Tuesday, 11 August 2026

ప్రభుత్వం పారదర్శకంగా వుండాల్సిన పనిలేదా?

 Transparency

ప్రభుత్వం పారదర్శకంగా వుండాల్సిన పనిలేదా?

 

డానీ

సమాజ విశ్లేషకులు




 

కొంతకాలంగా మనదేశంలో ప్రజాస్వామ్యానికీ , పాలక స్వామ్యానికీ తేడాలేకుండా పోయింది. ప్రభుత్వం ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాలనేదే ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి విలువ. దాన్ని తలకిందులు చేస్తూ ప్రజలు ప్రభుత్వానికి బాధ్యతగా వుండాలని దబాయిస్తున్నారు. చాలామంది ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఒళ్ళో మీడియా  (దీనినే హిందీలో గోదీ మీడియా అంటున్నారు) రేయింక్బవళ్ళు ఈ తప్పుడు విలువనే ప్రచారం చేస్తున్నది.  

 

రాజధాని నగరం జంతర్ మంతర్ దగ్గర తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలని విద్యార్ధిలోకం నిరసనలకు దిగింది. నీట్ పేపర్లు లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం వారి ఆక్రోశానికి ప్రధాన కారణం. వారిలో నష్టపోయిన బాధవుంది.  దెబ్బతిన్న గాయం వుంది. ప్రభుత్వ అసమర్ధత మీద అసహనం వుంది. ముందే కొందరు విద్యార్ధులు చనిపోయారు. అడగడానికి వచ్చిన వారిలోనూ కొందర్ని పోలీసులు పొట్టనపెట్టుకున్నారు. క్రూరంగా లాఠీచార్జి చేశారు. దాన్ని లాఠీ చార్జి అని సరళంగా అనడమూ తప్పే. లాఠీల్లో ఇనుప మేకులు దించి వాటితో విద్యార్ధుల మీద డాడి చేశారు. తుపాకులతో పిల్లెట్లు పేల్చారు. విద్యార్ధినులతో వ్యవహరించిన తీరైతే సభ్యసమాజం తలలు వంచుకోవాల్సిందే. ఒక్క మాటలో జలియన్ వాలా బాగ్ నరమేధాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్ వలస పాలకులు కూడా జలియన్ వాలా బాగ్ కాల్పులకు ఆదేశాలిచ్చిన  డయ్యర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ కేసును విచారించడానికి ఏర్పడిన లార్డ్ హంటర్ కమీషన్ డయ్యర్ చర్యల్ని మాహాపరాధంగా పేర్కొంది. డయ్యర్ బ్రిగేడ్ కమాండర్ పదవి నుండితప్పించారు. జీతం తగ్గించారు. అతన్ని ఒక విధంగా పదవీ విరమణ చేయించారు.  

 

వలస పాలనలోనే అన్ని రకాల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే స్వతంత్ర ప్రజాస్వామ్య భారత దేశంలో  విద్యార్ధుల మీద అంతటి క్రౌర్యాన్ని ప్రదర్శించిన ఢిల్లీ పోలీసుల మీద ఎంతటి తీవ్ర చర్యలు తీసుకోవాలీ? వీడియోలకు దొరికిపోయిన ఒకరిద్దర్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఢిల్లీ రాజధాని పోలీసులు నేరుగా కేంద్ర హోంశాఖ ఆధీనంలో పని చేస్తారు. నీట్ ప్రశ్నాపత్డాల లీకేజికి నైతిక బాధ్యులు ధర్మేంద్ర ప్రధాన్ అయితే, ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలకు నైతిక బాధ్యత దేశ హోంమంత్రి అమిత్ షాదే అవుతుంది. ఆ విషయం అమిత్ షాకు తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీజీకీ తెలుసు. వాళ్లు పార్లమెంటు సమావేశాలకు రావడం మానేశారు.  పార్లమెంటు భవనానికి వస్తున్నారు, తమ ఛాంబర్లలో వుంటున్నారు. కానీ, సభలకు రావడంలేదు. దేశ రాజకీయాల్లో అరవీర భయంకరుడు అని పేరుగాంచిన అమిత్ షా ఇప్పుడు భయపడుతున్నారు. ఇన్నాళ్ళూ అందర్నీ భయపెట్టిన అమిత్ షా ఇప్పుడు తానే భయం రుచి చూస్తున్నారు.

 

          ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తున్నది.  సమావేశాల్లో ప్రతి రోజూ ప్రతి నిముషం సభలో ప్రధాని, హోంమంత్రి వుండితీరాలనే నియమం ఏమీలేదు. ప్రతి ప్రశ్నకూ వాళ్ళే సమాధానం ఇవ్వాలనే నియమమూ లేదు. అవన్నీ నిజమే. ఢిల్లీ పోలీసుల రాక్షస ప్రవర్తనకు హోం మంత్రికాకుండా ఇంకెవరు సమాధానం చెప్పాలీ?

