A.M. Khan Yazdani & Usha S Danny
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Saturday, 15 August 2026
Communal Hormony is the need of the hour.
మతసామరస్యం — నేటి నినాదం
ఏ.ఎం. ఖాన్ యజ్దానీ — డానీ
సామాజిక విశ్లేషకుడు |
సీనియర్ జర్నలిస్టు
దాదాపు ఐదు దశాబ్దాలుగా భారత సమాజాన్ని, రాజకీయాలను, ప్రజా
జీవితాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, జర్నలిజంలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను.
వీలు కుదిరినప్పుడల్లా సోషల్ యాక్టివిస్టుగా కూడా పనిచేస్తున్నాను.
ఆగస్టు 15, త్రివర్ణ పతాకం, భారత రాజ్యాంగం — ఇవి మూడూ భారత గడ్డపై పుట్టి, పెరిగిన ప్రతి ఒక్కరికీ
అత్యంత గౌరవనీయమైనవి. త్రివర్ణ పతాకం గురించి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త అర్థాలు
చెబుతున్నారు. కానీ అది భారతదేశపు బహుళత్వానికి, సాంస్కృతిక సమైక్యతకు, ప్రజల
ఆకాంక్షలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు అశోకచక్రం మన జాతీయ
పతాకానికి మత సామరస్య విలువల్ని అద్దుతాయి.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మత సామరస్యం — ఇవి నా ఆలోచనా
విధానానికి ప్రాథమిక విలువలు.
భారత స్వాతంత్ర్యానికి 79 సంవత్సరాలు పూర్తయి, 80వ
స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, నా జర్నలిజం, నా సామాజిక ఆలోచన,
నా రాజకీయ వైఖరికి సంబంధించిన కొన్ని విషయాలను మిత్రులు, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.
నా మొదటి నమ్మకం — మత సామరస్యం. భారతదేశం అనేక మతాలు, భాషలు,
కులాలు, ప్రాంతాలు, సంస్కృతులతో కూడిన దేశం ఈ వైవిధ్యమే భారతదేశానికి బలం అని నమ్ముతాను.
అన్ని మతాల మధ్య సామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని, సోదరభావాన్ని పెంపొందించడం మనందరికీ
ముఖ్యమైన సామాజిక బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో
హిందూ–ముస్లిం సామరస్యం మరెంతో అవసరం.
గతంలో సమాజ విశ్లేషకులు ప్రధానంగా కుల వైరుధ్యాలను పరిశీలించేవారు.
ఆ తరువాత ధనిక –పేద వర్గాల మధ్య వైరుధ్యాలను విశ్లేషించే సంప్రదాయం బలపడింది. అవి
వేర్వేరు చారిత్రక దశలు. కానీ ఈ రోజు పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. రాజకీయ,
ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై మతం ప్రభావం విస్తరిస్తోంది. అందుకే నేటి సమాజ విశ్లేషకులు
మత వైరుధ్యాలను ముందుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
ఏ మతాన్నీ మరో మతానికి వ్యతిరేకంగా రాజకీయ ఆయుధంగా
ఉపయోగించకూడదు అనేది నా ప్రగాఢ నమ్మకం. మతం పేరుతో ప్రజల్లో భయం, ద్వేషం, అనుమానం,
శత్రుత్వాలను సృష్టించడం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధం. మతం మనుషులను విభజించడానికి
కాకుండా మనుషుల్ని కలపడానికి వారధిగా ఉండాలి.
మతాల మధ్య ఐక్యతకు సంబంధించిన అంశాలూ ఉంటాయి; ఘర్షణకు
దారితీసే అంశాలూ ఉంటాయి. తీవ్ర ఘర్షణకు దారితీసే అంశాలను పూర్తిగా పక్కన పెట్టాలి.
తక్కువ ఘర్షణగల అంశాలను సంస్కరించుకోవాలి. ఐక్యతకు దోహదపడే అంశాలను గుర్తించి,
వాటిని మరింత పెంపొందించుకోవాలి. ఇదొక్కటే మత సామరస్యానికి ఆచరణాత్మక మార్గం.
మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని విభజించే రాజకీయాలను తీవ్రంగా
వ్యతిరేకించాలి. ప్రత్యేకంగా RSS, VHP, బజరంగ్దళ్ వంటి సంస్థల విభజనాత్మక, విద్వేషపూరిత
రాజకీయ విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను.
ఆ సంస్థల భావజాలానికి రాజకీయ ప్రతినిధిగా వుంటున్న BJP అనుసరించే
విధానాలు, భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం, మత సామరస్యం, మైనారిటీల హక్కులకు
విరుద్ధంగా ఉంటున్నాయన్నది నా అవగాహన. వాటిని బాహాటంగా విమర్శిస్తాను. విమర్శించాలి
కూడ.
అదే విధంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి BJP
నాయకుల విధానాలను, నిర్ణయాలను కూడా నేను విమర్శనాత్మకంగా పరిశీలిస్తాను.
