Monday, 6 April 2026

అంబేడ్కరిజంలో మితవాదులు, విప్లవవాదులు

 

కాలధార

అంబేడ్కరిజంలో  మితవాదులు, విప్లవవాదులు

-      డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు




కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ సమాజంలో అంబేడ్కరిజం మరొక్కసారి చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటి చైర్మన్ గా బిఆర్ అంబేడ్కర్ మనందరికీ తెలుసు. భారత సమాజ పరిణామం మీద అంబేడ్కర్ ప్రభావం రాజ్యాంగంకన్నా ఎక్కువ.  ఆయన వారసులు ఇప్పుడు మితవాదులు, విప్లవాదులు అంటూ రెండు రకాలుగా చీలిపోయారు.

కులం సాంస్కృతిక రంగానికి మాత్రమే పరిమితమై లేదనీ; అది ఆర్ధిక రంగంలో పీడక సాధనంగా స్థిర పడిందనేది స్థూలంగా అంబేడ్కర్ సిధ్ధాంతం. కార్ల్ మార్క్స్ వర్గనిర్మూలన కార్యక్రమాన్ని ప్రతిపాదించినట్టు అంబేడ్కర్ కులనిర్మూలన కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాడు. ఇవి పైకి పరస్పర విరుధ్ధంగా కనిపిస్తున్నప్పటికీ ‘సమానత్వం’ అనే విలువల ప్రాతిపదికగా వీటి నిర్మాణం జరిగిందని సులువుగానే అర్ధం అవుతుంది. అది వాటి మధ్య ఐక్యత. ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఒక బాధ్యతగా అటు కమ్యూనిస్టు ఆలోచనాపరులుగానీ ఇటు అంబేడ్కరిస్టు ఆలోచనాపరులుగానీ ఎన్నడూ స్వీకరించలేదు.  దీనినొక తాత్విక ఘర్షణ అంశంగానే రెండు శిబిరాలు కొనసాగిస్తున్నాయి.

 

చరిత్ర చాలా కటువైనది. ఇబ్బందికర ప్రశ్నలు వేసి ప్రశ్నలు వేసి ఆలోచనాపరుల్ని మెడపట్టి నిలదీస్తూ వుంటుంది. అలాంటి సందర్భం 1964లో ఒకసారి కీలవేన్మణీలో వచ్చింది.

హరిత విప్లవం తరువాత వ్యవసాయోత్పత్తుల దిగుబడి భారీగా పెరిగినప్పటికీ తమిళనాడులో వ్యవసాయ కూలీ రేటు పెరగలేదు. సిపిఎం నాయకత్వంలో కూలీ రేటు పెంపు కోసం పోరాడుతున్న వ్యవసాయ కూలీలు 44 మందిని కీలవేన్మణీలో భూస్వాములు క్రూరంగా చంపేశారు. గోపాల కృష్ణన్ నాయుడు అనే స్థానిక భూస్వామి ఈదాడికి నాయకత్వం వహించాడు. దాడిలో చనిపోయినవారు దళితులు.

కీలవేన్మణి సంఘటనలో నాలుగు నేరేటివ్స్ వున్నాయి. మొదటిది; వ్యవసాయకూలీల్ని భూస్వాములు చంపారు. రెండు; దళితుల్ని భూస్వాములు చంపారు. మూడు దళితుల్ని నాయుళ్ళు చంపారు.  నాలుగు; దళితులైన వ్యవసాయకూలీల్ని భూస్వాములైన నాయుళ్ళు చంపారు.

కమ్యూనిస్టు పార్టీలు మొదటి నేరేటివ్ వరకే ఏకాభిప్రాయంతో వుంటాయి.  మిగిలిన నేరేటివ్స్ తో బేధాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాయి. అయితే, సామాజిక ఆలోచనాపరులు వీటికి సమాధానాలు, పరిష్కారాలు వెతికే పనిలో ఎలాగూ వుంటారు.

1984లో ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల ఊచకోత తరువాత మన దేశంలో మత అంశం కూడ ఎజెండా లోనికి చర్చకు వచ్చింది. కులం విషయంలో సాగినట్టే మతం విషయంలోనూ మేధోరంగంలో డొల్లతనం కొనసాగింది.

1990వ దశకం ప్రపంచాన్నే పునర్ వ్యవస్థీకరించిందని మనకు తెలుసు. కులం, మతంతో పాటు తెగ, లింగం, భాషా, ప్రాంతం తదితర అంశాలు కూడ పునర్ నిర్వచనాన్ని కోరుకున్నాయి. అప్పటి వరకు కమ్యూనిస్టు శిబిరాల్లో వున్నవారే బయటికి వచ్చి తమ స్వీయ సామాజికవర్గాల అభ్యున్నతి కోసం పూనుకున్నారు. తమ సమస్యల మీద సమాజాన్ని సెన్సిటైజ్ చేయడం వీరి తొలి లక్ష్యం.  అది చాలా వరకు నెరెవేరింది కూడ.

భౌతికశాస్త్రంలో వున్నట్టే సమాజంలోనూ చలన సూత్రాలు వుంటాయి. ప్రతీ చర్యకు తత్సమానమైన ప్రతిచర్య వుండడమేగాక ఆ ప్రతిచర్యకు సహితం తత్సమానమైన ప్రతిచర్యలు వుంటాయి.

