Sunday, 19 October 2025

 Constitution Vs Rifiles

*రాజ్యాంగం వెర్సస్ రైఫిల్*

ఈరోజు (19-10-2025 ఆదివారం)  సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజీ బాధ్యులకు

ధన్యవాదాలు.

 

స్థలాభావంవల్ల కొంత భాగాన్ని వాళ్ళు కత్తిరిస్తారు. పత్రికల్లో ఇది సహజం.

పూర్తిపాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తిగలవారు చదివి కామెంట్ చేస్తే ఆనందిస్తాను.

 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*




 

మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడ సానుభూతి వుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి  ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.  ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది!.

 

మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనంచేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందుకున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్ లో ఆశన్న లొందుబాటు.ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. మనలో చాలామంది గుర్తించడానికి నిరాకరిస్తారుగానీ ఇలా జరగాలని 1990లోనేలిఖించబడింది’.

 

ఇప్పుడు చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జులై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది.  నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్ లాల్ నెహ్రు లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 

*రక్తపాత విప్లవ్చ నివారణకే*

 

రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్లవాన్ని నివారించాలనే లక్ష్యం వుంది. బిఆర్ అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చిపడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు.

 

మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొందడానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కూడ ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల  రక్షణ వగయిరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలయిన సమానత్వం సోదర భావాలకు మరింత బలాన్ని, స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్యవాదం ఆదర్శాలు చేరింది కూడ నక్సలైట్ల భయంతోనే. అంచేత నక్సలైట్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా ప్రయాసలు అనడానికి వీల్లేదు.

 

*రెండు అధ్యాయాలు*

వందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టి చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం వుంది. అది;1990లకు ముందు, 1990ల తరువాత.

 

          పెట్టుబడీదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియోగాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టికర్తలకు యజమానులకు మధ్య శతృత్త్వాన్ని కూడ విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు  సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపుకు నడిపిస్తాయనేది మార్క్సిస్టు మూల సిధ్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడీదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్త్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. రెండింటి మధ్య తెలివిగా తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడానికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది. 

 

1917లో రష్యాలో అక్టోబరు విప్లవం తరువాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడీదారీ వ్యవస్థ వెలుగు తగ్గింది. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో ఫాసిజం, నాజీజంలను ఓడించడంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్రను నిర్వహించడంవల్లనూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇరుకున పడింది.

 

అయితే, అంతర్గత బలహీనతలు లోపాలు శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు వున్నాయి.  అలనాడు తెలంగాణలో సాగినవిగానీ, తరువాత నక్సలబరీ ప్రేరణతో అనేక రాష్ట్రాల్లో కొనసాగినవి గానీ కొన్ని గెరిల్లా చర్యలేగానీ  సాయుధ పోరాటం కాదు. స్థాయీ సైన్యాలను ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నధ్ధం చేయడంలో విప్లవ కమ్యూనిస్టు పార్టిల వరుస నాయకత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. పార్లమెంటరీ పంథాను ఎంచుకున్న కమ్యూనిస్టు పార్టీలు కూడ తాము ఎంచుకున్న మార్గంలో అంతే దారుణంగా చతికిలపడ్డాయి.  

 

1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్‌ లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విఛ్ఛిన్నం అయ్యింది. చైనాలోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడీదారీ ధోరణులు పెరిగాయి.  ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ప్రపంచ వ్యాప్తంగా ఇరుకున పడిపోయింది.

 

*పెట్టుబడీదారులారా ఏకంకండి!*

 

సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడీదారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్ధిక వేదికను నడుపుతున్నాడు.  ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక సర్ధుబాట్లు’ సిధ్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుంబిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్ధికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే!.

 

వీళ్ళందరూ చాలా తెలివైనవాళ్ళు.  ఎక్కడా తాము సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. అలాగే పెట్టుబడీదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు  కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్ధంకాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు.

 

ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరునాడు కనిపించదు. ఒకదాన్ని అర్ధం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు.  దీనికి వాళ్ళు పెట్టిన అందమైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’!  

 

దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొదలెట్టారు. దీనితో రాజకీయలబ్దిని సులువుగా పొందడమేగాక కొత్తతరాలు సామ్యవాదం వైపుకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైధ్ధాంతిక రంగంలో పెట్టుబడీదారీ వ్యూహకర్తల్ని డీకొనే  ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాశన!.

 

*పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా?*

 

ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న  సమయంలో,  ఇండియాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టి నాయకత్వపోరులో నిండా మునిగివుంది. ముందు కేజి సత్యమూర్తిని తరిమేశారు. తరువాత, సరిగ్గా అదే పధ్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజానికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవికావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం.

 

ఆ తరువాత విప్లవపార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి  సమర్ధులు కూడ కాదు. పెట్టుబడీదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్ధం చేసుకుని విరుగుడు కనిపెట్టే స్తోమత వాళ్ళకు లేకపోయింది. బ్రిటీష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభైయేళ్ళ క్రితం ఏకే 47 గొప్పది.  ఇప్పుడు మానవరహిత డ్రోన్లు, యుధ్ధవిమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో  కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిధ్ధమైతే అది దుస్సాహసం అవుతుంది!

 

*తమను తామే రద్దు చేసుకున్నారా?*

మావోయిస్టులు ఇతర అణగారిన సమూహాలను పూర్తిగా వదిలేసినా  వాళ్ళ మీద బయటి ప్రపంచంలో ఒక గౌరవం కొనసాగింది. దానికి ప్రధాన కారణం వాళ్ళు బస్తర్ అడవుల్లో  ఆదివాసుల కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూ వుండడమే. ఇప్పుడు వాళ్ళు ఆ కాడిని కూడ వదిలేశారు.  

 

ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువతరం బండిని గెంటుతుండాలి. యువతరాలే ప్రాణవాయువు.   కొత్తతరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృధ్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడ సాధ్యం కాదు.

 

ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు, కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆవేశారు. వృధ్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో  మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనోపతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో  అనేకం వున్నాయి.

 

ఎప్పుడయినా ఎక్కడయినా అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే.  ఆ లక్ష్యసాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా వున్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యంగం అనడం కూడ ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే  చెడ్డ రాజ్యంగం కూడ ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యంగం కూడ ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి వున్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా? కాదా? అన్నదికాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య.

 

మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరి వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్త్వం భ్రష్టు పట్టించగలిగిన దానికన్నా ఎక్కువగానే భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా  చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? అనేవి ఊహాజనిత సందేహాలు. దానికి సమాధానం కోసం మరి కొంతకాలం వేచిచూడాలి.

