Friday 10 April 2020

Corona and its Background

Corona and its Background



కరోనా : కొంచెంముందూ కొంచెం వెనుక
 డానీ
          శత్రుదేశాల మీద దాడికి అణుబాంబులు సిధ్ధం చేసుకుంటారుగానీ గట్టిగా జలుబుచేస్తే చాలు మనుషుల దగ్గర  మందు వుండదని కరోన గుర్తు చేసింది.

కరోన జన్మస్థలం చైనాలోని వూహాన్ నగరం. అక్కడి  సీఫుడ్హోల్సేల్మార్కెట్పరిసరాల్లో న్యుమోనియా లాంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రభుత్వం గత ఏడాది డిసెంఅబ్రు 31న ప్రకటించింది. మరుసటి రోజునే అంటే... జనవరి 1 తేదీన సీఫుడ్మార్కెట్ను మూసేసింది. నిజానికి అప్పటికి రెండు నెలలు ముందే కొవిడ్ -19 అక్కడ పుట్టింది.

ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది రెండవస్థానం. దానికి ముప్పు వచ్చిందంటే మొదటి పదిహేను స్థానాల్లో వున్న  అమెరిక, జపాన్, జర్మనీ, యుకే, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, బ్రెజిల్, కెనడా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, స్పెయిన్, మెక్సికో దేశాలకు ముప్పు వచ్చినట్టే. తూర్పు ఆసియా దేశమైన చైనాలో మహమ్మారి పుట్టిందని తెలియగానే ఆ ప్రాంతంలోని దక్షణ కొరియా, జపాన్ వంటి దేశాలు రాబోయే వైరస్ వ్యాప్తిని తట్టుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, సింగపూర్ కూడా వైరస్ పై వార్ కు సిధ్ధపడ్డాయి. మరోవైపు అమెరిక, ఇటలీలతోసహా అనేక దేశాలు రాష్ట్రాల అధినేతలు అనేకులు  కరోనాను అవహేళన చేశారు. జ్వరం, తలనొప్పి, నిమోనియాలకు వాడే పారాసిటమాల్ తదితర ‘ఓవర్ ద కౌంటర్’ (ఓటిసి) టాబ్లెట్స్ తో కరోనాను తరిమి కొట్టవచ్చని తేలిగ్గా తీసిపడేశారు. వేసవి వస్తే కరోనా నిలవదని రోనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. తమ దేశం అతి త్వరలో కరోనా వాక్సిన్ ను విడుదల చేస్తుందన్నారు.

జనాభాలోనూ ఆర్థిక రంగంలోనూ చైనాతో పోటీ పడుతున్న  దక్షణాసియా దేశమైన  భారత్ తనకు పొరుగుదేశం నుండి కోవిడ్ ముప్పువుందని ముందుగానే గమనించి వుండాల్సింది కానీ అలా జరగలేదు. కోవిడ్ విశ్వమారిలా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తరువాత కూడ ఇరవై రోజులకుగానీ మన ప్రభుత్వం మేల్కొనలేదు. పైగా, మార్చి 13న దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది.

వేగంగా దూసుకుని వస్తున్న ఒక మహమ్మారిని సకాలంలో గుర్తించ నిరాకరించిన కారణంగా మార్చి నెలాఖరుకు ప్రపంచ వ్యాప్తంగా  కొవిడ్ – 19 సోకినవారి సంఖ్య పది లక్షలు దాటింది. మృతుల సంఖ్య 50 వేలు దాటింది. వారం రోజుల్లో సోకినవారి సంఖ్య పదిహేను లక్షలు దాటేశాయి, మృతుల సంఖ్య 90 వేలకు చేరుకుంది. దాన్ని బట్టి కరోనా వ్యాప్తి వేగాన్ని అంచనా వేయవచ్చు. ఈ గణాంకాలన్నీ ఆరోగ్య పరీక్షల అనంతరం రోగ నిర్ధారణ అయిన కేసులకు సంబంధించినవి మాత్రమే. తమకు వైరస్ సోకిన విషయం తెలియనివాళ్ళు, శరీరంలో వ్యాధి లక్షణాలు ఇంకా బయటపడని వాళ్ళు ఎందరున్నారో వాళ్ల ద్వార ఇంకెందరికి ఇది సోకుతూ పోతున్నదో ఊహించుకోవలసిందే.

