Tuesday, 12 May 2026

The Criminal Tribes Act and Denotified Tribes (DNTs)

 "Criminal Tribes" in India refers to over 150 communities designated as "addicted to the systematic commission of non-bailable offences" under the British-era Criminal Tribes Act of 1871. These communities were subjected to forced registration, surveillance, and restricted movement. Following independence, the Act was repealed in 1949 and these communities were denotified in 1952, though they continue to face social stigma today. [1, 2, 3, 4, 5]

Historical Context: The Criminal Tribes Act
  • Purpose: The British enacted the Act to control communities seen as "born criminals" or professional thieves, often targeting nomadic groups, artisans, and traders who resisted colonial authority.
  • Implications: Members were restricted in their movement, forced to report to police stations, and segregated, impacting roughly 13 million people by 1947.
  • Targeted Groups: Various groups were listed across India, including Koli, Banjara, Bawaria, Sansi, Kanjar, and Bhantu.
Post-Independence: Denotified Tribes (DNTs)
  • Repeal: The Act was replaced in 1952 with the Habitual Offenders Act, which focused on individuals rather than entire communities.
  • Vimukti Diwas: August 31, 1952, is celebrated as Vimukti Diwas (Liberation Day) by these communities.
  • Status Today: Today, over 300 Nomadic Tribes and nearly 200 Denotified Tribes exist in India, many of whom still face police brutality, societal discrimination, and economic marginalization. [1, 2, 3, 4, 5]
Examples of Formerly "Criminal" Tribes
  • Lodha and Kheria Sabar (West Bengal)
  • Koravar, Kallar, Valayar (Tamil Nadu)
  • Yerukula (Andhra Pradesh)
  • Chapper-band (various regions) [1, 2, 3, 4]
These communities often face continued harassment and are often viewed with suspicion by the police and society. [1, 2]

*ముస్లింల మీద క్రిమినల్ ముద్రలు*

 

*కాలధార*

 

*ముస్లింల మీద క్రిమినల్ ముద్రలు*

 

*డానీ*

*సమాజ రాజకీయ విశ్లేషకులు*

 

 

         ఉదయం నిద్రలేచి సెల్ ఫోన్ ఆన్ చేయగానే మనం 2026లో వున్నామనీ,  ఈరోజు మే 12 అని చెపుతుంది. ఆ తరువాత టీ తాగుతూ దినపత్రికల పేజీలు తిరగేస్తుంటే మాత్రం మనం మధ్యయుగాల్లొ వున్నట్టు అర్ధం అవుతూవుంటుంది. నిజానికి మనం మధ్యయుగాలకు  ముందు కాలంలో వుంటున్నట్టు కూడ అనిపిస్తుంది.  మనకు స్పీడు ఎక్కువ. చాలా వేగంగా ఆదిమ కాలాల్లోనికి పరుగులు తీస్తుంటాం. నాగరీకంగా వుండడం మనకు నచ్చదు. అనాగరికంగా వుండడం మనకు ఇష్టం. అందరూ బుధ్ధిగా వుంటే వార్తలు లేక మీడియాకు ఎంత కష్టం?

 

         1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆధునిక రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1956 జనవరి 26 నుండి అది అమలు లోనికి వచ్చింది. ఏడాదిన్న క్రితం మనం రాజ్యాంగపు వజ్రోత్సవాన్ని కూడ జరుపుకున్నాం.  కానీ, నిజంగానే రాజ్యాంగ ఆదర్శాలను ఆచరిస్తున్నామా?

 

         రాజ్యాంగం రావడానికి ముందు బ్రిటీష్ వలస పాలన వుండేది. భారత  పౌర సంస్కృతి లోనికి వేలు పెట్టడానికి బ్రిటీష్ వాళ్ళు సహితం కొంచెం భయపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ నేరస్మృతి బ్రిటీష్ దే వుండాలంటూనే, పౌరస్మృతిని మాత్రం దేశీయులకే వదిలేశాడు. ముస్లిం సమాజం ఖురాన్- హదీసులు తమ పౌరజీవితానికి ప్రామాణికం అని చెప్పుకోగా, మనుస్మృతి తమకు ప్రామాణికం అని హిందువుల ప్రతినిధులు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు A Code of Gentoo Laws పేరుతో 1776లో మనుస్మృతి అమల్లోనికి వచ్చింది.  విద్యావేత్త సర్ విలియం జోన్స్  దీనిని 1794లో ఇంగ్లీషు లోనికి అనువాదం చేశాడు.

 

మనుస్మృతిలోని వర్ణాధారిత శిక్షా విధానం తరువాత యూరోపియన్ మితవాద తత్త్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. సమాజాన్ని అసమాన హక్కుల ఆధారంగా విభజించే ఆలోచనలు యూరోప్లోని కొన్ని నిరంకుశ రాజకీయ ధోరణులకు పరోక్ష మేధో ఆధారాలుగా మారాయని కొందరు విమర్శకులు విశ్లేషిస్తారు. అలా ఇటలీ, జర్మనీల్లో చెలరేగిన ఫాసిజం, నాజిజం వంటి భావజాలాల మూలాలను కూడ భారతీయ వర్ణవ్యవస్థలో వెతికే వాదనలు ఉన్నాయి.

