Thursday, 11 June 2026

Look East, Act East - India and China

 *లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్  : ఇండియా, చైనా*

 

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

            మన విదేశాంగ, వాణిజ్య వ్యవహారాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దుల్లో చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్సాయ్ చిన్‌ లో 38 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా అరవై యేళ్ళుగా ఆక్రమించుకుని కూర్చుంది. దాదాపు 80 వేల చదరపు కిలో మీటర్లున్న అరుణాచల్‌ ప్రదేశ్ మొత్తం తనదే అంటోంది. దానిని దక్షణ టిబెట్ అని వాదిస్తోంది.  మరోవైపు భారత మార్కెట్లలో చైనా వస్తువులు కొండల కొద్దీ వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సందర్భాలలోనే దేశ సార్వభౌమాధికారం మీద అనేక సందేహాలు  ముందుకు వస్తుంటాయి.

 

            పెట్రోలు, విద్యుత్, నీటి వినియోగంలో మితవ్యయాన్ని పాటించాలని ప్రభుత్వం తరచుగా ప్రజలకు సూచిస్తోంది.  దీనిని బట్టి ఓ ముఫ్ఫయి ఐదేళ్ళ క్రితపు ఆర్ధిక సంక్షోభం దిశగా మనం వేగంగా పోతున్నట్టు అనుమానం రావడం సహజం. 1980ల చివరినాటి-1990 ఆరంభంనాటి సంక్షోభం నుండి దేశాన్ని బయట పడేయడానికి పివి నరసింహారావు – మన్మోహన్ సింగ్ ద్వయం సరళీకృత ఆర్ధిక  విధానాలతోపాటూ “తూర్పుకు చూడండి” (లుక్ ఈస్ట్) అనే ఒక  కొత్త  ప్రాపంచిక దృక్పధాన్ని ముందుకు తెచ్చారు.

 

            లుక్ ఈస్ట్ అనేది కేవలం ఒక విదేశాంగ విధాన నినాదం మాత్రమే కాదు. రష్యా, అమెరికాల మధ్య శీతల యుధ్ధం ముగిసి ప్రపంచం పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో వున్నప్పుడు భారతదేశం తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం ఇది. ఆసియా ఖండంలో భారత నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయార్ధిక వ్యూహాల దిశను నిర్దేశించే పిలుపు ఇది. ప్రధానంగా తూర్పు – ఆగ్నేయాసియా దేశాలతో ప్రగాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని భారతదేశం - ప్రపంచ పటం మీద - ఈ ప్రాంతంలో - ఒక ప్రధాన శక్తిగా ఎదగాలనే వ్యూహం ఈ పిలుపులో వుంది. 

 

            19వ శతాబ్దంలో ఐరోపా, 20వ శతాబ్దంలో అమెరికా ప్రపంచ చోదక శక్తులుగా కొనసాగాయి. 21వ శతాబ్దంలో తూర్పు ఆసియా ప్రపంచ చోదక శక్తిగా మారగలదని అప్పట్లో ఒక ఊహాగానం చెలరేగింది. ఇండియాతోపాటూ సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, చైనాలు అనూహ్యంగా శక్తిని పుంజుకుంటాయని అంచనాలు వేశారు.

 

            నరేంద్ర మోదీజీ ప్రధాని అయ్యాక ‘లుక్ ఈస్ట్’ ను ‘యాక్ట్ ఈస్ట్’ గా ప్రకటించి క్రియాశీలంగా మార్చేందుకు పూనుకున్నారు. ఇది కొన్ని ఫలితాలను ఇచ్చింది కూడ. దక్షణాసియా దేశాల సంఘం (ASEAN)లో ఇండియా ప్రాధాన్యత పెరిగింది. జపాన్ ఇండియాకూ మద్దతుగా నిలిచింది.  ఆస్ట్రేలియా ఇండియాను కీలకమైన భాగస్వామి అనుకుంది. అమెరికా అయితే, చైనాను ఆసియా ఖండాన్ని దాటి విస్తరించకుండ నిలవరించాలంటే ఇండియాతో స్నేహం వ్యూహాత్మక అవసరం అని భావించింది. ఇంతటి అనుకూల వాతావరణాన్ని ఇండియా పూర్తిగా వాడుకునేలోపు కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి.  

 

            తూర్పు యూరోపు, సోవియట్ రష్యాలు బలహీనపడిన తరువాత చైనా సోషలిస్టు మార్గం నుండి పెట్టుబడీదారీ విధానం వైపుకు మారింది. చైనాను పెట్టుబడీదారీ దేశం అనడం కొందరికి ఇష్టం లేకపోవచ్చు. అలాంటివాళ్ళు చైనాది ఉత్పత్తిలో సోషలిస్టు విధానం, మార్కెటింగులో పెట్టుబడీదారీ విధానం అనుకోవచ్చు. అలా పదేళ్ళు పుంజుకుని, 2001 చివర్లో ప్రపంచ వాణిజ్య సంస్థలో 143వ దేశంగా చేరిన తరువాత చైనా ప్రపంచ మార్కెట్లో విజృంభించింది.   

 

            టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇ-కామర్స్,. ఇతర ఉత్పత్తిరంగాల్లో చైనా ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. ఉత్పత్తి ఎక్కువయితే వస్తువుల ధరలు పడిపోతాయని అందరికీ తెలుసు. ధరల్ని  తగ్గించడమే మార్కెటింగ్ ఆయుధంగా చైనా మార్చుకుంది. విపరీతంగా ఉత్పత్తిచేసి సరుకుల్ని తక్కువ ధరకు ప్రపంచ మార్కెట్లో విసిరేయడం  దాని విధానం. "ధర కారుచౌక. వాడండి. ఆస్వాదించండి. పాడైపోతే పడేయండి"  అనే చైనా మార్కెటింగ్ విధానం ప్రపంచ కన్స్యూమర్స్ ను తెగ ఆకర్షిస్తున్నాయి. చౌక ధరల వస్తువులు  భారీ ఫిరంగుల్లాగా పనిచేస్తాయి. వాటితో  చైనా గోడల్ని సహితం పెట్టుబడీదారులు సులువుగా కూల్చేస్తారు అనే అర్ధం వచ్చేలా ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ అన్నాడు. ఇప్పుడు చైనా చౌక ధరల ఫిరంగులతో ప్రపంచ మార్కెట్ ను కొల్లగొడుతోంది.

