Monday, 27 April 2026

We have Crossed 43

43 దాటాము!





 

మనిషి అసలే కోపిష్టి నిలకడగా కాపురం చేస్తాడా? అని మావాళ్ళ అనుమానం. దీనికి ముక్కు మీద కోపం అత్తారింట్లో ఎన్నాళ్లుంటుందని వాళ్ళవాళ్ల భయం. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ఎంత లేదన్నా మేము రోజుకు ఓ మూడుసార్లు దెబ్బలాడుకుంటుంటాం. ప్రతి తగవూ ఇక కుదరదు విడిపోవాల్సిందే అన్నంత వరకూ సాగుతుంది. అలా 43 సంవత్సరాలు సాగిపోయాయి.

 

మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసినప్పుడు నేను ఉద్యోగం చేయను; ఉద్యమాలంటూ ఊర్లెంబడి తిరుగుతాను. సంపాదన మీద నమ్మకంలేదు. పిల్లలు పుట్టినా వాళ్ళ పెంపకం చదువు వగయిరా బాధ్యతలన్నీ నీవే  అన్నాను. అన్నింటికీ సరేనంది. హిందూ ముస్లిం  మతాంతర వివాహం ఒకటి ఇలా జరిగిందంటే ఇవ్వాల్టి రోజుల్లో నమ్మడం కష్టం.

 

ఇరాన్ యుధ్ధం, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్, కగార్ ఆపరేషన్, కారంచేడు, చుండూరు, మణిపూర్ వంటి చిన్న చిన్న విషయాల మీద మాకెప్పుడూ బేధాభిప్రాయాలు లేవు. పోపు మాడడం, ఆవగాయ పచ్చడ్లోకి ముద్దపప్పు లేకపోవడం, పలావు చేసినపుడు ఖట్టా వండకపోవడం వంటి పెద్దపెద్ద విషయాల మీద మేము మూడవ ప్రపంచ యుధ్ధం స్థాయిలో పోట్లాడుకుంటాము. 

 

          చలసాని ప్రసాద్ మా పెళ్ళికి పురోహితుడు. తను అలాంటి దండల పెళ్ళిళ్ళు వంద వరకు చేశాడు. మాది తప్ప అన్నీ విఫలం అయ్యాయి. మా పెళ్ళికి రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక ప్రాధాన్యత వుంది. అది విఫలం కాకూడదనేది ఆమె పట్టుదల. దానికోసం తను సామదానబేధ దండోపాయాలు అన్నింటినీ ప్రయోగిస్తుంది.

 

27-04-2026 

There are Lot of Good People and I am indebted to them

 

మంచివాళ్లు వున్నారు. నేను వారికి రుణపడివున్నాను.







 

          సమాజం మేలు కోసం ఏ పని చేయాలన్నా బహిరంగంగా ప్రకటించి చేయాలనే నియమం ఒకటుంది. దానివల్ల ఇతరుల్లో సహితం ఆ మంచి పనిలో భాగస్తులు కావాలనే ఆసక్తి కలుగుతుంది. అప్పుడు సమిష్టి తత్త్వం ఏర్పడుతుంది.  లేకుంటే ఒంటరి చేష్టగా వుండిపోతుంది.

 

          నేను ఏదైనా అలాంటి సామాజిక కార్యక్రమాన్ని చేపట్టినపుడు ఒక బహిరంగ ప్రకటన చేస్తాను. ఖర్చులకు మీకు తోచింది ఇమ్మంటాను. కొందరు స్పందిస్తారు. తమకు తోచింది పంపుతారు.

 

          నేను మణిపూర్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడ అలాంటి ప్రకటన ఒకటి చేశాను. ఒకళ్ళిద్దరు స్పందించారు. ఓ 500 రూపాయల చొప్పున నా బ్యాంకు అకౌంట్ లో వేశారు. ఈలోగా లండన్ నుండి Paladugu Lakshmana Rao మెసేజ్ పెట్టారు. తాను మణిపూర్ లోనే కాంట్రాక్టులు చేస్తున్నారనీ, పది రోజుల తరువాత హైదరాబాద్ వచ్చి నన్ను మణిపూర్ తీసుకుని వెళతానని అన్నారు. అన్ని ఖర్చులూ తనే భరిస్తానన్నారు. ఉద్యమం రగులుకుంటున్నప్పుడే వెళ్ళాలి అనేది నా ఆలోచన ఆ మాటే వారికి చెప్పాను.  వెంటనే బయలుదేరి వెళుతాను అన్నాను. వారు నా అకౌంట్ లో పది వేల రూపాయలు వేశారు.

 

          ఆ వెంటనే Ajitha Kolla గారు US నుండి ఫోన్ చేశారు. మొత్తం ట్రావెలింగ్ బడ్జెట్ ఎంత అని అడిగారు. సుమారు 40 వేల రూపాయలు కావచ్చు అన్నారు. ఓ పది పదిహేను నిముషాల్లో నా అకౌంట్ లోనికి 40 వేల రూపాయలు జమ అయిపోయాయి. నా ఆశ్చర్యానికి అంతులేదు. లోకంలో మంచివాళ్ళు వుంటారని నేను గట్టిగా నమ్ముతాను. కానీ మరీ ఇంత మంచివాళ్ళు వుండడం తట్టుకోలేనంత ఆనందాన్ని ఇచ్చింది.

 

          ఈలోగా ఐజ్వాల్ నుండి Vadde Jayachandra ఫోన్ చేశారు. వారు మిజోరం స్టేట్ బ్యాంకు వున్నతాధికారిగా ఐజ్యాల్  లో వుంటున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఇంఫాల్ ఎయిర్ పోర్టులో దిగి మెయితీలు వుండే ప్రాంతాలను దాటుకుని కుకీ జోలు వుండే దక్షణ ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యం. దానికన్నా మిజోరం వచ్చి మణిపూర్ లోనికి దక్షణ దిక్కు నుండి ప్రవేశించడం సులువు. పైగా, మణిపూర్ నుండి తలదాచుకోవడానికి వచ్చిన కుకీ జో బాధితులకు మిజోరం ప్రభుత్వం ఐజ్వాల్ పరిసరాల్లోనే సహాయక కేంద్రాల్ని నిర్వహిస్తున్నదని వారు వివరించారు. ఐజ్వాల్ ఎయిర్ పోర్టులో విమానం దిగినప్పటి నుండి తిరిగి విమానం ఎక్కేవరకు సమస్త ఖర్చులు తనవే అన్నారు.