 

రచన : 16 అక్టోబరు 2025

ప్రచురణ : 19 అక్టోబరు 2025, సాక్షి దినపత్రిక  

Friday, 17 October 2025

*ఐక్య కార్యాచరణతో ఉపద్రవాన్ని ఎదుర్కొందాం*.

 *ఐక్య కార్యాచరణతో ఉపద్రవాన్ని ఎదుర్కొందాం*.




ఇప్పుడు మనం కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వ  పాలనలో  వుంటున్నాం.  ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం- క్రైస్తవ మైనారిటీలతోపాటు శ్రామికులు, సామాన్య ప్రజలు, మహిళలు దీనికి బాధితులు. రకరకాల వివక్షలకు గురవుతున్న మనమంతా ఏకంకానిదే  నియంతల్ని ఎదుర్కోలేం. వివక్షా అణిచివేతల్ని తిప్పికొట్టలేం.

 

కార్పొరేట్లకు ఆకలి ఎక్కువ. ఈ భూమి మొత్తం వాళ్ళకు కావాలి. సముద్రాలన్నీ కావాలి. ఆకాశమంతా కావాలి. అవి కూడ సరిపోవడంలేదు. ఆదివాసుల్ని తొలగించి అడవుల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. మత్స్యకారుల్ని తొలగించి తీరప్రాంతాల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. నాలుగు కార్ఖానాలు పెట్టుకుని ముస్లింలు పొట్ట పోసుకుంటుంటే ఆ బజార్లను బుల్డోజర్లతో కూల్చి కార్పొరేట్లకు అప్పచెప్పాలి. కార్మికులకు హక్కులుండరాదు. సంక్షేపథకాలను ఎత్తేయాలి. ఆ మిగులునంతా అస్మదీయ కార్పొరేట్లకు అప్పచెప్పాలి.

 

ఇలా చేయడానికి ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగ పీఠికలోని సామరస్యం, సామ్యవాదం అడ్డొచ్చాయి. వాటిని తొలగించడానికి పూనుకున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగ మూల ఆదర్శాలయిన స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాల నుండే సామరస్యం సామ్యవాదం పుట్టాయి అని సులువుగా అర్ధం అవుతుంది. సామరస్యం సామ్యవాదాలను తొలగించడం అంటే వాళ్ళు స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలను సహితం తొలగించడానికి సిధ్ధం అయ్యారని అర్ధం చేసుకోవాలి. అంటే, మొత్తం రాజ్యాంగాన్ని పీక నులిపి చంపేయ్యడానికి కుట్ర జరుగుతోందని గమనించకపోతే మన మెదళ్ళు పనిచేయడం లేదని అర్ధం.

 

లౌకికవాదాన్ని తీసేస్తే మైనారిటీలు రెండవశ్రేణి పౌరులుగా మారిపోతారు. మతస్వేఛ్ఛ రద్దవుతుంది. సోదరభావం రద్దయి మెజారిటీ మతాధికారం పెచ్చరిల్లుతుంది. సామ్యవాదాన్ని రద్దుచేస్తే కార్మికుల హక్కులు రద్దవుతాయి. పేద ధనిక అంతరం మరింతగా పెరిగిపోతుంది.  సంక్షేమ పథకాలు, ఉద్దీపన చర్యలు రద్దయిపోతాయి. అంటే దేశంలోని అణగారిన సమూహాలన్నీ తీవ్ర వివక్ష, అణిచివేతలకు గురవుతాయి. వీళ్ళందరూ ఏకం అయితేనే రాబోతున్న ఉపద్రవాన్ని నివారించగలుగుతారు.  

 

అయితే, ఇందులో ఒక పెద్ద చిక్కువుంది. కొందరు ఆలోచనాపరులు నమ్ముతున్నట్టో, ఆశించుతున్నట్టో బలహీనవర్గ సమూహాలు కింది స్థాయిలో సమైక్యంగా ఏమీలేవు. వాళ్ళ మధ్య సాంస్కృతిక, సాంఘీక, ధార్మిక, రాజకీయ, తాత్విక అంశాల్లో  అనేక విబేధాలున్నాయి. పైగా, విభిన్న రంగాల్లో ఎవరి లక్ష్యాలు వారికున్నాయి. కొన్ని సందర్భాలలో అవి పరస్పర విరుధ్ధంగానూ వుంటాయి. వాటిన్నింటినీ ఇప్పటికిప్పుడు పరిష్కరించుకోవడం సాధ్యంఅయ్యే పనికాదు. విబేధాలను పక్కన పెట్టి ఇప్పటి ఉమ్మడి ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఐక్యకార్యాచరణను (జాయింట్ యాక్షన్) రూపొందించుకుని కలిసి పనిచేయడం ఒక్కటే తక్షణ పరిష్కారం.  

 

కలిసి పనిచేయడం అంటే, వివిధ సమూహాల మధ్య సారూప్యం వున్నవాటిని మాత్రమే ఆచరణకు స్వీకరించాలి. సామరస్యంగా మార్చగలవాటిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. తీవ్ర విబేధాలున్న అంశాలను పక్కన పెట్టాలి. ఈ మూడు నియమాలను పాటిస్తేనే విభిన్న సమూహాల మధ్య ఐక్యత సాధ్యం అవుతుంది. ఇప్పుడు చెయ్యాల్సింది అదే.

డానీ

*ముస్లిం ఆలోచనాపరుల వేదిక  MTF*

*Civil Society - పౌరసమాజం* 

*బహుజన ఐక్యత ప్రాణ రక్షణ మందు*

 *బహుజన ఐక్యత ప్రాణ రక్షణ మందు*

మాన్యవార్ కాన్షీరామ్ అమరుడు. అందుకే ప్రతి కష్టకాలంలోనూ బలహీనవర్గాలు ఆయన్ని తలచుకుంటున్నాయి.

కాన్షీరామ్ తో నాకు చిన్న అనుబంధం వుంది. నేను సామాజిక కార్యకర్తగా వుంటూనే వర్కింగ్ జర్నలిస్టుగా మారిన కొత్తలో ఆయన విజయవాడ వచ్చారు. బహుశ అది 1989 మార్చి నెల కావచ్చు. అది ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో తొలి పర్యటన కావచ్చు.

