Wednesday, 29 May 2024

Maabhoomi Song - Gaddar Controversy

 పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి! 

A.m. Khan Yazdani Danny

March 21, 2024 · 


పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి!

ఒకవైపు రెడ్ది ముఖ్యమంత్రికి, ఇంకో వైపు  రెడ్ది సెన్సార్ బోర్డు డైరెక్టరుకు భయపడి  ప్రతాపరెడ్డిని నైజము సర్కారోడను చేశారు. 

ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డి (నల్గొండ జిల్లా) విసునూరు దొర రాంచంద్రారెడ్డి (వరంగల్  జిల్లా) అనుకుంటా. ఈ పాట పుట్టింది నల్గొండ జిల్లాలో. అప్పటి పోరాటానికి నైజాం నవాబు అసలు లక్ష్యమేకాదు. అంతటి విస్తృతీ లేదు. 

నిజాం నవాబు  హైదరాబాద్ నగర వీధుల్లో 16 ఎడ్లబండ్లు కట్టుకుని  తిరుగుతుంటాడని మెదడు వున్నవాడు ఎవరయినా రాస్తారా? పాట ఒరిజినల్ లో కవి-గాయకుడు-కార్యకర్త  యాదగిరి అలాంటి తప్పు చేయలేదు.  

ప్రతాప రెడ్డి పేరు తీసి నిజాం నవాబు పేరు పెట్టాలనుకున్నప్పుడు 16 ఎడ్లబండ్లు తీసి 16 రోల్స్ రాయిస్ కార్లు అని పెడితే కొంచెం అతికేది.

March 21, 2024 · 


*తెలిసి తెలిసి ఒకే తప్పును*

*పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?* 

*ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు*. 




*తెలిసి తెలిసి ఒకే తప్పును*

*పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?*

 

మా భూమి సినిమాలోని ‘బండెనకబండికట్టి పదారు బండ్లు కట్టి’ పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన ఒరిజినల్  పాటకు పూర్తి వక్రీకరణ. 

          మనం ఘనంగా చెప్పుకునే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ సాగింది నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ జిల్లాల్లోని కొన్ని తాలుకాల్లో.  

నల్గొండజిల్లాలో ఎర్రపహడ్ (సూర్యపేట) దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి ప్రధాన ప్రతినాయకులు. 

ఆ ఉద్యమంలో చాలా కాలం నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రస్తావన లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం భారత దేశంలో చేరకుండ  స్వతంత్ర్య దేశంగా వుండాలనుకున్న తరువాత, ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్ల ఆగడాలు మీతిమీరాక మాత్రమే సాహిత్యంలో అదీ చాలా అరుదుగా నైజాం  నవాబు ప్రస్తావన వచ్చింది.  

ఎర్రపహడ్  దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద నల్గొండజిల్లాకు చెందిన కవి-గాయకుడు-ఉద్యమకారుడు, అమరుడు బండి యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాట రాశాడు. ఆ పాట చరణాలు అన్నింటిలోనూ  చివరి పంక్తిలో  “నా కొడుక ప్రతాపరెడ్డి” అనే మకుటం పునరావృతం అవుతూ వుంటుంది.  

మర్రి  చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా 1979 మార్చి 23న మా భూమి సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో సెన్సార్ బోర్డు అధికారిగా వున్నవారు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. 

రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సెన్సార్ అధికారి వుండగా నా కొడుక ప్రతాపరెడ్డి” అని పాట వుంటే సినిమా విడుదల కాదనో మరే కారణం చేతనో బండి యాదగిరి పాటను నిర్మాతలు మార్చేశారు. జెన్నారెడ్డి ప్రతాప రెడ్డిని  కాపాడి నా కొడుక ప్రతాపరెడ్డి” అని వున్న మకుటాన్ని ‘నైజాము సర్కరోడా!’గా మార్చేశారు. 

అప్పటికే  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయి పుష్కరం దాటింది. ఆయన సమాధి నుండి బయటికి వచ్చి”నేను తిరిగితే, 16 రోల్స్ రాయిస్ కారుల్లో హైదరాబాద్ వీధుల్లో కాన్వాయిగా తిరుగుతానేమోగానీ, ఎర్రపహాడ్ వీధుల్లో పదహారు ఎడ్లబండ్ల మీద ఎందుకు తిరుగుతానూ?” అని అభ్యంతరం చెప్పలేడని సినీ నిర్మాతల ధైర్యం కావచ్చు.  నవాబ్ వారసులు, అభిమానులు ఎలాగూ తెలుగు సినిమాలు చూడరనే గట్టి నమ్మకం కూడ ఈ బరితెగింపుకు కారణం కావచ్చు. 

