Sunday, 9 March 2025

 

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించ గలరు.

*ఫాసిజం – నాజీజం – హిందూత్వ*

*కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం*

 

డానీ

సమాజ విశ్లేషకులు, 9010757776




 

కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా  (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త – ఫాసిస్టు ధోరణుల్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించింది. దానితో ఇప్పుడు మేధోరంగంలో ఫాసిజం, నయా-ఫాసిజం,  నాజిజంల మీద  ఒక  కొత్త చర్చ రగులుకుంది.  నేరుగా ఫాసిస్టు అనకుండా కొత్త ఫాసిస్టు ధోరణులు అనడాన్ని జాతీయ కాంగ్రెస్ తో పాటు సిపిఐ సహితం సిపిఎం ముసాయిదాను తప్పుపడుతున్నాయి.

 

          పెట్టుబడీదారీ వ్యవస్థకు లాభాలే ముఖ్యం; లాభమే దాని లక్ష్యం; అదే దాని సంస్కృతి. మిగిలినవన్నీ అనవసరం. బక్వాస్. లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళ్ళను సహితం పెట్టుబడీదారులు అమ్మకానికి పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి, పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. ఇది ఒక విధంగా పులి మీద స్వారీ లాంటిది. ఎక్కడా ఆగడానికి వీల్లేదు. ఆగితే అక్కడ ఖేల్ ఖతం.

 

          గతంలో సెల్ ఫోన్ల మార్కెట్ ను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రి, మోటరోలా బ్రాండ్లు ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్, కొడాక్ కెమేరాలు, సోనీ వాక్ మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు.  పరుగు ఆపేస్తే బ్రాండ్లు అలా అంతమైపోతాయి.

 

తమ ప్రాచూర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడీదారులు ఏమైనా చేయగలరు. ఏ వేషం అయినా వేయగలరు.  ఒక దశలో అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా దర్శనమిస్తారు. ఇంకో దశలో జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికి వస్తుంది అనుకుంటే వాళ్ళే సమాజంలో ఛాందసాన్ని  పెంచిపోషించడం మొదలెడతారు.

 

          ఈ మార్కెట్ లక్షణాలు తెలియని చాలా మంది భూస్వామ్యంకన్నా పెట్టుబడీదారులు ఆధునికులు మెరుగయినవారు అనుకుంటుంటారు. అది తప్పు అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు భారీ పెట్టుబడీదారులు (వీరినే మనం మెగాకార్పొరేట్లు అంటున్నాం) తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించి తద్వార తమ అనుకూలుర్ని ఎన్నికల్లొ గెలిపించుకుని  అధికార పీఠం మీద కూర్చొబెట్టి వారి ద్వార తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.

 

          ఇక్కడ మనకు కనిపించేది ఒకటి; జరిగేది మరొకటి. ఎన్నికల ద్వార పరిపాలనాధికారాన్ని చేపట్టినవాళ్ళు  కార్పొరేట్ల సంపదను పెంచుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. నిజానికి తమ సంపదను పెంచుకోవడానికే కార్పొరేట్లు తమ అనుకూలుర్ని పరిపాలన పీఠం మీద కూర్చోబెట్టుకుంటారన్న సత్యం బయటికి కనిపించదు. మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా  కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship - CCD) అంటే గానీ తత్త్వం బోధపడదు.  

 

          కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం అనే మాట నిస్సందేహంగా  క్లిష్టమైనది. తెలుగువాళ్లకెందుకో కొత్త పదాల మీద ఒకరకం అసమ్మతి  వుంటుంది. మెర్రియమ్ వెబ్స్టర్, ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువుల్లో ఏడాదికి వెయ్యి నుండి రెండు వేల కొత్త పదాలను ఇంగ్లీషులో చేరుస్తుంటారు. మనకు ఆ సాంప్రదాయం లేదు. తమిళులకు అలాంటి సాంప్రదాయం వుంది. అలాంటి ఏర్పాటు మనకు ప్రభుత్వ పరంగానూలేదు; స్వఛ్ఛందంగానూ లేదు. పాత పదాలు కొత్త అర్ధాలను ఇవ్వవు. కొత్త పదాల్ని మనం ఒక పట్టాన అంగీకరించము. ఇదేలా కుదురుతుందీ?

 

కథలు కవితల్లో అందరికీ తెలిసిన పదాల్నే వాడవచ్చు. సామాన్య ప్రజలతో  సంభాషణల్లో వ్యవహారిక భాషలో మాట్లాడవచ్చు. కొత్త విషయాలు వివరించాల్సిన సిధ్ధాంత వ్యాసాల్లో, సెమినార్ ప్రసంగాల్లో అలా సాధ్యం కాదు.  కొవిడ్ మహమ్మారీ విజృంభించినపుడు కనీసం వంద కొత్త పదాలు  మన జీవితాల్లోనికి వచ్చేశాయి. వాడక తప్పలేదుగా. సామాజిక విషయాల్లోనూ కొత్త పదాల వాడకం అలవర్చుకోక తప్పదు. లేకపోతే మన మాటల్లో రాతల్లో  తెలుగు పదాలు తగ్గిపోయి ఇంగ్లీషుపదాలు పెరిగిపోతాయి.  