 

తమ వైఫల్యాలు బయటపడ్డప్పుడు మౌనంగా వుండిపోవడం మోదీజీగారి నైజం. మణిపూర్ మండిపోతున్నపుడు వారు మాట్లాడలేదు. మహిళా రెజ్లర్లు తమమీద లైంగిక దాడి జరిగిందని నిరసనలకు దిగినప్పుడూ వారు మాట్లాడలేదు. ఇలా అనేక సందర్భలున్నాయి. నిజానికి నీట్ పేపర్ల లీక్ మీద కూడ వారు మాట్లాడలేదు. దాన్ని తట్టుకోలేక కొందరు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ వారు మాట్లాడలేదు.

 

చాలా సీరియస్ విషయాలను అర్ధరాత్రి రీల్స్ చేసి  పెట్టడం మోదీజీకి చిత్రమైన అలవాటు. ఆ రీల్స్ లో వారు జంతర్ మంతర్ లో విద్యార్ధులు దారి తప్పారని చెప్పి బాధపడ్డారు. వారిలో కొందరు బూతులు వాడారనీ ఆవేదన చెందారు. పెద్ద మనసు చేసుకుని వాళ్లను క్షమించేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రీల్స్ ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అర్ధం అయింది. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ప్రధాని తమ పిల్లల్ని క్షమించడం ఏమిటో అర్ధం కాలేదు. బూతుల వ్యవహారమూ అంతే. నిరసన ప్రదర్శనల్లో ఎంత కోపం వచ్చినా బూతులు వాడడం మంచిది కాదు. కానీ ఆ పిల్లలు ఆ బూతుల్ని అధికార పార్టీ పెద్దల నుండే నేర్చుకున్నారంటే అతిశయోక్తికాదు. “కాంగ్రెస్ కి విధవా”,  “పచాస్ కరోడ్ కి గర్ల్ ఫ్రెండ్”, “విపక్షాల మేజువాణి” వంటి పదాలను వారే జాతిజనుల చెవుల్లో ఊదారు.

 

పౌరుడు పారదర్శకంగా ఉండాలి ప్రభుత్వం ఎందుకు కాదు? ప్రజాస్వామ్యంలో మనిషి డేటాగా మారుతున్నప్పుడు, అధికారానికి కూడా పారదర్శకత అవసరం కాదా? ఒకప్పుడు ప్రభుత్వం పౌరుడి ఇంటి తలుపు తట్టి అడిగేది

మీ పేరు ఏమిటి?”

కుటుంబంలో ఎంతమంది?”

ఏం పని చేస్తున్నారు?”

ఎంత ఆదాయం?”

 

ఇప్పుడు ప్రభుత్వం అడగకుండానే మన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే స్థితికి వచ్చింది.

 

మన పేరు, మన చిరునామా., మన మొబైల్ నంబర్., మన బ్యాంక్ ఖాతా , మన బయోమెట్రిక్ గుర్తింపు, మనకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, మన ప్రయాణాలు, మన డిజిటల్ లావాదేవీలు అన్నీ ప్రభుత్వానికి తెలుసు. కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో ఏం జరుగుతున్నదో ప్రభుత్వానికి తెలీదు.  ప్రశ్నాపత్రాల లీకులు జరిగినప్పుడేకాదు, జరిగిందని అందరికి తెలిశాక కూడ ప్రభుత్వానికి దానితో ఎలా డీల్ చేయాలో కూడ తెలీదు. ఇదొక విచిత్ర స్థితి.

 

డిజిటల్ యుగంలో పౌరుడు కేవలం ఒక మనిషి కాదు. ఒక డేటా పాయింట్ కూడా. ఇది ఆధునిక పరిపాలనకు అవసరమైన పరిణామమే కావచ్చు. . ప్రభుత్వం ప్రజల అవసరాలను తెలుసుకోవాలంటే డేటా కావాలి. సంక్షేమ పథకాలు సరిగ్గా చేరాలంటే సమాచారం కావాలి. జనగణన, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పేదరికం విధానాన్ని రూపొందించాలన్నా నమ్మదగిన గణాంకాలు అవసరం.

 

కానీ ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వానికి పౌరుడి గురించి ఇంత సమాచారం అవసరమైతే; పౌరుడికి ప్రభుత్వం గురించి ఎంత సమాచారం ఉండాలి? ఇదే కాలపు అసలు ప్రజాస్వామ్య ప్రశ్న.

 

ఎప్పుడువరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. పౌరుడు ఇప్పుడు open book. మరి  ప్రభుత్వం ఎందుకు రహాస్య పుస్తకంగా వుంటోంది ?