 

            ప్రపంచంలో  అత్యధిక జనాభాగల దేశంగావున్న కాలంలోనూ చైనా భయపడలేదు. అధిక జనాభాను సరుకుల ఉత్పత్తికి సద్వినియోగం చేసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, చౌక విద్యుత్, భారీ పోర్టులు, నైపుణ్య శిక్షణ, ఎగుమతి ఆధారిత పారిశ్రామిక విధానం అమలు చేసింది. ఫలితంగా ఒక వస్తువు ఉత్పత్తికి కావలసిన వందల భాగాలు, విభాగాలు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే తయారయ్యే వ్యవస్థల్ని ఏర్పాటుచేశారు. దీనినే Supply Chain Ecosystem అంటున్నారు. అలా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా  మారిపోయింది.

 

            ఇప్పుడు జనాభాలో మనదేశం చైనాను అధిగమించిందిగానీ, వస్తు ఉత్పత్తిలో చైనాతో పోలిస్తే చాలా వెనుకబడివున్నాం. ఏ దేశంలోనూ లేనంత  యువతరం వున్నా వాళ్ళను పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ఉపయోగించుకోలేకపోతున్నాం.

 

            మన దేశంలో వివిధ రాజకీయ పార్టీల గెలుపు వ్యూహాలు   యువతరాన్ని ఉత్పత్తికి దూరం చేస్తున్నాయని సమాజ విశ్లేషకుల అంచనా. మన రాజకీయాలు  మత రాజకీయాలుగా మారిపోతున్నాయనే ఆందోళన తరచూ వినిపిస్తున్నది. ఇలాంటి వాతావరణంలో ఎన్నికల్లో లబ్ది పొందాలంటే మత చీలికల్ని కొనసాగించక తప్పని పరిస్థితి. దానికోసం ఉత్సవాలు, ఊరేగింపులు, యాత్రలు, జాతరలు వంటివి  ఏవో ఒకటి నిరంతరం జరపాల్సి వస్తున్నది. అలా యువతరాన్ని ఉత్సాహ పరుస్తున్నారు మన రాజకీయ నాయకులు.

 

            ఒకవైపు, రాజకీయరంగం తీరిక లేకుండా కార్యక్రమాలు జరుపుతుంటే, మరోవైపు, మన ఫ్యాక్టరీ గొట్టాల నుండి పొగ రావడంలేదు. స్వంత ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో మన ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం అవుతోంది. నిరుద్యోగమూ పెరుగుతోంది.

            మన ఆర్ధికాభివృధ్ధిలోనూ ప్రాంతాల భాగస్వామ్యం లోపించింది. సహజవనరులు, మౌలిక నిర్మాణాలను గుజరాత్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల కార్పొరేట్లే హస్తగతం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడ వున్నాయి. కొందరు దీనిని ‘వెస్ట్ ఇండియా కంపెనీ’ అంటూ విమర్శిస్తున్నారు.

            1990లో  చైనా స్థూల జాతీయ ఉత్పత్తి 397 బిలియన్ డాలర్లు, అమెరికా జిడిపి 5,960 బిలియన్ డాలర్లు. అంటే 15 రెట్లు ఎక్కువ. 2025లో చైనా జిడిపి 20.6 ట్రిలియన్లు, అమెరికా జిడిపి 31.8 ట్రిలియన్లు. అంటే ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువ. సమీప భవిష్యత్తులో చైనా జిడిపి అమెరికాను అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వాళ్లు అలా అనడానికి బలమైన కారణాలు కూడా వున్నాయి. అమెరికా సాంకేతిక ఆధిపత్యం, డాలర్ ప్రాబల్యం, భౌగోళిక-రాజకీయ ప్రభావం, సైనిక పాటవం ఆధారంగా చేసుకుని ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. చైనా సరుకులకు బ్రాండ్ కూడ అక్కర లేదు. ‘చైనా సరుకు - ధర తక్కువ’ అదే దాని మార్కెటింగ్ క్యాప్షన్.

 

            2020 జూన్ నెలలో గాల్వాన్ లోయ వద్ద చైనా మన సరిహద్దుల్ని దాటే ప్రయత్నాలు చేయడంతో రెండు దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘అత్మనిర్భర్’ తత్త్వం ముందుకు వచ్చింది. ‘చైనా సరుకుల్ని బహిష్కరించండి’  నినాదాలు చెలరేగాయి. ఇది కొంచెం అతిశయించి రోడ్ల పక్కన నూడిల్స్ అమ్ముకునే తోపుడు బండ్ల మీద కూడ దేశభక్తులు దాడులు చేశారు. టిక్ టాక్ వంటి చైనా యాప్స్ ను రద్దు చేశారు.  ఓ రెండూ మూడేళ్ళ తరువాత అందరూ అన్నీ మరచిపోయారు. ఇప్పుడూ మన దేశంలోని మొబైల్ ఫోన్స్, ఫర్నిచర్, అపెరల్స్, (దుస్తులు- బూట్లు) టాయ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ పార్ట్స్ మార్కెట్లన్నీ చైనా సరుకులతో కిటకిటలాడిపోతున్నాయి.

 

            ఆహారధాన్యాలు, హార్టికల్చర్ (కూరగాయల) ఉత్పత్తిలో ఇండియా ముందుంది అనే అభిప్రాయం వుంది. ఆ రంగంలోనూ చైనా ఉత్పత్తులు ప్రవేశించేస్తున్నాయి. చివరకు రైతు బజార్లలోనూ వెల్లుల్లి పాయలేగాక ఉల్లిపాయలు కూడ చైనావి అమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యకర పరిణామం ఏమిటంటే ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పెట్టడానికి కొన్ని షరతులతో  చైనాకు అనుమతి ఇచ్చారు.

 

            ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ విధానం భారత్‌ను ఆసియాతో అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. వ్యూహాత్మకంగా ఇది విజయవంతమైంది. జపాన్, ఆస్ట్రేలియా, ఆసియాన్ దేశాలతో ఇండియా సంబంధాలు బలపడ్డాయి. కానీ ఆర్థికంగా చైనా మరింత వేగంగా ముందుకెళ్లింది. ఆసియా సరఫరా గొలుసుల్లో చైనా కేంద్రంగా మారగా భారత్ ఇంకా ప్రవేశదశలోనే ఉంది. అయిష్టంగానే అయినా ఒక విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ‘లుక్ ఈస్ట్’  యాక్ట్ ఈస్ట్’ విధానం చైనాకు ఆర్థికంగా బలపడడానికి దోహదపడింది. మన రాజకీయ విధానాలు మనల్ని ఆర్ధిక రంగంలో వెనక్కి లాగాయి.  
            సరిహద్దుల్లో చైనాను వ్యూహాత్మక ప్రత్యర్థిగా పరిగణిస్తూనే, మార్కెట్లలో చైనా ఉత్పత్తులపై ఆధారపడే వైరుధ్య స్థితిలో భారత్ ఉంది. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలంటే నినాదాలకన్నా ఉత్పత్తి, నైపుణ్యం, పరిశ్రమల నిర్మాణంపైనే దేశం దృష్టి పెట్టాలి. లేకపోతే 'లుక్ ఈస్ట్', 'యాక్ట్ ఈస్ట్' చరిత్రలో చేతికి అందిన అవకాశాలను కోల్పోయిన విధానాలుగానే మిగిలిపోతాయి.
        సరిహద్దుల్లో సైనిక శక్తితో చైనాను ఎదుర్కోవడం ఒక విషయం. మార్కెట్‌లో చైనా ఉత్పత్తులతో పోటీ పడటం మరో విషయం. మొదటిదానికి సైన్యం అవసరం. రెండోదానికి పరిశ్రమలు అవసరం. నినాదాలు, భావోద్వేగాలు, బహిష్కరణ పిలుపులు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. కానీ ఉత్పత్తి, సాంకేతికత, నైపుణ్యం, ఉపాధి — ఇవే ఒక దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి శాశ్వత పునాదులు అవుతాయి.
11-06-2026