 

          నా మణిపూర్ పర్యటన ఆ ముగ్గురి ప్రాయోజిత కార్యక్రమంగా సాగింది. ఈ ముగ్గురిలో Vadde Jayachandra గారిని తప్ప మిగిలిన ఇద్దరినీ నేను ఇంతవరకూ చూడలేదు. వాళ్లు  సహకరించకపోతే నేను కుకీ జో ల సహాయక శిబిరాలకు వెళ్ళగలిగేవాడిని కాను.

 

          అలాగే 2020 చివర్లో  రైతు  ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు కూడ ఇలాంటి ప్రకటనే చేశాను. ఏంవీ ఫౌండేషన్ కు చెందిన ఆర్. వెంకట రెడ్డి గారు విమాన  చార్జీలు పంపించారు. అప్పటికీ నాకు వారితో కూడ పరిచయం లేదు. ఆ తరువాత మేము సన్నిహితులమయ్యాము అది వేరే కత. అది కరోనా కాలం. ఢిల్లీలో తన ఇంట్లో వుండమని  మిత్రుడు బిబిజి తిలక్ ఆఫర్ చేశాడు. ఆ రోజుల్లో అది రిస్క్ తో కూడిన వ్యవహారం.  

 

          ఈ లోకంలో మంచివాళ్లు సాధారణ సమయంలో కనిపించరు. మనం మంచి పని తల పెట్టినపుడు వాళ్లు మనకు కనిపిస్తారు. మంచివాళ్లు వున్నారు! నేను వారికి రుణపడివున్నాను.

 

          27 ఏప్రిల్ 2026

 

         

బిబిజి తిలక్ ఫొటో కోసం వెతికాను. కనిపించలేదు.

Tuesday, 21 April 2026

Ground Zero Nashik *గ్రౌండ్ జీరో నాసిక్ !*

 కాలధార

*గ్రౌండ్ జీరో నాసిక్ !*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*




          మహారాష్ట్రలోని నాసిక్ నగరం  రెండు వారాలుగా జాతీయ వార్తల పతాక శీర్షికల్లో మెరుస్తోంది. అక్కడ సాగిన రెండు కేసులు దేశాన్ని కుదిపేస్తున్నాయి.

 

         మొదటి కేసు జ్యోతిష్య బాబా అశోక్ ఖరాత్ కు సంబంధించింది. ఈ బాబాకు జాతకాలు చెప్పడమేగాక జాతకాలు మార్చగల దిట్ట అని పేరుండేది.  మహారాష్ట్రకు చెందిన చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు  నాసిక్ వెళ్ళి బాబా ఆశిస్సులు పొందేవారు.  బాబా ఫొటోలు కొన్నింటిలో సాక్షాత్తు దేశ ప్రధాని, హొంమంత్రి కూడ వున్నారంటే వారి పరపతి ఏ స్థాయిలో వుండేదో ఊహించుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు బాబాకు భక్తులు వంటివారు.

 

బాబా అశోక్ ఖరాత్ కు మహిళా శిష్యుల మీద ప్రత్యేక ఆసక్తి వుండేది. సోషల్ మీడియాలో ముస్లింల మీద, ముస్లిం మహిళల హిజాబ్ -బుర్ఖాల మీద, ఈద్ నమాజుల మీద తెగ విమర్శలు కురిపించి చెలరేగిపోయే మహిళా ఇన్ ఫ్లూయన్సర్లు తరచూ బాబా సేవలో తరించేవారు. మహారాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్  రూపాలి చాకన్కర్ బాబాకు ప్రియమైన శిష్యురాలు. బాబా ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగానని వారు సగర్వంగా చెప్పుకునేవారు.

 

         అందరి జాతకాలు చెప్పే బాబాగారికి తన జాతకం అర్ధం కాలేదు.  మార్చి మూడవ వారంలో వారి జాతకం తలకిందులు అయ్యింది. బాబా  తనను మూడేళ్ళుగా వేధిస్తున్నట్టు ఓ మహిళ సాక్ష్యాలతో సహా పిర్యాదు చేసింది. ఇదే అదనుగా, బాబా అనేక మంది సెలబ్రిటి మహిళలతో అతి సన్నిహితంగా వున్న ఫొటోలు, వీడియోలు డజన్లకొద్దీ వెలుగులోనికి వచ్చాయి. వారందరితో బాబా ప్రత్యేక పూజల పేరుతో ‘వైట్ రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ జరిపేవారట. వీటిని ఇప్పుడు అశోక్ ఖరాత్ ఫైల్స్ అంటున్నారు.

 

తమ వీడియోలు బయటికి రావడంతో సోషల్ మీడియా మహిళా ఇన్ ఫ్లూయన్సర్లు తమ అకౌంట్లను హఠాత్తుగా  మూసేసుకున్నారు. రూపాలి చాకన్కర్ వీడియోలు సహితం బయటికి రావడంతో ఆమె కూడ తన పదవికి రాజీనామా చేశారు. మరో వైపు, మహారాష్ట్ర మంత్రులు కొందరి శృంగార లీలల వీడియాలు  సహితం బయటికి రావడంతో ప్రభుత్వమే నైతిక సంక్షోభంలో పడింది. మార్చి నాలుగవ వారంలో బాబాను అరెస్టు చేశారు.

 

          డిజిటల్ టెక్నాలజీ పెరిగి స్పై కెమేరాలు అందుబాటు లోనికి  రావడంతో  అనేకమంది బాబాల వెకిలిచేష్టలు, శృంగార సరసాల వీడియోలు ఈమధ్య పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. హిందూరాష్ట్రం ఏర్పరచాలని ఉవ్విళ్ళూరుతున్న సమూహాలను ఇవి తీవ్ర నైతిక సంక్షోభంలో పడేస్తున్నాయి.

