సాక్షి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించగలరు
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Friday, 14 March 2025
Socialist Society? or Welfare State?
*సమసమాజమా? సంక్షేమ రాజ్యమా?*
*డానీ*
సమాజ విశ్లేషకులు. 9010757776
సామ్యవాద
సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను
ఎంచుకున్నాయి. మొదటిది; సాయుధ పోరాటం. రెండోది; పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల
నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చుగానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి.
“దేశాలు స్వాతంత్ర్యాన్ని,
జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు”
అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లాడేవి. ఇప్పుడు ఆ
పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడంలేదు.
ఇది నేటి వాస్తవస్థితి. దీనికి కారణం ఆయా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే
చర్చలవల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది.
జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి.
సోషలిస్టు
కలను సాకారం చేసుకోవడానికి అభిమానులు వందేళ్ళు ఎదురుచూడడమే మహత్తర విషయం. దీర్ఘకాల
పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి
కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమసమాజం
కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్పురించే
సమాధానం సంక్షేమరాజ్యం.
నార్డిక్
దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్ లాండ్ లు సంక్షేమ దేశాలని
చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్ లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం,
స్విడ్జర్లాండ్ కూడ తమవైన పధ్ధతుల్లో సంక్షేమరాజ్యాలని బయటికి అంతగా తెలీదు.
వీటిల్లో జర్మనీ రాజకీయార్ధిక పరిణామాలతో ఇండియాకు చాలా దగ్గరి పోలికలున్నాయి. జర్మనీ చరిత్రలో కొనసాగిన రాజకీయ దశలన్నీ కొంచెం ముందువెనుకగా ఇండియాలోనూ సంభవించాయి.
మొదటి
ప్రపంచ యుధ్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’
ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్
సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టి’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్
మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ట రూపం
నాజీజం. రెండవ ప్రపంచ యుధ్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ
‘మిత్రరాజ్యాల’ ఆధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరిక, రష్యాలు
చెరో భాగాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నాయి.
ఓ
నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరిక, యూకే,
ఫ్రాన్స్ ల ప్రాబల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ఫెడడల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ
(ఎఫ్ ఆర్ జి)గా అవతరించింది. అదే ఏడాది
అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్
(జిడిఆర్)గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడీదారీ దేశంగానూ, తూర్పు
జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పుకునేవారు.
కారణాలు
ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ
జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు
చేసి 1961 ఆగస్టు నెలలో అడ్దంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి
‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జిడిఆర్ నుండి
వలసలు ఆగలేదు. హంగేరి, జకోస్లోవోకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరుకోవడం
మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు
జర్మనీతోపాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమానియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోషలిస్టు
పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్
గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న
తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి.
రెండు
జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడీదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్ధం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు
ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన
ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్నప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు,
పెట్టుబడీదారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మని ఇప్పుడు పశ్చిమ యూరప్ లో ఒక మెరుగయిన సంక్షేమ
రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా జర్మనీ స్థూల జాతియోత్పత్తులు కూడా దాదాపు సమానం.
ఇప్పటి
ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త
ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ ఒక చర్చ సాగుతోంది. అదీగాక, మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ
నియంతృత్వం కొనసాగుతోందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. దేశంలోని సహజవనరుల్ని,
మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర
విస్తాపన సాగునుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టి
ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ
పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా
వుంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment