ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
అమిత్ షా మెడకు చుట్టుకోనున్నదా?
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
ఈ దశాబ్దపు ఒక అద్భుతంగా బొద్దింకలు ప్రధాని మోదీ మెడను వంచి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాయి. ఈ ఘనత కాక్రోచ్ జనతాపార్టి నేత అభిజిత్ దీప్కే, ఆ పార్టి ప్రతినిధులు, సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రంకాలకు ప్రధానంగా ఎలాగూ దక్కుతుంది. పిల్లల ఉద్యమానికి పెద్దరికాన్ని సమకూర్చిన సోనమ్ వాంగ్చూక్ కూ ఈ ఘనత దక్కుతుంది. వాళ్ళతో కలిసి అద్భుతంగా పోరాడిన ఏఐఎస్ ఏ విద్యార్ధి సంఘం నాయకులు నేహా బోరా, ఆమీన్ అమితోజ్, మనీష్ కుమార్ లకు కూడ ఈ ఘనత దక్కుతుంది. ఏఐఎస్ ఏ ఎలాగూ మార్క్సిస్టు లెనిస్టు భావాలుగల సంస్థ. దానితోపాటూ వామపక్ష విద్యార్ధి సంఘాలు కూడ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించాయి. ఒక వాదం ప్రకారం ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం లేని సిజేపికి ఆ కొరతను కమ్యూనిస్టు విద్యార్ధులే తీర్చారు. ఈ ఉద్యమం లోనికి పేరెంట్స్ కూడ పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇది రెండు తరాల ఉద్యమంగా మారి విజయావకాశాలు బాగా పెరిగాయి. ఢిల్లీ ఎండల్లో నిరసనకారులకు తాగడానికి నీళ్ల బాటిళ్ళు, తినడానికి ఆహారాన్ని పంపించిన అజ్ఞాతదాతలు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు.
ఈ జాబితా చాలా పెద్దది. కానీ, తప్పని సరిగా పేర్కోవాల్సిన పేరు భారత ప్రధాన న్యాయ మూర్తి సూర్యకాంత్ గారిది. ముందు వారు కాక్రోచెస్ అని విసుక్కోవడంతో బొద్దింకల ఆత్మగౌరవ ఉద్యమం మొదలయింది. సోనమ్ వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించాక ఉద్యమం ముగిసిపోతుందేమోననీ ఆందోళన చెందుతున్న సమయంలో, మళ్ళీ వారే లాఠీచార్జీ వీడియోలను చూసే సమయం తనకు లేదంటూ ప్రకటించి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి గొప్పగా దోహదపడ్డారు. ఈ ఉద్యమం మొదలు కావడానికీ, విజయవంతం కావడానికీ వారే కారణం. ఈ అంశం అభిజిత్ కు కూడ తెలుసు. ఉద్యమ ముగింపు సందేశంలో ఆయన ‘మిత్రులతోపాటూ శత్రువులకు’ కూడ ధన్యవాదాలు తెలిపారు.
గత పుష్కర కాలంగా ప్రజలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయాన్ని తరచుగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకోగానీ, ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్వర్, దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ లను కూడ తరచూ గుర్తు చేసుకుంటున్నారు. మంచిగా కాదు.
ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఒక లెఖ్ఖ ప్రకారం ఆయన రాజీనామాతో నీట్ విద్యార్ధుల ఉద్యమం ముగిసినట్టే. ఇంకో లెఖ్ఖపరకారం ధర్మేంద్ర రాజీనామా కొత్త ఉద్యమానికి బీజాలు వేసింది. మరోమాటల్లో చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు అమిత్ షా మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి.
రాజీనామా చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకున్న కారణాలు ఏమైనా కావచ్చు. నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకూ, ఆ కారణంగా అనేక మంది విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైనందుకూ, లక్షల మంది విద్యార్ఢుల ఆత్మక్షోభకూ, వారి కుటుంబ సభ్యుల ఆవేదనకూ మూలమైనందుకూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో విద్యార్ధులు బాధితులు ప్రభుత్వం బాధ్యురాలు.