 

మతాన్ని సాంప్రదాయవాదులు చాలా పవిత్రమైన వ్యవహారంగా భావిస్తారు. ఈ నియమం హిందూమతానికి కూడ వర్తిస్తుంది. ఎంతటి హిందువులు అయినాసరే  వారికి ఇలాంటి వికారపు  చేష్టలు నచ్చవు. పడవు.

 

         వర్షం రావడానికి ముందు మెరుపులు మెరిసినట్టు,  కీలకమైన ఎన్నికలకు  ముందు మన దేశంలో టెర్రరిస్టు దాడులు, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ సంఘటనలు జరుగుతుంటాయి. మెరుపులు మెరిసినపుడు కొన్ని శ్లోకాలు చదివినట్టు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ‘హిందువువులు ప్రమాదంలో వున్నారు” అని కొందరు గట్టిగా  నినాదాలు చేస్తుంటారు. ఇలాంటి నినాదాలు ఇవ్వడం కోసమే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయనే  నిందకూడ లేకపోలేదు.

 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగానూ యధాతధంగా పాత ఫార్మూలానే రిపీట్ చేశారు. అయితే, ఈసారి సీన్ రివర్స్ అయింది.   బాబాలు, స్వామీజీల వికారపు చేష్టల   వీడియోలు అనేకం బయటికి వచ్చాయి. కాషాయ దళాల్ని ఇబ్బందుల్లో పడేశాయి. 

 

         ఇలా వుండగా నాసిక్ లో ఇంకో సంచలన కథనం చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. టాటా కన్సల్టెన్సీ  సర్వీసెస్ (టిసిఎస్) లో జిహాదీ కుట్ర జరిగిందనేది ఆ కథనం సారాంశం. కొంతమంది ముస్లిం  స్టాఫ్ అక్కడి హిందూ అమ్మాయిల్ని లైంగికంగా వేదిస్తున్నారనీ, ఇస్లాం ను స్వీకరించాలని వత్తిడి తెస్తున్నారు అనేది ఆ కథనాల సారాంశం. అక్కడ హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్న ‘నిదా ఖాన్ ఈ కుట్రకు సూత్రధారి అనీ,  కార్పొరేట్ కంపెనీలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి విదేశాల నుండి భారీ నిధులు వస్తున్నాయి అనేవి ఈ కేసులో కీలక ఆరోపణలు.

 

         ఎన్నికల వేళ 'హిందూ ఖతరేమే హై ' అని ఓటర్లను భయపెట్టడానికి కాసుకుని కూర్చున్న మీడియా సేనాధిపతులకు  నాసిక్ టిసిఎస్ కేసు లడ్డూలా దొరికింది. బాబా అశోక్ ఖరాత్ అఘాయిత్యాలను ప్రజలు మరచిపోయేలా చేయడానికి, ఐదురాష్ట్రాల ఎన్నికల్లో – ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో -  హిందూ ఓట్ బ్యాంకును ఆకర్షించడానికీ  ఇంతకన్నా గొప్ప ఛాన్సు వుంటుందా?   అని వారు మురిసిపోయారు. 

 

మాస్టర్ మైండ్ నిదా ఖాన్  అనగానే గోదీ మీడియా న్యూస్ రీడర్లు, యాంకర్లు వారం రోజులపాటు రెచ్చిపోయారు. సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ దీనికి కార్పొరేట్ జిహాద్ అని పేరు పెట్టారు. పోలీసులు రంగంలోనికి దిగి కొందర్ని అదుపులోనికి తీసుకున్నారు.

 

         ఈ ప్రచారం మీద టిసిఎస్ స్పందించింది. తమ నాస్తిక్ యూనిట్ లో నిదా ఖాన్  అనే ఆమె పనిచేయడం లేదనీ, తమ యూనిట్ ఆపరేషన్స్ మేనేజర్ పేరు అశ్వినీ చైనానీ అనీ, ఆమె హిందువు అని ఒక వివరణ విడుదల చేసింది. నిదా ఖాన్  అనే అనే ఆమె గతంలో తమ దగ్గర పనిచేసిందనీ, అప్పుడు కూడ ఆమె హెచ్ ఆర్ కాదనీ, ఒక సాధారణ టెలీ కాలర్ మాత్రమేనని, ఆమె ప్రస్తుతం నాసిక్ లోనే లేదనీ, పెళ్ళి చేసుకుని ముంబాయిలో వుంటూ పై చదువులు చదువుకుంటున్నదని కూడ వివరణ ఇచ్చింది.

 

         గోదీ మీడియాకు ఈ వివరణలతో పనిలేదు.  దేశంలో హిందూ సమాజానికి ముస్లింలు ముప్పుగా మారిపోయారు అని ప్రచారం చేయడమే వారి వృత్తి.  ఈ ప్రచారం ఫలితంగా చాలా మంది మనసుల్లో నాటుకున్న విషయం ఏమంటే,  దేశంలో ముస్లిం జనాభా  పెరిగిపోతున్నది. అదిచాలక,  పెద్ద ఎత్తున హిందూ అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుని వాళ్లను ముస్లింలుగా మార్చేస్తున్నారు-  అని.

         భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశ జనాభాలో  ముస్లింలు 15 శాతం; ఇప్పుడూ వాళ్ళు 15 శాతమే. డెభ్భయి అయిదేళ్ళ అమృత కాలంలో ముస్లిం జనాభా ఒక్కశాతం కూడ పెరగలేదు. ప్రణాళికా బధ్ధంగా కుటుంబాలను రూపొందించుకున్నవారు ఒకరిద్దరు పిల్లలతోనే సరిపెట్టేసుకుంటున్నారు.  

 

మరో ఆసక్తికర అంశం ఏమంటే, అందుబాటులో వున్న అధికారిక వైద్య రికార్డుల ప్రకారం హిందూ స్త్రీలకన్నా ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు 25 శాతం ఎక్కువ. మన దేశంలో హిందూ స్త్రీల ఫెర్టిలిటీ రేటు రెండు అయితే ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు 2.5. దేశంలో ముస్లిం జనాభాను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే ముస్లిం యువకులు హిందూ స్త్రీలను పెళ్ళి చేసుకోవడంకన్నా ముస్లిం స్త్రీలను  పెళ్ళి చేసుకుంటేనే ప్రయోజనం ఎక్కువ. ఫెర్టిలిటీ రేటు ఎక్కువ కనుక ఎక్కువమంది ‘ముస్లింలను’ కనవచ్చు.

