Monday, 18 May 2026

Womb also a Geopolitical Space - గర్భాశయంపై భౌగోళిక రాజకీయాలు!*

 

* గర్భాశయంపై భౌగోళిక రాజకీయాలు!*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*





 

 

ప్రపంచం ఒకప్పుడు జనాభా పేలుడు గురించి భయపడింది. ఇప్పుడు జనాభా క్షీణత గురించి వణుకుతోంది! గర్భాశయం గొప్పతనం ఇప్పుడు పెరిగింది.

 

అవసరమే అన్వేషణలకు జన్మస్థలం అనే మనుగడ నియమం తెలీని ఓ భయస్తుడు థామస్ రాబర్ట్ మాల్థస్ ఓ పిచ్చి జనాభా సిధ్ధాంతంతో ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆయన సిధ్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనదేశం ఆహారం అందక కృంగి కృశించి అల్లాడిపోవాలి. అలా జరగడంలేదు. అవసరానికి మించి పండించే సామర్ధ్యం మనకుందని ప్రతి సంవత్సరం నిరూపిస్తున్నాం. ప్రతి ఏటా 35 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని పండిస్తున్నాం. ఏటా 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని ఎగుమతి చేస్తున్నాం. అనధికారికంగా స్మగుల్ అవుతున్న ఆహారధాన్యాలకు లెఖ్ఖలు లేవు.  ‘సీజ్ ద షిప్’ కథ గుర్తుంది కదా!

 

“మేమిద్దరం మాకిద్దరు” “పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం” “చిన్న కుటుంబం – చింతలు లేని కుటుంబం” “ ఒక్కరే ముద్దు – ఆ తరువాత వద్దు” ఇలాంటి నినాదాలు 1960, 70 లలో హోరెత్తించాయి. కథ అక్కడి నుండి మొదలైంది. మతద్వేషాన్ని పెంచి దేశ ప్రధాని కాదలచిన ఒక రాష్ట్ర  ముఖ్యమంత్రి ముస్లింలను జనాభా దోషులుగా చిత్రించడానికి కొత్త నినాదాన్ని రూపొందించారు.  “హమ్ పాంచ్ హమారే పచ్చీస్” (ఒక భర్త, నలుగురు భార్యలు- వారికి పాతికమంది సంతానం) అని భయపెట్టేంత వరకు సాగింది వారి ప్రచారం.

 

ఇప్పుడు అదే సంఘపరివారానికి అధినాయకులైన మోహన్ భగవత్ నలుగురు పిల్లల్ని కనాలంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లల్ని కనేవారికి వేల రూపాయల నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.

 

ఇది భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. రష్యా, చైనా, యూరప్ — అందరూ ఒక్కసారిగా ‘ఫెర్టిలిటీ’ గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం కుటుంబ సమస్యనా? లేక భవిష్యత్ ప్రపంచాధిపత్య యుద్ధమా? పెట్రోలు స్థానాన్ని జనాభా ఆక్రమిస్తున్నదా?

 

విద్యార్ధులు లేక ఖాళీగా పడున్న కుర్చీల్ని చూసి జపాన్ వణుకుతోంది. పాఠశాలలు మూతపడుతున్నాయి. యూరప్‌లో వృద్ధులే ఎక్కువ. దక్షిణ కొరియాలో పెళ్లిళ్లు తగ్గిపోయాయి. తైవాన్ జనాభా అంతరించిపోతోంది. ఇటలీలో గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రీస్, పోర్చుగల్ పరిస్థితి అదే. చొరబాటుదార్లను తరిమేస్తాం  అంటూ మనం ఎన్నికల హామీలు ఇస్తుంటే, జర్మనీ  విదేశీయుల్ని తమ దేశానికి రావాలని బతిమాలుకుంటోంది. అక్కడ యంత్రాలున్నాయి; యంత్రాల మీద పనిచేయడానికి మనుషులు లేరు. 

 

జనాభాకు ముంచుకొస్తున్న ముప్పును చూసి రాజకీయ నాయకులు, ధార్మిక పెద్దలు కొత్త నినాదం మొదలుపెట్టారు — “పిల్లలు కనండి!” అంటున్నారు. ఎందుకంటే, జనాభా లేకపోతే మార్కెట్ ఉండదు. సైన్యం ఉండదు. కార్మికులు ఉండరు. పన్నులు కట్టేవాళ్లు ఉండరు. కార్మికులు లేకపోతే కార్పొరేట్ సామ్రాజ్యాల శ్వాస ఆగిపోతుంది అని కార్ల్ మార్క్స్ అన్న మాటలు ఈ సందర్భంగా సహజంగానే  గుర్తుకు వస్తాయి. ప్రపంచం ఇప్పుడు ‘డెమోగ్రాఫిక్ ఎమర్జెన్సీ’ని ఎదుర్కొంటోంది.”

 

మోహన్ భగవత్  పెద్దకుటుంబాల గురించి మాట్లాడినప్పుడు చాలా మంది దాన్ని కేవలం సిద్ధాంత రాజకీయంగా చూశారు. కానీ అసలు భయం ఇంకోటి. ఇండియా సంతానోత్పత్తి రేటు ఇప్పటికే భర్తీస్థాయి దిగువకు వచ్చేస్తోంది. అంటే భవిష్యత్తులో వృద్ధులు ఎక్కువ; యువత తక్కువ! ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదు; ఇది ఆర్థిక యుద్ధం.

 

స్వామి వివేకానంద ఒక సందర్భంలో  ఒక జాతి బలం దాని ప్రజలే అన్నాడు. ప్రజలు లేకుండా దేశభక్తి నినాదాలు కూడా నీరసపడిపోతాయి. తమాషా ఏమిటంటే, ఏళ్ల తరబడి ‘జనాభా నియంత్రణ’ గురించి చెప్పిన వ్యవస్థే ఇప్పుడు ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అంటోంది. చరిత్రలో ఇది చాలా పెద్ద మలుపు. ఒక పెద్ద కుదుపు!

 

ప్రభుత్వాలు ఇప్పుడు ప్రసూతిని  సంక్షేమంగా కాకుండా జీవికను కాపాడుకునే  మార్గంగా చూస్తున్నాయి. ఇది ఒక దేశం కథ కాదు; ప్రపంచ సంక్షోభం. తూర్పు ఆసియాలో, దక్షణ కొరియా, జపాన్, చైనా, తూర్పు యూరప్ లో యుక్రేయిన్, రష్యా, బల్గేరియా, దక్షణ యూరప్ లో ఇటలీ గ్రీస్ లలో ప్రసూతి సంక్షోభం చాలా తీవ్రంగా వుంది. అనేక దేశాలు పిల్లలు కనేవారికి పన్ను మినహాయింపులు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. వారికి ఒక విషయం అర్థమైపోయింది; జనాభాయే ముక్తి. ఈమాట వినగానే ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆగస్టే కోమ్టే మాటలు ‘డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ’ గుర్తుకు వచ్చి వుంటాయి.