నా విమర్శ వారి వ్యక్తిగత మత విశ్వాసాలపై కాదు. వారి రాజకీయ
ఆలోచనలు, సామాజిక విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా జీవితంపై వాటి ప్రభావం —
ఇవే వారిపై నా విమర్శకు ప్రధాన కారణాలు.
అదే సమయంలో, పైకి కనిపించే రాజకీయ–సాంస్కృతిక దృశ్యం వెనుక
ఉన్న ఆర్థిక ప్రయోజనాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వానికి
సన్నిహితంగా ఉండే కొన్ని కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలు కూడా ఈ విద్వేష రాజకీయ–సాంస్కృతిక పరిణామాల వెనుక
పనిచేస్తున్నాయి. రాజకీయ అధికారాన్ని, ఆర్థిక అధికారాన్ని, భావజాల ఆధిపత్యాన్ని
విడివిడిగా చూడలేం.
నా
ఆలోచనా ప్రపంచం
నా సామాజిక, రాజకీయ ఆలోచనలపై కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్
ఎంగెల్స్, వి.ఐ. లెనిన్, ఆంటోనియో గ్రాంసీల ప్రభావం వుంది. ముఖ్యంగా, వర్గం, అధికారం,
అణచివేత, దోపిడీ, భావజాలం, ఆర్థిక వ్యవస్థ–రాజకీయ వ్యవస్థల మధ్య సంబంధం వంటి
అంశాలను అర్థం చేసుకోవడంలో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ల ఆలోచనలు మనకు ఉపయోగపడతాయి.
అలాగే, అధికారం కేవలం ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా ప్రజల ఆలోచనల్లో, సామాజిక
విలువల్లో, చివరకు ‘సాధారణ జ్ఞానం’గా ఎలా మారుతుందో అర్థం చేసుకోవడంలో గ్రాంసీ
ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయి.
అయితే, వీరెవరినీ
నేను గుడ్డిగా అనుసరించను. ఏ సిద్ధాంతాన్నైనా సరే భారతదేశ వాస్తవ పరిస్థితులకు
అన్వయించి, విమర్శనాత్మకంగా పరిశీలించాలి. సమాజం అనుక్షణం మారుతూ ఉంటుంది. ఇది
తిరుగులేని సత్యం. అందుకే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించే పనిముట్లు
కూడా నిరంతరం మారుతూ ఉండాలి.
Objective Conditions ను అర్థం చేసుకోలేనివారు ఎంతటి Subjective
Efforts పెట్టినా ఆశించిన ఫలితాలు ఎప్పటికీ రావు.
నేను ప్రతిక్షణం ఒక సామ్యవాద సమాజం కోసం కలలు కంటూ ఉంటాను. తెలిసో
తెలియకో ఆ కలలను చిదిమేసే వారిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను.
కాంగ్రెస్పై
నా వైఖరి
నా రాజకీయ వైఖరిలో మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సిన
అవసరం వుంది. నేను భారత జాతీయ కాంగ్రెస్కు సిద్ధాంతపరమైన మద్దతుదారుడిని ఏమీ కాదు.
అయితే రాజకీయాలు కేవలం సిద్ధాంతాలతోనే నడవవు. కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యూహం
కూడా అవసరం. ప్రత్యేకించి RSS–BJP ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవాల్సిన ప్రస్తుత
పరిస్థితుల్లో అలాంటి వ్యూహాలు మరీ అవసరం. RSS సిద్ధాంతాన్ని వ్యతిరేకించే, BJP
రాజకీయాలను ప్రతిఘటించే వ్యక్తి, పార్టీ, సంస్థ, కూటమి ఏదైనా సరే అవసరమైనప్పుడు వాటికి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధం. ఈ విషయంలో నా వైఖరి చాలా స్పష్టం.
ప్రస్తుతం అధికారంలో ఉన్న NDA కూటమిని ఎదుర్కోవడానికి మరో
బలమైన రాజకీయ కూటమి అవసరం. ప్రస్తుత విపక్షాల్లో కాంగ్రెస్ పార్టీనే అత్యంత బలమైన
రాజకీయ శక్తి అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ లేకుండా
NDAను ఓడించే స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించడం చాలా కష్టం అని
నేను భావిస్తున్నాను. అందుకే ప్రస్తుత చారిత్రక సందర్భంలో రాహుల్ గాంధీకి,
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వ్యూహాత్మకంగా అనివార్యమనిపిస్తోంది. అంత
మాత్రాన నేను కాంగ్రెస్కు శాశ్వత రాజకీయ విధేయుడిని అవుతానని కాదు. రాజకీయ
వాస్తవాలు మారితే నా వైఖరి కూడా మారవచ్చు. వ్యూహాత్మక మద్దతు వేరు — సిద్ధాంతపరమైన
మద్దతు వేరు.
నా
జర్నలిజం
నేను జర్నలిస్టును. ఏ రాజకీయ పార్టీకి ప్రతినిధిని కాదు.
ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రధాన స్రవంతి
మీడియాలో స్వతంత్ర జర్నలిజానికి స్థలం క్రమంగా తగ్గిపోతోంది. స్వతంత్ర మీడియా
సంస్థలు లేకపోలేదు. కానీ అవి ప్రస్తుతం ప్రధాన స్రవంతిని అధిగమించే స్థాయిలో లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర జర్నలిజం అవసరం మరింత పెరుగుతుంది.
నేను ఏ పార్టీకి, ఏ రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చినా,
అవసరమైనప్పుడు ఆ పార్టీని కూడా ప్రశ్నించే, విమర్శించే హక్కును నేను ఎప్పటికీ
వదులుకోను.
నా జర్నలిజానికి నేను పెట్టుకున్న మార్గదర్శక సూత్రం: “News
is sacred, views are free.” “వార్త పవిత్రమైనది — అభిప్రాయాలు స్వేచ్ఛాయుతమైనవి.”
వాస్తవం వాస్తవంగానే ఉండాలి. అభిప్రాయాన్ని అభిప్రాయంగానే చెప్పాలి. వార్తను,
వ్యాఖ్యానాన్ని కలిపివేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు. అధికారంలో ఎవరున్నా, అధికారాన్ని
ప్రశ్నించడం జర్నలిస్టు బాధ్యత. ఏ సంస్థనైనా, ఏ నాయకుడినైనా విమర్శించేటప్పుడు వాస్తవాలు,
ఆధారాలు, చరిత్ర, తర్కం ఆధారంగా మాట్లాడటం జర్నలిస్టుగా నా బాధ్యత. అదే నా
నిబద్ధత.
నా చివరి మాట
నా రాజకీయ, సామాజిక ఆలోచనలకు ప్రాథమిక ఆధారం ఒక్కటే. భారతదేశం
ప్రతి భారతీయుడిదీ. మతం, కులం, భాష, ప్రాంతం, లింగం లేదా సామాజిక నేపథ్యం ఏదైనా —
ప్రతి పౌరుడికీ సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన పౌరసత్వం ఉండాలి.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు,
జైనులు, నాస్తికులు — ఏ మతానికి చెందిన వారైనా, ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నా —
అందరూ సమాన గౌరవంతో, స్వేచ్ఛతో జీవించగల భారతదేశాన్ని మనం నిర్మించాలి.
మత ద్వేషాన్ని, మెజారిటీ ఆధిపత్యాన్ని, సామాజిక విభజన
రాజకీయాలను నేను వ్యతిరేకిస్తాను.
వాస్తవాలు మారితే నా రాజకీయ అంచనాలు కూడా మారవచ్చు. ఒక
సందర్భంలో ఒక రాజకీయ శక్తికి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వవచ్చు. మరో సందర్భంలో అదే
శక్తిని విమర్శించనూవచ్చు. ఎందుకంటే —
ఏ రాజకీయ పార్టీకీ సభ్యుడ్ని
కాదు. విధేయుడిని అస్సలు కాదు. నా విధేయత భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి,
సామాజిక న్యాయానికి, మత సామరస్యానికి, భారత ప్రజలకు. అంతే!
(స్వతంత్ర భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా — ఇది నా
ప్రకటన).
Tuesday, 11 August 2026
ప్రభుత్వం పారదర్శకంగా వుండాల్సిన పనిలేదా?
Transparency
ప్రభుత్వం పారదర్శకంగా వుండాల్సిన పనిలేదా?
డానీ
సమాజ విశ్లేషకులు
కొంతకాలంగా మనదేశంలో ప్రజాస్వామ్యానికీ
, పాలక స్వామ్యానికీ తేడాలేకుండా పోయింది. ప్రభుత్వం ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాలనేదే
ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి విలువ. దాన్ని తలకిందులు చేస్తూ ప్రజలు ప్రభుత్వానికి బాధ్యతగా
వుండాలని దబాయిస్తున్నారు. చాలామంది ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఒళ్ళో మీడియా (దీనినే హిందీలో గోదీ మీడియా అంటున్నారు) రేయింక్బవళ్ళు
ఈ తప్పుడు విలువనే ప్రచారం చేస్తున్నది.
