Saturday, 21 June 2025

ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?

 సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురణార్ధం

 

*ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?* 

డానీ

సమాజ విశ్లేషకుల, 9010757776   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్టంగా 8 మాత్రమే గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్రప్రదేశ్ లో దాన్ని 9 గంటలకు పెంచారు.  ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. 

పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మ్యాన్‌పవర్ చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడ పెంచితే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరుతున్నాయి. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. 

ఇక్కడో విచిత్రం వుంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల  ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగుతాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు  సిబ్బంది మధ్య చాలా నగ్మంగా వివక్ష చూపడానికి సిధ్ధపడింది. 

ప్రభుత్వోద్యోగుల మీద కన్నతల్లి ప్రేమ, ప్రైవేటు శ్రామికుల మీద సవతితల్లి ప్రేమ చూపడం అనేది పని గంటలతో మాత్రమే ఆగడంలేదు. జీతభత్యాల్లో అసాధారణ వ్యత్యాసం వుంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన కూడ చేయలేదు. 

వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరకధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైధూనాలు వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి వుంటుంది. ఆ పిదప, కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ  ఆసక్తులు వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి వుంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి వుంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే  కనుక ఒక రోజులో వుండే 24 గంటల్లో  ఈ మూడు ధర్మాలకు  సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిధ్ధపడుతున్నాయి. ఇదొక అమానవీయ పరిణామం.

 ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పాదాయవర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగయిరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృధ్ధి చేస్తుండాలి.  వీటికయ్యే ఖర్చును కూడ ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం కూడ కావాలి. దానినే మనం సామాన్య భాషలో ప్రభుత్వ వుద్యోగులు అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ వుద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు.   

ఏపి ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్ధిక మంత్రి ఎనమల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ వుద్యోగ జీతభత్యాలు పెన్షన్లకు సరిపోతున్నదన్నారు.   

ఏ ప్రభుత్వం అయినాసరే రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటాయించినా 75 శాతం రాష్ట్ర అభివృధ్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడంలేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృధ్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి  వస్తున్నది. చివరకు పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే; ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల్ని మొత్తంగా  ప్రభుత్వ వుద్యోగుల జీతభత్యాలకు కేటాయిస్తున్నారు. ఈమాత్రం దానికి పన్నులు వసూలు చేయడం దేనికీ? ప్రభుత్వ  ఉద్యోగుల్ని పోషించడం దేనికీ? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.   

వృత్తి మీద ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి కార్యాలయంలో ప్రతి పనికి ఒక టారీఫ్ బుక్ వుంటుంది. దాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ నిజాయితీగా పనిచేసేవారు కూడ తప్పనిసరిగా వుంటారు. అయితే, అలాంటివారు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి. 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచీవాలయ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి రావడానికి సిధ్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారానికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడ ఏర్పాటు చేశారు. 12796 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిముషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిముషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్ లో బయలు దేరుతుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో  5.30 నిముషాలకు బయలు దేరి మంగళగిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం చెరో అరగంట పని సమయాన్ని తగ్గించాల్సిందే!. 

సచీవాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగజేసి పదేళ్ళు దాటుతోంది.  ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం?  ఎవరికయినా రావలసిన సందేహమే! 

22 జూన్ 2027

Saturday, 7 June 2025

Sudhakar - *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 

మావోయిస్టు సుధాకర్ (అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహా చలం / / TLNS చలం).  ఉద్యమంలో ఆనంద్, సోమన్న పేర్లతోనూ వున్నాడు. ఆయుర్వేద మెడిసిన్ విజయవాడలోనే చదివాడు.

 

ప్రతిష్టాత్మక  కృష్ణా జిల్లాలో సివోసి / పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్లుగా పెండ్యాల మల్లేశ్వర రావు, నేను, సుధాకర్ వరుసగా పని చేశాము.  మా ముగ్గురి వ్య్వహారశైలి భిన్నమైనది. ఉద్యమానికి మా కాంట్రిబ్యూషన్ కూడ భిన్నమైనది.