 

ఇప్పుడు ప్రపంచం ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా వుండడం గురించి చర్చిస్తోంది. ప్రసవ రేటు అధికంగా వుండడానికి జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు కూడ వుంటాయి.  అందులో భాగంగా ధార్మిక కారణాలూ వుంటాయి. వాటిని పరిశోధించాలి. పిల్లల్ని కనడానికి 19 నుండి 29 సంవత్సరాలలోపు  సానుకూలమైన వయస్సు. యువతరం ఆ వయసులోనే పెళ్ళి చేసుకునేలా సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానికి తగ్గ వాతావరణాన్ని చట్టపరంగా  ఏర్పాటు చేయాలి.

 

2001 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో  విడాకులు తీసుకున్నలేదా విడిపోయిన మహిళలు 23.5 లక్షల మంది. పదేళ్ళ తరువాత 2011లో వీరి సంఖ్య 33 లక్షలకు చేరుకుంది. పదేళ్ళలో 40 శాతం పెరుగుదల. 2021లో జనాభా లెఖ్ఖలు తీయలేదుగానీ అది 46 లక్షలకు చేరివుంటుందని అంచనా. 2031 నాటికి ఈ సంఖ్య 65 లక్షలు దాటుతుంది.

 

సమాజాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలు సరిపోవు. సమాజ విశ్లేషకులు ఇంకొన్ని అడుగులు ముందుకు వేయాలి. గణాంకాల్ని సామాజికవర్గాలవారీగా వర్గీకరించాలి. అప్పుడు విడాకులు తీసుకున్న / విడిపోయిన మహిళలు ఏ కుల, ఏ మత  సమూహాల్లో ఎక్కువ శాతం వున్నారో తేలిపోతుంది. కులమత విద్వేషాలను రేకెత్తించే వారికి ఇలాంటి  వర్గీకరణలు నచ్చవు. “ముస్లింలలో విడాకులు ఎక్కువ” అని ప్రచారం చేసేవారికి ఈ గణాంకాలు గొంతు దిగవు. మరో విషయం ఏమంటే, వితంతువుల్ని, విడాకులు పొందిన స్త్రీలని వివాహం చేసుకునే సాంప్రదాయం ముస్లిం సమాజంలో ఏడవ శతాబ్దం ఆరంభం నుండే వుంది. దీనినొక సామాజిక విలువగా గుర్తించడానికి మిగిలిన సమూహాలకు వెయ్యేళ్ళకు పైగా పట్టింది.

 

ప్రధాన స్రవంతి  మీడియా, సోషల్ మీడియా రెండూ ఒక క్లిష్టమైన సామాజిక అంశాన్ని ‘భయ రాజకీయంగా’ మార్చడానికి అదనపు గంటలు శ్రమిస్తున్నాయి. సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డర్కెమ్ అవగాహన ప్రకారం సమాజం సంఘీభావంతో ఏర్పడుతుందిగానీ భయంతోకాదు. ఎందుకంటే మాతృత్త్వాన్ని కూడ ఒక రాజకీయార్ధిక ఆయుధంగా మార్చేస్తే సమాజమే అంతరించిపోతుంది.

 

గత మార్చి నెలలో రంజాన్ పండుగ సందర్భంగా  రష్యా అధినేత వ్లదిమీర్ పుతిన్ తన అధికార నివాసంలో ముస్లిం పిల్లలతో వేడుక చేసుకుని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి సాధారణ ఫోటోలు కావు; ఒక సరికొత్త రాజకీయ సంకేతం. యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, జనాభా సంక్షోభం మధ్య క్రెమ్లిన్ ఇప్పుడు ముస్లిం సమాజాన్ని వ్యూహాత్మకంగా ప్రయోజనకారిగా చూస్తోంది. ఇది కేవలం మత సహనం కాదు; జనాభా డిమాండ్.  

 

మావో కాలంలో జనాభాను చైనా ఒక శక్తిగా భావించేది. తర్వాత దానికీ జనాభా భయం పట్టుకుంది. కుటుంబ నియంత్రణల్ని చాలా కఠినంగా  సాగించింది. అదే చైనా ఇప్పుడు యువతను పెళ్లి చేసుకోమని వేడుకుంటోంది. ఇది చరిత్రలోని అతిపెద్ద వ్యంగ్యాల్లో ఒకటి. చైనా వాయువ్య ప్రాంతలో వుండే వ్యూఘుర్ ముస్లింలను అప్పట్లో క్రూరంగా  అణిచివేసేవారు. కొత్తతరం పుట్టక  సతమతమైపోతున్న చైనాకు ఇప్పుడు ముస్లింల మీద  సానుకూల వైఖరి పుట్టుకొచ్చింది.  

 

ప్రపంచ నాయకులకు ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్ధం అయిపోయింది; జనాభా లేకపోతే దేశాలు ఖాళీ అయిపోతాయి.  1970లలో అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ లకు రక్షణ వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన హెన్రీ కిస్సింగర్ పంటల్ని నియంత్రిస్తే మానవాళిని నియంత్రించవచ్చు అనేవాడు. ఇప్పుడు ఆ సూత్రం మారింది; ‘జనాభాను కాపాడుకుంటే భవిష్యత్తును శాసించవచ్చు’. ఇప్పుడు ఇదే కొత్త గ్లోబల్ రాజకీయ వ్యూహం!

 

ఇప్పుడు ప్రపంచ యువత క్రమంగా పెళ్లి నుంచి దూరమవుతోంది.  సౌకర్యవంతమైన జీవితం మీద ఆశ, ఉద్యోగ అస్థిరత, ఒంటరి జీవన విధానం, వినియోగదారీ సంస్కృతి దీనికి కారణాలు. సోషియాలజిస్ట్ జిగ్మంట్ బౌమన్ ద్రవాధునికత అన్నది దీనినే. స్థిరమైన బంధాలు కనమరుగౌతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ స్థిరంగా వుండడం సాధ్యం కాదు. మనం స్థిర కుటుంబాన్ని నిరాకరిస్తే సంతానోత్పత్తికి అవకాశాలు తగ్గిపోతాయి.  నశించిపోతున్న మానవ జాతిని పునరుత్పత్తి సామర్ధ్యంతో  నిలబెట్టే శక్తి ఒక్క మహిళలకే వుంది. దానిని గౌరవించడం నేర్చుకోవాలి. మహిళల్ని గౌరవించకపోతే మానవజాతి నిలబడదు.

