Monday 6 April 2020

Coronalogy and Communal Virology


Coronalogy and Communal Virology
కరోనాలజీ! కమ్యూనల్ వైరాలజీ

డానీ           

            ఒక అననుకూల వాతావరణంలో అమాయకత్వంతోనో, అతి విశ్వాసంతోనో, మూఢనమ్మకంతోనో తబ్లిఘీ జమాత్ వ్యవహరించిన తీరు మొత్తం భారత ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టింది. ఈ నింద త్వరలోనే తొలగిపోవచ్చని ఆశిద్దాం. దాని దుష్ప్రభావం చాలా కాలం కొనసాగుతుంది. ఎందుకంటే మనుషుల్లో ఏర్పడిన దురభిప్రాయాలు వెంటనే మాసిపోవు.

కరోనా సొకినవారిని  ‘బాధితులు’ అనరాదనీ వారిని ‘చికిత్సలో ఉన్న వారు’ అని మాత్రమే పేర్కొనాలనీ అని కేంద్ర ప్రభుత్వం పౌరులకు పలు సూచనలు జారీ చేసింది. అలాగే కరోనా వ్యాప్తి విషయంలో “మతాలు, ప్రాంతాల ముద్రలు రుద్దకూడదు” అని హెచ్చరించింది. అయినప్పటికీ మనదేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించిన వార్తల్లో నిజాముద్దీన్ మర్కజ్ పేరు తరచుగా వినపడుతూనే వుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిజెపి సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మర్కజ్ ను సందర్శించి వచ్చినవారు వివిధ రాష్ట్రాలలో  “మానవ బాంబులు”గా మారారని తాజాగా ఆరోపించారు.  

ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికీ ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరి తప్పు ఎంతో తేల్చడానికి కరోన వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఘన చరిత్రను ఒక వరుస క్రమంలో అర్థం చేసుకోవాల్సి వుంది.  Corona Chronology = Coronology. అన్నట్టు, క్రొనోలాజీ అనేది మన కేంద్ర హోంమంత్రికి చాలా ఇష్టమైన పదం. వారు గతంలో సిఏఏ, సెన్సెస్, ఎన్ పిఆర్, ఎన్ ఆర్సీల క్రొనోలాజీని విపులంగా వివరించియున్నారు.   

సాధారణంగా అధికారంలో వున్న సామాజికవర్గాలకు తమ తప్పుల్ని చాకచక్యంగా ఇతర సామాజికవర్గాల మీద నెట్టివేసే సౌకర్యం వుంటుంది.  శిక్షాస్మృతి రూపకల్పనలోనే ఇలాంటి వెసులుబాటును పొందుపరుస్తారు. ఎప్పుడూ ఏ కేసులోనూ నేరస్తులు అందరూ దొరకరు. దొరికిన వాళ్ళను మాత్రమే  శిక్షిస్తారు. శిక్షించేవాళ్ళలోనూ నేరస్తులు వుంటారు. అలా ఇప్పుడు తబ్లిఘీ జమాత్ పేరు వెలుగులోనికి వచ్చింది. తబ్లిఘీ జమాత్ ఒక తప్పు చేసిందంటే మిగిలిన వాళ్ళు ఎవరూ తప్పులు చేయలేదని కాదు.  కొందరి తప్పులు కనిపిస్తాయి కొందరివి కన్బిపించవు. అంతే. చట్టాన్ని అమలు చేసేవాళ్ళు ఏ కేసును ఎందుకు బయటపెడతారు, ఏ కేసును ఎందుకు దాచి పెడతారు అనేది అదో పెద్ద సామాజిక, సాంస్కృతిక తాత్విక చర్చ.

తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ కార్యాలయం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సమీపంలోని మర్కజ్ లో వుంది. దీనిని నిజాముద్దీన్ మర్కజ్ అంటారుగానీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాతో దీనికి ఎలాంటి సంబంధమూలేదు. మర్కజ్  ప్రస్తుత అధినేత మౌలాన ముహమ్మద్ సాద్ కంధాల్వీ. మర్కజ్ అంటేనే సమావేశ మందిరం అని అర్థం.            సాధారణ దినాల్లో మర్కజ్ ప్రాంగణంలో కొన్ని వందల మంది వుంటారు. కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంగణంలో వేల మంది వుంటారు. పది వేల మంది ఒక్కసారిగా సమావేశం కావడానికి అవసరమైన సౌకర్యాలు అక్కడ వుంటాయి. అనేక దేశాలకు విస్తరించిన సంస్థ కనుక నిత్యం మర్కజ్ కు వచ్చే వారిలో  విదేశీయులు సహితం పెద్ద సంఖ్యలో వుంటారు. తబ్లిఘీ జమాత్ ప్రపంచ వ్యాప్తంగా  వివిధ నగరాల్లో లక్షల మందితో ఇజ్తెమాలు నిర్వహిస్తూ వుంటుంది.  మర్కజ్ లో మార్చి రెండవ వారంలో నిర్వహించిన అంతర్జాతీయ విసృత కార్యవర్గ సమావేశం ఇప్పుడు ఒక పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వివాదంలో మర్కజ్ పాత్ర మంచి చెడుల్ని  తేల్చడానికి మన దగ్గర నాలుగు రకాల ఇన్ పుట్స్ వున్నాయి. మొదటిది, జరిగిన సంఘటనలు. రెండవది; తన చర్యల్ని  సమర్థించుకోవడానికి మర్కజ్ చేస్తున్న వాదనలు. మూడవది; సంఘీయులు  మర్కస్ మీద చేస్తున్న ఆరోపణలు. నాలుగవది; ముస్లిం సమాజంలోని ఇతర జమాత్ లు, ప్రముఖుల స్పందన . ఈ నాలుగు ఇన్ పుట్స్ ను విశ్లేషిస్తే ఆలోచనాపరులు ఈ అంశం మీద తీసుకోవాల్సిన విధానం స్పష్టం అవుతుంది.

జరిగిన సంఘటనలు కరోనాలజీ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మధ్యలో కరోన వైరస్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించింది. భారత ప్రభుత్వం మనదేశంలోనికి కరోన ప్రవేశించినట్టు జనవరి 30న తొలిసారిగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న  కరోనాను విశ్వమారిగా ప్రకటించింది. మార్చి 13న భారత ప్రభుత్వం కరోనా వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే,  దేశంలో ఇంకా హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి లేదని పేర్కొంది. అదే రోజు ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధాని నగర ప్రాంతంలో 200 మందికి మించి సభలు, సదస్సులు, సమావేశాలు, గూమిగూడడాలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరునాడు ఈ సంఖ్యను 50కు కుదిస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది. తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ విస్తృత కార్యవర్గ సమావేశం మార్చి 13 నుండి 15 వరకు ఢిల్లీలో జరిగాయి. దేశ విదేశాల నుండి వచ్చిన దాదాపు మూడున్నర వేల మంది మూడు రోజులూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. వీరిలో విదేశీయులు పెద్ద సంఖ్యలో వున్నారు.  మలేసియా, ఇండోనేషియా నుండి కూడ ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు.