రాజధాని నగరం జంతర్ మంతర్ దగ్గర
తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలని విద్యార్ధిలోకం నిరసనలకు దిగింది. నీట్
పేపర్లు లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం వారి ఆక్రోశానికి ప్రధాన కారణం. వారిలో నష్టపోయిన
బాధవుంది. దెబ్బతిన్న గాయం వుంది. ప్రభుత్వ
అసమర్ధత మీద అసహనం వుంది. ముందే కొందరు విద్యార్ధులు చనిపోయారు. అడగడానికి వచ్చిన వారిలోనూ
కొందర్ని పోలీసులు పొట్టనపెట్టుకున్నారు. క్రూరంగా లాఠీచార్జి చేశారు. దాన్ని లాఠీ
చార్జి అని సరళంగా అనడమూ తప్పే. లాఠీల్లో ఇనుప మేకులు దించి వాటితో విద్యార్ధుల మీద
డాడి చేశారు. తుపాకులతో పిల్లెట్లు పేల్చారు. విద్యార్ధినులతో వ్యవహరించిన తీరైతే సభ్యసమాజం
తలలు వంచుకోవాల్సిందే. ఒక్క మాటలో జలియన్ వాలా బాగ్ నరమేధాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్
వలస పాలకులు కూడా జలియన్ వాలా బాగ్ కాల్పులకు ఆదేశాలిచ్చిన డయ్యర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ కేసును
విచారించడానికి ఏర్పడిన లార్డ్ హంటర్ కమీషన్ డయ్యర్ చర్యల్ని మాహాపరాధంగా పేర్కొంది.
డయ్యర్ బ్రిగేడ్ కమాండర్ పదవి నుండితప్పించారు. జీతం తగ్గించారు. అతన్ని ఒక విధంగా
పదవీ విరమణ చేయించారు.
వలస పాలనలోనే అన్ని రకాల క్రమశిక్షణ
చర్యలు తీసుకుంటే స్వతంత్ర ప్రజాస్వామ్య భారత దేశంలో విద్యార్ధుల మీద అంతటి క్రౌర్యాన్ని ప్రదర్శించిన
ఢిల్లీ పోలీసుల మీద ఎంతటి తీవ్ర చర్యలు తీసుకోవాలీ? వీడియోలకు దొరికిపోయిన ఒకరిద్దర్ని
సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఢిల్లీ రాజధాని పోలీసులు నేరుగా కేంద్ర
హోంశాఖ ఆధీనంలో పని చేస్తారు. నీట్ ప్రశ్నాపత్డాల లీకేజికి నైతిక బాధ్యులు ధర్మేంద్ర
ప్రధాన్ అయితే, ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలకు నైతిక బాధ్యత దేశ హోంమంత్రి అమిత్ షాదే
అవుతుంది. ఆ విషయం అమిత్ షాకు తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీజీకీ తెలుసు. వాళ్లు పార్లమెంటు
సమావేశాలకు రావడం మానేశారు. పార్లమెంటు భవనానికి
వస్తున్నారు, తమ ఛాంబర్లలో వుంటున్నారు. కానీ, సభలకు రావడంలేదు. దేశ రాజకీయాల్లో అరవీర
భయంకరుడు అని పేరుగాంచిన అమిత్ షా ఇప్పుడు భయపడుతున్నారు. ఇన్నాళ్ళూ అందర్నీ భయపెట్టిన
అమిత్ షా ఇప్పుడు తానే భయం రుచి చూస్తున్నారు.
ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తున్నది. సమావేశాల్లో ప్రతి రోజూ ప్రతి నిముషం సభలో ప్రధాని,
హోంమంత్రి వుండితీరాలనే నియమం ఏమీలేదు. ప్రతి ప్రశ్నకూ వాళ్ళే సమాధానం ఇవ్వాలనే నియమమూ
లేదు. అవన్నీ నిజమే. ఢిల్లీ పోలీసుల రాక్షస ప్రవర్తనకు హోం మంత్రికాకుండా ఇంకెవరు సమాధానం
చెప్పాలీ?
తమ వైఫల్యాలు బయటపడ్డప్పుడు మౌనంగా
వుండిపోవడం మోదీజీగారి నైజం. మణిపూర్ మండిపోతున్నపుడు వారు మాట్లాడలేదు. మహిళా రెజ్లర్లు
తమమీద లైంగిక దాడి జరిగిందని నిరసనలకు దిగినప్పుడూ వారు మాట్లాడలేదు. ఇలా అనేక సందర్భలున్నాయి.
నిజానికి నీట్ పేపర్ల లీక్ మీద కూడ వారు మాట్లాడలేదు. దాన్ని తట్టుకోలేక కొందరు విద్యార్ధులు
ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ వారు మాట్లాడలేదు.
చాలా సీరియస్ విషయాలను అర్ధరాత్రి
రీల్స్ చేసి పెట్టడం మోదీజీకి చిత్రమైన అలవాటు.
ఆ రీల్స్ లో వారు జంతర్ మంతర్ లో విద్యార్ధులు దారి తప్పారని చెప్పి బాధపడ్డారు. వారిలో
కొందరు బూతులు వాడారనీ ఆవేదన చెందారు. పెద్ద మనసు చేసుకుని వాళ్లను క్షమించేస్తున్నట్టు
ప్రకటించారు. ఆ రీల్స్ ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అర్ధం అయింది. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు
ప్రధాని తమ పిల్లల్ని క్షమించడం ఏమిటో అర్ధం కాలేదు. బూతుల వ్యవహారమూ అంతే. నిరసన ప్రదర్శనల్లో
ఎంత కోపం వచ్చినా బూతులు వాడడం మంచిది కాదు. కానీ ఆ పిల్లలు ఆ బూతుల్ని అధికార పార్టీ
పెద్దల నుండే నేర్చుకున్నారంటే అతిశయోక్తికాదు. “కాంగ్రెస్ కి విధవా”, “పచాస్ కరోడ్ కి గర్ల్ ఫ్రెండ్”, “విపక్షాల మేజువాణి”
వంటి పదాలను వారే జాతిజనుల చెవుల్లో ఊదారు.
