మొపాసా కథ ‘వెన్నముద్ద’
Guy de Maupassant’s ‘Boule de Suif’
ఉష యస్ డానీ
గైడి మొపాసా, సాదత్ హసన్ మంటో, ఆనతోల్ చెఖోవ్, లూసన్ - ప్రపంచ కథకుల్లో అగ్రగణ్యులు. సాహిత్యంలో ఎవరి అభిరుచులు వారివి; ఎవరి ప్రాధాన్యాలు వారివి. ఇది నా ప్రాధాన్యం.
మొపాసా 19వ శతాబ్దపు ఫ్రెంచ్ దేశస్తుడు. 1870ల నాటి ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధకాలంలో జీవించాడు. నెపోలియన్ – 3 ఫ్రాన్స్ - బిస్మార్క్ జర్మనీల మధ్య సాగిన యుధ్ధం అది. ఆ యుధ్ధం ముగింపులోనే 1914లో మొదటి ప్రపంచ యుధ్ధం ఆరంభానికి బీజాలున్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే (1871) పారీస్ కమ్యూన్ పేరిట ఫ్రాన్స్ లో ఓ రెండు నెలలు తొలి కార్మిక రాజ్యం ఏర్పడింది.
ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధం, పారీస్ కమ్యూన్ నాటికి మొపాసా ఇరవై యేళ్ల యువకుడు. ఆ యుధ్ధాన్నీ, ఆ విప్లవ ప్రభుత్వాన్నీ స్వయంగా చూశాడు. ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం, ఫ్రాన్సులో రైతాంగ విప్లవాల నేపథ్యంలో ఛార్లెస్ డికెన్స్ రచనలు సాగినట్టు, ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధం, పారీస్ కమ్యూన్ నేపథ్యంలో గై డి మపాసా కథలు సాగాయి. ఆ నేపథ్యాన్ని కూడా అర్ధం చేసుకుంటే మొపాసా రచనల్ని మరింత గొప్పగా ఆస్వాదించవచ్చు.
మనిషి బుధ్ధి విందులో మాంసం ముక్క దగ్గర బయటపడుతుందని మనకు ఒక సామెత వుంది. ప్రశాంత కాలంలో మర్యాదస్తుల్లా ప్రవర్తించే మనుషులు ప్రళయ కాలంలో నైతికంగా దిగజారి ప్రవర్తిస్తారని మొపాసా కథలన్నీ వందలసార్లు నిరూపిస్తాయి.
తన ముప్ఫయ్యవ ఏట రాసిన ‘బౌలే ది సౌఫ్’తో మొపాసా కథా ప్రపంచంలో ఒక ధృవతారగా మారిపోయాడు. తను రచయితగా వున్నది పదేళ్ళే అయినా చాలా విస్తారంగా రచనలు చేసాడు. 1980-1890 మధ్య కాలంలో 300 కథలు, 200 వ్యాసాలు, 6 నవలలు, మూడు నాటకాలు, మూడు ప్రయాణ అనుభవాలు, కొన్ని వచన కవితలు రాసాడు.
మనుషుల్లోని వివాహేతర సంభోగ యావ,
మర్యాదస్తులు ఎదుటివారికి చెప్పే నీతుల్లోని డొల్లతనం మొపాసా రచనల్లో ప్రధాన అంశంగా వుంటాయి.
మనుషుల ప్రవర్తన మీద వినిపించీ వినిపించని అధిక్షేపణ, కనిపించీ కనిపించని స్వల్ప హాస్యం మొపాసా శైలి. దీనినే ఇప్పుడు tragicomic, black comedi అంటున్నారు. భీభత్సాన్ని సహితం అలా అలవోకగా సాయంకాలాలు పిల్లలకు అమ్మమ్మ కథ చెపుతున్నట్టు సాగిపోతుంది మొపాసా కథనం.
గోదావరి మండలంలో వరి నాట్లు, కోతలకు వచ్చే మహిళా కూలీలు పాడే పాటలు చాలా ఆసక్తిగా వుంటాయి.
“భద్రమ్ము అన్నాడు గోంగోరకి!
అరే భద్రమ్ము అన్నాడు గోంగోరకి!
వాడు భద్రమ్ము అన్నాడు గోంగోరకీ!
అరే బట్టలిప్పదీశాడు గోంగోరకీ!”
“జాగ్రత్త అన్నాడు గోంగోరకి!
అరే జాగ్రత్త
అన్నాడు గోంగోరకి!
వాడు జాగ్రత్త అన్నాడు గోంగోరకీ!
అరే జాకెటిప్పదీశాడు గోంగోరకీ”
ఇది బృందగానం. ఒకరో ఇద్దరో పాడుతుంటే ఓ నాలుగెకరాల కమతంలో బారులు తీరి నిలబడిన ఓ నలభై యాభై మంది కోరస్ ఇస్తుంటారు. పనీ, పాట, నవ్వూ కలగలిసిపోతాయి. గట్టు మీదున్న మగాళ్ళు ఆ పాటల్ని వింటూ గతాన్ని నెమరేసుకుంటూనో భవిష్యత్తును తలుచుకుంటూనో తెగ సంబర పడిపోతుంటారు. వాళ్లను చూస్తూ మహిళలు కొంచెం కవ్వింపుగానూ పాడుతుంటారు. ముఠాలో పెళ్ళీడు రాని పిల్లలూ వుంటారు. ఈ పాట వాళ్లకు అర్ధంఅయ్యి అర్ధంకానట్టూ వుంటుంది. మధ్యమధ్యలో అర్ధం అయినపుడు ఆ పిల్లలు కిసుక్కున నవ్వుతుంటారు. ఇందులో అశ్లీలం వుందటే వుంది. పరిశుభ్రత లేదంటే లేదు. అయితే, పాటలోగానీ, ప్రవర్తనలోగానీ ఎవరూ అంతకు మించి ముందుకు సాగరు.
