Friday 3 September 2021

We lost Shireesha but her Aalambana spirit continues.

 We lost Shireesha but her Aalambanaa spirit continues.

  శిరీషగారు లేరు; వారిఆలంబనస్పూర్తి  కొనసాగుతుంది.

  

మనతరం అనేమాట ఎవరికైనాసరే గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూవుంటుంది.  అలా నాకు గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూ వచ్చిన వ్యక్తుల్లో రచయిత్రి దాసరి శిరీష గారు ఒకరు. వారు మా రతం.

 

సమాజంలో ఒక మనిషి పుట్టడం మహత్తర విషయం అయినట్టు ఆత్మీయులు చనిపోవడం చాలా బాధాకర సన్నివేశం. మనతరం వాళ్ళు చనిపోయినపుడు మన పునాదిరాళ్ళు కదిలిపోయి మన  జీవన భవనం కూలిపోతున్నదనే భావన కలుగుతుంది. త్రిపురనేని శ్రీనివాస్, పతంజలి, బాలగోపాల్, తాడి మోహన్, ఉప్పుమావులూరి సాంబశిరావు (ఉసా), దేవిప్రియగార్లు చనిపోయినపుడు నేను అలాంటి భావోద్వేగానికి లోనయ్యాను.

 

శిరీషగారు చనిపోయారని నిన్న మా రెండో అబ్బాయి హైదరాబాద్ నుండి  ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఆలోచనలు 50 యేళ్ళు వెనక్కి పోయాయి.

 

శిరీషగారు దాదాపు 48 యేళ్ళుగా తెలుసు. అప్పుడు నాకు 23 యేళ్ళు. ప్రతి మనిషి జీవితంలో ఇది చాల సంక్లిష్టమైన వయసు. మనుషులు ప్రేమలో పడే కాలం ఇది. జీవితంలో ఎలా స్థిరపడాలనే ఆరాటం ఒకవైపు, జీవిత భాగస్వామి గురించిన ఆలోచనలూ మరోవైపు వెంటాడుతుంటాయి.  ఉపాధి, ప్రేమల మధ్య పొత్తు కుదరని సమయం అది. రెండింటిలో ఏదో ఒకదాన్ని వదులుకోలేక చాలా ఘర్షణ పడాల్సి వస్తుంది. జీవితంలో స్థిరపడితే పెళ్ళి చేస్తామని పెద్ద తరం అంటుంది. పెళ్లి చేసుకుంటే స్థిరపడతామని చిన్నతరం అంటుంది. అలాంటి ఒక ఘర్షణకు  పరిష్కారం కోసం నేను తొలిసారిగా 1975లో భీమవరంలో శిరీషగారిని కలిశాను.

 

నాకు నరసాపురంలో చొప్పరపు ఉషారాణి అనే మంచి సాహిత్య స్నేహితురాలు వుండేది.  స్నేహం వరకు బాగానే వుండిందిగానీ తను నన్ను ప్రపోజ్ చేసిన తరువాత మా ఇద్దరికీ కష్టాలు మొదలయ్యాయి. దానికి మతం ప్రధాన కారణం; నాకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడం మరో కారణం. ఒకటి సాంస్కృతికం; మరొకటి ఆర్థికం.

 

ఇరువైపుల నుండి పెద్ద మనుషులు చెరొకరు నిలబడి పెళ్ళిచేయాలనే ఒక కాంప్రమైజ్ ఫార్మూల ఒక దశలో ముందుకు వచ్చింది. మా నాన్నగారి తమ్ముడు భీమవరంలో పేరున్న వ్యాపారి. అప్పట్లో ఉష మూడవ అక్క నర్శమాంబగారు కూడ భీమవరంలో ఉద్యోగం  చేస్తూండేవారు. నేను భీమవరం వెళ్ళి మా బాబాయితో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాను. అలాగే నర్శమాంబగారినీ కలిశాను. ఇటూ మా బాబాయి, అటు నర్శమాంబగారు  నిలబడితే సమస్య  పరిష్కారం అయినట్టే.

