Wednesday, 9 April 2025

Peace Talks - 2004 Part - 2

 శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన

*ఒక అద్భుత ప్రయాణం! 

 


శాంతి చర్చల సమయంలో ప్రభుత్వం వున్నంత ఉదారంగా పోలీసులు వుండరు. మరీ ముఖ్యం నిఘా విభాగం పోలీసులు. నక్సల్స్ నాయకుల డెన్ ల  ఆచూకీ తెలుసుకోవడానికి రకరకాలుగా కూపీ లాగుతూనే వుంటారు.

రంజాన్ మాసం ఆరంభమయింది. నేను ఉపవాసాలు చేస్తున్నాను. ఆరోజు అక్టోబరు 20 అనుకుంటాను. రాత్రి నిద్రపోవడానికి ముందు ఫోన్ వచ్చింది. అవ్తల చెలం. “నన్ను నా ఏరియాలో దించుతావా?” అని అడిగాడు.

మరో ఆలోచనకు తావివ్వకుండ “దించుతాను” అన్నాను.

            చెలం అప్పట్లో ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ జోనల్ (AOBZ) సెక్రటరీగా వుంటున్నాడు.  ఒరిస్సాలో విపరీతంగా ప్రయాణించిన అనుభవం నాకుంది. తను వెళ్ళాల్సిన చోటు సీలేరు , మల్కాన్ గిరి ప్రాంతంలో వుంటుందని అనుకున్నాను.

చెలం ఆ రాత్రి నన్ను అలా కోరడం మాత్రం ఆశ్చర్యం అనిపించింది.

నేను 1978లో సివోసిలో చేరాను. అప్పట్లో దాన్ని బయటి జనం కొండపల్లి సీతారామయ్య గ్రూపు అనేవారు. ఆ తరువాత అది పీపుల్స్ వార్ అయ్యింది. ముందు యూత్ వింగ్ లో చేరాను. అలాఅలా అక్షరాల నుండి ఆయుధాల వరకు అన్ని విభాగాల్లోనూ పనిచేశాను. కొంత కాలం కొండపల్లి సీతారాయ్యకు కొరియర్ కమ్ బాడీగార్డ్ గానూ వున్నాను.

విప్లవోద్యమంలో అనేక దశలుంటాయి; కనీసం ఐదు భిన్న దశలుంటాయి.  జాగ్రత్తగా గమనిస్తే 1920ల నాటి మన్యం తిరుగుబాటులో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. వాటన్నింటి గురించి మాట్లాడడానికి ఇది సందర్భంకాదుగానీ మొదలయినపుడు వున్నంత సహృదయత, విశాల దృక్పథాలు నాయకుల్లో తరువాతి కాలంలో వుండవు.  వాళ్ళలో బ్యూరాక్రసీ గట్టిగానే తలకెక్కుతుంది. చెవులు పనిచేయవు; నోరు మాత్రమే పనిచేస్తుంది. వ్యక్తి సామర్ధ్యంకన్నా విధేయతకు ఎక్కువ మార్కులు వేస్తారు.  ప్రశ్నించిన వారిని వర్గ శత్రువుకన్నా ఎక్కువగా వేధిస్తారు. విసిగిపోయి 1990లో పీపుల్స్ వార్ తో నేను పూర్తి బంధాలనూ తెంచుకున్నాను.

పీపుల్స్ వార్ కన్నా దుందుడుకు పార్టి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్. అవి రెండూ కలిసి మావోయిస్టు పార్టి ఏర్పడడంతో నా సంధిగ్ధం పోయింది. పీపుల్స్ వారే లేదుగా!. పైగా, నన్ను చాలా ఇబ్బంది పెట్టిన రాష్ట్ర కమిటి కార్యదర్శి ముక్కు సుబ్బారెడ్డి (రంగన్న), కేంద్ర కమిటీ సభ్యుడు నిమలూరి భాస్కర రావు ( మల్లిక్) ఇద్దరూ వీరోచితంగా ప్రభుత్వానికి లొంగిపోయారు. వాళ్ళతో ఘర్షణ పడినందుకు ఇప్పటికీ నాకు గర్వంగానే వుంటుంది.  

అయితే నాకో సరిహద్దు గోడ వుంది. 1985కన్నా ముందు నాతో పార్టీలో పనిచేసినవారితో ఒక భావోద్వేగ అనుబంధం ఎప్పుడూ వుంటుంది. తరువాత వచ్చిన వారి గురించి తెలుసుకోవాలని కూడ నేను అనుకోలేదు. 

నేను వదిలేసినా పీపుల్స్ వార్ నన్ను వదలలేదు. అసందర్భంగా నైతిక పరీక్షలు పెట్టేది. “కొందరు ఎంసిసి సభ్యులు, బీహారు వాళ్ళు;  విజయవాడ బెంజ్ సర్కిల్ లో బస్సు దిగారు. వాళ్ళను సురక్షిత ప్రాంతానికి చేర్చాలి” అని ఎవరో ఫోన్ చేస్తారు. ఇంకోసారి బెజవాడ రైల్వేస్టేషన్ లో పంజాబ్ నుండి ముగ్గురు వచ్చి వున్నారు. ఎనిమిది  గంటలు వుంటారు. ఉదయం పినాకిని క్స్ ప్రెస్ ఎక్కించాలి అని ఇంకో ఫోను. ఇంకెవరో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. “పాత కామ్రేడ్ ఒకామె ఒక రహాస్య మీటింగుకు ఇల్లు ఇచ్చింది. అక్కడ కుళ్ళిన ఆహారం తిని ఇద్దరు బెంగాలీ సభ్యులు చనిపోయే పరిస్థితి వచ్చింది. మీరే కాపాడాలి” అని. నేను వెళితే ఒక ముప్పు; వాళ్లతోపాటు నేనూ అరెస్టు అవుతాను. వెళ్ళకపోతే ఇంకో ముప్పు; “డానీకి చెప్పాము అతను వెళ్ళలేదు; దారి తెలీక వాళ్ళు అరెస్టు అయ్యారు”  అని నిందిస్తారు. నాకేమిటీ ఈ గోల?  వాళ్ళ అరెస్టు నింద నాకెందుకని రిస్క్ చేస్తాను.  

“ప్లాన్ చేయడం రాదు; ఎగ్జిక్యూట్ చేయడం రాదు. వచ్చే ప్రమాదాన్ని ఊహించి విరుగుడును సిధ్ధం చేయడం అస్సలు తెలీదు. ఎవడ్రా మిమ్మల్ని రిక్రూట్ చేసింది?” అని కొంచెం గట్టిగానే అరిచిన సందర్భాలూ వున్నాయి. అప్పుడు వాళ్ళు “మీరు పెర్ఫెక్షనిస్టు అని మీకు చెప్పాము” అంటారు. అది వారి అమాయకత్వమో అతి తెలివో? అర్ధం కాదు.

ఇలాంటి సంఘటనలు అనేకం. అవన్నీ చెప్పుకుంటూ పోతే అది ఇప్పట్లో తేలదు.