విజయవాడ అంబేడ్కర్ భవన్ లో క్రియాశీల కార్యకర్తల సమావేశం పెట్టారు. కొందరు మిత్రులు నన్నూ రమ్మంటే వెళ్ళాను.  కాన్షీరామ్ కు ఒక అలవాటు వుండేది. తను ప్రసంగించడానికి ముందు మీడియాను బయటికి పొమ్మనేవారు. తనకు మీడియా ప్రచారం అక్కరలేదనేవారు. ఆరోజూ మీడియా ప్రతినిధుల్ని లేచి నిలబడమన్నారు. మిగిలిన మీడియా మిత్రులతో నేనూ లేచి నిలబడ్డాను. ఆయన అందర్నీ “గెట్ ఆఫ్“ అన్నారు.

నేను ఒక విన్నపం చేశాను. “వృత్తిరీత్యా జర్నలిస్టునే కానీ ప్రవృత్తిరీత్యా సామాజిక కార్యకర్తని. కారంచేడు ఉద్యమంతో ఒక అనుబంధం కూడ వుంది” అన్నాను. ఈలోపు ఒకరిద్దరు అంబేడ్కరైట్ మిత్రులు ఆయన దగ్గరికి వెళ్ళి నాగురించి మంచిగా చెప్పారు. అలా  నాకు ఆ సమావేశంలో వుండడానికి అనుమతి దొరికింది. అంతేకాక కాన్షీరామ్ నాతో ఓ ఐదారు  నిముషాలకుపైగా ఆసక్తిగా మాట్లాడారు. దాన్నే ఒక ఇంటర్వ్యూగా రాశాను. ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ప్రచురించింది. తరువాత ఆ ఇంటర్వ్యూను ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టి ఒక చిన్న పుస్తకంగా వేసింది.

నాకు ఆరోజు కాన్షీరామ్ మాటల్లో బాగా నచ్చింది ఒకటుంది. జిస్కే జిత్నీ భాగేదారీ, ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ (జనాభాలో ఎవరు ఎంతో వారికి హక్కు అంత”). ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప సామాజిక సూత్రం.

జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా కాన్షీరామ్ ముందుకు తెచ్చిన  జిస్కే జిత్నీ భాగేదారీ, ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ నినాదాన్ని ఇస్తున్నారు. దీనివల్ల ఇతర సామాజికవర్గాలతోపాటు భారత ముస్లిం సామాజిక వర్గానికి కూడ మేలు జరుగుతుంది. అందులో సందేహం లేదు. కానీ, ముస్లింలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం అని రాహుల్ గాంధి స్పష్టంగా చెప్పడం లేదు. ఎన్డీయే కూటమి తనను ‘ముస్లిం సంతుష్టీకరణ’ ముద్ర వేస్తుందని ఆయన జంకుతూ వుండవచ్చు.

నిన్న ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టి విడుదల చేసిన పోస్టర్ లో ముస్లింలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ వుంది. ఇది గొప్ప ముందంజ. ఇటీవల నేను సభల మీద మునుపటి ఆసక్తిని చూపడంలేదు. ఏఐ బిఎస్పి విడుదల చేసిన  పోస్టర్ చూసి కొత్త ఉత్తేజాన్ని పొంది ఈ సభకు వచ్చాను.

ముస్లింలు దళితుల ఐక్యత ఈరోజుది కాదు. దీనికి వందేళ్ళ చరిత్ర వుంది. ఈ ఐక్యతకు 1931 నాటి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ వేదికగా నిలిచింది.

          1909 నాటి మోర్లే-మింటో సంస్కరణలు,  ‘ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ -1909’ ద్వారానూ, 1919 నాటి మోంటేగు-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ -1919 ద్వారానూ బ్రిటీష్ ఇండియాలోని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గా(separate electorates) సౌకర్యం వచ్చింది. అంటే, తమ శాసనకర్తల్ని  తామే ఎన్నుకునే అవకాశం.

          1916 నాటి లక్నో ఒప్పందంలో  జాతీయ కాంగ్రెస్ కూడ ముస్లిం లీగ్ పొందిన  ప్రత్యేక నియోజకవర్గాల సౌకర్యాన్ని సమర్ధించింది. ముస్లింలకు నాటి జనాభా దామాషాకు మించి రాజకీయ ప్రాతినిధ్యం దక్కింది.  

          ముస్లింలను చూసి శిక్కు, క్రైస్తవ, ఆంగ్లో ఇండియన్  సామాజికవర్గాలు సహితం ప్రత్యేక నియోజకవర్గాలను సాధించుకున్నాయి.  అణగారినవర్గాలకు కూడ ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని 1930లో బిఆర్ అంబేడ్కర్ కోరారు.  1931 చివర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అంశం మీదనే సుదీర్ఘ చర్చలు వాడివేడిగా జరిగాయి.

హిందూ సామాజికవర్గాల  ప్రతినిధిగా సమావేశంలో పాల్గొంటున్నట్టు ప్రకటించిన గాంధీజీ - అణగారిన వర్గాలు, హిందూసమాజంలో అంతర్భాగం కనుక వాళ్ళకు  ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించరాదనీ, ఒకవేళ అలా చేస్తే, అవి హిందూ సమాజాన్ని శాశ్వతంగా విభజిస్తాయంటూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అణగారినవర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కానేకాదనీవాళ్ళు భారత జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సమూహం కనుక వాళ్ళను విడిగా చూడాలని అంబేడ్కర్ వాదించారు. భారత ఉపఖండంలోని ప్రతి సామాజికవర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయరంగంలో పూర్తిస్థాయి భద్రతలు కల్పించాలని  ముస్లిం లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా, ఆగా ఖాన్-3 తదితరులు గట్టిగా వాదించారు. అలా వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో శిక్కు, క్రైస్తవ సమూహాలతోపాటు అణగారినవర్గాలకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు

ముస్లిం క్రైస్తవ, శిక్కు, అణగారినవర్గాలు ఏకం కావడంతో గాంధీజీవాదం వీగిపోయింది. ముస్లిం లీగ్, అంబేడ్కర్ సంయుక్త వాదం బలాన్ని సాధించింది. అప్పటి బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ అణగారినవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932 ఆగస్టు 16 కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. భారతదేశంలో బహుజన ఐక్యతకు ఇది తొలి భారీ  విజయం.

1984 అక్టోబరు-నవంబరు నెలల్లో ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లోని  శిక్కుల మీద దాడి జరిగింది.  ఆ తరువాత వాళ్ళు ముస్లింల మీద దాడి చేస్తారనే ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. 1931 నాటి బలహీనవర్గాల ఐక్యతను పునరుధ్ధరించాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది.

