Friday 28 January 2022

Indian media is waging a 'holy war' against Muslims.

 Indian media is waging a holy war against Muslims.

ముస్లింల మీద భారత మీడియా  'పవిత్ర మతయుధ్ధం' సాగిస్తోంది  

 

ప్రధాన స్రవంతి మీడియా

భారత మీడియా ముస్లింల మీద 'పవిత్ర మతయుధ్ధం' సాగిస్తోంది  

 

ముస్లింలకు అనుకూలమైన వార్తల్ని అది ప్రచారం కానివ్వదు. ముస్లింలకు వ్యతిరేకమైన వార్తల్ని ప్రముఖంగా ప్రచారంచేస్తుంది.

 

ఇటీవల మీడియా మరో నీచమైన విధానానికి పాల్పడింది. ముస్లింలకు వ్యతిరేకంగా అబధ్ధాలను కుత్రిమంగా సృష్టించి ప్రచారం చేస్తున్నది. 2020 మార్చ్ నాటి ఢిల్లీ మర్కజ్ కేసు దీనికి పెద్ద ఉదాహరణ. 

 

14 దేశాలకు చెందిన ముస్లింలు ఢిల్లీ మర్కజ్ మసీదులో సమావేశమై కోవిడ్ వ్యాప్తికి కుట్ర చేశారని భారత మీడియా బరితెగించి ఆరోపించింది. నకిలి (డాక్టర్డ్) వీడియోలను, సంఘటనతో సంబంధంలేని వీడియోలను  ప్రసారం చేసి  వాళ్ళను ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్లు’గా ప్రచారం చేసింది. దానితో, మర్కజ్ లో ఆ సమయంలో వున్నవారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత న్యాయస్థానంలో జరిగిన  విచారణలో  తేలిందేమంటే, వారిలో ఒక్కరు కూడ ‘కోవిడ్ పాజిటివ్’ కాదని.  ‘కోవిడ్ పాజిటివ్’ కానివాళ్ళను ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్లు’గా ఎలా చిత్రించారు?” అని ఢిల్లీ పోలీసుల్ని న్యాయస్థానం నిలదీసింది. “పైన్నుండి వచ్చే ఆదేశాల మేరకు ఎఫ్ ఐ ఆర్ రాసేస్తారా? వాస్తవాలను సరిచూకునే పనిలేదా?” అని  చివాట్లు పెట్టింది. అప్పటికే 9 నెలలు గడిచిపోయాయి. ఈలోగా దేశంలో ముస్లిం వ్యతిరేకత హద్దులులేకుండా  పెరిగిపోయింది. దేశంలో చాలాకాలంగా కొనసాగుతూవున్న అసహన వాతావరణాన్ని ఇది మరింతగా పెంచేసింది.

 

సోషల్ మీడియా

సోషల్ మీడియాలో ట్రోల్స్ రెచ్చిపోయి ముస్లిం వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. దీనికి ‘సుల్లీ-బుల్లీ’ కేసు తాజా ఉదాహరణ. ముస్లిం మహిళల్లోని సోషల్ యాక్టివిస్టుల అంగాంగాల్ని  వేలేం వేసేంత వరకు వెళ్ళింది వీరి వికృత చేష్ట. ఈ కేసు బాధితుల్లో మా ముస్లిం లోచనాపరుల వేదిక (MTF) ముఖ్యనాయకురాలు  ఖాలిదా పర్వీన్ బాజీ కూడ వున్నారు.

 

మతసామరస్య భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముస్లీం మహిళలే చొరవతో ముందుకు వచ్చి వినూత్నంగా షాహీన్ బాగ్ ఉద్యమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలుసు. షాహీన్ బాగ్ ఉద్యమ స్పూర్తితోనే ఢిల్లీలో రైతుల ఆందోళన సాగింది. దేశంలో మరో షాహీన్ బాగ్ ఉద్యమం ఆరంభంకాకుండ ముస్లిం మహిళా సామాజిక కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు సాగుతున్న కుట్రల్లో ‘సుల్లీ-బుల్లీ’ కేసు ఒకటి.

 

ఉపాధి రంగం

ముస్లింలకు వారి జనాభాకు తగినట్టు విద్యా, ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో  రిజర్వేషన్లు లేవు. ముస్లిం ద్వేషాన్ని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తుండడంతో ఉపాధిరంగంలో వివక్ష పెరిగి ముస్లింల అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

 

ముస్లింలలో అత్యధికులు చేతివృత్తులవారు. చిన్నచిన్న హాకర్లు, అస్థిర శ్రామికులు (Precariat) సమాజంలోని వివక్ష కారణంగా వీరంతా ఇటీవలి కాలంలో ఆర్ధిక వెలివేతకు గురవుతున్నారు. కరోన లాక్ డౌన్ కాలంలో భారీగా నష్టపోయిన సమూహం ముస్లింలే.  

 

(ఐక్య రాజ్య సమితి_ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (UNHRC) నిర్వహించనున్న 4వ యూనివర్సల్ పీరియాడికల్ రివ్యూ (UPR IV) కోసం 28-1-2022 సాయంత్రం జరిగిన జూమ్ సమావేశంలో చేసిన ప్రసంగ పాఠం).

No comments:

Post a Comment