“మీ ఆఫీసు వాళ్ళు కారు ఇస్తే అందులో పోదాం. న్యూస్ ఛానల్ కారుగా. కొంచెం సేప్టి”  అన్నాడు చెలం. అప్పటికే రాత్రి 10 కావస్తోంది.  ముందు కారు కావాలి. డ్రైవరు కావాలి. కెమేరా మాన్ కావాలి. కారుకు పెట్రోలు కావాలి.   వీటన్నింటికీ ఆఫీసు పర్మిషన్ కావాలి. ఆ డ్యూటి నాకే  వేయాలి. దాదాపు అసాధ్యమైన వ్యవహారం.

అయినా ధైర్యం చేసి ఆఫీసు జనరల్ మేనేజరు ధనేకుల సుందరయ్యకు ఫోన్ చేశా. సుందరయ్య నాకు మంచి మిత్రుడు. కాలేజీ రోజుల్లో ఏఐఎస్ ఎఫ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. జమిందార్ బిల్డింగులో తనది మా పక్క రూమే.

“కారు కావాలి ఒరిస్సా వెళ్ళాలి” అన్నాను.

సుందరయ్య ముదురున్నర ముదురు; హైదరాబాద్ లో బెజవాడ రౌడి.  వెంటనే “చెలాన్ని దింపుతున్నావా?” అని అడిగేడు.  

“అవును” అన్నాను.

“చెలం ఐదు రోజులుగా ఇక్కడే వున్నాడు గాబట్టి ఒరిస్సా వెళ్ళి ఇంటర్వ్యూ చేయ్యాల్సిన పనిలేదు. ఎండి ఒప్పుకోడు. అక్కడ ఇంకో పెద్ద నక్సలైట్ ఇంటర్వ్యూ చేస్తానని చెపితే సరిపోతుంది. నువ్వు అలా చెప్పు. మిగతావి నేను చూసుకుంటాను” అన్నాడు. 

గంటలో కారు, డ్రైవరు, కెమేరా మేన్ అంతా సెట్ అయ్యారు.

చెలం మళ్ళీ ఫోన్ చేశాడు. అంతా సెట్ అయ్యింది అన్నాను. “అజిత కూడ వస్తే బాగుంటుంది’ అన్నాడు. “తనతో ఒక టెక్నికల్ పనుంది. అలా జర్నీలో ఫ్యామిలీగా కనిపిస్తాము. ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.

ఆరోజు అజిత హైదరాబాద్ లో లేదు. విజయవాడలో వుంది. ఫోన్ చేసి చెప్పాను ఇలా చెలం అడిగాడు అని. తనూ వస్తానంది. టైమ్ కో-ఆర్డినేషన్ చాలా ముఖ్యం. తక్షణం బయలుదేరి హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ అరైవల్ టెర్మినల్ వద్ద వేయిట్ చేయమన్నా.

అందరం తెల్లారు జామున సి-టీవీ ఆఫీసు నుండి బయలు దేరి బస్ స్టాండ్ లో అజితను ఎక్కించుకుని ఉదయం 9 గంటలకు శ్రీశైలం చినఆరుట్ల చేరుకున్నాము.

కొద్ది సేపు ఎదురుచూసిన తరువాత రెండు పార్టీల ప్రతినిధులు ఐదుగురు వచ్చారు. గద్దర్ వాళ్ళకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాడు.

అందరూ వెళిపోయాక మా కారు బయలు దేరింది. ఈటీవి రిపోర్టరుకు నేను చెలం వెంట వెళుతున్నట్టు అర్ధం అయింది. నా దగ్గరేదో బిగ్ న్యూస్ వుంటుందనుకుని తనూ నాతోనే వస్తానన్నాడు.

ఏ పదకుండింటికో బయలు దేరి దోర్ణాల మీదుగా గుంటూరు సమీపంలోని ఫిరంగిపురం చేరుకున్నాం. చాలా లేటు అయ్యింది గానీ అక్కడే డాక్టర్ జయకుమార్ నడుపుతున్న స్కూల్ లో లంచ్ చేశారు అందరూ.

రాత్రికి విజయవాడ చేరుకుని సూర్యరావుపేటలో ఓ నర్సింగ్ హోం నిర్వాహకుని ఇంట్లో రాత్రి భోజనం చేసి అక్కడే పడుకున్నాం. ఆయన విజయవాడలో ప్రముఖ నెఫ్రాలజిస్టు; చెలంకు ఎక్కడో క్లాస్ మేట్.

రెండో రోజు  ఉదయం విజయవాడలో బయలు దేరి 9-10 గంటలకు కొవ్వూరులొ గోదావరి గట్టుకు చేరుకున్నాం. అక్కడ తోరాడ నరసింహారావు, పెండ్యాల మల్లేశ్వరరావు తదితరులు బ్రేక్ ఫాస్ట్ తో సిధ్ధంగా వున్నారు. మల్లేశ్వర రావు చెలంకు కొంచెం సీనియర్. తోరాడ నరసింహారావు నాకు రాజమండ్రి సెంట్రల్ జైలులో తోటి ఖైది.

రాడికల్ విద్యార్ధి నాయకుడు చెరుకూరి రాజ్ కుమార్ (ఆజాద్) ను విడిపించడానికి 1980లో రాజమండ్రి మ్యూజియం రోడ్డు పోలీస్ స్టేషన్ కష్టడీని బ్రేక్ చేశారు. ఆ సందర్భంగా సిఐ, ఎస్సైలకు గట్టిగానే దెబ్బలు తగిలాయి. ‘Attempt to murder on circle inspector and sub inspectors in police station’ అనేది మా మీద పెట్టిన కేసు. తోరాడ నరసింహారావు A1. నేను A3.

రాజమండ్రి నుండి ఎర్రవరం వరకు నేషనల్ హైవేలో వెళ్ళి అక్కడి నుండి మన్యంలోనికి ప్రవేశం. అడవిలో దొరకనివి కొనుక్కోమని ఎలేశ్వరంలో ముందుగానే చెప్పారు. అక్కడి నుండి మన్యం పితూరీలో మనం వినే ఊర్లు అన్నింటి మీదుగా ప్రయాణించడం గొప్ప థ్రిల్. కోనలోవ, జద్దంగి, రాజవొమ్మంగి, పెద్ద వలస, ఆర్ వి నగర్ ల మీదుగా జికే వీధి  చేరే సమయానికి రాత్రి 7 దాటింది. చలికాలం కావడంతో బాగా చీకటిగా వుంది.

ఆ తరువాత దారీ ఊర్లు మాకు తెలీవు. రోడ్డు దిగి అడవి బాట పట్టాము. ఒకతను బైక్ మీద మా కార్లకు ఒక గంట పాటు దారి చూపిస్తూ వెళ్ళాడు. ఆ తరువాత ఆ దారికూడ లేదు. పచ్చిరోడ్డు. వర్షాలు పడి నీళ్ళు ప్రవహిస్తునాయి. బైకు వాడు పోయి ఒక కుర్రోడు వచ్చాడు. అతను ముందు పరుగెడుతుంటే మా కార్లు అతన్ని అనుసరించాయి. కొన్ని చోట్ల రాళ్ళ మీదుగా, బురదలో నుండి వెళ్ళడానికి కార్లు మొరాయించాయి. పరిసరాల్లో వున్న చెట్ల కొమ్మలు నరికి దార్లో పరచి వాటి మీదుగా కార్లను తోసుకుంటూ వెళ్ళాము. స్థానికులు తోవ చూపకపోతే ఆ దారుల్లో వెళ్ళడం చాలా కష్టం. ఏమైనాగానీ రాత్రి పది దాటాక చెలం చెప్పిన గమ్యస్థానానికి చేరుకున్నాం. అడ్డంగా కొండ. దానికి ఆవల ఒరిస్సా; ఈవల ఆంధ్రప్రదేశ్.  నా బాధ్యత తీరిపోయింది. ఊపిరి  పీల్చుకున్నాను.

ఏవో చిన్న దీపపు బుడ్డీలు వున్నాయిగానీ వెలుతురు లేదు. భోజనం పెట్టారు. ఏం పెట్టారో తెలీదు. తినేశాం. పక్కనే చిన్న బడి వుంది. అందులో నాలుగో ఐదో పొట్టి బల్లలున్నాయి. రెండేసి పక్కన చేర్చి అదే మంచం అనుకుని పడుకున్నాం. మా స్టాఫ్ కార్లలొ పడుకున్నారు. బాగా చలి.

మరునాడు ఉదయం తెల్లారక ముందే సైనిక దుస్తుల్లోవున్న కొందరు సాయుధులు  మేమున్న గది తలుపుల్ని తోసి గుమ్మానికి అడ్డంగా నిలిచారు. ఆ శబ్దానికి నేను కళ్ళు తెరిచాను. ముందు వాళ్ళు పోలీసులేమో అనుకున్నాను. కొంచెం కంగారు కూడ వేసింది. ఒకతను టార్చి లైటుతో  గదంతా కలయ చూస్తున్నాడు.  నా ముఖాన్ని గుర్తుపట్టాడు. “డానీ గారా? మీరా? మీ రచనలు దొరక్క మేము ఫొటోస్టాట్ కాపీలు తీసుకుని చదువుకుంటున్నాం” అన్నాడు.

ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. నగరంలో ఓ పాఠకుడు దొరికితేనే రచయితలు సంబరపడిపోతారు. అలాంటిది కాకులు దూరనీ కారడవిలో గన్నుపట్టుకున్న పాఠకుడు దొరికితే ఎలా వుంటుందీ? టెన్షన్ పోయి సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాను.

ఉదయం ఏవో ఆ గెరిల్లా దళాల కసరత్తులు వగయిరా విన్యాసాలు చూశాము. పరిసరాల్లో కమతాలు చూశాము. అంతర పంటల విధానం వుంది అక్కడ. మధ్యాహ్నం ఏదో భోజనం పెట్టారు. తీపి గుమ్మడికాయ కూర వండారు. దాదాపు నూనె లేకుండా వండినా బాగుందనిపించింది.

పార్టీవాళ్ళు కొందరు వచ్చి కలిశారు. అజితకు కంప్యూటర్ల పరిజ్ఞానం వుందని వాళ్ళకు సమాచారం వుంది. అజితను ఒక వారం రోజులు వుండమని వాళ్ళు కోరారు. అజితకు కూడ అడవి అన్నా అన్నలన్నా పిచ్చి అభిమానం. తను వుండిపోయింది. మేము ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాము. సీలేరు, చింతురు, భద్రాచలం, కొత్తగూడెం మీదుగా రాత్రి పదింటికి ఖమ్మం చేరుకున్నాం.  అక్కడ డాక్టర్ గోపీనాథ్ మాకు భోజనం ఏర్పాటు చేశాడు. మరునాడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నాము.

ఇంకా కథ ముగియలేదు.

ఈ ఎపిసోడ్ లో నేను సాధించిన విజయంకన్నా అజిత సాధించిన విజయం గొప్పది.

ఇక్కడ ఇంకో  విషయం చెప్పాలి. అజిత వారం రోజుల తరువాత తిరిగి వచ్చింది. అక్కడి మీడియా విభాగానికి కంప్యూటర్ మెళుకువలు నేర్పింది. మన్యంలో కొన్ని రోజులు వుండడం మూలంగా  తనకు  మలేరియా రావచ్చని అక్కడి వాళ్ళు చెప్పారు. మలేరియా లక్షణాలు కూడ వివరించారు. సోకినట్టు అనుమానం రాగానే మందులు వాడడం మొదలెట్టాలని కూడ హెచ్చరించారట. హైదరాబాద్ తిరిగి వచ్చిన వారం రోజులకు అజితకు మలేరియా లక్షణాలు కనిపించాయి. హాస్పిటల్ కు వెళ్ళి మలేరియా అని చెప్పినా హైదరాబాద్ డాక్టర్లు ఒప్పుకోలేదు. వ్యాధిని ముదరబెట్టి క్రానిక్ దశకు తెచ్చారు. కిడ్నీలు పాడైపోయి బ్లాక్ వాటర్ వచ్చేసింది. చనిపోతుంది ఇక ఇంటికి తీసుకుపొండి అని డాక్టర్లు చెప్పేశారు.

అక్కడి నుండి కేర్ హాస్పిటల్ కు మార్చాము.  పి. ఫాల్సిపారిమ్ మలేరియా బ్లాక్ వాటర్ స్థితికి వచ్చాక నయం అయిన కేసు అప్పటికి ఇండియాలో ఒక్కటి కూడ లేదు. అలా బయటపడిన తొలి పేషెంట్ అజిత. ఆమె కేసును ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫెరెన్స్ కు రిఫర్ చేశారు. అజితను డిశ్చార్జ్ చేసిన రోజున డాక్టర్ తాళ్ళూరి శరత్ చంద్ర ఆయన  టీమ్ వచ్చి  ఆమెకు పూల బొకే ఇచ్చి గ్రూపు ఫొటో దిగారు.

ఇంతకన్నా గొప్ప కథ మరొకటి వుంది.

అడవి నుండి తిరిగి వచ్చాక అజిత ఆనారోగ్యం పాలైందని, చావు బతుకుల్లో వుందని తెలియగానే మావోయిస్టు పార్టి రంగంలో దిగింది. ముఖ్యంగా వరవరరావు సమన్వయం చేశారు.  మొత్తం హాస్పిటల్ ఖర్చు వాళ్ళే భరించారు. నెల తరువాత అజితకు మళ్ళీ అలాగే వచ్చింది. రెండోసారి కూడ వాళ్లే ఖర్చులు పెట్టుకున్నారు. అజితకు మూడో నెలలోనూ మళ్ళీ తిరగబడింది. మూడోసారి ఖర్చులు మాత్రం నేను భరించాను. 

Peace Talks - 2004 Part - 1

 శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన

*ఒక అద్భుత ప్రయాణం!*  




కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మావోయిస్టులు సిధ్ధం అయ్యారు.  ఇటీవల బస్తర్ పాండుమ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి దంతేవాడ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడ శాంతిచర్చలకు  సానుకూల సంకేతాలు ఇచ్చారు. మావోయిస్టుల్ని ‘సోదరులు’ అని సంభోదించారు. ఛత్తీస్ గడ్ తోపాటు మావోయిస్టుల ప్రభావం వున్న పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో త్వరలో శాంతి చర్చలు జరగవచ్చు.