పౌరుడు
పారదర్శకంగా ఉండాలి… ప్రభుత్వం ఎందుకు కాదు? ప్రజాస్వామ్యంలో
మనిషి డేటాగా మారుతున్నప్పుడు,
అధికారానికి కూడా పారదర్శకత అవసరం కాదా? ఒకప్పుడు ప్రభుత్వం పౌరుడి ఇంటి తలుపు తట్టి అడిగేది—
“మీ పేరు ఏమిటి?”
“కుటుంబంలో ఎంతమంది?”
“ఏం పని చేస్తున్నారు?”
“ఎంత ఆదాయం?”
ఇప్పుడు ప్రభుత్వం అడగకుండానే మన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే స్థితికి వచ్చింది.
మన
పేరు, మన చిరునామా., మన మొబైల్ నంబర్., మన బ్యాంక్ ఖాతా , మన బయోమెట్రిక్ గుర్తింపు, మనకు అందుతున్న ప్రభుత్వ
పథకాలు, మన ప్రయాణాలు, మన డిజిటల్ లావాదేవీలు అన్నీ ప్రభుత్వానికి తెలుసు. కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో
ఏం జరుగుతున్నదో ప్రభుత్వానికి తెలీదు. ప్రశ్నాపత్రాల
లీకులు జరిగినప్పుడేకాదు, జరిగిందని అందరికి తెలిశాక కూడ ప్రభుత్వానికి దానితో ఎలా
డీల్ చేయాలో కూడ తెలీదు. ఇదొక విచిత్ర స్థితి.
డిజిటల్ యుగంలో పౌరుడు కేవలం ఒక మనిషి కాదు. ఒక డేటా పాయింట్ కూడా. ఇది ఆధునిక పరిపాలనకు అవసరమైన పరిణామమే కావచ్చు. .
ప్రభుత్వం ప్రజల అవసరాలను తెలుసుకోవాలంటే
డేటా కావాలి. సంక్షేమ పథకాలు సరిగ్గా చేరాలంటే సమాచారం కావాలి. జనగణన, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పేదరికం—ఏ విధానాన్ని రూపొందించాలన్నా
నమ్మదగిన గణాంకాలు అవసరం.
కానీ
ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వానికి పౌరుడి గురించి ఇంత సమాచారం అవసరమైతే; పౌరుడికి
ప్రభుత్వం గురించి ఎంత సమాచారం ఉండాలి? ఇదే ఈ కాలపు అసలు ప్రజాస్వామ్య ప్రశ్న.
ఎప్పుడువరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో
కూడా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. పౌరుడు ఇప్పుడు
open book. మరి ప్రభుత్వం ఎందుకు
రహాస్య పుస్తకంగా వుంటోంది ?
పౌరుడిని ప్రభుత్వం పారదర్శకంగా ఉండమంటుంది. నీ ఆదాయం చెప్పు. నీ ఆస్తి చెప్పు. నీ చిరునామా చెప్పు. నీ గుర్తింపు నిరూపించు. నీ కుటుంబ వివరాలు ఇవ్వు. నీ బ్యాంక్ ఖాతా ఇవ్వు. అవసరమైతే నీ సామాజిక, ఆర్థిక స్థితి కూడా చెప్పు. పౌరుడు అన్నీ చెబుతాడు. కానీ ఒకరోజు అదే పౌరుడు ప్రభుత్వాన్ని అడుగుతాడు: “నా డేటా ఎక్కడుంది?” “ఎవరు చూస్తున్నారు?”“ఎందుకు చూస్తున్నారు?” “ఎంతకాలం ఉంచుతారు?” “ఎవరితో పంచుకుంటారు?” “తప్పు సమాచారం ఉంటే దాన్ని ఎలా సరిచేసుకోవాలి?” ఇక్కడ సమాధానం స్పష్టంగా, సులభంగా, పౌరుడికి అర్థమయ్యే భాషలో ఉండాలి.
ఎందుకంటే Privacy అంటే
దొంగచాటు వ్య్వహారంకాదు. Privacy
అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామిక హక్కు. తప్పు చేయని మనిషికి కూడా గోప్యత అవసరమే. మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మనం నిజంగా offline అవుతామా? ఇక్కడే డిజిటల్ యుగం మనకు మరో విచిత్రమైన ప్రశ్నను ఎదురుపెడుతోంది. మనం ప్రైవసీ కోసం మొబైల్ ఫోన్ను switch off చేస్తాం. అంటే అది పూర్తిగా చనిపోయిందని అనుకుంటాం. అది నిజం కాదు. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాక కూడ తెలుసుకోవాలనుకున్న
వారికి మన గురించి అన్నీ తెలిసే అవకాశాలు వున్నాయి.
“బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్” అన్నాడు జార్జ్ ఆర్వెల్. నిజానికి 1950ల ఆరంభం నాటికి
ప్రపంచంలో సమాచార విప్లవం సంభవించలేదు. ఇప్పుడు అన్నీ సాధ్యమే. సమాచారం ప్రజల నుండి
ప్రభుత్వానికి వెళుతున్నదిగానీ, ప్రభుత్వం నుండి ప్రజలకు రావడంలేదు. అధికారంలోవున్న
ఎన్డీ కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి బ్యాంకు నిల్వ పది వేల కోట్ల రూపాయలని విపక్షాలు
ఆరోపిస్తున్న కాలం ఇది. బీఫ్ ఎగుమతిదారుల నుండి బిజెపి భారీగా పార్టీ ఫండ్ అందుకుందని చట్టసభల్లోనే విమర్శలు వస్తున్నాయి.
మన
మొబైల్ ఫోన్ ఎప్పుడు నిజంగా మనది కాదు. అది మన మీద ప్రభుత్వం నియమించిన వేగులు కూడా కావచ్చు.
కానీ, ప్రజలు ప్రభుత్వ విధానాలనూ నిర్ణయాలను తెలుసుకోవడం ఎలా? ప్రధాని ఎవరి లబ్దికోసం
ఏ దేశానికి వెళుతున్నారూ ప్రజలు తెలుసుకునే హక్కు వుందా? లేదా? ఎలా తెలుసుకోవాలీ? ఆ
సౌకర్యం వుందా? లేకపోతే దాన్ని ఎలా పొందాలీ?
ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారా?
ప్రజలు తమను ఎన్నుకునేలా చేసే టెక్నాలజీని ప్రభుత్వం సమకూర్చుకుందా? ఈ ఒన్ వే ట్రాఫిక్కును
టూ-వే గా మార్చే మార్గాలేమిటీ? ప్రజాస్వామ్యం అంటే రెండు వైపులా నడిచే సమాచార
మార్గం. పౌరుడి నుంచి ప్రభుత్వానికి సమాచారం వెళ్లాలి. ప్రభుత్వం నుంచి పౌరుడికి జవాబు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం
బతికినట్టవుతుంది.
11-08-2026
Wednesday, 29 July 2026
Dharmendra Pradhan & Amit Shah
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
అమిత్ షా మెడకు చుట్టుకోనున్నదా?
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
ఈ దశాబ్దపు ఒక అద్భుతంగా బొద్దింకలు ప్రధాని మోదీ మెడను వంచి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాయి. ఈ ఘనత కాక్రోచ్ జనతాపార్టి నేత అభిజిత్ దీప్కే, ఆ పార్టి ప్రతినిధులు, సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రంకాలకు ప్రధానంగా ఎలాగూ దక్కుతుంది. పిల్లల ఉద్యమానికి పెద్దరికాన్ని సమకూర్చిన సోనమ్ వాంగ్చూక్ కూ ఈ ఘనత దక్కుతుంది. వాళ్ళతో కలిసి అద్భుతంగా పోరాడిన ఏఐఎస్ ఏ విద్యార్ధి సంఘం నాయకులు నేహా బోరా, ఆమీన్ అమితోజ్, మనీష్ కుమార్ లకు కూడ ఈ ఘనత దక్కుతుంది. ఏఐఎస్ ఏ ఎలాగూ మార్క్సిస్టు లెనిస్టు భావాలుగల సంస్థ. దానితోపాటూ వామపక్ష విద్యార్ధి సంఘాలు కూడ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించాయి. ఒక వాదం ప్రకారం ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం లేని సిజేపికి ఆ కొరతను కమ్యూనిస్టు విద్యార్ధులే తీర్చారు. ఈ ఉద్యమం లోనికి పేరెంట్స్ కూడ పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇది రెండు తరాల ఉద్యమంగా మారి విజయావకాశాలు బాగా పెరిగాయి. ఢిల్లీ ఎండల్లో నిరసనకారులకు తాగడానికి నీళ్ల బాటిళ్ళు, తినడానికి ఆహారాన్ని పంపించిన అజ్ఞాతదాతలు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు.
ఈ జాబితా చాలా పెద్దది. కానీ, తప్పని సరిగా పేర్కోవాల్సిన పేరు భారత ప్రధాన న్యాయ మూర్తి సూర్యకాంత్ గారిది. ముందు వారు కాక్రోచెస్ అని విసుక్కోవడంతో బొద్దింకల ఆత్మగౌరవ ఉద్యమం మొదలయింది. సోనమ్ వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించాక ఉద్యమం ముగిసిపోతుందేమోననీ ఆందోళన చెందుతున్న సమయంలో, మళ్ళీ వారే లాఠీచార్జీ వీడియోలను చూసే సమయం తనకు లేదంటూ ప్రకటించి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి గొప్పగా దోహదపడ్డారు. ఈ ఉద్యమం మొదలు కావడానికీ, విజయవంతం కావడానికీ వారే కారణం. ఈ అంశం అభిజిత్ కు కూడ తెలుసు. ఉద్యమ ముగింపు సందేశంలో ఆయన ‘మిత్రులతోపాటూ శత్రువులకు’ కూడ ధన్యవాదాలు తెలిపారు.