Tuesday, 9 June 2026

10 Major Questions in the history of Communist Party of India?

 1. When did BT Ranadive become the General Secretary of the Communist Party of India?

2. When did B. T. Radioactive give the call for the armed struggle in India?

3. When did the Telangana Armed Struggle commence and with whose decision?

4. What other armed struggles took place in British India under the leadership of the Communist Party of India?

5. When did Mao Tse-tung conceive the idea of New Democratic Revolution in China?

6. What exactly did JV Stalin advise the delegates of the Communist Party of India during their meeting on 9 February 1951?

7. When did BT Ranadive get expelled from the Communist Party, terming him 'Left Adventurist'?

8. Who took the reins of the Communist Party of India after MT Ranadive?

9. What was the 'Andhra Thesis'? Who drafted it?

10. What is the link between 'Andhra Thesis' and the 'Agrarian' Revolution conceived by Kondapalli Sitharamaiah during the 1970s? 

*సోనమ్ వాంగ్ చుక్ నుండి ఖాన్ సర్ వరకు*

 *కాలధార*

*సోనమ్ వాంగ్ చుక్ నుండి ఖాన్ సర్ వరకు*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే; ఎన్ని బొద్దింకలు ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకున్నాయి? అని. ఎన్ని రావాలనుకున్నాయీ? ఎన్ని వచ్చాయి? ఎన్ని రాలేకపోయాయి?  ఎన్నింటిని రానివ్వలేదు? అనే సందేహాలు ఎలాగూ వుంటాయి. వాటికి ఎవరి సమాధానాలు వారికి వుంటాయి. అక్కడ భారీగా దించిన పోలీసుల్ని, పారా మిలటరీ దళాల్నీ చూస్తే చాలు ఎలీనవారు ఎంతగా భయపడ్డారనేది తెలిసిపోతుంది.  అదే అసలు విషయం.

 

కాక్రోచ్ జనతా పార్టికి సోషల్ మీడియాలో రెండు కోట్ల కన్నా ఎక్కువ మంది మద్దతు పలికారు. అంతమంది ఎలాగూ ఢిల్లీ రాలేరు. వస్తే ఎలా వుంటుందో ఆ ప్రళయ దృశ్యాన్ని ఊహించడం కూడ కష్టం. వెయ్యిమంది గోల చేస్తే వందమంది వచ్చారు అని కొన్ని మీడియా సంస్థలు ఎద్దేవ చేశాయి. రెండు కోట్లలో పది శాతం ఎంతో వాళ్లు లెఖ్ఖగట్టినట్టు లేదు.  ఇంకా టీనేజ్ కూడ దాటని విద్యార్ధులు దేశ రాజధాని వీదుల్లో నిటారుగా నిలబడి జాతీయ విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని ధైర్యంగా నినాదాలు చేశారు. ఇందులో ఎవరికీ రాబోతున్న ఒక కొత్త పరిణామం కనిపించడంలేదా?.

 

డిజిటల్ జెనరేషన్ వీధుల్లోనికి వచ్చినప్పుడెల్లా  ఒక సామాజిక కార్యకర్తని బలివ్వడం ఒక సాంప్రదాయం.  గత ఏడాది సెప్టెంబరు లడాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని  విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు అక్కడి విద్యా సంస్కర్త, ప్రసిధ్ధ సైంటిస్టు సోనమ్ వాంగ్ చూ ను అరెస్టు చేసి ఆరునెలలు జైల్లో నిర్భందించారు. విద్యార్ధుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా  వాంగ్ చుక్ రెచ్చగొట్టాడు అనేది ఆరోపణ. ఇప్పుడు దాదాపులాంటి కథే పునరావృతం అవుతోంది. ఇప్పుడు ఢిల్లీ నొరసన ప్రదర్శనలకు పాట్నా  ఖాన్ సర్ ను బలిపీఠం ఎక్కిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఒక విచిత్రమైన ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ప్రజాదరణ పొందిన వ్యక్తులు అధికార వ్యవస్థలతో ఘర్షణకు దిగితే ఏమవుతుంది? లడఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ అయినా, లక్షలాది విద్యార్థుల ఆదరణ పొందిన ఖాన్ సర్ అయినా, వారి చుట్టూ వివాదాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?

 

ఖాన్ సర్ అసలు పేరు ఫైజల్ ఖాన్. సోనం వాంగ్‌చుక్, ఖాన్ సర్ మధ్య ప్రత్యక్ష పోలికలు చాలా పరిమితమే. ఒకరు పర్యావరణం, రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సామాజిక కార్యకర్త. మరొకరు విద్యా రంగంలో లక్షలాది మంది విద్యార్థులకు చేరువైన ఉపాధ్యాయుడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఒక సామాన్య అంశం ఉంది. ఇద్దరూ తమ తమ రంగాల్లో భారీ ప్రజాదరణ సంపాదించారు. ప్రజాదరణ పెరిగిన వ్యక్తుల చర్యలు, వ్యాఖ్యలు, ఉద్యమాలు సహజంగానే ప్రభుత్వాలు, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి.

 

ఈ ఇద్దరి వెనుక పెద్ద సామాజిక మద్దతు ఉంది. వాంగ్‌చుక్‌కు లడఖ్ ప్రజలు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు ఇస్తారు. ఖాన్ సర్‌కు విద్యార్థులు, ఉద్యోగార్థులు, మధ్యతరగతి కుటుంబాల మద్దతు ఉంది. సమాజ శాస్త్రవేత్త మాక్స్ వెబర్ దీనిని "కరిష్మాటిక్ అథారిటీ" అని అంటాడు.  అంటే పదవి వల్ల కాకుండా వ్యక్తిగత ప్రభావం వల్ల ఏర్పడే నాయకత్వం. అలాంటి వ్యక్తులు ప్రజలలో ఆశలు, ఆకాంక్షలు, భావోద్వేగాలను ప్రేరేపిస్తారు.

