సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?
మావోయిస్టు ఉద్యమం
ముగింపుపై ఒక రాజకీయ విశ్లేషణ
సామాజిక–రాజకీయ విశ్లేషకులు | సీనియర్ జర్నలిస్టు
అసలు మలుపు – 1990
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?
మావోయిస్టు ఉద్యమం
ముగింపుపై ఒక రాజకీయ విశ్లేషణ
సామాజిక–రాజకీయ విశ్లేషకులు | సీనియర్ జర్నలిస్టు
అసలు మలుపు – 1990
సామాజిక అశాంతిని రేపుతున్న ఏఐ విప్లవం!
డానీ
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
మెగా కార్పొరేట్ల ధనదాహం తీర్చడానికి భూగోళం సరిపోయేలాలేదు. మరో ఏడాదిలో వైట్ కాలర్ జాబ్స్ చాలా వరకు కనుమరుగైపోయే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ ముస్తఫా సులేమాన్ అంటున్నారు. మరో రెండు మూడేళ్లల్లో కంప్యూటర్లతో ఇంటర్ ఫేస్ (కీబోర్డ్స్) మారిపోతాయని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అంటున్నారు. ఓ మూడేళ్లల్లో అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందని టెక్ జెయింట్ ఎలాన్ మస్క్ అంచనా.
సాంకేతిక విప్లవం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి, వేగం, సామర్థ్యం. కానీ ప్రతి సాంకేతిక మార్పు ఒక ప్రశ్నను కూడా రేపుతుంది. ఆ మార్పు ప్రయోజనం అందరికీ దక్కుతుందా? లేక కొందరికేనా? ప్రస్తుతం నడుస్తున్న కృత్రిమ మేధ (AI) విప్లవం ఈ ప్రశ్నను మరింత పదునుగా ముందుకు తెస్తోంది. ఎందుకంటే, ఇది కేవలం పని విధానాన్ని మార్చి ఊరుకోదు; మొత్తం పని స్వభావాన్నే మార్చుతోంది.
చేతి పని నుంచి మెదడు పనివరకు
పారిశ్రామిక విప్లవం చేతిపనుల్ని యంత్రాలకు అప్పగించింది. కంప్యూటర్ విప్లవం కార్యాలయ వ్యవస్థను మార్చింది. కాని కుత్రిమమేధ విప్లవం నేరుగా మానవ బుద్ధిని సవాలు చేస్తోంది. డేటా విశ్లేషణ, నివేదికల తయారీ, ప్రాథమిక న్యాయ సలహా, కోడింగ్, మార్కెటింగ్ వ్యూహం—ఇవన్నీ ఇప్పుడు అల్గోరిథమ్స్ చేసేయగలుగుతున్నాయి. ఈ మార్పులు మొదట ఉద్యోగుల సామర్ధ్యాన్ని అనూహ్యంగా పెంచుతాయి. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒక్కడే చేయగలిగితే సంస్థలకు లాభాలు పెరుగుతాయి. కానీ, పదిమందిలో తొమ్మిదిమంది ఉపాధిని కోల్పోతారు. వాళ్లను ఎక్కడ సర్దుతారు? ఇది తప్పనిసరిగా సామాజిక ఉద్రిక్తతకు దారి తీస్తుంది.
విరిగిపోతున్న ఉద్యోగ మెట్టు
కుత్రిమ మేధ మూలంగా ప్రస్తుతం ఎక్కువగా దెబ్బతింటున్న సమూహం ఎంట్రీ లెవల్ ఉద్యోగులు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికిచ్చే రొటీన్ పనులను కుత్రిమ మేధ వేగంగా చేసిపడేస్తోంది. ఇది తాత్కాలికంగా కంపెనీలకు ప్రయోజనం. కానీ దీర్ఘకాలంలో ప్రమాదం. ఎంట్రీ లెవల్ లో రిక్రూట్మెంట్ లేకుండా ఆ పై స్థాయి ఉద్యోగులకు నైపుణ్యాం ఎలా అబ్బుతుందీ? ఉద్యోగ మెట్ల వ్యవస్థలో మొదటి మెట్టును తీసేస్తే పైకి ఎక్కే దారేదీ? ఇది కేవలం ఉపాధి సమస్య కాదు - సామాజిక శాంతికి సంబంధించిన సమస్య.
మధ్యతరగతి అస్థిరత
మధ్యతరగతివర్గం సాధారణంగా విద్య, ఉద్యోగభద్రత, స్థిర ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కుత్రిమ మేధ కారణంగా స్థిర ఉద్యోగాల స్థానంలో అస్థిర ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పందాలు పెరుగుతున్నాయి. దానితో కుటుంబ భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటాయి. ఫలితంగా అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి నుంచి సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ అశాంతి పుడతాయి. అప్పుడవి వ్యవస్థ వునికినే ప్రశ్నిస్తాయి.
కార్పొరేట్ కేంద్రీకరణ
కుత్రిమ మేధ తయారీకి భారీ పెట్టుబడులు కావాలి. సహజంగానే వీటిని అతికొద్దిగా వుండే భారీ టెక్నాలజీ కంపెనీలే రూపొందించగలుగుతాయి. ఆ కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. కాని ఆ లాభాలు సమాజంలో సమానంగా పంపకం జరగవు. పెరుగుతున్న ఉత్పాదకత ఫలితాలు మెగా కార్పొరేట్ల స్థాయిలోనే నిలిచిపోతాయి. సంపద పంపకాల్లో అసమానత పెరిగిన ప్రతిసారి చరిత్రలో సామాజిక అశాంతి చెలరేగింది. పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు కూడ సాగాయి.