 

నేను ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతాను.

సుధాకర్ దానికి పూర్తిగా భిన్నం.

తక్కువ గొంతుతో చాలా సున్నితంగా మాట్లాడుతాడు.

ప్రత్యర్ధిని కూడ నచ్చచెప్పాలనుకుంటాడు.

అప్పట్లో కొంచెం బిడియస్తుడు కూడ.

 

తనూ కాకినాడ నాగమల్లేశ్వర రావు కొన్నాళ్ళు  - బహుశ 1978లో -రామచంద్రాపురంలో చదివారు.

అక్కడి బ్యాంకు ఉద్యోగి నిమ్మకాయల వీర రాఘవ వీళ్ళకు రాడికల్ సంబంధాలు కల్పించారు. 

ఆ తరువాత వీళ్ళిద్దరూ విజయవాడకు వచ్చారు.

 

ముందు మల్లేశ్వరరావు సివోసి/ పీపుల్స్ వార్ లో చేరాడు.  

తను నాకన్నా సీనియర్ సెంట్రల్ ఆర్గనైజర్. / సివో. 

మల్లేశ్వర రావును వేరే జిల్లాకు పంపించాక నేను ఆ స్థానంలోనికి వచ్చాను.

ఆ తరువాత చలం చేరాడు.  

 

మాకు గురువయిన వివి కృష్ణారావు 1979 చివర్లో సివోసి నుండి బయటికి వెళ్ళిపోయేనాటికి నేను రాడికల్ యూత్ లీగ్ కృష్ణాజిల్లా అధ్యక్షుడిని.

 

ఆర్ ఎస్ యూ తో సహా ఇతర ప్రజాసంఘాల బాధ్యతల్ని కూడ నేనే చూడాల్సి వచ్చింది. జిల్లా పార్టి బాధ్యతల్ని కూడ నేనే చూసేవాడిని. జిల్లా యూనిట్ కు అడహాక్ కార్యదర్శి.

 

1981 ఏప్రిల్ చివరి వరకు హోల్ టైమర్ గా వున్నాను.

 

నాకు చలం తోడయ్యాడు. తను స్టూడెంట్స్ వింగ్ ను చూసేవాడు.

 

ఇద్దరం విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి దగ్గర బాయ్స్ హాస్టలు జమీందార్ బిల్డింగ్స్ లో వుండేవాళ్ళం.  అది వామపక్షాల కోట.

 

ఓ అరవై చదరపు అడుగుల గది. ఒక చెక్క మంచం, ఒక చెక్క బల్ల, ఓ చెక్క కుర్చీ,ఓ 40 క్యాండిల్స్ బల్బు. ఇదీ మా వసతి.

 

నెలకు అద్దె 8 రూపాయలు. సబ్సిడీ రేటు.

అయినా నిత్యం మూడు నాలుగు నెలలు అద్దె బకాయి వుండేది.

అభిమానులు ఇచ్చిన పుస్తకాలు గదినిండా వుండేవి.

కడుపు నిండా ఆకలి వుండేది.

 

ఉదయాన్నే అద్దె బకాయి గురించి మమ్మల్ని తిట్టిపోసే హాస్టల్ మేట్రన్ సుందరమ్మ 10 గంటల తరువాత చల్లబడి అభిమానంతో ఉప్మా వండి పంపేది.

 

మా ఇద్దరి జీవితం గుణదల కొండతో ముడిపడి వుండేది. కొండకిందే జమీందార్ బిల్డింగు.

 

నగరంలో కొన్ని ఇళ్ళు, కొన్ని హొటళ్ళు మాకు ఉచితంగా భోజనం పెట్టేవి. ఒక్కోసారి అక్కడికి వెళ్ళడానికి సిటీ బస్సు టికెట్టు చార్జీలు కూడ వుండేవి కావు.

 

పుస్తకాలు చదవడం, సమావేశాల్లో మాట్లాడడం మాత్రమే పని.

ఆ తరువాత నేను ఎప్పుడూ అంతగా చదవలేదు.