గతంలో జరిగిన శాంతిచర్చలు సహజంగానే ఈ సందర్భంలో గుర్తుకు వస్తాయి. తిరుపతిలోని అలిపిరి దగ్గర 2003 అక్టోబరు 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారు మీద పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబుదాడి చేశారు. ఆ దాడి నుండి ఒక అద్భుతంగా చంద్రబాబు బయటపడ్డారు. ప్రజల ఐఏఎస్ అధికారిగా పేరుగాంచిన ఎస్ ఆర్ శంకరన్, ఈ నేపథ్యంలో,  చొరవ చేసి శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. విచిత్రం ఏమంటే 1987లో తూర్పుగోదావరిజిల్లా గుర్తేడులో పీపుల్స్ వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేసిన ఏడుగురు ఐఏఎస్ అధికారుల్లో శంకరన్ కూడ ఒకరు. అప్పట్లో వారు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా వుండేవారు.

శాంతి చర్చలకు పీపుల్స్ వార్ కూడ సంసిధ్ధత వ్యక్తం చేసింది. విధివిధానాల గురించి చర్చలు సాగుతున్న దశలోనే 2004 ఎన్నికలొచ్చి చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది.

కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన వాగ్దానాల్లో  నక్సలైట్లతో శాంతి చర్చలు జరుపుతామన్నది ఒకటి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే జీవో మీద తొలి సంతకం చేసిన రాజశేఖర రెడ్డి పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలకు చెందిన నక్సలైట్లను శాంతి చర్చలకు పిలిచారు. ఆ తరువాత చాలా కసరత్తు సాగింది. వాటిల్లోనూ ఎస్ ఆర్ శంకరన్ కీలక పాత్ర వహించారు. ముందు రాయబారుల కమిటి ఏర్పడింది. వరవరరావు, గద్దర్, కళ్యాణరావు , మరొకరు అందులో సభ్యులు.

అప్పట్లో కే. జానా రెడ్డి హోంమంత్రిగా వుండేవారు. ఆయనే ప్రభుత్వ బృందానికి నేత. ఆయనతోపాటు మరో ముగ్గురు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరో నలుగురు అందులో వున్నారు. పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (ఆర్కే), సుధాకర్ (చెలం) మరొకరు పీపుల్స్ వార్ పక్షాన, అమర్, మరొకరు జనశక్తి పక్షాన నక్సల్స్ ప్రతినిధులుగా వచ్చారు.

జూబిలీ హిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి  ఇన్ స్టిట్యూట్  ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ లో అక్టోబరు 15 ఉదయం చర్చలు మొదలయ్యాయి. అదేరోజు వైయస్ రాజశేఖర రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రం జరిగింది వైయస్ ప్రభుత్వం పీపుల్స్ వార్ ను చర్చలకు పిలిచింది. వాళ్ళ రాష్ట్ర  ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకున్నాక పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టిల కేంద్ర కమిటీలు ఏకమై సిపిఐ – మావోయిస్టుగా ఏర్పడ్డాయి.

నాలుగు రోజులు సాగిన చర్చలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చాలా ఆసక్తిని కలిగించాయి. నక్సల్ ప్రతినిధులకు విడిదిగా ఇచ్చిన మంజీర గెస్ట్ హౌస్ కు నిరంతరం అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు గుంపులు గుంపులుగా వచ్చి తమ సమస్యల్ని చెప్పుకునేవారు.

నక్సల్ ప్రతినిధులు అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. వాటిల్లో పేదలకు భూమి పంపిణి అనే అంశం మీద వైయస్  ప్రభుత్వం  సుముఖత వ్యక్తం చేసింది. ఆ నాలుగేళ్ళు చాలా పెద్ద స్థాయిలో భూమిని పంచింది. ఇది స్పష్టంగా కనిపించిన విజయం.

శాంతి చర్చలు లాభించలేదనే అభిప్రాయం నక్సల్స్ అభిమానులు చాలా మందిలో వుంది. చర్చలవల్ల ప్రభుత్వ పరపతి పెరిగినంతగా నక్సల్స్ పరపతి పెరగలేదు. దానికి అనేక కారణాలున్నాయి. మావోయిస్టులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకిన తరువాత అటు ఆంధ్రా ప్రాంతంలో వారికి సాధారణ అభిమానులు తగ్గుముఖం పట్టారు. ఇటు తెలంగాణలోనూ వారికి లాభించిందేమీ లేదు. కేసిఆర్ వారికి చేసిన మేలేమీ లేకపోగా  టిఆర్ ఎస్‍ ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మావోయిస్టుల మీద కూడ పడింది. 

జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఆనాటి చర్చల్లో పాల్గొన్న అమర్ అభిప్రాయం ఇందుకు భిన్నంగా వుంది. ఆనాడు గోదావరి లోయలో వరుస ఎన్ కౌంటర్లతో తమ పార్టి ఊపిరి ఆడని స్థితిలో పడిపోయిందనీ, చర్చలకు ఆహ్వానించడంతో ‘బ్రీదింగ్’ స్పేస్ దక్కిందని ఆయన ఇటీవల ఓ సందర్భంలో అన్నారు.  

నాకు వైయస్ జరిపిన శాంతి చర్చలతో ఒక వ్యక్తిగత అనుబంధం వుంది. నేను అప్పట్లో ఓ శాటిలైట్ ఛానల్ కు ముఖ్యమంత్రి పేషీ బీట్ చూస్తున్నాను. అటు ముఖ్యమంత్రి, హోంమంత్రి, కోనేరు రంగారావు, పాలడుగు వెంకట్రావులతో సన్నిహితంగా వుండేవాడిని. ఇటు, వరవరరావు, గద్దర్, శంకరన్ లతో కూడ సన్నిహితంగా వుండేవాడిని.

పీపుల్స్ వార్ ప్రతినిధిగా చర్చలకు వచ్చిన సుధాకర్ ( చెలం) ఉద్యమంలో నాకు జూనియర్. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ సమీపంలోని జమీందార్ బిల్డింగు హాస్టల్ లో మేమిద్దరం ఒకే గదిలో వుండేవాళ్ళం.  1981లో నేను హోల్ టైమర్ జీవితం నుండి పార్ట్ టైమర్ గా మారినపుడు చెలానికి శిక్షణ ఇవ్వాల్సిందిగా కేజి సత్యమూర్తి నన్ను కోరారు. చెలం నా భార్య అజితకు సీనియర్; గురువు కూడ.

నక్సల్ ప్రతినిధులు శ్రీశైలం సమీపంలోని చిన ఆరుట్ల దగ్గర అక్టోబరు 12న  బయటపడి, చారిత్రాత్మక గుత్తికొండబిలం దగ్గర సభ జరిపి  ప్రభుత్వంతో చర్చలకు వచ్చారు. ప్రభుత్వం కూడ చర్చల తరువాత  టెక్నికల్ గా వాళ్ళను చిన ఆరుట్ల దగ్గరే సురక్షితంగా దించేసింది. కానీ, అది వాళ్ళ స్థావరం కాదు. ఐదుగురికి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు డెన్ లున్నాయి. వాళ్ళు తమ పధ్ధతుల్లో రహాస్యంగా తమ డెన్ లకు చేరుకోవాలి.

