Wednesday 11 September 2024

The History of Prakasham Barrage

 మనం తెలుసుకోవాల్సిన ప్రకాశం బరాజ్ చరిత్ర

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

 

 

పెద్ద ఆపద ముంచుకుని వస్తేగానీ మనకు చరిత్ర గుర్తుకురాదు. అలా ఇప్పుడు ప్రకాశం బరాజ్ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కృష్ణానది వరద సెప్టెంబరు 2న రికార్డు స్థాయిలో 11 లక్షల 50 వేల కుసెక్కుల వేగంతో ప్రహించింది. బెజవాడ నగరాన్ని, కృష్ణాడెల్టానేకాక మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఓ నాలుగు రోజులు భయపెట్టిన కృష్ణ వరద ఇప్పుడు తగ్గుముఖం పట్టేక  మనం నిర్లక్ష్యం చేసిన అనేక సమస్యలు వరదలా ముందుకు వస్తున్నాయి.

 

తిరుగుబాటుల్ని అణిచివేయడమా? సంక్షేమ పథకాల్ని అమలు చేయడమా?

 

ప్రస్తుతంవున్న ప్రకాశం బరాజ్ కు కొన్ని అడుగులు దిగువన గతంలో బెజవాడ ఆనకట్ట వుండేది. దాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1855లో నిర్మించింది. గోదావరి నది మీద ధవిళేశ్వరం వద్ద 1852లో ఆనకట్టను నిర్మించిన కెప్టెన్ ఆర్ధర్ థామస్ కాటనే బెజవాడ ఆనకట్టనూ డిజైన్ చేశాడు. అప్పట్లో గోదావరి కృష్ణా మండలాలు ఒకే కలక్టరేట్ పరిధిలో  వుండేవి.  అప్పటి కలెక్టర్ గోర్డన్ మెకంజీ (Gordon Mackenzie) అనుకుంటా. 

 

ఆనకట్ట ఎడమగట్టు ప్రధాన కాలువ మూడు కాలువలుగా చీలి బెజవాడ పట్టణం మీదుగా తూర్పు డెల్టా దిశగా సాగడం ఒక అందమైన ఇంజినీరింగ్ రూపకల్పన. వెనిస్ నగరాన్ని తలపించే వెనిటియన్ (Venetian) డిజైన్ ఇది. 11.8 లక్షల కూసెక్కుల నీటి విడుదల సామర్ధ్యంతో దీన్ని రూపకల్పన చేశారు.  అయితే, ధవిళేశ్వరం ఆనకట్ట నిర్మాణ కాలంలోనే కాటన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. బెజవాడ ఆనకట్ట నిర్మాణ బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలెగ్జాండర్  ఆర్ర్ (Charles Alexander Orr) స్వీకరించి పూర్తి చేశాడు. ఈ ఆనకట్ట దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు డెల్టా గ్రామాలకు తాగునీరు అందించేది.

 

కాటన్, ఆర్ర్ లకు ఒక ‘సినిమాటిక్’ చరిత్ర ఉంది. ఇద్దరూ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్ స్థాయి సైనికాధికారులు. ఇప్పటి గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్ని అప్పట్లో సంవత్సరాల తరబడి క్షామం  పీడించింది. ఒక్క పూట తిండి కోసం పిల్లల్ని అమ్ముకోవడానికి తల్లిదండ్రులు సిధ్ధం అయ్యేవారు. అంతటి దయనీయ పరిస్థితి. జనం కంపెనీ పాలన మీద పీకలోతు కసితో రగిలిపోయారు.  ఇండియాలో తమ పాలన ఆరంభమయ్యి నూరేళ్ళు (1757-1857) కావస్తున్న సందర్భంగా అనేకచోట్ల తిరుగుబాట్లు చెలరేగవచ్చని కంపెనీ పాలకులు భయపడ్డారు. జరగబోయే తిరుగుబాట్లను ముందుగానే  అణిచివేయడానికి  సైనికాధికారుల్ని గోదావరి- కృష్ణా మండలానికి పంపించాడు అప్పటి గవర్నర్ జనరల్ (హెన్రీ హార్డింగే నా? డల్హౌసీ నా?). 

 

తిరుగుబాటుని నివారించడానికి ఇక్కడికి వచ్చిన కెప్టెన్ కాటన్ దైవ భక్తుడు. పక్కనే గోదావరి, కృష్ణా వంటి గొప్ప నదులు ప్రవహిస్తున్నప్పటికీ మనుషులు  తిండిలేక చనిపోతుండడాన్ని చూసి చలించిపోయాడు. ఆకలితో అలమటిస్తున్నవారిని  తుపాకులతో అణిచివేయడం ఆయనకు నచ్చలేదు. గోదావరి మీద ఓ నాలుగు అడుగుల ఎత్తున్న ఆనకట్ట కట్టి కొంచెం సాగునీరు అందిస్తే  పండించుకుని తింటారు. కడుపులో తిండి పడితే తిరుగుబాట్లు చేయరుకదా అని ఆలోచించాడు.

