Sunday 25 August 2024

Godavari Water Hijack

 Godavari Water Hijack

అనుసంధానమా? అపహరణమా?

కావేరికి గోదావరి వాటర్ హైజాక్ 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 

గోదావరి - కావేరి నదుల అనుసంధానం  ప్రాజెక్టు ఫైళ్ళు ఢిల్లీలో వేగంగా కదులుతున్నాయి. అప్పట్లో కేంద్ర జలవనరులశాఖా మంత్రిగా వున్న నితిన్ గడ్కరి 2017లో తొలిసారిగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.  2019 జనవరిలో స్వయంగా అమరావతి వచ్చి  60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు (DPR) కూడా సిధ్ధమైందన్నారు. 

నిజంగా వున్నాయోలేవో స్పష్టంగా తెలియని గోదావరి అదనపు జలాలే కావేరి అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పనకు  ఆధారం.   ప్రతిఏటా 11 వందల టిఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రం పాలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. చెన్నై సభలో నితిన్ గడ్కరి ఏకంగా ఏటా 3 వేల టిఎంసిల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నదని ప్రకటించేశారు. 

జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90 శాతం నిధుల్ని అందించాల్సిన   బాధ్యత కేంద్రానిదే కనుక అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం ఆనందించిందేగానీ, దీని వెనుక నున్న వాటర్ హైజాక్ కుట్రను గమనించలేదు. ఈ ప్రాజెక్టువల్ల తమిళనాడు, కర్ణాటక, పాండుచెర్రి రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే మాట నిజం. ఇందులో బిజెపికి రాజకీయ ప్రయోజనాలు కూడ వున్నాయి. అప్పట్లో కర్ణాటకలో బిజెపి  అధికారంలో వుంది. దక్షణాదిలో ఆ ఒక్క రాష్ట్రాన్ని అయినా కాపాడుకోకుంటే బిజెపికి ‘ఉత్తరాది హిందీ పార్టి’ అనే నింద తప్పదు. అలాగే గోదావరి నీటిని ఎరగా చూపి తమిళనాడులోనూ కాలు మోపాలనే ఆశ బిజెపిలో చాలా కాలంగా వుంది.    

ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు సహితం మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడమే విచిత్రం. రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగే మేలేమిటో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదాలు నడుస్తున్నాయి. కావేరి అనుసంధానం  ప్రాజెక్టు ఈ వివాదాల్ని పరిష్కరిస్తుందా? మరింతగా పెంచుతుందా? అనేది ఈ సందర్భంగా ఎవరికయినా రావలసిన ప్రశ్న, 

1980 నాటి బచావత్ ట్రిబ్యూనల్ గోదావరి నదిలో 3,565 టిఎంసిల నికర జలాలున్నట్టు తేల్చింది. అప్పట్లొ గోదావరి నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,  ఒరిస్సాల మీదుగా ప్రవహించేది.  ఇప్పుడు అదనంగా ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గోదావరి నది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1495 టిఎంసిలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో  ఈ నీటిని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు 64 శాతం, తెలంగాణకు 36 శాతం చొప్పున పంపిణి చేశారు. 

నదీజలాల పంపకాల్లో అంతర్జాతీయంగా పరివాహక ప్రాంతాన్ని (catchment area) బట్టి దేశాలు, రాష్ట్రాల వాటాల్ని నిర్ణయిస్తారు. ఏ ప్రాంతంవల్ల నదికి ఎంత నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతానికి అంత వాటా దక్కుతుంది. నదుల దిగువ ప్రాంతాలు వరదల్ని తట్టుకోవాల్సి వుంటుంది కనుక వాటికి కొన్ని హక్కులుంటాయి (lower riparian rights). అలాగే, నదుల మీద ముందుగా కట్టిన ప్రాజెక్టులకు ప్రత్యేక హక్కులుంటాయి. 

కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ. అయినప్పటికీ, బచావత్ ట్రిబ్యూనల్  కృష్ణానది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ వాటా ఇచ్చింది. దానికి రెండు హేతువులు చెప్పింది. మొదటిది, కృష్ణానది మీద తొలి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడ్డాయి. రెండోది, నిర్మాణం పూర్తయి ఆయకట్టు కలిగున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపును ఇచ్చి తీరాలి. అయితే, దీనికో పరిష్కారం కూడ బచావత్ ట్రిబ్యూనల్  సూచించింది. భవిష్యత్తులో గోదావరిబేసిన్ నుండి కృష్ణాబేసిన్ కు నీటిని మళ్ళిస్తే, అందులో 18 శాతం మహారాష్ట్రకు, 27 శాతం కర్ణాటకకు కృష్ణా నికర జలాల నుండి ఇవ్వాలని ఓ నియమం పెట్టింది. 

పోలవరం నుండి 80 టిఎంసీల నీటిని కృష్ణా బేసిన్ కు మళ్ళిస్తే  అందులో 35 టిఎంసిలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందుతాయి. మిగిలిన 45 టిఎంసీల్లో 36 శాతం అంటే 16  టిఎంసిలు తనకు వస్తుందని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. అంటే, పోలవరం నుండి మళ్ళించే 80 టిఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కు నికరంగా దక్కేది 29 టిఎంసీలే. కృష్ణా గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  కు కేటాయించిన నికర జలాలను జనాభా ప్రాతిపదికన కాకుండా, పరివాహక ప్రాంతం ప్రాతిపదికన పంచాలని తెలంగాణ రాష్ట్రం ఇటీవల కొత్త పంచాయితీ పెట్టింది. 

గోదావరి నదికి ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదుల ద్వార నీరు వచ్చి చేరుతుంది.  తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, ఇచ్చంపల్లి వద్ద ఇంద్రావతి, ఆంధ్రప్రదేశ్ లోని కూనవరం వద్ద శబరి నదులు కలుస్తాయి. 

గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో ముడు దశలున్నాయి. మొదటి దశలో ఇచ్చంపల్లి - నాగార్జునసాగర్ ల మధ్య  గోదావరి-కృష్ణా నదుల్ని అను సంధానం చేస్తారు. రెండో దశలో నాగార్జునసాగర్  సోమశిల ప్రాజెక్టుల మధ్య కృష్ణా పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తారు. మూడవ దశలో సోమశిల నుండి కట్టలాయ్ మధ్య పెన్నా, కావేరి నదుల్ని అనుసంధానం చేస్తారు. పెన్నా- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 2022 కేంద్ర బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయించారు. 

ఈ నాలుగు నదుల అనుసంధానానికి ముందు, ఆ తరువాత కూడ మరో మూడు నదుల అనుసంధానాలు వున్నాయి. ఉత్తరాన  మహానదిని గోదావరి నదితో అనుసంధానం చేస్తారు. దక్షణాన కావేరి నదిని తమిళనాడులోని వాగాయ్ (Vaigai), గుండార్ (Gundar) నదులతో  అనుసంధానం చేస్తారు. కావేరి-గుండార్ ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టేసింది. 

భారీ నీటి పారుదలా ప్రాజెక్టుల మీద దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలున్న్నాయి. పోలవరం ప్రాజెక్టును ‘ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్’ అని ఒక సమూహం అంటున్నది. పోలవరం ముంపు బాధితులయిన ఆదివాసులు దాన్ని ‘డెత్ లైన్’ అంటున్నారు. ముంపు బాధితులకు సంపూర్ణ సహాయ, పునరావాస (ఆర్ ఆర్) ప్యాకేజిని ఇచ్చిన తరువాతే ప్రాజెక్టును పూర్తి చేయాలని అడిగే గొంతుకలు కూడ ఏపి మైదాన ప్రాంతాల్లో లేవు. 

భారీ నీటి పారుదలా ప్రాజెక్టులకన్నా చిన్న తరహా ప్రాజెక్టులే మేలనేది ఇప్పుడు బలపడుతున్న అభిప్రాయం. నీటి పారుదలా ప్రాజెక్టుల్ని అట్టహాసంగా నిర్మిస్తారుగానీ వాటిని సమర్ధంగా నిర్వహిస్తున్న ఉదాహరణ మనకు ఒక్కటీ కనిపించదు. తుంగభద్రా డామ్ గేటు కొట్టుకొని పోవడం దీనికి తాజా ఉదాహరణ. స్టాప్ లాగ్ గేట్లు, కౌంటర్ వెయిట్ వ్యవస్థ, ఇతర పరికరాలు అదనంగా అందుబాటులో వుంచుకోవాలనే ఆలోచన కూడ నీటిపారుదలాశాఖ అధికారులకు రాలేదు. ఆ గేట్లకు కొన్నేళ్ళుగా కనీసం గ్రీజు కూడ పెట్టలేదట. 