          ఇరవయ్యొకటో శతాబ్దంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతో జరగవు; జనాభాతో కూడా జరుగుతాయి. ఎవరి దగ్గర యువత ఎక్కువగా ఉంటే… వాళ్ల దగ్గర మార్కెట్ ఉంటుంది. వాళ్ల దగ్గర కార్మికులు ఉంటారు. వాళ్ల దగ్గర సైనికులు ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మహిళల గర్భాశయాన్ని కూడా భౌగోళిక రాజకీయ వేదిక (geopolitical space) గా చూస్తోంది.

 

ఇది వినడానికి కఠినంగా ఉన్నా — నిజం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మహిళలకు గౌరవం, భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, పిల్లల్నికనే సానుకూల వాతావరణం కల్పించకుండా కేవలం ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అని చెప్పడం సరిపోతుందా?

 

18-05-2026


Thursday, 14 May 2026

Parliamentary democracy — a Sedative? or a Solvation?

 Parliamentary democracy — a Sedative? or a Solvation?

ప్రజాస్వామ్యమా? రాజకీయ మాయా?

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో ‘ప్రజాస్వామ్యం; అనే పదానికి వచ్చినంత పవిత్రత మరే రాజకీయ సిధ్ధాంతానికీ రాలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తనను ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వంగానే ప్రకటించుకుంటోంది. ప్రతి యుద్ధం, ప్రతి ఆర్థిక విధానం, ప్రతి చట్టం — ప్రజాస్వామ్యం పేరుతోనే సాగుతున్నాయి. ఇరాన్ మీద యుధ్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన రాజకీయ ఆయుధం ‘పాలనమార్పు’ (Regime change). అంటే, ఇరాన్ లో నియంతృత్త్వాన్ని అంతంచేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని నమ్మబలికాడు. ఆ మంత్రం ప్రభావవంతంగా పనిచేసింది. ఆ దెబ్బకు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయేల్ ల జంటదాడిని ఖండించడానికి కూడ అనేక దేశాలు జంకాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటే హజార్ ఖూన్ మాఫ్ !

కానీ, అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న ఇక్కడే ఎదురవుతుంది. ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల పాలనేనా? లేక ప్రజల పేరుతో నడిచే ఇతరుల అధికార వ్యవస్థనా?

మార్క్సిస్టులకు  సాంప్రదాయంగా  ప్రజాస్వామ్యం మీద ఎలాగూ నమ్మకం వుండదు. పెట్టుబడీదారీ వ్యవస్థ తనకు అనుకూలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించుకుందన్నారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ ముక్తకంఠంతో. అంచేత వాళ్ళ మీద ప్రజాస్వామ్య మంత్రం ప్రభావం చూపదు.

           రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత, ముఖ్యంగా ముస్సోలినీ – హిట్లర్ల ఫాసిస్టు, నాజీయిస్టు నియంతృత్త్వాలను  చూసిన తరువాత  ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం మీద వ్యామోహం ప్రమాదకరంగా పెరిగింది. ఈ ‘పవిత్ర మాయాజాలం’ను ఛేధించడానికి  ప్రయత్నించినవాళ్లలో ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు జాన్  డన్న్ ఒకడు. ‘ప్రజాస్వామ్యపు మాయజాలం ఛేదింపు’ అనే పుస్తకంలో క్రూరంఐన నియంతృత్త్వమే అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం ముసుగులో  కొనసాగుతున్న తీరును అతను లోతుగా విశ్లేషించాడు. 

అనేక దేశాల్లో క్రమం తప్పకుండ ఎన్నికలు జరుగుతున్నాయి. రుతుక్రమం తప్పకుండ చట్టసభలు నడుస్తున్నాయి. అనేక చట్టాలు మెజారిటీ సభ్యుల ఆమోదం పొందుతున్నాయి. ప్రతిపక్షాలు కూడ సభలు సమావేశాలు నిర్వహించి తమ విధానాలను ప్రకటిస్తున్నాయి. అధికార పార్టీలను ఘాటుగానే విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికార పార్టి ఓటమిపాలై  ప్రతిపక్ష పార్టి  అధికారాన్ని చేపడుతోంది. ఇన్ని జరిగినా, ప్రజాస్వామ్యానికి నిఘంటువుల్లో అర్ధం చెప్పినట్టు సమాజంలో జరుగుతోందా? తమ జీవితాలను తాము అనుకున్నట్టు మార్చుకునే అధికారం నిజంగా ప్రజల చేతుల్లో ఉంటోందా?

జాన్  డన్న్ వాదన ప్రకారం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక రాజకీయ మత్తుమందుగా మారిపోయింది. ఎన్నికలు జరుగుతున్నాయనే కారణంతో ప్రజలు తమకు అధికారం ఉందని భావిస్తున్నారు. కానీ అసలు అధికార నిర్మాణాలు మాత్రం కార్పొరేట్ శక్తులు, మీడియా సామ్రాజ్యాలు, అంతర్జాతీయ పెట్టుబడి, భద్రతా వ్యవస్థల చేతుల్లోకి జారిపోతున్నాయి. ఇదే ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అంతర్గత విషాదం.

భారత రాజకీయ వ్యవస్థను గమనిస్తే ఈ వైరుధ్యాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్‌ను చాలా మంది  ప్రశంసిస్తారు. 2024లొ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటింగులో పాల్గొన్నారు. వీరిలో 31 కోట్ల మంది మహిళలు. ఈ అంకెల్ని చూస్తే ప్రపంచం నివ్వెరపోవాల్సిందే. అయితే, కులాధిపత్యం, ధన ప్రభావం, ఎన్నికల అవినీతి, మీడియా మానిప్యులేషన్, రాజకీయ నేరీకరణ, రాజకీయ మతీకరణ  వగయిరాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయంటే అతిశయోక్తికాదు.