ఈలోగా, 1985 జులైలో కారంచేడులో  షెడ్యూల్ కులాల మీద క్రూర దాడిజరిగింది. ఇతర ఇబ్బందుల సంగతి ఎలావున్నా ఒక చారిత్రక బాధ్యత అనుకొని వెళ్ళి ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. నాయకత్వం కూడ వహించాను. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సివుంది. కారంచేడు ఉద్యమానికి అరడజను మంది తమతమ పధ్ధతుల్లో నాయకత్వం వహించారు. సెప్టెంబరు 10న రాస్తారోకోతో ఉద్యమం మీద నిర్బంధం పెరిగింది. దానితో ఇతర నాయకులు చీరాల వదిలి వెళ్ళిపోయారు. నేను మాత్రమే అక్కడ నిలబడ్డాను అని సగర్వంగా చెప్పగలను. అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఒక మంచి పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన తరువాతే చీరాలను వదిలాను.

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. నేను చీరాలలో వున్నంత కాలం ఇప్పటి ఏఐబిఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆర్డినేటర్ బి. పరంజ్యోతి వాళ్ళ ఇల్లే నాకు ఆశ్రయంగా వుంది. మేమిద్దరం ఉద్యమ సహచరులం మాత్రమేకాదు; ఆత్మీయ మిత్రులం కూడ.

ఇప్పుడు వర్తమానానికి వద్దాం. కార్పొరేట్ మతతత్వ   నియంతృత్వ  పాలనలో మనం వుంటున్నాం.  ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం- క్రైస్తవ మైనారిటీలతోపాటు శ్రామికులు, సామాన్య ప్రజలు, మహిళలు దీనికి బాధితులు. రకరకాల వివక్షలకు గురవుతున్న వీళ్ళందరూ ఏకంకానిదే కార్పొరేట్ మతతత్వ   నియంతృత్వాన్ని ఎదుర్కోలేం.  

కార్పొరేట్లకు ఆకలి ఎక్కువ. ఈ భూమి మొత్తం వాళ్ళకు కావాలి. సముద్రాలన్నీ కావాలి. ఆకాశమంతా కావాలి. అవి కూడ సరిపోవడంలేదు. ఆదివాసుల్ని తొలగించి అడవుల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. మత్స్యకారుల్ని తొలగించి తీరప్రాంతాల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. నాలుగు కార్ఖానాలు పెట్టుకుని ముస్లింలు పొట్ట పోసుకుంటుంటే ఆ బజార్లను బుల్డోజర్లతో కూల్చి కార్పొరేట్లకు అప్పచెప్పాలి.

ఇలా చేయడానికి ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగ పీఠికలోని సామరస్యం, సామ్యవాదం అడ్డొచ్చాయి. వాటిని తొలగించడానికి పూనుకున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగ మూల ఆదర్శాలయిన స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాల నుండే సామరస్యం సామ్యవాదం పుట్టాయి అని సులువుగా అర్ధం అవుతుంది. సామరస్యం సామ్యవాదం తొలగించడం అంటే వాళ్ళు స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలను తొలగించడానికి సిధ్ధం అయ్యారని అర్ధం చేసుకోవాలి. అంటే, మొత్తం రాజ్యాంగాన్ని పీక నులిపి చంపేయ్యడానికి కుట్ర జరుగుతోందని గమనించకపోతే మన మెదళ్ళు పనిచేయడం లేదని అర్ధం.

దేశంలోని అణగారిన సమూహాలన్నీ ఏకంకావాలి. ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మైనారిటీలు, శ్రామికులు ఏకమై ఒక ప్రభంజనాన్ని సృష్టించాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రళయ సమయం! బహుజన ఐక్యత ఇప్పుడు ప్రాణ రక్షణ మందు!

డానీ

సమాజ విశ్లేషకులు

ముస్లిం ఆచనాపరుల వేదిక (MTF)

(ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టి 2025 అక్టోబరు 9న విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపిన ధర్నాలో  చేసిన ప్రసంగ పాఠం) 

Constitution Vs Rifle

Constitution Vs Rifiles

రాజ్యాంగం వెర్సస్ రైఫిల్ 

డానీ 

సమాజ విశ్లేషకులు 




మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడ సానుభూతి వుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి  ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.  ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది!. 



మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనంచేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందుకున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్ గడ్ లో ఆశన్న లొందుబాటు. ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. మనలో చాలామంది గుర్తించడానికి నిరాకరిస్తారుగానీ ఇలా జరగాలని 1990లోనే ‘లిఖించబడింది’.


ఇప్పుడు చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జులై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది.  నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్ లాల్ నెహ్రు లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 


రక్తపాత విప్లవ నివారణకే

రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్లవాన్ని నివారించాలనే లక్ష్యం వుంది. బిఆర్ అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చిపడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు. 


మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొందడానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కూడ ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల  రక్షణ వగయిరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలయిన సమానత్వం సోదర భావాలకు మరింత బలాన్ని, స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్యవాదం ఆదర్శాలు చేరింది కూడ నక్సలైట్ల భయంతోనే. అంచేత నక్సలైట్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా ప్రయాసలు అనడానికి వీల్లేదు.


రెండు అధ్యాయాలు

వందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టి చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం వుంది. అది;1990లకు ముందు, 1990ల తరువాత.


 పెట్టుబడీదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియోగాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టికర్తలకు యజమానులకు మధ్య శతృత్త్వాన్ని కూడ విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు  సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపుకు నడిపిస్తాయనేది మార్క్సిస్టు మూల సిధ్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడీదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్త్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. రెండింటి మధ్య తెలివిగా తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడానికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది.  


1917లో రష్యాలో అక్టోబరు విప్లవం తరువాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడీదారీ వ్యవస్థ వెలుగు తగ్గింది. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో ఫాసిజం, నాజీజంలను ఓడించడంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్రను నిర్వహించడంవల్లనూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇరుకున పడింది. 


అయితే, అంతర్గత బలహీనతలు లోపాలు శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు వున్నాయి.  అలనాడు తెలంగాణలో సాగినవిగానీ, తరువాత నక్సలబరీ ప్రేరణతో అనేక రాష్ట్రాల్లో కొనసాగినవిగానీ కొన్ని గెరిల్లా చర్యలేగానీ  సాయుధ పోరాటం కాదు. స్థాయీ సైన్యాలను ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నధ్ధం చేయడంలో విప్లవ కమ్యూనిస్టు పార్టిల వరుస నాయకత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. పార్లమెంటరీ పంథాను ఎంచుకున్న కమ్యూనిస్టు పార్టీలు కూడ తాము ఎంచుకున్న మార్గంలో అంతే దారుణంగా చతికిలపడ్డాయి.  


1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్ లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విఛ్ఛిన్నం అయ్యింది. చైనాలోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడీదారీ ధోరణులు పెరిగాయి.  ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ప్రపంచ వ్యాప్తంగా ఇరుకున పడిపోయింది. 


