Friday 30 August 2019

అతివాద సర్వసత్తాక జాతీయవాద ముప్పు


అతివాద సర్వసత్తాక జాతీయవాద ముప్పు

ప్రపంచంలో హిందువులకు వున్నది భారతదేశం ఒక్కటే అంటున్నారు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి  నరేంద్రమోదీజీ. వారు  ప్రస్తుతానికి కొంచెం ముసుగులో మాట్లాడుతున్నారుగానీ, వారు  చెప్పదలుచుకున్నది మాత్రం భారతదేశంలో వుండాల్సింది హిందువులు ఒక్కటే అని.
నరేంద్ర మోదీ పేరు వినగానే ఎవరికైనా  గుర్తుకు వచ్చేది 2002 నాటి గుజరాత్ నరమేథం. అప్పుడు మోదీజీ రాష్ట్ర ముఖ్యమంత్రి.   మారణహోమాన్ని సృష్టించకుండా దేశంలో గుజరాత్ వంటి అభివృధ్ధిని సాధించలేమని మోదీ అభిమానులు నమ్ముతున్నారు. అభివృధ్ధి పేరుతో దేశమంతా మారణహోమాన్ని సృష్ఠిస్తారేమోనని మోదీ వ్యతిరేకులు అప్పుడే ఆందోళన చెందుతున్నారు.  
స్థూల జాతియోత్పత్తి (జిడిపి) పెరుగుదల రేటు గుజరాత్ లో ఎక్కువగా వున్నమాట వాస్తవం. నరేంద్రమోదీ హయాంలోనే కాక అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ గుజరాత్ లో జిడిపి పెరుగుదల రేటు ఎక్కువగానే వుంది. భారత దేశపు మెగా కార్పొరేట్ సంస్థల కేంద్ర కార్యాలయాలు గుజరాత్ లో వుండడంవల్ల ఇది సాధ్యం అయింది. అయితే, సమాజం ఆనందంగా వుందనడానికి జిడిపి పెరుగుదల రేటు ఎన్నడూ కొలమానం కాదు. సామాన్య ప్రజానీకం కటిక పేదరికంలో మగ్గిపోతున్నప్పటికీ కార్పొరేట్లకు భారీ లాభాలు వస్తుంటే జిడిపి పెరుగుదల రేటు మెరుగ్గా వుండే అవకాశం వుంది. దానికి గుజరాత్ గొప్ప ఉదాహరణ. మరోవైపు, గుజరాత్ ఆర్థిక వ్యవస్థ దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా పెద్దదేమీ కాదు. ఆర్థిక వ్యవస్థల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరువాత ఆరవ స్థానం గుజరాత్ ది.
సువిశాల ప్రజల ఆమోదాన్ని (పాపులర్ మ్యాండేట్) పొంది కొద్దిమందిగా వుండే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడమే  పెట్టుబడీదారీ రాజ్యం నిర్వర్తించే ప్రధాన కర్తవ్యం. కర్తవ్యాన్ని సాధ్యమైనంత వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వార  నెరవేర్చడానికే అది ప్రయత్నిస్తుంది. అయితే పెట్టుబడీదారుల సహజమైన అత్యాశవల్లనో, నిర్వహణ, యాజమాన్య లోపాలవల్లనో పార్లమెంటు తరచూ ప్రజల విశ్వసనీయతను కోల్పోతూ వుంటుంది. అలాంటి సందర్భాల్లో పెట్టుబడీదారీ రాజ్యం అడ్డడారుల్ని తొక్కైనాసరే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. పెట్టుబడీదారీ రాజ్యం ఆలా వెతుక్కునే అడ్డదారుల్లో మతవర్గతత్వం ముఖ్యమైనది.  అప్పుడది మతవర్గ నియంతృత్వంగా మారుతుంది.
