Monday 24 August 2020

Unity of Oppressed groups and integration of the liberation theories

 Unity of Oppressed groups and integration of the liberation theories

అణగారిన సమూహాల ఐక్యత;

విముక్తి సిధ్ధాంతాల సమన్వయం

డానీ        

(Statutory Warning : ఈ వ్యాసాన్ని పిల్లలకు దూరంగా వుంచండి. పిల్లలు జడుసుకునే ప్రమాదం వుంది.)     

         సమాజంలో  ఆర్థిక అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం మార్క్సిజం. సమాజంలో  కుల అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం అంబేడ్కరిజం. సమసమాజ నిర్మాణమే రెండు సిధ్ధాంతాల లక్ష్యమూ గమ్యమూ కనుక వాటి మధ్య అతి సహజంగానే ఒక తాత్విక ఐక్యత వుంది. తాత్విక ఐక్యత సామాజిక ఐక్యతకు దారితీస్తుంది. అలాగే,  సామాజిక ఐక్యత కూడ తాత్విక ఐక్యతకు దారి తీస్తుంది. విశ్వంలో ఏదైనా అలాగే మాత్రమే  కాక  తద్విరుధ్ధంగానూ జరుగుతుంది అనేది గతితార్కిక చారిత్రక భౌతికవాద కీలక సూత్రం. కార్ల్ మార్క్స్ అయితే అనేక సందర్భాలో ‘vice versa’ అనేవాడు. పునాది ఉపరితలాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒక సూత్రీకరణ అయితే, తద్విరుధ్ధంగా ఉపరితలం కూడ పునాదిని ప్రభావితం చేస్తుంది. గతితర్కం అంటేనే పరస్పర ప్రతిచర్య.

 పునాది è ఉపరితలంè పునాది

సమాజం è సాహిత్యం è సమాజం

సామాజిక ఐక్యతè తాత్విక ఐక్యతè సామాజిక ఐక్యత

ఇలా వుంటాయి గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రీకరణలు.

           సమాజంలోని అణగారిన సమూహాల మధ్య కూడ  వైరుధ్యాలుంటాయి. అవి తమ మధ్యన గల వైరుధ్యాలను క్రమంగా పక్కన పెట్టి అణిచివేత ప్రాతిపదికగా ఏకం అవుతుంటాయి. బాధ, వేదన వాళ్లను ఏకం చేస్తుంది. అయితే ప్రతి సమూహానికీ ఒక ప్రత్యేక విముక్తి సిధ్ధాంతం వుంటుంది. బౌధ్ధిక రంగంలో ఆ సిధ్ధాంతాల మధ్య ఒక  ఘర్షణ కొనసాగుతూ వుంటుంది. అణగారిన సమూహాల ఆలోచనాపరులు చేయాల్సిన మొదటి పని ఏమంటే ఆ సిధ్ధాంతాల మధ్యన ఒక సమన్వయాన్ని సాధించడం. అయితే, ఏ కాలంలో అయినా ఏ సమాజంలో అయినా సమన్వయం సహించని ఆలోచనాపరులు కూడ వుంటారు. వాళ్లు మిత్రవైరుధ్యాలని  భూతద్దంలో పెట్టి శతృవైరుధ్యాలుగా చిత్రిస్తుంటారు. దాని ఫలితంగా శతృవైరుధ్యాలు మిత్రవైరుధ్యాలుగా  పరిణమిస్తాయి.

           సమాజంలో ఆర్థిక యజమానులు, ఆర్థిక శ్రామికులు వున్నట్టే, సాంస్కృతిక యజమానులు,  సాంస్కృతిక శ్రామికులు కూడ వుంటారు. ఆర్థిక యజమానులు, సాంస్కృతిక యజమానుల మధ్య ఎలాగూ ఒక ఐక్యత వుంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఆర్థిక శ్రామికులు, సాంస్కృతిక శ్రామికులు ఏకం అవ్వాల్సి వుంటుంది. అలాంటి ఐక్యతకు అడ్డుపడితే సాంస్కృతిక శ్రామికులు వెళ్ళి సాంస్కృతిక యజమానులు, ఆర్థిక యజమానుల పంచన చేరుతారు.  సామాన్య భాషలో చెప్పాలంటే కార్పొరేట్లకు, యజమాని కులాలకు మధ్య ఎలాగూ ఐక్యత వుంటుంది. వాళ్లకు వ్యతిరేకంగా శ్రామికులు, ఎస్సీ, బిసి తదితర శ్రామిక కులాలు ఏకం కావల్సి వుంటుంది. వాళ్ళు ఏకం కాకుండా అడ్డుపడితే ఎస్సీ, బిసి తదితర శ్రామిక కులాలు వెళ్ళి మనువాదులతో, కార్పొరేట్లతో కలుస్తాయి. వర్తమాన భారత సమాజంలో ఈ పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి.   