            శిక్షలకు సంబంధించి మనుస్మృతిలో వున్న ఆదేశాలన్నింటినీ ఇప్పుడు ఉటంకించాల్సిన అవసరంలేదుగానీ,  ఆ శిక్షాస్మృతి పాటించే ప్రాధమిక  నియమాన్ని అర్ధం చేసుకుంటేచాలు. ఇద్దరు వ్యక్తులు చేసిన నేరం ఒక్కటే అయినప్పటికీ  పైవర్ణాల వారికి  తక్కువ శిక్ష, కింది వర్ణాల వారికి పెద్ద శిక్ష అనేది మనుస్మృతి విధించిన నియమం. దీనినే ఇప్పుడు మన సమాజం ముస్లింల విషయంలో పాటిస్తున్నది. హిందువులకు చిన్న శిక్ష, ముస్లింలకు పెద్ద శిక్ష.

 

         ఓ ముస్లిం అబ్బాయి ఓ హిందూ అమ్మాయిని  ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే అది లవ్ జిహాద్. అది ఆ కుర్రాడ్ని నడిరోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాల్సినంత నేరం.  వాళ్లిద్దరు ఒక కార్పొరేట్ ఆఫీసులో సహోద్యోగులు అయ్యుంటే అది కార్పొరేట్ జీహాద్. వాళ్ళిద్దరూ ఓ మెడికల్ కాలేజీలో చదువుతుంటే అది మెడికల్ జిహాద్. వాళ్ళేమయిన ఇల్లు కట్టుకుంటే జమీన్ జిహాద్, ఘర్ జిహాద్. బతకడానికి బన్నులు అమ్ముకుంటే బన్ జిహాద్, బేప్సార్ జిహాద్. ఇందుగలదు అందులేదనే సందేహమే వద్దు. ఈ జిహాద్ ఎందెందువెతికినా అందందే వుండును.

 

                  కుంభమేళాలో ‘మొనాలిసా’గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక ట్రైబల్ అమ్మాయికి పెద్దలు పెళ్ళి కుదిర్చారు. ఆ పెళ్ళి ఆమెకు ఇష్టంలేదు. తన సన్నిహితుడు సినీ నటుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. అంతే. ఈ సంఘటనలో ముస్లిం పేరు కనిపించడంతో సనాతనుల మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. మొనాలిసాను కిడ్నాప్ చేశాడనీ, పైగా ఆమె మైనర్ గనుక అతని మీద పోక్సో కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపాలని సనాతనుల సంఘాలు రోడ్డుకెక్కాయి. ఆమె నిజంగానే మైనర్ అయ్యుంటే ఆమెకు పెళ్ళీ చేయతలపెట్టిన తల్లిదండ్రుల్ని ముందు అరెస్టు చేయాలి. ఇంత చిన్న లాజిక్కును ఎలా మర్చిపోయారబ్బా? 

 

ఇప్పుడు ఇంకో పోక్సో కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై  ఓ మైనర్  మీద అత్యాచారం చేశాడనే ఆరోపణ వచ్చింది. నిందితుని తండ్రి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో మొదట్లో కేసు కట్టడానికి తెలంగాణ పోలీసులు తటపటాయించారు. నిందితుడు ముస్లిం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సనాతన మహిళామణులు నీరసం వచ్చి నిద్రపోయారు.

 

సహజంగానే తన కొడుకు నిర్దోషనీ బండి సంజయ్ మీడియా ముందు బోలెడు బాధపడ్డారు. అయితే, బండి భగీరథ్ మరీ నోట్లో వేలు పెట్టినా కొరకడం తెలీని అమాయకుడుకాదనీ, గతంలో కొందరి వేళ్ళు కొరికిన చరిత్ర అతనికి వుందని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు.  ప్రస్తుతం భగీరథ్ పరారీలో వున్నాడనీ, తండ్రి చెప్పినంత అమాయకుడు కాడు కనుక తెలివిగా  ట్రేస్ కాకుండా సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడని కూకట్ పల్లి డిసిపి రితిరాజ్ మీడియాకు తెలిపారు.

 

నిజానికి ఈకేసు జాతీయ రాజకీయాలను కూడ ప్రభావితం చేసిందనే వాదన ఒకటుంది. అధికార పర్యటనకు మే 10న హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వేదిక మీదనే కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తనతో చేతులు కలిపితే బోలెడు అభివృధ్ధి సాధించవచ్చని ఒక ఆఫర్ కూడ ఇచ్చారు.  ఫలితంగా రేవంత్ రెడ్డి ఈ కేసులో అంటీ ముట్టనట్టు వ్యవహరించారనే కథకం కూడ చక్కర్లు కొట్టింది. అంతిమంగా భగీరథ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్.

