*మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*
మావోయిస్టు సుధాకర్ (అసలు పేరు తెంటు లక్ష్మీ
నరసింహా చలం / / TLNS చలం). ఉద్యమంలో ఆనంద్,
సోమన్న పేర్లతోనూ వున్నాడు. ఆయుర్వేద మెడిసిన్ విజయవాడలోనే చదివాడు.
ప్రతిష్టాత్మక కృష్ణా జిల్లాలో సివోసి / పీపుల్స్ వార్ సెంట్రల్
ఆర్గనైజర్లుగా పెండ్యాల మల్లేశ్వర రావు, నేను, సుధాకర్ వరుసగా పని చేశాము. మా ముగ్గురి వ్య్వహారశైలి భిన్నమైనది. ఉద్యమానికి
మా కాంట్రిబ్యూషన్ కూడ భిన్నమైనది.
నేను
ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతాను.
సుధాకర్
దానికి పూర్తిగా భిన్నం.
తక్కువ
గొంతుతో చాలా సున్నితంగా మాట్లాడుతాడు.
ప్రత్యర్ధిని
కూడ నచ్చచెప్పాలనుకుంటాడు.
అప్పట్లో
కొంచెం బిడియస్తుడు కూడ.
తనూ
కాకినాడ నాగమల్లేశ్వర రావు కొన్నాళ్ళు - బహుశ
1978లో -రామచంద్రాపురంలో చదివారు.
అక్కడి
బ్యాంకు ఉద్యోగి నిమ్మకాయల వీర రాఘవ వీళ్ళకు రాడికల్ సంబంధాలు కల్పించారు.
ఆ
తరువాత వీళ్ళిద్దరూ విజయవాడకు వచ్చారు.
ముందు
మల్లేశ్వరరావు సివోసి/ పీపుల్స్ వార్ లో చేరాడు.
తను
నాకన్నా సీనియర్ సెంట్రల్ ఆర్గనైజర్. / సివో.
మల్లేశ్వర
రావును వేరే జిల్లాకు పంపించాక నేను ఆ స్థానంలోనికి వచ్చాను.
ఆ
తరువాత చలం చేరాడు.
మాకు
గురువయిన వివి కృష్ణారావు 1979 చివర్లో సివోసి నుండి బయటికి వెళ్ళిపోయేనాటికి నేను
రాడికల్ యూత్ లీగ్ కృష్ణాజిల్లా అధ్యక్షుడిని.
ఆర్
ఎస్ యూ తో సహా ఇతర ప్రజాసంఘాల బాధ్యతల్ని కూడ నేనే చూడాల్సి వచ్చింది. జిల్లా పార్టి
బాధ్యతల్ని కూడ నేనే చూసేవాడిని. జిల్లా యూనిట్ కు అడహాక్ కార్యదర్శి.
1981
ఏప్రిల్ చివరి వరకు హోల్ టైమర్ గా వున్నాను.
నాకు
చలం తోడయ్యాడు. తను స్టూడెంట్స్ వింగ్ ను చూసేవాడు.
ఇద్దరం
విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి దగ్గర బాయ్స్ హాస్టలు జమీందార్ బిల్డింగ్స్ లో వుండేవాళ్ళం.
అది వామపక్షాల కోట.
ఓ
అరవై చదరపు అడుగుల గది. ఒక చెక్క మంచం, ఒక చెక్క బల్ల, ఓ చెక్క కుర్చీ,ఓ 40 క్యాండిల్స్
బల్బు. ఇదీ మా వసతి.
నెలకు
అద్దె 8 రూపాయలు. సబ్సిడీ రేటు.
అయినా
నిత్యం మూడు నాలుగు నెలలు అద్దె బకాయి వుండేది.
అభిమానులు
ఇచ్చిన పుస్తకాలు గదినిండా వుండేవి.
కడుపు
నిండా ఆకలి వుండేది.
ఉదయాన్నే
అద్దె బకాయి గురించి మమ్మల్ని తిట్టిపోసే హాస్టల్ మేట్రన్ సుందరమ్మ 10 గంటల తరువాత
చల్లబడి అభిమానంతో ఉప్మా వండి పంపేది.
మా
ఇద్దరి జీవితం గుణదల కొండతో ముడిపడి వుండేది. కొండకిందే జమీందార్ బిల్డింగు.
నగరంలో
కొన్ని ఇళ్ళు, కొన్ని హొటళ్ళు మాకు ఉచితంగా భోజనం పెట్టేవి. ఒక్కోసారి అక్కడికి వెళ్ళడానికి
సిటీ బస్సు టికెట్టు చార్జీలు కూడ వుండేవి కావు.