ఈ వక్రీకరణ గద్దర్ చేశాడో, మరొకరు చేశారో బయటికి తెలీదు. కానీ ఇది గద్దర్ పాటగానే ప్రచారం అయ్యింది. గద్దర్ కూడ “నా కొడుక ప్రతాపరెడ్డి” మకుటంను తొలగించి ‘నైజాము సర్కరోడా!’ మకుటం వున్న పాటనే బహిరంగ సభల్లో పాడేవాడు. ఇది సంఘపరివారం సాగించే ముస్లిం వ్యతిరేక  ప్రచారానికి చాలా అనుకూలంగా మారింది. ఆరెస్సెస్  నాయకులు  నిజాం నవాబును తిట్టడానికి ‘గద్దర్ పాట’ను కోట్ చేయడం మొదలెట్టారు.  ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు. 

ఈరోజు మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) గారు మళ్ళీ వక్రీకరణ పాటనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. 

కమ్యూనిస్టు పార్టీల విధేయులైన మేధావులు ఈ వివాదం మీద ఎక్కడయినా రాశారేమో నేను చదవలేదు. ఇతరులు ఒక్క అక్షరం తేడా రాసినా పోలీసుల్ని మించిన “ఇంటరాగేషన్” చేసే ఈ విధేయులు ఇంతటి వక్రీకరణనను కడుపులో దాచేసుకున్నారా! తెలీదు! 

*డానీ*

4 జూన్ 2025 



Ramesh Hazari

సార్... బండి యాదగిరి రాసిన పాట ఇది కాదని మీకూ తెలవదా
ఒరిజినల్ సాంగ్
"బండేనుక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే పోతవ్ కొడుకో... నాకొడక ప్రతాప్ రెడ్డి.."
దొరల పీడన ను ఎదిరించే నేపథ్యంలో ఎర్రబాడు ( సూర్యాపేట) దొర జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి మీద ఆ ప్రాంత కవి బండి యాదగిరి రాసిన పాట.. అది.
బండెనుక బండి పదహారు బండ్లు ... అనాటి దొరలు కచ్చురాలు కట్టుకుని పోయేవాళ్ళు...
సుట్టు ముట్టు సూర్యాపేట....(ఎర్రబాడు సుట్టు ).. నువుండేది హైదరాబాద్ ( ప్రతాప్ రెడ్డి ఉండేది) ..

దీన్ని... సినిమా కోసం మార్చి రాసిండ్రు... రజాకర్ల మీద కోపమో మరో కారణమో కానీ... అట్లా మార్చడం... తెలంగాణ సమాజానికి గంగా జమునా తేహజీబ్ విషయంలో నష్టమే చేసిందనీ చెప్పొచ్చు..

ఒరిజినల్ సాంగ్ ఇదీ 👇

బండెనక బండి గట్టీ
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్ల పోతావ్ కొడుకో
నా కొడుక ప్రతాపరెడ్డి

దొడ్లన్నీ కాలిపాయే
ఎడ్లన్నీ ఎల్లిపాయ
ఇకనైనా లజ్జ లేదా
నా కొడకా ప్రతాపరెడ్డి

గొల్లోల్ల గోర్లు ఒడిసె
రైతుల బియ్యమొడిసె
ఇక ఏమీ తింటావు కొడుకో
నా కొడకా ప్రతాపరెడ్డి

పెద పంది సూరిగాడు
చిన్న పంది మల్లిగాడు
మీ ఇద్దరిని తింటాం కొడుకో
నా కొడకా ప్రతాపరెడ్డి

Sai Vamshi

 March 21, 2024 · · 

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

... యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ఆర్.నారాయణమూర్తి గారు 'వీరతెలంగాణ' సినిమా తీసి, అందులో బండి యాదగిరి గారి 'బండెనక బండి కట్టి' పాట వాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ పాట జనాన్ని ఎంత ఉత్తేజితుల్ని చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

