Thursday 28 July 2022

Are the Muslims ready to encourage their own Media

 ముస్లిం మీడియాను 

ప్రోత్సహించడానికి 

ముస్లిం సమాజం సిధ్ధమేనా? 



“మారడానికి సిధ్ధపడని జాతిని దేవుడు కూడ మార్చలేడు” అనే మాటను నేను మా ముస్లిం సమూహంలో చిన్నప్పటి నుండి వింటున్నాను. గడిచిన  అరవై ఏళ్ళలో భారత ముస్లింల జీవితాలు మెరుగుపడలేదు. పైగా, మరింతగా క్షీణించి పోతున్నాయి. కూడు, గుడ్డ, గూడు సంగతి డేవుడెరుగు;  ప్రాణరక్షణ కూడ కరువైన స్థితిలో నేటి ముస్లిం సమాజం వుంది. 


మన జీవితాలు మారలేదంటే మనం మారడానికి సిధ్ధంగా లేమని అర్ధం. లేదా మారడానికి అనుసరించాల్సిన మార్గాలేమిటో మనకు అర్ధంకాలేదని అర్ధం. ఓ సమాజం మారాలంటే అందులో రెండు అంశాలు కఛ్ఛితంగా వుండాలి; మేధావులు, మీడియా. ఆధునిక సమాజాల్లో మేధావులు, మీడియాలేని సమూహాలు పోటీని నిలదొక్కుకోలేక అంతరించి పోతాయి; లేదా మరింత చాదస్తంగా మారిపోతాయి. రెండింటి ఫలితం ఒక్కటే. 


మార్పుకు అత్యంత త్వరగా ప్రతిస్పందించే జీవరాశులు  మాత్రమే మనుగడ సాగిస్తాయి” అన్నాడు చార్లెస్ డార్విన్. బలమైన, అత్యంత తెలివైన జీవరాశులు  కూడ వాటి ముందు బలాదూర్ అనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు వీస్తున్న గాలి మార్గాన్ని భారమితి గుర్తించినట్టు జాతికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మేధావులు ముందుగా పసిగడతారు; వెంటనే స్పందిస్తారు.  స్వాతంత్ర్యానంతరం దేశంలోని అనేకానేక అణగారిన సమూహాలు తమ స్వంత మేధావుల్ని, మీడియానూ సృష్టించుకుంటూ మెరుగైన జీవితం దిశగా సాగుతున్నాయి. భారత ముస్లిం సమాజంలో ఇది రివర్స్ గేర్ లో సాగుతోంది. 


సౌదీ అరేబియా ప్రభుత్వం  తబ్లిఘీ జమాత్ కార్యకలాపాలను నిషేధించారనే వార్త రాగానే  ఇక్కడ  స్పందించగల భారత ముస్లిం సమాజం ఇక్కడి సామాజిక రాజకీయ పరిణామాల మీద స్పందించడంలేదు; కనీసం స్పందించాల్సినంతగా స్పందించడంలేదు.   



ముస్లింలకు స్వంత మీడియా లేకపోతే వచ్చే నష్టం ఏమిటీ? అని కొందరు ప్రశ్నించవచ్చు. నష్టం ఏమీ వుండదు. మన గురించి మన ప్రత్యర్ధులు ప్రచారం చేయదలుచుకున్న అభిప్రాయాలే వాస్తవాలుగా ప్రసారం అవుతుంటాయి!!!


అదృష్టావశాత్తు ముస్లిం సమాజంలో ఆలోచనాపరులకు కొదవలేదు; దురదృష్టావశాత్తు వారికి స్వీయ సమాజంలో గుర్తింపులేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ ఉద్యమం సాగినప్పుడు ముస్లిం ఆలోచనాపరులు కొన్నాళ్ళు కొంచెం వెలుగులో కనిపించారు. ఆ తరువాత కథ మామూలే.  ముస్లిం ఆలోచనాపరులు ఒకవైపు; ముస్లిం మౌలానాలు మరోవైపు.


ఇంతటి అననుకూల పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజపు మేలు కోసం  తెలుగులో కొన్ని పత్రికలు వస్తున్నాయి. చాలాకాలంగా ‘గీటురాయి’ వస్తున్నది. నెల్లూరు నుండి రఫీక్ ‘ఇస్లామిక్ వాయిస్’ అనే పత్రికను తెస్తున్నారు. కడప నుండి ఇంకో పత్రిక వస్తున్నది.  ఇంకా ఒకటో రెండో పత్రికలు వస్తున్నట్టు విన్నాను. ఇప్పుడు హైదరాబాద్ నుండి స్కైబాబా ఆధ్వర్యంలో ‘చమన్’ అనే త్రైమాసిక వెబ్ పత్రిక మొదలైంది.  


కమ్మర్షియల్ మీడియా కత వేరు. దాని కమ్మర్షియల్ విలువలు వేరు. దాన్ని కమ్మర్షియల్ ఆర్ధిక పునాదులు వేరు.  సామాజిక పత్రికల నిర్వహణకు స్వఛ్ఛంద మేధోశ్రమ కావాలి; అందుకు అంకితభావంగల ఒక టీం కావాలి. ఆర్ధిక సహాయం కావాలి.  మేధోసామర్ధ్యంకలవారు  పత్రికలను నిర్వహిస్తే వాటిని ఇతరులు ఆర్ధికంగా ఆదుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల జనాభా కోటిన్నర వరకు వుంటుంది. వీరిలో అక్షరాశ్యులు కోటి మంది అనుకుంటే, వారిలో తెలుగు చదివేవారు 50 లక్షల మందికి పైగా వుంటారు. ఇది చిన్న మార్కెట్ ఏమీకాదు. ఈ యాభై లక్షల మంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రూపాయి సబ్ స్క్రిప్షన్ (చందా) కడితే పది పత్రికల్ని అవలీలగా ప్రచురించవచ్చు. 


టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా విజృంభిస్తున్న కాలంలో  పత్రికల్ని తేవడం పెద్ద కష్టంకాదు. దానికి తెలుగు ముస్లిం సమాజం సిధ్ధమేనా అనేదే ముఖ్యం? 


ఏఎం ఖాన్  యజ్దానీ (డానీ)

సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్  

23-07-2022

No comments:

Post a Comment