 

          ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు వున్నట్లే నచ్చని వారూ వుంటారు.  నచ్చనివారు దీన్ని ఫాసిస్టు అంటున్నారు. ఆ మాటను కాంగ్రెస్సూ అంటున్నది; కమ్యూనిస్టులు అంటున్నారు.

 

ఫాసిజం ఇటాలియన్ పదం. అది ముస్సోలిని నియంతృత్వాన్ని  విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు  పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అదికాదు. ముస్సోలిని సగర్వంగా తనకుతానుగా పెట్టుకున్న పేరు అది. ఫాసియో అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అని అర్ధం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ అని పేరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్ధం. బిజెపి కూడ తొలి రోజుల్లో జాతిపిత గాంధేయ సోషలిజం అనేది.

 

ఫాసిజం, నాజిజం రెండూ నియతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఆరెస్సెస్ వ్యవస్థాపకులైన కేబి హెడ్గేవార్ సన్నిహితులు ఇటలీ వెళ్ళి, ముస్సోలినీని కలిసి ఫాసిజాన్ని అధ్యయనం చేసివచ్చారు. రెండవ సర్ సంగ్ ఛాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ నాజీ హిట్లర్ ను ఎక్కువగా అభిమానించేవారు. ఆర్యజాతి ఔన్నత్యం, అక్కడ మతమైనారిటీ సమూహాలైన యూదుల్ని అణిచివేయడం వగయిరాలన్నీ వారికి తెగనచ్చాయి. స్వఛ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో వారు రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్ల ర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ ఫాసిజంలో మైనారిటీ మతాన్ని అణిచివేయాలనే అంశం లేదు; కనీసం మొదట్లో లేదు.  జర్మనీ నాజిజంలో యూదు నరమేధం పెద్ద ఎత్తున వుంది. అది గురూజీకి నచ్చింది. హిట్లర్ కాన్సెంట్రేషన్ క్యాంపులు పెట్టాడు; మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఫాసిజంకన్నా నాజిజమే భారతదేశ ప్రభుత్వ స్వభావానికి ఎక్కువగా సరిపోతుంది.

 

ఇటలీలో ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మనదేశంలోనూ  సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరు పెట్టుకుంది. చాలా మందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకు తేడా తెలీదు. మతం అంటే దేవుని మీద విశ్వాసం. మతతత్త్వం అంటే ఇతర మతస్తుల మీద అసహనం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం రాజకీయార్ధిక వ్య్వహారం. 

 

అతివాద హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది 1922లో  ఘనంగా  ‘హిందూత్వ’ అనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ అనగానే తమని నిందిస్తున్నారని  సాధారణ హిందువులు అనుకుంటే తమ  ఉనికికి ముప్పు వస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి.

 

ఇండియా కమ్యూనిస్టు పార్టీల్లో మొదటి నుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడితులు పీడకులు వుంటారని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల పక్షాన వుంటామని ప్రకటించాల్సివుంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వేస్తుందని వాళ్ళ భయం. అవి చాలా ఇరకాటంలో చాలా కాలం కొనసాగాయి. మతవ్యవస్థలో పీడితుల పక్షం వహించలేవు; పీడకుల పక్షం వహిస్తామని చెప్పుకోలేవు. పలాయన మార్గంగా మతంలో వర్గం లేదని చాలాకాలం  బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి.

 

నిజ జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం  అనేది మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీనితో పాటు ఉపరితలం కూడ వుంటుంది. అదేమీ విడిగా వుండదు. పునాది ఉపరితలాల్లో ప్రధానమైది నిస్సందేహంగా పునాదే. దాని అర్ధం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో వుంటూ,  ఒకదాన్నిమరొకటి నిరంతరం ప్రభావితం చేసుకుంటుంటాయి. కొంచెం సాంకేతిక భాషలో చెప్పాలంటే, పునాదీ ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో వుంటాయి.

 

గడిచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18-22 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన సిపిఐ-ఎం 22వ మహాసభల్లో “అధికార హిందూత్వ సాగిస్తున్న దాడులు, దేశంలో పెరుగుతున్న ఫాసిస్ట్ ధోరణుల్ని సూచిస్తున్నాయి” అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6-10 తేదీల్లో కన్నూర్ లో జరిగిన సిపిఐ-ఎం 23వ మహాసభల్లో “మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ ఫాసిస్ట్ ఎజెండాను అమలు చేస్తోంది" అని పేర్కొన్నారు.

 

2025 ఏప్రిల్ 2-6 తేదీల్లో మధురైలో జరుగనున్న సిపిఐ-ఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు.  “ప్రతీఘాత హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చి ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యాన్నీ అణిచివేసి నయా-ఫాసిస్టు ధోరణుల్ని ప్రదర్శిస్తున్నది”  అని పేర్కొన్నారు. పూర్తిగా ఫాసిస్టు అనలేదని కాంగ్రెస్ సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

 

1970లలో ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్ అని నేరుగా  విమర్శించేవారు. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్ పాయి, జార్జ్ ఫెర్నాండెస్, మురార్జీ దేశాయి, రామ్ మనోహర్ లోహియా, ఎల్ కే అద్వానీ, నానీ ఫాల్కీవాల తదితరులు ఆమెను హిట్లర్ అన్నవారి జాబితాలో వున్నారు.  

 

ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. దానికి రాబోయే మహాసభల్లో సిపిఐ-ఎం నాయకత్వం సమాధానం చెప్పవచ్చు. 

No comments:

Post a Comment