           బహుజన రచయితల వేదిక (బరవే), బామ్సేఫ్ ల నాయకులు సత్యం కొల్లాబత్తుల ‘బాబాసాహెబ్ అంబేద్కర్ - మార్క్స్ వాద మిత్రుడేకాని భారతదేశ మార్క్సిస్టుల మిత్రుడుకాదు’ అనే శీర్షికతో ఇటీవల ఒక వ్యాసం రాశారు.  రాసింది బరవే, బామ్సేఫ్ ల నాయకులు కనుక  వ్యాసాన్ని చాలా శ్రధ్ధగా చదివాను. ప్రతిపాదించిన  ప్రతి అంశాన్నీ సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

           బహుజన కులాలకూ మనువాద కులాలకు మధ్యగల వైరుధ్యమే భారత సమాజంలో ప్రధాన వైరుధ్యం” అని సత్యం చేసిన  సూత్రీకరణ  గొప్ప ఆసక్తిని కలిగించింది. “(1.) బుద్ధుని శాంతియుత మార్గంలో (2.) ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించి (3) మనువాద కుల ఆధిపత్యాన్ని కూలదోసి (4) సమ సమాజాన్ని ఏర్పాటు చెయ్యాలి”  అని  వారు అందులో  ఒక కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

           అనేకమంది అంబేడ్కరిస్టులు చాలా కాలంగా తమ కార్యక్రమం (program) కులనిర్మూలన అని అంటున్నారు. మార్క్సిస్టులకు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ ప్రామాణికం అయినట్టు అంబేడ్కరిస్టులకు ‘కులనిర్మూలన’ పుస్తకం ప్రామాణికం అని కత్తి పద్మారావు వంటివాళ్ళు చెప్పి వున్నారు. అయితే, అంబేడ్కరిస్టులకు నాలుగు దశల కార్యక్రమం వుందని ఇంతకు ముందు ఎవరూ ఇంత స్పష్టంగా చెప్పలేదనుకుంటాను. ఆ పని సత్యం చేశారు.  Satyam deserves appreciation.

           సామాజిక రాజకీయ సిధ్ధాంతాల్ని ఎప్పుడయినా రెండు స్థాయిల్లో విశ్లేషణ చేయాలి.  మొదటిది, సామాజిక స్థాయి. రెండోది, ఆ సిధ్ధాంతాన్ని ఆశ్రయించిన రాజకీయ పార్టీలు ఆచరించిన వ్యూహాలు ఎత్తుగడలు. ఈ అంశం సత్యం వ్యాసంలో కలగాపులగంగా వుంది.

           ఎంఎల్ పార్టీలతోసహా భారత కమ్యూనిస్టు పార్టీలన్నీ అనేక చారిత్రక మలుపుల్లో అనేక తప్పులు చేసి ప్రజల మద్దతును చాలా వరకు కోల్పోయాయి. దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం బాగా  తగ్గింది. భారత దేశంలో  అంబేడ్కరిస్టు పార్టీలు, అంబేడ్కరిస్టు నాయకులు సహితం తక్కువ తప్పులు చేయలేదు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పుల్ని మాత్రమే ప్రస్తావించిన సత్యం అంబేడ్కరిస్టు పార్టీలు, అంబేడ్కరిస్టు నాయకులు చేసిన తప్పుల్ని విశాల హృదయంతో మన్నించేశారు; లేదా కష్టపడి కప్పిపెట్టారు.

           ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కొన్ని అంబేడ్కరిస్టు పార్టీలు / అంబేడ్కరిస్టు నాయకులు సత్యం చెప్పే ‘మనువాద’ పార్టీలతో జతకట్టాయి. ఏపీలో కూడ పవన్ కళ్యాణ్ జనసేనతో  అంబేడ్కరిస్టు బిఎస్పీ జతకట్టిందనే వాస్తవాన్ని సత్యం ఎలా  మరిచిపోయారో అర్థం కాదు. జనసేన అంతకు ముందూ మనువాద పార్టీలతోనే పొత్తులో వుంది. ఆ తరువాతా మనువాద పార్టీలతోనే పొత్తులో వుంది. ఏపిలో వుభయ కమ్యూనిస్టు పార్టీలు కూడ ఇదే తప్పు చేశాయి.  వర్తమాన పరిణామాలనే గుర్తించలేని వారికి సుదీర్ఘ చారిత్రక పరిణామాల్ని విశ్లేషించగల సామర్థ్యం వుంటుందని  అనుకోవడం కష్టం. 