 

విచిత్రం ఏమంటే బండి భగీరథ్ ను రక్షించడానికి తెలుగు మీడియా సంస్థలు నడుం బిగించాయి. కొన్ని సంస్థలు, జరిగిన సంఘటనను ‘హానీ ట్రాప్’ గా చిత్రించాయి. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కుట్రదారులుగా ప్రచారం చేశాయి. బాలిక మైనర్ అయినప్పుడు హానీ ట్రాప్ ఆరోపణ చెల్లదనే కనీసపు ఇంగితం కూడ ఈ మీడియా సంస్థలకు లేకపోయింది. మైనర్ బాలికను అడ్డుపెట్టి ఆమె తల్లియే హానీ ట్రాప్ నడిపించిందనేంత వరకు సోషల్ మీడియా కథనాలు వెళ్ళాయి. నిందితుడినే బాధితుడిగా చిత్రించే అతి తెలివినీ ప్రదర్శించాయి.

 

ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక అక్షరం స్థానాన్ని శబ్దం ఆక్రమించడంతో  పాత్రికేయ విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయనే ఆరోపణలు, ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగానే వున్నాయి. మన దేశంలో అవి మరీ దిగజారాయి. తెలుగు మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, ఏ స్థాయికి పడిపోయిందో కొలవడం కూడా కష్టమే.

 

భారత ముస్లింలలో నేరస్తులు వుండరని ఎవరూ అనరు. ముస్లింలలోనూ నేరస్తులు తప్పక వుంటారు. కానీ నేరస్తులందరూ ముస్లింలే అని చెప్పడానికీ, ఎక్కడ ఏ నేరం జరిగినా అందులో ముస్లింలు వున్నారని ప్రచారం  సాగించడానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తున్నది.

 

ప్రతిదానికీ ముస్లింలను బోనెక్కించడానికి ప్రయత్నించడంకన్నా నమ్మకమైన గణాంకాలతో ఎవరయినా ముందుకు రావచ్చు. దేశంలో జరిగే ప్రతినేరాన్నీ నమోదు చేయడానికి కేంద్రంలో హొంశాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వుంటుంది. అది ప్రతి సంవత్సరం తన నివేదికను విడుదల చేస్తుంటుంది.

 

ఇటీవల విడుదలైన ఎన్ సి ఆర్ బి నివేదిక  2024వ సంవత్సరంలో దేశంలో శిక్షార్హమైన నేరాలు 60 లక్షల వరకు జరిగాయని పేర్కొంది. వీటిల్లో అత్యాచారాలు 29,536. లైంగిక వేధింపులు 48, 3030. భార్యల మీద భర్తల డౌర్జన్యం 1,20, 227. వరకట్న హత్యలు 5,737. మహిళల అదృశ్యం 67,829 కేసులు.

 

ఈ కేసులన్నింటిలోని గణాంకాల్ని మత ప్రాతిపదికన వర్గీకరిస్తే ఏ సామాజిక సమూహంలో ఎంతమంది నేరస్తులు వున్నారో  సులువుగా తెలిసిపోతుంది. ఎవరు ఎక్కువ నేరస్త స్వభావం కలిగివున్నాడో తేలిపోతుంది.

 

ఆ ప్రయత్నం చేయనంతకాలం అణగారిన మత సమూహాల మీద క్రిమినల్ ముద్రలు వేస్తూనే వుంటారు.  

 

రచన: 12-05-2026

 

Wednesday, 6 May 2026

హిందూ సంఘటన – ముస్లిం విభజన - Hundi Unity and Muslim Division

 

*కాలధార*

*హిందూ సంఘటన – ముస్లిం విభజన*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 


 

ఇప్పుడు జరిగిన ఐదు రాష్ ట్రాల ఎన్నికల్లో బిజెపి బలపడుతుందని దాదాపు అందరికీ ముందే తెలుసు. తమిళనాడులో  బిజెపి కాలుమోపడానికి జాగా దొరకదనీ తెలుసు. డియంకే ఓడిపోయి టివికే ఆధిక్యాన్ని సాధిస్తుందని ఊహించకపోవచ్చుగానీ, దక్షణాది రాజకీయాల్లో క్రైస్తవ నేపథ్యంవున్న జోసెఫ్ విజయ్ ముందుకు దూసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

 

సమాజాన్ని మార్చడానికి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నవారూ వున్నారు. వాళ్ళకు పార్లమెంటరి ఎన్నికలతో ఎలాగూ పనిలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్న రాజకీయ పార్టీలు దేశంలో అనేకం వున్నాయి. అవి ఇతర సందర్భాల్లొ పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఎన్నికలప్పుడే మేల్కొని కొన్ని రోజులు కొంచెం హడావిడి చేస్తాయి. ఇంతటి బద్దకస్తులతో రాజకీయాల్లో మార్పురాదు.

 

 బిజెపి అలాకాదు; దానికి ఎన్నికలనేవి 27x7x56. ఎన్నికల్లో బిజెపి వరుస విజయాలు సాధించడానికి ఇదొక ప్రధాన కారణం. అన్నింటికన్నా గొప్పది బిజెపి ఎంచుకున్న ఎన్నికల ఎత్తుగడ. హిందూ సంఘటన – ముస్లిం విభజన.