యువతలో ఆందోళన
యువత జనాభా అధికంగా ఉన్న భారతదేశంలో ఈ పరిణామం మరింత తీవ్రంగానూ మారవచ్చు. ప్రతి సంవత్సరం కోటిమందికి పైగా పట్టభద్రులు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. ఎంట్రీ లెవల్ అవకాశాలు తగ్గిపోతే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఉద్యోగం లేని విద్యావంతుల సమూహం ఏ దేశానికైనా పెద్ద సవాలు. వాళ్ళ అసంతృప్తి దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పవచ్చు. కగార్ ఆపరేషన్ తో ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల్ని సమూలంగా అణిచివేస్తున్నామనే ఉత్సాహంలో కేంద్ర ప్రభుత్వం వుంది. దాని కోరిక నెరవేరనూ వచ్చు. అయితే, నిరుద్యోగానికి గురైన విద్యావంతులైన యువతరం తిరగబడిన కారణంగానే 1960లలో నక్సల్బరి వుద్యమం తలెత్తింది. చరిత్ర పునరావృతం కావచ్చు.
‘గిగ్’ సమాజం వైపు?
స్థిర ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక పనులు, ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పందాలు పెరుగుతున్నాయి. ఇది ఒక కొత్త పని సంస్కృతి; గిగ్ ఎకానమీ. బయటికి స్వేచ్ఛలా కనిపించినా, లోపల అనిశ్చితి కొనసాగుతుంటుంది. ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా, వ్యక్తులు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇది వ్యక్తిగత స్థాయిలో ఒత్తిడిని, సామాజిక స్థాయిలో వర్గ వైషమ్యాన్నీ పెంచుతుంది.
సాంకేతిక విప్లవమా? సామాజిక పరీక్షా?
ఇప్పటి వరకు ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడ ఆగలేదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఏఐని ఆపడం సాధ్యం కాదు. అది ముందుకు సాగుతూనే వుంటుంది. ఏఐ సృష్టించే సంక్షోభాన్ని ఎలా అదుపు చేయాలి అనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఇందులో బాధ్యతాయుత పాత్రను పోషించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, రీస్కిల్లింగ్ విధానాలు, సామాజిక భద్రతా వలయాలు, కార్పొరేట్ల నియంత్రణ చేపట్టాలి.
ఉత్పాదకత పెరిగితే పని గంటలు తగ్గాలి. జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి. అందరికీ అవకాశాలు దక్కాలి. అలా జరగకపోతే, సాంకేతిక విప్లవాలు సాధించే ఉత్పత్తి పెరుగుదలకన్నా అవి సమాజంలో సృష్టించే అసమానతలు ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి అసలు చర్చ టెక్నాలజీ మీద కాకుండా అది సృష్టించే లాభాలు, పంపకాల మీద సాగాలి. మనిషి సామర్ధ్యాన్ని పెంచడానికి సాంకేతిక పురోగతి తోడ్పడాలి. అది ఏకంగా మనిషినే లేకుండా చేస్తే ఉపాధిరంగంలో ఒక ప్రళయం చెలరేగుతుంది.
16 ఫిబ్రవరి 2026
Published Sakshi 22-02-2026
https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=22/02/2026&pgid=809458&device=desktop&view=3
1.
*సిధ్ధాంతం
మాట్లాడండి : ట్రోల్ భాషను పక్కన పెట్టండి*
పీపుల్స్ వార్ గానీ, మావోయిస్టు పార్టీ గానీ
1990 తరువాత ఏ రంగంలో అయినా సాధించిన స్పష్టమైన విజయం ఏమిటో నాకు తెలియదు అన్నాను.
“విజయం” అనే పదం నచ్చకపోతే — “కొత్తగా ఆవిష్కరించిన సిద్ధాంత అంశాలు ఏమిటి?” అని అడగవచ్చు.
నిజంగా నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే చెప్పండి. “గుడ్డోళ్లు, కళ్ళజోళ్లు” వంటి మాటలు
అనవసరం.
ముందుగా నా అంధత్వం గురించి స్పష్టత: బాల్యంలోనే
ఎడమ కన్ను తెగింది. అదే కంటికి ఇరవై ఏళ్ల క్రితం రెటీనోపతి వచ్చింది; దాని ప్రభావం
కుడి కంటికి కూడా వస్తోంది. రెండు కళ్ళూ పోయినా ఎలా జీవించాలో ముందే కొంత శిక్షణ తీసుకున్నాను. కళ్ళో, కాళ్ళో పోతాయేమోనని
భయపడే మనిషిని కాదు.
నేను 1980లో కొండపల్లికి కొరియర్/బాడీగార్డ్
గా పనిచేశాను. 1985లో కారంచేడు ఉద్యమానికి
నాయకత్వం వహించాను. 1990లో పీపుల్స్ వార్ విధానాలతో విభేదించాను. బయటికి రావడానికి ముందు ఆంధ్రజ్యోతి వారపత్రికలో
ఒక వ్యాసం రాసి బహిరంగంగా నా అసంతృప్తిని ప్రకటించాను. ఆ వ్యాసాన్ని విరసం జనరల్ బాడీ
చర్చించింది. అప్పటి నుండి పీపుల్స్ వార్ మీద నా అభిప్రాయాలు ఏమాత్రం మారలేదు. రాజకీయ
ఆలోచనల్ని నేను బహిరంగంగానే మాట్లాడుతాను.
పీపుల్స్ వారుకు ఒక సృజనాత్మక దశ ఉండింది. ఎమర్జెన్సీ కాలంలో పూర్తిగా
దెబ్బతిన్న సివోసిని కొండపల్లి మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఇందులో రెండు దశలున్నాయి.