పుస్తకాలు
చదవడం, సమావేశాల్లో మాట్లాడడం మాత్రమే పని.
ఆ
తరువాత నేను ఎప్పుడూ అంతగా చదవలేదు.
పార్టీ
పిసి సెక్రటరి ముక్కు సుబ్బారెడ్డి /రంగన్న, క్రాంతి పత్రిక ఇన్ చార్జి ఎల్ ఎస్ ఎన్ మూర్తి తరచూ వచ్చి కలిసేవారు. ఇతర జిల్లాల బాధ్యులు కలవడానికి
కూడ అదే కేంద్రం.
మా
కదలికల్ని పసిగట్టడానికి స్టేట్ ఇంటెల్లిజెన్స్, సెంట్రల్ ఇంటెల్లిజెన్స్ సిబ్బంది
ఎవరో ఒకరు నిరంతరం మాచవరంలోనే తిరుగుతూ వుండేవాళ్ళు.
ఒక్కోసారి
నేనే వాళ్లను పిలిచి డబ్బులు లేవుగానీ టీ తాగించండి అనేవాడిని. అదో కామెడి.
విప్లవోద్యమంలో
ఇలాంటి కామెడీలు చాలా వుంటాయి.
అందుకే
చాలామంది ఆ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
1983లో
నేను అజితను పెళ్ళి చేసుకునేవరకు జమిందార్ బిల్డింగ్ లోనే వున్నాము.
1980
చివర్లో ఒక పార్టి పంచాయితీ కోసం హైదరాబాద్ రాంనగర్ కు వెళ్ళినపుడు కుటుంబం కోసం హోల్
టైమర్ జీవితం నుండి బయటికి పోవాలి అని శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి లకు తెలిపాను.
ఆ
సమావేశానికి చెలం కూడ వచ్చాడు.
చెలానికి
పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాక మాత్రమే హోల్ టైమర్ జీవితం నుండి తప్పుకో మన్నారు.
ఆ
శిక్షణ ఓ నాలుగైదు నెలలు సాగింది.
1981
మే 1న నేను హోల్ టైమర్ జీవితాన్ని ముగించాను.
సుధాకర్
జిల్లా పార్టి బాధ్యతలు తీసుకున్నాడు.
అక్కడి
నుండి తన ఎదుగుదల చాలా వేగంగా సాగింది.
నేను
తనకు గురువు అయినట్టు
అజితకు
తను గురువు.
తల్లిదండ్రుల
గొప్పతనాన్ని పిల్లలు నిరూపిస్తారు.
గురువుల
గొప్పతనాన్ని శిష్యులు నిరూపిస్తారు.
కలేకూరి
ప్రసాద్ కత వేరు.
తను
బయట వుండి చావుని కొని తెచ్చుకున్నాడు.
చెలం
లోపలుండి చావుకు ఎదురెళ్ళాడు.
తనంటే
నాకు కొంచెం గర్వంగా వుండేది.
విప్లవోద్యమంలో నా కాంట్రిబ్యూషన్ కొంత వుందని చెప్పడానికయినా కొందరు
మిగిలి వుండాలిగా.
వాళ్ళే
నాకన్నా ముందే చనిపోతే
నా
గొప్పలు నేనే చెప్పుకోవాలి.
అది
చాలా హీనంగా వుంటుంది.
నేను
హోల్ టైమర్ జీవితం నుండి బయటికి వచ్చి ఆటోమోబైల్ రంగంలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు
కారంచేడు సంఘటన జరిగింది.
కారంచెడు
ఉద్యమంలో పనిచేయడానికి ఎవర్ని పంపించాలో ఆ పార్టికి అర్ధం కాలేదు.
ఒకటి
రెండు ప్రయత్నాలు చేశారు. సఫలం కాలేదు.
నేనయితే
బాగుంటుందని సుధాకర్ భావించాడు.
కారంచెడు
ఇష్యూను నువ్వు సాల్వ్ చేయగలవు.
నువ్వు
వెళ్ళి తీరాలి అని నన్ను తనే అడిగాడు.
నాక్కూడ
ఆ ఛాలెంజ్ నచ్చింది.
మరొక్కసారి
హోల్ టైమర్ గా మారాను.
కారంచెడు
ఉద్యమానికి ముందు అలాంటి ఒక్క ఉదాహరణ కూడ (precedent) లేదు.