 

దేశంలో మెజారిటీ సమూహమైన హిందూ సమాజాన్ని తన ఓటు బ్యాంకుగా బిజెపి ఎంచుకుంది. అందులో అందరూకాకున్నా సగం మంది సానుకూలంగా స్పందించినా అధికారంలోనికి రావచ్చు; అధికారాన్ని కొన సాగించవచ్చు అని దానికి అర్ధం అయిపోయింది.  గత మూడు లోక్ సభ ఎన్నికల్లో దానికి 40 శాతం లోపే ఓట్లు వచ్చాయి. అయినా అధికారం దక్కుతోంది. అంచేత అది ‘హేట్ ముస్లిం’ నినాదాన్ని వదులుకోదు. అది దాని ప్రాణరక్షణ మందు. ప్రతి అంశానికి జిహాద్ పనే పదాన్ని ఒక తిట్టుగా చేరురుస్తుంది.

 

అలా బిజెపి ఒక కంఫర్ట్ జోన్ లో కొనసాగుతున్నప్పటికీ దానికో ఇబ్బంది వుంది. హేట్ ముస్లిం నినాదం వల్ల బిజెపికి 40 శాతం ఓట్లు పడ్డా బయట 60 శాతం ఓట్లు వుండిపోతాయి. వాటిని విపక్ష పార్టి ఏదైనా లాక్కో గలిగితే  బిజెపి పునాదులు కదిలిపోతాయి. అందువల్ల, విపక్షాలు ముస్లిం పక్షం వహించకుండ బిజెపి నిత్యం కొత్త వ్యూహాలు పన్నుతూనే ఉంటుంది. విపక్షాల మీద ‘ముస్లిం సంతుష్టీకరణ పార్టీలు’ అని నింద వేస్తుంది. ఈ నింద మీద పడితే విపక్షాలు భయంతో వణికిపోతాయి. ముస్లిం అనే పదాన్ని ఉచ్చరించడానికే భయపడి పోతాయి. ముస్లింలను బిజెపి దగ్గరకు తీసుకోదు; విపక్షాలను దగ్గరికి తీసుకోనివ్వదు.

 

సాధారణంగా ఒక ఎన్నికల గుర్తు మీద ఒక పార్టి మాత్రమే  పోటీ చేస్తుంది.  బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలంను గెలిపించడానికి అనేక పార్టీలు ఏకం అవుతుంటాయి. వాటిల్లో ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ పేరు బాగా వెలిగింది. ‘ఎస్ ఐ ఆర్’ పేరుతో ముస్లింలకు దాదాపు  ఓటు లేకుండా చేసేసింది.  ఆపైన   న్యాయాస్థానాలు కూడ తమవంతు  భక్తిని ప్రదర్శించుకున్నాయి.

 

ఇందిరాగాంధీ కూడా నిరంకుశ పోకడలకు పాల్పడ్డారనేది వాస్తవం. అయితే, రాజ్యాంగ వ్యవస్థల్ని ఇప్పటి స్థాయిలో ఆమె వాడలేదు. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు 1975లో రద్దు చేసింది. తీర్పు వల్ల ఆమె ప్రధాని పదవే ప్రమాదంలో పడింది. దీనినే ఎమర్జెన్సీకి విధింపుకు తక్షణ ప్రేరణగా భావిస్తారు. ఇప్పటి కోర్టులకు ప్రధానిని తప్పుపట్టే సామర్ధ్యం వుందా? అని ప్రశ్నించుకుంటే లేదనేదే సమాధానం అవుతుంది.

 

మార్చి నెలలో ఓ ముస్లిం కుటుంబం రంజాన్ ఉపవాసాల ఇఫ్తారీ విందును కాశీలో గంగానది మీద ఒక బోటులో జరుపుకుంది. ఈ సంఘటన మీద బిజెపి యువజన విభాగం నేత ఒకరు ఆ కుటుంబం మీద కేసు పెట్టారు. మిగిలిన ఆహారాన్ని నదీలో పడేసి జలాలను కలుషితం చేశారనీ, దీనికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేసి దేశవ్యాప్తంగా  హిందువుల మనోభావాలను గాయపరిచారనీ, తద్వార పెద్దఎత్తున  మతకల్లోలాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేశారనేవి ప్రధాన ఆరోపణలు. ఆ బృందానికి ఇప్పటి వరకు బెయిల్ కూడ దొరకలేదు. మతకల్లోలాలను రెచ్చగొట్టే కేసుల్లో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానాలు తేల్చి చెప్పేశాయి. ఈ కేసును ప్రధాని పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

నిజానికి గంగా నదికి ఇరువైపులా వున్న గ్రామాలు, పట్టణాలు, నగరాల మురికినీటిని గంగానది లోనికే వదిలేస్తుంటారు. టూరిస్టు బోట్ల మీద మందు పార్టీలు జరగడం కూడ సర్వసాధారణం. అలాంటప్పుడు ముస్లిం కుటుంబాన్ని మాత్రమే ఎందుకు శిక్షిస్తున్నారంటే ఒక విచిత్ర సమాధానం ముందుకు వచ్చింది. మురికినీళ్ళు, మందు పార్టీలవల్ల ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినలేదు. కానీ, అదే పనిని ముస్లిం కుటుంబం చేసినపుడు ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఆ వివరణ.