ఉద్యమం పెరుగుతున్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా వుండేది. దాన్ని
నాలాంటివాళ్ళు బాగా ఆస్వాదించారు. ఉద్యమం బలపడిన తరువాత పార్టీలో బ్యూరాక్రసీ పెరిగింది. పార్టీ బాధ్యుల
నైతిక విలువలు దిగజారిపోయాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ ప్రోత్సాహం కూడ
తోడవ్వడంతో ఇవి విజృభించాయి. నాలాంటి వాళ్ళు
భరించలేని స్థితి ఏర్పడింది. తరువాత ఇంకో దశ మొదలయ్యింది. బయటి నుండి ప్రభుత్వ నిర్బంధం పెరగడం ఒక పార్శ్వం. లోపలి వికృతులు పెరగడం మరో పార్శ్వం. ‘ఆరు చెడులు’
అంటూ కొండపల్లి ప్రవేశపెట్టిన పత్రం కూడా పార్టి నాయకత్వం అంతర్గత పతనానికి సంకేతమే.
ఉద్యమం లోపల నుంచి కూడ క్షీణిస్తోంది అన్న
భావన బలపడినప్పుడు నేను బయటికి వచ్చేశాను. ఇది జరిగిన కొద్ది రోజులకే గ్రేటెస్ట్ తరానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను
బేబీ బూమర్లు పీపుల్స్ వార్ నుండి తరిమేశారు.
ఆ తరువాత పీపుల్స్ వార్ గురించిగానీ, మావోయిస్టు
పార్టీ గురించి గానీ నేను ఒక్క మాట కూడా మెచ్చుకోలుగా చెప్పలేదు. వాటి మీద నాకు సదభిప్రాయం
లేదు. వాటి పేరు చెప్పుకుని జీవించాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఉద్యమం మీద ప్రభుత్వ
నిర్బంధాన్ని ప్రజాస్వామిక దృక్కోణంలో ఖండించడం అనేది వేరే విషయం; వారి విధానాలను సమర్థించడం
అనేది వేరే విషయం. నేను ప్రభుత్వ అణిచివేతని ఖండించడం ఆపలేదు; విప్లవపార్టీలు అని చెప్పుకునేవారి
డొల్లతన్నాని ఖండించడమూ ఆపలేదు.
మావోయిస్టు అభిమానుల్లో ఒక అతిశయ ధోరణి కనిపిస్తోంది.
ఆ పార్టీ నాయకత్వాన్ని నేను దగ్గరగా చూసిన వాడిని. కొన్ని మరచిపోలేని చేదు అనుభవాలున్నాయి.
ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని గుర్తించాలి.
రాజ్యాంగ లక్ష్యాల రూపకల్పనలో, భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక
హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలో “సోషలిస్టు”, “సెక్యులర్” ఆదర్శాల
చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద
ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించకపోయినా, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి,
మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో
పనిచేసినవారే.
కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో,
మత నిర్మూలనో జరగలేదుగానీ కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం కొనసాగింది.
కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా ప్రోత్సాహించకపోయినా
ఆమోదం లభించింది. తెలుగు సాహిత్యం మీద వామపక్ష
ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా
తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి. ఇవన్నీ కమ్యూనిస్టుల
చారిత్రక విజయాలే. వీటిని ఎవరూ కాదలేరు.
1990 తరువాత ప్రపంచ సామాజిక-ఆర్థిక కూర్పు
సమూలంగా మారిపోయింది. దీనిని నేను “1990 అనంతర సంక్షోభం” అంటున్నాను. పాత కూర్పుకు
సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. పనిచేయలేదు కూడ. ఈ మార్పును కమ్యూనిస్టు నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక
పోయింది.
*ఇక్కడ తరాల ప్రశ్న కీలకం*
Greatest
Generation – Silent Generation – Baby Boomers – Gen X/Y/Z.
పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు,
కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులు Greatest Generationకు చెందినవారు. రెండు ప్రపంచ
యుద్ధాల మధ్యకాలపు అంతర్జాతీయ కూర్పు వారికి బాగా అర్థమైంది; ఆ మేరకు వారు తమ కాలంలో
సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపారు.
మధ్యలో
silent Generation ఒకటుంది. కేజి సత్య మూర్తి ఆ తరానికి చెందినవారు. తరువాతి
నాయకత్వం ప్రధానంగా Baby Boomersకి చెందింది. కొత్తగా ఎదిగి వచ్చిన Gen X, Y, Z తరాలను వారు ఆకర్షించలేకపోయారు. విద్యావంతులైన
పట్టణ మధ్యతరగతి సానుభూతి వర్గాన్ని కూడా క్రమంగా కోల్పోయారు.
1990ల దశకం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా
ఒక సంధికాలం. ఆ మార్పును Baby Boomer నాయకత్వం హ్యాండిల్ చేయలేకపోయింది. అక్కడి నుంచే
కమ్యూనిస్టు ఉద్యమం చారిత్రక పతన దశలోకి వెళ్లింది.
ఉద్యమాలకు చారుమజుందార్ కాంట్రిబ్యూషన్ ఏమిటో
మనకు తెలుసు. కొండపల్లి సీతారామయ్య కాంట్రిబ్యూషన్ కూడ మనకు తెలుసు. గణపతి సిద్ధాంతపరంగా
కొత్తగా ఏమి జోడించారో మనకు తెలియదు. అలాగే, ఉద్యమ పురోగతికి వారు చేసిన కృషి గురించి
కూడ ఎవరూ చెప్పగా వినలేదు. ఎవరైనా స్పష్టంగా
చెప్పగలిగితే వినడానికి సిద్ధం. విప్లవకారుల త్యాగాలను గౌరవించడం వేరు. వారి విప్లవ
పంథాను సమర్థించడం వేరు. బయటివారికి పంథానే ముఖ్యం.