 

పౌరుడిని ప్రభుత్వం పారదర్శకంగా ఉండమంటుంది. నీ ఆదాయం చెప్పు. నీ ఆస్తి చెప్పు. నీ చిరునామా చెప్పు. నీ గుర్తింపు నిరూపించు. నీ కుటుంబ వివరాలు ఇవ్వు. నీ బ్యాంక్ ఖాతా ఇవ్వు. అవసరమైతే నీ సామాజిక, ఆర్థిక స్థితి కూడా చెప్పు. పౌరుడు అన్నీ చెబుతాడు. కానీ ఒకరోజు అదే పౌరుడు ప్రభుత్వాన్ని అడుగుతాడు: నా డేటా ఎక్కడుంది?” ఎవరు చూస్తున్నారు?”ఎందుకు చూస్తున్నారు?” ఎంతకాలం ఉంచుతారు?”  ఎవరితో పంచుకుంటారు?” తప్పు సమాచారం ఉంటే దాన్ని ఎలా సరిచేసుకోవాలి?” ఇక్కడ సమాధానం స్పష్టంగా, సులభంగా, పౌరుడికి అర్థమయ్యే భాషలో ఉండాలి.

 

ఎందుకంటే Privacy అంటే దొంగచాటు వ్య్వహారంకాదు. Privacy అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామిక హక్కు. తప్పు చేయని మనిషికి కూడా గోప్యత అవసరమే. మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మనం నిజంగా offline అవుతామా? ఇక్కడే డిజిటల్ యుగం మనకు మరో విచిత్రమైన ప్రశ్నను ఎదురుపెడుతోంది. మనం  ప్రైవసీ కోసం మొబైల్ ఫోన్ను switch off చేస్తాం. అంటే అది పూర్తిగా చనిపోయిందని అనుకుంటాం. అది నిజం కాదు. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాక కూడ తెలుసుకోవాలనుకున్న వారికి మన గురించి అన్నీ తెలిసే అవకాశాలు వున్నాయి.

 

“బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్”  అన్నాడు జార్జ్ ఆర్వెల్. నిజానికి 1950ల ఆరంభం నాటికి ప్రపంచంలో సమాచార విప్లవం సంభవించలేదు. ఇప్పుడు అన్నీ సాధ్యమే. సమాచారం ప్రజల నుండి ప్రభుత్వానికి వెళుతున్నదిగానీ, ప్రభుత్వం నుండి ప్రజలకు రావడంలేదు. అధికారంలోవున్న ఎన్డీ కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి  బ్యాంకు నిల్వ పది వేల కోట్ల రూపాయలని విపక్షాలు ఆరోపిస్తున్న కాలం ఇది. బీఫ్ ఎగుమతిదారుల నుండి బిజెపి భారీగా పార్టీ ఫండ్  అందుకుందని చట్టసభల్లోనే విమర్శలు వస్తున్నాయి.

 

మన మొబైల్ ఫోన్ ఎప్పుడు నిజంగా మనది కాదు. అది మన మీద ప్రభుత్వం నియమించిన వేగులు కూడా కావచ్చు. కానీ, ప్రజలు ప్రభుత్వ విధానాలనూ నిర్ణయాలను తెలుసుకోవడం ఎలా? ప్రధాని ఎవరి లబ్దికోసం ఏ దేశానికి వెళుతున్నారూ ప్రజలు తెలుసుకునే హక్కు వుందా? లేదా? ఎలా తెలుసుకోవాలీ? ఆ సౌకర్యం వుందా?  లేకపోతే దాన్ని ఎలా పొందాలీ?

 

ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారా? ప్రజలు తమను ఎన్నుకునేలా చేసే టెక్నాలజీని ప్రభుత్వం సమకూర్చుకుందా? ఈ ఒన్ వే ట్రాఫిక్కును  టూ-వే గా మార్చే మార్గాలేమిటీ?  ప్రజాస్వామ్యం అంటే రెండు వైపులా నడిచే సమాచార మార్గం. పౌరుడి నుంచి ప్రభుత్వానికి  సమాచారం వెళ్లాలి. ప్రభుత్వం నుంచి పౌరుడికి జవాబు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతికినట్టవుతుంది.

 

11-08-2026

Wednesday, 29 July 2026

Dharmendra Pradhan & Amit Shah

 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా 

అమిత్ షా మెడకు చుట్టుకోనున్నదా?

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు





ఈ దశాబ్దపు ఒక అద్భుతంగా బొద్దింకలు ప్రధాని మోదీ మెడను వంచి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాయి. ఈ ఘనత కాక్రోచ్ జనతాపార్టి నేత అభిజిత్ దీప్కే, ఆ పార్టి ప్రతినిధులు, సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రంకాలకు ప్రధానంగా ఎలాగూ దక్కుతుంది. పిల్లల ఉద్యమానికి పెద్దరికాన్ని సమకూర్చిన సోనమ్ వాంగ్చూక్ కూ ఈ ఘనత దక్కుతుంది. వాళ్ళతో కలిసి  అద్భుతంగా పోరాడిన ఏఐఎస్ ఏ విద్యార్ధి సంఘం నాయకులు నేహా బోరా, ఆమీన్ అమితోజ్, మనీష్ కుమార్ లకు కూడ ఈ ఘనత దక్కుతుంది. ఏఐఎస్ ఏ ఎలాగూ మార్క్సిస్టు లెనిస్టు భావాలుగల సంస్థ. దానితోపాటూ వామపక్ష విద్యార్ధి సంఘాలు కూడ ఉద్యమంలో  క్రియాశీల పాత్ర వహించాయి. ఒక వాదం ప్రకారం ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం లేని సిజేపికి ఆ కొరతను కమ్యూనిస్టు విద్యార్ధులే తీర్చారు. ఈ ఉద్యమం లోనికి పేరెంట్స్ కూడ పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇది రెండు  తరాల ఉద్యమంగా మారి విజయావకాశాలు బాగా పెరిగాయి. ఢిల్లీ ఎండల్లో నిరసనకారులకు తాగడానికి నీళ్ల బాటిళ్ళు, తినడానికి ఆహారాన్ని పంపించిన అజ్ఞాతదాతలు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు.  