         “సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు” అని బిఆర్ అంబేడ్కర్ చాలాసార్లు హెచ్చరించాడు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లోని 824 శాసన సభ నియోజకవర్గాలను ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలోవున్న పార్టి వీటిల్లో ఒక్క సీటు కూడా ముస్లింలకు కేటాయించలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయి నాయకులు ముస్లిం వ్యతిరేక ప్రచారం సాగించి హిందూ ఓట్లను ఆకర్షించి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించారు. బిజెపికి ఓటు వేయని వార్నీ, విపక్షాలకు మద్దతు తెలిపే వారినీ ఎన్నికల సంఘం ఏకంగా ఓటర్ల జాబితా నుండి తొలగించిందని  విపక్షాలు అనేకసార్లు ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణల్ని నిజం  చేస్తూ, నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేసిన మనోజ్ కుమార్ అగర్వాల్ ను ఆ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరిగా నియమించారు. ఆ రాష్ట్రానికి స్పెషల్ ఎలక్షన్ ఆబ్జర్వర్ గావున్న డాక్టర్ సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించారు.

యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు; ప్రతి ఓటుకూ సమాన విలువ అని రాజ్యాంగం అంటే చాలామంది చాలాకాలం మైమరచిపోయారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమాన ఓటు హక్కు ఇవ్వగలదు; కానీ, సమాన శక్తి ఇవ్వదు అని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ హెచ్చరిక ఇప్పుడు మరింత సత్యంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కానీ సామాజిక అసమానతలు మరింత బలపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల కంటే ఎన్నికల యంత్రాలుగా మారుతున్నాయి. పౌరులు క్రమంగా ఓటు బ్యాంకులుగా, డేటా యూనిట్లుగా మారుతున్నారు.

ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందా? అనే ప్రశ్న కీలకమైనది. ప్రజలు ఐదేళ్లకోసారి ఓటు వేస్తారు. కానీ ఆ తర్వాత జరిగే వేలాది నిర్ణయాలన్నీ కార్పొరేట్ల అవసరాలు,  లాబీయింగ్,  రహస్య ఒప్పందాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్ళు, మీడియా ప్రచార యుద్ధాలు, రాజ్యాంగ వ్యవస్థల కుమ్మక్కు వగయిరాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. వీటికి అంతిమంగా “ప్రజాస్వామ్య నిర్ణయం” అనే ముద్ర వేస్తే చాలు అది పవిత్రం అయిపోతుంది.  ఇది ప్రజాస్వామ్యమా? లేక ప్రజాస్వామ్యం పేరుతో నడిచే వ్యవస్థీకృత రాజకీయ మాయా?. దీనికి మనకు జవాబు దొరకదు.

ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నిర్ణయమని భావించడం ఎంత ప్రమాదకరమో ప్రపంచం ఇరాక్ యుధ్ధంలో  చూసింది. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశంలో  కోట్లాది ప్రజలు  వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా యుద్ధం ప్రారంభించాయి. కల్తీలేని నియంతల్లా ప్రవర్తించాయి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD) వున్నాయంటూ ఇరాక్ లో ప్రవేశించాయి. సద్దాం హూస్సేన్ చనిపోయినా ఆ జీవరసాయన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ జాడ కనిపించలేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడికీ అలాంటి నెపం ఒకటి వేశారు; ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నదని. యుధ్ధం మొదలై 75 రోజులైనా ఎవరికీ వాటి జాడ కనిపించలేదు. ఈ యుధ్ధానికి అమెరికా పౌడుల మద్దతువుందా? అంటే అదీ అనుమానమే. అయినప్పటికీ అమెరికాను గొప్ప ప్రజాస్వామిక దేశం అంటున్నారు.  ఇదె ప్రజాస్వామ్య విషాదం.

ఇక్కడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అసలు సంక్షోభం బయటపడుతుంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వాలపై ప్రభావం చూపేది ఎవరు? సాధారణ పౌరులా? లేక కార్పొరేట్ పెట్టుబడిదారులా?

నేటి ఎన్నికలు కూడా మార్కెట్ ఉత్పత్తులుగా మారిపోయాయి. రాజకీయ పార్టీలు బ్రాండ్ సంస్థల్లా పనిచేస్తున్నాయి. మీడియా ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడం మానేసి ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తోంది. సోషల్ మీడియా యుగంలో భావోద్వేగాలే రాజకీయ ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమంగా “కార్పొరేట్ పార్లమెంటరీ వ్యవస్థ”గా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి.

ప్రజాస్వామ్యం ఒకప్పుడు ప్రజలకు విముక్తి ఆశను ఇచ్చింది. రాజరికాలను, వలస పాలనలను, నియంతృత్వాలను సవాలు చేసే శక్తిగా ఎదిగింది. కానీ అదే ప్రజాస్వామ్యం ఇప్పుడు మార్కెట్ శక్తులతో కలిసిపోయి ప్రజలనే నిస్సహ్సాయులుగా వుంచేస్తోంది. 2011 మార్చి నెలలో జపాన్ లోని ఫుషికుమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం దీనికి గొప్ప ఉదాహరణ.  జపాన్ లో ప్రజాస్వామిక ప్రభుత్వమే వుంది. అయినప్పటికీ, అది కార్పొరేట్ల ప్రయోజనాలను నేరవేర్చే క్రమంలో ప్రజల భద్రతను కూడ పక్కన పెట్టింది. ప్రజాస్వామ్యం ఉన్నంత మాత్రాన ప్రజల భద్రతకు హామీ వుంటుందని చెప్పడానికి వీల్లేదని ఫుషికుమా  సంఘటన నిరూపించింది.  ఇదే నేటి ప్రపంచ సంక్షోభం.

అయితే దీనికి పరిష్కారం నియంతృత్వమా? అనే ప్రశ్న కూడ ముందుకు రావచ్చు.  మతద్వేషానికి విరుగుడు మతద్వేషం కానట్టే విఫలమైన ప్రజాస్వామ్యానికి విరుగుడు నియంతృత్వం కాదు. అయితే, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఎన్నికల ప్రక్రియ మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజల జీవితాలపై నిజమైన నియంత్రణ, సమాచారం మీద ప్రజల హక్కు, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం — ఇవన్నీ లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమంగా ఖాళీ పూజా కర్మకాండంగా మారిపోతుంది.

ప్రజాస్వామ్యం పవిత్రగ్రంధం కాదు. అది ఒక రాజకీయ సాధనం మాత్రమే. ఆ సాధనం విముక్తి ఇవ్వగలదు, మత్తెక్కించగలదు, ప్రజలను శక్తివంతం చేయగలదు, మత ద్వేషాల్ని రెచ్చగొట్టగలదు, మోసం కూడా చేయగలదు.  అందుకే ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని  ప్రజాస్వామ్యాన్ని పూజించడం కాదు; దానిని అర్థం చేసుకోవడం. దాని మాయాజాలాన్ని ఛేదించడం. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల పండుగ నుంచి ప్రజల నిజమైన భాగస్వామ్య వ్యవస్థగా మార్చడం. లేకపోతే ‘ప్రజాస్వామ్యం’ అనే పవిత్ర పదం చివరికి ప్రజల స్వరాన్నే మింగేసే రాజకీయ మత్తుమందుగా మారిపోవచ్చు. ముస్సోలిని, హిట్లర్ కూడ ముందు ప్రజాస్వామికంగానే ఎన్నికయ్యారనేది మనం మరచిపోకూడదు.