ఆరెస్సెస్ సామాజిక దృక్పథం సనాతన ధర్మం. దాని సామాజిక నిర్మాణం చాతుర్వర్ణ వ్యవస్థ. ఇందులో ముస్లింలు, క్రైస్తవులకు ఎలాగూ స్థానం లేదు. దళితులు, ఆదివాసులకు కూడ స్థానం లేదు. అయితే,1990ల లోనే ఆరెస్సెస్ రాజకీయ విభాగమయిన బిజేపి విస్తరించి అధికారాన్ని చేపట్టడానికి విశాలమయిన ఓటు బ్యాంకు అవసరం అయింది. ఈ రాజకీయ అవసరాన్ని పరిష్కరించడానికి దళితులు, ఆదివాసులకు ద్వారాలు తెరిచారు.

          రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే ఆరెస్సెస్ అంబేడ్కర్ మీద తీవ్ర విమర్శలు చేసింది. రాజ్యాంగ రచన పూర్తి అయిన తరువాత కూడ అది ఈ దేశానికి పనికిరాదనీ, మనుధర్మశాస్త్రం ఒక్కటే తమ రాజ్యంగం అని ప్రకటించింది. తమవైన రోజులు వచ్చినపుడు మనుధర్మశాస్త్రాన్ని అధికారిక రాజ్యాంగంగా ప్రకటిస్తామని ఆరెస్సెస్ నాయకులు బాహాటంగానే ప్రకటనలు చేశారు.

          అయితే, రాజకీయ లబ్ది కోసం దళితులు, ఆదివాసుల్ని దగ్గరకు తీసుకోవాల్సి రావడంతో సంఘపరివారానికి అంబేడ్కర్ మీద సానుకూల వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. అంబేడ్కర్ ను హిందూ సంస్కర్తగా మార్చి తనలో కలుపుకుంది.

ఏ సంకల్పాన్ని అయినాసరే ఒక పటిష్ట ప్రణాళికతో మమలు చేయడంలో సంఘ్ పరివారం గొప్ప అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. చేపట్టిన యజ్ఞానికి   ముహుర్తాలను నిర్ణయించడంలోనూ సంఘపరివారానికి సాటి మరొకరు లేరు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చడానికి అంబేడ్కర్ వర్ధంతి నాడే ముహూర్తం పెట్టడంలోనే సంఘ్ పరివారం   నేర్పరితనం కనిపిస్తుంది.

అస్పృశ్యులంటూ ఒకప్పుడు గుళ్ళలో ప్రవేశానికి అనుమతి నిరాకరించిన సమూహాలకు రోడ్ల మీద పందిళ్ళు వేసి గణపతి నవరాత్రులు, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలు, శోభాయాత్రలు నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పారు. దేవతా విగ్రహాలు తమ గుమ్మం ముందుకు రావడంతో వారూ పూనకంతో ఊగిపోయారు. కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తూ చెలరేగిపోయారు.  ఇవి సంఘ్ పరివారానికి రాజకీయరంగంలో అనూహ్య విజయాలను సాధించిపెట్టాయి.

నరేంద్ర మోది రాజకీయ పునాదిని పటిష్టం చేసిన గుజరాత్ అల్లర్లలో కాల్బలంగా ఎస్సీలు పోషించిన పాత్ర సామాన్యమైనదికాదు.  హిందూమత సమాజ నిర్మాణం కోసం కొందరు ఎస్సీలు నడుం బిగించి చెలరేగిపోయారు. వారి కొత్త పూనకాన్ని కొన్ని అంతర్జాతీయ పత్రికలు కవర్ పేజీల మీద భద్రపరిచాయి.  

ఇవన్నీ పాతికేళ్ళ నాటి పరిణామాలు. ఇప్పుడు బిజెపి దేశంలో తిరుగులేని రాజకీయ పార్టి. దాని అగ్రనేతలిద్దరూ ఏది మాట్లాడినా అదే వేదం. అదే శాసనం.  వాళ్ళిద్దరూ అన్నింటినీ అమ్మేస్తుంటారు. ఇంకో ఇద్దరు వాటన్నింటినీ కొనేస్తుంటారు. ఇప్పుడు ఇండియా అంటే ఆ నలుగురే!!

 

ప్రస్తుతం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సామ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే చివరి విడి ఎన్నికలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీ లిమిటేషన్ ప్రక్రియ సాగుతోంది. ఆ తరువాత జమిలీ ఎన్నికలే వుంటాయి. దక్షణాది ప్రజాభిప్రాయంతో పనిలేకుండానే ఉత్తరాదివారే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే రోజులు వస్తున్నాయి. ఇక ఎస్సీలు, ఆదివాసుల ఓట్లతోనూ వారికి పెద్దగా పనివుండదు. 

సరిగ్గా ఈ సమయంలో సుప్రీం కోర్టు ఒక కీలక తీర్పు చెప్పింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు టైమింగే టైమింగు.

ఈ తీర్పు 40 యేళ్ల క్రితం వచ్చుంటే కారంచేడు దురాగతం నేరేటివ్ మారిపోయివుండేది. కారంచేడు దురాగతంలో బాధితులు దళిత క్రైస్తవులు. ఇప్పటి తీర్పు ప్రకారం దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను కోల్పోతారు. దళితుల మీద అత్యాచారాల నిరోధక చట్టం వారికి వర్తించేదికాదు.  