ఈ జాబితా చాలా పెద్దది. కానీ, తప్పని సరిగా పేర్కోవాల్సిన పేరు భారత ప్రధాన న్యాయ మూర్తి సూర్యకాంత్ గారిది. ముందు వారు కాక్రోచెస్  అని విసుక్కోవడంతో  బొద్దింకల ఆత్మగౌరవ ఉద్యమం మొదలయింది. సోనమ్ వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించాక ఉద్యమం ముగిసిపోతుందేమోననీ ఆందోళన చెందుతున్న సమయంలో, మళ్ళీ వారే లాఠీచార్జీ వీడియోలను చూసే సమయం తనకు లేదంటూ ప్రకటించి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి గొప్పగా దోహదపడ్డారు.  ఈ ఉద్యమం మొదలు కావడానికీ, విజయవంతం కావడానికీ వారే కారణం. ఈ అంశం అభిజిత్ కు కూడ తెలుసు. ఉద్యమ ముగింపు సందేశంలో ఆయన ‘మిత్రులతోపాటూ శత్రువులకు’ కూడ ధన్యవాదాలు తెలిపారు. 


గత పుష్కర కాలంగా ప్రజలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయాన్ని తరచుగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకోగానీ, ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్వర్, దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ లను కూడ తరచూ గుర్తు చేసుకుంటున్నారు. మంచిగా కాదు. 


ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఒక లెఖ్ఖ ప్రకారం ఆయన రాజీనామాతో నీట్ విద్యార్ధుల ఉద్యమం ముగిసినట్టే. ఇంకో లెఖ్ఖపరకారం ధర్మేంద్ర రాజీనామా కొత్త ఉద్యమానికి బీజాలు వేసింది. మరోమాటల్లో చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు అమిత్ షా మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. 


రాజీనామా చేయడానికి  ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకున్న కారణాలు ఏమైనా కావచ్చు. నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకూ,  ఆ కారణంగా అనేక మంది విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైనందుకూ, లక్షల మంది విద్యార్ఢుల ఆత్మక్షోభకూ, వారి కుటుంబ సభ్యుల ఆవేదనకూ మూలమైనందుకూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో విద్యార్ధులు బాధితులు ప్రభుత్వం బాధ్యురాలు. 


ఇక్కడే ఒక న్యాయపరమైన చిక్కు వచ్చిపడింది. విద్యార్ధులకు  అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుని సంబంధిత మంత్రిని పదవి నుండి తప్పిస్తే, ఆ విద్యార్ధుల మీద లాఠీ చార్జీ చేసిన పోలీసులు, చేయించిన హోంమంత్రి గురించి న్యాయశాస్త్రంలోవున్న నిర్వచనం ఏమిటీ?  ఇది ఇప్పటి ప్రశ్న. 

ఆన్యాయానికి గురైన విద్యార్ధులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ఒక ప్రజాస్వామిక హక్కు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోవడం ప్రభుత్వం చేసిన తప్పు. తప్పుచేసిన ప్రభుత్వం బాధితులయిన విద్యార్ధుల మీద లాఠీచార్జీ చేయడం మరో నేరం.  

అది సాధారణ లాఠీ చార్జీకాదు. పోలీసులు నిరసనకారుల మీద సాక్షాత్తు యుధ్ధం చేశారు. లాఠీలకు మేకులు గుచ్చారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఆ ఆదేశాలు హోంశాఖ నుండే వచ్చివుండాలి. పురుష పోలీసులు మహిళల మీడ లాఠీ చేయడమే  ఒక నేరం అయితే.  కొందరు పోలీసులు వారితో వీడియోల సాక్షిగా చాలా అసభ్యంగా వ్యవహరించారు. అది కూడ నేరమే. యూనిఫాం ధరించిన పోలీసులతోపాటూ  సాదా దుస్తులలో ఉన్న వ్యక్తులు సహితం విద్యార్థుల మీద విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్నీ ప్రైవేటు సంస్థలకు అప్పచెపుతున్న మోదీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థనూ ప్రేవేటు సంస్థకు అప్పచెప్పారా? లేక ఇది ప్రభుత్వ ప్రాయోజిత గూండాయిజమా? అనే అనుమానాలు చెలరేగేలా వున్నాయి వీడియో ఫుటేజులు. పోలీసు వున్నతాధికారులు సహితం చెలరేగిపోయారు. మహిళల్ని టార్గెట్ చేసుకుని క్రూరంగా కొట్టారు.  