            కోవిడ్ – 19 వ్యాప్తిలో మూడు  దశలుంటాయి. మొదటి దశ; విదేశాల నుండి దిగుమతి కావడం. రెండవ దశ, విదేశాల నుండి వచ్చినవారి ద్వార వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తదితర సన్నిహిత సమూహానికి సోకడం. మూడవ దశ; మొత్తం సమాజంలో విజృంభించడం. విదేశాలకు వెళ్ళకపోయినా, పాజిటివ్ వ్యక్తులతో సంబంధాలు లేకపోయినా అసలు ఎవరి ద్వార సంక్రమించిందో తెలియకుండానే వైరస్ సోకే చెందే దశ ఇది. దీనినే Community Transmission అంటారు. కరోనా వైరస్ సోకే అవకాశాలున్న వారిని రెండవ  దశ వరకు గుర్తించడం కష్టమేగానీ అసాధ్యం మాత్రం కాదు. భారత్ వంటి అత్యధిక జనాభా గలిగిన దేశంలో మూడవ దశలో వైరస్ సోకే వారి సంఖ్యను అంచనా వేయడం  వైద్య ఆరోగ్యరంగ నిపుణులకు సహితం అసాధ్యం.

            నిత్యం దాదాపుగా 25 వేల మంది ప్రయాణీకులు విదేశాల నుండి భారత దేశానికి  వస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, నెలల్లో అలా 6 లక్షల మంది వచ్చి వుంటారు. మార్చి 16న విదేశాల నుండి వచ్చే వారి మీద  నిషేధం విధించే వరకు ఇంకో లక్ష మంది వచ్చి వుంటారు. ఈ ఏడు లక్షల మంది భారత దేశానికి సంబంధించి కోవిడ్ – 19 మొదటి దశకు చెందిన అనుమానితులు.  వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ వున్నారూ? వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? వీరితో సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య ఎంత? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? అనే అంశాల మీద ఒక్కర్ని కూడ మినహాయించకుండ సమగ్ర సర్వే జరగాలి. ఈ సర్వే జనగణన, ఎన్ పిఆర్, సిఏఏ, ఎన్ ఆర్సీలకన్నా ప్రాణప్రదమైనది. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా ఎన్నార్సీసర్వే జరిపితీరుతాం అని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు లక్షల మంది ఆరోగ్య స్థితి మీద సకాలంలో  సర్వే జరపాలన్న అంశాన్ని ఉపేక్షించింది. ఏ ప్రభుత్వంలో అయినా సరే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అయిపోయినపుడు సామాజిక ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురయిపోతాయి.

            నిజానికి భారత ప్రజలు అద్భుతమైన సివిక్‍ సెన్స్ గలవారు. ప్రధాని జనతా కర్ ఫ్యూ పాటించమంటే పాటించారు. తాలీ ఔర్ థాలీ కార్యక్రమం ఇస్తే తలూపారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కంచాలు మీద చెంచాలతో వాయించమంటే వాయించారు.  లాక్ డౌన్ ప్రకటించి మూడు వారాలపాటు ఇళ్ళలో సెల్ఫ్ ఐసోలేషన్ పాటించమంటే పాటిస్తున్నారు. ఏప్రిల్ 5 రాత్రి దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. కరోనాను తరిమి కొట్టడానికి ప్రభుత్వం ఇంక ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పాటించడానికి ప్రజలు సిధ్ధంగా వున్నారు. సరైన కార్యక్రమాన్ని ఇవ్వకపోతే అది పాలకుల తప్పిదం అవుతుందిగానీ; ప్రజలది మాత్రంకాదు. 