సుప్రీంకోర్టు కొత్త తీర్పు నేపథ్యంలో ఎస్సీలలో అనేక అభిప్రాయాలు చెలరేగుతాయి. వీటన్నింటికీ అంబేడ్కరే కేంద్ర బిందువు అవుతాడు. సంఘ్ పరివారంతో ఘర్షణ లేకుండా సర్దుకుపోవాలనుకునే వర్గం ఒకటి ముందుకు రావచ్చు. రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అథవాలే వంటివారు వేసిన దారి వారికి ఎలాగూ వుంది. వాళ్ల బాటలో నడుస్తూ, అధికారానికి దగ్గర కావచ్చు. తమనుతాము బహుజన హిందువులమని ప్రకటించుకుని కులరహిత హిందూమత సమాజ నిర్మాణం కోసం కృషిచేస్తామనవచ్చు.

పాకిస్తాన్ ఏర్పాటు సందర్భంగా ముస్లిం సమాజం మీద అంబేడ్కర్ చేసిన కామెంట్లు కొన్ని సంఘ్ పరివారానికి గొప్పగా నచ్చుతాయి. కులరహిత హిందూమత సమాజ నిర్మాతలు వాటిని వల్లెవేయవచ్చు.  అప్పుడు, అంబేడ్కర్ ను వదలనట్టూ వుంటుంది. సంఘ్ పరివారాన్ని హత్తుకున్నట్టూ వుంటుంది.  రెండు ఉపయోగాలు.

ఈ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించే అంబేడ్కర్ వాదులూ వుంటారు. వారు అంబేడ్కర్ సిధ్ధాంతాల్లోని విప్లవకర అంశాల్ని ముందుకు తెస్తారు. వాళ్ళు, ‘కులరహిత హిందూమత సమాజ’ నిర్మాతల్ని మితవాదులు అంటారు. ఈ క్రమం ఈపాటికే మొదలయిపోయింది.  

ఈ పరిణామాలు దళిత సమూహానికే పరిమితం కావు. సమస్త ఉనికివాద సమూహాల్లోనూ సంఘపరివారం ఆశ్రయంకోరే, నిరాకరించే విభజనలు వస్తాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల్లో రివల్యూషనరీ, రివిజనిస్టు శిబిరాలుండేవి. ఇప్పుడు ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ శిబిరాల్లోనూ ఈ రెండు పంథాల పోరాటం మొదలవుతుంది. ఎవరు గెలుస్తారూ? అనేది చెప్పడానికి మరికొంత కాలం వేచి చూడాలి.  

6 ఏప్రిల్ 2026


Wednesday, 1 April 2026

ఒక శకం ముగిసింది – మరో శకం మొదలు కావాలి

 కాలధార

 

ఒక శకం ముగిసింది – మరో శకం మొదలు కావాలి

 

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు



02-04-2026 Teluguprabha

 

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కు నిర్దేశించిన గడువు మార్చి 31కి ఒక రోజు ముందే లక్ష్యాన్ని సాధించుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ విజయం మాత్రమే కాదు; మావోయిస్టుల పరాజయం కూడ.

 

          మనదేశంలో  అనేక రకాల కమ్యూనిస్టు పార్టీలున్నాయి.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పూర్తిగా అంకితమైనవి వున్నాయి. ఎన్నికల్లో పాల్గొంటూనే వీలున్నప్పుడు సాయుధపోరాటాన్ని కూడ చేస్తామనేవి  వున్నాయి. సాయుధపోరాటం మొదలెట్టడానికి సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నవి వున్నాయి. ఆ రెండు పనులు కాకుండా ఇంకేవో పనులు చేస్తున్నవీ వున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల్ని బహిష్కరించి  సాయుధపోరాటం మాత్రమే సమాజంలో మార్పును తెస్తుందని నమ్మే  ఏకైక పార్టి సిపిఐ- మావోయిస్టు. అలా దానికో ప్రత్యేకత వుంది.  

 

          మనదేశంలో భూస్వామ్య ప్రధాన వ్యవస్థ పెట్టుబడీదారీ ప్రధాన వ్యవస్థగా మారడంలో కమ్యూనిస్టుల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. దేశంలో ప్రజాస్వామ్య భావాల వ్యాప్తికి కూడ కమ్యూనిస్టు పార్టీలు దోహదపడ్డాయి. అప్పట్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ  సాగిస్తున్న రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతోనే రాజ్యాంగంలో అనేక ఆదర్శాలను పొందుపరిచారంటే  అతిశయోక్తికాదు. ఆ తరువాత భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలోసోషలిస్టు”, “సెక్యులర్ఆదర్శాల చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించలేదుగానీ, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే.

 కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో, మత నిర్మూలనో జరగలేదుగానీ కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం కొనసాగింది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా  ప్రోత్సాహించకపోయినా ఆమోదం లభించింది.  తెలుగు సాహిత్యం మీద వామపక్ష ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి; వహిస్తున్నాయి. ఇవన్నీ కమ్యూనిస్టులు సాధించిన చారిత్రక సామాజిక సాంస్కృతిక  విజయాలే. వీటినీ ఎవరూ కాదలేరు.