14 మే 2026

ప్రచురణ ః ఆంధ్రజ్యోతి 19 మే 2026 


Tuesday, 12 May 2026

The Criminal Tribes Act and Denotified Tribes (DNTs)

 "Criminal Tribes" in India refers to over 150 communities designated as "addicted to the systematic commission of non-bailable offences" under the British-era Criminal Tribes Act of 1871. These communities were subjected to forced registration, surveillance, and restricted movement. Following independence, the Act was repealed in 1949 and these communities were denotified in 1952, though they continue to face social stigma today. [1, 2, 3, 4, 5]

Historical Context: The Criminal Tribes Act
  • Purpose: The British enacted the Act to control communities seen as "born criminals" or professional thieves, often targeting nomadic groups, artisans, and traders who resisted colonial authority.
  • Implications: Members were restricted in their movement, forced to report to police stations, and segregated, impacting roughly 13 million people by 1947.
  • Targeted Groups: Various groups were listed across India, including Koli, Banjara, Bawaria, Sansi, Kanjar, and Bhantu.
Post-Independence: Denotified Tribes (DNTs)
  • Repeal: The Act was replaced in 1952 with the Habitual Offenders Act, which focused on individuals rather than entire communities.
  • Vimukti Diwas: August 31, 1952, is celebrated as Vimukti Diwas (Liberation Day) by these communities.
  • Status Today: Today, over 300 Nomadic Tribes and nearly 200 Denotified Tribes exist in India, many of whom still face police brutality, societal discrimination, and economic marginalization. [1, 2, 3, 4, 5]
Examples of Formerly "Criminal" Tribes
  • Lodha and Kheria Sabar (West Bengal)
  • Koravar, Kallar, Valayar (Tamil Nadu)
  • Yerukula (Andhra Pradesh)
  • Chapper-band (various regions) [1, 2, 3, 4]
These communities often face continued harassment and are often viewed with suspicion by the police and society. [1, 2]

*ముస్లింల మీద క్రిమినల్ ముద్రలు*

 *ముస్లింల మీదేనా క్రిమినల్ ముద్రలు*

 ఈ రోజు నా వ్యాసాన్ని ప్రచురించిన తెలుగు ప్రభకు ధన్యవాదాలు.

 *డానీ*

*సమాజ రాజకీయ విశ్లేషకులు*

*కాలధార*

 


 

         ఉదయం నిద్రలేచి సెల్ ఫోన్ ఆన్ చేయగానే మనం 2026లో వున్నామనీ,  ఈరోజు మే 12 అని చెపుతుంది. ఆ తరువాత టీ తాగుతూ దినపత్రికల పేజీలు తిరగేస్తుంటే మాత్రం మనం మధ్యయుగాల్లొ వున్నట్టు అర్ధం అవుతూవుంటుంది. నిజానికి మనం మధ్యయుగాలకు  ముందు కాలంలో వుంటున్నట్టు కూడ అనిపిస్తుంది.  మనకు స్పీడు ఎక్కువ. చాలా వేగంగా ఆదిమ కాలాల్లోనికి పరుగులు తీస్తుంటాం. నాగరీకంగా వుండడం మనకు నచ్చదు. అనాగరికంగా వుండడం మనకు ఇష్టం. అందరూ బుధ్ధిగా వుంటే వైరల్ వార్తలు లేక మీడియాకు ఎంత కష్టం?

 

         1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆధునిక రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1956 జనవరి 26 నుండి అది అమలు లోనికి వచ్చింది. ఏడాదిన్న క్రితం మనం రాజ్యాంగపు వజ్రోత్సవాన్ని కూడ జరుపుకున్నాం.  కానీ, నిజంగానే మన ప్రభుత్వాలు  రాజ్యాంగ ఆదర్శాలను ఆచరిస్తున్నాయా?

 

         రాజ్యాంగం రావడానికి ముందు బ్రిటీష్ వలస పాలన వుండేది. భారత  పౌర సంస్కృతి లోనికి వేలు పెట్టడానికి బ్రిటీష్ వాళ్ళు సహితం కొంచెం భయపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ నేరస్మృతి బ్రిటీష్ ది వుండాలంటూనే, పౌరస్మృతిని మాత్రం దేశీయులకే వదిలేశాడు. ముస్లిం సమాజం ఖురాన్- హదీసులు తమ పౌరజీవితానికి ప్రామాణికం అని చెప్పుకోగా, మనుస్మృతి తమకు ప్రామాణికం అని హిందువుల ప్రతినిధులు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు A Code of Gentoo Laws పేరుతో 1776లో మనుస్మృతి అమల్లోనికి వచ్చింది.  విద్యావేత్త సర్ విలియం జోన్స్  దీనిని 1794లో ఇంగ్లీషు లోనికి అనువాదం చేశాడు.

మనుస్మృతిలోని వర్ణాధారిత శిక్షా విధానం తరువాత యూరోపియన్ మితవాద తత్త్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. సమాజాన్ని అసమాన హక్కుల ఆధారంగా విభజించే సనాతన ఆలోచనలు యూరోప్లోని కొన్ని నిరంకుశ రాజకీయ ధోరణులకు పరోక్ష మేధో ఆధారాలుగా మారాయని కొందరు విమర్శకులు విశ్లేషిస్తారు. అలా ఇటలీ, జర్మనీల్లో చెలరేగిన ఫాసిజం, నాజిజం వంటి భావజాలాల మూలాలు కూడ భారతీయ వర్ణవ్యవస్థలో వున్నాయనే  వాదనలు ఉన్నాయి.

            శిక్షలకు సంబంధించి మనుస్మృతిలో వున్న ఆదేశాలన్నింటినీ ఇప్పుడు ఉటంకించాల్సిన అవసరంలేదుగానీ, ఆ శిక్షాస్మృతి పాటించే ఒక ప్రాధమిక  నియమాన్ని అర్ధం చేసుకుంటేచాలు. ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన నేరానికి పాల్పడినప్పుడు  పైవర్ణాల వారికి  తక్కువ శిక్ష, కింది వర్ణాల వారికి పెద్ద శిక్ష విధించాలనేది మనుస్మృతి పాటించే నియమం. దీనినే ఇప్పుటి మన సమాజం ముస్లింల విషయంలో పాటిస్తున్నది. హిందువులకు చిన్న శిక్ష, ముస్లింలకు పెద్ద శిక్ష.