           ఈ వ్యాసంలో ఇంకా అనేకానేక superficial formulations వున్నాయి. సామాజిక సైధ్ధాంతిక విశ్లేషణ చేసే ఆసక్తికన్నా గట్టున కూర్చుని ఆట చూసేవారిని అలరించే (addressing the gallery) ఆసక్తి ఈ వ్యాసంలో ఎక్కువగా కనిపించింది. ఇలాంటి ధోరణి తెలుగు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో బాగుంటాయి. సత్యం వ్యాసంలోని అన్ని అంశాల్ని కాకపోయినా కొన్ని కీలక అంశాలను అయినా పరిశీలించాల్సి వుంది.

           మాగ్నా కార్టా మీద సంతకం చేశాక 13వ శతాబ్దంలో బ్రిటన్ లో పార్లమెంటరీ వ్యవస్థ నెలకొంది. Declaration of 1789 నుండే ఫ్రాన్స్ లో పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడింది. 1857 తరువాత బ్రిటీష్ పార్లమెంటు నేరుగా భారత కాలనీని పాలించడం మొదలెట్టింది. అంటే మనం ఆనాడే   పార్లమెంటు వ్యవస్థలో అంతర్భాగం అయ్యాము. 1892లో దాదాభాయి నౌరోజి భారతదేశం నుండి బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ – 1935 ప్రకారం 1936 చివర్లో భారత గడ్డ మీద ప్రావిన్షియల్ ఎన్నికలు జరిగాయి. ప్రావిన్షియల్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

           ఈ సందర్భంగా ఆలోచనాపరులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే  శ్రామికవర్గం విప్లవం ద్వార సోషలిస్టు సమాజాన్ని సృష్టిస్తుంది అనే ఒక సరికొత్త సామాజిక విముక్తి సూత్రాన్ని కార్ల్ మార్క్స్ 1847లో ఆవిష్కరించాడు (invention). బహుజనులు రాజ్యాధికారాన్ని చేపట్టడానికి బాబాసాహెబ్   అంబేడ్కర్ పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నారు (selection). ఆవిష్కరించడం, కనుగొనడం (discovery), ఎంచుకోవడం అనేవి స్థాయీ బేధంగల మూడు వేరువేరు చర్యలు. అప్పటికి కొనసాగుతున్న పార్లమెంటరీ పంథాను తిరస్కరించి విప్లవ పంథాను కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టాడు. బాబాసాహెబ్ కొత్తగా కనిపెట్టిన పంథా అంటూ ఏమీలేదు. మార్క్స్ సూచించిన విప్లవ పంథాను తిరస్కరించి బ్రిటీష్ వలస పాలకులు ప్రవేశపెట్టిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయానికే కట్టుబడాలని అంబేడ్కర్  సూచించారు.  కుల మత తెగ లింగ వివక్ష లేకుండ  యుక్తవయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం (Universal suffrage, universal franchise) భారత రాజ్యాంగపు గొప్ప ప్రజాస్వామిక ఆదర్శాల్లో ఒకటి. భారత లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం నేటి తక్షణ కర్తవ్యం.  

           బ్రిటన్ లో 1893 నుండి Independent Labour Party వుంది. అది అక్కడి Labour Partyకి చంకలో పిల్లగా వుండేది. 1975లో అది తల్లి సంస్థ  అయిన Labour Partyలో విలీనం అయిపోయింది. బ్రిటన్ నుండి భారత రాజకీయాల్లోనికి కాంగ్రెస్ దిగుమతి అయినట్టే Independent Labour Partyని  అంబేడ్కర్ 1936లో ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. 1942లో దాన్ని రద్దు చేసి Scheduled Castes Federationను ఆరంభించారు. అదే 1956లో రిపబ్లికన్ పార్టిగా రూపాంతరం చెందింది. అంబేడ్కర్ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన ఈ మూడు దశల్లోనూ శ్రామికులు, ఎస్సీలు అనే భావన వుంది. అయితే,  ‘బహుజనులు’ అనే కాన్సెప్ట్ వాటిల్లో అప్పటికి లేదనిపిస్తోంది. బహుజనులు అనే కాన్సెప్ట్ ను 1970లలో  ‘బామ్ సెఫ్’ ద్వార, 1980లలో ‘బిఎస్పి’ ద్వార  కాన్షీరామ్ ముందుకు తెచ్చారు. అయితే, ఈ బహుజన కాన్సెప్ట్ ను తన ఆచరణ ద్వార దెబ్బకొట్టింది కూడ కాన్షీరామే కావడం విచిత్రం!