పెట్టుబడీదారులారా ఏకంకండి!

సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడీదారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్ధిక వేదికను నడుపుతున్నాడు.  ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కలిసి ‘నిర్మాణాత్మక సర్ధుబాట్లు’ సిధ్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుంబిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్ధికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే!. 

వీళ్ళందరూ చాలా తెలివైనవాళ్ళు.  ఎక్కడా తాము సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. అలాగే పెట్టుబడీదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు  కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్ధంకాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు. 

ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరునాడు కనిపించదు. ఒకదాన్ని అర్ధం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు.  దీనికి వాళ్ళు పెట్టిన అందమైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’!  

దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొదలెట్టారు. దీనితో రాజకీయలబ్దిని సులువుగా పొందడమేగాక కొత్తతరాలు సామ్యవాదం వైపుకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దాదాపు ఈ సమయంలోనే అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్ స్టిట్యూట్ లో  శామ్యూల్ హంటింగ్టన్  'నాగరీకతల ఘర్షణ'  సిధ్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. వీటిని సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. 


ఇంత జరిగిపోతున్నా సైధ్ధాంతిక రంగంలో పెట్టుబడీదారీ వ్యూహకర్తల్ని డీకొనే  ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాశన!.


పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా? 

ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న  సమయంలో,  ఇండియాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టి నాయకత్వపోరులో నిండా మునిగివుంది. ముందు కేజి సత్యమూర్తిని తరిమేశారు. తరువాత, సరిగ్గా అదే పధ్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజానికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవికావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం.


ఆ తరువాత విప్లవపార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి  సమర్ధులు కూడ కాదు. పెట్టుబడీదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్ధం చేసుకుని విరుగుడు కనిపెట్టేంత  స్తోమత వాళ్ళకు లేకపోయింది. బ్రిటీష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభైయేళ్ళ క్రితం ఏకే 47 గొప్పది.  ఇప్పుడు మానవరహిత డ్రోన్లు, యుధ్ధవిమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో  కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిధ్ధమైతే అది దుస్సాహసం అవుతుంది! 


తమను తామే రద్దు చేసుకున్నారా? 

మావోయిస్టులు, ఇతర అణగారిన సమూహాలను పూర్తిగా వదిలేసినా  వాళ్ళ మీద బయటి ప్రపంచంలో ఒక గౌరవం కొనసాగింది. దానికి కారణం వాళ్ళు బస్తర్ అడవుల్లో  ఆదివాసుల కోసం పోరాడుతూ వుండడమే. ఇప్పుడు వాళ్ళు ఆ కాడిని కూడ వదిలేశారు.  


ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువతరం బండిని గెంటుతుండాలి. యువతరాలే ప్రాణవాయువు.   కొత్తతరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృధ్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడ సాధ్యం కాదు. 


ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు, కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆపేశారు. వృధ్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో  మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనోపతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో  అనేకం వున్నాయి. 


ఎప్పుడయినా ఎక్కడయినా అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే.  ఆ లక్ష్యసాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా వున్నప్పుడే జనసమూహాలు మరోవైపు చూడాల్సి వస్తుంది. 


సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యంగం అనడం కూడ ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే  చెడ్డ రాజ్యంగం కూడ ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యంగం కూడ ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి వున్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా? కాదా? అన్నదికాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య. 


మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరి వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్త్వం భ్రష్టు పట్టించగలిగిన దానికన్నా ఎక్కువగానే భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా  చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? అనేవి ఊహాజనిత సందేహాలు. దానికి సమాధానం కోసం మరి కొంతకాలం వేచిచూడాలి.


16 అక్టోబరు 2025

Friday, 10 October 2025

Do Muslims really not care about society?

 Do Muslims really not care about society?

ముస్లింలు నిజంగానే సమాజాన్ని పట్టించుకోలేదా?

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

          ముస్లింలు సమాజాన్ని పట్టించుకోరు అనే మాటను మనం తరచూ వింటుంటాం. వాళ్ళకు అల్లాతప్ప లోకం అక్కరలేదు అని కూడ చాలామంది అంటుంటారు. ముస్లింలు మార్పుకు, ఆధునికతకు వ్యతిరేకులు అనే నింద ఇందులో దాగి వుంటుంది. కొందరు తెలియక అమాయికంగా అలా అంటే అదో ఇది. మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి మాటల్ని ప్రచారంలో పెడుతుంటారు. దీనినే ఇస్లామో ఫోబియా అంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక ప్రచారం మోతాదు పెంచింది. దీనికోసం ఓ భారీ సిబ్బంది రాత్రీపగలు కరసేవ చేస్తున్నది.

 

          వ్యాపార-వాణిజ్య లాభాలతో సంతృప్తి చెందక భారత ఉపఖండాన్ని పాలించాలని వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలను 1757లో ప్లాసీ వద్ద  ఎదుర్కొన్నవాడు నవాబు సిరాజ్ ఉద్దౌలా.  అప్పటికి అతని వయస్సు నిండా పాతికేళ్ళు కూడా కావు. అతన్ని అతి క్రూరంగా చంపిన తరువాతే భారత గడ్డ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలన ఆరంభం అయింది.  

 

          ఇది జరిగిన వందేళ్ల తరువాత 1857 మధ్యలో సిపాయిల తిరుగుబాటు అనే భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం సాగింది. ప్రాదేశిక జాతీయవాదం (Territorial nationalism)  ఆదర్శాన్ని తొలిసారిగా ముందుకు తెచ్చిన పోరాటం అది. దాని ఆరంభ నాయకుడు మౌల్వీ అహమదుల్లా షా. తిరుగుబాటుకు గౌరవ జాతీయ నాయకుడు ఎలాగూ వృధ్ధ చక్రవర్తి బహద్దూర్ షా జాఫర్.

 

ప్రాదేశిక జాతీయవాదం అంటే మరేమీకాదు; బ్రిటీష్ వలస పాలకుల్ని తరిమేశాక మిగిలినవాళ్ళందరూ భారత గడ్డ మీద  కలిసిమెలసి జీవించాలనేది ఈ ఆదర్శం. ఇదే రాజ్యాంగ రచన నాటికి సర్వ సామరస్య   సోదరభావంగా మారింది.

