Tuesday, 29 August 2017

The Stark Reality of Nandyala BY-Elections

The Stark Reality of Nandyala BY-Elections
నంద్యాల నగ్న సత్యాలు!
-       - డానీ

నంద్యాల ఉపఎన్నికల్లో సెంటిమెంట్ బలంగా పనిచేసి తెలుగు దేశం అభ్యర్ధికి ఘన విజయం చేకూర్చిందనే అభిప్రాయం బలంగా ప్రచారంలోనికి వచ్చింది. నిజానికి అక్కడ సెంటిమెంటుకన్నా అనేక ఇతర అంశాలే బలంగా పనిచేశాయి. వాటిని పరిశీలించకుంటే ఎన్నికల ఫలితాలని సరిగ్గా అంచనా వేయలేం.  
నంద్యాల ఉపఎన్నికల్లో సెంటిమెంటు టిడిపి, వైయస్సార్ సిపిలకు సమానంగా వుంది. టిడిపికి సిట్టింగ్ అభ్యర్ధి చనిపోతే, వైయస్సార్ సిపికి గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధి ప్లేటు ఫిరాయించాడు. ఒకరికి అభ్యర్ధి సెంటిమెంట్ అయితే మరొకరికి పార్టి సెంటిమెంట్ వుంది. సెంటి మెంట్ ఇద్దరికీ సమానం అయినపుడు ఫలితాలని ఇతర అంశాలు నిర్ణయిస్తాయి.
రాజకీయ పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న వైపరీత్యాలకు తాజా ప్రతీక నంధ్యాల ఉపఎన్నికలు.  టిడిపీ తో మొదలయ్యి ఆళ్లగడ్డ నుండి మూడుసార్లు గెలిచి, 2009లో ప్రజారాజ్యం పార్టీకి మారి,  2014 ఎన్నికల్లో వైయస్సార్ సిపి  టిక్కెట్టుపై రెండుచోట్ల గెలిచి ఎన్నికల తరువాత గోడ దూకి  తిరిగి తెలుగు దేశం పార్టీ లోనికి చేరిన చరిత్ర భూమా కుటుంబానిది. కాంగ్రెస్‍ లో మొదలయ్యి మంత్రి పదవిని కూడా పొంది, 2014 ఎన్నికల్లో టిడీపీకి మారి, ఇప్పుడు మళ్ళీ వైయస్సార్ సిపి  టిక్కెట్టుపై రంగంలో దిగిన చరిత్ర శిల్పా కుటుంబానిది. తడవకో పార్టీ మారే అభ్యర్ధులు తలబడుతున్నప్పుడు  వాటిని రాజకీయ సిధ్ధాంతాల ఘర్షణ అనరు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే గనుక అందులో సామాజిక సంఘర్షణ  కూడా ఏమీ లేదు.  అది కేవలం రెండు కుటుంబాల తగవు.
చంద్రబాబు అభివృధ్ది విధానాలకు ఓట్లు పడ్డాయని ఇప్పుడు అధికారపార్టి సాగిస్తున్న ప్రచారమూ సరైనదికాదు. దాదాపు 80 వేల ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడ్డాయి మరి!. వైయస్సార్ సిపీ నోటి దుర్వినియోగంకన్నా, టిడిపి అధికార దుర్వినియోగం ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిందని అంటే అది కొంచెం సమంజసంగా వుంటుంది.
డబ్బు పంపిణీలో నంద్యాల ఉప ఎన్నిక గత రికార్డులు అన్నింటినీ బద్దలుగొట్టేసింది. ఒక అనధికార అంచనా ప్రకారం అధికార పార్టి ఎన్నికల వ్యయం 100 కోట్ల రూపాయలకు పైమాటేనట! 1500 కోట్ల రూపాయల నంద్యాల అభివృధ్ధి ప్యాకేజీ వగయిరాలు దీనికి అదనం.
2019 అసెంబ్లీ ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదనే మాట ప్రచారంలో వుంది. అందువల్ల ఎవరు గెలిచారు? అనే దానికన్నా ఎందుకు గెలిచారు? ఎందుకు ఓడారు? అన్న అంశాల మీద భారీ చర్చలు జరుగుతున్నాయి.
అధికార యంత్రాంగం సహకారం (దీనినే అధికార దుర్వినియోగం అని కూడా అంటారు.), డబ్బు ప్రవాహం రెండింటినీ కలిపి ఎన్నికల సీసాలో పోసి దానిమీద  అభివృధ్ధి మంత్రం అనే లేబిల్ ను అంటించేస్తే గెలవడం సులభమని  నంద్యాల ఫలితాలతో టిడీపీ వ్యూహకర్తలకు అర్ధం అయిపోయి వుంటుంది. బహుశ ఈ ఫార్మూలానే ఆ పార్టి రేపు 2019 ఎన్నికల్లో కూడా ప్రయోగించవచ్చు!.
గెలుపుకు కొన్ని కారణాలే వుంటాయి. ఓటమికి వంద కారణాలుంటాయి. ఇప్పుడు అవేమిటనేది అసలు చర్చ.
ఈ ఎన్నికల్లో జగన్ ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకునిగా వ్యవహరించలేదు. సమీప భవిష్యత్తులో వారు అలాంటి పరిపక్వతను సాధించగల సూచనలూ కనిపించడంలేదు. రాజకీయాల్లో విధానాలే కీలకం అయినప్పటికీ నాయకుని వ్యక్తిత్వం, వ్య్వహారశైలి నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది.  ఎవరయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించడం తప్పుకాదు. కానీ, ముఖ్యమంత్రి అయిపోయానని భ్రమించడం తప్పు!. ఈపాటి చిన్న తేడాను జగన్ చాలా కాలంగా గుర్తించడంలేదు.
ప్రజాస్వామ్యం అంటేనే అంకెల ఆధిక్యత. ఏపీలో రాజకీయ నాయకత్వం వహిస్తున్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాల్లో దేనికీ కూడా  స్వంత ఓట్లతో  మేజిక్ ఫిగర్ ను సాధించి అధికారాన్ని చేపట్టగల సంఖ్యాబలం లేదు. అందువల్ల, సామాజిక కూటమి రాజకీయాలు అనివార్యం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు  టిడిపిని కమ్మపార్టీగా, వైసిపిని రెడ్డి పార్టిగా ప్రచారంచేస్తున్నారుగానీ అది మరీ సంకుచిత దృక్పథం. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గం చొరవతో వివిధ సామాజికవర్గాలతో ఏర్పడిన కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తుండగా, రెడ్డి సామాజికవర్గం చొరవతో వివిధ సామాజికవర్గాలతో ఏర్పడిన కూటమికి జగన్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, సోషల్ ఇంజనీరింగ్ (కుల సమీకరణలకు గౌరవనీయ పదం) చంద్రబాబు శిబిరంలో కనిపించినంత స్పష్టంగా జగన్ శిబిరంలో కనిపించదు. అది టిడిపికి ఎన్నికల్లో ఒక సానుకూల అంశం.
          అసలు తన ఓటు బ్యాంకు గురించి జగన్ కు లోతైన అవగాహన  లేనట్టుంది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు 2004, 2009 ఎన్నికల్లో పడ్డ ఓట్లన్నీ తన పేరున ఎన్నికల కమీషన్ లాకర్ లో ఇప్పటికీ భద్రంగా వున్నాయనే భ్రమల్లో జగన్ వుంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగై పోవడంతో ఆ ఓట్లన్నీ తనకు పడతాయని ఆయన నమ్మారు. అయితే, ఆ ఓటర్ల సామాజిక కూర్పు ఏమిటీ? వాళ్లపై  కొత్తగా రంగ ప్రవేశం చేసిన నరేంద్ర మోదీ ప్రభావం ఏమిటీ? అనే అంశాలు  ఆయనకు అర్ధం కాలేదు.