సరిగ్గా ఇలాగే వుంటుంది మొపాసా రచనా శైలి. శృంగారాన్ని తడమకుండా వుండలేడు. మనం బయటికి చెప్పడానికి బిడియపడే విషయాలను కూడా చెప్పేస్తాడు. అయితే వాటి హద్దుల్ని దాటాలనీ అనుకోడు. ఇలాంటి శైలిని ఫ్రెంచ్ లో ‘conte leste’ అంటారు. ఇంగ్లీషులోగానీ, తెలుగులోగానీ దీనికి పర్యాయపదాన్ని కనిపెట్టాల్సి వుంది. అరేబియన్ నైట్స్ కథల పరంపరలో కూడా ఇలాంటి శైలి ఒకటి కనిపిస్తుంది.
మొపాసా రాసిన మూడు వందల కథల్లో అగ్రస్థానం ‘బౌలే ది సౌఫ్’దే. తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఒక అనుమతి పత్రాన్ని పొందడం కోసం పట్టణంలోని మర్యాదస్తులు అందరూ కలిసి ఓ అందమైన అమ్మాయిని తీసుకెళ్ళి ఓ సైనికాధికారి పక్కలో పడుకోబెట్టడం ఇందులో కథాంశం. సైనికాధికారి దగ్గరికి పంపడానికి మర్యాదస్తులందరూ ఆ అమ్మాయిని బుజ్జగించి ఒప్పించడం, తీరా తమ పనయ్యాక ఆ అమ్మాయిని అమానుషంగా అవమానించడం ఇందులో కథనం.
ముసుగులు తొడిగిన సమాజాన్ని మొపాసా భరించలేకపోయేవాడు. సమాజాన్ని బట్టలూడదీసి నగ్నంగా చూపించడం అతని సాహిత్య లక్ష్యం. కొన్ని సందర్భాల్లో తానే బట్టలూడదీసుకుని ఆ వాణిజ్య వేశ్యా వీధుల్లో నగ్నంగా తిరిగేవాడు. వర్తమాన సమాజంలో గొప్ప కథలు రావడంలేదని గుండెలు బాదుకునేవారు ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. మర్యాదస్తులెవరూ గొప్ప కథలు రాయలేరని మపాసా, మంటో ఇద్దరూ కొంచెం గట్టిగానే అరిచి చెప్పారు.
ఫ్రెంచ్ ‘బౌలే ది సౌఫ్’ను తెలుగులో కొవ్వుముద్ద, వెన్నముద్ద అనవచ్చు. ఇంగ్లీషులోనూ కొందరు 'Ball of Fat' అని అనువదిస్తే మరికొందరు 'Butterball' అని అనువదించారు. . తెలుగులో 'వెన్నముద్ద' అంటే బాగుంటుందనిపించింది. కొవ్వు పదంలో కొంచెం కరుకుదనం వుంది. 'వెన్నముద్ద' లో మృదుత్వం వుంది. ఈ కథలో ప్రధాన పాత్ర ఎలిజబెత్ రూసో అమాయకపు వాణిజ్య వేశ్య. భావోద్వేగాలు మరీ ఎక్కువగావున్న ఆమె. అయితే, వేశ్యావాటికల నిర్వాహకురాలు మాత్రం కాదు.
‘వెన్న ముద్ద’ ఎలిజబెత్ రూసో వంటి పాత్ర మన పౌరాణిక సాహిత్యంలోనూ వుంది. మహాభారతంలో ఋష్యశృంగుని కథలో వచ్చే వైశాలి పాత్ర ఇలాంటిదే. విశ్వామిత్రుని పాత్ర రామాయణ మహాభారతాల్లో వున్నట్టు, ఋష్యశృంగుని పాత్ర కూడా రెండు పురాణాల్లోనూ కనిపిస్తుంది. మహారాజు రోమపాదుడు చేసిన పాప ఫలితంగా అంగ రాజ్యంలో దాదాపు పన్నెండు సంవత్సరాలు వర్షాలు కురవవు. ఋష్యశృంగుడనే ముని కుమారుడు కాలుమోపితే రాజ్యంలో వర్షాలు కురుస్తాయని రాజగురువు ఉపాయం చెపుతాడు. స్త్రీ స్పర్శ ఎరుగని ఋష్యశృంగుడ్ని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చే బాధ్యతను వైశాలీ అనే దేవదాసీకి అప్పగిస్తాడు రోమపాదుడు. వైశాలి నిజానికి రోమపాదుని వివాహేతర సంతానం. అప్పటి వరకు ఆ విషయం రహాస్యంగా వుంటుంది. వైశాలిని తన కుమార్తె అని ప్రపంచానికి బాహాటంగా ప్రకటిస్తానని రాజు మాట ఇస్తాడు. దాన్ని నమ్మి ఋష్యశృంగుడ్ని తీసుకురావడానికి బయలుదేరి వెళుతుంది వైశాలి. అక్కడ తన శృంగార కళానైపుణ్యంతో ఋష్యశృంగుడ్ని ముగ్గులోనికి దింపి అంగరాజ్యానికి తీసుకువస్తుంది. ఋష్యశృంగుడి రాకతో రాజ్యంలో భారీగా వర్షాలు కురుస్తాయి. కానీ, రాజు రోమపాదుడు మాట తప్పుతాడు. తన అధికారిక కూతుర్ని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్ళి చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. రాజు మోసం చేయడంతో వైశాలి కుంగిపోయి వర్షపు నీటిలో పడిపోతుంది. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలను చూసి ఆనందోత్సాహంలోవున్న జనం వైశాలిని తొక్కుకుంటూ పరుగులు తీస్తారు. ఆ తొక్కిసలాటలో వైశాలి, ఆమె తల్లి కూడా చనిపోతారు.
సుప్రసిధ్ధ తమిళ దర్శకుడు కే బాలచందర్ 1973లో తీసిన ‘ఆరంగేట్రం’లో ప్రధానపాత్ర లలితకు ప్రేరణ వైశాలి, ఎలిజబెత్ రూసో అనిపిస్తుంది. ఇదే సినిమాను తెలుగులో ‘జీవితరంగం’ పేరుతో పునర్ నిర్మించారు. రెండు భాషల్లోనూ ప్రధాన పాత్రను ప్రమిల నటించగా, హిందీలో ‘ఆయినా’ పేరుతో తీసిన సినిమాలో ముంతాజ్ నటించింది. మళయాళ దర్శకుడు భరతన్ 1988లో వైశాలి పేరుతోనే పౌరాణీక గాధను తెరకు ఎక్కించారు. ఆ సినిమాను తెలుగులో కూడా అనువాదం చేశారు. అన్ని భాషలలోనూ అప్పట్లో అది ప్రజాదరణపొందింది.
కథా నవలా సాహిత్యంలోని గొప్ప పాత్రలకు పౌరాణిక స్థాయి వచ్చేస్తుంది. ఆ స్థాయికి చేరుకున్నాక అది ప్రపంచ వ్యాప్తంగా వేలమంది రచయితలకు ప్రేరణగా మారుతుంది. దానికి Boule de Suif ఒక గొప్ప ఉదాహరణ.
మానవ జీవితసారం అంటే మపాసాకు సంబంధించినంత వరకు రెండే రెండు అంశాలు; ఆహారం, మైధూనం. జానెడు పొట్ట, పొట్టకు జానెడు కింద. అంతే. మిగిలినదంతా ముసుగులు, బూటకం అనుకుంటాడతను. వెన్నముద్ద కథ కూడా ఆకలి ఆహరంతో మొదలయ్యి సంభోగంతో ముగుస్తుంది.
పద్యానికి చందస్సు, గణాలు, యతి, ప్రాసలు వున్నట్టే కథ, నవల, నాటకం, సినిమా వగయిరా ప్రక్రియలకూ సందర్భం-ఘర్షణ- పరిష్కారం (Set up – confrontation-resolution) అంటూ ఒక నిర్ధిష్ట నిర్మితి (paradigm) వుంటుంది. పరిష్కారంలో ప్రధాన పాత్ర విజయాన్ని సాధిస్తే అది సుఖాంతం అవుతుంది పరాజయాన్ని పొందితే అది విషాదాంతం అవుతుంది.
అయితే, నిర్మితి తెలిసినవాళ్ళే గొప్ప కథలు రాస్తారనే నియమం ఏమీలేదు. పండితులువేరు కవులువేరు అనేమాట ఎలాగూ వుంది. కాకపోతే, నిర్మితి తెలియనివాళ్లకన్నా నిర్మితి తెలిసినవాళ్ళు సులువుగా కథలు రాయగలరు. అదొక సౌలభ్యం. అంతకన్నా ముఖ్యవిషయం ఏమంటే, గొప్ప రచయితలు రాసిన గొప్ప కథలు తరువాతి తరాల వారికి నిర్మితి నియమాలుగా మారిపోతాయి. అలాంటి కథల్లో మొపాసా కథ బౌలే ది సౌఫ్ ఒకటి.
ఆయన రాసిన నిర్మితిని అధ్యయనం చేయడం తరువాతి తరాల వారికి చాలా అవసరం.
ప్రష్యా, ఫాన్స్ ల మధ్య 1870లో యుధ్ధం ఆరంభమయింది. శారీరక సౌష్టవం, యుధ్ధ క్రమశిక్షణ రెండూలేని ఫ్రెంచ్ సైనికులు వారం రోజుల్లోనే చేతులు ఎత్తేశారు. జర్మన్ సైనికులు ఫ్రాన్స్ లోనికి చొచ్చుకువచ్చి సీన్ నదీ తీరాన్న రూన్ తదితర నగరాలను ఆక్రమించుకున్నారు. విజయ గర్వంతో పెద్ద ఎత్తున అత్యాచారాలకు పాల్పడ్డారు. వంటగదుల్లోనికీ పడకగదుల్లోనికి కూడా దూసుకు వచ్చేస్తున్న జర్మన్ సైనికుల్ని నిలవరించడం స్థానికులకు కష్టంగా మారింది. ఈ దౌర్జన్యాలను భరించలేక రూన్ నగర ప్రముఖులు ఓ పదిమంది ఓ తెల్లారు జామున ఓ నాలుగు గుర్రాల బగ్గీ మాట్లాడుకుని ప్యారీస్ సమీపంలోని హావ్రే నగరానికి బయలుదేరారు. ఆ కోచ్ లో నగర వాణిజ్య వేశ్య కూడ ఒకామె వుంటుంది. మొపాసా ఆమెను Prostitute అని కాకుండా courtesan అంటూ ఆస్థాన నర్తకి అనే అర్ధం వచ్చేలా గౌరవంగా పరిచయం చేస్తాడు.
వేశ్యల్లోనూ అనేక అంతస్తులుంటాయి. అక్కడా హాకర్స్- మెగా షోరూమ్ తేడాలుంటాయి. 1970ల నాటి రాజమండ్రి భాషలో చెప్పాలంటే మొదటిది ఇసుకవీధి, రెండోది మెరకవీధి. డబ్బు పడేస్తున్నాంకదా అని ఇసుకవీధి కొంపల్లోనికి వెళ్ళినంత సులువుగా మెరక వీధి మేడల్లోనికి వెళ్లడం కుదరదు. అక్కడ అనేక లాంఛనాలు వుంటాయి. అవన్నీ సంతృప్తి చెందితేనే ప్రవేశం వుంటుంది. ఇసుకవీధి అమ్మాయిలకు ఇంటి పేర్లు వుండవు. పేర్లు మాత్రమే వుంటాయి. ఆ పేర్లు కూడా కొత్తగా రంగంలో దిగాక పెట్టుకున్నవే. మెరక వీధి అమ్మాయిలకు పేర్లు, ఇంటిపేర్లు కూడా వుంటాయి. ఆ ఇంటి పేర్లు కూడా ఆ ప్రాంతంలోని ప్రముఖ కుటుంబాలకు చెందినవే అయ్యుంటాయి. కన్నెరికం సాంప్రదాయం నుండి వాళ్లకు ఇంటి పేర్లు వస్తాయి.
స్థనాలు (embonpoint) వయసుకు మించి పెరిగిపోవడంవల్ల ఆమెకు ఆ ఊర్లో వెన్నముద్ద అనే ముద్దుపేరు స్థిరపడిపోయింది. ఆమె అసలు పేరు ఎలిజిబెత్ రూసో. సిసిలి జాతికి చెందిన కులీనుల ఇంటిపేరు అది. ఒక విధంగా ఆమెది గురజాడవారి కన్యాశుల్కంలో మధురవాణి రేంజి!
ఊరిని వదిలి పారిపోయే హడావిడిలో వాళ్లంతా తిండి తెచ్చుకోవడం మరచిపోయారు. మంచుదారిలో ప్రయాణం నిదానంగా సాగుతుంటే చలికి ఆకలి వేగంగా పెరిగిపోతోంది. ఆకలి ఘట్టంలోనే సారా వ్యాపారి లూసొ “eat the fattest of the passengers’’ పాటను గుర్తు చేసాడు. సముద్రంలో దారితప్పిన నావికులు తిండి దొరకనపుడు తమలో లావుగా వున్నవాడ్ని కోసుకు తినేస్తారని చెప్పే పాట అది. వెన్నముద్దను దృష్టిలో పెట్టుకునే అతనా మాట అన్నాడు. అది వినంగానే మర్యాదస్తులైన ప్రయాణికులందరూ ఉలిక్కి పడ్డారు.
కథా క్రమంలో ఆరంభం కాబోతున్న ఘర్షణకు ఇది తొలి సంకేతం. దీనినే కథా నిర్మీతిలో మొదటి ప్లాట్ పాయింట్ అంటారు.
బగ్గీలోని కులీన స్త్రీలంతా వెన్నముద్దను చూసి మొదట ఈసడించుకున్నారు. అయితే వాళ్ల పొగరును ఆకలి అణిచివేసింది. ఆమె తెచ్చిన తిండి తినకతప్పలేదు. ఆమె తిండి తింటూ ఆమెతో మాట్లాడకపోవడం మర్యాద కాదు కనుక మాట కలిపారు. ఆ మాటల్లో ఆమె తాను ఫ్రెంచ్ విప్లవనేత నెపోలియన్ బొనపార్టెకు వీరాభిమానినని ప్రకటించుకుంది. జర్మన్లు అంటే తనకు పరమ ద్వేషం అంది. వీలు కుదిరితే జర్మన్ సైనికాధికారి ఒక్కడినయినా చంపాలనేది తన కోరిక అని భయం లేకుండా చెప్పేసింది.
ఆరంభం కాబోతున్న ఘర్షణకు ఇది మలి సంకేతం. దానినే కథా నిర్మీతిలో రెండవ ప్లాట్ పాయింట్ అంటారు.
అలనాటి ఫ్రాన్స్ లోని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, రివల్యూషనరీ రాజకీయాలు కూడా ఆ బగ్గీలో చర్చకు వచ్చాయి. తిండి, కబుర్లు ముగిసే సమయానికి చీకటి పడింది. బగ్గీలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. డెమోక్రాట్ అయిన కోర్నుడెట్ అనేవాడు చొరవచేసి వెన్నముద్ద భుజం మీద చెయ్యి వేశాడు. ఆమె ఆ చీకట్లో అతని భుజాన్ని గురిచూసి చప్పుడు కాకుండా బలంగా ఒక గుద్దుగుద్ధింది. అలా గట్టిగా తిరస్కరిస్తుంది.
ఇది కూడా ఒక ప్లాట్ పాయింటే. ఇలా ప్రతి చోటా వెన్నముద్ద స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనాన్ని కొనసాగిస్తాడు మొపాసా. ఇంకో సందర్భంలోనూ శత్రువు నీడపడే చోట తాను సెక్స్ లో పాల్గొనను అంటుంది ఎలిజిబెత్.
ఆ తరువాత దృశ్యంలో వెలుతురు తగ్గిపోయి చీకట్లు కమ్ముకున్నాయి. శబ్దం ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించింది. నిద్ర ముందు కొచ్చి మనుషులు నిశ్చలనంగా మారిపోయారు. బగ్గీ టోట్స్ నగరంలో ప్రవేశించింది.
హఠాత్తుగా జర్మన్
భాషలో కేకలు అరుపులు, సైనికుల పదఘట్టనలు, సెర్చ్ లైట్ల వెలుతురులతో కొత్త సన్నివేశం ఆరంభం అయ్యింది. అప్పుడు ప్రత్యక్ష మయ్యాడు పొడవుగా సన్నగా వున్న జర్మన్ అధికారి. పెద్దపెద్ద
మీసాలు పెంచాడుగానీ పెద్ద వయసేమీకాదు; యువకుడే.
ఒక భీభత్స సన్నివేశాన్ని ఆరంభంచడానికి ముందు కాన్వాస్ ను నిశ్శబ్ద, నిశ్ఛలన, కాంతిహీనంగా మార్చడం ఒక టెక్నిక్. ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిధ్ధ దర్శకులందరూ సినిమాల్లో ప్రతినాయకుడ్ని పరిచయం చేసే ఘట్టంలో ఇలాంటి టెక్నిక్ నే వాడారు. బాపు గారి ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు పరిచయం ఘట్టం గుర్తుందిగా?
ఇక్కడే ఘర్షణ అధ్యాయం మొదలవుతుంది. కథా నియమాల్లో ఘర్షణ అధ్యాయం పావు కథ అయ్యాక మొదలయ్యి ముప్పావు కథ వరకు కొనసాగుతుంది.
జర్మన్ అధికారిని చూసి బగ్గీలోని ప్రయాణికులంతా భయంతో ఒణికిపోయారు. వెన్నముద్దకు మాత్రం ఆవేశం ముంచుకొచ్చింది. అందరూ హోటల్ గదుల్లో సామాన్లు పెట్టి డైనింగ్ హాలులో రాత్రి భోజనాలకు కూర్చుంటారు. ఆ సమయంలో హొటల్ యజమాని అక్కడికి వచ్చి “మేడం ఎలిజబెత్ రూసో?” అని పిలవడంతో కథ మలుపు తిరుగుతుంది.
కథ ఆరంభం నుండీ ఆమెను వెన్నముద్దగానే వర్ణిస్తూ వచ్చిన మొపాసా అప్పుడే మొదటిసారి ఆమె పేరు చెపుతాడు. ఆమె రూసో వంశీకురాలు అని పాఠకులకు పాత్రలకు అప్పుడే తెలుస్తుంది.
జర్మన్ సైనికాధికారి ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాడని హొటల్ యజమాని చెప్పాడు. జర్మన్ సైనికాధికారులతో తాను మాట్లాడనని వెన్నముద్ద మొండికేసింది. ఆ అమ్మాయి తమ కొంప ముంచుతుందని కులినులందరూ భయపడి పోయారు. వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కోమని అందరూ ఆమెను బతిమాలారు. చివరకు ఆమె ఒప్పుకుంది.
“జర్మన్ సైనికాధికారుల మొఖం చూడడమే నాకు ఇష్టంలేదు. మీకోసం వెళుతున్నాను. గుర్తుపెట్టుకోండి” అంది వెన్నముద్ద.
కౌంటెస్ ముందుకు వచ్చి ఎలిజబెత్ చేతిని ఆప్యాయంగా పట్టుకుని “మీ మేలు మరిపోలేము” అంటుంది.
అయిష్టంగానే నెమ్మదిగా వెళుతుంది వెన్నముద్ద. జర్మన్ సైనికాధికారిని కలిశాక అతన్ని తిట్టుకుంటూ విసురుగా తిరిగి వస్తుంది. కానీ అతన్ని ఎందుకు తిడుతున్నదో చెప్పదు. అందరూ ఆమె చుట్టూ మూగి అనేకసార్లు అడిగాక మరునాడు అసలు విషయం చెపుతుంది.
“వాడు నాతో ఒక రాత్రి పడుకుంటాడట”అంటుంది.
ఇది కథకు మిడ్ పాయింట్.
కథ రెండవ భాగంలో అసలు నాటకం మొదలవుతుంది. జర్మన్ సైనికాధికారి కోరిక విని మర్యాదస్తులందరూ నిర్ఘాంతపోతారు. హాహాకారాలు చేస్తారు. బల్ల మీద వున్న వస్తువుల్ని కోపంగా నేలకేసి కొడతారు. మనుషుల్లో ఇంత నీచులుంటారా? అని తిట్టిపోస్తారు.