తబ్లిగ్ జమాత్ ఫిబ్రవరి చివర్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19ని విశ్వమారి (పాండమిక్) గా ప్రకటించిన మార్చి 1 నాడే ఆ సమావేశాలు ముగిశాయి. అప్పటికే మలేసియా, ఇండోనేషియా దేశాలు కరోనా హాట్ స్పాట్ గా వున్నాయి.

మార్చి 20న భారత ప్రధాని ప్రజల ముందుకు వచ్చి కరోనా వ్యాప్తి తీవ్రత గురించి మాట్లాడారు. మార్చి 22న జనతా కర్ ఫ్యూను పాటించాలని కోరారు. అదే రోజు సామాజిక దూరం పాటించాలని  ఆదేశించారు. మార్చి 22 జనతా కర్ ఫ్యూ అద్భుతంగా విజయవతం అయింది. మార్చి 25 నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ అమల్లోనికి వచ్చింది.

మర్కజ్ సమావేశం తరువాత స్వదేశీయులు తమతమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయారు. విదేశీయుల్లో కొందరు దేశంలో లోని అనేక పట్టణాల్లో జరుగుతున్న ధార్మిక సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళారు.  

మలేసియా నుండి ఢిల్లీ మర్కజ్ కు వచ్చిన పది మంది యాత్రికులు అక్కడి నుండి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఖాజీపేట్ మీదుగా  కరీంనగర్ కు వచ్చి ధార్మిక సమావేశాల్లో పాల్గొన్నారు. మార్చి 21న వారికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో కరోనాకు మర్కజ్ లింకు మొదటిసారి వెలుగు లోనికి వచ్చింది. దానితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అప్రమత్తం అయ్యాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 6 సాయంత్రానికి దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 4067. వీరిలో నిజాముద్దీన్ మర్కజ్ తో అనుబంధం వున్నవారి సంఖ్య 1445; అంటే 35.52 శాతం. ఉత్తరప్రదేశ్ లో కరోన చికిత్సలో వున్నవారిలో 50 శాతం మందికి మర్కజ్ తో లింకు వుందని తేలింది.  

మర్కజ్ తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో వీరు పాల్గొన్న సభలు సమావేశాల్లోనూ,  ప్రయాణాల్లోనూ వీరితో సంపర్కంలోనికి వచ్చినట్టు తేలిన వారు 25 వేల మంది. వీరందరినీ క్వారంటైన్ కు పంపించారు.  ఇంకా సర్వే పూర్తి కాలేదు గాబట్టి మర్కజ్ తో ప్రత్యక్ష లింకు వున్నవారి సంఖ్య, వారితో సంపంర్కంలోనికి వచ్చినవారి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చు. 

మార్చి 15 సాయంత్రానికే అంతర్జాతీయ సమావేశం ముగిసింది. ఆరోజే ప్రతినిధులు తమతమ రాష్ట్రాలకు తిరుగుప్రయాణమయ్యారు. విదేశీ ప్రతినిధులు కూడ ధార్మిక సమావేశాల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడ మర్కజ్ ను మూయలేదు. లాక్ డౌన్ అమల్లోనికి వచ్చే వరకు మర్కజ్ లో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి. 

హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వాలియా మార్చి 24న మర్కజ్ నిర్వాహకుల్ని పిలిచి తక్షణం ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.  డిఫెన్స్ కాలనీ సబ్ డివిజనల్ మెజెస్ట్రేట్ రెండు మూడుసార్లు మర్కజ్ ను సందర్శించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. తాను వెళ్ళినపుడు మర్కజ్ లో 13 వందలకు మించి సభ్యులు వున్నారనీ, వాళ్లు సామాజిక దూరాన్ని పాటించడంలేదనీ, మాస్కులు ధరించడంలేదనీ, ఆ ప్రాంగణంలో చేతుల్ని కడుక్కోవడానికి శానిటైజర్లు లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు.
                                             
కేంద్ర హోమంత్రి అమిత్ షా  ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవాల్ మార్చి 28 అర్థరాత్రి  స్వయంగా మర్కజ్ కు వెళ్ళి తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ ఆమీర్ మౌలనా ముహమ్మద్ సాద్ కథాల్వీతో చర్చించారు. ఆ సమయంలో మర్కజ్ లో 2,361 మంది వున్నారు. వీరిలో కరోనా సోకినవారు 617 మంది. అంటే ప్రతి నలుగురికి ఒకరుకన్నా ఎక్కువ (26.13 శాతం). వీరిని చికిత్స కోసం హాస్పిటల్ కు పంపించారు. మిగిలిన వారిని  క్వారంటైన్ కు పంపించారు.  ఆ తరువాత మౌలాన సాద్ కనిపించకుండా అజ్ఞాతానికి వెళ్ళిపోయారు.  మౌలాన స్వీయ ఐసోలేషన్ లో వున్నారనీ 14 రోజుల గడువు తరువాత వారు కేసు దర్యాప్తు సంస్థల ముందుకు వస్తారని మర్కజ్ న్యాయవాది తౌసీఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.  మార్చి నెలలో మర్కజ్ ను సందర్శించిన 2,083 మంది విదేశీ సభ్యుల్లో 1750 మందిని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రకటించారు.              

‘లాక్ డౌన్, ‘సామాజిక దూరంఆదేశాలను వీసా నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమేగాక దేశంలో కరోన వ్యాప్తికి దోహదపడిందన్నది మర్కజ్ మీద ఇప్పుడున్న ప్రధాన ఆరోపణ. మౌలాన సాద్, ముఫ్తి సెహజాద్ లతోపాటూ మరో ఐదుగురిపై మార్చి 31న కేసి నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి లోని అనేక సెక్షన్లతోపాటూ  అంటువ్యాధుల నిర్మూలనా చట్ట- 1897 కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా వుల్లంఘించారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.

దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చిన వారికి సోకిన కరోనా కేసులు కూడా ఇప్పుడు క్రమంగా బయటికి వస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ లోని రుషికేష్ కు వెళ్ళి వచ్చిన దంపతులు మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో కరోనా పాజిటివ్ గా తేలారు.  అలాగే మర్కజ్ తో సంబంధం లేకుండా విదేశాల నుండి దిగుమతి అయిన కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోనికి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ కే చెందిన మొరెనా జిల్లాలో సురేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు మొత్తం పదకొండు మందీ కరోనా పాజిటివ్ అని తేలారు. తన తల్లి అంత్య క్రియలకు దుబాయి నుండి వచ్చిన సురేష్ గ్రామంలో 15 వందల మందికి దశదిన కర్మ భోజనాలు పెట్టాడు. ఇప్పుడు ఆ 15 వందల మందితో పాటు వాళ్లు కలిసిన ఇతరుల్ని కూడ గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.  ఇది ఇప్పుడు మర్కజ్ అంతటి కేసు.

తన చర్యల్ని  సమర్థించుకోవడానికి మర్కజ్ చేస్తున్న వాదనలు

“అంతర్జాతీయ విస్తృత కార్యవర్గ సమావేశం  తేదీల నిర్ణయం ఆరు నెలలు ముందుగానే జరిగిపోయింది. అప్పటికి ప్రపంచంలో ఎక్కడా కరోనా వైరస్ వునికి లేదు. విదేశీ ప్రతినిధులు కూడ ఢిల్లీ చేరుకున్నాక సమావేశాన్ని వాయిదా వేయడం సాధ్యంకాదు. విదేశీ ప్రతినిధులు వచ్చినపుడు విమానాశ్రయాల్లో ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. వాళ్ళను 14 రోజుల క్వారంటైన్ కు పంపలేదు. దాని అర్థం మర్కజ్ సమావేశానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టే. ఢిల్లీలో సమావేశాలు మొదలయిన మార్చి 13నే కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని చేసిన ప్రకటన మాకు నమ్మకాన్ని కలిగించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కీడ్రల మీద ఆంక్షలు విధించారుగానీ, ధార్మిక సమావేశాల మీద ఆంక్షలు లేవు. రైళ్ళు, బస్సులు, విమానాల రాకపోకలు రద్దు కావడంతో  విదేశీ ప్రతినిధులేగాక స్వదేశీ ప్రతినిధులు సహితం ఎటూ కదల్లేక మర్కజ్ లో ఇరుక్కున్నారు. ముందు జనతా కర్ ఫ్యూను ఆ తరువాత లాక్ డౌన్ ను ప్రకటించారు. లాక్ డౌన్ కాలంలో ఎక్కడివాళ్ళు అక్కడే వుండిపోవాలని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు అప్పటికి మర్కజ్ లో వున్నవారు అక్కడే వుండిపోయారు.

తబ్లిఘీయులు దైనందిక జీవితంలో, ఆహారపు అలవాట్లలో శుచి శుభ్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కరోనాకు విరుగుడు నమాజ్. నిజానికి ఐదు పూటల నమాజ్ చదివేవారివల్లనే దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది.

తబ్లీక్ జమాత్ మర్కజ్ కు ప్రతి రోజు 2, 3 వేలమంది  వచ్చిపోతుంటారు. అది నిరంతర ప్రక్రియ. ప్రధాని ఏమాత్రం ముందుగా చెప్పకుండా లాక్ డౌన్ ప్రకటించారు. దానితో అంతమంది అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మేము మోసపోయాం.  ఇది ప్రభుత్వ చేసిన తప్పు. మర్కజ్ ఎలాంటి తప్పు చేయలేదు.

రోగుల వ్యక్తిగత సమాచార గోప్యత చట్టాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా వుల్లంఘిస్తోంది. మర్కజ్ కు వెళ్ళిన వారి వివరాలను మీడియాలో ప్రకటిస్తున్నారు. పోలీసులు వారి ఇళ్ళకు వెళ్ళి అందరి సమక్షంలో బయటికి లాక్కొనివచ్చి  క్వారంటైన్ కు తరలిస్తున్నారు.


“మేము కరోనాను ఇతర మత సమూహాల్లో వ్యాప్తి చేయదలిస్తే మసీదులకు ఎందుకు వెళుతాము?, మా కుటుంబ సభ్యులతోనే ఎందుకు నివసిస్తామూ? మర్కజ్ వల్ల కరోనా సోకినవారు నూటికి నూరు శాతం ముస్లింలే ”  “కరోనా సోకి మేము కుంగిపోతుంటే బాధితుల్నే దోషులు అనడం మానవత్వమేనా?”

మర్కజ్ నుండి వచ్చిన వారు స్వఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని ముస్లిం ఆలోచనాపరులు కూడా మీడియాలో పిలుపులు ఇచ్చారు. కరోనా మీద ఒక సామాజిక జాడ్యం (సోషల్ టాబూ) కొనసాగుతూ వుందని వారు గ్రహించ లేకపోతున్నారు. కరోనా సోకిందని తెలిస్తే పరిసరాలవాళ్ళు వాళ్ళతో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. అసలు కరోనా సోకినవారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సుల్ని కూడ అనేక చోట్ల సామాజికంగా వెలి వేస్తున్నారు. ఇక  ముస్లీంలకు కరోనా సోకిందని తెలిస్తే మూకోన్మాదులు ఊరుకుంటారా?  ఢిల్లీ సమీపంలోని బవానా గ్రామంలో మర్కజ్ కు వెళ్ళి వచ్చిన మెహబూబ్ అలీ అనే యువకుడిని కరోనా అనుమానంతో మూకోన్మాదులు దాడి చేసి హత్య చేశారు.   

మర్కజ్ మీద సంఘీయుల ఆరోపణలు.
తెలంగాణలోని కరీంనగర్ లో  కరోనా కేసు బయటపడినప్పుడే మర్కజ్ లింకు వెలుగులోనికి వచ్చింది. భారత ముస్లిం సమాజంలో అనేక జమాతుల్లో తబ్లిఘీ ఒకటి. అసలు ఏ జమాతుల్లోనూ వుండనివారు కూడా చాలా పెద్ద సంఖ్యలో వుంటారు.    మర్కజ్ తో పాటూ మొత్తం భారత ముస్లిం సమాజాన్ని అనుమానించే, నిందించే, నిలబెట్టే ట్రోలింగ్ అప్పటి నుండే సోషల్ మీడియాలో మొదలయింది. ‘కరోనా హాట్ స్పాట్’ ‘వైరస్ ఉగ్రవాదం’, ‘తాలిబాన్ వైరస్’, ‘వైరస్ జిహాద్ వంటి తీవ్ర నిందలు వైరల్ గా మారిపోయాయి.