ఇక్కడే ఒక న్యాయపరమైన చిక్కు వచ్చిపడింది. విద్యార్ధులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుని సంబంధిత మంత్రిని పదవి నుండి తప్పిస్తే, ఆ విద్యార్ధుల మీద లాఠీ చార్జీ చేసిన పోలీసులు, చేయించిన హోంమంత్రి గురించి న్యాయశాస్త్రంలోవున్న నిర్వచనం ఏమిటీ? ఇది ఇప్పటి ప్రశ్న.
ఆన్యాయానికి గురైన విద్యార్ధులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ఒక ప్రజాస్వామిక హక్కు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోవడం ప్రభుత్వం చేసిన తప్పు. తప్పుచేసిన ప్రభుత్వం బాధితులయిన విద్యార్ధుల మీద లాఠీచార్జీ చేయడం మరో నేరం.
అది సాధారణ లాఠీ చార్జీకాదు. పోలీసులు నిరసనకారుల మీద సాక్షాత్తు యుధ్ధం చేశారు. లాఠీలకు మేకులు గుచ్చారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఆ ఆదేశాలు హోంశాఖ నుండే వచ్చివుండాలి. పురుష పోలీసులు మహిళల మీడ లాఠీ చేయడమే ఒక నేరం అయితే. కొందరు పోలీసులు వారితో వీడియోల సాక్షిగా చాలా అసభ్యంగా వ్యవహరించారు. అది కూడ నేరమే. యూనిఫాం ధరించిన పోలీసులతోపాటూ సాదా దుస్తులలో ఉన్న వ్యక్తులు సహితం విద్యార్థుల మీద విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్నీ ప్రైవేటు సంస్థలకు అప్పచెపుతున్న మోదీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థనూ ప్రేవేటు సంస్థకు అప్పచెప్పారా? లేక ఇది ప్రభుత్వ ప్రాయోజిత గూండాయిజమా? అనే అనుమానాలు చెలరేగేలా వున్నాయి వీడియో ఫుటేజులు. పోలీసు వున్నతాధికారులు సహితం చెలరేగిపోయారు. మహిళల్ని టార్గెట్ చేసుకుని క్రూరంగా కొట్టారు.
అభిజిత్ దీప్కే ఒక దళీతుడు, సోనమ్ వాగ్చుక్ ఆదివాసీ. పదిమందికి ఉపయోగపడే ఒక మంచి డిమాండ్తో ముందుకు వస్తే చాలు. అతని సామాజికవర్గం ఏమిటీ? అని ప్రశ్నించకుండానే సమాజం అతని వెంట నడుస్తుంది. ఇదే ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన కొత్త రాజకీయ నేరేటివ్. అంతేకాదు ఒక వాగాడంబరుడిని ఎదుర్కోవడానికి ఒక గొప్ప వక్త కావాల్సిన అవసరం లేదని కూడ ఈ ఉద్యమం నిరూపించింది.
మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్ గా యువ తరంగం మొదలయింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో జెన్ –జీగా, మన దేశంలో కాక్రోచెస్ రూపం తీసుకుంది. పేరేదైతేనేం ఇది కొత్తతరం; అందులోనూ విద్యార్ఢులు. చదువుకున్న తరం విద్యాగంధం లేనివాళ్ళను దేశాధినేతలుగానో, ప్రభుత్వాధి నేతలుగానో భరించదు.
దేశప్రజల్ని హిందూ-ముస్లింగా చీల్చి సులువుగా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సంఘపరివారం గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ప్రభుత్వ వైఫల్యాలని ఎవరు ప్రశ్నించినా ముస్లింలు, జిహాదీలూ, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టోపీవాలాలు, మియాలు, ఖలిస్తానీలు, చైనా ప్రేరేపితులు, జార్జ్ సోరస్ పేటీంలు (కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా అమెరికా - సిఐఏ / రష్యా ఏజెంట్లు కూడ) అని నిందించడం పరిపాటి అయిపోయింది. ఈ నిందలకు భయపడి అనేక ఉద్యమాలు చాలా సందర్భాల్లో వెనుకంజ వేశాయి. బొద్దింకల ఉద్యమం ఈ నిందలకు భయడలేదు. మూతి పగిలేలా సమాధానం ఇచ్చింది. నిందలన్నింటినీ కట్టకట్టి దేశ రాజధాని నగర మురుగు కాలువల్లో పడేసింది. ఈ పరిణామాలన్నీ ఇంత వేగంగా జరిగిపోతాయని ఎవరూ ఊహించి వుండరు.