మరునాడు మర్యాదస్తుల ధోరణి మారిపోతుంది. వెన్నముద్ద వల్లనే తమకు కష్టాలు వచ్చాయనే ఆలోచన మొదలవుతుంది. వేశ్యవృత్తిలో వున్న ఆమెకు వాడితో ఒక్క రాత్రి పడుకుంటే కొత్తగా వచ్చే నష్టమేంటీ? వంటి వాదనలూ చేస్తారు. చిన్న విషయాన్ని ఎక్కువ చేస్తున్నదని విసుక్కుంటారు. వెన్నముద్ద కాళ్ళూ చేతులు కట్టి వాడికి అప్పచెప్పాలనే మొరటు ఆలోచనలూ చేస్తారు. అయితే, వాళ్లంతా మర్యాదస్తులు కనుక తమ ఆలోచనల్ని బయటికి పొక్కకుండా జగ్రత్త పడ్తారు. మంచి మాటలతో ఆమెను ఒప్పించాలని ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసుకుంటారు. శత్రువుల కోట మీదికి యుధ్ధానికి వెళూతున్న సైన్యాధిపతిలా వ్యూహ రచన చేస్తారు. ఒక క్రమ పధ్ధతిలో ఆమెతో ఎవరు ఎలా మాట్లాడాలో ఒక స్ల్రిప్టు అనుకుని రిహార్సల్ కూడా వేసుకుంటారు.
వెన్నముద్దను జర్మన్ అధికారి పక్కన పడుకోబెట్టడానికి దేశభక్తి అనే సెంటిమెంటును గట్టిగా పూస్తారు. శత్రు సైన్యాధికారులకి తమ అందాల్ని ఎరగా వేసి దేశ ప్రజల్ని కాపాడిన పౌరాణిక స్త్రీల గాధల్ని ఏకరువు పెడతారు. చరిత్రలో లేని కొన్ని గాధల్ని తామే కల్పించి చెపుతారు. అసలు ఆడదాని శరీరం వున్నది శత్రువులనించి తమ పురుషులని కాపాడటానికే అన్నంతగా కథలు అల్లేస్తారు.
వాళ్ళు ఇంతగా చెపుతున్నా వెన్నముద్దకు నమ్మకం కలుగదు. అప్పుడు చర్చి సిస్టర్లు రంగంలోనికి దిగుతారు. “పరుల హితం కొరకు మనుషులు చేసే పాపకార్యాలని భగవంతుడు క్షమిస్తాడు” అని గట్టిగా చెపుతారు. బగ్గీలో వున్న పదిమందినేకాక మొత్తం హావ్రే నగరంలో తమ సేవల కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది క్షతగాత్రులని కాపాడే అవకాశం భగవంతుడు ఎలిజబెత్ రూసోకే ఇచ్చాడంటారు.
దేశభక్తితోపాటు దైవ అనుమతి కూడా వుందనడంతో వెన్నముద్ద ఆలోచనల్లో పడిపోతుంది. ఆ తరువాతి రోజు కూడ మర్యాదస్తులంతా కలిసి దాదాపు ఇలాంటి నాటకాన్నే మరిన్ని భావోద్వేగాలను దట్టించి కొనసాగిస్తారు.
లోకంలో ఎంతటి మూర్ఖుడికి అయినా దేశభక్తి, దైవభక్తి రంగరించి పోస్తే పూనకం వచ్చేస్తుందని వాళ్ళకు తెలుసు. దీనికి ఎలిజబెత్ మినహాయింపుకాదు. అంతిమంగా తన మాతృదేశ ప్రజల్ని రక్షించడం కోసం శత్రుదేశపు సైనికాధికారితో పడుకోవడానికి ఆమె సిధ్ధపడుతుంది.
మొపాసా కథల్లో శృంగార నేపథ్యం వుంటుందిగానీ శృంగార వర్ణన వుండదు. మొపాసాకు సంబంధించి సెక్స్ అనేది మానవ సహజ చర్య. వస్త్రాలు ముసుగులు లేకుండా సాగించే నగ్నకార్యం కనుక దానిని పాఠకులకు వర్ణించి చెప్పాల్సిన పనిలేదను కుంటాడతను.
ఆ రాత్రి పడగ్గదిలో వెన్నముద్దతో జర్మన్ సైనికాధికారి సాగించిన సంభోగం గురించి ఒక్క వాక్యం కూడా రచయిత రాయడు. అంతకు ముందు జర్మన్ సైనికాధికారి వెన్నముద్దతో తన కోరికను చెప్పిన సన్నివేశాన్ని కూడా మొపాసా పాఠకులకు చూపడు. కానీ, జర్మన్ సైనికాధికారి పడగ్గదిలో వెన్నముద్ద వుండగా వాళ్ళ సంభోగం గురించి మర్యాదస్తులు హొటల్ గదుల్లో కూర్చొని చెప్పుకునే మాటల్ని మొపాసా విపులంగా రాస్తాడు. మర్యాదస్తుల జీవితాల్లోని బూటకాన్ని బయటపెట్టడం అతని లక్ష్యం.
వేశ్య జీవితం పారదర్శకం. మర్యాదస్తుల జీవితం తెర తీయని నాటకం. మపాసా ఆ తెరను చించిపడేస్తాడు.