 

ఖాన్ సర్ కేవలం ఒక కోచింగ్ టీచర్ మాత్రమే కాదు. లక్షలాది మంది ఉద్యోగార్థులకు, విద్యార్థులకు పరిచయమైన ప్రజా వ్యక్తి. ఖాన్ గ్లోబల్ స్టడీస్ (KGS) అనే సంస్థ ద్వార పేద విద్యార్ధులకు చాలా తక్కువ ఫీజుతో కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ ఇస్తుంటారు. ఆయన విద్యార్ధులు లక్షల్లో వుంటారు. ఆయన YouTube ఛానల్ కు 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు వున్నారు. ఇటీవల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి నమ్మలేనంత తక్కువ ఫీజులకు వైద్య సేవలు అందించడం మొదలెట్టారు.

 

లోకంలో ఎవరయినా పేదలకు సేవ చేయాలనుకుంటే వెంటనే వారికి ధనవంతులు శత్రువుగా మారిపోతారు.  విద్యారంగంలో కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు, వైద్యరంగంలో కార్పొరేట్ హాస్పిటళ్లు  ఖాన్ సర్ ను పెద్ద శత్రువుగా భావిస్తున్నాయి. సమయం కోసం ఎదురుచూస్తున్నాయి.

 

ఖాన్ సర్ అకడమిక్ అంశాలు తప్ప సాధారంగా రాజకీయాలు మాట్లాడరు. హిందూ-ముస్లిం విభజన గురించు కూడ మాట్లాడదు. కరెంట్ అఫైర్స్ క్లాసులు చెప్పే సమయంలో ఇరాన్ యుధ్ధం గురించి, రష్యా చమురు గురుంచి ఇటీవల ఆయన ఆన్ లైన్లో మాట్లాడుతున్న విషయాలు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికరంగానే మారాయి.

 

ముఖ్యంగా NEET పరీక్షా వివాదాలు, NTA పనితీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. ఒక దశలో కేంద్ర విద్యాశాఖమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. అంతే. నిప్పు రాజుకుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా?

 

ఆయన ప్రత్యర్ధులయిన ఒక కార్పొరేట్ కోచింగ్ సెంటర్ ప్రోద్భలంతో రెండు డజన్ల మంది జూన్ 2 రాత్రి ఖాన్ గ్లోబల్ స్టడీస్ భవనం మీద దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కేజిఎస్ భద్రతా సిబ్బంది దుండగుల్ని అడ్డుకుంది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపింది. అక్కడ నుండి కథ అడ్దం తిరిగింది. ఖాన్ సర్ మీద కేసు నమోదు అయింది. కాల్పులు జరపమని భద్రతా సిబ్బందిని ఖాన్ సర్ ఆదేశించినట్టు క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. అయితే, అతన్ని అరెస్టు చేయవద్దని పాట్నా సివిల్ కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీచేసింది. ఇది ఎంతకాలం ఆయనకు అరెస్టు కాకుండా రక్షణ ఇస్తుందో తెలీదు. ప్రత్యర్ధులు పైకోర్టులకు తప్పక వెళతారు. ఈ కేసు కేంద్ర ప్రభుత్వానికి కూడ కీలకమైనది. విధ్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలని ఖాన్ సర్ చేసిన్బ డిమాండును కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంతత్వరగా మరచిపోరు. ఎస్.ఎస్. సి. యూజి పేపర్ రీ-వాల్యూయేషన్ కోరిన విద్యార్ధి లొకేషన్ నెట్లో సౌత్ ఏషియా అని వస్తేనే అతను పాకిస్తానీ అనేసిన మీడియా, ఇంటి పేరు ఖాన్ అని వున్నాయన్ని ఇంకేమి అంటదో ఊహించుకోవచ్చు.

 

ఖాన్ సర్ మద్దతుదారులలో చాలామంది ఆయనపై అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. మరోవైపు, చట్ట అమలు సంస్థలు తాము కేవలం విచారణ నిర్వహిస్తున్నామని చెబుతున్నాయి. ఇక్కడే ప్రజాస్వామ్యంలో ఒక సవాలు ఉంటుంది. ప్రజల భావోద్వేగాలు ఒక వైపు, న్యాయ ప్రక్రియ మరోవైపు. హన్నా అరెండ్ చెప్పినట్లుగా, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనది అబద్ధం కాదు; వాస్తవం మరియు అభిప్రాయం మధ్య సరిహద్దు చెదిరిపోవడమే. అందువల్ల మనం వాస్తవాలను, ఆరోపణలను, అభిప్రాయాలను వేరు చేయాలి.

 

సోనం వాంగ్‌చుక్, ఖాన్ సర్, లేదా గతంలో వివిధ రంగాల్లో ప్రజాదరణ పొందిన ఇతర వ్యక్తులువారి చుట్టూ ఏర్పడిన వివాదాలు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వ్యక్తులు అధికార వ్యవస్థలను ప్రశ్నించినప్పుడు, వారు ఎక్కువ వేధింపులకు గురవుతారా? లేక ప్రజాదరణ పెరిగిన కొద్దీ సహజంగానే వివాదాలు కూడా పెరుగుతాయా? దీనికి సులభమైన సమాధానం లేదు. కానీ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరమైనది ఒకటేప్రశ్నించే హక్కు ఉండాలి, విచారణ నిష్పాక్షికంగా జరగాలి, తీర్పు సాక్ష్యాల ఆధారంగా రావాలి.

 

నిజానికి ప్రజాస్వామిక యుగంలో  ప్రజలకు మెరుగైన విద్యా, వైద్యం అందించాల్సిన బాధ్యత  ప్రభుత్వాలది. కానీ అలా జరగడంలేదు. ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్ని, హాస్పిటల్స్ ను నిర్వీర్వం చేసేస్తున్నాయి. దానితో ప్రజలు ప్రైవేటు విద్యాసంస్థల్ని, కార్పొరేట్ హాస్పీటల్స్ ని ఆశయించక తప్పడం లేదు.  ఇదే అదనుగా కార్పొరేట్ విద్యా సంస్థలు. హాస్పిటల్స్ ఫీజుల్ని, పరీక్షల్ని, వైద్యప్రక్రియల ధరల్ని విపరీతంగా పెంచేశాయి. ఎవరో అన్నట్టు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు వున్నంత వరకు ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్లు లీక్ అవుతూనే వుంటాయి. కొన్నిసార్లు ఆ విషయం బయటపడుతుంటుంది. అనేకసార్లు బయటపడదు.

