Saturday 11 August 2018

Talaq is a criminal case and divorce is civil case



తలాక్  క్రిమినల్ కేసు; విడాకులు సివిల్ కేసు 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


ఇటు సుప్రీం కోర్టులో అటు పార్లమెంటులో  ఈ వారం  దాంపత్య జీవితం, విడాకుల మీద ఆసక్తికర చర్చలు సాగాయి. ఇవి రెండూ విరుధ్ధ మార్గాల్లో సాగుతుండడం విశేషం.

వివాహేతర లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 497వ సెక్షన్‌  ను పౌరసమాజం చాలా కాలంగా  వ్యతిరేకిస్తోంది. పైకి ఈ సెక్షన్ స్త్రీలకు అనుకూలంగా వున్నట్టు  కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో స్త్రీలను ఒక సరుకుగా మార్చి వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదనే  అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది.  వివాహేతర లైంగిక సంబంధాలను మీడియాలో కొందరు  వ్యభిచారం, అక్రమ సంబంధం అని మొరటుగా రాస్తున్నారుగానీ అవి సరైన అనువాదాలు కావు. ఇంగ్లీషులో Adultery, Infidelity, Promiscuity అనే పర్యాయ  పదాలను వాడుతారు. 

అడల్టెరి చట్టం ప్రకారం ఒక వివాహిత మహిళ  వివాహేతర లైంగిక సంబంధాన్ని  పెట్టుకోవడం ఒక పౌర తప్పిద (Civil Wrong) మాత్రమే తప్ప; శిక్షించదగ్గ నేరం ఏమీ కాదు.  భార్య మరొకరితో వివాహేతర లైంగిక సంబంధం కొనసాగించడానికి భర్త అనుమతి ఇస్తే అది కూడా ఒక సామాజిక తప్పిదమే అవుతుంది తప్ప; శిక్షించదగ్గ నేరం అవ్వదు. అలాగే యుక్త వయస్సు నిండిన ఒక వివాహితుడు యుక్త వయస్సు నిండిన మరో అవివాహితతో వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకోవడం సహితం సామాజిక తప్పిదమే అవుతుందిగానీ; శిక్షించదగ్గ నేరం అవ్వదు. అతని మీద చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరే హక్కు అతని భార్యకు లేదు.

అయితే, ఓ పురుషుడు ఓ వివాహిత  స్త్రీతో వివాహేతర  లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ ప్రియుని మీద ప్రియురాలి  భర్త  కేసు పెట్టవచ్చు. ఇప్పటి చట్ట నిర్వచనం ప్రకారం భార్య శీలం భర్త ఆస్తి కనుక ‘మరొకరి సొత్తును’ ‘దొంగిలించినందుకు’ ఆ ప్రియునికి న్యాయస్థానం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు.

అడల్టెరి చట్టం మీద ప్రధానంగా మూడు రకాల విమర్శలున్నాయి. వివాహేతర లైంగిక సంబంధంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఇష్టపూర్వకంగా పాల్గొన్నప్పుడు పురుషులను మాత్రమే శిక్షించడం లింగ వివక్ష అవుతుందనేది మొదటి  విమర్శ.  వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించే నైతిక బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిపై వుండగా దాన్ని భార్యలపై మాత్రమే  మోపారన్నది రెండవ  విమర్శ. భారత  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14  కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా చట్టం ముందు సమానమని  అంటున్నపుడు లింగ వివక్షను పాటించే  సెక్షన్‌ 497 చెల్లదనేది ఒక బలమైన వాదన. ఈ చట్టం  స్త్రీలను స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు గల వ్యక్తిగా కాకుండా భర్తకు ఆస్తిగా, సరుకుగా మాత్రమే చూస్తున్నదనేది మూడవ విమర్శ. తద్వారా ఇది స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదన్నది ఇంకో గట్టి  వాదన.   
వివాహేతర లైంగిక సంబంధాలను యూరోప్ దేశాలన్నీ పరిణితి చెందిన వ్యక్తుల లైంగిక స్వేఛ్ఛగా భావిస్తున్నాయి.  లాటిన్ అమెరికా దేశాలు వాటిని  నేరంగా పరిగణించడం మానేశాయి. ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ  అవగాహన విస్తరించింది. వివాహేతర లైంగిక సంబంధాలను ఇప్పటికీ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్న బహుకొద్ది దేశాల్లో భారత దేశం ఒకటి. 