నేను, అజిత ఇద్దరం సుధాకర్ (చెలం)ను చినఆరుట్ల నుండి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో సురక్షితంగా దించి వచ్చాము. అదొక అద్భుత ప్రయాణం. ఆ వివరాలు ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.

10 ఏప్రిల్ 2025

శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన

*ఒక అద్భుత ప్రయాణం!*  

https://www.youtube.com/watch?v=OcHDse-Q9BM

Tuesday, 1 April 2025

Danny on - Chat GPT & Grok

 నా గురించి Chat GPT & Grok లకు వున్న అభిప్రాయం 




Chat GPT

A.M. Khan Yazdani,  better known mononymously as Danny, is a distinguished Telugu writer, journalist, documentary filmmaker, political commentator, literary critic, humorist, and social worker. His multifaceted career reflects a deep commitment to societal issues and cultural discourse.

In the realm of journalism, Yazdani has been actively involved in reporting and analyzing critical events. For instance, he provided insights into the brutal murder of a Muslim man inside a masjid in Andhra Pradesh, highlighting the communal tensions and the need for justice. ​The News Minute

Yazdani also maintains a blog where he shares his thoughts and experiences. In one of his posts dated April 30, 2023, he reflects on the significance of Lenin's birthday coinciding with the festival of Eid, and shares a personal anecdote about a young visitor named Hashmi, emphasizing the importance of engaging with the younger generation.Instagram+1LinkedIn+1A.M. Khan Yazdani & Usha S Danny

Furthermore, he has been featured in various YouTube videos discussing topics ranging from the impact of Brahmanism on Marxism in India to contemporary political issues. His YouTube channel serves as a platform for his political commentary and social analysis. ​YouTubeYouTube

Through his diverse body of work, A.M. Khan Yazdani continues to contribute significantly to Telugu literature, journalism, and social activism, fostering critical discussions and advocating for societal progress.


GROK 

A.M. Khan Yazdani, Usha S Danny  ఇద్దరు జంట రచయితలు అనుకుంది. 

A.M. Khan Yazdani is known as Danny is a writer, journalist, and social commentator, often collaborating with Usha S. Danny on various intellectual and creative projects. Together, they’ve explored themes like education, social justice, and political critique, primarily in the Telugu-speaking context. Their work includes articles, translations (e.g., adapting Jean-Paul Sartre’s The Respectful Prostitute into Telugu with an Indian socio-political twist), and commentary on issues like farmer loan waivers and historical reflections (e.g., the defeat of Fascism). Their blog, khanyazdani.blogspot.com, showcases these efforts, blending literary criticism with activism.

Danny - mononym

 A mononym is a single name used by a person, without a surname or additional names. Many historical figures, celebrities, and artists are known by mononyms.

Examples:

  • Historical figures: Buddha, Plato, Napoleon

  • Celebrities: Madonna, Cher, Prince

  • Writers & Thinkers: Voltaire, Tagore

  • Athletes: Pele, Maradona

Mononyms are often used for branding, uniqueness, or cultural reasons. In some cultures, single names are the norm, while in others, they are adopted for public recognition.

Usage :

A.M. Khan Yazdani,  better known mononymously as Danny, is a distinguished Telugu writer, journalist, documentary filmmaker, political commentator, literary critic, humorist, and social worker. 



Sunday, 30 March 2025

You have to excuse Danny for Many things - చాలా వాటికి క్షమించాలి డానీని!!

 చాలా వాటికి క్షమించాలి డానీని!!




 

ఏదైనా చదువుతున్నప్పుడు, స్టడీ చేస్తున్నపుడు,  రాస్తున్నపుడు నేను ఈ లోకంలో వుండను. శరీరం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంటుంది. మెదడు ఇంకెక్కడో వుంటుంది. ‘బాడి ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్’ అంటారే  ఇది అంతకు మించింది. ఆ సమయంలో నాకు ఏదీ కనిపించదు; ఏదీ వినిపించదు. చివరికి సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడ వినిపించదు. ఒక వేళ వినిపించినా ఎత్తను. వేరే లోకం నుండి హఠాత్తుగా తిరిగి రావడం కుదరదు. పాస్ పోర్టు, వీసా సమస్యలు వుంటాయి.  

 

“స్టౌవ్ మీద కూర మాడుతోంది గ్యాస్ ఆపెయ్యి” అని మా ఆవిడ అరిచి గీపెట్టినా నాకు వినిపించదుగాక వినిపించదు. ఆ తరువాత “నీకు చెవుడా?” అంటుంది.  అదీ వినిపించదు. ఒకవేళ అప్పటికి ఈలోకం లోనికి తిరిగి వచ్చేసివుంటే మాత్రం వినిపిస్తుంది. అప్పుడు మౌనంగా వుండిపోతాను. కమ్యూనిస్టు పార్టిల్లోనేకాదు; కాపురాల్లోనూ వ్యూహాలు ఎత్తుగడలు వుంటాయి. ఇంట్లో మౌనంగా వుండడం తెలిసినవాడే ఈరోజుల్లో కాపురం చేయగలడు అని ఎవరు చెప్పారో గుర్తులేదుగానీ దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను.

 

నేను చాలా సెలెక్టివ్ గా మాత్రమే పుస్తకాలు చదువుతాను. కనిపించిన పుస్తకాలన్నింటినీ తిరగేసేంతటి చదువరినికాను. అప్పటికి నాకు అవసరమైనవి అనుకున్నవి మాత్రమే చదువుతుంటాను. నా షెడ్యూల్ లో లేనివి చదవడం చాలా కష్టం. పుస్తకాలు బాగోలేవని కానేకాదు; అప్పటికి చదవాల్సినవి క్యూలో చాలా వుంటాయి.

 

మరీ ఆబ్లిగేషన్ అయితే తప్ప పుస్తకావిష్కరణ సభల్లో వక్తగా వుండడం నాకు ఇష్టం వుండదు. ముందుమాటలు రాయడమూ చాలా కష్టం. ఆ పుస్తకాన్ని నిర్ణిత సమయంలోగా చదవాల్సి వస్తుంది. దాని కోసం అనేక పనుల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అదీగాక అందులో ఏదైనా లోటు వుందని చెప్పినా, అతిశయోక్తులతో పొగడకపోయినా రచయితలు అలుగుతారు. ఇదో కొత్త సమస్య. 

 

నా ఆర్టికల్స్ అచ్చయిన రోజున చాలా కాల్స్ వస్తుంటాయి. కొందరు మెసేజులు పెడుతుంటారు. కొందరు విమర్శిస్తారు. కొందరు మెచ్చుకుంటారు. మెచ్చుకోళ్ళు, విమర్శలు రెండూ నాకు చాలా ఇష్టం. ఆ తరువాత ఏం రాయాలో నాకు అర్ధం అవుతుంటుంది.