మార్చి 21న 332 మాత్రమే వున్న కరోనా కేసులు మార్చి 28న వెయ్యికి చేరుకున్నాయి. అప్పటికే వైరస్ 18 రాష్ట్రాలకు వ్యాపించింది. అనేక చోట్ల కరోన లింకు కనిపించింది. 

ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టివి మార్చి 31 రాత్రి ‘ద డిబేట్’ కార్యక్రమంలో ‘మర్కజ్ కోవిడ్ స్ప్రెడ్’  హాష్ టాగ్ తో చర్చ నడిపింది.  మర్కజ్ “ఉద్దేశ పూర్వకంగా”, “బాహాటంగా”, “ప్రణాళికా బధ్ధంగా”  దేశంలో కరోనా వ్యాప్తికి “కుట్ర” చేసి “దేశద్రోహం”కు పాల్పడిందని ఆర్నాబ్ గోస్వామి స్వయంగా ఆరోపించారు. “ఢిల్లీ సమావేశానికి వచ్చిన విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళారూ? అసలు విజిటింగ్ వీసాల మీద దేశానికి వచ్చిన వారు చట్ట వ్యతిరేకంగా మతప్రచారంలో ఎందుకు పాల్గొన్నారూ?” వంటి ప్రశ్నల్ని మీడియా లేవనెత్తింది.

ఆ తరువాత ప్రాంతీయ, స్థానిక మీడియాలు కూడా ఓ మూడు రోజులు అదే మార్గంలో నడిచాయి.

ఈ సందర్భంలో రెండు మూడు ఫేక్ వీడియోలు సహితం  రంగప్రవేశం చేశాయి. ఒక దాంట్లో ముస్లీములు చాలా వేగంగా ఊపిరీ పీల్చి వదులుతున్నారు. మరో దాంట్లో ఎంగిలి కంచాల్లో మిగిన అన్నాన్ని ముస్లిం యువకులు తింటున్నారు. మర్కజ్ లో ముస్లింలు మానవ బాంబుల్లా కరోనా వైరస్ ను స్వఛ్ఛందంగా ఒకరికొకరు అంటించుకుని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపింజేశారనడానికి సాక్ష్యంగా  ఈ వీడియోలు ప్రసారం అయ్యాయి.

మర్కజ్ నిర్వాహకులు ఇప్పటికీ పశ్ఛాత్తప పడుతున్నట్టు కనిపించడంలేదు. వాళ్ళు ఈ దేశపు ప్రతి చట్టాన్నీ వుల్లంఘించారు. దేశం ఆచరిస్తున్న లాక్ డౌన్ మీద వాళ్ళు ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. తమకు సాధ్యమయినన్ని పధ్ధతుల్లో లాక్ డౌన్ ను వ్యతిరేకించాలనీ, దాన్ని విఫలం చేయాలి” అని తబ్లిఘీ జమాత్ నేత మౌలానా ముహమ్మద్ సాద్ తన అనుచరులకు పిలుపు ఇచ్చారని ఆర్నబ్ గోస్వామి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

             “మనం నమాజ్ ను నిర్లక్ష్యం చేస్తుంన్నందుకు అల్లా ఆగ్రహించి మనల్ని శిక్షించడానికి రోగాలు, వైరస్ లను పంపిస్తాడు “ప్రళయం ముంచుకు వస్తున్నపుడు ఆపత్కాలంలో మనం చేయాల్సిన గొప్ప పని మసీదుల్లో చేరి నమాజ్ ఆచరించడమే” ”నమాజ్ ను వదలండి, పదిమంది కలవకండి, కలిసిమెలసి వుండకండి అని డాక్టర్లు చెప్పే మాటల్ని వినకండి”  “ఒకవేళ మనం చనిపోవడం అనివార్యం అయితే దానికి మసీదుకన్నా పవిత్ర స్థలం ఇంకేదీ వుండదు” “అందువల్ల మసీదును, నమాజ్ ను వదలకండి” వంటి ప్రవచనాలున్న కొన్ని ఆడియో క్లిప్పులు మౌలాన సాద్ పేరిట ప్రచారంలోనికి వచ్చాయి. ఇవి మౌలాన సాద్  ప్రవచనాలేనా? కరోనాను దృష్టిలో పెట్టుకుని మొన్నటి ఢిల్లీ సమావేశంలో వారు అలా ప్రవచించారా? అసలది అది వారి గొంతుయేనా?   అనే అంశాలు ఇంకా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ఈ వీడియోలు సమాజంలో ముస్లిం వ్యతిరేకతను, ద్వేషాన్నీ విపరీతంగా రెచ్చగొట్టాయి.

ఇతర జమాత్ లు, ప్రముఖుల స్పందన
“పాత వీడియోలను ఇప్పటి వైరస్ నేపథ్యంలో సందర్భాన్ని మార్చి ప్రవేశ పెట్టడంతో చాలా పెద్ద అపార్థం చోటుచేసుకుంది.  ఆ రెండు వీడియోలు ఇప్పుడు మర్కజ్ లో తీసినవి కావు.  అవి పదేళ్ళు పాతవి.  అసలవి భారతదేశంలో చిత్రించినవి కావు.  అవి ఫేక్ వీడియోల్లని ఇప్పటికే కొన్ని ఛానళ్ళు నిరూపించాయి”.

“అన్నం దైవ స్వరూపం కనుక కంచంలో ఒక్క మెతుకును కూడ వదలకుండ తినాలని ముస్లింలు భావిస్తారు. కొందరైతే భోజనం ముగిశాక కంచంలో కొద్దిగా నీరు పోసి దాన్ని రసంగా తాగేస్తారు. ఇంకొంచెం చాదస్తం వున్నవాళ్లు పక్కవాళ్ళ కంచంలో మిగిలిన ఎంగిలి మెతుకుల్ని కూడ తింటారు. తద్వార ఆహార పవిత్రతను పాటించినట్టు భావిస్తారు. ఇలాంటి సాంప్రదాయం మదరసాల్లోనూ, షియా ముస్లిం సమాజంలోని దావూదీ భోరా  తెగల్లోనూ ఎక్కువగా కొనసాగుతోంది. ఆహార వృధాను కట్టడి చేయడానికి ముస్లిం సమాజంలో ‘దానా కమిటీలు సహితం వుంటాయి. దానా అంటే అన్నం మెతుకులు. దావూదీ భోరాల దానా కమిటీలు చేస్తున్న కృషిని సాక్షాత్తు భారత ప్రధాని రెండేళ్ళ క్రితమే గొప్పగా మెచ్చుకున్నారు. ముస్లిం సూఫీ సమూహాల్లో ప్రాణాయామం వంటి ఆసనాలు కూడా వుంటాయి”. 

