Tuesday, 14 January 2025

Happy Birthday Agitha

 అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు !



 

అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు !
ఇప్పటి కులమత సమీకరణల లోతైన విభజన వాతావరణంలో మాది పెద్దలు నిర్ణయించిన పెళ్ళి అంటే చాలామందికి నమ్మశక్యంగా వుండకపోవచ్చు. కానీ, నలభై రెండేళ్ళ క్రితం సామాజిక వాతావరణం చాలా గొప్పగా వుండేది.
మరీ వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో కాకపోయినా ఓ ఏడాది రెండేళ్ళలో దేశంలో విప్లవం వచ్చేస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళ సంఖ్య ఎక్కువగా వుండేది.
పీపుల్స్ వార్ పార్టీకి కృష్ణాజిల్లాలో పూర్తి స్థాయి కమిటీ ఎప్పుడూ లేదు. అడహాక్ కమిటీలే ఉండేవి. ఆ కమిటీ బాధ్యులుగావున్న వివి కృష్ణారావుగారు ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్లిపోయారు. అంత వరకు రాడికల్ యూత్ లీగ్ (ఆర్ వై యల్) జిల్లా అధ్యక్షునిగావున్న నేను జిల్లా పార్టీకి అడహాక్ బాధ్యునిగా మారాను.
అప్పట్లో జిల్లా రైతు-కూలీ సంఘం కార్యదర్శిగా ఏలూరి భీమయ్య వుండేవారు. రైతుల సమస్యలు చెప్పుకోవడానికి వారు తరచూ నా దగ్గరికి విజయవాడ వస్తుండేవారు. మనిషి చాలా నిరాడంబరంగా ఉండేవారు. నేను కుర్చీలో కూర్చొని టేబుల్ మీద రాసుకుంటుంటే నా గదిలోనికి వచ్చి నేల మీద కూర్చునే వారు.
వారిది శివాపురం. తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో మధిరకు దగ్గరగా కృష్ణాజిల్లాలోవున్న కుగ్రామం అది. మధిర పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే వైరా వాగు మీద అప్పటికి వంతెన లేదు. ఆ గ్రామానికి రైలు బస్సు సౌకర్యం ఇప్పటికీ లేదు. తెలంగాణ పోలీసుల నుండి తప్పించుకోవాల్సి వచ్చినపుడు నక్సల్ నేతలు వ్యూహాత్మాకంగా శివపురంలో షెల్టర్ తీసుకునేవారు. 1940ల నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుండి కొండపల్లి సీతారామయ్యకు ఆ గ్రామంలో అభిమానులు ఎక్కువ. కృష్ణా జిల్లాలో పీపుల్స్ వార్ కార్యకర్తలు ఎవరు అరెస్టు అయినా శివాపురం రైతులే కోర్టుల్లో తమ భూమి పత్రాలు జామీనుగా సమర్పించి బెయిల్ తెచ్చేవారు.
1982 వేసవిలో ఏలూరులో ఆర్ వైఎల్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. దానికి రెండు రోజులు ముందు శివపురంలో కృష్ణాజిల్లా మహాసభలు జరిగాయి. అక్కడ మొదటిసారి భీమయ్య కూతురు అజితను చూసాను. మొదటి చూపులోనే ఆమెవి కళగల కళ్ళు అనిపించాయి.
ఏలూరు వెళ్ళే సభ్యులమంతా మరునాడు తెల్లారు జామున శివాపురం నుండి మధిర రైల్వేస్టేషన్ కు బయలు దేరాము. తెలియని దారి, చీకట్లో నడక. కొన్ని గ్రామాల్లో కుక్కల గుంపు దాడి. నాకు తెలుగుతోపాటు కొంచెం ఇంగ్లీషు, కొద్దిగా హింది, కొద్దిగా ఉర్దూ, అరబ్బీలు వచ్చు. కానీ కుక్కల భాష బొత్తిగా రాదు. వాటిని చూస్తే భయం కూడ. అజిత చేతిలో ఓ పొడుగాటి కర్ర తీసుకుని మా బృందానికి ముందు నడుస్తూ కుక్కల్ని తరుముతుండేది. కక్కలంటే ఆమెకు భయం లేకపోవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.
ధైర్యంగల పిల్ల అనుకున్నాను. నవ్వు అజిత సిగ్నేచర్.
తరువాత కొంతకాలనికి, తన కుమార్తెను పార్టీలో ఇవ్వాలని భావిస్తున్నట్టు భీమయ్య చెప్పగా కొండపల్లి సీతారామయ్యగారు నా పేరు సూచించారట. పార్టీ రీజినల్ కమిటీ కార్యదర్శి ఈ విషయాన్ని నాకు చెప్పారు. ముందు తనతో నేరుగా మాట్లాడి తన అభిప్రాయం తెలుసుకోవాలి అన్నాను. పార్టీ ఆర్ సి మాకు విజయవాడలో ‘పెళ్లి చూపులు’ ఏర్పాటు చేసింది.