 

ఇక్కడో తాత్విక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.  ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు  నిర్వీర్యం అయిపోవడంవల్ల కార్పొరేట్ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయా? లేక తద్భిన్నంగా, కార్పొరేట్ సంస్థల లాభాల్ని పెంచడానికే  ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్ని నిర్వీర్యం చేసేస్తున్నదా? కారణం ఏదైనా ఇది కొత్తగా ఎదిగి వస్తున్న కొత్త తరం సమస్య. మనం ఆలోచించాల్సింది వారి గురింది.

 

సమాజంలో చాలా అరుదుగానే సోనమ్ వాంగ్ చుక్, ఖాన్ సర్ లాంటివారు పుడతారు. వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చుగానీ వ్యవస్థ చాలా బలమైనది. చాలా క్రూరమైనది.

 

09-06-2026 

Saturday, 30 May 2026

ఇండియాను శాకాహార దేశంగా ప్రకటిస్తే హిందువులే తిరగబడతారు

 ఇండియాను శాకాహార దేశంగా ప్రకటిస్తే హిందువులే తిరగబడతారు 


సంఘపరివార శక్తులు ముస్లింలను మానసికంగా, భౌతికంగా వేధించడానికి కొన్ని దశాబ్దాలుగా బీఫ్ పాలిటిక్స్ ను ప్రయోగిస్తున్నాయి. మరోవైపు, బీఫ్ ఎక్స్ పోర్టులో భారత దేశం అగ్రస్థానంలోవుంది. అందులోనూ యోగీ ఆదిత్యనాధ్ ఉత్తర ప్రదేశ్ మరీ ముందుంది.


ఈ ద్వంద్వ నీతి ముసుగును ఊడదీసి సంఘపరివారం నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ముస్లిం నాయకులు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. గోమాసాంన్ని తాము మానేస్తున్నామని ప్రకటించడమేగాక, గోవును జాతీయ పశువుగా గుర్తించమని ప్రభుత్వాన్నే కోరారు. ఈ  సర్జికల్ స్ట్రైక్ ను తట్టుకోలేక సంఘపరివార శక్తులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. 


ఈ డిమాండ్ ను ముస్లింల చేత ఉపసంహరింపచేయడానికి సంఘపరివార శక్తులు నానా తంటాలు పడుతున్నాయి. ఇది ‘ముస్లింల సెల్ఫ్ గోల్’ అని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎలా ఇది సెల్ఫ్ గోల్? ఇందులో ముస్లింలు కొత్తగా కోల్పోయేది ఏమిటీ? 


ముస్లింలు ఏమైనా ఆవుమాసం తింటున్నారా?  ఆవు మాసం తినడం ఇస్లాం విధుల్లో ఒకటా? ఏమీకాదే!! 

ఇస్లాం పుట్టిన సౌదీ ఆరేబియాలో దుంబ (గొర్రె) మాంసాన్నే అత్యధికంగా వినియోగిస్తారు. వాళ్ళకు ఆవుజాతి దాదాపు లేదు.  


సంఘపరివార శక్తులే దిగివచ్చి 14 యేళ్ళు దాటిని ఆవును తినవచ్చు. ఇంట్లో తినవచ్చు. మిథున్ ఆవును తినవచ్చు అంటున్నాయి. ఇది ముస్లింల నైతిక విజయం. 


దేశంలోని మాంసాహారుల్లో ముస్లింలు 14 శాతం మాత్రమే.; హిందువులు 80 శాతం. ఇండియాను శాఖాహార దేశంగా ప్రకటించే సాహసం ఈ ప్రభుత్వం చేయలేదు. అలాచేస్తే, హిందూ సమాజమే తిరగ బడుతుంది. అంచేత ఆ సమస్య ఎప్పటికీ తలెత్తదు.


Friday, 29 May 2026

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

 

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన  తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

కాలధార




 

సామాజిక కార్యకర్తల సమావేశాల్లో సాధారణంగా వినిపించే ఒక అసంతృప్తి ఏమంటే ఉద్యమాల్లో ముస్లింలు కలసి రావడంలేదని. ఇదొక సెలెక్టివ్ మెమోరీకి సంబంధించిన అంశం. ముస్లింలు రోజువారీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనని మాట నిజమేగానీ, సమయం వచ్చినపుడు వాళ్ళు మిగిలినవాళ్ళకన్నా చాలా చురుగ్గానే కదులుతారు.  

 

ఇతర అంశాలను స్పృజించే ముందు ఎవరయినా గమనించాల్సిన అంశం ఏమంటే భారత ముస్లింలు ప్రధాన స్రవంతి సమూహం కాదు. వాళ్ళు ఉపస్రంవతి సమూహం. ఇటాలియన్ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్షీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక సబాల్టర్న్ గ్రూపు అది. ఆర్థికంగా వెనుకబడిన, సాంస్కృతికంగా అణచివేయబడిన, ఆధిపత్య అధికార వ్యవస్థల నుండి బహిష్కరణకుగురైన, తమ గోడు వినిపించుకోవడానికైనా  చట్టసభల్లో దాదాపు ప్రాతినిధ్యంలేని ఒక అల్పసంఖ్యాక సామాజిక సమూహాం అది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంచలనాత్మక ఫలితాలను చూసిన మే నెల అంతకన్నా సంచలనాత్మకంగా రెండు వార్తల్ని వెలుగులోనికి తెచ్చింది. The International Hepato-Pancreato-Biliary Association Chines chapter సదస్సు ప్రస్తుతం వూహాన్ లో జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్ ఈ సమావేశంలో పాల్గొనడానికి చైనా వెళ్ళారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఓ పేషెంటుకు అత్యవసరంగా Ureteral reimplantation Surgery చేయాల్సి వచ్చింది. డాక్టర్ గౌస్ దాదాపు ఏడు వేల కిలో మీటర్ల దూరం నుండి విజయవంతంగా టెలీ రోబోటిక్ సర్జరీ నిర్వహించారన్న వార్త దినపత్రికల మొదటి పేజీల్లో వచ్చింది. ఆ పక్కనే మరో వార్త కూడ వచ్చింది. కోల్కతా జిల్లాలోని కాషీపూర్ –బెల్గాచియా  నియోజకవర్గం నుండి గెలిచిన బిజేపి ఎమ్మెల్యే రితేష్ తివారి తాను ముస్లింలకు ఒక్క చిన్నపని కూడ చేసిపెట్టనని శపథం చేశారు.  చివరకు పంక్చర్లు వేసుకుని బతికే అవకాశం కూడ ఇవ్వనంటూ బాబా భోలేనాధ్ విగ్రహం సాక్షిగా ఒట్టు వేశారు.