ఉత్తరాదిన మొదలైన భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాట ప్రభావం దక్షణాదికి కూడ విస్తరించింది. నిజాం ప్రిన్సిలీ స్టేట్లో, తిరుగుబాటుదార్లు హైదరాబాద్ లోని నిజాం ప్యాలెస్ మీదికి కాకుండా నిజాం మీద పెత్తనం చేస్తున్న రెసిడెంట్ మేజర్ కట్ బెర్ట్ డేవిడ్సన్ కోఠీ రెసిడెన్సీ మీదికి దండెత్తారు. దీనికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్ (తురుం) ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ సామాజికవర్గాలు ఏమిటో విడిగా చెప్పాల్సిన పనిలేదు.

తొంభై ఏళ్ళ తరువాత నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. దాని నాయకులు నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర‌ జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డిల మీద పోరాటం చేశారు. వారికి రాజధాని నగరంలోని  నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ గురించిగానీ, బ్రిటీష్ రెసిడెంట్ సర్ ఆర్ధర్ కన్నింఘామ్ లోథియన్ గురించిగానీ అంతగా తెలీదు. అసలా పోరాటంలో నిజాం ప్రస్తావన కూడా చివరి రోజుల్లో - అంటే 1947 ఆగస్టులో బ్రిటీష్ పాలన ముగిశాకమాత్రమే వచ్చింది. వాళ్ళకన్నా పది దశాబ్దాల ముందు పోరాడిన తురుం ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ లు ఈస్ట్ ఇండియా కంపెనీ రెసిడెంట్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు.

1857 తిరుగుబాటు ముందుకు తెచ్చిన ప్రాదేశిక జాతీయవాదమే జాతియోద్యమానికి ప్రేరణగా మారింది.  భగత్ సింగ్, ఉధామ్ సింగ్ వంటి విప్లవవాదులు, మహాత్మా గాంధీ వంటి అహింసావాదులు ప్రాదేశిక జాతీయవాదాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. భావి భారత ప్రజల నుదిటి రాతను రాసిన రాజ్యాంగ సభ సభ్యుల్లో - అందరిదీ కాకున్నా - అత్యధికులదీ ఇదే ఆదర్శం. దేశానికి ఇంతటి ప్రభావశీల  సామాజిక సిధ్ధాంతాన్ని అందించిన వారెవరూ? అనే అంశం మీద ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు.

 

1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ కు బదురుద్దీన్ తాయబ్జీ, రహీమతుల్లా మొహమూద్ వ్యవస్థాపక సభ్యులు. తరువాతి కాలంలో వాళ్ళు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షులుగానూ పనిచేశారు. భారత సామాజిక రాజకీయ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న సుల్తాన్ మొహమ్మద్ షా (ఆగా ఖాన్ – 3)  సహితం బాల్యం నుండి కాంగ్రెస్ పెరుగుదలకు తోడ్పడినవారే.  

 

1920 అక్టోబరు నెలలో తాష్కెంట్ లో ఏర్పడిన భారత జాతీయ కమ్యూనిస్టు పార్టికి మొహమ్మద్ షఫీక్ సిద్దీఖి వ్యవస్థాపక కార్యదర్శి; ముహమ్మద్ ఆలీ వ్యవస్థాపక సభ్యులు. వాళ్ళిద్దరూ పాన్ఇస్లామిక్ ఖిలాఫత్ ఉద్యమ నాయకులు. 1925లో  కాన్పూరులో పుట్టిన  భారత కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపక సభ ఆహ్వాన సంఘానికి మౌలానా హస్రత్ మోహానీ అధ్యక్షునిగా వున్నారు. ముజఫర్ అహ్మాద్, ఎస్ డి హసన్, ఆజాద్ సోమానీలు తదితరులు సిపిఐ వ్యవస్థాపక కేంద్ర సభ్యులు.

 

దాదాపు కాలంలోనే, ఉవ్వెత్తున సాగిన సాయుధ విప్లవపోరులో అష్ఫఖుల్లా ఖాన్, గదర్ పార్టీలో మౌలానా బర్కతుల్లా భోపాలీ, సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో కెప్టెన్ అబ్బాస్ ఆలీ వంటివారు మనకు కనిపిస్తారు.

 

1935-36 ప్రాంతాల్లో ఏర్పడిన అభ్యుదయ రచయితల ఉద్యమం వ్యవస్థాపకులు డజన్ మందిలో ఎనమండుగురు ముస్లింలు, నలుగురు ముస్లిమేతరులు సంస్థకు తొలి అధ్యక్షులుగా  వుండిన మున్షీ ప్రేమ్ చంద్ అప్పటి డిమాండును బట్టి ఉర్దూలో రచనా వ్యాసాంగాన్ని సాగించేవారు. అప్పట్లో పుస్తకాలు చదివే భారతీయుల్లో ముస్లింలే ఎక్కువమంది అనే వాస్తవాన్ని మరచిపోరాదు. పాలకులు ఒక కుట్ర పథకం ప్రకారం ఉర్దూను పక్కన పెట్టి  ఇతర భాషల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాక ముస్లింలు కుత్రిమంగా నయా నిరక్షరాశ్యులు అయిపోయారు.   

బ్రిటీష్ వలస పాలనలో పోరాడో, లాబీయింగ్ చేసో రాజకీయ ఉద్దీపన పథకాలని అందుకున్న తొలి సామాజికవర్గం ముస్లింలు. తమ శాసనకర్తల్ని తామే ఎన్నుకునేలా ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు (separate electorates) ఏర్పాటు చేయాలనే  డిమాండును  ముస్లిం లీగ్  ముందుకు తెచ్చింది. 1909 నాటి మోర్లే-మింటో సంస్కరణలు, తద్వార వచ్చిన ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ -1909 ముస్లిం లీగ్ డిమాండును ఆమోదించింది. 1916లో ముస్లిం లీగ్ తో చేసుకున్న లక్నో ఒప్పందంలో  జాతీయ కాంగ్రెస్ కూడ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును సమర్ధించింది.

శిక్కు, క్రైస్తవ, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ సామాజికవర్గాలు సహితం ముస్లింల నుండి ప్రేరణ పొంది తమకూ ప్రత్యేక నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయాలని కోరారు. 1919 నాటి మోంటేగు-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ -1919 ద్వార నాలుగు సామాజికవర్గాలకు సౌకర్యం హామీగా మారింది. అప్పటి దేశ జనాభాలో ముస్లింలు 25 శాతం వుండగా శాసన సభల్లో 33 శాతం స్థానాలు కేటాయించారు. అంటే దామాషాకన్నా 33 శాతం ఎక్కువ!.