నదుల అనుసంధానం వల్ల నాలుగు రకాల నష్టాలు వుంటాయి.  మొదటిది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రెండోది, నదులు, నీటి వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు వుండే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనికి పోతాయి. మూడోది, జల వనరులపై వాణిజ్య హక్కుల్ని మెగా కార్పొరేట్లకు  అప్పగించడానికి దారులు తెరచుకుంటాయి నాలుగోది; ప్రతిఏటా నది నీళ్ళు సముద్రం లోనికి పారకపోతే సముద్రం నది వైపుకు దూసుకుని వచ్చి డెల్టా భూముల్ని చవిటి పర్రలుగా మార్చేస్తుంది.  

ఏపిలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. జులై నెలలో జరిగిన జాతీయ జలవనరుల అభివృధ్ధి సంస్థ (NWDA) వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. గోదావరి- కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుండి మొదలెట్టాలని కోరింది.  తెలంగాణలోని ఇచ్చంపల్లి, సమ్మకక-సారక్క ప్రాజెక్టుల నుండికన్నా  ఏపిలోని పోలవరం నుండి మొదలెడితే ఎక్కువ ప్రయోజనాలు వుంటాయని వివరించింది.  నరసారావుపేట సమీపాన బొల్లపల్లె వద్ద 300 టిఎంసిల రిజర్వాయర్ ను నిర్మిస్తే అక్కడి నుండి పెన్నా నదికి చాలా సులువుగా అనుసంధానం చేయవచ్చని సూచించింది.   

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో కొన్ని కొత్త చిక్కులున్నాయి. ఇందులో కీలకమైనది అసలు గోదావరి నదిలో వెయ్యి టిఎంసీల అదనపు జలలున్నాయని ఎలా ఎక్కడ ఎప్పుడు  నిర్ధారిస్తారు? గోదావరినది మీద చివరి ప్రాజెక్టు ధవిళేశ్వరం. అక్కడ తేల్చాలి అదనపు జలాలు వున్నాయో లేవో.  సాధారణంగా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు ఆగస్టు నెలలో వస్తాయి. ఆగస్టు నెలలో  పోలవరం నుండి కావేరి ప్రాజెక్టుకు వెయ్యి టిఎంసీల నీళ్లు విడుదల చేసేస్తే, ఆ తరువాతి నెలల్లొ నదిలోనికి అనుకున్నంత నీరు రాకపోతే ఏమిటీ పరిస్థితీ? గోదావరి డెల్టా ఆయకట్టుకు 175 సంవత్సరాలుగా వున్న  లోయర్ రైపేరియన్  హక్కులు ఏం కావాలీ?  

జగన్మోహన్ రెడ్డి సర్కారు  గతంలో పోలవరం నుండి కావేరికి నీళ్లు తరలించాలని ప్రతిపాదించినపుడు నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీ రాం తిరస్కరించారు. గోదావరి నుండి తరలించేందుకు నికర జలాల్లో మిగులు ఏమీలేదు.   గోదావరి నికరజలాల్లో ఛత్తీస్ ఘడ్ కు 141 టియంసిల వాటా వుంది. దాన్ని ఆ రాష్ట్రం వాడుకోవడంలేదు. ఆ నీటిని కావేరికి తరలించాలని కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఛత్తీస్ ఘడ్  లో బిజెపి ప్రభుత్వమే వున్నా ఆ నీళ్ళు వదులుకోవడానికి ఆ రాష్ట్రం సిధ్ధంగా లేదు. గోదావరి- కావేరి ప్రాజెక్టులో ఇప్పటికి మూడు డిపిఆర్ లు వచ్చాయి. 

ఇప్పుడు ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది.  గోదావరి బేసిన్ నుండి  కృష్ణా బేసిన్ కు వెయ్యి టిఎంసిల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కొరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బిజేపి రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలో నెట్టే పథకం ఇది. అంతేకాదు; ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది.  గోదావరి బేసిన్ నుండి  కృష్ణా బేసిన్ కు వెయ్యి టిఎంసిల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కొరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బిజేపి రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలో నెట్టే పథకం ఇది. 

//EOM//

28-08-2024

ప్రచురణ : 30-08-2024 

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=30/08/2024&pgid=454731&device=desktop&view=3


No comments:

Post a Comment