 

పార్టీ పిసి సెక్రటరి ముక్కు సుబ్బారెడ్డి /రంగన్న, క్రాంతి పత్రిక ఇన్ చార్జి  ఎల్ ఎస్ ఎన్ మూర్తి  తరచూ వచ్చి కలిసేవారు. ఇతర జిల్లాల బాధ్యులు కలవడానికి కూడ అదే కేంద్రం.

 

మా కదలికల్ని పసిగట్టడానికి స్టేట్ ఇంటెల్లిజెన్స్, సెంట్రల్ ఇంటెల్లిజెన్స్ సిబ్బంది ఎవరో ఒకరు నిరంతరం మాచవరంలోనే తిరుగుతూ వుండేవాళ్ళు.

 

ఒక్కోసారి నేనే వాళ్లను పిలిచి డబ్బులు లేవుగానీ టీ తాగించండి అనేవాడిని. అదో కామెడి.

 

విప్లవోద్యమంలో ఇలాంటి కామెడీలు చాలా వుంటాయి.

అందుకే చాలామంది ఆ జీవితాన్ని ఆస్వాదిస్తారు.

 

1983లో నేను అజితను పెళ్ళి చేసుకునేవరకు జమిందార్ బిల్డింగ్ లోనే వున్నాము.

 

1980 చివర్లో ఒక పార్టి పంచాయితీ కోసం హైదరాబాద్ రాంనగర్ కు వెళ్ళినపుడు కుటుంబం కోసం హోల్ టైమర్ జీవితం నుండి బయటికి పోవాలి అని శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి లకు తెలిపాను.

ఆ సమావేశానికి చెలం కూడ వచ్చాడు.

 

చెలానికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాక మాత్రమే హోల్ టైమర్ జీవితం నుండి తప్పుకో మన్నారు.

 

ఆ శిక్షణ ఓ నాలుగైదు నెలలు సాగింది.

1981 మే 1న నేను హోల్ టైమర్ జీవితాన్ని ముగించాను.

సుధాకర్ జిల్లా పార్టి బాధ్యతలు తీసుకున్నాడు.

అక్కడి నుండి తన ఎదుగుదల చాలా వేగంగా సాగింది.

 

నేను తనకు గురువు అయినట్టు

అజితకు తను గురువు.

 

తల్లిదండ్రుల గొప్పతనాన్ని పిల్లలు నిరూపిస్తారు.

గురువుల గొప్పతనాన్ని శిష్యులు నిరూపిస్తారు.

 

కలేకూరి ప్రసాద్ కత వేరు.

తను బయట వుండి చావుని కొని తెచ్చుకున్నాడు.

చెలం లోపలుండి  చావుకు ఎదురెళ్ళాడు.

తనంటే నాకు కొంచెం గర్వంగా వుండేది.

 

విప్లవోద్యమంలో  నా కాంట్రిబ్యూషన్ కొంత వుందని చెప్పడానికయినా కొందరు మిగిలి వుండాలిగా.

వాళ్ళే నాకన్నా ముందే చనిపోతే

నా గొప్పలు నేనే చెప్పుకోవాలి.

అది చాలా హీనంగా వుంటుంది. 

 

నేను హోల్ టైమర్ జీవితం నుండి బయటికి వచ్చి ఆటోమోబైల్ రంగంలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు కారంచేడు సంఘటన జరిగింది.

 

కారంచెడు ఉద్యమంలో పనిచేయడానికి ఎవర్ని పంపించాలో ఆ పార్టికి అర్ధం కాలేదు.

ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. సఫలం కాలేదు.

 

నేనయితే బాగుంటుందని సుధాకర్  భావించాడు.

కారంచెడు ఇష్యూను నువ్వు సాల్వ్ చేయగలవు.

నువ్వు వెళ్ళి తీరాలి అని నన్ను తనే అడిగాడు.

నాక్కూడ ఆ ఛాలెంజ్ నచ్చింది.

మరొక్కసారి హోల్ టైమర్ గా మారాను.  