ఈరోజు మావోయిస్టుల విప్లవ పంథా ఏమిటి? మావో
వందేళ్ళ క్రితం చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమేనా? దానికి ముందు కొండపల్లి వ్యవసాయిక
విప్లవాన్ని జోడించారు. వందేళ్ళలో సమాజం చాలా మారిపోయింది. మారిన సమాజాన్ని గుర్తించని
వాళ్ళు ఆ సమాజాన్ని ఎన్నడూ మార్చలేరు.
వర్తమాన భారత సమాజాన్ని నేను “కార్పొరేట్
– కమ్యూనల్ - డిక్టేటర్షిప్”గా అర్థం చేసుకుంటాను. మావోయిస్టు పార్టీతో సహా ఇతర కమ్యూనిస్టు
పార్టీలు ఇంకా “అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థ””నాలుగు
వైరుధ్యాలు” అనే పురాతన నిర్వచనానికే కట్టుబడి ఉంటే అది చారిత్రక జఢత్వమే అవుతుంది.
పాత విశ్లేషణ పనికిరాకపోయినా కొత్త విశ్లేషణ సృష్టించలేని నిస్సహాయ స్థితి — అదే అసలు
సంక్షోభం.
ఉద్యమాల్లో సైనిక విజయాలు - పరాజయాలు నాకు
ఆసక్తికరం కాదు. సిద్ధాంత పరాజయం గురించి మాత్రం విస్తృత చర్చ అవసరం. విప్లవ సిద్ధాంతం
సామాజిక మార్పుకు ప్రాణవాయువు. నిరంతరం బొగ్గుపులుసు వాయువును వదిలేసి, ప్రాణవాయువును
పీల్చుకుంటూ వుండాలి. లేకుంటే మరణం తప్పదు.
విమర్శించగానే తిట్లు మొదలుపెట్టడం వాదన కాదు.
మావోయిష్టులు ఇటీవల ట్రోల్ ఇష్టులుగా మారారు.
ఇదో ముందంజ కాబోలు. మర్యాదకర భాషలో చర్చించాలంటే
నేను ఎప్పుడైనా సిద్ధం. తిట్ల భాష మాత్రమే మీకు వచ్చు అనుకుంటే — నేను నరసాపురోడినని
గుర్తుంచుకోండి.
–
డానీ
*పాత కార్యక్రమాలకు
కాలం చెల్లింది*
2
1985లో కేజి సత్యమూర్తిని పార్టీ నుండి బహిష్కరించారు.
సరిగ్గా అదే సాంప్రదాయంలో కొండపల్లి సీతారామయ్యను
1990లో పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరువాత పీపుల్స్ వార్ గానీ, 2004లో ఏర్పడిన మావోయిస్టు పార్టీగానీ కొత్తగా రూపొందించిన విప్లవ
కార్యక్రమం ఏమిటీ? అనేదే సూటి ప్రశ్న. అలాంటి కార్యక్రమం ఏదైనా వుంటే మావోయిస్టు పార్టీ
ప్రతినిధులుగానీ, అభిమానులుగానీ బయటి ప్రపంచానికి చెప్పాలి.
ప్రస్తుత వ్యవస్థను ‘కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్
షిప్’ అని కొన్నేళ్ళుగా పిలుస్తున్నాను. ఇంగ్లీషులో ‘Corporate Communal
Dictatorship’ అంటున్నాను. దీనికి బాధితులు
కొన్ని వందల సమాజాలు, సమూహాలుంటాయి. ముందు వాటన్నింటి విస్తృత జాబితా ఒకటి తీయాలి.
విడిగా ప్రతి సమాజపు జన సంఖ్యనూ అంచనా వేయాలి.
ఈ సమూహాల్లో ప్రతీదీ ఒక ప్రత్యేక తరహా అణిచివేతకు
గురవుతుంటుంది. అణిచివేత తీవ్రత కూడ ఒక్కో
సమూహానికి ఒక్కో స్థాయిలో వుంటుంది. తీవ్రత
ప్రాతిపదికగా వాటన్నింటినీ నిలువు దొంతరలు (vertical staratification)గా పేర్చాలి.
నా అంచనా మేరకు ఈ దొంతరల్లో అత్యంత అణిచివేతకు
గురవుతున్న సమాజాల్లో ఆదివాసులు, ముస్లింలు, దళితులు వుంటారు. ఆ తరువాత కూడ ఇంకో
97 రకాల సమాజాలు వుంటాయి.
ఈ సమూహాలన్నీ బాధిత సమాజాలు. వీటన్నింటినీ
అవి ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రత్యేక అణిచివేతల నుండి విముక్తి చేసి స్వేఛ్ఛా, సమానత్వం,
సోదరభావాలతో జీవించగలిగే ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి. అలాంటి ఒక విప్లవ సిధ్ధాంతం విప్లవ కార్యక్రమం ఒకటి రూపొందాలీ. అదీ నేటి చారిత్రక
అవసరం.
స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అనేవి రాజ్యాంగ
ఆదర్శాలు. రాజ్యాంగవాదం పరిమితమైనదనీ తమది అంతకన్నా విస్తృతమైన ఆదర్శాలనీ మావోయిస్టులు
అంటుంటారు. ఇటు రాజ్యాంగం ప్రతిపాదించిన పార్లమెంటరీ
ప్రజాస్వామ్య పంథా, అటు సాయుధపోరాట పంథా రెండూ విషాదకరంగా విఫలం అయిపోయిన దశలో ఇప్పుడు
మనమున్నాము.