           ఉత్తరప్రదేశ్ లో 1990ల ఆరంభంలో బిసిల రాజకీయ వేదిక అయిన ఎస్పీ, ఎస్సీల రాజకీయ వేదిక అయిన బిఎస్పిల మధ్య ఒక పొత్తు ఏర్పడింది. ఇది అచ్చమైన బహుజన రాజకీయ పొత్తు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలలోనూ ఈ పొత్తుకు సానుకూల ప్రభావం కనిపించింది. (1994లో ‘ఇప్పుడు వీస్తున్న గాలి కాన్షీరామ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నేను కవర్ పేజి వ్యాసం రాశాను).  అయితే ఆ పొత్తు ఆ ఉత్సాహం ఓ రెండేళ్ళలో ఆవిరైపోయింది. 

           ఉత్తరప్రదేశ్ లో 1996 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలోని బిజెపికి 174 సీట్లు వచ్చాయి. ములాయం సింగ్ నాయకత్వంలోని ఎస్పీకి 110 సీట్లు వచ్చాయి, మాయావతి (కాన్షీరామ్ ) నాయకత్వంలోని బిఎస్పీకి 67 సీట్లు వచ్చాయి. హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఐదు నెలల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. బిసి ములాయం సింగ్ కు ఎస్సీ మాయావతి మద్దతివ్వాలా? లేక ఎస్సీ మాయావతికి  బిసి ములాయం సింగ్ మద్దతివ్వాలా? అనే చర్చ సుదీర్ఘ కాలం దేశమంతటా  సాగింది. చివరకు బిజేపి మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. మరోమాటల్లో చెప్పాలంటే అంబేడ్కరిస్టులు మనువాదులతో నేరుగా ‘ఎన్నికల అనంతర పొత్తు’ కుదుర్చుకున్నారు. “ఇది అవకాశవాదంకాదు; ఎస్సీలకు  వేల సంవత్సరాల తరువాత దక్కిన అవకాశం” అని ఆరోజు మాన్యవార్ కాన్షీరామ్ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. 

           ఆ ప్రకటన ప్రభావంతో మైనారిటీలు, బిసిలు అతి సహజంగానే బిఎస్పీకి దూరం కావడం మొదలెట్టేరు. బిఎస్పీలో చేరి మనువాదుల్ని పరోక్షంగా సమర్ధించడం కన్నా, నేరుగా బిజేపిలో చేరి కీలక పదవుల్ని చేజిక్కించుకోవచ్చనే ఆలోచనలు బిసిల్లో మొదలయ్యాయి. ఆ క్రమంలోనే బిసి సామాజికవర్గానికి చెందిన నరేంద్ర మోదీజీ బిజేపి పక్షాన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత భారత ప్రధాని అయ్యారు.  గుజరాత్ మారణ హోమంలో ఎస్సీలు, బిసీలు నిర్వర్తించిన కరసేవ గురించి తెలియనివారు ఇప్పుడు ఎవ్వరూ వుండరు. నరేంద్ర మోదీజీ పిఎంఓ ప్రస్తానానికి బీజాలు ఉత్తర ప్రదేశ్ లో బిఎస్పీ, బిజేపిల మధ్య  1996 ఎన్నికల అనంతరం ఏర్పడిన పొత్తులో వున్నాయి అనంటే అతిశయోక్తికాదు. ఎస్సిల్ని కాన్షీరామ్ మనువాదులకు దగ్గర చేస్తే, మనువాదులకు దగ్గరయ్యే మార్గాల్ని బిసిలు వెతుక్కున్నారు. బిసిలు లేని లోటును తీర్చుకోవడానికి ఇప్పుడు మాయావతి బ్రాహ్మణ సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రతీ చర్యకూ తద్విరుధ్ధమైన సమానమైన ప్రతి చర్య వుంటుందనే భౌతిక శాస్త్ర సూత్రం సమాజానికీ వర్తిస్తుంది; రాజకీయాలకూ వర్తిస్తుంది.      