అణగారిన వర్గాలకు కూడ ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను 1930లో బీఆర్ అంబేడ్కర్  ముందుకు తెచ్చారు.   1931 చివర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అంశం మీద చాలా వాడివేడి చర్చలు జరిగాయి. తనను హిందూ సమాజపు ప్రతినిధిగా ప్రకటించుకున్న గాంధీజీ - అణగారిన వర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కనుక వాళ్ళకు  ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించరాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ, అణగారినవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే, అవి హిందూ సమాజాన్ని శాశ్వతంగా విభజిస్తాయని గట్టిగా ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కానేకాదనీ,  వాళ్ళు భారత జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సమూహం కనుక వాళ్ళను విడిగా పరిగణించి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనేది అంబేడ్కర్ వాదన. బ్రిటీష్ ఇండియాలోని ప్రతి ప్రత్యేక సమూహానికీ ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు పూర్తిస్థాయి రాజకీయ భద్రతలు కల్పించాలని  ముస్లిం లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా, ఆగా ఖాన్-3 తదితరులు కోరారు. అలా వాళ్ళు, రౌండ్ టేబుల్ సమావేశంలో శిక్కు, క్రైస్తవ సమూహాలతోపాటు అణగారినవర్గాలకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు

ముస్లిం క్రైస్తవ, శిక్కు, అణగారినవర్గాలు ఏకం కావడంతో గాంధీజీవాదం వీగిపోయింది. ముస్లిం లీగ్, అంబేడ్కర్ సంయుక్త వాదం బలాన్ని సాధించింది. అప్పటి బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ అణగారినవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932 ఆగస్టు 16 కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. చరిత్రలో బహుజన ఐక్యతకు ఇది తొలి విజయం!  

అణగారినవర్గాలకు కమ్యూనల్ అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ  గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో అంబేడ్కర్ వారితో పూనా ఒప్పందం చేసుకున్నారు. అలా, అణగారినవర్గాలకు  71 ప్రత్యేక నియోజకవర్గాలు రద్దు అయ్యాయి, 148 రిజర్వుడు నియోజకవర్గాలు వచ్చాయి. వీటి లాభనష్టాల మీద ఇప్పటికీ భిన్నమైన చర్చలు సాగుతూనే వున్నాయి.

కేబినెట్ మిశన్ ప్లాన్ – 1946 ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తున్నపుడు ఒక విశేషం జరిగింది. ప్రాంతీయ శాసనసభల నుండి పరోక్ష ఎన్నికల ద్వార (ఇప్పటి రాజ్యసభ సభ్యుల్లా) రాజ్యాంగసభ సభ్యులు ఎన్నిక కావాలి. షెడ్యూల్ కాస్ట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా అంబేడ్కర్ 1946 జులైలో బాంబే ప్రెసిడెన్సీ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతున్న మరో షెడ్యూల్డ్ కాస్ట్ సభ్యుడు ఎన్ ఎస్. కజ్రోల్కర్ చేతుల్లో ఓడిపోయారు. రాజ్యాంగసభలో తాను వుండితీరాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న అంబేడ్కర్ కు నిరాశే ఎదురయింది. సమయంలో ముస్లిం లీగ్ ముందుకు వచ్చి పక్షం రోజుల్లోనే  తమకు బలం వున్న తూర్పు బెంగాల్ అసెంబ్లీ నుండి అంబేడ్కర్ ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించింది. ఇందులో ముస్లిం లీగ్ స్వార్ధం కూడ వుండొచ్చు. అణగారిన కులాల పక్షపాతి అయిన అంబేడ్కర్ రాజ్యాంగ సభలో వుంటే ముస్లిం మైనారిటీల రాజకీయ, సామాజిక భద్రతల కోసం కృషిచేస్తారని జిన్నా తదితరులు ఆశించి వుండవచ్చు. కానీ, అలా జరగలేదు. కొత్త రాజ్యాంగం వచ్చాక భారత ముస్లింలకు గతంలో వుండిన ప్రత్యేక నియోజకవర్గాలు మిగలలేదు; కొత్త రిజర్వుడు స్థానాలూ రాలేదు. ఇతర ఉద్దీపన చర్యలూ దక్కలేదు. తూర్పు బెంగాల్ లో తాను గెలిచిన స్థానాన్ని అంబేడ్కర్ కోసం రాజీనామా చేసి తప్పుకున్న  ముస్లిం లీగ్ నాయకుడు జోగిందర్ నాథ్ మండల్. ఆయన తరువాతి కాలంలో పాకిస్తాన్ తొలి న్యాయ, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు.

  తాము పరాజితులమని భారత ముస్లిం సమాజానికి 1857 పోరాటం తరువాత స్పష్టంగానే అర్ధం అయింది. బ్రిటీష్ పాలకులు ముస్లీంల్ను నమ్మేవారుకాదు. వాళ్ళను అనుమానిస్తూనే వుండేవారు.  స్వాతంత్ర్యానంతరం కూడ పరిస్థితి మారలేదు. మీ దేవుడ్ని మీరు కొలుచుకోవచ్చు, నమాజులు చేసుకోవచ్చు తప్ప ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు, ఉద్దీపన చర్యలు మాత్రం ఆశించవద్దనే సంకేతాలనే అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ఇస్తూవచ్చాయి. ఈమాటల్ని కాంగ్రెస్ పైకి చెప్పేదికాదు; సంఘపరివారం పైకి చెప్పేది. అంతే తేడ.

తెలంగాణ రైతాంగ పోరాటానికి కామ్రేడ్స్ అసోసియేషన్ ఒక మేధో సరోవరంగా పనిచేసింది. రాజ్ బహద్దూర్ గౌర్ వంటి ఇద్దరు ముగ్గురు తప్ప సంస్థలోని వాళ్ళందరూ ముస్లింలే. తెలంగాణ పోరాటంలో మొదటి అమరుడు బందగి; చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇది చరిత్రేకదా? 1977 ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్యకన్నా ఎస్ రవూఫ్ కేడర్ కు  చాలా ఆకర్షణ గల నాయకుడు.