పార్లమెంటరీప్రజాస్వామ్యం, మతవర్గనియంతృత్వం రెండూ పెట్టుబడీదారీ నియంతృత్వానికి రెండు పార్శ్వాలు మాత్రమే. పార్లమెంటరీప్రజాస్వామ్యం మతానికి ముసుగు కప్పి వుంచుతుంది. మతవర్గనియంతృత్వం మతతత్త్వం ముసుగును తొలగించడమేగాక దాన్ని  బోను నుండి బయటకు వదులుతుంది.
నియంతృత్వం అన్నింటికన్నా ముందుగా మనుషుల్నివాళ్ళుమనం అని విభజిస్తుంది. “వాళ్లను అంతం చేసి మనం పెరుగుదాం అనేది ప్రతి నియంతృత్వం ఇచ్చే తొలి నినాదం. ఆర్దిక సంక్షోభాల్లో కూరుకు పోయిన అసమసమాజాల్లో నినాదం అగ్నిలా వ్యాపిస్తుంది.
వర్గసమాజంలో ధనిక-పేద వర్గాల మధ్య అంతర్లీనంగా ఒక వైరం కొనసాగుతూ వుంటుంది. అక్కడ ప్రభుత్వమైనా  పాలకవర్గాలకు ఊడిగం చేయకతప్పదు.  కొన్ని ప్రభుత్వాలు దిష్టి తీయడానికి అన్నట్టు ప్రజలకు కొంత ముష్ఠి పడేస్తాయి. కొన్ని ప్రభుత్వాలు ముష్ఠి కూడా పడేయవు. తమకు ముష్ఠి కూడా పడేయని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నికల సమయంలో మార్చేస్తుంటారు. ప్రజలు ఎలాగూ ఐదేళ్ళకోసారి ప్రభుత్వాల్ని మార్చేస్తున్నపుడు ఇక ముష్టి పడేయాల్సిన అవసరమే లేదని పాలకులు ఒక నిర్ణయానికివస్తారు. అలాంటి దశలో,  ప్రభుత్వాలను మార్చినా ప్రయోజనం లేదని గమనించిన ప్రజలు ఏకంగా వర్గసమాజాన్నే మార్చాల్సిన అవసరం వుందని గుర్తిస్తారు.  అలాంటి సంక్షోభ దశలో  వర్గసమాజాన్ని కాపాడడానికి పెట్టుబడీదారీ రాజ్యం నియంతృత్వ రూపాన్ని ధరిస్తుంది.
పాలకులకు, పాలితులకు మధ్య ఆర్ధిక వైరాన్ని నియంతృత్వం తోసిపుచ్చుతుంది. తొలి అడుగులోనే దేశప్రజల్లో ధనికులు, పేదలనే విభజనని నిరాకరిస్తుంది. దేశప్రజల్లో అధిక సంఖ్యాకులందరూ ఒక అఖండజాతి  అనే ఒక బూటకపు నినాదాన్ని హోరెత్తించి ఉన్మాదాన్ని సృష్టిస్తుంది. అఖండజాతి సభ్యులందరూ కుల, వర్గ సాంస్కృతిక విబేధాలను మరచిపోయి దేశాభివృధ్ధి కోసం  ఎలాంటి త్యాగాలకైనా, ఎంతటి సాహసాలకైనా సిధ్ధపడాలని పిలుపిస్తుంది. అంతటి త్యాగాలు చేసి అఖండజాతి సాధించిన ప్రగతిని దేశప్రజలందరికీ అది సమానంగా పంపిణీ చేస్తుందా? అనే ఒకే ఒక ప్రశ్న వేస్తే చాలు నియంతృత్వం రెచ్చగొట్టే జాతీయ ఉన్మాదం మొత్తం నీరుగారిపోతుంది.  పాలకులకు లబ్ది చేకూర్చడానికి వర్గసమాజపు రాజ్యం నిర్వర్తించే కర్తవ్యాలనే మతవర్గతత్త్వ రాజ్యం కూడా నిర్వర్తిస్తుంది. అయితే, పనిని లబ్దిదారులతో మాత్రమేకాక బాధితులతోనూ చేయిస్తుంది. అదే దాని ప్రత్యేకత!

నియంతృత్వం ఎప్పుడూ రెండు స్థాయిల్లో పనిచేస్తూవుంటుంది. మొదటిది, సాంస్కృతికస్థాయి. రెండోది అధికారస్థాయీ. సాంస్కృతికస్థాయిలో అది చాలా అకర్షణీయంగా వుంటుంది. మనుషులపై మాదకద్రవ్యాలకన్నా శక్తివంతంగా అది పనిచేస్తుంది. దాని అసలు రూపం అధికారాన్ని చేపట్టినపుడే బయట పడుతుంది. ఎందుకంటే అధికారంలో వున్నప్పుడు దాని సాంస్కృతిక ముసుగు చిరిగిపోతుంది.
దేశప్రజల్లో జాతియోన్మాదాన్ని రెచ్చగొట్టడం  మతవర్గతత్వానికి సాంస్కృతిక పార్శ్వం అయితే భారీపారిశ్రామిక సంస్థలకు భారీ లాభాల్ని అర్జించి పెట్టడం దీని రాజకీయార్ధిక పార్శ్వం. దేశభక్తి ముసుగులో అది సాధించే లక్ష్యం అదే! వాజ్ పాయి మంత్రివర్గంలో ఏకంగా డిస్ ఇన్వెస్ట్ మెంట్ శాఖనే ఏర్పాటు చేశారు. అరుణ్ శౌరీ దానికి మంత్రిగా వున్నారు.  దేశ జనాభాలో నాలుగోవంతు ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నా డజను జాతీయ కార్పొరేట్ సంస్థలు దేశవిదేశాల్లో సాధిస్తున్న విజయాలను చూసి ఆనందించమంటుంది మతవర్గతత్వం.
సాధారణ ప్రజల్లో కుత్రిమ ఉత్సాహాన్ని నింపడానికి దేశంలోని ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఒక కుత్రిమ శత్రువుగా చిత్రిస్తుంది మతవర్గ నియంతృత్వం. అలా సృష్టించిన కుత్రిమ శత్రువుకు వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలన్నింటినీ కూడగడుతుంది. శత్రుసంహారం జరిగితే మిగిలిన సామాజికవర్గాలకు సర్వసౌభాగ్యాలు అందుబాటులోనికి వస్తాయనే బూటకపు ప్రచారాన్ని ఉధృతంగా చేపట్టి, భూలోకస్వర్గాన్ని నిర్మిస్తున్నట్టు ఒక కుత్రిమ ఉత్సాహాన్ని విశాల ప్రజానీకంలో నింపుతుంది. కుత్రిమ ఉత్సాహాన్ని కొనసాగించడానికి వీలుగా ఒక అల్లరి మూకను సృష్టించి రోడ్ల మీదకు వదులుతుంది.
ఎవరో ఒకర్ని శత్రువుగా చూపకుంటే మిగిలిన సామాజికవర్గాలు ఏకంకావనీ మతవర్గ నియంతృత్వానికి తెలుసు. అది సృష్టించే కుత్రిమ శత్రువు నిత్యం ఒకే సామాజికవర్గం అవ్వాల్సినపనిలేదు. ఒకసారి ముస్లింలు, ఇంకోసారి శిక్కులు, మరోసారి క్రైస్తవులు ఇలా సందర్భాన్నిబట్టి కుత్రిమ శత్రువును అది మారుస్తూ వుంటుంది. ఎప్పుడైనాసరే  ఒక సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలన్నింటినీ  కూడగట్టడమే దాని లక్ష్యం.
నియంతృత్వం ఊరించే భూలోకస్వర్గ ప్రాప్తి పొందే ఉత్సాహంతో ప్రజలు ఉత్పత్తిలో చురుగ్గా పాల్గొంటారు. అలా దేశంలో అభివృధ్ధి సూచికలు చెప్పుకోదగ్గ పెరుగుదలను సాధిస్తాయి. ఇలాంటి సంకేతాలన్నీ తాము ఆశిస్తున్న స్వర్గం అతిదగ్గరలో వుందనే భ్రమను ప్రజల్లో పెంచుతాయి. వాళ్ల ఉత్సాహం పెరిగిన  ఫలితంగా ఉత్పత్తి మరింత పెరుగుతుంది. మళ్ళీ స్థూల జాతీయ ఉత్పత్తి సూచికలు పెరుగుతాయి.