వైయస్ హయాంలో కాంగ్రెస్ కు దగ్గరయిన ముస్లింలు  కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన విధానాలవల్ల ఆ పార్టీకి దూరం అవుతున్న సమయం అది.  మరోవైపు, చంద్రబాబు ఎన్నికలకు ముందే మోదీతో జత కట్టడంతో ముస్లీం సమాజం జగన్ వైపు ఆశగా చూసింది. “ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీతో జతకట్టను” అని ఒక్క హామీ ఇస్తే చాలని ముస్లీం ప్రతినిధులు వైయస్సార్ సీపీ పెద్దల్ని కోరారు. మోదీ రాకతో ముస్లిం, క్రైస్తవ, దళిత సామాజికవర్గాల్లో తలెత్తిన భయాందోళనల్ని జగన్ అస్సలు పట్టించుకోలేదు. ప్రచార ఘట్టం ముగిసే వరకూ ఆయన అలాంటి హామీ ఇవ్వలేదు.  అయినప్పటికీ, మరోమార్గంలేక ఆ మూడు సామాజికవర్గాల్లో అత్యధిక భాగం జగన్ కు ఓటేయక తప్పలేదు. వాళ్ళలో కొంత భాగం మాత్రమే టిడిపికి ఓటేశారు.
          ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలన్నీ రెండు ఎత్తుగడల్ని అనుసరిస్తుంటాయి. మొదటిది, తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటాయి. రెండోది; తమ విధానాలతో కొత్తగా అదనపు ఓటు బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నం చేస్తాయి.
నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వయో బేధం వున్నప్పటికీ, కుటుంబాల నేపథ్యం కారణంగా దాదాపు ఇద్దరూ సమవుజ్జీలు. అప్పుడు నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం ఓట్లు సహజంగానే దాదాపు సమానంగా చీలిపోతాయని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో నంద్యాలలో  విజయానికి ముస్లీం ఓటర్లు అత్యంత కీలకంగా మారారు.
ముస్లిం ఫ్యాక్టర్ ను ముందే గమనించిన చంద్రబాబు ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్ బోర్డు నియామకాలు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీకి నిధుల కేటాయింపు  తదితర కొన్ని రాయితీలను ప్రకటించారు.  అవి ఎన్నికల కోసం ప్రకటించిన రాయితీలే కావచ్చు. ఎవరు ప్రకటించినా ఎప్పుడు ప్రకటించినా రాయితీలు రాయితీలే. జగన్ వెంటనే దానికి మించిన రాయితీలను ముస్లిం సమాజానికి ప్రకటించి వుండాల్సింది. తెలంగాణలో కేసిఆర్ హామీ ఇచ్చినట్టు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి వుండాల్సింది. “మా నాయిన వైయస్ రాజశేఖర రెడ్డిగారు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారూ. నేను దాన్ని పది శాతం చేస్తా” అని ఒక్క మాట అనుంటే కనీసం 15 వేల ఓట్లు తారుమారయ్యేవి. అప్పుడు ఫలితాలు ఎలావుండేవో ఊహించుకోవచ్చు.
జగన్ అలా చేయలేదు. 2014లో చేసిన తప్పునే ఆయన మరోసారి చేశారు. ఈసారి అంతకన్నా పెద్ద తప్పు చేశారు. తాను నరేంద్ర మోదీ, అమిత్ షాలకు దగ్గరవుతున్నట్టు బలమైన సంకేతాలు ఇచ్చారు. దానివల్ల చంద్రబాబు ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టవచ్చని వారు ఆశించి వుండవచ్చుగానీ, తన ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా మునిగి పోతుందని ఊహించి వుండరు.
ఎన్నికల వ్యూహకర్తగా ఉత్తరాది నుండి జగన్ కోరి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ (పీకే) భారత రాజకీయాల్లో మోదీ అప్రతిహత శక్తి అనే నమ్మే వ్యక్తి. 2014 ఎన్నికల్లో మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా వున్నారు.  బీహార్ లో నితీష్ కుమార్ ను బుజ్జగించి పాత గొడవల్ని మరిచిపోయేలా చేసి మోదీకీ దగ్గర చేసింది వీరే. ఇప్పుడు జగన్ నూ పెరటి దారిలో మోదీ-అమిత్ షాల దగ్గరికి చేరుస్తున్నదీ వీరే. ఇలాంటి వ్యూహాలు నంద్యాల వంటి చోట్ల ఓట్లు పీకలేవని పీకేగారికి తెలియకపోవచ్చు.
2014లో మోదీతో జత జట్టినప్పటి నుండీ ముస్లింలలో ఎక్కువ మంది టిడిపి మీద గుర్రుగా వున్నారనేది వాస్తవం. మోదీ ప్రభావంతోనే ఏపీ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం దక్కలేదనే అభిప్రాయం  కూడా బలంగా వుంది. తాము నమ్ముకున్న జగన్ ఇప్పుడు మోదీకీ దగ్గర కావడం ద్రోహ చర్య అనే భావం ఆ సామాజికవర్గంలో బలపడింది. శత్రువుకన్నా ద్రోహి మరింత ప్రమాదకారి అనే సామెత ఎలానూ వుంది. 
నంద్యాల ఎన్నికల్లో ముస్లిం ఫ్యాక్టర్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ముస్లింలు తమ నమ్మకాన్ని వమ్ము చేశారని వైసిపి శిబిరం ఇప్పుడు బాధపడుతూ వుండవచ్చు. అసలు విషయం ఏమంటే జగన్ కు స్వీయసామాజికవర్గం నుండి కూడా ఆశించిన మద్దతు లభించలేదు. రెడ్డి సామాజికవర్గానికి ఓటింగ్ బలం వుందనుకున్న నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోనూ వైసిపికి ఆధిక్యత రాలేదు.  
“ముస్లీంలు చంద్రబాబుకు ఓటేసినా ఏన్డీయేకు ఓటేసినట్టేగా?’’ అని వైసిపీ మేధావులు కొందరు ఇప్పుడు గడుసుగా అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడున్న రాజకీయ సమీకరణల్లో జగన్ కు ఓటేసినా ఏన్డీయేకు ఓటేసినట్టే. ఇద్దరి మధ్య ఎవర్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు మొరటుదేగానీ ఒక పాత సామెత వుంది “ఫత్తర్ ఫోడు  వీపు నాకడంకన్నా  అత్తరు సాయిబు చంక నాకడం మేలు” అని. విపక్షనేతకన్నా అధికారపక్షనేతే మేలని ముస్లీంలు భావించారు. అదే నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను నిర్ణయించింది. Nothing hurts more when whom you thought a friend betrays you.
హైదరాబాద్
28 ఆగస్టు 2019
ప్రచురణ :
మన తెలంగాణ దినపత్రిక, ఎడిట్ పేజీ,  30 ఆగస్టు 2017