 

భారీ ఖర్చుతో కూడిన ఆనకట్ట నిర్మాణం ప్రతిపాదనను కంపెనీ ఒప్పుకోలేదు. కరువు మూలంగా ఆదాయం పడిపోవడంతో కంపెనీ దగ్గర నిధులు కూడ లేవు.  అయినా కాటన్ పట్టు వదలలేదు. కంపెనీకి అనేక ఆర్ధిక ప్రయోజనాలు సమకూరుతాయని వివరిస్తూ రెండో నివేదిక సమర్పించాడు. నీటిశిస్తు విధించి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చు; కాలువలతో పడవ రవాణా సౌకర్యం అభివృధ్ధి చెందుతుంది; ఇక్కడి భూముల్లో  పత్తి పండిస్తే మాంచెస్టర్  కాటన్ మిల్లులకు ముడి సరుకు చౌకగా దొరుకుతుంది; వగయిరా ఆశలు కల్పించాడు. కాటన్ రెండో ప్రయత్నం ఫలించింది. అలా  గోదావరి మీద ధవిళేశ్వరం ఆనకట్ట సాకారం అయ్యింది. అదే వరవడిలో కృష్ణా మీద బెజవాడ ఆనకట్ట మొదలయ్యింది. తిరుగుబాటుదార్లను అంతం చేయడమా? సంక్షేమ పథకాల్ని అమలు చేయడమా? అని అడిగితే రెండోదే మంచి ఆప్షన్ అనేది కాటన్ అభిప్రాయం.  

 

 

97 ఏళ్ళు సమర్ధంగా పనిచేసిన  బెజవాడ ఆనకట్ట 1952 సెప్టెంబరు నెలలో కూలిపోయింది. అప్పట్లో విజయవాడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా వుండేవారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతోంది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రాజకీయ సంక్షోభ కాలంలో బెజవాడ ఆనకట్టను మద్రాసు ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

1953 అక్టోబరు 1న  టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, నిధుల కొరతున్న రాష్ట్రం. అయినప్పటికీ  బెజవాడ ఆనకట్టకు కొన్ని అడుగుల ఎగువన ఏకంగా 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే భారీ బరాజ్ ను నిర్మించడానికి  1954లో ప్రకాశం పంతులు నడుం బిగించారు. ఈలోగా ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  1957లో దీన్ని పూర్తి చేశారు. అంతటి రాజకీయ సంక్షోభంలోనూ, అంతకన్నా తీవ్రమైన  ఆర్ధికలోటులోనూ, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రపరికరాలు  అంతగా అందుబాటులోలేని కాలంలో ఇంతటి భారీ ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తి చేయడం మహత్తర విషయం. అప్పటికి అది దేశంలోనే అత్యంత ఆధునిక ప్రాజెక్టు.

 

గోదావరి, కృష్ణా జీవనదులు కావు. వర్షాకాలం మాత్రమే నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఈ నదులు పూర్తిగా ఎండిపోతాయి. ఆ సమయంలో బరాజ్ గేట్లు, పిల్లర్లకు మరమ్మత్తులు చేసేలా,  రిజర్వాయర్ లో వచ్చి చేరే పూడికను తొలగించేలా డిజైన్ చేశారు.

 

ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (VTPS) రావడంతో ప్రకాశం బరాజ్ కు కష్టాలు మొదలయ్యాయి. ధర్మల్ పవర్ ప్రాజెక్టులకు కూలింగ్ టవర్స్ వుండాలి. దానికి బోలెడు ఖర్చు అవుతుంది. వాటికి బదులు కృష్ణానదినే కూలింగ్ ప్లాంటుగా వాడుకునేలా డిజైన్ చేశారు. కృష్ణానది నది నుండి విటిపిఎస్ కు కూలింగ్  కెనాల్ ద్వార నీరు పారాలంటే (gravity flow)  బారేజ్ దగ్గర నిరంతరం 12 అడుగుల  లెవల్ లో నీరుండాలి. బారేజ్ క్రస్ట్ గేటు ఎత్తు కూడ 12 అడుగులు. అంటే నిరంతరం బారేజ్ రిజర్వాయరును నిండుగా (FRL) వుంచాలి. కరువు రోజుల్లోనూ  రిజర్వాయరులోని నీటిని వాడుకోవడానికి వీలు లేకుండాపోయింది. ఇది మొదటి ఇబ్బంది. ప్రతి వేసవిలో పూడికను తొలగించకపోతే మేటవేసి రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇది రెండో ఇబ్బంది. సంవత్సరాల తరబడి పిల్లర్లు, గేట్లకు వేసవి మరమ్మత్తులు  చేయడం సాధ్యంకాలేదు. జలాశయం నిరంతరం నిండుగా వుండడంతో నీటిలోవున్న గేట్ల పరిస్థితిని కనీసం పరిశీలించే అవకాశం కూడ లేకుండాపోయింది. ఇది ప్రమాదం.  ఇప్పుడయితే తాత్కాలికంగా డమ్మీ గేట్లను పెట్టి అసలు గేట్లను మార్చడానికి వీలుండేలా పిల్లర్లను డిజైన్ చేస్తున్నారు. ప్రకాశం బారేజీకి అలాంటి సౌకర్యం లేదు. ఇప్పుడు గేట్లు మార్చాలంటే అదో పెద్ద కార్యక్రమం అవుతుంది.

