*తెలిసి తెలిసి ఒకే తప్పును*
మా భూమి సినిమాలోని ‘బండెనకబండికట్టి పదారు బండ్లు కట్టి’ పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన ఒరిజినల్ పాటకు పూర్తి వక్రీకరణ.
నల్గొండజిల్లాలో ఎర్రపహడ్ (సూర్యపేట) దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి ప్రధాన ప్రతినాయకులు.
ఆ ఉద్యమంలో చాలా కాలం నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రస్తావన లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం భారత దేశంలో చేరకుండ స్వతంత్ర్య దేశంగా వుండాలనుకున్న తరువాత, ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్ల ఆగడాలు మీతిమీరాక మాత్రమే సాహిత్యంలో అదీ చాలా అరుదుగా నైజాం నవాబు ప్రస్తావన వచ్చింది.
ఎర్రపహడ్ దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద నల్గొండజిల్లాకు చెందిన కవి-గాయకుడు-ఉద్యమకారుడు, అమరుడు బండి యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాట రాశాడు. ఆ పాట చరణాలు అన్నింటిలోనూ చివరి పంక్తిలో “నా కొడుక ప్రతాపరెడ్డి” అనే మకుటం పునరావృతం అవుతూ వుంటుంది.
మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా 1979 మార్చి 23న మా భూమి సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో సెన్సార్ బోర్డు అధికారిగా వున్నవారు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సెన్సార్ అధికారి వుండగా “నా కొడుక ప్రతాపరెడ్డి” అని పాట వుంటే సినిమా విడుదల కాదనో మరే కారణం చేతనో బండి యాదగిరి పాటను నిర్మాతలు మార్చేశారు. జెన్నారెడ్డి ప్రతాప రెడ్డిని కాపాడి “నా కొడుక ప్రతాపరెడ్డి” అని వున్న మకుటాన్ని ‘నైజాము సర్కరోడా!’గా మార్చేశారు.
అప్పటికే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయి పుష్కరం దాటింది. ఆయన సమాధి నుండి బయటికి వచ్చి”నేను తిరిగితే, 16 రోల్స్ రాయిస్ కారుల్లో హైదరాబాద్ వీధుల్లో కాన్వాయిగా తిరుగుతానేమోగానీ, ఎర్రపహాడ్ వీధుల్లో పదహారు ఎడ్లబండ్ల మీద ఎందుకు తిరుగుతానూ?” అని అభ్యంతరం చెప్పలేడని సినీ నిర్మాతల ధైర్యం కావచ్చు. నవాబ్ వారసులు, అభిమానులు ఎలాగూ తెలుగు సినిమాలు చూడరనే గట్టి నమ్మకం కూడ ఈ బరితెగింపుకు కారణం కావచ్చు.
ఈ వక్రీకరణ గద్దర్ చేశాడో, మరొకరు చేశారో బయటికి తెలీదు. కానీ ఇది గద్దర్ పాటగానే ప్రచారం అయ్యింది. గద్దర్ కూడ “నా కొడుక ప్రతాపరెడ్డి” మకుటంను తొలగించి ‘నైజాము సర్కరోడా!’ మకుటం వున్న పాటనే బహిరంగ సభల్లో పాడేవాడు. ఇది సంఘపరివారం సాగించే ముస్లిం వ్యతిరేక ప్రచారానికి చాలా అనుకూలంగా మారింది. ఆరెస్సెస్ నాయకులు నిజాం నవాబును తిట్టడానికి ‘గద్దర్ పాట’ను కోట్ చేయడం మొదలెట్టారు. ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు.
ఈరోజు మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) గారు మళ్ళీ వక్రీకరణ పాటనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కమ్యూనిస్టు పార్టీల విధేయులైన మేధావులు ఈ వివాదం మీద ఎక్కడయినా రాశారేమో నేను చదవలేదు. ఇతరులు ఒక్క అక్షరం తేడా రాసినా పోలీసుల్ని మించిన “ఇంటరాగేషన్” చేసే ఈ విధేయులు ఇంతటి వక్రీకరణనను కడుపులో దాచేసుకున్నారా! తెలీదు!
*డానీ*
No comments:
Post a Comment