Wednesday, 23 August 2017

From Shabano to Shayara Bano the progress of Indian Muslims

షాబానో నుండి షాయరాబానో వరకు
భారత ముస్లీం సమాజం పురోగమనం!
-        ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

ట్రిపుల్ తలఖ్ విధానాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత ముస్లిం సమాజం సంతోషంగా ఆహ్వానించింది. ముస్లిం సమాజంలోనీ మహిళలేకాక పురుషులు సహితం, ఉదారవాదులేకాక, చాంధసులు సహితం ట్రిపుల్ తలఖ్ (చిటికెల్లో విడాకులు) విధానాన్ని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, వాట్స్ అప్, ఆన్ లైన్, స్కైప్ వగయిరాల ద్వార చెప్పే తలాఖ్ లు చెల్లవని చెప్పడానికి షరియా / హదీస్ ల నుండి ఉటంకింపులు కూడా అఖ్ఖరలేదు. ఇవన్నీ సమాచార విప్లవం అనంతరం వచ్చిన సౌకర్యాలు, దుర్వినియోగాలు. సమాచార విప్లవం కన్నా వెయ్యేళ్ళు ముందుగా రాసినవి కనుక షరియా / హదీస్ లు వీటిని గుర్తించవు. ఒక్కసారిగా (వెంటవెంటనే instant) తలాక్ చెప్పడం ముస్లిం పర్సనల్ లా (షరియా)కు వ్యతిరేకమని ఇస్లాం ధార్మిక గురువులు చాలాసార్లు చెప్పివున్నారు. అలా ధర్మవిరుధ్ధంగా విడాకులు ఇచ్చిన భర్తల కుటుంబాలను సాంఘీకంగా బహిష్కరించాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గతంలో పిలుపు (ఫత్వా) కూడా ఇచ్చింది.
చిటికెల్లో విడాకులు విధానంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించాల్సినంతగా స్పందించలేదనే అపవాదు కూడా ఒకటి వుంది. అయితే. ఇందులో ఒక స్మృతి సూక్ష్మం వుంది. సాంఘీక బహిష్కరణ చేయమని  మాత్రమే పర్సనల్ లా బోర్డు ఫత్వా జారీ చేయగలదు. త్రిపుల్ తలాఖ్ దోషులతో  అంతకు మించి వ్యవహరిస్తే – అంటే తిట్టడం, కొట్టడం వంటివి చేస్తే -  అది పౌరస్మృతి పరిధిని దాటి నేరస్మృతి పరిధిలోనికి వెళ్ళిపోతుంది. ప్రత్యేక పౌరస్మృతి వున్నట్టు ముస్లింలకు ప్రత్యేక నేరస్మృతి వుండదు. పర్సనల్ లా బోర్డు పరిధి పరిమితుల్ని కూడా అర్ధం చేసుకోవాలి.
తాము ఆశించిందే కోర్టు తీర్పుగా రావడం ఎవరికైనా ఆనందమే. ముస్లిం సమాజానికి  అంతకు మించిన  ఆనందాన్నిచ్చే అంశం అత్యున్నత న్యాయస్థానం తీర్పులో మరొకటుంది. మత స్వేఛ్ఛ అనేది పౌరులకు రాజ్యాంగంలోని 25వ అధీకరణ ద్వార  వచ్చిన  ప్రాధమిక హక్కు అని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది. ప్రస్తుత, అసహన వాతావరణంలో, గోగ్రవాదుల మూకదాడుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన భరోసా తమకు పెద్ద వరమని భారత ముస్లిం సమాజం భావిస్తోంది.  
1985లో షాబానో మనోవర్తి కేసు సాగిన సమయంలో భారత ముస్లిం సమాజం మీద  ఛాందసుల  ప్రాబల్యం ఎక్కువగా వుంది. అప్పుడు ముస్లిం ఉదారవాదులు బలంగాలేరు. ఇప్పటి షయరా బాను కేసు సందర్భంగా కొందరు కొన్ని అపోహలూ, భయాందోళనల్ని వ్యక్తం చేసినప్పటికీ, ట్రిపుల్ తలాక్ ను రద్దుచేయాలనే అంశం మీద ముస్లీం సమాజంలో  దాదాపు ఏకాభిప్రాయం వుంది.  గడిచిన మూడు దశాబ్దాల కాలంలో భాతర ముస్లిం సమాజం సాధించిన పురోగతిగా దీన్ని భావించవచ్చు.
ఈ సందర్భంగా వ్యక్తమైన అపోహలూ, భయాందోళనల్ని కూడా  కొట్టి పడేయడానికి వీలులేనివి. ట్రిపుల్ తలాక్ నెపంతో ముస్లిం పర్సనల్ లానే రద్దు చేస్తారని కొందరు భయపడ్డారు. బయటి నుండి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రచారమే దానికి ప్రధాన కారణం. వాళ్ళల్లో కొందరు అతివుత్సాహంతో ఏకంగా ముస్లిం సమాజంలో మొత్తం విడాకులనే రద్దు చేయాలని ప్రతిపాదించారు.
ముస్లిం విడాకుల్లో మూడు విధానాలున్నాయి. వాటిల్లో తక్షణ విడాకుల విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనినే మీడియా ‘ట్రిపుల్ తలాఖ్’ గా ప్రచారం చేసింది. నిజానికి మిగిలిన రెండు విధానాల్లో కూడా మూడుసార్లు తలాఖ్ చెపుతారు. అయితే సుదీర్ఘ గడువు తీసుకుని వాయిదాల పధ్ధతుల్లో తలాఖ్ చెపుతారు.
“తక్షణ తలాఖ్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనదా?” “ఇస్లాం ధర్మాల్లో ప్రాధమికమైనదా?” అనే రెండు అంశాలను ఈ కేసులో సుప్రీం కోర్టు పరిశీలినకు స్వీకరించింది. తక్షణ తలాఖ్ అనేది త్రాజ్యాంగ వ్యతిరేకమైనది మాత్రమేగాక, ఇస్లాం ప్రాధమిక ధర్మాలకు కూడా  వ్యతిరేకమైనదని తేల్చింది. విడాకుల విధానంలో ఒక వైపరీత్యంగా మొదలయి విచక్షణా రహితంగా కొనసాగుతున్న “తక్షణ తలాఖ్’ ను రద్దు చేయడం ద్వార  ఇస్లాం ప్రాధమిక ధర్మాలకు సుప్రీం కోర్టు తీర్పు మేలు చేసింది.