 

ఇంకొందరు నేనేదో గొప్పవాడిని అనుకుని తమ వ్యక్తిగత సమస్యలు కూడ చెపుతుంటారు. కష్టాల్లోవున్న సమూహాలకు సంఘీభావం తెలపడం నా బాధ్యత అనుకుంటాను. వాళ్ళను ఆ కష్టాలనుండి తప్పించే స్తోమత నాకులేదు. 

 

ఈమధ్య చాలా మంది వాట్సప్ లో ఫోన్లు చేస్తున్నారు. రకరకాల గ్రూపుల్లో రోజుకు వందకు పైగా మెసేజులు వస్తుంటాయి. వాటిల్లో ఆ మిస్సిడ్ కాల్స్ ను, జూమ్ మీటింగ్ సమాచారాలను చూడడం చాలాసార్లు కుదరదు. అందుకు అందరూ నన్ను క్షమించాలి.

 

మీటింగులకు వక్తలుగా వెళ్ళడం కూడ ఒక సమస్యే. నేను వస్తే బాగుంటుందని నిర్వాహకులు భావిస్తారు. ముందు డేట్ల సమస్య వుంటుంది. వాళ్లు అనుకున్న రోజు మనకు ఖాళీ వుండాలి. ఈనెల 23 ఆదివారం ఉదయం విజయవాడలో మార్క్సిస్టుల కేవి రమణారెడ్డి మీటింగు వుండింది. దానికి నేను తప్పక వెళ్ళాలి. సాయంత్రం గుంటూరులో ఓ కొత్త అంబేడ్కరిస్టు సంఘం ఆరంభం. అక్కడికీ పిలిచారు.  ఆరోజు మధ్యాహ్నం మామూలు ఎండగాలేదు. లైవ్ లో మెసేజ్ ఇస్తానని గుంటూరు వారిని కోరాను. వాళ్ళు ఒప్పుకున్నారు. అలా గత ఆదివారం గడిచిపోయింది.

 

 సభల్లో టాపిక్కు అనేది చాలా కీలకమైన అంశం. కొందరు వక్తగా పిలుస్తారుగానీ టాపిక్ స్పెసిఫిక్ గా చెప్పరు. మనం వేదిక ఎక్కాక మైకు ముందుకు వెళ్ళేటప్పుడు టాపిక్ అనుకోవాలి. కొందరు వాళ్ళేదో కొత్త టాపిక్ చెప్పి “అది మీకు కొట్టిన పిండేనండి” అంటారు. ఒకే టాపిక్కును మళ్ళీమళ్ళీ మాట్లాడడం అంత బావుండదు. కొత్త అంశాలు కొన్నయినా జోడించాలి. దానికి తప్పక  కొత్త అధ్యయనం కావాలి.

 

నాతోపాటు వేదికను ఎవరు పంచుకుంటున్నారు అనే విషయం మీద  నాకు ఎప్పుడూ ఎలాంటి పట్టింపులూ లేవు. కొందరికి ఈ విషయంలో చాలా పట్టింపులు వుంటాయి. నాకు బాగా సీనియర్ అయినా ఓకే; బాగా జూనియర్ అయినా ఓకే. కెప్టెన్  ఏ ఆర్డర్ లో పంపినా మన బ్యాటింగ్ మనం కఛ్ఛితంగా చేయాలి. అదొక్కటే రూలు.

 

ఎంత సమయం మాట్లాడాలి? ఏఏ అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి? వినేవారు ఎవరూ? వంటి అంశాలను మాత్రం నేను ముందుగా తెలుసుకుంటాను. వినేవాళ్ళు విద్యాధికులయితే కొంచెం ఇంటెలెక్యూవల్ స్టఫ్ జోడిస్తాము. వినేవాళ్ళు సామాన్య కర్షక-శ్రామికులు అయితే కొంచెం భావోద్వేగ అంశాలను జోడిస్తాము.  ఒకే సమావేశంలో ఈ రెండు సమూహాలు  వుంటే మాత్రం నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టినట్టే.

 

ప్రసంగానికి ప్రయాణ ఖర్చులు కూడ ఇటీవల చాలా ముఖ్యమైన కాంపోనెంట్ గా మారింది. కొందరు ప్రయాణ ఖర్చులు ఇస్తున్నారు. కొందరు ఇవ్వడంలేదు. 1970లలో రైళ్ళల్లో టికెట్టు లేకుండానే   ప్రయాణం చేసేవాళ్లం. అరుగుల మీదో, రోడ్ల పక్కన చెట్లకిందో, గొడ్ల సావిట్లోనో పడుకునేవాళ్ళం. ఆరుబయట ఇసుకలోనో, ఒక్కోసారి కోళ్ళ ఫారంలోనో పడుకున్న సందర్భాలున్నాయి.  నాకు ఉబ్బసం వుంది. తరువాత అది ఎంత బాధపెట్టేదో చెప్పలేను.

 

ఇప్పుడు కాలం మారిపోయింది. మరోవైపు, ఆరోగ్య నిబంధనలు వచ్చాయి. వాటిని కఛ్ఛితంగా పాటించాల్సి వస్తున్నది.

 

విజయవాడ నుండి ఉత్తరం, దక్షణం, పడమర  ఏ దిక్కున పోవాలన్నా వోల్వో ఏసి బస్సు చార్జీలు వెయ్యి నుండి 12 వందల రూపాయలు వరకు వున్నాయి. రానూ పోనూ 2500. క్యాబ్ తదితర ప్రయాణ ఖర్చులు ఇంకో 500 రూపాయలు. ఇదిగాక హొటల్ వసతి, భోజన ఖర్చుల కోసం నిర్వాహకులకు సులువుగా 1500 - 2000 రూపాయలు అవుతాయి. నాలుగున్నర వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎవరికైనాసరే అది కఛ్ఛితంగా పెద్ద భారమే.

 

అలాగే వక్త కూడ కొన్ని భారాలుంటాయి.  ఒక ప్రసంగానికి ప్రయాణ సమయం రానూపోనూ రెండు రోజులు. అధ్యయనం కోసం కనీసం ఓ మూడు రోజులు కేటాయించాలి. వెరసి ఐదు రోజుల వ్యవహారం.

 

ఇంత ఖర్చు, ఇంత సమయం వున్నాయి కనుక ప్రసంగాలను నేను కొంచెం సీరియస్ వ్యవహారంగా భావిస్తాను. ప్రసంగానికి సిధ్ధంకావడానికి కనీసం 15 రోజుల వ్యవధి వుండాలంటాను.  ముందు ప్రసంగం రాసుకుని సమయాన్ని సరిచేస్తాను. ప్రసంగ పాఠాన్ని నిర్వాహకులకు రెండు మూడు రోజుల ముందే పంపిస్తాను. తప్పులు, తొలగింపులు, తగిలింపులు వాళ్ళు సూచిస్తారు. ఆ తరువాత  ఫైనల్ కాపీ తయారవుతుంది. ప్రసంగించడానికి ఒక అరగంట ముందు దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాను.

 

చేతికి మైకు ఇచ్చారు గనుక నోటికి వచ్చింది మాట్లాడేయడం అనేది నాకు నచ్చదు. ఇంత వ్యవహారం కుదరదు అనుకున్నప్పుడు డేట్లు కుదరవు అని ఒక అబధ్ధం చెప్పి తప్పించుకోక తప్పదు. అంచేత చాలా వాటికి క్షమించాలి డానీని.