అభిజిత్ దీప్కే ఒక దళీతుడు, సోనమ్ వాగ్చుక్ ఆదివాసీ. పదిమందికి ఉపయోగపడే ఒక మంచి డిమాండ్తో ముందుకు వస్తే చాలు. అతని సామాజికవర్గం ఏమిటీ? అని ప్రశ్నించకుండానే సమాజం అతని వెంట నడుస్తుంది.  ఇదే ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన కొత్త రాజకీయ నేరేటివ్. అంతేకాదు ఒక వాగాడంబరుడిని ఎదుర్కోవడానికి ఒక గొప్ప వక్త కావాల్సిన అవసరం లేదని కూడ ఈ ఉద్యమం నిరూపించింది. 


మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్ గా యువ తరంగం మొదలయింది.  శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో జెన్ –జీగా, మన దేశంలో కాక్రోచెస్ రూపం తీసుకుంది. పేరేదైతేనేం ఇది కొత్తతరం; అందులోనూ విద్యార్ఢులు. చదువుకున్న తరం విద్యాగంధం లేనివాళ్ళను దేశాధినేతలుగానో, ప్రభుత్వాధి నేతలుగానో  భరించదు. 


దేశప్రజల్ని హిందూ-ముస్లింగా చీల్చి సులువుగా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో  సంఘపరివారం గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ప్రభుత్వ వైఫల్యాలని ఎవరు ప్రశ్నించినా ముస్లింలు, జిహాదీలూ, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టోపీవాలాలు, మియాలు, ఖలిస్తానీలు,  చైనా ప్రేరేపితులు, జార్జ్ సోరస్ పేటీంలు (కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా అమెరికా - సిఐఏ / రష్యా ఏజెంట్లు కూడ) అని నిందించడం పరిపాటి అయిపోయింది. ఈ నిందలకు భయపడి అనేక ఉద్యమాలు చాలా సందర్భాల్లో వెనుకంజ వేశాయి. బొద్దింకల ఉద్యమం ఈ నిందలకు భయడలేదు. మూతి పగిలేలా సమాధానం ఇచ్చింది.  నిందలన్నింటినీ కట్టకట్టి దేశ రాజధాని నగర మురుగు కాలువల్లో పడేసింది. ఈ పరిణామాలన్నీ  ఇంత వేగంగా జరిగిపోతాయని ఎవరూ ఊహించి వుండరు. 


కథ ఇక్కడితో ముగియలేదు. మరికొన్ని డిమాండ్లతో ప్రజలు ఎలాగూ ముందుకు వస్తారు. అలావస్తే ఈసారి వాళ్ళ మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తాం అనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఇండియా గాబట్టి విధ్యార్ధుల మీద లాఠీచార్జి మాత్రమే జరిపి వదిలేశారు. విదేశాల్లో అయితే ఫైరింగ్ జరిపేవారని బిజెపి చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి అసహనం  వ్యక్తం చేశారు. ఈసారి భారత ప్రధాన న్యాయమూర్తి కొంచెం సమయం కేటాయించి. నిరసన చేస్తున్న విద్యార్ధుల మీద లాఠీచార్జీని “సమర్ధించలేం” అన్నారు.  అప్పటికే సమయం మించిపోయింది. ఇండియాను విదేశంగా మార్చాలనే ఉత్సాహంతో ఊగిపోతున్న బీహార్ పోలీసులు ఆరోజే  విద్యార్ధుల మీద ఏకంగా ఏకే 47తో కాల్పులు జరిపారు. ఇది హోం మంత్రి అమిత్ షా  వివరణ ఇవ్వాల్సిన వ్యవహారం. 


దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోకుండా ఉండాలనీ, దేశఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే తనూ రాజీనామా ఇస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన కూడ అమిత్ షా మెడకు చుట్టుకునేదే. దేశవ్యతిరేక శక్తులు ఏకంగా దేశ రాజధాని నగరంలో లక్షల సంఖ్యలో నిరసనకు దిగారంటే ఇంతటి భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరూ?  దానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి కదా?


సిజేపి భవిష్యత్తు కార్యక్రమం ఏమిటీ? అనే ప్రశ్న ఈ సందర్భంగా సహజఙానే వస్తుంది. అదేమోగానీ, విద్యార్ధుల ఉద్యమం ఇచ్చిన ఉత్తేజంతో సమీప భవిష్యత్తులో  అనేక ఉద్యమాలు తలెట్టుతాయి. అమెరికా ట్రేడ్/ఆగ్రీ  డీల్ కు వ్యతిరేకంగా  మరో ఉద్యమాన్ని చేప్పట్టాలని సంయుక్త్  కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ అప్పుడే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు దిగుమతుల్ని తగ్గించాలనే సాకుతో వాహనాల్లో ఎథనాల్ వాడకాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల మీద కూడ ప్రజల్లో తీవ్ర అసహనం వుంది. 