గత పుష్కర కాలంగా ప్రజలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయాన్ని తరచుగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకోగానీ, ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్వర్, దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ లను కూడ తరచూ గుర్తు చేసుకుంటున్నారు. మంచిగా కాదు.
ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఒక లెఖ్ఖ ప్రకారం ఆయన రాజీనామాతో నీట్ విద్యార్ధుల ఉద్యమం ముగిసినట్టే. ఇంకో లెఖ్ఖపరకారం ధర్మేంద్ర రాజీనామా కొత్త ఉద్యమానికి బీజాలు వేసింది. మరోమాటల్లో చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు అమిత్ షా మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి.
రాజీనామా చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకున్న కారణాలు ఏమైనా కావచ్చు. నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకూ, ఆ కారణంగా అనేక మంది విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైనందుకూ, లక్షల మంది విద్యార్ఢుల ఆత్మక్షోభకూ, వారి కుటుంబ సభ్యుల ఆవేదనకూ మూలమైనందుకూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో విద్యార్ధులు బాధితులు ప్రభుత్వం బాధ్యురాలు.
ఇక్కడే ఒక న్యాయపరమైన చిక్కు వచ్చిపడింది. విద్యార్ధులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుని సంబంధిత మంత్రిని పదవి నుండి తప్పిస్తే, ఆ విద్యార్ధుల మీద లాఠీ చార్జీ చేసిన పోలీసులు, చేయించిన హోంమంత్రి గురించి న్యాయశాస్త్రంలోవున్న నిర్వచనం ఏమిటీ? ఇది ఇప్పటి ప్రశ్న.
ఆన్యాయానికి గురైన విద్యార్ధులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ఒక ప్రజాస్వామిక హక్కు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోవడం ప్రభుత్వం చేసిన తప్పు. తప్పుచేసిన ప్రభుత్వం బాధితులయిన విద్యార్ధుల మీద లాఠీచార్జీ చేయడం మరో నేరం.
అది సాధారణ లాఠీ చార్జీకాదు. పోలీసులు నిరసనకారుల మీద సాక్షాత్తు యుధ్ధం చేశారు. లాఠీలకు మేకులు గుచ్చారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఆ ఆదేశాలు హోంశాఖ నుండే వచ్చివుండాలి. పురుష పోలీసులు మహిళల మీడ లాఠీ చేయడమే ఒక నేరం అయితే. కొందరు పోలీసులు వారితో వీడియోల సాక్షిగా చాలా అసభ్యంగా వ్యవహరించారు. అది కూడ నేరమే. యూనిఫాం ధరించిన పోలీసులతోపాటూ సాదా దుస్తులలో ఉన్న వ్యక్తులు సహితం విద్యార్థుల మీద విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్నీ ప్రైవేటు సంస్థలకు అప్పచెపుతున్న మోదీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థనూ ప్రేవేటు సంస్థకు అప్పచెప్పారా? లేక ఇది ప్రభుత్వ ప్రాయోజిత గూండాయిజమా? అనే అనుమానాలు చెలరేగేలా వున్నాయి వీడియో ఫుటేజులు. పోలీసు వున్నతాధికారులు సహితం చెలరేగిపోయారు. మహిళల్ని టార్గెట్ చేసుకుని క్రూరంగా కొట్టారు.
అభిజిత్ దీప్కే ఒక దళీతుడు, సోనమ్ వాగ్చుక్ ఆదివాసీ. పదిమందికి ఉపయోగపడే ఒక మంచి డిమాండ్తో ముందుకు వస్తే చాలు. అతని సామాజికవర్గం ఏమిటీ? అని ప్రశ్నించకుండానే సమాజం అతని వెంట నడుస్తుంది. ఇదే ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన కొత్త రాజకీయ నేరేటివ్. అంతేకాదు ఒక వాగాడంబరుడిని ఎదుర్కోవడానికి ఒక గొప్ప వక్త కావాల్సిన అవసరం లేదని కూడ ఈ ఉద్యమం నిరూపించింది.
మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్ గా యువ తరంగం మొదలయింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో జెన్ –జీగా, మన దేశంలో కాక్రోచెస్ రూపం తీసుకుంది. పేరేదైతేనేం ఇది కొత్తతరం; అందులోనూ విద్యార్ఢులు. చదువుకున్న తరం విద్యాగంధం లేనివాళ్ళను దేశాధినేతలుగానో, ప్రభుత్వాధి నేతలుగానో భరించదు.