రాజ్యాంగం అనేది ఒకటి వుండబట్టే కొన్ని సానుకూల
చట్టాలను కమ్యూనిస్టు పార్టీలు సాధించుకోగలిగాయి. అయితే, ఇప్పుడు ఆ అవకాశాలు లేవు.
ఆ పాజిటివ్ కాన్స్టిట్యూషన్ దశ 1990లలో ముగిసి
పోయింది. ఇది పోస్ట్ -1990 దశ.
దేశంలోని రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలు
ఉన్నతమైనవనీ, వాటిల్లోనూ మావోయిస్టు పార్టి మరింత ఉన్నతమైనదనే నేరేటివ్ ఒకదాన్ని కొందరు
ఇప్పుడు అతి ఉత్సాహంతో రేయింబవళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంచేత వారినే నేరుగా అడిగాను; ‘Corporate Communal Dictatorship’ సమాజం నుండి బాధిత, పీడిత సమూహాలను విముక్తి చేయడానికి
మీ విప్లవ కార్యక్రమం ఏమిటీ? అని. సమాధానం లేదు. ఆపైన, వ్యక్తిత్వ హననం. నిందలు. చెత్త
మాటలు. ఇదేనా వీరి సైధ్ధాంతిక స్థాయి?. బహుశ ఇదే కావచ్చు.
అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ కాలగర్భంలో
కలిసిపోయి నూతన ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇప్పుడూ ఆ నాలుగు వైరుధ్యాలేనా? దున్నేవానికే
భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవం అనే
కార్యక్రమం 1990 నాటికే తన ప్రాసంగికతను కోల్పోయింది.
మన దగ్గర జలుబు దగ్గుకు మందులే వున్నాయిగానీ
కరోనాకు మందులు లేవంటే కుదరదు. కనిపెట్టాలి. ఇప్పుడున్న పార్టీలకు చారిత్రికంగా అవసరమైన సృజనాత్మకత లేదు. అది వ్యక్తుల తప్పుకాదు.
కాలం మారింది. పాత కార్యక్రమాలకు కాలం చెల్లింది.
విముక్తి అనేది చాలా పెద్ద మాట. వర్తమాన సమాజంలో
శ్రామికవర్గాన్ని, అణగారిన సమూహాల్ని కనీసం
నిర్వచించగలిగే స్థితిలో అయినా కమ్యూనిస్టు పార్టీలు వున్నాయా?
–
డానీ
*ముస్లింల ప్రస్తావనలేని
విప్లవకార్యక్రమం ఒక బూటకం!*
3.
సమాజాన్ని మార్చడానికి దీర్ఘకాలిక పోరాటం అవసరమనీ,
దానికి వందేళ్ళు కూడ సరిపోవు అని కొందరు అంటున్నారు.
ఆరెస్సెస్ పుట్టి కూడ వందేళ్ళే. అది ఏం సాధించిందో కళ్ళు మూసుకున్నా కనపడుతోంది. ముస్లింలు
పొట్టకూటి కోసం ఓ జాతరలో కోవా బన్ అమ్ముకుందామన్నా కుదరడంలేదు.
కోవా
బన్ విషాదం మీద చాలామంది స్పందించారు. దానికి
వారందరికీ ధన్యవాదాలు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలను జీవనోపాధిని అణిచివేస్తున్నారు.
వాళ్ళ ఇళ్ళను, దుకాణాలనూ బుల్ డోజర్లతో కూల్చేస్తున్నారు. మావోయిస్టులు ఎన్నికల్ని
బహిష్కరించమంటారు. సంఘపరివారం ముస్లింలను చట్టసభల నుండి బహిష్కరిస్తోంది. వాటి మీద కూడ కోవా బన్ స్థాయి స్పందన అవసరం.
ఇవన్నీ సంఘపరివారం సాగిస్తున్న ముస్లింయాగం
అనుకోవచ్చు. కమ్యూనిస్టు విప్లవకారులు అయినా అందుకు భిన్నంగా వున్నారా? ఇటివల విరసం
30వ మహాసభలు జరిగాయి. నాలుగు పేజీల ఒక పెద్ద అందమైన కరపత్రం విడుదల చేశారు. సాయుధ విప్లవ
పోరాట విరమణ గురించి లోకంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో అందులో చాలా వివరంగా
చర్చించారు.
ఆయుధాలను భుజాన్నే మోస్తారా? లేక, జాతర పెట్టి
ప్రభుత్వానికి ఉత్సాహంగా అప్పగిస్తారా? అనేది మావోయిస్టుల ఇష్టం. ఆయుధాలను భజాన్న పెట్టుకున్నా,
ప్రభుత్వానికి స్వాధీనం చేసినా దేనికోసం? అనేది సామాజిక అంశం. బయటి వారికి సామాజిక
అంశంతోనే పని. జాగ్రత్తగా గమనిస్తే ఆ కరపత్రంలో
విప్లవ కార్యక్రమం, పంథాల మీద సెంటిమెంట్ కన్నా తుపాకీ మీద సెంటిమెంట్ అతిగా కనిపిస్తుంది.
విప్లవోద్యమ పతనానికి ఇది చివరి సంకేతం.
ఆ కోవాబన్ బాధితుడు నడుబిగించి విప్లవించడానికి
సిధ్ధపడి ఉత్తేజం కోసం ఆ కరపత్రాన్ని చదివితే చాలా నిరుత్సాహానికి గురవుతాడు. ఆ కరపత్రంలో
ముస్లిం అనే పదం కాదుకదా మైనారిటీలు అనేమాట కూడ మనకు కనిపించదు. ఆ కరపత్ర రచయితలు చాలా
తెలివైనవారు. అవకాశం వస్తే మావోయిస్టు పార్టీకి కొత్త కార్యదర్శి కాగలిగినంత సమర్ధులు. అంత జాగ్రత్త పడి దాన్ని రాశారు. ఇది
కూడ ఇంకో జాతరలో ఇంకో కోవా బన్ కథ.