“నువ్వు నాకు నచ్చావు. అయితే, నాకు ఉద్యోగం లేదు; నిలకడగా ఉద్యోగం చేసే ఆసక్తి లేదు. ఆస్తిలేదు. ఉద్యమాలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతాను. నానుండి ఎలాంటి ఆదాయాన్ని ఆశించకు. పిల్లలు పుడితే వాళ్ళ పెంపకం చదువు వగయిరా భారం కూడ నీదే. అన్నింటికన్నా ముఖ్యమైనది నాకు ఇంతకు ముందే పెళ్లి అయింది. అది మతాంతర వివాహం. మా పెళ్లి ఆమె పెద్దలకు నచ్చలేదు. పెళ్లయిన నెల రోజులకే ఆమె బలవన్మరణం పాలయింది. ఇక నీ ఇష్టం” అన్నాను.
తను నా షరతులు అన్నింటినీ ఒప్పుకుంది. విప్లవ భావుకతను ఆమెకు ఆ స్థాయిలో నింపేశారు వాళ్ళ నాన్న. కొండపల్లి సీతారామయ్య నిప్పుల్లో దూకమన్నా దూకడానికి భీమయ్య సిద్ధం. వాళ్ళ నాన్న గాడిదను (పోలిక బాగోలేదుకదూ?) చేసుకోమన్నా చేసుకోవడానికి అజిత సిద్ధం. అలా ఉండేది కమిట్ మెంట్!.
విప్లవం విజయవంతం అవుతుందనే అపార నమ్మకం వుండడంతో సాహసాలు, దుస్సాహసాలు కూడా చేసేసే వాళ్ళం. కమ్యూనిస్టు పార్టీలు రాజకీయరంగంలో అనుకున్న విజయాలను సాధించడంలో విఫలం అయ్యాయి. అయితే, సామాజిక వాతావరణంలో అనేక గొప్ప మార్పులు రావడానికి అవి చాలా దోహదపడ్డాయి.
వాళ్ళు నా మతం ఏదని అడుగలేదు, నేను వాళ్ళ కులం ఏమిటని అడగలేదు. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా భీమయ్యగారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనీ అయన 14 ఎకరాల మధ్యతరగతి రైతు అనీ అజిత ఆయనకు ఏకైక సంతానం అనీ అర్ధం అయింది.
భీమాయ్యగారే ఇష్టంగా పెళ్లి చేయడంతో ఆయన బంధువులు ఎక్కువమంది మా పెళ్ళికి హాజరయ్యారు. నన్ను గౌరవప్రదంగా తమ సమూహంలో కలుపుకున్నారు. మాది ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ గా మారిపోయింది. ఏలూరివారు చెరుకూరివారు కొమ్మినేనివారు, లగడపాటివారు అలా చాలా పెద్దది అజిత బలగం.
నాకు అప్పటికే రచయితగా కొంత పేరు వుంది. ఉషా యస్ డానీగా గుర్తింపు వచ్చింది. పబ్లిక్ స్పీకర్ గా వున్నాను. పీపుల్స్ వార్ కోస్తాజిల్లాల యూనిట్లలో బయటవున్న వారికేగాక లోపల వున్నవారికీ మార్క్సిస్టు తత్త్వశాస్త్రం పాఠాలు చెపుతున్నాను. ఢిల్లీ జేఎన్ యూలో ఓ ఇంగ్లీషు ఉపన్యాసం కూడ ఇచ్చి వచ్చాను. అజిత నాకన్నా పదేళ్ళకు పైగా చిన్నది. ఇవన్నీ కలిపి అజితకన్నా నేను గొప్పవాడిననే భావనలో వుండేవాడిని.
మా ఇల్లు పూరిపాక. ఆదాయం తక్కువ. కుటుంబంలో నామీద ఆధారపడినవారు ఎక్కువ. నిరంతరం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు వుండేవి. ఆపైన ఇంటి మీద తరచూ పోలీసుల దాడులు, తనిఖీలు, అరెస్టులు వుండేవి. ఒక్కోసారి నన్ను ఎక్కడ పెట్టారో కుటుంబసభ్యులకు తెలీని పరిస్థితి వుండేది. తరచూ ఉత్కంఠ, ఆందోళన, కుంగుబాట్లు కొనసాగేవి. అజిత వంద ఎకరాల ఉమ్మడి కుటుంబం నుండి వచ్చింది. అయినా తను మా ఇంట్లో వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది. ఇంకొకరయితే ఎన్నడో నన్ను వదిలి పారిపోయి వుండేవారు.