ముస్లింలు పంక్చర్లు మాత్రమే వేస్తారా? 19వ శతాబ్దం ఆరంభానికి ముందే ‘మైసూరియన్’ రాకెట్లను సృష్టించిన టిప్పూ సుల్తాన్ ను ఏ ఖాతాలో వేయాలీ? అమెరికాలోని నాసా కేంద్రంలో టిప్పూ సుల్తాన్ చిత్రపటాన్ని చూసి ఉత్తేజాన్ని పొంది భారత దేశానికి అగ్నీ, పృధ్వీ వంటి బాలిస్టిక్ మిస్సైల్స్ ను సృష్టించిన ఎపిజె కలాంను ఏ లెఖ్ఖలో వేయాలీ? 

ముస్లింలకు సమస్తరంగాల్లో జీవనోపాధి లేకుండా చేస్తాం. ఎన్నికల్లో పోటీ చేయనివ్వం; పోటీ చేసినా గెలవనివ్వం. అసలు, ఓటు హక్కునే తీసివేస్తాం, ఆరోపణలు వస్తే చాలు విచారణలు లేకుండానే బుల్డోజర్లతో శిక్షించేస్తాం అంటూ మెజారిటీ సమూహానికి చెందిన అధికారవర్గం బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా ఘనత వహించిన ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ముస్లింలను పట్టించుకునది ఏ మేరకూ? భారత మతవ్యవస్థలో ముస్లింలను శ్రామికవర్గంగా ప్రకటించకపోయినాసరే కనీసం అణగారిన సమూహంగా ప్రకటించిన వామపక్ష పార్టీ ఏదయినావుందా? వేడి పాలతో నోరు కాల్చుకున్నవాళ్లు చల్లని మజ్జిగను కూడ  ఊదిఊది తాగుతారు. ఆ స్థితిలో పడిపోయారు భారత ముస్లింలు. సామాజిక సంఘాలు, వాటి కార్యకర్తలు, నాయకుల్ని చూస్తే ముస్లింలకు భయం, ఆందోళన, అనుమానం.

 

దీని అర్ధం ముస్లిం సమూహం సామాజిక మార్పుకు వ్యతిరేకమైనదని కానేకాదు. ఇస్లాం పుట్టుకలోలే అనేక సామాజిక విప్లవాలున్నాయి.  తెగల ఆధిపత్యం, బానిసత్వం, సంపద కేంద్రీకరణ, ఆర్థిక

దోపిడీ, లింగ వివక్ష, పుట్టుకతో వచ్చే అహంకారం వగయిరా సాంఘీక ఆచారాలకు వ్యతిరేకంగా ఇస్లాం ఆవిర్భవించింది. అది ఏకకాలంలో ఆధ్యాత్మికమైనది; సామాజికమైనది.

 

నిరుపేదలు, నిస్సహాయుల పట్ల దయగలిగి వుండండి. బానిసల్ని విముక్తిచేయండి. వర్ణబేధాల్ని పాటించకండి. సంపదను ఒకే చోట పోగుపడనియ్యవద్దు. అందులో, న్యాయమైన భాగాన్ని పేదలకు పంచండి. అలాంటి సత్ప్రవర్తనే గొప్ప ఆరాధనా మార్గం వంటి ఇస్లాం ఆదేశాలు ముస్లిం సముదాయాల్లో సామాజిక న్యాయ పోరాటాలను  ప్రోత్సహించాయి. సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ దేవునికి ప్రీతిపాత్రులు కావచ్చని ధార్మిక ముస్లింలు నమ్ముతారు. సామాజికన్యాయ సాధన కూడ దైవారాధన మార్గమే కనుక దానికోసం నాస్తికులు కావల్సిన అవసరం లేదని కూడా వాళ్లు భావిస్తారు. ఇరాన్ కు చెందిన ముస్లిం ఆలోచనాపరుడు అలీ షరియతీ ఇస్లాంను ఒక విముక్తి సిద్ధాంతంగా మలిచాడు. (ఇస్లామిక్ లిబరేషన్ థియాలజీ!) అతని దృష్టిలో నిజమైన ఆధ్యాత్మికత సమాజంలో దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా నిలబడాలి. అందుకే చరిత్రలో మనకు మతం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది; అధికారానికి ఊడిగం చేసేది; రెండోది; బాధితుల పక్షాన నిలిచే నైతిక శక్తి. ఈ రెండు ధోరణుల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం.

 

8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ప్రపంచ విజ్ఞాన కేంద్రాలు ముస్లిం ప్రపంచంలోనే ఉండేవి అంటే అతిశయోక్తికాదు. ఇరాక్ లో బాగ్దాద్, స్పెయిన్ లో కార్డోబా, ఈజిప్టులో కైరో నగరాలు విజ్ఞానశాస్త్ర, తత్వ, వైద్య పరిశోధనలకు నిలయాలయ్యాయి. ప్రపంచ ఆధునిక భావాలకు పుట్టినిల్లుగా భావించే ఫ్రెంచ్ విప్లవం ముందుకు తెచ్చిన న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అప్పటికే ఇస్లాంలో వున్నాయి. ఇస్లామిక్ స్వర్ణయుగంగా భావించే ఈ కాలం మనకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే — ప్రశ్నించే తత్త్వాన్ని కాపాడుకున్న సమాజాలు విజ్ఞాన రంగంలో  ముందుకు వెళ్తాయి అని.

 

సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కూడ కాపాడుకోవచ్చా? అనేది ముస్లిం సమాజం నిరంతరం ఎదుర్కొనే ధార్మిక మీమాంస.  అది సాధ్యమే అని చాలాసార్లు చాలామంది నిరూపించారు.

 

భారత స్వాతంత్ర్య ప్రధమ సంగ్రామానికి బహద్దూర్ షా నాయకత్వం వహించాడనీ, 1920లో ఏర్పడిన భారత జాతీయ కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపక కార్యదర్శి మొహమ్మద్ షఫీఖీ సిధ్ధీఖి అని చాలా మందికి తెలుసు. కానీ ఆయా చారిత్రక సందర్భాల్లో వాళ్ళే ఆ పాత్రను ఎందుకు పోషించారు అనే సందేహం మాత్రం చాలా మందికి వచ్చి వుండదు.

 

ఇక వర్తమానానికి వద్దాం. నరేంద్ర మోదీ – అమిత్ షాల హయాంలో ఏపుగా పెరిగిన  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఎలా ఎదుర్కోవాలో తెలీక విపక్షాలు సతమతమౌతున్న కాలంలో వాళ్లకు ఒకదారి చూపించింది ముస్లిం మహిళలే. అదే, పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ను వ్యతిరేకిస్తూ మొదలయిన  షాహీన్ బాగ్ నిరసనోద్యమం. దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో ఒక వేదికను నిర్మించి, ప్రశాంతంగా కూర్చొని నిరసన తెలిపే ఒక వినూత్న విధానాన్నీ వాళ్ళు రచించారు. ఒక మైనారిటీ సమూహమైన ముస్లిం మహిళలు ఉద్యమం చేస్తుంటే మరో మైనారిటీ సమూహమైన శిక్కు మహిళలు కదలి వచ్చి షాహీన్ బాగ్ లో ఉచిత భోజనం (లంగర్)  ఏర్పాటు చేశారు.