“మర్కజ్ అధినేత మౌలానా ముహమ్మద్ సాద్ చర్య “నేరపూరిత అజ్ఞానం”; లేదా “అజ్ఞానంతో చేసిన నేరం” (Criminal Ignorance)” అన్నారు   ముస్లిం స్కాలర్ సయ్యద్ అహమద్ ఉల్ హుస్సైనీ సయీదుల్ ఖాదరి,

“అంటు వ్యాధి ప్రబలిన ప్రాంతానికి వెళ్ళరాదు. అంటు వ్యాధి సోకిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదు. అంటు వ్యాధులు ప్రబలడానికి మీరు కారకులు కావద్దు” అని ప్రవక్త ముహమ్మద్  ఆదేశాలు (హదీస్) చాలా స్పష్టంగా వున్నాయి. మర్కజ్ నిర్ణయం  ప్రవక్త ముహమ్మద్  ఆదేశాలాకు విరుధ్ధం” అన్నారాయన.  

“కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నాటికే అజ్మీర్ లోని హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ ఛిష్టీ వారి దర్గను మూసివేశారు. ఢిల్లీలో మర్కజ్ పక్కనే వున్న ఖ్వాజా హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వారి దర్గను మూసివేశారు. హైదరాబాద్ తో సహా దేశంలోవున్న దర్గాలన్నీ మూసి వేశారు” అని గుర్తు చేశారాయన.

ముస్లింలకు మక్కాలోని మజ్దిద్- అల్- హర్మ్, మదీనాలోని మజ్దిద్- అల్- నబవి అతి పవిత్రమైనవి.  మక్కా, మదీన మసీదుల్లో శుక్రవారం నమాజులతో సహా అన్ని నమాజుల్ని మార్చి 20న రద్దు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. అంతకు మూడు రోజుల ముందే దేశంలోని అన్నీ మసీదుల్లో అన్ని నమాజుల్నీ రద్దు చేసింది. మక్కా, మదీన మసీదుల్నే మూసివేసినపుడు మౌలాన సాద్ మర్కజ్ కార్యకలాపాలను సాగించడంపట్ల పలువురు ముస్లిం ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

మరో ముస్లిం పెద్ద మొహమ్మద్ ఆలం మౌలాన సాద్ తీరు మీద తీవ్ర అసంతృ]ప్తిని వ్యక్తం చేశారు. “మౌలానా సాద్ కు అన్ని విషయాలూ తెలుసు. ప్రపంచంలోనేగాక దేశంలోనూ కరోన వైరస్ ప్రబలుతున్నదని తెలుసు. అయితే, మొండివైఖరితో వారు అమాయకపు తబ్లిఘీ జమాత్  సభ్యుల్ని కరోనా కోరల్లోనికి నెట్టేశారు. మౌలానా సాద్ తాను ప్రపంచ ముస్లింలకు ఆమిర్(అగ్రనేత)నని భావిస్తుంటారు. మర్కజ్ ను మక్కా, మదీనాల తరువాత అంతటి పవిత్ర స్థలంగా పేర్కొంటుంటారు. అలాంటిది కరోనా గురించి అంత అజ్ఞానంతో ఎలా వ్యవహరించారో అర్థంకాదు”  అన్నారాయన.

మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటి ఛాన్సలర్ జఫర్ సరేష్ వాలా మర్కజ్ తీరును తప్పుపట్టారు. తాను మౌలానా ముహమ్మద్ సాద్ ను కలిసి వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం శ్రేయస్కరం కాదనీ, దాన్ని  రద్దు చేయాలని కోరినా తన మాటను పెడచెవిన పెట్టారని జఫర్ ప్రకటించారు.

ఢిల్లీలోనే కేంద్ర కార్యాలయం వున్న షురా -ఏ -జమాత్  కరోన వ్యాప్తి నేపథ్యంలో  తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. ఆ సంస్థ నేతలు మౌలాన జహీరుల్ హుస్సేన్, మౌలాన ఇబ్రాహీం, మౌలాన అహమద్ సంయుక్తంగా తబ్లిఘి జమాత్ కు కూడ ఇలాంటి సూచన చేశారు. వాళ్ల మాటల్ని కూడా మౌలాన సాద్ వినలేదు.

షియా ముస్లిం సంఘాలన్నీ మర్కజ్ ను తీవ్రవాద సంస్థగా పేర్కొని దాని  తీరు మీద తీవ్రంగా విరుచుకుపడ్డాయి. షియా వక్ఫ్ బోర్డు చీఫ్ వాసిమ్ రిజ్వీ, ఉత్త్రప్రదేశ్ మంత్రి మొహసిన్ రజా తబ్లిఘీ జమాత్ ను నిషేధించాలని కోరాయి. తబ్లిఘీ జమాత్  దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడిందని వారు ఆరోపించారు.

కాంగ్రెస్ మీడియా ప్రతినిధి మీమ్ అఫ్జల్ కూడ మార్చి రెండవవారంలో సమావేశాన్ని కొనసాగించడం శ్రేయస్కరం కాదని మౌలానా సాద్ ను హెచ్చరించారు. వారు అఫజల్ మాటల్ని కూడా తోసిపుచ్చారు. 

“తబ్లిఘీ జమాత్ సరిగ్గా వ్యవహరించలేదు. మలేషియా ప్రతినిధికి వైరస్ సోకినట్టు కరీంనగర్ నుండి వార్తలు వచ్చినా స్పందించలేదు. అయితే,  కొందరు దీన్ని కుట్రగానూ, కరోనా జిహాద్ గానూ చిత్రించడం చాలా దురదృష్టకరం” అన్నారు రాజ్యాంగ నిపుణులు ఫైజాన్ ముస్తఫా.

ఇక్కడ దేశద్రోహ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న మర్కజ్ విచిత్రంగా మన శత్రుదేశం  పాకిస్తాన్ లోనూ ఇప్పుడు ఇలాంటి నిందల్నే ఎదుర్కొంటోంది. రాయివిండ్ తో పాటూ సింధ్-హైదరాబాద్, కసూర్ (లాహోర్) నగరాల్లో తబ్లిఘీ జమాత్ కు చెందిన చెరో 50 మంది మతప్రచారకులు కరోనా పాజిటివ్ అని తేలారు. దానితో ఉలిక్కి పడిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆ నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. 