బండెన్క బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి

ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా

నాజీల మించినవ్‌రో దేశ్‌ముఖ్ దొరగాడా

దేశ్‌ముఖ్‌లు, దొరలు నిజాం రాజుకంటే తక్కువేమీ కాదన్న అర్థం ఇందులో ఉంది. సినిమాలో ఈ పాట నారాయణమూర్తి గారి మీదే చిత్రీకరించారు. యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలో ఏది ఎలా వాడాలో ఆయనకు తెలుసుగా!(ఆ పాటను గద్దర్ గారి గొంతులో మీరు విని తీరాలి. ఆహా! అదొక అనుభవం. 'మాభూమి' సినిమాలో ఉంది).

అదే నారాయణమూర్తి గారు 'రజాకార్' సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చి నిజాం రాజ్యంలో రజాకార్లు చేసిన అన్యాయాల గురించి వివరించారు. హైదరాబాద్ స్టేట్‌కు ముస్లింలు, హిందువులు రెండు కళ్లు అన్నారు. ముస్లింలు అల్లానే పూజిస్తారు, క్రైస్తవులు క్రీస్తునే పూజిస్తారు, హిందువులు మాత్రం చర్చిలు, దర్గాలకు వెళ్తారని గొప్పగా చెప్పారు. హిందువులు చర్చిలు, దర్గాలకు వెళ్లడమేమిటి నాన్సెన్స్ అనుకున్నారేమో, ఆ కార్యక్రమంలో కొందరు ఆ మాటలకు అరిచారు. ఆయన వారిని కసిరి ప్రసంగం కొనసాగించారు. 

ఇన్ని చెప్పారు సరే, మరి దొరలు, భూస్వాముల దురాగతాల గురించి ఒక్క విషయమూ చెప్పలేదే? గడీల్లో వెట్టి చాకిరీ గురించి మాట్లాడలేదే? 'ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా' అనే లైన్ పాడలేదు ఎందుకు? రజాకార్లు అనేవాళ్లు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు, ఏయే ప్రాంతాలకు వెళ్లారు అనే వివరాలు తెలిసిన ఆయనకు అసలైన చరిత్ర తెలియదా? విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలు, కంఠాత్మకూర్‌ గడీ అన్యాయాలు, కడవెండిలో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అక్రమాలకు ఎదురుతిరిగి, రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు చేసిన దొడ్డి కొమరయ్య హత్య.. ఇవన్నీ మరిచారా? అందరూ అమాయకులైపోయారా?

పటేల్ ప్రధాని కాకుండా నెహ్రూ అడ్డుకున్నాడనే మాట గుర్తున్న నారాయణమూర్తి గారికి, భారతదేశంలో విలీనం అనంతం తెలంగాణలోని పేదల భూములు ఏమయ్యాయో తెలియదా? ఎవరి అధీనంలోకి వెళ్ళాయో గుర్తులేదా? 'రజాకార్' సినిమాకి చాలా ఏళ్ల ముందే వచ్చిన 'మాభూమి', 'దాసి' సినిమాలు చూడలేదా? వాటిలో నిజాలు కళ్లకు కట్టలేదా? బాలింతల పాలు పిండింది ఎవరో తెలియదా? ఇంత చరిత్ర మరిచారా? ఆ దొరలే బాలింతల పాలు పిండించినట్లు 'వీరతెలంగాణ' సినిమాలో చూపించారే! తేడా ఎక్కడ జరిగింది?

జనం చూస్తూ చూస్తూ ఉంటే చివరకు సినిమా స్టూడియోల్లో కల్పనాత్మక చారిత్రక పాఠాలు, సినిమా స్ర్కిప్ట్‌లలో వండి వార్చిన దేశభక్తి ప్రపత్తులు పెరుగుతాయి. వాటిని చూసి జనం ఎంత ఊగితే, అవతల కాసులు, ఓట్లు అన్ని రాలతాయి. అది సత్యం! తెలియనివారు ఇదిగో ఇలా తమకు తెలిసిన చరిత్రను తెలియనట్టే మర్చిపోతారు. 

అన్నట్టు, 'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? అసలు ఎప్పుడైనా ఆ సినిమా చూశారా? ముందు వెళ్ళి చూసి రండి.

- విశీ(వి.సాయివంశీ) 


No comments:

Post a Comment