Thursday 28 July 2022

CHAMAN Jul - Sep – 2022 REVIEW

 చమన్

జులై- సెప్టెంబరు 2022 సంచిక

పరిచయం

 

స్కైబాబా సంపాదకత్వంలో వస్తున్న చమన్ జులై-సెప్టెంబరు 2022 త్రైమాసిక వెబ్- పత్రిక అందింది. చాలా అందంగావుంది. వ్యాసాలు శీర్షికలు ఆలోచనల్ని రేకెత్తించేవిగా వున్నాయి.

 

స్కైబాబా ఎడిటోరియల్ ‘ముస్లింలు మూలవాసులని గుర్తెరగాలి’ అంటూ ఒక ప్రతిపాదనని ముందు పెట్టింది.  10, 12 శతాబ్దాల్లో ఘజ్నీ, ఘోరీల కత్తి మొనల మీద భారత ఉపఖండంలోనికి ఇస్లాం ప్రవేశించిందనే నేరేటివ్ ఒకటి ఇటీవల భారీ ప్రచారంలోవుంది. నిజానికి దానికి మూడు వందల ఏళ్ల క్రితమే ఇస్లాం ఇక్కడికి మతప్రచారకుల ద్వార  వచ్చింది.  అనేక రకాల సామాజిక  కారణాలవల్ల స్థానిక ఎస్టి, ఎస్సి, బిసి సామాజికవర్గాలు సమూహాలు సమూహాలుగా ఇస్లాం ను స్వీకరించాయి.           ఆ ఆనవాళ్లను ఇప్పటికీ భారత ముస్లిం సమాజంలో చూడవచ్చు. వారివల్ల ఒక మిశ్రమ సంస్కృతి ముస్లిం సమాజంలో ఏర్పడింది.  ఆరెస్సెస్ చీఫ్  మోహన్ భగత్ గారు గత ఏడాది జులై 4న ప్రార్ధనా రీతులు వేరయినంత మాత్రాన హిందూ ముస్లింలు వేరుకాదు. మనందరి డిఎన్ 40 వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతోంది. మైనారిటీలు అంటే మనతోపాటు జీవిస్తూ వచ్చిన మన సోదరులు. అనాదిగా కలిసివుంటున్న వాళ్ళను మళ్ళీ కలపడం ఏమిటీ?” అంటూ చాలా ప్రేమను వ్యక్తం చేశారు.

ముస్లింలలోని పూర్వ ఎస్టిలను, పూర్వ ఎస్సీలను, పూర్వ బిసిలను  వరుసగా ఎస్టీ, ఎస్సీ,  బిసి జాబితాల్లో చేర్చాలి. ఎథినిక్ జస్టిస్ అంటే అదే. ఓసీ ముస్లింలుగా  కొనసాగుతున్న ముస్లింలను విద్యా, ఉపాధిరంగాల్లో వారి స్వల్ప ప్రాతినిధ్యాన్నిబట్టి, సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న వివక్షనుబట్టి వాళ్ళను కూడ  బిసి జాబితాలో చేర్చాలి. అప్పుడే స్కైబాబా ప్రతిపాదనకు సరైన న్యాయం జరుగుతుంది. 

 

ఆయితే ఈ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఎవరూ? ముస్లిం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిందెవరూ?  ముస్లిం సమాజమా? హిందూసమాజమా?  ఎస్టీ ఎస్సి బిసి ఆలోచనాపరులా? అణగారిన ముస్లిం సమూహాలకు సామాజిక న్యాయం జరపాల్సింది ఎవరూ?  అనేవి అసలు ప్రశ్నలు.

 

ముస్లింల ఆర్ధిక పునాదుల్ని పెకలిస్తూ, హిజబ్ తదితర వివాదాలతో ముస్లీం బాలికల్ని విద్యకు దూరంచేస్తూ, ముస్లిం సంస్కృతీ సాంప్రదాలకు విరుధ్ధంగా  చట్టాలు తెస్తూ అంతిమంగా ముస్లింలను బలవన్మరణాల దిశగా నెట్టివేసే లక్ష్యంతో సాగుతున్న పరిణామాలను వివరిస్తుంది నశ్రీన్ ఖాన్ వ్యాసం ‘ఆకలితో హతమార్చే కుట్ర’.