అయితే, భారత సమాజానికి సంబంధించిన మౌలిక స్వభావాలను విశ్లేషించడంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమయ్యాయి. భారత సమాజం కులసమాజం; మతసమాజం; తెగ సమాజం.  ఈ ప్రాతిపదిక మీదనే ఆర్ధిక పంపకాలు సౌకర్యాలు వుంటాయి. ఆ చట్రమే రాజకీయాధికారాన్ని నిర్ణయిస్తుంది. కులం, మతం, లింగం, భాష, ప్రాంతం అన్నింటిలోనూ వర్గ ప్రభావం వుంటుందన్న వాస్తవాన్ని గుర్తించడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులకు వందేళ్ళు సరిపోలేదు. ఇది తెలియక జరిగిన తప్పా? లేక ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన కుట్రా? అనే అంశాల  మీద ఇప్పటికీ చర్చలు సాగుతూనే వున్నాయి.

ఉత్పత్తి విధానం నుండే ఉపరితల అంశాలు ఆవిర్భవిస్తాయనే సిధ్ధాంతంలో తప్పేమీలేదుగానీ, ఆ తరువాత ఆ ఉపరితల అంశాలు స్వతంత్రంగానూ, సృజనాత్మకంగానూ నిరంతరం అభివృధ్ధి చెందుతుంటాయి అనే అంశం మీద కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో అవగాహన లోపించింది.

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య తదితర తొలితరం కమ్యూనిస్టు నాయకులకు వ్యవసాయం, నీటి పారుదల, డ్రైనేజి  రంగాల మీద సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. వ్యవసాయం ప్రధానంగా వున్న కాలంలో వాళ్ళ అభిప్రాయాలకు ఒక విలువ వుండేది.  కమ్యూనిస్టేతరులు కూడ వాళ్ళ ప్రతిభను గుర్తించి మెచ్చుకునేవారు.


1990వ దశకం ప్రపంచాన్ని పునర్ వ్యవస్థీకరించింది. ముందు తూర్పు యూరప్ పతనమైంది. ఆ పిదప రష్యాయే ముక్కలైంది.  కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడింది. ఇలాంటి అవకాశం కోసం  ఎదురుచూస్తున్న కుడిపక్ష తీవ్రవాదం  (రైట్ ఎక్స్ ట్రీమిజం) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగిపోయింది.  లాల్ కిషన్ అడవాణి రథయాత్రలు, బాబ్రీమసీదు కూల్చివేత ఒక క్రమంలో జరిగాయి.  సరళీకృత, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఆర్ధిక విధానాలు ప్రవేశించాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) సెంటర్ ఏర్పడింది.  ఐటి విప్లవం చెలరేగింది. పబ్లిక్ రంగాన్ని ప్రైవేటురంగం అధిగమించింది. గ్రామాల్లో రైతుకూలీలు అంతరించడం మొదలైంది. పట్టణాల్లో కార్మికుల అర్ధం మారిపోయింది. అస్థిర కార్మికులు (ప్రికారియేట్),  గిగ్ వర్కర్లు పుట్టుకొచ్చారు.  జిడిపిలో సర్విస్ సెక్టార్ 70 శాతానికి చేరుకుంది. వ్యవసాయం, పారిశ్రామికరంగాలు జాతీయ జిడిపీలో చెరో 16 శాతానికి పరిమితమైపోయాయి.


అవన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. సమస్తరంగాలలో కొత్త విలువలు ప్రవేశించాయి. ఇది ‘1990 అనంతర కల్లోలం’.  పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. మార్పుల్ని కమ్యూనిస్టు పార్టీల కొత్త నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక పోయింది.

 

          ఇంగ్లండ్ లో పుట్టిన కమ్యూనిస్టు సిధ్ధాంతం రష్యా, చైనా, వియత్నాం తదితర దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అక్కడి విప్లవాలకు నాయకత్వం వహించినవారు కమ్యూనిస్టు-సోషలిస్టు  మౌలిక సూత్రాలను తమ దేశ వాస్తవ పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించి ఫలితాలను సాధించారు. అలాంటి సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ లోపించింది.  అయితే రష్యామార్గం, కాకుంటే చైనా మార్గం అన్నట్టుగానే వ్యవహరించారు.

 

          2004లో మావోయిస్టు పార్టి అని పేరు పెట్టుకోవడం అంటేనే తాము 1920 - 40ల నాటి చైనా విప్లవ పధ్ధతుల్ని అనుసరిస్తామని చెప్పుకోవడమే. సాంప్రదాయిక మార్క్సిస్టు చట్రం ప్రకారం భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారుతుంది. ఆ తరువాత పెట్టుబడీదారీ వ్యవస్థ సోషలిస్టు వ్యవస్థగా మారుతుంది. అంతిమంగా కమ్యూనిస్టు వ్యవస్థగా  మారుతుంది. ఈ చట్రం తమ దేశానికి అమరదని 1920లలో మావో గుర్తించాడు. భూస్వామ్య సమాజాన్ని నేరుగా సోషలిస్టు దేశంగా మార్చడానికి 1940లో నూతన ప్రజాస్వామిక విప్లవం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించాడు. అది చైనాలో సఫలం అయినట్టు కొన్నాళ్ళు కనిపించింది. ఆ తరువాత అక్కడ పెట్టుబడీదారీ వ్యవస్థ పునర్జన్మ ఎత్తిందీ. ఇదెలా జరిగింది? అనే అంశం మీద ఇప్పుడు విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