 

         ఓ ముస్లిం అబ్బాయి ఓ హిందూ అమ్మాయిని  ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే అది లవ్ జిహాద్. అది ఆ కుర్రాడ్ని నడిరోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాల్సినంత నేరం.  వాళ్లిద్దరు ఒక కార్పొరేట్ ఆఫీసులో సహోద్యోగులు అయ్యుంటే అది కార్పొరేట్ జీహాద్. వాళ్ళిద్దరూ ఓ మెడికల్ కాలేజీలో చదువుతుంటే అది మెడికల్ జిహాద్. వాళ్ళేమయిన ఇల్లు కట్టుకుంటే జమీన్ జిహాద్, ఘర్ జిహాద్. బతకడానికి బన్నులు అమ్ముకుంటే బన్ జిహాద్, బేపార్ జిహాద్. ఇందుగలదు అందులేదనే సందేహమే వద్దు. ఈ జిహాద్ ఎందెందువెతికినా అందందే వుండును.

 

                  కుంభమేళాలో ‘మొనాలిసా’గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక ట్రైబల్ అమ్మాయికి పెద్దలు పెళ్ళి కుదిర్చారు. ఆ పెళ్ళి ఆమెకు ఇష్టంలేదు. ఈంటి నుండి బయటికి వచ్చి తన సన్నిహితుడయిన సినీ నటుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. అంతే. ఈ సంఘటనలో ముస్లిం పేరు కనిపించడంతో సనాతనుల మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. అతను మొనాలిసాను కిడ్నాప్ చేశాడని ఆరోపించాయి. పైగా, ఆమె మైనర్ గనుక అతని మీద పోక్సో కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ  రోడ్డుకెక్కాయి. ఆమె నిజంగానే మైనర్ అయ్యుంటే ఆమెకు పెళ్ళి చేయతలపెట్టిన తల్లిదండ్రుల్ని ముందు అరెస్టు చేయాలి. ఇంత చిన్న లాజిక్కును ఎలా మర్చిపోయారబ్బా? 

 

ఇప్పుడు ఇంకో పోక్సో కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై  ఓ మైనర్  మీద అత్యాచారం చేశాడనే ఆరోపణ వచ్చింది. నిందితుని తండ్రి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో మొదట్లో కేసు కట్టడానికి తెలంగాణ పోలీసులు తటపటాయించారు. నిందితుడు ముస్లిం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సనాతన మహిళామణులు నీరసం వచ్చి నిద్రపోయారు.

 

సహజంగానే తన కొడుకు నిర్దోషనీ బండి సంజయ్ మీడియా ముందు బోలెడు బాధపడ్డారు. అయితే, బండి భగీరథ్ మరీ నోట్లో వేలు పెట్టినా కొరకడం తెలీని అమాయకుడుకాదనీ, గతంలో కొందరి వేళ్ళు కొరికిన చరిత్ర కూడ అతనికి వుందని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు.  ప్రస్తుతం భగీరథ్ పరారీలో వున్నాడనీ, తండ్రి చెప్పినంత అమాయకుడు కాడు కనుక పోలీసులకు  ట్రేస్ కాకుండా తెలివిగా సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడని కూకట్ పల్లి డిసిపి రితిరాజ్ మీడియాకు తెలిపారు.

 

నిజానికి ఈకేసు జాతీయ రాజకీయాలను కూడ ప్రభావితం చేసిందనే వాదన ఒకటుంది. అధికార పర్యటనకు మే 10న హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వేదిక మీదనేవున్న కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తనతో చేతులు కలిపితే బోలెడు అభివృధ్ధి సాధించవచ్చని ఒక బంపర్ ఆఫర్ కూడ ఇచ్చారు.  ఫలితంగా రేవంత్ రెడ్డి ఈ కేసులో అంటీ ముట్టనట్టు వ్యవహరించారనే కథకం కూడ కొన్ని రోజులు చక్కర్లు కొట్టింది. అంతిమంగా భగీరథ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్.

 

విచిత్రం ఏమంటే బండి భగీరథ్ ను రక్షించడానికి తెలుగు మీడియా సంస్థలు నడుం బిగించాయి. కొన్ని సంస్థలు, జరిగిన సంఘటనను ‘హానీ ట్రాప్’ గా చిత్రించాయి. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కుట్రదారులుగా ప్రచారం చేశాయి. బాలిక మైనర్ అయినప్పుడు హానీ ట్రాప్ ఆరోపణ చెల్లదనే కనీసపు ఇంగితం కూడ ఈ మీడియా సంస్థలకు లేకపోయింది. మైనర్ బాలికను అడ్డుపెట్టి ఆమె తల్లియే హానీ ట్రాప్ నడిపించిందనేంత వరకు సోషల్ మీడియా కథనాలు వెళ్ళాయి. నిందితుడినే బాధితుడిగా చిత్రించే అతి తెలివినీ ప్రదర్శించాయి.

 

ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక అక్షరం స్థానాన్ని శబ్దం ఆక్రమించడంతో  పాత్రికేయ విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయనే ఆరోపణలు, ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగానే వున్నాయి. మన దేశంలో అవి మరీ దిగజారాయి. తెలుగు మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, ఏ స్థాయికి పడిపోయిందో కొలవడం కూడా ఇప్పుడు కష్టమే.

 

భారత ముస్లింలలో నేరస్తులు వుండరని ఎవరూ అనరు. ముస్లింలలోనూ నేరస్తులు తప్పక వుంటారు. కానీ నేరస్తులందరూ ముస్లింలే అని చెప్పడానికీ, ఎక్కడ ఏ నేరం జరిగినా అందులో ముస్లింలు వున్నారని ప్రచారం  సాగించడానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తున్నది. ముస్లింలను Criminal Communityగానో, Habitual Offenders గానో చిత్రంచడం వీరి లక్ష్యం.

 

ప్రతిదానికీ ముస్లింలను బోనెక్కించడానికి ప్రయత్నించడంకన్నా నమ్మకమైన గణాంకాలతో ఎవరయినా ముందుకు రావచ్చు. దేశంలో జరిగే ప్రతినేరాన్నీ నమోదు చేయడానికి కేంద్రంలో హొంశాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వుంటుంది. అది ప్రతి సంవత్సరం తన నివేదికను విడుదల చేస్తుంటుంది.