          అయితే, పెరుగుదల అంతా నిలువు (Vertical) అభివృధ్ధి మాత్రమే అనీ, అది సమమట్టపు (Horizintal)  అభివృధ్ధిని సాధించడంలేదనీ, సాధించనూ లేదని ప్రజలకు తెలియడానికి కొంత కాలం పడుతుంది.   నియతృత్వాన్ని నమ్మి దాని వెంట పరుగులు పెట్టిన సమూహాలే దాని సామర్ధ్యాన్ని శంకించడం మొదలెడతాయి. నియంతృత్వాన్ని నమ్మిన సమూహాల్లో ఉత్సాహం నీరుగారిపోయే కొద్దీ ఉత్పత్తి తగ్గి, అభివృధ్ధి సూచికలు దిగువముఖం పడతాయి. ఫలితంగా దేశంలో నిలువు అభివృధ్ధి సహితం కుంటుపడిపోతుంది.
వర్తమాన రాజకీయాల్లో యూపియేవన్ కూ, యూపీయేటూకూ తేడా ఇదే. యూపియేవన్ నిలువు అభివృధ్ధిని సాధించిన ఫలితంగానే దానికి 2009 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు లభించాయి. అది సమమట్టపు అభివృధ్ధి కాదని తెలిశాక ప్రజల్లో ఉత్పాదక ఆసక్తి తగ్గిపోయింది. అప్పుడు మొత్తం అభివృధ్ధే కుంటుపడిపోతుంది.  పరిణామాల్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.
అసమ అభివృధ్ధితో విసుగు చెందిన జనానికికష్టానికి తగిన ప్రతిఫలంశక్తిమేరకు శ్రమఅవసరం మేరకు ప్రతిఫలం వంటి సామ్యవాద ఆర్ధిక నీతులు ఉత్సాహాన్నివ్వవు. “శ్రమ పడకుండానే సౌఖ్యం వంటి మాటలు సహజంగానే కొన్నివర్గాల్లో ఆసక్తినీ, ఆశల్నీ పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటేదొంగసొత్తును పంచుకుందాం అనేమాట అల్లరి మూకల్లో ఉన్మాదాన్ని పెంచుతాయి.
అయితే ఇక్కడో చిక్కు ప్రశ్న ముందుకు వస్తుంది. ఎవరిసొత్తును ఎవరు పంచుకోవాలి? అనేదే ప్రశ్న. సమస్యను పరిష్కరించడానికి నియంతలు దేశీయ  సామాజికవర్గాల్ని సాంస్కృతిక పునాదిపై రెండు శతృశిబిరాలుగా చీలుస్తారు. ఒకవర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ల మీద వాళ్ల సంపద మీద హక్కును రెండో వర్గానికి కల్పిస్తామంటారు. ఇది సాంస్కృతిక జాతీయవాదపు ఆర్ధిక కోణం.
వాజ్ పాయ్ హయాంలో సంఘపరివారం కొంత కాలం దేశంలో క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని బలంగా సాగించింది. ఇప్పుడు ముస్లింల వంతు వచ్చినట్టుంది. ఆ విభాగంలో నరేంద్ర మోదీ అనుభవజ్ఞులు. నిన్న గుజరాత్ లో జరిగిందే రేపు దేశంలో జరగబోతోంది. కార్పొరేట్లు భారీ లాభాలు గడిస్తారు. ముస్లింలు  ధనమాన ప్రాణాల్ని కోల్పోతారు. ప్రజాస్వామిక శక్తులకు ఇది పెద్ద సవాలేగానీ ఇప్పుడు వాళ్ళకు నరేంద్ర మోదీని నిలవరించేంత శక్తి వుందా?

రచన : 17 మార్చి 2014

(18 మార్చి 2014 విరసం హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభ ప్రసంగ పాఠం

No comments:

Post a Comment