Wednesday 17 June 2015

ఢిల్లీ అబ్ బహుత్ దూర్ హై!!

ఢిల్లీ అబ్ బహుత్ దూర్ హై!!
ఉషా యస్ డానీ

ప్రజాజీవితంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్నవాళ్ల మీద ఆరోపణలు రావడం కొత్తకాదు. అలాంటప్పుడు వాళ్ళు రెండు పనులు  చేయాలి. మొదటిది, తమను నమ్మి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించిన ప్రజలకు ఘటనల పూర్వాపరాలను వివరించి, తమవల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన తప్పులకు క్షమాపణలు కోరడం. రెండోది, న్యాయప్రక్రియకు సిద్ధపడటం. తన మీద, తన పార్టీ మీద బలమైన ఆరోపణలు వచ్చినపుడు నిర్వర్తించాల్సిన ప్రాణప్రదమైన కర్తవ్యాల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారు.

ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజాకోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నారు.

న్యాయకోవిదులు కోర్టుల్లో సకల మోళీలు, గారడీలను ప్రదర్శించి సూది బెజ్జమంత రంధ్రంలోంచి ఏనుగుల్లాంటి దోషుల్ని బయటపడేస్తుంటారు. కథను చాలా మంది చదివే ఉంటారు. మహారాణితప్ప మరెవరూ ఏడు గుర్రాల బగ్గీని వాడకూడదని ఇంగ్లండులో ఒక చట్టం ఉండేది. ఒకడెవరో ఏడు గుర్రాల బగ్గీలో లండన్ వీధుల్లో తిరిగితే, అరెస్టు చేసి బోనెక్కిస్తారు. తెలివైన అతని లాయరు ఏడోది గుర్రం (హార్స్) కాదనీ, ఆడ గుర్రం (మేర్) అని నిరూపించి తన కక్షిదారుడ్ని నిర్దోషిగా బయటపడేస్తాడు. చట్టంలో ఇలాంటి ఒక్క సాంకేతిక రంధ్రాన్నయినా కనిపెట్టి కేసు నుండి బయటపడాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

 లాయర్ల సలహాల మేరకు కొందరు నిందితులు బోనెక్కాక అనేక ప్రశ్నలకుకాదు’ ‘తెలీదువంటి జవాబులతో, మౌనంతో దాటవేస్తారు. లీగల్ కోర్టులో చేసి నట్టు ప్రజాకోర్టులోనూ టెక్నికల్గా వ్యవహరించడమే చంద్రబాబు ప్రత్యేకత. ఆయన అచ్చమైన హైటెక్కు నేత!

రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల మీద, వాటిలో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ, ప్రాంతీయ, కులసమీకరణల మీద రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. అంశాలపై నోరు తెరవడానికి బాబు సిద్ధంగా లేరు. మౌనం అర్థాంగీకారం అవుతుందని గుర్తించే స్థితిలోనూ లేరు. క్లిప్పింగుల పుట్టుక చట్టబద్ధంగానే సాగిందా? ఒక సీఎం మీద మరో రాష్ట ఏసీబీ స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపింగులు చేయడం చట్టసమ్మతమా? వగైరా సాంకేతిక అంశాల మీదనే ఉంది వారి ధ్యాసంతా.

ఏపీకి రావలసిన రాయితీలు, సౌకర్యాలు, వెసులుబాటులు, జాతీయ స్థాయి విద్యా, వైద్య, సాంకేతిక సంస్థలు, మౌలికరంగ పథకాలు చాలా ఉన్నాయి. రాయలసీమను, ఉత్తరాం ధ్రలో మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. వీటి సాధనకు చంద్రబాబు పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వారి పోరాటం తనను గెలిపించిన ఏపీ ప్రజల కోసం కాదు... హైదరాబాద్లో గవర్నర్కు విశేషాధికారాల సాధన కోసం. ఇదో రాజకీయ వైచిత్రి!

 ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇప్పుడు రెండు విరుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒకైవైపు, గవర్నర్ తన విశే షాధికారాలను ప్రయోగించాలని ఏపీ సీఎం  ప్రాధేయపడుతుంటే, మరోవైపు, గవర్నర్ను నెత్తిన పెట్టుకుని తెలంగాణ సీఎం తిరుగుతున్నారు. ఢిల్ల్లీలోనూ దాదాపు ఇదే సీన్. ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లినా జరగని పనులు తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లకపోయినా జరిగిపోతున్నాయి. బాబు ఢిల్ల్లీ పర్యటనలో ఉండగానే తెలంగాణలోని యాదాద్రి-వరంగల్ నాలుగు లేన్ల రోడ్డు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది!
  
 ప్రధాని నరేంద్ర మోదీ అచ్చమైన గుజరాతీ వ్యాపారి. చంద్రబాబు ఆస్థి ఖాతా అనుకుంటే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు... వ్యయం ఖాతా అనుకుంటే పలకరించడానికీ ఆసక్తి చూపరు. ఇలాంటి విషయాలను రాష్ర్టస్థాయిలోనే పరిష్కరించుకోవాలేగానీ ఢిల్లీ వరకు తేకూడదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అనడం ఢిల్లీలోని కొత్త పరిణామాలకు ఒక సంకేతం. మోదీ ప్రభుత్వానికి ఏపీ  రాయబారిగా ఉంటున్న వెంకయ్య నాయుడు కూడా కష్టకాలంలో బాబుతో అంటీ ముట్టనట్ట్టుగా ఉంటున్నారు. ఢిల్లీలో మోదీతో చంద్ర బాబు ఏం మాట్లాడారో గానీ.. హైదరాబాద్ తిరిగి రాగానే ప్రధానికి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రధానితో వివరంగా మాట్లాడే అవకాశం బాబుకు దక్కలేదని ఇది సూచి స్తోంది. చంద్రబాబుకు ఢిల్ల్లీ అబ్ బహుత్ దూర్ హై!!


చంద్రబాబు లేఖ ప్రధాని కార్యాలయానికి చేరక ముందే...హైదరాబాద్లో ఆంధ్రులకు భద్రత లేదనడం చంద్రబాబు అపోహేనంటూ లేఖలోని ప్రధాన అంశాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్రెడ్డి ఖండించారు. కేసీఆర్తో పాటు చంద్రబాబు కూడా యోగా శిబిరా నికి వచ్చి మానసిక వత్తిడిని దూరం చేసుకోవాలని హితవు చెప్పారు. యోగముద్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ఒకవేళ స్పందించినా అది బాబుకు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. మిత్రపక్షాలు కూడా చంద్రబాబుకు దూరం అవుతున్నాయనడానికి ఇవన్నీ సంకేతాలు కావచ్చు.

 (రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)

 మొబైల్: 9010757776

Highlights
ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజాకోర్టు ఈపాటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించేసిందిఇక లీగల్ కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడడానికున్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయసలహాదారులూ ఇప్పుడు పగలూ రాత్రి మేధోమధనం  చేస్తున్నారు.

హైదరాబాద్
14-7-2015

(4300 Characters  With Spaces)

 ప్రచురణ : సాక్షి దినపత్రిక 17-6-2015 


No comments:

Post a Comment