వివాహేతర లైంగిక సంబంధాల వ్యాజ్యాలలో 1959 నాటి నానావతి కేసు పెద్ద సంచలనం రేపింది. భారత నావికా దళ కమాండర్ కే యం నానావతి తన భార్య సిల్వియాతో వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజాను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. ఈ కేసు విచారణ తొలిదశలో  నానావతి చర్యను శిక్షించదగ్గ నేరం కాదని జ్యూరీ తీర్పు చెప్పింది.  ఆ తరువాత మహారాష్ట్ర హైకోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.

భార్య వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే భర్త ఆమె ప్రియుడి మీద నేరారోపణ చేయవచ్చు. కానీ, భర్త వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే భార్య అతని ప్రియురాలి మీద నేరారోపణ చేయడం కుదరదు అనేది అడల్టెరి చట్టంలో ఒక లింగవివక్ష నిబంధన. నానావతి కేసులో ప్రియుడు ప్రేమ్ అహుజా మీద నానావతి నేరారోపణ చేసినట్టు,  తన భర్తతో   వివాహేతర లైంగిక సంబంధాన్ని సాగించిన  నానావతి భార్య సిల్వియా  మీద  ప్రేమ్ అహుజా  భార్య నేరారోపణ చేయడం కుదరదు. భర్తలకు భార్యలు ఆస్తి అయినట్టు భార్యలకు భర్తలు ఆస్తి కారు!  

దేశంలో ఆర్ధిక సరళీకరణ ప్రవేశించాక ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న పురుషులను  మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్షైనీ అనే వ్యక్తి  ఇటీవల న్యాయస్తానంలో  పిటిషన్దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్దీపక్మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కేసును విచారిస్తోంది. సుప్రీంకోర్టు  సీనియర్ న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నారిమన్, ఏ యం ఖాన్విల్కర్, డి వై చంద్రచూడ్, ఇందూ మల్ హోత్రా ఈ ధర్మాసనంలో వున్నారు.  ఆగస్టు 2, 9 తేదీల్లో ఈ ధార్మాసనం విచారణ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్జనరల్పింకీ ఆనంద్వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రతను పరిరక్షించాలనే దృష్టితోనే వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్నామని వివరించారు.  ‘వ్యభిచారం’ (వివాహేతర లైంగిక సంబంధం) నేరం కాదని చెప్పే విదేశీ చట్టాలను పరిగణనలోకి తీసుకోవద్దని, భారతదేశంలోని సాంస్కృతిక స్థితిగతుల ఆధారంగానే సమాజ శ్రేయస్సు కోసం చట్టం చెల్లుబాటును కొనసాగించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ వాదనను  రాజ్యాంగ ధర్మాసనం అంగీకరించలేదు. “వివాహేతర లైంగిక సంబంధాన్ని  నేరపూరిత చర్య అనలేము. మహా అయితే, అదొక పౌర  తప్పిదం మాత్రమే వుతుంది. పౌర తప్పిదాలకు పౌర పరిష్కారంగా విడాకులు వున్నప్పుడు ఇక శిక్షలు దేనికీ?  వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నంత మాత్రానా ఒక  వ్యక్తిని ఐదేళ్ళు జైలుకు పంపడం ఇంగితజ్ఞానంతో కూడిన చర్య అనిపించుకోదు”  అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.
నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  దీపక్ మిశ్రా మాటల్లోనే చెప్పాలంటే,   Sending a person to prison for five years for adultery does not appeal to common sense”
“Adultery does not even qualify as a criminal offence and is, at the most, a civil wrong” “Adultery has a civil remedy; divorce”.
“Protecting marriage is the responsibility of the couple involved. If one of them fails, there is a civil remedy available to the other.
“Where is the question of public good in a broken marriage”
“there might be cases in which adultery was a consequence of a broken marriage”.

వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నందువల్ల వివాహ వ్యవస్థ దెబ్బతినదు తద్విరుధ్ధంగా  వివాహవ్యవస్థ దెబ్బతినడంవల్లనే వివాహేతర లైంగిక సంబంధాలు ఏర్పడతాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి  ఆర్ధిక విధానాలవల్ల సాంప్రదాయ వివాహ వ్యవస్థ విఛ్ఛిన్నం అయిపోయే వాతావరణాన్ని నేరుగా  ప్రభుత్వమే సృష్టిస్తోంది. మరోవైపు, రాజ్యం సృస్టిస్తున్న విధ్వంసక విధానాల పరిణామాల మీద దంపతుల  ప్రతిస్పందనను, ప్రతిచర్యను అదే శిక్షించాలనుకుంటోంది. మరోమాటల్లో,  నేరస్తుడే బాధితులను శిక్షిస్తున్నాడు.