జమాత్ ఏ –ఉలేమా హింద్, జమాత్ ఏ ఇస్లామీ హింద్ సహితం మర్కజ్ వ్యవహార శైలి మీద అసహనాన్ని వ్యక్తం చేశాయి.  మర్కజ్ వంకతో మీడియా ద్వార దేశంలో మత ద్వేషాన్ని, ముస్లిం వ్యతిరేకతను వ్యాపింపిచేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ  జమాతే ఉలేమా ఏ హింద్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  తబ్లిఘీ జమాత్ ద్వార జరిగిన “ఒక దురదృష్టకర సంఘటన”తో మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించడానికీ, వాళ్ళను భూతాలుగా చూపెట్టడానికీ   కొందరు ప్రయత్నిస్తున్నారని జమాతే ఉలేమా ఏ హింద్ లీగల్ సెల్ కార్యదర్శి ఎజాజ్ మగ్బూల్ ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

"నిజామొద్దీన్‌ సభకు వెళ్లి వచ్చిన జమాత్‌ సభ్యులారా! మీ కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వాలు, పోలీసులు, వైద్యులకు సహకరించండి. లేదంటే మొత్తం ముస్లిం సమాజం నింద మోయాల్సి వస్తున్నది. మతం పేరిట ఆధునిక రాజకీయ, సామాజిక, వైద్య విధానాలను, అభివృద్ధిని విస్మరించడాన్ని మేం సమర్థించం. అలా విస్మరిస్తే ఒక్క ఇస్లాం సమాజానికే కాదు, సహ సమాజం అంతటికి హాని చేసినవారవుతారు. దయచేసి అందరూ, ముఖ్యంగా ముస్లింలు రోజువారీ సమాజాన్ని గమనించండి. తెలుసుకోండి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు ఇస్తున్న సూచనలను గమనించండి. ప్రభుత్వాదేశాలను, సూచనలను అనుసరించండి. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని అనుసరించండి". 

- ముస్లిం థింకర్స్ డయాస్ 

10 ఏప్రిల్ 2020 ( ఆంధ్రజ్యోతి దినపత్రిక )

"మర్కజ్    ధార్మిక సదస్సులో పాల్గొన్నవారు, వీరితో కలిసిన ముస్లింలు స్వఛ్ఛందంగా ఆయా అధికారుల వద్దకు వెళ్ళి కరోనా పరీక్షల చేయుంచుకుని, డాక్టర్ల సలహాలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము" 
- బూర్గుల నర్సింగరావు 
మరియూ 130 మంది కవులు కళాకారులు ఆలోచనాపరులు సామాజికకార్యకర్తలు. 
16 ఏప్రిల్ 2020 ( ఆంధ్రజ్యోతి దినపత్రిక ) 


  "(మర్కజ్)వారు అజ్ఞానంతోనో లేక పరిస్థితుల వల్లో చేసిన దాన్ని ఉద్దేశ పూర్వకంగా చేశారని లేక కుట్ర పూరితంగా చేశారని అంటే ఎలా నమ్మటం?" 
ఎ. సునీత  (ఆంధ్రజ్యోతి 19 ఏప్రిల్ 2020)

మర్కజ్ సమావేశం మార్చి 15న ముగిసింది. ఆ రెండు బృందాలు నెల తరువాత కూడ  ప్రత్యేకించి మర్కజ్ ధార్మిక సదస్సులో పాల్గొన్నవారికి అలాంటి సూచన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. 


ఈ పరిణామాల నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు
విదేశీ పర్యటనల నుండి తిరిగి వచ్చిన స్వదేశీయుల వల్లనూ, మనదేశంలో పర్యటించడానికి వచ్చిన విదేశీయులవల్లనూ  భారతదేశం లోనికి   కరోనా ప్రవేశించింది. మన దేశంలో పర్యటించడానికి వచ్చిన విదేశీయుల్లో  ఒక బృందం మర్కజ్ సమావేశాల్లో పాల్గొన్నది. ఇప్పుడు పాలక యంత్రాంగ దృష్టి అంతా మర్కజ్ పాయ మీదనే వుంది. దానివల్ల పాలకులకు ఒక రాజకీయ ప్రయోజనం వుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మిగిలిన పాయల్ని నిర్లక్ష్యం చేస్తే సమీప భవిష్యత్తులో అవి మర్కజ్ ను మించిన విధ్వంసాన్ని సృష్టించవచ్చు.  అజ్ఞానం, అహంభావాలతో మర్కజ్ వ్యవహరించినతీరు ప్రత్యర్ధులు  ఒక కుట్ర సిధ్ధాంతాన్ని రూపొందించి ప్రచారం చేయడానికి దోహదపడింది. 

ముస్లింలలో సున్నీ, షియా, సూఫీ తదితర కొన్ని తెగలున్నాయి.  ప్రతి తెగల్లోనూవీటిల్లోనూ ఉపతెగలున్నాయి. ఈ తెగలు ఉపతెగల్లో కొన్ని జమాత్ లున్నాయి. అసలు ఏ జమాత్ ల లోనూ వుండని ముస్లిం సమూహాలు కూడ పెద్ద సంఖ్యలో వున్నాయి. తబ్లిఘీ జమాత్ అజ్ఞానం అహంభావం ఇప్పుడు మొత్తం భారత  ముస్లిం సమాజానికి శాపంగా మారింది.  

మర్కజ్ మీద  మొదట్లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయామే ఇప్పుడు ఎక్కువ మందిలో బలపడుతున్నట్టుంది



మతవిశ్వాసాలకూ వర్తమాన సమాజ అవసరాలకు మధ్య ఎప్పుడూ ఒక వైరుధ్యం వుంటుంది. వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మతవిశ్వాసాలను పరిష్కరించే వారిని ఆధునికులు అంటారు. తద్విరుధ్ధంగా వుండేవారిని ఛాందసులు అంటారు. తబ్లిఘీ జమాత్ అనుయాయులు మరీ అమాయకులనీ, వాళ్ళకు ‘దీన్ దారీ (పరలోక) ధ్యాసే తప్ప ‘దునియాదారీ (ఇహలోక) స్పృహ వుండదని వారి మీద  చాలామంది జాలి పడుతుంటారు. ఏమాత్రం ఇహలోక స్పృహ లేని తబ్లిఘీ జమాత్ ప్రపంచాన్ని ముంచుకుని వస్తున్న కరోనా మహమ్మారిని తన సహజ నిర్లిప్త ధోరణిలో  పట్టించుకోలేదు.  అదే ఇప్పుడు వారికి శాపంగా మారింది.

ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్య విభాగాల దృష్టి మొత్తం మర్కజ్ కు వెళ్ళి వచ్చిన వాళ్ళ మీద వుంది. కరోన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడ వాళ్ళ మీదే జరుగుతున్నాయి కనుక  పాజిటివ్ కేసులు కూడా సహజంగానే వాళ్ళ నుండే వుంటున్నాయి. రేపు ఇతర సమూహాల మీద కూడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరపాల్సి వుంటుంది. అప్పుడు వెలువడే ఫలితాలతో ఇప్పటి సమీకరణలు  మారవచ్చు. మర్కజ్ లింకులో ప్రబలిన కేసుల శాతం అప్పుడు చాలా వరకు తగ్గిపోవచ్చు. నాలుగు రోజుల్లోనే  మర్కజ్ లింకుల శాతం 36 శాతం నుండి 21 శాతానికి పడిపోయింది. వచ్చే వారం ఇది 10 శాతం కన్నా తక్కువకు పడిపోవచ్చు. అప్పుడు ఇప్పటి ఆరోపణలకు తావు వుండదు. 

మర్కజ్ లో  అంతర్జాతీయ విసృత కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే ఢిల్లీలోనే మార్చి 14న అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి మహారాజ్ ‘గోమూత్ర సేవన విందు నిర్వహించారు. “విష్ణుమూర్తి కొత్త అవతారం కరోనఅనీ, “లోకంలో మాంసాహారుల్ని శిక్షించడానికి శ్రీనరసింహస్వామి కరోనా వైరస్ అవతారం ఎత్తారు అనీ, “దానివల్ల శాఖాహారులకు ముప్పులేదు అని గోమూత్ర సేవన విందులో స్వామీ చక్రపాణి మహారాజ్ ప్రవచించారు.  

నిజానికి మతసమూహాలు అన్నింటిలోనూ ధార్మిక గురువుల ప్రవచనాలన్నీ ఇహలోక ఆకర్షణల్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేరమనే చెపుతాయి. కబీర్, అన్నమయ్య, రామదాసు వగయిరా భక్తుల  కీర్తనల్ని గమనించండి. కీర్తన ఎవరిదైనా కంటెంట్ ఒక్కటే. దేవుడ్ని శరణుకోరితే సమస్యలన్నీ పోతాయి అనేది వాటి సారాంశం. ఇలాంటి ప్రవచనాలను నేరుగా సైన్సుతో ముడిపెట్టే సాహసం ఎవరూ చేయకూడదు.   మౌలానా సాద్ ఆ పొరపాటు చేశారు.

మర్కజ్ ను వాళ్ళు ముందే ఖాళీ చేసి వుండాల్సింది. మరీ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్  మార్చి 28 అర్ధరాత్రి వచ్చి బలవంతంగా మర్కజ్ ను ఖాళీ చేయించే వరకు పరిస్థితిని తెచ్చుకోకుండ వుండాల్సింది.

చైనా కరోన వేరు ఇండియా కరోన వేరు. ఇండియా కరోనకు మతతత్వము అనే మరో వైరస్  తోడయ్యింది. మెజారిటీ సమూహం తెలిసి చేసినా అది తప్పు కాదు. మైనారిటీ సమూహం తెలియక చేసినా అది తప్పే అవుతుంది! అది ఇప్పుడు సాంప్రదాయం. తప్పులు అందరూ చేయవచ్చుగాక; భారత ముస్లింలు తప్పు చేస్తే ఎలా? ముడు వారాలు లాక్ డౌన్ లో వుంటే కరోన వైరస్ ను తరిమి కొట్టవచ్చేమోగానీ మతతత్వవైరస్ ను తరిమికొట్టడం అంత ఈజీ కాదు.

భారత ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా మందగమనంలో వుంది.  మార్చి 31తో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. సాలీన జీడిపి గ్రోత్ రేట్ రెండు మూడు శాతం కన్నా తక్కువే వుంటుందని నిపుణులు కొంతకాలంగా అంటున్నారు. కరోనా వైరస్ ముందుకు దూసుకు రావడంతో ఆర్థిక వ్యవస్థ మీద చర్చ వెనక్కిపోయి ప్రభుత్వానికి ఒక వెసులుబాటును కలిగింది. ఇప్పుడు కరోన వైరస్ నెపాన్ని మోపడానికి కూడ ఒక బలిపశువు అవసరం అయ్యింది. ఈ పరిణామాలు అర్థంకాని  మర్కజ్ తనంత తానే వెళ్ళి బలిపీఠం మీద తలపెట్టింది.

220 దేశాల్లో శాఖలున్నాయని చెప్పుకునే తబ్లిగ్ జమాత్ మార్చి 1 నాడే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను పాటించి వుండాల్సింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్  ఆదేశం (హదీసు) ప్రకారం తన కార్యక్రమాలన్నింటినీ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించివుంటే ఈరోజు ఆ తబ్లిగ్ జమాత్ మాత్రమేగాక మొత్తం ముస్లిం సమాజం అందరి మన్ననలను పొందుతూ వుండేది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల విభాగం కేంద్ర హోంశాఖ ఆధీనంలో వుంటాయి.  బిజేపి అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా కొనసాగుతున్న అమిత్ షాయే ఆ శాఖకు మంత్రి. పైగా మర్కజ్ కు కూతవేటు దూరంలో నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ వుంటుంది. హోంశాఖకు తెలియకుండ విదేశీయులు మనదేశంలోనికి ప్రవేశించలేరు. వీసాల నాడే ఎవరు ఎప్పుడు మనదేశంలోనికి వస్తున్నారన్నది తెలిసిపోతుంది. స్థానిక స్పెషల్ బ్రాంచ్, రాష్ట్ర ఇంటెలిజెన్స్,  కేంద్ర ఇంటెలిజెన్స్ లతోపాటూ జాతీయ భద్రత వ్యవహారాల సలహాదారు (NIA) వరకు అన్ని విభాగాలూ విదేశీ పర్యాటకుల కదలికల మీద నిఘావేసి వుంచుతారు. ఇంతటి సమాచారం వున్నప్పుడు కరోనా ముప్పు నేపథ్యంలో ఈ విభాగాలు   మర్కజ్ సమావేశాన్ని మార్చి 13నే అడ్డుకోవచ్చు. వాళ్లు ఉదాసీనత కారణంగా ఆ విషయాన్ని పట్టించుకోలేదా? లేక ఉద్దేశ్య పూర్వకంగానే ఒక కుట్ర పూరితంగా సమావేశాన్ని జరపనిచ్చారా?  కరోన సాంఘీక దూరాన్ని  ముస్లింల సాంఘీక బహిష్కరణగా మార్చదలిచారా? అనేవి సమంజసమైన సందేహలే. అలాగే మౌలానా సాద్ ఉదాసీనతతో ఈ కుట్రను గమనించలేకపోయారా? లేక మొండివైఖరితో వ్యవహరించారా? లేదా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అంటున్నన్నట్టు మర్కజ్, కేంద్ర హోంశాఖల మధ్య అపవిత్ర సంబంధాలు ఏమైనా వున్నాయా? అనేవి కూడ గమనించాల్సిన అంశాలే.  