దేశప్రజల్ని హిందూ-ముస్లింగా చీల్చి సులువుగా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సంఘపరివారం గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ప్రభుత్వ వైఫల్యాలని ఎవరు ప్రశ్నించినా ముస్లింలు, జిహాదీలూ, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టోపీవాలాలు, మియాలు, ఖలిస్తానీలు, చైనా ప్రేరేపితులు, జార్జ్ సోరస్ పేటీంలు (కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా అమెరికా - సిఐఏ / రష్యా ఏజెంట్లు కూడ) అని నిందించడం పరిపాటి అయిపోయింది. ఈ నిందలకు భయపడి అనేక ఉద్యమాలు చాలా సందర్భాల్లో వెనుకంజ వేశాయి. బొద్దింకల ఉద్యమం ఈ నిందలకు భయడలేదు. మూతి పగిలేలా సమాధానం ఇచ్చింది. నిందలన్నింటినీ కట్టకట్టి దేశ రాజధాని నగర మురుగు కాలువల్లో పడేసింది. ఈ పరిణామాలన్నీ ఇంత వేగంగా జరిగిపోతాయని ఎవరూ ఊహించి వుండరు.
కథ ఇక్కడితో ముగియలేదు. మరికొన్ని డిమాండ్లతో ప్రజలు ఎలాగూ ముందుకు వస్తారు. అలావస్తే ఈసారి వాళ్ళ మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తాం అనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఇండియా గాబట్టి విధ్యార్ధుల మీద లాఠీచార్జి మాత్రమే జరిపి వదిలేశారు. విదేశాల్లో అయితే ఫైరింగ్ జరిపేవారని బిజెపి చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈసారి భారత ప్రధాన న్యాయమూర్తి కొంచెం సమయం కేటాయించి. నిరసన చేస్తున్న విద్యార్ధుల మీద లాఠీచార్జీని “సమర్ధించలేం” అన్నారు. అప్పటికే సమయం మించిపోయింది. ఇండియాను విదేశంగా మార్చాలనే ఉత్సాహంతో ఊగిపోతున్న బీహార్ పోలీసులు ఆరోజే విద్యార్ధుల మీద ఏకంగా ఏకే 47తో కాల్పులు జరిపారు. ఇది హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాల్సిన వ్యవహారం.
దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోకుండా ఉండాలనీ, దేశఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే తనూ రాజీనామా ఇస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన కూడ అమిత్ షా మెడకు చుట్టుకునేదే. దేశవ్యతిరేక శక్తులు ఏకంగా దేశ రాజధాని నగరంలో లక్షల సంఖ్యలో నిరసనకు దిగారంటే ఇంతటి భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరూ? దానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి కదా?
సిజేపి భవిష్యత్తు కార్యక్రమం ఏమిటీ? అనే ప్రశ్న ఈ సందర్భంగా సహజఙానే వస్తుంది. అదేమోగానీ, విద్యార్ధుల ఉద్యమం ఇచ్చిన ఉత్తేజంతో సమీప భవిష్యత్తులో అనేక ఉద్యమాలు తలెట్టుతాయి. అమెరికా ట్రేడ్/ఆగ్రీ డీల్ కు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని చేప్పట్టాలని సంయుక్త్ కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ అప్పుడే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు దిగుమతుల్ని తగ్గించాలనే సాకుతో వాహనాల్లో ఎథనాల్ వాడకాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల మీద కూడ ప్రజల్లో తీవ్ర అసహనం వుంది.
పౌరసత్వ చట్టం మీద షాహీన్ బాగ్ నిరసన, నల్లచట్టాల మీద రైతుల నిరసన, లైంగిన వేధింపుల మీద మహిళా రెజ్లర్ల నిరసన అన్నీ విజయాలు సాధించకుండానే ముగిసిపోయాయి అనుకున్నాము. అవన్నీ కలిసి విద్యార్ధుల ఉద్యమంగా విజృంభిస్తాయని ఒక్కరూ ఊహించి వుండక్లపోవచ్చు. ఓడిపోయింది ఓడిపోయినట్టుకాదు; గెలిచింది గెలిచినట్టూ కాదు. ఈ తత్వం ు తెలియాలంటే ఓపిగ్గా కొన్నాళ్లు ఎదురుచూడాలి.
దశాబ్దాల తరబడి సమాజంలో ఏ కదలికా కనిపించని కాలాలు ఉంటాయి. అదే సమయంలో, దశాబ్దాల పరిణామం కొన్ని వారాల్లోనే సంభవించే సందర్భాలూ ఉంటాయి. చరిత్ర నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా వాయు వేగంతో పరుగెత్తడం మొదలుపెడుతుంది. ఈ మాటల్ని లెనిన్ అన్నట్టున్నాడు. ఇప్పుడు మనం అలాంటి ఒక దశను చూస్తున్నామేమో.
26 జులై 2026 – telugu prabha