 

         ఇలా వుండగా, బాబా అశోక్ ఖరాత్  కేసులో ప్రధాన సాక్షి, అతని అనుచరుడు  జితేంద్ర షెల్కే, అతని భార్య అనురాధల్ని రెండ్రోజుల క్రితం ఒక కారు నాసిక్ లో నడిరోడ్డు మీద చంపేసింది. ఇప్పుడు ఆ కేసులో ప్రధాన సాక్షులు చనిపోయారు కనుక బాబాగారు సగౌరవంగా విడుదలై బయటికి వస్తారు. అభిమానులు వారికి దండలేసి సాదరంగా ఆహ్వానించి మేళ తాళాలతో ఊరేగిస్తారు.  మహారాష్ట్ర ప్రభుత్వం కూడ వారిని వున్నత పదవులతో సత్కరిస్తుంది.

 

         ఐదు రాష్ట్రాల ఎన్నికలు, డిలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం, బాబా అశోక్ ఖరాత్  బండారం బయట పడడం, అదే నాసిక్ లో కార్పొరేట్ జిహాద్ కేసు నడవడం, అక్కడే  బాబా అశోక్ ఖరాత్ కేసులో ప్రధాన సాక్షిని కారు చంపేయడం ..... ఇవన్నీ విడివిడి సంఘటనలా? యాధృఛ్ఛికంగా  జరిగిన సంఘటనలేనా?  లేక వీటి మధ్య ఒక అంతస్సంబంధం వుందా? ఇవి ఇప్పుడు ఎవరికయినా  రావలసిన సందేహాలు.

 

         కార్పొరేట్ జిహాద్ కేసు  కోర్టులో నిరూపణ కావచ్చు; కాకపోవచ్చు.  కానీ అరెస్టు చేసిన వారిని  జైళ్ళ నుండి ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరూ చెప్పలేరు. ఈలోగా ముస్లింలను రిక్రూట్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు జంకుతాయి. లవ్ జిహాద్ జరుగుతుందనికాదు; ప్రభుత్వం తమ మీద కక్ష కడుతుందని. ఇది అసలు ప్రమాదం. పాలకుల లక్ష్యం కూడా అదే. దేశంలో ముస్లింలకు ఎవ్వరూ చదువు చెప్పకూడదు; చదువుకున్నా ఉద్యోగాలు ఇవ్వకూడదు; పెళ్ళికి అమ్మాయిల్ని ఇవ్వకూడదు; పని ఇవ్వకుడదు, వాళ్ళ దగ్గర ఏవీ కొనకూడదు. ముస్లింలకు బిచ్చం కూడ ఇవ్వకూడదు. అసలు జనాభా లెఖ్ఖల్లో వాళ్ళ పేరు నమోదు కాకూడదు. ఇదీ ఇప్పుడు నడుస్తున్న నియమం.

ప్రచురణ : తెలుగుప్రభ. నెట్  22-04-2026

రచన : 21-04-2026

Sunday, 19 April 2026

BJP Elections strategy


ఎన్నికల్లో గెలవడానికి సంఘపరివారం ఓ సులువైన మార్గాన్ని కనిపెట్టింది. ముస్లిం భూతాన్ని మించిన విన్నింగ్ ఫార్మూలా మరొకటి లేదని దానికి అర్ధం అయింది. నరేంద్ర మోదీజీ రాజకీయ గ్రాఫ్ వేగంగా పెరగడానికి ఈ ఫార్మూలా బాగా పనిచేసింది. 


2011 జనాభా లెఖ్ఖల ప్రకారం భారతదేశంలో హిందువులు 79 శాతం. ముస్లింలు 15శాతం. క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు, జైనులు 6 శాతం. ముస్లింలతో ముప్పు వుందని ప్రచారంచేస్తే మిగిలిన 85 శాతం ఓటర్లను సులువుగా ఆకర్షించుకోవచ్చనేది ఒక వ్యూహం. 


15 శాతాన్ని అన్యులుగా చూపెట్టి 85 శాతాన్ని ఆకర్షించే వ్యూహం భారత రాజకీయాల్లో కొత్తదేమీకాదు. మొదట్లో కాంగ్రెస్ కూడా  ఇదే వ్యూహంతో సాగేది. 15 శాతం కమ్యూనిస్టు తదితర పార్టీల  అభిమానులున్నాసరే 85 శాతం తమతోనే వుంటారనే ధీమాతో వ్యవహరించేది. ఇది రాజకీయ ప్రాతిపదిక. కమ్యూనిస్టులది కూడ సేమ్ టు సేమ్ ఫార్మూలా. దేశంలో దోపిడిదారులు 15 శాతం మాత్రమేననీ శ్రామికులు 85 శాతం అని వాళ్ళు లెఖ్ఖలు వేసుకునేవారు.  ఇది వర్గ ప్రాతిపదిక. అంబేడ్కర్ శిబిరం నుండి వచ్చిన కాన్షీరామ్ సహితం 85 శాతం ఫార్మూలాకు కులప్రాదికన పునర్ నిర్వచించారు. పెత్తందాదీ కులాలు 15 శాతం మాత్రమేననీ, బహుజనులు 85 శాతం అనీ గణాంకాలు వివరించేవారు. 


రాజకీయ, వర్గ, కుల, ప్రాంతీయత తదితర  ప్రాతిపదికలకన్నా  మతం చాలా ప్రభావశీలంగా పని చేస్తుందని  కనిపెట్టింది మాత్రం బిజెపి. 15 శాతం ముస్లింలను ధేశానికి ముప్పుగా చూపెట్టి 85 శాతాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తే, అందులో సగం ఓట్లు పడినా రాజ్యాధికారం దక్కుతుందని  దానికి అర్ధం అయింది. గడిచిన మూడు లోక్ సభా ఎన్నికల్లోనూ బిజేపికి 40 శాతం ఓట్లు కూడ రాలేదు. అయినప్పటికీ మొదీజీ అప్రతిహత శక్తిగా వెలుగులో వుంటున్నారు.  బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇలాంటి వింతలు కూడ వుంటాయి. 


జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాక మోదీజీ చారిత్రాత్మక వాగ్దానాలు అనేకం ప్రకటించారు.  వాటిల్లో ఒక్కదాన్ని కూడ నెరవేర్చకపోగా వాటికి భిన్నమైన ఫలితాలను సాధించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు తీసుకునివచ్చి ప్రతి భారతీయుడుడికి 15 లక్షల రూపాయల చొప్పున పంచవచ్చు అనే మాటతో వారు జాతీయ రాజకీయాల్లో వెలుగులోనికి వచ్చారు. ఆధికారంలో వచ్చాక వారు ఆ నల్లధనాన్ని ఎలాగూ తీసుకురాలేదు. మరోవైపు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారి సంఖ్య వారి హయాంలో బాగా పెరిగింది. మతపరంగా, రాష్ట్రపరంగా వీరెవరూ అని ఆరాతీస్తే సంఘపరివారానికి చాలా కోపం వస్తుంది. చీలికవాదులంటూ గోదీ మీడియా  చాలా పెద్ద గొంతుతో విరుచుకు పడుతుంది. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనేది వారి మరో ప్రసిధ్ధ నినాదం. దేశంలో ఇద్దరు కార్పొరేట్ల ఆస్తులు నిరంతరం పెరిగిపోతుండడాన్నీ, మరో వైపు ఆదివాసులు, ముస్లింలు, వలస కార్మికుల్ని తీవ్రంగా వేధించడాన్నీ మనం ప్రతిరోజూ చూడవచ్చు. 543 లోక్ సభ స్థానాల్లో ఒక్క సీటు తప్ప, మరేచోట కూడ బిజెపి ముస్లిం అభ్యర్ధికి పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. లక్షద్వీప్ లో  ముస్లింకు ఇవ్వక తప్పలేదు. ఉత్తరప్రదేశ్ లో నేరం రుజువుకానక్కరలేదు; నేరారోపణ జరిగితేచాలు ముస్లింల ఇళ్ళను బుల్ డోజర్లతో కూల్చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 


ఎన్నికల్లో ఈ కిక్కు సరిపోదు. డోసు పెంచాలి. దేశాన్ని ముస్లిం ముప్పు కబళిస్తున్నదని భయపెట్టాలి. ముస్లింలు నవ్వినా ఏడ్చినా ప్రేమించినా పొట్టకూటికోసం బన్నులు అమ్ముకున్నా దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆందోళన సాగించాలి. బన్ను జిహాద్, లవ్ జిహాద్, జమీన్ జిహాద్, మెడికల్ జిహాద్ ..  ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. 


టిప్పు రాగానే రెచ్చిపోవడానికి  వ్యవస్థీకృత కళాకారులు  సోషల్ మీడియాలోనూ, అన్-సోషల్ మీడియాలోనూ వేల సంఖ్యలో సిధ్ధంగా వుంటారు. 


ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న  ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు బిజెపికి ప్రతిష్ణాత్మకం. తమిళనాడు నేల మీద బిజెపి విత్తనం మొలకెత్తడం కష్టం. ఇప్పుడు బిజెపి శక్తులన్నింటినీ పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించింది. 

Monday, 13 April 2026

“We cannot transform a society that we do not understand.” అర్ధంకాని సమాజాన్ని మార్చలేం!*

 

*అర్ధంకాని సమాజాన్ని మార్చలేం!*

ఈరోజు ‘తెలుగుప్రభ’ ఎడిట్ పేజి ‘బహుళ ‘నా వ్యాసాన్ని ప్రచురించింది. ప్రచురణకర్తలకు ధన్యవాదాలు.

 

*కాలధార*

*అర్ధంకాని సమాజాన్ని మార్చలేం!*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*



 

ప్రపంచ పటం మీద ఇప్పుడు రెండు రకాల యుధ్ధాలు సాగుతున్నాయి. ఒకటి గ్లోబల్ ఇంకొకటి లోకల్.

 

అమెరికా - ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద ఆయిల్ యుధ్ధం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ మీద ఇరాన్ ఎలాగూ ప్రతిదాడులు చేస్తుంది. కానీ, టెహరాన్, న్యూయార్క్ నగరాల మధ్య రానూపోనూ దూరం పాతిక వేల కిలోమీటర్లు. అంతదూరం వెళ్ళి క్షిపణులు ప్రయోగించి తిరిగొచ్చేంత సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృధ్ధి చెందలేదు. కనుక గల్ఫ్ ప్రాంతంలో,  వివిధ దేశాల్లోవున్న అమెరికా యుధ్ధ స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అలా ఇది ఒక ప్రాంతీయ యుధ్ధంగా మారింది. రేపు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు రంగంలోనికి దిగితే అది మరో ప్రపంచ యుధ్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు.  భారతదేశంలో అబూజ్ మడ్ లోనూ కొన్నేళ్ళుగా ఒక యుధ్ధం సాగుతోంది. అక్కడ భారత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మావోయిస్టుల్ని తుద ముట్టించినట్టు కేంద్ర హోం మంత్రి పార్లమెంటులో ప్రకటించారు.

 

నక్సలైట్ ఉద్యమంలో 50 యేళ్ళ క్రితం కూడ ఇలాంటి నైరాశ్య పరిస్థితి ఒకసారి వచ్చింది. దాదాపు కాలి బూడిదగా మారిపోయిందనుకున్న ఉద్యమానికి ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచి దేశవ్యాప్తంగా విస్తరింప చేసిన ఘనత కొండపల్లి సీతారామయ్యకు దక్కుతుంది. కేఎస్  కృషిని తలకిందులు చేసిన ఘనత ఇప్పటి మావోయిస్టు పార్టికి దక్కుతుంది. అది పరాజయం నుండి పెరుగుదలకు ప్రయాణం అయితే ఇది పెరుగుదల నుండి పరాజయానికి ప్రయాణం. అలా ఈరోజు ఆనాటి కొండపల్లిని తలచుకోవాల్సిన అవసరం వచ్చింది.