 

ఈ పరిణామాల్ని   మావోయిస్టు పార్టి పట్టించుకోలేదు. ఆ పార్టి ఇప్పటికీ మన సమాజాన్ని 1920ల నాటి  చైనాలా అర్ధవలస – అర్ధభూస్వామ్య వ్యవస్థగానే పరిగణిస్తుంది. “దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవ విజయం ఇరుసుగా గలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం” తమ లక్ష్యంగా పెట్టుకుంది.  అది కాలం చెల్లిన కార్యక్రమం కనుక మన దేశ పీడిత ప్రజలు దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 4,839 మంది నక్సలైట్లు లొంగిపోయారు.  లొంగిపోవడానికి నిరాకరించిన 706 మందిని పోలీసులు ఎన్కౌంటర్లలో హతమార్చామని హోంమంత్రి పార్లమెంటులో ప్రకటించడం. విడ్డూరం. వాళ్ళ మీద న్యాయ  ప్రక్రియ జరపకుండా హతమార్చడం ఏమిటీ? రాజ్యాంగ బధ్ధమేనా? 

 

ఉద్యమాల్లో చేరినవాళ్ళు జీవితకాలం అందులోనే వుండిపోతారనే నియమం ఏమీలేదు. వెళ్ళిపోయేవారు తక్కువగానూ, వచ్చి చేరేవారు ఎక్కువగానూ వుంటే ఆ ఉద్యమాలు ముందుకు సాగుతున్నట్టు లెఖ్ఖ. వెళ్ళిపోయేవారు ఎక్కువగానూ వచ్చిచేరేవారు తక్కువగానూ వుంటే ఆ ఉద్యమాలు వెనక్కు తగ్గుతున్నట్టు లెఖ్ఖ.  ఈ ప్రమాణాల ప్రకారం మావోయిస్టు పార్టి విస్తరిస్తోందో అంతరిస్తోందో ఎవరికివారు అంచనా వేసుకోవచ్చు.

 

          మావోయిస్టు పార్టి అంచనాలతో సంబంధం లేకుండానే భారత సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (CCD) గా మారిపోయింది. ఇందులో మూడు విభాగాలున్నాయి. ఒక్కో విభాగానికి అనేక సమూహాలు  బాధితులుగా వుంటారు. మూడు విభాగాలకు కలిపి మరెన్నో సమూహాలు  బాధితులుగా వుంటాయి. 

ఈ బాధితులందరితో  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఓడించే ఒక కార్యక్రమాన్ని ఎవరో ఒకరు ఇప్పుడు రూపొందించాలి. అప్పుడు మాత్రమే ఒక నూతన ఐక్య సంఘటన ఏర్పడి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఓడించి  సమాజాన్ని మారుస్తుంది.

 

డానీ

సమాజ, రాజకీయ  విశ్లేషకులు

 

1 ఏప్రిల్ 2026

Thursday, 19 March 2026

Naredra Modi and Amit Shah Face Saving Tactics

 

Naredra Modi and Amit Shah Face Saving Tactics

బిజెపి 2014లో అధికారానికి వచ్చినప్పటి నుండీ అమెరికాతో సన్నిహితంగా వుంటూ వస్తున్నది.

ప్రపంచ మార్కెట్లో చైనా విస్తరణను అదుపుచేయడానికి ఇండియా తనకు వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా కూడా భావిస్తున్నది.

భారత ప్రధాని నరేందర్ మోదీ ఇంతకు ముందు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లొ డొనాల్డ్ ట్రంపుకు ప్రచారం కూడ చేశారు.

రెండేళ్ల క్రితం అంబానీ రిలయన్స్ సంస్థకు చమురు  కోసం  మోదీజీ రష్యా వైపుక్లు మొగ్గారు.

అమెరికాకన్నా, పశ్చిమాసియా దేశాలకన్నా చౌక ధరకు రష్యా చమురును సరఫరా చేసింది.

రెండోసారి అధికారానికి వచ్చిన  డోనాల్డ్ ట్రంప్ ఇండియా మీద కక్షకట్టారు.  

భారీగా టారీఫ్ లు విధించారు.

మరోవైపు, రష్యా చ అవుక చమురు  ప్రయోజనాలు భారత ప్రజలకు దక్కలేదు.

దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గలేదు.

ఆ చమురు లాభాలన్నీ రిలయన్స్ సంస్థకే దక్కాయని విమర్శలు వచ్చాయి.

మళ్ళీ మోదీజీ అమెరికా వైపుకు మళ్ళారు.

దేశానికి నష్టాన్ని  చేకూర్చే ఒక ట్రేడ్ డీల్  ను అమెరికాతో చేసుకున్నారు.

అంతేకాదు అమెరిక-ఇజ్రాయేల్ కలి ఇరాన్ మీద యుధ్ధానికి సిధ్ధం అవుతున్న వేళ ఇజ్రాయేల్ వెళ్ళి పొగిడి వచ్చారు. ఇండియాలో గ్రామగ్రామాన ఇజేయేల్ టెక్నాలజీని విస్తరింపజేస్తామని వచ్చారు.  

ఇంతగా వారు ఎందుకు లొంగి ప్రవర్తిస్తున్నారనే చర్చ దేశంలో మొదలయ్యింది.