పూర్వ విప్లవ విద్యార్ధి సంఘం 50 వసంతాల ఉత్సవం నుండి గమనిస్తే మనకో విషయం సులువుగా
అర్ధం అవుతోంది. మావోయిస్టు పార్టి సోషల్ మీడియాలో ముస్లింల కోసం ప్రత్యేతేకంగా ఉత్సాహవంతులైన ఒక ట్రోల్ బ్యాచిని
తయారు చేసింది.
మైనారిటీల ప్రస్తావనలేని విప్లవకార్యక్రమం
ఏదైనా ఒక బూటకం!. ఇది పైకి ప్రగతిశీలంగా కనిపించే
మెజారిటీ మతవాదం!
-
డానీ
Is the decision to wage war the responsibility of the Prime Minister? The Army Chief?
డానీ
రాజకీయ,
సామాజిక విశ్లేషకులు
భారత్–చైనా
సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న
దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా?
లేదా? “మీకు నచ్చినట్టు చేయండి” అంటూ చేతులెత్తేశారా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా
మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది.
భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం. ఎం. నరవణే రాసిన ‘నాలుగు నక్షత్రాల విధి’ (Four Stars of Destiny) అనే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. కాని ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు ‘కారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. ప్రత్యేకించి, చైనా సైన్యం ముందుకు దూసుకు వచ్చిన అత్యంత ఉద్రిక్త క్షణాల్లో భారత ప్రభుత్వ నాయకత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. ఇప్పుడిది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది ఒక సంక్షోభ కాలంలో తీసుకున్న లేక తీసుకోలేకపోయిన నిర్ణయాల వివాదం.
2020
జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు
లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాస్ రేంజ్ వైపు కదలడం
మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుధ్ధ ప్రకటన.
ఇలాంటి
వేళల్లో దేశాన్ని నడిపించాల్సింది ఎవరు? యుధ్ధ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరూ? సైన్యమా? కేంద్ర ప్రభుత్వమా?
ఆగస్టు
31, 2020. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి.
భారత కమాండర్లు కూడ
అప్రమత్తమై
దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలు
లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి.
అప్పటి
ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్లు చేశారు.
అందరికీ వారడిగింది ఒక్కటే మాట. “ఏం చేయాలి?”!
కొన్ని గంటల వరకు స్పందన లేదు; ఆదేశాలు రాలేదు. తరువాత రక్షణశాఖా మంత్రి నుండి ఒక ఫోన్
వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. “ప్రధానితో మాట్లాడాను”. “జో ఉచిత్ సమ్జో వో కరో” (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి”).
ఈ సూచన విని తాను షాకుకు గురయ్యినట్టు ఈ పుస్తకంలో
నరవణె రాసుకున్నారు. యుధ్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది. యుధ్ధం చేయాలనో,
జరుగుతున్న యుధ్ధాన్ని ఆపాలనో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరూ? రాజకీయ నాయకత్వమా? సైనిక
నాయకత్వమా?
ఇలాంటి
ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్ పాయి హయాంలోనూ వచ్చాయి.
వాళ్ళిద్దరూ అప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణే ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని
మోదీలో అలాంటి నిర్ణయాత్మక శక్తిగానీ, స్పష్టతగానీ
కనిపించలేదు అని. దీన్నేమీ ఆయన ఒక ఆరోపణగా చెప్పలేదు. తనకు ఎదురయిన అనభవంగా పాఠకులతో
పంచుకోవాలనుకున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్తే నిర్ణయాలు తీసుకుంటుంది;
దాన్ని సైన్యం పాటిస్తుంది.
పుల్వామా,
బాలాకోట్ ప్రతిదాడుల తరువాత ప్రధాని మోదీజీ దృఢ నిర్ణయాలు తీసుకోగల సమర్ధులు అనే మాట
బాగా ప్రచారం అయ్యింది. కానీ చైనా విషయంలో వారు తడబడినట్టుగా నరవణె కథనం
ద్వార అర్ధం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఇప్పుడు చేతికి అందివచ్చిన ఆయుధంగా
మారింది.
జాతీయ
భద్రత కారణంగా నరవణే పుస్తకాన్ని పరిశీలించాల్సివుందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తికాలేదు. ప్రచురణకు అనుమతి
రాలేదు. జాతీయ భద్రతకన్నామ్తమకు ఎదురయ్యే రాజకీయ
ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ వున్నాయి. ఇది సెన్సారా?
నియంత్రణా? ఒక ఆర్మీ మాజీ చీఫ్ తన యుధ్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా?
ప్రధాన
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్ సభలో నరవణె
పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించినపుడు అధికార పక్షాలు
గట్టిగా అడ్డుకున్నాయి. సభ వాయిదాపడింది.
అగ్నివీర్,
అగ్నిపథ్ పథకాల మీద కూడ నరవణె ఈ పుస్తకంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్విత
ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడ తక్కువనీ ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా భారత సైన్యం
భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యవహరించినంత కటువుగా
చైనాతో వ్యవహరించలేకపోతున్నదని నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పుస్తకం
పూర్తిగా బయటికి వస్తే దేశంలో ఒక దుమారం రేగుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ గురించి ప్రధాన స్రవంతీ మీడియా ప్రచారం
చేస్తున్న అతిశయోక్తులకు, మోదీ అమిత్ షా ద్వయం తమ గురించి చెప్పుకుంటున్న ప్రగల్భాలకూ
ఈ పుస్తకం ఒక ఇబ్బంది కావచ్చు !