 

నిర్మాణానికి అప్పడప్పుడు పగుళ్ళు (Cracks and cavities) ఏర్పడతాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పద్దతుల్లో పూడ్చాలి. లేకుంటే నిర్మాణం సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇంకాస్త నిర్లక్ష్యం చేస్తే ఏకంగా నిర్మాణమే కూలిపోతుంది. ప్రకాశం బరాజ్ ను దగ్గరగా పరిశీలిస్తే సామాన్యుల కంటి చూపుకు కూడ పగుళ్ళు కనిపిస్తాయి. నీటిపారుదలశాఖా మంత్రులకు, అధికారులు – సిబ్బందికి ఈ పగుళ్ళు కనిపించవు.

 

ఇక్కడ బి-స్టోరి ఒకటుంది. 1960లలో  అప్పటి విజయవాడ మునిసిపల్ కమీషనర్ అజిత్ సింగ్ కృష్ణలంకలోని కృష్ణానది ముంపు బాధితులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు. అలా ఆయన పేరిట సింగ్ నగర్ ఏర్పడ్డది. అది బుడమేరు పరివాహక ప్రాంతంలో వుంది. ఎప్పుడు వరద వస్తుందో ఎప్పుడు ఎండిపోతుందో ఊహించ శక్యంకాని చిన్న ఏరు బుడమేరు. దాని నడక కూడ వేగంగా పాకుతున్న పాములా అనేక మెలికలు తిరుగుతూ వుంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినప్పుడు దానికి అకస్మాత్తు వరదలు (Flash Floods) వస్తుంటాయి. దాని సహజ మార్గం ఆక్రమణలతో పూడిపోవడంతో వరద సమయంలో బుడమేరు నగరం మీదికి వచ్చేస్తుంది. అలా దానికి విజయవాడ దుఖ్ఖఃదాయిని (Sorrow of Vijayawada) అనే పేరు వచ్చింది.  

 

నిరంతరం విస్తరించే నగరాన్ని ఎవ్వరూ ఆపలేరు. కనుక, బుడమేరు సమస్యను 1980లలో రెండు రకాలుగా పరిష్కరించారు. సింగ్ నగర్ పరిసరాల్లో వరదకట్ట నిర్మించారు; వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మించి బుడమేరు మళ్ళింపు కాలవ (BDC) తవ్వారు. ఈ బిడిసి; ఎన్టిపిఎస్ ఔట్ ఫ్లో కూలింగ్ కెనాల్ తో జతకూడి ఇబ్రహీంపట్నం ఫెర్రి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కొత్తగా తవ్విన గోదావరి-కృష్ణా అనుసంధానం కాలువను కూడ వీటిలోనే కలిపారు.

ఆగస్టు చివరి వారంలో ఖమ్మం జిల్లా నుండి బుడమేరుకు భారీ వరద వచ్చింది. మరోవైపు, గోదావరి-కృష్ణా అనుసంధానం నీళ్ళొచ్చాయి. విటిపిఎస్ కూలింగ్ కెనాల్ నీళ్ళు ఎలాగూ వున్నవే.  సరిగ్గా అప్పుడు రికార్డు స్థాయి భారీ వరదతో ప్రవహిస్తున్న కృష్ణానది ఈ మూడు నీళ్ళను  స్వీకరించకపోగా తిప్పికొట్టింది. రాజకీయ ప్రాబల్యం గలవారు ఎప్పుడో బుడమేరు వరదకట్ట మట్టిని తవ్వి అమ్ముకున్నారు. కృష్ణా వరద ధాటికి బుడమేరు ప్రవాహం వెనక్కు పరుగులు తీసింది. కరకట్ట లేదు కనుక ఉగ్రంగా మారి నగరం మీద పడింది. విజయవాడలో నాలుగో భాగం  నీట మునిగింది.   ఈ విషాదానికి దోషులు ఒక్కరు కాదు;  అనేకులు!

No comments:

Post a Comment