 

కారంచెడు ఉద్యమానికి ముందు అలాంటి ఒక్క ఉదాహరణ కూడ (precedent) లేదు.

అయినప్పటికీ ఆ ఉద్యమం చాలా గొప్పగా విజయవంతం అయ్యింది.

ఆ తరువాత కత వేరు.

 

నెమలూరి భాస్కర రావు / మల్లిక్ వంటి కపటి వచ్చాక నేను పీపుల్స్ వార్ తో సన్నిహితంగా కొనసాగలేకపోయాను. ఆ పార్టీ నుండి తప్పుకున్నాను.  

 

అయినా, వ్యక్తిగత స్థాయిలో కొందరితో పాత  అనుబంధం కొనసాగింది.

నేను బయటికి వచ్చాక కూడ పీపుల్స్ వార్ వాళ్ళు అడిగిన ఏ పనినీ కాదనలేదు.

అజితను ప్లీజ్ చేయడానికి కూడ కొన్ని పనులు చేసి పెట్టాను.

 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో  అక్టోబరులో శాంతిచర్చలకు వచ్చిన నక్సల్స్ ప్రతినిధి బృందంతో తను ఉపనాయకుడు. అప్పట్లో తను ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ AOB  జోనల్ కార్యదర్శిగా వుంటున్నాడు.

 

చర్చల కోసం వాళ్లందరూ శ్రీశైలం సమీపాన చినఆరుట్ల గ్రామం దగ్గర బయటికి వచ్చారు. ప్రభుత్వం కూడ చర్చల అనంతరం చినఆరుట్ల గ్రామం దగ్గరే వాళ్ళనును లాంఛనంగా దించేసింది. నిజానికి ఎవరి డెన్ లు వారికున్నాయి.

 

ఓరోజు రాత్రి చెలం ఫోన్ చేశాడు. తనను ఒరిస్సా ఆంధ్రా బోర్డర్ లోని తన డెన్ లో దించాలని అడిగాడు. నేను సరే అన్నాను. అజితతో పాటు వెళ్ళి అప్పర్ సీలేరు ప్రాంతలో దించి వచ్చాను.

 

ఆ మధ్య ఎవరో ఓ పాత రాడికల్ నన్ను పత్రికల్లో నాలుగు వ్యాసాలు రాస్తే పెద్దవాళ్లయిపోరు అని ఎద్దేవ చేశాడు.

 

అక్షరాలతోపాటు ఆయుధాలనూ సృష్టించాను అని గట్టిగా చెప్పాలనుకున్నాను.

అది చెప్పాల్సింది నేను కాదు. చెప్పాల్సినవాళ్లు చెప్పాలి.

ఇప్పుడు చెప్పాల్సిన వాడు చనిపోయాడు.

సుధాకర్ మరణం నాకు మామూలు నష్టంకాదు.

నా నైతికతే సంక్షోభంలో పడిపోయింది.

 

తల్లిదండ్రుల కళ్లముందే పిల్లలు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద మరోటి వుండదని అంటారు.

గురువుల కళ్ళముందే శిష్యులు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద వుండదు.

 

 

తను ఆయుధాల సేకరణ విభాగంలో వున్నాడని కొన్నేళ్ల క్రితం ఎవరో అన్నారు.

రాజకీయ అవగాహన  విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడని ఇంకోసారి విన్నాను.

మంచి వ్యూహకర్తగా మారాడని కొందరు చెప్పారు.  

కాబోయే జాతీయ కార్యదర్శి అన్నారు.

నా పొగరు కొంచెం పెరిగింది.

కానీ ఇప్పుడు అదంతా గతం అయిపోయింది.

 

మా అనుబందానికి ప్రతీక గుణదల కొండ.

రాత్రి గుణదల కొండెక్కి విజయవాడ అంతా వినిపించేలా గట్టిగా ఏడ్వాలనిపించింది.  

ఇప్పుడు నేను జమిందార్ బిల్డింగులోని డానీని కాను.

హిప్పోక్రాట్ అయిపోయాను.