పౌరసత్వ చట్టం మీద షాహీన్ బాగ్ నిరసన, నల్లచట్టాల మీద రైతుల నిరసన, లైంగిన వేధింపుల మీద మహిళా రెజ్లర్ల నిరసన అన్నీ  విజయాలు సాధించకుండానే ముగిసిపోయాయి అనుకున్నాము. అవన్నీ కలిసి విద్యార్ధుల ఉద్యమంగా విజృంభిస్తాయని ఒక్కరూ ఊహించి వుండక్లపోవచ్చు. ఓడిపోయింది ఓడిపోయినట్టుకాదు; గెలిచింది గెలిచినట్టూ కాదు. ఈ తత్వం ు తెలియాలంటే ఓపిగ్గా కొన్నాళ్లు ఎదురుచూడాలి. 


దశాబ్దాల తరబడి సమాజంలో ఏ కదలికా కనిపించని కాలాలు ఉంటాయి. అదే సమయంలో, దశాబ్దాల పరిణామం కొన్ని వారాల్లోనే సంభవించే సందర్భాలూ ఉంటాయి. చరిత్ర నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా వాయు వేగంతో పరుగెత్తడం మొదలుపెడుతుంది.  ఈ మాటల్ని లెనిన్ అన్నట్టున్నాడు. ఇప్పుడు మనం అలాంటి ఒక దశను చూస్తున్నామేమో.



26 జులై 2026 – telugu prabha

Saturday, 25 July 2026

సింహాసనం వణికింది

 

సింహాసనం వణికింది 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 


ఈరోజు నావ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. 



 

            ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నియంతను ఒక హాస్యాస్పదమైన కేతిగాడిగా చూపించడం ద్వారా, నియంతల గురించి ప్రజల్లో పేరుకుపోయిన భయాన్ని తొలగించడానికే  తాను ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమా తీసినట్టు  చాప్లిన్ ఓ వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో బొద్దింకలు అదే పని చేశాయి. నియంతలు కూడా భయపడతారు. దిగివస్తారు. వెనక్కి తగ్గుతారు. అవసరమైతే తమ మంత్రులను కూడా బలి ఇస్తారు.

 

            ఇంతకాలం మనకు ఒక నేరేటివ్ను నమ్మించారు. భారత ప్రధాని సర్వశక్తిమంతులు. సర్వజ్ఞులు. వారు అనుకున్నదే జరుగుతుంది. ఎంతటివారైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వారు హిమాలయాలంత ఎత్తులో ఉంటే, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తూర్పు కనుమల్లోని చిన్న గుట్ట మాత్రమే. ప్రజాస్వామ్యానికి మూడు మూలస్థంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు, అనధికారికంగా నాలుగో స్థంభంగా భావించే మీడియాఅన్నీ వారి కనుసన్నల్లోనే కదులుతున్నాయనే భావనను ప్రజల్లోకి నెట్టారు. భావన ఎంత బలంగా మారిందంటేప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ప్రశ్నకంటే, అధికారాన్ని ఎదిరించడం సాధ్యమా కాదా అన్నదే అసలు ప్రశ్నగా మారిపోయింది.

 

            అప్పుడు షాహీన్ బాగ్ వచ్చింది. వాళ్లను పాకిస్తానీయులన్నారు. రైతులు ఉద్యమిస్తే ఖలిస్తానీయులన్నారు. మహిళా రెజర్లు న్యాయం అడిగితే, వారి మీదే నిందల దాడులు చేశారు. ఉద్యమాలన్నీ ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రశ్నలనే లేవనెత్తాయి. కానీ వాటికి ఒక పరిమితి ఉంది. వాటి మీద ఒక నిర్దిష్ట ప్రయోజనాలున్న సామాజికవర్గాల ఉద్యమాలంటూ ముద్ర వేయగలిగారు. వాటిని మిగతా సమాజం నుంచి వేరు చేయడం అధికారానికి సులభమైంది.

 

            కానీ బొద్దింకల ఉద్యమం వ్యూహాన్ని తలకిందులు చేసింది. అది ఒక సామాజిక వర్గం ఉద్యమం కాదు. అది ఒక మత ఉద్యమం కాదు. అది ఒక కుల ఉద్యమం కాదు. అది పిల్లల ఉద్యమంగా మొదలై, తల్లిదండ్రుల ఉద్యమంగా విస్తరించింది. చివరికి, దేశం మొత్తం తన పిల్లల భవిష్యత్తు గురించి ప్రశ్నించే ఉద్యమంగా మారింది.