 

ఇటీవల విడుదలైన ఎన్ సి ఆర్ బి నివేదిక  2024వ సంవత్సరంలో దేశంలో శిక్షార్హమైన నేరాలు 60 లక్షల వరకు జరిగాయని పేర్కొంది. వీటిల్లో అత్యాచారాలు 29,536. లైంగిక వేధింపులు 48, 3030. భార్యల మీద భర్తల దౌర్జన్యం 1,20, 227. వరకట్న హత్యలు 5,737. మహిళల అదృశ్యం 67,829 కేసులు.

 

ఈ కేసులన్నింటిలోని గణాంకాల్ని మత ప్రాతిపదికన వర్గీకరిస్తే ఏ సామాజిక సమూహంలో ఎంతమంది నేరస్తులు వున్నారో సులువుగా తెలిసిపోతుంది. ఎవరు ఎక్కువ నేరస్త స్వభావం కలిగివున్నారో కూడ  తేలిపోతుంది.

 

ఆ ప్రయత్నం చేయనంతకాలం అణగారిన మత సమూహాల మీద క్రిమినల్ ముద్రలు వేస్తూనే వుంటారు.  

 

రచన: 12-05-2026

 

https://epaper.teluguprabha.net/HyderabadMain?eid=11&edate=13/05/2026&pgid=296892&device=mobile&view=0&sedId=0&uemail=

Wednesday, 6 May 2026

హిందూ సంఘటన – ముస్లిం విభజన - Hundi Unity and Muslim Division

 

*కాలధార*

*హిందూ సంఘటన – ముస్లిం విభజన*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 


 

ఇప్పుడు జరిగిన ఐదు రాష్ ట్రాల ఎన్నికల్లో బిజెపి బలపడుతుందని దాదాపు అందరికీ ముందే తెలుసు. తమిళనాడులో  బిజెపి కాలుమోపడానికి జాగా దొరకదనీ తెలుసు. డియంకే ఓడిపోయి టివికే ఆధిక్యాన్ని సాధిస్తుందని ఊహించకపోవచ్చుగానీ, దక్షణాది రాజకీయాల్లో క్రైస్తవ నేపథ్యంవున్న జోసెఫ్ విజయ్ ముందుకు దూసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

 

సమాజాన్ని మార్చడానికి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నవారూ వున్నారు. వాళ్ళకు పార్లమెంటరి ఎన్నికలతో ఎలాగూ పనిలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్న రాజకీయ పార్టీలు దేశంలో అనేకం వున్నాయి. అవి ఇతర సందర్భాల్లొ పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఎన్నికలప్పుడే మేల్కొని కొన్ని రోజులు కొంచెం హడావిడి చేస్తాయి. ఇంతటి బద్దకస్తులతో రాజకీయాల్లో మార్పురాదు.

 

 బిజెపి అలాకాదు; దానికి ఎన్నికలనేవి 27x7x56. ఎన్నికల్లో బిజెపి వరుస విజయాలు సాధించడానికి ఇదొక ప్రధాన కారణం. అన్నింటికన్నా గొప్పది బిజెపి ఎంచుకున్న ఎన్నికల ఎత్తుగడ. హిందూ సంఘటన – ముస్లిం విభజన.

 

దేశంలో మెజారిటీ సమూహమైన హిందూ సమాజాన్ని తన ఓటు బ్యాంకుగా బిజెపి ఎంచుకుంది. అందులో అందరూకాకున్నా సగం మంది సానుకూలంగా స్పందించినా అధికారంలోనికి రావచ్చు; అధికారాన్ని కొన సాగించవచ్చు అని దానికి అర్ధం అయిపోయింది.  గత మూడు లోక్ సభ ఎన్నికల్లో దానికి 40 శాతం లోపే ఓట్లు వచ్చాయి. అయినా అధికారం దక్కుతోంది. అంచేత అది ‘హేట్ ముస్లిం’ నినాదాన్ని వదులుకోదు. అది దాని ప్రాణరక్షణ మందు. ప్రతి అంశానికి జిహాద్ పనే పదాన్ని ఒక తిట్టుగా చేరురుస్తుంది.

 

అలా బిజెపి ఒక కంఫర్ట్ జోన్ లో కొనసాగుతున్నప్పటికీ దానికో ఇబ్బంది వుంది. హేట్ ముస్లిం నినాదం వల్ల బిజెపికి 40 శాతం ఓట్లు పడ్డా బయట 60 శాతం ఓట్లు వుండిపోతాయి. వాటిని విపక్ష పార్టి ఏదైనా లాక్కో గలిగితే  బిజెపి పునాదులు కదిలిపోతాయి. అందువల్ల, విపక్షాలు ముస్లిం పక్షం వహించకుండ బిజెపి నిత్యం కొత్త వ్యూహాలు పన్నుతూనే ఉంటుంది. విపక్షాల మీద ‘ముస్లిం సంతుష్టీకరణ పార్టీలు’ అని నింద వేస్తుంది. ఈ నింద మీద పడితే విపక్షాలు భయంతో వణికిపోతాయి. ముస్లిం అనే పదాన్ని ఉచ్చరించడానికే భయపడి పోతాయి. ముస్లింలను బిజెపి దగ్గరకు తీసుకోదు; విపక్షాలను దగ్గరికి తీసుకోనివ్వదు.

 

సాధారణంగా ఒక ఎన్నికల గుర్తు మీద ఒక పార్టి మాత్రమే  పోటీ చేస్తుంది.  బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలంను గెలిపించడానికి అనేక పార్టీలు ఏకం అవుతుంటాయి. వాటిల్లో ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ పేరు బాగా వెలిగింది. ‘ఎస్ ఐ ఆర్’ పేరుతో ముస్లింలకు దాదాపు  ఓటు లేకుండా చేసేసింది.  ఆపైన   న్యాయాస్థానాలు కూడ తమవంతు  భక్తిని ప్రదర్శించుకున్నాయి.

 

ఇందిరాగాంధీ కూడా నిరంకుశ పోకడలకు పాల్పడ్డారనేది వాస్తవం. అయితే, రాజ్యాంగ వ్యవస్థల్ని ఇప్పటి స్థాయిలో ఆమె వాడలేదు. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు 1975లో రద్దు చేసింది. తీర్పు వల్ల ఆమె ప్రధాని పదవే ప్రమాదంలో పడింది. దీనినే ఎమర్జెన్సీకి విధింపుకు తక్షణ ప్రేరణగా భావిస్తారు. ఇప్పటి కోర్టులకు ప్రధానిని తప్పుపట్టే సామర్ధ్యం వుందా? అని ప్రశ్నించుకుంటే లేదనేదే సమాధానం అవుతుంది.