 

ఈ పరిణామాలు ఇంతటితోఆగలేదు. ముస్లింలతో ఎంతటి సాన్నిహిత్యం వున్నాసరే వాళ్ళను పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలకు ఆహ్వానించరాదని అనధికార హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముస్లింల రాకను నివారించడానికి పందుల్ని వాడేంత వరకు అభివృధ్ధి చెందింది  పరిస్థితి. అనేక వేడుకల్లో పందుల్ని భాగం చేస్తున్నారు. గోమూత్రం, ఆవుపేడలకు పందుల ప్రేమ  అదనపు ఆకర్షణ.

 

మూర్ఖులు, నేరస్వభావం కలిగినవాళ్ళు అన్ని సమూహాల్లోనూ వుంటారు; భారత ముస్లింలలోనూ వుంటారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం వుండాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముద్ర వేసేముందు ఎవరిలో ఎంత శాతం అనేది తేల్చుకోవాలిగా? భారతదేశంలో ఏటా 30 వేలకు పైగా మానభంగాల కేసులు నయోదవుతున్నాయని ఎన్ సిఆర్ బి అధికారికంగా ప్రకటించింది. ఆ కేసుల్లో ఆరోపితుల పేర్లను పరిశీలిస్తే వాళ్ల మతం తెలిసిపోతుంది. వాళ్ళలో ముస్లింలు 14 శాతం కన్నా ఎక్కువ వున్నారా? తక్కువ వున్నారా?  ఒకసారి పరిశీలిస్తే పోలా? ఢిల్లీ నిర్భయా (2012), జమ్మూకశ్మీర్ కథువా  (2018), హత్రాస్  (2020), ఉన్నావ్ (2017), శక్తిమిల్ గ్యాంగ్ రేప్ (2013) కేసుల్ని అందరూ మరచిపోయారా? అలాగే భార్యా హంతకుల కేసుల గణాంకాల్ని సహితం మత  ప్రాతిపదికన  వర్గీకరించాలి. అత్యధికులు ఎవరూ? అనేది తేల్చాలి. అలాగే బహుభార్యత్త్వాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం జరుగుతున్నది. సహజీవనం చట్టబధ్ధం అయ్యాక బహుభార్యత్త్వాన్ని ఎవరు ఎంచుకుంటారూ?

 

ఎన్నికల్లో 60 శాతం ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా పడుతున్నాయన్నది వాస్తవం.  లెఖ్ఖల ప్రకారం 4కన్నా 60 ఎక్కువ. అయినప్పటికీ విపక్షాలు ఓడిపోతున్నాయి. కారణం వాటి మధ్య సిధ్ధాంతపరమైన ఐక్యత లేదు. లేదా వాటి ఐక్యతకు సిధ్ధాంతపరమైన పునాదిలేదు. అది ఏర్పడనంతకాలం ఇండియా బ్లాక్ అనేది ఒక పీతల గంపలా మాత్రమే వుంటుంది. తాము ఎందుకు గెలిచారో గెలిచినవాళ్ళకు స్పష్టంగా తెలుసు. తాము ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలని ఓడిపోయినవాళ్ళు అనుకోరు. వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ  అందరూ ప్రధాని పదవికి అర్హులే. కానీ, ఆ పదవి ఒక్కరికే దక్కుతుందనే స్పృహ వాళ్ళలో రానంత వరకు  ఎన్నికల ఫలితాలు ఇలానే వస్తుంటాయి.

 

అన్నీ మారిపోతున్నట్టే ఎన్నికల రాజకీయాలు కూడ మారిపోయాయి. గతంలో ముందు దేశాధినేతలు ఆ వెనక పారిశ్రామిక వేత్తలు వుండేవారు. దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు చెట్టాపట్టాలేసుకు తిరిగిన రోజులు కూడ వున్నాయి. ఇప్పుడు ముందు పారిశ్రామిక వేత్తలు వారి వెనుక దేశాధినేతలు నడుస్తున్నారు. ఈ మార్పు ఇంటాబయటా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయం, ఆర్ధికం ఇక ఎంత మాత్రం రెండుకావు; ఆ రెండూ ఒకటే. ప్రజల్లో మతోన్మాదాన్ని క్రమం తప్పకుండా ఎక్కిస్తున్నంత కాలం దేశానికి గడ్డుకాలం తప్పదు.

 

దీని అంతటి సారం ఏమంటే, ఒక రాజకీయార్ధిక ఎజెండా మన సామాజిక జీవితాలతో ఒక కౄరమైన క్రీడను సాగిస్తోంది.

 

05-05-2026

Wednesday, 29 April 2026

ఇది హిందూత్వకు టెర్మినల్ స్టేజ్!

 కాలధార

ఇది హిందూత్వకు టెర్మినల్ స్టేజ్!   


డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు 


 

ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న  పాలన అనేది నిఘంటువు అర్ధం. పాలకులు ప్రజల్ని వశీకరణం చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అలాంటి దగ్గర దారులు తెలిసిన బహుకొద్ది మంది మాత్రమే అధికారాన్ని దక్కించుకునే క్రీడగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. దగ్గర దారులు అనడానికి బదులు అడ్డదారులు అనుకున్నా పెద్ద తప్పేమీకాదు.

