పకుండ చట్టసభలు నడుస్తున్నాయి. అనేక చట్టాలు మెజారిటీ సభ్యుల ఆమోదం పొందుతున్నాయి. ప్రతిపక్షాలు కూడ సభలు సమావేశాలు నిర్వహించి తమ విధానాలను ప్రకటిస్తున్నాయి. అధికార పార్టీలను ఘాటుగానే విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికార పార్టి ఓటమిపాలై  ప్రతిపక్ష పార్టి  అధికారాన్ని చేపడుతోంది. ఇన్ని జరిగినా, ప్రజాస్వామ్యానికి నిఘంటువుల్లో అర్ధం చెప్పినట్టు సమాజంలో జరుగుతోందా? తమ జీవితాలను తాము అనుకున్నట్టు మార్చుకునే అధికారం నిజంగా ప్రజల చేతుల్లో ఉంటోందా?

జాన్  డన్న్ వాదన ప్రకారం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక రాజకీయ మత్తుమందుగా మారిపోయింది. ఎన్నికలు జరుగుతున్నాయనే కారణంతో ప్రజలు తమకు అధికారం ఉందని భావిస్తున్నారు. కానీ అసలు అధికార నిర్మాణాలు మాత్రం కార్పొరేట్ శక్తులు, మీడియా సామ్రాజ్యాలు, అంతర్జాతీయ పెట్టుబడి, భద్రతా వ్యవస్థల చేతుల్లోకి జారిపోతున్నాయి. ఇదే ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అంతర్గత విషాదం.

భారత రాజకీయ వ్యవస్థను గమనిస్తే ఈ వైరుధ్యాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్‌ను చాలా మంది  ప్రశంసిస్తారు. 2024లొ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటింగులో పాల్గొన్నారు. వీరిలో 31 కోట్ల మంది మహిళలు. ఈ అంకెల్ని చూస్తే ప్రపంచం నివ్వెరపోవాల్సిందే. అయితే, కులాధిపత్యం, ధన ప్రభావం, ఎన్నికల అవినీతి, మీడియా మానిప్యులేషన్, రాజకీయ నేరీకరణ, రాజకీయ మతీకరణ  వగయిరాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయంటే అతిశయోక్తికాదు.

         “సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు” అని బిఆర్ అంబేడ్కర్ చాలాసార్లు హెచ్చరించాడు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లోని 824 శాసన సభ నియోజకవర్గాలను ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలోవున్న పార్టి వీటిల్లో ఒక్క సీటు కూడా ముస్లింలకు కేటాయించలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయి నాయకులు ముస్లిం వ్యతిరేక ప్రచారం సాగించి హిందూ ఓట్లను ఆకర్షించి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించారు. బిజెపికి ఓటు వేయని వార్నీ, విపక్షాలకు మద్దతు తెలిపే వారినీ ఎన్నికల సంఘం ఏకంగా ఓటర్ల జాబితా నుండి తొలగించిందని  విపక్షాలు అనేకసార్లు ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణల్ని నిజం  చేస్తూ, నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేసిన మనోజ్ కుమార్ అగర్వాల్ ను ఆ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరిగా నియమించారు. ఆ రాష్ట్రానికి స్పెషల్ ఎలక్షన్ ఆబ్జర్వర్ గావున్న డాక్టర్ సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించారు.

యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు; ప్రతి ఓటుకూ సమాన విలువ అని రాజ్యాంగం అంటే చాలామంది చాలాకాలం మైమరచిపోయారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమాన ఓటు హక్కు ఇవ్వగలదు; కానీ, సమాన శక్తి ఇవ్వదు అని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ హెచ్చరిక ఇప్పుడు మరింత సత్యంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కానీ సామాజిక అసమానతలు మరింత బలపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల కంటే ఎన్నికల యంత్రాలుగా మారుతున్నాయి. పౌరులు క్రమంగా ఓటు బ్యాంకులుగా, డేటా యూనిట్లుగా మారుతున్నారు.

ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందా? అనే ప్రశ్న కీలకమైనది. ప్రజలు ఐదేళ్లకోసారి ఓటు వేస్తారు. కానీ ఆ తర్వాత జరిగే వేలాది నిర్ణయాలన్నీ కార్పొరేట్ల అవసరాలు,  లాబీయింగ్,  రహస్య ఒప్పందాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్ళు, మీడియా ప్రచార యుద్ధాలు, రాజ్యాంగ వ్యవస్థల కుమ్మక్కు వగయిరాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. వీటికి అంతిమంగా “ప్రజాస్వామ్య నిర్ణయం” అనే ముద్ర వేస్తే చాలు అది పవిత్రం అయిపోతుంది.  ఇది ప్రజాస్వామ్యమా? లేక ప్రజాస్వామ్యం పేరుతో నడిచే వ్యవస్థీకృత రాజకీయ మాయా?. దీనికి మనకు జవాబు దొరకదు.

ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నిర్ణయమని భావించడం ఎంత ప్రమాదకరమో ప్రపంచం ఇరాక్ యుధ్ధంలో  చూసింది. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశంలో  కోట్లాది ప్రజలు  వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా యుద్ధం ప్రారంభించాయి. కల్తీలేని నియంతల్లా ప్రవర్తించాయి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD) వున్నాయంటూ ఇరాక్ లో ప్రవేశించాయి. సద్దాం హూస్సేన్ చనిపోయినా ఆ జీవరసాయన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ జాడ కనిపించలేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడికీ అలాంటి నెపం ఒకటి వేశారు; ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నదని. యుధ్ధం మొదలై 75 రోజులైనా ఎవరికీ వాటి జాడ కనిపించలేదు. ఈ యుధ్ధానికి అమెరికా పౌడుల మద్దతువుందా? అంటే అదీ అనుమానమే. అయినప్పటికీ అమెరికాను గొప్ప ప్రజాస్వామిక దేశం అంటున్నారు.  ఇదె ప్రజాస్వామ్య విషాదం.

ఇక్కడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అసలు సంక్షోభం బయటపడుతుంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వాలపై ప్రభావం చూపేది ఎవరు? సాధారణ పౌరులా? లేక కార్పొరేట్ పెట్టుబడిదారులా?

నేటి ఎన్నికలు కూడా మార్కెట్ ఉత్పత్తులుగా మారిపోయాయి. రాజకీయ పార్టీలు బ్రాండ్ సంస్థల్లా పనిచేస్తున్నాయి. మీడియా ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడం మానేసి ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తోంది. సోషల్ మీడియా యుగంలో భావోద్వేగాలే రాజకీయ ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమంగా “కార్పొరేట్ పార్లమెంటరీ వ్యవస్థ”గా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి.

ప్రజాస్వామ్యం ఒకప్పుడు ప్రజలకు విముక్తి ఆశను ఇచ్చింది. రాజరికాలను, వలస పాలనలను, నియంతృత్వాలను సవాలు చేసే శక్తిగా ఎదిగింది. కానీ అదే ప్రజాస్వామ్యం ఇప్పుడు మార్కెట్ శక్తులతో కలిసిపోయి ప్రజలనే నిస్సహ్సాయులుగా వుంచేస్తోంది. 2011 మార్చి నెలలో జపాన్ లోని ఫుషికుమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం దీనికి గొప్ప ఉదాహరణ.  జపాన్ లో ప్రజాస్వామిక ప్రభుత్వమే వుంది. అయినప్పటికీ, అది కార్పొరేట్ల ప్రయోజనాలను నేరవేర్చే క్రమంలో ప్రజల భద్రతను కూడ పక్కన పెట్టింది. ప్రజాస్వామ్యం ఉన్నంత మాత్రాన ప్రజల భద్రతకు హామీ వుంటుందని చెప్పడానికి వీల్లేదని ఫుషికుమా  సంఘటన నిరూపించింది.  ఇదే నేటి ప్రపంచ సంక్షోభం.

అయితే దీనికి పరిష్కారం నియంతృత్వమా? అనే ప్రశ్న కూడ ముందుకు రావచ్చు.  మతద్వేషానికి విరుగుడు మతద్వేషం కానట్టే విఫలమైన ప్రజాస్వామ్యానికి విరుగుడు నియంతృత్వం కాదు. అయితే, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఎన్నికల ప్రక్రియ మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజల జీవితాలపై నిజమైన నియంత్రణ, సమాచారం మీద ప్రజల హక్కు, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం — ఇవన్నీ లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమంగా ఖాళీ పూజా కర్మకాండంగా మారిపోతుంది.

ప్రజాస్వామ్యం పవిత్రగ్రంధం కాదు. అది ఒక రాజకీయ సాధనం మాత్రమే. ఆ సాధనం విముక్తి ఇవ్వగలదు, మత్తెక్కించగలదు, ప్రజలను శక్తివంతం చేయగలదు, మత ద్వేషాల్ని రెచ్చగొట్టగలదు, మోసం కూడా చేయగలదు.  అందుకే ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని  ప్రజాస్వామ్యాన్ని పూజించడం కాదు; దానిని అర్థం చేసుకోవడం. దాని మాయాజాలాన్ని ఛేదించడం. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల పండుగ నుంచి ప్రజల నిజమైన భాగస్వామ్య వ్యవస్థగా మార్చడం. లేకపోతే ‘ప్రజాస్వామ్యం’ అనే పవిత్ర పదం చివరికి ప్రజల స్వరాన్నే మింగేసే రాజకీయ మత్తుమందుగా మారిపోవచ్చు. ముస్సోలిని, హిట్లర్ కూడ ముందు ప్రజాస్వామికంగానే ఎన్నికయ్యారనేది మనం మరచిపోకూడదు.

14 మే 2026

ప్రచురణ ః ఆంధ్రజ్యోతి 19 మే 2026