 

కేఎస్ వర్ధంతి ఏప్రిల్ 12. ఆయన చనిపోయి 24 ఏళ్ళు. ఈ సమాజం బాగోలేదనీ, దీన్ని మార్చాల్సిన అవసరం వుందని ఆశించేవారికి కేఎస్ ఇప్పటికీ స్పూర్తి.

 

కేఎస్ చాలా విస్తారంగా సిధ్ధాంత వ్యాసాలు రాశారు. అవన్నీ యధాతధంగా ఈరోజు పనికి వస్తాయని అనుకోవడంతప్పు. స్థలకాలాలు మారిపోయినపుడు ఉద్యమాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు సమూలంగా మారిపోతాయి. ఆనాటి ఆ పరిస్థితుల్ని మార్చడానికి ఆయనేం చేశాడు? ఆయన స్పూర్తితో - ఈనాడు ఈ పరిస్థితుల్ని మార్చడానికి మనం ఏం చేయాలీ? అనే కనీసపు సృహ లేకపోవడం గతితార్కిక చారిత్రక భౌతిక వాద మౌలిక సూత్రాలకు  వ్యతిరేకం.

 

వాస్తవ సమాజ అవగాహన వాస్తవ పోరాట విధానాలు అనేవి కొత్త తరాలు కేఎస్ నుండి నేర్చుకోవాల్సిన మార్గదర్శకాలు. మనకు అర్ధంకాని సమాజాన్ని మనం ఎన్నడూ మార్చలేం. We cannot transform a society that we do not understand.

 

నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి శకం 1990లో ముగిసింది. సరిగ్గా అప్పుడే మన దేశంలో అర్ధ వలస-అర్ధ భూస్వామ్య శకం కూడ ముగిసింది. ఆ తరువాత ప్రపంచంలో పునర్ వ్యవస్థీకరణ సాగింది.  తూర్పు యూరప్ దేశాలు సోషలిజాన్ని వదిలివేశాయి. ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా వెలసిల్లిన సోవియట్ రష్యా ముక్కలైంది. తూర్పుగాలి ఆగిపోయి పడమటి గాలి వీచడం మొదలయింది. వామపక్ష భావజాలం బలహీనపడి రైట్ వింగ్ తీవ్రవాదం బలపడింది. మతతత్త్వం చెలరేగింది. అందులో భాగంగానే దేశంలో అద్వానీ రథయాత్రలు సాగాయి. బాబ్రీమసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండ, కేంద్రంలో బిజేపి నాయకత్వంలో అధికార కూటమి ఏర్పడడం వగయిరాలు వాటికి కొనసాగింపే. ఆర్ధికరంగంలో గరీబీ హఠావో నినాదాలు అంతరించి కార్పొరేట్ బఢావో విధానాలు విజృభించాయి.

 

విద్యా వైద్య తదితర సమస్త రంగాల్లో  పబ్లిక్ సెక్టార్ ను వెనక్కి నెట్టి ప్రైవేట్ సెక్టార్ కు పెద్దపీట వేశారు. విద్య ఖరీదైపోవడంతో ఆ విద్య ద్వార ఉపాధి పొందినవారు అవినీతిపరులైపోవడానికి ఆస్కారం పెరిగింది. రాజకీయార్ధిక రంగాల్లో వచ్చిన మార్పులు బెడ్ రూముల వరకూ విస్తరించాయి. కుటుంబ వ్యవస్థ ప్రైవటైజ్ అయిపోయింది. అంతేకాదు; మనుషుల ఆలోచనా ధోరణి మారిపోయింది. మనిషికీ సమాజానికి ఒక అనుబంధం వుందనుకునే కాలం అంతరించి మనిషి ఒంటరివాడై అంతఃసంఘర్షణకు గురయ్యే కాలం వచ్చింది. ఒక్కమాటలో ఈ సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ( కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం)గా మారిపోయింది.

 

కొత్త సమాజంలో  కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు మొత్తంగా కావాలి. ఫలితంగా విస్తాపనకు గురయ్యే ఆదివాసులు దీనికి మొదటి బాధితులు. మతతత్త్వాన్నీ సమాజపు అట్టడుగు పొరల వరకు తీసుకుని వెళితే రాజకీయ పై పొరల్లో మెజారిటీ మత సమూహానికి అధికారం దక్కడం సులువు అవుతుంది. దీనికి ప్రధాన బాధితులు మైనారిటీ మత సమూహాలు; ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు. అలాగే, ప్రభుత్వ నియంతృత్వ   పోకడలకు ప్రధాన బాధితులు ఉదారవాదులు, మత సామరస్యవాదులు. ఈ సమూహాలన్నీ ఆయా విభాగాల్లో ప్రధాన బాధితులు మాత్రమే; నిజానికి ఆయా విభాగాల్లో విడిగానూ, మొత్తంగానూ వుండే బాధితుల జాబితా  చాలా పెద్దది, చాలా విస్తారమైనది.  

 

మావోయిస్టుల పోరాట పటిమను, అంకిత భావాన్నీ, ప్రాణ త్యాగాలనూ ప్రత్యర్ధులు సహితం తక్కువగా అంచనా వేయరు.  కానీ, కొత్తగా ఏర్పడిన కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ( కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం) సమాజాన్ని వాళ్లు అర్ధం చేసుకోలేదు.  లేదా అర్ధం చేసుకోదలచలేదు. 1927-40ల మధ్య కాలంలో వ్యవసాయ ప్రధాన  చైనాలో పుట్టిన అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సిధ్ధాంతాన్ని వాళ్ళు ఇప్పటికీ గుండెలకు హత్తుకుని తిరుగుతున్నారు. భారత జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపోయినా వాళ్ళ ఆలోచనలు మారలేదు. వాళ్ళ ప్రాణపద కార్యక్రమాలయిన ‘వ్యవసాయిక విప్లవం’, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ రూపకల్పనలో మనకు ఎక్కడా ‘ఆదివాసులు’ అనే పదం కనిపించదు. ‘ముస్లిం’ కాదుకదా, మైనారిటీలు అనే పదం అందులో వుంటుందని ఆశించడం  కూడ అమాయికత్వమే అవుతుంది. విచిత్రం ఏమంటే, ఉదారవాదుల మీద వాళ్ళకు కనీసపు గౌరవం కూడ లేదు.