 

మార్చి నెలలో ఓ ముస్లిం కుటుంబం రంజాన్ ఉపవాసాల ఇఫ్తారీ విందును కాశీలో గంగానది మీద ఒక బోటులో జరుపుకుంది. ఈ సంఘటన మీద బిజెపి యువజన విభాగం నేత ఒకరు ఆ కుటుంబం మీద కేసు పెట్టారు. మిగిలిన ఆహారాన్ని నదీలో పడేసి జలాలను కలుషితం చేశారనీ, దీనికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేసి దేశవ్యాప్తంగా  హిందువుల మనోభావాలను గాయపరిచారనీ, తద్వార పెద్దఎత్తున  మతకల్లోలాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేశారనేవి ప్రధాన ఆరోపణలు. ఆ బృందానికి ఇప్పటి వరకు బెయిల్ కూడ దొరకలేదు. మతకల్లోలాలను రెచ్చగొట్టే కేసుల్లో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానాలు తేల్చి చెప్పేశాయి. ఈ కేసును ప్రధాని పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

నిజానికి గంగా నదికి ఇరువైపులా వున్న గ్రామాలు, పట్టణాలు, నగరాల మురికినీటిని గంగానది లోనికే వదిలేస్తుంటారు. టూరిస్టు బోట్ల మీద మందు పార్టీలు జరగడం కూడ సర్వసాధారణం. అలాంటప్పుడు ముస్లిం కుటుంబాన్ని మాత్రమే ఎందుకు శిక్షిస్తున్నారంటే ఒక విచిత్ర సమాధానం ముందుకు వచ్చింది. మురికినీళ్ళు, మందు పార్టీలవల్ల ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినలేదు. కానీ, అదే పనిని ముస్లిం కుటుంబం చేసినపుడు ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఆ వివరణ.

 

ఈ పరిణామాలు ఇంతటితోఆగలేదు. ముస్లింలతో ఎంతటి సాన్నిహిత్యం వున్నాసరే వాళ్ళను పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలకు ఆహ్వానించరాదని అనధికార హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముస్లింల రాకను నివారించడానికి పందుల్ని వాడేంత వరకు అభివృధ్ధి చెందింది  పరిస్థితి. అనేక వేడుకల్లో పందుల్ని భాగం చేస్తున్నారు. గోమూత్రం, ఆవుపేడలకు పందుల ప్రేమ  అదనపు ఆకర్షణ.

 

మూర్ఖులు, నేరస్వభావం కలిగినవాళ్ళు అన్ని సమూహాల్లోనూ వుంటారు; భారత ముస్లింలలోనూ వుంటారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం వుండాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముద్ర వేసేముందు ఎవరిలో ఎంత శాతం అనేది తేల్చుకోవాలిగా? భారతదేశంలో ఏటా 30 వేలకు పైగా మానభంగాల కేసులు నయోదవుతున్నాయని ఎన్ సిఆర్ బి అధికారికంగా ప్రకటించింది. ఆ కేసుల్లో ఆరోపితుల పేర్లను పరిశీలిస్తే వాళ్ల మతం తెలిసిపోతుంది. వాళ్ళలో ముస్లింలు 14 శాతం కన్నా ఎక్కువ వున్నారా? తక్కువ వున్నారా?  ఒకసారి పరిశీలిస్తే పోలా? ఢిల్లీ నిర్భయా (2012), జమ్మూకశ్మీర్ కథువా  (2018), హత్రాస్  (2020), ఉన్నావ్ (2017), శక్తిమిల్ గ్యాంగ్ రేప్ (2013) కేసుల్ని అందరూ మరచిపోయారా? అలాగే భార్యా హంతకుల కేసుల గణాంకాల్ని సహితం మత  ప్రాతిపదికన  వర్గీకరించాలి. అత్యధికులు ఎవరూ? అనేది తేల్చాలి. అలాగే బహుభార్యత్త్వాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం జరుగుతున్నది. సహజీవనం చట్టబధ్ధం అయ్యాక బహుభార్యత్త్వాన్ని ఎవరు ఎంచుకుంటారూ?

 

ఎన్నికల్లో 60 శాతం ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా పడుతున్నాయన్నది వాస్తవం.  లెఖ్ఖల ప్రకారం 4కన్నా 60 ఎక్కువ. అయినప్పటికీ విపక్షాలు ఓడిపోతున్నాయి. కారణం వాటి మధ్య సిధ్ధాంతపరమైన ఐక్యత లేదు. లేదా వాటి ఐక్యతకు సిధ్ధాంతపరమైన పునాదిలేదు. అది ఏర్పడనంతకాలం ఇండియా బ్లాక్ అనేది ఒక పీతల గంపలా మాత్రమే వుంటుంది. తాము ఎందుకు గెలిచారో గెలిచినవాళ్ళకు స్పష్టంగా తెలుసు. తాము ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలని ఓడిపోయినవాళ్ళు అనుకోరు. వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ  అందరూ ప్రధాని పదవికి అర్హులే. కానీ, ఆ పదవి ఒక్కరికే దక్కుతుందనే స్పృహ వాళ్ళలో రానంత వరకు  ఎన్నికల ఫలితాలు ఇలానే వస్తుంటాయి.

 

అన్నీ మారిపోతున్నట్టే ఎన్నికల రాజకీయాలు కూడ మారిపోయాయి. గతంలో ముందు దేశాధినేతలు ఆ వెనక పారిశ్రామిక వేత్తలు వుండేవారు. దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు చెట్టాపట్టాలేసుకు తిరిగిన రోజులు కూడ వున్నాయి. ఇప్పుడు ముందు పారిశ్రామిక వేత్తలు వారి వెనుక దేశాధినేతలు నడుస్తున్నారు. ఈ మార్పు ఇంటాబయటా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయం, ఆర్ధికం ఇక ఎంత మాత్రం రెండుకావు; ఆ రెండూ ఒకటే. ప్రజల్లో మతోన్మాదాన్ని క్రమం తప్పకుండా ఎక్కిస్తున్నంత కాలం దేశానికి గడ్డుకాలం తప్పదు.

 

దీని అంతటి సారం ఏమంటే, ఒక రాజకీయార్ధిక ఎజెండా మన సామాజిక జీవితాలతో ఒక కౄరమైన క్రీడను సాగిస్తోంది.

 

05-05-2026