అయినప్పటికీ
ఆ ఉద్యమం చాలా గొప్పగా విజయవంతం అయ్యింది.
ఆ
తరువాత కత వేరు.
నెమలూరి
భాస్కర రావు / మల్లిక్ వంటి కపటి వచ్చాక నేను పీపుల్స్ వార్ తో సన్నిహితంగా కొనసాగలేకపోయాను.
ఆ పార్టీ నుండి తప్పుకున్నాను.
అయినా,
వ్యక్తిగత స్థాయిలో కొందరితో పాత అనుబంధం కొనసాగింది.
నేను
బయటికి వచ్చాక కూడ పీపుల్స్ వార్ వాళ్ళు అడిగిన ఏ పనినీ కాదనలేదు.
అజితను
ప్లీజ్ చేయడానికి కూడ కొన్ని పనులు చేసి పెట్టాను.
వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో అక్టోబరులో
శాంతిచర్చలకు వచ్చిన నక్సల్స్ ప్రతినిధి బృందంతో తను ఉపనాయకుడు. అప్పట్లో తను ఆంధ్రా-ఒరిస్సా
బార్డర్ AOB జోనల్ కార్యదర్శిగా వుంటున్నాడు.
చర్చల కోసం వాళ్లందరూ శ్రీశైలం సమీపాన చినఆరుట్ల
గ్రామం దగ్గర బయటికి వచ్చారు. ప్రభుత్వం కూడ చర్చల అనంతరం చినఆరుట్ల గ్రామం దగ్గరే
వాళ్ళనును లాంఛనంగా దించేసింది. నిజానికి ఎవరి డెన్ లు వారికున్నాయి.
ఓరోజు
రాత్రి చెలం ఫోన్ చేశాడు. తనను ఒరిస్సా ఆంధ్రా బోర్డర్ లోని తన డెన్ లో దించాలని అడిగాడు.
నేను సరే అన్నాను. అజితతో పాటు వెళ్ళి అప్పర్ సీలేరు ప్రాంతలో దించి వచ్చాను.
ఆ
మధ్య ఎవరో ఓ పాత రాడికల్ నన్ను పత్రికల్లో నాలుగు వ్యాసాలు రాస్తే పెద్దవాళ్లయిపోరు
అని ఎద్దేవ చేశాడు.
అక్షరాలతోపాటు
ఆయుధాలనూ సృష్టించాను అని గట్టిగా చెప్పాలనుకున్నాను.
అది
చెప్పాల్సింది నేను కాదు. చెప్పాల్సినవాళ్లు చెప్పాలి.
ఇప్పుడు
చెప్పాల్సిన వాడు చనిపోయాడు.
సుధాకర్
మరణం నాకు మామూలు నష్టంకాదు.
నా
నైతికతే సంక్షోభంలో పడిపోయింది.
తల్లిదండ్రుల
కళ్లముందే పిల్లలు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద మరోటి వుండదని అంటారు.
గురువుల
కళ్ళముందే శిష్యులు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద వుండదు.
తను
ఆయుధాల సేకరణ విభాగంలో వున్నాడని కొన్నేళ్ల క్రితం ఎవరో అన్నారు.
రాజకీయ
అవగాహన విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడని ఇంకోసారి
విన్నాను.
మంచి
వ్యూహకర్తగా మారాడని కొందరు చెప్పారు.
కాబోయే
జాతీయ కార్యదర్శి అన్నారు.
నా
పొగరు కొంచెం పెరిగింది.
కానీ
ఇప్పుడు అదంతా గతం అయిపోయింది.
మా
అనుబందానికి ప్రతీక గుణదల కొండ.
రాత్రి
గుణదల కొండెక్కి విజయవాడ అంతా వినిపించేలా గట్టిగా ఏడ్వాలనిపించింది.
ఇప్పుడు
నేను జమిందార్ బిల్డింగులోని డానీని కాను.
హిప్పోక్రాట్
అయిపోయాను.
తను బతకాలనుకున్నట్టే బతికాడు. చావాలనుకున్నట్టే చనిపోయాడు. ఇంతటి అదృష్టం కోటికి ఒక్కరికి కూడ దక్కదు. .
వీరుల మరణవార్తలు విన్నప్పుడు ముందు కొంచెం విషాదంగా ఉంటుంది. ఆ విషాదంలోనూ బోలెడు గర్వం ఉంటుంది.
*డానీ*
06
జూన్ 2025
No comments:
Post a Comment