తీవ్ర వివాదాస్పదుడైన జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మత్రుల పేర్లు వుండడం వల్లనే మోదీజీ జుట్టును పట్టుకుని ట్రంప్ ఆడిస్తున్నారనే మాట బాగా ప్రచారంలో వుంది.

ఈమాట మీద పార్లమెంటులో తనను నిలదీస్తారనే భయంతోనే మోదీజీ ఒ నెలరోజులుగా పార్లమెంటుకు రావడంలేదు. ముఖం చాటేశారు.

గతంలో మిత్రునిగావున్న ఇరాన్ కు దూరమయ్యారు.

భారత దేశం విశాఖపట్నంలో  జరిగిన నౌకా విన్యాసాల్లో పాల్గొని వెనక్కు వెళుతున్న ఇరాన్ యుధ్ధనౌకను అమెరికా కూల్చి వేసినా, ఇరాన్ దేశాధినేతల్ని చంపేసినా  మోదీజీ కొంచెమైనా నిరసన / సానుభూతి వ్యక్తం చేయలేదు.

ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో భారత ఓడల్ని అనుమతించాలని ఇరాన్ ను వేడుకుంటున్నారు.

జ్ఞానం శీలంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్తోమత తమకు వుందని మోదీ తరచు ప్రచారం చేసుకునేవారు.

చైనా గాల్వాన్ ఆక్రమణకు వచ్చినప్పుడు మోదీజీ తటపటాయించారని  అప్పటి సైనిక ఉన్నతాధికారి రాసినట్టు చెపుతున్న పుస్తకం కూడ మోదీ ఇమేజ్ ను దెబ్బతీసింది.

హిందూమతం ప్రమాదంలో వుందనే ప్రచారాన్ని ఉధృతం చేసి ఓటర్లను హిందూ ముస్లిం అంటూ చీల్చి రాజకీయంగా లబ్ది పొందుతూ వస్తున్నారు  మోది.

ఇప్పుడు శంకరాచార్య లాంటి హిందూ మతాచార్యులు కొందరు మోదీకి వ్యతిరేకంగా మారారు.

మోది భక్తులు, అల్లరి మూకలు ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ పరిణామాల్ని  బిజెపి అభిమానులు సహితం చీదరించుకుంటున్నారు.  

బిజెపి అధికారంలోవున్న రాష్ట్రాల్లో పోలీసులు సహితం ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని పోలీసు అధికారుల్ని మందలిస్తున్నాయి.

కిలో మాసం ఇంట్లో వుంచుకున్నందుకు లించింగ్  ముఠాలు ఇళ్ళలోనికి దూరి  ముస్లింలను చంపేసిన సంఘటనలున్నాయి. ఆ కేసుల్లో అసలది బీఫో కాదో తేలలేదు.

ఇప్పుడు బీఫ్ ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది.

అందులో ఆవుమాసం కూడ వుందని వార్తలొస్తున్నాయి.

ఏకంగా ఆరెస్సెస్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కుటుంబ సభ్యులే బీఫ్ ఎగుమతి చేస్తూ పట్టుబడ్డారు.

బీఫ్ ఎగుమతిదారుల నుండి బిజెపికి ఏలా భారీ ముడుపులు, పార్టీ ఫండ్స్ బాహాటంగానే అందుతున్నాయి.

బ్యాంకుల్లో వందల వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవాళ్ళు అందరు హిందువులే కావడం, అందులోనూ అత్యధికులు గుజరాతీయులు కావడం అనేక అనుమానాలకు తావ ఇస్తున్నది.  

భారీ కుంభకోణాల్లో చిక్కున్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు బిజెపిలో చేరి రాత్రికి రాత్రి పునీతులైపోతున్నారు.

బిజెపి నేతల చాలా జుగుప్సాకరమైన నేరాలు, అనైతిక ప్రవర్తనలు  ఇటీవలి కాలంలో  వరుసగా బయటికి వస్తున్నాయి.

దేశంలోని సహజవనరులు, ఎనర్జీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్  తదితర రంగాలన్నింటినీ క్రమంగా  అస్మదీయ కార్పొరేట్లకు కట్టబేట్టేస్తున్నారనే వాస్తవం ఇప్పుడు బహిరంగ చర్చగా మారిపోయిం.

ఏప్రిల్ నెలలో అస్సాం, కేరళ, పాండుచ్చెరీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

వీటిల్లో ఆధిక్యత రాకపోయినా మోదీ గ్రాఫ్ పడిపోతున్నదనే ప్రచారం మొదలవుతుంది.

అసలు దేశంలో ఎన్నికలే ఒక అప్రహసనంగా మారిపోయాయి. పోలిగ్ లెఖ్ఖలు హాస్యాస్పదంగా మారిపోయాయి. ఇవిఎంల మాయ నిజమేనని నమ్మేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇన్ని తలవంపుల మధ్య మోదీ తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి మోదీజీ ఒక పని చేయవచ్చని ఒక ప్రచారం జరుగుతోంది.

ఛతీడ్ గడ్ లో మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ భారీగా సాగుతోంది.  

మావోయిస్టుల్ని లేకుండా చేయడానికి మార్చి 31ని గడువు తేదీగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించి వున్నారు.