తనకు దక్కని సౌఖ్యం జర్మన్ సైనికాధికారికి దక్కినందుకు డెమోక్రాట్ ఉక్రోషాన్ని పట్టలేకపోతాడు. తమలాంటి గొప్ప అందగత్తెల్ని కాకుండా ఆ ‘బజారుదాన్ని’ ఎంచుకున్న జర్మన్ సైనికాధికారి చౌకబారు అభిరుచికి మర్యాదస్తుల మహిళలు నొచ్చుకుంటారు. పెళ్ళి అయిన మహిళలంటే జర్మన్ అధికారికి చాలా గౌరవం కనుక తమ జోలికి రాలేదని కొందరు తమను తాము సమర్దించుకుంటారు. యూనిఫాం వేసుకున్న మాగాడికి ఒళ్ళు సమర్పించుకోవడంలోవున్న ఆనందాన్నీ కొందరు ప్రస్తావిస్తారు. జర్మన్ అధికారి తమను బలవంతంగా లొంగదీసుకుంటున్నట్టు ఊహించుకుని పరవశించిపోయినవాళ్ళూ ఆ బృందంలో వుంటారు. వేశ్యావృత్తిలో కొనసాగుతూ ఓ అధికారి కోరికను కాదనే హక్కు వెన్నముద్దకు లేదని కొందరు వాదిస్తారు.
మరునాడు ఉదయం హావ్రే వెళ్లడానికి బగ్గీ సిధ్ధం అవుతుంది.
వెన్నముద్దది చిత్రమైన పరిస్థితి. వేశ్యావృత్తిలోవున్న స్త్రీలకు
ఇలాంటి రాత్రుళ్ళు కొత్తేమీకాదు. కానీ, ఆ రాత్రి భిన్నమైనది. ఆమె దేహం జాతీయ సమస్యగా మారిన రాత్రి అది. తను మేలు చేసిందో మోసపోయిందో అర్దం కావడంలేదామెకు. అంతకు ముందు రోజు తనను అంతగా బతిమాలి ఒప్పించి అధికారి పక్కలోనికి పంపినవాళ్ళు ఈరోజు తనను ఎంతగానో ఓదారుస్తారని ఆమె ఆశించింది. కానీ, సన్నివేశం
ఆమె ఊహించినట్టు సాగదు.
మొదటి రోజు వాళ్ళు తిండి తెచ్చుకోవడం మరిచిపోయినట్టు తను ఈరోజు తిండి తెచ్చుకోవడం మరచిపోయింది. మొదటి రోజు తను వాళ్ళకు వడ్డించినట్టు ఈరోజు వాళ్ళు తనకు కొసరికొసరి వడ్డిస్తారని ఆమె అనుకుంది. కానీ వాళ్ళు ఆమెను చూడగానే అంటువ్యాధి సోకిన రోగిని చూసినట్టు మూకుమ్మడిగా పక్కకు తప్పుకున్నారు.
మర్యాదస్తులు అందరూ కలిసి తనను మోసం చేశారని ఆమెకు కొంచెం ఆలస్యంగా అర్ధం అవుతుంది. సరిగ్గా వారం క్రితం ఆమె ఒక జర్మన్ సైనికాధికారిని కుర్చీతో తల పగలగొట్టి చంపడానికి సిధ్ధమయింది. ఈరోజు శత్రుదేశస్తుల్ని మించిన శత్రువులు తన ముందు కూర్చుని చోద్యం చూస్తుంటే తను తలవంచుకుని నిలబడింది. మోసపోవడం ఎవరికైనా బాధాకరమే. మొసగించినవాళ్ళ ముందు నిస్సహాయంగా నిలబడడం అంతకన్నా బాధాకరం.
మనుషులకు దుఃఖం, బాధ, దిగులు, బెంగ, నిస్పృహ, నిస్సహాయత అవమానం, పరాభవం ఎప్పుడయినా కలగవచ్చు. కానీ, ఏడ్వడానికి మాత్రం స్థలం, సందర్భం కావాలి. ఆత్మీయుల కడుపు తలపెట్టి ఏడ్వగలగడం ఒక గొప్ప వరం. జీవితంలో అంతటి అదృష్టంలేనివాళ్ళు గదుల్లో ఒంటరిగా కూర్చోనో, గుబురు చెట్ల మధ్య నిలబడో, లోయల్లోకో, కొండలపైకో వెళ్ళి ఎవరూ చూడకుండా గట్టిగా వెక్కివెక్కి ఏడ్చి మనసు తేలికబడ్డాక మళ్ళీ ఇహలోకం లోనికి వస్తుంటారు.
ఎలిజిబెత్ రూసో దురదృష్టవంతుల్లోకెల్లా దురదృష్టవంతురాలు. ఏడ్పు వచ్చినా ఏడ్వలేని పరిస్థితి ఆమెది. ఆమెకు మోసం, దుఃఖం, బాధ, దిగులు, బెంగ, నిస్పృహ, అవమానం, పరాభవం అన్నీ ఒక్కసారే జరిగిపోయాయి. అంతటి నిస్సహాయతలో గట్టిగా ఏడ్వాలనిపించడం సహజం. తన చుట్టూ వున్నది తనను మోసం చేసినవాళ్ళు. వాళ్లముందు ఏడ్వడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువచ్చింది. కానీ లోపలినుండి ఏడుపు పెల్లుబుకుని వచ్చేస్తోంది. అది బయటికి రాకుండా దాన్ని ఆమె గొంతులో బలవంతంగా నొక్కి వేస్తోంది. అప్పుడు ఆ ఏడుపు వెక్కిళ్ళుగా మారిపోయాయి.