కోవిడ్ సెకండ్ వేవ్ లో తల్లిదండ్రులకు సోకితే పిల్లలు, పిల్లలకు సోకితే తల్లిదండ్రులు వదిలి పారిపోయారు. మహమ్మారి మా ఇంట్లోనూ వచ్చింది.
ముందు అజితకు సోకింది. నా కొడుకులు ఇద్దరికీ నాకన్నా అజిత అవసరం ఎక్కువ. కుటుంబంలో నేను చేయలేని పనుల్ని తను చేయగలదు. తనను తీసుకుని అంబులెన్స్ లో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే సమయానికి నాకూ కోవిడ్ సోకింది. నా పరిస్థితి తనకన్నా విషమించింది. చనిపోతానని డాక్టర్లు ప్రకటించేశారు. దానికి అజిత ఒప్పుకోలేదు. నన్ను బతికించేసింది. అదో మెడికల్ మెరకిల్.
తను చాలా మొండిది. పల్లెటూరి పిల్ల ఇమేజ్ నుండి తప్పించుకోవడానికి కంప్యూటర్ టెక్నాలజీలో నైపుణ్యాన్ని సాధించింది. మా పెద్దోడు ప్రస్తుతం VFX సూపర్ వైజర్ కావడానికి పునాది వేసింది తనే. వాడికి చాలా చిన్న వయసులోనే కంప్యూటర్ మెళుకువలు నేర్పింది.
నాకన్నా ముందే తను జర్నలిస్టు అయ్యింది. 1988 డిసెంబరులో వంగవీటి మోహన రంగా హత్యకు రెండు రోజులు ముందు తనే అతన్నీ, దేవినేని నెహ్రూను ఇంటర్ వ్యూ చేసింది. బెజవాడ మండుతున్న రోజుల్లో తను ఏకైక లేడీ రిపోర్టర్. చాలా ధైర్యంగా దూసుకునిపోయేది. ఆమె విజయవాడలో బహుశ తొలి మహిళా రిపోర్టర్.
మా అమ్మకు అజితకు ఒక పోలిక వుంది. నేను టక్ చేసుకుని, బూట్లు, టై వేసుకుని ఇంగ్లీషు మాట్లాడాలని మా అమ్మ కోరుకునేది. తన కొడుకులు ఇంగ్లీషు మీడియంలో చదవాలనీ, కంప్యూటర్లతో ఆడుకోవాలనీ అజిత అనుకునేది.
నేను మనసు కుదిరినప్పుడు ఉద్యోగాలు చేశాను. చికాకు కలిగినప్పుడు ఉద్యోగాలు మానేశాను. ఎప్పుడూ తను ఆర్ధిక లోటు గురించి మాట్లాడలేదు. “మై హూ నా!” అనేది. సహజాతంగానే తనకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగా వచ్చు.
కారంచెడులో దాడి జరిగినపుడు మా పెద్దోడికి మూడున్నర నెలలు. తల్లీబిడ్డను వదిలేసి వెళ్ళిపోయాను. తను ఒక్క మాట కూడ అన్లేదు. చుండూరు అప్పుడు కూడ నువ్వు వెళితే బాగుంటుంది అన్నది. నా వ్యక్తిగత కారణాలవల్ల కారంచెడు ఉద్యమంలా చుండూరులో నిమగ్నం కాలేదు. రెండుసార్లు వెళ్ళి చూసి వచ్చాను. అంతే.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో పీపుల్స్ వార్ / మావోయిస్టు, జనశక్తి పార్టీలకు చెందిన నక్సల్స్ ప్రతినిధుల్ని చర్చలకు పిలిచింది. ఆ చర్చల్లో పాల్గొనడానికి వచ్చిన ఆంధ్రా ఒరిస్సా బార్డర్ కమిటి బాధ్యుడు సుధాకర్ ను సురక్షితంగా తీసుకుని వెళ్ళి అతని కార్యక్షేత్రంలో దింపమని నన్ను కోరారు.
నేను అప్పటికే పీపుల్స్ వార్ కు దూరంగా వుంటున్నాను. అయినా, వాళ్ళు అడిగిన పని చేయాలనుకున్నాను. అజితను సంతృప్తి పరచడానికి కూడ ఆ పని చేశాను. హైదరాబాద్ నుండి శ్రీశైలం (చిన ఆరుట్ల); అక్కడి నుండి విజయవాడ, అక్కడి నుండి ఒరిస్సా బోర్డర్; తనూ నాతో వచ్చింది. ఆ ప్రయాణాన్ని చాలా గొప్పగా ఆస్వాదించింది. నేను వెంటనే తిరిగి వచ్చేశాను. అక్కడివారు పార్టి ఐటి వింగ్ లో కంప్యూటర్ మెళుకువలు నేర్పాలని అజితను కోరారు. తను అక్కడ ఓ వారం రోజులు వుండి తనకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి వచ్చింది.