 

నన్ను పిలిచినప్పుడు నా ప్రసంగానికి ఇంత సమయం ఇవ్వాలని ఎవర్నీ ఇప్పటి వరకు అడగలేదు. గంట క్లాస్ చెప్పాలన్నాఓకే. కేవలం రెండు నిముషాల సందేశం ఇవ్వాలన్నా ఓకే.

 

సాహిత్య సభలు హైదరాబాద్ లో అరగంట ఆలస్యంగా మొదలవుతాయి. విజయవాడ, విశాఖపట్నంలో గంట ఆలస్యంగా మొదలవుతాయి. గుంటూరులో గంటన్నర ఆలస్యంగా మొదలవుతాయి. ఫలితంగా అధ్యక్షులవారికి  కార్యక్రమాన్ని కుదించక తపదు. కానీ, 30 నిముషాల ప్రసంగానికి సిధ్ధమయి వెళ్ళీన వక్త దాన్ని హఠాత్తుగా 10 నిముషాలకు కుదించుకోవడం అంత సులువైన వ్యవహారంకాదు.  సినిమాలకు స్క్రీన్ ప్లే వున్నట్టు ఉపన్యాసానికి కూడ ఒక ఆర్డర్ వుంటుంది. అది పాడైపోతే ఉపన్యాసం రక్తికట్టదు. ఎంతైనా ఉపన్యాసం కూడ ఒక కళేకదా!

 

నేను వక్తను కాకపోయినా నాకు నచ్చినవారు ప్రసంగించే మీటింగులకు వెళుతుంటాను. ఇటీవల అక్కడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సభికుల్లో నన్ను చూసి సభాధ్యక్షులు వేదిక మీదికి పిలుస్తున్నారు. హఠాత్తుగా ప్రసంగించేయగల సమర్ధుడ్నికాను నేను. పైగా షెడ్యూలులో లేకుండా వేదికనెక్కి ప్రసంగిస్తే, నేను తీసుకున్న సమయం ఇంకో వక్త ఎవరికో కోత పడుతుంది.  అది చాలా బాధ.

 

కొన్ని ఎమర్జెన్సీ వ్యవహారాలుంటాయి. శ్రీశ్రీ విశ్వేశ్వర రావు, సామాజిక పరివర్తనా కేంద్రం దుర్గం సుబ్బారావు నా పబ్లిషర్లు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా నిబంధనల్ని సడలించి వెళ్ళక తప్పదు. ఇందులో విశ్వేశ్వర రావు మార్క్సిస్టు, దుర్గం   సుబ్బారావు ఫూలే- అంబేడ్కరిస్టు. ఈ రెండు శిబిరాల్లోనూ నేను ఒకేలా వుండగలను.

 

ఇది 1982 నాటి ఫొటో. విజయవాడ ప్రెస్ క్లబ్ లో చలసాని ప్రసాద్ తో నేను. ఆ రోజుల్లో మీటింగుల్ని మేము 30-40 రూపాయల్లో జరిపేసేవాళ్ళం.

 

ఫొటో కర్టెసీ – vmrg Suresh

Thursday, 27 March 2025

Does Hindutva suits 'fascism'?

 Does Hindutva suits 'fascism'? 

*హిందూత్వకు ‘ఫాసిజం’ నప్పుతుందా?*

 

ఈరోజు ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం.

చదివి అభిప్రాయం చెప్పండి. విమర్శల్ని కూడ ఆహ్వానిస్తున్నాను.

ట్రోల్ మాత్రం వద్దు.

 

*డానీ

సమాజ విశ్లేషకులు*, 9010757776


కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా  (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం ముసాయిదా కేంద్ర ప్రభుత్వాన్ని “నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది” అని పేర్కొనడంతో ఫాసిజం, నయా-ఫాసిజం,  నాజిజంల మీద మేధోరంగంలో  ఒక  కొత్త చర్చ మొదలయింది. నేరుగా ‘ఫాసిస్టు’ అనకుండా ‘కొత్త ఫాసిస్టు స్వభావం’ అనడాన్ని జాతీయ కాంగ్రెస్ తో పాటు సిపిఐ సహితం సిపిఎంను తప్పుపడుతున్నాయి.

 

          ఇతరులు ఛాందసం అనుకున్నాసరే భూస్వామ్య సమాజానికి తనకంటూ కొన్ని విలువలు వుంటాయి. పెట్టుబడీదారీ వ్యవస్థకు లాభాలే ముఖ్యం. అదే దాని సంస్కృతి; అదే దాని విలువ. లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళ్ళను సహితం పెట్టుబడీదారులు అమ్మకానికి పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి, పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. విస్తరించిన మార్కెట్ డిమాండును అందుకోవడానికి మళ్ళీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి. ఇది ఒక విధంగా పులి మీద స్వారీ లాంటిది. ఎక్కడా ఆగడానికి వీల్లేదు. ఆగితే అక్కడే ఖేల్ ఖతం.

 

          గతంలో సెల్ ఫోన్ల మార్కెట్ ను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రి, మోటరోలా బ్రాండ్లు ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్, కొడాక్ కెమేరాలు, సోనీ వాక్ మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు.  పరుగు ఆపేస్తే మహామహా బ్రాండ్లు కూడ అలా అంతమైపోతాయి.

 

తమ ప్రాచూర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడీదారులు ఏమైనా చేయగలరు. ఏ వేషం అయినా వేయగలరు.  ఒక దశలో అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా, మతరహితులుగా దర్శనమిస్తారు. ఇంకో దశలో జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికివస్తుంది అనుకుంటే వాళ్ళే సమాజంలో ఛాందసాన్ని  మూఢనమ్మకాలను పెంచిపోషించడం మొదలెడతారు.

 

          ఈ మార్కెట్ లక్షణాలు తెలియని చాలా మంది భూస్వామ్యంకన్నా పెట్టుబడీదారులు మెరుగయినవారు అనుకుంటుంటారు. అది తప్పు అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు భారీ పెట్టుబడీదారులు (వీరినే మనం మెగాకార్పొరేట్లు అంటున్నాం) తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించి తద్వార తమ అనుకూలుర్ని ఎన్నికల్లో గెలిపించుకుని  అధికార పీఠం మీద కూర్చొబెట్టి వారి ద్వార తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.

 

          ఇక్కడ మనకు కనిపించేది ఒకటి; జరిగేది మరొకటి. ఎన్నికల ద్వార పరిపాలనాధికారాన్ని చేపట్టినవాళ్ళు  కార్పొరేట్ల సంపదను పెంచుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. నిజానికి తమ సంపదను పెంచుకోవడానికి కార్పొరేట్లే తమ అనుకూలుర్ని పరిపాలన పీఠం మీద కూర్చో బెట్టుకుంటారన్న సత్యం సాధారణ దృష్టికి కనిపించదు. మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా  కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship - CCD) అంటేగానీ  తత్త్వం బోధపడదు.  