“వెన్నముద్ద ఇంకా ఏడుస్తూనే వుంది. కోర్నుడెట్ ఆలపిస్తున్న ఫ్రెంచ్ జాతీయ గీతపు చరణాల మధ్య ఆమె వెక్కిళ్ళు ఆ రాత్రి చీకట్లో సన్నగా వినిపిస్తున్నాయి” అనే పారడాక్సీతో మొపాస కథ ముగుస్తుంది.
ఈ జాతీయ గీతం వైచిత్రి తరువాతి కాలంలో దాదాపు ఒక ఫార్మూలాగా మారిపోయింది. ఛార్లీ చాప్లిన్ సిటీలైట్స్ సినిమా ఆరంభంలోనే ఇలాంటి సన్నివేశం వుంటుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ గజల్ ‘ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ నా మాంగ్” కూడా ఈ కోవలోదే. 1970వ దశకం తరువాత ఈ ప్రక్రియ విస్తారంగా సాగింది. “గాంధి పుట్టిన దేశమా ఇది?” (పవిత్ర బంధం), “గాంధీ పుట్టిన దేశం/రఘురాముడు ఏలిన రాజ్యం (గాంధీ పుట్టిన దేశం), వందేమాతర గీతం స్వరం మారుతున్నది (వందేమాతరం) వంటి అనేక పాటలు, సన్నివేశాలు అనేక సినిమాల్లో వచ్చాయి.
అయితే వాళ్ళంతా మొపాసాను కాపీ కొట్టారని కాదు. కొన్ని సాంప్రదాయాలు అలా పుట్టి కొనసాగుతుంటాయి. మన సినిమాల్లో చూసిన సంఘటనలు పాటలు అన్నీ దేశంలో నక్సలైట్ ఉద్యమం ఆరంభం అయ్యాక, భారత రాజ్యాంగంలో సోషలిజాన్ని చేర్చాలనే ఆలోచనలు బలపడ్డాక వచ్చిన సాహిత్యం. నేను రాసిన ‘ప్రగతి’ నాటిక కోసం యంజీ రామారావు రాసిన “ఇది భారత దేశం, ఇది భూతల స్వర్గం” పాట కూడా ఈ సాంప్రదాయంలో వచ్చిందే. 19వ శతాబ్దంలోనే జాతీయగీతం మీద నిరసన తెలపడం మొపాసా గొప్పతనం. అది అంత చిన్న విషయం కాదు.
తెలుగు భాషతో అనుబంధం వున్నవాళ్ళకు ఫ్రెంచ్ భాషతో అనేక ఇబ్బందులు వుంటాయి. తెలుగు భాషలో ప్రతి అక్షరాన్నీ పలుకుతాం. ఇంగ్లీషు భాషలో కొన్ని సైలెంట్ అక్షరాలుంటాయి. ఫ్రెంచ్ భాషలో సైలెంట్ అక్షరాలు ఎక్కువగా వుండడమేగాక అవి కొత్త శబ్దాల్ని కూడా ఇస్తాయి. నాకు ఫ్రెంచ్ భాష రాదుకనుక, వచ్చినా కొన్ని శబ్దాల్ని తెలుగులో రాయలేము కనుక ఈ పరిమితుల్లోనే ఇందులోని నామవాచకాలను అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. అసలు మొపాసా పేరునే వాళ్ళు చాలా భిన్నంగా ఉచ్చరిస్తారట.
“And Boule de Suif still wept, and sometimes a sob she could not restrain was heard in the darkness between two verses of the song” అనే మొపాసా ముగింపు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలిజిబెత్ రూసో ను ఒళ్ళోకి తీసుకుని, హృదయానికి హత్తుకుని, తల నిమురుతూ ఓదార్చాలని ప్రతి పాఠకునికీ అనిపిస్తుంది. అలా అనిపించకపోతే వాళ్ళు అసలు మనుషులేకాదు. మనిషికానివాడు మంచి పాఠకుడుకాలేడు. అప్పుడు సాహిత్యం ఒక సామాజిక చర్యగా మారిపోతుంది. ఒక వేశ్యను ఒళ్ళోకి తీసుకుని ఓదార్చే సామాజిక చర్య!. “విసర్జిత వ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించడమేగాక పాఠకుల చేత కూడా గుర్తింప చేసేవాళ్ళు గొప్ప రచయితలు” అంటూ నా పోస్ట్ పై కామెంట్ పెట్టిన వేమన వసంత లక్ష్మి ఈ కోణాన్ని సరిగ్గా గుర్తించింది. విసర్జిత జీవుల్ని అభిమానించేలా చదువరుల్ని సిధ్ధం చేయడమే ఉనికివాద సాహిత్యాల ప్రయోజనం. అందుకు నేను మొపాసాను ప్రేమిస్తాను; చాలాచాలా గాఢంగా.
(వారం క్రితం బౌలే ది సౌఫ్ తెలుగు అనువాదాన్ని నా వాల్ మీద షేర్ చేస్తే రెండు లైకులు మాత్రమే ఇచ్చి నన్ను రెచ్చగొట్టిన ముఖపుస్తక మిత్రులకు ధన్యవాదాలు)
హైదరాబాద్
4 ఆగస్టు 2017
No comments:
Post a Comment