తను బతకాలనుకున్నట్టే బతికాడు. చావాలనుకున్నట్టే చనిపోయాడు. ఇంతటి అదృష్టం కోటికి ఒక్కరికి కూడ దక్కదు. .


వీరుల మరణవార్తలు విన్నప్పుడు ముందు కొంచెం విషాదంగా ఉంటుంది. ఆ విషాదంలోనూ బోలెడు గర్వం ఉంటుంది.

 

*డానీ*

06 జూన్ 2025

తెలిసి తెలిసి ఒకే తప్పును పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?

 *తెలిసి తెలిసి ఒకే తప్పును*

*పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?*






మా భూమి సినిమాలోని ‘బండెనకబండికట్టి పదారు బండ్లు కట్టి’ పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన ఒరిజినల్ పాటకు పూర్తి వక్రీకరణ.
మనం ఘనంగా చెప్పుకునే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ సాగింది నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ జిల్లాల్లోని కొన్ని తాలుకాల్లో.
నల్గొండజిల్లాలో ఎర్రపహడ్ (సూర్యపేట) దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి ప్రధాన ప్రతినాయకులు.
ఆ ఉద్యమంలో చాలా కాలం నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రస్తావన లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం భారత దేశంలో చేరకుండ స్వతంత్ర్య దేశంగా వుండాలనుకున్న తరువాత, ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్ల ఆగడాలు మీతిమీరాక మాత్రమే సాహిత్యంలో అదీ చాలా అరుదుగా నైజాం నవాబు ప్రస్తావన వచ్చింది.
ఎర్రపహడ్ దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద నల్గొండజిల్లాకు చెందిన కవి-గాయకుడు-ఉద్యమకారుడు, అమరుడు బండి యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాట రాశాడు. ఆ పాట చరణాలు అన్నింటిలోనూ చివరి పంక్తిలో “నా కొడుక ప్రతాపరెడ్డి” అనే మకుటం పునరావృతం అవుతూ వుంటుంది.
మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా 1979 మార్చి 23న మా భూమి సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో సెన్సార్ బోర్డు అధికారిగా వున్నవారు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సెన్సార్ అధికారి వుండగా “నా కొడుక ప్రతాపరెడ్డి” అని పాట వుంటే సినిమా విడుదల కాదనో మరే కారణం చేతనో బండి యాదగిరి పాటను నిర్మాతలు మార్చేశారు. జెన్నారెడ్డి ప్రతాప రెడ్డిని కాపాడి “నా కొడుక ప్రతాపరెడ్డి” అని వున్న మకుటాన్ని ‘నైజాము సర్కరోడా!’గా మార్చేశారు.
అప్పటికే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయి పుష్కరం దాటింది. ఆయన సమాధి నుండి బయటికి వచ్చి”నేను తిరిగితే, 16 రోల్స్ రాయిస్ కారుల్లో హైదరాబాద్ వీధుల్లో కాన్వాయిగా తిరుగుతానేమోగానీ, ఎర్రపహాడ్ వీధుల్లో పదహారు ఎడ్లబండ్ల మీద ఎందుకు తిరుగుతానూ?” అని అభ్యంతరం చెప్పలేడని సినీ నిర్మాతల ధైర్యం కావచ్చు. నవాబ్ వారసులు, అభిమానులు ఎలాగూ తెలుగు సినిమాలు చూడరనే గట్టి నమ్మకం కూడ ఈ బరితెగింపుకు కారణం కావచ్చు.
ఈ వక్రీకరణ గద్దర్ చేశాడో, మరొకరు చేశారో బయటికి తెలీదు. కానీ ఇది గద్దర్ పాటగానే ప్రచారం అయ్యింది. గద్దర్ కూడ “నా కొడుక ప్రతాపరెడ్డి” మకుటంను తొలగించి ‘నైజాము సర్కరోడా!’ మకుటం వున్న పాటనే బహిరంగ సభల్లో పాడేవాడు. ఇది సంఘపరివారం సాగించే ముస్లిం వ్యతిరేక ప్రచారానికి చాలా అనుకూలంగా మారింది. ఆరెస్సెస్ నాయకులు నిజాం నవాబును తిట్టడానికి ‘గద్దర్ పాట’ను కోట్ చేయడం మొదలెట్టారు. ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు.
ఈరోజు మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) గారు మళ్ళీ వక్రీకరణ పాటనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కమ్యూనిస్టు పార్టీల విధేయులైన మేధావులు ఈ వివాదం మీద ఎక్కడయినా రాశారేమో నేను చదవలేదు. ఇతరులు ఒక్క అక్షరం తేడా రాసినా పోలీసుల్ని మించిన “ఇంటరాగేషన్” చేసే ఈ విధేయులు ఇంతటి వక్రీకరణనను కడుపులో దాచేసుకున్నారా! తెలీదు!
*డానీ*