 

            మొదట బొద్దింక అన్న అవమానాన్ని వాళ్లు ఆత్మగౌరవంగా మార్చుకున్నారు. “పిల్లలు ఏం చేస్తారు?” అన్న చిన్నచూపును—“పిల్లలు ఏదైనా చేయగలరుఅనే సత్యంగా మార్చారు. అమ్మాయిలు ఢిల్లీ వీధుల్లో నిలబడి గోదీ మీడియాను ప్రశ్నిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. “మమ్మల్ని పాకిస్తానీయులంటున్నారు. పాకిస్తాన్ వెళ్లి బిర్యానీలు తిన్నవాళ్లు ఎవరు?” అని వాళ్లు అడిగారు. ఒక్క ప్రశ్నలోనే ఎన్నో సంవత్సరాల రాజకీయ ప్రచారానికి సమాధానం ఉంది. “మేము నమ్మే దేవుని ఆలయాలను మూసివేశారు. కానీ అల్లా ఇంటినీ, గురుద్వారాలనూ మా కోసం తెరిచి ఉంచారుఅని హిందూ సమూహం చెబుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే వారికి అది చాలా అసౌకర్యకరమైన వ్యాఖ్య.

 

            ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి దళితుడా కాదా అని ప్రజలు చూడలేదు. అతను తమ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్ళుతున్నాడా? లేదా? అన్నదే చూశారు. ఇది చిన్న విషయం కాదు.

 

            ఇంకో విషయాన్ని కూడ ఉద్యమం బయటపెట్టింది. ముస్సోలినీ ఇటలీలో బ్లాక్ షర్ట్స్ను, హిట్లర్ జర్మనీలో బ్రౌన్ షర్ట్స్ను ఉపయోగించాడు. ఢిల్లీలో పోలీసులతో కలిసి విద్యార్థులపై దాడి చేస్తున్న కొత్త రకం షర్ట్స్ను ప్రజలు చూశారు. సాక్ష్యాలు బయటపడ్డాయి. వీడియోలు వాటిని బంధించాయి.

 

            నీట్ ప్రశ్నాపత్రాల లీక్ నుంచి మొదలైన డిమాండ్ మరింత పెద్దదైంది. “కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.” ప్రభుత్వం ఇంకా బెట్టుచేస్తే, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కూడా అడగగలంఅన్న స్థాయికి ఉద్యమం చేరింది. అదే కీలక మలుపు.

 

            గత పన్నెండు సంవత్సరాల్లో పార్టీ, సంఘం, ఉద్యమం కూడా స్థాయిలో సింహాసనాన్ని భయపెట్టిందా? బహుశా లేదు. సింహాసనం వణికింది. వైపుకే ముప్పు వస్తున్నప్పుడు, ఒక మంత్రిని వదిలించుకోవడం మంచిదని సింహాసనం భావించింది.

 

            ఢిల్లీలో విద్యార్థినులు ఫైజ్ అహ్మద్ ఫైజ్ గీతాన్ని పాడుతూ తిరిగారు.  కిరీటాలు గాల్లో ఎగురుతాయి. సింహాసనాలు పక్కకు ఒరుగుతాయి.” గీతం తన ప్రభావాన్ని కోల్పోలేదు. ఎందుకంటే చరిత్రలో సింహాసనమూ శాశ్వతం కాదు.

 

            మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుందో ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది. అది ఒక మంత్రిలో లేదు. అది ఒక పార్టీ కార్యాలయంలో లేదు. అది ప్రజల భయంలో ఉంది. భయం పోయిన రోజుమాయల ఫకీరు శక్తులన్నింటినీ కోల్పోతాడు.

 

            ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నిరూపించింది. నాయకుడు అన్నీ తాను కాకూడదు. ప్రజలు ఉద్యమించేలా చేయాలి. ఇది సీట్ల కోసం, పదవుల కోసం, కూటముల కోసం పరస్పరం తగువులాడుకుంటూ రోజురోజుకూ బలహీనపడుతున్న విపక్షాలకు ఒక గుణపాఠం.

 

            ప్రజల సమస్యలను ముందుకు పెట్టండి. ప్రజలను వీధుల్లోనికి తీసుకురండి. ప్రజలకు నాయకత్వం అప్పచెప్పండి. అదే ప్రజాస్వామ్యం.

 

            ఒక మంత్రిని తప్పించినంత మాత్రాన వ్యవస్థ మారిపోలేదు. నీట్ పరీక్షా వ్యవస్థ మారలేదు. కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం కూలిపోలేదు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వత పరిష్కారం రాలేదు. అయినా ఇది ఒక మహత్తర విజయం. ఎందుకంటే నిరాశతో నిండిన వాతావరణంలో, అధికారాన్ని ప్రశ్నించడం సాధ్యమేనని ఇది నిరూపించింది.

 

            విజయం ఒక్కరోజులో రాలేదు. సర్ ప్రక్రియతో ఓ జ్ఞాని దేశంలో బోలెడంత అభాసుపాలయ్యారు. ప్రజా సమస్యల్ని లేవనెత్తేవారిని బొద్దింకలంటూ ఇంకో న్యాయమూర్తి సూర్యకాంతులు వెదజల్లారు.  అలా తిట్టు నుండి బొద్దింకల పార్టీ పుట్టింది. జనం నవ్వారు. “ఇదో పిల్లల వ్యవహారంఅన్నారు. అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ చేతికి నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అనే ఆయుధం అందించారు.