వివాహేతర లైంగిక సంబంధం సహితం నేరం కాదనీ, అదొక పౌర  తప్పిదం అనీ,  పౌర తప్పిదాలకు పౌర పరిష్కారంగా విడాకులు వున్నాయనీ సుప్రీం కోర్టు వందసార్లు నొక్కి చెపుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అందుకు పూర్తి విరుధ్ధంగా వ్యవహరిస్తోంది. ముస్లింల విడాకులను (తలాక్) నేరపూరిత చర్యగా పరిగణించే బిల్లును చట్టంగా మార్చడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నది. తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తలను జైళ్ళకు పంపించాలని ఉవ్విళ్ళూరుతున్నది.

అడల్టెరి చట్టం మీద సుప్రీం కోర్టు తుది విచారణను పూర్తి చేసిన ఆగస్టు 9 నాడే కేంద్ర మంత్రివర్గం  ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017 కు తుది మెరుగులు దిద్దడం ఒక విషాద వైచిత్రి!.  ఆరోజు కేంద్ర కేబినెట్ తలాక్ బిల్లుకు మూడు సవరణలు చేసింది. తాము  న్యాయబధ్ధంగా వ్యవహరిస్తున్నట్టు ప్రపంచానికి చూపెట్టడానికి. రాజ్యసభలో దీనికి ఎదురవుతున్న ప్రతిఘటన రీత్యా బిల్లును సరళీకరించినట్టు చెపుతున్నప్పటికీ అందులో తక్షణ ట్రిపుల్ తలాక్ ను ‘శిక్షించదగ్గ నేరపూరిత చర్య’గానే కొనసాగించింది.  ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో  ప్రవేశపెడతారు. ఒకవేళ అప్పుడు కూడా సభ్యుల నుండి  ప్రతిఘటన ఎదురయితే, ఆర్డినెన్స్ ద్వారానో, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానో ఈ బిల్లును చెల్లుబాటులోనికి తేవాలని సంఘపరివారం ఆతృతగా వుంది. 2019 సాధారణ  ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ బిల్లు తమకు ప్రాణరక్షణ ఔషధంగా ఉపయోగపడుతుందని బిజెపి గట్టిగా నమ్ముతోంది.  

ముస్లిం వివాహ రద్దు కోసం ఒక చట్టం  (The Dissolution of Muslim Marriage Act  – 1939) గత 80 ఏళ్ళుగా అమలులో వుంది. అందులోని క్లాజ్ 2లో ముస్లిం మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం  న్యాయస్థానం నుండి అనుమతి పొందడానికి  అవసరమైన భూమికల జాబితావుంది.  ఆ క్లాజ్ లో “మహిళ” అని వున్న చోట “దంపతుల్లో ఏ ఒక్కరయినా (spouse)” అని స్వల్ప మార్పు చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం దానికి దేశం దద్దరిల్లేలా గోల చేయడం అనవసరం.  నరేంద్ర మోదీ - అమిత్ షాల ప్రభుత్వానికి సామాజిక సంస్కరణలకన్నా రాజకీయ ప్రయోజనాలు మిన్న.  

పౌర తప్పిదం ముస్లిం మత సమూహంలో జరిగినా తప్పే, హిందూ మత సమూహంలో జరిగినా తప్పే. పౌరతప్పిదాలకు పౌరపరిష్కారాలు వెతకాలిగానీ, కారాగార శిక్షలు వేయడం అంతకన్నా పెద్ద తప్పు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో విడాకులు పొందిన ముస్లిం స్త్రీలు రెండు లక్షల మంది వున్నారు, హిందూ స్త్రీలు ఏడు లక్షల మంది వున్నారు. విడాకులు ఇవ్వడం సార్వజనీనంగా శిక్షించదగ్గ నేరం అని భావిస్తే ఆ తొమ్మిది లక్షల మంది భర్తలకు కారగార శిక్షలు విధించి జైళ్ళకు పంపడానికి ప్రభుత్వం సిధ్ధమేనా?  లేకుంటే కేవలం ముస్లిం భర్తలకు మాత్రమే ప్రభుత్వం జైలు శిక్షలు వేయదలిచిందా? అప్పుడది ప్రభుత్వ ప్రాయోజిత మత వివక్ష అవ్వదా? రాజ్యాంగ ఆదర్శాలను వుల్లంఘిస్తున్నది ఎవరూ? 

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేది కన్వీనర్)
మొబైలు : 9010757776

రచన : విజయవాడ, 11 ఆగస్టు 2018
ప్రచురణ : మన తెలంగాణ, 12 ఆగస్టు 2018

No comments:

Post a Comment