          సత్యం వ్యాసంలో కాన్షీరామ్ ప్రస్తావన అనేకసార్లు వుంది గనుక మాన్యవార్ రాజకీయాల్ని కొంచెం వివరంగా  విశ్లేషించాల్సి వచ్చింది. ఇటీవలి కాలం వరకూ మహా అంబేడ్కరిస్టులుగా పోజులు కొట్టిన లోక్ జనశక్తి నాయకులు రామ్ విలాస్ పాశ్వాన్, రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఎ) నాయకుడు రాందాస్ అథవాలే, All India Confederation of SC/ST Organizations నాయకుడు ఉదిత్ రాజ్ తదితరులు సంఘపరివారానికి, మనువాద పార్టీలకు అందించిన, అందిస్తున్న కరసేవల గురించి అందరికీ క్షుణ్ణంగా తెలుసు కనుక వాటిని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనిపించింది. 

          ఎస్సీల ఓట్ల కోసం కమ్యూనిస్టు పార్టీలు అంబేడ్కర్ ను దగ్గరకు తీసుకునే కపట ప్రయత్నం చేస్తున్నాయనేది సత్యం వ్యాసంలో ప్రధాన అరోపణ. సామాజిక, రాజకీయ రంగాల్లో  ఈ సత్యానికి తెలియాల్సిన మొదటి సత్యం  ఏమంటే అంబేడ్కర్ ను ఈరోజు మరింత దగ్గరకు తీసుకుంటున్నది మనువాదులే అని. రెండవ సత్యం ఏమంటే, అంబేడ్కర్ ఫొటో పెట్టుకునే రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకిక స్వభావాన్ని తొలగించే ప్రయత్నాలను సాగిస్తున్నది కూడ మనువాదులే అని. మూడవ సత్యం ఏమంటే, బిఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు ఉత్తర ప్రదేశ్ లో ‘గణేశు’నిగా మారి చాలా కాలం అయిందనీ.  నాలుగవ సత్యం ఏమంటే, ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి శ్రీరాముని విగ్రహంకన్నా ఎత్తైన పరశురాముని విగ్రహాన్ని నిర్మించడానికి భాయి ములాయం సింగ్, బహెన్ మాయావతి పోటీలు పడుతున్నారు అని. ఐదవ సత్యం ఏమంటే, ఉత్తరప్రదేశ్ లో దళిత బ్రాహ్మణ ‘భాయిచార’ (సోదరభావం) కోసం బహెన్ జీ రేయింబవళ్ళు కృషిచేస్తున్నారని. ఇదంతా ‘కల్తీలేని’ అంబేడ్కరిజం అని వారంటే మనం చేయగలిగింది ఏమీలేదు. ఆరవ సత్యం ఏమంటే, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ – అంబేడ్కర్ విరచిత ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’లో కమ్యూనిస్టులు చాలా క్రియాశీలంగా పాల్గొన్నారు అని. 

          బహుజనులందరూ కమ్యూనిస్టు పార్టీల్లో చేరి మోసపోయారనడం ఒక అవాస్తవ ప్రకటన.  దేశ జనాభాలో 85 శాతంగా వున్న బహుజనులందరూ కాకపోయినా అందులో మూడో వంతు అంటే 30 శాతం మంది గట్టిగా  మద్దతు ఇచ్చినా కమ్యూనిస్టు పార్టీలు ఏనాడో కేంద్రంలో అధికార పార్టీలుగా మారి వుండేవి. 1952 లోక్ సభ ఎన్నికల్లో నెహ్రు నాయకత్వంలోని కాంగ్రెస్ కు 4 కోట్ల 77 లక్షల ఓట్లు వచ్చాయి. ఏకే గోపాలన్ నాయకత్వంలోని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి 34 లక్షల 84 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 45 శాతం. కమ్యూనిస్టు పార్టికి 3.29శాతం ఓట్లు వచ్చాయి. ఈ 3.29 శాతం ఓట్లలో బహుజనుల ఓట్లు ఎన్ని? సత్యం చెప్పిన ‘మనువాద కులాల’ ఓట్లు ఎన్నీ?  ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను 1957లో ముఖ్యమంత్రిని చేసిన  కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  కమ్యూనిస్టు పార్టికి వచ్చిన ఓట్లు 35.28 శాతం మాత్రమే. 