ఇంతటి వివాదాన్ని సృష్టించిన ‘చిటికెల్లో విడాకుల’ కేసులు దేశం మొత్తమ్మీద రెండు వందలు కూడా వుండవు. మొత్తం ముస్లీం విడాకుల కేసుల్లో ఇవి 0.1శాతం మాత్రమే. వెయ్యికి ఒక్కటి కాదు కేవలం ఒక్క కేసు వున్నా విచక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించాల్సిన పనిలేదు.
విచక్షణతో కూడిన విడాకుల విధానాలు ఇకముందు కూడా ముస్లిం సమాజంలో కొనసాగుతాయి.
మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే మతాలు అన్నీ  మధ్యయుగాలకన్నా ముందు కాలంలో ఆవిర్భవించాయి. పితృస్వామ్య వ్యవస్థలో  పుట్టిన కారణంగా మినహాయింపు లేకుండా సమస్త మతధర్మాల్లో స్త్రీ వివక్ష వుంటుంది. అయితే, స్త్రీల విషయంలో  ఇస్లాం  సాపేక్షకంగా  ఉదారంగా వ్యవహరించిందనేది వాస్తవం. స్త్రీలకు విద్య, వివాహ, పునర్ వివాహ, విడాకుల (కులా) స్వేచ్చలతోపాటూ ఆస్తి హక్కు కూడా కల్పించింది. స్త్రీ సంస్కరణల విషయంలో ఇతర మతసమూహాలతో పోలిస్తే ఇస్లాం వెయ్యి సంవత్సరాలు ముందున్నది. అయినప్పటికీ ముస్లీం సమాజంలో స్త్రీలకు పురుషులతో సర్వసమాన హక్కులున్నాయనడం అతిశయోక్తే అవుతుంది!.
వర్తమాన ప్రపంచంలో ముస్లీంలు ఒక్కోదేశంలో ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. తాము మెజారిటీగావున్న దేశాల్లో వ్యవహరించినట్టు  మైనారిటీగా వున్న దేశాల్లో వాళ్ళు దూకుడుగా మార్పుల్ని స్వీకరించలేరు. దానికి కారణం అభద్రత. పౌరస్మృతిని వదులుకుంటే తమ అస్థిత్వమే అంతరించిపోతుందని భారత ముస్లీం సమాజం భావిస్తుంది.  అంచేతవాళ్ళు తమ పౌరసృతిని గట్టిగా పరిరక్షించుకోవాలనుకుంటారు. నిజానికి తాము మైనారిటీలుగా వున్న దేశాల్లో హిందువులు సహితం ఇదే విధానాన్ని కొనసాగిస్తారు. భారతదేశంలో భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలను పట్టించుకోనివారు సహితం అమేరికా వెళ్ళాక వాటికి పెద్దపీట వేస్తుండడాన్ని మనం తానా తదితర ఉత్సవాల్లో చూస్తున్నాం.
ట్రిపుల్ తలాఖ్ తో ఆగకుండా మొత్తం ముస్లీం పర్సనల్ లానే రద్దు చేయాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నశ్రీన్ ఒక అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు. భారత ముస్లీం సమాజం ఎందుకు తన ప్రత్యేక అస్థిత్వాన్ని రద్దు చేసుకోవాలీ? అనే ప్రశ్నకు తస్లీమా నశ్రీన్ వంటివారివద్ద సమంజసమైన సమాధానం వుండదు.
ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేయకుంటే తాము హిందూమతాన్ని స్వీకరిస్తామని కొందరు ముస్లిం మహిళలు హెచ్చరించినట్టు ఇటీవల కొంత ప్రచారం సాగింది. కులవ్యవస్థ పునాది మీద ఏర్పడిన హిందూసమాజం లోనికి బయటివారు సగౌరవంగా ప్రవేశించగల మార్గం ఇప్పటి వరకు తెరుచుకోలేదు. కులవ్యవస్థకు బయటికి పోయే పెరటి ద్వారంతప్ప, లోపలికి ప్రవేశించే సింహద్వారం లేదు.
గ్యాడ్జెట్ యాప్ తలాఖ్ వివాదం మొదలయ్యాక చాలా మందికి కొత్త ఉపాధి దొరికింది. వాళ్ళు ముస్లిం మహిళ మీద  సానుభూతి పేరుతో ముస్లిం సమాజాన్ని పరమ అనాగరీకంగా చిత్రించే పనిలో పడ్డారు. ఈ జీయస్టీ తరం స్త్రీజనోధ్ధారకుల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రుల నుండి గల్లీల్ల చిన్న లీడర్ల వరకు అందరూ వున్నారు. వీళ్లంతా చాకచక్యంగా దాచే ప్రయత్నం చేసిన వాస్తవం ఒకటుంది. మన దేశంలో విడాకులు పొందిన ముస్లీం మహిళలకన్నా హిందూ మహిళలు  మూడు రెట్ల కన్నా ఎక్కువ.  2011 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో విడాకులు పొందిన హిందూ మహిళలు 681529 మంది; ముస్లిం మహిళలు 212074 మంది.
స్త్రీపురుషులు ఇద్దరికీ విడాకుల సౌలభ్యం వున్నప్పటికీ ఏ మత సమూహంలో అయినా దీన్ని స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా వాడుకుంటారు. బహుశ శిక్కు సమాజం దీనికి మినహాయింపు కావచ్చు.    ముస్లిం సమాజంలో భర్తలకు భార్యలు విడాకులిచ్చే కేసు ఒకటుంటే, భార్యకు భర్తలు విడాకులిచ్చే కేసులు నాలుగు వుంటున్నాయి. ఇతర మత సమూహాలతో పోలిస్తే ఈ నిష్పత్తి ముస్లిం సమాజంలో ఎక్కువగా వున్నమాట వాస్తవం. అయితే, మరి కొన్ని అంశాలతో కలిపి ఈ గణాంకాలను పరిశీలించాల్సి వుంటుంది.
ముస్లిం సమాజంలో విడిపోవాలనుకున్నప్పుడు పురుషులు వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. ఇతర మత సమాజాల్లో చట్ట ప్రకారం విడాకులు ఇవ్వకుండానే భార్యల్ని వదిలివేసే సాంప్రదాయం కూడా వుంది. విడాకులు పొందకుండా, భర్త తమను వదిలేశాడో? లేదో? తేల్చుకోలేని కేసులు అనేకం వున్నాయి.  వాళ్ళు చట్టం దృష్టిలో కలిసి వుంటారు; వాస్తవంలో విడిపోయి వుంటారు. ఇలా సంధిగ్ధంలో కొనసాగే కేసులు ముస్లీం మత సదాయంలో చాలా తక్కువ. ఈ కారణం వల్లనూ ముస్లిం విడాకుల సంఖ్య దాదాపు కచ్చితంగా రికార్డులకు ఎక్కుతుంది. అంచేత ఎక్కువగానూ కనిపిస్తుంది.  