 

నర్శమాంబగారికి సూత్రప్రాయంగా మా పెళ్ళి విషయంలో సానుకూలతే వుంది. అయితే, నన్ను స్క్రూటినీ చేసే బాధ్యతను వారు తన స్నేహితురాలు శిరీషగారికి అప్పచెప్పారు. అప్పట్లో శిరీషగారు కూడ భీమవరంలో ఉద్యోగం  చేస్తూండేవారు.

 

అప్పటికి  నాకు శీరీషగారి గురించి పరోక్షంగా కొంత తెలుసు. నా కాలేజి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు పల్లం రామానుజాచారి వాళ్ళది కృష్ణాజిల్లా గండేపల్లి గ్రామం. అక్కడ శిరీషగారి అమ్మగారు; రచయిత్రి పరిపూర్ణ  గారితో ఆచారీ కుటుంబానికి ఒక అనుబంధం  వుండేది. అనుబంధంతో   శీరీషగారు నరసాపురంలో ఆచారీ ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళారు. నాకో దారి దొరికినట్టయింది. డానీ ఒక మంచిబాలుడు. నమ్మి అమ్మాయిని ఇవ్వవచ్చుఅంటూ ఆచారి దగ్గర ఒకరికమెండేషన్ లెటర్తీసుకుని, భీమవరం వెళ్ళి   ‘పెళ్ళి ఇంటర్వ్యూ’ కు  శిరీషగారి ముందు చేతులు కట్టుకుని   నిలబడ్డాను.

 

విజయవాడ మారుతీనగర్ లోని శిరీషగారి ఇంట్లోనే 1978 చివర్లో నాకు ఆర్టిస్టు తాడి మోహన్ పరిచయం అయ్యాడు.  హైదరాబాద్ కు మారిన తరువాత కూడ శిరీషగారి కుటుంబంతో పాత అనుబంధం కొనసాగింది.

 

మనుషులు రెండు రకాలు. నాయకత్వం వహించేవారు; నాయకుల వెంట నడిచేవారు. లీడర్స్ అండ్ ఫాలోయర్స్.  కొందరు వయసు పెరిగే కొద్దీ జీవితానుభవంతో రాటుదేలుతారు. కొందరు బాల్యంలోనే జీవితానుభవాన్ని చవిచూస్తారు. అలాంటివారు సాధారణంగా కుంగిపోతారు. వాళ్ళల్లో కొందరు మాత్రం రాటుదేలి  నాయకులుగా ఎదుగుతారు. వీళ్ళనే మనం  ‘బోర్న్ లీడర్స్అంటాం. నిజానికి వీళ్ళకు కూడ స్వంత సమస్యలు అనేకం వుంటాయి. అయినప్పటికీ, వీళ్ళు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలగడమేగాక  తమ చుట్టూవున్న వాళ్ళ సమస్యల్ని కూడ పరిష్కరిస్తుంటారుఇతరులకు స్ఫూర్తినిచ్చిప్రోత్సహించే సామర్థ్యం వారికి సహజంగానే ఉంటుంది. శిరీషగారు నాకు తెలిసినప్పటి నుండి  చనిపోయే వరకు తన టీమ్ కు తిరుగులేని నాయకురాలు.  ఆ సమూహంలో వారి స్థానం నిత్యం ఒక మెట్టు పైన వుండేది.  వారి మనస్తత్వానికి ప్రతిరూపమేఆలంబన’. 

 

శిరీషగారికి నివాళులు,

తోట అపర్ణకు ప్రగాఢ సానుభూతి.

 

పరిపూర్ణగారికి వచ్చిన కష్టం ఒకరు ఓదార్చగలిగేది కాదు. అనేక తూఫాన్లను తట్టుకుని నిలిచిన నావ వారు. ఇప్పుడు దీనిని కూడ తట్టుకోగలరని ఆశిస్తాను.

 

శిరీషగారు లేరు; వారిఆలంబనస్పూర్తి  కొనసాగుతుంది.

 

-        ఉషా యస్ డానీ 

No comments:

Post a Comment