Saturday 25 June 2016

మానవ సంబంధాల అంతస్సారం ఆర్ధికమే

విచ్చిన్నం అవుతున్న కుటుంవ వ్యవస్థ

సృష్టిలో సమస్త జీవులు తమ సంతతిని ఉత్పత్తి చేస్తాయి. ఆహార సేకరణతో తమ సంతతి జీవికను నిలబెట్టుకుంటాయి.
మనుషులు కూడా తమ సంతతిని ఉత్పత్తి చేస్తారు. అయితే మనుషుల అవసరాలు కేవలం ఆహార సేకరణతో తీరేవికావు. 
తన సంతతి భౌతిక అవసరాలను నెరవేర్చడం  కోసం మనిషి భౌతిక ఉత్పత్తిని చేపడతాడు. భౌతిక ఉత్పత్తిని చేపట్టడానికి పనిముట్లను కనిపెడతాడు. సాధన ద్వార వాటిని వాడే నైపుణ్యాన్ని సాధిస్తాడు. మనిషి పనిముట్లను కనిపెట్టే జీవి. భౌతిక అవసరాలను తీర్చడానికి భౌతిక ఉత్పత్తి చేయాలనుకోవడం, చేయడం, చేసినదాన్ని పంచడం అంతా ఒక సమాహారం. ఒక వ్యవస్థ. దీనినే ఆర్ధిక వ్యవస్థ అంటారు.  సరిగ్గా ఈ అంశమే మనిషిని ఇతర జీవుల నుండి విడదీసి ఒక విశిష్ట ప్రత్యేకతను ఇస్తుంది.  మరో మాటల్లో చెప్పాలంటే మనిషి ఆర్ధిక జీవి. 

జంతువుల సమూహాన్ని జంతు ప్రపంచం అన్నట్టు మనుషుల సమూహాన్ని మానవ ప్రపంచం అనడం తప్పు. మానవ సమాజం అనాలి. భౌతిక ఉత్పత్తి, పంపకాలు  వుండవు కనుక జంతుప్రపంచంలో తరతమ బేధాలు వుండవు. భౌతిక ఉత్పత్తి, పంపకాలు వున్నాయి కనుక మానవ సమాజంలో తరతమ బేధాలు వుండడమేగాక అవి చాలా సంక్లిష్టంగానూ వుంటాయి. ఇందులో ప్రతిపాత్రకూ ఆర్ధికంగా నైతికంగా నిర్దిష్టంగా కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు వుంటాయి. ఆర్ధిక నియమాల స్పృహలేనివాళ్ళు, వాటిని  మానవ సమాజంలో సభ్యులు కాలేరు. మానవ సంబంధాల అంతస్సారం ఆర్ధికమే. డబ్బే అన్నిటికీ మూలం అనేది దీనికి సంకుచిత రూపం. మానవ సంబంధాలు అంత సంకుచితమైనవికావు. 

తల్లిదండ్రులు డబ్బు కోసమే పిల్లల్ని పోషిస్తారా? ప్రేమికులు డబ్బు కోసమే ప్రేమలో పడతారా? ఇదేమయినా వ్యాపారమా?  వంటి ప్రశ్నలు తరచుగా విపిస్తుంటాయి. 

నిజానికి తల్లిదండ్రులు వ్యాపారులు కాదు. తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనీ తద్వార మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని వాళ్ళు ఆశిస్తారు. తమ పిల్లలు గౌరవనీయమైన స్థానాలకు ఎదగాలనీ, ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనీ,  వృధ్ధాప్యంలో తమను గౌరవప్రదంగా చూడాలనీ, మంచాన పడ్డప్పుడు సాకాలనీ,  చనిపోయాక   అంత్యక్రియలు, కర్మకాండలూ సజావుగా జరిపించాలనీ కొరుకుంటారు. ఇదొక వృత్తం. ఇందులో ఆర్ధిక అంశం వెన్నెముకగా వున్నప్పటికీ దానిని ఆశ్రయించుకుని అనేక భావోద్వేగాలు వుంటాయి. వీటిని ఉత్త భావోద్వేగాలు అన్నా తప్పే; ఉత్త ఆర్ధికం అన్నా తప్పే. 

ఆస్థిని పోగేయడమే లక్ష్యం అయితే మనుషులు భారీగా ఖర్చుపెట్టి పిల్లల్ని పోషించాల్సిన పనిలేదు. ఆ డబ్బును వెండి బంగారాల మీద పెట్టినా, ఇంటిస్థలాలు, పొలాల మీద పెట్టినా మంచి రాబడి వస్తుంది. పిల్ల మీద పెట్టే  పెట్టుబడికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. యుక్త వయస్సు వచ్చాక పిలల్లు స్వతంత్రులు అయిపోతారు. వృధ్ధులయిపోయిన తల్లిదండ్రుల పోషణ బాధ్యతను తీసుకోవచ్చు తీసుకోకపోనూవచ్చు. తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న పిల్లల శాతమే ఇటీవల వేగంగా పెరుగుతోంది. 

పిల్లల స్వతంత్రాభిలాష తల్లిదండ్రుల ఆలోచన సరళిని మారుస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు  పిల్లల కోసం తమ సర్వస్వాన్ని ధారపోయడానికి ఇష్టపడకపోవచ్చు. వృధ్ధాప్యంలో గారవనీయమైన జీవితం కోసం పొదుపు, ఆర్ధిక, వైద్య ఆరోగ్య బీమాల్లో పాలసీ తీసుకుని జాగ్రత్త పడవచ్చు.  మన సమాజంలో ఇలాంటి ధోరణులు ఇప్పటికే మొదలయ్యాయి. వీటికి పరాకాష్ట అసలు పిల్లల్నే  కనకపోవడం. ఇది, ప్రతిజీవీ తన జాతిని అభివృధ్ధి చేస్తుందనే సృష్టి నియమానికే వ్యతిరేకం. 

No comments:

Post a Comment