నాయకునికి వుండాల్సిన లక్షణం అమాయికత్వం మూఢవిశ్వాసం కాదు; ముందుచూపు. మర్కజ్ నిర్వాహకుల్లో ఏ దశలోనూ అలాంటి ముందు చూపు కనిపించలేదు. తమను కొందరు ఒక వలలో బంధిస్తున్నారనే స్పృహ లేకపోవడం న్యాయం కాదు.  కొన్ని చారిత్రక సందర్భాల్లో ముప్పును గుర్తించకపోవడం కూడ చారిత్రక తప్పిదమే. తబ్లిగ్ జమాత్ ముందుగా తాను నష్టపోయి తరువాత భారత ముస్లిం సమాజానికి కూడ భారీ నష్టాన్ని కలుగజేసింది.

హిందూత్వ ఎజెండా వున్న రాజకీయ పార్టీ కేంద్రంతో సహా అనేక రాష్ట్రాల్లో అధికారంలో వున్నప్పుడు, ప్రధాన స్రవంతి మీడియా మెజారిటీ మతవాదాన్ని బాహాటంగా ప్రోత్సహిస్తున్నపుడు, మైనార్టీలవల్ల ఒక్క తప్పు జరిగినా వంద తప్పుల్ని సృష్టించి  ట్రోల్ చేయడాని సోషల్ మీడియా సిధ్ధంగా వుంటుంది. ఇలాంటి సందర్భాల్లో అల్పసంఖ్యాక సమూహాల ధార్మిక గురువులు మరింత జాగరూకతతో వ్యవహరించాలి.

           సిఏఏ, ఎన్ పిఆర్, ఎన్నార్సీలకు  వ్యతిరేకంగా షాహీన్ బాగ్ పేరిట ఆరంభమయిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఏపుగా విస్తరించింది. లౌకికవాదులు, సామ్యవాదులు, మానవతావాదులు, మతసామరస్య వాదుల నుండే గాక సాధారణ హిందూ సమాజం నుండి కూడ ముస్లిం సమాజానికి అద్భుతమైన సంఘీభావం సోదరభావం సమకూరింది. చరిత్రలో నాయకుడు లేకుండ సాగిన ఒక మహత్తర సామాజిక ఉద్యమం ఇది. ఫిబ్రవరి రెండవ వారంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన  తరువాత కేంద్ర ప్రభుత్వానికి  షాహీన్ బాగ్ ఉద్యమం సెగ తగిలింది. ఎన్నార్సీ మీద ఒకడుగు వెనక్కు వేస్తున్న సంకేతాలు కూడ వెలువడ్డాయి. ఇప్పుడు అదంతా మర్కజ్ వివాదంలో కొట్టుకు పోయింది. ఇప్పుడు ముస్లిం సమాజం ఎన్నార్సీని రద్దు చేయమని కోరడం ఆపి కరోనా వైరస్ వ్యాప్తికి తాను కారణంకాదని నిరూపించుకోవాల్సిన ఆత్మరక్షణలో పడిపోయింది. మర్కజ్ చేసిన అనాలోచిత చర్య ఫలితంగా షాహీన్ బాగ్ ఉద్యమానికీ తద్వార భారత ముస్లిం సమాజానికి నైతికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.

            మనదేశంలో ముస్లింలు అసహాయ లోకువ సమాజం.  ఎక్కడ ఏ తప్పు జరిగినా లోకం ముందుగా ముస్లింల వైపు చూసే వాతావరణం కొనసాగుతూవుంది. లోకంలో తమ మీద కొనసాగుతున్న అపోహల్ని తొలగించడానికీ, ఆమోదాంశాన్ని పొందడానికి ముస్లింలు ప్రత్యేకంగా కృషి చేయాలి. అంతే తప్ప కొత్త విమర్శలకు, నిందలకు, అపోహలకు అవకాశం ఇచ్చేలా ఎన్నడూ వ్యవహరించకూడదు.

మతంకన్నా సమాజం గొప్పది. సమాజ శ్రేయస్సు తరువాతే మత విశ్వాసాలు వుండాలి. భారత ముస్లిం సమాజానికి మర్కజ్ ఏకైక ప్రతినిధి ఏమీకాదు. దేశంలో అనేక జమాతులున్నాయి. అసలు ఏ జమాత్ లోనూ లేను ముస్లింలూ వున్నారు. తన అనాలోచిత  చర్యలవల్ల భారత ముస్లిం సమాజం  మొత్తాన్ని నైతిక సంక్షోభంలో పడేసినట్లు మర్కజ్ గుర్తిస్తున్న దాఖలాలు ఇప్పటికీ కనిపించడంలేదు.

ఎవరయినాసరే ముందు కరోనా వైరస్ ను గుర్తిస్తే తొలుత  మందును ఆ పిదప టీకాను కూడ కనుగొనవచ్చు. అసలు వైరస్ నే గుర్తించనివాళ్ళకు ఇబ్బందులు తప్పవు. మర్కజ్ అనాలోచిత చర్య కూడ అంతే. జరిగిన తప్పును ముందు  గుర్తిస్తే దానికి పరిష్కారాలు, నష్టనివారణోపాయాల్ని కనుగొనడం కష్టం ఏమీ కాదు. ఇప్పుడు  తబ్లిఘీ జమాత్ మాత్రమే కాకుండ మొత్తం భారత ముస్లిం సమాజం ఇతర మత సమూహాల నుండి గుడ్ విల్ బిల్డింగ్ కోసం కృషి చేయాలి.

రచన : 4 ఏప్రిల్  2020
ప్రచురణ :   ఫేస్ బుక్.  6 ఏప్రిల్ 2020

No comments:

Post a Comment