ముస్లిం సాంప్రదాయంలో పెళ్ళి అనేది ‘’దేవతలు చేసింది” “స్వర్గంల్లో నిర్ణయం అయింది” “జన్మజన్మల బంధం” వంటి శాశ్విత అనుబంధంకాదు. అదొక ఇహలోక ఒప్పందం. ఒప్పందం అనుకున్నప్పుడు కలవడం విడిపోవడమూ వుంటుంది. ముస్లిం సమాజంలో కన్యత్వ పట్టింపు లేకపోవడం ఒక గొప్ప విశేషం. పునర్ వివాహ సాంప్రదాయం అనాదిగా వుంది. విడాకులు పొందిన స్వల్పకాలంలోనే అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చేసేస్తుంటారు. పునర్వివాహం అనేది సాంప్రదాయంగా లేని సమాజాల్లో విడాకుల / విధవా స్త్రీల కష్టాలు మరింత తీవ్రంగా వుంటాయి.
ముస్లిం పర్సనల్ లా చర్చకు వచ్చినపుడు సహజంగానే ఉమ్మడి పౌరస్మృతి కూడా చర్చకు వస్తుంది. తక్షణ తలాఖ్ మీద సుప్రీం కోర్టు తీర్పు రాగానే బీజేపి రాజ్యసభసభ్యుడు సుబ్రమణియన్ స్వామి యూనిఫామ్ సివిల్ కోడ్ పాట అందుకున్నారు.  అహింసలాగ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఒక ఆశయమేగానీ ఆచరణకాదు.
భారత ఉపఖండంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలన ఆరంభమయిన కొత్తలోనే గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్  1772లో భారత దేశంలో పౌరస్మృతిని రూపొందించడానికి ఒక ప్రయత్నం చేశాడు.  ముస్లిం సమాజానికి  ఖురాన్ వంటి పవిత్రగ్రంధం, షరియా-హదీస్ వంటి పౌర స్మృతి వున్నట్టు హిందూ సమాజానికి లేవు. వేదాలను, రామాయణ, మహాభారత ఇతిహాసాలను స్మృతులుగా భావించడం కుదరలేదు. మరో గవర్నర్ జనరల్ విలియమ్ బెంటింక్, విద్యావేత్త థామస్ మెకాలే  హిందూ సమాజానికి ఒక పౌర స్మృతిని క్రోడీకరించడానికి పూనుకున్నారు. మనుస్మృతినే  ఆంగ్లో-హిందూ పౌరచట్టంగా   గుర్తించాలనే ప్రతిపాదనలు వచ్చాయి.  ఇరవయ్యవ శతాబ్దం ఆరంభంలో విలియం జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీషులోనికి అనువదించాడు. అప్పటి నుండి అదే అధికారికంగానో అనధికారికంగానో  హిందూ పౌర స్మృతిగా కొనసాగింది. భగవద్గీతను హిందూస్మృతిగా ప్రతిపాదించిన సందర్భాలూ వున్నాయి.  నిజానికి భగవద్గీతకు ప్రజల్లో ఆమోదాంశం కూడా ఎక్కువ. అయితే మహాభారత ఇతిహాసంలో అంతర్భాగంగా ఆవిర్భవించిందనే కారణంతో దానికి స్మృతి గుర్తింపు రాలేదు.
జాతియోద్యమం ఊపందుకున్న కాలంలో మనుస్మృతి చర్చనీయాంశంగా మారింది. అప్పుడే కొత్తగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ మనుస్మృతిని హిందూ పౌర స్మృతిగా ప్రచారం చేసింది. మహాత్మా గాంధీజీ  సహితం కొన్ని వివాదాస్పద అంశాలను తొలగించి మనుస్మృతిని హిందూ పౌర స్మృతిగా స్వీకరించవచ్చని  భావించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందుకు భిన్నంగా స్పందించారు. కులవ్యవస్థకు పునాది వేసిందే మనస్మృతి అని ఆయన దుయ్యబట్టారు. 1927 డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధాన్ని నడివీధిలో అంబేడ్కర్ తగులబెట్టారు.
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఆచరణలో ఖురాన్, షరియా, బైబిల్,  మనుస్మృతి తదితర మతగ్రంధాల్ని  క్రోడీకరించి కొత్తగా ఒక పౌర స్మృతిని రూపొందించడం అని అర్ధం. ఏ గ్రంధం నుండి ఏ అంశాన్ని స్వీకరించాలి అనేది సామాజిక అవసరాల మీదకాక రాజకీయ ప్రాబల్యాల మీద ఆధార పడివుంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్రంలో ఇప్పుడు అధికారంలోవున్న శక్తుల రాజకీయార్ధిక దృక్పధం హిందూత్వ అనేది బహిరంగ రహాస్యం.  వాళ్ళ మేధో సరోవరం ఆరెస్సెస్ నాయకత్వంలోని సంఘ్ పరివారం.
భారత త్రివర్ణ పతాకాన్ని ఒక అపశకునంగా విమర్శించినట్టే భారత రాజ్యాంగాన్ని కూడా తీవ్రంగా విమర్శించిన చరిత్ర ఆరెస్సెస్ ది. రాజ్యాంగ రూపశిల్పులు మనుస్మృతిని మరచిపోవడం చారిత్రక నేరం అంటూ ఆ సంస్థ దుయ్యబట్టింది. ఆర్ ఎస్సెస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ - భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన పక్షం రోజుల్లో విడుదలైన సంచికలో - “మనువు మన హృదయాలను ఏలుతున్నాడు” అనే వ్యాసాన్ని ప్రచురించింది.
సంఘ్ పరివార శక్తుల ఆధ్వర్యంలో సాగే  ఉమ్మడి పౌర స్మృతి రచన సహజంగానే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వుంటుందని ఊహించడం పెద్ద కష్టమేమీకాదు. అలాంటి ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం సమాజానికేకేకాక ఇతర మత అల్పసంఖ్యాక సమాజాలకు సహితం  ఆమోదయోగ్యంకాదు.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ కన్వీనర్)
మొబైల్ :  9010757776
హైదరాబాద్
23 ఆగస్టు 2017
ప్రచురణ :
మన తెలంగాణ దినపత్రిక, 24 ఆగస్టు 2017