 

షాహీన్ బాగ్ ఒక కొత్తరకం ఉద్యమం.  దీనికి నాయకులు లేరు. సంయుక్త కార్యాచరణ కమిటిలేదు. కార్యవర్గం లేదు. అందరూ నాయకులే. అందరూ కార్యకర్తలే. షాహీన్ బాగ్ ఉద్యమం ఇచ్చిన స్పూర్తితోనే సరిగ్గా అదే పధ్ధతుల్లో ఢిల్లీ నగర శివార్లలో లంగరుతోసహా నిరసనోద్యమాన్ని చేపట్టారు భారత  రైతులు. ఈ పరిణామాల్ని, అనుబంధాల్నీ  మరచిపోవడం న్యాయం కాదు.

 

ఇప్పటి డిజిటల్ యుగంలో నిరసనోద్యమాల రూపం సారం రెండూ మారిపోయాయి. టునీషియాలో 2010 డిసెంబర్‌లో రోడ్డు మీద పండ్లు అమ్ముకునే  ఒక చిరువ్యాపారి మొహమ్మద్ బొవాజిజిని ట్రాఫిక్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ అవమానాన్ని భరించలేక అతను అక్కడికక్కడే ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటన మీద టునీషియా యువత తీవ్రంగా స్పందించింది. అవినీతి, నియంతృత్వం, నిరుద్యోగం, యువతలో పేరుకుపోయిన నిస్పృహ — ఇవన్నీ కలిసి ఒక్కసారిగా పేలాయి. స్మార్ట్ ఫోన్ల సహాయంతో  వాళ్ళ ఆక్రోసం  ప్రపంచం నలుమూలలకు చేరింది. నెలరోజుల్లోనే టునీషియా ప్రభుత్వం పడిపోయింది. దేశాధ్యక్షుడు బెన్ అలీ దేశం వదిలి పారిపోయాడు.

 

అమెరికా చరిత్రకారిణి హన్నా అరెండెట్ చెప్పినట్టు ప్రజలు ప్రభుత్వానికి విధేయంగా వుండడం మానేసిన క్షణాణ అధికార భవనాలు కూలిపోతాయి.

 

ఆ తరువాత యువతరం నిరసన సెగలు ఈజిప్టును తాకాయి. కైరోలోని తాహరీర్ స్క్వేర్లో లక్షల మంది యువకులు ప్రదర్శనగా వచ్చారు. ముఫ్ఫయి యేళ్ళుగా నిరాఘాటంగా అధికారాన్ని చెలాయిస్తున్న హోస్నీ ముబారక్ రాజీనామా చేసి గద్దె దిగి వెళ్ళిపోయాడు. ఇదే పధ్ధతి నిరసనోద్యమం లిబియాలో అంటుకోగా అధ్యక్షుడు మువమ్మర్ గడాఫీ గద్దె దిగడమేగాక హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే సిరియా, ఎమెన్, బహెరెన్  లో కూడా యువతరం నిరసన సెగలు గట్టిగా తాకి అక్కడి ప్రభుత్వాలను మార్చేశాయి.  ఇవన్నీ అరేబియన్ దేశాలు కనుక సమాజశాస్త్రవేత్తలు యువతరం నిరసనోద్యమాలకు ‘అరబ్ స్ప్రింగ్’  అని పేరు పెట్టారు. తెలుగులో మనం ‘అరబ్ వసంతం’ అనుకోవచ్చు. ఈ యువగాలులు  ఇతర దేశల్లోనికి ప్రవేశించినపుడు జెన్ –జీ అనే పేరు వచ్చింది. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లను తాకి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇండియాలోనూ ప్రవేశించాయి.

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో యువతరం నిరసనలు  యుద్ధాలకంటే పెద్ద మార్పుల్ని చాలా వేగంగా తీసుకొచ్చాయి. అయితే,  అరబ్ వసంతాలు నియంతల వ్యవస్థల్ని సమర్ధంగా నిర్మూలించినంతగా  ఒక ఆదర్శవంతమైన కొత్త వ్యవస్థల్ని నిర్మించలేకపోయాయి. ఇది వీటి బలహీనత. నియంతృత్వాన్ని నిర్మూలించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా వుంది. ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మీంచే సిధ్ధాంతం ఇప్పుడు వాళ్ళకు కావాలి!!

 

రచన : 26-05-2026

ప్రచురణ :  27 మే 2026

నాలుగు వైరుధ్యాలేవీ? ప్రధాన వైరుధ్యం ఏదీ?

 నాలుగు వైరుధ్యాలేవీ? ప్రధాన వైరుధ్యం ఏదీ? 




ఈమధ్య కాలంలో చాలా ఆసక్తిగా విన్న ప్రసంగం ఇది.

ఇందులో మూడు భాగాలున్నాయి.
గతం, వర్తమానం, భవిష్యత్తు.
నక్సల్ బరీ గత చరిత్ర గురించి వేణు చాలా ఉత్తేజకరంగా ప్రసంగించాడు.
అందుకు అతన్ని ఎంతయినా మెచ్చుకోవచ్చు.
వర్తమానానికి వచ్చే సమయానికి అలాంటి ఉత్తేజానికి అవకాశంలేదు.
తాము మాత్రమే విప్లవకారులు, తమది మాత్రమే విప్లవకర సంస్థ అని
గొప్పలు చెప్పుకున్న మావోయిస్టు పార్టి నాయకత్వం 'వికసిత్ భారత్' తీర్ధం తీసుకుని ప్రభుత్వానికి వీరోచితంగా లొంగిపోయింది.
వర్తమానం నిరాశాజనకంగా వున్నప్పుడు భవిష్యత్తును ఆశాజనకంగా చిత్రించడం కష్టం,
దేశంలో విప్లవకర వాతావరణం అద్భుతంగా వుంది. విప్లవకర శక్తులు పుష్కలంగా వున్నాయి.
కానీ, విప్లవానికి అవసరమైన మూడు షరతుల్లో ప్రాణప్రదమైనది - విప్లవకర సంస్థ, పార్టి - పూర్తిగా మిస్సయింది.
ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఆలోచనాపరులు ఏం చేయాలీ?
చొరవ చేసి భవిష్యత్తు కోసం ఒక కొత్త పంథాను రూపొందించాలి.
1990ల తరువాత మారిన ఆర్ధిక సామాజిక వాతావరణంలో వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం వంటి పాత కార్యక్రమాలను పక్కన పెట్టి కొత్త సామాజికార్ధిక పునాదుల మీద కొత్త కార్యక్రమాన్ని, ఒక కొత్త ఐక్య సంఘటనను ప్రతిపాదించాలి.
అంతకన్నా ముందు కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ సమాజంలో నాలుగు వైరుధ్యాలనూ, అందులో ప్రధాన వైరుధ్యాన్నీ ప్రకటించాలి.
అలాంటి చొరవ వేణు ప్రసంగంలో లోపించింది.
ఈసారి బక్రీద్ భారత ముస్లింల రాజకీయ చరిత్రలో ఒక ముందడుగు. "గోహత్యను నిషేధించండి", "ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి" అంటూ ఒక వినూత్న ఉద్యమానికి వాళ్లు నడుంబింగించారు. బక్రీద్ కు నాలుగు రోజులు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఆ ప్రస్తావనలేదు.
అయినప్పటికీ, 80 నిముషాల ప్రసంగంలో ఒక చోట మైనారిటీలు, ఇంకోచోట ముస్లింలు, క్రైస్తవులు అనే పదాలు వినిపించాయి. అందుకు వేణుకు ధన్యవాదాలు.