 

ముస్లింల మీద రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో అప్రకటిత బహిరంగ వెలివేత ఒకటి సాగుతునద్దని అయినప్పటికీ ముస్లిం సమాజం అవేశానికి గురికాకుండ  ‘సహనమే విద్వేషాన్ని ఓడించే ఆయుధం’ గా భావించాలన్నారు  మహమ్మద్ అబ్బాస్.

 

మూడు రంగుల జాతీయ జెండా  నీడన నిలబడిఒళ్ళో  గాంధీజీ  అంబేడ్కర్ల  ఫొటోలు  పెట్టుకునిఒక  చేతితో  భారత  మతసామరస్య  రాజ్యాంగాన్ని  పట్టుకునిఇంకో చేతితో  పిడికిలి బిగించి   “న్యాయం,  స్వేఛ్ఛసమానత్వంసోదరభావం”  అంటూ  నినదిస్తూ ముస్లిం మహిళలు ఆరంభించిన షాహీన్ బాగ్ ఉద్యమం ఇంకా ముగియలేదన్నారు ‘షాహీన్ బాగ్ దాదీలకు సలాం’ వ్యాసంలో దాదా హయాత్.

సచిన్ టెండూల్కర్ ప్రేరణతో మన దేశంలో  క్రికెట్ పాపులారిటీ పెరిగినంతగా సానియా మీర్జా  వెలుగులోనికి వచ్చాక టెన్నిస్ పాపులారిటీ పెరగలేదు. వారసత్వాన్ని అందుకున్న ముస్లిం మహిళలు చాలా తక్కువ. . ఇప్పుడు  బంగారు బాక్సర్ నిఖత్ జరీన్ ముస్లిం మహిళలకు కొత్త ఇన్ స్పిరేషన్ గా మారిది.  ఈ నేపథ్యంలో పుట్టిన రజిత కొమ్ము కథ బాగుంది.

ప్రజల అధికారిణిగా పేరు తెచ్చుకున్న తస్లిమా ముహమ్మద్ సేవల్ని వివరిస్తూ స్కైబాబా రాసిన కథనం ఉత్తేజాన్ని ఇచ్చేదిగా వుంది. వర్తమాన ఢిల్లీ  రాజకీయాలకు కొంత కామెడీనీ, తెలంగాణ యాసనూ జోడిస్తూ  హుమయూన్ సంఘీర్ రాసిన ‘పయాంగాలు’ కొంచెం రిలీఫ్ ఇస్తుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ గురుకులాలవల్ల ముస్లిం విద్యార్ధులకు జరుగుతున్న ప్రయోజనాల మీద కే సీతారాములు నివేదిక అనేక విలువైన సమాచారాన్ని మనకు అందిస్తోంది. 

ముస్లిం ప్రముఖుల్ని పరిచయం చేసే శీర్షికలో ఈసారి హిందూపురానికి చెందిన సామాజిక కార్యకర్త ఉమమర్ ఫారూఖ్ ఖాన్ సేవల్ని వలి హుస్సేన్ పరిచయం చేశారు.

తొలి తెలుగు  ముస్లిం కథకులు షేక్ హూస్సేన్ సత్యాగ్నిని స్కైబాబా చేసిన ఇంటర్వ్యూలో   ఆసక్తికర అంశాలు అనేకం వున్నాయి.  రాజు దుర్గాని కథ ‘ఇంతెజార్ మే’ కూడ ఒక మంచి కథ.