మా భూమి సినిమా పాటలో పది అంశాలు

 *మా భూమి సినిమా పాటలో పది అంశాలు*




 

1.            ఎర్రపహడ్ దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాటరాశాడు. దీన్ని ఉద్యమ కాలంలో రాసి వుంటాడు.    

 

2.            అతనే నిజాం నవాబు మీద ‘నైజాము సర్కరోడ నాజీల మించినోడ’ పాట కూడ రాశాడు. దీన్ని స్వాతంత్ర్యానంతరం రాసివుంటాడు.   

 

3.            మాభూమి సినిమా కథ ప్రతాప రెడ్డి ఆవరణలో సాగుతుంది. పాట మాత్రం హఠాత్తుగా నిజాము ఆవరణ లోనికి  మారిపోతుంది. ‘బండెనక బండికట్టి’ పాట తలను తీసుకొచ్చి ‘నైజాము సర్కరోడ’ పాట మొండేనికి అతికించారు. వీక్షణం ఎన్ వేణుగోపాల్ భాషలో అక్కడి పల్లవిని తీసుకొచ్చి ఇక్కడి చరణాలకు జోడించారు.  

 

4.            యాదగిరి అటు  ఎర్రపహడ్  దొర‌ను ఇటు నైజాము సర్కారునూ విమర్శిస్తూ పాటలు రాశాడు. రాసిన సందర్భాలు వేరైనా ఆయన దృష్టిలో ఇద్దరూ దోషులే.

 

 

5.            సినిమా పాటలో ఎర్రపహడ్  దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డికి పూర్తిగా లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి నైజాము సర్కరోడిని మాత్రమే బోను ఎక్కించారు.

 

6.            ఇద్దరు వ్యక్తులు ఒకేరకం తప్పుచేసినా ఒకరికి లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి మరొకరికి  మాత్రమే శిక్ష వేసే మనుస్మృతి సాంప్రదాయం ఒకటి మనకు వుండింది.

 

7.             “ఆ పాట మీద వివాదం, లేనివి వెతకడానికి ప్రయత్నించడం అనవసరం” అని వేణుగోపాల్ హితవు కూడ పలికారు.

 

8.            వేణుగోపాల్ రైటప్ ఆ పురాతన శిక్షాస్మృతిని బాహాటంగా సమర్ధిస్తున్నది.

 

9.            వారి హితవు దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి సామాజికవర్గానికి అనుకూలంగానూ, నైజాము సర్కారు సామాజికవర్గానికి ప్రతికూలంగానూ వున్నది. ఇద్దరూ రెండు మతాలకు ప్రతినిధులు. మావోయిస్టుల్లో స్థాయి మేధావులుగా చెలామణి అవుతున్నవారు ఏ మత సమూహానికి లీగల్ ఇంప్యూనిటీ ఇస్తున్నారూ? ఏ మత సమూహాన్ని బోను ఎక్కిస్తున్నారూ? అనేదే ఈ వివాదానికి మూలం.  ఇది పాట మీద వివాదం మాత్రమేకాదు; మావోయిస్టుల సామాజిక దృక్పథాల మీద వివాదం.

 

10.    It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.

 

*డానీ*

05 జూన్ 2025