N. Venugopal Breaks Down Charu Mazumdar’s Explosive Letter on Naxalbari | G8news

https://www.youtube.com/watch?v=B7vJ4YQfSJQ








Sunday, 24 May 2026

*బొద్దింకల ఉద్యమం దేనికి ప్రతీకా?*

*బొద్దింకల ఉద్యమం దేనికి ప్రతీకా?*

 

ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు.  

 

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*




భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దేశంలోని మొత్తం యువత గురించి తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని  దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే మాటను జెన్ జీ యువత వైరల్ గా మార్చేసింది. “అవును. మేము బొద్దింకలమే” అని ప్రకటించుకుంది.  ఇది కేవలం మీమ్ రాజకీయమా? లేక వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?

 ఉద్యోగాలులేని యువతరం మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిజంలోకి వచ్చి కొందర్ని టార్గెట్ చేస్తున్నదని  మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా “బొద్దింకలు” అనే పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చిందని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి  శత్రుత్వం కాదని అనేక మంది స్పందించారు. మనకు నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేఛ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా స్వేఛ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్ధంలో అమెరిక సామాజిక కార్యకర్త నోవమ్ చోమ్స్కీ అన్న మాట మళ్ళీ వైరల్ అయ్యాయి.

ఉద్యమకాలంలో అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా మారిపోతుంది.  నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సిపిఐ – మార్క్సిస్టు - లెనినిస్టులు. కిట్టనివాళ్లు వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. “అవును మేము నక్సలైట్లమే” అంటూ  వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొదలెట్టారు. “మేము మాల”, “మేము మాదిగ” వంటి ఆత్మగౌరవ ప్రకటనల్ని కూడ మనం చూశాం. ఇది సోషల్ మీడియా యుగం కనుక వేగం మరింత ఎక్కువ. ఇప్పుడు “బొద్దింక” అనే మాట కొత్త రాజకీయ మీమ్‌గా మారింది. వేలాది మంది యువత “అవును. మేము బొద్దింకలం” అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు బొద్దింక ఫోటోలతో టీ షర్టులు ధరించి రీల్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ తత్వవేత్త మైఖేల్ ఫుకాల్ట్ “అధికారం ప్రతిఘటనను సృష్టిస్తుంది” అన్న సిద్ధాంతం ఇప్పుడు గట్టిగానే పనిచేస్తోంది. అధికార భాష ఎంత కఠినంగా మారితే ప్రతిస్పందన అంత వైరల్ అవుతుంది.

 

బోస్టన్ యూనివర్సిటీ విద్యార్ధి అభిజీత్ దీప్కే సరదాగా ‘కాక్రోచ్ జనతా పార్టి’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే ఆ పార్టీలో యాభై వేల మంది చేరిపోయారు. తరువాత కోటి మంది అయ్యారు. ఇదేమీ ఒక రాజకీయ పార్టి కాకపోవచ్చు కానీ, ఇది ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. ముఖ్యంగా, విద్యావంతులైన పట్టణ యువత ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ భావోద్వేగంగా కనెక్ట్ కాలేకపోతున్నదని  ఈ వైరల్ స్పందన చెపుతోంది. స్థిరమైన రాజకీయ ఐడెంటిటీలు కరిగిపోతున్న కాలం ఇది. అస్థిర కార్మికవర్గం అస్థిర రాజకీయ భావాలనూ సృష్టిస్తుంది.

కొత్త పరిణామాల వెనుకనున్న అసలు నేపథ్యం తీవ్రమైన నిరుద్యోగం. పరీక్షాపత్రాల  లీకులు, ఉద్యోగాల కొరత, కాంట్రాక్ట్ కల్చర్, పెరుగుతున్న పోటీ యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉపాధి  సంక్షోభం కూడా ఉంది.

కొత్త తరాల్లో కొత్త ఆలోచనలు రావడం సహజం; పాత ఆలోచనల నుండి బయటపడటమే పెద్ద కష్టం. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టుకోవడంలేదు. అందుకే మీమ్స్, వ్యంగ్యం, డిజిటల్ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.

బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ఉన్నాయి. “న్యూక్లియర్ యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే” అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు. కోట్ల సంవత్సరాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను తట్టుకునే సామర్ధ్యం కూడా వీటికి ఉందనడానికి సైంటిఫిక్ ఆధారాలున్నాయి. అందుకే ఇప్పుడు యువత “మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం” అని ధీమాగా అంటోంది. 

 

ఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్ పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు — ఇవే ఇప్పుడు కొత్త పోరాట   వేదికలు. టునీషియా, లిబియా అరబ్ స్ప్రింగ్,  అమెరికాలో “వాల్ స్ట్రీట్ ను ఆక్రమించండి”, హాంగ్‌కాంగ్ ఉద్యమాలు,— అన్నీ డిజిటల్ మీడియా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్-Z అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.

            ఈ బొద్దింకల వివాదం మరో పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తింది — ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా? దానికి సమాధానం కాదనే! రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టే దాని విలువ ఉంటుంది అన్నాడు అంబేడ్కర్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం అవసరం. అదే సమయంలో వాటికి అకౌంటబిలిటీ కూడా అవసరం. సోషల్ మీడియాలో యువత అంటున్నదేమిటీ? - “ప్రశ్నించడం దేశద్రోహం కాదు.” అది నిజమేకదా!! 

కాక్రోచ్ జనతా పార్టి నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేవి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. రాజకీయ పార్టీలు, మీడియా, న్యాయవ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థలపట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతుంది. ఈసారి అది ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే యువతను అవమానిస్తే అనర్ధాలే జరగవచ్చు.

రచన : 20 మే 2026