http://epaper.manatelangana.news/1330773/Mana-Telangana-Daily/24-08-2017#page/4/2 

Sunday, 13 August 2017

Inspiration, Adoption And Plagiarism

Inspiration, Adoption And  Plagiarism

 Inspiration వేరు;  adoption వేరు; plagiarism వేరు

 

Boule de Suif కథను 4 ఆగస్టు 2017న పరిచయం చేస్తూ నేను పోస్టు చేసిన  వ్యాసం మీద ఫేస్ బుక్ లో సాగిన చర్చలో ఒకరు చెలం కథల్ని, వాటి మీద మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వారు చేసిన వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు

 మొపాస కథలో చెలం ప్రస్తావన తేవాలని నేను అనుకోలేదుఉనికవాద దశలో దృక్పథాలు విభేదిస్తాయి కనుక ఆమేరకు చెలం పాత్రలు కొన్నింటి చిత్రణపై నాకు భిన్నాభిప్రాయాలు వున్నాయిఅయితే, చెలం గారి స్వతంత్ర ఆలోచనల మీదాపరుగులు తీసే వారి తెలుగు  వాక్యాల మీద నాకు అపార గౌరవం వుందివారి మీద మొపాసా, D. H. Lawrence ప్రభావం వుందని  చాలామంది అంటారు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తే అవగాహనలేని కొందరు  పాఠకులు   చెలాన్ని పుసుక్కున plagiarist  అనేస్తారని భయపడ్డాను. సాహిత్యంలో స్థాయిలేనివాళ్ళు సహితం సోషల్ మీడియాలో పదాన్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నారు.

 

Inspiration వేరు;  adoption వేరు; plagiarism వేరు. చెలాన్ని plagiarist  అని ఒక కుర్రకుంక అన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి అలనాటి ఉద్దండులు అన్నా తప్పే.

 

ప్రపంచవ్యాప్తంగా  మానవాళికి ప్రేమ, ద్వేషం, బాధ, అసూయ, మోసం, త్యాగం, స్వార్ధం వంటి ప్రాధమిక భావోద్వేగాలు కొన్ని వుంటాయి. వాటన్నింటినీ సాహిత్య తొలి దశల్లోనే  అన్ని జాతుల్లోనూ, అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ  అప్పటి కవులు , రచయితలు  గ్రంధస్తం చేసేశారు. "పురాణాలు మానవజాతి బాల్యం అని కార్ల్ మార్క్స్ వంటివాళ్ళు అన్నది అర్ధంలోనే.