 

మనదేశంలో ఎన్నికల్లో గెలవడానికి సంఘపరివారం ఓ సులువైన మార్గాన్ని కనిపెట్టింది. ముస్లిం భూతాన్ని మించిన విన్నింగ్ ఫార్మూలా మరొకటి లేదని దానికి అర్ధం అయింది. నరేంద్ర మోదీజీ రాజకీయ గ్రాఫ్ వేగంగా పెరగడానికి ఈ ఫార్మూలా బాగా పనిచేసింది.

 

    2011 జనాభా లెఖ్ఖల ప్రకారం భారతదేశంలో హిందువులు 79 శాతం. ముస్లింలు 15 శాతం. క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు, జైనులు 6 శాతం. హిందువులకు ముస్లింలతో ముప్పు వుందని ప్రచారంచేస్తే ఆ 79 శాతం ఓటర్లను సులువుగా ఆకర్షించుకోవచ్చనేది ఒక వ్యూహం.

 

    15 శాతం ఓటర్లను అన్యులుగా చూపెట్టి, 85 శాతం ఓటర్లను  ఆకర్షించే వ్యూహం భారత రాజకీయాల్లో కొత్తదేమీకాదు. మొదట్లో కాంగ్రెస్ కూడా  ఇదే వ్యూహంతో సాగేది. ఓటర్లలో ఓ 15 శాతం కమ్యూనిస్టు తదితర పార్టీల  అభిమానులున్నాసరే 85 శాతం తమతోనే వుంటారనే ధీమాతో వ్యవహరించేది. ఇది రాజకీయ ప్రాతిపదిక. కమ్యూనిస్టులది కూడ సేమ్ టు సేమ్ ఫార్మూలా. దేశంలో దోపిడిదారులు 15 శాతం మాత్రమేననీ శ్రామికులు 85 శాతం అని వాళ్ళు లెఖ్ఖలు వేసుకునేవారు.  ఇది వర్గ ప్రాతిపదిక. అంబేడ్కర్ శిబిరం నుండి వచ్చిన కాన్షీరామ్ సహితం 85 శాతం ఫార్మూలాను పాటించేవారు.  పెత్తందాదీ కులాలు 15 శాతం మాత్రమేననీ, బహుజనులు 85 శాతం అనీ గణాంకాలు వివరించేవారు. ఇది కులప్రాదిక.

 

    రాజకీయ, వర్గ, కుల, భాషా, ప్రాంతీయత తదితర  ప్రాతిపదికలకన్నా ఎన్నికల్లో  మతం చాలా ప్రభావశీలంగా పని చేస్తుందని  కనిపెట్టింది మాత్రం బిజెపియే. 15 శాతం ముస్లింలను ప్రమాదకారులుగా చూపెట్టి 85 శాతం హిందువులను ఆకర్షించడానికి అది ప్రతి ఎన్నికల్లోనూ  ప్రయత్నం చేస్తుంది. అందులో సగం ఓట్లు పడినా రాజ్యాధికారం దక్కుతుందని  దానికి అర్ధం అయింది. ‘హిందూ ఖతరే మే హై’ అనేది దాని అధికార రక్షా కవచంగా మారిపోయింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణమంత్రి హిందువులే అయినపుడు హిందువులు ప్రమాదంలో ఎలా వుంటారు? అనే అనుమానం కూడ ఎవరికీరాదు. అదే మత మహాత్యం. ఇంత చేసినా  గడిచిన మూడు లోక్ సభ ఎన్నికల్లోనూ బిజేపికి పూర్తిగా 40 శాతం ఓట్లు కూడ రాలేదు. అయినప్పటికీ మొదీజీ అప్రతిహత శక్తిగా వెలుగులో వుంటున్నారు.  బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇలాంటి వింతలు కూడ కొన్ని వుంటాయి.

 

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాక మోదీజీ చారిత్రాత్మక వాగ్దానాలు అనేకం చేశారు. ఆకర్షనీయ పథకాలు అనేకం ప్రకటించారు.  వాటిల్లో ఒక్కదాన్ని కూడ నెరవేర్చకపోగా వాటికి విరుధ్ధమైన ఆచరణను సాగించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు తీసుకునివచ్చి ప్రతి భారతీయుడుడికి 15 లక్షల రూపాయల చొప్పున పంచవచ్చు అనే మాటతో వారు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆధికారంలో వచ్చాక వారు ఆ నల్లధనాన్ని ఎలాగూ వెనక్కి తీసుకురాలేదు. మరోవైపు, బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేవారి సంఖ్య వారి హయాంలో బాగా పెరిగింది. మత పరంగా, సామాజికవర్గం పరంగా, ప్రాంత పరంగా వీరెవరూ? అని ఆరాతీస్తే సంఘపరివారానికి చాలా కోపం వస్తుంది. చీలికవాదులంటూ గోదీ మీడియా  చాలా పెద్ద గొంతుతో వాళ్ళ మీద విరుచుకు పడుతుంది.

