Ganapati
సుదీర్ఘకాలం వున్నారు
సరే; ఏంచేశారూ?
డానీ
సమాజ విశ్లేషకులు
నక్సలైట్ ఉద్యమంలో గణపతి పేరుతో ప్రసిద్ధులైన
ముప్పాళ లక్ష్మణరావు అజ్ఞాత జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వస్తారనే చర్చ మళ్ళీ
మొదలైంది. అయితే, గణపతి బహిరంగ జీవితంలోకి తిరిగి వస్తారా లేదా అన్నదానికంటే ఆయన మీద కొన్ని పెద్ద ప్రశ్నలు వున్నాయి.
గణపతి 1990ల ప్రారంభంలో పీపుల్స్ వార్ నాయకత్వంలోకి
వచ్చారు. 2004లో ఆ పార్టి, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ విలీనం అయ్యి సిపిఐ (మావోయిస్టు)
ఏర్పడినప్పుడు దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆరేడేళ్ల క్రితం వృధ్ధాప్యం,
అనారోగ్యం తదితర కారణాలతో ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు.
ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితాన్ని గడపడం సామాన్య
విషయం కాదు. కుటుంబం, వ్యక్తిగత స్వేచ్ఛ, సాధారణ జీవితం అన్నింటినీ వదిలి దశాబ్దాల
పాటు ఉద్యమంలో అజ్ఞాత జీవితాన్ని గడపడం నిస్సందేహంగా ఒక నిబద్ధత. ఎవరయినా సరే ఆ త్యాగాన్ని గుర్తించాలి.
కానీ నిబద్ధత ఒక్కటే నాయకత్వానికి కొలమానమా?
గతితార్కిక భౌతికవాదం పరిమాణాన్ని మాత్రమే చూడదు; గుణాత్మక మార్పును కూడా చూస్తుంది.
ఒక నాయకుడు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారన్నది పరిమాణం. ఆ కాలంలో తను నమ్మిన సిధ్ధాంతానికీ,
చేపట్టిన ఉద్యమానికి, సమాజానికి ఏం జోడించారన్నదే గుణాత్మక ప్రశ్నలు.
కొండపల్లి సీతారామయ్యను తప్పించి గణపతి పీపుల్స్
వార్ నాయకత్వంలోకి వచ్చిన 1990లు ప్రపంచ చరిత్రలో ఒక మహామలుపు. తూర్పు యూరప్లో సోషలిస్టు
ప్రభుత్వాలు కూలిపోయాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ప్రపంచ పెట్టుబడిదారీ
వ్యవస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించింది. అదే సమయంలో భారతదేశంలో 1991 ఆర్థిక సంస్కరణలు
ప్రారంభమయ్యాయి. మార్కెట్, ప్రైవేట్ పెట్టుబడి, ప్రపంచ వాణిజ్యం భారత ఆర్థిక వ్యవస్థను
మార్చడం ప్రారంభించాయి. ఉరుగ్వే రౌండ్ తరువాత
1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది; భారత్ దాని వ్యవస్థాపక దేశాలలో ఒకటిగా మారింది.
ఇదే కాలంలో భారత రాజకీయార్ధిక సాంస్కృతిక రంగాల్లో
మరో గుణాత్మక మార్పు వచ్చింది. అప్పటి వరకు లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ గా కొనసాగిన భారత రాజకీయాలు
రైట్ ఆఫ్ ద సెంటర్ గా మారాయి. 1990 అద్వానీ రథయాత్ర, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత దేశ
రాజకీయాల దిశను మార్చాయి. సమాజంలో మతపరమైన రాజకీయ సమీకరణ మొదలయింది. ఒకవైపు వర్గ రాజకీయాలను మార్కెట్ సవాలు చేసింది.
మరోవైపు, మతతత్త్వ రాజకీయాలు ఊపందుకున్నాయి.
ఈ పరిణామాల్ని భారత కమ్యూనిస్టు ఉద్యమం, అందులో
తాను మొనగాడు అని ప్రకటించుకున్న మావోయిస్టు పార్టి ఎంతవరకు అర్థం చేసుకుంది? ఇదే అసలు ప్రశ్న.
సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన
విభజనే చరిత్రలో మొట్టమొదటి శ్రమ విభజన అనే సూత్రీకరణను 1840లలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్
ఏంగిల్స్ జంటగా చేశారు. మార్క్స్ మరణానంతరం ఏంగిల్స్ రాసిన ‘కుటుంబం, వ్యక్తిగత ఆస్తి,
రాజ్యాల పుట్టుక’ గ్రంధంలో "ఒక భర్త ఒక
భార్య అనే ఆధునిక బూర్జువా కుటుంబంలో, భర్త
బూర్జువా వర్గానికి ప్రతినిధి; భార్య శ్రామిక వర్గానికి ప్రతినిధి" అంటూ పాత సూత్రానికి
కొత్త జవసత్వాలిచ్చాడు. అంతే కాదు వాళ్ళ మధ్య ‘వర్గవైరం’ వుంటుందన్నాడు.
కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థలో యజమానివర్గం
ఎవరూ? శ్రామికవర్గం ఏవరూ? వర్గ వైరం (class antagonism) ఏ సమూహాల మధ్య ఏర్పడిందీ? తాము ఎవరి పక్షం వహించాలీ? అనే ప్రాణప్రదమైన
చారిత్రక సైధ్ధాంతిక సవాళ్ళను దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టి కూడ ఎదుర్కొనే ప్రయత్నం
చేయలేదు. దానికి గణపతి కూడ మినహాయింపుకాదు. అంటే తన కాలంలో తలెత్తిన తాత్విక సంక్షోభాన్ని
పరిష్కరించే ప్రయత్నం ఆయన చేయలేదు. అలాంటివారి నాయకత్వంలో
కొనసాగే పార్టిలు సహజంగానే అంతరించిపోయే జాతుల్లో కలిసిపోతాయి.
“మాకు కులం లేదు, మతం లేదు” అని చెప్పుకోవడం
సులభం. కానీ సమాజంలో కులం, మతం ఎలా పనిచేస్తున్నాయో వర్గ విశ్లేషణ చేయడం అంత సులభం కాదు. తమకు అర్థంకాని సమాజాన్ని ఎవరూ మార్చలేరు.
సమాజంలో వేగంగా విస్తరిస్తున్న మతతత్త్వ పరిణామాల్ని ముందుగా పసిగట్టడంలోనూ, దానిని
ఎదుర్కోవడానికి ఒక సైధ్ధాంతిక పునాదిని నిర్మించడంలోనూ పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టి నాయకత్వం విఫలమైంది.
మరోవైపు, మతోన్మాద శక్తులకు కార్పొరేట్ల మద్దతు కూడ లభించడంతో కార్పొరేట్ కమ్యూనల్
డిక్టేటర్ షిప్ (CCD) దేశంలో బలపడింది.
ఈ సందర్భంగా ఒక అనుబంధ ప్రశ్న కూడ ముఖ్యమైనది.
మూడు దశాబ్దాల నాయకత్వంలో మార్క్సిస్టు సిద్ధాంతానికి గణపతి చేసిన కొత్త చేర్పు ఏమిటి?
మార్క్స్ పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషిస్తే,
లెనిన్ సామ్రాజ్యవాదంగా మారిన పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించాడు. అలాగే, వ్యవసాయ ప్రధాన దేశాన్ని సోషలిస్టు దేశంగా
మార్చే ప్రయత్నం మావో చేశాడు. అలా భారత సమాజంలో వచ్చిన మార్పుల్ని గణపతి ఏమేరకు అర్థం
చేసుకున్నారో చూడాలి.
గణపతి పేరుతో గుర్తుండిపోయే ఒక కొత్త సైద్ధాంతిక
ప్రతిపాదన ఏమిటి? ముందు ఆటోమేషన్, ఆ వెనక కుత్రిమ మేధ వచ్చాయి. పునాది – ఉపరితలం, ఉత్పత్తి
శక్తులు – ఉత్పత్తి సంబంధాలు అనే మార్క్సిస్టు మెధడాలజీనీ కొత్త ఉత్పత్తి విధానానికి
ఆయన అన్వయించిన దాఖలాలు మనకు కనిపించవు. ఇప్పటికీ
అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సమాజం అంటుండడాన్ని మించిన అభాస మరొకటి వుండదు. ఇలాంటి తత్త్వదారిద్యం
ఓటమిని పొందక తప్పదు.
గణపతి అనుసరించిన సైనిక వ్యూహాల్లోనూ ఇవే సందేహాలు.
మావో చరిత్రలో ప్రసిద్ధి చెందిన లాంగ్ మార్చ్
/ జైత్రయాత్ర నిజానికి యుధ్ధరంగం నుండి వెనుకడుగు (రిట్రీట్). వెనక్కి తగ్గుతూనే దాన్ని
ప్రజా మద్దతును పెంచుకునే రాజకీయ వ్యూహంగా మలచగలిగాడు మావో. అందుకు భిన్నంగా గణపతి
పార్టి శ్రేణుల్ని పౌరసమాజానికి దూరం చేసి, తనకున్న సాయుధ దళాల్ని ఛత్తీస్ గడ్ అంబుజ్
మడ్ లో మోహరించి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ
వ్యతిరేకిస్తూ సాయుధపోరాటమే ఏకైకమార్గం అన్న మావోయిస్టు పార్టి మొదటి రంగాన్ని వదిలేసింది;
రెండో రంగంలో విషాదకరంగా ఓడిపోయింది.
గణపతి నిబద్ధతను ప్రశంసించవచ్చు. ఆయన త్యాగాన్ని
గుర్తించవచ్చు. ఒక సాయుధ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపిన ఆయన సంస్థాగత సామర్థ్యాన్ని
కూడా గుర్తించవచ్చు.అయితే నాణేనికి మరోవైపున కూడ చూడాలి.
కొండపల్లి సీతారామయ్య తప్పులు చేయని రాజకీయ
సిధ్ధాంత వేత్త అని చెప్పడం సరికాకపోవచ్చు. ఆయన చేసిన తప్పులు ఆయనకు వున్నాయి. కానీ,
దాదాపు బూడిదగా మారిపోయిందనుకున్న నక్సలైట్ ఉద్యమానికి ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచిన
ఘనత కొండపల్లిదే. కొండపల్లి పెంచిన ద్రాక్షతోటను కాల్చి బూడిదగా మార్చిన రికార్డు ఇప్పుడు
గణపతి పేరున నమోదయ్యింది.
07
సెప్టెంబరు 2026


.png)