 

తరువాతి తరం రచయితలు చేసేదేమిటంటే భావోద్వేగాలను తమ కాలానికీ, తమ ప్రాంతానికి, తమ సంస్కృతికి, తమ ఉద్యమ, రాజకీయ అవసరాలకు, తమ దృక్పధాలకు, తమ సందర్భాలకు అనువుగా అన్వయించడం మాత్రమే.  O. Henry రాసిన   'The Gift of the Magi' కథ దాంపత్య అనుబంధం మీద అత్యద్భుత చిత్రణ. అంతటి గొప్ప కథను చదువుతున్నప్పుడు కూడా ఎక్కడో  ఒకసారి వాల్మీకీ రామాయణంలోని సీతారాముల అనుబంధం గుర్తుకు వస్తుంది.

 

చరిత్ర పునరావృతం అయినట్టు సాహిత్యం కూడా పునరావృతమౌతుంది. రచయిత అసమర్ధుడయితే ఒక నకిలీ కథను తయారుచేసి పాఠకుల ముఖాన కొడతాడు. రచయిత సమర్ధుడయితే గతంకన్నా వున్నతంగాను పునఃసృష్టి చేయగలడుసాహిత్య విమర్శకులు పరిశీలించాల్సింది రచయితకున్న ఆధునిక అన్వయ సామర్ధ్యం గురించి.

 

నేను ఏడాది జనవరి నెలలో వివాహ వేడుకకు పౌరహిత్యం  వహించాను. పూర్వకాలంలో కొత్త దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించేవారు. ఆధునిక కాలంలో  'The Gift of the Magi' సినిమా చూపించాలి, లేకుంటే కథ వున్న పుస్తకాన్ని బహూకరించాలి అని ప్రతిపాదించాను. అలా పాత సాంప్రదాయాలను update చేయవచ్చు.

 

          ప్రతి రచయితకూ తనదైన సృజనాత్మక శక్తి వుంటుంది. అదే అతని కాంట్రిబ్యూషన్. దానికో మూలాన్ని పీకి   plagiarist   అనేయడం సరికాదుఅన్వయం కూడా ఒక కళా సామర్ధ్యం. మూలాన్నీ, అన్వయాన్నీ మెచ్చుకునే సామర్ధ్యం విమర్శకులకు వుండాలి.

 

అలా కాదంటే, మన కవిత్రయం సహితం  plagiarists జాబితాలో చేరిపోతారు. లేదా వాళ్ల రచనల్ని కేవలం అనువాదాలు అనాల్సి వుంటుంది. అది సరికాదుమహాభారత పాత్రల్ని జలపాత హోరులా మలచిన తిక్కన రచనా నైపుణ్యాన్ని మెచ్చుకోకపోవడం సాహిత్య అపచారం అవుతుంది

 

యమకూపం నవలాకారుడు అలెగ్జాండర్ కుప్రిన్ ఒకసారి తన రచనా ప్రక్రియ గురించి మాట్లాడుతూ "Characters I've made cannot be seen as copying real people. I picked up a lot of small details from the real life, but that was by no means copying the reality, which is something I detest doing" అన్నాడు. పైగా తాను ఒక పాత్రను ఒకరి నుండి తీసుకోడనీ అనేక మందిని పరిశీలించి ఒక పాత్రను సృష్టిస్తానన్నాడు.

 

జాతియోద్యమం బలంగా సాగుతున్న కాలంలో కురుక్షేత్ర  నాటక రచన సాగింది. "అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు" వంటి పద్యాలు అలా పుట్టినవే. పాత కథకు సంబంధించి అది కౌరవులకు పాండవులు చేసిన హెచ్చరికలు. కానీ, కొత్త కథకు సంబంధించి అవి వలసపాలకులకు భారతీయులు చేస్తున్న హెచ్చరికలుఇంకొంచెం పరికించి చూస్తే 1930 దశకపు సైమన్ కమీషన్ రిపోర్టువైశ్రాయి  లార్డ్ ఇర్విన్ మంతనాలు, బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్  రౌండ్ టేబుల్ సమావేశ ఏర్పాట్లు, మహాత్మాగాంధీ స్వరాజ్య డిమాండ్, 1940 దశకపు క్విట్ఇండియా  నినాదం  వగయిరాల ఛాయలు మనకు తిరుపతి వెంకట కవుల రాయబార ఘట్టంలో కనిపిస్తాయి. అలా పుట్టినవే "జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని.... " వంటి పద్యాలు. మహామహితాత్ము డజాతశత్రువు గాంధీ మహాత్ముడే. దండం గాంధీజీ చేతిలోని కర్రే. అర్ధం అయినవాళ్లకు అర్ధం అయినంత!.

 

కథ ఒకటే అయినా, వ్యాసుని మహాభారతం, కవిత్రయం మహాభారతం, తిరుపతి వేంకట కవుల కురుక్షేత్ర నాటకం ఒకటికాదుమూడింటి చారిత్రక సందర్భాలు వేరు. ప్రయోజనాలు వేరు విధంగా అవి స్వతంత్ర రచనలే.

 

ఇప్పుడు ఉనికివాద యుగంలో అంబేడ్కర్, పెరియార్జిన్నా పాత్రల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కురుక్షేత్ర నాటకాన్ని తిరగ రాయవచ్చు. అలాంటి నాటకాలు ఈపాటికే  తమిళ భాషలో వచ్చి వుంటాయి కూడ

 

మధ్య Andrey Zvyagintsev దర్శకత్వం వహించిన Leviathan (తిమింగిలగిలం) రష్యన్ సినిమా   చూసి నిర్ఘాంత పొయాను. కథ అయూబ్ (Job) అనే  ఇస్లాం ప్రవక్తకు చెందింది. దాని ప్రస్తావన బైబిల్ లో  కూడ (Naboth's Vineyard)  వుంది. వీటితోపాటూ, అమేరికాలో రోడ్ల విస్తరణ, సుందరీకరణ  పథకం మీద తిరుగుబాటు చేసి చనిపోయిన  Marvin Heemeyer  జీవితాన్ని తక్షణ ప్రేరణగా తీసుకున్నట్టు  రచయిత ప్రకటించాడు.