          అమిత్ షా మాటల్లో ‘మూడవ పానిపట్టు (మత)యుధ్ధం’గా సాగిన 2019 సాధారణ ఎన్నికల్లో బిఎస్పీకి పడిన ఓట్లు 3.68 శాతం, సిపిఐ (ఎం)కు పడిన ఓట్లు 1.75 శాతం. సిపిఐకి పడిన ఓట్లు 0.58 శాతం. వుభయ కమ్యూనిస్టులకు పడిన 2.33 శాతం ఓట్లలో యజమాని కులాల ఓట్లు ఎన్నీ? బహుజనుల ఓట్లు ఎన్నీ?   మూడు పార్టీలకు కలిపి మొత్తంగా పడిన 6 శాతం ఓట్లు పోగా మిగిలిన 79 శాతం బహుజనుల ఓట్లు ఎక్కడికి పోయినట్టూ? ఏదైనా చెప్పేటప్పుడు ఒకసారి గణాంకాలు చూసుకుని మాట్లాడాలి. సత్యం చెప్పినవన్నీ సత్యాలు కాదు.

          కమ్యూనిస్టు పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిలు ఎక్కువ మందే వున్నారుకానీ; ఎస్టీ, ఎస్సీ, బిసిల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీల్లో లేరు. పోనీ వాళ్ళు  బహుజన పార్టీల్లో వున్నారా? అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టి  ఆవిర్భవించాక బిసిలు అటువైపు మళ్ళారు. ఎస్సీల్లోని ఒక పాయ కాంగ్రెస్ లో వుంటే ఇంకో పాయ టిడిపికి మద్దతుగా వుండేది. అచ్చంగా ఎస్సీల కోసమే పుట్టిన రిపబ్లికన్ పార్టి కాంగ్రెస్ కు తోకలా వుండేదంటే కొందరు మిత్రులకు అభ్యంతరాలు వుండవచ్చు. రిపబ్లికన్ పార్టి నాయకులు కన్నమరాజ కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామికి ఒళ్ళో పిల్లాడిలా వుండేవారంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు,  ఆర్పీఐ, బిఎస్పీ, బిఆర్పి, మహాజన ఫ్రంట్ వగయిరా బహుజన పార్టీలన్నింటికి కలిపి ఏ ఎన్నికల్లోనూ 2, 3 శాతానికి మించి ఓట్లు పడలేదు. మొత్తం ఓటర్లలో 85 శాతంగా వున్న బహుజనుల్లో ఓ 3 శాతం బహుజన పార్టీలకు, ఇంకో 2 శాతం కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. మిగిలిన 80 శాతం బహుజనులు (వీళ్లు మొత్తం బహుజనుల్లో 94 శాతం) కమ్యూనిస్టేతర, బహుజనేతర మనువాద పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇది ఇప్పటివరకు కొనసాగుతున్న బహుజన ఓటింగ్ సరళి.  ఇదీ అసలు విషాదం. ముందుగా పట్టించుకోవాల్సిన విషయం ఇది.           

          మనువాద పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిల స్థితిగతులు అనే అంశాన్ని సత్యం చాలా కన్వీనియంట్ గా దాట వేశారు. ఇది మేధో దివాళా కోరుతనం. బహుజన సమాజంలో  94 శాతం ఓట్లు మనువాద పార్టీలకు పడుతున్నా సత్యానికి అభ్యంతరం లేదు. ఈ అంశానికి సంబంధించి వారి మొత్తం వ్యాసంలో ఒక్క వాక్యం కూడ లేదు.  కానీ, ఓ 2 శాతం ఓట్లు కమ్యూనిస్టులకు పడడం మీదనే వారికి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఇదీ ఈ అంబేడ్కరిస్టు ఆలోచనాపరుని సామాజిక చైతన్యం.   

          కమ్యూనిస్టు ఉద్యమాల్లో చనిపోయినవారిలో అన్ని కులాలకు అన్ని తెగలకు, అన్ని మతాలకు చెందినవారు వున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసిలు మాత్రమే చనిపోయారనడం చరిత్రను అడ్దగోలుగా వక్రీకరించడమే అవుతుంది.  ఈ సందర్భంగా Ammar Ali Jan రచన ‘Study in the Formation of Communist Thought in India’ను సత్యం ఉటంకించారు. ఈ పుస్తకంలో పాక్షిక సామాజిక వాస్తవాలు మాత్రమే వున్నాయి. 

          ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన సామాజికవర్గాలకు తరువాతి కాలంలో ఒక సామాజిక పెట్టుబడి (social capital) ఏర్పడుతుంది. అలాంటి సామాజిక పెట్టుబడి బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే దక్కిందనే అభిప్రాయం కొందరిలో వుంది. నిజానికి ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన శ్రామిక కులాలకు కూడ సోషల్ కేపిటల్  ఏర్పడుతుంది. అలా సోషల్ కేపిటల్ దక్కడం వల్లనే కమ్యూనిస్టు శిబిరాల నుండి బయటికి వచ్చినవారే తరువాతి కాలంలో ఉనికివాద సిధ్ధాంతకర్తలు, నాయకులు కాగలిగారు. తరువాతి కాలంలో ప్రధాన స్రవంతీ రాజకీయ పార్టీల్లో చేరడానికి వాళ్ళకు గతకాలపు ‘కమ్యూనిస్టు శిక్షణ’ ఒక అర్హతగా మారింది. కాంగ్రెస్, బిజేపి శిబిరాల నుండి శ్రామిక కులాల్లో ఉనికివాద సిధ్ధాంతకర్తలు ఎందుకు రాలేదు? అనేది సత్యాన్వేషకులు అడగాల్సిన మొదటి  ప్రశ్న. 

          ఎస్సీ, బీసీ  సమూహాలను దృష్టిలో పెట్టుకుని సత్యం కులం అనేది ప్రధాన సమస్య అంటున్నారు. ఇటీవలి కాలంలో బిసీలు క్రమంగా అంబేడ్కరిజానికి దూరం అవుతూ మనువాద పార్టీలకు వేగంగా దగ్గరవుతున్న విషయాన్ని వారు గమనించే వుంటారు.  ఎస్సీల తక్షణ సమస్య అస్పృశ్యత, మూకోన్మాద దాడులు (untouchability and lynching). అంబేడ్కరిస్టులు మార్క్సిస్టులు మాత్రమే కాదు ప్రజాస్వామికవాదులు ఎవరయినా ముందు ఆ దురాచారాన్ని, ఆ దాడుల్ని గట్టిగా వ్యతిరేకించాలి. 

           మరోవైపు, దేశ జనాభాలో ఎస్సీలతో సమానంగా వున్న ముస్లింలకు కులం అనేది ప్రధాన  సమస్యకాదు; వాళ్ళ సమస్య మతం, మూకోన్మాదం. ఈ రెండింటినీ సత్యం  పరిగణన లోనికి తీసుకోలేదు. ఎస్టీలకు కూడ కులం మతం రెండూ సమస్యలు కావు; వాళ్ల సమస్య తెగ. మహిళలకు కులం, మతం, తెగ కూడ సమస్యలు కావు. వాళ్ళ సమస్య లింగం (జెండర్). ఎస్సీల కుల సమస్య పరిష్కారంకాగానే మైనారిటీల మతసమస్య, ఎస్టీల తెగ సమస్య, మహిళల లింగ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని ‘మొరటు కమ్యూనిస్టు’ల తరహాలో సత్యం కూడ ప్రకటనలు చేయరని నమ్ముతున్నాను. 

          సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవంలో “బుద్ధుని శాంతియుత మార్గంలో” చేరాలనే ముందస్తు షరతు ఒకటి వుంది. చనిపోవడానికి ఏడు వారాల ముందు 1956 అక్టోబరు 14న  బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌధ్ధమతాన్ని స్వీకరించారు. మాన్యవార్ కాన్షీరామ్ కూడ 2006 అక్టోబరు 14న బౌధ్ధమతాన్ని స్వీకరించాలని భావించారు. అయితే అంతకు ముందే వారు చనిపోయారు. కేంద్రంలో బిఎస్పీ అధికారానికి వచ్చాక తాను బౌధ్ధమతాన్ని స్వీకరిస్తానని బహెన్ మాయావతి ప్రకటించియున్నారు. ఉదిత్ రాజ్ అయితే బౌధ్ధాన్ని కూడ తీసుకెళ్ళి మనువాదంతో రాజకీయ హానీమూన్ సాగించారు. ఇప్పుడయితే వారు కాంగ్రెస్ లో వున్నారు. అది వేరే కథ. 