అయితే,
ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ చేస్తున్న వాదనకు భిన్నమైన కోణం కూడా వుండవచ్చు. ఎందుకంటే,
ఎంఎం నరవణె సంఘ్ పరివారానికి అనుకూలురనీ, దానివల్లనే వారికి సైన్యంలో అంతటి స్థానం
దక్కిందనే మాట కూడ ప్రచారంలోవుంది. కారవాన్ పత్రిక ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను మాత్రమే
ప్రచురించింది. మిగిలిన పేజీల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి వుండవచ్చు. మొత్తం
పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.
6
ఫిబ్రవరి 2026
The Warnings of the History
చరిత్ర చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతాలు?
డానీ
సమాజ విశ్లేషకులు
చరిత్ర పునరావృతం కాదు—కనీసం యథాతథంగా అయితే కాదు.
అయినప్పటికీ, కొన్ని ధోరణులు మాత్రం తిరిగి తిరిగి కనిపిస్తుంటాయి. అవే ఒకప్పుడు
ప్రపంచాన్ని మహావిధ్వంసం వైపు నడిపించిన సంకేతాలు. ఆ ధోరణులు మళ్ళీ కనిపించడం
మొదలైతే, సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని అర్థం.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న
ఒక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఏఐ ద్వారా రూపొందించిన ఆ మ్యాప్లో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా తదితర
దేశాలను అమెరికా భూభాగంగా చూపించారు. చట్టపరంగా దీనికి ఎటువంటి విలువ లేదని అందరికీ
తెలుసు. కానీ రాజకీయాల్లో మ్యాప్లు అమాయకమైన బొమ్మలు కావు. అవి భవిష్యత్తు
ఆకాంక్షలను, ప్రపంచ శక్తి నడక దిశను, దురాక్రమణ ఆలోచనలను సూచించే సంకేతాలు
కావచ్చు.
చరిత్రను చూస్తే, ప్రపంచ శక్తులు ముందుగా మ్యాప్లతోనే
ఆడుకున్నాయి. తరువాత మాటలుగా మారాయి. ఆపై విధానాలు మారాయి. యుధ్ధాలు జరిగాయి. చివరకు
దేశాల సరిహద్దులే మారిపోయాయి. ప్రపంచ పటం మీద అగ్రరాజ్యం కావాలనుకున్న దేశం తన ప్రయాణాన్ని ఎప్పుడూ
యుద్ధంతో మొదలుపెట్టదు; అది ముందుగా భాషలోకి, చిత్రాల్లోకి, ప్రజల ఊహల్లోకి
ప్రవేశిస్తుంది.
ఆ మ్యాప్ కింద రాసిన “ఇక్కడి నుండి వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు” అనే
వ్యాఖ్య కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ వాక్యం కాదు. ఇది చర్చలు,
రాజీలు, దౌత్య సంవాదాలకు తలుపులు మూసే భాష. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే—ఇలాంటి
భాష వినిపించిన ప్రతిసారీ, దాని వెనక ఘోర పరిణామాలే వచ్చాయి.
బ్రిటిష్ చరిత్రకారుడు ఏ.జె.పీ. టేలర్ ఒకసారి అన్నట్లు, “యుద్ధాలు అకస్మాత్తుగా జరుగుతాయనుకోవడం మన
అజ్ఞానం; నిజానికి అవి చాలాకాలం మాటలలోనే సిద్ధమవుతాయి.” నేటి ప్రపంచంలో ఆ
మాటల స్థానాన్ని ఇప్పుడు చిత్రాలు, మీమ్స్, ఏఐ మ్యాప్లు తీసుకున్నాయి.
1930ల నాటి యూరప్లో ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినీ కూడా
ఇలానే మాట్లాడాడు. ఆఫ్రికా ఆక్రమణను సమర్థించుకుంటూ, “మన ప్రజలకు ఊపిరి
పీల్చుకోవడానికి స్థలం కావాలి” అన్నాడు. జాతీయ గర్వం, భద్రత, ప్రజల అవసరాల సాకులు
నెపాలతో సాగిన ఆ వాదన చివరకు ఖండాన్ని రక్తపాతంలో ముంచింది. ఇది వ్యక్తుల్ని విమర్శించడానికో,
డోనాల్డ్ ట్రంప్ ను ముస్సోలినీతో పోల్చడానికో కాదు; చరిత్రలో పదే పదే కనిపించే
ధోరణుల్ని కొంచె ముందుగా లోతుగా అర్థం చేసుకోవడానికి.
గ్రీన్లాండ్ విషయంలో అంతర్జాతీయ చట్టం స్పష్టంగా ఉంది. అది
డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. ఐక్యరాజ్యసమితి సూత్రాల
ప్రకారం భూభాగాల మార్పు ప్రజల సమ్మతితోనే జరగాలి. అయితే, భద్రత పేరిట భౌగోళిక
ఆకాంక్షలను కప్పిపుచ్చుకోవడం కొత్త కాదు. కానీ, అలాంటి ప్రయత్నాలు ప్రపంచానికి
శాంతిని ఎప్పుడూ తీసుకురాలేదు. చరిత్రకారులు పలుమార్లు హెచ్చరించినట్లు, “చట్టం బలహీనపడినప్పుడు శక్తి మాట్లాడుతుంది.”
