Wednesday 11 September 2024

ఈరోజు సాక్షి దినపత్రికలో న వ్యాసం 'బెజవాడ ముంపు పాపం ఎందరిదీ?' వచ్చింది.
స్థలాభావం వల్ల కొంత భాగం అచ్చుకాలేదు. ఆసక్తిగలవారు ఇక్కడ చదవచ్చు.
మీ అభిప్రాయాలూ తెలిపితే ఆనందిస్తాను.





బెజవాడ ముంపు పాపం ఎందరిదీ?
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయంలో ఒకే స్పేస్ లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ జరుగుతుందనేది ఫిజిక్స్ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అనవసర సమస్యల్ని కోరి తెచ్చుకుంటుంటారు. పాపం వాళ్ళకు ఫిజిక్స్ లోని యాక్సిడెంట్ సూత్రం తెలికపోవచ్చు. కానీ, సివిల్ - మెకానికల్ ఇంజినీరింగుల్లో లో పిహెచ్ డీలు చేసి రాష్ ట్రానికి ఇంజినీర్ – ఇన్-చీఫ్ వంటి అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి అయినా యాక్సిడెంట్ సూత్రాలు తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి!.
ప్రకృతి విపత్తులు ఒక రుతు క్రమంలోనే జరుగుతుంటాయి. వాటివల్ల విధ్వంసం జరిగితే ఆ తప్పు ప్రకృతిదికాదు; ప్రకృతితొ చెలగాటం ఆడిన మనుషులది. ఇప్పుడు మనం మొన్నటి కృష్ణానది వరద గురించీ, విజయవాడ ముంపు గురించీ మాడ్లాడుకుందాము.
ప్రకాశం బారేజిని చాలా కష్టకాలంలో చాలా కష్టపడి ఆంధ్ర రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి కొన్ని అడుగులు దిగువన ఇంతకు ముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్ ఆర్ధర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా మరో కెప్టెన్, ఛార్లెస్ అలెగ్జాండర్ ఆర్ర్ (Charles Alexander Orr) నిర్మించాడు. దాదాపు ఒక శతాబ్ద కాలం సమర్ధంగా పనిచేసిన కాటన్ – ఆర్ర్ ఆనకట్ట 1952 సెప్టెంబరు నెలలో కూలిపోయింది.
అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా వుండేవారు. సరిగ్గా అప్పుడే ఆంధ్రా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం వుదృతంగా ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం బాగా వేడెక్కింది. ఇంతటి రాజకీయ సంక్షోభ సమయంలో విలవిల్లాడుతున్న మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బారేజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టుకన్నా మూడురెట్లు ఎక్కువ - అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు- సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్టంగా 12 లక్షల కుసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్ధర్ థామస్ కాటన్ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడుగుల ఎత్తు క్రస్ట్ గేట్లతో ఒక భారీ బరాజ్ డిజైనింగ్ రూపుదిద్దుకుంది.
బరాజ్ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రాప్రాంతానికి తెలంగాణా ప్రాంతం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బారాజ్ నిర్మాణం పూర్తయింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి బరాజ్ నిర్మాణం మూడేళ్ళలో (1954-57) పూర్తి అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పటికీ చిత్తశుధ్ధి తగ్గిపోయిన కారణంగా భారీ బరాజ్ ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది.
సాంకేతికంగా ప్రకాశం బరాజ్ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్ కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్ రిజర్వాయర్ లో నిల్వవుండే మూడు టిఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. ఆయిల్ పోసేవారు; గ్రీజు పట్టించేవారు. అవసరం అయితే పాత గేట్లకు బదులు కొత్త గేట్లు అమర్చేవారు. జలాశంలో చేరిన మేటను తొలగించేవారు. ఇప్పుడయితే జలాశయంలో నీరువుండగానే గేట్లు మార్చే ‘స్టాప్ లాగ్ గేట్ల’ సౌకర్యం వచ్చింది. ప్రకాశం బరాజ్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. అయితే, అప్పటికి స్టాప్ లాగ్ గేట్ల పరిజ్ఞానం అభివృధ్ధి కాలేదు. ఆ అవసరమూ అప్పుడు లేదు.
సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్) రావడంతో ప్రకాశం బారేజ్ కు ముప్పు మొదలయింది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడడానికి వీలుగా కూలింగ్ టవర్స్ ను ఏర్పాటు చేయాలి. విటిపిఎస్ నేరుగా కృష్ణానదిని కూలింగ్ యూనిట్ గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణ నది నుండి విటిపిఎస్ కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (FRL) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది.
ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బారేజ్ ను వేరే లక్ష్యంతో నిర్మించిన విటిపిఎస్ తో లంకె పెట్టడం పెద్ద పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్ లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. మొదటిది, జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. రెండోది; వేసవిలో బరాజ్ క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. మూడోది, బరాజ్ నిర్మాణం, పిల్లర్లు, క్రస్ట్ గేట్ల పరిస్థితి నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి కూడ వీలు కాలేదు. నాలుగోది, మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో జలాశయంలో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది.