 

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనేది వారి మరో ప్రసిధ్ధ నినాదం. దేశంలో ఇద్దరు కార్పొరేట్ల ఆస్తులు నిరంతరం పెరిగిపోతుండడాన్నీ, మరో వైపు ఆదివాసులు, ముస్లింలు, వలస కార్మికుల్ని తీవ్రంగా వేధించడాన్నీ మనం ప్రతిరోజూ చూడవచ్చు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా మొత్తం 543  స్థానాల్లో ఒక్క చోటతప్ప, మరెక్కడా బిజెపి ముస్లిం అభ్యర్ధులకు పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. లక్షద్వీప్ లో  మరొకరు వుండరుకనుక అక్కడ మాత్రమే ముస్లింకు ఒక సీటు ఇచ్చారు.  ఉత్తరప్రదేశ్ లో ముస్లీంల మీద  నేరారోపణ జరిగితేచాలు; నేరం రుజువు కాకుండానే వాళ్ళ ఇళ్ళను బుల్ డోజర్లతో కూల్చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

 

ఎన్నికల్లో ఓటర్లకు ఈ కిక్కు సరిపోదు. డోసు పెంచాలి. దేశాన్ని ముస్లిం ముప్పు కబళించేస్తున్నదని భయపెట్టాలి. ముస్లింలు నవ్వినా ఏడ్చినా ప్రేమించినా పొట్టకూటికోసం బన్నులు అమ్ముకున్నా దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆందోళన సాగించాలి. బన్ను జిహాద్, లవ్ జిహాద్, జమీన్ జిహాద్.  ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఒకవైపు ముస్లింలు పంక్చర్లు వేసుకోవడానికితప్ప మరి దేనికీ పనికిరారు అని ప్రచారం చేస్తుంటారు. ముస్లింలు తమ స్వశక్తి మీద విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తే దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆ విద్యా సంస్థను మూసేసేవరకూ నిద్రపోరు. కశ్మీర్ లో ఈ మధ్య ఓ మెడికల్ కాలేజీలోని 50 సీట్లలో 42 స్థానాల్ని ముస్లింలు మెరిట్ ప్రాతిపదికన దక్కించుకున్నారు. అంతే, ‘మెడికల్ జిహాద్’ అంటూ ఆందోళన చేసి ఆ మెడికల్ కాలేజీనే మూయించివేశారు. టిప్పు రాగానే రెచ్చిపోవడానికి  వ్యవస్థీకృత వృత్తి కళాకారులు  సోషల్ మీడియాలోనూ, అన్-సోషల్ మీడియాలోనూ వేల సంఖ్యలో సిధ్ధంగా వుంటారు.

 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న  ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు బిజెపికి ప్రతిష్ణాత్మకం. తమిళనాడు నేల మీద బిజెపి విత్తనం మొలకెత్తడం కష్టం. ఇప్పుడు బిజెపి శక్తులన్నింటినీ పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించింది. అంటే, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం అన్నమాట.

 

పశ్చిమ బెంగాల్ లో తాము అధికారంలోనికి వస్తే బంగ్లాదేశ్ చొరబాటుదార్లను మెడపట్టి గెంటేస్తామనీ, దేశ తూర్పు సరిహద్దును ముళ్ళకంచెలతో మూసి వేస్తామని హోంమంత్రి అమిత్ షా ఒక వాగ్దానం చేశారు. చొరబాటుదార్లను బయటికి పంపించడానికి detect, delete and deport విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నిజానికి చొరబాటుదార్లను బయటికి పంపించడానికి బిజెపి  పశ్చిమ బెంగాల్ లో అధికారంలోనికి రావలసిన పనిలేదు. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలో ఇప్పుడు బిజెపినే అధికారంలో వుంది. ఓటర్లు ఇలాంటి లాజిక్కులు అడగకూడదు. చెప్పింది వినాలి.

   

బెంగాలో చొరబాటుదారుల ‘యొక్క’, చొరబాటుదారుల ‘ద్వార’ చొరబాటుదారుల ‘కొరకు’ ప్రభుత్వాన్ని తృణామూల్ కాంగ్రెస్ నడుపుతున్నదని ప్రధాని ఆరోపించారు. చొరబాటుదార్ల మతాన్నీ, భాషనూ, సంస్కృతీ సాంప్రదాయాలనూ పరిరక్షించడానికి మమతా బెనర్జీ అదనంగా శ్రమిస్తున్నారని వారు ఎద్దేవ చేశారు. బిజెపి నాయకుడు ఒకాయన అయితే బెంగాల్ ఎన్నికల్ని ఏకంగా నాగరీకతల యుధ్ధంగా చిత్రించారు.

 

    విధానపరమైన ప్రచారాలు  సరిపోవనుకున్నప్పుడు సంఘపరివారం అనేక దిగజారుడు పనులు సహితం చేస్తుంది. ఎన్నికల ప్రచారం జోరుగు సాగుతున్న కాలంలో, శ్రీరామ నవమికి ముందు   పశ్చిమ బెంగాల్ పురులియాలో ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాలను కొందరు దుండగులు విధ్వంసం చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు సహజంగా ముస్లింలను అనుమానిస్తారు. అరెస్టులు చేస్తారు. కానీ, మతకల్లోలాలను రెచ్చగొట్టడానికి  బిజిపి నేతలే విగ్రహాల విధ్వంసానికి పాల్పడినట్టు తేలింది.