ఇప్పటికే వందల మంది మావోయిస్టుల్ని ఆయుధాలతోసహా లొంగిపోయేలా చేశారు. అనేక మందిని చంపేశారు. కొందరిని అరెస్టు చేర్శారు. ఇక బహుకొద్దిమంది మాత్రమే లోపలున్నారు. వారిని కూడ ఈ పది రోజుల్లో అరెస్టు చేయడమో, లొంగదీసుకోవడమే చేస్తారు.

వీరినీ, ఇటీవల లొంగదీసుకున్నవారికీ కలిపి ఓ మూడు నాలుగు వందల మంది మావోయిస్టూలతో ఛత్తీస్ గడ్ లో పెద్ద ప్రదర్శన నిర్వహిస్తారు.

మావో యిస్టుల్ని లేకుండా చేస్తాం అన్నాం చేసి చూపించాం అని గొప్పగా ప్రచారం చేసుకోవడానికి రంగాన్ని సిధ్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి జవాబు చెప్పుకోలేని ఆరోపణల పర్వం ఇదొక్కటే వాళ్లకు ఫేస్ సేవిం్ మార్గం.

Wednesday, 18 March 2026

Telugu Regional Literature and the Water Narrative - తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

 తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-     -   / డానీ 




తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-      డానీ

-       

తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం 1970లలో ఒక్కసారిగా ఊపందుకున్నట్టుగా కనిపించినా, దాని వేర్లు అంతకంటే లోతుగా విస్తరించి ఉన్నాయి. ఎమర్జెన్సీ తరువాత ఈ ధోరణి మరింత స్పష్టంగా, ఒక సాహిత్య ధోరణిగా రూపుదిద్దుకుంది. అయితే, ఇది కేవలం సాహిత్య పరిణామం మాత్రమే కాదు; దీనికి వెనుక బలమైన రాజకీయ-ఆర్థిక శక్తులు పనిచేశాయి.

 

సాహిత్య ధోరణులు కేవలం రచయితల వ్యక్తిగత అభిరుచుల ఫలితం కావు. అవి సమాజంలోని రాజకీయార్ధిక సంబంధాల ప్రతిబింబాలు. జాతీయ ఆదాయంలో తమకు న్యాయమైన వాటా కోసం రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల గొడుగుల కింద గొంతు పెంచినప్పుడు, ఆ భావజాలం క్రమంగా సాహిత్యంలో ప్రతిబింబించింది. ప్రాంతీయ ఆత్మగౌరవం, అన్యాయంపై అసంతృప్తి, అభివృద్ధిలో అసమానత — ఇవన్నీ కలిపి ప్రాంతీయ సాహిత్యానికి పునాది వేశాయి.

 

ఈ సాహిత్య ప్రవాహం మొదట ఉత్తరాంధ్ర–కళింగాంధ్ర ప్రాంతాలలో స్పష్టంగా వినిపించింది. అక్కడి రచయితలు తమ భూభాగానికి, జీవన అనుభవాలకు ఒక ప్రత్యేక స్వరాన్ని ఇచ్చారు. ఆ స్వరం తరువాత రాయలసీమకు విస్తరించింది. ఆ తరువాత తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బలంగా వ్యక్తమైంది. ఈ సాహిత్య పరిణామంలో నక్సలైట్  ఉద్యమం ఒక పరోక్ష శక్తిగా పనిచేసింది. అది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాక, సాంస్కృతిక చైతన్యాన్ని కూడా గొప్పగా మేల్కొలిపింది.

 

ఈ మార్పుల వెనుక ఆర్థిక మూలాన్ని ఒక్క పదంలో చెప్పాలంటే — “నీళ్లు”. ప్రాంతీయ సాహిత్యంలో నీళ్లు కేవలం ఒక నేపథ్యం కాదు; అదే కథల కథానాయకగా మారింది అనడం అతిశయోక్తి కాదు. నీటి కొరత, కరువు, వలసలు — ఇవి కథలలో కేవలం సంఘటనలు కాదు; అవే కథను నడిపించే ప్రధాన శక్తులుగా మారాయి.

 

ప్రాంతీయ సాహిత్యం కరువును తన ప్రధాన కథా వస్తువుగా స్వీకరించినప్పుడు, అది సహజంగానే నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాలపై ఒక అంతర్గత విమర్శను నిర్మించింది. ఈ విమర్శ ఎప్పుడూ ప్రత్యక్షంగా బయటపడకపోయినా, దాని అంతర్బావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు నేలలో నీటి సమృద్ధితో గుర్తింపుపొందిన ప్రాంతాలు గోదావరి - కృష్ణా జిల్లాలు. అయితే, అక్కడి సాహిత్యంలో ప్రాంతీయ భావోద్వేగాలు పూర్తిగా లేకపోయాయని  చెప్పడం మరీ సింప్లిఫై చేసినట్టు అవుతుంది. కానీ, నీటి కొరత వంటి తీవ్రమైన అనుభవం అక్కడి సాహిత్యంలో ప్రధాన కథావస్తువుగా మారడానికి ఆస్కారంలేదు.