ఎప్పుడైనా తను కోరేది ఒక్కటే; నేను ఏదో ఒక విధంగా కమ్యూనిస్టుగా కొనసాగుతూ వుండాలి. “కమ్యూనిస్టు పార్టిల విధానాలు నచ్చకపోతే విమర్శించు; అది తప్పుకాదు. కానీ, కమ్యూనిజమే తప్పు అంటే మాత్రం మనం కలిసి వుండాల్సిన పనిలేదు” అని హెచ్చరిస్తుంటుంది.
ఇప్పుడు పీపుల్స్ వార్ లేదు. అయినా, ఇప్పటికీ తను పీపుల్స్ వార్ లో వున్నట్టు భావిస్తుంటుంది. తను ఇంతవరకు ఎన్నడూ ఓటు వేయలేదు. ఇంకా ఎన్నికల బహిష్కరణను అమలు చేస్తూనే వుంటుంది. వాళ్ళూ తెలివైన వాళ్ళు. కీలకమైన సమయాల్లో పాలసీ వ్యవహారం ఏదైనా నాకు కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అజిత ద్వార చెప్పిస్తారు.
నెల క్రితం ఆదివాసుల జాతీయ మహాసభల్ని ఢిల్లీలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ పోలీసు పర్మిషన్ రాకపోవడంతో దాన్ని విజయవాడకు మార్చారు. సభ ప్రారంభం కావడానికి కేవలం రెండు గంటల ముందు నాకు ఫోన్ చేసి ప్రారంభోపన్యాసం చేయాలని కోరారు నిర్వాహకులు. ఇప్పుడా చెప్పేది? అని నాకు కొంచెం చికాకు వచ్చింది. ఇలాంటి విషయాల్లో ప్రొటోకాల్స్ చూస్తారా? ఎప్పుడు చెప్పినాసరే నువ్వు వెళ్ళవలసిందే అని తనే నన్ను సిధ్ధం చేసి సభలకు తీసుకుని వెళ్ళింది.
తను జనవరి 15న పుట్టింది. సోషల్ యాక్టివిస్టుగా వుండడం మూలంగా సంక్రాంతి సెలవుల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట మీటింగు వుండేది. అలా తన అనేక బర్త్ డేల సందర్భంగా నేను ఇంట్లో లేను.
చలసాని ప్రసాద్ మా పెళ్ళి పురోహితుడు. ఆయన ఓ వంద కమ్యూనిస్టు పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళల్లో 99 జంటలు విడిపోయారు. మీరూ విడిపోతే ఒక రికార్డు అవుతుంది అనేవాడు చలసాని!.
సాధారణంగా ఎలాంటి కారణాలు లేకుండానే భార్యాభర్తలు తగవులాడుకుంటుంటారు. మా మధ్య తగవులు రావడానికి చాలా కారణాలున్నాయి. ఇద్దరికీ ఆత్మాభిమానమేకాదు ఇగో కూడ కొంచెం ఎక్కువ. నాకు త్వరగా కోపం వస్తుందని చాలామందికి తెలుసు. నాకన్నా వేగంగా అజితకు కోపం వస్తుంది. ఒక లెఖ్ఖ ప్రకారం మేమిద్దరం ఇప్పటికి వెయ్యినొక్కసారి విడిపోవాలి. అలా జరగకపోవడానికి కారణం అజితకు నేను సర్వస్వం. అజితంటే నాకు చాలా ఇష్టం.
కోపం వచ్చినప్పుడు ఆమె నన్ను చాలా మాటలు అనేస్తుంది. ఆ వేడిలో నేనూ చాలా అనేస్తాను. వాటినన్నింటినీ ఓ వారం తరువాత రికార్డుల నుండి తొలగిస్తుంటాము. ఎవరు ఎవరికి రుణపడివున్నామని బ్యాలెన్స్ షీటు వేసుకుంటే నేనే అజితకు రుణపడివుంటాను. కోపంగా వున్నప్పుడు ఒప్పుకోను. కానీ, ఆ విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు.
సామాజిక జీవితంలో నేను చేసిన రిస్కులకు, చేసిన పనులకు నాకు రావలసిన గుర్తింపు దక్కింది. తను చేసిన రిస్కులు నాకన్నా తక్కువేమీకాదు. అయినా తనకు రావల్సినంత గుర్తింపు రాలేదు. ఆ పాపం నాదే అనుకుంటాను.
హ్యాపీ బర్త్ డే అజిత.
జనవరి 15, 2025

No comments:

Post a Comment