మరోవైపు, కమ్యూనిస్టు పార్టీల  తీరు ముస్లింలకు మరీ ఇబ్బందిగా మారింది. మార్క్స్ నుండి మతం మత్తుమందు అనే మాటనే తీసుకున్నారుగానీ వర్గ సమాజంలో మత ఆవశ్యకతను గురించి   ఆయన అన్న మాటల్ని పట్టించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీల  నాయకులు నాస్తికత్వానికి ఎక్కువ మార్క్సిజానికి తక్కువగా వ్యవహరించడం మొదలెట్టారుభారత కమ్యూనిస్టు పార్టీని ముస్లిం హజ్రత్ లు, మౌల్వీలు మొదలెట్టారన్న వాస్తవాన్ని సహితం వాళ్ళు మరచిపోయారు. బయట చెప్పుల స్టాండ్ దగ్గర మతాన్ని వదిలిపెట్టి పార్టీ ఆఫీసుల్లోనికి రావాలని ఆదేశించడం మొదలెట్టారు. బయట సంఘపరివారం ముస్లీంలను అంతర్గత ముప్పుగా ఎలాగూ ప్రకటించేసింది. ఇటు,  కమ్యూనిస్టు పార్టీలు మతాన్ని వదులుకోమంటుంటే ముస్లింలు ఏం చేయాలీ? ముస్లిం ఉనికిని కూడ మిగలనివ్వరా? కమ్యూనిస్టు నాయకులు చనిపోతే ఖననం చేస్తారా? దహనం చేస్తారా? ఒకవైపు, పార్టీ ఆఫీసులకు ముస్లింలుగా రావద్దు అంటూనే మరోవైపు ముస్లింలు సామాజిక ఉద్యమాల్లోనికి రారు అని నిందించడం ఎంతవరకు సమంజసం.  వేడి పాలతో  మూతి కాల్చుకున్నవారు మజ్జిగను కూడ  ఊదిఊది తాగుతారు. కపట రాజకీయ రంగం ముస్లింలను అలా భయపెట్టేసింది.

నిరంకుశ పోకడలు పోయే ప్రభుత్వాన్ని ఫాసిస్టు అంటాం. ఫాసిజం అప్రతిహత శక్తి ఏమీ కాదు దానిని  ఓడించవచ్చు అని ప్రపంచానికి తొలిసారి చాటి చెప్పింది ఎవరూఇటలీ మొస్సోలినీ ఫాసిజానికి  మొదటి దెబ్బ కొట్టింది ఉత్తర ఆఫ్రీకాలోని లిబియాలో 1942లో జరిగిన ఎల్ ఆలమెయిన్ యుధ్ధంలో కాదా? వాళ్ళు గెడ్డాలు, టోపీలు  పెట్టుకునే ఫాసిస్టు సైన్యాలను ఎదుర్కోన్నారు. వాళ్ళ ప్రేరణతోనే రెండవ ప్రపంచ యుధ్ధంలో మిత్రపక్షాలు ధైర్యాన్ని నింపుకునాయి.

కార్పొరేట్ మతతత్వ నిరంకుశత్వాన్ని (Corporate Communal Dictatorship)ను దేశ రాజధాని నగరంలో  దిగ్బంధం చేయవచ్చని ఎవరు నేర్పారూ? ఒంటినిండా బుర్ఖాలు కప్పుకున్న ముస్లిం మహిళలు కాదా? వాళ్ళు చూపిన దారిలోనే ఢిల్లీ మహానగరంలో రైతుల ఆందోళన సాగింది.

శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ప్రాన్స్, లఢాఖ్ లో అకస్మిక నిరసనలు చెలరేగాక వీటి మీద ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. వీటిని అరబ్ తరహా  అకస్మిక నిరసనలు (Arab style spring protests) అంటారు. వీటి పుట్టినిల్లు కూడ ఒక చిన్న ముస్లిం దేశం. ఉత్తర ఆఫ్రికాలోని టునీసియాలో 2010 డిసెంబరు 11 పోలీసుల హింసను భరించలేక ఒక హాకర్ నడిరోడ్డు మీద తనకు తాను నిప్పంటించుకున్నాడు. అంతే, టునీషియా  యువతరం రోడ్ల మీదకు వచ్చి దేశాధినేత గద్దె దిగే పారిపోయే వరకు దాదాపు నెలరోజులు నిరసనలు సాగించింది. మనమేమీ చేయలేం గానీ జెన్జీ అనగా కొత్తతరం రావలసిందే అనే మాట ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తోంది.

మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు ఏకం కావాలనే కోరిక రెండు మూడు దశాబ్దాలుగా వినిపిస్తోంది. దీనినే  లాల్ నీల్ మైత్రి అంటున్నారు. నేటి కార్పొరేట్ మతతత్వ నిరంకుశత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసులు కదా? మరి వాళ్ళను కలుపుకోరా? ముస్లింలు, ఆదివాసుల సంయుక్త రంగు ఆకుపచ్చ. దీనినే హర్యాలి అంటారు. హర్యాలి అంటే తమకు తెలీదని కొందరు అంటున్నారు. నిజంగానే తెలియకపోతే ఎవరయిన్క తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవాల్సిన పని లేదు అనుకుంటేనే సమస్య.

కమరా అంటే ఉర్దూలో గది. ఈ పదం లాటిన్ లో కూడ వుంది.  ఇందులో నుండే కెమేర అనే పదం పుట్టింది. రహాస్య సమావేశాల్ని ‘ఇన్ కెమెరా మీటింగ్’ అనడం మనకు తెలుసు. ఒకే గదిలో సన్నిహితంగా నివసించేవారిని స్పానిష్ లో కమరాడ అంటారు. అది ఫ్రెంచ్ లో కమరాడే అయ్యింది. తరువాత ఇంగ్లీష్ లో కామ్రేడ్  అయ్యింది. కమ్యూనిస్టుల సంస్కృతి పెరిగాక ఉద్యమ సహచరుల్ని కామ్రేడ్స్ అనే సాంప్రదాయం మొదలయ్యింది. అలాగే అనేక భాషల నుండి లాల్ సలామ్, ఇంక్విలాబ్, జిందాబాద్ వంటి పదాలు వచ్చాయి. ఆ క్రమంలోనే హర్యాలి వచ్చింది అనుకోవాలి.

హర్యాలీకి తెలుగులో కూడ పునాదులున్నాయి. ఆకులు పచ్చగా ఉండేందుకు దోహదపడే పదార్ధం  క్లోరోఫిల్. దానిని తెలుగులో పత్రహరితం అంటారు. గ్రీన్ రివల్యూషన్ ను తెలుగులో హరిత విప్లవం అంటాము. ఆ హరితమే హర్యాలి. ఇది ముస్లింలు, ఆదివాసుల ఉమ్మడి రంగు.

రంగుల గురించి తెలిసినవాళ్ళకు ఒక జ్ఞానం వుంటుంది. లోకంలోని రంగులన్నింటికీ మూలం ఎరుపు, ఆకుపచ్చ, నీలం. వీటిని ఇంగ్లీషులో ఆర్-జి-బి (RGB) అంటారు. ఈ మూడు రంగులతో కోటాను కోట్ల షేడ్లు సృష్టించవచ్చు. భారత సామాజిక రంగంలోనూ ఎరుపు, ఆకుపచ్చ, నీలం కలిస్తే అద్భుతాలు జరుగుతాయి.

 

డానీ

సమాజ విశ్లేషకులు

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

10-10-2025