 

నిర్బంధాన్ని తట్టుకునే క్రమంలో మావోయిస్టులు  ఎంచుకున్న వెనకతట్టు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆదివాసులు వున్నారు. అభూజ్ మడ్ ప్రాంతపు ఆదివాసులతో  కలిసి ఒక దశాబ్ద కాలంగా వాళ్ళు  పనిచేస్తున్నారు. వాళ్ళు ఆచరిస్తున్నది వాళ్ళ కార్యక్రమంలో కనిపించదు; వాళ్ళ కార్యక్రమంలో ప్రకటించుకున్నది వాళ్ళ ఆచరణలో కనిపించదు. ఇలా ప్రకటిత కార్యక్రమానికీ, ఆచరణకు పొంతన కుదరకపోతే ఉద్యమాలు  ముందుకుకాక వెనక్కు పరుగులు తీస్తాయి. ఇప్పుడు మనం అలాంటి పరిణామాలనే చూస్తున్నాం. 

 

సంఘపరివారం ప్రచారంచేసే హిందూత్వ సిధ్ధాంతం, దాని  లక్ష్యమయిన హిందూరాష్ట్ర ఏర్పాటు ప్రస్తుతం దేశంలో అధికార భావజాలంగా మారిపోయింది. విపక్ష పార్టీలు, ఉదారవాదులతోపాటూ కమ్యూనిస్టుల మీద కూడ దీని ప్రభావం కనిపిస్తోంది. నిజానికి వాళ్ళ  పరిస్థితి దయనీయంగా మారిపోయిందనవచ్చు. అధిక సంఖ్యాక సమూహాలకు దూరం కాకుండా వుండడానికి వాళ్ళు పడరానిపాట్లు పడుతున్నారు.

 

సంఘపరివారం మతం అనే ఆపరేటివ్ సిస్టమ్ తో హిందూ మత సమూహాల  మెదళ్ళను మొత్తంగా తన కంట్రోల్ లోనికి తీసుకుంది. వాళ్లలో ఉండాల్సిన సెన్సిటివిటీస్ ను క్రమంగా చంపేస్తోంది. “హిందూ ఖతరేమే హై” అన్నది ప్రధాన ప్రచారం. పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల కార్యక్షేత్రంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలో కమ్యూనిస్టులకు అర్ధం కావడంలేదు. ఎంతటి కమ్యునిస్టులయినాసరే హిందూవులకు జరుగుతున్న అన్యాయాలను గురించి కూడా మాట్లాడాలి కదా అని ఎవరయినా నిలదీస్తే వీళ్ళు నీళ్ళు నములుతున్నారు.

 

వాస్తవ ప్రపంచంలో మైనార్టీల మీద సమస్తరంగాల్లో తీవ్రస్థాయిలో కొనసాగుతున్న అణిచివేతను గట్టిగా విమర్శించడానికి కూడ ఇప్పుడు కమ్యూనిస్టులు జంకుతున్నారు. అంతేకాదు, వ్యక్తి స్వేఛ్ఛ, భావ ప్రకటనా స్వేఛ్ఛా, మత స్వేఛ్ఛల్ని ప్రసాదించే ఆర్టికల్ 21, ఆర్టికల్ 25లను అమలుపరచమని గట్టిగా అడిగే సాహసాన్ని కూడ వీరు ప్రదర్శించలేకపోతున్నారు. ఈ పరిస్థితి దేశంలోని మైనార్టీల్ని ఏకాకుల్ని చేసి మరింత అభద్రతా భావానికి గురిచేస్తోంది.  ధార్మిక రంగంలో మొదలయిన ఈ వివక్ష రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలకు కూడ విస్తరించింది.

 

అమెరిక-ఇజ్రాయిల్ సైనికాధికారులు ఇరాన్ పై యుధ్ధాన్ని పవిత్ర యుధ్ధం (క్రూసేడ్స్‍) గా ప్రచారం చేయడం మొదలెట్టారు. అలాంటి సన్నివేశం మనదేశంలోనూ రూపుదిద్దుకుంటున్నది. ఈ వాస్తవాన్ని కమ్యునిస్టులకు అనుక్షణం గుర్తు చేయడం మైనారిటీ ఆలోచనాపరుల సామాజిక బాధ్యతగా మారింది.

 

14-04-2026

తెలుగుప్రభ 15-04-2026

Saturday, 11 April 2026

New Article

 

తత్త్వవేత్తల ప్రధాన కర్తవ్యం ప్రపంచాన్ని మార్చడమేనని కార్ల్ మార్క్స్ అన్నాడు. ఆయన చెప్పిన వేల, లక్షల వాక్యాల్లో ఇది మహోన్నతమైనది.   అయితే, సమాజాన్ని మార్చడం అంత సులభమైన వ్యవహారంకాదు. ఎలాంటి సమాజాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాము అనేది మనకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న. ఇందులో మూడు అంశాలున్నాయి.  మూల సమాజం, గమ్య సమాజం, మూల సమాజాన్ని గమ్య సమాజంగా మార్చే ప్రక్రియ.

 

గమ్యసమాజాన్ని వర్ణించడం కొంత సులువు. మనం ఏర్పరచుకున్న ఆదర్శాలన్నింటినీ అందులో కూర్చవచ్చు. మరో మాటల్లో చెప్పాలంటే మూల సమాజంలోని దుర్లక్షణాలన్నింటినీ తీసేస్తే అది ఆదర్శ సమాజం అయిపోతుంది. మతగ్రంధాల్లో స్వర్గలోక వర్ణన ఈ నియమాల మీదే సాగుతుంది.  