కథ ఇక్కడితో ముగియలేదు. మరికొన్ని డిమాండ్లతో ప్రజలు ఎలాగూ ముందుకు వస్తారు. అలావస్తే ఈసారి వాళ్ళ మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తాం అనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఇండియా గాబట్టి విధ్యార్ధుల మీద లాఠీచార్జి మాత్రమే జరిపి వదిలేశారు. విదేశాల్లో అయితే ఫైరింగ్ జరిపేవారని బిజెపి చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈసారి భారత ప్రధాన న్యాయమూర్తి కొంచెం సమయం కేటాయించి. నిరసన చేస్తున్న విద్యార్ధుల మీద లాఠీచార్జీని “సమర్ధించలేం” అన్నారు. అప్పటికే సమయం మించిపోయింది. ఇండియాను విదేశంగా మార్చాలనే ఉత్సాహంతో ఊగిపోతున్న బీహార్ పోలీసులు ఆరోజే విద్యార్ధుల మీద ఏకంగా ఏకే 47తో కాల్పులు జరిపారు. ఇది హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాల్సిన వ్యవహారం.
దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోకుండా ఉండాలనీ, దేశఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే తనూ రాజీనామా ఇస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన కూడ అమిత్ షా మెడకు చుట్టుకునేదే. దేశవ్యతిరేక శక్తులు ఏకంగా దేశ రాజధాని నగరంలో లక్షల సంఖ్యలో నిరసనకు దిగారంటే ఇంతటి భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరూ? దానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి కదా?
సిజేపి భవిష్యత్తు కార్యక్రమం ఏమిటీ? అనే ప్రశ్న ఈ సందర్భంగా సహజఙానే వస్తుంది. అదేమోగానీ, విద్యార్ధుల ఉద్యమం ఇచ్చిన ఉత్తేజంతో సమీప భవిష్యత్తులో అనేక ఉద్యమాలు తలెట్టుతాయి. అమెరికా ట్రేడ్/ఆగ్రీ డీల్ కు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని చేప్పట్టాలని సంయుక్త్ కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ అప్పుడే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు దిగుమతుల్ని తగ్గించాలనే సాకుతో వాహనాల్లో ఎథనాల్ వాడకాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల మీద కూడ ప్రజల్లో తీవ్ర అసహనం వుంది.
పౌరసత్వ చట్టం మీద షాహీన్ బాగ్ నిరసన, నల్లచట్టాల మీద రైతుల నిరసన, లైంగిన వేధింపుల మీద మహిళా రెజ్లర్ల నిరసన అన్నీ విజయాలు సాధించకుండానే ముగిసిపోయాయి అనుకున్నాము. అవన్నీ కలిసి విద్యార్ధుల ఉద్యమంగా విజృంభిస్తాయని ఒక్కరూ ఊహించి వుండక్లపోవచ్చు. ఓడిపోయింది ఓడిపోయినట్టుకాదు; గెలిచింది గెలిచినట్టూ కాదు. ఈ తత్వం ు తెలియాలంటే ఓపిగ్గా కొన్నాళ్లు ఎదురుచూడాలి.
దశాబ్దాల తరబడి సమాజంలో ఏ కదలికా కనిపించని కాలాలు ఉంటాయి. అదే సమయంలో, దశాబ్దాల పరిణామం కొన్ని వారాల్లోనే సంభవించే సందర్భాలూ ఉంటాయి. చరిత్ర నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా వాయు వేగంతో పరుగెత్తడం మొదలుపెడుతుంది. ఈ మాటల్ని లెనిన్ అన్నట్టున్నాడు. ఇప్పుడు మనం అలాంటి ఒక దశను చూస్తున్నామేమో.
26 జులై 2026 – telugu prabha