 

ఇనాయతుల్లా ‘రోజాదర్గా’, వై కృష్ణ జ్యోతి ‘మతసామరస్యం నేటి అవసరం’, నిఖిత ఆర్ ఎస్ ‘మత సామరస్యతను ముస్లింల దగ్గరే నేర్చుకున్నాను’, వెంకటరామయ్య పద్యాల ‘దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో వున్నాయి’, సైకాలజిస్ట్ విశేష్ ‘ఈ మతోన్మాదం ఒక టెర్రరిజం కాదా?’ ‘మన మందరం ఒక కుటుంబం – ఈ భావన మతానికి అతీతమైనది’, విజయ ‘మూలం తల్లిదండ్రుల దగ్గరే వుంది’ మొదలయిన వ్యాసాలన్నీ మతసామరస్యం నేటి సామాజిక అవసరమనే వాస్తవాన్నీ అనేక రూపాల్లో మనకు వివరించారు.

తొలి ముస్లిం సంస్కర్త ఫాతిమా షేక్ మీద సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన పుస్తకాన్ని చల్లపల్లి స్వరూపరాణి సమీక్షించగా, కవి-కథకురాలు  షాజహానా  సంపాదకత్వంలో వచ్చిన ‘మొహర్’ సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, ఫర్హత్ నశ్రీన్ రాసిన ‘ది గ్రేట్ మొఘల్స్’ ను షేక్ మెహబూబ్ బాషా  సమీక్షించారు.

‘సియాసీ’ కాలమ్ లో జిలుకర శ్రీనివాస్ రాసిన ‘ముస్లిం సమాజంలో ‘ఆధునిక ఉద్యమం’ తప్పక చదవాల్సిన వ్యాసం.  ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఆధునికత, రాచరిక మతరాజ్యం, ప్రజాస్వామ్యం వగయిరా పదజాలాల నేరేటివ్స్ ఇప్పుడు మారిపోతున్నాయి. పెట్టుబడీదారీ వ్యవస్థ అప్పట్లో తన అవసరాల కోసం కొన్ని విలువల్ని ప్రచారం చేసింది; రాజకీయ నిర్మాణాల్నీ రూపొందించింది. దీనినే మనం గొప్పగా ఆధునికత అంటున్నాం. అదే పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త చారిత్రక సందర్భంలో చాలా నేర్పుగా  మతాన్ని ఆశ్రయిస్తున్నది. ప్రజ్వామిక ఎన్నికల ద్వార నియంతృత్త్వాన్ని చెలాయిస్తున్నది. మారిన సందర్భంలో ఈ వ్యాసాన్ని కొంచెం విపులంగా చర్చించాల్సివుంది. అయితే, భారత ముస్లిం సమాజం మీద ప్రేమతో రాసిన వ్యాసం ఇది.

లద్దాఫ్, నూర్ బాషా, దూదేకుల ముస్లింలకు బతికున్నప్పుడు ఉర్దూభాష,  చనిపోయక ఖబరస్థాన్  పెద్ద సమస్యలని వివరిస్తూ  రాసిన నూర్జహాన్ కథ ‘కిదర్’.

ఎయిడ్స్ కన్నా ఎక్కువగా  కరోనా భయపెట్టింది. తల్లిదండ్రుల్ని వదిలి పిల్లలు పారిపోవడమేకాదు  పిల్లల్ని వదిలి తల్లిదండ్రులు కూడ పారిపోయారు. దాదాపు అన్నిచోట్లా దిక్కులేని కరోనా శవాలకు అంత్యక్రియలు జరిపింది ముస్లిం యువతే. అలాంటి ఒక టీమ్ గురించి ఇందులో ఒక కథనం వుంది. దీన్ని ‘కరోనా జిహాద్’ అన్నవాళ్ళూ లేకపోలేదు.

ఇప్పుడపఃఉ సామాజికార్ధిక రాజకీయ సినిమా రంగాల్లో ‘సెలెక్టివ్ మెమొరి’ కొనసాగుతోంది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో తెరవని ఫైల్స్ వివరణ బాగుంది.

ఇక చివర్లో ‘భారత ముస్లింలతో మీడియా ఎలా వ్యవహరిస్తోంది?’ అనే నా వ్యాసం వుంది.

మొత్తమ్మీద ఒక ఉపయోగకరమైన ‘చమన్’ సంచిక ఇది.

July 24, 2022

No comments:

Post a Comment