 

సంఘ్ పరివారం ప్రచారం, దాడులకు భయపడి భారత ముస్లిం సమాజం గోమాంసానికేకాక అసలు బీప్ కే దూరమయిపోయింది.  దానితో గోరక్షణ కోసం ఏర్పడిన బిజెపి దళాలకు పనిలేకుండా పోయింది. వాళ్ళే గోవుల్ని కోసి ఆ ముక్కల్ని గుళ్ళల్లో విసిరి ఆ నిందను ముస్లింల మీద వేసేంత వరకు తెగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు మరీ ఎక్కువవుతున్నాయి.

 

ఈ పూనకం ఎంత వరకూ వెళ్ళిపోయిందంటే దేశలో శాకాహారులు హిందువులు, మాంసాహారులు ముస్లింలు అనే కొత్త నిర్వచనాన్ని ముందుకు తెచ్చారు. ఈ తర్కం ప్రకారం దేశంలో మాంసాహారులే మెజారిటి.   అంటే ముస్లింలే మెజారిటి అన్నమాట.

భారత ఆర్ధిక స్థితి నాలుగో స్థానం నుండి ఆరవ స్థానానికి పడిపోయింది. భారతదేశంకన్నా బంగ్లాదేశ్ తలసరి జిడిపి మెరుగ్గావుంది.    అమెరిక ముఖం మీద ఉమ్మేసినా మన దేశాధినేతలు కర్చిఫ్ తో తుడుచుకుని మౌనంగా వుండిపోతున్నారు. వీటి మీద మాట్లాడాల్సిన సమయంలో “వాళ్లు మాసం తినడమేగాక ఆ వీడియోలను బయట పెట్టి ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు” అని స్వయంగా ప్రధానియే ప్రచారం చేస్తున్నారు. ముస్లింలను సామాజికంగా వెలివేయడానికి హిందువులు పందుల్ని పెంచుకోవాలని సంఘపరివార వ్యూహకర్తలు పిలుపులు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. దీన్ని హిందూత్వకు టెర్మినల్ స్టేజి అనవచ్చు.   

 

హిందూ సమూహం మొత్తం లించింగ్ బ్యాచీల్లా వుండదు. మతాన్ని ఒక పవిత్ర వ్యవహారంగా భావించే సమూహం కూడ వుంటుంది. కొత్తగా వస్తున్న ఈ వికారపు పోకడల్ని వాళ్లు ఆమోదిస్తున్నారా? భరిస్తున్నారా? అనేది ఒక సమంజసమైన  సందేహం.  వాళ్లు ఆమోదించకపోతే హిందూత్వ లోపలి నుండే బీటలు వారుతుంది.

 

రచన : 28-04-2026

ప్రచురణ : తెలుగుప్రభ 29-04-2026

Monday, 27 April 2026

We have Crossed 43

43 దాటాము!





 

మనిషి అసలే కోపిష్టి నిలకడగా కాపురం చేస్తాడా? అని మావాళ్ళ అనుమానం. దీనికి ముక్కు మీద కోపం అత్తారింట్లో ఎన్నాళ్లుంటుందని వాళ్ళవాళ్ల భయం. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ఎంత లేదన్నా మేము రోజుకు ఓ మూడుసార్లు దెబ్బలాడుకుంటుంటాం. ప్రతి తగవూ ఇక కుదరదు విడిపోవాల్సిందే అన్నంత వరకూ సాగుతుంది. అలా 43 సంవత్సరాలు సాగిపోయాయి.

 

మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసినప్పుడు నేను ఉద్యోగం చేయను; ఉద్యమాలంటూ ఊర్లెంబడి తిరుగుతాను. సంపాదన మీద నమ్మకంలేదు. పిల్లలు పుట్టినా వాళ్ళ పెంపకం చదువు వగయిరా బాధ్యతలన్నీ నీవే  అన్నాను. అన్నింటికీ సరేనంది. హిందూ ముస్లిం  మతాంతర వివాహం ఒకటి ఇలా జరిగిందంటే ఇవ్వాల్టి రోజుల్లో నమ్మడం కష్టం.

 

ఇరాన్ యుధ్ధం, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్, కగార్ ఆపరేషన్, కారంచేడు, చుండూరు, మణిపూర్ వంటి చిన్న చిన్న విషయాల మీద మాకెప్పుడూ బేధాభిప్రాయాలు లేవు. పోపు మాడడం, ఆవగాయ పచ్చడ్లోకి ముద్దపప్పు లేకపోవడం, పలావు చేసినపుడు ఖట్టా వండకపోవడం వంటి పెద్దపెద్ద విషయాల మీద మేము మూడవ ప్రపంచ యుధ్ధం స్థాయిలో పోట్లాడుకుంటాము. 

 

          చలసాని ప్రసాద్ మా పెళ్ళికి పురోహితుడు. తను అలాంటి దండల పెళ్ళిళ్ళు వంద వరకు చేశాడు. మాది తప్ప అన్నీ విఫలం అయ్యాయి. మా పెళ్ళికి రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక ప్రాధాన్యత వుంది. అది విఫలం కాకూడదనేది ఆమె పట్టుదల. దానికోసం తను సామదానబేధ దండోపాయాలు అన్నింటినీ ప్రయోగిస్తుంది.

 

27-04-2026