 

మూల సమాజ వాస్తవ స్వభావాన్ని చెప్పడం అంత సులువుకాదు. కొందరు దీన్ని కుల వ్యవస్థ అంటారు; మరి కొందరు దీన్ని మతవ్యవస్థ అంటారు; ఇంకొందరు తెగ వ్యవస్థ అంటారు. కొందరు కార్పొరేట్ల వ్యవస్థ అంటారు. లింగం, ప్రాంతం, భాషా వ్యవస్థలు అనేవాళ్ళూ వున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు దీన్ని నియంతృత్త్వ వ్యవస్థ అంటారు ఏ గుడ్డివానికీ అర్ధం కాని ఏనుగు లాంటిది ఈ వ్యవస్థ. నిజానికి గుడ్డివాళ్లెవరూ తప్పు చెప్పలేదు. వాళ్లకు అర్ధం అయ్యిందే చెప్పారు. ఇప్పుడూ అంతే. ప్రతి ఒక్కరు తమకు అర్ధం అయిందే నిజాయితీగానే చెపుతున్నారు. కానీ, ఏ ఒక్కరికీ ఈ సమాజ వాస్తవం అర్ధం కాలేదు.

 

ఈ సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ అని నాకు కొన్నేళ్ళుగా అనిపిస్తున్నది. ఇది అర్ధవలస- అర్ధ భూస్వామ్య సమాజం అని సిపిఐ మావోయిస్టులు అంటున్నారు.  ఇది కుల సమాజం అని ఎస్సీలు, బిసిలు అంటున్నారు. ఇది తెగ సమాజం అని ఆదివాసులు అంటున్నారు. ఇది పురుష వ్యవస్థ అనో, మరో వ్యవస్థ అనో అంటున్నవారు కూడా చాలామంది వున్నారు.  వీళ్ళందరూ చెప్పేది వాస్తవమే కావచ్చు; వాస్తవం కాకనూపోవచ్చు. వాస్తవం వీళ్లందరి మధ్య ఎక్కడో వున్నది.

 

ఇక వర్తమాన సమాజాన్ని మార్చే విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఘపరివారం గురించి. వాళ్ళు చాలా కాలంగా దీన్ని హిందూ రాష్ట్రగా మార్చాలంటున్నారు. మిగిలినవారు పది ముక్కలుగా వున్నారు కనుక హిందూ రాష్ట్ర కోరుకునేవారు దేశంలో ఎక్కువమంది వున్నారు. అయితే వాళ్ళంతా కలిసినా 20-25 శాతానికి మించి వుండరు. ఎన్నికల్లో బిజెపికి, దాని కూటమికీ ఓట్లేస్తున్న వారందరినీ హిందూరాష్ట్ర అనుకూలురుగా భావించడానికి కూడ వీల్లేదు. దేశంలో హిందూరాష్ట్రను వ్యతిరేకించేవాళ్ళు 70-75 శానికి మించి వుంటారు. అయితే వాళ్ళు వంద ముక్కలుగా వుంటారు. 


JNJ Postings 11-04-2026

 JNJ Postings 11-04-2026

1.

"మాకు ఫ్యూచర్ సిటీలో -  రోడ్లు, విద్యుత్తూ, నీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థల వంటి  మౌలిక  సదుపాయాలు కల్పించి, ఇండివిడ్యువల్ గా లే - అవుట్లు  వేసి, - ఇంటి స్థలాలు కేటాయించ వలసిందిగా  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము" 


ఈ తీర్మానం మీద సర్వసభ్య సమావేశం అభిప్రాయాన్ని తీసుకోవాలి. 


- డానీ, 134



2. 

మన భావోద్వేగాలన్నీ నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాలతో  ప్రగాఢంగా ముడిపడి వున్నాయి.  ఆ విషయం అందరికి తెలుసు. కానీ, నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గాన్ని ఏ ఒక్కరూ ఇంతవరకు చెప్పలేకపోయారు. నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గం  ఎవరికయినా తెలిస్తే ఇప్పుడయినా చెప్పవచ్చు. లేనప్పుడు ఏమిటీ పరిష్కారం? ప్రత్యామ్నాయాలు ఆలోచించక తప్పదుకదా?  


- డానీ, 134




3. 


నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గం  ఎవరికయినా తెలిస్తే ఇప్పుడయినా చెప్పవచ్చు. 


- డానీ, 134


4.

చట్టం మనకు అనుకూలంగా ఉంటే 

దానికి సీఎం తో పనిలేదు. 

మన  రెండు స్థలాలు మనకే వస్తాయి. 

ఇప్పుడు చట్టం మనకు అనుకూలంగా లేదని 

నా అభిప్రాయం. 


చట్టం మనకు వ్యతిరేకంగా మారడానికి 

బివోడి కూడా కారణమా? అనేదీ ఒక అంశమే. 

కానీ దాన్ని సాగదీయడంవల్ల ప్రయోజనం లేదు. 

ఇప్పుడు పనికొచ్చే పనేదైనా ఉంటే అది మాత్రమే చేయాలి. 


సొసైటీలో రాజకీయ ప్రయోజనాలు ఆశించేవారు 

ముందుకు కదలరు. 

బ్లేమ్ గేమ్ ముఖ్యం వాళ్లకు.

వాళ్ళు ఏపనీ చేయలేరు.  

 


- డానీ, 134


5

కాసేపు బివోడిని పక్కన పెట్టి ఆలోచిద్దాం. 


ఆ రెండు స్థలాలను మనకు ఇవ్వాలని సీఎం తలచుకుంటే 

సుప్రీం కోర్టు తీర్పు మనకు అడ్డంకికాదు. 

ఇది బాగుంది. 


సియం మనకు ఇవ్వాలని తలచుకోకపోయిన సరే 

అయన చేత  ఆ రెండు స్థలాలను మనకు 

ఇప్పించే స్తొమత సుప్రీం కోర్టు తీర్పుకు ఉందా? 

 లేదు అనేకదా  సమాధానం!!!


మన కేసులో సీఎం సుప్రీం.   


ముందు ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


దాన్ని బట్టి కార్యాచరణను రూపొందించుకోవాలి. 


- డానీ, 134




 సుప్రీం కోర్టులో మన curative పిటిషన్ పై దృష్టి పెట్టడం మేలు. జర్నలిస్టుల సొంత ఇంటి కలను స్వయంగా సుప్రీం కోర్టే దూరం చేయడం అన్యాయమని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయ పడిన నేపథ్యంలో...curative పిటిషన్ మన ఆశలకు సజీవ రూపం ఇచ్చే అవకాశం ఉంది.