 

            అభిజీత్ దీప్కే దాన్ని వరంగా చూశాడు.కళ్లకు అద్దుకున్నాడు. విద్యార్థుల ఆగ్రహాన్ని ఉద్యమంగా మార్చాడు. తరువాత లఢాఖ్ ఉద్యమ నాయకుడు, ప్రజా శాస్త్రవేత్తగా పేరుగాంచిన సోనమ్ వాంగ్చూక్ రంగంలోకి వచ్చాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ జంతర్ మంతర్ వైపు చూడటం మొదలుపెట్టారు. పిల్లల ప్రశ్న తల్లిదండ్రుల ప్రశ్నగా మారింది. తల్లిదండ్రుల ప్రశ్న దేశ ప్రశ్నగా మారింది.

 

            మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్. శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు. నేపాల్లో జెన్-జీ. మన దేశంలో కాక్రోచెస్. పేరేదైనా కావచ్చు. కొత్త తరం భయపడదు. భయపెడుతుంది. భయపెట్టింది.  

 

            ఈ కథ ఓ అరవై ఏళ్ళ  క్రితం మొదలయింది.  1968లో ఫ్రాన్స్లో విద్యార్థి ఉద్యమం వచ్చింది. దాదాపు అదే కాలంలో భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం పుట్టింది. ప్రపంచంలోని అధికార వ్యవస్థలు ఉలిక్కిపడ్డాయి. ఉద్యమాలకు కారణం ఏమిటి? వాళ్లు జల్లెడపట్టి వెతికారు. వాళ్లకు కనిపించిన ఒక కారణంప్రభుత్వ విద్యాసంస్థలు. చౌకగా, అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు ప్రశ్నించే యువతను తయారు చేస్తున్నాయి. యువతే ఉద్యమాలకు వెళ్తోంది అని వాళ్లకు అర్ధం అయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలహీనపరిచే ప్రక్రియ మొదలైంది. ఉన్నత విద్య క్రమంగా ప్రైవేటు రంగానికి వెళ్లింది. విద్య అనేది నెమ్మదిగా హక్కు నుంచి వస్తువుగా మారింది. వస్తువు చివరికి కార్పొరేట్ ఉత్పత్తిగా మారింది.

 

            ఈరోజు వైద్య విద్య పరిస్థితి చూడండి. మూడు దశాబ్దాల క్రితం ఇంజినీరింగ్ విద్యకున్న డిమాండ్ ఇప్పుడు లేదు. మెడిసిన్ ఆ క్రేజ్ ను పుంజుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం కుటుంబాలు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పీజీ కోసం మరిన్ని కోట్లు. అయినా, అల్పాదాయ వర్గాలు సహితం అప్పులు చేసైనా సరే తమ పిల్లలను డాక్టర్లు చేయాలనుకుంటున్నారు.

 

            ఇప్పుడు నీట్ ఒక పరీక్ష మాత్రమే కాదు. అది ఒక భారీ ఆర్థిక వ్యవస్థ నీట్ కోచింగ్ మార్కెట్‌ 60 వేల కోట్ల రూపాయల వ్యాపారంగా అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా కోచింగ్ సంస్థలను కలుపుకుంటే ఆర్థిక వ్యవస్థ మరింత పెద్దదవుతుంది.

 

            వ్యవస్థకు ప్రాణవాయువు ఏమిటి? ర్యాంకులు. ర్యాంకులు ఎలా వస్తాయి? అది విద్యార్థి ప్రతిభపై ఆధారపడి ఉండాలి. కానీ ప్రశ్నాపత్రం ముందుగానే అందే అవకాశం ఉందని మార్కెట్లో నమ్మకం ఏర్పడితే? అప్పుడు కోచింగ్ విద్య కాదు; అది వ్యాపారం. ప్రశ్నాపత్రం ఒక ఉత్పత్తి. ర్యాంకు ఒక ప్రకటన. విజయం ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్. ఇదే అసలు ప్రమాదం.

 

            కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం చాలా పెద్దది. చాలా శక్తివంతమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీలు కేవలం వ్యక్తిగత అవినీతి కాదు. అవి వ్యవస్థాగత అవినీతి. అందుకే ఉద్యమం ఒక మంత్రిని తప్పించడంతో ముగిసిపోకూడదు. ఇది విద్యా వ్యవస్థను ప్రశ్నించాలి. కోచింగ్ పరిశ్రమను ప్రశ్నించాలి. ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను ప్రశ్నించాలి. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థను ప్రశ్నించాలి.

 

            ఇప్పటికి  సింహాసనం వణికింది. అది మళ్లీ స్థిరపడుతుందా? లేక ప్రజలు దాన్ని మరింతగా కదిలిస్తారా?

 

26 జూన్ 2026Published on 31 July 2026