 

వారం క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక పతాక శీర్షికలో  ఆధునిక దాంపత్య జీవితం మీద పెద్ద కథనాన్ని ప్రచురించిందిమానసిక వత్తిడి, కుంగుబాటుల కారణంగా  పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గిపోవడంవల్ల భార్యా భర్తల మధ్య కొత్త వివాదాలు తలెత్తుతున్నాయనేది కథనం సారాంశం. ఇలాంటి సర్వేలు అంతర్జాతీయ socialogy పత్రికల్లో చాలా కాలంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోయి మనుషులు మధుమేహానికి గురవుతున్నట్టు భవిష్యత్తులో టెస్టోస్టిరాన్  ఉత్పత్తి తగ్గిపోయి మగజాతే అంతరించిపోతుందనే ఊహాగానాలూ చెలరేగుతున్నాయి. వీటి ఆధారంగా కథలు రాస్తే అవి  అనివార్యంగా   D. H. Lawrence నవల  Lady Chatterley's Lover కు దగ్గరగా వుంటాయి. పరిశోధకులు ఇంకాస్త లోతుకు వెళితే లారెన్స్ నవలకు  Lady Ottoline Morrell వంటి ప్రాగ్రూపాలు కూడా కనిపిస్తాయి.

భర్త నయంకాని వ్యాధిగ్రస్తుడయినా, లైంగిక పటుత్వం లేనివాడయినా భార్య  అతనితోనే కొనసాగాలని చెప్పే పతివ్రతల కథలు మనకు చాలా వున్నాయి. 'సుమంగళి' వంటి సాంఘీక సినిమాలు కూడా వచ్చాయియూరప్ మహిళలు అర్ధ శతాబ్దం ముందే ఇలాంటి నీతి కబుర్ల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు భారత మహిళలు  సహితం బాటలో నడుస్తున్నారువివాహేతర సంబంధాల మీద ఇప్పటికే తెలుగులో చాలా కథలు వచ్చేశాయి. వస్తున్నాయి. వీటన్నింటినీ D. H. Lawrence కు అంటగట్టలేం యాభై యేళ్ళు ఆలస్యగానే కావచ్చుగానీమన జీవితాలు యూరోప్ ను అనుసరిస్తున్నపుడు మన సాహిత్యం సహితం యూరోప్ ను అనుసరిస్తోంది. ఇప్పటికీ పతీవ్రతలు ఏకపత్నీవ్రతుల కథలు రాస్తున్న వాళ్ళున్నారు. కాలంలోనూ పతీవ్రతల్ని, ఏకపత్నీవ్రతుల్ని చూడగలుగుతున్న వారి మైక్రోస్కోపిక్ దృష్టిని మెచ్చుకోవాలి!.

 

స్వల్పకాలిక, తాత్కాలిక స్త్రీ పురుష సంబంధాల మీద   Robert James Waller రాసిన   'The Bridges of Madison County' నవల ఆధారంగా 1995లో  మెరిల్ స్ట్రిప్ తో క్లింట్ ఈస్ట్ వుడ్ ఒక  గొప్ప సినిమా తీశాడు. మహేష్ భట్ 1998లో తీసిన మరో గొప్ప సినిమా 'జఖ్మ్ముగింపు  ఎత్తుగడ 'The Bridges of Madison County' నవల ముగింపును పోలి వుంటుంది ముగింపు పోలికను పక్కన పెడితే, జఖ్మ్ సినిమాలో ప్రధాన  కథా వస్తువు   మత అసహన  వాతావరణంబీజేపి అగ్రనేత అడవాణి తొలి రథయాత్ర జరుపుతున్న కాలంలోనే మత అసహన  వాతావరణం మీద  సినిమా తీసినందుకు మనం మహేష్ భట్ ను ఎంతగా పొగిడినా తక్కువే.

 

యూరోపియన్ల గొప్పతనం  ఏమంటే తాము ఎక్కడ నుండి ప్రేరణ పొందారో దాన్ని వాళ్ళు ముందుగానే ప్రకటిస్తారు. 1933 నాటి King Kong సినిమాను చూసి జీవితంలో అలాంటి సినిమా ఒక్కటయినా తీయాలనే లక్ష్యంతో  తాను దర్శకునిగా మారినట్టు 2005లో అదే కథతో  అదే పేరుతో కొత్త  సినిమా తీసిన పీటర్ జాక్సన్ చెప్పుకున్నాడు.

 

మొపాసా 'వెన్నముద్ద' కథ ప్రేరణతో హాలీవుడ్ లో Stage Coach' అనే సినిమా వచ్చింది. Citizen Kane సినిమా తీయడానికి ముందు ప్రేరణ కోసం Stage Coach సినిమాను నలభై రోజులు వరసాగ్గా చూసినట్టు దాని డైరెక్టరు  Orson Welles రాసుకున్నాడు. లూసన్ అయితే Old Stories Retold పేరుతో ఒక కథా సంకలనమే రాశాడురావి శాస్త్రి కూడ పిపీలకం వంటి కొన్ని కథల్లో అలాంటి ప్రయోగాలు చేశారు.

 

నేను రాసిన 'రాజుగారి కొమ్ము'కు The King and The Tamarind Drum కథ ప్రేరణ, 'కటారా' కథ ముగింపు ఎత్తుగడకు  Shaddad and his Paradise కథ ప్రేరణ, అలాంటి ఒక ఎత్తుగడ Citizen Kaneలో కూడ కనిపిస్తుంది.   గత నెలలో రాసిన 'మదరసా మేకపిల్ల' కు 'తోడేలు-మేకపిల్ల' కథ ప్రేరణ.

 

గత దశాబ్దంన్నర కాలంగా Vishal Bhardwaj, Sanjay Leela Bansali ఒకరితో ఒకరు పోటీపడి షేక్స్ పియర్ నాటకాలకు మహత్తర అన్వయాలుతీస్తున్నారుషేక్స్ పియర్ Hamlet,  Basharat Peer అనుభవాలు Curfewed Nightను కలిపి  Vishal Bhardwaj హైదర్ సినిమాగా మలిచిన తీరు అద్భుతం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన పాతాళభైరవి (1951) మూల కథను పింగళి నాగేంద్రరావు అల్లావుద్దీన్ నుండే తీసుకున్నారు. అన్నట్టు ఆధునిక అన్వయాలు పొందుతున్న వాటిల్లో రామాయణ మహాభారతాలు, నీతిచంద్రికలు, అరేబియన్ రాత్రులతోపాటూ  షేక్స్ పియర్, గై డి మొపాసాల రచనలే ఎక్కువ.

 

14 ఆగస్టు 2017