 

          కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం అనే మాట నిస్సందేహంగా  క్లిష్టమైనది. తెలుగువాళ్లకెందుకో కొత్త పదాల మీద ఒకరకం అసమ్మతి  వుంటుంది. ఆక్స్ ఫర్డ్ తదితర ఇంగ్లీషు నిఘంటువుల్లో ఏడాదికి వెయ్యి నుండి రెండు వేల కొత్త పదాలను చేరుస్తుంటారు. మనకు ఆ సాంప్రదాయం లేదు. తమిళులకు అలాంటి సాంప్రదాయం వుంది. అలాంటి ఏర్పాటు మనకు ప్రభుత్వ పరంగానూలేదు; స్వఛ్ఛందంగానూ లేదు. పాత పదాలు కొత్త అర్ధాలను ఇవ్వవు. కొత్త పదాల్ని మనం ఒక పట్టాన అంగీకరించము. అంచేత మనకు కొత్త జ్ఞాన సూక్ష్మాలు  ఒక పట్టాన అబ్బవు.  

 

          ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు వున్నట్లే నచ్చని వారూ వుంటారు. నచ్చనివారు దీన్ని ఫాసిస్టు అంటున్నారు. ఆ మాటను కాంగ్రెస్సూ అంటున్నది; కమ్యూనిస్టులు అంటున్నారు.

 

ఫాసిజం ఇటాలియన్ పదం. అది ముస్సోలిని నియంతృత్వాన్ని  విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు  పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అదికాదు. ముస్సోలిని సగర్వంగా తనకుతానుగా పెట్టుకున్న పేరు అది. ‘ఫాసియో’ అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అని అర్ధం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ అని పేరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్ధం. బిజెపి కూడ తొలి రోజుల్లో జాతిపిత పేరున గాంధేయ సోషలిజం అనేది. హిట్లర్ పార్టి పేరు నేషనల్ సోషలిస్టు జర్మన్ వర్కర్స్ పార్టి.

 

ఫాసిజం, నాజిజం రెండూ నియతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఆరెస్సెస్ వ్యవస్థాపకులైన హెడ్గేవార్ మీద ఫాసిస్టు ముస్సోలినీ ప్రభావం వుండింది. రెండవ సర్సంగ్ ఛాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ నాజీ హిట్లర్ ను ఎక్కువగా అభిమానించేవారు. ‘ఆర్యజాతి ఔన్నత్యం’, ‘మతమైనారిటీ సమూహాల నరమేధం’  వగయిరాలు వారికి తెగనచ్చాయి. స్వఛ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో వారు రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్లర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ ఫాసిజంలో మైనారిటీ మత సమూహాలను అణిచివేయాలనే అంశం లేదు; కనీసం మొదట్లో లేదు.  జర్మనీ నాజిజంలో యూదు నరమేధం పెద్ద ఎత్తున వుంది. హిట్లర్ కాన్సెంట్రేషన్ క్యాంపులు పెట్టాడు; మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావానికి ఫాసిజంకన్నా నాజిజమే దగ్గరగా వుంటుంది.

 

ఇటలీలో ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మనదేశంలోనూ సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరును ఇష్టంగా పెట్టుకుంది. చాలా మందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకు తేడా తెలీదు. మతం అంటే దేవుని మీద విశ్వాసం. మతతత్త్వం అంటే ఇతర మతస్తుల మీద అసహనం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం రాజకీయార్ధిక వ్య్వహారం. 

 

అతివాద హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది 1922లో  ఘనంగా  ‘హిందూత్వ’ అనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ అన్నప్పుడు తమని నిందిస్తున్నారని  సాధారణ హిందువులు అపోహపడితే తమ ఉనికికి ముప్పు వస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి. మెజారిటీ మతతత్త్వ నియంతృత్వాన్ని సంభోదించడానికి కొందరు ‘బ్రాహ్మణీయ’ ‘కాషాయ’ అనే పదాలను వాడుతున్నారు. బ్రాహ్మణులు, కాషాయాంబరధారులు అందర్నీ నియంతల భక్తుల జాబితాలో వేయడం తప్పు. దానివల్ల నియంతృత్వాన్ని వ్యతిరేకించేవారికి  మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది.

 

ఇండియా కమ్యూనిస్టు పార్టీల్లో మొదటి నుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడిత మతసమూహాలు పీడక మతసమూహాలు  వుంటారని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల పక్షాన వుంటామని ప్రకటించాల్సివుంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వెళ్ళిపోతుందని వాళ్ళ భయం. మతవ్యవస్థలో పీడితులపక్షం వహించలేవు; పీడకులపక్షం వహిస్తామని చెప్పుకోలేవు. ఇలాంటి ఇరకాటం నుండి బయటపడడానికి మతంలో వర్గ లేదని చాలాకాలం  బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి. ప్రతిదేశంలోనూ పాలకమతం వున్నట్టే పాలితమతం కూడ వుంటుంది.

 

నిజ జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం  అనేది మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీనితో పాటు ఉపరితలం కూడ వుంటుంది. రెండూ విడిగా వుండవు. పునాది ఉపరితలాల్లో ప్రధానమైది నిస్సందేహంగా పునాదే. దాని అర్ధం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో వుంటూ,  ఒకదాన్నిమరొకటి నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. సాంకేతిక భాషలో చెప్పాలంటే, పునాదీ ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో వుంటాయి.

 

గడిచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18-22 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన సిపిఐ-ఎం 22వ మహాసభల్లో "నిరంకుశ, హిందూత్వ సాగిస్తున్న మతతత్త్వ దాడులు ముందుకు తోసుకుని వస్తున్న ఫాసిస్టు ధోరణులను ప్రదర్శిస్తున్నాయి" అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6-10 తేదీల్లో కన్నూర్ లో జరిగిన సిపిఐ-ఎం 23వ మహాసభల్లో " ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టిక్  ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నది"అని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 2-6 తేదీల్లో మధురైలో జరుగనున్న సిపిఐ-ఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు. "మితవాద హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుని పోవడానికీ, ప్రతిపక్షాలనూ, ప్రజాస్వామ్యాన్నీ అణగదొక్కడానికీ అనుసరిస్తున్న నియంతృత్వ పధ్ధతులు నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. ఇంత డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా ‘ఫాసిస్టు’ అనవచ్చుగా అని కాంగ్రెస్ సిపిఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

 

1970ల నాటి ఎమర్జెన్సీ కాలంలో  ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ‘హిట్లర్’ అని నేరుగా  విమర్శించేవారు. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్ పాయి, జార్జ్ ఫెర్నాండెస్, మురార్జీ దేశాయి, ఎల్ కే అద్వానీ, నానీ ఫాల్కీవాల తదితరులు ఆమెను అలా విమర్శించినవారి జాబితాలో వున్నారు.  

 

ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయే మహాసభల్లో సిపిఐ-ఎం నాయకత్వం దానికి వివరంగా సమాధానం చెప్పవచ్చు.

 

రచన : 09-మార్చ్ 2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 27 మార్చి 2025

https://www.andhrajyothy.com/2025/editorial/is-hindutva-fascilism-a-new-debate-in-politics-1385963.html