ఇక్కడే ఐక్యరాజ్యసమితి పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నానాజాతి సమితి ఎలా నిర్వీర్యమైపోయిందో, ఇప్పుడు
ఐక్యరాజ్యసమితి కూడా అలాంటి స్థితికి చేరుతోందా అన్న సందేహం అంతర్జాతీయ వేదికలపై
వినిపిస్తోంది. నాటో వంటి కూటముల్లోనూ అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది. పైకి మౌనం
ఉన్నా, లోపల ఉడుకుతున్న ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్ కమీషన్ అధ్యక్షురాలు
ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అప్పుడే స్పందించారు.
“ట్రంప్ టారిఫుల బెదిరింపులు దారితప్పాయి” అని
ఆమె స్పష్టంగానే ప్రకటించారు. అంతేకాదు, ట్రంప్
విదేశాంగ విధానాల మీద తమ ప్రతిస్పందన “ఐక్యంగా, సముచితంగా ఉంటుంది.” అన్నారు. ఇది కేవలం ఆర్థిక ప్రకటన కాదు. ఇది ఒక రాజకీయ సంకేతం — ప్రపంచ యుధ్ధానంతరం ఏర్పడిన ప్రపంచ కూర్పును కాపాడుకోవాలన్న సంకల్పం అందులో వుంది. చరిత్రకారుడు టోనీ జడ్ అన్నట్లు, “1945 తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ కూర్పు సంపూర్ణం కాకపోవచ్చు; కానీ
అది లేకపోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంది.”
డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు
చేస్తున్నారు. అక్కడి వీధుల్లో
వినిపిస్తున్న స్వరాలు కూడ ఇప్పుడు ప్రపంచానికి ముఖ్యమే. “అమెరికాకు పూర్వ వైభవాన్ని తెద్దాం” అనే నినాదాన్ని ట్రంప్ ఇటీవల పెద్ద ఎత్తున
ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో దీన్ని “Make America Great Again (MAGA)’’
అంటున్నారు. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్, గ్రీన్ ల్యాండ్ ముఖ్యపట్టణం నూక్
నగరాల్లో ప్రదర్శనకారులు ట్రంక్
నినాదానికి కొత్త అర్ధం ఇచ్చారు. వాళ్ళు కూడ MAGA అంటున్నారు. కానీ, వాళ్ళ నినాదం పూర్తిగా
అమెరికాకు వ్యతిరేకం. వాళ్ళు “Make America Go Away” అని నినదిస్తున్నారు. ఈ
నినాదం పైకి కొంచెం వ్యంగ్యంగా కనిపించినా, దాని వెనక ఉన్న భయం నిజమైనది.
సామ్రాజ్యవాద భాషను పాలకులకన్నా ముందే సామాన్య ప్రజలే గుర్తిస్తారని చరిత్ర పదే పదే
నిరూపించింది.
ప్రపంచం యుద్ధాల దిశగా సాగేటప్పుడు ఇలాంటి
కీలక సంకేతాలు కనిపిస్తాయని అమెరిక చరిత్రకారిణి హన్నా ఆరెండ్ గమనించారు. కీడుకి ఒక
సామాన్య లక్షణం ఉంటుందని ఆమె చెప్పారు. దానిని ఆమె *‘Banality of Evil’*గా నిర్వచించారు.
బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను బేరీజు వేసుకునే
ఇంగితజ్ఞానాన్ని కోల్పోయిన ప్రతిసారీ, ప్రపంచ స్థాయిలో తీవ్రమైన కీడు చోటు చేసుకుందని
ఆమె హెచ్చరించారు.
ఇక్కడ కార్ల్ మార్క్స్ చేసిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకు
వస్తుంది. చరిత్ర మొదట విషాదంగానూ,
తరువాత ప్రహసనంగానూ తిరిగి వస్తుందనే అర్ధంలో ఆయనోమాట అన్నాడు. చరిత్ర యధాతథంగా
పునరావృతం కాకపోయినా, చరిత్రలోని ధోరణులు మళ్ళీ మళ్ళీ వివిధ స్థాయిల్లో మన ముందుకు
వస్తాయని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు.
మీడియా పాత్ర ఈ సమయంలో అత్యంత కీలకం. భయాన్ని పెంచకుండ పరిస్థితిని
విశ్లేషించడం మీడియా బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు, అనేక గ్లోబల్ మీడియా సంస్థలు ప్రపంచానికి
ముంచుకొస్తున్న ప్రమాదాన్ని వినోదంగా మార్చే ధోరణితో వ్యవ్హరిస్తున్నాయి. ఇది ప్రజల్ని
అప్రమత్తం చేయాల్సిన సమయంలో, మత్తులోకి
నెట్టే ప్రమాదం.
ఇది తీర్పు కాదు; ఒక హెచ్చరిక. వ్యక్తుల మీద కాదు, ప్రమాదకర
ధోరణుల మీద చర్చ. సార్వభౌమత్వం అంటే శక్తివంతుడి ఇష్టాఇష్టాలు కాదు; అది ప్రజల
హక్కు. ఈ సూత్రాన్ని చిన్న చూపు చూస్తే చిన్న దేశాల భవిష్యత్తే కాక మొత్తం ప్రపంచ శాంతే కనుమరుగై పోతుంది.
చరిత్ర మౌనంగా ఉండదు. అది వర్తమాన ప్రపంచాన్ని నిద్ర లేపుతుంది.
నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి నిలదీస్తుంది. అప్రమత్తంగా వున్నవాళ్ళు, సమూహ
బాధ్యతలు తెలిసిన వాళ్ళు మాత్రమే చరిత్ర విసిరిన
సవాలుకు సమాధానం ఇవ్వగలరు.
రచన
: 21 జనవరి 2026