            ఒక అంచనా ప్రకారం ఈ వైరస్  ఒకరి నుండి మరొకరికి సగటున 17 మందికి సోకుతుంది (ట). ఈ లెఖ్ఖ ప్రకారం మొదటి దశలోని 7 లక్షల మంది అనుమానితులు  రెండవ దశలో ఒక కోటి 19 లక్షల మంది అవుతారు. మూడవ దశలో అనుమానితుల సంఖ్య దాదాపు 20 కోట్లకు చేరుకుంటుంది. ఇదొక గరిష్ట ఊహాగానం (Hypothesis) మాత్రమే. ఎందుకంటే మొదటి ధశలో  విదేశాల నుండి వచ్చినవారు అందరూ వైరస్ తో వుండరు. ఎంతమంది వైరస్ తో వచ్చారు అన్నది కూడ పరీక్షలు చేసి తేల్చాల్సిన అంశం. ఈ అంకెలు ఎవర్నీ భయపెట్టడానికికాదు; మహమ్మారిని ఎదుర్కోవడానికి మన సంసిధ్ధత ఏ స్థాయిలో వుండాలో చెప్పడానికి మాత్రమే. ముంచుకు వస్తున్న ఇంతటి మహా ఉపద్రవాన్ని మనం తక్కువగా అంచనా వేసి వేరే పనుల్లో మునిగిపోయాం. మనం అంటే ప్రజలు పాలకులు కూడ.

కేరళలో తొలి కరోన కేసు నమోదయిందని భారత ప్రభుత్వం జనవరి 30న  ధృవీకరించింది. ఆరోజు నుండే  భారత దేశానికి వస్తున్న విదేశీయుల్నీ,  స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్నీ ఎయిర్ పోర్టులనుండే 14 రోజుల క్వారంటైన్ కు పంపించే కార్యక్రమాన్ని మొదలెట్టివుంటే ఈ వైరస్ ను మొగ్గలోనే తుంచేసే అవకాశం వుండేది.  కానీ, భారత ప్రభుత్వ దృష్టి అంతా అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన మీదే వుంది. మరో వైపు ట్రంపు కూడ భారత పర్యటనకు ఉవ్విళ్ళూరారు. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లో  అమెరిక అధ్యక్షుని రోడ్ షోకు అట్టహాసంగా అక్షరాల కోటి మందిని సమీకరించడానికి సన్నాహాలు చేశారు. పది మిలియన్ల భారతీయులు తనను చూడడానికి వస్తున్నారని ట్రంప్ స్వయంగా గొప్పగా చెప్పుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సహితం అమెరిక మీద మొగమాటంతో ట్రంప్ భారత పర్యటన ముగిసే వరకు  కరోన వైరస్ మీద హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనను వాయిదా వేసింది. డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చి యుధ్ధవిమానాలు అమ్ముకోవాలని ఆతృతపడ్డాడేతప్ప; అప్పుడే హైడ్రాక్సి క్లోరోక్విన్  మాత్రలు కొనుక్కోవాలనుకోలేదు

 కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా మార్చి 20న ప్రకటించింది. ఆ రోజు మన ప్రధాని దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి 22న జనతా కర్ ఫ్యూ నిర్వహించాలని కోరారు. సామాజిక దూరాన్ని పాటించాలనే నియమం కూడ ఆరోజునే మొదటిసారిగా ఎజెండా లోనికి వచ్చింది. లాక్ డౌన్ నియమాలు మార్చి 25 నుండి అమల్లోనికి వచ్చాయి.

            ఏ సమాజంలో అయినా సాంప్రదాయాలు సామాజిక విలువలు ఏర్పడడానికి కొన్ని శతాబ్దాలు పడతాయి. మన దేశంలో సాంప్రదాయాలు మారిపోవడానికి ఒక్క నెల చాలు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో అమెరికా అధ్యక్షుడ్ని భారత ప్రధాని డజనుసార్లు ఆలింగనం చేసుకోవడం ఒక గొప్ప విలువగా ప్రచారం అయ్యింది. ఒక అభివృధ్ధి చెందుతున్న దేశం ఒక అగ్రరాజ్యం పై సాధించిన నైతిక విజయంగా దాన్ని భావించారు. సరిగ్గా నెల తిరక్కుండానే మార్చి 20న ‘సామాజిక దూరం కొత్త విలువగా మారిపోయింది. ఇప్పుడు మనుషుల మధ్య నాలుగు అడుగుల దూరాన్ని పాటించడం కొత్త  ఆరోగ్య సంస్కారం అయిపోయింది.  