ప్రకాశం బరాజ్ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొదలయ్యాయి. విటిపిఎస్ తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు ప్రిష్కారంగా విటిపిఎస్ ఇన్-ఫ్లో కెనాల్ కోసం బరాజ్ ఎగువన పంపింగ్ స్టేషన్ నిర్మించారు.
ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది విటిపిఎస్ ఔట్ ఫ్లో (కూలింగ్) కెనాల్ విషయంలో జరిగింది.
ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను కొంచెం పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం వేగంగా పాకుతున్న త్రాచుపాములా అనేక మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలో మీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయువ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు (flash Floodస) వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల కుసెక్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. వరద వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవుగనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఖ్ఖఃదాయని’ అని ఓ చెడ్డ పేరుంది.
1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధితులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్ కమీషనర్ అజిత్ సింగ్. అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడ అనేక పేర్లతో మరింతగా విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్ధం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు.
బుడమేరును అదుపు చేయడానికి 1980 లలో మూడు ప్రతిపాదనలు వచ్చాయి. మొదటిది, స్ట్రయిట్ కట్ నిర్మించాలనేది. రెండోది, అజిత్ సింగ్ నగర్ పరిసరాల్లో కరకట్ట నిర్మించాలనేది. మూడోది, వెలలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ నిర్మించి సగం నీటిని కృష్ణానదిలోనికి మళ్ళించడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ (బిడిసి) కట్టాలనేది. స్ట్రయిట్ కట్ నిర్మించలేదు గానీ మిగిలిన రెండూ సాకారం అయ్యాయి.
ఈ పరిష్కారాల్లోనూ ‘రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయం ఒకే స్పేస్’ అనే సూత్రాన్ని మరచిపోయారు. బిడిసి కోసం ప్రత్యేకంగా కాలువ తవ్వకుండా దాన్ని విటిపిఎస్ కూలింగ్ కెనాల్ లో కలిపారు. అలాగే, రాజకీయ నాయకులు మట్టి ఇసుక కొండలు అడవులు ఒకేచోట వుండవుకదా! కరకట్ట మట్టిని రాజకీయ నాయకులు తవ్వుకొని అమ్మేసుకున్నారు!.
గ్రావిటీ ఫ్లోలో బిడిసి, విటిపిఎస్ కూలింగ్ కెనాల్ నీళ్ళు ఇబ్రహీంపట్నం ఫెర్రీవద్ద కృష్ణానదిలో కలిపోతాయని ప్రాజెక్టు డిజైనర్లు భావించారు. వరద కాలంలో కృష్ణా పారుదల లెవెల్ పెరిగి బిడిసి, విటిపిఎస్ కూలింగ్ కెనాల్ ల లోనికి కృష్ణా నీళ్ళు ఎదురు వస్తాయనే ఆలోచన వారికి రాకపోవడం విచిత్రం.
ఈ విచిత్రం ఇంతటితో ఆగలేదు. గోదావరి బేసిన్ నీటిని పట్టిసీమ పంపింగ్ స్టేషన్ నుండి కాలువల ద్వార కృష్ణా బేసిన్ లోనికి మళ్ళించడం మొదలెట్టారు. ఆ కాలువను కూడ బిడిసితో కలిపారు. విటిపిఎస్ కూలింగ్ వాటర్, బుడమేరు వరద నీరు, గోదావరి అనుసంధానం నీరు మొత్తం మూడు నీళ్ళు ఒకే కాలువ ద్వార కృష్ణా నదిలో పారాలి. ఆ సమయంలో కృష్ణా నదికి వరద వస్తే ఏమిటీ పరిస్థితి? నాలుగు ఆబ్జెక్టులు ఒకేసమయంలో ఒకే స్పేస్ లో కలుస్తాయి. ఇది ఎంతటి దుస్సాహసమో చెప్పనలవి కాదు. కృష్ణా వరద బిడిఎస్ లోనికి వెనక్కు రాకుండా కనీసం ఒక లాక్ సిష్టం పెట్టాలనే ఆలోచన కూడ ఇంజినీరింగ్ డిజైనర్లకు రాలేదు.
నీటిపారుదలా శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన ప్రకారం ఆగస్టులో గోదావరి అనుసంధానం కాలువలో 8 వేల కుసెక్కుల నీరు పారుతోంది. ఆ సమయంలో బుడమేరులో ఎగువ నుండి 40 వేల కూసెక్కుల వేగంతో వరద వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణానది వందేళ్ళలో ఎన్నడూ లేనంత వుదృతంగా పారుతోంది. లాక్ సిస్టం లేదు కనుక కృష్ణానది బిడిఎస్ ద్వార బుడమేరు లోనికి వచ్చేసింది. తన నీటినే తట్టుకోలేని బుడమేరు; కృష్ణా వరదను తట్టుకుంటుందా? మూడు నీళ్లు కలిసి విజవాడలో మూడో భాగాన్ని ముంచేశాయి.
అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్ లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళుకట్టినా, ఇళ్ళలోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు.

11-09-2024
//EOM//

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=11/09/2024&pgid=461686&device=desktop&view=3

No comments:

Post a Comment