          శ్రీలంక, మయన్మార్ లలో అతి క్రూర నిరంకుశ పాలనను చూశాక కూడ బహుజనులు బౌధ్ధాన్ని స్వీకరించాలని బామ్సెఫ్ నేత షరతు విధించడం ఆశ్చర్యకరం. ఇలాంటి మత మార్పిడి ప్రతిపాదనని ముస్లిం, క్రైస్తవ, శిక్కు మతమైనారిటి సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇప్పటి బిసి సామాజికవర్గాలు సహితం బౌధ్ధాన్నీ ఆమోదిస్తాయని భావించడం కష్టం. అంచేత, సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. బుధ్ధుని ప్రస్తావనను పక్కన పెట్టి ‘పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథా’లో అని ఆ వాక్యాన్ని మారిస్తే బామ్సెఫ్ ప్రతిపాదనను పరిశీలనకు స్వీకరించవచ్చు. 

          సాంప్రదాయ అంబేడ్కరిస్టులు, మార్క్సిస్టులు ఓ డెభ్భయి ఏళ్ళుగా కులం, వర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కొట్లాడుకుంటున్నారు. ఆ పంచాయితి ఇంకా తేలలేదు. ఈ డెభ్భయి యేళ్ళ కాలంలో అణిచివేతకు గురయ్యే అనేక సమూహాలు వెలుగులోనికి వచ్చాయి. Class, Caste, Religion, Tribe, Race, Gender, Colour, Disability, Physical Appreance, Sexuality etc etc వంటి ఎన్నో రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని ఎవరు పట్టించుకోవాలీ?           

        సమాజంలో అనేక సమూహాలు, సామాజికవర్గాల మీద అనేక రూపాల్లో దోపిడీ అణిచివేతలు కొనసాగుతున్నాయని ముందు మనం గమనించాలి. దోపిడీ అణిచివేతకు గురయ్యే ప్రతి సమూహానికీ తమ విముక్తికి సంబంధించిన ఒక ప్రత్యేక సిధ్ధాంతం వుంటుందని కూడ మనం గుర్తించాలి. ఇది Intersectionality. ఇలాంటి చైతన్యం ఈరోజు మనకు చాలా అవసరం. ముందు అణగారిన సమూహాలన్నీ ఏకం కావాలి. అణిచివేతకు గురవుతుండడమే వాళ్ళ మధ్య ఐక్యతకు పునాది.  ఆ సామాన్యాశంతోనే వారు ఏకం అవుతారు. వుమ్మడి ప్రయోజనాల కోసం వివిధ శక్తుల మధ్య ఐక్యసంఘటన ఏర్పడడం తొలి అడుగు. ఆ తరువాత అణగారిన సమూహాల విముక్తి సిధ్ధాంతాల మధ్య ఒక సమన్వయం, సంయమనం ఏర్పడాలి. అణగారిన సమూహాల మధ్య ఐక్యత, వాటి సిధ్ధాంతాల మధ్య సమన్వయం ఒక క్రమంలో ఏర్పడుతాయని ఇప్పటి పరిస్థితిలో ఊహించడం కూడ కష్టమే కావచ్చు. మనం ఇప్పుడు ఊహించలేని అనేక గుణాత్మక పరిణామాలు చారిత్రక అవసరాల రీత్యా  జరుగుతాయి. “మార్క్స్ ను అంబేడ్కర్ తో కల్తీ కానివ్వం”, “అంబేడ్కర్ ను మార్క్స్ తో కల్తీ కానివ్వం” వంటి ఛాందస వాదనలు భేషజాలు ఆరోజు దూది పింజాల్లా గాలికి కొట్టుకుపోతాయి.   ఆ తరువాత సమైక్య విముక్తి పోరాటం ఆరంభం అవడం కూడా ఒక చారిత్రక అవసరమే. అది పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథాలోనే సాగుతుందని ఆశిధ్ధాం. ఆ మార్గంలో సకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోతే ఇతర మార్గాల్ని పరిశీలించే ఆప్షన్ ఎలాగూ వుంటుంది.

           సిఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ, డిటెన్షన్ సెంటర్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మొదలయిన – ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు, మహిళలు, శ్రామికులు, ఇతర అణగారిన సమూహాలు, మతసామరస్యవాదులు, పౌర-మానవ హక్కుల కార్యకర్తలు, సామ్యవాదులు,  కమ్యూనిస్టులు, ఫూలేఇస్టులు ఇంకా ఇంకా అనేకులు ఐక్యమై పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని మన ముందుకు తెచ్చింది. ఆరోజు భారత లౌకిక రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించారు. ఈరోజు భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు అంబేడ్కర్ సిధ్ధాంతం నాయకత్వం వహించాలి. భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి సర్వసేనాధిపతి బాబాసాహెబ్ అంబేడ్కర్.  

 హైదరాబాద్

25 ఆగస్టు 2020


No comments:

Post a Comment