            ప్రధాని ప్రకటించడానికి ముందేగాక ప్రకటించిన తరువాత కూడ సామాజిక దూరం నియమం విస్తారంగా వుల్లంఘనకు గురయ్యింది; గురవుతోంది. అవసరమైన ఏర్పాట్లు చేయకుండ, అందుబాటులో ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు ఇళ్ళలోనో రోడ్ల మీదనో ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలిని తట్టుకోలేనివారు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు. కొందరు ఇళ్ళలోనే మగ్గిపోతున్నారు. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లాజిస్టిక్ లోపాలకు కారకులు ఎవరూ?

            ప్రస్తుతం ప్రపంచాన్ని సోకుతున్న కరోన వైరస్ కొత్తది.  2003 నాటి  సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS), 2015 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)  కన్నా ఇది భిన్నమైనది. అందుకే దీన్ని కొత్త (నావెల్) కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 అంటున్నారు.  కోవిడ్ -19కు ఇప్పటి వరకు కచ్చితమైన మందు లేదు ఒక నిర్దిష్ట చికిత్సావిధానం కూడ లేదు. ఇంకా మందునే కనుగొనలేనప్పుడు టీకా (వ్యాక్సిన్) ను కనుగొనడానికి చాలా సమయం పట్టవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నెప్పులు, నిమోనియా, సిఓపిడి, మలేరియ తదితర వ్యాధులకు ఇప్పటి వరకు వాడుతున్న మందుల్నే కరోనాకు వాడుతున్నారు. కరోన ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యాధి కనుక రోగులకు వెంటిలేటర్లు వాడాల్సివుంటుంది. దానితో  ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్లు, సాధారణ మాస్కులు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, పర్సనల్ ప్రొటేక్షన్ ఎక్విప్ మెంట్ (PPE) వగయిరాలకు  చాలా పెద్ద గిరాకీ ఏర్పడింది. అనేక చోట్ల పిపిఇలు, మాస్కులు  అందుబాటులోలేక  డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు తమ విధుల్ని నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఏ దశకు చేరిందంటే మందులు, వైద్య పరికరాల కోసం  దేశాలే ఏకంగా హైజాకర్లుగా మారిపోతున్నాయి.

చైనా లోని షాంఘై విమాశ్రయం నుండి ఏప్రిల్ 2న ఎన్-95 మాస్కులతో ఫ్రాన్స్ కు బయలుదేరబోతున్న కార్గో విమానంలోని మొత్తం సరుకును  అమెరిక అక్కడికక్కడే మూడు రెట్లు అధిక ధర చెల్లించి ఎత్తుకు పోయింది. దేశంలో మెడికల్ కిట్స్‍ కు ఇంతటి కొరత వున్న సమయంలో  ఏప్రిల్ 5న కొచ్చి ఏయిర్ పోర్టు నుండి 90 టన్నుల మాస్కులు, సర్జికల్ గ్లౌజులు,  పిపిఇ లతో ఒక కార్గో విమానం సెర్జియా రాజధాని బెల్గ్రేడ్ కు బయలుదేరి వెళ్ళడం మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అంతకు ముందు మార్చి 29న కూడ మరో విమానంలో 35 లక్షల జతల సెర్జికల్ గ్లౌజులు కొచ్చి ఏయిర్ పోర్టు నుండి ఎగుమతి అయ్యాయి. ఏమిటీ దీనిర్ధం? 

రచన : 4 ఏప్రిల్  2020
ప్రచురణ :   ఫేస్ బుక్.  6 ఏప్రిల్ 2020

No comments:

Post a Comment