 

నేను అలాంటి నేల నుంచే వచ్చాను. ఆడపిల్ల మురిపెంగా కాలి గోటి తో నేలను తాకితే చాలు — ఒక జలధార ఉబికి వస్తుందనిపించే భూమి అది. అదే ఒక గిఫ్టెడ్ ల్యాండ్; అదే ఒక కర్స్డ్ ల్యాండ్. ఎందుకంటే, కరువు కథలతో నిర్మితమైన ప్రాంతీయ సాహిత్యం విమర్శించే నేల అదే. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కథలకు జీవంపోస్తే, ఇంకో ప్రాంతంలో నీటి సమృద్ధి కథలకు వస్తువుల కొరతను సృష్టించింది. ఇది ఒక విరుధ్ధ అభాస.

 

అయితే, కృష్ణా–గోదావరి ప్రాంతాల గురించిన ఈ భావన కూడా పూర్తిగా సత్యం కాదు. ఈ జిల్లాలలోని తూర్పు ప్రాంతాల్లో నీటి సమృద్ధి ఉన్నప్పటికీ, పశ్చిమ ప్రాంతాల్లో మెట్టభూములు, అడవి ప్రాంతాలు కరువుతోనే పోరాడుతున్నాయి. ఈ అంతర్గత వైరుధ్యాన్నీ మనం తరచూ విస్మరిస్తుంటాము.

 

నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల రచయితలు సహజంగానే వేరే దిశలో ప్రయాణిస్తారు. వారు స్థూల సామాజిక అంశాలు, తత్త్వశాస్త్ర సమస్యలు, లేదా మనిషి అంతర్గత ప్రపంచాన్ని పరిశీలించే కథల వైపు మొగ్గు చూపవచ్చు. ఈ విభిన్న దృక్కోణాలే తెలుగు సాహిత్యాన్ని సమృద్ధిగా నిలబెడతాయి.

 

ఇటీవల నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణతో, గతంలో కరువుతో బాధపడిన అనేక ప్రాంతాల్లో పరిస్థితులు మారాయి. రాయలసీమలో పండుతున్న సోనా మసూరి ధాన్యం, తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పెరిగిన ధాన్య ఉత్పత్తి — ఇవన్నీ ఈ మార్పులకు సంకేతాలు. ఉత్తర తెలంగాణలో పండే జిరా రైస్ వంటి పంటలకు జాతీయ స్థాయిలో గిరాకీ పెరగడం కూడా ఒక కొత్త ఆర్థిక వాస్తవాన్ని సూచిస్తోంది.

 

అయితే, ఈ మార్పుల ప్రభావం సాహిత్యంలో అంత త్వరగా ప్రతిబింబించలేదు. కరువు కథలకు అలవాటు పడిన రచయితలు, మారిన వాస్తవాలను పట్టుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నారు. కథలు, నవలలు రాయడంలో సులభ మార్గాలను వెతుక్కోవడం ఒక ధోరణిగా మారుతోంది. 1980–90లలో వచ్చిన ఉనికివాదాలు కొంతకాలం కొత్త ఆకర్షణగా నిలిచినా, కాలం మారినా రచయితల దృక్కోణం అంతగా మారలేదనిపిస్తుంది.

 

మలిదశ తెలంగాణ ఉద్యమం ఆంధ్రా ప్రాంతం నుండి వలసవచ్చిన వారిపై ఎక్కుపెట్టింది. నిజానికి తమ ప్రాంతంలో పెరుగుతున్న పెట్టుబడి సంచయనం మీద పోరాడాల్సిన సమయంలో ప్రాంతీయవాదానికి పరిమితమైంది. రాష్ట్ర విభజన తరువాత విజృభించిన పెట్టుబడీ సంచయనంతో ఎలా వ్యవహరించాలో ప్రాంతీయవాద సాహిత్యానికి అర్ధం కాలేదు. అది ఇప్పటికీ కన్వీనియంట్ గా పాత పాటలే పాడుతోంది.

 

ఈ స్థితికి కారణం ఏమంటే, చాలా మంది రచయితలు తమకు అనువైన ఒక సాహిత్య స్థలాన్ని ఎంచుకుని, దానిలోనే స్థిరపడిపోతున్నారు. తమ రచనలు పాక్షిక వాస్తవాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయన్న అవగాహన కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఈ పెరిఫెరల్ సౌకర్యం, సాహిత్యానికి మాత్రమే కాదు, సమాజానికీ హానికరం.

 

కథకుడికి కావలసింది కేవలం రచనా నైపుణ్యం మాత్రమే కాదు; సమాజాన్ని అర్థం చేసుకుని మార్చే తత్త్వదృష్టి కూడా కావాలి. ప్రస్తుతం ఆ తత్త్వదృష్టికే కరువు ఏర్పడింది. కార్పొరేట్–కమ్యూనల్ నియంతృత్త్వం పెరుగుతున్న ఈ కాలంలో, ఆ వాస్తవాన్ని కథా వస్తువుగా స్వీకరించినప్పుడే తెలుగు సాహిత్యం కొత్త జవసత్వాలను పొందుతుంది.

 

ప్రాంతీయవాదం ఒక దశలో అవసరమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ, అదే ఒక సౌకర్యవాదంగా మారినప్పుడు, అది తన తొలినాటి శక్తిని కోల్పోతుంది. కాబట్టి, ప్రాంతాన్ని దాటి, సమాజపు విస్తృత వాస్తవాలను ఆవిష్కరించే దిశగా తెలుగు సాహిత్యం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.

 

(ఖదీద్ బాబు రైటర్స్ మీట్‌లో 15 మార్చి 2026న చేసిన ప్రసంగం ఆధారంగా)